‘పడగ’ల స్తబ్ధతా, ‘విండ్’ చలనమూ !


సాహిత్యంలో దృక్పథాలు రెలెవెన్స్-11

 వేయిపడగలలో ధర్మారావు ముఖంగా అతిమానుష, మానుష ప్రపంచాల మధ్య తారతమ్య వివేచన నవల పొడవునా జరుగుతూనే ఉండడం గురించి చెప్పుకున్నాం. అరుంధతినీ, కిరీటి భార్య శశిరేఖనూ కూడా అబ్బురపరచిన అతిమానుషజగత్తు అది. దేవదాసిని చూసినప్పుడు, “తానొక కల్పితజగత్తున, అమానుషప్రపంచమున  తిరుగాడుచున్నట్లు”; “ఈ సంవిధానమే చిత్రముగా నున్నట్టు” శశిరేఖకు అనిపిస్తుంది. అలాగే, కావ్యజగత్తే యథార్థమైన జగత్తు అనీ, అపరిపక్వమైన మనస్సులు, కృత్రిమ ప్రకృతులు, అసహజమైన మనోభావాలు కలిగిన మనమే కల్పిత జగత్తు అనీ ధర్మారావు అనుకోవడం గురించీ, దివ్యజగత్తు నుంచి భౌమజగత్తులోకి రావడంలో అతను ఎదుర్కొనే క్లేశం గురించి కూడా చెప్పుకున్నాం.

ఈ అతిమానుష, మానుష జగత్తులను; అవాస్తవిక, వాస్తవికజగత్తులుగా అనువదించుకుంటే ధర్మారావు పొందే క్లేశం వాస్తవికతను ఎదుర్కోవడంలోనే. శిల్పంలోనూ, కవిత్వంలోనూ కూడా వస్తుస్వరూపాన్ని “యథాప్రాప్తం”గా చిత్రించ కూడదని అతను అనుకుంటాడు. అతని ఆలోచనలు ఇంకా ఇలా ఉంటాయి:

లోకమునందలి వస్తువు బహుదోషభూయిష్ఠముగా నుండును. దాని నుండి దోషమును తీసివేసి దాని ఉత్కృష్ట స్వరూపమునే గ్రహించవలయును. దోషమును పరిహరించుట రెండు విధములు. ఒకటి లోకమునందలి ఉత్కృష్ట స్వరూపమునే గ్రహించుట, రెండవది, కొన్ని సమయములు, సంప్రదాయములు సృష్టించి తదనుగుణముగా శిల్పమును చిత్రించుట. మొదటిదాని కన్న రెండవది ఉత్కృష్టమైనది. పాశ్చాత్యశిల్పము మొదటి మార్గము ననుసరించును…వారి చిత్రము లన్నింటికి మాతృకలుండును…భారతదేశశిల్పి శిల్పము చక్షుర్విషయమున కన్న యెక్కువ మనోవిషయమగుచున్నది. పాశ్చాత్యశిల్పమునందు మనము చూచు బొమ్మ గొప్ప సౌందర్యము కలిగియుండును. అది మన నేత్రానందకరము. భారతశిల్పము నందలి చిత్రము పూర్తిగా మనోవిషయము…ఎన్ని చూచినను భారతశిల్పము యొక్క యుత్కృష్టత అవివాదాంశము.

రవివర్మచిత్రాల గురించి ఇలా అంటాడు:

రవివర్మ శిల్పము పాశ్చాత్యమార్గము ననుసరించును. అందులో కూడా చాలా తక్కువరకముది…ఇట్టి చిత్రములు వ్యాప్తి పొందుట చేత లోకమున జనులకు పూర్వ సంప్రదాయములయు, పూర్వ మహాపురుషుల స్త్రీల యథార్థతత్త్వము యొక్కయు జ్ఞానము లేక చెడిపోవుచున్నారు. పైగా వీనియందు సౌందర్యజ్ఞానము కలుగుటలేదు. మనస్సును స్పృశించుటలేదు సరికదా, నేత్రము యొక్క నైశిత్యమును కూడ తాకుట లేదు…ఇప్పటి యీ గ్రామఫోన్ల ప్లేట్ల సంగీతము వలెనే యిట్టి బొమ్మలును మనదేశమునందలి జ్ఞానమునకు వేరుపుర్వు లగుచున్నవి.

వాస్తవికతను నిరాకరించి, అవాస్తవికతను నిర్మించాలని చెప్పడమే ఇది. దీనిని శిల్పానికీ, సాహిత్యానికే కాక సంఘానికీ  ఆపాదిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించగలం. యథాప్రాప్తంగా కాకుండా దోషాన్ని పరిహరించి ఉత్కృష్టాన్నే స్వీకరించడమంటే, వాస్తవిక ప్రపంచంలోని వైరుధ్యాలను మరుగుపుచ్చి సాహిత్యానికి, సాహిత్యకారుడికీ ఉపదేశక స్థానాన్ని కల్పించడమే. అదలా ఉంచితే పాశ్చాత్యంలో కానీ, మన దగ్గర కానీ సాహిత్యం వాస్తవిక జీవన ప్రతిబింబం కావడం వెనుక చాలా చరిత్రే ఉంది. అందులోకి వెళ్లడానికి ఇది సందర్భం కాదు.

గాన్ విత్ ద విండ్ కు వస్తే, వాస్తవికత గురించి యాష్లీ ఊహలు కూడా అచ్చం ధర్మారావు ఊహల్లానే ఉంటాయి. అతను కూడా వాస్తవికతను ఎదుర్కోడంలో క్లేశానీకీ, భయానికీ లోనవుతాడు. “దేనికి భయపడుతున్నా”వని స్కార్లెట్ అడిగినప్పుడు అతని సమాధానం ఇలా ఉంటుంది:

ఓహ్, నామరహితమైన అనేకవాటి గురించి. మాటల్లోకి మార్చితే అర్థరహితంగా ధ్వనించే వాటి గురించి. జీవితం హఠాత్తుగా మరీ వాస్తవికం అయిపోవడం, జీవితం గురించిన అల్ప వాస్తవాలతో కూడా మరీ వ్యక్తిగత సంబంధం కలగడం గురించి.  ఇక్కడ బురదలో నిలబడి కట్టెలు కొట్టవలసివచ్చినందుకు నేను బాధపడడంలేదు. ఇది దేనిని సంకేతిస్తోందో దానిని తలచుకుని బాధపడుతున్నాను. నేను అమితంగా ప్రేమించిన పాతజీవితంలోని సౌందర్యాన్ని కోల్పోయినందుకు కుంగిపోతున్నాను. యుద్ధానికి ముందు జీవితం ఎంతో అందంగా ఉండేది. గ్రీకుకళలోలా అందులో ఒక ఆకర్షణ, పరిపూర్ణత, సమగ్రత, సౌష్టవం ఉండేవి. అందరికీ అలా అనిపించకపోవచ్చు. ఆ తేడా కూడా ఇప్పుడే అర్థమవుతోంది. నాకు మాత్రం ట్వెల్వ్ ఓక్స్ లో జీవించడంలోనే నిజమైన అందం ఉంది. నేనా జీవితానికి చెందినవాణ్ణి. అందులో భాగాన్ని. ఇప్పుడు అదంతా గతించిపోయింది, ఈ కొత్త జీవితంలో నేను ఇమడను. అందుకే భయపడుతున్నాను. పాత జీవితంలో ఛాయామాత్రంగా లేని ప్రతిదానికీ; మరీ వాస్తవికంగా, మరీ జీవశక్తితో కనిపించే మనుషులకు, పరిస్థితులకు దూరంగా ఉండేవాణ్ణి. నా జీవితంలోకి అలాంటి మనుషులు, పరిస్థితుల చొరబడితే కోపం వచ్చేది. అందుకే నిన్ను కూడా దూరంగా ఉంచాను. కారణం, నీలోనూ జీవశక్తి పొంగి పొర్లుతూ మరీ వాస్తవికంగా కనిపిస్తావు. నీడలనూ, స్వాప్నికతనూ ప్రేమించే పిరికివాణ్ణి నేను… యుద్ధం వచ్చి పడకపోతే, ట్వెల్వ్ ఓక్స్ లోనే పాతుకుపోయి, జీవితంలో భాగం కాకుండానే దాని గమనాన్ని సాక్షిమాత్రంగా దర్శిస్తూ సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేసేవాణ్ణి.

విచిత్రం ఏమిటంటే, యాష్లీకి ట్వెల్వ్ ఓక్స్ ఎలాగో; ధర్మారావుకు సుబ్బన్నపేట అలాగ.  చదువుకోసమనో, మరొకందుకనో మధ్య మధ్య అతను వేరే ఊళ్ళకు వెళ్ళి వచ్చినా ప్రధానంగా సుబ్బన్నపేటకే అతుక్కుపోతాడు. అక్కడి జీవితమే తనకు ఇష్టమని ఒకటి రెండు సందర్భాలలో అంటాడు కూడా. అతని అతిమానుషజగత్తుకు చెందిన ప్రణాళికను అమలు చేయడానికి ఉద్దేశించిన కార్యక్షేత్రం కూడా సుబ్బన్నపేటే.

అయితే, ఇద్దరి జీవనపరిస్థితులు, అనుభవాలు, ఊహల మధ్య పెద్ద తేడా తెచ్చిపెట్టింది, యుద్ధం! ఇదో చిత్రమైన వాస్తవం. యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. కానీ యుద్ధం మనిషి అనుభవంలో, ఆలోచనల్లో, తద్వారా జీవితంలో తీసుకు వచ్చే మార్పు బహుముఖంగా ఉంటుంది. అది శతాబ్దాల స్తబ్ధతను వదలగొట్టి మనిషిని క్రియాశీలిని చేస్తుంది. మనిషిలోని మానవత్వాన్నీ, రాక్షసత్వాన్నీ కూడా ఆవిష్కరిస్తూ అంతిమంగా మనిషితనానికి ఒక పెద్ద పరీక్షాఘట్టం అవుతుంది. అంతవరకు ఆకాశవిహారం చేయించే అందమైన కాల్పనిక ఊహలనుంచీ, స్వాప్నికతనుంచీ మనిషిని హఠాత్తుగా కఠోరవాస్తవాల భూమార్గం పట్టిస్తుంది.

యాష్లీ ఇంకా ఇలా అంటాడు:

యుద్ధం రాగానే, జీవితం తాలూకు వాస్తవికత నాలోకి చొచ్చుకువచ్చింది. నీకు గుర్తుండే ఉంటుంది, మొదటిసారి నేను యుద్ధంలోకి దిగింది బుల్ రన్ దగ్గర. నా బాల్యస్నేహితులు తునాతునకలవుతున్న దృశ్యాన్ని అప్పుడు చూశాను. మృత్యుముఖంలో ఉన్న గుర్రాలు పెట్టే సకిలింపులు విన్నాను. నేను జరిపిన కాల్పులలో  అవతలిపక్క మనుషులు రక్తం కక్కుకుంటూ కుప్పకూలిపోతున్నప్పుడు కలిగే హృదయవిదారకమైన, దారుణమైన అనుభూతిని చవిచూశాను.  అయితే నావరకు యుద్ధం తాలూకు దారుణాలు ఇవి కావు; నేను జనాల మధ్య జీవించవలసి రావడం!

నేను అంతవరకు జనానికి దూరంగా నాదైన గూడులో ఉండిపోయాను. నా మిత్రులు కూడా ఎంతో జాగ్రత్తగా ఎంచుకున్న అతి కొద్దిమంది. కానీ, కొందరు స్వాప్నికులతో నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నానన్నఎరుకను యుద్ధం  కలిగించింది. నా భార్యాపిల్లలను పోషించుకోవాలంటే, నాతో ఎలాంటి సాదృశ్యం లేని మనుషుల ప్రపంచంలో నేను జీవించక తప్పదన్న సంగతి ఇప్పుడు నాకు తెలిసివచ్చింది. నువ్వు వేరు, జీవితంతో ముఖాముఖి తలపడుతూ దానిని నీ ఇష్టానుసారం వంచడానికి పూనుకున్నావు. కానీ ఈ ప్రపంచంలో నేను ఎక్కడ ఇమడగలను? అందుకే భయపడుతున్నాను…నాదైన చిన్న ఆంతరిక ప్రపంచం అంతరించిపోయింది. నా ఆలోచనలతో ఎలాంటి సారూప్యతా లేనివారు, భిన్నమైన కార్యాచరణతో నాకు హాటెన్ టోట్లలా విజాతీయుల్లా తోచేవారు దానిని దురాక్రమించుకున్నారు. బురద కాళ్లతో నా ప్రపంచాన్ని తొక్కేశారు. నేనిప్పుడు తలదాచుకుందుకు చోటేదీ మిగల్లేదు.

ఇలాంటి యాష్లీ మాటల్లో ధర్మారావు ఊహల ప్రతిఫలనానికి మరిన్ని ఉదాహరణలు ఇచ్చుకోనవసరం లేదు. ఇద్దరూ మార్పుతో రాజీపడలేని, మార్పును జీర్ణించుకోలేనివారే.  అంతటి యుద్ధం కూడా ఇలాంటి యాష్లీ స్వభావంలో మార్పు తేలేదు. అయితే, ఇద్దరి మధ్యా ఒక తేడా. తనకు ఎంత రుచించనిదైనా యాష్లీని యుద్ధం వాస్తవికతలోకి ప్రవేశపెట్టింది. వాస్తవికత గురించే కాక, తన గురించి కూడా కొత్త పాఠాలు నేర్పి, కొత్త ఎరుక కలిగించింది.  మారిన ప్రపంచంలో తనకు చోటు లేదనుకున్నా, అందులో ఇమిడి కాలు కూడదీసుకోడానికి శతవిధాల పోరాడుతున్న స్కార్లెట్ లాంటి వ్యక్తులపట్ల యుద్ధం అతనిలో ప్రశంసను, సానుభూతిని రేకెత్తించింది. దృష్టి వైశాల్యాన్ని పెంచింది. తనను ప్రేమిస్తున్నానని చెప్పమని స్కార్లెట్ అడిగినప్పుడు, “అవును, నీ సాహసాన్ని, దృఢసంకల్పాన్ని, నీలోని జ్వాలనూ, నిర్దాక్షిణ్యతను ప్రేమిస్తున్నా”నని యాష్లీ అంటాడు. “ప్రేమించడానికి, పోరాడడానికీ  నాకేమీ మిగల్లే”దని స్కార్లెట్ అన్నప్పుడు;  తారాకు పూర్వవైభవం తెచ్చి పెట్టే పని ఒకటి మిగిలిందని సంకేతిస్తూ, కిందికి వంగి ఎర్రటి మట్టి తీసి ఆమె చేతిలో పెడతాడు.

లోకజ్ఞానాన్ని మించి, యాష్లీలో యుద్ధం కలిగించినది స్వస్వరూపజ్ఞానం. మారిన పరిస్థితులలో నీడలను, స్వాప్నికతను అంటిపెట్టుకుని ఉండడం పిరికితనం అనుకుంటాడు.  కొత్త ప్రపంచంలో తను ఇమడలేకపోవచ్చు కానీ, అందులో చోటుకోసం పెనుగులాడుతున్న వ్యక్తులపై ఇప్పుడతనికి నిరసన, తృణీకారభావం, నిషేధబుద్ధి లేవు. లోకాన్ని అదేపనిగా ఆడిపోసుకోవడంలేదు. గత, వర్తమాన జీవితాలను శ్రేష్టతా, సామాన్యతల తాసులో తూచి శ్రేష్టజీవితం కోసం కలలు కనడం లేదు. ఆత్మోత్కర్షలేదు. యుద్ధానికి ముందు అలాంటివి ఏమాత్రమైనా ఉన్నా, యుద్ధం తర్వాత  అంతరించిపోయాయి.

ధర్మారావులో మాత్రం ఇవన్నీ ఉన్నాయి. కారణం, అతని వెనుక యుద్ధం లేదు, యుద్ధం కలిగించే అనుభవమూ, స్వస్వరూప జ్ఞానమూ, దృష్టి వైశాల్యమూ, మార్పులతో రాజీపడే, సర్దుకునే వ్యక్తులపట్ల సానుభూతీ లేవు. యాష్లీకి ఉన్నట్టు పెద్ద కుదుపుతోపాటు అనూహ్యమైన చలనశీలతను తెచ్చే యుద్ధ నేపథ్యంలేని స్థితిలో ధర్మారావుకు నిలబడి ఉన్న లౌకిక ప్రపంచం, సాపేక్షంగా స్తబ్ధ ప్రపంచం. ఎక్కువ కాలవ్యవధిలో చాప కింద నీరులా వ్యాపించే మార్పులతో  ధర్మారావు ఊహలోని గతవైభవ జీవితాన్ని లోపలినుంచి శిథిలం చేస్తున్న ప్రపంచం. ఈ మార్పుల దీర్ఘ కాలవ్యవధి, ధర్మారావు ఊహాశాలితను భూమార్గం పట్టించేబదులు మరింతగా అతిమానుష, కాల్పనిక జగత్తువైపు నడిపించి, లౌకికంగా అతన్ని నిష్క్రియుడిగా, నిస్సహాయుడిగా, నిర్వేదిగా మిగిల్చింది. గతవైభవోద్ధరణకు ఉద్దేశించిన అతని కార్యాచరణ ప్రణాళికా అతిమానుషమే, కాల్పనికమే. అది, ఇంద్రియ మనోనిగ్రహాల ద్వారా భక్తి జ్ఞానాలను పొందడం! సుబ్బన్నపేటలోని దేవాలయవ్యవస్థ అందుకు కార్యక్షేత్రం. గిరిక, గణాచారి, హరప్ప, అరుంధతి లాంటివారు కార్యకర్తలు.

యుద్ధానుభవం లేదా సాంస్కృతిక పునరుజ్జీవనానుభవం ఉండడం, లేకపోవడం అనేది పాశ్చాత్య, భారతీయ సామాజిక, సాంస్కృతిక, సాహిత్యక, తాత్వికతల తారతమ్య పరిశీలనకు ఒక ముఖ్య కొలమానం. ఆ స్పృహ వేయిపడగల రచయితలోనే కాదు, ఆ భావజాలానికి చెందిన చాలామందిలో లేదు. దాని ఫలితం బహురూపాలలో కనిపిస్తుంది. అన్నింటిలోనూ ఉభయుల మధ్య ఉన్న తేడాలు స్థిరమైనవనీ, స్వాభావికమైనవనీ, మౌలికమైనవనే నిర్ధారణ వాటిలో ఒకటి. వేయిపడగల రచయిత ధర్మారావు ముఖంగా వ్యక్తీకరించిన అనేక నిర్ధారణలు అలాగే ఉంటాయి. ఒకచోట ఇలా అంటాడు:

పాశ్చాత్యలోకము తన సంఘము ప్రతినిమేష పరివర్తనములచేత గగ్గోలు పడుచున్నది. అనియత భావములు జలపాతమువలె నిలిచి ప్రవహించలేక, యూర్థ్వ తిర్య గధో ముహుస్తాడనములచేత ఘూర్ణిళ్లిపోవుచున్నది. సిద్ధాంతమేదో తెలియదు. ఆదర్శమేదో తెలియదు. ఒక నిలుకడకు రాని, వచ్చుటకు వీలు లేకుండ తనే చేసుకొనిన పరిస్థితుల నుండి బహుళసమస్యలు పెంచుకుని, తత్సమస్యాపరిష్కారము కొరకు వేవిధముల వాఙ్మయమును వినియోగించుచున్నది. అది యంతయు సారస్వతమేనా?

పాశ్చాత్యలోకం పైన చెప్పిన విధంగా ఉండడానికి కీ ఎక్కుడుందన్న పరిశీలన వేయిపడగల రచయితలో లేదు. సాంస్కృతిక పునరుజ్జీవనం రూపంలో పెద్ద కదలిక వచ్చిన సమాజం అది. ఆ తర్వాత రెండు ప్రపంచయుద్ధాలను చూసింది(వేయిపడగల రచనా కాలానికి మొదటి ప్రపంచయుద్ధమే జరిగింది). ఆ విధంగా రకరకాల పరివర్తనలకు పాశ్చాత్యలోకం ప్రపంచప్రయోగశాల అయింది. మంచీ-చెడూ కలగలసిన పరివర్తనలు అవి. ఈ పరిణామాన్ని స్తబ్ధతా-చలనాల దృష్టికోణం నుంచి చూసినప్పుడు వేటి ప్రాధాన్యం వాటికుంది. కానీ వేయిపడగల రచయిత స్తబ్ధతను, నిలకడను గొప్ప గుణంగా చూపిస్తున్నాడు. స్తబ్ధతను ప్రేమించే దృక్పథం కాలాన్నీ, చరిత్రనూ, సారస్వతాన్నే కాక, సమస్తాన్ని స్టాణువుగానే చూస్తుంది. “మహార్థవంతమైనది నశించిపోవుటయు, అల్పప్రయోజనము లైనవి విజృంభించుటయు యీ నాటి సృష్టిపరిణామములోని యొక భాగము…ఒక నిమేషమాత్రమున్న మార్పు నిమేషజీవితులకు దీర్ఘముగానే కనిపించును. అనంతమైన కాలమున దీర్ఘ హ్రస్వత లెక్కడ?” అని ఒకచోట ధర్మారావు అంటాడు. ఈ నాటి సృష్టిపరిణామమే ఇలా ఉందనీ, ఒకప్పటి సృష్టి పరిణామం ఇలా లేదనే ఒక అతార్కిక ఊహను మొదటివాక్యం వెల్లడిస్తే, రెండో వాక్యం అనంతమైన కాలంలో మార్పు నిమేషమాత్రమే నంటూ మార్పు లేకుండా ఉండడమే కాలానికి గల అసలు స్వభావమని ధ్వనింపజేస్తోంది.

దేవీ దేవతలు, మతవిశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన అనేకాంశాలలో పాశ్చాత్య, భారతీయ సమాజాల మధ్య ఉన్న తేడాలు స్వాభావికమైనవీ, మౌలికమైనవీ కావనీ; క్రీస్తు పూర్వ ప్రపంచంలో పాశ్చాత్యంతో సహా ప్రపంచమంతా ఈ విషయాలలో దాదాపు ఒకేవిధమైన అనుభవాన్ని పంచుకుందనీ సారంగలోనే వెలువడిన నా పురాగమన వ్యాసాలలో సోదాహరణంగా చూపించాను.

అదలా ఉంచితే, వేయిపడగలను, గాన్ విత్ ద విండ్ ను పక్క పక్కన పెట్టి పరిశీలించినప్పుడు; వేయిపడగలకు గాన్ విత్ ద విండ్ ఒక సమాధానమనీ, యుద్ధానుభవం ద్వారా, వేయిపడగల ఇతివృత్తానికి లేని ఒక సంపూర్ణతను, సమగ్రతను అది పొందగలిగిందనీ, వేయిపడగల రచయిత ధర్మారావును నాయకుణ్ణి చేసి పట్టం కడితే; గాన్ విత్ ద విండ్ రచయిత్రి ధర్మారావు ప్రతిబింబమైన యాష్లీ నిరాకరించి మార్పుకు పట్టం కట్టడమే లక్ష్యంగా తన నవలను నడిపించిందనే భావన కలుగుతుంది.

(ఈ భాగాన్నిఇక్కడితో సశేషం చేసి సారంగను చూడబోతే ఇక సెలవు’, ‘ఇదే సారంగ చివరి సంచిక అంటూ సంపాదకవర్గం చేసిన పిడుగుపాటులాంటి ప్రకటన. సారంగ లాంటి పత్రిక ఆగడం సాహిత్యవిజ్ఞానప్రేమికులందరికీ  బాధాకరపరిణామం. ఇది తాత్కాలికం కావాలనే అందరిలా నేనూ కోరుకుంటున్నాను. నా పురాగమన వ్యాసాలు, ఈ వ్యాసాలతోపాటు వివిధ ఇతర వ్యాసాలను కూడా ప్రచురించిన అఫ్సర్, కల్పనగార్లకు కృతజ్ఞతలు.

ఈ పరిణామం కారణంగా ఈ వ్యాసపరంపర ఇక్కడ అర్థాంతరంగా ఆగిపోక తప్పడంలేదు. మరోచోట పునః ప్రారంభమవు తుందేమో నన్నది ప్రస్తుతానికి ఆశాభావం. -కల్లూరి భాస్కరం)

 

 

 

 

అతని మరణం…

 

స్లీమన్ కథ-35

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు అన్నా, నొప్పి తిరగబెట్టింది. ఇంతకుముందు కన్నా దుర్భరంగా మారింది. చెవిలోని అస్థి కవచం దెబ్బతిన్నట్టు, మంట లోపలిచెవిలోకి వ్యాపించినట్టు అర్థమైంది. వైద్యులు వారిస్తున్నా వినకుండా ఆసుపత్రినుంచి వెళ్లిపోవాలని స్లీమన్ నిర్ణయించుకున్నాడు. చెవుల్లోంచి తీసిన ఎముకలను రెండు చిన్న పెట్టెలలో ఉంచి అతని చేతికి ఇచ్చారు. అతను  లైప్జిగ్ (Leipzig) 1 వెళ్ళి తన ప్రచురణకర్తలను కలసుకున్నాడు. అక్కడినుంచి బెర్లిన్ వెళ్ళి విర్కోను కలిశాడు. వినుకలిశక్తి పూర్తిగా పోయింది. అయినా విర్కోకు ఉల్లాసంగా ఉన్నట్టు కనిపించాడు. కెనారీ సందర్శనకు తోడు వస్తానన్న అతని వాగ్దానాన్ని గుర్తుచేసి రైల్లో పారిస్ వెళ్ళాడు.

డిసెంబర్ 15న పారిస్ చేరుకున్నాడు. ఆ శీతాకాలంలో అతిశీతల దినం అదే. సోఫియా రాసిన ఆరు ఉత్తరాలు అతనికోసం ఎదురుచేస్తున్నాయి. అవి చదువుతుంటే, తన గురించి ఆందోళన చెందుతూ ఆమె తన పక్కనే ఉన్నట్టు  అనుభూతి చెందాడు. క్రిస్టమస్ నాటికి గానీ తను తిరిగి ఎథెన్స్ కు వెళ్ళలేననుకున్నాడు. ఈ మధ్యలో తను నేపుల్స్ 2 మ్యూజియంను సందర్శించేందుకు వ్యవధి ఉంటుంది. తను పాంపే 3లో తవ్వి తీసిన పురావస్తుసంపదను అందులో ప్రదర్శిస్తున్నారు. చెవిపోటు తిరగబెట్టడానికి తను చేసిన పొరపాటే కారణమనీ, రైల్లో వెళ్ళేటప్పుడు అరేబియన్ నైట్స్ అరబ్బీ మూలాన్ని చదవడంలో మునిగిపోయి చెవులలో దూది పెట్టుకోవడం మరచిపోయాననీ భార్యకు రాశాడు. విర్కోకు చివరి ఉత్తరం రాస్తూ, పల్లాస్ ఎథెనా (Pallas Athene-గ్రీకు ఉచ్చారణ: పలావా ఫినా) 4 చిరకాలం వర్ధిల్లుగాక! ఇప్పుడు కనీసం కుడిచెవితోనైనా వినగలుగుతున్నాను. ఎడమ చెవి కూడా బాగుపడుతుందని అనుకుంటున్నాను” అన్నాడు.

తనను జీవితాంతం కాపాడుతూ వచ్చిన పల్లాస్ ఎథెనా, ఇతర గ్రీకు దేవతలు ఇప్పుడు ఒలింపస్ 5 మబ్బుల మాటున ఉండిపోయారు. తను కనుగొన్న నిక్షేపాలను కడసారి చూసేందుకు మాత్రం అనుమతించారు, అది కూడా లిప్తకాలమే! ఓ శీతాకాలపు మధ్యాహ్నాన విపరీతమైన జ్వరంతోనూ, నిస్త్రాణతోనూ బాధపడుతూ పక్కన వైద్యుని ఉంచుకుని నేపుల్స్ మ్యూజియంను సందర్శించాడు.

అక్కడికి చేరే సమయానికే తుదిఘడియలకు చేరువలో ఉన్నాడు. చెవిపోటుతో గిలగిలలాడుతున్నాడు. పారిస్ నుంచి రెండు రోజుల ప్రయాణం అతని ఓపికను పూర్తిగా హరించింది. పోటు క్షణక్షణానికి దుస్సహమవుతున్న స్థితిలో వెంటవెంటనే ఇద్దరు వైద్యులను సంప్రదించాడు. ఇంకో వైపు అతని ఎథెన్స్ ప్రయాణానికి ఓడ సిద్ధంగా ఉంది. కానీ అతను సముద్రప్రయాణం చేసే స్థితిలో లేడు. క్రిస్టమస్ సంబరాలను కొద్ది రోజులు వాయిదా వేయమని సోఫియాకు తంతి పంపించి, మూడో వైద్యుని సంప్రదించడానికి వెళ్ళాడు. అతన్ని గుర్తుపట్టిన ఆ వైద్యుడు పురావస్తుశాస్త్రంపై ఎంతో ఆసక్తిని చూపిస్తూ, ఓసారి పాంపే వెళ్ళి వస్తే ఎలా ఉంటుందని సూచించాడు.

ఓ పెద్ద కోటును చుట్టబెట్టుకున్న స్లీమన్, ఓ బండిలో కూర్చుని వెసూవియస్(Vesuvius)6 కొండ నీడనే, ఓ  అఖాతాన్ని చుట్టుకున్న దారిలో సుదీర్ఘప్రయాణం చేసి పాంపేను సందర్శించాడు. వసారా ఇళ్ళు, పురాతన రోమన్ శకటాల కింద నలిగిన రహదారులు, రెండువేల ఏళ్ల క్రితం మద్యవిక్రేతలు నిలబడిన తబెర్నా(tabernae-మద్యవిక్రయ కుటీరాలు)లు-అతను ఎలా ఊహించుకున్నాడో అలాగే ఉన్నాయి. ఆ తర్వాత హోటల్ గదికి తిరిగొచ్చాడు. తను త్వరలోనే ఎథెన్స్ చేరుకుంటాననీ, అక్కడికొచ్చాక ఈ చెవినొప్పి సంగతి చూస్తాననీ చెబుతూ మరికొన్ని తంతులు పంపించాడు.

స్లీమన్ ఎథెన్స్ నివాసంలో ఉన్న నాణేల మ్యూజియం

స్లీమన్ ఎథెన్స్ నివాసంలో ఉన్న నాణేల మ్యూజియం

క్రిస్టమస్ రోజున, పోస్టాఫీస్ కు వెడుతూ కాబోలు, ప్యాజ్జా డెల్లా శాంటా క్లరీటాను దాటుతున్నాడు. అంతలో  రోడ్డు మీద కుప్పకూలిపోయాడు. అయినా కళ్ళు తెరచుకుని స్పృహలోనే ఉన్నాడు. జనం చుట్టూ మూగి ఎవరు, ఏమిటని ప్రశ్నించారు. తల ఊపడం తప్ప మాట్లాడలేకపోయాడు. మాట పడి పోయిందని అర్థమైంది.

పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాస్త కళ్ళు తిరిగి ఉంటాయి తప్ప, పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని చేర్చుకోడానికి నిరాకరించారు. దాంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అతని ఆనవాలు పత్రాల కోసం, డబ్బు కోసం జేబులు వెతికారు. అవి కనిపించలేదు కానీ, వైద్యుడి చిరునామా దొరికింది. అతన్ని పిలిపించారు. స్లీమన్ గురించి అతను చెప్పిన వివరాలకు  విస్తుపోయారు. అతని దుస్తులు చూసి పేదవాడు అనుకున్నారు. అతను పెద్ద సంపన్నుడనీ, అతని పర్సు నిండా బంగారు నాణేలు ఉంటాయనీ వైద్యుడు చెప్పాడు. తనే అతని చొక్కా లోపలి జేబులోంచి బంగారు నాణేలతో ఉన్న ఒక పెద్ద పర్సును బయటికి తీశాడు.

స్లీమన్ ను అతని హోటల్ గదికి తీసుకెళ్లారు. అప్పటికీ అతను పూర్తి స్పృహలోనే ఉన్నాడు. ఒక్క మాట పోవడం తప్ప మిగిలిన అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయి. వైద్యుడు అతని చెవిని తెరచి చూశాడు. అప్పటికే రుగ్మత మెదడుకు వ్యాపించినట్టు అర్థమైంది. ఈ దశలో చేయగలిగింది ఏమీ లేదని తోచింది. ఆ రాత్రి గడిచింది. మరునాడు అతని శరీరంలో కుడిభాగం చచ్చుబడిపోయింది. కపాలానికి రంధ్రం చేసి లోపల పరీక్షిస్తే మంచిదన్న సలహా వినిపించింది. ఎనిమిదిమంది నిపుణులను పిలిపించారు. వాళ్ళు ఇంకో గదిలో సమావేశమై ఏం చేయాలో చర్చించుకుంటూ ఉండగానే, చివరివరకు స్పృహలోనే ఉన్న స్లీమన్ తన పడక మీద నిశ్శబ్దంగా కన్నుమూశాడు.

***

ఎథెన్స్, బెర్లిన్ లకు తంతి వెళ్లింది. దార్ఫెల్త్, సోఫియా అన్న వెంటనే బయలుదేరి వచ్చారు. మృతదేహాన్ని ఎథెన్స్ కు తీసుకెళ్లారు. పదో రోజున, 1891 జనవరి 4న శవపేటికను, ఆకాశపు కప్పు కింద ఇరవైనలుగురు పాలరాతి దేవీదేవుళ్ళు కొలువుతీరిన అతని భవంతిలోని విశాలమైన హాలులో ఉంచారు. కింగ్ జార్జి, యువరాజు కాన్ స్టాన్ టైన్ స్వయంగా వచ్చి శవపేటిక వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. ప్రపంచం నలుమూలల నుంచీ సానుభూతి సందేశాలు వెల్లువెత్తాయి.

తన సమాధి స్థలాన్ని అతను ముందే ఎంచుకున్నాడు. ఇలిసస్ కు దక్షిణంగా ఉన్న ఒక శ్మశానంలో, తను ఎంతగానో ప్రేమించిన గ్రీకుల మధ్య, ఒక వీరుడికి తగిన గోపురం కింద అతని మృతదేహాన్ని సమాధి చేశారు.  అక్కడినుంచి ఎథెన్స్ పురాతనదుర్గమూ, శరోనిక్ 7 నీలిజలాలు, సుదూర ఆర్గోలిస్ పర్వతాలు– స్థిమిత పడని అతని ఆత్మకు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ పర్వతాలకు అవతలే మైసీనియా, టిర్యిన్స్ రాజుల సమాధులు ఉన్నాయి. జీవితం చాలించిన తర్వాత కూడా తన ఆరాధ్య వీరులకు, దేవతలకు దగ్గరగానే ఉన్నాడు. శిఖరాగ్రాన ఉన్న శిథిల పార్థినోన్ (Parthenon) 8 నుంచి తెలి చూపుల తల్లి ఎథెనా అతన్ని చల్లగా చూస్తూనే ఉంటుంది.

మరణానంతరం అతనికి కొత్త జీవితం ప్రారంభమైంది. భూమిని మంత్రించి బంగారాన్ని వెలికి తీసిన ఈ వ్యక్తి తన జీవితకాలంలోనే ఒక చరిత్రగా మారిపోయాడు. మరణాంతరం అంతకంటే పెద్ద చరిత్రగా పరిణమించాడు. అతని దురాగ్రహాన్ని, తలబిరుసును, ఇబ్బందికరమైన అతని విపరీత ధోరణులను జనం మరచిపోయారు. హోమర్ పట్ల అతని అచంచల విశ్వాసాన్నీ,  భూమిలో సమాధైన రహస్యాల వెల్లడిలో అతని మడమ తిప్పని సంకల్పబలాన్నీ గుర్తుపెట్టుకున్నారు. అతని అవగుణాలే సుగుణాలుగా మారిపోయాయి. విచక్షణ ఎరగని అతని అహంభావాన్ని సహజమైన ఆత్మగౌరవమన్నారు. అతని అతిశయోక్తులూ, డాబుసరి మాటలూ,  గొప్ప చారిత్రకసంపదను బయటపెట్టాలన్న అతని తహతహ నుంచి పుట్టినవనీ; వాటిని క్షమించచ్చనీ అనుకున్నారు.  తనను ఒక మంచి బ్యాంక్ గుమస్తాగా మలచిన అలవాట్లే అతనికి జీవితాంతం ఉండిపోయాయన్న సంగతిని జనం మరచిపోయారు. మేథ్యూ ఆర్నాల్డ్(Matthew Arnold)9 అంటాడు: హోమర్ మహావేగంతో దూకే జలపాతం, నిష్కపటి, ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు, గొప్ప ఉదాత్తత నిండినవాడు 10;  స్లీమన్ ది పూర్తి విరుద్ధ స్వభావం, నిదానంగా, గడుసుగా వ్యవహరించేవాడు, సంక్లిష్టస్వభావి, జిత్తులమారి, డాంబికుడు, కోపిష్టి. సహజమైన ఉదాత్తత మచ్చుకైనా లేనివాడు.

museum

స్లీమన్ మ్యూజియం

అయినాసరే,  ట్రాయ్ బురుజులమీద నిలబడి తన శత్రువులతో  అసామాన్య విజిగీషతో పోరాడిన వీరుడిగా; మొక్కవోని సంకల్పశక్తి ఉన్నవాడిగా చరిత్ర అతన్ని అభివర్ణించింది. తన విశ్వసనీయతను పెంచుకోడానికి తగినంత సత్యసంధతను పాటించినవాడిగా చిత్రించింది.  వాస్తవంగా హోమర్ కాలానికి చెందిన వస్తువులను వేటినీ అతను వెలికితీయకపోయినా, అతని శవపేటిక శిరోభాగం వద్ద హోమర్ శిలాప్రతిమను ఉంచడం ఎంతైనా సముచితంగా కనిపించింది.

చివరికి, పురావస్తురంగంలోకి దారులు తెరచి చూపించిన గొప్ప వేగుచుక్కలలో ఒకడిగా, తొలితరం పురావస్తు నిపుణులలో ప్రముఖుడిగా గుర్తింపు పొందాడు. నిజానికి అతను శాస్త్రీయ పురావస్తు పరిజ్ఞానానికి వ్యతిరేకి. పూర్తిగా కాల్పనికభావన నిండినవాడు. యథేచ్ఛగా కిటికీలు తెరిచేసి రకరకాల గాలులు లోపలికి ప్రసరించడానికి అవకాశమిచ్చినవాడు. కేవలం విశ్వాసమూ, స్వాప్నికతే ఈ రంగంలో అతన్ని ముందుకు నడిపించాయి. తను బాల్యం నుంచీ ఆరాధిస్తూ వచ్చిన హోమర్ వీరుల స్వభావాన్నే ఈ రంగంలోనూ అతను పుణికిపుచ్చుకున్నాడు.

స్లీమన్ మరణించిన కొన్ని రోజుల తర్వాత, ఎనభయ్యొక్కేళ్ళ గ్లాడ్ స్టన్ వణికే చేతితో స్వయంగా సంతాపసందేశం రాసి సోఫియాకు పంపించాడు. స్లీమన్ లోని విలక్షణ మేధాశక్తి తనను ఎంత గాఢంగా ప్రభావితం చేసిందో అందులో రాశాడు. స్లీమన్ విజయస్వభావాన్ని ఒకే ఒక్క పేరాలో ఇలా వర్ణించాడు:

అతనిలోని ఉత్సాహశక్తి;  పురాకాలపు శౌర్యసాహసస్ఫూర్తిని పరిశుద్ధ, రక్తరహిత రూపంలో సంపూర్ణంగా గుర్తుచేసింది. తన పరిశోధనల తొలి దశలలో అతను తీవ్రవిమర్శనూ ఉపేక్షనూ రెండింటినీ ఎదుర్కొన్నాడు. కానీ మంచుపొగనుంచి సూర్యుడు బయటపడినట్టుగా అతని పరిశోధనల శక్తీ, విలువా స్పష్టమౌవుతున్న కొద్దీ వ్యతిరేకులు తోక ముడిచారు.  అతని బాల్యమూ, యవ్వనకాలమూ, అతని అనంతరజీవితం కంటే ఏమంత తక్కువ ప్రాముఖ్యం ఉన్నవి కావు. నిజానికి ఆ మూడు దశలనూ ఎవరూ విడదీయలేరు. ఎందుకంటే, తొలినుంచి తుదివరకూ ఒక లక్ష్యశుద్ధి, ఒక ప్రయోజనదృష్టి ఒకేలా అతని జీవితాన్ని ముందుకు నడిపించాయి. అతన్ని ప్రముఖుడిగా నిలబెట్టడానికి అతనిలోని ఉత్సాహశక్తి, ఔదార్యాలలో ఏ ఒక్కటైనా సరిపోతాయి. ఇక ఆ రెండూ కలిసినప్పుడు అదొక అద్భుతానికి ఏమాత్రం తక్కువ కాదు.

“అతనిలోని ఉత్సాహశక్తి; పురాకాలపు శౌర్యసాహసస్ఫూర్తిని పరిశుద్ధ, రక్తరహిత రూపంలో సంపూర్ణంగా గుర్తుచేసింది…” అన్న గ్లాడ్ స్టన్ వాక్యంతో స్లీమన్ విభేదించి ఉండేవాడు. పురాతన వీరులకు తను రక్తమాంసాలు కల్పించాననీ, సమాధులనుంచి వారిని పునరుత్థానం చెందించాననీ చెప్పి ఉండేవాడు. భూమిలో కప్పడిన పురానగరాలపై ఒక మాంత్రికుడిలా అతను మంత్రదండం తిప్పి, వాటిని సజీవం చేశాడు. ఈ పురాతన జీవుల గురించి మనకిప్పుడు తెలుస్తోందంటే, అతను తన శక్తియుక్తులన్నీ గుప్పించి వారి అవశేషాలను వెలికి తీశాడు కనుకనే. ఒకప్పుడు గొప్ప వైశాల్యమూ, అద్భుతత్వమూ, నిగూఢతా మూర్తీభవించిన మహావీరులు ఈ భూమిమీద నడయాడారు. ఇప్పటికీ వారిలో ఆ వైశాల్యమూ, అద్భుతత్వమూ అలాగే ఉన్నాయి కానీ; వెనకటంత నిగూఢులు కారు. అఖిలెస్, నక్కజిత్తుల ఒడీసీయస్, శిరస్త్రాణంపై నర్తించే తురాయితో హెక్టర్—వీళ్ళందరి మధ్యా స్లీమన్ నిరంతరం జీవించాడు, వీరిపట్ల అతను నమ్మకాన్ని కోల్పోయిన క్షణమంటూ లేదు.

***

ఒక్కోసారి స్లీమన్ ఆలోచనా సరళి ఎలా ఉండేదంటే,  హోమర్ చిత్రించిన వీరులు మాత్రమే నిజం, మిగతా యావత్ప్రపంచం అబద్ధమన్న భావన అతనిలో జీర్ణించుకుందా అనిపించేది. తన జీవితంలో చివరి అయిదేళ్లూ అతను ప్రాచీన గ్రీకుభాషలోనే మాట్లాడాడు, రాశాడు. హోమర్ మంత్రదండం స్పర్శించని ప్రతిదానిపైనా అతను నిరాసక్తుడయ్యాడు. “ఒక్క హోమర్ మాత్రమే నాలో ఆసక్తిని నింపుతున్నాడు. మిగతా అన్నిటిపట్లా నాలో నిరాసక్తత నానాటికీ పెరుగుతోంది” అని ఒక మిత్రుడితో అన్నాడు. పురాతనపు మట్టిపిడకల(tablets)మీద లిఖించిన ధర్మశాస్త్రాలకు ఉన్నంత శక్తిమంతతతో హోమర్ అతనితో సంభాషించాడు. అంతేకాదు, హోమర్ అతనికి ఒక దిగ్దర్శి, ఒక శిలాశాసనం, ఒక జీవనవిధానం, ఈ భూగోళపు ఒకానొక చరిత్ర. రేపటి మానవజీవనసరళిని ప్రస్ఫుటించే ఒక భవిష్యవాణి. స్లీమన్ ఉన్మాది కాడు, కానీ ఉన్మాదానికి దగ్గరగా ఉంటాడు.  ఉజ్వలమైన, అత్యద్భుతమైన విశుద్ధనాగరికత ఒకప్పుడు ఈ భూమిమీద వర్ధిల్లిందన్న విశ్వాసాన్ని విరాడ్రూపానికి పెంచిన ఉన్మాదం అతనిది. అతని దృష్టిలో, ఉన్మాది కావడానికి సైతం సిద్ధమై అడుగుపెట్టదగిన మహత్తర నాగరికత అది.

స్లీమన్ తో పాటు అలాంటి ఉన్మత్తతను పంచుకున్నవారు మరెందరో!  ఆంగ్లకవి కీట్స్ ఒక గ్రీకు కలశాన్ని చూడగానే, తనను ఏదో అద్భుతమైన ఉజ్వలత కమ్మేసిన అపురూప క్షణాలను అనుభూతి చెందాడు. పురాకాలపు బలులు, ఇతర తంతులు తన కళ్లముందు జరుగుతున్నట్టు భావించుకున్నాడు. భూమి మీద ఏనాడో అదృశ్యమైన ఆ నాగరికతకు జర్మన్ రచయిత గథా(Goethe)11, జర్మన్ కవి షిలర్(Schiller)12  విధేయత ప్రకటించుకున్నారు. గ్రీకు దేవతలను తలచుకుని మత్తెక్కి మైమరచిన మరో జర్మన్ కవి  ఫ్రీడ్రిచ్ హోల్డర్లీన్(Friedrich Holderlin)13, ఇప్పటికీ వారి ఆలయాలు ఉన్నట్టూ, వాటిలో ఇప్పటికీ వారి కొలుపులు జరుగుతున్నట్టూ, ఈ ఆలయాలలో తనొక పూజారి నైనట్టూ ఊహించుకున్నాడు. ఊహల్లో తప్ప ఎన్నడూ చూసి ఎరగని గ్రీకు దీవుల్లో తనొక సంచారి ననుకున్నాడు. అతని భావనలో క్రీస్తే సర్వోన్నత దైవం, గ్రీకు వీరులు క్రీస్తు పుత్రులు. క్రీస్తు, గ్రీకు దేవతల పట్ల అతనిలో ఒకేవిధమైన భక్తితత్పరత.  ప్రాచీన గ్రీకు సంగీతయుక్తంగా కవిత్వం విరచిస్తూనే అతను క్రైస్తవకవులలో అగ్రగణ్యుడిగా గుర్తింపు పొందాడు.  క్రీస్తు ఆరాధన, గ్రీసు విధేయత జమిలిగా అతన్ని ఎంత వివశుణ్ణి చేశాయంటే, చివరికి అతనొక ఉన్మాది అయ్యాడు.

స్లీమన్ విషయానికి వస్తే, అతను చర్చి వాతావరణంలో పెరిగినా, తన క్రైస్తవ వారసత్వాన్ని నిరాకరించాడు. ఏనాడూ చర్చికి వెళ్లలేదు. బైబిల్ ను కల్పితరచనగా భావించాడు. కొత్త నిబంధన(New Testament) చూసి విస్తుపోయాడు. హోమర్ లో కనిపించని అనేక గ్రీకు పదాలు అందులో కనిపించాయి. సోఫియా తల్లి మరణించినప్పుడు, శ్మశానవాటికకు వెళ్ళిన అతను, అక్కడ క్రైస్తవ పూజారుల చేస్తున్న ప్రార్థనలు విని, “ఇదంతా అర్థరహితం. పునరుత్థానం అంటూ ఏదీ లేదు- ఉన్నదల్లా ఒక్క అమరత్వం మాత్రమే!” నని గొణుక్కున్నాడు. హోమర్ అనంతరకాలానికి చెందిన యూరోపియన్ సంప్రదాయం మొత్తాన్నిఅతను తృణీకరించాడు. మోజెస్ సినాయి ఏడారులను దాటాడు; క్రీస్తు పరమపదించాడు; రోమన్ సామ్రాజ్యం ఉత్థాన పతనాలను చూసింది. ఆ తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనం అడుగుపెట్టింది. ఆ తర్వాత ఒక్కొక్క రేకే కాండం నుంచి జారిపోయింది; అతని దృష్టిలో ఇవన్నీ కేవలం అర్థరహితాలు–

చివరివరకూ నిలిచి వెలిగేది ఒకే ఒక జ్వాల… ఆ జ్వాల పేరు, హోమర్!!!

***

స్లీమన్ తర్వాత…

  • స్లీమన్ ప్రారంభించిన పని, అతని మరణం తర్వాత కూడా విజయవంతంగా కొనసాగింది. యూరప్ కు చెందిన ఎందరో పురావస్తునిపుణులు గ్రీస్, మధ్యప్రాచ్యం మొదలైన చోట్ల తవ్వకాలు జరిపించి పురాకాలానికి చెందిన ఎన్నో విశేషాలను బయటపెట్టారు.
  • ట్రాయ్ లో తవ్వకాలు కొనసాగించడానికి దార్ఫెల్త్ కు సోఫియా ఆర్థికసాయం చేసింది. ఆ తర్వాత జర్మన్ చక్రవర్తి నుంచి కూడా ఆర్థికసాయం అందింది. హోమర్ చిత్రించిన ట్రాయ్ ను గుర్తించడంలో స్లీమన్ పొరబడినట్టు దార్ఫెల్త్ కు అర్థమైంది. అతని తవ్వకాలలోనే హోమర్ ట్రాయ్ బయటపడింది.
  • సర్ ఆర్థర్ ఎవాన్స్ 1900-05 మధ్య క్రీటులో తవ్వకాలు జరిపించి క్రీ.పూ. ఆరవ సహస్రాబ్దికి చెందిన నాగరికతను వెలికితీశాడు. క్రీటుకు చెందిన మూడు లిపులను బయటపెట్టాడు.
  • అమెరికాకు చెందిన కార్ల్ బ్లెగన్ 14అనే పురావస్తునిపుణుడు 1932-38 మధ్యకాలంలో హిస్సాలిక్ లో తవ్వకాలు జరిపించి స్లీమన్, దార్ఫెల్త్ ల పొరపాట్లను సరిదిద్దాడు. మైసీనియాలో క్రీటు లిపిలో ఉన్న మట్టిపిడకలను కనుగొన్నాడు. అయితే ఆ లిపిని ఛేదించలేకపోయాడు. ఇంతలో రెండో ప్రపంచయుద్ధం రావడంతో పురావస్తు తవ్వకాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
  • 1952లో క్రీటు లిపితో ఉన్న మరికొన్ని మట్టిపిడకలు బయటపడ్డాయి. మైకేల్ వెంట్రిస్(Michael Ventris) 15అనే ఆంగ్లేయభాషాశాస్త్రవేత్త, జాన్ చాద్విక్(John Chadwick) 16, ఆలిస్ కాబర్(Alice Kober) 17 అనే మరో ఇద్దరు భాషావేత్తలతో కలసి ఎట్టకేలకు విజయవంతంగా క్రీటు లిపిని ఛేదించి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. వెంట్రిస్, చాద్విక్ లు Documents in Mycenaean Greek అనే తమ రచనను స్లీమన్ కు అంకితమిచ్చారు.

(అయిపోయింది)

అథోజ్ఞాపికలు

  1. లైప్జిగ్: జర్మనీలోని ఒక నగరం.
  2. నేపుల్స్: ఇటలీలో రోమ్, మిలాన్ తర్వాత పెద్ద నగరం.
  3. పాంపే: ఇటలీలో నేపుల్స్ కు దగ్గరలో ఉన్న పురావస్తు ప్రాధాన్యం కలిగిన ప్రాచీన నగరం.
  4. పల్లాస్ ఎథెనా: విజ్ఞానాన్ని, ధైర్యసాహసాలను, స్ఫూర్తిని, న్యాయ, ధర్మాలను, నాగరికతను, గణిత శాస్త్రాన్ని, యుద్ధవ్యూహాన్ని, లలితకళలను, చేతివృత్తులను సంకేతించే గ్రీకు దేవత. మన సరస్వతీదేవితో పోల్చదగిన దేవత అన్నమాట.
  5. ఒలింపస్: గ్రీకు దేవతలు నివసించే పర్వతం. రాక్షసులపై దేవతలు విజయం సాధించిన తావు.
  6. వెసూవియస్(Vesuvius): ఇటలీలో నేపుల్స్ కు దగ్గరలో ఉన్న ఒక అగ్నిపర్వతం.
  7. శరోనిక్: గ్రీస్ లో ఉన్న ద్వీపసముదాయాన్ని చుట్టి ఉన్న జలసంధి. ఈ పేరే ఈ ద్వీపసముదాయానికి కూడా వచ్చింది.
  8. పార్థినోన్ (Parthenon): గ్రీస్ లో ఎథెన్స్ లో ఉన్న పురాతన దుర్గంపై ఉన్న ఎథెనా ఆలయం.
  9. మేథ్యూ ఆర్నాల్డ్(1822-1888): ప్రముఖ ఇంగ్లీష్ కవి, విమర్శకుడు.
  10. విచిత్రంగా వాల్మీకి గురించి రాంభట్ల కృష్ణమూర్తిగారు కూడా ఇలాగే అంటారు: “వాల్మీకి నిజాన్ని దాచడు. అబద్ధం చెప్పడు”(జనకథ). వ్యాసుడికీ ఇదే వర్తిస్తుందనుకుంటాను.
  11. జొహాన్ వాల్ఫ్ గంగ్ గథా(1749-1832): జర్మన్ రచయిత, రాజనీతిజ్ఞుడు.
  12. జొహాన్ క్రిస్తోఫ్ ఫ్రీడ్రిచ్ వాన్ షిలర్(1759-1805): జర్మన్ కవి, తత్వవేత్త, చరిత్రకారుడు.
  13. జొహాన్ క్రిస్టియన్ ఫ్రీడ్రిచ్ హోల్డర్లీన్(1770-1843): ప్రముఖ జర్మన్ గేయకవి.
  14. కార్ల్ విలియం బ్లెగన్ (1887-1971): అమెరికాకు చెందిన పురావస్తునిపుణుడు.
  15. మైకేల్ జార్జి ఫ్రాన్సిస్ వెంట్రిస్(1922-1956): ఆంగ్లేయ భాషాశాస్త్రవేత్త.
  16. జాన్ చాద్విక్ (1920-1998): ఆంగ్లేయ భాషాశాస్త్రవేత్త.
  17. ఆలిస్ ఎలిజబెత్ కాబర్(1906-1950): అమెరికాకు చెందిన భాషానిపుణురాలు.

 

 

 

 

 

 

“ప్రియా సోఫియా…ఇంక సెలవా!”

 

స్లీమన్ కథ-34

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

కైరోలోని బ్రిటిష్ సైనికాధికారులు తన రాకపై ప్రత్యేకమైన ఆసక్తి చూపకపోవడం స్లీమన్ ను బాధించింది. బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్న ఈజిప్షియన్లపై అతనిలో సానుభూతి అంకురించింది. ఆస్వాన్ 1 చేరగానే, తన రాక గురించి స్థానిక అధికారులకు తెలియజేయమని కార్యదర్శిని ఒడ్డుకు పంపించాడు. తిరిగొచ్చిన కార్యదర్శి, అధికారులు మీ పేరెప్పుడూ వినలేదన్నారనీ, మీకు స్వాగతం చెప్పే ఉద్దేశంలో లేరనీ చెప్పాడు. తన పేరు ప్రతిష్టలు ఆస్వాన్ లోని ఈజిప్షియన్ కార్యాలయాలవరకూ పాకలేదని తెలిసి స్లీమన్ దిగ్భ్రాంతి చెందాడు. కోపంతో గింజుకున్నాడు. అధికారులు వచ్చి తనకు స్వాగతం చెబితే తప్ప ఒడ్డు ఎక్కేదిలేదని భీష్మించాడు.

ఆ శీతాకాలంలో ఆస్వాన్ పర్యాటకులతో కిక్కిరిసి ఉంది. వాళ్ళలో చాలామంది ఔత్శాహిక పురావస్తునిపుణులున్నారు. వాళ్లలోనూ కొందరు మంచి అంకితభావం ఉన్న యువకులు. అలాంటి వారిలో ఈ.ఏ. వ్యాలిస్ బాడ్జ్ 2 ఒకడు.  అప్పటికతను అంతగా ప్రసిద్ధుడు కాదు. బ్రిటిష్ మ్యూజియం తరపున మొదటిసారి ఈజిప్టులో పని చేయడానికి వచ్చాడు. కుఫిక్ లిపి 3 రాతలతో ఉన్న తొలినాటి మహమ్మదీయుల గోపుర సమాధులను గుర్తించడం అతనికి అప్పగించిన బాధ్యత. ఎందుకంటే, హిజిరా 4 సమీపకాలం నుంచీ ఆస్వాన్ యాత్రాస్థలిగా ఉంటూ వచ్చింది.

వ్యాలిస్ బాడ్జ్ పనిపట్ల మంచి శ్రద్ద, ఆసక్తి ఉన్నవాడే కాక, సరళస్వభావి. స్లీమన్ చిన్నబుచ్చుకున్న సంగతి అతనికి తెలిసింది. వెంటనే ఇద్దరు మిత్రులను వెంటబెట్టుకుని స్లీమన్ ఉన్న దహబియా వద్దకు ఒక బోటులో వెళ్ళాడు. బట్లర్ వాళ్ళకు ఎదురేగి పడవ వెనుక భాగంలో ఉన్న ఒక విశాలమైన గదిలోకి తీసుకెళ్ళాడు. అతను తెచ్చి ఇచ్చిన కాఫీ తాగి సిగరెట్లు వెలిగించిన తర్వాత అసలు విషయానికి వస్తూ, కొత్తగా తవ్వితీసిన మహమ్మదీయ సమాధుల పరిశీలనకు మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చామని స్లీమన్ తో చెప్పారు. ఆ మాట వినగానే స్లీమన్ బిర్ర బిగుసుకున్నాడు. తనకు అలాంటి ఆసక్తేమీ లేనట్టు తన కవళికలతోనే సూచించాడు. “మీరు వచ్చి అడిగినందుకు సంతోషం. నా పురావస్తు పరిజ్ఞానం అంతా ఉపయోగించి ఆ సమాధులగురించి మీకు క్షుణ్ణంగా బోధించి ఉండేవాణ్ణే కానీ, ఇప్పుడు నాకంత తీరిక లేదు. వాడీ హల్ఫా వెడుతున్నాను” అన్నాడు.

ఆ తర్వాత కాసేపు నిశ్శబ్దం. స్లీమన్ ఇంకో మాట మాట్లాకుండా, ‘ఇక మీరు దయచేయచ్చు’ అని సూచిస్తున్నట్టుగా, అంతవరకూ తను చదువుతూ ఉన్న ఇలియడ్ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ ముగ్గురూ విస్తుపోయారు. “ఇక మమ్మల్ని సెలవు తీసుకోమంటారా” అని వారిలో ఒకడైన మేజర్ ప్లంకెట్ ఎంతో మృదువుగా, మర్యాదగా అడిగాడు. స్లీమన్ తల ఊపాడు. తిరిగి వెడుతూ వారు ఒక విచిత్రమైన అనుభూతికి లోనయ్యారు. ఒకవైపు, ఒక ప్రపంచప్రసిద్ధ పురావస్తునిపుణుని కలసుకున్నామన్న సంతృప్తి, ఇంకోవైపు ఆయన ప్రవర్తన కలిగించిన మనస్తాపం!

schliemann and sophia

ఒకవిధంగా అతని ప్రవర్తన అసాధారణమే. తన శేషజీవితాన్ని బాధాగ్రస్తం చేస్తూవచ్చిన తలనొప్పి కూడా అందుకు ఒక కారణం కావచ్చు. మరోసారి ఇలాగే అతను నైలు నదిలో ప్రయాణించాడు. అప్పుడు రుడాల్ఫ్ విర్కో అతని వెంట ఉన్నాడు. తలనొప్పి, చెవినొప్పి కొంత ఉపశమించిన ఆ దశలో స్లీమన్ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నాడు. కార్నక్ 5 స్తంభాల మధ్య తిరుగుతూ, అక్కడి అంతుచిక్కని గజిబిజి దారులపై యువ పురావస్తునిపుణుడు ఫ్లిండర్స్ పేట్రీ 6 రూపొందించిన రేఖాపటాలను పరిశీలిస్తూ నాలుగు గంటలపాటు గడిపాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద భవంతి ఉన్న ప్రదేశం అది. ఆ భవంతిలో మూడు వేల గదులు, బ్రహ్మాండమైన 12 దేవీడీలు ఉండేవి. గదుల్లో సగం భూగర్భంలో ఉన్నాయి. గజిబిజి దారులతో ఉన్న ఆ సువిశాల ప్రదేశంలో ఫ్లిండర్స్ ఎంతో ఓపికగా జరిపించిన తవ్వకాలు స్లీమన్ ను ముగ్ధుణ్ణి చేశాయి. ఆ తర్వాత స్లీమన్, విర్కోలను కలసుకున్న ఫ్లిండర్స్ , పిడివాది అంటూనే వాస్తవాలను అంగీకరించే నిజాయతీ స్లీమన్ లో ఉందని కితాబు ఇచ్చాడు.

స్లీమన్ 1888లో సితేరా దీవిలో కొద్దిపాటి తవ్వకాలు జరిపి అఫ్రోడైట్ ఆలయాన్ని వెలికితీశాడు. హిస్సాలిక్, మైసీనియాలలో తను కనుగొన్న వాటితో మాత్రమే పోల్చదగిన ఓ బ్రహ్మాండమైన నిర్మాణాన్ని తను బయటపెట్టానంటూ లండన్ టైమ్స్ కు పొడవైన తంతి పంపించాడు. అదే ఏడాది పీలోస్ లోనూ, స్ఫేక్టీరియా 7దీవిలోనూ తవ్వకాలు జరిపాడు. క్రీ.పూ. 425లో స్పార్టాన్లు కనిపెట్టి ఉపయోగించుకున్నట్టు తూసడడీస్ రాసిన దుర్గాలను స్పేక్టీరియాలో వెలికితీశాడు. ఇవి ముఖ్యమైన పరిశోధనలే కానీ; హిస్సాలిక్, మైసీనియాలకు సాటి వచ్చేవి మాత్రం కావు.

నోసస్ అదే పనిగా అతన్ని గుంజి లాగుతూనే ఉంది. “నోసస్ (క్రీటు రాజధాని) రాజులు నివసించిన ప్రాసాదాలను బయటపెట్టడడమన్న ఒకే ఒక మహత్కార్యంతో ఈ జీవితాన్ని చాలిద్దామని ఉంది” అని 1889 జనవరి 1న రాసుకున్నాడు. అదే ఏడాది వసంతంలో అక్కడి భూమి కొనుగోలుకు మరో ప్రయత్నం చేద్దామనుకున్నాడు. దార్ఫెల్త్ ను వెంటబెట్టుకుని వెళ్ళి మళ్ళీ బేరసారాలు మొదలుపెట్టాడు. భూమి యజమాని అక్కడున్న 2500 ఆలివ్ చెట్ల ధరను కూడా కలుపుకుని లక్ష ఫ్రాంకులు అడిగాడు. స్లీమన్ 40వేల ఫ్రాంకులు ఇవ్వజూపాడు. చివరికి 50వేల ఫ్రాంకులకు బేరం కుదిరింది. తీరా ఆలివ్ చెట్లను లెక్కబెడితే 888 మాత్రమే ఉన్నాయి. దాంతో మండిపడిన స్లీమన్ ఇలాంటి అబద్ధాలకోరుతో తను లావాదేవీలు జరిపేదిలేదని మొండికేసాడు.

వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేయడానికి దార్ఫెల్త్ కు మనస్కరించలేదు. ఆ భూమి గురించి మరింత కూపీ తీశాడు. తమకు అమ్మజూపిన వ్యక్తి కింద మూడో వంతు భూమి మాత్రమే ఉందనీ, మిగతా భూమి మరొకరి యాజమాన్యంలో ఉందనీ తేలింది. ఆ కొత్త వ్యక్తితో సునాయాసంగా బేరం కుదిరి ఒప్పందం సిద్ధమైంది. అక్కడి తవ్వకాలలో లభించే నిధినిక్షేపాలలో మూడో వంతు స్థలయజమానులకు స్లీమన్ ఇవ్వజూపాడు. కానీ ఈసారి సంతకం చేయడానికి మొదటి స్థలయజమాని తిరస్కరించాడు. ఇది తెగే వ్యవహారం కాదని స్లీమన్ నిర్ణయానికి వచ్చి దార్ఫెల్త్ తో కలసి తిరుగుముఖం పట్టాడు. అతని క్రీటు గురించిన కల పూర్తిగా కరిగిపోయింది.

ఆ సంవత్సరంలోనే అతను ట్రాయ్ లో ట్రోజన్ పురావస్తు సంపద మీద మొదటి అంతర్జాతీయ సమ్మేళనం ఏర్పాటు చేసి దేశ దేశాల పండితులనూ ఆహ్వానించాడు. వారితోపాటు ట్రాయ్ శిథిలాల వెంట తిరుగుతూ తను కనుగొన్న విశేషాలను వారికి చూపించాడు. తన అనుభవాలను కథలు కథలుగా వారికి వినిపించాడు. ఇప్పటికీ అతనిలోని తొలినాటి ఉత్తేజం అలాగే ఉంది. మరుసటేడు అక్కడే రెండవ అంతర్జాతీయ సమ్మేళనం నిర్వహించాడు. పండితులను ఉద్దేశించి ఎంతో హుందాగా ప్రసంగాలు చేశాడు. విచిత్రంగా అతని మాటల్లో కొంత మార్పు వచ్చింది. వెనకటిలా సాటి పండితుల అల్పవిద్వత్తునో, మరుగుజ్జుపోకడలనో ఎత్తిచూపి తీసిపారేసే ధోరణి తగ్గింది. ఆ రోజుల్లోనే రుడాల్ఫ్ విర్కోను వెంటబెట్టుకుని మరోసారి ఈదా పర్వతం మీదికి విహారయాత్రకు బయలుదేరాడు. సాయంత్రానికి ఆ పర్వత పాదాల దగ్గర ఉన్న ఒక గ్రామానికి చేరేసరికి అతనికి దుర్భరమైన చెవిపోటు వచ్చి వినుకలిశక్తి పోయింది. విర్కో చెవిని పరీక్షించి లోపల బాగా వాచి ఉన్నట్టు గమనించాడు. వెంటనే ట్రాయ్ కి వెళ్ళడం మంచిదన్నాడు. ఇద్దరూ ఈదా పర్వతం ఎక్కకుండానే వెనక్కి వెళ్ళిపోయారు.

Atlantis-1882

Atlantis-1882

సమ్మేళనం ముగిసిన తర్వాత మళ్ళీ విర్కోతో కలసి గుర్రాల మీద ఈదా పర్వతయాత్రకు వెళ్లాడు. కొండ ఎక్కిన తర్వాత జియస్ కూర్చున్నదిగా చెప్పిన సింహాసనం మీద కూర్చుని, ఆ ఎత్తునుంచి కింది మైదానాన్ని చూస్తూ కాసేపు గడిపాడు. ఆ తర్వాత శిఖరానికి చేరుకుంటుండగా తుపాను విరుచుకుపడింది. చూస్తుండగానే అది పెను తుపానుగా మారిపోయింది. పెద్ద పెద్ద ఉరుములతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. అద్భుతమైన మెరుపులతో నలుదిక్కులూ వెలిగిపోయాయి. ఇద్దరూ రాతి గుట్టల కింద తల దాచుకున్నారు. అయినా వర్షంలో నిలువునా తడిసిపోయారు. కాసేపటికి తుపాను వెలిసింది. వర్షపు నీటితో శుభ్రపడిన కాంతిలో స్లీమన్ మరోసారి కింది ట్రాయ్ మైదానాన్ని, అదే చివరిసారా అన్నట్టుగా తన్మయంగా చూస్తూ ఉండిపోయాడు. నిజంగా అదే చివరిసారి అయింది.

సమ్మేళనం ముగిసినా పని కొనసాగింది. పనుల సారథ్యాన్ని దార్ఫెల్త్ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. శిథిలాల చెత్తను తొలగించే ముందు, పట్టుబట్టి ప్రతి వివరాన్నీ సునిశితంగా పరిశీలించాడు. ఫోటో తీయించాడు. చీటీలు అతికించాడు. సమయం వృథా అవుతోందని స్లీమన్ పోరు పెడుతున్నా వినిపించుకోలేదు. అతని శ్రమ వృథా పోలేదు. కొత్తగా కొన్ని అపురూపమైన మైసీనియా కుండ పెంకులు వెలుగు చూశాయి. మరికొన్ని కోటగోడలు బయటపడ్డాయి. చివరికి ఒక పెద్ద భవంతి బయటపడింది. దాంతో స్లీమన్ లో కొత్త ఆశలు చిగురించాయి. హోమర్ చిత్రించిన ట్రాయ్ తాలూకు మొత్తం ప్రణాళిక అంతా తన జీవితకాలంలోనే బయటపడుతున్నట్టు ఊహించుకుని ఉత్సాహం చెందాడు. అంతలో వేడి గాలులు మైదానాన్ని ఊపేయడం ప్రారంభించాయి. పనివాళ్లు కొందరు జ్వరపడ్డారు. తవ్వకాలను మరుసటేడుకు వాయిదా వేస్తూ జులై చివరిలో తిరిగి ఎథెన్స్ కు వెళ్లిపోయాడు.

పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. స్లీమన్ రాతబల్ల మీద ఆ ఏడాది పని తాలూకు వివరణ పత్రాల దొంతర పేరుకుపోతోంది. ఎప్పటిలా సోఫియా సాహచర్యం అతనికి ఉపశమనం కలిగిస్తూ పనిభారాన్ని తేలిక చేస్తూనే ఉంది.  మరోవైపు, ఎప్పటిలా అస్థిమితంగానూ, ఏవేవో కలలు కంటూనూ గడుపుతూనే ఉన్నాడు. అయితే, తను మరోసారి ట్రాయ్ ను సందర్శించే అవకాశం లేదన్న సంగతి అప్పటి కతనికి తెలియదు. అట్లాంటిస్ 8 దీవులను సందర్శించాలనీ, మెక్సికోకు వెళ్ళి రావాలనీ అనుకుంటున్నట్టు విర్కోకు రాశాడు. ఈ ప్రదేశాలలో ఎక్కడో ఒడీసియస్ యాత్రకు సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతాయని అతని ఊహ. కెనారీ దీవుల్లోనే తను అట్లాంటిస్ ను కనుక్కోగలనని తలపోసాడు. ఈ దీవులు నిత్యవసంతశోభతో అలరారుతూ ఉంటాయన్న హోమర్ అభివర్ణనే అతని ఊహకు మూలం. అయితే, ఈ లోపల ఇటీవలి ట్రాయ్ తవ్వకాలపై  పుస్తకాన్ని పూర్తి చేయాలనీ, మరో అంతర్జాతీయ సమ్మేళనం నిర్వహించాలనీ, వచ్చే వసంతాన్నీ, వేసవినీ పూర్తిగా ట్రాయ్ లోనే గడపాలనీ అనుకున్నాడు.

చెవిపోటు ఇప్పుడు అంతగా బాధించడంలేదు. వాపు కూడా తగ్గింది. బహుశా శస్త్రచికిత్స అవసరం కాకపోవచ్చు. దానిని వీలైనంత కాలం వాయిదా వేస్తే మంచిదని విర్కో సలహా ఇచ్చాడు. స్లీమన్ ఆ సలహాను పాటించాడు. సోఫియా వియెన్నా సందర్శనకు వెళ్లింది. ఆమె తోడులేని గృహజీవితం అతనిలో ఎప్పుడూ శూన్యాన్ని నింపుతూనే ఉంటుంది. ఇంట్లో దెయ్యం పట్టినట్టు తిరిగేవాడు. తాము ఇద్దరూ కలసి ఎథెన్స్ లో ఎప్పుడూ పెళ్లిరోజు జరుపుకోని సంగతి అతనికి సెప్టెంబర్ చివరిలో గుర్తొచ్చింది. ఆమెకు ప్రాచీన గ్రీకులో ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు:

మన పెళ్లిరోజును తలచుకుని ఎంతో గర్విస్తున్నాను. వచ్చే ఏడాది మనిద్దరం కలసి పెళ్లిరోజు జరుపుకునేలా చూడమని దేవతలను ప్రార్థిస్తున్నాను. నీ బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాను. మనిద్దరం కలసి ఇరవయ్యొక్క ఏళ్లపాటు సుఖసంతోషాలతో జీవించాం. ఇన్నేళ్ల కాలాన్నీ ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే విధి మన జీవితాల్లో తీపినీ, చేదునూ సమానంగా నింపిందనిపిస్తుంది. మన పెళ్లిని పరిపూర్ణంగా ఎప్పుడూ పండుగ చేసుకోలేనేమో కూడా. ఎందుకంటే, నువ్వు నా ప్రియాతిప్రియమైన అర్థాంగివి మాత్రమే కాదు; నాకు నెచ్చెలివి. కష్టాలలో దారి చూపించిన సారథివి. నా చేతిలో చేయి వేసి నడిచిన విశ్వసనీయ సహచరివి. ఒక అద్వితీయ మాతృమూర్తివిగా కూడా. నీ సుగుణ సంపదను తలచుకుని నిరంతరం మురిసిపోతూనే ఉంటాను. జియస్ కరుణిస్తే మరుజన్మలో కూడా నిన్నే పెళ్లి చేసుకుంటాను.

ఇవే రోజుల్లో చెవిపోటుకు శస్త్రచికిత్స తప్పని పరిస్థితి వచ్చింది. విర్కో సిఫార్సు మీద హాలీ 9 లోని ఒక క్లినిక్ కు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. కబురు అందుకున్న సోఫియా భర్త ప్రయాణం ఏర్పాట్లు చూసి సాగనంపడానికి వెంటనే ఎథెన్స్ కు వచ్చింది. బయలుదేరేముందు తన స్వభావవిరుద్ధంగా స్లీమన్ గంభీరంగానూ, నిర్లిప్తంగానూ ఉండిపోయాడు. బ్యాంక్ డైరక్టర్లతో తన వీలునామా గురించి మాట్లాడాడు. తన దుస్తులు మడత పెట్టి ట్రంకులో పెట్టుకుంటున్నప్పుడు, “ఈ దుస్తులు ఎవరు వేసుకుంటారో?!” అన్న మాటలు అతని నోట అప్రయత్నంగా వెలువడ్డాయి. సోఫియా తను కూడా వస్తానంది. “ఆరువారాల్లో వచ్చేస్తాను, పిల్లల్ని చూసుకుంటూ ఉండు” అని స్లీమన్ అన్నాడు. రైల్వే స్టేషన్ కు బయలుదేరేముందు, చివరిక్షణంలో భర్త రిస్టువాచీ ఛైను పట్టుకుని ఆపి ముఖంలోకి చూసింది. అదే చివరిచూపా అన్న స్ఫురణ ఆమె చూపుల్లో కదలాడింది.

నవంబర్ లో అతను హాలీ చేరుకున్నాడు. చలికాలం. క్లినిక్ కిటికీలకు అవతల మంచు కురుస్తోంది. వైద్యులు అతని రెండు చెవులనూ పరీక్షించారు. రెండింటికీ శస్త్రచికిత్స అవసరమని తేల్చారు. మరునాడు శస్త్రచికిత్స జరిపారు. ఆ సమయంలో తెల్లని నూనెబట్ట పరచిన ఒక బల్ల మీద పడుకోబెట్టారు. “అంతకుముందు ఒక శవపరీక్ష జరపడానికి ఉపయోగించిన బల్లలానే అది కనిపించింది” అని ఆ తర్వాత స్లీమన్ ఒక మిత్రుడితో అన్నాడు. శస్త్రచికిత్సకు ఒకటిమ్ముప్పావు గంట పట్టింది.

వైద్యుల ప్రకారం శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. కానీ స్లీమన్ కు అలా అనిపించలేదు. దానికితోడు ఆసుపత్రిలో గడపడం దుర్భరంగా తోచింది. సందర్శకులను అనుమతించలేదు. తలకు పెద్ద కట్టు కట్టారు. ఆ పరిస్థితిలో కూడా చుట్టూ పుస్తకాలు పేర్చుకుని, ఉత్తరాలు రాస్తూ గడిపాడు. దార్ఫెల్త్ కూ ఉత్తరం రాస్తూ, తను చేసిన తప్పులన్నింటినీ క్షమించమనీ, తమ ఇద్దరి మధ్యా ఛాయామాత్రంగానైనా ఎప్పుడైనా మనస్పర్థ కలిగిందని భావిస్తే, దానిని నిర్మొహమాటంగా వెల్లడించమనీ కోరాడు. భార్యనుంచి అందుకున్న ఉత్తరానికి జవాబు రాస్తూ, “మహిళలందరిలోనూ మణిపూసవు నువ్వు, నీ ఉత్తరాన్ని చెమ్మగిల్లిన కళ్ళతో చదువుకున్నాను” అన్నాడు.

(సశేషం)

***

అథోజ్ఞాపికలు

  1. ఆస్వాన్: ఈజిప్టులో నైలు నది ఒడ్డున ఉన్న ఒక నగరం. ఆస్వాన్ డ్యామ్ సుప్రసిద్ధం.
  2. ఈ. ఏ. వ్యాలిస్ బాడ్జ్(1857-1934): ఈజిప్టు పురాచరిత్ర, సంస్కృతి, సాహిత్యాలలో నిపుణుడైన ఆంగ్లేయుడు, భాషాశాస్త్రవేత్త. ప్రాచీన మధ్యప్రాచ్యం పై అనేక గ్రంథాలు రచించాడు.
  3. కుఫిక్ లిపి: వివిధ అరబ్బీ లిపులకు చెందిన ప్రాచీన రాతలిపి. ఇరాక్ లోని కుఫా అనే చోట క్రీ.శ. 7వ శతాబ్ది చివరిలో అభివృద్ధి చెందింది.
  4. హిజిరా: మహమ్మద్ ప్రవక్త క్రీ.శ. 622లో మక్కా నుంచి మదీనాకు వెళ్ళిన సందర్భాన్ని సంకేతించే ముస్లిం శకం.
  5. కార్నక్: ఈజిప్టులోని తీబ్స్ నగరంలో భాగంగా ఉన్న విశాలమైన ప్రాచీన, మధ్యయుగ ఆలయ సముదాయం. వీటిలో అనేకం శిథిల ఆలయాలు.
  6. ఫ్లిండర్స్ పేట్రీ (1853-1942): ఈజిప్టు విషయాలలో నిపుణుడైన ఆంగ్లేయుడు. పురావస్తుశాస్త్రానికీ, ప్రాచీన కళాఖండాల పరిరక్షణకూ సంబంధించిన శాస్త్రీయ పద్ధతులను అభివృద్ధి చేసిన ప్రముఖులలో ఒకడు.
  7. స్ఫేక్టీరియా: గ్రీస్ లోని పెలొపనీస్ ద్వీపకల్పంలో పీలోస్ అఖాతం వద్ద ఉన్న ఒక చిన్న దీవి. క్రీ.పూ. 431-404 మధ్య పెలొపనీసస్ యుద్ధంగా ప్రసిద్ధమైన యుద్ధం ఇక్కడే జరిగింది.
  8. అట్లాంటిస్-కెనారీ దీవులు: అతి పురాతనకాలంలో, ఒక అంచనా ప్రకారం 9వేల సంవత్సరాల క్రితం, అట్లాంటిక్ సముద్రంలో ఉండేదిగా భావిస్తూ వచ్చిన ఒక దీవి/దీవులు ఇవి. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో(క్రీ.పూ. 428-348) తన ‘తీమేయస్’ (Timaeus), ‘క్రీషియస్’ (Critias) అనే డైలాగులలో అట్లాంటిస్ గురించి రాశాడు. పెద్ద ఉత్పాతం ఏదో సంభవించి ఈ భూఖండం సముద్రంలో లోతుగా మునిగిపోయిందనీ, ఇందులోని పెద్ద పెద్ద పర్వతాల శిఖరాలు మాత్రమే నీటిపై కనిపిస్తాయనీ రాశాడు. ఆయన నిజమైన ఆధారాలతోనే రాశాడా, లేక ఊహించాడా అన్నది తెలియదు. కాకపోతే, అప్పటినుంచీ అట్లాంటిస్ అనే భూఖండం నిజంగానే ఉండేదని నమ్ముతూ వచ్చినవాళ్ళు నేటి కెనారీ(Canary) దీవులు, అజోర్స్(Azores)దీవులు, కేప్ వర్ద్(Verde),మదీరా(Madeira)లు భాగంగా ఉన్న మైక్రోనేసియా యే ఆ మునిగిపోయిన ప్రాచీన భూఖండం తాలూకు అవశేషమని భావిస్తారు.

గ్రీకు పురాణాల ప్రకారం చూస్తే, ప్రముఖ గ్రీకువీరుడు హెరాక్లీస్ చేపట్టిన 12 సాధనలలో ఒకటి, ప్రపంచం అంతం వరకూ వెళ్ళి సంధ్యా దేవతలలో ఒకరైన హెస్పరడీస్ కాపలా కాస్తున్న తోటలోని బంగారు యాపిల్ పండ్లను తీసుకురావడం! హెస్పరీస్, అట్లాస్ ల కుమార్తే హెస్పరడీస్. గ్రీకు, రోమన్ పురాణాలు ఒక రాక్షసునిగా పేర్కొన్న అట్లాస్ పేరే అట్లాంటిక్ సముద్రానికీ, మొరోకోలోని అట్లాస్ పర్వతశ్రేణికీ వచ్చింది. హెరాక్లీస్ స్తంభాల(Pillars of Heracules) ఉనికిని చెబుతున్న నేటి జిబ్రాల్టర్ జలసంధిని కూడా దాటి సంధ్యాదేవతలు నివసించే స్వర్గధామానికి హెరాక్లీస్ వెళ్లాడనీ;  ఆ స్వర్గధామమే నేటి కెనారీ దీవులనీ, పౌరాణిక వర్ణనకు అవే సరిపోతున్నాయనీ భావించారు.

హోమర్ కూడా ఈ దీవులను ఎలిజియం(Elysium)దీవుల పేరిట గుర్తించాడు. పుణ్యకార్యాలు చేస్తూ, ధర్మబద్ధంగా జీవించినవారు చనిపోయి ఈ దీవులకు వెడతారని రాశాడు. అయితే అతి ప్రాచీన నావికులైన ఫినీషియన్లు కానీ, గ్రీకులు కానీ ఈ దీవులకు వెళ్ళినట్టు ఆధారాలు లేవు. అయితే ఉత్తర ఆఫ్రికాలోని అట్లాంటిక్ తీరాన్ని సందర్శించిన తొలి ఫినీషియన్లు, వారి వారసులైన పురాతన కార్తేజ్ నగరవాసులు కెనారీ దీవులను కనీసం చూసి ఉండడానికి ఎంతైనా అవకాశముంది. క్రీ.పూ. 12వ శతాబ్దిలో ఫినీషియన్లు కెనారీ దీవులకు వెళ్ళి వచ్చారని కొందరు చరిత్రకారులు భావించారు. క్రీ.పూ. 470లో కార్తేజ్ కు చెందిన నావికుడు హన్నో ఈ దీవులను సందర్శించాడంటారు. క్రీ.పూ. 146లో జరిగిన మూడవ ప్యూనిక్ యుద్ధంలో కార్తేజ్ ను జయించిన రోమన్లు పురాణ ప్రసిద్ధమైన ఈ దీవులపై పెద్ద ఆసక్తి చూపించలేదు. ఉత్తర ఆఫ్రికాలోని ప్రాచీన లిబియా రాకుమారుడు, మంచి విద్యావేత్త అయిన జుబా-2 క్రీ.పూ. 40లో కెనారీ దీవులకు ఒక పరిశోధక బృందాన్ని పంపించాడు. ఆ వివరాలను ప్లినీ ద ఎల్డర్ (క్రీ.శ. 23-79) నమోదు చేశాడు. టోలెమీ(క్రీ.శ. 150) భౌగోళిక ఊహారేఖలను ఆధారం చేసుకుని ఈ దీవుల ఉనికిని తగుమేరకు కచ్చితంగా గుర్తించి వాటిని ప్రపంచపు అంతిమ సరిహద్దు అన్నాడు. (పైన ఇచ్చిన రేఖాపటాన్ని చూడగలరు)

Read more: http://www.lonelyplanet.com/canary-islands/history#ixzz49dtzEVAE

ఖండాల చలన సిద్ధాంతం (continental drift) ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసినదే. ఆ కోణంలో చూసినప్పుడు అట్లాంటిస్ ఉనికి గురించి ప్లేటో క్రీస్తు పూర్వకాలంలోనే ఊహించడం విశేషంగానే కనిపిస్తుంది. మన విషయానికి వస్తే, రామాయణంలో సీతాన్వేషణకు వానరవీరులను అన్ని దిక్కులకూ  పంపుతూ సుగ్రీవుడు అనేక ద్వీపాలు, సముద్రాలు, పర్వతాలు, ప్రాంతాల గురించి చెబుతాడు. వాటిని నేటి భౌగోళిక పరిజ్ఞానంతో ఎంతవరకు గుర్తించగలమో చెప్పలేం. హోమర్ ఆధారంగా అట్లాంటిస్ ను గుర్తించాలని స్లీమన్ అనుకున్నట్టే, రామాయణం, పురాణాలు వగైరాలలో పేర్కొన్న భౌగోళిక ప్రాంతాలను గుర్తించడానికి ప్రయత్నించిన పండితులు మన దగ్గరా ఉన్నారు. మహాభారతంలోనూ ఇటువంటి అజ్ఞాత భౌగోళిక వివరాలు కనిపిస్తాయి. సముద్రంలో మునిగిపోయినట్టు పౌరాణికంగా విశ్వసించే  శ్రీకృష్ణుని ద్వారకా నగరాన్ని యు. ఆర్. రావు అనే పురావస్తునిపుణుని సారథ్యంలో గుర్తించినట్టు చెప్పడం ఇటీవలి చరిత్ర.

కొలంబస్ కనిపెట్టడానికి చాలాముందే 11, 12 శతాబ్దులలోనే గ్రీస్ లాండ్ కు చెందిన నావికులు అమెరికాను కనిపెట్టారనీ, అంతకంటే అతి ప్రాచీనకాలంలోనే భూగోళపు అమరికను బట్టి అమెరికా ఖండాన్ని ఊహించగలిగారనీ ఆ మధ్య ఒక పుస్తకంలో చదివాను.

  1. హాలీ: జర్మనీలోని ఒక నగరం.

 

అతని లానే మరొకడు…!    

 

స్లీమన్ కథ-33

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

స్లీమన్, దార్ఫెల్త్ ఇద్దరూ నాప్లియోలో మకాం పెట్టారు. సూర్యోదయానికి ముందే లేచి స్లీమన్ సముద్రస్నానానానికి వెళ్లడం, పదినిమిషాలసేపు ఈత కొట్టడం మామూలే. ఆ తర్వాత ఇద్దరూ కలసి అక్కడికి పాతిక నిమిషాల దూరంలో ఉన్న టిర్యిన్స్ కు గుర్రం మీద వెళ్ళేవారు. ఉదయం ఎనిమిదికి తొలి విరామం. అక్కడి బ్రహ్మాండమైన రాతి వసారాల నీడలో పనివాళ్లు అల్పాహారం తీసుకునేవారు. సూర్యాస్తమయంవరకూ పని జరిగేది. ఆ తర్వాత ఇద్దరూ నాప్లియోకు తిరిగివెళ్ళేవారు.

జూన్ వరకూ తవ్వకాలు కొనసాగాయి.  హోమర్ వర్ణించిన ప్రాసాదం తాలూకు మొత్తం ప్రణాళిక అంతా వేసవి తొలి రోజుల్లోనే బయటపడింది. ఆ భారీ దుర్గం ఒక సున్నపురాతి కొండ మీద నిలబడి ఉంది. కింద చిత్తడి మైదానం. పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన పైకప్పుతో వసారాలు అనేక తరాలుగా గొర్రెల దొడ్లుగా ఉపయోగపడుతూ వచ్చాయి. గొర్రెల రాపిడికి కొన్ని చోట్ల రాళ్ళు నునుపుతేలాయి. ఈ రాతి కట్టడాలను దర్శించిన పసన్నియస్, ఎన్ని కంచరగాడిదలతో లాగించినా వీటిలో చిన్న రాయిని కూడా కదిలించలేరని రాశాడు. మైసీనియాలో లానే ఇక్కడా పసన్నియస్ రాతలను స్లీమన్ పరమప్రమాణంగా తీసుకున్నప్పటికీ, ఆయన రాతకు భిన్నంగా అనేక చిన్న చిన్న రాళ్ళను పనివాళ్ళ చేత సునాయాసంగా తీయించగలిగాడు.

మరుసటి వేసవిలో టిర్యిన్స్ ను మరోసారి సందర్శించాడు. ఒక బాలుడు తామ్రవర్ణంలో ఉన్న ఒక ఎద్దు మీదికి గెంతుతున్నట్టు ఉన్న ఒక చక్కని కుడ్యచిత్రం, రేఖాగణితనమూనాలో ఉన్న మరో చిత్రం తాలూకు అవశేషాలు, అసంఖ్యాకమైన నీలిరాతి బొంగరం ఆకృతులు, లావా కత్తులు, బాణపు మొనలు కనిపించాయి. అరంగుళం వెడల్పు మాత్రం ఉన్న ఒక బంగారు గొడ్డలి తప్ప మరెంలాంటి బంగారు వస్తువులూ దొరకలేదు.

టిర్యిన్స్ పేరుతో అతను రాసిన పుస్తకం 1886లో ప్రచురితమైంది. ట్రాయ్ పై అతను రాసిన చివరి పుస్తకంలానే ఇది కూడా నిరాశగొలిపింది. తన రాతను తవ్వకాలలో లభించిన వస్తువుల వర్ణనతో సరిపెట్టి, బయటపడిన భారీ కట్టడాల గురించిన చర్చను దార్ఫెల్త్ కు విడిచిపెట్టాడు. ఇక్కడ దొరికిన అనేక మృణ్మయ కలశాలు, ట్రాయ్, మైసీనియాలలో దొరికిన వాటికంటే అభివృద్ధి చెందిన శైలిని సూచిస్తున్నాయి. మెలి తిరిగిన కొమ్ములతో ఉన్న ఒక భారీ  వృషభచిత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేసింది. ఇటువంటి వృషభచిత్రాలే ఆ తర్వాత నోసస్ తవ్వకాలలోనూ బయటపడ్డాయి. టిర్యిన్స్ వృషభాన్ని కూడా క్రీటు కళాకారుడే చిత్రించి ఉండడానికీ అవకాశం ఉంది. అయితే, స్లీమన్ కాలానికి గ్రీసు ప్రధానభూభాగంపై క్రీటు సంస్కృతి ప్రభావాన్ని ఎవరూ గమనించలేదు. మైసీనియా, టిర్యిన్స్ గిరిదుర్గాలను ఫినీషియన్లు1 నిర్మించి ఉంటారని స్లీమన్ భావిస్తూ వచ్చాడు. సుదూర పురాచరిత్రకాలంలో గ్రీసు, ఏజియన్ దీవుల్లోకి, అయోనియన్ సముద్రంలోకి ఫినీషియన్లు పెద్ద ఎత్తున చొచ్చుకువచ్చారనీ;  క్రీ.పూ. 1100 ప్రాంతంలో డోరియన్ 2 ఆక్రమణదారులు తరిమికొట్టేవరకూ ఈ ప్రాంతాలలో వారి ఆధిపత్యం కొనసాగిందనీ పురాచరిత్రనిపుణులు భావించారు.

220px-Charles_George_Gordon_by_Freres

గోర్డాన్

స్లీమన్ గట్టిగా విశ్వసిస్తూ వచ్చిన సిద్ధాంతాలలో వీరయుగం అంతరించిందన్నది ఒకటి. పురాతన గ్రీసు వీరులలోనే వీరత్వం అసాధారణస్థాయిలో నిండి ఉండేదనీ, ఆ తర్వాత అంత ప్రగాఢంగా మరెక్కడా, మరెప్పుడూ అది పరిమళించలేదనీ అతను నమ్మేవాడు. ట్రాయ్, మైసీనియాలు మహితాత్ములు నడయాడిన భూములనీ, అనంతరకాలంలో  ప్రపంచం అల్పజీవులు, అంగుష్టమాత్రుల పాలబడిందని అనుకునేవాడు.3 అయితే అతని దృష్టిలో ఈ కాలంలోనూ కొన్ని మినహాయింపులు లేకపోలేదు. 1881 మార్చిలో నిహిలిస్టుల 4 చేతిలో హతుడైన జార్ చక్రవర్తి అలెగ్జాండర్ –II ను 5 వెనకటి ప్రామాణిక వీరుల తెగకు చెందినవాడిగా భావించేవాడు. అంతకంటే ఉజ్వలోదాహరణగా జనరల్ గోర్డన్ 6 ను స్మరించుకునేవాడు. సూడాన్ లో అతను గడించిన అదృష్టాలను స్లీమన్ ఎంతో ఆసక్తితో గమనిస్తూవచ్చాడు.

స్లీమన్, గోర్డన్ ల మధ్య ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ మొండి ధైర్యమూ, తమపట్ల తమకు అచంచల విశ్వాసమూ ఉన్నవారే. భూమిలో నిక్షిప్తమైన వస్తువుల పట్ల, విచిత్రంగా ఇద్దరిలోనూ ఒకేవిధమైన ఆసక్తి. హోమర్, పసన్నియస్ లపట్ల తిరుగులేని నమ్మకం ఉన్న స్లీమన్ భూమిలో కప్పడిన ట్రాయ్, మైసీనియా, టిర్యిన్స్ నగరాలను వెలికితీశాడు.  బైబిల్ లోని ఉత్తేజిత వచనాలను ప్రగాఢంగా విశ్వసిస్తూ పవిత్రభూమి(Holy Land) అంతటా సంచరించిన గోర్దన్;  తను గల్గత(Golgota), గిబియన్(Gibeon), గార్డెన్ ఆఫ్ ఈడెన్ ల వాస్తవిక ఉనికిని కనుగొన్నానని నమ్మాడు. ఇద్దరూ తమవైన ఏకాంతదుర్గంలో,  తమను నేరుగా ప్రభావితం చేసిన రచనలను మాత్రమే చదువుతూ గడిపినవారే. ఇద్దరూ ఒకేలా సమకాలీన నాగరికతతో ఇబ్బంది పడుతూ; తమను పురాతనజీవులుగా, తిరిగిరాని గతానికి చెందినవారిగా భావించుకుంటూ తమ తమ స్వాప్నికప్రపంచాలలో జీవించినవారే. భవిష్యత్తు గురించిన ప్రశ్న తలెత్తినప్పుడల్లా గోర్డన్ బైబిల్ అందుకుని ఏదో ఒక పుటను తెరిచి చూసేవాడు. అందులో భవిష్యచిత్రం అతని కళ్ళకు స్పష్టంగా కనిపించేది. సరిగ్గా అలాంటి సందర్భాలలో  స్లీమన్ కూడా హోమర్ ను తెరచి చూసేవాడు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు వాళ్ళిద్దరూ.

స్లీమన్ దృష్టిలో గోర్డన్ తన కాలపు నిజమైన వీరుడు. ఇంకా చెప్పాలంటే, తన కాలపు హెక్టర్. సూడాన్ రాజధాని ఖార్టూమ్ లో గోర్డన్ విడిసి ఉన్నప్పుడు మాదీ(Mahdi) 7గా తనను ప్రకటించుకున్న మహమ్మద్ అహ్మద్ అబ్ద్ అల్లాహ్ (1884-1885) సేనలు అతన్ని ముట్టడించాయి. గోర్డన్ బలగానికి ఆహారం, ఇతర నిత్యావసరాలు అందకుండా చూశాయి. మరోవైపు తుపాకీ మందు తరిగిపోతుంది. తామున్న భవంతి కిటికీలకు ఇసుకబస్తాలతో రక్షణ కల్పించమని గోర్డన్ కు సహచరులు విజ్ఞప్తి చేశారు. గోర్డన్ తిరస్కరించాడు. అందుకుబదులు ఒక కిటికీ వద్ద ఇరవైనాలుగు కొవ్వొత్తులు వెలిగించిన ఒక లాంతరును ఉంచమని ఆదేశించాడు. అప్పుడు అతను అన్నాడు: ”భగవంతుడు భయాన్ని ఒక్కొక్కరికే పంచుతూ వెళ్ళాడు. నా వంతు వచ్చింది. తీరాచూస్తే, నాకు పంచడానికి భయం కాస్త కూడా మిగలలేదు. కనుక గోర్డన్ దేనికీ భయపడడని వెళ్ళి ఖార్టూమ్ ప్రజలకు చెప్పండి.”

మహమ్మద్ అహ్మద్

మహమ్మద్ అహ్మద్

1885 ఫిబ్రవరి 3న మాదీ, అతని సహచరులు గోర్డన్ ఉన్న భవంతిని సమీపించారు. సూర్యోదయానికల్లా అతని సేనలు నగరం మొత్తాన్ని కమ్మేసాయి. గోర్డన్ కరవాలం చేతబూని భవంతి మెట్ల దగ్గర శత్రువుల రాకకు నిరీక్షిస్తూ నిలబడ్డాడు. శత్రువుపై విరుచుకుపడి అద్భుతంగా పోరాడాడు. చివరికి ఆ మెట్ల దగ్గరే, పీనుగుల కుప్ప మధ్య ప్రాణాలు వదిలాడు. అతని తల నరికి ఒక వస్త్రంలో చుట్టి మాదీకి కానుకగా ఇచ్చారు. దానిని ఒక చెట్టు కొమ్మకు వేలాడదీయమని మాదీ ఆదేశించాడు. ఆ రక్తపంకిలమైన శిరసు చుట్టూ కొన్ని రోజులపాటు రాబందులు తిరిగాయి.

తను ఎథెన్స్ లో ఉంటూనే మధ్యధరాసముద్రానికి ఆవల, ఖార్టూమ్ లో జరుగుతున్న పరిణామాలను స్లీమన్ ఆందోళనతో గమనిస్తూ వచ్చాడు. గోర్డన్ మరణం అతన్ని తీవ్రంగా కుంగదీసింది. జీవించి ఉన్నవారిలో తను అమితంగా అభిమానించి ఆరాధించినది గోర్డన్ నే. అప్పటి ప్రధానమంత్రి గ్లాడ్ స్టన్ చేసిన ఒక అనూహ్యమైన పొరపాటే గోర్డన్ విషాదమరణానికి దారి తీయించిందని రాణి విక్టోరియా సహా యావత్ బ్రిటిష్ ప్రజలూ నమ్మారు. గోర్డన్ కు అండగా సకాలంలో అదనపు బలగాలను పంపడంలో గ్లాడ్ స్టన్ విఫలమయ్యాడని ఆరోపణ.  స్లీమన్ కు గ్లాడ్ స్టన్ బాగా తెలిసినవాడే. తన మైసీనియా కు సుదీర్ఘమైన ఉపోద్ఘాతం రాసింది ఆయనే. తనను 10 డౌనింగ్ స్ట్రీట్ లోని తన నివాసానికి ఆహ్వానించి విందు ఇచ్చింది ఆయనే. కానీ తన ఆరాధ్యవీరుడు గోర్డన్ మరణానికి కారణమైన గ్లాడ్ స్టన్ పొరపాటును స్లీమన్ క్షమించలేకపోయాడు. అతనిపట్ల ఆగ్రహంతో వణికిపోయాడు. తన అధ్యయన కక్ష్యలో ఉంచిన అతని సంతకంతో ఉన్న ఫోటోను నేలమీదికి విసిరికొడదామా, లేక చించి పారేద్దామా అనుకున్నాడు. చివరికి తీసుకెళ్లి పాయిఖానాలో ఉంచాడు.

నోసస్ స్థల యజమానితో బేరం కుదరక ఎథెన్స్ కు తిరిగివచ్చినా క్రీటు తవ్వకాలపై దీర్ఘకాలికప్రణాళికను రచించుకుంటూ, మధ్యలో తిరిగి ట్రాయ్ దారి పడితే ఎలా ఉంటుందని అనుకుంటూ, ఇంకోసారి ఇథకా వెడితే మంచిదా అని భావిస్తూ గడిపాడు. ఇవేవీ కాక, ఓసారి పారిస్ వెళ్ళి తన ఇళ్ల పరిస్థితిని చూసొస్తే బాగుంటుందా అని కూడా అనుకున్నాడు. కానీ ఇవేవీ చేయకుండానే రోజులు దొర్లించాడు. వృద్ధాప్యం, అలసిపోయిన భావన  కమ్ముకుంటున్న కొద్దీ అతను తనలోకి తాను అదృశ్యమైపోతూ వచ్చాడు. రోజంతా, అర్థరాత్రివరకూ హోమర్ పఠనమే. అదొక మత్తుమందుగా మారింది. అదొక్కటే అతన్ని బుద్ధిమాంద్యంలోకి నెట్టకుండా మానసికస్వస్థత కల్పిస్తూవచ్చింది. ఇప్పుడూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు కానీ, దస్తూరీలో వణకు కనిపిస్తోంది. రాను రాను అతని రాతల్లో అఖియన్లను శాపనార్థాలు పెట్టే  ట్రోజన్ వీరుల గొంతు ధ్వనిస్తోంది. కాకపోతే, హోమర్ వీరుల నోట ప్రవహించిన ఆ అద్భుత శాపనార్థాలు ఒక పిరికి ప్రొఫెసర్ ను తలపించే ఈ వ్యక్తి నోట వినిపించడమే ఆసక్తికరం.

అయితే, వృద్ధాప్యం మీదపడుతున్నా స్లీమన్ లో వెరపు మచ్చుకైనా లేదు. తన మహత్తర పరిశోధనలకు ఇవ్వవలసిన గుర్తింపు ఇవ్వకపోయినా, లేదా అరకొరగా గుర్తించినా ఇప్పటికీ ఆగ్రహాన్ని కుమ్మరిస్తూనే ఉన్నాడు. కెప్టెన్ బాటిషర్(Bottischer) అనే అతను హిస్సాలిక్ పై ఒక వ్యాసం రాస్తూ, అది ఒక పెద్ద దహనవాటిక అనీ, బహుశా పర్షియన్లకు చెందిందనీ అన్నాడు. దానిని హాస్యాస్పద సిద్ధాంతంగా పేర్కొని తుత్తునియలు చేయడానికి స్లీమన్ రీముల కొద్దీ కాగితాలు వెచ్చించాడు. చిన్నపాటి విమర్శకు కూడా గాయపడిన సింహంలా గర్జించే అలవాటు అతనికి ఇప్పటికీ పోలేదు. స్లీమన్ ఏదో అంకితం ఇవ్వజూపినప్పుడు మెక్లెమ్బర్గ్ పాలకుడు(Grand Duke) అందుకు స్పందించకపోవడంతో అతను తీవ్రనిరసన రంగరిస్తూ ఒక తంతి పంపించాడు. మంచి పేలుడుమందు దట్టించినట్టు ఉండే తంతులు పంపించడం అతనికి ముందునుంచీ అలవాటే. దాంతో స్లీమన్ గౌరవార్థం మెక్లెంబర్గ్ పాలకుడు ఒక స్వర్ణపతకాన్ని జారీచేసి అతనితో సంధి చేసుకున్నాడు.

మధ్యలో కొన్ని మాసాలపాటు స్లీమన్ పురావస్తుపరిశోధనలను పక్కన పెట్టేసి తిరిగి వ్యాపారవేత్తగా అవతారమెత్తాడు. తన ఆస్తులు, పెట్టుబడులు భద్రంగా ఉన్నాయో లేదో చూసుకోడానికి ప్రపంచపర్యటన ప్రారంభించాడు. క్యూబాలో తనకు భారీ ఎస్టేట్లు ఉండడంతో హవానా సందర్శించాడు. అలాగే, మాడ్రిడ్, బెర్లిన్ లలో ఉన్న తన ఆస్తుల్ని చూసుకోడానికి ఆ దేశాలకు వెళ్ళాడు. పనిలోపనిగా వెళ్ళిన ప్రతిచోటా  ట్రాయ్ పై తన సిద్ధాంతాలను బలపరచుకుంటూ ఉపన్యాసాలు చేశాడు. తనకున్న ధనబలంతో అనుకున్నదే తడవుగా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలిగే అవకాశాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాడు.

శారీరకంగా అతనిలో మార్పు వస్తోంది. చెవిపోటు రాను రాను దుర్భరంగా మారుతోంది. ఒక్కోసారి పెదవులు బాధతో మెలితిరుగుతున్నాయి. మాట నట్టుతోంది. ఆహారనియమాలను మరింత కచ్చితంగా పాటించవలసివస్తోంది. చీకటితోనే నిద్రలేవడం, సముద్రస్నానం చేయడం, మూడు గుడ్లు, ఒక కప్పు టీ తో ఉదయపు అల్పాహారం, ఆ తర్వాత వార్తాపత్రికలు, స్టాక్ ఎక్స్ఛేంజ్ నివేదికలు చదవడం,  ఉత్తరాలు రాయడం; హోమర్ తోపాటు సోఫొక్లీస్ లేదా యురిపిడీస్ ల నుంచి మూడేసి వందల పంక్తులు వల్లించడం(ప్లేటోను చాలా అరుదుగా చదివేవాడు, అరిస్టాటిల్ ను అసలు చదివేవాడు కాదు), ఆతర్వాత మధ్యాహ్నభోజనం, కాసేపు నడక, సాయంత్రంవరకూ పూర్తిగా అధ్యయనం, సాధారణంగా సాయంత్రాలు సందర్శకులతో గడపడం, రాత్రి పదిగంటలకు పడక. ఇదీ అతని నిత్యకృత్యం. రాత్రిళ్ళు తరచు నిద్రపట్టేదికాదు. దాంతో రాత్రంతా చదువుతూనే గడిపేవాడు.

వృద్ధుడవుతున్న కొద్దీ నిద్రలో వచ్చే కలలను పట్టించుకునే చాదస్తం పెరిగింది. వాటిని జాగ్రత్తగా విశ్లేషించేవాడు. సోఫియాకు కలలో కాకులు, చిక్కుడు కాండం, విదేశీ సందర్శకులు కనిపించినట్టు తెలిస్తే విపరీతంగా ఆందోళన చెందేవాడు. 8 పురాతన దేవతల ఆధికారిక వాణిని, స్వప్నవిశేషాలను హోమర్ పదే పదే ఉగ్గడించాడు. స్లీమన్ పై వాటి ప్రభావం ఉంది. వయసు మీరుతున్న ఈ దశలో అతను క్రమంగా బాహ్యప్రపంచం నుంచి ఆంతరికప్రపంచంలోకి జారుకుంటూవచ్చాడు.

శరీరం దుర్బలమవుతోంది. చెవిపోటు నానాటికీ తీవ్రమవుతోంది. యూరప్ శీతగాలులు దుస్సహం అవుతున్నాయి. దాంతో మిగిలిన శీతాకాలాలు దక్షిణాదిన గడపడానికి నిర్ణయించుకున్నాడు. ఈజిప్టు అతన్ని ఆకర్షించింది. మూడు తరాలుగా ఈజిప్టులో తవ్వకాలు జరుపుతున్న ఫ్రెంచి, ఇంగ్లీష్ పురావస్తుశాస్త్రజ్ఞుల నివేదికలను అప్పటికే అతను విస్తారంగా చదివి ఉన్నాడు. అయితే, తనకున్న బుద్ధికుశలత వాళ్ళకు లేదనీ, వాళ్ళ పురావస్తుశాస్త్రపరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే ననీ, తనలా వాళ్ళెవరూ స్వర్ణనిక్షేపాలు కనిపెట్టలేదనీ అనుకున్నాడు.  తనే ఈజిప్టులో కొద్దిపాటి తవ్వకాలను చేపడితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశాడు.

 గ్లాడ్ స్టన్

గ్లాడ్ స్టన్

1886 ముగింపునకు వస్తోంది. ఒక్క సహాయకునీ; గ్రీకు, అరబ్బీ పుస్తకాల దొంతరనూ వెంటబెట్టుకుని మూడు మాసాలపాటు నైలు నదిలో తీరుబడిగా ప్రయాణిస్తూ గడపాలని నిర్ణయించుకున్నాడు. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఆ కాలానికి అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలతో, అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దిన ఒక చక్కని దహబియా 9 ను1500 పౌండ్లకు అద్దెకు తీసుకున్నాడు. తీబన్(Theban) 10 శిథిలాలు, టోలెమీ ఆలయాల మీదుగా వెడుతున్నప్పుడు పడవను ఆపించి తీరగ్రామంలోకి వెళ్ళి సంతలో తిరిగేవాడు. గ్రామస్తులతో అరబ్బీలో ముచ్చటించడం అతనికి సంతోషం కలిగించేది. వాళ్ళ ఒంటి మీద ఉన్న పుళ్ళకు చిన్న చిన్న చిట్కా వైద్యాలు సూచించేవాడు. ఒక ఈజిప్టు బాలిక భుజానికి పక్షవాతంతోనూ, వాపుతోనూ బాధపడుతుండడం చూసి; రోజూ రెండుసార్లు నైలు నదిలో స్నానం చేయమనీ, అవిసె గింజలను, కొన్ని రకాల మూలికలను ముద్ద చేసి వేడి వేడిగా భుజానికి పిండికట్టు వేసుకోమని సూచించాడు. ఫలితం ఏమైందో తెలియదు. నల్లని దేహాకాంతితో, శిల్పించినట్టు ఉండే ముఖాలతో కనిపించే న్యూబియన్ల 11 ను ఎంతో ఇష్టపడేవాడు. తనకు ఇంతవరకు తారసపడిన జనాలలో వీరొక్కరే వీరజాతిగా కనిపిస్తున్నారనుకున్నాడు.

వాడీ హల్ఫా(Wadi Halfa)12 వరకూ ప్రయాణించాలన్నది అతని సంకల్పం. మధ్యలో క్లియోపాట్రా గురించిన ఆలోచనలు చేశాడు. నైలు నది లోతును, మేఘాల కూర్పును అధ్యయనం చేశాడు. బాగా ఎత్తున ఏర్పడిన మేఘాలను బట్టి మరుసటి రోజు వాతావరణాన్ని అంచనా వేసేవాడు. ప్రయాణాల్లో ప్రతిసారీ చేస్తున్నట్టే, రోజువారీ ఉష్ణోగ్రతలను నమోదు చేశాడు. అక్కడక్కడ కనిపించిన శాసనాల నకలు రాసుకున్నాడు. పడవ కప్పు మీద అస్థిమితంగా పచార్లు చేసేవాడు కానీ అతనిలో ఒక విచిత్రమైన నెమ్మది ఏర్పడింది. హోమర్ ను చదువుతున్నప్పుడు మాత్రం ఎందులోనూ పొందనంత ఆనందం అతనిలో పురివిప్పి నర్తించేది.

(సశేషం)

***

అథోజ్ఞాపికలు

  1. ఫినీషియన్లు: ఋగ్వేదంలో పేర్కొన్న ‘పణు’లే ఫినీషియన్లు అని కోశాంబీ అంటారు. ఫినీషియన్లు సముద్రయానంలో నిపుణులైన ప్రాచీనకాలపు వర్తకులు. వీరికి సంబంధించిన మరికొన్ని విశేషాలను నేను ‘పురా’గమనం శీర్షిక కింద రాసిన ఈ వ్యాసాలలో చూడవచ్చు. 1. దేవతల కుక్క(18-09-2014) 2. ప్రపంచచరిత్రలో మనం(24-09-20140 3. పర్షియన్ రాముడు-గ్రీకు హనుమంతుడు (02-10-2014) 4. చరిత్రలో ఒక అద్భుతం (13-11-2014)
  2. డోరియన్లు: నాలుగు పురాతన గ్రీకు తెగలలో ఒకరు. మిగిలిన మూడూ: అయోలియన్లు, అఖియన్లు, అయోనియన్లు.
  3. విచిత్రంగా మహాభారతం కూడా గొప్ప వీరులైన క్షత్రియజాతి అంతరించిపోవడం గురించీ, ‘అల్ప’జీవులు ప్రాబల్యంలోకి రావడం గురించీ చెబుతుంది. ఒకానొక కాలంలో ప్రపంచంలో పలుచోట్ల జరిగిన పరిణామాల సాదృశ్యాన్ని పరిశీలించిన పురాచరిత్రకారులు, వాటిని ‘వీరయుగం’ కింద వర్గీకరించారు. నేను గమనించినంతవరకు మహాభారతాన్ని ఈ వీరయుగ కోణం నుంచి ఎవరూ పరిశీలించినట్టులేదు. నా ‘పురా’గమన వ్యాసాలు కొన్నింటిలో ఈ కోణాన్ని కొంతవరకు స్పృశించాను.
  4. నిహిలిస్టులు: నిహిలిజాన్ని బోధించేవారు నిహిలిస్టులు. అన్ని రకాల విలువలను, నైతికతను వీరు వ్యతిరేకిస్తారు. Nihil అనే లాటిన్ మాటనుంచి nihilism పుట్టింది. ఫ్రెడరిక్ హెన్రీ జాకొబీ(1743-1819)అనే జర్మన్ తాత్వికుడు ఈ మాటను కల్పించాడు. జోసెఫ్ వాన్ గారెస్ (1776-1848) అనే జర్మన్ పాత్రికేయుడు ఈ మాటను మొదటిసారి రాజకీయార్థంలో వాడాడు. రష్యన్ రచయిత తుర్గేనివ్  (1818-1883) తన ‘ఫాదర్స్ అండ్ చిల్రన్’ అనే నవలలో nigilizm అనే రష్యన్ రూపాన్ని వాడి ఆ మాటను తనే రూపొందించానన్నాడు. 1860-1917 మధ్యకాలంలో రష్యాలో సాగిన విప్లవ అరాచకత్వాన్ని ఈ మాటతో సంకేతించారు. Online Etymology Dictionary, © 2010 Douglas Harper
  5. అలెగ్జాండర్ –II(1818-1881): రష్యా చక్రవర్తి(జార్). 1855లో పట్టాభిషిక్తుడయ్యాడు. పోలండ్ కు రాజుగానూ, ఫిన్ లాండ్ కు గ్రాండ్ డ్యూక్ గానూ కూడా ఉన్నాడు. 1881లో నిహిలిస్టుల చేతిలో హతుడయ్యాడు.

 

  1. చార్లెస్ జార్జి గోర్డన్(1833-1885): బ్రిటిష్ సైనికాధికారి. చైనా, సూడాన్ లలో విధులు నిర్వహించాడు.
  2. మాదీ(Mahdi): ఇస్లాం పరిరక్షణకు, స్థాపనకు కత్తి పట్టి ఉద్యమించిన వీరుని సూచించే పేరు. చరిత్రలో పలువురు తమను ‘మాదీ’గా ప్రకటించుకున్నారు.
  3. స్వప్నాలవల్ల మంచి గానీ, చెడుగానీ జరుగుతుందన్న విశ్వాసం మనలోనూ ఉంది. రామాయణంలో ‘త్రిజటా స్వప్నం’ లాంటి ఉదాహరణలు ఉన్నాయి.
  4. దహబియా: నైలు నదిలో తిరిగే పడవలను ఈ పేరుతో పిలుస్తారు.
  5. తీబన్(Theban): ఈజిప్టులోని పురాతన నగరం తీబ్స్(Thebes) కు చెందిన పౌరుడు తీబన్.
  6. న్యూబియన్లు: ఈజిప్టుకు దక్షిణంగానూ, నేటి సూడాన్ ఉత్తరప్రాంతంలోనూ ఉన్న న్యుబియా అనే ప్రాంతానికి చెందినవారు.
  7. వాడీ హల్ఫా(Wadi Halfa): సూడాన్ ఉత్తరప్రాంతంలో ఉన్న ఒక నగరం.

  

 

 

 

 

 

 

 

 

 

కీర్తి శిఖరాగ్రంపై స్లీమన్

 

స్లీమన్ కథ-32

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ట్రాయ్ నిక్షేపాలను జర్మనీకి అప్పగించడానికి స్లీమన్ ఆమోదం తెలిపిన తర్వాత, విర్కో వెంటనే రంగంలోకి దిగాడు. సంబంధితులు అందరితో మాట్లాడాడు. చివరగా జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ తో మాట్లాడినప్పుడు ఆయన ఎంతో ఉత్సాహం చూపించాడు. ఆ నిక్షేపాలను బెర్లిన్ లో శాశ్వత ప్రదర్శనకు ఉంచడంకోసం ఏమైనా చేయడానికి సంసిద్ధత చూపిన బిస్మార్క్, ఇంతకీ స్లీమన్ ఎటువంటి గౌరవసత్కారాలను ఆశిస్తున్నారని అడిగాడు. అత్యున్నత వర్గాలనుంచి గుర్తింపును మాత్రమే స్లీమన్ కోరుకుంటున్నారని అప్పటికి సమాధానం చెప్పిన విర్కో, ఆ తర్వాత స్లీమన్ ను సంప్రదించాడు.  కైజర్(జర్మన్ చక్రవర్తి)నుంచి ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని; సైనిక, పౌర ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారా(Pour le merite)న్ని, బెర్లిన్ గౌరవపౌరసత్వాన్ని, ప్రష్యన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ లో సభ్యత్వాన్ని తను కోరుకుంటున్నాననీ; నిక్షేపాలను ఉంచే ప్రదర్శనశాలకు శాశ్వతంగా తన పేరు పెట్టాలనీ చెప్పిన స్లీమన్; బిరుదు కూడా ఇస్తే సంతోషమే కానీ దానికోసం పట్టుబట్టబోనని అన్నాడు. ఒక్క Pour le merite మినహా మిగిలినవన్నీ నెరవేరేలా విర్కో ఒంటిచేత్తో కృషిచేశాడు. సోఫియాకు మాత్రం ఈ ఏర్పాటు నచ్చలేదు. ట్రాయ్ నిక్షేపాలు గ్రీస్ కు చెందాలని ఆమె ఆశిస్తోంది. కానీ అప్పటికే నిర్ణయం తీసేసుకున్న భర్తకు ఎదురుచెప్పలేకపోయింది. కైజర్ స్వహస్తాలతో రాసిన ప్రశంసాపత్రంలో తన పేరు కూడా చేర్చడం చూసి సంతృప్తి చెందింది.

అంతవరకూ లండన్ లో ప్రదర్శనకు ఉంచిన నిక్షేపాలను ఎట్టకేలకు 1880 డిసెంబర్ లో బెర్లిన్ కు తరలించారు. ఆరునెలల తర్వాత, 1881 జులై 7న, ఆ నిక్షేపాలను జర్మనీకి లాంఛనంగా అప్పగించి స్లీమన్ బెర్లిన్ లో రాజసత్కారాన్ని అందుకున్నాడు. వోల్కకుండా మ్యూజియంలోని ఒక విభాగంలో వాటిని ఉంచి ద్వారబంధం పైన స్లీమన్ పేరును స్వర్ణాక్షరాలతో లిఖించారు. అప్పటికి యువరాజుగా ఉండి, ఆ తర్వాత కైజర్ పదవిని అధిష్ఠించిన విల్హెమ్-II  స్వయంగా సోఫియాను విందుకు తోడ్కొనివెళ్ళాడు. అప్పటికామె వయసు 28 ఏళ్ళు, స్లీమన్ మరో ఆరునెలలకు 60వ ఏట అడుగుపెట్టబోతున్నాడు.

ఆ రోజున స్లీమన్ ప్రతిష్ట శిఖరాగ్రానికి చేరింది. చక్రవర్తి, మహారాజ్ఞి, యువరాజులు, యువరాణులు, మొత్తం రాజాస్థానం అతన్ని ఘనంగా ప్రస్తుతించింది. వీటన్నటికన్నా బెర్లిన్ గౌరవపౌరసత్వాన్నే అత్యున్నత సత్కారంగా స్లీమన్ భావించాడు. అంతవరకూ అలాంటి గౌరవం ఇద్దరికే లభించింది: ఒకరు బిస్మార్క్, ఇంకొకరు ఫీల్డ్ మార్షల్ కౌంట్ హెల్మత్ వాన్ మోత్కా. జర్మనీ పునరుజ్జీవనానికి వీరిద్దరూ బాధ్యులు. ఒక అనామక చర్చిలో కిటికీకి అతుక్కుపోయి బాహ్య పౌరాణిక ప్రపంచాన్ని విప్పారిన కళ్ళతో చూసి పరవశించిన  బాలుడు, ఇప్పుడు ఆ పౌరాణిక ప్రపంచం సజీవం కావడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అత్యంత పురాతన రాజులనే కాదు, నేటి సజీవులైన రాజులను కూడా తన వద్దకు రప్పించుకున్నాడు. ఒకసారి తన జీవితాన్ని వెనుదిరిగి చూసుకుంటూ, తను చేసిన వీరోచిత కార్యాలను, ఇతర సాఫల్యాలను తలచుకుని అతను అమితమైన సంతృప్తిని చెందాడు.

ట్రాయ్ నిక్షేపాలు రెండో ప్రపంచయుద్ధం చివరివరకూ బెర్లిన్ లోనే ఉన్నాయి. యుద్ధం మొదలైన తర్వాత బెర్లిన్ జంతుప్రదర్శనశాలలో లోతుగా తవ్విన ఒక రహస్య కందకంలో వాటిని భద్రపరిచారు. 1945 వసంతంలో అవి రష్యన్ సేనల కంటబడ్డాయి. వాటిని వారు రష్యాకు తరలించారు.1

ట్రాయ్ అతన్ని వెంటాడుతూనే ఉంది. తను చనిపోయేలోగా ట్రోజన్ రాజుల సమాధులను బయటపెట్టాలనుకున్నాడు. ట్రాయ్ కి చెందిన అన్ని నగరాల సవివర రేఖాపటాలను తయారుచేసుకున్నాడు. 1882 మార్చి 1న హిస్సాలిక్ దిబ్బ మీద తొమ్మిదో సారి తవ్వకాలు ప్రారంభించాడు. మొదటిసారి తవ్వకాలకూ, ఇప్పటికీ మధ్య పద్నాలుగేళ్ల కాలం దొర్లినా అతనిలో వెనకటి ఉత్సాహం అలాగే ఉంది. తలనొప్పి, చెవినొప్పి తగ్గాయి. అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఏమిటంటే, అప్పట్లో చాలావరకూ ప్రాథమిక పరికరాల మీద ఆధారపడ్డాడు. ఆహారపదార్థాలు, ఇతర నిత్యావసరాల సరఫరా తగినంత ఉండేదికాదు. కానీ ఈసారి అతనికి మహారాజపోషణ లభించింది. లండన్ కు చెందిన మెస్సర్స్ ష్రోడర్స్ పెద్ద ఎత్తున ఆహారాన్ని కానుకగా పంపించింది. వాటిలో చికాగో గొడ్డుమాంసం, నిలవ పండ్లు, ఇంగ్లీష్ చీజు, ఎద్దు నాలుక మొదలైనవి ఉన్నాయి. ఒకవిధమైన తృణధాన్యంతో చేసిన 240 సీసాల బీరు(pale ale) కూడా పంపించింది. అన్ని సీసాలనూ అయిదుమాసాలలో స్లీమన్ ఒక్కడే ఖాళీ చేసేశాడు. “నేను ముప్పై ఏళ్లుగా మలబద్ధకంతో బాధపడుతున్నాను. ఈ బీరు (pale ale) నాకు ఎంతో ఉపశమనం ఇచ్చింది. ఈ సమస్యకు ఇంతకు మించిన దివ్యౌషధం లేదు” అని ప్రకటించాడు.

ఈసారి యువపురావస్తు శాస్త్రవేత్త, సమర్థుడు విల్హెమ్ దార్ఫెల్త్ సహాయకుడిగా ఉన్నాడు. టర్కీ ప్రభుత్వం నుంచి తలనొప్పులు మాత్రం తప్పలేదు. విద్యామంత్రిత్వశాఖకు చెందిన బేదర్ ఎదీన్ ఎఫెన్డీని పర్యవేక్షకుడిగా పంపింది. షరా మామూలుగా అతని ఆంక్షలు, అభ్యంతరాలు స్లీమన్ సహనాన్ని పరీక్షిస్తూనే వచ్చాయి. అతని నిత్యకృత్యాలకు వస్తే, మొదటిసారికీ, ఇప్పటికీ వాటిలో కూడా ఎలాంటి మార్పూ లేదు.  సూర్యోదయానికి ముందే లేచి గుర్రం మీద సముద్రస్నానానికి హేల్స్ ఫాంట్ కు వెళ్ళేవాడు. ముగ్గురు సాయుధ అంగరక్షకులు అతని వెంట ఉండేవారు. ఎండనుంచి రక్షణకోసం, బాగా పాతబడిన అదే శిరస్త్రాణాన్ని, పెద్ద పెద్ద కళ్ళద్దాలను, భారీ కోటును ధరించి ఇప్పటికీ రోజుకు 150 మందితో పని చేయిస్తున్నాడు. కోటు జేబులోంచి ఎర్రటి సిల్కు రుమాలు వేలాడుతూ ఉండేది.  ఇప్పటికీ నికొలస్ జెఫిరోస్ జానకిస్ అనే ఆ గ్రీకుజాతీయుడే వేతనాల చెల్లింపుతో సహా అతని పనులన్నీ చక్కబెడుతున్నాడు. అతనే స్టోర్ కీపర్ గా కూడా ఉంటూ పనివాళ్ళకు రొట్టె, పొగాకు, బ్రాందీ వగైరాలను అధికధరలకు అమ్మి బాగా సొమ్ము చేసుకునేవాడు.

జూన్ వచ్చేసరికి మిడతల దండు దాడి చేయడం ప్రారంభించింది. దానికితోడు ఎదీన్ ఎఫెన్డీ నసా పెరిగిపోయింది. సహనం పూర్తిగా నశించిన స్లీమన్ టర్కీ ప్రభుత్వంనుంచి తనకు రక్షణ కల్పించవలసిందని కోరుతూ బిస్మార్క్ కు అత్యవసర తంతి పంపించాడు. కానీ ఆవైపునుంచి ఉలుకూపలుకూ లేదు. తవ్వకాలను చూద్దామంటే, ఏవో చిన్నచిన్న కంచు, రాగి సామగ్రి తప్ప విశేషంగా చెప్పదగినవేవీ బయటపడలేదు. దాంతో తవ్వకాలు ఆపేయాలని జులై చివరిలో స్లీమన్ నిర్ణయం తీసుకున్నాడు.

మరుసటి సంవత్సరం Troja అనే పేరుతో ట్రాయ్ తవ్వకాలమీద తన మూడో పుస్తకం తీసుకొచ్చాడు. అతని పుస్తకాలన్నిటిలో అదే పేలవం. పెద్దగా కలసిరాని 1881-82 తవ్వకాల వివరాలు తప్ప అందులో ఏమీలేదు. కాకపోతే అప్పటివరకూ జరిపిన  ట్రాయ్ తవ్వకాల సమాచారం మొత్తాన్నిఅందులో పొందుపరిచాడు. మరికొన్ని పురాతన ప్రదేశాలలో కూడా తవ్వకాలు జరిపించాలన్న ఆలోచన అప్పటికి చాలా కాలంగా చేస్తూనే వచ్చాడు. తను నౌకా ప్రమాదాన్ని ఎదుర్కొన్న తేరా(Thera)2, సముద్రపు నురగనుంచి అఫ్రోడైట్ పైకి వచ్చినట్టు చెప్పే సితేరా(Cythera)3, తూసడడీస్(Thucydides)4 వర్ణించిన గొప్ప యుద్ధస్థలి అయిన పెలపనీసస్(Peloponnesus)కు పశ్చిమతీరంలోని పీలోస్(Pylos) వాటిలో ఉన్నాయి.

the-peloponnesian-war-syracuse-naval-battle

ఒక అదృష్టక్షణంలో అతని దృష్టి క్రీటు(Crete)ద్వీపం వైపు కూడా మళ్ళింది. అది అప్పటికింకా టర్కీ ఆధిపత్యంలోనే ఉంది. 1878లో, మినోస్5 కలొకైరినోస్  అనే పౌరాణికనామం కలిగిన కాండియా6 వర్తకుడు, కెఫలా త్సెలంపే అనే కొండ మీద కొద్దిపాటి తవ్వకాలు జరిపించాడు. ఆ కొండ ఉన్న చోటే క్రీటు పురాతన రాజధాని నోసస్ ఉండేదని చెబుతారు. అయితే, అప్పటికి పురావస్తుశాస్త్రజ్ఞుల దృష్టి గ్రీసు ప్రధానభూభాగం మీద ఉన్నంతగా  క్రీటుమీదలేదు. మినోస్ కలొకైరినోస్ జరిపిన తవ్వకాల వివరాలు తెలుసుకున్న స్లీమన్, అక్కడ గొప్ప పురావస్తుసంపద బయటపడవచ్చన్న నిర్ణయానికి వచ్చాడు. దార్ఫెల్త్ కూడా ఆ అభిప్రాయాన్ని బలపరిచాడు. ఇద్దరూ కలసి 1886లో నోసస్ ను సందర్శించి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ దిబ్బ ఒక టర్కు యాజమాన్యంలో ఉంది. అతని అంగీకారం తీసుకునే షరతు మీద తవ్వకాలు జరపడానికి ఆ దీవి గవర్నర్ నుంచి ఫర్మానా సంపాదించిన స్లీమన్, బేరసారాలు మొదలుపెట్టాడు. అది సుదీర్ఘంగా సాగింది. ఆ యజమాని కూడా వ్యాపారపు మెళకువలలో స్లీమన్ కు సాటివచ్చేవాడే. 5వేల పౌండ్లకు కొంచెమైనా తగ్గేదిలేదని అతను కరాఖండిగా చెప్పాడు. అది చాలా ఎక్కువ అనుకున్న స్లీమన్ మండిపడ్డాడు. ఏదోవిధంగా దారికి వస్తాడులే అనుకున్న స్లీమన్ ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. కానీ అది సానుకూలం కాలేదు.

ఆ తర్వాత చాలా ఏళ్ళకు నోసస్ వద్ద తవ్వకాలు జరిపి ఆర్ధర్ ఎవాన్స్7 ఎన్నో గొప్ప విశేషాలను బయటపెట్టాడు. స్లీమన్ అప్పుడే కనుక ఆ పని చేసి ఉంటే ఎవాన్స్ కు దక్కిన ప్రతిష్ట అతనికే దక్కి ఉండేది.

తనకు ఆసక్తి గొలిపే పురాతనప్రదేశాలు అనేకం ఉండడంతో అతను మొదటిసారి తన జీవితచరమాంకంలో  సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ వచ్చాడు. చివరికి, తనకు కూతవేటు దూరంలో, ఎథెన్స్ కు దగ్గరలో ఉన్న మారథాన్ 8లో తవ్వకాలు జరపడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉన్న ఒక చిన్నపాటి దిబ్బ పురాతనప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. గ్రీకులకు, పర్షియన్లకు(క్రీ.పూ. 499-449) జరిగిన యుద్ధాలలో మరణించిన 192 మంది ఎథెన్స్ సైనికులను అక్కడ పూడ్చిపెట్టారని సాంప్రదాయిక విశ్వాసం. పసన్నియస్ రాతలు కూడా అందుకు సాక్ష్యామిస్తున్నాయి. 1884 ఫిబ్రవరిలో తవ్వకాలకు అనుమతి సంపాదించుకున్నాడు.  ఆ దిబ్బకు అడ్డంగా ఒక కందకం తవ్వించాడు. అయితే, ఆ తవ్వకాలు కొన్ని రోజుల్లోనే ముగిశాయి. ఎథెన్స్ సైనికుల అవశేషాలేవీ కనిపించలేదు. బల్లేలూ, కత్తులూ, శిరస్త్రాణాలూ, వక్షస్త్రాణాలవంటి యుద్ధసామగ్రి అయినా కనిపిస్తుందని అతను ఆశపడ్డాడు. కానీ అదీ నెరవేరలేదు. పర్షియన్లు గ్రీకు గడ్డ మీద అడుగుపెట్టడానికి ముందే ఆ దిబ్బ మీద జనం నివసించేవారనడానికి సాక్ష్యంగా కొన్ని కుండపెంకులు మాత్రం దొరికాయి.

Voelkerkundemuseum-HA-Hamburg-Berlin

Voelkerkundemuseum-HA-Hamburg-Berlin

ఇక టిర్యిన్స్ (Tiryns) మిగిలింది. ఆర్గోస్ మైదానంలో ఉన్న గొప్ప దుర్గం అది. మొదటిసారి గ్రీసు వెళ్లినప్పుడు స్లీమన్ దానిని సందర్శించాడు.  మైసీనియా తవ్వకాలకు ముందు ఇక్కడ కొద్దిపాటి తవ్వకాలు జరిపించి ఆపేశాడు. మైసీనియా కన్నా టిర్యిన్స్ పురాతనం. గ్రీకు పురాణాల ప్రకారం, హెర్క్యులెస్ అక్కడే జన్మించాడు. కనకవర్షం రూపంలో జియస్ ఈ నగరాన్ని సందర్శించాడు. దానై ద్వారా ఒక కూతురును కని ఆమెనొక బురుజులో బంధించాడు. ఆమె ద్వారా అతనికి పెర్సియస్ అనే కొడుకు పుట్టాడు. ఆర్గోస్ కు చెందిన ఈ వీరుడే మెడూసా తల నరికాడు. ప్రాచీన గ్రీకులు కూడా టిర్యిన్స్ ను భయభక్తులతో చూశారు. “మనకు టిర్యిన్స్ ఉండగా అంతదూరం వెళ్ళి పిరమిడ్ల(ఈజిప్టు)ను సందర్శించే శ్రమ దేనికి?” అని పసన్నియస్ రాశాడు.

స్లీమన్ 1884 మార్చి 14న నాప్లియో చేరుకున్నాడు. విల్హెమ్ దార్ఫెల్త్ అతని వెంట ఉన్నాడు. ఈసారి ఎక్కువ పనిభారాన్ని అతనే మోశాడు. ఇప్పుడు కూడా లండన్ కు చెందిన మెస్సర్స్ ష్రోడర్స్ పెద్ద ఎత్తున ఆహారపదార్థాలను, ఇతర నిత్యావసర సామగ్రిని కానుకగా పంపింది. స్లీమన్ 70 మందిని పనిలోకి తీసుకున్నాడు. 40 ఇంగ్లీష్ తోపుడు బళ్ళను, 20 భారీ గునపాలను, 25 భారీ గొడ్డళ్లను, 50 చిన్నపాటి గొడ్డళ్లను బరిలోకి దింపాడు.  ఈసారి, ఇంతకు ముందెప్పుడూ  లేనంత శాస్త్రీయప్రణాళికతో అతను తవ్వకాలకు సిద్ధమయ్యాడు. అతనూ, దార్ఫెల్త్ బాధ్యతలను పంచుకున్నారు. ఎక్కడ గోడలను కూల్చాలో, ఎక్కడ తవ్వకాలు జరపాలో సూచించడం స్లీమన్ బాధ్యత. పనులను పర్యవేక్షించడం; ఇంజనీర్ ను, రేఖాపటాల నిపుణుని, ప్రధాన కాంట్రాక్టర్ ను సంప్రదించడం దార్ఫెల్త్ బాధ్యత. అంటే,  స్లీమన్ పురావస్తువులకు, నిక్షేపాలకు బాధ్యత వహిస్తే; దార్ఫెల్త్ పురాతన కట్టడాలకు బాధ్యత వహించాడన్నమాట.

                                                      (సశేషం)

 

 

***

అథోజ్ఞాపికలు

  • In fact, the treasure had been secretly removed to theSoviet Union by the Red Army. During the Cold War, the government of the Soviet Union denied any knowledge of the fate of Priam’s Treasure. However, in September 1993 the treasure turned up at the Pushkin Museum in Moscow.[4][5] The return of items taken from museums has been arranged in a treaty with Germany[6] but, as of January 2010, is being blocked by museum directors in Russia.[6] They are keeping the looted art, they say, as compensation for the destruction of Russian cities and looting of Russian museums by Nazi Germany in World War II. A 1998 Russian law, the Federal Law on Cultural Valuables Displaced to the USSR as a Result of the Second World War and Located on the Territory of the Russian Federation, legalizes the looting in Germany as compensation and prevents Russian authorities from proceeding to restitutions.         (వికీపీడియా సమాచారం)
  • తేరా: గ్రీకు పురాతన నగరం. ఏజియన్ సముద్రంలో శాంటొరీన్ అనే దీవిలో ఉంది.
  • సీతేరా: గ్రీసులోని ఒక దీవి. గ్రీకు దేవత అఫ్రోడైట్ సముద్రపు నురగ నుంచి అవతరించిందని గ్రీకు పురాణాలు చెప్పడం ఆసక్తికరం. అఫ్రోడైట్ సుఖసంతోషాలను ప్రసాదించే సౌభాగ్యదేవత. మన పురాణాల ప్రకారం సిరిసంపదలను ఇచ్చే లక్ష్మీదేవి కూడా పాలసముద్రంలో ఉద్భవిస్తుంది.
  • తూసడడీస్(క్రీ.పూ. 460-395): గ్రీకు చరిత్రకారుడు, సైన్యాధికారి. క్రీ.పూ. 5వ శతాబ్దంలో స్పార్టా, ఎథెన్స్ ల మధ్య జరిగిన పెలపనీసస్ యుద్ధసమాచారాన్ని గ్రంథస్థం చేశాడు.
  • మినోస్: పురాతన క్రీటును పాలించిన తొలిరాజు ఇతనేనని గ్రీకు పురాణాలు చెబుతాయి. తూసడడీస్ ప్రకారం, ఇతను ట్రోజన్ యుద్ధానికి మూడు తరాల వెనకటివాడు. ఏజియన్ సముద్రంపై ఆధిపత్యం నెరిపిన మినోస్ నౌకానిర్మాణం ఎరిగినవాడనీ, నౌకాయానం చేశాడనీ, క్రీటు రాజ్యాంగాన్నీ, ధర్మశాస్త్రాన్నీ నిర్దేశించాడనీ అంటారు. విశేషమేమిటంటే మినోస్ కు, మన పురాణాలలోని మనువుకు నామసామ్యమే కాక, నౌకానిర్మాణం, ధర్మశాస్త్రనిర్దేశం వగైరాలలో కూడా పోలికలు ఉన్నాయి. రాంభట్ల కృష్ణమూర్తిగారి పుస్తకాలలో మినోస్-మనువుల పోలికల గురించి మరికొన్ని వివరాలు చూడవచ్చు.
  • కాండియా: క్రీ.శ. 1205-1212 మధ్యకాలంలో క్రీటు ద్వీపం ఇటలీ ఏలుబడిలో ఉన్నప్పుడు దాని అధికారనామం.
  • ఆర్థర్ ఎవాన్స్(1851-1941): ప్రముఖ బ్రిటిష్ పురావస్తునిపుణుడు. కంచుయుగానికి చెందిన ఏజియన్ నాగరికతను బాగా అధ్యయనం చేసినవాడు.
  • మారథాన్: ఒలింపిక్ క్రీడల్లో ఎక్కువదూరం పరుగు పోటీకి ఈ మాట పర్యాయపదంగా మారిన సంగతి తెలిసినదే. దాని పూర్వచరిత్రను నా ‘పురా’గమన వ్యాసాలలో ‘పర్షియన్ రాముడు, గ్రీకు హనుమంతుడు’ అనే వ్యాసం(అక్టోబర్ 2, 2014)లో ఇచ్చాను. చూడగలరు.

 

 

ఇలియడ్ చెప్పిందీ ‘కలికాలం’ గురించే!

 

స్లీమన్ కథ-31

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అనేక గొప్ప ఇతిహాసాలలానే ఇలియడ్ కూడా ఒక దుష్టకాలంలో, వీరోచితంగా ఎదుర్కొన్న ఒకానొక ఓటమి గురించి చెబుతుంది. ఉత్తములు నాశనమవుతారు, చెడు వర్ధిల్లుతుంది.1 అయితే దేవతల తీర్పు వ్యక్తులు చేసిన మంచి పనులపైనో, చెడ్డ పనులపైనో ఆధారపడి ఉండదు. మనిషి భవితవ్యంతో వారికి నిమిత్తం లేదు. అంతిమంగా దేవతలు మనిషిలోని పచ్చి తెగింపునకే ప్రాధాన్యం ఇస్తారు. తమను కూడా ధిక్కరించి ప్రమాదభూయిష్ఠమార్గంలో మనిషి ఎంత ధైర్యంగా, ఎంత హుందాగా అడుగువేశాడన్నదే చూస్తారు. ఆ ధైర్యమూ, ధిక్కారమే మనిషిలోని ఉన్నతోన్నత సుగుణం. మనిషిని దేవుడితో సమానం చేసేది అదే. అదే సమయంలో, అతనిలోని మార్దవం అతన్ని మానవీకరిస్తుంది.

అపార ధైర్యసాహసాలు, మానవీయత అనే ఈ రెండుప్రపంచాల మధ్య హోమర్ అనాయాసంగా సంచరించాడు.     అప్పటికింకా మనిషి అమాయకతనూ, నరాలలో స్వచ్ఛంగా జ్వలించే అగ్నినీ నింపుకున్నప్పటి ప్రపంచాన్ని తన కృతుల్లో ప్రతిఫలించాడు. అపరాధభావనతోనూ, నిరంతరాయమైన విషాద పునరావృతితోనూ భయభీతుడు కావడం నాటి మనిషికి తెలియదు.  నాలుగు దిక్కుల నడవలో సహజమైన ఇంద్రియస్పందనలతో  సరళజీవితం గడిపిన ఫ్రాక్చరిత్ర కాలపు జీవి అతను. ముదిమి పైబడిన దశలో, తనకు రెండు వందల ఏళ్ల క్రితం జరిగిన ఘటనలను హోమర్ చిత్రించాడు. పారంపరికంగా అందుతూ వచ్చిన కథలకు తన యవ్వనస్మృతులను మేళవిస్తూ; ఆయా పాత్రలను ఉన్నదానికంటే ఎక్కువ ఉజ్వలంగానూ, ఆకర్షకంగానూ అతను చిత్రించి ఉండవచ్చు.

అయితే, అతనిలో ఒక వృద్ధుడిలోని సహజమైన శాంతీ, స్వచ్ఛతా ద్యోతకమవుతాయి. గతించిన యవ్వనకాలపు జవసత్వాలపై  ఒక వృద్ధుడికి ఉండే మమకారం ఉట్టిపడుతుంది. తన ఒడిస్సే చివరి అధ్యాయంలో చిత్రించిన మారణకాండలాంటిది అతనికి స్వయంగా తెలుసు. ఆ కృతిలో, ఒడీసియెస్ అర్థాంగి పెనలోపి పునస్వయంవరానికి వచ్చిన రాజులను నరికి పోగులు పెడతారు. పనికత్తెలను ఉరితీస్తారు. తన రోజుల్లో ఒక యువసామంతరాజును చంపి, రక్తం ఓడుతున్న మృతదేహాన్ని ఒక రథానికి కట్టి శిథిల నగర ప్రాకారాల చుట్టూ ఈడ్చుకు వెళ్ళిన ఘటన అతనికి తెలుసు. తను రాజుల గుడారంలో కూర్చుని ఉండగా, యుద్ధంలో పట్టుబడిన స్త్రీలను విజేతలు పంచుకోవడం తెలుసు.  ఊరూరా తిరుగుతూ తంత్రీవాద్యాన్ని మోగిస్తూ, ఇలాంటి అనేక అనుభవాల మేళవింపుతో కథలు చెప్పుకుంటూ వెళ్లాడాయన. ఆ తర్వాత ఆయన శిష్యులు ఈ కథలను గానం చేశారు. అనంతరకాలంలో ఇవి గ్రంథస్థమయ్యాయి.2

ఎన్నో తరాలు గడిచిపోయాయి; అయినా ఈ కథలు పెద్దగా మారింది లేదు. కథన దాహార్తి తీరని ఆ గొంతు మూగవోయింది లేదు. ఆ గొంతు ఎంత శక్తిమంతమూ, ఎంత అనర్గళమూ అంటే; ఒకానొక నాగరికత మొత్తానికి అది ఆకృతినిచ్చి, రంగులద్ది తనతో మోసుకెళ్లింది. ఆ తర్వాత అలాంటిది మరెప్పుడూ జరగలేదు. హోమర్ చిత్రించిన ఆ నాగరికత సుసంపన్నమైనది, సుసుందరమైనది, ఇంద్రియస్పందనలను ఎంతో ఉదాత్తంగా వ్యక్తీకరించినది. ఇంకా అది ఎలాంటిదంటే, ఒక స్వాప్నిక అంశను ధరించినదిగా దానిని జనం విశ్వసిస్తూ వచ్చారు. అయితే, స్లీమన్ దానిని మెలకువలో స్వప్నంగా నిరూపించి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. 3

***

ఇన్నేళ్లలోనూ అతనిలో పెద్ద మార్పేమీ లేదు, అదే మంకుతనం, అవే అలవాట్లు. తన జీవితం పొడవునా పుంఖాను పుంఖంగా ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు, గ్రంథరచన చేస్తూనే ఉన్నాడు. తనెంత సంపన్నుడు, ప్రసిద్ధుడు అయినా తన రాతకోతలకోసం సహాయకుని నియమించుకోలేదు. ఆ అవసరం అతనికి కనిపించలేదు.  మధ్య మధ్య ఒక భాషలోంచి ఇంకో భాషలోకి దూకుతూ తన ఉత్తరాలు తనే రాసుకునేవాడు,

అతని సంపద పెరుగుతూనే వచ్చింది. స్టాక్ మార్కెట్ మీదా; పారిస్, బెర్లిన్, ఎథెన్స్ లలోని తన నివాసాల పైనా ఎప్పుడూ ఒక చూపు ఉంచేవాడు. తను కిరాయికి ఇచ్చిన ఇళ్ళలో ఏ ఒక్కటైనా ఖాళీగా ఉంటే, అందుకు రెండు నిద్రలేని రాత్రుళ్ళను మూల్యంగా చెల్లించేవాణ్ణని చెప్పుకున్నాడు. అలాగని మనిషిలో అసలే మార్పు లేదనీ చెప్పలేం. ఇంతకుముందు దుస్తులపై పెద్ద శ్రద్ధపెట్టేవాడు కాదు, ఇప్పుడు దుస్తులపైనా, టోపీల పైనా  కాస్త అభిరుచిని చూపిస్తున్నాడు.  కోటు జేబులోంచి ఒక ఎర్రటి సిల్కు జేబురుమాలు వేలాడదీసే అలవాటు ఒకటి అతనికి కొత్తగా వచ్చింది. నలుగురిలో ఉన్నప్పుడు సాధారణంగా నిశ్శబ్దం పాటించేవాడు, చాలా అరుదుగా నోరువిప్పేవాడు. తన తవ్వకాలపై చర్చలు అతనికి ఇష్టముండేవి కావు. అడుగు బడుగు జనాలపై ఆదరణ చూపించేవాడు. ఏదో సాధించాలన్న తపన ఇప్పటికీ అతనిలో అలాగే ఉంది. స్వర్ణనిక్షేపాల దాహమూ తగ్గలేదు.

125446-004-0C269211

ఎప్పుడూ ఏదో తొందరలో ఉన్నట్టూ, అస్థిమితంగానూ గడిపేవాడు. గడచిపోయే కాలం పట్ల విపరీతమైన స్పృహతో ఉండేవాడు. ఒక్క క్షణం వృథా అయినా సహించేవాడు కాదు. రోజులో ఇన్నిగంటల చొప్పున ప్రతి పనికీ కేటాయించుకునేవాడు. వేసవిలో ఉదయం మూడు గంటలకే లేచి భార్యతో కలసి గుర్రం మీద సముద్రస్నానానికి వెళ్ళేవాడు. ఉప్పునీటిలో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయనీ, సముద్రస్నానం అన్ని రకాల రోగాలనూ నయం చేస్తుందనీ నమ్మాడు. వయసు మీదపడిన కొద్దీ మరింత నియమబద్ధమైన జీవితం వైపు మొగ్గుతూ వచ్చాడు. తన అరవై నాలుగవ ఏట, పెదవిపై ఏర్పడిన కణితిని మత్తుమందు తీసుకోకుండా కోయించుకున్నాడు. అంతకు కొన్ని మాసాల ముందు గుర్రం మీంచి పడి, కళ్ళద్దాల తునకలు చెక్కిళ్లలో గుచ్చుకున్నప్పుడు కూడా వాటంతట అవే బయటికి వచ్చేవరకూ ఓపికతో ఎదురుచూశాడు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు.

అయితే, శరీరానికి ఎంతో మంచిదని తను నమ్ముతూ వచ్చిన సముద్రస్నానమే నెమ్మదిగా అతని ఆరోగ్యాన్ని హరించడం ప్రారంభించింది. 1877లో, తన మైసీనియా (Mycenae) గ్రంథానికి గ్లాడ్ స్టన్ ప్రసిద్ధమైన ముందుమాట రాస్తున్న తరుణంలో మొదటిసారి స్లీమన్ వినుకలి సమస్యకూ, అస్వస్థతకూ లోనయ్యాడు. సముద్రజలం చెవుల్లోకి ప్రవేశించి విపరీతమైన చెవిపోటుకూ, తలనొప్పికి దారితీయించింది.  తన జీవితంలోని చివరి పదమూడేళ్లూ ఈ రెండు సమస్యలతో అతను బాధపడుతూనే ఉన్నాడు.

తనకు అత్యంత ప్రతిష్ఠను కట్టబెట్టిన ట్రాయ్ ఇప్పటికీ అతని బుద్ధికి పని చెబుతూనే ఉంది. హిస్సాలిక్ లో తను జరిపిన తవ్వకాల పూర్తి వివరాలను పొందుపరుస్తూ, ఆత్మకథాంశాలను జోడిస్తూ, అనంతర పరిశోధనల వెలుగులో కొన్ని వెనకటి సూత్రీకరణలను సవరించుకుంటూ 1879లో ఇలియోస్ (Ilios) అనే పుస్తకాన్ని తీసుకొచ్చాడు.

ఆ తర్వాత కూడా కొన్ని ప్రశ్నలు అతన్ని వేధిస్తూనే ఉన్నాయి. ఇంతకీ ట్రాయ్ ఉనికి హిస్సాలిక్ దగ్గరేనా? ఆ చిన్న దిబ్బను హోమర్ చిత్రించిన సువిశాల నగరంగా ఊహించుకోగలమా? ఆ దిబ్బే ట్రాయ్ అయుంటే అందులో అయిదువేలమంది జనమూ, అయిదు వందలమంది సైన్యమూ మించి ఉండగల అవకాశం లేదని అంచనావేశాడు. అప్పుడు హోమర్ వర్ణించిన అరవై నాలుగు గదుల విశాల ప్రాసాదాలు ఎక్కడున్నట్టు? పైగా ట్రాయ్ గిరిదుర్గం మైసీనియా గిరిదుర్గం కన్నా కూడా చిన్నది.

హిస్సాలిక్ గురించి ఆలోచించినకొద్దీ అతన్ని సందేహాలు అలముకుంటూనే ఉన్నాయి. బహుశా ట్రాయ్ హోమర్ ఊహాజనితం కావచ్చుననుకున్న క్షణాలూ ఉన్నాయి. హిస్సాలిక్ దిబ్బే హోమర్ చిత్రించిన ట్రాయ్ అన్న సంగతిని నిస్సందేహంగా నిరూపించే ఏ పురాతన లిఖిత ఆధారమో, లేదా మరో స్వర్ణకోశాగారమో కనిపిస్తుందన్న ఆశతో అతను తన జీవితాంతమూ ట్రాయ్ లో తవ్వకాలు కొనసాగిస్తూనే వచ్చాడు. ఇంతవరకు ట్రాయ్ గురించిన అతని పరిజ్ఞానం హిస్సాలిక్, బునర్ బషీ, స్కామందరస్ లోయ, దాని దగ్గర ఉన్న చిన్న చిన్న ఊళ్ళకు పరిమితమైంది. ఈసారి వాటిని దాటి వెళ్ళి పరిశీలిస్తే తన సమస్యకు పరిష్కారం దొరకచ్చేమో ననుకుని 1881 మే నెలలో గుర్రం మీద ట్రాయ్ అంతటా సుదీర్ఘపర్యటన చేశాడు. అందువల్ల అతను ఆశించిన ఫలితం దక్కలేదు కానీ, ఈదా(Mount Ida)పర్వతాన్ని ఎక్కగలిగాడు. హోమర్ ప్రకారం ఆ పర్వతం మీద దేవతలు నివసిస్తారు.4 అక్కడినుంచి ట్రాయ్ లో జరిగే యుద్ధాలను వీక్షిస్తారు. అక్కడ అడవి మృగాలు సంచరిస్తూ ఉంటాయి. అయితే, ట్రాయ్ అంతటా సర్వసామాన్యంగా కనిపించే ఒక్క కోకిల తప్ప ఆ పర్వతం మీద మరే జీవీ కనిపించలేదు. ఒక కొన మీద ఒక అజ్ఞాత పశువుల కాపరికి చెందిన ఒకే ఒక సమాధి కనిపించింది. ఇంకో కొన మీద ఒక పాలరాతి పలక కనిపించింది. అది దేవతల రాజు అయిన జియస్ సింహాసన అవశేషం కాబోలని స్లీమన్ అనుకున్నాడు. ఆ కొండ మీదనుంచి చూస్తే హిస్సాలిక్ దిబ్బ కోటు బొత్తమంత చిన్నదిగా కనిపించింది. అంతదూరం నుంచి కింద  సైన్యాల కదలికలను జియస్ ఎలా చూడగలిగాడోనని స్లీమన్ అనుకున్నాడు.

అదే సంవత్సరంలో హిస్సాలిక్ మీద చిన్నపాటి తవ్వకాలు జరిపించాడు కానీ అవి నిరుపయోగమయ్యాయి. అవే రోజుల్లో మరో ముఖ్యసమస్య అతని బుర్రను తొలుస్తూవచ్చింది. అది, ట్రాయ్ నిక్షేపాలను ఎక్కడ ఉంచాలన్నది. గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు అతని ఆలోచనల్లో నానుతూ వచ్చాయి. ఒక దశలో స్వర్ణహారాలను రష్యాకు విక్రయించాలని కూడా అనుకున్నాడు. నిక్షేపాలను హెర్మిటేజ్ మ్యూజియంకు అప్పగించే పక్షంలో మంచి ప్రతిఫలం లభించేలా చూస్తానని వాగ్దానం చేసిన ఒక రష్యన్ ఏజెంటుతో కొన్ని వారాలపాటు ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు. అయితే, నిక్షేపాలను అమ్మాలన్న బలమైన కోరిక స్లీమన్ కు లేదు. అవి ఎంతటి ధనంతోనూ తూచలేని అమూల్యాలన్న సంగతి అతనికి తెలుసు. సిస్టైన్ చాపెల్ కు 5 ఎంత ధర కట్టగలరు? ఆయా ఘటనలు జరిగేవరకూ ఓపికగా ఎదురుచూస్తూనే, నిరంతర సందిగ్ధాల మధ్య నలగడం అతని స్వభావంలోనే ఉంది. తన పరిశోధనలను ఎన్నడూ గుర్తించి హర్షించని జర్మనీకి ట్రాయ్ నిక్షేపాలను అప్పగించే ప్రశ్నలేనేలేదని, 1878 చివరిలో ఒక బెర్లిన్ వర్తకుడికి కరాఖండిగా లేఖ రాశాడు. అయితే, ఆరునెలలు తిరిగేలోపల తను నిక్షేపాలను జర్మనీకే అప్పగించబోతున్న సంగతి అతనికి తెలియదు. అందుకు ఒక నల్లని ముళ్లచెట్టు తాలూకు పూల కొమ్మ కారణం. అదెలాగంటే…

స్లీమన్ జీవితకాలం మొత్తంలో తనకు స్నేహితులంటూ చెప్పదగిన వారు ఇద్దరే.  ఒకరు, యువపురావస్తు శాస్త్రవేత్త విల్హెమ్ దార్ఫెల్త్. ఒలింపియాలో స్లీమన్ చేపట్టిన తవ్వకాలకు సహకరించడానికి ప్రష్యన్ ప్రభుత్వం అతన్ని పంపించింది. ఇంకొకరు, ప్రసిద్ధ వైద్యుడు రుడాల్ఫ్ విర్కో. విచిత్రం ఏమిటంటే, స్లీమన్,అతనూ స్వభావంలో ఉత్తర, దక్షిణాలు. విర్కో నెమ్మదస్తుడు, పద్ధతిగా తూచినట్టు వ్యవహరించేవాడు, ఉపాయశీలి, తర్కబద్ధంగా మాట్లాడేవాడు, ధనదాహం, కీర్తిదాహం బొత్తిగా లేనివాడు.  తన శక్తియుక్తులను ఏక కాలంలో వంద వేర్వేరు పనులకు మళ్ళిస్తూనే నిదానంగానూ, పద్ధతిగానూ వ్యవహరించగల అతి కొద్దిమందిలో ఒకడు. స్లీమన్ అతన్ని చూసి ఒకవిధంగా అసూయ చెందేవాడు, అతని స్నేహాన్ని కోరుకునేవాడు, వైద్యసంబంధమైన ప్రశ్నలను అదేపనిగా గుప్పించేవాడు. చివరికి, సత్కారాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, పసిపిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అతన్నే అడిగేవాడు.

heinrich-schliemann-1822-1890-german-traveler-and-archeologist-schliemann-addressing-a-scientific-group-in-london-england-wood-engraving-from-an-english-newspaper-of-1877-granger

1879 వసంతంలో, హిస్సాలిక్ తవ్వకాలలో కొద్ది విరామం దొరికినప్పుడు, స్కామందరస్ లోయ వెంబడి విహారయాత్రకు వెడదామని స్లీమన్ అతనితో అన్నాడు. స్లీమన్ వెంట వెళ్ళే అవకాశం దొరికినందుకు విర్కో సంతోషించాడు. ఇద్దరూ ఈదా పర్వతపాదాల దగ్గరికి చేరుకున్నారు. స్లీమన్ తన స్వభావానికి భిన్నంగా, ఏవో ఆలోచనలతో సతమతమవుతూ మౌనంగా ఉండిపోయాడు. ఏమిటి విషయమని విర్కో అడిగాడు. “రకరకాల విషయాలుంటాయి, ఏదని చెప్పను?” అని స్లీమన్ అన్నాడు.

కాసేపటి తర్వాత, ఇద్దరూ ఒక నల్ల ముళ్లచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, విర్కో అదే ప్రశ్న మరోసారి అడిగాడు. “తను మరణించిన తర్వాత ట్రాయ్ నిక్షేపాల పరిస్థితి ఏమిటన్న ఆలోచన నన్ను తొలుస్తోం”దని స్లీమన్ జవాబు చెప్పాడు. హఠాత్తుగా విర్కో పూలు చిగురుస్తున్న ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిచి స్లీమన్ కు ఇచ్చి, “ఇదిగో అంకెర్షాగెన్ 6 పూలచెండు” అన్నాడు.

తను ఆ మాట ఎందుకు అన్నాడో అతనికే తెలియదు. అప్రయత్నంగా వచ్చిన మాట అది. అది చెవినబడగానే స్లీమన్ ముఖకవళికలు మారిపోవడం విర్కో గమనించాడు. అతని మీంచి ఓ పెద్ద బరువు దిగిపోయిన ఛాయలు వాటిలో కనిపించాయి. ఆ కొమ్మను అందుకున్న స్లీమన్, “అవును, అంకెర్షాగెన్ పూల చెండే” అన్నాడు. అంతకు మించి మాటలేవీ జరగకుండానే నిర్ణయం జరిగిపోయింది. ఆ సంగతి ఇద్దరికీ తెలుసు.

కొన్ని గంటల తర్వాత విహారయాత్రనుంచి తిరిగి వస్తున్నప్పుడు విర్కో యథాలాపంగా అన్నాడు, “ ఆ నిక్షేపాలు జర్మనీకి చేరవలసిందే. వాటినక్కడ భద్రంగా చూస్తారు. మీకు సముచిత సత్కారం లభిస్తుంది. అంతా సాఫీగా జరిగిపోతుంది. మీరు సరే నంటే యువరాజు బిస్మార్క్ తో మాట్లాడతాను”.

స్లీమన్ తల ఊపాడు. ఏడేళ్లుగా తనను వేధిస్తున్న ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. ఆ వసంత దినాన ఆ పూల కొమ్మను చూడగానే చిన్నప్పుడు అంకెర్షాగెన్ తోటలో తను చూసిన పెద్ద పెద్ద పూల రాశులు అతని స్మృతిపథంలో మెదిలాయి. అంతే, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాడు.

(సశేషం)

***

అథోజ్ఞాపికలు

  1. ‘దుష్టకాలం’ అన్న భావన మన పురాణ ఇతిహాసాలలోనూ ఉంది. ఉదాహరణకు, కలియుగం, లేదా కలికాలం. మహాభారతంలో ఈ కలియుగం ప్రస్తావన చాలాచోట్ల వస్తుంది. ఉత్తములు నశిస్తారు, చెడు వర్ధిల్లుతుందన్న భావనా అందులో అడుగడుగునా వ్యక్తమవుతుంది. పాండురాజు మరణించిన తర్వాత వ్యాసుడు సత్యవతికి చేసిన బోధలో “గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్” అనే వాక్యం సుప్రసిద్ధం.
  2. మహాభారతం విషయంలోనూ ఇదే జరిగింది. హోమర్ తర్వాత ఆయన కృతులను శిష్యులు గానం చేస్తూ ప్రచారం చేసినట్టే, వ్యాసుని శిష్యులు మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ప్రచారం చేశారు. పండిత నిర్ధారణ ప్రకారం, వ్యాసుడు చెప్పిన మహాభారత కథ ఎనిమిది వేల శ్లోకాలే. ఆ తర్వాత ఆయన శిష్యులు రెండు అంచెలలో దానిని లక్ష శ్లోకాలకు పెంచారు. విచిత్రమేమిటంటే, ఇలాంటి విస్తరణ క్రమమే ఇలియడ్ కూ ఉంది. తంత్రీవాద్యం, గానం పోలిక రామాయణానికి మరింత దగ్గరగా వర్తిస్తుంది. రామాయణం “తంత్రీలయ సమన్వితం”. దానిని వాల్మీకి శిష్యులు కుశలవులు గానం చేశారు.
  3. ఈ అభివర్ణన THE GOLD OF TROY రచించిన Robert Payne ది.
  4. గ్రీకు దేవతలు ఈదా పర్వతం మీద నివసించినట్టే, మన పురాణాల ప్రకారం మన దేవతలు మేరు పర్వతం మీద నివసిస్తారు.
  5. సిస్టైన్ చాపెల్: వాటికన్ సిటీలోని పోప్ అధికారనివాసం.
  6. అంకెర్షాగెన్: జర్మనీలోని ఒక గ్రామం. స్లీమన్ తన బాల్యాన్ని ఈ గ్రామంలోనే గడిపాడు.

 

 

అమ్మ ఆరాధనలో కమ్మగా జీవించిన ట్రోజన్లు

 

స్లీమన్ కథ-30

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఈజిప్టు పూజారుల ద్వారా హెరోడొటస్ తెలుసుకున్న సమాచారం ప్రకారం, ట్రోజన్ యుద్ధం పూర్తిగా అర్థరహితం. ఎందుకంటే,  ట్రాయ్ పై గ్రీకులు దాడి చేసిన సమయంలో హెలెన్ కానీ, ఆమెను ఎత్తుకువెళ్లిన పారిస్ కానీ అసలు ట్రాయ్ లోనే లేరు. పారిస్ ఆమెను తీసుకుని ఈజిప్టు రాజధాని మెంఫిస్ కు పారిపోయాడు. వారిద్దరినీ నిర్బంధంలోకి తీసుకోమని ఫారో(ఈజిప్టు చక్రవర్తి)ఆదేశించాడు. పారిస్ ను విచారిస్తూ, నీ పక్కనున్న ఈ యువతికీ నీకూ ఏమిటి సంబంధమని ప్రశ్నించారు. పారిస్ ఆ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. దాంతో అతన్ని దేశం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత హెలెన్ భర్త మెనెలాస్ మెంఫిస్ కు వచ్చి, హెలెన్ ను తన భార్యగా నిరూపించుకుని ఆమెతో కలసి గ్రీస్ కు తిరిగివెళ్ళాడు.

హెరోడొటస్ ఇలా అంటాడు:

ట్రాయ్ లో ఏం జరిగిందో చెప్పే గ్రీకుల కథనం నమ్మదగినదేనా అని పూజారులను అడిగాను. దానికి సమాధానంగా,  మెనెలాస్ స్వయంగా చెప్పినదంటూ వాళ్ళు కొంత సమాచారం ఇచ్చారు. దాని ప్రకారం, హెలెన్ ను ఎత్తుకువెళ్లినట్టు తెలిసిన గ్రీకులు, మెనెలాస్ కు మద్దతుగా పెద్ద సైన్యాన్ని పంపించారు. అది ట్రోజన్ గడ్డమీద అడుగుపెట్టి కుదురుకున్న తర్వాత రాచనగరుకు కొందరు దూతలను పంపించారు. వారిలో మెనెలాస్ కూడా ఒకడు. ట్రోజన్ల స్వాగతం అందుకున్న ఆ బృందం, హెలెన్ ను, పారిస్ అపహరించిన సొత్తును, తగిన పరిహారంతో సహా అప్పగించవలసిందిగా కోరింది.* హెలెన్ తమ వద్ద లేదనీ, ఆ సొత్తు కూడా తమ స్వాధీనంలో లేదనీ, హెలెన్ తప్పించుకుని ఈజిప్టుకు వెళ్ళగా అక్కడి రాజు ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నాడనీ ట్రోజన్లు వారికి చెప్పారు. తమ అధీనంలో లేనివాటిని కోరుతూ తమను శిక్షించబోవడం అన్యాయమని వారు వాదించారు.

సత్యప్రమాణంగా ఇదీ జరిగింది అంటూ ట్రోజన్లు మొదటినుంచీ ఈ కథనానికే కట్టుబడి ఉంటూ వచ్చారు.  గ్రీకులు మాత్రం దీనిని కట్టుకథగా తోసిపుచ్చారు. నగరాన్ని ముట్టడించి అది కుప్పకూలేవరకూ పోరాటం సాగించారు. అయినా హెలెన్ జాడ వాళ్ళకు కనిపించలేదు. ఓడిపోయిన దశలో కూడా ట్రోజన్లు తమ మొదటి కథనాన్నే నొక్కి చెప్పారు. వాళ్ళ మాటల్లో నిజముందని గ్రీకులు ఎట్టకేలకు తెలుసుకున్నారు. మెనెలాస్ ను ఈజిప్టు చక్రవర్తి వద్దకు పంపించారు. మెనెలాస్ నదీమార్గంలో మెంఫిస్ కు చేరుకుని అసలు కథను వినిపించిన తర్వాత ఈజిప్టు అతన్ని ఆదరించి ఇతర సొత్తుతో సహా హెలెన్ ను అప్పగించింది.

అయితే, ఈజిప్టు అంత ఆదరించినా మెనెలాస్ ఆ దేశంపట్ల కృతఘ్నతను చాటుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ప్రతికూల పవనాలు వీస్తుండడంతో కొన్ని వారాలపాటు అతను ఈజిప్టులోనే ఆగిపోవాల్సి వచ్చింది. పవనాలను తనకు అనుకూలంగా మార్చుకోడానికి ఇద్దరు ఈజిప్టు బాలులను పట్టుకుని దేవతలకు బలి ఇచ్చాడు. ఈ దారుణం గురించి తెలిసిన ఈజిప్టువాసులు పగద్వేషాలలో రగిలిపోతూ అతన్ని వెంటాడారు. మెనెలాస్ ఎలాగో తప్పించుకుని లిబియాకు పారిపోయాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఈజిప్టుకు తెలియదు.

ట్రోజన్ యుద్ధం గురించిన హెరోడొటస్ కథనం ఇలా సాగుతుంది. అయితే దీనిని బొత్తిగా నిరాధారమని అనలేం. విచిత్రంగా హోమర్ పద్యాలలోనే ఇందుకు సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. ఫినీషియా లోని సైదున్(Sidon)కు పారిస్, ఈజిప్టుకు మెనెలాస్ ప్రయాణం చేసినట్టు అవి చెబుతున్నాయి. హోమర్ పై తనకు ఎంత ఆరాధనాభావం ఉన్నా; కేవలం హెలెన్ ను పారిస్ సొంతం చేసుకోవడం కోసం మొత్తం ట్రాయ్ నీ, ట్రోజన్లనూ బలిపెట్టేంత ఉన్మాదిగా రాజు ప్రియామ్ ను హెరోడొటస్ భావించలేకపోయాడు. “ఒకవేళ ప్రియామ్ స్వయంగా హెలెన్ ను వివాహమాడి ఉన్నా, అది ఇంతటి విధ్వంసానికి దారితీస్తున్నప్పుడు కూడా ఆమెను అప్పగించకుండా ఉంటాడంటే నేను నమ్మలేను” అని అతను రాశాడు. మొత్తానికి వాస్తవంగా ఏం జరిగిందో హెరోడొటస్ తో సహా ఎవరికీ తెలియదు. ఒకటి మాత్రం నిశ్చయం: ఊహించడానికి కూడా వీలులేనంత అర్థరహిత యుద్ధం అది. అదే సమయంలో, మిగతా యుద్ధాలను మించిన అర్థరహితం మాత్రం కాదు.**

ట్రోజన్ యుద్ధానికి దారి తీయించిన కారణాలు మనకు స్పష్టంగా తెలియకపోయినా, అందులో పాల్గొన్న వీరుల గురించి మాత్రం బాగా తెలుసు. ట్రోజన్ సమాధులేవీ బయటపడలేదు. మైసీనియాలో బయటపడిన సమాధుల విషయానికి వస్తే, అవి యుద్ధానికి ముందు కాలానికి చెందినవి. కానీ, నాటి సైనికుల గురించి మనకు బాగా తెలుస్తోంది. హోమర్ చిత్రణలు, తవ్వకాలలో బయటపడిన సాక్ష్యాలు ఒకేవిధంగా వారిని మనకు పరిచయం చేస్తున్నాయి. మైసీనియా తవ్వకాలలో స్లీమన్ గుర్తించిన కొందరు అజ్ఞాత రాజులు జీవించిన కాలానికీ, ట్రోజన్ యుద్ధం జరిగిన కాలానికీ మధ్య పెద్దగా మార్పు ఏమీ సంభవించలేదు. సైనికుల ఆహార్యం, ఆయుధాలు, యుద్ధం సాగించే తీరు, ప్రజలు ధరించే దుస్తులు, అలంకరణ, సాంఘిక ఆచారాలు, వ్యవసాయవిధానాలు, ఆహారపు అలవాట్లు, దేవతల కొలుపులు-అన్నీ ఇంచుమించు ఒకలాంటివే.

వారి జుట్టు బుజాల వరకూ వేళ్లాడుతూ ఉండేది. బంగారు, వెండి సూత్రాలతో దానిని ముడేసుకునేవారు. వేసవిలో మగవారు చేతులున్న చొక్కాలను మోకాళ్ళ వరకూ ధరించేవారు. శీతాకాలంలో చేతులు లేని పెద్ద పెద్ద అంగరఖాల్లాంటివి ధరించి మెడ దగ్గర ముడేసుకునేవారు. అవి పడకమీద పరిచిన దుప్పట్లలా కూడా పనికొచ్చేవి. నడుములకు అలంకృత పట్టీలను(వడ్డాణాల లాంటివి), కర్ణాభరణాలను, మెడలో గొలుసులను, స్వర్ణహారకిరీటాలను, జడకట్టులను ధరించేవారు. అరచేతులకు తొడుగులు వేసుకునేవారు. వారికి ఉన్ని వాడకం తెలుసు. పూజారిణులు, సంపన్న మహిళలు మంచి కుట్టుపని చేసిన రంగురంగుల అంచులున్న కటివస్త్రాన్ని ధరించేవారు. ఒక్కోసారి కటివస్త్రం, అమ్మవారి స్వర్ణముద్రపై ఉన్న చిత్రంలో స్త్రీలు ధరించిన విధంగా విభజితమై ఉండేది. సైనికులు పంది దంతాలతో చేసిన శిరస్త్రాణాన్ని ధరించేవారు. మైసీనియాలో దొరికిన వంపుతిరిగిన పంది దంతాలు అచ్చం హోమర్ వర్ణించినట్టే ఉన్నాయి.

కుర్చీలు, బల్లలు ఉపయోగించేవారు. కానీ కంచాలలో భోజనం చేసేవారు కాదు. బల్ల మీదే పదార్థాలను పరచుకుని తినేవారు. ఆ తర్వాత బల్లను శుద్ధి చేసేవారు. మేక మాంసం, పంది మాంసం, చాలా అరుదుగా గొడ్డు మాంసం తినేవారు. వీటితోపాటు పెరట్లో కోళ్ళ పెంపకం ఉండేది. ఇళ్ళల్లో బాతులు తిరుగుతూ ఉండేవి. జింకలను, అడవి పందులను, అడవి మేకలను, కుందేళ్ళను, తోడేళ్లను వేటాడేవారు. చేపలు తినేవారు, నత్తగుల్లలను మరింత మక్కువతో తినేవారు. గోధుమ, బార్లీ, సజ్జలు, చిక్కుడు, బటానీ, కాయధాన్యాలను పండించేవారు. ద్రాక్షను, ఆలివ్ చెట్లను సాగుచేసేవారు. మద్యంలో తేనె కలుపుకుని సేవించేవారు.  తోటల్లో బేరి, అత్తి, యాపిల్, దానిమ్మ వగైరా పండ్లను పండించి ఇష్టంగా తినేవారు. పిల్లలు మాంసం, మజ్జ, వెన్న తినేవారు. పాల వాడకం తెలియదు. చీజ్ ను పేదలకు కూడా అందుబాటులో ఉండే పదార్థంగా భావించేవారు. పిల్లులు ఉండేవి కావు. క్రీ.పూ. 6వశతాబ్దిలోనే పిల్లి గ్రీస్ లో అడుగుపెట్టింది. వేటకుక్కలు, కాపలాకుక్కలు ఉండేవి.

తాము దైవసమానుడుగా భావించే రాజు చుట్టూ అల్లుకున్న నిరాడంబర, ఆదిమ సామాజికవ్యవస్థ వారిది. దాదాపు పరిశ్రమలంటూ ఏవీ లేవు. నాణేల వాడకం తెలియదు. ప్రతి తెగా విపరీతమైన స్వాభిమానంతో ఉండేది. ఇతర తెగలపట్ల అదే స్థాయిలో శత్రుత్వం వహించేది. అయితే, ఒక్కోసారి ఇతర తెగలతో మైత్రిని కల్పించుకుని శాంతి, సామరస్యాలతో జీవించడమూ వారికి తెలుసు.*** సర్ వాల్టర్ లీఫ్**** మాటల్లో చెప్పాలంటే, “అప్పటి వారి వ్యవస్థలు, మనుషుల గుంపులను బానిసలుగా మార్చుకుని చెప్పు చేతల్లో ఉంచుకోగలిగినంత బలమైనవి కావు”. ఇప్పటి జనసమూహాలతో పోల్చవలసివస్తే, వారు నేటి ఇండొనేసియాలోని బలిద్వీపవాసులకు దగ్గరగా ఉంటారు. ఈ ద్వీపవాసులు కూడా చండశాసనులైన రాజుల ఏలుబడిలో దేవతలు, రుతువుల పట్ల సామరస్యంతో నిరంతర శ్రమజీవనం గడుపుతూ ఉంటారు.

ట్రోజన్లు దేవతలను, పితృదేవతలను ఆరాధించేవారు. వారి ఆరాధనలో ఆనందం వెల్లివిరుస్తూ ఉండేది. వారికి ఉపవాసాలు, పాపపరిహారాలు, ప్రాయశ్చిత్తాలు తెలియవు. వారిలో అపరాధభావన లేదు. అనాదికాలంలో ఒకానొక తోటలోని నిషిద్ధ ఫలాన్ని తిన్న నేరానికి తమకు ఏదో వినాశనం దాపురించబోతోందన్న భావన వారికి తెలియదు. వారిలో యవ్వనోత్సాహం, తాజాదనం తొణికిసలాడుతూ ఉండేవి. సూర్యకాంతి నిండిన ఒక ప్రాకృతిక ప్రపంచంలో వారు జీవించేవారు. అప్పటికింకా వారి దేహతంత్రులు పాలు గారుతూ సరికొత్తగా ఉండేవి. వారి చుట్టూ దివ్యత్వం తాండవిస్తూ ఉండేది. ***** దేవతలకు సొంతంగా ఒక హోదా, వారిలో తమవైన ఒక తారతమ్యక్రమం ఉండడం నాటి జనానికి పెద్ద విశేషంగా  కనిపించేది కాదు; వెండి విల్లు ధరించిన అపోలో “దేవతలందరిలోనూ బలవత్తరుడు”, అయితే, జియస్ కూడా అంతే బలవత్తరుడు. వారి దృష్టిలో దేవతలందరూ దాదాపు మర్త్యులే; అలాగే మనుషులందరూ దాదాపు దివ్యులే. మానవ జీవితపు అత్యున్నత సాఫల్యం దేవతల ప్రపంచంలోకి అడుగుపెట్టగలగడమే. మర్త్యుడైన దియోమెదెస్****** కూడా దేవత అఫ్రోడైట్ ను గాయపరచగలడు. దేవతలు సైతం విపణివీథిలో సంచరిస్తారు. మనుషుల్లానే వారు కూడా ప్రాకృతిక శక్తులముందు తలవంచుతారు. “మృత్యువు పాలించే చీకటి సామ్రాజ్యా”న్ని తలచుకుని వణకిపోతారు.

ట్రోజన్లు కాంతిని ప్రేమించేవారు, చీకటికి భయపడేవారు. దివ్యత్వం వారికి దాదాపు చేతికి అందేటంత దూరంలో ఉండేది. గాలిలో, స్పర్శలో, రాత్రిళ్ళు వేసుకునే చలిమంటలో, కంచు తళతళలలో, ప్రకాశించే ఆలివ్ చెట్లలో, మనుషుల ముఖాల్లో వారికి దివ్యత్వం గోచరించేది. జంటగొడ్డలి, చక్రాకార స్వస్తిక, అమ్మవారికి చెందిన చిన్న చిన్న మట్టిబొమ్మలు, చిత్రమైన బొంగరం ఆకృతులు వారికి దివ్యత్వ చిహ్నాలు. సాధారణంగా నీలిరంగు రాళ్ళతో మలచిన ఈ బొంగరం ఆకృతులు స్త్రీగర్భానికి, అంతుబట్టని సృష్టి ప్రారంభానికి ప్రతీకలు. ప్రతి చిన్న ప్రవాహాన్నీ అంటిపెట్టుకుని అప్సరసలు(nymphs)ఉంటారు. *******ప్రతి ఉరుములోనూ వారికి ఒక అదృశ్యదేవత వాణి వినిపిస్తుంది. నదులు, సముద్రపు నురగ, పర్వతాలు, చెట్లు సహా అన్నింటిలోనూ దివ్యత్వం నిండి ఉంటుంది. అయితే అంత దివ్యత్వమూ మృత్యువు ముందు ఓడిపోతుంది. దేవతలు కూడా మృత్యువుకు తలవంచుతారు.  మనుషులు మృత్యువును తలచుకుని అంతులేనంతగా భయపడతారు. మృత్యువు, ప్రపంచపు ముఖాన లిఖించిన ఒక వక్రరేఖ. హోమర్ మృత్యుభయాన్ని చిత్రించినంత గాఢంగా, ప్రస్ఫుటంగా మరి దేనినీ చిత్రించలేదు.  ట్రోజన్ల ప్రత్యేక లక్షణమా అన్నట్టుగా దానిని వర్ణించాడు. అయితే ఆ మృత్యుభయాన్ని అంటిపెట్టుకుని ఒకవిధమైన గర్వమూ ఉంటుంది. భయపడుతూ, ద్వేషిస్తూనే మృత్యువును మెరిసే కళ్ళతో వారు పరిహసించనూగలరు.

హోమర్ ప్రకారం, ట్రోజన్లు, అఖియన్లు మృతులను దహనం చేసేవారు. బలిద్వీపవాసుల్లా చితిమంట చుట్టూ నృత్యం చేసేవారు. తన ఆప్తమిత్రుడు పెట్రోక్లస్ చనిపోయినప్పుడు చితిమీద అతని మృతదేహంతోపాటు గొర్రెలను, ఎద్దులను, గుర్రాలను, శునకాలనే కాక; పన్నెండుగురు ట్రోజన్ యువకులను కూడా ఉంచి అఖిలెస్ దహనం చేయించాడు. అయితే, ఇది ప్రాణమిత్రుడి గౌరవార్థం జరిగిన అరుదైన తంతే తప్ప తరచు జరిగేదిగా భావించలేము.  దేవుడు అపోలో జోక్యం చేసుకుని నివారించేవరకూ  పన్నెండు రోజులపాటు హెక్టర్ మృతదేహాన్ని అఖిలెస్ నానారకాలుగా అపవిత్రపరచడం కూడా ఇలాంటి అరుదైన సందర్భమే. మనకు అందుబాటులో ఉన్న ఇతర అనేక సాక్ష్యాల ప్రకారం, హోమర్ చిత్రించిన గ్రీకులు మృతులపట్ల అత్యంత భక్తిగౌరవాలను చాటుకునేవారు.********

హోమర్ చిత్రించిన చితిమంటలకూ, మైసీనియాలో బయటపడిన సమాధుల తీరుకూ ఎలాంటి పోలికా లేకపోవడాన్ని పండితులు ఎత్తిచూపారు. ట్రోజన్ యుద్ధానికి చాలా ముందునాటి నాగరికతకు చెందిన అంత్యక్రియల ఆచారాలకు అవి అద్దంపడుతున్నాయని వారు వాదించారు. స్వర్ణారాశులతో నిండిన ఆ సమాధులు ట్రోజన్ యుద్ధానికి ముందునాటివనడంలో సందేహం లేదు. అయితే, బంగారం దానికదే ఒక మంట లాంటిది. దహనం తర్వాత మాత్రమే మృతుల ఆత్మలను పితృదేవతల లోకంలోకి అనుమతిస్తారని హోమర్ నొక్కి చెప్పాడు. దానికి అనుగుణంగా బంగారపు ముసుగులనే ఒకవిధమైన చితిమంటకు చిహ్నంగా భావించడంలో తప్పులేదు. బంగారు ముసుగులతో మృతదేహాలను పాతిపెట్టడాన్ని దహనానికి ప్రత్యామ్నాయంగా గ్రీకులు భావించి ఉంటారు.

(సశేషం)

****

అథోజ్ఞాపికలు

*యుద్ధానికి ముందు శత్రువు వద్దకు దూతను పంపడం, ఆ దూతను గౌరవంగా చూడడం అనే పద్ధతీ, సంప్రదాయమూ రామాయణ, మహాభారతాలలో కూడా కనిపిస్తాయి.

**క్రీ.పూ. 4వ శతాబ్దికి చెందిన హెరోడొటస్ కూడా యుద్ధాలను ఇలా లాభ, నష్టాలు; హేతు, నిర్హేతుకల కోణంనుంచి చూడడం; ట్రోజన్ యుద్ధాన్ని అర్థరహితంగా భావించడం ఆశ్చర్యం గొలుపుతుంది. గణవ్యవస్థలోనూ, దానికి అతి సమీపంలోని ఇతిహాసకాలంలోనూ శత్రువు పట్ల పగప్రతీకారాలను తీర్చుకోవడం కంటే, అందుకు యుద్ధాలకు దిగడం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఏ లాభ, నష్టాల మీమాంసా, ఎలాంటి హేతు, నిర్హేతుకల పరిశీలనా అక్కడ పనిచేయదు. యుద్ధం చేయడం, ప్రాణత్యాగం చేయడం దానికదే ఒక ఉన్నతమైన విలువ. క్షత్రియుడిగా పుట్టినవాడికి యుద్ధం చేయడం, యుద్ధంలో చావడం ఎంతటి పుణ్యకార్యాలో మహాభారతం అడుగడుగునా చెబుతుంది. అర్జునుడు కానీ, ఇలియడ్ లోని హెక్టర్ కానీ యుద్ధానంతర విధ్వంసాన్ని తలచుకుని విషాదానికి లోనవడం మినహాయింపులు మాత్రమే. ఒకవైపు విషాదానికి లోనవుతూనే, మరోవైపు యుద్ధమూ, అది కలిగించే సర్వనాశనమూ అనివార్యాలన్న స్పృహా వారిలో ఉంది. వారు ఒకవిధంగా యుద్ధ అనుకూల-వ్యతిరేకతల సంధి దశను ప్రతిబింబిస్తూ ఉండచ్చు.

***అంతవరకూ ఒంటరిగా జీవించిన తెగలు, భిన్నమైన తెగలు తారసపడినప్పుడు వాటిపట్ల శత్రువైఖరి కనబరచేవి. యుద్ధాలకు దిగేవి. ఈ విధంగా చూసినప్పుడు యుద్ధమనస్తత్వానికి మూలాలు గణవ్యవస్థలో ఉన్నట్టు అర్థమవుతుంది. భిన్న తెగలతో మైత్రిని, సామరస్యాన్ని పెంచుకోడానికి గణవ్యవస్థలో సహజంగానే కొంత వ్యవధి పట్టి ఉంటుంది. గణవ్యవస్థ అంతరించిందని అనుకునే నేటి కాలంలోనూ ఆ ప్రక్రియ పూర్తి అయిందని చెప్పలేం.

****సర్ వాల్టర్ లీఫ్(1852-1927): ఇంగ్లండ్ కు చెందిన ఒక బ్యాంకర్. వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ కు చాలా ఏళ్లపాటు డైరక్టర్ గా ఉన్నాడు. గ్రీకు ఇతిహాసాలలో పండితుడు, ఇలియడ్ ప్రామాణిక ముద్రణను తేవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.

*****క్రైస్తవం, ఇస్లాంల ముందుకాలానికి చెందిన ట్రోజన్ల ఆరాధనావిధానాలలో, దేవీ, దేవుళ్ళలో, మతవిశ్వాసాలలో నేటి మన హైందవ లక్షణాలు కనిపిస్తాయి. మనకు ఇప్పుడు సైతం ఉన్నట్టే, వారిలోనూ అమ్మవారి ఆరాధన ఉండేది. దీని గురించి నా వెనకటి ‘పురా’గమన వ్యాసాలలో విస్తారంగా ప్రస్తావించాను. ఆసక్తిగలవారు చూడగలరు.

****** దియోమెదెస్: ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్న ఒక గ్రీకువీరుడు.

*******మన పురాణ ఇతిహాసాలలోనూ  నదులను అంటిపెట్టుకుని అప్సరసలు(nymphs) ఉండడం తెలిసినదే.

********మహాభారతంలో తొడలు విరిగి పడి ఉన్న దుర్యోధనుని శిరస్సును భీముడు కాలితో తన్నినప్పుడు. అది సహించని ధర్మరాజు భీముని మందలిస్తాడు. రామాయణంలో రావణుడు చనిపోయిన తర్వాత కూడా  తమ్ముడు విభీషణుడు అతనిని తూలనాడినప్పుడు. “మరణాంతాని వైరాని” అంటూ రాముడు అతన్ని మందలించి రావణుడి మృతదేహానికి అంత్యక్రియలు జరపమని కోరతాడు.

 

 

 

 

 

ట్రోజన్ యుద్ధంలోనూ ఒక ‘అర్జున విషాదయోగం’

 

స్లీమన్ కథ-29

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కల్లూరి భాస్కరం

యుద్ధ సందర్భంలో భార్యతో మాట్లాడుతూ హెక్టర్ అంటాడు:

ఆ రోజు వస్తుంది,  నా అంతరాత్మ చెబుతోంది,

మన పవిత్రనగరం ట్రాయ్ ధూళిధూసరితమైపోతుంది,

ట్రాయ్, ధైర్యశాలి అయిన రాజు, అతని రాచపరివారం, అంతా సర్వనాశనమైపోతారు.

ట్రోజన్ల దుఃఖం నన్ను అంతగా కదిలించడంలేదు సుమా-

దుఃఖం అనివార్యం- హెక్యూబా* దుఃఖం, నా తండ్రి దుఃఖం,

శత్రు పాదాల దగ్గర రక్తధూళిలో పడిఉన్న ఎందరో ఉత్తముల దుఃఖం- అనివార్యం.

నా మృత్యువును నేను తలపోస్తున్నాను, నా చావు నీకు కలిగించబోయే శోకం నన్ను చిత్రవధచేస్తోంది:

కంచు కవచం ధరించిన శత్రువు నిన్ను బానిసత్వంలోకి ఈడ్చుకు వెడుతుంటే నువ్వు పెట్టే ఆర్తారావం నా గుండెల్ని పిండుతోంది.

ఆర్గోస్ లోని ఎవరి మగ్గం దగ్గరో వాళ్ళు నీ చేత పని చేయిస్తారు

లేదా ఎక్కడో ఏ మారుమూల ఊరికో వెళ్ళి కడవతో నీళ్ళు మోస్తావు,

ఏం చేసినా నీ ఇష్టానికి విరుద్ధంగానే, నువ్వు బందీవి.

దుఃఖిస్తున్న నీతో వాళ్ళు అంటారు:

“ తమ నగరం కోసం పోరాడుతున్న రోజుల్లో ట్రాయ్ ఆశ్వికసేనకు నాయకత్వం వహించిన ఘన సేనాని హెక్టర్  ఇల్లాలా! ఇటు చూడు”

ఆ మాటలకు, నిన్ను దాస్యం నుంచి విముక్తం చేసే నాలాంటి వాడు ఎవరూ లేనందుకు,

నీ దుఖం మరింత పొంగి పొర్లుతుంది.

నీ దుర్భరశోకం, నిన్ను బానిసగా మార్చిన వైనం నా చెవిన పడకముందే

నాకు చావు రావాలి, భూమి నా మీద విరుచుకుపడి నన్ను పాతాళానికి తొక్కేయాలి.

దేదీప్యమానుడైన ఆ వీరుడు అలా మాట్లాడుతూ కొడుకువైపు చేతులు చాచాడు,

తండ్రి దేహంపై లోహపు మెరుపులూ, శిరస్త్రాణంపై గుర్రపువెంట్రుకల తురాయీ చూసి భయపడిన బాలుడు-

చక్కని మొలనూలు ధరించిన దాది వైపు ఏడుస్తూ పరుగెత్తాడు.

తల్లిదండ్రుల ముఖాల్లో నవ్వులు విరబూసాయి,

ఉజ్వలుడైన  హెక్టర్ ధగద్ధగాయమానమైన శిరస్త్రాణాన్నితీసి నేల మీద ఉంచి తన గారాల పట్టిని చేతుల్లోకి తీసుకుని లాలించాడు.

తను సృష్టించిన పాత్రపై ప్రేమ పెల్లుబికితే తప్ప ఇలాంటి సన్నివేశాలను ఇంత దుస్సహ గాఢతతో, ఇంత ఆర్ద్రంగా ఎవరూ రాయలేరు. ఇలియడ్  మొత్తాన్ని హెక్టర్ పక్షాన చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఇతిహాసం పొడవునా అతను మాట్లాడుతూనే ఉంటాడు. ఒక్కోసారి ధిక్కారపూర్వకంగా గర్జిస్తూ, ఇంకోసారి కోపంతో వణకుతూ, మరోసారి ప్రసన్నతనూ, నిగ్రహాన్నీ పలికిస్తూ అతని గొంతు ఇతిహాసమంతటా బిగ్గరగా  వినిపిస్తూ ఉంటుంది. “ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ విధ్వంసం మన మీద వచ్చిపడింది. దానిపై తిరగబడుతూ, గడచిపోయే ప్రతి ఒక్క క్షణం నుంచీ మనకు దక్కే అల్ప సంతోషాన్ని జుర్రుకుందాం” అంటాడతను. విచిత్రంగా ఈ మాటలు ఆధునికతకు సమాధానాలుగా ధ్వనిస్తాయి. హోమర్ ను చదువుతున్నకొద్దీ మనం ఆధునిక ప్రపంచంతో ముఖాముఖీ తలపడుతున్నామన్న ఒక విచిత్ర స్ఫురణ నిరంతరాయంగా కలుగుతూ ఉంటుంది.

మానవ అంతఃకరణలోని అరాచకరాక్షసుని హింసాత్మక స్వైరవిహారానికి అఖిలెస్ ప్రాతినిధ్యం వహిస్తాడు. అతను కేవలం చంపడం కోసమే చంపుతాడు. అందులోనే వెర్రి ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. అతని దృష్టిలో విధ్వంసం ఒక  ఉత్తమోత్తమ పుణ్యకార్యం . అతనిది రాతిగుండె అనో; పగ, ప్రతీకారం మూర్తీభవించినవాడనో అనడం, అతని భయానకప్రవృత్తిని తక్కువ చేసి చూపడమే. అతని సంహారకాండకు ఒక లక్ష్యం ఉండదు. ఒక వేటగాడిలా వెంటాడి వెంటాడి మరీ చంపుతాడు. అందులో పిల్లలు, వృద్ధులు అన్న విచక్షణ లేదు.  అపరాధభావన లేదు. ప్రపంచాన్ని అమితంగా ద్వేషిస్తాడు. దానిని నిర్ధూమధామం చేయడంలో తను పొందే తృప్తి కన్నా అతనికి మరేవీ ఎక్కువ కావు. శత్రుగృహంలో ఉన్న హెలెన్ ను విడిపించడం కోసం అతను  యుద్ధంలో పాల్గొనలేదు; చంపడంలో ఉండే సంతోషాన్ని పిండుకోవడం కోసం, ట్రాయ్ మొత్తాన్ని బూడిదకుప్పగా మార్చడం కోసం పాల్గొన్నాడు.

achilles_dragging_hector_s_body_in_front_of_troy__by_jacktzekov-d82vnjg

అందరికంటే ఎక్కువగా  హెక్టర్ మన ఆలోచనలకు దగ్గరగా ఉంటాడు. అతనిలో ఎలాంటి భ్రమలూ లేవు. అతని చేతిలో ఎలాంటి మంత్రదండమూ లేదు. నేటి మన కాలపు ఛాయలు అతనిలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. శకునాలను ధిక్కరిస్తాడు. విధిని తప్పించుకోడానికి మానవసాధ్యమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాడు, అదే సమయంలో, అది తప్పించుకోలేనిదనీ అతనికి తెలుస్తూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా హుందాగా, గౌరవప్రదంగా నడచుకుంటాడు; అయితే గౌరవమర్యాదలు యుద్ధాలను గెలవలేవనీ అతనికి తెలుసు. హోమర్ చెప్పినట్టుగా అతని ముఖంలో నిశీథి తాండవిస్తూ ఉంటుంది. మరోవైపు, అతను ఎంతటి వీరుడంటే, “కోటగుమ్మంలోంచి రివ్వున యుద్ధానికి దూసుకువెడుతుంటే దేవతలు కూడా అతన్ని పట్టుకోలేరు”. చివరికి, తన కవచాన్ని కోల్పోయిన స్థితిలో, కంఠంలో దిగబడిన ఒక కత్తిపోటుతో అతని జీవితం అంతమవుతుంది. అప్పటికీ కసి తీరని శత్రువు అతని మృతదేహాన్ని దుమ్ములోంచి ఈడ్చుకువెళ్ళాడు.  దేవతలు తనను త్యజించి శత్రుపక్షం వహించడమే అతని పతన,పరాభవాలకు కారణం. విచిత్రం ఏమిటంటే, తన జీవితం ఇలాగే ముగుస్తుందని అతనికి ముందునుంచీ తెలుసు. **

ప్రతి కాలంలోనూ జనం హోమర్ ను చదువుకున్నారు. కానీ నేటి కాలంలో చదువుతున్నంత విస్తృతంగా, శ్రద్ధగా ఎప్పుడూ చదవలేదు. అందుకు తగిన కారణమే ఉంది. హోమర్ ప్రకృతికి అద్దం పట్టాడు. అతను వర్ణించిన ప్రపంచం సరిగ్గా నేటి ప్రపంచమే. ట్రాయ్ దగ్ధమైన తర్వాత ఈ మూడువేల సంవత్సరాలలో ప్రపంచం పెద్దగా మారింది లేదు. నాటి ఆ మంట ఇంకా రగులుతూనే ఉంది. అందులో చిక్కుకున్నవారు బయటపడడానికి పంటిబిగువు పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రతిచోటా విధ్వంసగ్రస్తుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. మనందరం ట్రోజన్లమే.*** అంధుడైన హోమర్ పురాతన ద్వీపాల వెంబడి సంచరిస్తూ నేటి మన దురవస్థను విస్తారమైన కాంతిమంతతతో వర్ణించాడు. అలాగని అతను ప్రవక్త ఏమీ కాదు; మానవావస్థను అతనంత నగ్నంగా, ఘనంగా వర్ణించినవారు లేరు.

పాశ్చాత్య నాగరికత మూలాలు వెతికే ప్రయత్నంలో స్లీమన్ ట్రాయ్ అన్వేషణకు వెళ్ళాడు. అతనూ ఆధునికత ఆవహించినవాడే. అశాంతి, అభద్రత, నీడల మధ్య సంచారం సహా విక్టోరియన్ల జాడ్యాలన్నీ అతనికీ ఉన్నాయి. అదే సమయంలో, ఈ సంకీర్ణ ఆధునిక నాగరికత గుప్పించే ప్రలోభాలనుంచి తప్పించుకోవాలన్న దృఢనిశ్చయమూ అతనిలో అసాధారణస్థాయిలో ఉంది. తనవైన మూలాల నుంచి తను దూరమయ్యాడన్న ఎరుక అతనికుంది. అందుకే తన మూలాలను అన్వేషించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతిపురాతన గతంలోకి… ఎలాంటి దారి గుర్తులూ లేని ప్రదేశాలకు సైతం వెళ్లాలనుకున్నాడు. ****

విచిత్రం ఏమిటంటే, ఆధారాలను పట్టించుకోకుండా సిద్ధాంతాలను అల్లే పండితులపట్ల ఆధునికులలో ఉండే తిరస్కారభావం స్లీమన్ లోనూ ఉంది.  అందుకే, హోమర్ కల్పితవ్యక్తి కాడనీ, ఇప్పటికీ జనం జ్ఞాపకాలలో వెచ్చగా ఉన్న యుద్ధాల గురించి రాసిన ఒకనాటి సజీవవ్యక్తి అనీ తిరుగులేని ఆధారాలతో నిరూపించాలనుకున్నాడు. ఆ సంకల్పాన్ని హద్దులు దాటిస్తూ, తను అగమెమ్నన్ ముఖాన్ని గుర్తుపట్టానని అతను అన్నప్పుడూ; ‘హెలెన్ స్వర్ణహారకిరీటాన్ని’ భార్య నుదుట అలంకరించినప్పుడూ అందరూ వెక్కిరింపుగా నవ్వారు. అయితే, అతని భావన నిజమైనా కాకపోయినా కనీసం అది అసాధ్యమని మాత్రం ఎవరూ అనలేరు.

హోమర్ లో అంతవరకూ పాఠకుల దృష్టిని పెద్దగా ఆకర్షించని ఛాయామాత్ర ఉల్లేఖలు కొన్నింటికి రక్తమాంసాలను కల్పించి, ముందులేని ప్రాధాన్యతను వాటికి సంతరించడం స్లీమన్ చేసిన గొప్ప దోహదాలలో ఒకటి. తను జరిపిన తవ్వకాలలో అతనికి గట్టి లిఖిత ఆధారాలు ఏవీ కనిపించకపోయినా; అతను బయటపెట్టినవాటిలో అనేకం హోమర్ చిత్రణలకు అనుగుణంగా ఉండి, అతని పద్యాలను అప్పుడే తవ్వి తీసి అపనమ్మక ప్రపంచం ముందు పెట్టాడా అన్న భావన కలిగిస్తాయి. ఏమైతేనేం, తను పాశ్చాత్యనాగరికత మూలస్థానాన్ని కనిపెట్టాడు, అంతే! ఇంతకు మించి చెప్పుకోవడం అనవసరం.

అసలు ట్రాయ్ లో ఏం జరిగింది, యుద్ధం ఎందుకు చేయవలసివచ్చిందన్నది ఈ రోజుకీ మనకు తెలియదు. హోమర్ నిజంగా ట్రాయ్ ను సందర్శించాడా అన్నది కూడా తెలియదు. కానీ ట్రాయ్ పతనగాథ ఏమాత్రం సందేహించడానికి వీలులేనంత ప్రామాణిక వివరాలతో, పటిష్టమైన చట్రంతో మన ముందుకు వచ్చింది.*****  హోమర్ ఒక కవిగా తన అభిరుచికి అనుగుణంగా వీరులను తీర్చిదిద్దాడు. కొందరిని ఉన్నతీకరించాడు, కొందరిని వక్రీకరించాడు. తన సానుభూతులన్నిటినీ హెక్టర్ లో గాఢంగా రంగరించాడు. హెలెన్ ను పారిస్ ఎత్తుకువెళ్లడం వల్లనే ట్రోజన్ యుద్ధం జరిగిందని అతను నమ్మాడు. అయితే, ఆర్థిక కారణాలతో కాకుండా అర్థరహిత కారణాలతో కూడా తరచు యుద్ధాలు జరిగాయన్న సంగతిని విస్మరించిన ఆధునిక పండితులు మాత్రం, దర్దనెల్లెస్ పై ఆధిపత్యం కోసమే ట్రోజన్ యుద్ధం జరిగిందని భావించారు.

ఇక, ట్రోజన్ యుద్ధం గురించి గ్రీకు పురాతన చరిత్రకారుడు హెరోడొటస్ (క్రీ.పూ. 484-425)కథనం మరోవిధంగా ఉంది.

(సశేషం)

****

అథోజ్ఞాపికలు

*హెక్యూబా: రాజు ప్రియామ్ భార్య.

**హెక్టర్ లో విచిత్రంగా మహాభారతంలోని అర్జునుడి పోలికలు, కర్ణుడి పోలికలూ కూడా కనిపిస్తాయి. అతను మనం తేలిగ్గా పోల్చుకోగలిగిన మానవమాత్రుడిలానే వ్యవహరిస్తాడు. విధికి ఎదురు తిరగలేని మానవనిస్సహాయతను అంగీకరిస్తూనే, మానవప్రయత్నంతో ధైర్యంగా దానిని ఎదుర్కోడానికి సిద్ధమవుతాడు. మనిషిలోని దుఃఖం, వేదన, ఆనందం, ఆశ, నిరాశ మొదలైన అన్ని రకాల అవస్థలను ప్రతిబింబిస్తాడు. మహాభారతంలోని అర్జునుడు కూడా ఈ మానవస్వభావానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. ‘నరుడు’ అన్న అతని మరో పేరే దీనిని సూచిస్తూ ఉండచ్చు. హెక్టర్ లానే అర్జునుడు కూడా యుద్ధఘట్టంలో సందేహాలు, సందిగ్ధాల మధ్య నలుగుతాడు. విషాదానికి లోనవుతాడు. హెక్టర్ లానే యుద్ధానంతర విధ్వంసాన్ని పదే పదే ఎత్తి చూపుతాడు.

ఇంకోవైపు, హెక్టర్ అంతమైన తీరు కర్ణుని గుర్తుచేస్తుంది. అతను కవచాన్ని కోల్పోవడం, ఆ స్థితిలో కంఠంలో శత్రువు కత్తి దిగబడడం కర్ణుని అంతిమక్షణాలకు కొంచెం దగ్గరగా ఉన్నాయి.  దేవతలు హెక్టర్ కు ప్రతికూలంగా మారి శత్రుపక్షం వహించి అతని చావుకు కారణమైనట్టే, దేవతల రాజైన ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలను హరించి అతని చావుకి ఒక కారణమయ్యాడు.

***ఇక్కడ కూడా మహాభారతంతో ఇలియడ్ కు పోలిక కుదురుతున్నట్టుంది. పాశ్చాత్యులందరూ ట్రోజన్లు అయితే, మనం భారతీయులం కురుక్షేత్రయుద్ధ వారసులం. ట్రోజన్ యుద్ధం పాశ్చాత్య సమాజాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పిందనుకుంటే, కురుక్షేత్రయుద్ధం భారతీయసమాజాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పింది. నా విస్తృత అధ్యయనంలో ఈ చర్చ ఒక భాగం కాబోతోంది.

****మనకులానే పాశ్చాత్యులకు కూడా ఆధునికత ఒక సమస్య కావడం ఇక్కడ ఆసక్తికరం.

*****ఇక్కడా మహాభారతంతో పోలిక కుదురుతోంది. మహాభారతయుద్ధం నిజంగా జరిగిందో లేదో మనకీ తెలియదు. కానీ యుద్ధ చిత్రణ మాత్రం నిజంగా జరిగిందన్న భావన కలిగిస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గ్రీకుల ‘మహాభారతం’ ఇలియడ్

 

స్లీమన్ కథ-28

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కల్లూరి భాస్కరం

స్లీమన్ తన జీవితకాలంలోని చివరి పదేళ్లూ మరెక్కడైనా స్వర్ణనిక్షేపాలు బయటపడతాయా అని గాలిస్తూనే గడిపాడు. కానీ అతని ఆశ ఫలించలేదు. తనలో ఒక బాలుడిలో ఉండే కుతూహలం, ఒక యువకుడిలో ఉండే ఉత్సాహం ఇప్పటికీ ఉన్నా శరీరాన్ని వృద్ధాప్యం ఆవహించింది. ఎక్కడో ఒకచోట తను స్థిరంగా కుదురుకోవాలనిపించింది. ఎథెన్స్ తనకెంతో ఇష్టాన్నీ, మనశ్శాంతినీ కలిగించడంతో ఆ నగరం నడిమధ్యలో తన స్థాయికి తగినట్టు ఒక నివాసాన్ని నిర్మించుకోవాలని నిశ్చయించుకున్నాడు.

ట్రాయ్, మైసీనియాలలో తను కనుగొన్న రాజప్రాసాదాల నమూనాలో తన సౌధానికి తనే రూపకల్పన చేసుకున్నాడు. దానికి Iliou Melathron (‘ట్రాయ్ ప్రాసాదం’) అని పేరుపెట్టాడు. అది లైకాబిటిస్ కొండ పాదాల దగ్గర రాజుగారి గుర్రపుశాలకు ఎగువన ఉంది. అదొక భారీ నిర్మాణం. రంగురాళ్ల నేలతో, పాలరాతి మెట్లతో లోపల చలి చలిగా ఉంటుంది.  ట్రాయ్ లో తను కనుగొన్న స్వర్ణపాత్రలు, కలశాల నమూనాలు వాటి మీద చిత్రితమై ఉన్నాయి. గోడల మీద ప్రాచీనతను ప్రతిబింబించే ప్రకృతి దృశ్యాలు, హోమర్ నుంచి తగిన ఉటంకింపులతో గ్రీకు వీరుల చిత్రాలు ఉన్నాయి.

కింది అంతస్థులలో తను కనుగొన్న నిక్షేపాలను ప్రదర్శించాడు. పై అంతస్థును తన అధ్యయనానికి కేటాయించుకున్నాడు. “క్షేత్రగణితాన్ని అధ్యయనం చేయనివారు బయటే ఉండండి” అనే హెచ్చరికను తలుపుకు అతికించాడు. గదినిండా పుస్తకాలు. తను సేకరించిన అతి విలువైన సామగ్రిని కూడా అందులోనే ఉంచాడు. గోడల మీద, తను ఎంతగానో అభిమానించే న్యూయార్క్, ఇండియానాపోలిస్ తాలూకు దృశ్యాలను అలంకరించాడు. మందంగా తోలు తాపడం చేసిన ఓ పెద్ద కుర్చీలో కూర్చుని రోజంతా ప్రాచీన గ్రీకు గ్రంథాలను చదువుతూ గడిపేవాడు. పక్కనే ఒక చిన్న కుర్చీ ఉండేది. దానిమీద, రోజూ ఉదయమే పారిస్, లండన్, బెర్లిన్ ల నుంచి వచ్చే స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాల దొంతర ఉండేది. టెలిగ్రాఫ్ ఫారాలు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి. ఇప్పటికీ అతను వ్యాపారప్రముఖుడే. దాదాపు ప్రపంచమంతా విస్తరించిన తన ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణకు రోజూ కొన్ని గంటలు కేటాయించుకునేవాడు.

తన నివాసంలో అతను హోమర్ వర్ణించిన రాజుల్లానే ఒక నియంతలా వ్యవహరించేవాడు. తన మాట శిలాశాసనం. తనకు పంపే వర్తమానాలను అన్నింటినీ ప్రాచీన గ్రీకు భాషలో పంపి తీరవలసిందే. ఇంట్లో భోజనాల దగ్గర, ఇతర నిత్యకృత్యాలలో గ్రీకు మాట్లాడవలసిందే. తన పనివాళ్లు అందరికీ గ్రీకు పేర్లు పెట్టాడు. ఒక పనివాడి పేరు, బెల్లర్ ఫాన్. ఇంకొకతని పేరు, టెలమాన్. కూతురు అంద్రోమకీ ఆయా పేరు, దనాయి.  కొడుకు అగమెమ్నన్ నర్సు పేరు పోలిక్సీనా. ముసలి తోటమాలి పేరు కల్ఫాస్. భవిష్యత్తును చెప్పగలిగిన కల్ఫాస్ శాపవాక్యాలతోనే ఇలియడ్ మొదలవుతుంది. ప్రాచీన గ్రీకులు ఇళ్ళలో ఎక్కువ గృహోపకరణాలను పేర్చేవారు కాదు కనుక, తను కూడా వారినే అనుసరించాడు. ఓ మూల కొన్నిపాటి కుర్చీలతో, సోఫాలతో గదులన్నీ బోసిపోయినట్టు ఉండేవి.  అలాగే, ఇంట్లో ఎక్కడా తెరలు ఉండకూడదు.  అతని ఉద్దేశంలో, అఖిలెస్ తెరలు వేలాడదీసిన నివాసంలో ఉన్నాడన్నది అసలు ఊహించడానికే వీలులేని విషయం. తన భారీ భవంతిని పురాతన గ్రీకు రాజప్రాసాదాల నమూనాలో నిర్మించడానికి, పాంపే(పురాతన రోమన్ నగరం) శిథిలాలు అతన్ని ప్రత్యేకించి ఆకట్టుకోవడం కూడా ఒక కారణం. పాంపే భవంతులలోని నాట్యశాలల తరహాలోనే తన నివాసంలో నాట్యశాలను నిర్మించాడు. దాని గోడల మీద నీలం, తెలుపు రంగుల్లో పిల్లల నగ్నచిత్రాలను ప్రదర్శించాడు. వాటిలో తన పరిచయస్తులు, ప్రయాణాలలో తనకు తారసపడిన వ్యక్తుల కవళికలు ఉండేలా చూశాడు. వాటి మధ్యలో కళ్ళద్దాలు ధరించిన తన చిత్రాన్ని ఉంచాడు.

జీవితం పొద్దువాలుతున్న దశలో తనకు రక్షగానూ, తనలో ఉత్సాహం నింపడానికా అన్నట్టూ భవనం పై కప్పు నేల మీద జియస్, అఫ్రొడైట్, అపోలో, ఎథెనా సహా ఇరవైనాలుగు మంది దేవీ దేవుళ్ళ పాలరాతి విగ్రహాలను ఉంచాడు.

***

pura1

స్లీమన్ తన జీవితంలో చివరి ముప్పై నాలుగేళ్లూ ఇలియడ్ ను ఎంతో తమకంతో పఠిస్తూనే వచ్చాడు. అదే అతని బైబిల్. రోజులో ఎన్నోసార్లు ఆ పుస్తకాన్ని తిరగేసేవాడు. దాదాపు అతని ఆలోచనల కన్నిటికీ అదే ఊటబావి.  అందులో, ఏ భాగం గొప్పదీ, ఏది నీకు ఎక్కువ ఇష్టం అన్న ప్రశ్నకు అతని దగ్గర అవకాశమే లేదు. అది ఆమూలాగ్రమూ గొప్పదే,  ప్రీతి కలిగించేదే. అందుబాటులో ఉన్న ఇలియడ్ ప్రతి ఒక్క ముద్రణా అతని లైబ్రరీలో ఉండేది. వాటిలో అనేకం మందమైన మొరాకో తోలుతో బైండ్ చేసినవి. అవిగాక,  చవకగా లభించే పేపర్ బౌండ్ చాజ్నిట్స్ [Tauchnitz- జర్మనీకి చెందిన బెర్న్ హార్డ్ చాజ్నిట్స్ అనే అతను నెలకొల్పిన సంస్థ 1842-1950ల మధ్యకాలంలో పేపర్ బౌండ్ చవక ముద్రణలను వ్యాప్తిలోకి తెచ్చింది. అవి చాజ్నిట్స్ ముద్రణలుగా ప్రసిద్ధి చెందాయి]ముద్రణలను ప్రయాణాలలో వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. వాటి పుటలను తన వ్యాఖ్యానంతో నింపేసేవాడు.

ఇలియడ్ ను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉందని ఓసారి ఒక మిత్రుడు ఉత్తరం రాశాడు. అందులో కష్టమేమీ లేదనీ, అది కాస్టలియన్[గ్రీస్ లో డెల్ఫీ సమీపంలోని] ఊటజలాలంత తేటగా ఉంటుందనీ, ఒక ఆధునిక నవలలా దానిని చదువుకోవచ్చనీ స్లీమన్ జవాబిచ్చాడు. అతని దృష్టిలో ఇలియడ్, ఒడిస్సే లు రెండూ దివ్యశాసనాలు. భగవదాశీస్సులతో రూపొందినవి. మానవమాత్రుడికి సాధ్యం కాని ఉదాత్తతా, సొగసూ వాటిలో ఉట్టిపడుతుంటాయి. ఈ గ్రంథాలను ఎవరైనాసరే కూర్చుని శ్రద్ధగా పఠిస్తే తన జన్మ సార్ధకమైందన్న భావనా, ఒక అలౌకికానందమూ అతన్ని ముప్పిరిగొంటాయి. మనిషి తాలూకు అంతటి విషాదాన్నీ అవి ప్రతిఫలిస్తాయి. అవి, ఒక పరిపూర్ణ కవి చెప్పిన పరిపూర్ణ కథలు. ఇంతకు మించి చెప్పడం అనవసరం.

ఇలియడ్ లో అన్నిటి కన్నా ఫలానా భాగం గొప్పదని చెప్పడం కష్టమనీ, అన్నీ సమానంగా రంజకమైనవే నని స్లీమన్ పదే పదే నొక్కి చెప్పినా; ఒక సందర్భంలో మాత్రం తన ఈ నిర్ధారణను తనే ఉల్లంఘించాడు.  అన్నిటిలోనూ  ప్రత్యేకించి మరింత అద్భుతమైనదిగా ఒక ఘట్టాన్ని ఎత్తిచూపాడు. అది, హెలెన్ ఒక వస్త్రంపై అల్లిక పని చేస్తూ స్కియన్ గేటు వైపు నడిచి వెడుతున్న ఘట్టం. ఆమె నేస్తున్న అలంకరణవస్త్రంపై ట్రోజన్లు, అఖియన్లు ఒకరి పీక ఒకరు పట్టుకున్న చిత్రాలు ఉన్నాయి.  ఆ సమయంలో, చెట్టు కొమ్మల మీద ఆనందంగా కిచకిచలాడే పక్షుల్లా  రాజు ప్రియామ్, నగర పెద్దలూ  సమీపంలోని ఒక బురుజు మీద సమావేశమై మాట్లాడుకుంటూ ఉంటారు.

యుద్ధం ఆగిపోయిందన్న వార్త వస్తుంది. దానికి బదులు హెలెన్ భర్త మెనెలాస్, ఆమెను అపహరించుకుని వచ్చిన పారిస్ ద్వంద్వయుద్ధం చేయాలని తీర్మానించారు. హెలెన్ భవితవ్యాన్ని ఆ యుద్ధం నిర్ణయించబోతోంది. హెలెన్ శ్వేతవస్త్రం ధరించి, చెలికత్తెలు వెంటరాగా ప్రియామ్ ఉన్న బురుజును సమీపిస్తుంది. ఆమె రాకను గమనించిన పెద్దలు అప్రయత్నంగా గొంతులు తగ్గించి, ఆమె అద్భుత సౌందర్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఇంకోవైపు, సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం అంతం కాబోతోందన్న సంతోషం వాళ్ళలో వెల్లివిరుస్తోంది. ప్రియామ్ ఆమెను తన దగ్గరకు పిలిచి శత్రుసేనలోని ఒక వ్యక్తిని చూపించి, “అందరికంటే ఆజానుబాహువుగా, ధీరోదాత్తుడిలా కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు?” అని అడుగుతాడు.

pura3

“అతను అగమెమ్నన్, నా భర్తకు అన్నగారు” అని హెలెన్ చెబుతుంది. ఆ తర్వాత, తన కవచాన్ని నేల మీదికి జారవిడిచిన ఇంకో వ్యక్తిని చూపించి, తగుమాత్రం ఎత్తుగా, లోతైన ఛాతీతో ఉన్న అతను ఎవరని అడుగుతాడు. “అతను ఒడీసియస్” అని చెబుతుంది. ఈసారి, ఎత్తుగా, అందంగా ఉన్న ఇంకో వ్యక్తిని చూపించి, ఎవరని అడుగుతాడు. “అతను ఎజాక్స్” అని చెబుతుంది. క్రీటు రాజు ఇడోమెనెస్ ను కూడా ఆమె గుర్తుపడుతుంది. అగమెమ్నన్ సేనానులందరిలో అతనే పెద్దవాడు.  ఇంతలో ఇద్దరి కోసం ఆమె కళ్ళు ఆత్రుతతో గాలించాయి. వారు, కాస్టరస్, పోలీడూసెస్ లు. వాళ్ళిద్దరూ ఆమె సోదరులు. ఒకతను మంచి అశ్వశిక్షకుడు, ఇంకొకతను ప్రసిద్ధ మల్లయోధుడు. వాళ్ళు కనిపించకపోయేసరికి కీడును శంకించి, పట్టలేని దుఃఖంతో ఆమె మూగవోయింది. హోమర్ అంటాడు:

ఫలవంతమైన భూమి ఇప్పటికే వారిని తన ఒడిలోకి తీసుకుంది

దూరంగా, తాము ఎంతో ప్రేమించే లాసిడిమోనియా*కు వారు చేరుకున్నారు

దుఃఖం నగ్నంగా నర్తించే ఇలాంటి ఘట్టాలు హోమర్ లో ఏడెనిమిది కనిపిస్తాయి. దుఃఖం-మనిషి ఎదుర్కొనే దుఃఖం- ఇదే ఈ కథలో ప్రధాన ఇతివృత్తం. అఖిలెస్ ఆగ్రహోదగ్రతా, ఎందరో ఉత్తముల చావుకు కారణమైన అతని విలయ తాండవం-ఇవే తన ప్రధానవస్తువులని హోమర్ ఇతిహాస ప్రారంభంలోనే చెబుతాడు. అఖిలెస్ రూపంలో మృత్యుశక్తి పట్టపగ్గాలు లేకుండా విస్ఫోటించింది. తన దారికి అడ్డువచ్చిన ప్రతిదానినీ ధ్వంసం చేస్తూ, ప్రతి ఒకరితో ఘర్షణపడుతూ; శత్రువీరుడైన హెక్టర్ ను చంపి అతని మృతదేహాన్ని గుర్తుపట్టలేనంతగా ఛిద్రం చేసేవరకూ ఎత్తిన కత్తి దించని అఖిలెస్ విజృంభణను ఊపిరి బిగబట్టి చూస్తూ ఉండిపోతాం. ఎట్టకేలకు మృతదేహాన్ని రాజు ప్రియామ్ కు అతను అప్పగించినప్పుడు, ఆ యువవీరుడైన హెక్టర్ రూపురేఖల్లో  మానవీయంగా, లేదా దైవత్వంగా చెప్పదగినదేదీ మిగలదు. అతను, నలిపి చంపేసిన ఒక పురుగు!

అఖిలెస్సే ఇందులో నాయకుడు. అయితే, అతను మృత్యువును ప్రేమించిన నాయకుడు. ఇందుకు భిన్నంగా ఈ కథను వినే శ్రోతలందరూ జీవితాన్ని ప్రేమించేవారు. ఇంత అందమైన భూమిని సృష్టించి కూడా, దానిని ఇంతటి విషాదంతో నింపిన దేవతల విధ్వంసశక్తికి వారు నివ్వెరపోతారు. మెరిసే కవచాలు, ధైర్యం ఉట్టిపడే చూపులు, వంగే మానవదేహాలు, స్వర్ణహారాల ధగధగలు-అన్నీ చివరికి ఇన్ని కన్నీళ్లుగా మిగిలిపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే, యువవీరుల విషాదాంతాన్ని పురస్కరించుకుని భగవంతుని ఉద్దేశించి చేసే సుదీర్ఘ ప్రార్థన, ఇలియడ్.**

ఇలియడ్ లో అడుగడుగునా  బాధాగ్రస్తుల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇంతటి ధ్వంసకాండకు గ్రీకులు ఎందుకు పూనుకున్నారు? అందులో వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని పొందారు?  హెక్టర్ మృతదేహాన్ని ట్రాయ్ ప్రాకారాల వెంట ఈడ్చుకువెడతారనీ, అఖిలెస్ విజయం సాధిస్తాడనీ, తళుక్కు మనే శ్వేతవస్త్రాలతో ప్రేతదేవతలా హెలెన్ కథ అంతటా ఆవరించి ఉంటుందనీ ప్రారంభంనుంచీ మనకు తెలుస్తూనే ఉంటుంది. గొప్ప సౌందర్యారాశిగా, అందరానిదిగా తోచే హెలెన్, తన అందానికి తనే భయభ్రాంతమవుతూ జీవించే ఒక భూతాన్ని తలపిస్తుంది. ఈ భూతం కోసమే వీరులంతా కలసి ఈ మహాయుద్ధం సాగించారు; ఈ భూతం కోసమే సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నారు. పురుషులు చావవలసిందే; స్త్రీలు దుఃఖించవలసిందే; రక్తం చిందవలసిందే; చివరికి అంతా నిష్ఫలం. ఒక భయానకమైన, నిర్హేతుకమైన విధి ఆద్యంతం పరచుకున్నట్టు ఉంటుంది.***

జీవితం నిరర్థకం, అర్థరహితమన్న ఎరుక హోమర్ లో ధ్వనిస్తూ ఉంటుంది. అతనికి యుద్ధాల గురించి తెలుసు.  మృతులు, క్షతగాత్రుల దేహాలు నేలకొరిగిన దృశ్యం ఎలా ఉంటుందో తెలుసు. సంప్రదాయం అతన్ని అంధుడిగా చెబుతుంది. అందుకే కాబోలు, ప్రతిదానిలో ఉజ్వలతను పదే పదే ఎత్తి చూపుతాడు. అతన్ని ఏజియన్ దీవులకు చెందిన ఒక ద్వీపవాసిగా కూడా సంప్రదాయం చెబుతుంది.**** బహుశా అందుకే గ్రీకులు, ట్రోజన్ల ఉభయుల పట్లా అతనిలో ఒక విచిత్రమైన నిర్మమత్వమూ; అర్థరహితమైన యుద్ధంలో చిక్కుకున్న వ్యక్తుల పట్ల మమత్వమూ కనిపిస్తాయి.

ఇలియడ్ లో ముగ్గురు వ్యక్తులు విశిష్టంగా కనిపిస్తారు: అల్లకల్లోలం సాగించే అఖిలెస్, జిత్తులమారి ఒడీసియస్, విధివంచితుడు హెక్టర్! ఒడిస్సే చివరి అధ్యాయాలలో ఒడీసియస్, అఖిలెస్ లక్షణాలను అన్నిటినీ పుణికి పుచ్చుకుంటాడు. ఇలియడ్ లో హెక్టర్ ఆంతరంగిక నాయకుడు అయితే, అఖిలెస్ బహిరంగ నాయకుడు. ఆర్ద్రతా, ఆత్మీయతా నిండిన దాదాపు అన్ని ఘట్టాలూ హెక్టర్ కు సంబంధించి ఉంటాయి. ఇంచుమించు అతను హేమ్లెట్ లాంటివాడు. సాలెగూడులో ఇరుక్కున్న అతను దాని నుంచి బయటపడే ప్రయత్నంలో ఆశ, నిరాశల మధ్య ఊగిసలాడతాడు. అందమైన కలలు పేర్చుకుంటాడు, అంతలోనే వాటిని కుప్పకూల్చుతాడు. తన నాశనానికి తనే అసహనంతో ఎదురుచూసేవాడిలా కనిపిస్తాడు. ఒక్కోసారి బాల్యస్మృతులలోకి జారిపోతాడు.  జీవితం గాలిబుడగ లాంటిదన్న భావనకూ, బాధ్యతాస్పృహకూ మధ్య నలుగుతూ ఉంటాడు.

(సశేషం)

******

అథోజ్ఞాపికలు

*లాసిడిమోనియా: గ్రీసు పురాతన నగరాలలో ఒకటైన స్పార్టాకు మరో పేరు.

** మహాభారతానికి, ఇలియడ్ కు పోలికలు అడుగడుగునా కనిపించి ఆశ్చర్యం గొలుపుతాయి. ఇది ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన ఆసక్తికరమైన అంశం.

***ఈ వివరణ కూడా మహాభారతాన్ని, అందులోని స్త్రీపర్వాన్ని గుర్తుచేస్తుంది. అలాగే, రామాయణాన్ని కూడా.  ట్రోజన్ యుద్ధం హెలెన్ కోసం జరిగితే, ఒక కోణం లోంచి చూసినప్పుడు మహాభారతయుద్ధానికి కేంద్రబిందువు ద్రౌపది. రామ, రావణయుద్ధానికి కేంద్రబిందువు సీత.

****మహాభారతకర్త వ్యాసుడు కూడా ద్వీపంలోనే జన్మించాడు. అందుకే ఆయనకు కృష్ణ ద్వైపాయనుడు(కృష్ణ=నల్లనివాడు, ద్వైపాయనుడు=ద్వీపంలో జన్మించినవాడు) అనే పేరు వచ్చింది.  హోమర్ కు, ఆయనకు మరికొన్ని పోలికలు ఉన్నాయి.

 

 

 

పురాతన మైసీనియాలో అమ్మవారి స్వర్ణముద్ర!

 

స్లీమన్ కథ-27

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)-కల్లూరి భాస్కరం

~

 

మైసీనియాలో స్లీమన్ చేపట్టిన పని పూర్తయింది. నవంబర్ చివరిలో గ్రీస్ రాజుకు ఒక తంతి పంపించాడు. తవ్వకాలలో తను కనుగొన్న స్వర్ణసంపదతోపాటు, ఇతర విశేషాలను అందులో వివరించాడు. ఒక్క స్వర్ణ సంపదతోనే పెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేయచ్చనీ, అది ప్రపంచంలోనే ఒక అద్భుత మ్యూజియం అవుతుందనీ, దానిని దర్శించడానికి కొన్ని శతాబ్దాలపాటు విదేశీ పర్యాటకులు గ్రీస్ కు బారులు కడతారనీ అన్నాడు. తను కేవలం శాస్త్రవిజ్ఞానం మీద మక్కువతోనే పని చేశాననీ, ఈ స్వర్ణసంపదపై ఎలాంటి హక్కునూ ప్రకటించబోననీ నొక్కి చెప్పాడు. ఆ ముల్లెను ఎంతో భద్రంగా గ్రీస్ కు అప్పజెబుతున్నాననీ,  భగవంతుడి దయవల్ల అది జాతీయ సంపదకు అపారమైన మూలనిధి కావాలని ఆకాంక్షిస్తున్నాననీ అన్నాడు.

తీరా రాజుగారి కార్యదర్శినుంచి వచ్చిన జవాబు చూసి నీరుగారిపోయాడు. అది చాలా క్లుప్తంగా ఉంది. అతను జరిపిన ముఖ్యమైన పరిశోధనలకు, అందులో చూపించిన ఉత్సాహానికీ, శాస్త్రవిజ్ఞానం పట్ల మక్కువకు రాజు అభినందనలు తెలిపాడు. భవిష్యత్తులో జరపబోయే తవ్వకాలు కూడా ఇలాంటి విజయాన్నే చేకూర్చగలవన్న ఆశాభావాన్ని ప్రకటించాడు.

స్లీమన్ తను తవ్వకాలు జరిపిన చోటునుంచి మొదటిసారి వట్టి చేతులతో తిరిగి వెడుతున్నాడు. మైసీనియాలో అతను కనుగొన్నవన్నీ గ్రీకు ప్రభుత్వం ఆస్తిగా మారబోతున్నాయి. తవ్వకాలు జరిగినంత కాలం తనకు పక్కలో బల్లెంలా ఉంటూవచ్చిన స్టెమటేక్స్ తనకంటే ముందే పరిశోధనాంశాలను బహిర్గతం చేయడం ప్రారంభించాడు. దాంతో ఆగ్రహించిన స్లీమన్, అతన్ని నిరోధించాలనీ, పరిశోధనాంశాలను వెల్లడించే హక్కు తనకే ఉంది తప్ప ప్రభుత్వానికి కాదనీ స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి తంతి పంపించాడు.

ఆవిధంగా ప్రభుత్వంతో అతనికి మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈమధ్యలో నాప్లియో పట్టణ పాలకవ్యవస్థ జోక్యం చేసుకుని అక్కడ దొరికిన నిక్షేపాలను అక్కడే భద్రపరచాలని డిమాండ్ చేసింది. అది పట్టణానికి చెందిన ఆస్తి అనీ, దానివల్ల పట్టణానికి మేలు జరుగుతుందనీ నొక్కి చెప్పింది. ఇది తెలిసి స్లీమన్ రగిలిపోయాడు. ఇంకోవైపు, తన పరిశోధనాంశాలపై ప్రసిద్ధ పురావస్తు సొసైటీలు అన్నింటికీ తంతి పంపుతూ;  తవ్వకాలు జరిపిన ప్రదేశంలో  భారీ సంఖ్యలో తీసిన ఛాయాచిత్రాల కూర్పుపై ఆలోచన చేస్తూ, నోట్సు, డైరీలు రాసుకుంటూ గడిపాడు. యథావిధిగా జర్మన్లు అతని నిర్ధారణలను ఎద్దేవా చేస్తూ కొట్టి పారేశారు. ఫ్రాన్స్ ఆసక్తి చూపించలేదు. ఒక్క ఇంగ్లండ్ మాత్రమే అతని ఉత్సాహంలో పాలుపంచుకుంది.

శీతాకాలాన్ని ఎథెన్స్ లో గడిపాడు. తన రికార్డులకోసం ఆగొరా పూర్తి రేఖాచిత్రం గీసి తెమ్మని మైసీనియాలో తన దగ్గర పనిచేసిన యువ ఇంజనీర్ వసీలియోస్ డ్రొసినోస్ ను పంపించాడు. ఆగొరాకు దక్షిణంగా పాక్షికంగా తవ్వకాలు జరిగిన చోట అతనికి పైపైన చెక్కిన రాళ్ళు కనిపించాయి. అవి సమాధి మందిరంలో కనిపించిన రాళ్లలా ఉన్నాయి. అదే రోజున మైసీనియాకు వచ్చిన స్టెమటేక్స్ తో వాటి గురించి చర్చించాడు. ఒక పనివాణ్ణి రప్పించి అక్కడ తవ్వించారు. ఒక స్వర్ణపాత్ర బయటపడింది. ఆ తర్వాత మరో అయిదు బంగారు పాత్రలు బయటపడ్డాయి. వాటిలో నాలుగింటికి కుక్క తల ఆకారంలో సున్నితంగా మలచిన కాడలు ఉన్నాయి. ఒకటి ఏ అలంకారమూ లేకుండా సాదాగా ఉంది. ఆపైన బంగారు తీగనుంచి మలచిన ఎన్నో ఉంగరాలు, రెండు స్వర్ణముద్రలు బయటపడ్డాయి. వాటిలో ఒకదాని మీద కొన్ని జంతువుల తలలు, మొక్కజొన్న కంకులు చిత్రితమై ఉన్నాయి. రెండోది మాత్రం కళాఖండమని చెప్పవచ్చు.

అది అమ్మ(Mother Goddess)వారికి చెందిన స్వర్ణముద్ర. మొదటి సమాధిలో దొరికిన బంగారు ముసుగులానే ఇది కూడా మైసీనియా ప్రజల ప్రగాఢ మతవిశ్వాసానికి అద్దంపడుతోంది. దాని మీద  అమ్మవారికి  నైవేద్యం ఇస్తున్నట్టు సూచించే చిత్రం ఉంది. అది కూడా అతి నిరాడంబరంగా ఉంది. దేవాలయం, పీఠం, తెరలు, తంతులు మొదలైనవి లేవు. అమ్మవారు ఒక పవిత్రవృక్షం కింద కూర్చుని ఉంది. తలపై పువ్వులు తురుముకుంది. ఆమె చేతిలో కూడా పువ్వులు ఉన్నాయి. కులీనతను చాటే ఇద్దరు యువతులనుంచి పువ్వులు స్వీకరిస్తోంది. బహుశా వాళ్ళు పూజారిణులు కావచ్చు. అమ్మవారి ఎదురుగా నిలబడిన ఒక పరిచారిక ఆ ఇద్దరినీ అమ్మవారికి చూపుతోంది. ఇంకొక పరిచారిక చిన్న రాతిగుట్టను ఎక్కి పవిత్రవృక్షఫలాన్ని తెంపుతోంది. అది అమ్మవారికి నివేదన చేయడానికి కావచ్చు. ముడతలు, ముడతలుగా ఉండి, మంచి అల్లికపని చేసిన జోడులంగాలను అందరూ ధరించారు. వీరుల యుగానికి చెందిన మైసీనియా సంస్కృతిలో అలాంటి జోడు లంగాలనే ధరించేవారు. అమ్మవారిలానే అందరూ నగ్నవక్షాలతోనూ, తలపై పువ్వులు, ఇతర అలంకారాలతోనూ ఉన్నారు.

పూజారిణులకు, అమ్మవారికి మధ్యలో రెండు జంట గొడ్డళ్ళు ఉన్నాయి. వాటిలో ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. ఈ జంట గొడ్డళ్ళు బహుశా లౌకిక, పారలౌకిక శక్తులను రెంటినీ సూచిస్తూ ఉండచ్చు. పూజారిణులకు పైన; శిరస్త్రాణామూ, చేతిలో ఖడ్గమూ ధరించిన ఒక యువతి గాలిలో తేలుతున్నట్టు ఉంది. ఆమెను ఎనిమిది(8)అంకె ఆకారంలో ఉన్న ఒక డాలు కప్పి ఉంది. మనకు తెలిసినంతవరకు ఒక సాయుధ దేవతను చిత్రిస్తున్న తొలిచిత్రం ఇదే. ఈమెకు ఒక పక్కన ఉజ్వలంగా ప్రకాశిస్తున్న సూర్యుడు, చంద్రవంక చిత్రాలు ఉన్నాయి. అవి మధ్యాహ్నాన్నీ, రాత్రినీ కూడా సూచిస్తున్నాయి.

ఈ చిత్రంలోని వ్యక్తులందరిలో ప్రశాంతత, పవిత్రత ఉట్టిపడుతున్నాయి. అప్పటి జనం, జీవితంపట్ల ధీమాతో ఎంతో ప్రశాంతజీవనం సాగిస్తున్న సంగతిని ఈ స్వర్ణముద్రలోని ప్రతి వివరం సూచిస్తోంది. ఈ ముద్ర ఎంత చిన్నదంటే, ఒక అంగుళం వెడల్పును మించిలేదు. కళాకారుడు అంత చిన్న ముద్రలోనే శతాబ్దాలుగా సంతరించుకున్న మతవిజ్ఞానాన్ని అంతటినీ అద్భుతంగా రంగరించాడు. స్వర్గశక్తి కాంతి రూపంలో వలయాలు వలయాలుగా కిందికి ప్రవహిస్తోంది. పవిత్రమైన తోపులో కూర్చుని ఉన్న అమ్మవారి నుంచి అదే శక్తి పొంగిపొరలుతోంది. పూజారిణులలో వినయవిధేయతలకు బదులు,  ఒక హక్కుగా తాము అమ్మవారి దగ్గర ఉన్నామన్న భావన కనిపిస్తోంది.  అమ్మకు నివేదన చేయడంలో ప్రేమాభిమానాలు తొంగిచూస్తున్నాయి. ఈజిప్టు చిత్రాలలో దేవతలకు నివేదన చేసేటప్పుడు భక్తులలో కనిపించే దాస్యభావన వీరిలో కనిపించడంలేదు. వీరిలో ఒక మానవీయమైన ఆత్మగౌరవం, హుందాతనం వ్యక్తమవుతున్నాయి. సూర్య, చంద్ర కాంతులలో స్నానమాడుతూ స్వేచ్ఛగా సంచరించేవారిలా కనిపిస్తున్నారు.

ఈ స్వర్ణముద్ర సంకేతించే పూర్తి అర్థమేమిటో తెలియదు. చిత్రానికి ఒక పక్కన ఆరు విచిత్రమైన వస్తువులు కనిపిస్తున్నాయి. అవి బంగారు ముసుగులో, కపాలాలో, శిరస్త్రాణాలో, పవిత్రపుష్పాలో లేక మరొకటో తెలియదు. ఆ పవిత్రవృక్షం దేనిని సూచిస్తోందో కూడా చెప్పలేం. స్టెమటేక్స్ నుంచి అతి కష్టం మీద ఈ స్వర్ణముద్ర ఫోటో ను సంపాదించి పరిశీలించిన స్లీమన్, అందులోని చెట్టు ఫలాలు అనాసలో లేదా మధ్య అమెరికాలో తను చూసిన పనస తరహా పండ్లో కావచ్చు ననుకున్నాడు.  అందులోని స్త్రీలు శిరస్త్రాణం లాంటిది ధరించారనుకున్నాడు. వాళ్ళలో కనిపించే పురుషలక్షణాలు అతనికి విస్తుగొలిపాయి. వాళ్ళ లంగాలకు ఉన్న పట్టీలు చంద్రవంక ఆకారంలో ఉన్నాయనుకున్న స్లీమన్, అలాంటి చంద్రవంక రూపాలే స్వర్ణముద్ర అంతటా ఉన్నాయని అనుకున్నాడు. సూర్య, చంద్రుల కింద అలలు అలలుగా ఉన్న గీతలు సముద్రాన్ని సంకేతిస్తున్నాయని ఊహించాడు. అవి స్వర్గకాంతి వలయాలనూ, లేదా పాలపుంతనూ కూడా సూచిస్తూ ఉండచ్చు.

అఖిలెస్ కోసం ఈఫెస్టస్ (లోహపు పని చేసే గ్రీకు దేవుడు) అయిదు వలయాలు కలిగిన ఓ పెద్ద డాలును ఎలా తయారు చేశాడో ఇలియడ్ లో హోమర్ వర్ణించాడు.  మొదటి వలయం భూమి, ఆకాశం, సముద్రం, అలుపనేది ఎరగని సూర్యుడు, పూర్ణచంద్రుడు, నక్షత్రమండలాలను సూచిస్తుంది. స్లీమన్ మొదటిసారి అమ్మవారి స్వర్ణముద్రను చూసినప్పుడు ఉత్తేజితుడయ్యాడు. “అఖిలెస్ డాలుకు ఈఫెస్టస్ ఎలాంటి మహిమలు కల్పించాడో వర్ణించిన హోమర్, బహుశా ఈ స్వర్ణముద్రను చూసి ఉంటా”డని తన పక్కనే ఉన్న సోఫియాతో అన్నాడు. అంతటి విశిష్టమైన స్వర్ణముద్ర మొదట తన కంట పడనందుకు ఎంతో విచారించాడు. అయితే, తను కనుక ఇంజనీర్ ను పంపి ఉండకపోతే అది ఎప్పటికీ బయటపడేదే కాదనుకుని ఊరడిల్లాడు.

మైసీనియాలో తను కనుగొన్న విశేషాలకు పుస్తకరూపమిస్తూ ఎనిమిది వారాలు గడిపాడు. వెంటనే దానిని ఫ్రెంచ్, ఇంగ్లీష్ లలోకి అనువదించడం ప్రారంభించాడు. ఆ తర్వాత, తన పుస్తకానికి పరిచయవ్యాసం రాయవలసిందిగా బ్రిటిష్ రాజకీయ కురువృద్ధుడు, గొప్ప హోమర్ అధ్యయనవేత్త అయిన  గ్లాడ్ స్టన్ ను కోరాడు. తన ప్రశంసకు అపార్థాలు కల్పించవచ్చునని భయపడి గ్లాడ్ స్టన్ అందుకు వెనకాడాడు. వేసవిలో లండన్ సందర్శించిన స్లీమన్ తనతో ట్రాయ్ నిక్షేపాలను తీసుకువెళ్లి, సౌత్ కెన్సింగ్టన్ మ్యూజియంలో వాటిని ప్రదర్శింపజేశాడు. గ్లాడ్ స్టన్ కు అవి నిజంగానే ట్రాయ్ నిక్షేపాలన్న నమ్మకం చిక్కకపోయినా, స్లీమన్ పాండిత్యానికి ముగ్ధుడై చివరికి నలభై పుటల పరిచయవ్యాసం రాసి ఇచ్చాడు.

అమ్మవారి స్వర్ణముద్ర ప్రత్యేకించి గ్లాడ్ స్టన్ ను ఆకట్టుకుంది. తొలి సమాధిలో కనిపించిన కళేబరం అగమెమ్నన్ దే కావచ్చని స్లీమన్ లానే ఆయనా అనుకున్నాడు. రూపురేఖలు పదిలంగా ఉన్నాయి కనుక, దానిని భద్రపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారనీ, మృతుడు ఒక విశిష్ట వ్యక్తి అయినప్పుడే అలా జరుగుతుందనీ భావించాడు. అగమెమ్నన్ వెంట ఎప్పుడూ ఇద్దరు పురోహితులు ఉండి హెచ్చరికుల పాత్ర నిర్వహిస్తూ ఉంటారని ఇలియడ్  చెబుతోంది కనుక, సమాధిలో ఈ కళేబరం పక్కనే కనిపించిన రెండు కళేబరాలూ నిస్సందేహంగా వాళ్ళవే అయుంటాయని గ్లాడ్ స్టన్ అనుకున్నాడు.

లండన్ లో తను పొందిన గౌరవాదరాలకు స్లీమన్ పొంగిపోయాడు. గ్లాడ్ స్టన్ తో కలసి విందుభోజనం చేశాడు. ఎథెన్స్ లో అస్వస్థతతో ఉన్న సోఫియాకు తంతి మీద తంతి పంపించాడు. ఆమె పక్కన లేకుండా అతను ఎక్కువ రోజులు గడపలేడు. ఎట్టకేలకు, రాయల్ ఆర్కియలాజికల్ సొసైటీ సభ్యులు ఆమెను ప్రసంగానికి ఆహ్వానించడంతో వెంటనే లండన్ వచ్చి భర్త పక్కనే వేదికను అలంకరించింది. ఇరవై అయిదు రోజుల పాటు, సమాధులలోని పురాతన మైసీనియా రాజులు, రాణుల కళేబరాల మధ్య మోకాళ్ళ మీద కూర్చుని వాటిని కప్పిన మట్టి పొరలను తను ఎంత జాగ్రత్తగా తొలగించిందో సరళమైన ఇంగ్లీష్ లో వివరించింది. కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. ప్రశంసాసూచకంగా స్లీమన్ చిరునవ్వు చిందించాడు. ఆమె ప్రసంగ పాఠాన్ని తనే రాసి ఇచ్చాడు. ఒక్క తప్పు కూడా  లేకుండా లేకుండా రాసింది రాసినట్టు ఆమె అప్పగించినందుకు సంతోషించాడు. అంతకు మించిన సంతోషం అతన్ని త్వరలోనే ముంచెత్తబోతోంది. అప్పుడామె గర్భవతి. కొడుకు పుట్టబోతున్నాడు. పేరు కూడా స్లీమన్ ముందే నిర్ణయించేశాడు: అగమెమ్నన్!

పద్దెనిమిది మాసాలపాటు ప్రశంసల జల్లులో పులకరిస్తూ గడిపిన తర్వాత, 1878 వేసవిలో తిరిగి తవ్వకాలను చేపట్టాడు. ఈసారి ఇథకాలోని ఒడీసియస్ ప్రాసాదాన్ని కనుక్కోగలననుకున్నాడు. మౌంట్ అయోటిస్ పైన జూలైలో రెండు వారాలపాటు తవ్వకాలు జరిపించాడు. 190 ఇళ్ల శిథిలాలు తప్ప విలువైన వేవీ కనిపించలేదు. దాంతో తవ్వకాలు విరమించాడు.

మరోసారి ట్రాయ్ వైపు గాలి మళ్ళింది.  అక్కడ తవ్వకాలను కొనసాగించడానికి  టర్కీ ప్రభుత్వం నుంచి ఫర్మానా పొందడంలో ఈసారి గ్లాడ్ స్టన్ సాయంతోపాటు, కాన్ స్టాంట్ నోపిల్ లో బ్రిటిష్ రాయబారిగా ఉన్న ఆస్టెన్ లేయర్డ్ సాయం కూడా లభించింది. అసీరియన్ల నగరం నినవే(Nineveh)ను కనుగొన్న పురావస్తు నిపుణుడిగా లేయర్డ్ ప్రసిద్ధుడు. టర్కీ ప్రభుత్వం ఫర్మానా ఇస్తూనే ముందు జాగ్రత్తగా తవ్వకాల పర్యవేక్షణకు ఒక స్పెషల్ కమిషనర్ ను, పదిమంది పోలీసులను నియమించింది.

హిస్సాలిక్ కు వెళ్ళడం స్లీమన్ కు ఇది ఆరోసారి. సెప్టెంబర్ లో పని ప్రారంభించాడు. రెండు మాసాలవరకూ విలువైనవేవీ దొరకలేదు. 1878 అక్టోబర్ 21న, బ్రిటిష్ యుద్ధనౌకకు చెందిన కొందరు అధికారుల సమక్షంలో ప్రియామ్ ప్రాసాదం తాలూకు ఈశాన్య ప్రదేశాన్ని కనుగొన్నాడు. తనకు మొదటి ట్రోజన్ నిక్షేపాలు దొరికిన ప్రదేశానికి ఇది ఆట్టే దూరంలో లేదు. ఇక్కడ 20 బంగారు కర్ణాభరణాలు, పెద్ద సంఖ్యలో బంగారు ఉంగరాలు, బంగారు-వెండి మిశ్రమంతో చేసిన రెండు పెద్ద కంకణాలు, 11 వెండి చెవిపోగులు, 158 వెండి ఉంగరాలు, లెక్కలేనన్ని బంగారు పూసలు బయటపడ్డాయి. మరికొన్ని రోజుల తర్వాత కొన్ని బంగారపు కడ్డీలు, బంగారు గుళ్ళు, ఒక స్వర్ణకంకణం, ఒక వెండి బాకు కనిపించాయి. నవంబర్ 26న తవ్వకాలు నిలిపివేశారు. ఈసారి మూడో వంతు నిక్షేపాలను మాత్రమే తన వద్ద ఉంచుకోడానికి స్లీమన్ ను అనుమతించారు. మిగిలివాటిని కాన్ స్టాంట్ నోపిల్ లోని ఇంపీరియల్ మ్యూజియం కు పంపించారు.

అంతవరకూ అతన్ని వరిస్తూ వచ్చిన అదృష్టం తదుపరి వసంతంలో ఆఖరి అంకానికి చేరబోతోంది. ఫిబ్రవరిలో ట్రాయ్ కు చేరుకుని ఎమిలీ బర్నాఫ్, రుడాల్ఫ్ ఫిర్కోల సాయంతో ట్రాయ్ లో తవ్వకాలు కొనసాగించాడు. నగర ప్రాకారాన్ని తవ్వి తీసి, హోమర్ ట్రాయ్ కు చెందిన పూర్తి రేఖాపటాన్ని తయారు చేయాలన్నది అతని ఆలోచన. ఏప్రిల్ లో కొన్ని బంగారు చక్రాలు, గొలుసులు, చెవిపోగులు, కంకణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అతనికి ఎలాంటి నిక్షేపాలూ కనిపించలేదు. ఒకప్పుడు అపార స్వర్ణసంపదతో అలరారే మూడు పట్టణాలు ఉండేవని హోమర్ చెప్పాడు. అవి: ట్రాయ్, మైసీనియా; బియోషా (Boeotia)లోని ఒకప్పటి గొప్ప నగరమైన అర్కమెనోస్. హోమర్ ను పరమప్రమాణంగా భావించే స్లీమన్, మరుసటి సంవత్సరం  అర్కమెనోస్ లో తవ్వకాలకు పూనుకున్నాడు. కానీ అతను ఆశించినట్టు స్వర్ణనిక్షేపాలు బయటపడలేదు.

అతని అదృష్టాధ్యాయం అంతటితో ముగిసింది!

(సశేషం)

 

 

 అగమెమ్నన్ ముఖం తొడుగు దొరికింది!

MaskOfAgamemnon

స్లీమన్ కథ-26

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఈసారి స్లీమన్ కు అన్నింటికన్నా ఎక్కువ ఆశ్చర్యం కలిగించినవి, అసంఖ్యాకంగా ఉన్నబంగారు బిళ్ళలు. ఈ ఒక్క సమాధిగదిలోనే అవి ఏడువందలకు పైగా లెక్కకొచ్చాయి.  ఆకులు, సీతాకోకచిలుకలు, ఆక్టోపస్ లు, నక్షత్రాలు, పొద్దుతిరుగుడు పువ్వులు…ఇలా అవి వివిధ ఆకృతులలో ఉన్నాయి. కొన్ని పూర్తిగా రేఖాగణితనమూనాలలో ఉన్నాయి. ఇవి యోధుల చేతిలోని డాలును సూచించే సంక్షిప్త రూపాలని స్లీమన్ అనుకున్నాడు. కానీ మరణానంతర జీవితంలో వెంట ఉండే  సామగ్రిని సూచించే ప్రతీకలు కావచ్చు.

స్వర్ణముద్రలతోపాటు పెద్ద సంఖ్యలో స్వర్ణఫలకాలు ఉన్నాయి. వీటిలో అంగుళం మించి వెడల్పు ఉన్న ఫలకాలు చాలా తక్కువ. పర్షియాలో జరిపిన తవ్వకాలలో దొరికిన సైరస్, గ్జెరెక్సెస్ ల కాలం నాటి సంక్షిప్త స్వర్ణ ఫలకాలకు ఇవి భిన్నంగా ఉన్నాయి.  కళాకారుడు బంగారు రేకులను తీసుకుని సింహాలు, రాబందులు, చేపలు, జింకలు, గద్దలు, హంసలుగా మలిచాడు. వాటిలో జీవం ఉట్టిపడుతోంది. ఇవి బహుశా మృతుల దుస్తులకు కుట్టిన అలంకారాలు అయుంటాయి.

మూడో సమాధిలో మూడు అస్థిపంజరాలు కనిపించాయి. ఎముకలు, దంతాల పరిమాణాన్ని బట్టి అవి స్త్రీలకు చెందినవని స్లీమన్ అనుకున్నాడు. కానీ కవచాలు ధరించిన రాజు, ఇద్దరు రాకుమారులకు చెందినవి కావచ్చు. ఎముకల మధ్య ఒక బాకు, బంగారు తాపడంతో వెండితో చేసిన రెండు రాజదండాలు ఉన్నాయి.

మూడో సమాధి తెరచుకోవడంతో, మిగిలిన ఆగొరా మొత్తంలో తవ్వకాలకు స్లీమన్ సిద్ధమయ్యాడు. ఎక్కడనుంచి ప్రారంభించాలో మొదట అర్థం కాలేదు. అంతలో, ఆగొరాలోని మిగిలిన చోట్లకు భిన్నంగా మూడో సమాధికి పశ్చిమదిశలో మట్టి నల్లగా ఉన్నసంగతిని అతను గమనించాడు. అక్కడ 15 అడుగుల లోతున తవ్వించాడు. కుండ పెంకులు తప్ప ఏమీ కనిపించలేదు. మరో 9 అడుగుల  లోతున తవ్వేసరికి నాలుగు అడుగుల ఎత్తైన ఒక గుండ్రని వేదిక లాంటిది కనిపించింది. అది నూతి వరలా తెరచుకుని ఉంది.  మృతవీరులను సమాధి చేసి, వారి గౌరవార్థం దానిని నిర్మించి ఉంటారని స్లీమన్ అనుకున్నాడు. బహుశా  మృతవీరులను ఉద్దేశించి అందులోకి కానుకలు జారవిడిచి ఉంటారని కూడా ఊహించాడు. సుమేరియాకు చెందిన రాచసమాధుల దగ్గర కూడా ఇలాగే మట్టి గొట్టాలు లేదా బిలాల లాంటివి కనిపించాయి. వాటిలోంచి మృతులకు బలులు, కానుకలు అర్పించేవారు. అయితే, స్లీమన్ కాలానికి అక్కడ తవ్వకాలు జరగలేదు. కనుక స్లీమన్ సొంత ఊహ మీదే ఆధారపడ్డాడు. ఆ ఊహే నిజమన్న నిర్ధారణకు ఆ తర్వాతి నిపుణులు కూడా వచ్చారు.

ఆ గుండ్రని నిర్మాణం అడుగున మరో మూడు అడుగులు తవ్వించాడు. స్వర్ణనిక్షేపాలతో నిండిన మరో సమాధి కనిపించింది. బంగారమూ, నగలూ కప్పిన మరో అయిదు కళేబరాలు కనిపించాయి. వాటిలో మూడు బంగారు ముసుగులు(ముఖాచ్ఛాదనలు) ధరించి ఉన్నాయి.  నాలుగవ కళేబరం శిరసు దగ్గర వంగిన మరో బంగారు ముసుగు కనిపించింది. అది సింహశిరస్సు ఆకారంలో ఉంది. అది శిరస్త్రాణం కావచ్చని స్లీమన్ అనుకున్నాడు.

ఈ నాలుగు ముసుగుల్లోనూ ఒకటి, మనిషి కవళికలను గుర్తించలేనంతగా శిథిలమైంది. కొన్ని నిమిషాలపాటు దానిని తదేకంగా చూస్తూ;  ఎత్తైన నుదురు, పొడవాటి గ్రీకు నాసిక, పలచని పెదవులతో చిన్న నోరు ఉన్న ఒక యువకుడి ముఖాన్ని అందులో పోల్చుకోడానికి  స్లీమన్ ప్రయత్నించాడు. ఈ ముసుగుకు స్పష్టమైన రూపురేఖలు లేకపోయినా, రెండు ముసుగులు మాత్రం ఆ నాలుగవ సమాధి వైభవానికి అద్దం పడుతున్నాయి. వాటిలోంచి ఓ అధికారమూ, ఆధిపత్యంతో పాటు దారుణమైన అందం తొంగి చూస్తోంది. వాటిపై మృత్యుచ్చాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. భయానకమైన కవళికలే తప్ప ప్రశాంతత కనిపించడం లేదు. ఈజిప్టు ఫారోల శవపేటికలపై ఉన్న ముసుగులకు ఇవి భిన్నంగా ఉన్నాయి. దారువుపై చిత్రించిన ఈజిప్టు ఫారోల ముసుగులలో పవిత్రత, ప్రశాంతత ఉట్టిపడుతూ ఉంటాయి. మైసీనియా ముసుగుల సరళి వెనుక మరేదో ప్రయోజనాన్ని ఉద్దేశించి ఉంటారని స్లీమన్ అనుకున్నాడు. కళాకారుడు వాటిని ఆ వ్యక్తులు జీవించి ఉన్నప్పటి ముఖాలుగా తయారు చేయలేదు. వాటిపై మృత్యుచ్చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి వేర్వేరు వ్యక్తులకు చెందిన  చిత్తరువులు కావచ్చునని కూడా స్లీమన్ అనుకున్నాడు. మృత్యుచ్చాయలు కనిపిస్తున్నా; నిస్సందేహంగా ప్రతి మూసుగూ వేర్వేరు వ్యక్తుల ముఖాన్నే సూచిస్తోందనీ, అలా కాని పక్షంలో అన్ని ముసుగులూ ఒకే మూసలో ఉండేవనీ రాసుకున్నాడు.

అవి వేర్వేరు వ్యక్తుల చిత్తరువులనే అనుకున్నప్పటికీ, జీవించి ఉన్నప్పుడు వారిని గుర్తుపట్టడానికి వీలైన దాదాపు అన్ని కవళికలూ చెరిగిపోయేంతగా కళాకారుడు వాటిని సరళీకరించి దాదాపు అమూర్తస్థాయికి కుదించాడు. ఒక ముసుగుపై కళ్ళు గోళాల్లానూ, ముఖంలోంచి పొడుచుకు వచ్చేలానూ ఉండి మృత్యువు రూపుగట్టే శూన్యతను సంకేతిస్తున్నాయి. ఇంకో ముసుగుపై నుదురు ఎత్తుగా ఉంది.  పెదవులు బిగుసుకుని అతుక్కునిపోయినట్టు ఉండి మరణబాధను సూచిస్తున్నాయి. పెరూలో కనిపించిన అచ్చం ఇలాంటి బంగారు ముఖాచ్ఛాదనల్లానే ఇవి కూడా చనిపోయిన ఆయా వ్యక్తుల చిత్తరవులను మించి, మృత్యుచిత్రాలులా కనిపిస్తున్నాయి.  వాటిలో ఒక అభౌతికమైన అందం ప్రకాశిస్తోంది. మరణించిన కొన్ని గంటల తర్వాత రాజులు, రాకుమారుల ముఖాలు ఎలా ఉన్నాయో అలాగే మలచడానికి కళాకారుడు ప్రయత్నించాడు తప్ప; ఎక్కువ వివరాలు చూపాలని అనుకోలేదు. అన్ని ముఖాలూ దాదాపు దేవతాముఖాలను తలపిస్తున్నాయి. మరణించిన పాలకులలో దివ్యాంశను సూచిస్తూ, తాము జీవించి ఉండగా చలాయించిన దివ్యాధికారాన్నే; మరణించిన తర్వాత కూడా వెంట నిలుపుకున్నారని చెప్పడం కళాకారుడి ఉద్దేశంలా కనిపిస్తుంది.

ఈ ముసుగులు వీక్షకులను భయసంభ్రమాలకు గురిచేస్తాయి. పాశ్చాత్య చరిత్ర పొడవునా చిత్రకారులు అనేకులు మృత్యువు రూపురేఖలు పట్టుకుని చిత్రించడానికి  ప్రయత్నించారు. కానీ ఈ అజ్ఞాత మైసీనియా చిత్రకారులంతగా సఫలులైనవాళ్లు చాలా అరుదు. మన నాగరికత తొలి నాళ్లకు చెందిన ఈ ముసుగు చిత్రాలు  మృత్యువును ఎంతో నిర్భయంగానూ, శక్తిమంతంగానూ, సరళంగానూ చిత్రించిన తీరు అసాధారణమనిపిస్తుంది.

అయితే, ఈ ముసుగుల వాస్తవిక ప్రయోజనం ఏమిటో ఎవరికీ తెలియదు. హోమర్ కానీ, మరో గ్రీకు పండితుడు కానీ ఇలాంటి మృత్యు ముఖాచ్ఛాదనల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వాటిని మృతుల ముఖాలకు చుట్టి, వాటి సూత్రాలను చెవులకు చేసిన రంధ్రాలలో దూర్చి కట్టారు. దురదృష్టవశాత్తూ, ఆ అయిదుగురు మృతుల కపాలాలూ, భద్రపరచడానికి వీలులేనంతగా శిథిలమయ్యాయి. అవి బయటపడినప్పుడు వాస్తవంగా ఏ భంగిమలో ఉన్నాయో తెలియదు. బంగారు ముసుగులూ; కళేబరాల దగ్గర చెల్లా చెదరుగా పడున్న స్వర్ణాభరణాలూ మన కళ్ళముందు కనిపిస్తున్నాయి కానీ; ఆ రాతి సమాధుల్లో మృతదేహాలను ఎలా ఉంచేవారో, ఎలాంటి తంతు జరిపేవారో- ఆ మొత్తం సన్నివేశాన్ని ఇప్పుడు ఊహించుకోగలిగినంతగా మనకు ప్రాచీన గ్రీసు గురించిన పరిజ్ఞానం లేదు.

చదునుగానూ, విరిగీ ఉన్న సింహపు శిరస్సును మొదటిసారి చూసినప్పుడు శిరస్త్రాణం కాబోలని స్లీమన్ అనుకున్నాడు.  అందులో ఉండాల్సిన చిన్న చిన్న ముక్కలు మాయమయ్యాయనిపించింది. దానిని మరోసారి చేతిలోకి తీసుకుని నిశితంగా పరిశీలించాడు.  అందులో సింహపు కళ్ళను, చెవులను, ముట్టెను పోల్చుకుంటూ, అది కచ్చితంగా ముఖం మీద ధరించే ముసుగు అయుంటుందనుకున్నాడు. అయితే, అనంతరకాలంలో, ముట్టె నుదుటిమీద ఆనేలా రాజులు సింహశిరస్సును శిరస్త్రాణాలుగా ధరించడం కనిపిస్తుంది.  అలెగ్జాండర్ నాణేల మీద అలాంటి శిరస్త్రాణమే ఉంటుంది. కనుక స్లీమన్ మొదట అనుకున్నదే నిజం కావచ్చు.

నాలుగవ సమాధిలో కనిపించిన స్వర్ణసంపద స్లీమన్ ను సైతం విచలితుణ్ణి చేసింది. బంగారు ముసుగులు అందులో స్వల్పభాగం మాత్రమే. రెండు కళేబరాల మీద స్వర్ణ వక్షస్త్రాణాలు(breast plates)ఉన్నాయి. ఇంకో కళేబరం మీద చంచలించే ఆకులున్న కిరీటం ఉంది. పదకొండు గుండ్రని భారీ స్వర్ణపాత్రలు ఉన్నాయి. వాటిలో ఒకదాని చేతులపై రెండు పావురాలు ఎంతో సున్నితంగా చెక్కి ఉన్నాయి. ఆ పాత్ర అచ్చంగా ఇలియడ్ లో వర్ణించిన నెస్తార్ కు చెందిన మద్యపాత్రలా ఉంది [నెస్తార్: మైసీనియాలోని ఒక పట్టణమైన పీలోస్ ను పాలించిన రాజనీతిజ్ఞుడైన రాజు. ఇలియడ్ ప్రకారం, ట్రోజన్ యుద్ధంలో గ్రీకుల పక్షాన పోరాడాడు. మహాభారతంలోని భీష్ముడిలా మూడు తరాలను చూసిన వీరుడు, మంచి సలహాదారు] “బంగారు సూచికలు (పిన్నులు) పొదిగి, రెండు పావురాలతో అలంకృతమైన” పాత్రగా దానిని ఇలియడ్ వర్ణించింది. ఆపైన బంగారు వడ్డాణాలు, జడకట్లు(రిబ్బన్లు), మోకాలి దగ్గర కట్టుకునే ఒక బంగారు పట్టీ, ఒక బంగారు కవచం, బంగారు పతకాలు, పిన్నులు; ఒక అంగుళం కంటే చిన్నవిగా ఉన్న రెండు తలల బంగారు గొడ్డళ్ళు, బంగారు రేకులు ఆచ్ఛాదించిన 12 భారీ బొత్తాలు, నాణేలను తలపిస్తున్న 400 కు పైగా స్వర్ణముద్రలు,  150 బంగారు బిళ్ళలు, ఒక బంగారు చేప, కత్తి పిడులుగా  మలచి ఉపయోగించినట్టు అనిపిస్తున్న 10 బంగారు రేకులు, రాగి కాగులు, కంచుతో చేసిన మొనదేలిన కత్తులు, బంగారు కొమ్ములతో ఉన్న ఒక వెండి గోవు శిరస్సు కనిపించాయి. ఈ సమాధిలో కనిపించిన అనేక వస్తువుల్లానే గోశిరస్సు కూడా పవిత్రతను చాటే తెగ(tribe)చిహ్నం అయుంటుంది. కళ్ళకు మిరుమిట్లు గొలిపే ఈ స్వర్ణరాశి మధ్యనే ఆశ్చర్యకరంగా లెక్కలేనన్ని ఆల్చిప్పలు కనిపించాయి. వీటిలో కొన్నింటిని అసలు తెరవనేలేదు.

తను ట్రాయ్ లో కనుగొన్న నిక్షేపాల కన్నా ఎక్కువ నిక్షేపాలు ఈ ఒక్క నాలుగవ సమాధిలోనే స్లీమన్ కు కనిపించాయి. ఈసారి దానికి నేరుగా ఉత్తరం వైపున తవ్వకాలు ప్రారంభించాడు. క్రమంగా అయిదవదీ, చివరిదీ అయిన సమాధి బయటపడింది. అందులో దోపిడీ జరిగిన ఆనవాళ్ళు కనిపించాయి. ఒక్క కళేబరం మాత్రమే ఉంది. అది కూడా పూర్తిగా శిథిలమై పొడి పొడిగా రాలిపోయేలా ఉంది. పక్కనే ఒక స్వర్ణకిరీటం, ఒక బంగారు పానపాత్ర, ఒక ఆకుపచ్చని కలశం, స్వల్ప సంఖ్యలో మట్టి బొమ్మల శకలాలు కనిపించాయి.

ఇంతకుముందు మొదటి సమాధి దగ్గర తవ్వకాలు ప్రారంభించినప్పుడు అది బురదతో నిండిపోవడం వల్ల పని ఆగిపోయింది. కొన్ని వారాలపాటు బాగా ఎండ కాయడంతో ఆ బురద ఎండిపోయి తిరిగి అక్కడ పని ప్రారంభించే అవకాశం కలిగింది. మొదట్లో అది ఖాళీగా ఉన్నట్టు అతనికి అనిపించింది. కానీ మరింత లోతుగా తవ్వేసరికి మూడు కళేబరాలు కనిపించాయి. వాటి పక్కనే కొద్దిపాటి నిక్షేపాలు ఉన్నాయి. వాటిలో రెండు బంగారు ముసుగులున్నాయి.  ఒకదాని కపాలానికి ఇప్పటికీ కొంచెం చర్మం అతుక్కుని ఉంది. పైన పడిన శిథిలాల బరువువల్ల ఆ కళేబరం అణిగి సాపుగా మారిపోయింది. ముక్కు లేదు. అయినా ముఖంలో గుర్తించగలిగిన కవళికలు కనిపిస్తున్నాయి. స్లీమన్ దానిని చూస్తూనే ఉత్తేజం పట్టలేకపోయాడు. ఆ ముఖంలో అతనికి అగమెమ్నన్ పోలికలు కనిపించాయి!

అది గుండ్రంగా ఉండి, ముప్పై అయిదేళ్ళ పురుషుడి ముఖంలా కనిపించింది. అన్ని దంతాలూ పటిష్టంగా ఉన్నాయి. ఒక పెద్ద స్వర్ణ వక్షస్త్రాణాన్ని ధరించి ఉన్నాడు. అతని నుదుటి మీదా, వక్షస్థలం మీదా, తొడల మీదా బంగారు ఆకులు పరచి ఉన్నాయి. అతని ముఖానికి పక్కనే పడున్న బంగారు ముసుగు సాపుగా అయిపోయింది. స్లీమన్ దానిని చేతుల్లోకి తీసుకుని పెదవులకు తాకించి ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఎథెన్స్ లోని మంత్రికి తంతి పంపించాడు. ఈ చివరి సమాధిలో కనుగొన్న మూడు కళేబరాలలో ఒకదాని ముఖంలో తను ఎంతో కాలంగా ఊహించుకుంటున్న అగమెమ్నన్ పోలికలు కనిపిస్తున్నాయనీ, ఆ ముఖ కవళికలను భద్రపరచడానికి చిత్రకారుని పంపవలసిందిగా నాప్లియోకు తంతి పంపాననీ అందులో తెలియజేశాడు.

ఆ పురాతన వీరుని కళేబరాన్నీ, దాదాపు భద్రస్థితిలో ఉన్న అతని ముఖాన్నీ చూడడానికి ఆర్గోస్ మైదాన ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దాని బొమ్మ గీయడానికి నాప్లియోనుంచి ఒక చిత్రకారుని రప్పించారు. శాస్త్రీయపద్ధతుల్లో భద్రపరిచే లోపల అది ఎక్కడ పొడి పొడి అయిపోతుందో నని భయపడుతూ  స్లీమన్ రెండురోజులపాటు ఆ పనులను పర్యవేక్షించాడు. ఆర్గోస్ నుంచి ఒక నిపుణుడు వచ్చి దాని మీద ఒక ద్రావణాన్ని పోసాడు. దాంతో అది గట్టిపడిన వెంటనే దానిని విజయవంతంగా ఎథెన్స్ కు తరలించారు.

నాలుగవ సమాధిలో దొరికిన విస్తారమైన స్వర్ణరాశులతో పోల్చితే,  దోపిడీ ఆనవాళ్ళు కనిపిస్తున్న మొదటి సమాధిలో దొరికినవి నామమాత్రమే కానీ; వాటిలో కూడా స్వర్ణపాత్రలు, స్వర్ణ వక్షస్త్రాణాలు, 12 బంగారు పలకలు ఉన్నాయి. ఆ పలకల్లో కొన్నింటిపై జింకలను సింహాలు వేటాడుతున్న చిత్రాలు ఉన్నాయి. ఆపైన బంగారు పిడులు ఉన్న 80 కంచు ఖడ్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా పదునుగా ఉన్నాయి. ఇంకా, ఒక కరవాలం తాలూకు బంగారు కుచ్చు, ఒక వీరుడి కళేబరం మీద పొడవాటి బంగారు పట్టీలు ఉన్నాయి. అన్నింటిలోనూ విశేషంగా చెప్పదగినది ఇక్కడ దొరికిన బంగారు ముసుగు. అది మిగిలిన ముసుగులన్నిటికన్నా చాలా అందంగా ఉంది.

మైసీనియాలో స్లీమన్ కనుగొన్నవాటిలో ఈ ముసుగే చివరిది. మిగిలిన వాటిలో లేని ఒక పరిపూర్ణత దీనిలో ఉంది. మిగిలినవి మృత్యువును శక్తిమంతంగా సూచిస్తున్నాయి కానీ, వాటిలో మర్త్యత్వం ఉంది. కానీ ఈ ముసుగులో శక్తిమంతతే కాక; ఒక పవిత్రత, నైర్మల్యం, ఉదాత్తత ఉట్టిపడుతున్నాయి. ఇతర ముసుగులు ఆయా వీరుల అంతిమక్షణాలలోని మృత్యుచ్ఛాయలను సూచిస్తూ ఉంటే, ఈ ముసుగు వాటికి భిన్నంగా ఒక వీరుడు దేవుడిగా మారిన క్షణాలను సూచిస్తోంది. అందులో మర్త్యత్వపు ఆనవాళ్ళు కాకుండా, కేవలం ప్రసన్నత తొంగి చూస్తోంది. విశాలమైన నేత్రాలు మూసుకుని ఉన్నాయి. కనురెప్పలు స్పష్టంగా గుర్తించబడి ఉన్నాయి. పలచని పెదవులు ఒక మార్మికమైన చిరునవ్వును వెలార్చుతూ మూసుకుని ఉన్నాయి. గెడ్డం ఉన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కనుబొమలు దట్టంగా చెక్కి ఉన్నాయి. మొత్తంగా ఆ కనుబొమలు, మీసాలు, పెదవులపై ఆ చిరునవ్వు ముఖానికి ఒక విచిత్రమైన లోతును సంతరిస్తున్నాయి. క్రీస్ట్ ఆఫ్ డఫ్నె[అలబామా, అమెరికాలో ఉన్న ప్రసిద్ధ కేథలిక్ చర్చి], చేఫాలు[ఇటలీలో, సిసిలీ ఉత్తరతీరంలో, పలేమో రాష్ట్రంలో ఉన్న నగరం], పలేమో [ఇటలీ దీవి అయిన సిసిలీ రాజధాని. 12వ శతాబ్దికి చెందిన ఇక్కడి కెథెడ్రల్ ప్రసిద్ధమైనది. ఇక్కడ రాచ సమాధులు ఉన్నాయి]వంటి అద్భుతనిర్మాణాలతో పోల్చదగిన ఆ ముఖం, ప్రాచీన చిత్రకళ సాధించిన ఉన్నతికి అద్దంపడుతోంది.

ట్రాయ్ లో దొరికిన స్వర్ణహారకిరీటాలు, మైసీనియాలో దొరికిన స్వర్ణకిరీటాలు, విస్తారమైన మిగతా స్వర్ణరాశులు అప్పటి జనం ఇంకా మోటుగానూ, అనాగరికదశలోనూ ఉన్నట్టు సూచిస్తున్నాయి. సైనికులను చిత్రించిన కలశం నాటి యోధులు యుద్ధానికి ఎలా వెళ్ళేవారో చెబుతోంది. సమాధులలో దొరికిన బంగారు నగలు ఉత్సవ సందర్భాలలో వాళ్ళు ఎలా అలంకరించుకునేవారో వెల్లడిస్తున్నాయి. ఈ ఒక్క ముఖాచ్ఛాదన మాత్రం దేవతలపట్ల వారు ఎంత ప్రగాఢమైన భక్తిగౌరవాలను చాటేవారో సూచిస్తోంది.

మైసీనియాలో స్లీమన్ తవ్వకాలు ముగిశాయి.

(సశేషం)

 

 

 

 

 

మతి పోగొట్టిన మైసీనియా స్వర్ణ సంపద

 

స్లీమన్ కథ-25

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఆ కలశం మీద చిత్రితులైన సైనికులు కొమ్ము శిరస్త్రాణాలు ధరించి ఉన్నారు. వాటి మీద తురాయిలు రెప రెప లాడుతున్నాయి. ఈజిప్టుసేనలకూ, ‘సాగర భూములనుంచి వచ్చిన’ వారికీ మధ్య జరిగిన యుద్ధాల తాలూకు చిత్రాలలోని సైనికులు కూడా ఇలాగే కొమ్ము శిరస్త్రాణాలు ధరించి కనిపిస్తారు. మైసీనియా కలశం మీద చిత్రించిన సైనికుల చేతుల్లో పొడవైన బల్లేలు, అర్థచంద్రాకారపు భారీ డాళ్ళు ఉన్నాయి. బల్లేలకు మద్యం సీసాలు తగిలించి ఉన్నాయి. సైనికుల కవచాల మీద చిన్న చిన్న వక్షస్త్రాణాలు ఉన్నాయి. వాటిని బహుశా ఒక లోహపు పట్టీతో బిగించుకున్నారు. కవచాలు వాళ్ళ తొడల దాకా ఉన్నాయి. వాటికి కుచ్చులు వేలాడుతున్నాయి. కాళ్ళకు మేజోళ్ళు ఉన్నాయి. స్లీమన్ అవి వస్త్రంతో చేసినవని అనుకున్నాడు కానీ, బహుశా కవచం లాంటివే అయుంటాయి. శిరస్త్రాణాలపై తెల్లని చుక్కలు ఉన్నాయి. చిత్రకారుడు ఆ చుక్కల ద్వారా  కంచులోహపు మెరుపును సూచిస్తున్నాడని స్లీమన్ అనుకున్నాడు. కానీ, ఆ తర్వాత కొన్ని రోజులకే అతనికి దొరికిన ఇంకో కలశం తాలూకు శకలం మీద ఉన్న చిత్రాన్ని చూస్తే; సైనికులు ధరించినవి తోలు శిరస్త్రాణాలనీ, వాటి మీద కనిపించే తెల్లని చుక్కలు లోహపు చీలలనీ అనిపిస్తుంది.

స్లీమన్ కు ఎక్కువగా విస్తుగొలిపినవి, శిరస్త్రాణాలకు ఉన్న కొమ్ములు. “వాటి ఉపయోగం ఏమిటో నాకు ఏమాత్రం బోధపడలేదు. హోమర్ కాలం నాటి శిరస్త్రాణాలపై అలాంటివి ఉండేవని అనుకుందామంటే హోమర్ వాటి గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు ” అని రాసుకున్నాడు. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం స్లీమన్ పరాకు చిత్తగించాడు. ఎందుకంటే, ఇలియడ్ మూడో అధ్యాయంలో , మెనెలాస్, పారిస్ ల ద్వంద్వ యుద్ధం సందర్భంలో హోమర్ కొమ్ము శిరస్త్రాణాలను ప్రస్తావించాడు: “మెనెలాస్ వెండి తాపడం చేసిన తన ఖడ్గాన్ని ఒక్క ఊపుతో పైకెత్తి శత్రు శిరస్త్రాణం కొమ్ముమీద మోదాడు. అప్పుడా ఖడ్గం ముక్క ముక్కలైపోయి అతని చేతిలోంచి జారిపోయింది” అని రాశాడు. ఖడ్గ ప్రహారాన్ని కాచుకోవడం కోసమే ఆ కొమ్ము. దాంతోపాటు;  కొమ్ములు దృష్టి దోషాన్ని నివారిస్తాయనీ, యోధుడి పుంస్త్వాన్ని నొక్కి చెబుతాయనీ, తనకు అదనంగా మరో కన్ను ఉందన్న భావనను అతడిలో కలిగిస్తాయనీ భావించారు. శిరస్త్రాణాలలో రెండు కొమ్ములు ఉన్నవీ, నాలుగు కొమ్ములు ఉన్నవీ కూడా కనిపిస్తాయి. శిరస్త్రాణాలపై కొమ్ములు ఒక్కోసారి మేక కొమ్ముల్లా మెలితిరిగి ఉంటాయి.

సైనికులు కవాతు చేస్తూ సాగుతూ ఉంటే వారి మార్గానికి ఎడమ వైపున యువతులు నిలబడి చేతులు ఊపుతున్నారు.  ఆవిధంగా,  వారి శిరస్త్రాణాలపై ఉన్న కొమ్ములు మరో ముఖ్యమైన సూచన కూడా చేస్తున్నాయి.* శిరస్త్రాణాలపై అలంకరించిన తురాయిలు ఈకల్లా కనిపిస్తున్నాయి తప్ప, గుర్రపు వెంట్రుకల్లా కాదు. సైనికులు పొత్తికడుపు దగ్గర వెడల్పాటి దళసరి లోహపు పట్టీని ధరించి ఉన్నారు. అది హోమర్ వర్ణించిన మిత్రే(mitre)ని తలపిస్తోంది. సైనికులు ధరించిన కాలితొడుగు(leggings)లకు అడుగున వెండిపట్టాల లాంటివి ఉన్నాయి. హోమర్ చిత్రించిన కాలితొడుగులకు కూడా ఒక్కోసారి వెండి పట్టాలు ఉంటాయి. సైనికుల ముక్కులు పొడవుగానూ, కళ్ళు వెడల్పుగానూ, గడ్డం తీరుగా కత్తిరించబడీ కనిపిస్తున్నాయి. అనంతరకాలంలో, వందల ఏళ్ల తర్వాత పర్షియన్ సేనలతో పోరాడిన గ్రీకు సైనికులు కూడా అచ్చం ఇలాగే కనిపిస్తారు. వారు కూడా నృత్యభంగిమలో కవాతు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా చిత్రాలలో కనిపిస్తారు. ఈవిధంగా ఈ పగిలిన కలశం అసాధారణరీతిలో గ్రీసు పురాచరిత్రను చెబుతోంది.**

***

OLYMPUS DIGITAL CAMERA

నెలలు గడుస్తున్నాయి. ఆగొరా(agora)లో దొరికిన నాలుగు సమాధిరాళ్ళ శకలాలు, సైనికుల చిత్రం ఉన్న కలశం తప్ప చెప్పుకోదగినవేవీ దొరకలేదు. మండుటెండలో, పొద్దుటి నుంచి సాయంత్రంవరకూ 125 మందితో స్లీమన్ తవ్వకాలు జరిపిస్తున్నాడు. మైసీనియా మొత్తాన్ని వేడి వేడి ధూళి మేఘాలు కమ్మేస్తున్నాయి. అతని కళ్ళు మండిపోతున్నాయి. ఎండతోపాటే అతని చిటపటలు పెరిగిపోతున్నాయి. ఇంకోపక్క అధికారులతో ఘర్షణ విడుపు లేకుండా సాగుతూనే ఉంది.

సందర్శకులు వస్తున్నారు. కుండ పెంకులు, పూసలు, మృణ్మయమూర్తులు మినహా వాళ్ళలో ఆసక్తిని నింపే గొప్ప విశేషాలేవీ అక్కడ లేవు. బ్రెజిల్ చక్రవర్తి దియోడెమ్ పేద్రో-2 తవ్వకాలను చూడడానికి కోరింత్ నుంచి వచ్చాడు. ఈ విశిష్ట సందర్శకుని రాకకు స్లీమన్ పొంగిపోయాడు. ఏట్రియస్ కోశాగారంగా పిలిచే ఓ భూగర్భ సమాధివద్ద అతనికి గొప్ప విందు ఇచ్చాడు. అది చాలా కాలంగా ప్రసిద్ధిలో ఉన్న ప్రదేశం కనుక, విలువైనవేవీ దొరకకపోవచ్చునన్న ఉద్దేశంతో అక్కడ తవ్వకాలు చేపట్టలేదు. తను ట్రాయ్ లో కనుగొన్నట్టే ఇక్కడ కూడా నిధినిక్షేపాలను కనుగొంటానని చక్రవర్తితో స్లీమన్ అన్నాడు. చక్రవర్తి చిరునవ్వు నవ్వాడు. స్లీమన్ చెప్పుకునే గొప్పల గురించి గ్రీకు అధికారులు అతన్ని ముందే హెచ్చరించారు. సమాధులపై అతను ఆసక్తిని చూపించాడు. మనిషి గుంభనంగానూ, సామాన్యంగానూ కనిపించినా అందంగా ఉన్నాడు. మాటలో, నడకలో మర్యాద ఉట్టిపడుతోంది. అతని పురావస్తు పరిజ్ఞానం స్లీమన్ ను ఆశ్చర్యచకితం చేసింది. అతన్ని ఆకాశానికి ఎత్తేశాడు. “పురాతన నాగరికతలపట్ల అవగాహన పెంపొందడానికి మీరు అమూల్యమైన దోహదం అందిస్తున్నా”రంటూ చక్రవర్తి కూడా స్లీమన్ పై ప్రశంసలు కురిపించాడు.

ఉబ్బు తబ్బిబ్బు అయిపోయిన స్లీమన్ అతనికి చిత్రిత మృణ్మయ పాత్రల తాలూకు శకలాలను కొన్నింటిని బహూకరించాడు.  అయితే, చక్రవర్తి వచ్చి వెళ్ళిన కొన్ని రోజులకు ఒక విషయం తెలిసి ఒకింత ఆశ్చర్యపోయాడు. లియోనీదస్ లియొనార్దో అనే పోలీస్ కెప్టెన్ చక్రవర్తి భద్రతకు బాధ్యుడిగా అతని వెంటే ఉన్నాడు. పోలీస్ సిబ్బంది అంతా పంచుకోండంటూ చక్రవర్తి ముష్టి విదిల్చినట్టు అతనికి నలభై ఫ్రాంకులు ఇచ్చాడు.  లియొనార్దోకు చక్రవర్తి వెయ్యి ఫ్రాంకులు బహూకరించాడనీ, నలభై ఫ్రాంకులే ఇచ్చినట్టు అతను అబద్ధం చెబుతున్నాడనీ మిగతా పోలీస్ సిబ్బంది అనుకున్నారు. దానిపై విచారణ జరిగి లియొనార్దోను ఉద్యోగం నుంచి తొలగించారు.

ఆ పోలీస్ కెప్టెన్ స్లీమన్ కు బాగా తెలిసినవాడు. అతనిపై తీసుకున్న చర్యకు స్లీమన్ మండిపడ్డాడు. అతను ఎలాంటి తప్పూ చేసి ఉండడంటూ ఎథెన్స్ లోని ప్రధానమంత్రికి తంతి పంపాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో, బ్రెజిల్ చక్రవర్తి కైరోలో ఉన్నట్టు తెలిసి నేరుగా అతనికే తంతి పంపాడు:

ఏలినవారు నాప్లియో నుంచి వెళ్ళేటప్పుడు, పోలీసులందరికీ పంచమని కోరుతూ కెప్టెన్ లియోనీదస్ లియొనార్దోకు నలభై ఫ్రాంకులు ఇచ్చారు. కానీ, ఏలినవారినుంచి వెయ్యి ఫ్రాంకులు తీసుకున్నాడంటూ, ఎంతో ఉత్తముడైన ఆ వ్యక్తి మీద నాప్లియో మేయర్ నింద మోపాడు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అతను జైలు పాలు కాకుండా చూడడం కోసం నేను విశ్వప్రయత్నం చేస్తున్నాను. అతను నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ఎంతో నిజాయితీపరుడు. కనుక  ఏలినవారు అతనికి వాస్తవంగా ఎంత మొత్తం ఇచ్చారో తెలుపుతూ తంతి పంపవలసిందని, పవిత్ర సత్యమూ, మానవత్వాల పేరిట ప్రార్థిస్తున్నాను.

పోలీస్ కెప్టెన్ కు తను నలభై ఫ్రాంకులే ఇచ్చినట్టు తెలుపుతూ చక్రవర్తి వెంటనే తంతి ఇచ్చాడు. దాంతో లియొనార్దోను తిరిగి ఉద్యోగంలో నియమించారు.

వేసవి గడిచింది. వర్షాలు ముంచెత్తుతుండడంతో తవ్వకాలు జరుగుతున్న ఆగొరా దగ్గర అంతా బురద బురద అయిపోయింది. అయినా పని కొనసాగింది. అక్టోబర్ మధ్యలో ఆగొరాలో లోతుగా తవ్వకాలు జరుపుతుండగా ఒక పెద్ద రాతి వాలుమీద, 20 అడుగుల పొడవూ, 10 అడుగుల వెడల్పుతో మలచిన ఒక సమాధి బయటపడింది. దొంగలు దోచుకున్నారనడానికి గుర్తుగా చెల్లా చెదురుగా పడున్న కొన్ని బంగారు బొత్తాలు, రాతి పలకలు, దంతపు కొమ్ములు కనిపించాయి. అవి సమాధి గది తాలూకు అలంకారసామగ్రి కాబోలని స్లీమన్ అనుకున్నాడు. మరింత దక్షిణంగా, ఆ వలయ కేంద్రానికి దగ్గరగా తవ్వకాలు కొనసాగించారు. 15 అడుగుల లోతున ఒక గులకరాయి పొర తగిలింది. ఆ పొర అడుగున మూడు కళేబరాలు కనిపించాయి. వాటిని మట్టి, చితాభస్మంలా కనిపిస్తున్న బూడిద దట్టంగా కప్పేసాయి.  వాటిలోంచి బంగారపు మెరుపులు తొంగి చూస్తున్నాయి.

చేతికి అందేటంత దూరంలో స్వర్ణనిక్షేపాలు ఉన్న సంగతి స్లీమన్ కు అర్థమైంది. ఇంకోవైపు ప్రభుత్వ అధికారులు నీడలా తనను వెన్నంటి ఉన్న సంగతీ తెలుసు. ట్రాయ్ లో నిక్షేపాలను కనిపెట్టిన క్షణాలలోలానే ఒక్కసారిగా విపరీతమైన ఆందోళనతో, ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరైపోయాడు. అప్పటిలానే సహాయం కోసం సోఫియావైపు చూశాడు. అతనెంత ఉద్రిక్తతకు, ఉత్తేజానికీ లోనయ్యాడంటే; ఆ అస్థిపంజరాలను కప్పిన మట్టిని తొలగించడానికి కూడా అతనికి చేతులు ఆడలేదు. చటుక్కున సోఫియాయే వాటి పక్కన ఉన్న ఖాళీ జాగాలోకి దూరి వెళ్ళి జేబుకత్తితో మట్టిని తొలగించింది.

ఒక్కో కళేబరం దగ్గరా అయిదేసి స్వర్ణకిరీటాలు ఉన్నాయి.  రెండు కళేబరాల దగ్గర అయిదేసి బంగారు శిలువ ఆకృతులూ, ఇంకో కళేబరం దగ్గర అలాంటివే నాలుగూ ఉన్నాయి.  వాటి చేతులను పొన్న ఆకుల రూపంలో మలచారు.  ట్రాయ్ లో దొరికిన స్వర్ణహార కిరీటాలు విస్తారమైన నగిషీపనులతో అట్టహాసంగా ఉంటే; పలచని బంగారు రేకుల మీద వలయాలు, గుబ్బల వంటి అలంకారాలను చెక్కిన మైసీనియా స్వర్ణకిరీటాలు సీదా సాదాగా ఉన్నాయి.

వాటి దగ్గరే చిన్న చిన్న లావా కత్తులు, తొడుగులు  చెల్లా చెదురుగా పడున్నాయి. ఒక వెండి పాత్ర ఉంది. అక్కడ అగ్నికి సంబంధించిన ఆధారాలను చూసిన స్లీమన్, మృతదేహాలను దహనం చేశారా, లేక కాల్చారా అన్న సందేహానికి లోనయ్యాడు. సమాధికి అడుగున ఉన్న గులకరాళ్ళు చితికి గాలి, వెలుతురు ప్రసరించడం కోసమే ననుకున్నాడు.  మృతదేహాన్ని దహనం చేయడం కాక; కాల్చి ఎముకలనుంచి మాంసాన్ని వేరు చేయడం మైసీనియన్ల ఆచారంగా నిర్ణయానికి వచ్చాడు.  ఆ తర్వాత మరో పురావస్తునిపుణుడు విల్హెమ్ డార్ఫెల్డ్ (1853-1940) కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించాడు. స్లీమన్ చూసే నాటికి ఆ మూడు కళేబరాల తాలూకు అస్థిపంజరాల ఆకృతులు స్పష్టంగా గుర్తించేలా ఉన్నా, తేమ వల్ల దెబ్బతిని త్వరలోనే వాటి రూపు చెడింది. మైసీనియా నిక్షేపాలు ప్రస్తుతానికి పదిహేను స్వర్ణకిరీటాలుగా, పద్నాలుగు బంగారు శిలువలుగా లెక్క తేలాయి.

OLYMPUS DIGITAL CAMERA

ఈసారి స్లీమన్ సింహద్వారా(Lion Gate)నికి మరింత దూరంగా, సమాధి కేంద్రానికి పక్కనే తవ్వకాలు జరపాలని నిర్ణయించాడు. 9 అడుగుల లోతున మరికొన్ని అస్థిపంజరాలు, వాటి దగ్గరే లావా కత్తులు కనిపించాయి కానీ; నిక్షేపాలేవీ కనిపించలేదు. ఒకింత విస్తుపోతూనే తవ్వకాలను కొనసాగించాడు. మొదటి సమాధి దగ్గర ఏమీ దొరకకపోయినా, రెండో సమాధి దగ్గర కొద్దిపాటి నిక్షేపాలు కనిపించాయి. అయితే, మూడో సమాధి దగ్గర కొంచెం తవ్వేసరికే అస్థిపంజరాల అడుగున అనూహ్యమైన స్వర్ణసంపద కళ్లను జిగేలుమనిపించింది.  మొత్తం గది అంతా ఎర్రటి కాంతులు విరజిమ్మే స్వర్ణాభరణాలతో కిక్కిరిసిపోయింది.

అప్పటికి పనివాళ్లను చాలామందిని పంపేశారు. నాటి కోశాగారాలుగా భావించిన తావుల వద్ద సైనికులు కాపలా కాస్తున్నారు. మరోసారి సోఫియా ఆ అస్థిపంజరాల మధ్యకి, స్వర్ణ సంపద మధ్యకి దూరి వెళ్లి, ఆ రాచ సమాధులను కప్పిన మట్టిని తొలగించింది. పలచని బంగారు రేకుల మీద సున్నితంగా మలచిన ఆకృతులు ఎక్కడ తింటాయోనన్న భయంతో ఎంతో జాగ్రత్తగా, ఓపికగా, నెమ్మదిగా ఆ పని చేసింది. రెండో సమాధిలో ఉన్నట్టే ఇందులోనూ మూడు కళేబరాలు ఉన్నాయి. అందులో ఒకటి స్వర్ణకిరీటాన్ని ధరించి ఉంది. ముప్పైకి పైగా బంగారపు ఆకులు దానికి వేళ్ళాడుతున్నాయి. రాజు ఆ కిరీటాన్ని ధరించినప్పుడు ఈ బంగారపు ఆకులు చంచలిస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి. ఇది గాక మరో ఎనిమిది స్వర్ణకిరీటాలు, ఆరు బంగారు శిలువలూ(వీటిలో కొన్ని విపరీత అలంకారం కలిగిన రెండుపేటల శిలువలు), వెండి కాడకు అమర్చిన బంగారు పువ్వు కనిపించాయి. ఆపైన కొన్ని స్వర్ణ హారాలు, గుండ్రని పాత్రలు, కలశాలు, మద్యం జారీలు కనిపించాయి. వీటిలో కొన్నిటికి చక్కని బంగారు తీగలు తాపడం చేసిన బంగారు మూతలు ఉన్నాయి. అలాగే, ప్రకాశించే రాతి స్ఫటికగోళాలు కొన్ని కనిపించాయి. బహుశా రాజుల కరవాలాలకు పిడులుగా వాటిని ఉపయోగించి ఉండవచ్చు.

                                                                                                               (సశేషం)

*ఇది THE GOLD OF TROY  రాసిన ROBERT PAYNE చేసిన వ్యాఖ్య. కొమ్ము పురుషుడి శృంగార సామర్థ్యానికి, అంటే పుంస్త్వానికి కూడా చిహ్నమన్న పరోక్షసూచన ఇందులో ఉంది. ఇదే శీర్షిక కింద నేను రాసిన ‘గణపతి కొమ్ము కిరీటం చెప్పే ‘శృంగార’గాథ’(సారంగ/21-05-2015) చూడగలరు. ‘శృంగం’ (కొమ్ము) అనే మాట నుంచే ‘శృంగారం’ అనే మాట పుట్టిందని రాంభట్ల కృష్ణమూర్తి అంటారు.

** పైన వివరించిన సైనికుల చిత్రం గ్రీసు పురాచరిత్రను చెప్పడంతోపాటు, పురాతన భారతదేశంలో, ఉదాహరణకు కురుక్షేత్రయుద్ధంలో సైనికులు ఎలాంటి ఆహార్యం ధరించేవారన్న ఆసక్తికర ప్రశ్నను ముందుకు తెస్తోంది. కవిత్రయభారతంలో కానీ, సంస్కృతభారతంలో కానీ సైనికుల ఆహార్యం గురించిన చిత్రణ ఉందేమో  పరిశీలించాలి. చరిత్రకారుల అంచనా ప్రకారం ట్రోజన్ యుద్ధం(జరిగి ఉంటే) క్రీ.పూ. 1334-1184ల మధ్య జరిగింది. కురుక్షేత్రయుద్ధం(జరిగి ఉంటే) క్రీ.పూ. 15-10 శతాబ్దుల మధ్య జరిగింది.  ఈ అంచనాలే నిజమైతే రెండు యుద్ధాలూ అటూ ,ఇటూ ఒకటి రెండు వందల ఏళ్ల తేడాతో జరిగి ఉండాలి. సైనికుల ఆహార్యమూ, ఆయుధాల విషయంలో రెంటి మధ్యా పోలికలు ఉన్నా ఆశ్చర్యం లేదు. అయితే, ఇది ప్రస్తుతానికి ఊహ మాత్రమే.

 

 

 

ఇది ఆర్ట్ ఆఫ్ డయింగ్!

 

 

-కల్లూరి భాస్కరం

~

 

కల్లూరి భాస్కరం

భారతదేశంలో ఈరోజున జరుగుతున్నది అక్షరాలా యుద్ధం…భావజాలాల మధ్య యుద్ధం. అందులో నాకైతే ఎలాంటి సందేహం లేదు. భావజాలఘర్షణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడది  యుద్ధ రూపం ధరించి, నానాటికీ తీవ్రమవుతోంది. యుద్ధంలోని ఒక పక్షం వారికి అదనంగా అధికారబలం ఉంది కనుక అది క్రమంగా భౌతికయుద్ధంగా కూడా మారుతోంది. అది దాని సహజపరిణామం. దేశద్రోహి మొదలైన ముద్రలు వేయడం…అరెస్టులు చేయడం…దాడులు చేయడం…న్యాయస్థానాలు సైతం భౌతికయుద్ధ క్షేత్రాలు కావడం…ఇదీ దాని క్రమం.

ఇప్పుడు జరిగే ఏ పరిణామాన్ని చర్చించడానికి పూనుకున్నా ఇది యుద్ధం అన్న స్పృహతోనే పూనుకోవలసి ఉంటుంది. ఇప్పుడు జరిగే ఏ పరిణామం గురించిన చర్చకైనా ‘యుద్ధం’ అన్నదే విశాల శీర్షిక. ‘రోహిత్ ఆత్మహత్య ఒక సరికొత్త/పాత సందర్భం’(సారంగ/జనవరి 23, 2016)అన్న నా వ్యాసాన్ని జరుగుతున్నది యుద్ధం అన్న ఉద్ఘాటనతోనే ముగించాను. ఇప్పుడు ఏది రాసినా దానికి కొనసాగింపే.

యుద్ధం అన్నప్పుడు సాధారణ నీతి నియమాలు, తర్క వితర్కాలు, హేతు నిర్హేతుకలు పక్కకు తప్పుకుంటాయి. యుద్ధం తనదైన నీతి నియమాలను, తర్కవితర్కాలను, హేతు నిర్హేతుకలను అనుసరిస్తుంది. యుద్ధమనే అసాధారణమైన ఒత్తిడిలో అందులో పాల్గొనే అన్ని పక్షాలలోనూ అదే జరుగుతుంది. ఏ మహాయుద్ధాన్ని తీసుకున్నా ఇందుకు సంబంధించిన ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మనకు బాగా తెలిసిన మహాభారతయుద్ధాన్నే తీసుకుంటే ఎంతో సత్యసంధుడు, ధర్మాత్ముడు అనుకునే ధర్మరాజు కూడా అబద్ధమాడతాడు. విరథుడు, నిరాయుధుడు అయిన సాటివీరుని అర్జునుడివంటి మహావీరుడు కూడా చంపుతాడు. అస్త్రసన్యాసం చేసిన గురువు శిరస్సును శిష్యుడే తెగనరకుతాడు.

యుద్ధమనే ఒత్తిడిలో శత్రువును చంపడమే కాదు, ఒక్కొక్కసారి ఆత్మహత్యలూ జరుగుతూ ఉంటాయి.

అయిదేళ్ళ కోసారి ‘ప్రజాస్వామికంగా’ మనదేశంలో జరిగే ఎన్నికల యుద్ధాలలో మనకు ఇలాంటి యుద్ధ పరిస్థితితో అనుభవం ఉంది. కాకపోతే ఈ యుద్ధపరిస్థితిని ఇప్పుడు అయిదేళ్లపాటూ చూడబోతున్నాం.

యుద్ధ సమయంలో నీతిబద్ధమైన, హేతుబద్ధమైన చర్చకు గల జాగా నానాటికీ తరిగిపోతూ ఉంటుంది. అక్షరక్షేత్రం కూడా సంకుల సమరవేదికగా మారి వాక్యం అర్థాన్ని, అన్వయాన్ని కోల్పోతూ రచన రణగొణ ధ్వనిగా పరిణమిస్తుంది. అక్షరక్షేత్రాన్ని కూడా బండ బలం, కండబలం ఉన్న శక్తులు ఆక్రమించుకుంటాయి. అర్థవంతంగా మాట్లాడాలని కోరుకునే శక్తులు క్రమంగా అస్త్రసన్యాసం చేయవలసివస్తుంది.

నేడు దేశం క్రమంగా ఇలాంటి సన్నివేశం వైపే సాగుతోంది. అర్థవంతమైన, హేతుబద్ధమైన చర్చకు జాగాను ఎంతవరకు కాపాడుకోగలమన్నది ఇప్పుడు మనముందు వేలాడుతున్న ప్రశ్న. అంతే కాదు, సవాలు.

***

అన్నీ ఆశ్చర్యాలే జరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన వాదాలే వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ న్యాయస్థానంలోనే, న్యాయమూర్తుల కళ్ళముందే నిందితుడి మీద న్యాయవాదులే దాడి చేసి కొట్టడం ఇటీవలి కాలంలో ఎప్పుడైనా చూసామా? ఒకసారి కాదు రెండుసార్లు! టీవీ తెరమీదికి వచ్చి ఇదే పని మళ్ళీ మళ్ళీ చేస్తామని ప్రకటించడం చూసామా? ఒకసారి కాదు; పదే పదే! ఇష్రత్ జెహాన్ అనే అమ్మాయి నిజంగా టెర్రరిస్టే అనుకుందాం. యూపీఏ ప్రభుత్వం అఫిడవిట్లను తారుమారు చేయడం ఘోరమనే అనుకుందాం. అందులోని న్యాయబద్ధతపై చర్చ జరగవలసిందే. నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిందే. కానీ అది జరుగుతున్నట్టుగా, అందులోని ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ కోణం చర్చలోకి రావలసినంతగా రావడంలేదు. దాని గురించి ప్రశ్నిస్తే, మీ హయాంలో ఎన్ని చోట్ల ఎన్ కౌంటర్లు జరగలేదు, వాటి గురించి మాట్లాడరేమని ప్రభుత్వంలోని వాళ్ళూ ప్రభుత్వపక్షంవాళ్ళూ ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానాలను యుద్ధక్షేత్రాలుగా మార్చడం; ఇతర ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ లను అడ్డు పెట్టుకుని ఇంకో ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ ను సమర్థించుకోవడం! ప్రభుత్వ, ప్రభుత్వపక్షాలే స్వయంగా ఆ పని చేయడం! అది చట్టానికీ, రాజ్యాంగానికి పాతర.

***

యుద్ధం అన్నప్పుడు దాని ప్రభావం సమాజం తాలూకు అన్ని అంగాలమీదా పడుతుంది. నీతి న్యాయం ధర్మమే కాదు; సమాజం, సాహిత్యం, మతం, సంస్కృతిసహా అన్నీ వక్రీకరణ చెంది వికృతికి లోనవుతాయి. తరతరాల అనుభవాల మీదా, అవగాహన మీదా, విశ్వాసాల మీదా గొడ్డలి పోట్లు పడతాయి.

యుద్ధం అన్నప్పుడు ‘మహావీరులు’ స్వయంభువులుగా హఠాత్తుగా విశ్వరూపంలో పుట్టుకొచ్చి యుద్ధ వేదికను ఆక్రమించుకుంటారు. గత కొన్ని రోజులలో అలా పుట్టుకొచ్చిన ఒక వ్యక్తి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవి శంకర్!

నేటి దేశవ్యాప్త యుద్ధ ప్రకంపనలకు ఎపి సెంటర్ అయిన ఢిల్లీలో, యమునా తీరంలో కొన్ని వేల ఎకరాల స్థలంలో ఎత్తైన వేదిక మీద, ఈ దేశ ప్రధాని తన పక్కనే నిలబడి ఉండగా, రొమ్ము విరుచుకుని తనను ప్రపంచస్థాయి వ్యక్తిగా ప్రకటించుకుంటూ వసుధైవకుటుంబకం అనే సూక్తిని వినిపిస్తుంటే చూసి అవాక్కయ్యాను. నా దేశంలో నేనే అపరిచితుడినైపోయినట్లు, నా తరతరాల అస్తిత్వాన్ని రూపు మాపే ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టు అనిపించింది. నిన్నటివరకు అనేకమంది అమాంబాపతు సాధు, సన్యాసులలో ఒకరని అనుకుంటున్న ఒక ఆధునిక సన్యాసి కాస్తా; నా ఇష్టాయిష్టాలతో పనిలేకుండా నా ప్రమేయంలేకుండా  ఒక్కసారిగా ఢిల్లీని ఆక్రమించుకుని యావద్దేశ ఆధ్యాత్మిక పురుషుడిగా ఆవిర్భవించినట్టు అనిపించింది. ఆ క్షణంలో ఆయన పక్కనే నిలబడి ఉన్న ప్రధాని స్వయంగా ఆయనను ఆధ్యాత్మిక చక్రవర్తిగా పట్టాభిషేకం చేశారనిపించింది. ఇంతవరకు మార్జిన్స్ లో ఉన్న వ్యక్తి ఆకస్మికంగా కేంద్రస్థానానికి వచ్చి ఆక్రమించుకున్నట్టు అనిపించింది.

శ్రీ శ్రీ రవిశంకర్ మీదా, ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ మీదా నాకు ఇంతవరకు ప్రత్యేకమైన వ్యతిరేకతను ప్రకటించుకోవాల్సిన అవసరం కనిపించలేదు. ఈ దేశంలో అనేక రకాలకు, అనేక పంథాలకు, అనేక శ్రేణులకు చెందిన ఆధ్యాత్మిక లేదా ఆధ్యాత్మిక ఆభాస కలిగిన వ్యక్తులున్నారు. ఎవరికి వారికి అనుచరులు ఉన్నారు. అనేక రంగాలలోలానే ఈ రంగంలో కూడా ఈ వైవిధ్యం ముందునుంచీ ఉన్నదే. సొంత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఈ వైవిధ్యాన్ని ప్రజాస్వామికంగా అర్థం చేసుకుంటున్నాం. శాంతిభద్రతలకు, ప్రజల విజ్ఞాన వివేకాలకు భంగం కలిగే వైపరీత్యాలు సంభవిస్తుంటే ఎత్తి చూపి ఖండిస్తున్నాం. అయితే, ఒకటి మాత్రం ఇంతవరకూ లేదు. వివిధ పంథాలలో ఎవరికి వారు మార్జిన్స్ లోనే ఉన్నారు తప్ప ఒక్కరే వచ్చి కేంద్రస్థానాన్ని ఆక్రమించుకోలేదు. ఎంతో వివాదాస్పదమైన, ప్రభుత్వ, సైనిక అండదండలున్న విశాల వేదికపై, ప్రధాని సాక్షిగా, వివిధ దేశాలకు చెందిన లక్షలాది జనం సమక్షంలో రవిశంకర్ అనే వ్యక్తి కేంద్రస్థానంలోకి వచ్చినట్టు మొదటిసారి కనిపించారు. సారం సంగతి ఎలా ఉన్నా సాంకేతికంగా చూసినప్పుడు ఎవరికైనా అదే అనిపిస్తుంది.

అదే నన్ను నా దేశంలో అపరిచితునిగా మార్చి దారుణంగా కుంగదీసిన పరిణామం.

అనేక కులాలు, మతాలు, సంస్కృతులు ఉన్న ఈ వైవిధ్యవంతమైన సమాజంలో సహజంగానే నేను కూడా ఒక కులానికి, మతానికి, సంస్కృతికి చెందినవాడిని. నాలానే ఇంకా కోట్లాదిమంది. నాకు ఈ దేశానికి సంబంధించిన వేల సంవత్సరాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విశ్వాస, జీవన సరళికి చెందిన వారసత్వం ఉంది. స్ఫూర్తిదాయకులైన ఆధ్యాత్మికపురుషుల వారసత్వం ఉంది. నాకు అవసరమనిపిస్తే ఆ వారసత్వాన్ని నేను ఉపయోగించుకుంటాను. ముఖ్యంగా జీవించే కళను నేను ఇప్పుడు కొత్తగా ఎవరి నుంచీ నేర్చుకోవలసిన అవసరంలేదు. నా వారసత్వంలోనే, నా కుటుంబంలోనే అందుకు సంబంధించిన మెళకువలు అందుతాయి. ఇంకా కావాలంటే నాకు భగవద్గీత ఉంది. రామాయణభారతభాగవతాలు ఉన్నాయి.

నేనంటే నేను ఒక్కడినే కాదు. నా సామాజిక నేపథ్యంలాంటి నేపథ్యం ఉన్న అనేకమంది. అలాగే నాకు భిన్నమైన సామాజిక నేపథ్యం ఉన్నవారికీ నాకు ఉన్నట్టే తమవైన వారసత్వాలు, స్ఫూర్తిదాయకాలు ఉన్నాయి. ఈ స్థితిలో నాకే కాదు; తమవైన వారసత్వ సంపద ఉన్న నాలాంటి చాలామందికి రవిశంకర్ అనే వ్యక్తితో కానీ, ఆయన చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ తో కానీ ఎలాంటి సంబంధమూ, అవసరమూ ఉండదు. ఆయన కానీ, ఆయన చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఉమ్మడిగా ఈ దేశంలోని అందరికీ అవసరమైనవీ, స్ఫూర్తినింపేవీ కానవసరంలేదు. మరి ఆయనతో, ఆయన చెప్పేవాటితో ఎవరు కనెక్టు అవుతారనే ప్రశ్న వస్తుంది. ఆధునికవిద్యవల్ల, ఆధునికతవల్లా సాంప్రదాయిక వారసత్వానికి దూరమైనవారికి ఆయనా, ఆయన చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆకర్షించవచ్చు. అలాగే విదేశీయులకు ఆకర్షించవచ్చు. దానిని వ్యతిరేకించాల్సిన అవసరమూ లేదు. ఎవరి అభిరుచి వారిది.

ఒకవేళ రవిశంకర్ ను కూడా ఈ దేశపు ఆధ్యాత్మికవారసత్వానికి ప్రతినిధిగానూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను ఆ వారసత్వ సారంగానూ ఎవరైనా భావిస్తూ ఉండచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ వ్యక్తి గానీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ మహారాజ పోషణలో కేంద్రస్థానాన్ని ఆక్రమించుకోవడమే ఇక్కడ సమస్య.  వైవిధ్యవంతమైన ఈ దేశపు స్వభావమూ, అస్తిత్వమూ అందుకు అవకాశమివ్వవు. అలా చేయడం ఈ దేశపు మౌలికతనే చెరచడం.

****

ఆశ్చర్యాలకు అంతేలేదు.

యమునా తీరంలో రవిశంకర్ వేదికను ముస్తాబు చేయడానికి సైన్యాన్ని బరిలోకి దింపడమే చూడండి. వివిధ ప్రభుత్వవిభాగాలు నిధులు సమకూర్చడమే చూడండి. పర్యావరణ సంబంధమైన అభ్యంతరాలు తలెత్తడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రవిశంకర్ కు 5కోట్ల జరిమానా విధించడం, తను జైలుకైనా వెడతాడు కానీ జరిమానా కట్టనని ఆయన ప్రకటించి ఒక తిరుగుబాటువీరుడిగా క్షణాలలో తన మూర్తిమత్వాన్ని పెంచుకోవడం, గ్రీన్ ట్రిబ్యునల్ తోకముడిచి ఆయన కార్యక్రమం నిరాఘాటంగా జరగడానికి అవకాశమివ్వడం… వరసగా చూడండి. ఆశ్చర్యం మీద ఆశ్చర్యం. యమునా తీరంలో గత కొద్దిరోజులలో తలెత్తినవి పర్యావరణవిధ్వంసం తాలూకు భయాలే  కాదు; నియమ నిబంధనలు, విలువలు, ఔచిత్యాలకు చెందిన విధ్వంసాన్ని చూశాం;  ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఒక వ్యక్తిముందు దాసోహమనడం చూశాం; వివాద నేపథ్యంలో ఈ దేశప్రథమపౌరుడైన  రాష్ట్రపతి ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా, ప్రధాని హాజరవడం అనే వింతను చూశాం.

రవిశంకర్ అనే వ్యక్తికి చెందిన కార్యక్రమంలో సైన్యాన్ని వినియోగించడాన్ని సమర్థించుకున్న తీరు ఇంకా దారుణం. కుంభమేళాలతో, ప్రకృతి వైపరీత్యాలతో, ఆసియన్ గేమ్స్ నిర్వహణతో పోలిక తెచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు జాతీయవిపత్తులు. ఆసియన్ గేమ్స్ నిర్వహణ జాతీయ కార్యక్రమం. కుంభమేళాలు సాంప్రదాయికంగా వందల సంవత్సరాలుగా జరుగుతున్న సామూహిక కార్యక్రమాలు. రవిశంకర్ అనే వ్యక్తి కన్నా సహస్రాంశాల చరిత్ర ఉన్న ఘటనలు అవి. రవిశంకర్ కార్యక్రమం ఎంత పెద్దదైనా కుంభమేళాతో పోల్చదగినది కాదు. అలా పోల్చడం అన్నివిధాలా బరితెగించడం. ఈ దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించడం. ఇంకా అవాచ్యం, ప్రధాని నరేంద్ర మోడీ రవిశంకర్ కార్యక్రమాన్ని సాంస్కృతిక కుంభమేళా అనడం. రవిశంకర్ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం హిందుత్వ వతిరేక ప్రతిపక్షాల కుట్రగా చిత్రించే ప్రయత్నంలో విచక్షణా వివేకాలను అజ్ఞానం పూర్తిగా హరించివేసిన ఫలితం ఇది. చివరికి ఆర్.ఎస్.ఎస్. వంటి హిందుత్వ పక్షాలు కూడా ఆధ్యాత్మిక చక్రవర్తిగా రవిశంకర్ పట్టాభిషేకాన్ని హర్షించి ఉంటాయని భావించలేం. కానీ రాజకీయప్రతిపక్షానికి గురిపెట్టే తహతహలో అవి కూడా మౌనం వహించి ఈ అజ్ఞాన వికట తాండవానికి నిశ్శబ్ద తాళం అందించాయి.

యుద్ధం కలిగించే ఒత్తిడిలో శత్రుహననాలే కాదు, ఆత్మహత్యలు కూడా ఉంటాయన్నది అందుకే. శ్రీ శ్రీ రవిశంకర్ అనే అత్యాధునిక సన్యాసి జరిపిన ఢిల్లీ ముట్టడికి, హిందుత్వ మౌన అంగీకారాన్ని తెలిపి ఆత్మహననానికి పాల్పడింది.

****

ఆర్ట్ ఆఫ్ లివింగ్ పట్ల ఇన్నేళ్లలోనూ నాకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ దేశపు అన్ని రకాల వైవిధ్యాలను, మత సాంస్కృతిక బహుళత్వాన్ని, ప్రభుత్వం తాలూకు నియమ నిబంధనలను, చివరకు ప్రభుత్వ అస్తిత్వాన్నీ, పర్యావరణస్పృహతో సహా అన్నింటినీ మృత్యుముఖంలోకి నడిపించగల ఆర్ట్ ఆఫ్ డయింగ్ గానే అది ఇప్పుడు రూపుగడుతోంది.

-భాస్కరం కల్లూరి

 

 

 

 

 

షరా మామూలుగా తవ్వకాలు, తగవులాటలూ…

 

స్లీమన్ కథ-24

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

తీరా మైసీనియాలో తవ్వకాలు ప్రారంభించ బోయేసరికి ఎక్కడినుంచి, ఎలా మొదలెట్టాలో స్లీమన్ కు వెంటనే తోచలేదు. ఆ ప్రాంతానికి చెందిన ఏవో స్థలపురాణాలు, విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో స్పష్టత ఉన్నవి తక్కువ. పైగా కొన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. అక్కడి వీరుల సమాధుల గురించిన ప్రామాణిక వివరణ పసన్నియస్ రాతల్లో లభిస్తోంది:

మైసీనియా శిథిలాల్లో ‘పెర్షా’ అనే ఒక జలయంత్రమూ; ఏట్రియస్ కు, అతని కొడుకులకు చెందిన భూగర్భ భవనాలూ ఉన్నాయి. వీటిలో నిధినిక్షేపాలను పాతిపెట్టారు.ఏట్రియస్ సమాధితోపాటు; ట్రాయ్ యుద్ధం నుంచి తిరిగొచ్చి, ఏగిస్త్వస్ ఇచ్చిన విందులో పాల్గొని, ఆ తర్వాత అతని చేతిలో హతులైన వాళ్ళ సమాధులూ ఉన్నాయి. అలాగే, అగమెమ్నన్, అతని రథసారథి ఎవ్రిమిడాన్, ఎలెక్త్రాల సమాధులూ; కవలపిల్లలైన తేలమస్, పెలోపస్ ల సమాధులూ ఉన్నాయి. కసండ్రా(ట్రాయ్ రాకుమారి, గొప్ప సౌందర్యవతి, ఒక కథనం ప్రకారం అగమెమ్నన్ ఉంపుడుగత్తె)కు పుట్టిన ఈ కవలలను పసితనంలోనే, తల్లిదండ్రులతోపాటు ఏగిస్త్వస్ హతమార్చాడని చెబుతారు. అగమెమ్నన్, తదితరుల సమాధులకు దగ్గరలో సమాధి చేయడానికి తగరన్న ఉద్దేశంతో క్లైటమెనెస్ట్రా, ఏగిస్త్వస్ లను ప్రాకారానికి ఒకింత అవతల సమాధి చేశారు.

మైసీనియాకు సంబంధించిన గ్రంథాలను, నాటకాలతో సహా, స్లీమన్ అధ్యయనం చేశాడు. వాటిని దాదాపు కంఠస్థం చేశాడు. వాటిలోని వర్ణనలను మననం చేసుకుంటూ వచ్చాడు. హోమర్ రచనలతో సమానంగా వాటిని కూడా ప్రామాణికంగా భావించి గౌరవించాడు. ట్రాయ్ పతనమైన 1300 ఏళ్ల తర్వాత పసన్నియస్ దాని గురించిన సమాచారాన్ని గ్రంథస్థం చేశాడు. కేవలం స్థలపురాణాలనే ఉన్నవున్నట్టు నమోదు చేశాడు. తను చిన్నప్పుడు హెన్నింగ్ వాన్ హోస్టీన్ కు చెందిన స్థానికగాథను నమ్మినట్టే స్లీమన్ వీటినీ నమ్మాడు. నిధినిక్షేపాలను పాతిపెట్టడం గురించిన కథలను మరింత నమ్మాడు.

పసన్నియస్ ఇచ్చిన సమాచారం గురించి ఆలోచిస్తున్నకొద్దీ తనకు ముందటి వ్యాఖ్యాతలు తప్పులో కాలేశారన్న అభిప్రాయం అతనిలో బలపడింది. వారి ప్రకారం, క్లైటమెనెస్ట్రా సమాధి నగరప్రాకారాలకు అవతల ఉంది. ఏట్రియస్, అగమెమ్నన్, అతనితోపాటు హతులైన వాళ్ళ సమాధులు ప్రాకారాలకు లోపల ఉన్నాయి. అయితే, పసన్నియస్ కాలానికే నగరప్రాకారాలు కుప్పకూలి కేవలం శిథిలాలు మిగిలాయి. అగమెమ్నన్ సమాధి నగరప్రాకారాల లోపల కాకుండా, గిరిదుర్గ ప్రాకారాల లోపల ఉందని చెప్పడం పసన్నియస్ ఉద్దేశమని స్లీమన్ భావించాడు. దాంతో, ట్రాయ్ లో సింహద్వారం దగ్గర నిక్షేపాలు లభించినట్టే, ఇక్కడా లభిస్తాయన్న నిర్ధారణకు వచ్చి సింహద్వారం దగ్గరే 1876 ఆగస్టులో తవ్వకాలు ప్రారంభించాడు. అరవైముగ్గురిని పనిలోకి తీసుకున్నాడు. ట్రాయ్ అనుభవంతో ముందే జాగ్రత్తపడిన ప్రభుత్వం, అతని కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచడానికి గ్రీకు పురావస్తు సంఘానికి చెందిన ముగ్గురు అధికారులను నియమించింది.

తనపై ఎవరు నిఘా పెట్టినా స్లీమన్ కు నచ్చదు. అందులోనూ అధికారులైతే కోపం నసాళానికి అంటుతుంది. సింహద్వారం అవతల రహదారిని మూసేస్తూ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. వాటిని తొలగించడానికి పనివాళ్ళను పురమాయించాడు. అధికారులు అభ్యంతరం చెప్పారు. నా ప్రణాళికకు అడ్డుతగులుతున్నారంటూ స్లీమన్ వాళ్లపై మండిపడ్డాడు. ఎప్పటిలా అధికారుల కళ్ళు కప్పడం కోసం పనివాళ్లను బృందాలుగా విడదీసి తలో చోటా పనిచేయించడం ప్రారంభించాడు. ఎండ విడుపులేకుండా దహిస్తోంది. దానికితోడు ఆ ప్రాంతమంతటా ధూళిమేఘాలు దట్టంగా కమ్మేశాయి. ఆ వాతావరణంతో పోటీపడి స్లీమన్ లో కోపతాపాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సందర్భాలలో అతనితో వాదనకు దిగడానికి ధైర్యం చాలని అధికారులు సోఫియాను కలసి ఫిర్యాదు చేయడం, ఆమె వీలైనంతవరకు వాళ్ళను శాంతింపచేయడానికి ప్రయత్నించడం, అది ఒక్కోసారి విఫలమవడం రివాజుగా మారింది.

పని వేగం పుంజుకుంటున్న కొద్దీ ఎక్కువమందిని పనిలోకి తీసుకున్నాడు. మరిన్ని గోడలను నేలమట్టం చేసేలా కనిపించాడు. ఈసారి అధికారులు మరింత గట్టిగా అభ్యంతరం చెప్పారు, గ్రీకు పురావస్తు సంఘం ముఖ్యప్రతినిధి స్టెమటేక్స్ ప్రభుత్వానికి ఇలా రాశాడు:

పురాతన కుడ్యాలను కూల్చడానికి గ్రీకు, రోమన్ తాలూకు పురావస్తువులనన్నింటినీ పగబట్టినట్టు ధ్వంసం చేసేస్తున్నాడు. గ్రీకు, రోమన్ కలశాలు కంటబడితే చీదరించుకుంటున్నాడు. వాటి తాలూకు ముక్కలను పారేస్తున్నాడు. నన్నో ఆటవికుడిగా చూస్తున్నాడు. నా విధినిర్వహణ మీకు సంతృప్తికరంగా లేకపోతే, దయచేసి నన్ను వెనక్కి పిలిపించండి. ఎందుకంటే, నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇక్కడ ఉంటున్నాను. రాత్రి తొమ్మిది వరకూ రోజంతా అతనితో కలసి తవ్వకాల దగ్గర గడుపుతున్నాను. ఆ తర్వాత, అర్థరాత్రి రెండువరకూ అతనితో కూర్చుని బయటపడిన పురావస్తువులను నమోదు చేస్తున్నాను. తను అధ్యయనానికి అవసరమంటే, కొన్ని వస్తువులను ఇంటికి పట్టుకెళ్లడానికీ అనుమతిస్తున్నాను.

దానిపై ప్రభుత్వం స్టెమటేక్స్ కు మరోసారి కచ్చితమైన ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం, ఏ గోడనూ కూల్చడానికి వీల్లేదు. తవ్వకాలు ఒకే సమయంలో అనేకచోట్ల జరగకూడదు. ఒక్కచోట మాత్రమే జరగాలి. పర్యవేక్షణకు వీలైన మేరకు పనివాళ్ళ సంఖ్యను పరిమితం చేయాలి. చివరగా, ఈ ఉత్తర్వుల ఉల్లంఘనే జరిగితే అందుకు స్టెమటేక్స్ బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

నాఫ్లియో ముఖ్యాధికారిని వెంటబెట్టుకుని స్టెమటేక్స్ జంకుతూనే వెళ్లి స్లీమన్ ను కలిశాడు. వీలైనంత మృదువుగా, మర్యాదగా పై ఉత్తర్వుల గురించి చెప్పాడు. అయినాసరే, స్లీమన్ భగ్గుమన్నాడు. స్టెమటేక్స్ ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించమని నాఫ్లియో ముఖ్యాధికారితో అన్నాడు. ఇలాంటి వాళ్ళతో తను క్షణం కూడా పనిచేయలేయనన్నాడు. మీరు చట్టాలకూ, ఒప్పందాలకూ లోబడి పనిచేయాలని స్టెమటేక్స్ అన్నాడు. ఇది ఒప్పందాలను ముందుపెట్టుకుని చేసే పనికాదని స్లీమన్ విరుచుకుపడ్డాడు…

ఈ అధికారులు వట్టి మూర్ఖులు, వీళ్ళకు ఏమీతెలియదు, పుండు సలిపినట్టు తనను సలుపుతున్నారు. భూగర్భంలో లోతుగా సమాధైన ఒక పురాతన నాగరికతకు చెందిన ఆనవాళ్లను బయటపెట్టడానికి తను ప్రయత్నిస్తున్నాడు. ఎంత పవిత్రమైన విధిని తను తలకెత్తుకున్నాడో వీళ్ళకు అర్థం కాదు. ఆధునిక శాస్త్రవిజ్ఞానం అందించిన అన్ని పద్ధతులనూ వినియోగించి ఈ  పురాతన నాగరికతా చిహ్నాలను పరిరక్షించడానికి సైతం తను సిద్ధంగా ఉన్నాడు. తను ఏం చేయాలన్నా తగినంత స్వేచ్ఛ ఉండాలి. ఈ అధికారులనే వాళ్ళు తన జోలికి రాకూడదు!…ఇదీ ఎప్పటిలానే స్లీమన్ వాదం.

స్లీమన్ నిప్పులు చెరుగుతుంటే, సోఫియా తెరవెనుక నిశ్శబ్దంగా ఉండిపోయింది. నాఫ్లియో ముఖ్యాధికారి ఎథెన్స్ నుంచి తనకు అందిన ఉత్తర్వును చదివి వినిపించాడు. ఒక పక్క, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యతాయుతుడైన అధికారి! ఇంకోపక్క, కేవలం గతానికి మాత్రమే జవాబుదారీగా వ్యవహరించవలసిన పురావస్తునిపుణుడు! వాతావరణం చాలా వేడెక్కిపోయింది. కోపంతో స్లీమన్ ముఖం ఎర్రబడిపోయింది. పనివాళ్లు పని ఆపేశారు.

నాఫ్లియో ముఖ్యాధికారి ఉత్తర్వులను చదివి వినిపించడం పూర్తయింది. అధికారుల ఉనికినే పట్టించుకోనట్టుగా స్లీమన్ వెంటనే పనివాళ్లవైపు తిరిగి, మీ పని మీరు కానివ్వండని హూంకరించాడు. అతని కళ్ళల్లోని ఎరుపును చూసి పనివాళ్లు భయపడ్డారు. అయిష్టంగానే మందకొడిగా పని మొదలు పెట్టారు. అదే రోజు సాయంత్రం సంబంధిత మంత్రిత్వశాఖకు స్లీమన్ మరో సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. తపాలాశాఖ మీద నమ్మకం లేక మరునాడు ఆ ఉత్తరం ఇచ్చి సోఫియాను ఎథెన్స్ కు పంపించాడు. సోఫియా ఆ ఉత్తరాన్ని స్వయంగా మంత్రికి ఇవ్వడమే కాదు, అప్పటికప్పుడు ఆయన చేత జవాబు రాయించి తీసుకురావాలి.

తవ్వకాలు కొనసాగాయి. స్లీమన్, స్టెమటేక్స్ ఒకరి పీకలు ఒకరు పట్టుకునే ఉన్నారు. ఆ కలహాల కాపురంలో మధ్య మధ్య రాజీలు, పరస్పర అభిమాన ప్రకటనలూ ఉన్నాయి. బెదిరింపులు, అనునయ వాక్యాలతో పై వాళ్ళకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే, తను అనుకున్న పద్ధతిలో పని చేసుకుంటూ పోయే కళలో స్లీమన్ ఇప్పటికే ఆరితేరాడు. మంత్రికి రాసిన ఉత్తరంలో గ్రీసు పట్ల తన అచంచలమైన ప్రేమను, పురావస్తు తవ్వకాల పట్ల నిబద్ధతను మరోసారి నొక్కి చెప్పాడు. నాఫ్లియో ముఖ్యాధికారికి పంపిన ఉత్తర్వులను ఏదో క్షణికావేశంతో పంపినవిగా తను భావిస్తున్నానన్నాడు. తననింత అవమానకరంగా చూస్తున్న దేశంలో తవ్వకాలు జరపాలన్న కోరిక కూడా నాలో చచ్చిపోతోందన్నాడు.

గ్రీకు, టర్కీ ప్రభుత్వాల దగ్గర ఇలాంటి ఉత్తరాలతో పెద్ద పెద్ద దస్త్రాలు తయారయ్యాయి. అతని ఎత్తుగడలను అవి ఇప్పటికే ఆకళించుకున్నాయి. కనుక పై ఉత్తరంలో రాసింది బూటకపు బెదిరింపని గ్రీసు ప్రభుత్వానికి తెలుసు. తవ్వకాలు విరమించి పోతానంటే ఆపకూడదని అనుకుంది. అయితే, గ్రీస్ ను విడిచిపెట్టి వెళ్ళే ఉద్దేశం సోఫియాకు లేదు. ఆమె కూడా నటనలో ఆరితేరినదే. భర్త పక్కన పెట్టని కోటలా నిలబడింది. ప్రతిపక్షులను చిత్తు చేయడంలో తన మెళకువలను అన్నిటినీ ప్రయోగించింది. స్లీమన్ వ్యూహాలను పక్కాగా అమలుచేయడంలో ఆమె పూర్తి భాగస్వామి  అనీ, అతని కన్నా కూడా అసలు కుట్రదారు ఆమే ననీ స్టెమటేక్స్ కు త్వరలోనే అర్థమైపోయింది. పెద్దమనిషి తరహా కలిగిన అతడు కూడా ఆంతరంగిక సంభాషణాల్లో ఆమెను “రాక్షసి’గా తిట్టిపోయడం ప్రారంభించాడు.

9f5321c5acc5ed373c5ef569c44a9f3b

తవ్వకాలు ఆపేసి అమెరికా వెళ్లిపోతానని స్లీమన్, రాజీనామా చేసి తప్పుకుంటానని స్టెమటేక్స్ అలా బెదిరిస్తూనే ఉండడం; వివాదం విషమించినప్పుడల్లా సోఫియా రంగప్రవేశం చేసి ఇరుపక్షాలనూ శాంతింపచేయడం ఒక తంతుగా మారిపోయింది. ఇతరుల ఘనతను గుర్తించే అలవాటు బొత్తిగా లేని స్లీమన్, సోఫియా చాకచక్యానికి మాత్రం ముగ్ధుడైపోయేవాడు. తను నక్కజిత్తుల ఒడీసియస్ అయితే, ఆమె పెనెలోపి అనుకునేవాడు.

తవ్వకాలలో చెప్పుకోదగినవేవీ బయటపడడం లేదు. ట్రాయ్ లో దొరికినట్టుగా  రోమన్, బైజాంటైన్ నాణేలు కూడా ఇక్కడ దొరకకపోవడం స్లీమన్ కు వింతగా అనిపించింది. శిథిలాల అడుగున, రేఖాగణిత నమూనా చిత్రణలు కలిగిన పురాతన కలశాలు; విచిత్రంగా, బొర్డో మద్య పాత్రలను తలపించే గుండ్రని మృణ్మయపాత్రలు దొరికాయి.  ఆపైన ట్రాయ్ లో లానే ఎరుపురంగు పులిమిన చిన్న చిన్న అమ్మవారి మట్టిబొమ్మలు, కత్తులు, బొత్తాలు, జంతువుల మట్టిబొమ్మలు, మోత్యా తవ్వకాల్లో దొరికిన లాంటి బాణపు మొనలు, చక్కని నీలిరాతితో చెక్కిన వందలాది బొంగరం ఆకృతులు, దువ్వెనలు, సూదులు, స్ఫటికపు ముక్కలు, తిరగళ్ళు, గొడ్డళ్ళు: మైసీనియా వాద్యపరికరాలలో భాగంగా స్లీమన్ భావించిన ఎముక ముక్కలు కనిపించాయి. చూడబోతే, ట్రాయ్ లో తనకు ఎదురైన అనుభవమే పునరావృత్తమవుతోందా అని అతనికి అనిపించింది. అక్కడిలానే అసంఖ్యాకమైన బొంగరం తరహా బొమ్మలు, లింగాకృతులు, అమ్మవారి మట్టిబొమ్మలు! అంతకు మించి విశేషమైనవేవీ లేవు.

ఎట్టకేలకు, నాలుగు లేదా అయిదో వారంలో సింహద్వారా(Lion Gate)నికి దక్షిణంగా జరుపుతున్న తవ్వకాలలో రెండు ఇసుకరాతి సమాధి రాళ్ళు బయటపడ్డాయి.  ఒక్కొక్కటి నాలుగు అడుగుల ఎత్తు ఉన్నాయి. వాటిపై ఆదిమకాలపు దారుచిత్రాల శైలిని పోలిన బొమ్మలు ఉన్నాయి. వాటిలో ఒక దానిలో ఒక వేటగాడు రథంమీద ప్రయాణిస్తూ జింకను వేటాడుతూ ఉంటాడు. రథం పక్కనే ఒక వేటకుక్క పరుగెడుతూ ఉంటుంది. ఇంకో బొమ్మలో ఒక నగ్నసైనికుడు ఒక పెద్ద కత్తి పుచ్చుకుని రథం మీద వెడుతుంటాడు. ఈ బొమ్మల శైలికి, సింహద్వారంపై ఉన్న బొమ్మల శైలికి పోలిక ఉన్నట్టు స్లీమన్ గమనించాడు. గుర్రాల తోకలు, కుక్క తోక మామూలుకు భిన్నంగా చాలా లావుగానూ, పొడవుగానూ ఉన్నాయి. రథాలను మాత్రం రేఖామాత్రంగా చెక్కారు. ఈ రథాలు అచ్చంగా ట్రోజన్ యుద్ధాలలో ఉపయోగించిన రథాలలానే ఉన్నాయని స్లీమన్ నిర్ధారించాడు.

ఆ తదుపరి రోజుల్లో జరిపిన తవ్వకాల్లో కూడా సమాధి రాళ్ళ శకలాలు దొరికాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక బంగారు బొత్తం కనిపించింది. అలా సమాధి రాళ్ళ దగ్గరే బంగారు బొత్తం కనిపించేసరికి సమీపంలోనే నిక్షేపాల వాసన ఏదో స్లీమన్ కు ఘాటుగా సోకింది.

ఆ సమాధిరాళ్ళు సింహద్వారానికి అవతల ఉన్న ఒక వలయాకార ప్రదేశంలో కనిపించడంతో అక్కడే తవ్వకాలు కొనసాగించాడు. అక్కడ బయటపడుతున్నవి మొదట అతనికి చిక్కుముడిగా కనిపించాయి. ఆ వలయాకారప్రదేశంలో చుట్టూ బల్లల రూపంలో రాతి పలకలను అమర్చారు. అధికారిక శాసనాలను చదివి వినిపించడానికి చాటింపు వేసి ప్రభువర్గాన్ని పిలిపించే బహిరంగ సమావేశస్థలిగా అది కనిపించింది. బహుశా అదొక నృత్యస్థలి, కవిసమ్మేళనస్థలీ కూడా కావచ్చు. అక్కడే గొప్ప గొప్ప వక్తల ప్రసంగాలు, బహుమతి ప్రదానాలూ జరుగుతూ ఉండివేమో. ఆయా సందర్భాలలో రాచరికానికి చెందిన పవిత్ర చిహ్నాలను అక్కడే ప్రజల సందర్శనకు ఉంచేవారేమో….

పవిత్రప్రదేశాలుగా పరిగణించే ఇటువంటి తావులు సాధారణంగా మృతవీరుల స్మారకనిర్మాణాలతో ముడిపడి ఉంటాయి. అక్కడి రాతి పలకల అడుగున రాజుల సమాధులు ఉండడమూ కద్దు. ఇలాంటి ప్రదేశాలను ‘ఆగొరా’(agora) అని పిలుస్తారు. ఇవి పవిత్రమైన తావులే అయినా విపణి ప్రదేశాలుగా కూడా వాడుకలో ఉండేవి. యురిపిడిస్ తన ‘ఎలెక్త్రా’ అనే రచనలో, బంగారు ఉన్ని కలిగిన గొర్రెపిల్లను దర్శించడానికి మైసీనియా ప్రజలను ఆగొరాకు ఆహ్వానించడం గురించి రాస్తాడు. బంగారు గొర్రెపిల్ల మైసీనియా రాచరికచిహ్నం. వీరుల సమాధులు ఆగొరా లోపలే ఉన్నాయని పసన్నియస్ రాశాడు. తెరా దీవిలోని ఆగొరాలో వీరులను సమాధి చేశారని పింధరోస్(ప్రాచీన గ్రీకు గేయకవి)రాశాడు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మైసీనియా వీరుల సమాధులు ఈ వలయాకారపు ఆగొరా లోనే ఉండి ఉంటాయని స్లీమన్ నిర్ణయానికి వచ్చాడు.

అయినా వెంటనే ఈ ప్రదేశంలో మరిన్ని తవ్వకాలు జరిపించకుండా, దానికి దక్షిణంగా కిటికీలు లేని ఏడు గదులతో ఉన్న ఒక రాతి కట్టడాన్ని రాజప్రాసాదంగా ఊహించుకుని మొదట అక్కడ తవ్వకాలు ప్రారంభించాడు. కానీ నిరాశే ఎదురైంది. ఎప్పటిలానే నీలిరంగు రాతితో మలచిన బొంగరం ఆకృతులు, గొడ్డళ్ళు, చిత్రిత మృణ్మయ కలశాల తాలూకు ముక్కలు కనిపించాయి. 12 అంగుళాల ఎత్తున్న ఒక కలశం మాత్రమే ఉన్నంతలో విలువైనదిగా కనిపించింది. దాని మీద యుద్ధానికి వెడుతున్న సైనికుల చిత్రం ఉంది. వారిని ముదురు ఎరుపు రంగులో చిత్రించారు. విశేషమేమిటంటే, ట్రాయ్ యుద్ధానికి ముందునాటి సైనికులను, వారి ఆయుధాలను ఈ చిత్రం ప్రదర్శిస్తోంది. వీటిలో మంచి జీవకళ ఉట్టిపడుతూ, ఆధునిక సరళిని తలపిస్తూ ఉండడం మరింత ఆసక్తికరం. అతి పురాతన గతానికి చెందిన ఈ సైనికులు సజీవంగా మన ముందుకొచ్చి నిలబడినట్టు ఉంటారు. అంతేకాదు, ఈ సైనికులు ధరించిన దుస్తుల లాంటివే హోమర్ చిత్రించిన వీరులు ధరించి ఉంటారని స్లీమన్ అనుకున్నాడు.

(సశేషం)

 

 

 

అక్రమ సంబంధాల విషాదస్థలి మైసీనియా

 

స్లీమన్ కథ-23

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మైసీనియాలో ఆ అయిదురోజుల తవ్వకాల్లో విలువైనవేవీ బయటపడకపోయినా, తప్పకుండా బయటపడతాయన్న నమ్మకంతో స్లీమన్ ఉన్నాడు. ఈ తవ్వకాల వివాదం సద్దుమణిగేదాకా రెండు మాసాలు ఓపికపట్టి ఆ తర్వాత గ్రీకు ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన దాఖలు చేసుకున్నాడు. మైసీనియాలో సొంత ఖర్చు మీద తవ్వకాలు జరుపుతాననీ, వాటిలో బయటపడే వాటినన్నిటినీ ప్రభుత్వానికి అప్పజెబుతాననీ, వాటి గురించి వెల్లడించే హక్కు మాత్రమే తనకు ఉంటుందనీ అందులో ప్రతిపాదించాడు. తనను ఇంతకుముందు దొంగగా, గ్రీసుకు శత్రువుగా చిత్రించిన మంత్రే దానిని ఆమోదిస్తూ సంతకం చేశాడు.

1874 ఏప్రిల్ 21 నుంచీ తవ్వకాలు ప్రారంభించాలని అతను నిర్ణయించుకున్నాడు. అందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, ట్రాయ్ నిక్షేపాలలో సగం తమకు అప్పజెప్పాలని కోరుతూ టర్కీ ప్రభుత్వం అతనిపై దావా వేసినట్టు సమాచారం వచ్చింది. కింది కోర్టులోనూ, పై కోర్టులోనూ దావా ఏడాదిపాటు సాగి అతని సహనాన్ని పరీక్షించింది.  అతను ఎథెన్స్ లోనే ఉండిపోవలసివచ్చింది. కోర్టు ఉత్తర్వుతో పోలీసులు వచ్చి అతని ఇంటిని సోదా చేశారు. నిక్షేపాలు కనిపించలేదు. వాటిని ఎక్కడ దాచాడో చెప్పడానికి స్లీమన్ నిరాకరించాడు. ప్రాసిక్యూషన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు సరికదా, ఎలాంటి పరిష్కారానికీ ఒప్పుకోలేదు.  పట్టుదలకుపోయి ప్రభుత్వంతో తుదికంటా పోరాడడానికే నిశ్చయించుకున్నాడు. అదే సమయంలో, తమ మధ్య ఎలాంటి వివాదం లేనట్టుగా, ట్రాయ్ లో తవ్వకాలను కొనసాగించే హక్కును కోరుతూ అదే ప్రభుత్వానికి అర్జీ మీద అర్జీ పెట్టుకుంటూవచ్చాడు.

ఆ ఏడాదంతా అతను పోలీసులతో, గ్రీకు ప్రభుత్వంతో, తన విమర్శకులతో; చివరికి సొంత న్యాయవాదులతో కూడా గొడవ పడుతూనే గడిపాడు. తన ఖర్చుతో ఒలింపియాలో తవ్వకాలు జరపడానికి ముందుకొచ్చినా; గ్రీకు ప్రభుత్వం అందుకు ప్రష్యన్ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంపై అతను మండిపడుతూ  ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. చివరికి ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గ్రీసు రాజు జార్జికి కూడా రాశాడు. అయినా ఫలితం లేకపోవడంతో,  ఉత్తరాల వల్ల పని జరగదనీ, గ్రీకు ప్రభుత్వాన్నీ, ప్రజలనీ మెప్పించే పని ఏదైనా చేసి తనవైపు తిప్పుకోవాలనీ అనుకున్నాడు.

అతని దృష్టి అక్కడి గిరిదుర్గం మీద ఉన్న మధ్యయుగాలనాటి వెనీషియన్(ఇటలీలోని వెనిస్ కు చెందినవారు కట్టించిన) బురుజు మీద పడింది. ఆ బురుజు ఆ పరిసరాల అందాన్ని దెబ్బతీస్తోంది. దానిని తొలగిస్తే బాగుంటుందని అందరూ అనుకోవడమే కానీ, ఆ పని చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. 80 అడుగుల ఎత్తున పాలరాయి పలకలతో నిర్మించిన ఆ బురుజులో గుడ్లగూబలు గూళ్ళు పెడుతున్నాయి. దానిని తొలగించడానికి 465 పౌండ్లు ఖర్చవుతాయని స్లీమన్ అంచనా వేసి, ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచాడు. ప్రభుత్వం అంగీకరించింది. అతను వెంటనే రంగంలోకి దిగి ఆ బురుజును తొలగించే పనిని విజయవంతంగా పూర్తిచేశాడు.

కోర్టులకు వేసవి సెలవులు కావడంతో అతనికి తీరిక చిక్కి ఓసారి ఉత్తర గ్రీస్ లో మెరపు పర్యటన జరిపి అర్కోమెనోస్ (గ్రీస్ లో పురావస్తు ప్రాధాన్యం కలిగిన ఒక ప్రదేశం) ను సందర్శించాడు. చారిత్రకంగా అదెంతో ప్రాముఖ్యం కలిగిన ప్రదేశమన్న నిర్ధారణకు వచ్చి, అక్కడ తవ్వకాలను చేపడితే తను ఆర్థిక సాయం చేస్తానని గ్రీకు పురావస్తు సంఘానికి రాశాడు. ఆరేళ్ళ తర్వాత  తనే అక్కడ కొన్ని తవ్వకాలు జరిపించాడు.

టర్కీ ప్రభుత్వం వేసిన దావా ఎట్టకేలకు పరిష్కారానికి వచ్చింది. స్లీమన్ ఎంతో తెలివిగా పావులు కదిపాడు. గ్రీకు న్యాయమూర్తులు టర్కీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తూ; పరిహారంగా 50 వేల ఫ్రాంకులు చెల్లించవలసిందిగా స్లీమన్ ను ఆదేశించారు. తను చేజిక్కించుకున్న ప్రియామ్ నిక్షేపాల విలువను 10 లక్షల ఫ్రాంకులుగా అంచనా వేసిన స్లీమన్, ఓడినా గెలుపు తనదే ననుకున్నాడు. ఆ 50 వేల ఫ్రాంకుల పరిహారానికి అయిదురెట్ల మొత్తాన్ని కాన్ స్టాంట్ నోపిల్ లోని ఇంపీరియల్ మ్యూజియంకు స్నేహపూర్వకంగా బహూకరించి; దాంతోపాటు ఏడు భారీ కలశాలను, నాలుగు సంచుల నిండా రాతి పురావస్తువులను పంపించాడు.

అప్పటికే అతని కీర్తి పైపైకి ఎగబాకుతోంది. దానిని ఆనందించే తీరిక ఇప్పుడు ఒకింత చిక్కింది. బ్రిటిష్ ప్రధాని గ్లాడ్ స్టన్ ప్రశంసాపూర్వకమైన లేఖ రాశాడు. ఇంగ్లండ్ లో అతనికి అతి ప్రముఖ అభిమానిగా మారిపోయాడు. 1875లో సోఫియాను, కూతురు యండ్రోమకిని వెంటబెట్టుకుని ఇంగ్లండ్ కు బయలుదేరాడు. దారిలో పారిస్ లో ఆగి, జియోగ్రాఫికల్ సొసైటీలో ప్రసంగించాడు. అలవాటుగా అతిశయోక్తులు, ఆత్మస్తుతీ రంగరిస్తూ అతను చేసిన ప్రసంగానికి శ్రోతల్లో స్పందన లేదు. ఎవరూ అతన్ని అభినందించడానికి ముందుకు రాలేదు. ప్లేస్ స్ట్రీట్ మిషెల్ లోని అతని నివాసం దగ్గర సందర్శకులు బారులు తీరలేదు.

లండన్ లో మాత్రం అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. గ్లాడ్ స్టన్ పొగడ్తలతో ముంచెత్తాడు. జూలై నెలంతా ప్రముఖులతో విందు వినోదాలలో గడిపాడు. సోఫియాను, కూతురినిని బ్రైటన్ లోనే ఉంచేశాడు. వారానికి ఒకటి రెండుసార్లైనా వెళ్ళి వాళ్ళను చూడడానికి వీలులేనంతగా తను లండన్ లో బిజీ అయిపోయానని చెప్పుకున్నాడు. ఫ్రెంచి జియోగ్రాఫికల్ సొసైటీ కార్యదర్శి గోచే కు లండన్ నుంచి ఉలా ఉత్తరం రాశాడు:

నేనిక్కడ ప్రసంగిస్తున్న పండిత సభలు శ్రోతలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ నా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. నేను మాట్లాడిన ప్రతిదీ పత్రికలు ప్రచురిస్తున్నాయి. రాజాస్థానాలనుంచి నాకు పిలుపులు అందుతున్నాయి. రాకుమారులు, రాకుమార్తెలు నన్ను ఆహ్వానించి నేను చెప్పేవి ఎంతో ఆసక్తిగా వింటున్నారు. హోమర్ ట్రాయ్ ని కనుగొన్న ఈ వ్యక్తి ఆటోగ్రాఫ్ తీసుకోడానికి అందరూ ఎగబడుతున్నారు. నన్ను స్వాగతసత్కారాలతో ముంచెత్తుతూ ఎంతో ఆదరిస్తున్న ఈ ముచ్చటైన లండన్ సమాజాన్ని విడిచిపెట్టి, నన్నో దేశద్రోహి అన్నట్టుగా చూసిన పారిస్ కు త్వరలోనే వస్తాను.

The Nine-Year Siege of Troy, after which King Agamemnon returns to his wife, Clytemnestra

అతను పారిస్ లో కొన్ని గంటలు మాత్రమే ఉన్నాడు. హాలెండ్ రాణి అతన్ని ది హేగ్ కు ఆహ్వానించింది. అక్కడ అతని గౌరవార్ధం జరిగిన విందు సమావేశానికి రాజ్యంలోని ప్రముఖులందరూ విచ్చేశారు. రాణి ప్రత్యేకంగా తనను సందర్శించే అవకాశమిచ్చి అతనితో ముచ్చటించింది. ఆమెతో కలసి లైడన్ మ్యూజియంలోని ఈజిప్టుకు చెందిన పురావస్తువులను చూస్తూ గంటల తరబడి గడిపాడు. రెండు కారణాలవల్ల స్లీమన్ కు ఆమె అమితంగా నచ్చింది. ఆమెకు పురాతత్వ శాస్త్రంపై మంచి ఆసక్తి ఉంది. ఆపైన ఏడు భాషల్ని అనర్గళంగా మాట్లాడుతుంది. లూవే మ్యూజియం కన్సర్వేటర్ రావెసొన్ కు ఇలా ఉత్తరం రాశాడు:

ఘనత వహించిన రాణి నన్ను తరచు అల్పాహారానికీ, మధ్యాహ్న, రాత్రి విందులకూ ఆహ్వానిస్తోంది. ఆమె బాగా చదువుకున్నది. అసాధారణమైన జ్ఞాపకశక్తి. ఆసియా మైనర్, గ్రీకు ద్వీపకల్పం, ఇటలీలో స్వయంగా కొన్ని తవ్వకాలను చేపట్టడానికి ఆమెను ఒప్పించగలనేమో ననిపిస్తోంది. నేను మాత్రం అందులోకి దిగకుండా సలహాదారు పాత్రకే పరిమితమవాలనుకుంటున్నాను.

అక్కడినుంచి అతను కోపెన్ హేగన్ వెళ్ళాడు. వారంరోజులపాటు అక్కడి మ్యూజియం లను సందర్శిస్తూ గడిపాడు. వాటిలో ప్రదర్శించిన కొన్ని శిలాయుగపు ఆయుధాలకూ, ట్రాయ్ లో కనుగొన్నవాటికీ మధ్య ఆసక్తికరమైన పోలికలు గమనించాడు. ఆ తర్వాత రోష్టాక్ వెళ్ళి తన ట్రాయ్ తవ్వకాలపై మరో ప్రసంగం చేశాడు. తిరుగు ప్రయాణంలో ఇటలీ అతన్ని ఆహ్వానించింది. తను నేపుల్స్ లోనే శేషజీవితాన్ని గడపదలచుకున్నానని అక్కడ ప్రకటించాడు. అల్బ లాంగో(ఇటలీలోని ఒక పురాతన ప్రదేశం)లో కొన్ని వారాలు గడిపాడు. అక్కడ ఇటీవలే కొన్ని అంత్యక్రియల కలశాలు బయటపడ్డాయి. మరిన్ని విశేషాలు వెల్లడవుతాయని అతనికి అనిపించలేదు. సీసీలీ పశ్చిమతీర సమీప ద్వీపమైన మోత్యాలో ఒకప్పుడు కార్తజీనియన్ (నేటి ట్యునీసియా రాజధాని ట్యూనిస్ శివార్లలో కార్తేజ్ అనే పురాతన నగరం ఉండేది. ఆ నగరానికి చెందినవారు కార్తజీనియన్లు) జనావాసం ఉండేది. అక్కడ చెప్పుకోదగిన పురాసంపద బయటపడే అవకాశముందని అనుకున్నాడు కానీ, తీరా చూశాక అలాంటి సూచనలేవీ కనిపించలేదు. ఇటలీలోని సెగ్వెంటే అనే పురాతన ప్రదేశంలో జరిపిన ప్రాథమిక తవ్వకాల్లో కూడా గొప్పవేవీ దొరకలేదు. అక్టోబర్ చివరినాటికి ఎటు అడుగువేయాలో తోచని స్థితిలో పడ్డాడు. ఉన్నపళంగా ట్రాయ్ వెళ్ళి తను చేయగలిగిందేమీ లేదు; గ్రీస్ కు తిరిగివెళ్ళడమంటే, అక్కడి ప్రభుత్వంతో ఎడతెగని ఘర్షణతో తలమునకలవడమే.

ఎంతైనా తనకు పేరు ప్రతిష్టలు తెచ్చింది ట్రాయే. డిసెంబర్ ప్రారంభంలో హఠాత్తుగా నేపుల్స్ విడిచిపెట్టి కాన్ స్టాంట్ నోపిల్ కు వెళ్లిపోయాడు. విద్యామంత్రి సఫ్వెట్ పాషాను కలసి కొత్త ఫర్మానా ఇప్పించమని కోరాడు. ఈసారి తవ్వకాల్లో బయటపడేవాటిని అన్నింటినీ నమ్మకంగా ఇంపీరియల్ మ్యూజియంకు అప్పగిస్తానంటే, ఫర్మానా ఇప్పించడానికి ప్రయత్నిస్తానని సఫ్వెట్ పాషా మాట ఇచ్చాడు.

1876 ఏప్రిల్ లో అతనికి ఫర్మానా అందింది. కానీ ఈలోపల, మైసీనియాలోని రాచ సమాధుల దగ్గర తవ్వకాలు జరపాలన్న ఆలోచనే అతని బుర్రను పూర్తిగా ఆక్రమించుకుంది. మైసీనియా గురించిన అధ్యయనంలో మునిగితేలుతున్న కొద్దీ అది సూదంటురాయిలా అతన్ని మరీ మరీ గుంజి లాగడం ప్రారంభించింది. తను ఎలాగూ ఒలింపియాలో తవ్వకాలు జరపలేడు, హిస్సాలిక్ లో దాదాపు తను ఆశించినవన్నీ కనుగొన్నాడు, ఇక మిగిలింది మైసీనియాయే. పౌరాణిక విశ్వాసం ప్రకారం దనాయ్, జియస్ ల కొడుకు పెర్సియస్ మైసీనియా రాజ్యాన్ని స్థాపించాడు. దనాయ్ కు అతను కనకవర్షం కురుస్తుండగా కనిపించాడు. మరోసారి తనకు స్వర్ణనిక్షేపాలు కనిపించడమంటూ జరిగితే అక్కడే నని స్లీమన్ నిశ్చయానికి వచ్చాడు.

***

స్లీమన్ రోజుల్లో మైసీనియా వెళ్ళే పర్యాటకు లెవరికైనా ఆర్గోస్ మైదానం దుబ్బులతోనూ, ధూళితోనూ నిండి పసుపు, తెలుపు రంగుల్లో కనిపించేది. 2,500 అడుగుల ఎత్తు ఉన్న రెండు పర్వతాల మధ్యనున్న బాటను కాపలా కాస్తున్నదా అన్నట్టుగా అక్కడ ఒకప్పుడు ఒక పెద్ద కోటనగరం ఉండేది. అక్కడిప్పుడు రాళ్ళగుట్ట తప్ప మరేమీ కనిపించదు. ఆ బృహత్ పర్వతాలు ఇప్పటికీ భయం గొలుపుతూ, వాటి పాదాల దగ్గర ఉన్న గుట్టల్లోంచి తోడేళ్ళ అరుపులు వినిపిస్తూనే ఉంటాయి కానీ; ఇటీవలి కాలంలో ఆ పరిసరాల్లో వచ్చిన మార్పూ కనిపిస్తుంది. ఇప్పుడా మైదానంలో మంచి వ్యవసాయం సాగుతోంది. చక్కని రోడ్లు పడ్డాయి. పొగాకు, పత్తి పొలాలమధ్య తోటల పెంపకం సాగుతోంది. పర్వతపాదాల దగ్గర బార్లీ పండిస్తున్నారు. అయినాసరే, ఆకూ అలమూ లేని ఆ నీలిరంగు బోసి పర్వతాల నేపథ్యంతో; అక్కడి అన్ని దారులపై ఆధిపత్యం చెలాయిస్తోందా అన్నట్టుగా మైసీనియా ఈరోజుకీ గుబులు రేపుతూనే ఉంటుంది.

ఆర్గోస్ మైదానం అంతటిపై పెత్తనం చేయడానికి అనువైన చోట మైసీనియా ఉంది. అక్కడికి దక్షిణంగా తొమ్మిది మైళ్ళ దూరంలో నాఫ్లియో దగ్గర పెట్టని కోటలా అఖాతం ఉంది. చరిత్రపూర్వకాలం నుంచీ ఈ ప్రాంతంలో జనాలు నివసించినట్టు ఆధారాలున్నాయి. క్రీ.పూ. 1700లో,  ప్రబలుడైన ఒక రాజు అప్పటికే ఇక్కడ ఉన్న కంచుయుగ ప్రారంభ కాలానికి చెందిన నగరం చుట్టూ బ్రహ్మాండమైన ప్రాకారాలను, కొత్తగా ఒక ప్రాసాదాన్ని నిర్మించాడు. అతని పేరేమిటో, ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు. నగరంలోకి వెళ్లడానికి చప్టా చేసిన రహదారి, దానికి రెండుపక్కలా బురుజులూ ఉన్నాయి. ఈ బురుజుల లోతట్టున ఇప్పటికీ ఒక పెద్ద సింహద్వారం(Lion Gate)ఉంది.

mycenae-lion-gate-00ఒకప్పుడు దానిని రెండు చెక్క తలుపులతో మూసి ఉంచేవారు. ఆ తలుపుల మీద ఓ పెద్ద దూలం, దాని మీద ఒకదాని కొకటి అభిముఖంగా ఉన్న రెండు సివంగుల బొమ్మలూ ఉన్నాయి. ఆ సింహద్వారంలోంచి లోపలికి వెడితే, 16 అడుగుల మందం కలిగిన ప్రాకారాలకు అవతల ఒక వలయాకారపు చప్పరం(terrace) కనిపిస్తుంది. స్లీమన్ రోజుల్లో ఈ చప్పరం రాళ్ళగుట్టలతోనూ, ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన చెత్తతోనూ నిండి ఉండేది. దీనికి అవతల రాజప్రాసాదాలు, ఇళ్ల తాలూకు శిథిలాలు ఉన్నాయి. వాటిని నాచు, కలుపు కప్పేశాయి. కొండ వాలుల్లోనూ, చుట్టుపక్కల ఉన్న లోయలోనూ దిగువ నగరం తాలూకు శిథిలాలు ఉన్నాయి. ఓ అడవిలా భయం గొలిప ఈ కొండ పరిసరాల్లోకి ఎప్పుడైనా దొంగలు తప్పిస్తే ఇంకెవరూ వెళ్లరు. ఇన్ని శతాబ్దాలలో ఇక్కడ పెద్దగా వచ్చిన మార్పేమీలేదు.  క్రీ.శ. రెండవ శతాబ్దికి చెందిన గ్రీకు పర్యాటకుడు, భౌగోళికవేత్త పసన్నియాస్ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడూ దాదాపు ఇప్పుడున్నట్టే ఉంది.

ఒకప్పుడు ఇక్కడ విశాలమైన వీధులతో, రథమార్గాలతో, తళతళా మెరిసిపోయే బాటలతో ఒక పెద్ద సుసంపన్న నగరం ఉండేది. ఈ ప్రాంతాన్ని బలవత్తరుడైన ఒక రాజు పాలించేవాడు. ఇక్కడి సింహద్వారంలోంచి భారీ సైన్యాలు రాకపోకలు సాగిస్తూ ఉండేవి.  రాజు అధీనంలో పెద్ద పెద్ద స్వర్ణ కోశాగారాలు ఉండేవి.  మైసీనియాను స్వర్ణనగరంగా హోమర్, సొఫొక్లీస్ లు ఇద్దరూ అభివర్ణించారు. ఈ నగరరాజ్యాన్ని పెర్సియస్ స్థాపించాడనీ, ఈ ప్రదేశంలో తన కత్తి ఉంచుకునే ఒర తాలూకు పై తొడుగు(mykes)ను పోగొట్టుకోవడం వల్లనో, ఇక్కడ కనిపించిన పుట్టగొడుగు(mykes)ల వల్లనో మైసీనియా అని పేరుపెట్టాడనీ పసన్నియాస్ రాశాడు. ఆర్గోలిస్ మైదానం ఎడ్లకు ప్రసిద్ధి కనుక అవి వేసే రంకె(mykithmos)లను సూచించేలా ఆ పేరు వచ్చి ఉండచ్చని స్లీమన్ అనుకున్నాడు.

పెర్సియస్, అతని వారసుల పాలన ప్రశాంతంగా సాగిపోయింది. కానీ ఆ తర్వాత ఏట్రియస్ నెలకొల్పిన రాజవంశం విషాదగ్రస్తంగా మిగిలిపోయింది. తన భార్యను సోదరుడు థయస్టీస్ లోబరచుకున్నాడని తెలిసిన ఏట్రియస్ అతని కొడుకులిద్దరినీ చంపి వారి మాంసంతో థయస్టీస్ కు విందు ఇచ్చాడు. ఆ సంగతి తెలిసిన థయస్టీస్ తిన్నది వాంతి చేసుకుని, భోజనం బల్లను ఎత్తిపడేసి, ఏట్రియస్ వంశం సర్వనాశనమైపోతుందని శాపనార్థాలు పెడుతూ అక్కడినినుంచి పరుగెత్తాడు. ఆ తర్వాత ఏట్రియస్ పై ఎలా పగ తీర్చుకోవాలో చెప్పమని దేవదూతను కోరాడు. నీ కూతురు పెలోపియా ద్వారా నీకు కలిగే కొడుకు మాత్రమే ఏట్రియస్ పై పగ తీర్చుకోగలడని దేవదూత పలికింది. ఓ రోజు రాత్రి థయస్టీస్ బలి ఇస్తుండగా ఒక అమ్మాయి అతనిని సమీపించింది. తన కూతురని తెలియక థయస్టీస్ ఆ అమ్మాయిని లోబరచుకున్నాడు. ఆమెకు కొడుకు పుట్టాడు. అతను ఏగిస్త్వస్ అనే పేరుతో పెరిగిపెద్దవాడై ఏట్రియస్ ను హతమార్చాడు. ఆ తర్వాత థయస్టీస్ కొంతకాలం రాజ్యాన్ని పాలించాడు. అతని తర్వాత ఏట్రియస్ కొడుకు అగమెమ్నన్ రాజయ్యాడు.

థయస్టీస్ శాపం ఆ తర్వాత కూడా ప్రభావం చూపించింది. అగమెమ్నన్ ట్రాయ్ లో యుద్ధం చేస్తున్న సమయంలో అతని భార్య క్లైటెమెనెస్ట్రాతో ఏగిస్త్వస్ సంబంధం పెట్టుకున్నాడు. యుద్ధం నుంచి తిరిగి రాగానే అగమెమ్నన్ ను అంతమొందించాలని ఇద్దరూ పన్నాగం పన్నారు. ట్రాయ్ నుంచి యుద్ధఖైదీలతో ఓడలు తిరిగి వస్తున్న సంగతిని గమనించి తమకు చెప్పమని ఒక కావలివాడిని సముద్రతీరానికి పంపించారు. ఏమాత్రం అనుమానం కలగని అగమెమ్నన్, సేనలు వెంటరాగా రథం మీద మైదానం దాటి కోటకు చేరుకున్నాడు. అక్కడ తనకు ఏర్పాటు చేసిన  విందుకు వెళ్ళాడు. ఆ విందులోనో, లేదా సమీపంలోని స్నానశాలలోనో ఏగిస్త్వస్, క్లైటెమెనెస్ట్రా లు అతన్ని హత్యచేశారు. దానికి ప్రతీకారంగా ఆ తర్వాత అగమెమ్నన్ సంతానమైన ఒరెస్టీస్, ఎలెక్త్రాలు క్లైటెమెనెస్ట్రాను, ఏగిస్త్వస్ ను హతమార్చారు. ఒరెస్టస్ రాజయ్యాడు.

అగమెమ్నన్ హత్యను హోమర్, ఎస్క్యులస్(క్రీ.పూ. 525, గ్రీకు విషాదాంత నాటకకర్త), సొఫొక్లీస్, యురిపిడీస్(క్రీ.పూ. 480, గ్రీకు విషాదాంత నాటక కర్త)లు ముగ్గురూ విశేషంగా కథనం చేశారు. ట్రాయ్ పతనాన్నీ, ఏట్రియస్ కుటుంబంలో పుట్టిన ముసలాన్నీ వీరయుగపు విషాదాంత ఘటనలుగా గ్రీకులు భావిస్తారు. వాటిమీదే తమ భావజగత్తును నిర్మించుకుంటూ, స్ఫూర్తిని పుంజుకుంటూ వచ్చారు. ట్రాయ్, మైసీనియాలు రెండింటినీ మహావీరుల స్మృతులు వెంటాడే పవిత్రస్థలాలుగా వారు భావిస్తారు.

ట్రాయ్ విషయంలోలానే, మైసీనియా విషయంలో కూడా తనదైన సరళ తర్కాన్ని అనుసరించి ముందుకెళ్లాలని స్లీమన్ అనుకున్నాడు. ట్రాయ్ లో నగరానికి దారితీసే ప్రధానద్వారం దగ్గర తను స్వర్ణనిక్షేపాలను కనిపెట్టాడు. మైసీనియాలో కూడా ప్రధానద్వారం దగ్గరే నిక్షేపాలను కనిపెట్టగలననుకున్నాడు.

(సశేషం)

 

 

 

 

ట్రాయ్ నగలతో సోఫియాకు అలంకారం

 

స్లీమన్ కథ-22

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పనివాళ్లు అందరూ వెళ్ళిపోయారు. సోఫియా తిరిగివచ్చింది. స్లీమన్ ఒక జేబుకత్తితో నిక్షేపాలను తవ్వి తీయడం  ప్రారంభించాడు. మట్టి, రాతిముక్కలు, పెద్ద పెద్ద రాళ్ళతో నిండిన రక్షణకుడ్యం కుప్పకూలేలా ఉంది. కానీ కళ్ళముందు కనిపిస్తున్న ఓ పెద్ద ఖజానా  అతని భయాలన్నింటినీ హరించేసింది. మళ్ళీ సోఫియావైపు తిరిగి, “త్వరగా వెళ్ళు, నీ పెద్ద శాలువ తీసుకురా” అన్నాడు.

మరోసారి సోఫియా చెక్క నిచ్చెన మీంచి పైకి ఎక్కి, ఇంటికి వెళ్లింది. భారీగా కుట్టుపని చేసిన ఓ పెద్ద ఎరుపురంగు శాలువతో తిరిగివచ్చింది. సాధారణంగా శ్రాద్ధదినాలలో గ్రీకు మహిళలు అలాంటి శాలువలు కప్పుకుంటారు. తవ్వి తీసిన నిక్షేపాలను ఆ శాలువలో మూటగట్టి ఇద్దరూ ఇంటికి మోసుకెళ్లారు.

తలుపు గడియ పెట్టేసి ఓ చెక్క టేబులు మీద ఆ నిక్షేపాలను పరిచారు. చిన్నచిన్న వస్తువులను పెద్దవాటిలో సర్దేశారు. పురావస్తుప్రదర్శనశాలల్లో అద్దాలలోంచి కనిపించే ఇలాంటి నగా నట్రా లేత పసుపురంగులో ఉండి, తాజాగా మెరిసిపోతున్నట్టు ఉంటాయి. ఒక విచిత్రమైన నిర్జీవత వాటిలో ఉంటుంది. కానీ భూమిలోంచి తవ్వి తీసినప్పుడు అవి అద్భుతమైన ఎరుపురంగుతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ నిక్షేపాలలో ఒక రాగి డాలు, ఒక రాగి కళాయి, ఒక వెండి తొడుగు, ఒక రాగి తొడుగు, ఒక బంగారు సీసా, రెండు బంగారు కప్పులు, వెండి బంగారు మిశ్రమంతో చేసిన ఒక చిన్న నగల పాత్ర ఉన్నాయి. ఇంకా, ఒక వెండి కొమ్ము జారీ, మూడు పెద్ద వెండి కలశాలు, రెండువైపులా పదునున్న ఏడు రాగి బాకులు, ఆరు వెండి కత్తులు, పదమూడు రాగి బల్లెపు పిడులు ఉన్నాయి. ఒక పెద్ద వెండి కలశం అడుగున రెండు బంగారు శిరోభూషణాలు, నాలుగు బంగారు జూకాలలాంటివి, 56 బంగారు చెవిపోగులు, 8,750 బంగారు ఉంగరాలు, బొత్తాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అతి చిన్నవి.

అన్నింటిలోనూ శిరోభూషణాలు ఎక్కువ ఆశ్చర్యం గొలిపాయి. వాటిలో ఒకదానికి తొంభై గొలుసులున్నాయి. వాటిపై ఆకులు, పువ్వుల చెక్కుడులు ఉన్నాయి. రెండువైపులా సన్నని బంగారు దారాలలాంటివి వేలాడుతున్నాయి. పర్షియన్, రోమన్ శిరోభూషణాలు కేవలం తలకు చుట్టుకునే పట్టీలలా మాత్రమే ఉంటాయి. వాటికి భిన్నంగా ట్రోజన్ శిరోభూషణాలు అసంఖ్యాకమైన బంగారు వలయాకార నిర్మాణాలతో నుదుటి మొత్తాన్ని కప్పేలా ఉంటాయి. అలాంటివి ఇంతకు ముందు కానీ, ఆ తర్వాత కానీ మరెక్కడా కనిపించలేదు.

Priam-treasure

స్లీమన్ సంభ్రమం పట్టలేకపోతున్నాడు. కంపిస్తున్న చేతుల్లోకి ఆ శిరోభూషణాలను తీసుకుని వెలుతురులోకి వెళ్ళి పరీక్షగా చూశాడు.  ఆ తర్వాత వాటిని సోఫియా నుదుట అలంకరించాడు. అవి ట్రోజన్ రాణికి చెందిన శిరోభూషణాలని అతను జీవితాంతం నమ్మినట్టు కనిపిస్తుంది కానీ, నిజానికి అవి రాజు ధరించిన శిరోభూషణాలు కావడానికే అవకాశ మెక్కువ. ఆమె ఒకవిధమైన ఆటవికపు వైభవంతో వెలిగిపోయేలా మెడలో నగలు దిగేశాడు. వేళ్ళకు ఉంగరాలు తొడిగాడు. మెక్లంబర్గ్ కు చెందిన ఒక అనామక చర్చి ఉద్యోగి కొడుకు ఎట్టకేలకు రాజులు నడయాడిన చోట, ఒక మహారాణిలా మెరిసిపోయే మహిళ ముందు నిలబడి ఉన్నాడు.

తను కచ్చితంగా రాజు ప్రియామ్ కు చెందిన నిక్షేపాలను కనుగొన్నాననుకున్నాడు. ట్రాయ్ తగలబడుతున్నప్పుడు వాటిని రహస్యంగా ఒక గోడలో భద్రపరిచారనీ, చివరి క్షణాలలో హడావుడిగా వాటిని ఒక చెక్కపెట్టెలో పెట్టి ఉంటారనీ, ఆ తొందరలో తాళం చెవిని అలాగే వదిలేసి ఉంటారనీ అనుకున్నాడు. కానీ అతను తాళం చెవి అనుకున్నది నిజానికి ఒక రాగి ఉలి. ఆ నిక్షేపాలను ఒక పెట్టెలో పెట్టారనడానికి కూడా ఆధారాలు కనిపించలేదు.

వాటి తయారీ విషయానికే వస్తే, బంగారు పాత్రలపై చక్కని పనితనం కనిపిస్తోంది. అయితే, తలపాగా లాంటి కిరీటా(tiara)లు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నా వాటిపై పనితనం ప్రాథమికంగా ఉంది. తీగ చుట్లతోనూ, తాపడం చేసిన బంగారు రేకులతోనూ వాటిని తయారుచేశారు. ఉంగరాల మీద ఎలాంటి చెక్కడాలూ లేవు.  ఎంతో అందంగా మలచిన ఒక బంగారు కొమ్ము పాత్రను మాత్రం పనితనంలో తలమానికమని చెప్పచ్చు. అయితే కత్తులు, బాణపు మొనలు, చిత్రమైన మృణ్మయమూర్తుల మధ్య అలాంటి పాత్ర ఎందుకుందో అర్థం కాలేదు. గోడల్లో భద్రపరచిన వాటిలో వెండి, బంగారాలే కాదు; ముతక పనితనం కనిపించే దంతపు వస్తువులు, ఒకమాదిరి మేలిరకపు రాళ్ళతో మలచిన  సుత్తి గొడ్డళ్ళు, మర్మస్థానంపై స్వస్తిక చిహ్నం కలిగిన ఒక స్త్రీ తాలూకు చిన్న సీసపు బొమ్మ ఉన్నాయి. వీటన్నిటినీ పక్క పక్కన చూసినప్పుడు, మూర్తి ఆరాధనా, ఆటవికతలతో ఉత్తమ కళాభిరుచి చెట్టపట్టాలు వేసుకుందా అనిపిస్తుంది. ఇంతకీ ఇది హోమర్ చిత్రించిన ట్రాయేనా, లేక అంతకంటే వెనకటి కాలానికి, మరింత ఆటవిక కాలానికి చెందినదా అన్న అనుమానం తలెత్తుతుంది.

స్లీమన్ మాత్రం, తను ప్రియామ్ కు చెందిన నిక్షేపాలను తవ్వితీశాననే నిర్ధారణకు వచ్చాడు.

అతను ఎంత ప్రయత్నించినా రహస్యం పూర్తిగా దాగలేదు. ట్రాయ్ అంతటా వదంతులు వ్యాపించాయి. అమీన్ ఎఫెన్డీ ఇంటికొచ్చి, తనకు తెలియకుండా ఏదో దాచారంటూ విరుచుకుపడ్డాడు. ఇల్లు సోదా చేస్తానన్నాడు. పెట్టెలు, దుస్తుల బీరువాలతో సహా అన్నీ తెరవమని సుల్తాన్ పేరు మీద ఆదేశించాడు. స్లీమన్ కూడా ఆగ్రహంతో ఊగిపోతూ అతన్ని గెంటివేశాడు. ఆరోజు రాత్రో, ఆ మరునాటి రాత్రో తింబ్రియాలోని కల్వర్ట్ ఇంటికి నిక్షేపాలను తరలించి; ఆ తర్వాత కొన్ని రోజులకు దేశం దాటించాడు.

మరికొన్ని రోజులపాటు రక్షణకుడ్యం అడుగున గాలించాడు. ఇంకేమీ దొరకలేదు. జూన్ 17న తవ్వకాలను అకస్మాత్తుగా ఆపేశాడు. పనివాళ్ళకు వేతనం చెల్లించి పంపేశాడు. ఒక్కసారిగా నిర్జనంగా మారిపోయిన ఆ దిబ్బ మీదికి ఒక పూజారి వచ్చి మతపరమైన తంతు నిర్వహించాడు. ఎక్కడబడితే అక్కడ కందకాలతో, నడవలతో పద్మవ్యూహంలా మారిన ఆ ప్రదేశం యుద్ధరంగాన్ని తలపించింది. తను ఎథెన్స్ కు వెళ్లిపోతున్నాననీ, ట్రాయ్ గడ్డ మీద మళ్ళీ అడుగుపెట్టననీ స్లీమన్ ప్రకటించి తను సేకరించిన కొన్ని వస్తువులను తీసుకుని నిశ్శబ్దంగా అక్కడినుంచి తప్పుకున్నాడు. మిగతా వస్తువులను ముందే పంపేశాడు. జూన్ 19 కల్లా ఎథెన్స్ లో ఉన్నాడు. అదే రోజున, తను వెలికితీసిన వాటి గురించి గర్వంగా చెప్పుకుంటూ వరసపెట్టి మిత్రులకు, బంధువులకు ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు.

ఉత్సాహం, ఉత్తేజం అతన్ని ఊపేస్తున్నాయి. “నేటి కాలంలోనే మహత్తరమైన, యావత్ప్రపంచం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అద్భుతాన్ని” తను కనుగొన్నాడు! ఎప్పుడూ తన గురించి గొప్పలు చెప్పుకునే ఈ పెద్దమనిషి, అలా చెప్పుకోవడం సహేతుకమేనని మొదటిసారి నిరూపించుకున్నాడు. ఆశకూ, హేతుబద్ధతకూ, అన్ని రకాల ఆధారాలకూ ఎదురీది తను ట్రాయ్ ని కనుగొన్నాడు. తన చేతుల్లో మెరిసిపోతున్న స్వర్ణ శిరోభూషణాలే అందుకు సాక్ష్యం! కాదనే ధైర్యం ఎవరి కుంటుంది?!

ఇంకోవైపు నిక్షేపాలు అతనికి మోయలేని బరువూ అయ్యాయి. సోఫియా బంధువులను కూడా ఈ గూడుపుఠాణీలోకి లాగాడు. గ్రీస్ అంతటా పశువుల కొట్టాల్లోకీ, గాదెల్లోకీ, పెరళ్ళ లోకీ గడ్డి చుట్టబెట్టిన విచిత్రమైన వస్తువులు రహస్యంగా చేరుకున్నాయి. ఒక వెదురు బుట్ట ఎలూసిస్ లో ఉంటున్న ఒక బంధువు ఇంటికి చేరింది. నిక్షేపాలను తలో చోటికీ తరలించేముందు ప్రతి వస్తువు గురించిన వివరాలను, తూకంతో సహా స్లీమన్ పూస గుచ్చినట్టు రాసుకున్నాడు. వాటిపై గ్రీకు, టర్కిష్ ప్రభుత్వాల కన్ను పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు.

తను ఎథెన్స్ లోనే ఉండిపోయాడు. సోఫియా కూతురిని తీసుకుని కొన్ని రోజులు విశ్రాంతిగా గడపడానికి ఇటలీలోని అగ్నిపర్వతద్వీపమైన ఈశ్చియాకు వెళ్లింది. కొన్ని వారాల తర్వాత ఒక నమ్మకస్తుడైన పనివాడిని పంపించి నిక్షేపాలను  ఎక్కడెక్కడ దాచాడో నోటి మాటగా ఆమెకు చెప్పించాడు.

ఇప్పుడిక మైసీనియా, ఒలింపియాలలో తవ్వకాల గురించి గట్టిగా ఆలోచించడం ప్రారంభించాడు. సొంత ఖర్చుతో తవ్వకాలు జరపడానికి అనుమతించమని ఇంతకు ముందు అడిగినప్పుడు గ్రీకు ప్రభుత్వం తిరస్కరించింది. తను కనుగొన్న నిక్షేపాలను ప్రభుత్వానికి అప్పగించే ప్రతిపాదనతో మరోసారి ప్రభుత్వాన్ని అనుమతి కోరాడు. టర్కీ ప్రభుత్వంతో ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుని ఈసారి కూడా గ్రీకు ప్రభుత్వం నిరాకరించింది.

ఆగస్టులో టర్కీ ప్రభుత్వం నుంచి స్లీమన్ కు తలనొప్పి రానే వచ్చింది. అతను నిక్షేపాలను కనుగొని, వాటిని రహస్యంగా తరలించిన సంగతి ప్రాథమిక దర్యాప్తు ద్వారా ప్రభుత్వం పసిగట్టింది. Augsburger Allegemeine Zeitung ప్రచురించిన స్లీమన్ నివేదికలు కూడా దానిని ధ్రువీకరిస్తున్నట్టు గమనించింది. తవ్వకాల దగ్గర తన ప్రతినిధిగా నియమించిన అమీన్ ఎఫెన్డీ తన విధిని సక్రమంగా నిర్వర్తించలేదన్న ఆరోపణతో ప్రభుత్వం అతనిపై చర్య తీసుకోబోతున్నట్టు స్లీమన్ కు తెలిసింది. అటోమన్ సామ్రాజ్యంలో తప్పు చేసిన అధికారికి విధించే శిక్ష ఒక్కోసారి మరణశిక్ష కూడా కావచ్చు. స్లీమన్ నైతిక సందిగ్ధంలో పడ్డాడు. తను కనుగొన్న నిక్షేపాలను టర్కీ ప్రభుత్వానికి అప్పగించే ప్రశ్న ఎలాగూ లేదు. టర్కీ వెళ్ళి అమీన్ ఎఫెన్డీ తరపున జోక్యం చేసుకునే ప్రశ్న అంతకంటే లేదు. కాకపోతే, ఎఫెన్డీ పూర్తిగా నిర్దోషి అని స్పష్టం చేస్తూ, “మానవత్వమూ, పవిత్ర న్యాయమూ” పేరిట ఉత్తరం రాసే అవకాశం తనకు ఉంది. అదే చేశాడు:

అక్కడ జరుగుతున్న ప్రతి పని పైనా అతను నిఘా పెట్టడం అసాధ్యం. ప్రతిరోజూ ఏకకాలంలో అయిదు చోట్ల తవ్వకాలు జరుగుతూ వచ్చాయి. తనే అయిదు రూపాలు ధరించి అయిదు చోట్లా కాపలా కాయగల మనిషి ఇంతవరకూ పుట్టలేదు.

అమీన్ ఎఫెన్డీ ఆ దిబ్బ మీద ఇంకో పక్క ఉన్నప్పుడు నేను నిక్షేపాలను కనుగొన్నాను. పనివాళ్ళ ద్వారా ఆ సంగతి తెలిసినప్పుడు పాపం అత నెంత డీలాపడిపోయాడో; కోపంతో రగిలిపోతూ నా ఇంటికి వచ్చి పెట్టెలూ, బీరువాలూ తెరచి చూపించమని సుల్తాన్ పేరు మీద ఎలా ఆదేశించాడో మీరు చూసి ఉంటే అతని మీద జాలిపడేవారు.

నా తవ్వకాల మీద అతనిలా రెప్పవాల్చకుండా నిఘా పెట్టినవారు ఇంకెవరూ లేరు. అయితే, పురావస్తు తవ్వకాలను పర్యవేక్షించే వ్యక్తి తప్పనిసరిగా ఓ పురావస్తునిపుణుడు అయుండాలి. అమీన్ ఎఫెన్డీ తప్పల్లా పురావస్తునిపుణుడు కాకపోవడమే…

ఆపైన, తను సమర్ధించుకోలేని తప్పు చేసి కూడా టర్కీ ప్రభుత్వంతో అడ్డదిడ్డం వాదనలోకి దిగాడు. మీరు నాక్చిన ఫర్మానాను రద్దు చేశారు కనుక, నేను ఏం చేసినా అడిగే హక్కు మీకు లేదన్నాడు. మీరు నాతో రాసుకున్న ఒప్పందాన్ని ఎప్పుడైతే ఉల్లంఘించారో, అప్పుడే దానికి కట్టుబడి ఉండాల్సిన నైతికబాధ్యతనుంచి నేను బయటపడ్డా నన్నాడు. నిక్షేపాలలో కొంతైనా లాంఛనంగా కాన్ స్టాంట్ నోపిల్ లోని ఇంపీరియల్ మ్యూజియంకు పంపవలసిందిగా ప్రభుత్వం లోపాయికారీగా అడిగింది. రవ్వంత కూడా పంపేది లేదని తెగేసి చెప్పిన స్లీమన్; ట్రాయ్ లో మరో మూడు మాసాలపాటు తవ్వకాలకు అనుమతిస్తే, ఆ తవ్వకాల్లో దొరికే ప్రతి ఒక్క వస్తువునీ మ్యూజియంకు ఇస్తానని అదే ఉత్తరంలో బేరం పెట్టాడు.

ఇక్కడ గ్రీకు ప్రభుత్వం వైఖరి కూడా అతనికి చికాకు తెప్పిస్తోంది. ఇటలీ వెళ్లిపోతే ఎలా ఉంటుందన్న ఆలోచన బుర్రను తొలవడం ప్రారంభించింది. పురావస్తునిపుణుల దృష్ట్యా పాలెమో, నేపుల్స్ లు తవ్వకాలకు ఎంతో యోగ్యమైన  ప్రదేశాలు. దాంతో ఇటలీలోని మ్యూజియం అధికారులను గిల్లడం మొదలుపెట్టాడు. ఈ ప్రదేశాలలో తను స్వేచ్ఛగా తవ్వకాలు జరపడానికి అనుమతిస్తే, వాటిలో బయటపడే వస్తువులను ఉంచడానికి సొంత ఖర్చుతో మ్యూజియం నిర్మించి ఇస్తానని ఆశపెట్టాడు.

ఈలోపల అతని పేరు మారుమోగడం ప్రారంభించింది. ట్రాయ్ లో అతను కనుగొన్న విశేషాల గురించి విని బ్రిటిష్ ప్రధాని గ్లాడ్ స్టన్ ముగ్ధుడయ్యాడు. ప్రముఖ ప్రాచ్య పండితుడు మాక్స్ ముల్లర్ వాటిపై ఒక వ్యాసం రాశాడు. జర్మనీలో అతని అనుకూల, వ్యతిరేకుల శిబిరాలు అప్పటికే ఏర్పడి యుద్ధం ప్రారంభించాయి. శిశిరం నుంచి శీతాకాలం ప్రారంభంవరకూ స్లీమన్ తన ట్రోజన్ నివేదికలకు పుస్తకరూపమిస్తూ గడిపాడు. మధ్య మధ్య ఫొటోల చేర్పుతో, Troianische Altertumer  అనే పేరుతో పూర్తి చేసిన ఆ పుస్తకాన్నీ, తనే చేసిన దాని ఫ్రెంచి అనువాదాన్నీ ప్రచురణకర్తకు పంపించాడు.

పుస్తకం పూర్తయ్యాక మళ్ళీ అస్తిమతంలోకి జారిపోయాడు. గ్రీకు ప్రభుత్వం ఒలింపియాలో తవ్వకాలు జరిపే హక్కును ప్రష్యన్ ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలిసి కోపంతో కుతకుతలాడాడు. మైసీనియా వెళ్ళి ప్రాథమిక పరిశీలన జరపాలని నిర్ణయించుకున్నాడు. ట్రాయ్ తరహా విజయాలను తను మరోసారి మూటగట్టుకునే అవకాశం అక్కడ తప్ప ఇంకెక్కడా ఉండదనుకున్నాడు.

Sophia_schliemann_treasure

సోఫియాను వెంటబెట్టుకుని, ఎవరికీ చెప్పకుండా రహస్యంగా మైసీనియాకు వెళ్లిపోయాడు. అప్పటికప్పుడు పనివాళ్లను నియమించుకున్నాడు. అయిదురోజులపాటు గిరిదుర్గం దగ్గర ముప్పైకి పైగా చిన్న చిన్న కందకాలను తవ్వించాడు. పెద్ద ప్రాముఖ్యం లేని కొన్ని కుండపెంకులు మాత్రం బయటపడ్డాయి. మైసీనియాలోని కోటగోడ లోపల వీరయుగం తాలూకు సమాధులు బయటపడగలవని తాను నమ్ముతున్నట్టు Ithaka, der Peloponnes und Troja అనే తన పుస్తకంలో చాలాకాలం క్రితమే రాసుకున్నాడు. ఆ నమ్మకం మరింత బలపడడమే ఈ అయిదురోజుల్లో అతను సాధించిన ముఖ్యమైన ఫలితం. కారణం చెప్పలేకపోయినా, ట్రాయ్ లో బంగారు నిక్షేపాలు ఉంటాయని ముందే ఊహించినట్టే; మైసీనియాలోని ప్రసిద్ధ సింహద్వారం (Lion Gate) దగ్గరలో, దానికి ఒకింత దూరంలో కచ్చితంగా రెండు గోపురం ఆకారంలోని శవాగారాలు(mortuary dome chambers) ఉంటాయని అతను ఊహించాడు. సింహద్వారానికి కొంచెం అవతల తవ్వితే తయస్టీస్, అగమెమ్నన్ తదితర మైసీనియా రాజుల సమాధులు బయటపడచ్చన్నాడు. ఇప్పటికే తను ఒడీసియస్ చితాభస్మాన్ని, ప్రియామ్ ప్రాసాదాన్ని వెలికి తీసి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. మైసీనియా రాజుల సమాధులను కూడా బయటపెడితే అది తనకు మరో కీర్తి కిరీటాన్ని అలంకరిస్తుందని అనుకున్నాడు.

అయితే దురదృష్టవశాత్తూ మైసీనియాలో తవ్వకాలను చేపట్టడానికి అతనికి అనుమతి లేదు. అక్కడ అతను రహస్యంగా తవ్వకాలు జరిపిస్తున్న వార్త గ్రీకు ప్రభుత్వం చెవిన పడనే పడింది. తక్షణమే వాటిని ఆపవలసిందిగా  ఆర్గోలిస్ (గ్రీస్ లోని ఒక ప్రాంతీయ పరిపాలనా విభాగం)ముఖ్యాధికారికి తంతి ఆదేశాలు పంపింది. ఆ తర్వాత, స్లీమన్ అంతవరకూ తవ్వితీసిన వాటిని జప్తు చేయవలసిందనీ, అతని పెట్టే బేడా సోదా చేయవలసిందనీ వెంట వెంటనే మరో రెండు టెలిగ్రాములు పంపింది.

ఈ పనులను నాఫ్లియోలోని పోలీస్ ఉన్నతాధికారికి అప్పగించారు. అతను స్లీమన్ ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. అతనితో కలసి ప్రశాంతంగా కాఫీ సేవిస్తూ సంగతేమిటని అడిగాడు. స్లీమన్ ఓ బుట్టెడు కుండ పెంకులు చూపించాడు. పురాతన నగరాల్లో అలాంటి కుండపెంకులు ప్రతి సందులోనూ, గొందులోనూ దొరుకుతాయనీ, విలువైనవేవీ తనకు కనిపించలేదనీ, కనుక అక్కడితో దానిని వదిలేశాననీ ఆ పోలీస్ అధికారి పైవాళ్ళకు రాశాడు.

ఎథెన్స్ కు తిరిగి వచ్చిన స్లీమన్, తనపై ప్రభుత్వం కత్తులు నూరుతున్న సంగతి గమనించాడు. ట్రాయ్ లో నిక్షేపాలను కనుగొన్నప్పటినుంచీ అతను అతిపెద్ద అనుమానితుల జాబితాలో చేరిపోయాడు. పోలీస్ అధికారి, ఆర్గోలిస్ ముఖ్యాధికారి, మైసీనియా మేయర్ చేతకాని దద్దమ్మలని గ్రీకు విద్యామంత్రి తిట్టిపోశాడు. “గ్రీసుకు ఎలాంటి రక్షణా లేదనీ; ఎవడైనాసరే చట్టాలను ఇష్టానుసారం కాలరాస్తూ ఈ నేలలోకి చొరబడి ఏమైనా చేయచ్చనీ తమ చర్యల ద్వారా నిరూపించా”రని దుయ్యబట్టాడు.

  (సశేషం)

 

 

ఆరు బుట్టల్లో, బస్తాలో బంగారం తరలించాడు

 

స్లీమన్ కథ-21

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

తవ్వకాలను కొనసాగించాడు. మరికొన్ని లింగాకృతులు, చక్కని పాలరాయి నుంచి చెక్కిన ఓ పక్షి గుడ్డు తప్ప ఇంకేవీ దొరకలేదు. నాలుగు నెలలుగా వర్షాలు లేవు. రోజుల తరబడీ హిస్సాలిక్ దిబ్బను ధూళి మేఘాలు కప్పేశాయి. అలాంటిది, హఠాత్తుగా కుంభవృష్టి. దిబ్బ అంతా బురద బురద అయిపోయింది. తవ్వకాలను నిలిపేశాడు. భార్యతో కలసి ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. మనిషి అస్వస్థంగా ఉన్నాడు. భార్యా, ముగ్గురు మేస్త్రీలూ, అంగరక్షకుడూ కూడా జ్వరంతో ఉన్నారు.

ఎథెన్స్ లో తిరిగి ఆరోగ్యం పుంజుకున్నాడు. ప్రియామ్ ప్రాసాదం తాలూకు ప్రణాళికను తెప్పించుకుని పరిశీలించిన బర్నూఫ్, అందులో కొన్ని లోపాలున్నాయనీ, ఫొటోగ్రాఫర్ సాయంతో మెరుగైన ప్రణాళికను తయారుచేయమనీ సూచించాడు. దాంతో నెల రోజుల తర్వాత ఫొటోగ్రాఫర్ ను వెంటబెట్టుకుని స్లీమన్ ట్రయాడ్ కు వెళ్ళాడు.

తీరా వెళ్ళాక, హిస్సాలిక్ దగ్గర నియమించిన కాపలాదారు పెద్ద పెద్ద రాళ్ళను చడీ చప్పుడు కాకుండా అమ్మేస్తున్న సంగతి బయటపడింది. సిప్లాక్ గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి కొన్ని రాళ్ళు వాడుకున్నారు. ఎహ్నీ షెహర్ అనే ఒక క్రైస్తవ గ్రామంలో గంటగోపురం నిర్మించడానికి మరికొన్ని వాడుకున్నారు. స్లీమన్ ఆగ్రహం పట్టలేకపోయాడు. అప్పటికప్పుడు ఆ కాపలాదారును తొలగించి అతని స్థానంలో ఒక సాయుధ కాపలాదారుని నియమించాడు. ఫొటోగ్రాఫులతో, కొత్త ప్రణాళికలతో ఎథెన్స్ కు తిరిగివెళ్ళాడు.

మరోవైపు ట్రాయ్ తవ్వకాల్లో అద్భుతాలేవీ బయటపడకపోవడం అతన్ని కుంగదీస్తూనే ఉంది. ఇంతవరకూ తవ్వకాలు జరపని ప్రదేశాల మీదికి అతని దృష్టి మళ్ళింది. సొంత ఖర్చు మీద మైసీనియా, ఒలింపియాలలో తవ్వకాలకు అనుమతించవలసిందిగా గ్రీకు ప్రభుత్వానికి రాశాడు. వాటిలో బయటపడే విలువైన సామగ్రిని తన జీవితాంతం దగ్గర ఉంచుకుంటాననీ, తన తదనంతరం అవి గ్రీకు జాతీయసంపద అవుతాయనీ షరతు పెట్టాడు. తన పేరుతో ఒక పురావస్తు ప్రదర్శనశాలను నిర్మించే ఒప్పందం మీద 2 లక్షల ఫ్రాంకులు ఇవ్వజూపాడు. కానీ ప్రభుత్వం అతని అభ్యర్థనలను తిరస్కరించింది. దాంతో తను శాశ్వతంగా ఎథెన్స్ ను విడిచిపెట్టి పారిస్ వెళ్లిపోతానని బెదిరించడం ప్రారంభించాడు.

3bf230edf319b9b3d4b1cb5b56972adc

కానీ ట్రాయ్ అతన్ని విడిచిపెట్టలేదు. అక్కడ అంతవరకూ కనుగొన్న వాటిలో ఎక్కువ భాగాన్ని బయటికి తరలించేశాడన్న ఆరోపణతో టర్కీ ప్రభుత్వం తన కిచ్చిన ఫర్మానాను రద్దు చేసినట్టు అతనికి తెలిసింది. తన తరపున జోక్యం చేసుకోవలసిందని కోరుతూ ఉన్నతస్థానాలలో ఉన్న పరిచితులకు ఎప్పటిలా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ఊదరగొట్టాడు. ఫలితంగా తవ్వకాల కొనసాగింపునకు అనధికారిక అనుమతి వచ్చింది. వెంటనే హిస్సాలిక్ కు తిరిగి వచ్చాడు. మార్చి 1నుంచీ పని ప్రారంభిస్తానని మిత్రులతో అన్నాడు కానీ, జనవరి 31 నాటికే పనిలోకి దిగిపోయాడు. ఉత్తరం నుంచి మంచుగాలులు వీస్తున్నాయి. గాలివానలు, చర్చి పండుగల బెడదకు అదనంగా ఊహించని మరో శత్రువు అతనికి ఎదురయ్యాడు. స్మిర్నాకు చెందిన ఒక వర్తకుడు లికొరిస్(liquorice) అనే ఒకరకం వేళ్ళను[మన దగ్గర ‘అతిమధురం’ అని పిలిచే ఈ వేళ్ళు దక్షిణ యూరప్ లోనూ, మన దేశంలోనూ, ఆసియాలోని మరికొన్ని ప్రాంతాలలోనూ దొరుకుతాయి] తవ్వితీయడం కోసం రోజుకు 12 నుంచి 23 పియాస్టర్ల కూలికి 150మంది గ్రామస్తులను పనిలోకి తీసుకున్నాడు. అది స్లీమన్ చెల్లించే కూలి కన్నా ఎక్కువ. నిశ్శబ్దంగా పళ్ళు నూరడం తప్ప అతను చేయగలిగిందేమీ లేకపోయింది. 1873, మార్చి 15న ఇలా రాసుకున్నాడు:

రాత్రిళ్ళు అతిశీతలంగా ఉంటున్నాయి. పొద్దుటిపూట ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయికి పడిపోతోంది. కానీ పగలు మాత్రం ఎండ దహించేస్తోంది. తరచు ఉష్ణోగ్రత 72 సెంటీగ్రేడ్లకు చేరుతోంది. చెట్ల ఆకులు మాడిపోతున్నాయి. ట్రాయ్ మైదానాన్ని వసంత కుసుమాలు కప్పేస్తున్నాయి. గత పదిహేనురోజులుగా చుట్టుపక్కల ఆవల్లోంచి లక్షలాది కప్పల బెకబెకలు చెవులు చిల్లులు పొడుస్తున్నాయి. గత ఎనిమిదిరోజుల్లో గూడకొంగలు తిరిగొచ్చాయి. నేను తవ్వకాలు జరిపిన చోట గోడల రంధ్రాలలో లెక్కలేనన్ని గుడ్లగూబలు గూడు కట్టుకుని, ఈ అడవి బతుకును మరింత నరకం చేస్తున్నాయి. ఏదో మార్మికతతోపాటు భయంగొలిపే వాటి అరుపులు రాత్రిళ్ళు మరీ దుర్భరంగా ఉంటున్నాయి.

స్లీమన్ ఆ దిబ్బమీద రెండడుగుల మందంగల గోడలతో ఒక చిన్న రాతి ఇల్లు, ఒక చెక్క ఇల్లు కట్టించాడు. రాతి ఇంటిని ఓ మేస్త్రీకి ఇచ్చి చెక్క ఇంట్లో తను ఉంటున్నాడు. గోడ పగుళ్ళలోంచి గాలి చొరబడుతోంది. మార్చి చివరిలో ఓ రోజు అర్థరాత్రి మూడు గంటలకు అతనికి హఠాత్తుగా మెలకువచ్చింది. గదంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఒక గోడ అప్పటికే తగలబడుతోంది. ఆ పడకగదిలో ఒక మూల, చెక్క పలకల మీద రాతితో ఏర్పాటు చేసిన నిప్పుగూడు ఉంది. రవ్వ పడి చెక్క అంటుకున్నట్టుంది. ఉధృతంగా వీస్తున్న ఉత్తరపు గాలి దానికి తోడైంది. గట్టిగా కేకలు వేస్తూ సోఫియాను నిద్రలేపి బయటికి పంపించేశాడు. స్నానాలగదిలోంచి నీళ్ళు తెచ్చి తగలబడుతున్న గోడ మీద కుమ్మరించాడు. ఈ కలకలానికి మేలుకున్న మేస్త్రీ వచ్చి తట్టలతో మట్టి ఎత్తిపోస్తూ మంటలు ఆర్పడానికి సాయపడ్డాడు.

ఇదంతా పావు గంటలో జరిగిపోయింది. కానీ, తనకు మెలకువ రావడంలో కేవలం కొన్ని క్షణాలు ఆలస్యమైతే తన పుస్తకాలు, కాగితాలు, తను భద్రపరిచిన పురావస్తువులు ఏమైపోయేవో; మరీ ముఖ్యంగా సోఫియా ఏమైపోయేదో నన్న ఊహ కొన్ని రోజులపాటు అతన్ని వెంటాడి వణికించింది.

మరోసారి విసుగూ, అలసటా అతని మీద దాడి చేస్తున్నాయి. ఉత్తరపు గాలి అదేపనిగా వేధిస్తూనే ఉంది. చర్చి శ్రాద్ధదినాలు దినదిన గండంగా మారి సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాయి. డబ్బు మంచినీళ్లలా ఖర్చైపోతోంది. ఇప్పటికీ రోజుకి 160 మందిని పనిలోకి దింపుతున్నాడు. నల్లని కుండలు, రాగితో చేసిన ఒక బల్లెపు పిడీ, మరికొన్ని బొంగరం ఆకారంలోని బొమ్మలు తప్ప విశేషంగా చెప్పుకోదగినవేవీ ఇప్పటికీ బయటపడడం లేదు. బయటపడినవి కూడా పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయాయి.

ఏప్రిల్ లో ఉత్తరపు గాలి ఉపశమించింది. మైదానమంతటా పసుపురంగు పువ్వులు పరచుకున్నాయి. ఇప్పుడు పనివాళ్లు మబ్బు విడిచిన ఆకాశం కింద ఆరుబయటే నిద్రపోగలుగుతున్నారు. స్లీమన్ ను కూడా తెలియని ప్రశాంతి ఆవహించింది. ఏదో అద్భుతాన్ని కనుక్కోబోతున్నాడన్న ఓ విచిత్రమైన స్ఫురణ అతనికి కలగడం ప్రారంభించింది. ఏప్రిల్ 16న, చప్టా చేసిన ఒక వీధీ, మనిషి ఎత్తున ఉన్న తొమ్మిది అతిపెద్ద మట్టి కూజాలూ బయటపడ్డాయి. అలాంటి కూజాలు అంతవరకూ ఎక్కడా వెలుగు చూడలేదు. అనంతర కాలంలో క్రీటు ద్వీపంలోని నోసస్ లో జరిగిన తవ్వకాల్లో మాత్రమే అలాంటివి బయటపడ్డాయి. స్లీమన్ లో ఉత్సాహం ఉరకలేసింది. ఆ తర్వాత, ఒకదాని కొకటి 20 అడుగుల ఎడమున్న రెండు ద్వారాలను కనుగొన్నాడు. వాటికి వెంటనే  ‘స్కెయిన్ గేట్’ అని పేరుపెట్టాడు. వాటి వెనక కనిపించిన ఓ పెద్ద భవనాన్నే ప్రియామ్ ప్రాసాదం అన్నాడు. అక్కడే మరికొన్ని కలశాలు, గుడ్లగూబ తలలూ కనిపించాయి.

స్లీమన్ సంతృప్తి చెందాడు. తన ఇన్నేళ్ల శ్రమా ఫలించబోతోందనీ, తను ఆశించిన వాటిని కనుక్కోబోతున్నాడనే నమ్మకం చిక్కింది. అంతవరకూ తను కనుక్కొన్నవాటిని వెల్లడి చేయబోతున్నట్టు ప్రకటించాడు. వాటిలో 200 చిత్రిత ఫలకాలు, 3500 చెక్కడాలు ఉన్నాయి. హిస్సాలిక్ లాంటి ఒక చిన్న దిబ్బ హోమర్ చిత్రించిన ట్రాయ్ అయ్యే అవకాశం లేదని జనం అనుకుంటారు, నిజమే. కానీ ఆ విశాలమైన ద్వారమూ, ప్రాసాదపు గోడలూ, సహజసిద్ధమైన రాళ్ళు పేర్చి నిర్మించిన దుర్గమూ, అసంఖ్యాకమైన నల్లమట్టి కుండల తాలూకు పెంకులూ, భారీ కూజాల్లాంటి పాత్రలూ,  వేల సంఖ్యలో ఉన్న కళాకృతులూ తను ట్రాయ్ ని కనుగొన్న సంగతిని రుజువు చేస్తున్నాయని స్లీమన్ భావించాడు.

అంతలో అతని ఉత్సాహంపై నీళ్ళు చల్లే వార్త…సోఫియా తండ్రి అవసానదశలో ఉన్నాడు. ఆమె వెంటనే బయలుదేరి ఎథెన్స్ కు వెళ్లింది. కానీ ఆమె వెళ్ళేటప్పటికే తండ్రి కన్ను మూశాడు. ఆ దిబ్బ మీద  ఇంట్లో స్లీమన్ ఒంటరిగా కూర్చుని భార్యకు ఓదార్పు లేఖ రాశాడు. అంత మార్దవం నిండిన లేఖ అతని మొత్తం లేఖలలోనే ఇంకొకటి లేదు:

అద్భుతవ్యక్తి అయిన మీ నాన్న దగ్గరికి మనందరం నేడో రేపో చేరేవాళ్ళమేనన్న సంగతిని గుర్తుచేసుకుని నిన్ను నువ్వు ఓదార్చుకోవాలి. మన ప్రియమైన కూతురికి తల్లి అవసరం ఎంతో ఉంటుందనీ, తల్లితోనే తన జీవితానందం అల్లుకుని ఉంటుందనీ అర్థం చేసుకుని నువ్వు ఓదార్పు పొందాలి. మన కన్నీళ్లు మీ నాన్నను తిరిగి తీసుకురాలేవనీ; ఎంతో ఉత్తముడూ, సాహసీ  అయిన మీ నాన్న ఈ జన్మ సంబంధమైన విచారాలకూ, తాపత్రయాలకూ దూరంగా; పరిశుద్ధమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడనీ; దుఃఖవిచారాలతో మగ్గుతూ ఈ భూమ్మీద మిగిలిపోయిన మనకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడనీ గ్రహించి నువ్వు ఓదార్పు పొందాలి. అయినా నువ్వు దుఃఖాన్ని జయించలేకపోతే, అందుబాటులో ఉన్న మొదటి ఆవిరిబోటు అందుకుని నా దగ్గరికి వచ్చెయ్యి. నీ దుఃఖ నివారణకు నేను చేయగలిగినవన్నీ చేస్తాను. నువ్వు లేకుండా ఇక్కడ ఎలాంటి తవ్వకాలూ జరగవు. త్వరలోనే రమ్మని ఆనందబాష్పాలతో వేడుకుంటున్నాను.

కొన్ని రోజుల తర్వాత సోఫియా బయలుదేరి వచ్చేసింది. తన అవసరం ఎక్కడో ఆమెకు బాగా తెలుసు. తను లేనిదే అతను ఒంటరి అయిపోతాడు. అతని జీవితవిజయాలన్నిటికీ ఆమె పతాకచిహ్నం.

వేసవి అడుగుపెడుతోంది. పసుపు రంగు పువ్వులు మాడిపోతున్నాయి. త్వరలోనే మైదానమంతా దగ్ధభూమి కాబోతోంది. జూన్ మధ్యనాటికి తవ్వకాలు ఆపేయబోతున్నాననీ; భార్యనూ, కూతురినీ మధ్య యూరప్ లోని ఏదైనా విశ్రాంతి స్థలానికి తీసుకువెళ్లదలచుకున్నాననీ- మే 30న కొడుకు సెర్గీకి స్లీమన్ ఉత్తరం రాశాడు. గత నాలుగు నెలల పనీ తన కెంతో సంతృప్తి నిచ్చిందన్నాడు. తను ట్రాయ్ ప్రాకారాలను, ప్రియామ్ ప్రాసాదం ఉనికినీ కనిపెట్టాడు. 250,000 మీటర్ల మేరకు మట్టి తవ్వాడు. ఒక మ్యూజియం మొత్తానికి సరిపడినన్ని పురావస్తువులను సేకరించాడు…

అదే రోజున ఫ్రాంక్ కల్వర్ట్ కు కూడా ఉత్తరం రాశాడు. హిస్సాలిక్ కు కొన్ని గంటల ప్రయాణదూరంలో, బునర్ బషీకి దగ్గరలో, తింబ్రియా అనే చోట కల్వర్ట్ కు ఒక ఎస్టేట్ ఉంది. అతనికి స్లీమన్ రాసిన ఉత్తరం, కొడుక్కి రాసిన ఉత్తరానికి  పూర్తి భిన్నమైన శైలిలో సాగింది. అందులో ఒకవిధమైన భయమూ, వణకూ తొంగిచూస్తున్నాయి.  నాటకీయంగా ఉండి; తన ప్రగాఢమైన ఆశలతో, కలలతో సన్నిహితంగా పెనవేసుకున్న ఇలాంటి లేఖ అతని జీవితం మొత్తంలో ఇదే:

నామీద గట్టి నిఘా పెట్టారని మీకు తెలపడానికి విచారిస్తున్నాను. కారణం తెలియదు కానీ, ఆ టర్కిష్ కాపలాదారు నామీద అదేపనిగా మండిపడుతున్నాడు. రేపు అతను నా ఇంటిని సోదా చేయబోతున్నాడు. కనుక, సొతంత్రం తీసుకుని ఆరు బుట్టలూ, ఒక బస్తా మీ దగ్గర భద్రపరచడానికి పంపుతున్నాను. దయతో వాటిని మీ ఇంట్లో ఉంచి తాళం వేయవలసిందిగానూ, వాటిమీద టర్కుల చేయి ఏవిధంగానూ పడకుండా చూడవలసిందిగానూ వేడుకుంటున్నాను.

ఆ ఆరు బుట్టలలోనూ, బస్తాలోనూ ఉన్నవి ట్రాయ్ తవ్వకాలలో బయటపడిన స్వర్ణ నిక్షేపాలు!

Troy-jewellery-Istanbul-Archaeoloy-Museum-8051

ఈ నిక్షేపాలు కచ్చితంగా ఏ తేదీన బయటపడ్డాయో తన ప్రచురిత రచనల్లో స్లీమన్ ఎక్కడా వెల్లడించలేదు. స్థలమూ, సమయమూ మాత్రం తెలుస్తున్నాయి. ఉదయం 7 గంటలకు, ప్రియామ్ ప్రాసాదానికి దగ్గరలోని ఒక చుట్టుగోడ(circular wall)కు అడుగున, బాగా లోతైన చోట అవి దొరికాయి. కల్వర్ట్ కు ఉత్తరం రాసిన మే 30నో, లేదా అప్పటికి కొన్ని రోజుల ముందో స్లీమన్ కు అవి కనిపించి ఉంటాయి. తను నిక్షేపాలను కనుగొన్నాననీ, అయితే సమయం లేక వాటిని ఇంకా పరిశీలించడం, లెక్కించడం చేయలేదనీ మే 31న అతను మొదటిసారి తన నివేదికలో రాశాడు. అంటే, ఈ మాటలు రాయడానికి ముందే ఆ నిక్షేపాలను కల్వర్ట్ ఇంటికి తరలించి ఉంటాడు.

వేర్వేరు సమయాలలో రాసిన మూడు వేర్వేరు కథనాలను బట్టి, మే నెలలో విపరీతంగా ఎండ కాసే ఒకరోజున అతను ఈ నిక్షేపాలను కనిపెట్టాడని అర్థమవుతోంది. ఆరోజున మైదాన మంతటినీ తళతళలాడే పసుపురంగు ధూళి పొగలా కమ్మేసింది. అంతకు ఎనిమిదిరోజుల ముందు అతనికి ఒక భారీ వెండి కలశం కనిపించింది. దానిలోపల ఓ చిన్న వెండి చెంబు ఉంది. దానికి దగ్గరలోనే ఒక రాగి శిరస్త్రాణం ఉంది. అది ఛిద్రమైనా, లింగాకారంలోని దాని కొమ్ములు మాత్రం భద్రంగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల కచ్చితంగా మరికొన్ని నిక్షేపాలు కనబడతాయన్న అంచనాతో తవ్వకాలు కొనసాగించాడు.

పనివాళ్లను గుంపులు గుంపులుగా విడదీసి వేర్వేరు చోట్ల తవ్వకాలు జరపడానికి పంపించేశాడు. వాళ్ళు కందకాల్లోనూ, నడవల్లోనూ పనిచేసుకుంటూ ఉంటే, నిక్షేపాలను గుట్టు చప్పుడు కాకుండా దిబ్బ మీది తన ఇంటికి తరలించవచ్చని అతని ఆలోచన. ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధి అమీన్ ఎఫెన్డీ ఆ సమీపంలో లేకుండా జాగ్రత్తపడాలనుకున్నాడు.

స్లీమన్, అతని భార్య, కొద్దిమంది పనివాళ్లు స్కేయిన్ గేటుకి దగ్గరలోని చుట్టుగోడ పొడవునా తవ్వకాలు జరుపుకుంటూ వెళ్లారు. 28 అడుగుల లోతున, విశేషమైన పనితనం కలిగిన ఒక రాగి పేటిక లాంటిది అతనికి కనిపించింది. పైన పేరుకుపోయిన దుమ్మును, ధూళిని పక్కకు తప్పిస్తూ చూసి, అది మూడడుగుల పొడవూ, 18 అంగుళాల ఎత్తూ ఉంటుందని అంచనా వేశాడు. ఆ పేటిక పైన శిరస్త్రాణం ఆకారంలోని రెండు వస్తువులు, ఒక భారీ దీపపు కుందె లాంటిది ఉన్నాయి. ఆ పేటిక బద్దలై ఉంది. అందులోంచి కొన్ని వెండి పాత్రలు తొంగి చూస్తున్నాయి. దానికి చుట్టుపక్కల నాలుగైదు అడుగుల మందాన ఎరుపు, గోధుమ రంగుల్లో ఉన్న దగ్ధశిథిలాలు ఉన్నాయి. అవి రాయంత కఠినంగా ఉన్నాయి. వాటికిపైన అయిదడుగుల వెడల్పు, ఇరవై అడుగుల ఎత్తు ఉన్న భారీ రక్షణకుడ్యాలు ఉన్నాయి.

ఎట్టకేలకు నిక్షేపాలను కనిపెట్టాననుకున్నాడు. టర్కుల చూపు పడకుండా వాటిని రక్షించడ మెలా అన్నది తక్షణ సమస్య. పనివాళ్లలో ఎవరూ పసిగట్టలేదు. సోఫియా అతని పక్కనే ఉంది. ఆమెవైపు తిరిగి, “నువ్వు వెంటనే వెళ్ళి ‘పైడోస్’ అని కేకపెట్టు” అని చెప్పాడు. పైడోస్ అనే ఆ గ్రీకు మాటకు సెలవుదినం అని అర్థం.

సోఫియా అప్పటికింకా నిక్షేపాలను గమనించలేదు. దాంతో ఆశ్చర్యపోయింది. “అదేమిటి, ఇంత హఠాత్తుగా?” అని అడిగింది. “అవును. ఇవాళ నా పుట్టినరోజనీ, ఇప్పుడే ఆ సంగతి గుర్తొచ్చిందనీ చెప్పు. పని చేయకపోయినా ఈరోజుకు పూర్తి వేతనం ఇస్తామని చెప్పు. అంతా ఊళ్ళకు వెళ్లిపోతారు. ఆ ఓవర్సీర్ ఇక్కడికి రాకుండా చూడు. త్వరగా వెళ్ళు. పైడోస్ అని కేకపెట్టు” అని స్లీమన్ ఆమెను తొందరపెట్టాడు.

 

సోఫియా చెక్క నిచ్చెన ఎక్కి, పైకి వెళ్ళి అతను చెప్పినట్టే చేసింది. సెలవుదినాలను ప్రకటించడం ప్రతిసారీ సోఫియా వంతు. వెంటనే పనివాళ్లు తవ్వకాలు ఆపేసి వెళ్లిపోవడం ప్రారంభించారు. అనుకోని విధంగా వేతనంతో సెలవు దొరికినందుకు సంతోషించినా, ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా హఠాత్తుగా సెలవు ప్రకటించలేదు కనుక కొంత అయోమయానికి గురయ్యారు. ప్రభుత్వ ప్రతినిధి అమీన్ ఎఫెన్డీ మరింత విస్తుపోయాడు. తనకు ముందుగా చెప్పకుండా ఇంత ఆకస్మికంగా ఎప్పుడూ సెలవు ప్రకటించలేదు.

(సశేషం)

 

 

 

 

 

 

 

నిధుల వేటలో…ఆశనిరాశల ఊగిసలాటలో…

 

స్లీమన్ కథ-20

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

నిజానికి ఈ విడత తవ్వకాలలో బయటపడినవన్నీ అతనికి చిక్కుముడులుగానే కనిపిస్తున్నాయి. గుడ్లగూబ ఎథెనా పవిత్రచిహ్నమనీ, ఎథేనియన్ నాణేలపై అది ఉంటుందనీ అతనికి తెలుసు. కానీ, ఇక్కడ కనిపించిన గుడ్లగూబ చిహ్నాలు  మరీ చరిత్రపూర్వకాలానికి చెందినవిలా ఉన్నాయి. తను రాతి యుగపు అవశేషాలను వెలికితీశాడా అనుకున్నాడు. నిరుత్సాహం చెందాడు. అభిప్రాయం కోరుతూ ఫ్రాంక్ కల్వర్ట్ సోదరుడు జేమ్స్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు. అతను జవాబు రాస్తూ, అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదనీ, క్రీ.పూ. 6,7 శతాబ్దుల వరకూ గ్రీకులు చిత్రిత మృణ్మయ పాత్ర(painted pottery)లను తయారుచేసుకోలేదనీ, మీకు కనిపించిన మూర్తుల్లాంటివి ఇంతకుముందు తవ్వకాల్లో కూడా బయటపడ్డాయనీ అన్నాడు. మరీ ఆటవికకాలానికి చెందిన ప్రదేశంలో తవ్వకాలు జరుపుతున్నాననుకుని నిరుత్సాహపడనవసరంలేదనీ, ముందుకు సాగమనీ ధైర్యం చెప్పాడు.

స్లీమన్ తవ్వకాలు కొనసాగించాడు. లింగాకృతులు, బొంగరం రూపంలోని మట్టి బొమ్మలు ఇంకా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఈ బొంగరం ఆకారంలోని బొమ్మలు విచిత్రంగా ట్రాయ్ మైదాన ప్రాంతంలోని శ్మశానం దిబ్బల్ని పోలి ఉన్నాయి. లావా కత్తులు(లావా వేగంగా ప్రవహిస్తూ, మంచి పదును కలిగిన నల్లని గాజు రూపంలో గడ్డకడుతుంది. దానిని కత్తిగా ఉపయోగించేవారు)కూడా కనిపించాయి. అవి ఎంత పదునుగా ఉన్నాయంటే, బహుశా వాటిని రేజర్లుగా వాడేవారేమోనని స్లీమన్ అనుకున్నాడు. ఆపైన కాల్చిన మట్టితో(terracotta) చేసిన చిన్న చిన్న పడవ బొమ్మలు కనిపించాయి. అవి భారతదేశంలో కనిపించే పడవల్లా ఉన్నాయి. ఈ వస్తువులన్నీ భారత్ నుంచి వ్యాపించి ఉండచ్చని అనుకున్నాడు. ఇక్కడ కనిపించిన లింగాకృతులను బట్టి ఈ ప్రదేశానికి వేదకాలపు భారతదేశంతో ఏదో సుదూరసంబంధం ఉండి ఉంటుందని భావించాడు. అయితే, ఈజిప్టుకు చెందినదా అనిపించే వెలిసిపోయిన శాసనలిపీ కనిపించింది. అక్కడక్కడ మట్టి పలకలపై చెక్కిన స్వస్తిక చిహ్నాలు బయటపడ్డాయి. బొంగరం ఆకారంలోని మట్టి బొమ్మల్లానే ఇవి కూడా అతనికి విస్తుగొలిపాయి.

నవంబర్ 16న, పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన గోడల్లో ఒకదానినీ, ఒక పెద్ద ద్వారబంధాన్నీ తవ్వితీయడానికి పురమాయించాడు.  ఆరోజు మూడు గంటల సేపు అరవై అయిదుగురు పనివాళ్లు చెమటోడ్చినా అవి లొంగలేదు. మరునాడు కూడా ఆ పని కొనసాగింది. నవంబర్ 18 సెలవు దినం. ఆరోజు పని చేయబోమని సిబ్బంది చెప్పేశారు. దాంతో స్లీమన్ తవ్వకాల నివేదిక రాసుకుంటూ గడిపాడు. ఈ నివేదికల ప్రతులను ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులకు పంపడం అతనికి పరిపాటి.  లింగాకృతులు, బొంగరం ఆకారంలోని బొమ్మలు, లావా కత్తులు, స్వస్తికచిహ్నాలు, శాసనపు రాతలూ అతనికి ఎంత కొరకరాని కొయ్య లయ్యాయంటే; తనే సర్వజ్ఞుడనుకునే ఆ మనిషి కాస్తా, వాటి గురించి తెలియచెప్పి పుణ్యం కట్టుకోండంటూ తనదైన శైలిలో పండితులకు విజ్ఞప్తి చేశాడు. తను ఈ శీతాకాలాన్ని ఎథెన్స్ లో గడుపుతాననీ, అక్కడి తన చిరుమానాకు రాయవలసిందనీ కోరాడు.

ఉత్తరం నుంచి వీచే తీవ్రమైన చలి గాలులు ట్రాయ్ మైదానాన్ని ఊపేస్తున్నాయి. అయినాసరే, పెద్ద చలికోటు, నెత్తిన హెల్మెట్ తో టంచన్ గా పనిలోకి దిగిపోయి సిబ్బందిని పరుగులెత్తించే స్లీమన్, సాధ్యమైన చివరి క్షణం వరకూ తవ్వకాలను జరిపించాల్సిందే ననుకున్నాడు. కానీ, నవంబర్ 24నుంచీ రెండు రోజులపాటు పెద్ద తుపాను విరుచుకుపడడంతో తప్పనిసరై తవ్వకాలను ఆపేసి ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. ఆ నిర్బంధ విరామంలో కొంత కాలాన్ని స్వస్తికాలపై తను రాసుకున్న సమాచారానికి వ్యాసరూపమిస్తూ గడిపాడు. నాజీ స్వస్తికాలలా కాకుండా అసలైన స్వస్తికాలు కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. ప్రపంచంలో అవి కనిపించని చోటు అంటూ లేదు. పురాతన చైనా చెక్కడాలపై, మిలాన్(ఇటలీ)లోని సెయింట్ యాంబ్రోస్ వేదికపై, నార్ఫిక్(ఇంగ్లండ్)లో కనిపించిన కెల్టిక్ అంత్యక్రియల కలశాలపై, రామాయణంలో వర్ణించిన ఓడల ముందు భాగంపై స్వస్తికచిహ్నాలు ఉన్నాయి. ఒక పుస్తకం రాయడానికా అన్నట్టుగా స్వస్తికాలపై అతను విస్తారమైన సమాచారాన్ని సేకరించిపెట్టుకున్నాడు.

విరామ కాలంలో ఎక్కువ సమయాన్ని తన పరిశోధన వ్యాసాలకు మెరుగులు దిద్దుకోవడం లోనే గడిపాడు. అవి అయిదు విడతలుగా అస్పెర్గర్స్ ఆల్గమైనా సైటూంగ్ లో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత ‘ట్రోజనీష్ ఆల్టట్యూమర్’(Trojan Antiquities) పేరుతో పుస్తకరూపం ధరించాయి. స్లీమన్ ప్రారంభ వ్యాసాలపై ప్రముఖ గ్రీకు అధ్యయనవేత్త ఎర్నెస్ట్ కర్టియస్ స్పందిస్తూ, బునర్ బషీయే ట్రాయ్ తప్ప స్లీమన్ భావించినట్టు హిస్సాలిక్ కాదని నొక్కి చెప్పాడు. దాంతో స్లీమన్ అతనిపై మండిపడ్డాడు. ట్రాయ్ రాజప్రాసాదాలు హిస్సాలిక్ లో కాక, ఇంకెక్కడో ఉంటాయని భావించేవాడు వట్టి మూర్ఖుడనీ, కాకపోతే లోయ మీదుగా ట్రాయ్ నగరం బునర్ బషీ వరకూ విస్తరించి ఉండచ్చనీ అన్నాడు.

లింగాకృతులు, బొంగరం ఆకారంలోని బొమ్మలు గడ్డు ప్రశ్నలుగా మారినా, తను పురాతన ట్రాయ్ నగరాన్ని కనుగొన్నానని అతను ఇప్పటికీ దృఢంగా నమ్ముతున్నాడు. ట్రాయ్ నగరం కేవలం ఊహల్లో తప్ప ఉనికిలో లేదని ఎర్నెస్ట్ రెనాన్, మాక్స్ ముల్లర్, లాంగ్ పెరియా లాంటి మహాపండితులు సైతం కొట్టిపారేసినా, స్లీమన్ మాత్రం అది నిజంగా ఉందని నిర్ధారణకు వచ్చాడు. 1872 మార్చిలో తన నాలుగో విడత తవ్వకాలకు ఎథెన్స్ నుంచి బయలుదేరి వెడుతూ, “హోమర్ పై నాది చెక్కు చెదరని విశ్వాసం. ప్రియామ్ ప్రాసాదాన్నీ, పురాతన ట్రాయ్ దుర్గాన్నీ కనుక నేను వెలుగులోకి తీసుకురాగలిగితే ప్రపంచవ్యాప్తంగా అదో పెద్ద సంచలనం అవుతుంది. ఆ కాలపు చారిత్రక, పవిత్ర అవశేషాలను దర్శించడానికి వందలు, వేల సంఖ్యలో హోమర్ అభిమానులు తరలివస్తారు” అని రాసుకున్నాడు.

bhaskar3

స్వస్తిక చిహ్నం కలిగిన ఒక దేవత

ఎంతో ఆత్మవిశ్వాసంతో నాలుగో విడత తవ్వకాలకు సిద్ధమయ్యాడు. లండన్ లోని అతని మాతృసంస్థ బ్రదర్స్ ష్రోడర్స్ కంపెనీ అరవై తోపుడుబళ్ళను, నాణ్యమైన ఇంగ్లీష్ పారలను, తేలికరకపు గొడ్డళ్లను కానుకగా పంపింది. మార్చి చివరిలో భార్యతో సహా దర్దనెల్లెస్ చేరుకుని ఏప్రిల్ 5న తవ్వకాలను పునః ప్రారంభించాడు.

పనివాళ్లతో సమస్యలు మామూలే. దానికితోడు వరసపెట్టి గాలివానలు, గ్రీకు పండుగ దినాలు. తొలి పదిహేనురోజుల్లో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పని జరిగింది. కొన్ని రోజులు వందమందిని, మరి కొన్ని రోజులు 126 మందిని పనిలోకి తీసుకున్నాడు. సగటున రోజుకు 20 మంది పనివాళ్ళ చొప్పున 300 ఫ్రాంకులు చెల్లించానని లెక్క వేసుకున్నాడు. మూడు వారాల తర్వాత ఒక రోజున పనివాళ్ళు పొగ తాగుతుండడం చూసి స్లీమన్ కేకలేశాడు. దాంతో వాళ్ళలో కొంతమంది ఎదురు తిరిగి పని మానుకుంటామని బెదిరించారు. పని చేసుకుంటున్న మిగిలిన వాళ్ళ మీద రాళ్ళు విసిరారు.

స్లీమన్ వెంటనే చర్యకు దిగాడు. దాదాపు అందరినీ పనిలోంచి తీసేశాడు. ఆరోజు రాత్రంతా నిద్రపోకుండా కొత్త పనివాళ్ళను వెతికాడు. మరునాడు విజయవంతంగా 120 మంది కొత్తవాళ్లను రంగంలోకి దింపాడు. పని చురుగ్గా సాగడం లేదని అదనంగా ఇంకో గంట పని చేయించాలనుకున్నాడు. ఉదయం ఓ గంట ముందుకు జరిపి, అయిదు నుంచే పని చేయించడం ప్రారంభించాడు. అయినాసరే, మధ్యలో గ్రీకు ఈస్టర్ పండుగ రావడంతో ఆరు రోజులపాటు తవ్వకాలు ఆగిపోయాయి. ఎలాగైనా తవ్వకాలు కొనసాగేలా చూడడానికి పనివాళ్ళకు అదనపు కూలీని ఎరేశాడు, బతిమాలాడు, బెదిరించాడు, సోమరిపోతులంటూ తిట్టిపోశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇంకోవైపు, తవ్వకాలలో చెప్పుకోదగినవీ బయటపడడం లేదు. ఎలకను పట్టడానికి కొండను తవ్వుతున్నానా అనుకుంటూ తీవ్రనైరాశ్యంలోకి జారిపోయిన క్షణాలూ ఉంటున్నాయి.

మే నెలలో మరికొన్ని శ్రాద్ధదినాలు వచ్చాయి. ఎక్కువ వేతనం ఇస్తానని ఆశపెట్టి తవ్వకాలు కొనసాగేలా చూడడానికి యధావిధిగా ప్రయత్నించాడు. చర్చి పెద్దలు మా తోలు తీస్తారంటూ పనివాళ్ళు తిరస్కరించారు. సెలవు దినాల్లో తరచు పనివాళ్ళ ఇళ్లకు వెళ్ళేవాడు. వాళ్ళల్లో, లేదా కుటుంబసభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో తీసుకుంటూ ఉంటే మందులు సూచించేవాడు. అప్పట్లో సాధారణంగా గ్రీకు పూజారులే వైద్యం కూడా చేసేవారు. రోగి ఒంటి మీద గాటు పెట్టి, లోపల మెత్తని దూది పెట్టి మండించిన ఓ చిన్న కప్పును దాని మీద బోర్లించి అందులోకి రక్తం తీసుకునేవారు. ఆ నాటువైద్యం చూసి స్లీమన్ భయభ్రాంతుడైపోయాడు. అలా పసిపిల్లలనుంచి కూడా రక్తం తీయడం మరింత బెంబేలెత్తించింది. అందువల్ల పిల్లల్లో మాటి మాటికీ రక్తస్రావం అవుతుండడం గమనించి, వాళ్ళ పెదవుల చుట్టూ ఉండే లోతైన ముడతలే అందుకు కారణమని తీర్మానించాడు. రోగి ఒక్క రక్తపు చుక్క కూడా చిందించనవసరం లేకుండా తను నయం చేస్తూవచ్చాననీ, దాదాపు అన్ని రోగాలకూ విరుగుడుగా ఉప్పునీటినీ, సముద్రస్నానాన్నీ సూచించి అద్భుతాఫలితాలు సాధించానని అతను చెప్పుకున్నాడు.

ఓ రోజున ఒంటినిండా పుళ్ళు పడిన ఓ అమ్మాయిని అతని దగ్గరికి తీసుకొచ్చారు. ఆమె ఎడమ కన్ను పూర్తిగా పుండు పడిపోయింది. విపరీతంగా దగ్గుతూ ఒక్క అడుగు కూడా వెయ్యలేని స్థితిలో ఉంది. ఒక డోసు ఆముదం తాగించమనీ, సముద్ర స్నానాలతోపాటు ఛాతీ విశాలం కావడానికి కొన్ని అభ్యాసాలు చేయించమనీ చెప్పాడు. రెండు వారాల తర్వాత ఆ అమ్మాయి తన ఊరి నుంచి మూడు గంటల ప్రయాణదూరంలో ఉన్న హిస్సాలిక్ కు అవలీలగా నడచివచ్చి స్లీమన్ పాదాల మీద పడి, అతని బూట్లను ముద్దుపెట్టుకుంది. మొదటి సముద్రస్నానానికే తనలో తిరిగి ఆకలి పుట్టిందని చెప్పింది. ఎడమ కన్ను బాగుపడుతుందన్న ఆశ లేకపోయినా ఒంటి మీద పుళ్ళు చాలావరకూ మానిపోయాయి. ఈ అమ్మాయి ఉదంతాన్ని ప్రతిసారీ అతను గర్వంగా చెప్పుకునేవాడు.

వేసవి వచ్చింది. ఆకాశం ఉష్ణం కక్కుతోంది. ఆవల్లోని కప్పల బెకబెకలతో రాత్రిళ్ళు దద్దరిల్లుతున్నాయి. సన్నగా, గోధుమ రంగులో ఉండే చిన్న చిన్న రక్తపింజరలు తిరిగే కాలమది. అవి చాలా ప్రమాదకరమైనవి. తవ్వకాలు జరిగేచోట శిథిల్లాల్లోంచి కూడా వస్తున్నాయి. గ్రామస్తులు పాము విషానికి ముందస్తు విరుగుడుగా ఒక రకం మూలికతో కషాయం తాగుతారని తెలిసి స్లీమన్ కూడా దానిని చేయించుకుని తాగాడు.

ఆ దిబ్బ మీద లోతైన కందకాలు తవ్విస్తున్నప్పుడు పెద్ద పెద్ద గోడలు కుప్పకూలి పనివాళ్లు ఆ శిథిలాల కింద కప్పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్నడూ, ఏ ఒక్కరూ పెద్దగా గాయపడకపోవడం చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యేవాడు. అదో అద్భుతంలా అనిపించేది. ఒక కోతి చెట్టెక్కినంత అవలీలగా ఆ దిబ్బ ఎక్కేవాడు. రోజంతా పనివాళ్లతో కలసి ఒళ్ళు అరగదీసుకునేవాడు. రాత్రిళ్ళు నిద్ర కాచుకుంటూ నోట్సు రాసుకునేవాడు.

అయితే, పురావస్తు తవ్వకాలకు సంబంధించి అతనికి శాస్త్రీయపరిజ్ఞానం లేదు. నిజానికి అప్పటి కింకా ఆ శాస్త్రం శైశవదశలోనే ఉంది. ఎథెన్స్ లోని ఫ్రెంచ్ స్కూల్ డైరక్టర్ గా ఉన్న ఎమీల్ బర్నూఫ్ చాలా విషయాల్లో అతని అజాగ్రత్తను ఎత్తి చూపుతూ గట్టిగా మందలించాడు. లింగాకృతులు, బొంగరం ఆకృతులు, కుండ పెనుకులు వగైరాలను కేవలం తవ్వి తీస్తే సరిపోదనీ; అవి ఎలా ఉన్నాయో, ఏ పరిస్థితిలో ఉన్నాయో, ఏ ప్రదేశంలో బయటపడ్డాయో-తేదీ, సమయంతో సహా అన్ని వివరాలూ పూసగుచ్చినట్టు డే బుక్కులో నమోదు చేయాలనీ హెచ్చరించాడు. అలా చేయనప్పుడు మీరు ఎలాంటి అద్భుతాలను వెలికితీసినా వాటి గురించి ఎప్పటికీ ఒక కచ్చితమైన నిర్ధారణకు రాలేరనీ పాఠం చెప్పాడు. అప్పటినుంచీ స్లీమన్ వివరాల నమోదుపై మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ, ప్రతి వస్తువుకూ కాగితంపట్టీ అతికిస్తూ వచ్చాడు. పురావస్తు తవ్వకాలలో ఒక పద్ధతి ప్రకారం కచ్చితమైన సమాచారాన్ని పొందుపరచడం ఎంత ముఖ్యమో క్రమంగా అతనికి అనుభవపూర్వకంగా అర్థమైంది.

అయినాసరే, ఇప్పటికీ తవ్వకాల్లో గొప్ప మెరుపులేవీ బయటపడడం లేదు. పెద్ద పెద్ద ప్రాకారాలు, అక్కడక్కడ పొడవైన అంకిత పాఠాలు లిఖించిన పాలరాయి పలకలు వెలుగు చూశాయి. అయితే అవి అనంతరకాలాలకు చెందినవి. ఆపైన కొన్ని భారీ కూజాల లాంటివీ, నల్లని మృణ్మయపాత్రలూ దొరికాయి. రాజు ప్రియామ్, రాకుమారుడు హెక్టర్, అఖిలెస్ లకు చెందినవేవీ కనిపించలేదు.

bhaskar2

ట్రాయ్ తవ్వకాల్లో దొరికిన స్వస్తిక చిహ్నం

అంతలో హఠాత్తుగా జూన్ 18, 1872న  రాతిమీద మలచిన ఒక చిత్రం బయటపడింది. అపోలో అనే దేవుడు నాలుగు సూర్యుని గుర్రాలపై స్వారీ చేస్తున్న చిత్రం అది. చిన్నదైనా అందులో చక్కని పనితనం ఉట్టిపడుతోంది. ఆ గుర్రాలను పైపైన చెక్కినప్పటికీ వాటిలో జవాసత్వాలే కాక, గొప్ప శిల్ప నైపుణ్యం తొంగి చూస్తోంది. అపోలో, బంగారు వన్నెలీనే తన శిరోజాలపై పది దీర్ఘ కిరణాలు, పది హ్రస్వ కిరణాలతో మలచిన కిరీటాన్ని ధరించి ఉన్నాడు. ఆ చిత్రం ట్రాయ్ కాలానికి తర్వాతిది, బహుశా టోలెమీల కాలానికి చెందినది. అయినాసరే, స్లీమన్ దానిని చూసి ముగ్ధుడయ్యాడు.  ఫ్రాంక్ కల్వర్ట్ కు చెందిన భాగంలో కనుగొన్నాడు కనుక అతని సాయంతో దానిని తక్షణమే బయటికి తరలించాడు. ఆ చిత్రం చాలా ఏళ్లపాటు ఎథెన్స్ లోని అతని ఇంటి తోటను అలంకరించింది.

ఒక పక్క వేసవి ముదురుతున్నా, హోమర్ చిత్రించిన ట్రాయ్ ఆనవాళ్ళు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఉండి ఉండి నైరాశ్యం అతన్ని కుంగదీస్తోంది. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి, ఆ దిబ్బ ఉత్తరం వాలున ఓ పెద్ద చప్పరా(terrace)న్ని, ఓ రాతిగోపురాన్ని వెలికితీయించాడు. అయినాసరే, రోజు రోజుకీ అతనిలో సందేహాలు పెరిగిపోతున్నాయి. కాన్ స్టాంట్ నోపిల్ లోని బ్రిటిష్ కాన్సూల్ మరో 20 తోపుడు బళ్ళను,10 లాగుడు బళ్ళను, 6 గుర్రపు బళ్ళను; పెద్ద సంఖ్యలో రకరకాల తవ్వుడు సామగ్రిని పంపించడంతో పనైతే సునాయాసంగా జరిగిపోతోంది కానీ, స్లీమన్ లో మాత్రం ఆశ అడుగంటిపోతోంది.

ఆ వేసవిలో మొదటిసారి అతనిలో అలసటా, అనారోగ్యం తొంగిచూశాయి. వెనకటి ఉత్సాహం మందగించింది. టర్కీ ప్రభుత్వం ఇచ్చిన ఫర్మానాను మంచి వనరులున్న ఏ పురావస్తు సంస్థకో, విదేశీ ప్రభుత్వానికో అప్పగించి చేతులు దులుపుకుందామా అనుకున్న క్షణాలున్నాయి. తన డబ్బంతా వృథా అవుతోందన్న చింత పట్టుకుంది. ఆపైన రోజుల తరబడి గాలిదుమారం రేగుతోంది. పనివాళ్ళకు ఎదురుగా ఏముందో కూడా కనిపించని పరిస్థితి. జులై రాగానే దుర్వాసనతో కూడిన చీడ వ్యాపించడం ప్రారంభించింది. కుళ్ళిపోయిన లక్షలాది కప్పల కళేబరాలనుంచి అది వ్యాపిస్తోందని స్లీమన్ అనుకున్నాడు. హిస్సాలిక్ దిబ్బ మీద అతను కట్టించిన ఇంటి దూలాలమీంచి పాములు కింద పడుతున్నాయి. వాటికితోడు తేళ్ళ భయం,

ఒక్కోసారి ఒంటరితనం నుంచి బయటపడడానికి పొరుగునే ఉన్న ఓ గ్రామానికి వెళ్ళేవాడు. అక్కడ ఒక గ్రీకు దుకాణదారు పరిచయమయ్యాడు. అతని పేరు కొస్తాదినోస్ కొలబాస్. పుట్టుకతోనే వికలాంగుడు. ఇటాలియన్, ఫ్రెంచి భాషలు తెలుసు. ఇలియడ్ ను పేజీలకు పేజీలు అప్పజెప్పేవాడు. అతనితో పండితగోష్ఠిని స్లీమన్ ఆనందించేవాడు. విసిరేసినట్టు ఉన్న ఆ మారుమూల ప్రాంతంలో అతనికి ఒకింత ఉల్లాసం కలిగించింది అదొక్కటే.

ఆగస్టు 4…అప్పటికే అతను జ్వరంతో బాధపడుతున్నాడు. ఇక ఆ వేసవిలో తవ్వకాలు ఆపేద్దామనుకుంటున్నాడు. అంతలో అతను ఎదురుచూస్తున్న నిధి మొదటసారి కంటబడింది. ఆనందపు అంబర మెక్కించేంత గొప్ప నిధిగా అతనికి తొలిచూపులో కనిపించలేదు. మూడు బంగారు చెవిపోగులు, ఒక బంగారు బొత్తం…! దగ్గరలోనే ఒక అస్థిపంజరం. అది ఒక యవతిదనీ; ఎముకల రంగును బట్టి, ట్రాయ్ తగలబడినప్పుడు మంటల్లో చిక్కుకుని మరణించి ఉంటుందనీ స్లీమన్ అంచనాకు వచ్చాడు.

(సశేషం)

 

 

ట్రాయ్ తవ్వకాలలో ‘శివలింగా’లు, యోని చిహ్నాలు

 

స్లీమన్ కథ-19

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అన్ని వైపులనుంచీ దాడికి సిద్ధమైన స్లీమన్, మొదటగా టర్కీలో అమెరికా రాయబారిగా ఉన్న వేన్ మేక్విగ్ కు ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. దానికి 4వేల పియాస్టర్లను జతపరిచాడు. తను హిస్సాలిక్ వెళ్లడానికీ, అక్కడి దిబ్బను కొనుగోలు చేయడానికీ విద్యామంత్రి సఫ్వెట్ పాషా ఒకవైపున అనుమతిస్తూనే, ఇంకోవైపు 3వేల పియాస్టర్లకు తనే దానిని కొనేసి మోసగించాడనీ; ఆ దిబ్బ తనకే చెందాలనీ, కనుక  మీ జోక్యాన్ని కోరుతూ దాని మూల్యం 3వేల పియాస్టర్లతో పాటు, మీ ఖర్చుల నిమిత్తం మరో వెయ్యి పియాస్టర్లు పంపుతున్నాననీ అందులో రాశాడు. ఇది వ్యాపార లావాదేవీ కాదనీ, చరిత్రకు సంబంధించిన ఒక అతి పెద్ద చిక్కుముడిని విప్పడానికి జరిపే ప్రయత్నమనీ, ఇందులో మనం వేసే ప్రతి అడుగూ మొత్తం నాగరిక ప్రపంచపు ప్రశంసలను అందుకుంటుందనీ అన్నాడు. ఆపైన కాన్ స్టాంట్ నోపిల్ లోని అధికారులకు మరెన్నో లేఖలు గుప్పించాడు. వాటిలో బెదిరింపులు, వేడికోళ్ళు, శాపనార్ధాలతో సహా అన్ని రకాల బాణీలనూ రంగరించాడు.

అయితే, ఈ లోపున అత్యవసరంగా పట్టించుకోవలసిన ఇతర పరిణామాలు తోసుకొచ్చాయి. ఆ చలికాలంలో పారిస్ నగరం ప్రష్యన్ సేనల భారీ ఫిరంగి పేలుళ్లతో దద్దరిల్లింది. తన ఆస్తుల భద్రతను తలచుకుని స్లీమన్ భయపడిపోయాడు. 6 ప్లేస్ స్ట్రీట్ మిషెల్ లో ఉన్న తన అపార్ట్ మెంట్ పై అతనికి విపరీతమైన మక్కువ. అతని పుస్తకాలూ; తూర్పు దేశాలనుంచీ, ఇథకా, తేరా లనుంచీ అతను సేకరించిన చిన్నపాటి పురావస్తు సంపదా అందులోనే ఉన్నాయి. ఒడీసీయెస్ చితాభస్మం ఉన్న కలశం కూడా వాటిలో ఉంది.

దాంతో హుటాహుటిన పారిస్ కు బయలుదేరాడు. ఎథెన్స్ లోని ప్రష్యన్ రాయబారినుంచి పరిచయలేఖ తీసుకుని మ్యూనిక్ వెళ్ళాడు. అక్కడ మరిన్ని పరిచయలేఖలు తీసుకుని స్ట్రాస్ బర్గ్ వెళ్ళి గవర్నర్ జనరల్ కౌంట్ బిస్మార్క్ బొలెన్ ను కలసుకున్నాడు. అక్కడినుంచి వెర్సై వెళ్ళి బిస్మార్క్ చేతులమీదుగా పారిస్ వెళ్ళేందుకు అనుమతిపత్రం తీసుకోడానికి ప్రయత్నించాడు. కానీ, శాంతి నెలకొనేదాకా పారిస్ లోకి ఎవరూ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ బిస్మార్క్ తోపాటు అధ్యక్షుడు జూల్స్ ఫవ్రా కూడా అతని అభ్యర్ధనను తిరస్కరించాడు.

తన దారికి అడ్డువచ్చే సాధారణ చట్టాలనే కాదు, సైనిక శాసనాలను కూడా స్వేచ్ఛకు ఆటంకాలుగా భావించి మండిపడే స్వభావం అతనిది. అయిదు ఫ్రాంకులు చెల్లించి, క్లైన్ అనే పేరుతో ఒక నకిలీ పాస్ పోర్ట్ సంపాదించాడు. అతనికి యాభై ఏళ్ళు ఉన్నా దానిమీద ఫోటో మాత్రం ఓ ముప్పై ఏళ్ల యువకుడిది. తప్పనిసరిగా అతను జర్మనీ మీదుగా వెళ్ళాల్సిందే కనుక, అనుమానంతో మూడుసార్లు అతన్ని నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నించారు. యుక్తితో తప్పించుకుని బయటపడ్డాననీ, లేకపోతే గోడకు అభిముఖంగా నిలబెట్టి కాల్చి చంపేసేవారని ఆ తర్వాత రాసుకున్నాడు. జర్మన్లకు బిరుదులు, పదవుల పిచ్చి ఎక్కువ కనుక, ప్రతి లెఫ్టినెంటునూ జనరల్ గానూ, ప్రతి సైనికుణ్ణీ కల్నల్ గానూ సంబోధించడంతో వాళ్ళు ఉబ్బిపోయి వదిలేశారు.

పారిస్ పూర్తిగా ధ్వంసమైనట్టు ఎథెన్స్ లో అతనికి అందిన సమాచారం. తీరా చూస్తే అలాంటిదేమీలేదు. పాంథియన్, సెయింట్ సుల్పీస్ చర్చి, సర్బాన్ సహా  పరిచితమైన భవంతులన్నీ అలాగే ఉన్నాయి. అతని అపార్ట్ మెంటూ, దాని పక్కనే ఉన్న అతని మరో ఇల్లూ, ఎలా విడిచి వెళ్లాడో అలాగే ఉన్నాయి. లైబ్రరీలోకి అడుగుపెట్టినప్పుడు తన చెక్కిళ్ళ వెంట ఆనందబాష్పాలు రాలాయని, చనిపోయాడనుకున్న పిల్లవాడు బతికి కళ్ళు తెరిస్తే ఎలాంటి అనుభూతికి లోనవుతామో అలాంటి అనుభూతికి లోనయ్యాననీ అతను చెప్పుకున్నాడు. విచిత్రంగా అతని పొరుగిల్లు మాత్రం దెబ్బతింది. దానిని చూడగానే, మేమెల్ లో అన్ని గిడ్డంగులూ అగ్నికి ఆహుతై తన గిడ్డంగి మాత్రం భద్రంగా ఉన్న సంగతి గుర్తొచ్చింది. మరోసారి ఏ అదృశ్యశక్తో, ఏ దైవిక ప్రయోజనం కోసమో తనను విధ్వంసం నుంచి కాపాడిందనుకున్నాడు. వసంతం అడుగుపెట్టడంతో చెట్లన్నీ పూల దుప్పటీ కప్పుకున్నట్టు ఉన్నాయి. కమ్యూన్ కింద  కూడా పారిస్ ఎప్పటిలానే సొగసులీనింది.

“పారిస్ లో పెద్దగా మార్పేమీ లేదు. వీథుల్లో జనసందోహం వెనకటిలానే ఉంది. అయితే గుర్రపు బండ్లు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎన్నోగుర్రాలను చంపి తినేయడమే కారణం. రాత్రిళ్ళు మాత్రం పారిస్ అంతటా ఏదో విషాదం పరచుకున్నట్టు ఉంటోంది. వీథుల్లో ఒకే ఒక చమురు దీపం వెలుగుతోంది. గ్యాస్ లైట్లు లేకపోవడంతో థియేటర్లు పగలు మాత్రమే నడుస్తున్నాయి. సర్బాన్ మినహా మ్యూజియంలు, లైబ్రరీలు అన్నీ మూతబడ్డాయి. కాలేజ్ ఆఫ్ ఫ్రాన్స్ ను రేపే తెరవబోతున్నారన్న వార్త ఆనందం నింపింది. పారిస్ లో చెట్లన్నీ కూల్చేశారన్నారు. కానీ అన్ని చెట్లూ అలాగే ఉన్నాయి” అని, ఊటెంబర్గ్ లో ఉండే ఒక వర్తకమిత్రుడు గాట్షాక్ కు రాసిన ఉత్తరంలో అన్నాడు.

పారిస్ పూర్తిగా కమ్యూనార్డ్ ల అధీనంలోకి వెళ్ళిన తర్వాత కూడా స్లీమన్ అక్కడే ఉండిపోయాడు. రాచరికం కింద ఉన్న జర్మనీపై కంటే ఫ్రాన్స్ పైనే అతనికి ఎక్కువ నమ్మకం కుదిరింది. యుద్ధగమనాన్ని దూరం నుంచి చూస్తూ తన అధ్యయనంలో ప్రశాంతంగా గడిపాడు. ఈ మధ్యలో ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాస్తూ, తనూ, సఫ్వెట్ పాషా, అమెరికా రాయబారీ కలసి మాట్లాడుకుంటే ప్రయోజనం ఉండచ్చనిపిస్తోందన్నాడు. ఇంతకుముందు హిస్సాలిక్ దగ్గర నిక్షేపాలు బయటపడిన సంగతి అతనికి గుర్తుంది. ఆ ప్రదేశం తను తవ్వించిన మొదటి కందకానికి ఎంతో దూరంలో లేదు. ఆంటియోకస్ ది గ్రేట్ కాలానికి చెందిన 12వందల భారీ రజత పతకాలు అక్కడ బయటపడ్డాయి. మంత్రి తన ప్రయత్నాలకు మోకాలు అడ్డడానికి అదీ ఒక కారణం కావచ్చు ననుకున్నాడు. అదే నిజమైతే అక్కడి నిధినిక్షేపాల మీద తనకు ఎలాంటి ఆసక్తీ లేనట్టు కనిపించడమే మార్గమని అతనికి తోచింది. అక్కడ వెండి, బంగారు నిక్షేపాలను కనుగొనడమే జరిగితే, ఒక్క నాణేన్ని కూడా విడిచిపెట్టకుండా మంత్రికి ఇవ్వడానికి తను సిద్ధమేననీ, తవ్వకాలు జరిపేచోట మంత్రిత్వశాఖకు చెందిన ఇద్దరు కాపలాదారులను నియమించుకోవచ్చనీ, అయితే ఒక విషయంలో మాత్రం తను ఎట్టి పరిస్థితులలోనూ రాజీపడేది లేదనీ అన్నాడు. హిస్సాలిక్ దిబ్బ మీద తనకు పూర్తి యాజమాన్య హక్కు లభించాల్సిందే! అంతవరకూ తను తిరిగి తవ్వకాలను చేపెట్టే ప్రశ్న లేదు. కేవలం ట్రాయ్ ఉనికిని నిరూపించడం తప్ప తనకు ఇందులో మరెలాంటి స్వార్థమూ లేదు. పైగా, ఈ లక్ష్యసాధనకోసం జీవితాన్నే కాదు, అపారమైన ధనాన్నీ ధారపోయడానికి తను సిద్ధమయ్యాడు. ఇంకా కావాలంటే, అక్కడ లభించే వెండి, బంగారాలకు రెట్టింపు విలువను ప్రభుత్వానికి ముట్టజెప్పడానికీ తను తయారుగా ఉన్నాడు. కాకపోతే, ప్రభుత్వ స్థలంలో తవ్వకాలు జరిపి రేపు జీవితాంతం దాని పర్యవసానాలను ఎదుర్కొనే ఓపిక మాత్రం తనకు లేదు. కనుక ఆ దిబ్బ సొంతం అయితేనే తిరిగి తవ్వకాలు ప్రారంభిస్తాడు.

అయితే, ఇదంతా పైకి వినిపించిన వాదమే తప్ప నిజం కాదు. తవ్వకాలలో లభించబోయే నిధినిక్షేపాలను తను చేజిక్కించుకుని తీరాలని అతను అప్పటికే నిర్ణయించుకున్నాడు. ఆ టర్కులిద్దరూ తనను వంచించబోయారు కనుక, ఒక ఆరితేరిన వర్తకుడిగా వారి ఎత్తుకు పై ఎత్తు వేసి వారిని తను వంచించదలచుకున్నాడు. ఆ రోజుల్లో తరచు తన అభిమాన పాత్ర అయిన ఒడీసియెస్ ను గుర్తుచేసుకునే వాడు. దేశదిమ్మరి అయిన ఒడీసీయెస్ వంచనలోనూ సిద్ధహస్తుడే. అతని ప్రభావం స్లీమన్ పై బాల్యంలోనే పడింది. ఆపైన  సోఫియా ఇప్పుడు గర్భవతి. కొడుకే పుడతాడన్న నమ్మకంతో ఒడీసియెస్ పేరు పెట్టాలని అప్పటికే అతను నిర్ణయించుకున్నాడు.

ఎలాంటి జంకూ కొంకూ లేకుండా మరోసారి నకిలీ పాస్ పోర్ట్ తో జర్మనీ మీదుగా ప్రయాణించి మే నెలలో ఎథెన్స్ కు చేరుకున్నాడు. సోఫియా ప్రసవించింది. ఆడపిల్ల. ఆ పిల్లకు ట్రాయ్ వీరుడు హెక్టర్ భార్య యండ్రోమకి పేరు పెట్టేశాడు.

జూన్ లో కాన్ స్టాంట్ నోపిల్ కు వెళ్ళి సఫ్వెట్ పాషాను కలిశాడు. అమెరికా రాయబారి వేన్ మేక్విగ్, రాయబార కార్యాలయం కార్యదర్శి జాన్ బ్రౌన్ ల సహకారంతో అక్షరరూపమిచ్చిన కొత్త ప్రతిపాదనను అతని ముందు ఉంచాడు. దాని ప్రకారం, హిస్సాలిక్ దిబ్బపై యాజమాన్య హక్కుకు తను పట్టుబట్టడు. అక్కడి తవ్వకాలలో గొప్ప నిధినిక్షేపాలు దొరుకుతాయని తను భావించడం లేదు. ఒకవేళ దొరకడమే జరిగితే, ఉభయులం(తనూ, టర్కిష్ ప్రభుత్వమూ) దానిని సమానంగా పంచుకోవాలి. తన భాగాన్ని దేశం నుంచి తరలించడానికి అనుమతించాలి. తవ్వకాలకు అయ్యే ఖర్చంతా తనే భరిస్తాడు. ప్రభుత్వమే ఆ దిబ్బను కొనేసి ఆ టర్కుల తలనొప్పి వదిలించింది కనుక దానిపై తను హక్కును కోరబోడు. అయితే, ఆ మారుమూల ప్రాంతంలో, ఒక విదేశీయుడిగా తనకూ, అక్కడ వెలుగు చూసే చారిత్రక సంపదకూ ప్రభుత్వం రక్షణ కల్పించాలి.

1871, ఆగస్టు 2న అతను లండన్ లో ఉండగా, కాన్ స్టాంట్ నోపిల్ లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఒక సీల్డు పెట్టె అందింది. అందులో టర్కిష్ ప్రభుత్వం ఇచ్చిన ఫర్మానా ఉంది. తక్షణమే తవ్వకాలను ప్రారంభించే తహతహలో ఉన్న స్లీమన్ అప్పటికప్పుడు ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు. సెప్టెంబర్ చివరిలో తను తవ్వకాలను చేపట్టాలనుకుంటున్నాననీ, అక్టోబర్ లో దర్దనెల్లెస్ వాతావరణం ఎలా ఉంటుందో, అప్పటికి జ్వరాలు వగైరా తగ్గుముఖం పడతాయో లేదో తన ఎథెన్స్ చిరునామాకు ఉత్తరం రాయవలసిందనీ కోరాడు.

సెప్టెంబర్ 27న భార్యతో కలసి దర్దనెల్లెస్ చేరుకున్నాడు. తీరా వెళ్ళాక ఫర్మానా పాఠంపై సందేహాలు తలెత్తాయి. అది హిస్సాలిక్ దిబ్బ గురించే ప్రస్తావిస్తోందా అన్నది స్పష్టం కాలేదు. ఆపైన దర్దనెల్లెస్ గవర్నర్ అక్మెడ్ పాషాకు ఎలాంటి ఉత్తర్వూ రాలేదు. తవ్వకాలప్పుడు “ పురాతన, చరిత్రప్రసిద్ధమైన ఆ నగరం తాలూకు ప్రాకారాలకు ఎలాంటి హానీ జరగకూడదు” అని ఆ ఫర్మానా ఆదేశిస్తోంది. పొరపాటున ఏ గోడో దెబ్బతింటే పర్యవసానాలు ఎలా ఉంటాయో అతనికి అర్థం కాలేదు.

సందేహాలతో సతమతమవుతూనే  సిప్లాక్ గ్రామంలో తన ముఖ్యకార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మేస్త్రీని, పనివాళ్లను నియమించుకున్నాడు. తోపుడు బళ్ళు, తట్టలు, పారలు, గొడ్డళ్ళు సహా సామగ్రి అంతా సిద్ధంగా ఉంది.  ఆ దిబ్బ మీద దాడికి దిగడానికి ముందు, అధికారుల మందకొడితనం అనే చివరి అడ్డంకిని దాటడం ఒక్కటే మిగిలింది. ఫర్మానాపై సందేహానివృత్తిని కోరుతూ జాన్ బ్రౌన్ కు అత్యవసర సందేశం పంపించాడు. స్పందన లేకపోవడంతో మూడు రోజుల తర్వాత మళ్ళీ పంపాడు. టర్కిష్ ప్రభుత్వం కల్పించిన పూర్తి రక్షణలో ఎట్టకేలకు అక్టోబర్ 11 వ తేదీన పని ప్రారంభించాడు.

ప్రభుత్వం జియోర్జోస్ సర్కిస్ అనే అధికారిని తన కాపలాదారుగా నియమించింది.  పుట్టుకతో అతను ఆర్మేనియన్. ఇంతకుముందు దర్దనెల్లెస్ లోని చాన్సెరీ ఆఫ్ జస్టిస్ లో సెకండ్ సెక్రెటరీగా పనిచేశాడు. స్లీమన్ కు నీడలా వెన్నంటి ఉంటూ, ప్రభుత్వం కళ్ళు కప్పి అక్కడినుంచి ఎలాంటి నిధినిక్షేపాలనూ తరలించకుండా నిరంతరం కాపలా కాయడం అతని పని. స్లీమన్ మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వానికి అతను “కళ్ళూ-చెవులూ”.

స్లీమన్ ఫ్రాన్స్ నుంచి ఎనిమిది తోపుడు బళ్ళు తెప్పించుకున్నాడు. కనుక మొదటి రోజున ఎనిమిదిమందిని పనిలోకి దింపాడు. తవ్వకాలు చురుగ్గా సాగడంతో మరునాడు ముప్పై అయిదుగురినీ, ఆ మరునాడు డెబ్బై నలుగురినీ పనిలోకి తీసుకున్నాడు. ఒక్కొక్కరికీ 9 పియాస్టర్లు చెల్లించాడు. వేతనాల చెల్లింపు నికొలస్ జెఫిరోస్ జానకిస్ అనే స్ఫురద్రూపి అయిన ఓ గ్రీకు చేతిమీదుగా జరిగేది. స్లీమన్ తన వివాహమైన వెంటనే అతన్ని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. రెంకోయ్ గ్రామానికి చెందిన జానకిస్ కు స్థానిక మాండలికాలు అన్నీ తెలుసు. స్లీమన్ కు అంగరక్షకుడు, వంటమనిషి, డబ్బు లావాదేవీలు జరిపేవాడూ…అన్నీ అతనే. తన దగ్గర పనిచేసే ప్రతి ఒకరినీ గ్రీకు పురాణాలలోని ఏదో ఒక పేరుతో పిలవడం స్లీమన్ కు అలవాటు. కానీ తనకెంతో నమ్మకస్తుడైన జానకిస్ ను మాత్రం అసలు పేరుతోనే పిలిచేవాడు. స్లీమన్ ఎక్కడున్నా అతని దరిదాపుల్లో జానకిస్ విధిగా ఉండాల్సిందే. స్థానిక అధికారికి ఎవరికైనా చేతులు తడపాల్సి వస్తే, స్లీమన్ దానిని జానకిస్ కు వదిలేసేవాడు. ముడుపుల చెల్లింపు కోసం, ఇతర ఖర్చుల కోసం జానకిస్ తన బెల్టు కింద బంగారు నాణేలను ఎప్పుడూ ఉంచుకునేవాడు.

వర్షాలు మొదలయ్యాయి, అయినా తవ్వకాలు కొనసాగాయి. ఎప్పటిలా స్లీమన్ తొందరలో ఉన్నాడు. ఆరు వారాల్లో ప్రియామ్ ప్రాసాదాన్ని వెలికి తీయాలని అనుకున్నాడు. వర్షంలో కూడా పనివాళ్లు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరువరకు పని చేశారు. మధ్యలో ఉదయం తొమ్మిదింటికి అరగంటసేపు అల్పాహార విరామం. మధ్యాహ్నం గంటన్నరసేపు భోజన విరామం. అప్పుడు తప్ప మరెప్పుడూ పొగ తాగడానికి వీల్లేదు. ధూమపానం మనిషి శక్తిని తగ్గిస్తుందనీ, ఏకాగ్రతను దెబ్బతీస్తుందనీ స్లీమన్ సిద్ధాంతం. పని జరుగుతున్నంత సేపూ అతను చండశాసనుడు. పని వాళ్ళ పీకల మీద ఉన్నట్టు ఉండేవాడు. వర్షాలను, మధ్య మధ్య పనికి ఆటంకమయ్యే గ్రీకు శ్రాద్ధదినాలనూ తిట్టిపోసేవాడు. దానికితోడు నెలలో మూడుసార్లు తుపానులు సంభవించి, తవ్వకాలను నిలిపివేయవలసివచ్చింది. ఆ విరామకాలంలో తవ్వకాల గురించిన నివేదికలు రాసుకునేవాడు.

రాయడానికి కూడా పెద్దగా ఏమీ కనిపించలేదు. కొన్ని నాణేలూ, కాలిన ఎముకలు, భారీ కుడ్యాలు, హోమర్ కంటే కూడా చాలా వెనకటి కాలానికి చెందిన విచిత్రమైన లింగాకృతులు బయటపడ్డాయి. ఇవి చక్కగా మెరుగుపెట్టిన నల్లరాతి లింగాకృతులు. వీటిలో కొన్నిటిపై తెల్లని చారలున్నాయి. అక్టోబర్ 30న జరిపిన తవ్వకాలలో ఇవే కాక, ఆకుపచ్చని రాయితో చేసిన బల్లెం పిడులు, అగ్నిపర్వతాలను తలపించే చిత్రమైన ఆకృతులు, పంది కోరలు, దంతాలు వందల సంఖ్యలో వెలికివచ్చాయి. ఆ తర్వాత కూడా రోజు రోజుకీ ఇలాంటివే బయటపడడం ప్రారంభించాయి. ఇంకా లోపలికి వెడుతున్న కొద్దీ గుడ్లగూబను పోలిన చిన్న చిన్న మృణ్మయమూర్తులు, గుడ్లగూబ తలను చెక్కిన రాతిపలకలు తగిలాయి. వాటిని చూడగానే ‘గుడ్లగూబ  ముఖం’ కలిగిన ఎథెనా గురించి హోమర్ చెప్పడం స్లీమన్ కు గుర్తొచ్చింది. గుడ్లగూబ పల్లాస్ ఎథెనాకు చెందిన ఓ పవిత్రచిహ్నం. కన్య అయిన ఎథెనా, ఎథెన్స్ కు రక్షణ దేవత. ఈ దేవత కళ్ళు గుడ్లగూబ కళ్లలా ప్రకాశవంతంగానూ, చీకట్లో కూడా చూడగలిగేలానూ ఉంటాయని ‘గుడ్లగూబ ముఖం కలిగిన ఎథెనా’ అన్న హోమర్ మాటకు పండితులు అర్థం చెప్పారు.

పదడుగుల లోతున, చిన్నపాటి బొంగరం ఆకారంలో ఉన్న మృణ్మయమూర్తులు కనిపించడం, వాటిలో కొన్నింటికి రెండు రంధ్రాలు ఉండడం చూసి స్లీమన్ మరింత విస్తుపోయాడు. భారతదేశంలోని దేవాలయాలలో తను చూసిన నల్లరాతి భారీ శివలింగాలు అతనికి చటుక్కున గుర్తొచ్చాయి. ఈ తవ్వకాలలో కూడా పెద్ద సంఖ్యలో కనిపించిన లింగాకృతులు పురుషసూత్రానికి చెందినవైతే; రంధ్రాలు చేసిన బొంగరం ఆకృతులు స్త్రీసూత్రానికి చెంది ఉంటాయనుకున్నాడు. ఇంతకీ ప్రియామ్ ప్రాసాదంలో ఇలాంటివి ఎందుకున్నాయో అతనికి అర్థం కాలేదు.

(సశేషం)

 

 

 

 

 

 

 

టర్కీ ప్రభుత్వంతో ‘ట్రోజన్ వార్’

 

స్లీమన్ కథ-18

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఎటు తిరిగినా అడ్డంకులే. మైసీనియా చుట్టుపక్కల బందిపోట్ల బెడద ఎక్కువగా ఉందన్న కారణం చూపించి అక్కడ తవ్వకాలకు గ్రీకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఫ్రాంక్ కల్వర్ట్ ను చూస్తే, తీవ్ర అనారోగ్యంతో తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సాయం చేయగల స్థితిలో లేడు. సోఫియా ఇంకా అస్వస్థంగానే ఉంది.  స్లీమన్ ఈలోపల ట్రయాడ్ లో తన పది రోజుల సాహసం గురించి కొల్నిషో సైతూంగ్ కు రాశాడు. యజమానుల అనుమతి లేకుండానే ఆ దిబ్బ మీద తను తవ్వకాలు జరిపిన సంగతిని కూడా బయటపెట్టాడు. టర్కిష్ అధికారులు ఆ కథనాన్ని చదివారనీ, తన చర్యను తప్పు పట్టారనీ అతనికి తెలిసింది. ఎథెన్స్ లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోడం తప్ప ప్రస్తుతానికి చేయగలిగిందేమీ అతనికి కనిపించలేదు.

అతను అమితంగా ద్వేషించేది ఒక్కటే, పనీపాటా లేకుండా గడపడం. ఫ్రాంక్ కల్వర్ట్ ఎందుకిలా మొండికేసాడనుకుంటూ అసహనానికి లోనయ్యాడు. ఆ ఇద్దరు టర్కులకూ వంద పౌండ్లు చెల్లించి వాళ్ళ భూమిని కొనాలనుకున్నాడు. కానీ వాళ్ళు పడనివ్వలేదు. ఇంకో తెలివి తక్కువ ప్రతిపాదన కూడా చేశాడు. అంతకన్నా తక్కువకు బేరం కుదిర్చితే, ఆ మిగిలిన మొత్తాన్ని మీకు వదిలేస్తానని కల్వర్ట్ కు రాశాడు. ఆ భూమి ఎప్పుడైతే తన సొంతమైందో, అప్పుడు తవ్వకాలు నిరాటంకంగా జరుగుతాయనీ; ఏటా మూడు మాసాలు తను అక్కడే గడుపుతూ, అయిదేళ్లలో అక్కడి శిథిల నిర్మాణాల చుట్టూ ఉన్న చెత్తను తరలించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడానికి కూడా తను సిద్ధపడగలననీ-ఏవేవో ఊహించుకున్నాడు.

అలా ఊహలతోనే రోజులు భారంగా గడుస్తున్నాయి. తీవ్ర నిరాశానిస్పృహలు స్లీమన్ ఉత్సాహాన్ని అణగదొక్కుతున్నాయి. కల్వర్ట్ కు ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పిస్తూ అదేపనిగా ఊదరగొడుతున్నాడు. టర్కిష్ ప్రభుత్వంతో మాట్లాడి పని జరిగేలా చూడమని ప్రాధేయపడుతున్నాడు. ప్రతి ఉత్తరాన్నీ, “మీరు దయతో అందించబోయే సానుకూల సమాచారం కోసం అత్యంత ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటా”నని ముగిస్తున్నాడు. అయితే, కల్వర్ట్ చేయగలిగిందేమీ లేదు, చేయాలన్న సుముఖతా ఆయనలో లేదు. తమ జాగాలో పెద్ద పెద్ద కందకాలు తవ్వించిన స్లీమన్ మీద ఇప్పటికీ కారాలు మిరియాలు నూరుతున్న టర్కులిద్దరూ సహకరించే స్థితిలో అసలే లేరు.

అంతలో వేసవి అడుగుపెట్టి, స్లీమన్ నిరీక్షణకు తాత్కాలికంగా తెరదించింది. తవ్వకాలకు అది ఎటూ అనువైన సమయం కాదు. స్లీమన్ తిరిగి పారిస్ వెళ్లిపోయి ఇతర వ్యవహారాలలో పడిపోయాడు. అక్కడ అతనికి విస్తారమైన ఆస్తులున్నాయి. అతను అద్దె కిచ్చిన భవనాలలో 200 మంది నివసిస్తున్నారు. మధ్య మధ్య తన ఆస్తి వ్యవహారాలను చూసుకోవడం అతనికి సంతృప్తితోపాటు కాలక్షేపాన్ని కలిగిస్తోంది. అలా ఉండగా, జూన్ మధ్యలో ఒకరోజున సెయింట్ పీటర్స్ బర్గ్ లోని కొడుకు సెర్గీనుంచి ఉత్తరం వచ్చింది. స్కూల్లో తన చదువు పెద్దగా ముందుకు సాగడంలేదని అతను రాశాడు.

దానికి స్లీమన్ ఫ్రెంచిలో జవాబు రాశాడు. అందులో తన గురించి గొప్పలు చెప్పుకున్నాడు కానీ, నిజానికది అతనప్పుడున్న నైరాశ్యస్థితికే అద్దంపట్టింది:

నీ చదువు ముందుకు సాగడంలేదని రాయడం నాకు చాలా విచారం కలిగించింది. జీవితంలో ప్రతిఒకడూ నిరంతరం ముందుకు సాగుతూ ఉండవలసిందే. లేకపోతే నిరుత్సాహంతో కుంగిపోవలసివస్తుంది. బ్రహ్మాండమైన శక్తియుక్తులు కలిగిన ఒక మనిషి ఎంత ఎత్తుకు వెళ్లగలడో, తను ఎక్కిన ప్రతి మెట్టులోనూ నిరూపించుకుంటూ వచ్చిన నీ తండ్రిని ఆదర్శంగా తీసుకో. 1842-1846 మధ్య ఏమ్ స్టడామ్ లో ఉన్న నాలుగేళ్లూ నేను అద్భుతాలు చేశాను. ఎవరూ చేయనివీ, చేయలేనివీ నేను చేశాను. ఆ తర్వాత సెయింట్ పీటర్స్ బర్గ్ లో వర్తకుడిగా ఎదిగి, ఇంతటి సాఫల్యం, ఇంతటి తెలివీ ఉన్న వర్తకుడు ఇంకొకడు లేడని నిరూపించుకున్నాను. ఆ తర్వాత యాత్రికుడిగా మారాను; మామూలు యాత్రికుడిగా కాదు, విశిష్ట ప్రావీణ్యాలు కలిగిన ఓ అద్భుతయాత్రికుడిగా! సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఏ వర్తకుడూ ఓ వైజ్ఞానికరచన చేయలేదు; నేను చేశాను. అది నాలుగు భాషల్లోకి అనువాదమై, ప్రపంచ ప్రశంసలు అందుకుంది. ఈరోజున నేనొక పురాతత్వశాస్త్రవేత్తను.  అన్ని దేశాలలోని పురాతత్వశాస్త్రవేత్తలూ రెండువేల ఏళ్లపాటు వెతికి వేసారిన ప్రాచీన నగరం ట్రాయ్ ని; యావత్ యూరప్, అమెరికాల కళ్ళు జిగేలుమనేలా  నేను కనిపెట్టాను…

ఈ గొప్పలు అతనప్పుడున్న నిస్సహాయతనుంచి పుట్టినవి. నైరాశ్యం నుంచీ, ఒంటరితనం నుంచీ పెల్లుబికినవి. తన జీవితానికి ఒక అర్థం వెతుక్కునే పెనుగులాటలో అతనున్నాడు. ఇతిహాసప్రసిద్ధమైన ట్రాయ్ ని తవ్వి తీయాలని తహతహలాడుతున్నాడు. కానీ, ఆ హిస్సాలిక్ దిబ్బ మీద గొర్రెల మందల్ని మేపుకునే ఇద్దరు అనామకులైన టర్కిష్ రైతులు, తనేదో మామూలు చొరబాటుదారైనట్టు, అడ్డుపడుతున్నారు. తక్షణం తమ జాగా నుంచి వెళ్లిపొమ్మని కళ్ళు ఉరుముతున్నారు. వాళ్ళకా హక్కు లేదు! తను, స్లీమన్ అనే తను, భూస్థాపితమైన ఆ నగరాన్ని వెలికి తీశాడు. కనుక ఆ నగరం మీద అన్ని హక్కులూ తనవి! ప్రపంచ విజ్ఞానానికి దోహదం అందించడం కోసం లక్ష ఫ్రాంకులు ఖర్చు పెట్టి తవ్వకాలు జరిపించడానికి తను సిద్ధమయ్యాడు. తనకు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. అలాంటిది, టర్కీలో ఓ మారుమూల ఉన్న చిన్న దిబ్బ తనకు కొరకరాని కొయ్య కావడమేమిటి? వంతెన కోసం ఆ పవిత్రమైన రాళ్ళను తీసుకుని తన నగరాన్ని అపవిత్రపరచడానికి ఆ టర్కు లిద్దరికీ ఎంత ధైర్యం! వాళ్ళ వదులు పంట్లాములూ(Baggy Trousers), వాళ్ళూ! తను హిస్సాలిక్ దిబ్బను విడిచిపెట్టి వచ్చేముందు, తను కలిగించిన నష్టానికి వంద పౌండ్లు ఇమ్మని వీళ్ళే అడిగారు. తను తిరస్కరించాడు.

1870 జూలై 19న నెపోలియన్-3 ప్రష్యాపై యుద్ధం ప్రకటించాడు. ఆ ఇద్దరు టర్కులపై ఆగ్రహంతో కుతకుతలాడుతూ అప్పటికి స్లీమన్ పారిస్ లోనే ఉన్నాడు. యుద్ధం ప్రకటించగానే బులోన్-సుర్-మేర్ కు చేరుకుని, అక్కడినుంచి ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు.  ట్రాయ్ లో తను వెలికి తీసిన ప్రాసాదం గోడలకు చెందిన రాళ్ళు ఎవరూ ఎత్తుకు పోకుండా చూడవలసిందనీ, మూడు వేల ఏళ్ల నాటి ఆ నిక్షేపాలను ఆ రైతులిద్దరూ ధ్వంసం చేయకుండా చూడడానికి ఏదో ఒక మార్గం ఉండకుండా ఉండదనీ అందులో విన్నవించాడు.

ఆగస్టు చివరిలో, టర్కీ విద్యామంత్రి సఫ్వెట్ పాషాకు తన తవ్వకాల గురించి ఓ సుదీర్ఘమైన వేడికోలు ఉత్తరం రాశాడు. ఏవో నిధి నిక్షేపాలకోసం తను హిస్సాలిక్ దిబ్బను తవ్వలేదనీ, అవి దొరుకుతాయని తను అనుకోవడంలేదనీ, “శాస్త్రవిజ్ఞానం పట్ల నిస్వార్థ ప్రేమతోనే” తవ్వకాలు జరిపించాననీ, ఆ దిబ్బ అడుగున ట్రాయ్ నగరం ఉనికిని నిరూపించడమే తన ధ్యేయమనీ అందులో రాశాడు. తను రచించిన Ithaka, der Peloponnes and Troja  అనే పుస్తకం ప్రతిని ఆ ఉత్తరానికి జతపరిచాడు. టర్కిష్ ప్రభుత్వం దయాదాక్షిణ్యాల పైనే తను పూర్తిగా ఆధారపడుతున్నాననీ, తన పరిశోధనల ప్రాముఖ్యాన్ని ప్రభుత్వం తప్పకుండా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నాననీ అన్నాడు. హోమర్ పట్ల తనకున్న వల్లమాలిన ఆరాధనాభావమే హిస్సాలిక్ తవ్వకాలకు పురిగొల్పిందనీ, ఇంతాజేసి తను జరిపింది ఆషామాషీ తవ్వకాలే అయినా, ప్రియాం ప్రాసాదాన్ని, బ్రహ్మాండమైన ఆ నగర ప్రాకారాల ఉనికిని అది బయటపెట్టింది కనుక ప్రభుత్వం తన చర్యను తప్పు పట్టబోదని ఆశిస్తున్నా నన్నాడు.

“గాలివానను కూడా లెక్క చేయకుండా వేసవిలోనా అన్నట్టుగా పనిచేశాను. రెండు పూటలా భోజనం చేసినట్టు ఊహల్లోనే తృప్తి పడుతూ, తిండీ తిప్పలు లేకుండా రోజంతా నడుం వంచాను. నేను వెలుగులోకి తెచ్చిన ప్రతి చిన్న మృణ్మయపాత్రా చరిత్రకు మరో పుటను జోడించిందని నేను నమ్ముతున్నాను” అన్నాడు. తను దుందుడుకుగా వ్యవహరించినందుకు ఏలినవారు క్షమించవలసిందనీ, తవ్వకాలను కొనసాగించడానికి అనుమతి లభిస్తుందన్న ఆశ లేశమైనా కలిగితే, ఏలినవారిని దర్శించుకోడానికి ఏ క్షణంలోనైనా తను సిద్ధంగా ఉంటాననీ ఉత్తరం ముగించాడు.

అయితే, అటునుంచి సమాధానం లేదు. స్లీమన్ లానే ఆ మంత్రి కూడా గడుసుపిండమే. తనది నిస్వార్థ ప్రయత్నమని స్లీమన్ అంతగా నమ్మబలకడం, ‘మనిద్దరి ఆరాధ్యదేవతా శాస్త్రవిజ్ఞానమేననీ, శాస్త్రవిజ్ఞాన ప్రగతికోసమే ఇద్దరం జీవితాలను అంకితం చేశామనీ, ఇద్దరం దానిపట్ల ఒకేవిధమైన ఉత్సాహాన్ని నింపుకున్నవాళ్ళమే ననీ’ మంత్రిని ఉబ్బేయడం అతను ఆశించినదానికి సరిగ్గా వ్యతిరేకఫలితాన్ని ఇచ్చాయి. అతని ప్రయత్నమంతా అక్కడ పాతిపెట్టిన నిక్షేపాల కోసమే నని మంత్రి నిశ్చయానికి వచ్చాడు.

ఎట్టకేలకు స్లీమన్ డిసెంబర్ లో కాన్ స్టాంట్ నోపిల్ కు వచ్చి పడ్డాడు. మంత్రిని దర్శించుకున్నాడు. మంత్రి అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. తన నుంచి ఎలాంటి సహాయమైనా అందుతుందని హామీ ఇచ్చాడు. శాస్త్రవిజ్ఞాన ప్రయోజనాలపట్ల తన సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. అయితే, ఇంకోవైపు తవ్వకాలను ఆపడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. గడుగ్గాయి అనిపించుకున్న అంతటి స్లీమన్ కూడా మంత్రి  పై మెరుగు మాటలకు బోల్తా పడిపోయి, కొద్ది రోజుల్లోనే తవ్వకాలను అనుమతిస్తూ టర్కిష్ ప్రభుత్వం నుంచి తనకు ఫర్మానా అంది, హిస్సాలిక్ దిబ్బ తన అధీనంలోకి వస్తుందనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.

కాన్ స్టాంట్ నోపిల్ లో అతనలా ఎదురు తెన్నులు చూస్తుండగానే, ఆ సమస్యతోపాటు, పారిస్ ఏ క్షణంలోనైనా శత్రువుల చేజిక్కవచ్చునంటూ అందిన సమాచారం అతని ఆలోచనల్ని కమ్మేసింది. అంతలో, వెయ్యి ఫ్రాంకులకు తమ భూమిని అమ్మడానికి టర్కులిద్దరూ నోటి మాటగా ఒప్పుకున్నట్టు కల్వర్ట్ నుంచి సమాచారం అందింది. సరిగ్గా అప్పుడే, ఆసంతృప్తిని, నిస్పృహను ప్రకటిస్తూ భార్య రాసిన ఉత్తరమూ చేరింది. నీకు పట్టిన అదృష్టాలను ఒక్కొక్కటే లెక్కపెట్టుకుంటే, నువ్విలా నిస్పృహ చెందడానికి ఎలాంటి కారణమూ కనిపించదని, అతను కొంత పరుషంగానే  సమాధానం రాశాడు… నిన్ను ఆరాధించే భర్త ఉన్నాడు, జీవితంలో ఒక ఉన్నతస్థితికి చేరావు, ఎథెన్స్ లో నీకు ఒక ఇల్లు, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే యోగ్యులైన పరివారం ఉన్నారు. అక్కడ ఫ్రాన్స్ లో, ఎలాంటి రక్షణా లేని తమ ఇళ్లపై శత్రువులు తూటాలు కురిపిస్తుంటే;  తినడానికి రొట్టె తునకకు కూడా గతి లేక, చలి కాచుకోడానికి చిన్నపాటి కట్టె పుల్ల కూడా కరవై ఆడా, మగా, పిల్లలు సహా ఇరవై లక్షల మంది ఆకలిచావులు చస్తున్నారు. ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలపై నీ ఆలోచన మళ్లిస్తే నీకే అర్థమవుతుంది…

ఆ తర్వాత, తను సఫ్వెట్ పాషాను కలసుకున్నాననీ, తనను ఎంతో ఆదరంగా ఆహ్వానించాడనీ, ఎంతో కాలంగా తను ఎదురుచూస్తున్న ఫర్మానాను జారీ చేయడానికి హామీ ఇచ్చాడనీ, అది నేడో రేపో తన చేతికి వస్తుందనీ రాశాడు. అది అందగానే తను హిస్సాలిక్ కు వెళ్ళి, భూమి కొనుగోలు లావాదేవీ పూర్తిచేసుకుని, ఓసారి పారిస్ వెళ్ళి వస్తాననీ, ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాల గురించి లేనిపోనివి ఊహించుకుని ఆందోళన చెందవద్దనీ అన్నాడు. ఇంకా ఇలా రాశాడు:

నువ్వు వెంటనే భగవంతుడి ముందు మోకరిల్లి నీకు ఆయన కట్టబెట్టిన అదృష్టా లన్నింటికీ కృతజ్ఞతలు చెప్పుకో. ఈరోజుల్లో నువ్వు పడుతున్న కష్టాన్నే తలచుకుంటూ నీపై ఆయన కురిపించిన కనకవర్షాన్ని మరచిపోయినందుకు క్షమాపణ అడుగు.

ఇంకోటి కూడా నువ్వు మరచిపోతావేమో…అనుకోకుండా నేనిక్కడ మకాం పెట్టిన ఈ పద్దెనిమిది రోజుల్లో టర్కిష్ నేర్చుకున్నాను. ధారాళంగా మాట్లాడడం, రాయడం కూడా చేస్తున్నాను. ఇప్పటికే 6వేల మాటలు నాకు పట్టుబడ్డాయి.

మరో వారం గడిచింది. అయినా సఫ్వెట్ పాషా నుంచి ఉలుకూ, పలుకూ లేదు. తవ్వకాలకు అనుమతి కోరుతూ 1871, జనవరి 8న స్లీమన్ లాంఛనంగా ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. పది రోజుల తర్వాత విద్యా మంత్రిత్వశాఖనుంచి అతనికి పిలుపు వచ్చింది. తవ్వకాలను కొనసాగించడానికి అనుమతి మంజూరు చేస్తూనే, ఆ భూమిని మంత్రిత్వశాఖ తరపున కొనుగోలు చేయవలసిందిగా దర్దనెల్లెస్ గవర్నర్ కు సఫ్వెట్ పాషా తంతి పంపినట్టు అక్కడ తెలిసింది.

స్లీమన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. “అతని ప్రవర్తన ఎంత రోతగా ఉందో కుండబద్దలు కొట్టినట్టు ఎత్తి చూపి కడిగేశాను” అని ఆ తర్వాత రాసుకున్నాడు. ఆ భూమిని కొనడానికి రెండున్నర ఏళ్లపాటు తను చేయని ప్రయత్నం లేదని వివరించుకుంటూ వచ్చాడు. కేవలం వైజ్ఞానిక ఆసక్తితో ఈ భారం తలకెత్తుకున్నాననీ; ట్రోజన్ యుద్ధం కట్టుకథ కాదు, ట్రాయ్ ఉనికి వాస్తవమని నిరూపించడమే తన ఆశయమనీ మరోసారి వాదించాడు. అందుకు చేయవలసిందల్లా ఆ దిబ్బను తవ్వడం, దానికయ్యే విపరీతమైన ఖర్చును భరించడానికి తను సిద్ధపడ్డాడు, అలాంటిది, డబ్బు చెల్లించి ఆ చిన్న ముక్కను తను సొంతం చేసుకోడానికి అడ్డుపడడం దుస్సహం, దుర్మార్గం అంటూ విరుచుకుపడ్డాడు.

ఈ మాటలు జరుగుతున్న సమయంలో, నేషనల్ మ్యూజియం డైరక్టర్ గా ఉన్న ఒక ఆంగ్లేయుడు మంత్రి దగ్గర కూర్చుని ఉన్నాడు. స్లీమన్ విజృంభణకు సఫ్వెట్ పాషా తెల్లబోయాడు. తలవంపుగా కూడా అనిపించినట్టుంది. కానీ, అంతలోనే తేరుకుని, అన్నీ సవ్యంగానే జరుగుతాయంటూ అతన్ని శాంతింపచేయడానికి ప్రయత్నించాడు. మీరు నిరభ్యంతరంగా హిస్సాలిక్ కు వెళ్లచ్చు, భూమిని కొనుక్కోవచ్చు, తవ్వకాలు కొనసాగించవచ్చు. “నిధినిక్షేపాలు ఏవైనా బయటపడిన పక్షంలో ఒట్టోమన్ సామ్రాజ్య నియమనిబంధనలను పాటించినంతవరకూ” మీకు ఎవరినుంచీ ఎలాంటి ఆటంకమూ రాదన్నాడు.

చర్చ ఈ కొత్త మలుపు తిరిగేసరికి స్లీమన్ కృతజ్ఞతాభావంతో తలమునకలైపోయాడు. తను కోరినవన్నీ మంజూరైనట్టు ఊహించుకున్నాడు. మంత్రికి ధన్యవాదాలు చెప్పాడు. ట్రాయ్ తవ్వకాలపై తను రాయబోయే పుస్తకంలో మీ పేరు ప్రస్తావిస్తానని వాగ్దానం చేశాడు. మంత్రి మాటల్లోని మతలబు ఆ తర్వాత అతనికి తెలిసొచ్చింది. లేదా అప్పుడే తెలిసినా కావాలనే వాటిని తనకు అనుకూలంగా అన్వయించుకునీ ఉండచ్చు.

మూడు రోజుల తర్వాత, భోరున వర్షం పడుతుండగా, ట్రోజన్ మైదానంలోని కుమ్ కేల్ అనే ఓ చిన్న గ్రామానికి చేరుకున్నాడు. వర్షంలో పూర్తిగా నానిపోయాడు, ఆపైన ప్రయాణం బడలిక. ఆ భూమి కొనుగోలుకు మంత్రి జనవరి 10న తంతి ఉత్తర్వులు ఇచ్చాడనీ, రెండు రోజుల తర్వాత ఆ భూమి యాజమాన్య హక్కు మంత్రికి బదిలీ అయిందని తెలిసింది. స్లీమన్ హుటాహుటిన దర్దనెల్లెస్ గవర్నర్ ను కలసుకున్నాడు. మంత్రి తన వెనకటి ఉత్తర్వును రద్దు చేయలేదా అని అడిగాడు. “లేదు, ఆ ఉత్తర్వే అమలులో ఉంది” అని గవర్నర్ సమాధానం చెప్పాడు. మోసగించారని భావించిన స్లీమన్ కోపంతో రగిలిపోతూ ఎథెన్స్ కు చేరుకున్నాడు.

అతనంత తేలిగ్గా మడమ తిప్పే మనిషి కాదు. ఆ భూమిపై పురావస్తు తవ్వకాలు ప్రారంభించి దానిపై తనదైన చెరగని ముద్ర వేశాడు కనుక, అది తనకే చెందాలని ఎప్పుడో నిర్ణయానికి వచ్చాడు. మంత్రి ఆ భూమిని 600 ఫ్రాంకులకు కొన్నట్టు తెలిసింది. కానీ తను 1,000 ఫ్రాంకులు ఇవ్వజూపాడు. ఆవిధంగా చూసినా భూమి తనకే దక్కాలి. అయినా తనకు ఆ హక్కును నిరాకరించారంటే,  వైజ్ఞానిక పరిశోధనలపై వాళ్ళకు గౌరవం లేదు. వాళ్ళు బొత్తిగా అనాగరికులు. పురాతత్వవేత్తగా తను కీర్తిశిఖరాలను అందుకోవడం, తన పేరు యూరప్ అంతా మారుమోగుతుండడం  చూసి వాళ్ళు భయపడ్డారు. ఇలా వాళ్ళను తిప్పికొట్టే ప్రయత్నంలో అన్ని రకాల వాదనలనూ, అన్ని స్థాయిలలోనూ ముందుకు తేవడానికి; అన్ని వైపుల నుంచీ దాడి చేయడానికి  సిద్ధమైపోయాడు.

(సశేషం)

 

 

సీజర్ ను భయపెట్టిన ‘ప్రేతాత్మ’ల నగరం…ట్రాయ్

 

స్లీమన్ కథ-17

 

కల్లూరి భాస్కరం

స్లీమన్ వెళ్ళేటప్పటికే, ట్రాయ్ నలిగిన బాట. ఆ బాటలో పిచ్చి పిచ్చిగా పెరిగిన ముళ్ల పొదలు, శిథిల వృక్షాలు. వాటికింద పాడుబడిన బలిపీఠాలు. ఆ పీఠాల వద్ద ఘనతవహించిన ఎంతోమంది మొక్కులు చెల్లించుకున్నారు. తరం వెంట తరంగా ఆ దుర్గమ ఫ్రిజియన్ తీరాన్ని సందర్శించిన అనేకమంది అక్కడి కూలుతున్న గోపురాల మధ్య తిరిగారు. హెలెన్ (గొప్ప సౌందర్యవతి. మైసీనియన్ స్పార్టాను పాలించే మెనెలాస్ భార్య. ఈమెను ట్రాయ్ రాకుమారుడు పారిస్ అపహరించుకుని వెళ్ళాడు. అది ట్రోజన్ యుద్ధానికి దారితీసింది) నిర్బంధానికీ, పదేళ్ళ యుద్ధానికీ సాక్షులుగా నిలిచిన జీర్ణ శిలల మీద సేదతీరారు.

హెరోడొటస్ మాటలనే విశ్వాసంలోకి తీసుకుంటే, ప్రపంచంలోని అత్యధికభాగాన్ని ఏలిన పర్షియన్ చక్రవర్తి గ్జెరెక్సెస్(క్రీ.పూ. 519) టర్కీ నుంచి గ్రీస్ కు దండు వెడలుతూ ఇక్కడ ఒకరోజు ఆగాడు. కొండ ఎక్కి దుర్గాన్ని చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి చెందిన విజ్ఞులను పిలిపించి అక్కడ జరిగిన ముట్టడుల కథలు చెప్పించుకుని విన్నాడు. ఆ తర్వాత ట్రోజన్ ఎథెనాకు వెయ్యి వృషభాలను బలిచ్చాడు. అక్కడి పూర్వజులైన మహనీయుల ఆత్మశాంతికి మద్యతర్పణాలు ఇవ్వవలసిందిగా పురోహితులను ఆదేశించాడు. ఏవో భయానక ప్రేతాత్మలు భూమిని చీల్చుకుంటూ వచ్చి మీద పడతాయన్న ఊహతోనే పర్షియన్ సేనలు ఆ రాత్రంతా వణికిపోతూ గడిపాయి.

పర్షియన్లకూ, ఇతరులకూ కూడా అది రకరకాల కథలూ, పీడకలలూ కలగలిసిన విచిత్ర భయాలను రేపే ప్రదేశం. అన్ని యుద్ధక్షేత్రాలలోలానే, ఈ ప్రాంతాన్ని కూడా ప్రతీకారదాహంతో ప్రేతాత్మలు పెట్టే పెడబొబ్బలు వెంటాడుతూ ఉంటాయి.  గ్జెరెక్సెస్ కూడా పాత పగలు తీర్చుకోవడమే తన లక్ష్యమని చెప్పుకున్నాడు. ట్రాయ్ పతనమే గ్రీకులకూ, తమకూ మధ్య శాశ్వతశత్రుత్వాన్ని రగిల్చిందని పర్షియన్లు అంటారు.

ట్రాయ్ గడ్డ మీద అడుగుపెట్టగానే, ఆసియా మొత్తం తమ చేజిక్కిందని గ్రీకులు అనుకున్నారు. హెల్స్ పాంట్ మీదుగా అలెగ్జాండర్ పర్షియన్లపై దండయాత్రకు వెడుతూ సెజియమ్(ఒక పురాతన నగరం)లోని ఓ గుట్టమీద ఉన్న అఖిలెస్ (ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్న గ్రీకు వీరుడు) సమాధిని దర్శించుకున్నాడు. ఒంటి నిండా నూనె పట్టించి ఆ సమాధి చుట్టూ నగ్నంగా ప్రదక్షిణ చేశాడు. ఎథెనా ఆలయంలో భద్రపరచిన కొన్ని ఆయుధాలను తను ధరించాడు. ఆ నగరాన్ని తీర్చిదిద్దడానికి బ్రహ్మాండమైన ప్రణాళికలు వేసుకున్నాడు.

భూ, సముద్రమార్గాలలో పాంపే(క్రీ. పూ. 106: రోమన్ సేనాని, రాజకీయ నేత)ను వేటాడుతున్న జూలియస్ సీజర్(క్రీ.పూ.100: రోమన్ సేనాని, రాజకీయనేత) ఇక్కడి రోటియన్ గుట్ట మీదికి చేరుకున్నాడు. అప్పటికి నలభై ఏళ్లక్రితం రోమన్ దళాల చేతుల్లో దగ్ధమైన ఈ నగర శిథిలాల మధ్య తిరిగాడు. చుట్టూ కమ్మేసిన అడవీ; రాజప్రాసాదాలపైనా, ఆలయాలపైనా దట్టంగా పెరిగిపోయిన ఓక్ చెట్లు తప్ప అతనికేమీ కనిపించలేదు. అక్కడక్కడ ఇసుక మేటలు వేసిన ఒక ప్రవాహాన్ని అతడు దాటుతుండగా, “ప్రసిద్ధ నది జంతస్ ఇదే” నని ఎవరో చెప్పారు. అతనో పచ్చిక నేల మీద అడుగుపెట్టినప్పుడు; “హెక్టర్(ట్రోజన్ రాకుమారుడు, ప్రియామ్ కొడుకు, వీరుడు) భౌతికకాయాన్ని తీసుకొచ్చిన ప్రదేశం ఇది. అతని ప్రేతాత్మ కోపగిస్తుంది, జాగ్రత్త” అని ఎవరో బిగ్గరగా అరిచారు. అతను ఒక రాళ్ళగుట్టను సమీపించబోయినప్పుడు, ఎవరో అతని చొక్కా పుచ్చుకుని లాగి,”కనబడడం లేదా? అది హెర్కయన్ జూపిటర్ బలిపీఠం” అని గుడ్లు ఉరిమాడు.

చుట్టూ శిథిలాలూ, అలముకున్న అంధకారం తప్ప ఏమీ కనిపించకపోయినా అదో పవిత్రస్థలి అని సీజర్ కు తెలుసు. అక్కడి ప్రేతాత్మలను తలచుకుని భయపడ్డాడు. అప్పటికప్పుడు మట్టితో ఒక బలిపీఠాన్ని నిర్మింపజేసి, దాని మీద ధూపం వెలిగించాడు. తనకు గొప్ప శ్రేయస్సును ప్రసాదించమని ఆ క్షేత్రపాలకులైన దేవతలను ప్రార్థించాడు. అక్కడి కుప్పకూలిన నిర్మాణాలను పునర్నిర్మించి వాటికి పూర్వవైభవం తీసుకోస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంతలో తన బద్ధశత్రువైన పాంపే గుర్తొచ్చి, అతన్ని చంపే తహతహలో ఓడ ఎక్కి ఎక్కడా ఆగకుండా హడావుడిగా ఆసియాలోని సుసంపన్న నగరాల మీదుగా ఈజిప్టు రాజధాని అలెగ్జాండ్రియాకు వెళ్లిపోయాడు.

ఉన్మాదులూ, చక్రవర్తులూ కూడా ట్రాయ్ ను దర్శించుకున్నాడు. ‘కరకలా’ అనే పేరుతో ప్రసిద్ధుడైన ఉన్మత్త రోమన్ చక్రవర్తి ఆంటోనినూస్(క్రీ.శ. 188) ఇక్కడి ఆలయాలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నాడు. ఈ ప్రాంత గతవైభవస్మరణతో మతిభ్రమించి, మేసిడోనియాలో తనను అలెగ్జాండర్ ది గ్రేట్ గా ఊహించుకున్నట్టే, ఇక్కడ అఖిలెస్ గా ఊహించుకున్నాడు. తన ఆప్తమిత్రుడు పెట్రాక్లస్ మరణానికి అఖిలెస్ అంతులేని దుఃఖంలో కూరుకుపోయిన సంగతి గుర్తొచ్చి, తను కూడా అలాంటి దుఃఖాన్ని అనుభవించాలనుకున్నాడు. తనెంతో అభిమానించే ఫెస్టస్ అనే ఒక మాజీబానిసకు విషం పెట్టి చంపించి అతనికి బ్రహ్మాండమైన చితిని పేర్చవలసిందిగా ఆదేశించాడు. తను స్వయంగా జంతువులను బలిచ్చి, మృతదేహాన్ని చితి మీదికి చేర్చి, నిప్పు అంటించాడు. ఆ తర్వాత ఆ మంటలపై మద్యాన్ని చిలకరించి, తన ప్రాణమిత్రుడి మరణాన్ని పండుగ చేసుకోవలసిందిగా వాయువులను ప్రార్థించాడు. కరకలా ప్రభుత్వంలో చిన్న అధికారిగా ఉన్న హెరోడియన్ ఈ ముచ్చట వివరిస్తూ, తను కూడా పట్టలేని దుఃఖంతో తన తలవెంట్రుక నొకదానిని చితికి అర్పించబోయాననీ, తీరా తనది పూర్తిగా బట్టతల కావడంతో అక్కడ ఉన్నవాళ్ళందరూ నవ్వారనీ చెప్పుకున్నాడు.

ఆ తర్వాత, అఖిలెస్ సమాధి చుట్టూ అలెగ్జాండర్ నగ్నంగా ప్రదక్షిణ చేశాడన్న సంగతి గుర్తొచ్చి కరకలా కూడా అదే చేశాడు.

ఆ తర్వాతి కాలంలోనూ, పర్షియాకో, జెరూసలెంకో నిరంతర ప్రవాహంలా వెళ్ళే యాత్రికుల బృందాలు విధిగా ఆ పవిత్రస్థలి మీద కాలు మోపాయి. తూర్పు భూముల్లో రోమన్ సామ్రాజ్యానికి కొత్త రాజధానిని నిర్మించాలనుకున్న కాన్ స్టాంటీన్(క్రీ.శ.270) అందుకు బైజాంటియమ్ ను ఖరారు చేసేముందు, ట్రాయ్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశాడు. నోవమ్ ఇలియమ్(ట్రాయ్ సమీపంలోని ఒక గ్రామం) ను సందర్శించిన రోమన్ చక్రవర్తి జూలియన్(క్రీ.శ.336), ఏజాక్స్(గ్రీకు వీరుడు)అస్థికలకు కొత్త సమాధిని నిర్మింపజేశాడు. మృతవీరుల అస్థికలను ఆరాధించే క్రైస్తవులను చూసి ఎగతాళి చేసిన ఈ చక్రవర్తే, ఏజాక్స్ సమాధిని భక్తితో కొలిచాడు. ట్రోజన్లు ఆ తర్వాత కూడా మరి కొన్నేళ్లపాటు పురాతన బలిపీఠాల వద్ద రహస్యంగా బలులు ఇస్తూవచ్చారు. రోమ్ లో క్రైస్తవ చక్రవర్తుల రాకతో అది క్రమంగా తగ్గుముఖం పట్టి, ట్రాయ్ మతపరమైన ప్రాముఖ్యం కొల్పోయింది.

greek goddess pallas athena

దర్దనెల్లెస్ కు వెళ్ళే దారులకు పదిహేనువందల ఏళ్లపాటు ట్రాయ్ కాపలా కాయగలిగింది. ఇప్పుడా వీధుల నిండా గడ్డి గాదం పెరిగిపోయాయి. ఆలయాలు, ప్రాసాదాల గోడలు కూలిపోయాయి. ఇప్పుడక్కడ ముళ్ళపొదలు, గడ్డితో నిండిన ఓ పెద్ద దిబ్బ మాత్రమే ఉంది. ట్రయాడ్ తీరం వెంబడి ప్రయాణించిన ఆంగ్లో-శాగ్జన్ చరిత్రకారుడు సావూఫ్ (క్రీ.శ. 1100), ట్రాయ్ శిథిలాలు అనేక మైళ్ళ దూరం వ్యాపించి ఉన్నాయని రాశాడు. ట్రాయ్ పూర్తిగా ధ్వంసమైందనీ, ఏమీ మిగలలేదనీ సర్ జాన్ మండవిల్ అనే మరో పర్యాటకుడు రాశాడు.

నిజమే, ట్రాయ్ ధ్వంసమైంది, అయినా మిగిలింది. జనం ఊహల్ని జ్వాజ్వల్యమానం చేయగలిగిన శక్తి ట్రాయ్ కు ఉన్నట్టు మరే నగరానికీ లేదు. బహుశా ఒక్క జెరూసలెం ఇందుకు మినహాయింపు. సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో ట్రాయ్ స్మృతిని హోమర్, వర్జిల్ సజీవం చేశారు. అఖిలెస్ నడిచిన బాటల మీద తాము కూడా నడిచే రోజు కోసం ఇటలీ పండితులు ఎందరో కలలు గన్నారు. రోమన్లు అనుకున్నట్టే, తాము కూడా ట్రోజన్ల వారసులమనీ, లండన్ అసలు పేరు ట్రాయ్ నోవంట్(నూతన ట్రాయ్) అనీ ఇంగ్లీష్ జనం అనుకుంటారు.

ట్రాయ్ కల్పన కాదు, నిజమనీ; హిస్సాలిక్ దిబ్బ కింద ఆ నగరం తాలూకు గోడలు, ప్రాసాదాలు, అలంకరణసామగ్రితోపాటు ట్రోజన్ల సాహిత్యం కూడా సమాధైందనీ 1870 లలో గట్టిగా నమ్మినవాళ్ళు ఇద్దరే: ఫ్రాంక్ కల్వర్ట్, హైన్ రిచ్ స్లీమన్.  ట్రాయ్ ఉనికి హిస్సాలిక్ దగ్గరే నని 1822లోనే నిరూపించే ప్రయత్నంచేసిన పురాతత్వనిపుణుడు చార్లెస్ మెక్లారెన్ 1870ల నాటికి జీవించిలేడు. బునర్ బషీయే ట్రాయ్ అనీ, హిస్సాలిక్ దిబ్బ మీద తవ్వకాలు జరపడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదనేది దాదాపు అప్పటి పండితులందరి ఏకాభిప్రాయం.

హిస్సాలిక్ దిబ్బ మీద పూర్తిస్థాయిలో తవ్వకాలను చేపట్టగల ఆర్థికస్తోమత ఫ్రాంక్ కల్వర్ట్ కు లేదు, అతనికంత ఆసక్తీలేదు. ఆ దిబ్బలోని తూర్పు భాగం అతని సొంతం. పశ్చిమభాగం కమ్ కేల్ లో ఉంటున్న ఇద్దరు టర్కులకు చెందింది.

సముద్రం వైపు తిరిగి ఉన్న పశ్చిమ భాగంలోనే అతి ముఖ్యమైన నిర్మాణాలూ, విలువైన నిధినిక్షేపాలూ బయటపడతాయని స్లీమన్ నిర్ధారణకు వచ్చాడు. టర్కుల అధీనంలో ఉన్న ఆ ప్రదేశంలోనే మొదట తవ్వకాలు జరుపుదామనీ, కల్వర్ట్ కు చెందిన ప్రాంతంలో తర్వాత ఎప్పుడైనా జరపచ్చనీ అనుకున్నాడు. తను బయటపెట్టబోయే నిర్మాణాలను, నిధినిక్షేపాలను చూసిన తర్వాత; తమ అనుమతి లేకుండా తవ్వకాలు జరిపించిన తన తెంపరితనాన్ని ఆ టర్కులిద్దరూ క్షమిస్తారని భావించాడు.

ఏప్రిల్ 9 న, దగ్గర్లోని రెంకోయ్ అనే గ్రామానికి చెందిన పదిమంది టర్కిష్ కూలీలతో మొదటి కందకాన్ని తవ్వించాడు. ఒక్కొక్కరికి పది పియాస్టెర్ల(పియాస్టెర్: మధ్యప్రాచ్యంలో అనేక చోట్ల చలామణిలో ఉన్న ఒక ద్రవ్యకొలమానం. పౌండులో నూరోవంతు)చొప్పున చెల్లించాడు. పని జరుగుతున్నంత సేపూ బెల్టులో పిస్టల్ తోనూ, చేతిలో కొరడాతోనూ వాళ్ళ నెత్తి మీద నిలబడ్డట్టు నిలబడ్డాడు. తను ‘స్కెయిన్ గేట్’(ట్రాయ్ పశ్చిమ ద్వారం. ఇక్కటే గ్రీకులకు, ట్రోజన్లకు అనేక యుద్ధాలు జరిగాయి) ఉంటుందని ఊహించుకున్న వాయవ్య భాగంలో ఒకచోట మొదటి పలుగు దెబ్బ పడింది. ఒక గంటసేపు తవ్విన తర్వాత రెండు అడుగుల లోతున ఒక ప్రాకారం తాలూకు శిథిలాలు కనిపించాయి. స్లీమన్ ఉత్తేజితుడయ్యాడు. సూర్యాస్తమయానికల్లా 60 అడుగుల పొడవూ, 40 అడుగుల వెడల్పూ ఉన్న ఒక భవనం తాలూకు పునాదులు బయటపడ్డాయి.

మరునాడు మరో పదకొండు మందిని పనిలోకి తీసుకున్నాడు. క్రమంగా బయటపడుతున్న ఆ భవనం ఆగ్నేయ, నైరుతి మూలల్లో తవ్వకాలు ప్రారంభించాడు. చదరపు రాళ్ళు తాపడం చేసిన భవనం పై కప్పు పైకి తేలింది. దాని మీద రెండడుగుల మందంలో మట్టి, వందల ఏళ్ల నాటి గొర్రె పెంటికలు, మొక్కల శిథిలాలు, వాతావరణం తాలూకు ధూళి పేరుకుపోయి ఉన్నాయి. కుండపెంకులేవీ కనిపించలేదు. ఆ చదరపు రాళ్ళ అడుగున తవ్వించాడు. సరిగ్గా అతను ఊహించినట్టే అడుగున అగ్నిప్రమాదాన్ని సూచిస్తూ బూడిద కుప్పలూ, కాలిపోయిన పదార్థాలూ కనిపించాయి. ఒక పద్ధతిగా ఉన్న వాటి అమరికను బట్టి అక్కడ కనీసం పది కొయ్య ఇళ్ళు ఉండేవనీ, అగ్ని ప్రమాదంలో అవి తగలబడి పోయాయనీ, ఆ శిథిలాల మీద ఆ తర్వాత రాతి కట్టడం అవతరించిందనీ అతను నిర్ధారణకు వచ్చాడు. ఆ బూడిద కుప్పల్లో ఒకచోట ఒక నాణెం దొరికింది. దానికి ఒక పక్క రోమన్ చక్రవర్తి కమొడస్(క్రీ.శ. 161) చిత్రం, ఇంకో పక్క యుద్ధంలో ట్రోజన్ సేనలకు నాయకత్వం వహించిన ట్రాయ్ రాకుమారుడు హెక్టర్ చిత్రం ఉన్నాయి. ‘హెక్టర్ ఇలియోన్’ (ట్రాయ్ కి చెందిన హెక్టర్) అని రాసి ఉన్న ఆ నాణెం అత్యంత శుభసంకేతంగా స్లీమన్ కళ్లకు కనిపించింది.

రెండు రోజులపాటు ఆ భవనం చుట్టూనే తవ్వించాడు. మూడో రోజున, ఆ స్థలం యజమానులైన ఆ టర్కులిద్దరూ ఏ క్షణంలోనైనా వచ్చిపడతారనిపించి; తూర్పు నుంచి పశ్చిమానికీ; దక్షిణం నుంచి ఉత్తరానికీ రెండు పొడవైన కందకాలను హడావుడిగా తవ్వించడం ప్రారంభించాడు. అందువల్ల ఆ నగరం తాలూకు పూర్తి చిత్రం ఏర్పడుతుందని అనుకున్నాడు.

అవడానికి అతని ప్రణాళిక పక్కాగానే ఉంది. కానీ పని మొదలెట్టించాడో లేదో, ఆ టర్కులిద్దరూ వచ్చిపడ్డారు. తమ స్థలంలో తవ్వకాలు జరుపుతున్న ఈ చిన్నపాటి సైన్యాన్ని చూసి విస్తుపోయారు. తను శాస్త్రీయ ప్రాముఖ్యమున్న పని చేస్తున్నాననీ, ఇందులో తనకు ఎలాంటి స్వార్థం లేదనీ, నిజానికి తను చేస్తున్న పని టర్కీ గౌరవాన్ని ఎంతైనా పెంచుతుందనీ స్లీమన్ దుబాషీ ద్వారా వారికి వివరించాడు. అప్పటికీ దిగ్భ్రాంతి నుంచి తేరుకోని ఆ టర్కులిద్దరూ ఈ పని చేసేందుకు మీ కెలాంటి హక్కూ లేదు, తక్షణం ఇక్కడినుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దాంతో స్లీమన్ వాళ్ళను బుజ్జగిస్తూ, బతిమాలుతూ తను తవ్వకాలు జరిపిన చోటికి తీసుకెళ్లి చూపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతత్వ శాస్త్రవేత్తలందరూ రేపు పొగడ్తలతో ముంచెత్తబోయే తన పరిశోధనాంశాల గురించి ఓ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు. ఇప్పటికే తను పల్లస్ ఎథెనా ఆలయం గోడలో కొంత భాగాన్ని, అసంఖ్యాకమైన అస్థికలను, తాపడం రాళ్ళను, పంది దంతాలను, అగ్నిప్రమాదం తాలూకు ఆనవాళ్లను బయటపెట్టానని చెప్పాడు.

టర్కులు కొంత మెత్తబడ్డారు. అన్నిటినీ మించి అక్కడ తవ్వి తీసిన పెద్ద బండరాళ్ళ మీద వాళ్ళ దృష్టి పడింది. సిమోయిస్ అనే చోట ఒక రాతి వంతెన కట్టించాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ బండ రాళ్ళు అందుకు బాగా పనికొస్తాయనిపించింది. ఈ రాళ్ళను తమ వంతెనకు వాడుకునే షరతు మీద ఆ రెండు పొడవైన కందకాలను తవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. స్లీమన్ వాళ్ళకు నలభై ఫ్రాంకులు చెల్లించాడు. అవి తీసుకుని వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

స్లీమన్ తను తవ్వి తీసిన వాటికి వెంటనే ఏదో ఒక చారిత్రకనామం ఉంచేవాడు. ఓ పెద్ద గోడ బయటపడగానే, ఆ కట్టడానికి పల్లస్ ఎథెనా ఆలయం అని పేరు పెట్టేశాడు. ఉత్తరపు కందకాన్ని తవ్వుతున్నప్పుడు అడుగున ఇరవై రెండు బూడిద పొరల కింద ఒక మృణ్మయ స్త్రీమూర్తి కనిపించగానే, దానికి హెలెన్ అని పేరు పెట్టాడు. తగిన ఆధారాలతోనే అలా పేర్లు పెడుతున్నాడా అన్నది అతనెప్పుడూ ఆలోచించుకోలేదు.

అయితే, టర్కులు వచ్చి వెళ్ళిన తర్వాత దీర్ఘాలోచనలో పడిపోయాడు. తన అదుపులో లేని శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి తప్ప తను ముందుకు వెళ్లలేడని అతనికి అర్థమైంది. నలభై ఫ్రాంకులు చెల్లించి, వంతెన కట్టుకోడానికి రాళ్ళు ఇస్తానని చెప్పి తను వాళ్ళతో తాత్కాలికంగా ఒప్పందం చేసుకున్నాడు కానీ, అది భగ్నమవదన్న నమ్మకం ఏమిటి? ఈ టర్కులు తమ హక్కులకోసం పట్టుబడితే ఏం చేయాలి? అక్కడికీ తను ఆ మొత్తం స్థలాన్ని కొనేయాలనుకుని బేరమాడాడు. వాళ్ళు చాలా ఎక్కువ ధర చెప్పారు. పైగా ఆ దిక్కుమాలిన వంతెన కోసం రాళ్ళు అడుగుతున్నారు. అంతకన్నా అపచారం ఉంటుందా? వీళ్లతో ఎలా వేగాలి? ఈ స్థలం మీద పూర్తి హక్కులు ఎలా సంపాదించాలి?

అతనిలాంటి ఆలోచనలతో సతమతమవుతుండగానే ఏప్రిల్ 21 న ఆ ఇద్దరు టర్కులూ మళ్ళీ వచ్చారు. ఇప్పటివరకూ తవ్విన రాళ్ళు వంతెనకు సరిపోతాయి, ఇక తవ్వకాలు ఆపేయండని హుకుం జారీచేశారు.

ఈ హుకుంను తోసిపుచ్చగల ఎలాంటి ఆయుధాలూ స్లీమన్ దగ్గర లేవు. వీళ్ళతో ఇక పోరాడి లాభం లేదు, వేరే మార్గాలు చూడాల్సిందే ననుకున్నాడు. తను ఇంతవరకూ చేసిన పనేమిటో, ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో వివరిస్తూ జర్మనీ, ఫ్రాన్స్, ఎథెన్స్, కాన్ స్టాంటినోపిల్ లో ఉన్న మిత్రులకు వరసపెట్టి ఉత్తరాలు రాశాడు. ఒక జర్మన్ మిత్రుడికి ఇలా రాశాడు:

అతి పురాతన ప్రాసాదాలు, ఆలయాల శిథిలాలను నేను బయటపెట్టాను. పదిహేను అడుగుల లోతున, ఒక అద్భుత నిర్మాణానికి చెందిన ఆరడుగుల మందమైన పెద్ద పెద్ద గోడల్ని కనుగొన్నాను. ఇంకా ఏడున్నర అడుగుల లోతున ఇవే గోడలు ఎనిమిదిన్నర అడుగుల మందమైన గోడలపై ఆని ఉండడం చూశాను. ఇవి ప్రియాం ప్రాసాదం గోడలో, లేదా ఎథెనా ఆలయం గోడలో అయుంటాయని అనుకుంటున్నాను.

అయితే, దురదృష్టవశాత్తూ ఈ స్థలానికి యజమానులైన ఇద్దరు టర్కులు అదేపనిగా చికాకు పెడుతున్నారు. బహుశా  రేపటితో వాళ్ళు నా పని ఆపేస్తారు. ఈ లోపల ఆ స్థలం కొనేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఏమైనా ప్రియాం ప్రాసాదాన్ని వెలికితీసే వరకూ విశ్రమించకూడదని నిర్ణయించుకున్నాను.

అలా రాశాడే కానీ, ఆ క్షణాన తను ఇక చేయగలిగిందేమీ లేదని అతనికి తెలుసు. పరిస్థితులకు తలవంచుతూ, పనివాళ్ళకు వేతనాలు చెల్లించి పంపేశాడు. ఈలోపల మైసీనియా తవ్వకాలకైనా అనుమతి వస్తుందని ఆశపడుతూ  ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. కొన్ని వారాలు మైసీనియాలో గడిపి, టర్కిష్ ప్రభుత్వం నుంచి ఫర్మానాను, హిస్సాలిక్ దిబ్బ మీద యాజమాన్య హక్కును సాధించుకున్న తర్వాత  ట్రాయ్ వచ్చి తిరిగి తవ్వకాలను ప్రారంభిచవచ్చనుకున్నాడు.

(సశేషం)

 

 

 

 

 

 

హోమర్ ను చదువుకుంటూ అతడు-ఆమె

స్లీమన్ కథ-16

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

సోఫియా తల్లిదండ్రులు, తోబుట్టువులు, దగ్గరి బంధువులతో సహా కుటుంబం అంతా అక్కడే ఉంది. అందరూ ఒక టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. ఒకింత విషాదం తొంగి చూసే చిరునవ్వు, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, బట్టతల, వేస్టుకోటుకు వేల్లాడుతున్న బరువైన బంగారపు వాచీ చైనుతో ఉన్న ఈ విచిత్రమైన జర్మన్ వైపు అంతా కళ్ళప్పగించి చూశారు.

కాసేపటికి సోఫియా వచ్చింది. తెల్లని దుస్తులు ధరించింది. జుట్టు రిబ్బన్ తో ముడేసుకుంది. చాలా గంభీరంగా ఉంది. అందరిముందూ వైనూ, కేకులూ ఉంచారు. సోఫియా తలవంచుకుని కూర్చుంది. స్లీమన్ తన ప్రపంచయాత్రా విశేషాలను చక్కని గ్రీకులో చెప్పడం ప్రారంభించాడు. మధ్యలో ఉన్నట్టుండి సోఫియావైపు తిరిగి, “నీకు దూరప్రయాణాలు ఇష్టమేనా?” అని అడిగాడు. ఇష్టమేనని ఆమె చెప్పింది. “రోమన్ చక్రవర్తి హేడ్రియన్ ఎథెన్స్ ను ఎప్పుడు సందర్శించాడు?” అని అడిగాడు. సోఫియా తేదీతో సహా ఠకీమని చెప్పింది. “హోమర్ పంక్తులు కొన్ని అప్పజెప్పగలవా?” అని అడిగాడు. గడగడా అప్పజెప్పింది. పరీక్ష నెగ్గింది.

ఆ తర్వాతి మూడురోజులూ స్లీమన్ పగలంతా ఆ ఇంటి చుట్టూనే వేల్లాడి రాత్రి హోటల్ కు వెళ్ళేవాడు. అతని కళ్ళు తనను కనిపెట్టి చూస్తున్నాయని సోఫియాకు తెలుసు. అయినా తత్తరపడలేదు. తన చెల్లెళ్లతోనూ, బంధువుల అమ్మాయిలతోనూ ఆటపాటల్లో మునిగితేలింది. టేబుల్ సర్దడంలో సాయం చేసింది. మధ్య మధ్య, చమురు డబ్బాలు, వెన్న, ఆలివ్ లు ఉంచిన సెల్లార్ లోకి పరుగుతీసింది. ఇంటినిండా బంధువులు. స్లీమన్ ఓ చిన్న ఉత్తరం రాసి ఎలాగో ఆమెకు అందేలా చూశాడు.

ఇద్దరూ ఏకాంతంగా కలసుకున్నప్పుడు, “నన్ను పెళ్లి చేసుకోడానికి నువ్వు ఎందుకు ఇష్టపడ్డావ”ని హఠాత్తుగా అడిగాడు.

“మీరు ధనవంతులని మా అమ్మానాన్నా చెప్పారు కనుక” అని సోఫియా తటాలున సమాధానం చెప్పింది.

ఆ మాట స్లీమన్ ను నొప్పించింది. కోపంతో విసవిసా హోటల్ కు వెళ్లిపోయాడు. ఈ అమ్మాయిలో ఒక సహజమైన ఉదాత్తత ఏదో ఉందని అతను అంతవరకూ అనుకున్నాడు. కానీ తన ప్రశ్నకు ఒక బానిసలా సమాధానం చెప్పింది. హోటల్ కు వెళ్ళిన తర్వాత వెంటనే ఆమెకు ఉత్తరం రాశాడు:

మిస్ సోఫియా, నువ్విచ్చిన సమాధానం నన్ను తీవ్రంగా గాయపరిచింది. ఒక బానిస మాత్రమే అలాంటి సమాధానం ఇవ్వగలదు. అందులోనూ నీలాంటి ఒక చదువుకున్న అమ్మాయి అలాంటి జవాబు ఇవ్వడం మరింత దిగ్భ్రాంతి కలిగించింది. నేను చాలా సీదాసాదా మనిషిని. గౌరవమర్యాదలు కలిగిన ఓ ఇంటిపక్షిని. మనం పెళ్లి చేసుకోవడమే జరిగితే ఇద్దరం కలసి పురావస్తు తవ్వకాలు జరపచ్చనీ, హోమర్ మీద పరస్పరాభిమానాన్ని పంచుకోవచ్చనీ, ఏవేవో అనుకున్నాను.

నేను ఎల్లుండి నేపుల్స్ కు వెడుతున్నాను. బహుశా మనం మళ్ళీ కలసుకోలేకపోవచ్చు. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక స్నేహహస్తం కావాలనిపిస్తే నీపట్ల అంకితభావం కలిగిన నన్ను గుర్తుచేసుకో.

                                                                                                                  హైన్ రిచ్ స్లీమన్

                                                                                                               డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ,

                                                                                               స్థలం: సెయింట్  మిషెల్, 6, పారిస్ 

ఆ ఉత్తరాన్ని హోటల్ మెసెంజర్ ద్వారా సోఫియాకు పంపించాడు. అది చదివి ఆమె ఉక్కిరిబిక్కిరైంది. అతని కోపం పోయేలా ఒక ఉత్తరం రాయమని కుటుంబం అంతా ఆమెపై ఒత్తిడి తెచ్చింది. ఆమెకు సహకరించడానికి ప్రభుత్వాధికారిగా ఉన్న ఓ దగ్గరిబంధువును కూడా రప్పించారు. అప్పటికప్పుడు ఓ దుకాణం నుంచి కొని తెచ్చిన చవకబారు కాగితం మీద సోఫియా ఇలా రాసింది:

ప్రియమైన హెర్ హైన్ రిచ్:  మీరు వెళ్లిపోతానన్నందుకు విచారిస్తున్నాను. మధ్యాహ్నం నేనన్న మాటలకు కోపం తెచ్చుకోవద్దు. ఆడపిల్లలు అలాగే మాట్లాడాలేమో ననుకున్నాను. రేపు మళ్ళీ మీరు మా ఇంటికి వస్తే మా అమ్మానాన్నా, నేనూ ఎంతో సంతోషిస్తాం.

స్లీమన్ దాంతో తేలికపడ్డాడు. అయినాసరే, ఆమె తనను ఇష్టపడే పెళ్ళికి ఒప్పుకుందా లేదా అన్నది తేల్చుకోడానికి  ఉత్తరాల మీద ఉత్తరాలు రాశాడు. ఆమె ప్రతి ఉత్తరానికి జవాబిచ్చింది. అలా ఆరు రోజులపాటు సాగిన ఆ ఉత్తరాయణంలో చివరికి ఆమె తానుగా వివాహ ప్రతిపాదన చేసిన తర్వాతే అతను బెట్టు వీడాడు. పదిహేడేళ్ళ సోఫియాకు, నలభై ఏడేళ్ళ స్లీమన్ కు సెప్టెంబర్ 24న వివాహం జరిగింది,

స్లీమన్ ఫ్రాక్ కోటు వేసుకున్నాడు. సోఫియా తెల్లని దుస్తులు ధరించి, కొలొనస్ పువ్వులతో అలంకరించిన పెళ్లి కూతురి ముసుగు వేసుకుంది. ఆమె బంధువులందరూ గ్రీకు జాతీయ ఆహార్యంలో పెళ్ళికి హాజరయ్యారు. ఆ తర్వాత సాయంత్రం దాకా విందు జరిగింది. అదే రోజు రాత్రి వధూవరులు ఇద్దరూ ఎథెన్స్ రేవు ప్రాంతమైన పిరయాస్ కు వెళ్ళి, తెల్లవారుజామున మూడు గంటలకు నేపుల్స్ వెళ్ళే ఓడ ఎక్కారు. తన ఆటబొమ్మలు కూడా తెచ్చుకుంటానని సోఫియా పట్టుబట్టింది. స్లీమన్ వద్దని వాదించే స్థితిలో లేడు. అలా అతనిపై ఆమె తొలి విజయం సాధించింది. ఆ తర్వాత చివరివరకూ ఆమె విజయపరంపర కొనసాగింది.

అందంతోపాటు ఆమెలో పసితనం ఉంది. ఆమె నడకలో ఒక సహజమైన హుందాతనం ఉట్టిపడేది. ఆమె జీవితాంతమూ అది చెక్కుచెదరలేదు. అతనిమీద పెత్తనం చేస్తున్నట్టు కనిపించకుండానే పెత్తనం చేసేది. ఆమె అతన్ని తదేకంగా ప్రేమించింది. కానీ ఆ ప్రేమలో పెద్దవాళ్ళపట్ల పిల్లలకు ఉండే ఒక మంకుతనం ఉండేది. సన్నిహితమిత్రులతో కూడా అంటీ అంటనట్టు ఉండే స్లీమన్ సైతం ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె మనస్థితి వెంట వెంటనే మారిపోతూ ఉండేది. నవ్వుతూ నవ్వుతూనే అంతలో గంభీరంగా మారిపోయేది. అది కూడా పిల్లల్లో కనిపించే గాంభీర్యం. అదతనికి ఆహ్లాదం కలిగించేది. “ఆమెలో భర్తపట్ల ఒక అలౌకిక ఆరాధనాభావం ఉంది” అని అతను హానీమూన్ రోజుల్లోనే రాసుకున్నాడు.

నిజానికి, అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య తన జీవితంలోకి అనుకోకుండా అడుగుపెట్టిన ఆమెపై అతనికీ అలాంటి ఆరాధనాభావమే ఉంది. తన తుదిక్షణాలవరకూ ఆమెను అలాగే ఆరాధించాడు. అయితే, వారు కీచులాడుకున్న సందర్భాలు లేకపోలేదు. అతనిలో వెనకటి అసహనం, ఆవేశం తన్నుకొచ్చిన ఘట్టాలూ ఉన్నాయి. అతని అహానికీ, అతిశయానికీ, డాంబికానికీ ఆమెలోని ప్రశాంతతా, ఉల్లాసమూ అడ్డుకట్ట అయ్యేవి. ఆమె సాహచర్యం అతనికి మృదుత్వాన్నీ, మర్యాదనూ మప్పింది. మొత్తానికి ఆమె తన సహచరి కావడం అతనికి ఓ అంతుబట్టని అద్భుతంలా అనిపించేది. తన గొప్ప అదృష్టాన్ని చూసుకుని తనే దిగ్భ్రమ చెందేవాడిలా ఒక్కోసారి ఆమెనే చూస్తూ ఉండిపోయేవాడు.

అదో విచిత్రమైన హానీమూన్. నేపుల్స్…పాంపే…ఫ్లోరెన్స్…మ్యూనిక్…వెంట వెంటనే ఒకచోటినుంచి ఒక చోటికి నిరంతర ప్రయాణం. అందులో విధిగా మ్యూజియంల సందర్శన ఉంటుంది. వాటిలోని కళాకృతులపై స్లీమన్ పెద్ద గొంతుతో ప్రత్యక్షవ్యాఖ్యానం వినిపిస్తూ ఉండేవాడు. విని విని ఇక భరించలేక సోఫియా చెవులు మూసుకునేది. అయినా అతనలా చెప్పడం ఆమెకు ఇష్టంగానే ఉండేది. జనం ఆగిపోయి ఈ నలభయ్యేడేళ్ళ ప్రొఫెసర్ ను, అతని పడచు భార్యను వింతగా చూసేవారు. కళాకృతుల పరిశీలనలో ఇద్దరిలోనూ ఒకే గాంభీర్యం, ఏకాగ్రత. సాయంత్రం హోటల్ గదికి తిరిగి వెళ్ళాక హోమర్ నుంచి రెండువందల పంక్తులు వల్లించమని ఆమెను కోరేవాడు. ఆమె వల్లిస్తూ వల్లిస్తూనే అప్పుడప్పుడు నిద్రలోకి జారిపోయేది. ఆమె అతనిలోని అధ్యాపకుణ్ణి మేలుకొలిపింది.

ఆమెను తన అభిరుచులకు అనుగుణంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె భాషావేత్త కావాలని పట్టుబట్టాడు. ఒక ఏడాదిలో జర్మన్, ఇంకో ఏడాదిలో ఫ్రెంచ్ నేర్చేసుకోవాలన్నాడు. అది నీకేమంత కష్టం కాదని బోధించాడు. ఆమెను పారిస్ లోని సువిశాలమైన తన అపార్ట్ మెంట్ కు తీసుకెళ్ళాడు. అది చలికాలం. బాగా మంచుపడుతోంది. ఆమెలో బంధువులకు దూరమయ్యానన్న దిగులు. భర్త రకరకాల ఫ్యాషన్ దుస్తులు తెచ్చి పడేసి వాటిని వేసుకొమంటున్నాడు. కొప్పు ధరించమన్నాడు. కొంతమంది గ్రీకు అమ్మాయిలు ఇంటికి వచ్చినప్పుడు, ఆమె కొప్పు విప్పేసి మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళకు తన ఆటబొమ్మలు చూపిస్తూ మురిసిపోయింది.

పారిస్ ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. మంచుతో వాతావరణం అంతా తడి తడిగా ఉంది. కత్తితో కోస్తున్నట్టు చలిగాలులు. అతని స్నేహాలు, ఆసక్తులు; తరచు జియోగ్రాఫికల్ సొసైటీ సందర్శనలు; ట్రాయ్ గురించీ, మైసీనియా గురించీ, గ్రీకు ద్వీపకల్పంలోని దీవుల గురించీ అతను అదేపనిగా మాట్లాడుతుండడం, అక్కడ భూమిలో కప్పడిన నిధినిక్షేపాల గురించిన అతని ఊహలూ-అన్నీ క్రమంగా ఆమెకు విసుగు తెప్పిస్తున్నాయి. స్లీమన్ బుర్రకు విశ్రాంతి అన్న ప్రశ్నే లేదు. అది గడియారంలా ఎప్పుడూ పనిచేస్తూ ఉండాల్సిందే. తనేమిటో నిరూపించుకోవాలన్న అంతులేని తపనతో ఒక కార్యక్షేత్రం కోసం ఇప్పటికీ అతను వెతుకుతూనే ఉన్నాడు.

స్లీమాన్ & సోఫియా

జనవరి చివరికల్లా మళ్ళీ అస్తిమితంలోకి జారిపోయాడు. ట్రాయ్ కి తిరిగివెళ్లే ఆలోచన ప్రారంభించాడు. అంతలో, కూతురు నడేజ్దా చనిపోయినట్టు పిడుగుపాటులాంటి వార్త! దుఃఖంతో కుప్పకూలిపోయాడు. మళ్ళీ ఏవేవో భూతాలు అతన్ని వెంటాడసాగాయి. కూతురి మరణానికి తనే కారణమనుకుంటూ తనను నిందించుకున్నాడు. ఆమెను దక్కించుకోడానికి తను ఏమైనా చేసి ఉండేవాడు. పెద్ద పెద్ద డాక్టర్లను ఇంటికే రప్పించి వైద్యం చేయించి ఉండేవాడు. అమ్మాయి అస్వస్థ గురించి ముందే తనకు చెప్పి ఉంటే ఎంత బాగుండేదనుకున్నాడు. మిగతా పిల్లల్ని ఓదార్చడానికి అప్పటికప్పుడు సెయింట్ పీటర్స్ బర్గ్ కు బయలుదేరాలనుకున్నాడు కానీ, ఇక్కడ సోఫియా జబ్బుపడింది.

మనిషి పాలిపోయి, నిస్తేజంగా అయిపోయింది. డాక్టర్లకు మాత్రం ఆమెలో ఎలాంటి లోపం కనిపించలేదు. ఫ్రెంచీ, జర్మనూ ఒకేసారి నేర్చుకోవాలని అతను ఒత్తిడి తేవడంతో ఆమె ఎక్కువ కష్టపడుతోంది. ఆమెలో ఇంత మందకొడితనం ఏమిటని అతను అనుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఆమెను సర్కస్ కు తీసుకెళ్లేవాడు, దానిని బాగా ఆనందించింది. కానీ ఎక్కువగా థియేటర్ కు తీసుకెళ్ళేవాడు. వజ్రపు నగలు వేసుకుని, బాక్స్ లో బాసింపట్టు వేసుకుని కూర్చుని, తనకు ఏమాత్రం అర్థం కాని ఉపన్యాసాలు వింటూ విసుగుతో కన్నీళ్ళ పర్యంతం అయ్యేది. చివరికి డాక్టర్లు ఇంటిబెంగ అని తేల్చారు.

ఫిబ్రవరి మధ్యకల్లా ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఉన్నట్టుండి ఏడవడం మొదలెట్టేది. ఆమెను ఎథెన్స్ లో దింపి తను ట్రాయ్ కి వెళ్లాలని స్లీమన్ నిర్ణయించుకున్నాడు. తవ్వకాలకు అనుమతిస్తూ టర్కిష్ ప్రభుత్వం నుంచి ఫర్మానా తెప్పిస్తానని కల్వర్ట్ వాగ్దానం చేశాడు. కానీ ఇంతవరకూ అది రాలేదు.  భార్యతో కలసి నీమన్ అనే స్టీమర్ మీద మార్సే నుంచి పిరయాస్ వెడుతూ, 1870 ఫిబ్రవరి 17న కల్వర్ట్ కు ఇలా ఉత్తరం రాశాడు. అందులో ఎప్పటిలా అతని అసహనం తొంగిచూసింది:

మీకు ఫర్మానా వచ్చిందీ లేనిదీ దయచేసి వెంటనే నాకు తెలియజేయండి. వచ్చి ఉంటే తక్షణమే హిస్సాలిక్ దగ్గర తవ్వకాలు ప్రారంభిస్తాను. పూర్తి అనుకూల వాతావరణం రాకుండా ఇంత ముందే పని ప్రారంభించడం అడ్డంకి అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే, ఇక్కడి వాతావరణం అనుకూలంగా, ఆహ్లాదకరంగా ఉంది. ట్రయాడ్(ట్రాయ్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు)లో ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. అదీగాక, ఆ తర్వాత నాకు వేరే అత్యవసరమైన పనులు కూడా ఉన్నాయి కనుక వెంటనే తవ్వకాలు ప్రారంభించాలనుకుంటున్నాను.

కనుక, మీకు ఫర్మానా వచ్చి ఉంటే దయచేసి అవసరమైన పరికరాలు, సాధనాల జాబితా మరోసారి రాసి పంపగలరు. పారిస్ నుంచి బయలుదేరే హడావుడిలో మీరు కిందటి సారి రాసిన లేఖలోని జాబితాను కాపీ చేసుకోవడం మరచిపోయాను…

స్లీమన్ ఎథెన్స్ కు చేరుకున్నాడు. అప్పటికీ ఫర్మానా రాలేదు. దాంతో మైసీనియాలో కొన్ని తవ్వకాలు జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు. అయితే, అప్పటికి కొన్ని మాసాల క్రితమే ఏడుగురు ఆంగ్లేయుల బృందాన్ని బందిపోట్లు హత్య చేయడంతో మారుమూల ప్రాంతాలలో ఒంటరిగా తిరిగే పురావస్తుపరిశోధకుల మీద గ్రీకు ప్రభుత్వం మండిపడుతోంది. దాంతో నిస్పృహ చెందిన స్లీమన్ ఫర్మానా వచ్చేవరకూ ఎజియన్ సముద్రపు దీవుల మధ్య పడవలో తిరుగుతూ కాలక్షేపం చేయాలనుకున్నాడు.

అదొక దుస్సాహసంగా పరిణమించింది. అతనికి పడవ ప్రయాణంలో అనుభవంలేదు. దానికితోడు, తను కుదుర్చుకున్న గ్రీకు పడవవాడి అనుభవం కూడా అంతంతమాత్రమే అనిపించింది. అపోలో(గ్రీకు దేవుడు) జన్మస్థలమైన డీలోస్ ను, పాలరాతి గుట్టలకు ప్రసిద్ధమైన పారొస్ ను, బాకస్ (రోమన్ దేవుడు)కు పవిత్రస్థలమైన నెక్సాస్ ను సందర్శించాడు. ఆ తర్వాత అతని పడవ తుపానులో చిక్కుకుంది. నాలుగురోజులపాటు రొట్టెతోనూ, మంచినీళ్ళతోనూ గడిపాడు. అక్కడినుంచి చిన్న దీవి అయిన తేరా(సెంటోరీనో)కు వెళ్లాడు. అది అన్నింటికన్నా ఎక్కువగా అతన్ని ఆకట్టుకుంది. ఎజియన్ సముద్రంలో విసిరేసినట్టు ఉన్న చిన్న చిన్న దీవుల్లో దాదాపు దక్షిణం కొసన ఉన్న ఈ దీవికి ఒక చరిత్ర ఉంది. క్రీ.పూ. 631 లో, ఆఫ్రికాలోని సంపన్న ప్రాంతమైన సైరీన్ ను తమ వలసగా మార్చుకోవడానికి గ్రీకులు ఈ దీవినుంచే బయలుదేరి వెళ్లారు. అది అగ్నిపర్వత ప్రాంతం కూడా. లావా పొరలతో; ఎరుపు, నలుపు, పసుపు, గోధుమ వంటి వివిధ రంగుల్లో ఏర్పడిన విచిత్ర శిఖరాలను చూసి స్లీమన్ ఆనందించాడు. ఈ శిఖరాలు ఏడువందల అడుగుల ఎత్తువరకూ ఉన్నాయనీ, “సంభ్రమం గొలిపే ఒక అద్భుతదృశ్యా”న్ని అవి ఆవిష్కరించాయనీ రాశాడు. ఆ దీవిలోని జనం కూడా అతనికి నచ్చారు. మూడు లావా పొరల కింద ఆమధ్యనే దొరికిన కొన్ని రాతి యుగపు కలశాలను వారి దగ్గర కొన్నాడు. అలా ఒక్కొక్క దీవినే చుట్టేసి తిరిగి ఎథెన్స్ కు వచ్చాడు.

ఇంతకుముందు గాలివాన, తుపానులాంటి ఒక పెద్ద విపత్తునుంచి బయటపడిన ప్రతిసారీ అతన్ని అదృష్టం వరిస్తూవచ్చింది. డచ్చి తీరానికి దగ్గరలో టెక్సెల్ దీవి దగ్గర అతను ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోయినప్పుడు అదే జరిగింది. అట్లాంటిక్ మధ్యలో సంభవించిన పెను తుపాను నుంచి బయటపడిన కొన్ని రోజులకే కాలిఫోర్నియా బంగారం వేటలో పెద్ద ముల్లెను మూటగట్టాడు. ఇప్పుడు కూడా తనను తేరా దీవిలోకి నెట్టుకుంటూ వెళ్ళిన నాలుగురోజుల తుపాను, ట్రాయ్ లో తనకోసం ఎదురుచూస్తున్న మరో గొప్ప అదృష్టాన్ని సంకేతిస్తూ ఉండచ్చని అతను భావించి ఉంటాడు.

అప్పటికీ కాన్ స్టాంట్ నోపిల్ నుంచి రావలసిన ఫర్మానా రాలేదు. అయినాసరే, తెగించాడు. తను ట్రయాడ్ కు వెళ్ళి తీరాలనీ, పనివాళ్ళను నియమించుకోవాలనీ, స్వయంగా చేతి గొడ్డలిని అందుకోవాలనీ, తనను ఏ శక్తీ ఆపలేదనీ నిర్ణయానికి వచ్చాడు. సోఫియాను ఎథెన్స్ లో ఉంచేసి, ఒంటరిగా, ఎవరి సాయమూ లేకుండా ట్రాయ్ మీద తుపానులా విరుచుకుపడడానికి బయలుదేరాడు.

(సశేషం)

 

 

 

 

గ్రీకు పెళ్లి కూతురు అన్వేషణలో…

స్లీమన్ కథ-15     

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ప్రముఖులకు, హోదాలో ఉన్నవారికి ఇచ్చే పురస్కారాలు స్లీమన్ కు ఎంతో విలువైనవిగా కనిపిస్తూ వచ్చాయి. అతనికీ బిరుదులు, సత్కారాల యావ పట్టుకుంది. తనను ఎవరైనా “హెర్ డాక్టర్” అని సంబోధిస్తేచాలు, అంతకన్నా తను కోరుకునేదేమీ ఉండదనుకున్నాడు. తను పారిస్ లో మకాం పెట్టి, సర్బాన్ యూనివర్సిటీలో చేరడానికి డాక్టరేట్ తెచ్చుకోవాలన్న తపన కూడా ఒక ప్రధాన కారణం. అయితే దురదృష్టవశాత్తూ, సర్బాన్ యూనివర్శిటీ నిబంధనల ప్రకారం అతను అతిథి విద్యార్థే తప్ప నిత్యవిద్యార్థి కాడు. కనుక, ఆ యూనివర్సిటీనుంచి డాక్టరేట్ పొందే అవకాశం లేదు. దాంతో యూనివర్సిటీ ఆఫ్ రాష్టాక్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఏ విషయం మీద సిద్ధాంతవ్యాసం సమర్పిస్తారని ఆ యూనివర్సిటీ అడిగినప్పుడు, తన జీవితకథనే ప్రాచీన గ్రీకుభాషలో రాసి సమర్పిస్తానని చెప్పాడు. విచిత్రం!-విశ్వవిద్యాలయాల చరిత్రలోనే అపూర్వం, అసాధారణం అయిన ఈ ప్రతిపాదనను ఆ యూనివర్సిటీ ఆమోదించింది.  ఆవిధంగా స్లీమన్ సొంతకథను రాసి డాక్టరేట్ తెచ్చుకున్నాడు. తన పేరుకు ముందు ఎవరైనా ‘డాక్టర్’ తగిలించకపోయినా, తనను ‘డాక్టర్ స్లీమన్’ అని సంబోధించకపోయినా  చాలా బాధ పడేవాడు.

పారిస్ లోని తన అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటూ పురావస్తు విషయాల రచనతోనూ, ఆత్మకథా రచనతోనూ నవంబర్, డిసెంబర్ మాసాలు గడిపాడు. ఆ తర్వాత ట్రాయ్ తవ్వకాల వ్యవహారం అతని బుర్రను మళ్ళీ తొలవడం ప్రారంభించింది. అసలు పురావస్తు తవ్వకాల గురించి తనకు ఎంత తెలుసు? ఎక్కడ, ఎలా ప్రారంభించాలి? ఎంతమంది పనివాళ్లను పెట్టుకోవాలి? ఎంత ఖర్చవుతుంది? బందిపోట్ల బెడదను ఎలా ఎదుర్కోవాలి? చివరికి…తవ్వకాలు జరిపేటప్పుడు ఎలాంటి టోపీ ధరించాలి?-ఇలా అనేక ప్రశ్నలు, సందేహాలు అతని ముందు వేళ్లాడాయి.

ఓ పందొమ్మిది ప్రశ్నలను దండగుచ్చుతూ, వెంటనే సమాధానం రాయమని అర్థిస్తూ 1868, డిసెంబర్ చివరిలో ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు:

  1. పని ప్రారంభించడానికి ఏది అనువైన సమయం?
  2. వసంతంరాగానే వీలైనంత త్వరగా ప్రారంభించడం మంచిదా?
  3. నాకు తరచు జ్వరం వస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో వసంతకాలంలో జ్వరాలు వచ్చే అవకాశం ఉందా?
  4. నాతో ఏయే మందులు పట్టుకెళ్లాలి?
  5. ఇక్కడినుంచే ఓ నౌకరును తీసుకుని వెళ్లనా? లేక ఎథెన్స్ లోనే నమ్మకస్తుడు ఎవరైనా దొరుకుతాడా? టర్కిష్ మాట్లాడగలిగే నమ్మకస్తుడైన గ్రీకు అయితే మంచిదనుకుంటాను.
  6. ట్రాయ్ ప్రాంతంలోని అన్ని ఇళ్ళలో పురుగూపుట్రా ఎక్కువ కనుక, మార్సే (Marseille: ఫ్రాన్స్ లోని ఒక పురాతన రేవు పట్టణం)నుంచే ఓ గుడారాన్ని, ఇనపమంచాన్ని, దిండును తీసుకెళ్ళమంటారా?
  7. నాతో ఏయే పరికరాలు, అత్యవసరాలు పట్టుకుని వెళ్ళాలో దయచేసి వివరంగా రాయగలరు.
  8. పిస్టల్స్, బాకు, రైఫిల్ దగ్గరుంచుకోవాలా?
  9. కొండమీద తవ్వకాలు జరపడానికి ఆ స్థలయజమానులు అభ్యంతరం చెబుతారా?
  10. అవసరమైనంతమంది పనివాళ్లు దొరుకుతారా? వాళ్ళను ఎక్కడినుంచి తెచ్చుకోవాలి, ఎంత కూలి ఇవ్వాలి?
  11. ఎంతమందిని తీసుకోవాలి? గ్రీకులో, టర్కులో అయితే మంచిదా?
  12. ఆ కొండను తవ్వడానికి ఎంత సమయం పట్టచ్చని మీరు అనుకుంటున్నారు?
  13. ఎంత ఖర్చవుతుంది?
  14. మొదట ఓ సొరంగాన్ని తవ్వమని మీరు సూచించారు. అదంత ఆచరణయోగ్యం కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అక్కడ పురాతన ఆలయాలు, ఇతర కట్టడాల శిథిలాలు ఉంటే అవి దెబ్బతినే ప్రమాదముంది.
  15. ఆ కొండ సహజంగా ఏర్పడింది కాదనీ, కృత్రిమమైనదనీ మీరు ఎలా నిర్ధారణకు వచ్చారు?
  16. ఆ కొండ విస్తీర్ణం 700 చదరపు అడుగులు ఉంటుందని మీరు సూచించారు. ఫ్రెంచివాళ్ళ లెక్క ప్రకారం అది 26.5 అడుగుల పొడవూ, అంతే వెడల్పూ అవుతుంది. మీ ఉద్దేశం, 700 అడుగుల పొడవూ, అంతే వెడల్పూ ఉంటుందని చెప్పడం అనుకుంటున్నాను. ఫ్రెంచి లెక్కలో అప్పుడది 4,90,000 చదరపు అడుగులు అవుతుంది. కానీ నా పుస్తకంలో దాని పొడవు, వెడల్పులు 233 మీటర్లని రాశాను. అప్పుడది 54,000 చదరపు మీటర్లు అవుతుంది.
  17. ఆ కొండ మీద ఎంత ఎత్తున తవ్వాలి?
  18. కాన్ స్టాంట్ నోపిల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం మంచిదని నాకు అనిపిస్తోంది. అప్పుడు దర్దనెల్స్ లోని ఆ బ్యాంక్ శాఖ ద్వారా రుణం పొందే వెసులుబాటు నాకు ఉంటుంది.
  19. మండుటెండలో పని చేసేటప్పుడు ఎటువంటి టోపీ పెట్టుకుంటే మంచిది?

ఫ్రాంక్ కల్వర్ట్ వెంటనే ఎంతో ఓర్పుతో సమాధానం రాశాడు.  మెత్తని చురకలు వేస్తూనే జాగ్రత్తలు చెప్పాడు. ఆయన పురాతత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి. నినవా(ప్రాచీన మెసొపొటేమియా నగరం. అసీరియన్ల రాజధాని. నేటి ఇరాక్ లో టైగ్రిస్ నది తూర్పుతీరంలో ఉంది)ను తవ్వి తీసిన ఆస్టెన్ హెన్రీ లయర్డ్(క్రీ.శ 1817-1894)ను విస్తృతంగా చదివినవాడు. కందకాలను ఎలా తవ్వాలో తన ఉత్తరంలో పూస గుచ్చినట్టు స్లీమన్ కు బోధించాడు. వసంతం ప్రారంభానికీ, వేసవికీ మధ్య తవ్వకాలను చేపడితే మంచిదన్నాడు. పనివాళ్లను ఎక్కడినుంచి తెచ్చుకోవాలో, ఎంత కూలి చెల్లించాలో కూడా రాశాడు. హిస్సాలిక్ కొండలో సగభాగం తన ఆస్తి అనీ, అక్కడ తవ్వకాలు జరపడానికి తన అనుమతి తప్పనిసరిగా ఉంటుందనీ మరోసారి గుర్తుచేశాడు. మిగిలిన సగభాగంలో తవ్వకాలు జరపాలనుకుంటే దాని యాజమానులను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇస్తూ, ఆ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నానన్నాడు.  స్లీమన్ కు ఉన్న తేనీటి వ్యసనం గురించి తనకు తెలుసు కనుక; తేయాకును వెంట తీసుకుని వెడితే మంచిదనీ, అక్కడ కాఫీ, చక్కెర మాత్రం పుష్కలంగా దొరుకుతాయనీ రాశాడు. అవసరమైన సంబారాలన్నీ దర్దనెల్స్ నుంచి తీసుకువెళ్లచ్చన్నాడు. ఆపైన, ఆ ప్రాంతం పొడవు, వెడల్పులకు సంబంధించిన స్లీమన్ లెక్కలను సరిదిద్దాడు. పిస్టల్స్, బాకుల్లాంటి కాల్పనిక ఆయుధాలేవీ అవసరం లేదనీ, తుపాకులు వెంట ఉంటే చాలనీ అన్నాడు. ఇక వసతి విషయానికి వస్తే, సిప్లక్(టర్కీలో ఒక పట్టణం)లో ఇల్లు అద్దెకు తీసుకోమనీ, దానికి వెల్ల వేయిస్తే పురుగూ పుట్రా సమస్య ఉండదనీ సలహా ఇచ్చాడు. చివరిగా, టర్కులు ధరించే తెల్లని మజ్లిన్ తలపాగా మండుటెండ నుంచి తలకు మంచి రక్షణ ఇస్తుందన్నాడు.

కల్వర్ట్ లేఖలోని అంశాలను మననం చేసుకుంటూనే స్లీమన్ ఓసారి చుట్టం చూపుగా జర్మనీ వెళ్ళాడు. తను పచారీ కొట్టు నౌకరుగా పనిచేసిన పస్టెన్ బర్గ్ ను సందర్శించి, డాక్టరేట్ తీసుకోడానికి రాష్టాక్ వెళ్ళాడు. తన పుస్తకం ప్రచురణకర్తల చేతుల్లో ఉంది, ట్రాయ్ తవ్వకాలకు సమయం ఉంది కనుక, విడాకుల పని మీద ఇక ఇండియానాపోలిస్ కు వెళ్ళడమే తరవాయి అనుకుని అమెరికాకు ప్రయాణం కట్టాడు. వెంటనే విడాకులు లభిస్తాయని ఆశించాడు కానీ, తీరా వెళ్ళాక అదంత త్వరగా తెమిలే వ్యవహారంలా కనిపించలేదు. చట్టంలో కొన్ని ముఖ్యమైన సవరణలను సూచించాడు కానీ, చట్టసభ వాటిని తిరస్కరించింది. హోటల్ జీవితంతో విసుగెత్తి ఇండియానాపోలిస్ లోని ఓ సంపన్న ప్రాంతంలో ఇల్లు కొనుక్కున్నాడు. ఇంట్లో ఆఫ్రో-అమెరికన్ పనివాళ్లను, వంటమనిషిని పెట్టుకున్నాడు. అయిదుగురు న్యాయవాదులను నియమించుకున్నాడు. తన విడాకుల కేసును తనే వాదించుకుంటున్నాడా అన్నట్టుగా అందులో పూర్తిగా కూరుకుపోయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన పరిచితులైన న్యాయనిపుణులకు సుదీర్ఘమైన ఉత్తరాలు రాశాడు.  జూన్ లోగా విడాకులు పొందే అవకాశం కనిపించడం లేదనీ, ట్రాయ్ తవ్వకాలను వచ్చే వసంతానికి వాయిదా వేయవలసిరావచ్చనీ ఏప్రిల్ 14న కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు.

అవే రోజుల్లో అతనోసారి న్యూయార్క్ లో స్ట్రీట్ కార్ లో ప్రయాణం చేస్తుండగా, ఓ ఎనిమిదేళ్ళ కుర్రాడు పుస్తకాలు అమ్ముతూ కనిపించాడు. “రెండు సెంట్లకు ఒక పుస్తకం” అని అరుస్తూ, ప్రయాణికుల చేతుల్లో పుస్తకాలు పెట్టాడు.  “అయిదు సెంట్లకు మూడు పుస్తకాలు” అని వాళ్ళ చెవిలో చెబుతున్నట్టు చెప్పి, ఆ తర్వాత అందరినుంచీ పుస్తకాలో, డబ్బులో వసూలు చేసుకున్నాడు. స్లీమన్ కు ముచ్చటేసి ఆ కుర్రాడి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఏడాది క్రితం తండ్రి చనిపోయాడనీ, తల్లి జబ్బుమనిషి అనీ, తాము ఆరుగురు సంతానమనీ, కుటుంబానికి సాయంగా తనిలా పుస్తకాలు అమ్ముతున్నాననీ అతను చెప్పాడు. అయ్యో అనుకున్న స్లీమన్ అతని చేతిలో ఓ డాలర్ ఉంచబోతే, తిరస్కరించాడు. “నా దగ్గర మీరు అరవై పుస్తకాలు తీసుకుంటేనే మీ డబ్బు తీసుకుంటాను. నేను వ్యాపారిని, బిచ్చగాణ్ణి కాదు” అన్నాడు పౌరుషంగా. ముగ్ధుడైపోయిన స్లీమన్ అతనికి డాలరిచ్చి అరవై పుస్తకాలు తీసుకున్నాడు. ఆ తర్వాత, “రేపు నీకు పట్టబోయే అదృష్టానికి ఈ డాలరే పెట్టుబడి కావాలని ఆశిస్తున్నాను. నువ్వు ఏదో ఒక రోజున గొప్ప ధనవంతుడివి కావాలనీ; నీలాంటి ఉత్తమపౌరుల కారణంగా ఆత్మగౌరవంతోనూ, వైభవంతోనూ వెలిగిపోయే ఈ ఘనతవహించిన దేశం, చరిత్రలోని మహోజ్వల సామ్రాజ్యాలను అన్నింటినీ మించిపోవాలనీ కోరుకుంటున్నాను” అంటూ చిన్న ఉపన్యాసం ఇచ్చాడు.

స్లీమన్ తనదైన పద్ధతిలో ఇండియానాపోలిస్ లో బిజీ అయిపోయాడు. అతని పిండి పదార్థాల ఫ్యాక్టరీ బాగా నడుస్తోంది. ఎప్పటిలా మనీ మార్కెట్ ను అధ్యయనం చేస్తున్నాడు. బ్రదర్స్ ష్రోడర్స్ కు సుదీర్ఘమైన వ్యాపార నివేదికలు పంపిస్తున్నాడు. తన అరబ్బీ పరిజ్ఞానానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు.The Arabian Nights Entertainment  పై చిన్న పుస్తకం రాశాడు. ‘వివిధ భాషలను త్వరగా నేర్చుకోవడం ఎలా?’ అన్న అంశం మీద ఒక పెద్ద వ్యాసం రాసి పకిప్సీ(న్యూయార్క్ రాష్ట్రంలోని ఒక నగరం)లో జరుగుతున్న అమెరికా భాషాశాస్త్రవేత్తల సదస్సుకు పంపించాడు. ట్రాయ్ ను తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు. నార్త్-వెస్ట్ పాసేజ్(ఉత్తర అట్లాంటిక్ ను ఆర్కిటిక్ సముద్రం మీదుగా పసిఫిక్ తో కలిపే మార్గం) మీదా, ఉత్తర ధృవాన్ని కనుగొనడం మీదా ఉత్సుకతను రంగరిస్తూ వరసపెట్టి ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. వీటి అన్వేషకులకు ఆర్థికసాయం చేయడానికి కూడా ముందుకొచ్చాడు. ఇవన్నీ అలా ఉండగా, విడాకుల కేసు నానుతూ ఉండగానే, ఎకతెరీనా స్థానంలో కొత్త వధువు కోసం తనూ అన్వేషణ మొదలుపెట్టాడు. అది కూడా అసాధారణ రీతిలో!

గ్రీకు అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. గ్రీకు భాషలోని శ్రావ్యత అతన్ని కట్టి పడేయడమే కాకుండా, ఆడవాళ్ళు మాట్లాడితే అది మరింత శ్రావ్యంగా అనిపించింది. అయితే గ్రీకు వధువును ఎలా వెతికి పట్టుకోవాలనేది ప్రశ్న.  స్వయంగా గ్రీస్ కు వెళ్ళి, క్షుణ్ణంగా గాలించి యోగ్యమైన వధువును గుర్తించడం ఒక మార్గం. అంతలో, అంతకన్నా తేలిక మార్గం అతనికి తట్టింది. ఫిబ్రవరిలో అతని గ్రీకుయాత్రా గ్రంథం తాలూకు బౌండ్ చేయని ప్రతులు కొన్ని అందాయి. రెండు ప్రతులను తన మిత్రుడు థియోక్లిటస్ విమ్పోస్ కు పంపిస్తూ, అందులో ఒకటి అతన్ని తీసుకోమనీ, రెండోది ఎథెన్స్ యూనివర్సిటీ గ్రంథాలయానికి ఇవ్వమనీ కోరాడు. వాటిని బైండ్ చేయడానికి అయ్యే ఖర్చు కోసం 100 ఫ్రాంకులకు చెక్కును జతపరిచాడు. అందులో ఏమైనా మిగిలితే ఎథెన్స్ లోని బీదలకు వెచ్చించమని కోరాడు.

ఆ తర్వాత హఠాత్తుగా విషయానికి వచ్చాడు. దయచేసి ఒక గ్రీకు అమ్మాయి ఫోటో పంపగలరా అని అడిగాడు. ఆమె ఎవరైనా సరే, అందగత్తె అయితే చాలన్నాడు. ఫొటో స్టూడియోల అద్దాలపై ప్రదర్శించే ఫోటోలైతే మంచిదనీ, అప్పుడామె ఏ ఫ్రెంచ్ యువతో అయే ప్రమాదం తప్పుతుందనీ, ఫ్రెచ్ యువతులు ప్రమాదకారులన్న సంగతి అందరికీ తెలిసిందేననీ అన్నాడు. మొదట తటపటాయిస్తూనే ఈ విషయం ఎత్తుకున్నాడు కానీ, పోను పోను ధైర్యం చిక్కి తన మనసులోని అసలు కోరికను బయటపెట్టాడు. దయచేసి విమ్పోస్ స్వయంగా తనకు ఓ గ్రీకు వధువును చూసి పెట్టాలన్నదే ఆ కోరిక. ఆమెకు ఉండాల్సిన అర్హతల విషయానికి వస్తే, ఆమె అందగత్తే కాక, పేద కుటుంబానికి చెందినదై ఉండాలి. నల్లని జుట్టు, మంచి చదువు, ప్రేమించగల హృదయంతో పాటు; హోమర్ మీద ఆసక్తి కలిగినదై ఉండాలి. విమ్పోస్ సోదరి అయితే అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఆమెకు పెళ్లైపోయింది. బహుశా ఓ అనాథనో, ఒక పండితుని కుమార్తెనో, ఎవరింట్లో నైనా పిల్లలకు చదువు చెబుతూ నాలుగు రాళ్ళు తెచ్చుకుంటున్న అమ్మాయినో గుర్తించడం కష్టం కాకపోవచ్చు. చివరగా, మనసు విప్పి మాట్లాడడానికి ప్రపంచంలో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారంటూ, ఎథెన్స్ లోని పేదల కోసమని చెప్పి మరో 100 ఫ్రాంకులకు చెక్కు జోడించాడు.

ఆ ఉత్తరానికి విమ్పోస్ కోపగించలేదు. వెంటనే ఎథెన్స్ కు వెళ్ళి ఫొటోలు సేకరించి స్లీమన్ కు పంపించాడు. వాటిలో ఒక ఫొటో స్లీమన్ ను ఆకట్టుకుంది. ఆమె పేరు సోఫియా ఎంగస్త్రోమెనస్. నల్లని జుట్టు, లేతగా ఉన్న కోలముఖం, పెద్ద కళ్ళు, దట్టమైన, ఒంపు తిరిగిన కనుబొమలు… అసాధారణమైన అందం ఉట్టిపడుతోంది. ఆ ముఖంలో గాంభీర్యం ఉంది కానీ, చిన్నపిల్లల తరహా చిరునవ్వుతో అది చటుక్కున కాంతిమంతమయ్యే చిన్నెలూ తొంగి చూస్తున్నాయి. స్లీమన్ ఆ ఫొటోకు పన్నెండు కాపీలు తయారు చేయించి ఒక కాపీని వెంటనే తండ్రికి పంపిస్తూ, దానికి ఒక ఉత్తరం జతపరిచాడు. ఈ ఫొటోలోని అమ్మాయి నీకు నచ్చుతుందనుకుంటున్నాననీ; అయితే, ఆమెలో చదువుసంధ్యలపట్ల ఉత్సాహం కనిపించకపోతే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాననీ అందులో రాశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై లో తను ఎథెన్స్ కు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుని జర్మనీకి తీసుకోస్తానని అన్నాడు.

కానీ విడాకుల కేసు ముందుకు సాగకపోవడంతో అతను జులైలో ఎథెన్స్ కు వెళ్లలేకపోయాడు. కాకపోతే, కేసు తనకు అనుకూలంగా పరిష్కారం కాదన్న భయం ఇప్పుడతనికి లేదు. మార్చిలో అతనికి అమెరికా పౌరసత్వం లభించింది. విడాకుల పత్రంపై సంతకాలు జరిగే రోజుకోసం ఓపికగా ఎదురుచూడడం మాత్రమే తనిప్పుడు చేయవలసింది. ఎట్టకేలకు జులై చివరిలో అతనికి విడాకులు మంజూరయ్యాయి. వెంటనే న్యూయార్క్ కు వెళ్ళి, అందుబాటులో ఉన్న మొదటి ఓడలో గ్రీస్ కు బయలుదేరాడు.  సోఫియాను పెళ్లి చేసుకునే విషయంలో అప్పటికీ అతను ఒక నిర్ణయానికి రాలేదు. ఓడ లోంచే ఒక మిత్రుడికి ఉత్తరం రాస్తూ, దేవుడు దయదలిస్తే గ్రీస్ లో తనకు వధువు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయనీ, అక్కడి అమ్మాయిలు ఈజిప్టు పిరమిడ్లలా అందంగా ఉంటారనీ అన్నాడు. తనను అలా పిరమిడ్ తో పోల్చడం సోఫియాకు నచ్చే అవకాశం లేదు.

అతను ఆగస్టులో, సెయింట్ మెలిటస్ ఫీస్టు రోజున గ్రీస్ చేరుకున్నాడు. ఎథెన్స్ కు వాయవ్యంగా మైలుదూరంలో కొలొనస్ అనే చిన్నపట్టణంలో ఎంగస్త్రోమెనస్ కుటుంబానికి ఒక తోట ఇల్లు, దానికి దగ్గరలో ఓ చిన్న చర్చి ఉన్నాయి. సెయింట్ మెలిటస్ ఆ చర్చికి పోషకుడు. కొలొనస్- గ్రీకు సంగీత, నాటక కర్త సోఫోక్లీస్ జన్మస్థలం కూడా. ఈడిపస్ అనూహ్యంగా అంతర్ధానమైన చోటు కూడా ఇదేనని చెబుతారు. “మంచు బిందువులతో తడిసి కొలొనస్ తెల్లగా మెరిసిపోతూ ఉంటుందనీ, ద్రాక్షమద్యం రంగులో ఉన్న మొక్కల లోంచి స్వచ్చమైన గొంతుతో నైటింగేళ్ళ పాట వినిపిస్తూ ఉంటుం”దనీ సోఫోక్లీస్ వర్ణిస్తాడు.

థియోక్లిటస్ విమ్పోస్ తో కలసి కొలొనస్ లోని ఆ చర్చి దగ్గరికి స్లీమన్ వెళ్ళేసరికి అక్కడ అనూచానంగా వస్తున్న మెలిటస్ పండుగ జరుగుతోంది. అమ్మాయిలు పూలదండలు తీసుకుని చర్చికి వస్తూ కనిపించారు. ఇంతకన్నా పునీతమైన ప్రాంగణం, పవిత్రమైన రోజు ఉండదనుకుని స్లీమన్ సంతోషించాడు.

సోఫియా ఓ అనాథా కాదు, ఆమెకు ఎవరింట్లోనో పిల్లలకు చదువు చెప్పి నాలుగు రాళ్ళు తెచ్చుకోవలసిన అవసరమూ లేదు, ఆమె కుటుంబం పేదదని చెప్పడానికీ లేదు. ఆమె తండ్రి ఒక వస్త్రవ్యాపారి. ఎథెన్స్ లొ అతనికో దుకాణమూ, ఇల్లూ ఉన్నాయి. మంచి శారీరక దారుఢ్యంతో, గ్రీకుశిల్పంలా ఉన్న అతను స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని పతకం తెచ్చుకున్నాడు. స్లీమన్ వెళ్ళేసరికి సోఫియా చర్చిలోనే ఉంది. ఒక స్టూలు మీద నిలబడి పూలదండలు కడుతోంది. అంతలో “జర్మన్ వచ్చా”డని కేకలు వినిపించాయి. అంత త్వరగా వస్తాడని ఊహించని సోఫియా వెంటనే స్టూలు మీంచి దూకి దుస్తులు మార్చుకోడానికి ఇంట్లోకి పరుగెత్తింది.

(సశేషం)

 

 

 

ఎట్టకేలకు ట్రాయ్ నేల మీద…

 

స్లీమన్ కథ-14

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

స్లీమన్ గ్రామస్తులను కలసి, ఆ కొండ మీద ఇంతకుముందు ఎవరికైనా నిధినిక్షేపాలు దొరికాయా అని వాకబు చేశాడు. ఎప్పుడో 1811-14 ప్రాంతంలో కెప్టన్ గితారా అనే వ్యక్తి అక్కడ గాలింపులు జరిపాడనీ, అతనికి బంగారు చెవిపోగులు, మురుగులు దొరికినట్టు విన్నామనీ, అంతకుమించి తమకేమీ తెలియదనీ కొందరు చెప్పారు.

తను ‘లయర్టిస్ పొలం’ అనుకున్నచోట నిలబడి ఒడిస్సే లోని చివరి అధ్యాయాన్ని వల్లిస్తూ, దానిని వాళ్ళ మాండలికంలో గ్రామస్తులకు అనువదించి చెప్పడం ప్రారంభించాడు. అతని చుట్టూ మూగిన గ్రామస్తులు, ఒక విదేశీయుడు తమ పురాణకథల్ని తమ భాషలో అలా అనర్గళంగా అప్పజెబుతుంటే ఆశ్చర్యానందాలతో తలమునకలైపోయారు. తన ఇథకా మకాంలో అత్యంత మహత్తర క్షణాలు ఇవే ననుకుంటూ ఆ అనుభవాన్ని స్లీమన్ ఇలా గుర్తుచేసుకున్నాడు:

మూడు వేల ఏళ్ల క్రితం వైభవోపేతులైన తమ పూర్వీకులు మాట్లాడిన భాషలో హోమర్ అత్యంత శ్రావ్యంగా రాసిన ఆ ఘట్టాలను వింటుంటే వాళ్ళలో ఉత్సుకత, ఉద్వేగం కట్టలు తెంచుకున్నాయి. ఆ క్షణంలో తాము నిలబడి ఉన్నచోటే లయర్టిస్ ఎదుర్కొన్న దుర్భరమైన కష్టాల గురించీ, చనిపోయాడనుకున్న కొడుకు ఇరవయ్యేళ్ళ తర్వాత తిరిగి వచ్చినప్పుడు అతను పట్టలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవడం గురించీ విని అందరూ కన్నీటి ప్రవాహంలో మునిగిపోయారు. నా వల్లింపు పూర్తి కాగానే ఆడ, మగ, పిల్లలతో సహా అంతా నా దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకున్నారు. “మాకు ఎంత సంతోషం కలిగించావో చెప్పలేం. వెయ్యి సార్లు నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం” అన్నారు. నన్ను తమ భుజాల మీద మోసుకుంటూ ఊళ్ళోకి తీసుకెళ్లారు.

అక్కడి తవ్వకాల్లో ఇంకేవీ దొరక్కపోవడంతో ఓడమీద కోరింత్ కు బయలుదేరి వెళ్ళాడు. అదో అధ్వాన్న ప్రదేశం. హోటళ్లు లేవు. మరోసారి ఓ చీకటి గుయ్యారం లాంటి సత్రంలో నల్లుల మధ్య గడిపాడు. పొద్దుటే లేచి సముద్రానికి వెళ్ళి ఓ అరగంటసేపు ఈత కొట్టాడు. ఆ తర్వాత ఓ మార్గదర్శిని, తనకు రక్షణగా ఇద్దరు సైనికులను నియమించుకున్నాడు. ఒక గాడిదను సంపాదించుకున్నాడు. అక్కడినుంచి దక్షిణంగా బయలుదేరి, చర్వాటి అనే గ్రామంలో మార్గదర్శినీ, సైనికులనూ ఉంచేసి తను మైసీనియాకు వెళ్ళాడు. అక్కడి సింహద్వారం(Lion Gate)తప్ప ఇంకేవీ అతన్ని అంతగా ఆకట్టుకోలేదు. మధ్యాహ్నానికి తిరిగి చర్వాటి వచ్చేసరికి మార్గదర్శి, సైనికులు నిద్రపోతున్నారు. వాళ్ళ ముఖం మీద నీళ్ళు చిలకరించి లేపాడు. వెంటనే బయలుదేరి ఆర్గోస్ కు వెడదామన్నాడు. సాయంత్రానికల్లా ఆర్గోస్ చేరుకోవడం అసాధ్యమని వాళ్ళు అన్నారు. ఈ ఊళ్ళో నిమిషం కూడా ఉండలేననీ, ఇంత దరిద్రంగా, మురికిగా ఉన్న ఊరు గ్రీస్ లోనే ఎక్కడా చూడలేదనీ, మంచి ఆహారం కాదు సరికదా స్వచ్ఛమైన నీళ్ళు కూడా లేవనీ అంటూ వాళ్ళకు నచ్చజెప్పి, సైనికులకు చిన్న చిన్న కానుకలు ఎరేసి ఆర్గోస్ కు బయలుదేరదీశాడు. దూర ప్రయాణం, దానికితోడు ఎండ… ఆర్గోస్ చేరేసరికి బాగా అలసిపోయాడు.  ప్రాచీన గ్రీస్ లో ఆర్గోస్ గొప్ప నగరమనీ, ఈ నగరవాసులు లలితకళలకు, ముఖ్యంగా సంగీతానికి ప్రసిద్ధులనీ రాసుకున్నాడు. అక్కడ దొరికే ‘మంచి నాణ్యమైన, మధురమైన మద్యా’ల గురించి రాస్తున్నప్పుడు మరింత మైమరచిపోయాడు.

మరునాడు మధ్యాహ్నం టిరిన్స్ కు బయలుదేరాడు. బ్రహ్మాండమైన గోడలతో అదో పెద్ద కోట. అయితే అదేమంత గొప్పగా అతన్ని ఆకట్టుకోలేదు. టిరిన్స్ గురించి రాసిన రెండు పేజీలను భాషాశాస్త్రసంబంధమైన ప్రశ్నలతో నింపేశాడు. శిథిలాలతోనూ, వెంట ఉన్న సిబ్బందితోనూ విసిగిపోయినట్టున్నాడు; దగ్గరలోని నాప్లియా అనే పట్టణానికి ఒంటరిగా నడిచివెళ్ళాడు. మరోసారి సముద్రతీరానికి చేరుకున్నందుకు సంతోషించాడు. అక్కడి వాతావరణం కూడా చల్లగా హాయిగా అనిపించి ఉల్లాసం నింపింది. జీను లేకుండా గాడిద మీద తిరిగే బాధ తప్పింది. మంచి హోటల్, రుచికరమైన తిండి దొరికాయి. దాంతో అంతవరకూ ఉన్న ప్రయాణం బడలిక తీరేలా కొన్ని రోజులు విశ్రాంతిగా గడిపాడు. ఆ తర్వాత హైడ్రా దీవికి వెళ్లాలనుకున్నాడు.

ఓడకోసం ఎదురుచూస్తూ, ఓ రోజు మధ్యాహ్నం కొన్ని పుస్తకాలు చేతిలో పట్టుకుని ప్రధాన రహదారి మీద నడిచి వెడుతున్నాడు. కాళ్ళకు సంకెళ్ళు ఉన్న అయిదుగురు ఖైదీలు దుమ్ము కొట్టుకున్న ఆ రోడ్డు మీద వెడుతూ కనిపించారు. స్లీమన్ చేతిలో ఉన్న పుస్తకాలను చూసి ఓ ఖైదీ అతన్ని సమీపించి, ఓ పుస్తకం కానీ, వార్తాపత్రిక కానీ ఇవ్వగలరా అని అడిగాడు. అతను చక్కని రూపురేఖలతో, భారీగా, హుందాగా, ఒక రైతులా కనిపించాడు. స్లీమన్ వెంటనే ఓ పుస్తకం ఇచ్చాడు. అతను ధన్యవాదాలు చెప్పి, ఆ పుస్తకాన్ని తలకిందులుగా పట్టుకుని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. విస్తుపోయిన స్లీమన్, “చదవగలవా?” అని అడిగాడు. “ఒక్క ముక్క కూడా చదవలేను. కానీ త్వరలోనే నేర్చుకోవాలని ఉం” దని అతను సమాధానం చెప్పాడు. అంతలో మిగిలిన ఖైదీలు కూడా వారిని సమీపించారు. మీకు  సంకెళ్ళు ఎందుకు వేశారని స్లీమన్ అడిగాడు. మేము కొండ ప్రాంతానికి చెందిన రైతులమనీ, నిష్కారణంగా పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి హింసిస్తున్నారనీ వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటల్లో ఎంతో మర్యాద ఉట్టిపడింది. చదువుమీద వారి ఆసక్తి స్లీమన్ ను ప్రత్యేకించి ఆకట్టుకుంది. ఆ అయిదుగురూ ఓ హత్యానేరాన్ని ఎదుర్కొంటున్నారనీ, త్వరలోనే వారికి మరణశిక్ష అమలుచేయబోతున్నారనీ ఆ తర్వాత తెలిసింది.

అక్కడినుంచి ఓడలో బయలుదేరి ఎథెన్స్ కు చేరుకున్నాడు. తనకు సెయింట్ పీటర్స్ బర్గ్ లో గ్రీకు బోధించిన థియోక్లిటస్ విమ్పోస్ ఇప్పుడు మాంటినీయాలో బిషప్ గా, ఎథెన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఇక్కడే ఉంటున్నాడు. ప్రాణం లేచొచ్చిన స్లీమన్ అతనితో స్నేహయాత్రను పునః ప్రారంభించాడు. ఇద్దరూ విడదీయలేని జంటలా కొన్ని రోజులపాటు తిరిగారు. ఆగస్టులో కాన్ స్టాంటినోపిల్ మీదుగా ట్రాయ్ కి దారితీశాడు. కాన్ స్టాంటినోపిల్ లోని రష్యన్ కాన్సూల్ అతనికి ఒక మార్గదర్శిని, రెండు గుర్రాలను సమకూర్చాడు.

sliiman

ఏవో స్వప్నలోకాల్లో విహరిస్తున్నట్టుగా ట్రాయ్ మైదానంలో తిరిగాడు. అది ఎత్తుపల్లాలు, మలుపులతో ఉన్న మెత్తని నేల. అక్కడక్కడ సింధూరం, సూచీపత్రం చెట్ల తోపులున్నాయి. నీళ్ళు తియ్యగా ఉన్నాయి. గాలి మద్యంలా మత్తెక్కిస్తోంది. అక్కడి బునర్ బషీ అనే ప్రాంతమే ఒకప్పటి ట్రాయ్ అని చాలాకాలంగా భావిస్తూవచ్చారు. కిక్కిరిసినట్టు ఉన్న చిన్న చిన్న ఇళ్లతో ఆ ప్రాంతం ఇప్పుడు పేదరికం ఓడుతూ కళావిహీనంగా ఉంది. అక్కడ టర్కులు, అల్బేనియన్ గ్రీకులు ఎక్కువమంది నివసిస్తున్నారు. దోమల వల్ల ఇళ్ల గోడల నిండా నల్లటి మచ్చలు పడ్డాయి. ఓ ఇంటి వాళ్ళు ఓ పాత్రతో స్లీమన్ కు పాలు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ పాత్రను చూడగానే అతనికి కడుపులో తిప్పినట్టు అయింది. దానిని శుభ్రం చేసి కనీసం పదేళ్ళు అయుంటుందనుకున్నాడు. ఆ అపరిశుభ్రత, అనాగరిక జీవన శైలీ; మార్గదర్శుల అజ్ఞానం అతన్ని బెంబేలెత్తించాయి. అయితే, ఇళ్ల కప్పుల మీద రెక్కలార్చుతూ తిరుగుతున్న గూడకొంగల్ని చూసి సంతోషించాడు. తను బాల్యాన్ని గడిపిన అంకెర్షాగన్ ను ఆ పరిసరాలు గుర్తుచేశాయి. “గూడకొంగల వల్ల ఎన్నో ఉపయోగాలు. అవి పాములను, కప్పలను తింటాయి” అని రాసుకున్నాడు.

ట్రాయ్ తెల్లగా మెరిసిపోయే పాలరాతి నిర్మాణాలతో, హుందాగా, ఠీవిగా, అజరామరంగా ఉంటుందని అతను ఊహించుకున్నాడు. కానీ బునర్ బషీని చూడగానే నీరుగారిపోయాడు. ప్రతిచోటా మురికీ, చెత్తకుప్పలూ. చుట్టుపక్కల ఉన్న చిత్తడినేలలనుంచి ఒకవిధమైన దుర్గంధం వీస్తోంది. అక్కడికి సముద్రం పదిమైళ్ళ దూరంలో ఉంది. అఖియన్లు రోజూ ఏడెనిమిదిసార్లు ట్రాయ్ నుంచి సముద్రతీరానికి వెళ్లివచ్చేవారని హోమర్ రాసిన సంగతి గుర్తొచ్చింది. దాంతో బునర్ బషీయే ట్రాయ్ కాకపోవచ్చనీ, ఆ లోయకు పశ్చిమం కొసన ఉన్న హిస్సాలిక్ కొండే కచ్చితంగా ట్రాయ్ అయుంటుందనీ అనుకున్నాడు. Dissertation on the Topography of Troy(1822) రాసిన ఆంగ్లపండితుడు చార్లెస్ మెక్లారెన్ కూడా అలాగే భావించాడు.

దర్దనెల్స్(టర్కీలో ఒక నగరం)లో అమెరికా వైస్-కాన్సూల్ గా పనిచేసిన మరో ఆంగ్లేయుడు ఫ్రాంక్ కల్వర్ట్ అభిప్రాయం కూడా అదే. హిస్సాలిక్ కొండలో సగభాగం అతని ఆస్తి. ఆస్ట్రియా కాన్సూల్ వాన్ హాన్ తో కలసి కల్వర్ట్ ఆ ప్రదేశంలో ప్రాథమికమైన తవ్వకాలు చేపట్టి, రెండు కందకాలు తవ్వించాడు. ఆ కొండకు తూర్పు వాలున, పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన ఓ ప్రాసాదం లేదా దేవాలయం తాలూకు అవశేషాలు బయటపడ్డాయి. ట్రాయ్ ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టానన్న నిర్ధారణకు వచ్చి, తన పరిశోధన ఫలితాల గురించి ఆర్కియలాజికల్ జర్నల్ కు రాశాడు. ట్రాయ్ ని కనిపెట్టిన గౌరవం బ్రిటిష్ కు దక్కాలనే ఆకాంక్షతో ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున తవ్వకాలను చేపట్టవలసిందిగా బ్రిటిష్ మ్యూజియంను కోరాడు. కానీ ఆ వైపునుంచి స్పందన లేదు. ఇక, కల్వర్ట్ తమ్ముడు ఫ్రెడరిక్ కూడా బునర్ బషీకి దగ్గరలో అయిదువేల ఎకరాల ఎస్టేట్ కు యజమాని. తన ద్రాక్షతోటలకు సమీపంలో ఉన్న ప్రదేశమే ట్రాయ్ అని అతనూ అంతే గట్టిగా నమ్మాడు.

స్లీమన్ చేసిందల్లా కల్వర్ట్ అడుగుజాడల్లో వెళ్లడమే. హిస్సాలిక్ కొండ మీద దృష్టి పెట్టాడో లేదో; మబ్బులన్నీ ఇట్టే విడిపోయి, అంతా తేటతెల్లంగా ఉన్నట్టు అతనికి అనిపించింది. ఆ కొండకు వెళ్ళే దారులు, దాని ఆకారం, పరిమాణం, చివరికి ఫ్రాంక్ కల్వర్ట్ తవ్వించిన కందకాల దగ్గర కనిపించిన ఆధారాలతో సహా అన్నీ ట్రాయ్ ఇదేనని నిరూపిస్తున్నాయనుకున్నాడు. ఆ కొండ పై భాగంలో తవ్వితే ప్రియామ్(ట్రోజన్ యుద్ధసమయంలో ట్రాయ్ ను పరిపాలించే రాజు) ప్రాసాదం తాలూకు శిథిలాలు బయటపడచ్చని అనుకున్నాడు. అతని ఊహ ప్రకారం ఆ కొండమీదే కోట ఉండేది. ఆ కొండను చుట్టుకుని, కోటకు దిగువున ఎథెన్స్ నగరం విస్తరించి ఉండేది. కొండ చుట్టూ భూమిలో ఎన్నో శిథిలాలు సమాధై ఉండచ్చనీ, ఆ కొండ మీదే అనేక పాలరాతి భవనాలు, నిధినిక్షేపాలు, గ్రీకు హీరోల సమాధులు ఉండి ఉండచ్చనీ భావించాడు. రెండు వారాలు కూడా తిరక్కుండానే హడావుడిగా ఆగస్టు 21న కాన్ స్టాంట్ నోపిల్ కు తిరిగి వెళ్ళి, ఫ్రాంక్ కల్వర్ట్ ను కలసుకుని తన సూత్రీకరణలపై చర్చలు జరిపాడు.

లేడికి లేచిందే పరుగులా తక్షణమే రంగంలోకి దిగిపోవాలన్న స్లీమన్ అత్యుత్సాహం; భారీ ప్రణాళికలతో, హఠాత్ నిర్ణయాలతో హిస్సాలిక్ కొండ మీద అతను అక్షరాలా మెరుపుదాడికి సిద్ధమైనట్టు కనిపించడం కల్వర్ట్ కు వింత గొలిపాయి. ఆయన నిదానస్తుడు, ఆచి తూచి నిర్ణయాలు తీసుకునే మనిషి. ఇది తవ్వకాలకు అనువైన సమయం కాదనీ, వచ్చే వసంతం దాకా ఆగడం మంచిదనీ సలహా ఇచ్చాడు. ఈలోపల జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలనీ, ముఖ్యంగా టర్కీ ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాలనీ చెప్పాడు. హిస్సాలిక్ కొండలో సగభాగానికి తనే యజమాని అయినప్పటికీ, అడ్డురాబోనని హామీ ఇచ్చాడు. కల్వర్ట్ ఔదార్యం, మంచితనం స్లీమన్ ను విచలితుణ్ణి చేసి ఆయనపై గౌరవాన్ని పెంచాయి. ఇంకొకరైతే ఇదే అవకాశం అనుకుని తనతో బేరసారాలకు దిగి ఉండేవారని అనుకున్నాడు.

కల్వర్ట్ సలహా పాటిస్తూ తన ఉత్సాహానికి కళ్ళెం వేయక తప్పలేదు. అందుకు ఇంకో కారణం కూడా ఉంది. అది, ఎకతెరీనాతో విడాకుల వ్యవహారం. వచ్చే వసంతం నాటికే అది సానుకూలమయ్యేలా చూస్తామని ఇండియానాపొలిస్ లోని మిత్రులు అతనికి మాట ఇచ్చారు. ఆ ప్రకారం వసంతం నాటికి అమెరికా వెళ్ళి ఆ పని పూర్తి చేయాలనీ, ఆ వెంటనే ట్రాయ్ కి తిరిగి రావాలనీ, ఈ లోపల పారిస్ వెళ్ళిపోయి శీతాకాలం అంతా అక్కడే గడుపుతూ గ్రీస్ లో తన ఆరువారాల పర్యటన విశేషాలతో పుస్తకం రాయాలనీ నిర్ణయించుకున్నాడు.

అనుకున్నట్టే, Ithaka, der Peloponnes und Troja అనే పేరుతో ఆ పుస్తకం పూర్తి చేశాడు. పురాతత్వ పరిశోధకుడిగా, భాషాశాస్త్రవేత్తగా, పురావస్తు తవ్వకాల నిపుణుడిగా, చరిత్రకారుడిగా, వ్యాపారవేత్తగా, ఉత్సుకత ఉరకలేసే బాలుడిగా తన అవతారాలన్నింటినీ అందులో గుప్పించేశాడు. అక్కడక్కడ మెరుపులున్నా, మొత్తం మీద ఆ పుస్తకం ఓ పరిశోధక విద్యార్థి రాసిన పత్రంలా చప్ప చప్పగా తయారైంది. దేవుడతనికి మంచి ఐశ్వర్యం, గొప్ప స్ఫురణ, బహుభాషా పాండిత్యం ఇచ్చాడు కానీ; దురదృష్టవశాత్తూ చక్కని శైలిని ఇవ్వలేదు. చాలాచోట్ల అతని రాత డబ్బు లావాదేవీల నమోదులా ఉంటుంది. దానికితోడు, అతని ఆలోచనల్లో స్పష్టత లోపించింది. నోయ్ స్ట్రీలిజ్ లో చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్ అతని శ్రద్ధాసక్తులను మెచ్చుకుంటూనే ఈ లోపాన్ని ఎత్తి చూపించాడు కూడా. ఆపైన తన పుస్తకంలో అసలు విషయం నుంచి పక్కకు వెళ్ళి భాషాశాస్త్ర సంబంధమైన చర్చలను అదే పనిగా సాగదీశాడు.  మధ్య మధ్య విశాలమైన అతని మెదడు లోతుల్లోంచి కొంత సరుకు ఉన్న ఆలోచనల బుడగలూ పైకి తేలాయి.

అతనిలో ఒకవైపు కీర్తి దాహం, ధనదాహం, అహం, అతిశయం, దాదాపు పరిచితులందరి పట్లా తృణీకారభావం; మరోవైపు అతి సామాన్యులతో కూడా కలసిపోయే తత్వం, వారిపై సానుభూతి, మెచ్చుకోలు వంటి మానవీయస్పందనలు! తనలోని ఇలాంటి వైరుధ్యాలను దాచుకోడానికి అతను ఏనాడూ ప్రయత్నించలేదు. ఈ పుస్తకమూ వాటికి అద్దం పట్టింది. తన జ్ఞానాన్ని అంతటినీ అందులో ఆడంబరంగా ప్రదర్శించాడు. తన వాదాన్ని వ్యతిరేకించే ఉటంకింపులను పూర్తిగా పక్కన పెట్టేసి, సమర్ధించే ఉటంకింపులను వరసపెట్టి ఇచ్చుకుంటూ పోయాడు. భాషాశాస్త్ర పరమైన ప్రతి జటిలమైన అంశాన్నీ తనదైన పద్ధతిలో చీల్చి చెండాడేశాడు. హోమర్ ను స్ట్రాబో(క్రీ.పూ. 64-క్రీ.శ. 24: గ్రీకు భౌగోళికశాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, చరిత్రకారుడు)వ్యతిరేకించిన ఘట్టాలలో హోమర్ ను కాపాడే బాధ్యతను తన భుజస్కంధాలపైకి తీసుకుని స్ట్రాబోను దుమ్మెత్తిపోశాడు. ఆయా ప్రదేశాలగురించి తన ఆరాధ్యకవి అందించిన సమాచారంలో ఏ ఒక్కరు ఏ చిన్న లోపాన్ని ఎత్తి చూపినా వాళ్లమీద విపరీతమైన అసహనాన్ని కుమ్మరించాడు. ఒక మతఛాందసుడి తరహాలో అతను హోమర్ ను సాక్షాత్తు దేవుడిగా ఆకాశానికి ఎత్తడం, ప్రతిపక్షవాదాలను గుడ్డిగా నరికి పోగులు పెట్టడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

ఇంగ్లీష్ లో హడావుడిగా రాసిన ఈ పుస్తకాన్ని జర్మన్ లోకి అనువాదం చేసి లీప్జిగ్ పబ్లిషర్ కు పంపించాడు. ఆ సంస్థ అతని ఖర్చుతోనే 750 కాపీలు ప్రచురించింది. ఒక రచయితగా తన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, ఆ పాత్రను ఎంత గాఢంగా తీసుకున్నాడో పదమూడేళ్ళ కొడుకు సెర్గీకి రాసిన ఈ ఉత్తరం వెల్లడిస్తుంది:

నా పురావస్తుపరిశోధనను పుస్తకరూపంలోకి తేవడంలో పగలూ, రాత్రీ శ్రమిస్తున్నాను. ఈ పుస్తకం రచయితగా నాకు పేరు తెస్తుందని ఆశపడుతున్నాను. నేను జియోగ్రాఫిక్ అండ్ ఆర్కియలాజికల్ సొసైటీలో సభ్యుణ్ణి. నా పుస్తకంలోని ముప్పై పేజీలను మిగతా సభ్యులకు చదివి వినిపించాను. నా పరిశోధనాంశాలపై వాళ్ళు ఎంతో ఉత్సుకతను చూపించారని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

ఈ పుస్తకం పాఠకాదరణ పొందితే నా శేషజీవితం అంతా పుస్తకాలు రాస్తూనే గడపాలని నిర్ణయించుకున్నాను. మంచి పుస్తకాలు రాయడం కన్నా ఆసక్తికరమైన వ్యాసంగం ఇంకొకటి లేదని నేను నమ్ముతున్నాను. ఒక రచన చేసేటప్పుడు రచయిత ఎంతో సంతోషాన్నీ, సంతృప్తినీ, శాంతినీ పొందుతాడు. ఆ మనస్థితిలోంచి సమాజంలోకి వచ్చిన తర్వాత తన పరిశోధనా ఫలాల గురించీ, తన తపస్సు గురించీ వేలాది విషయాలు ఇతరులకు బోధించగలుగుతాడు. ప్రతి ఒకరూ రచయితల మార్గదర్శనాన్ని కోరుకుంటారు, వాళ్ళను నెత్తిన పెట్టుకుంటారు. ఈ వ్యాసంగంలో నేనింకా అభ్యాసదశలోనే ఉన్నాను కానీ, పదింతల మంది మిత్రుల్ని మాత్రం సంపాదించుకోగలిగాను…

నిజానికి అతనికి సన్నిహిత మిత్రులంటూ ఎవరూ దాదాపు లేరు. అలాంటి స్నేహంకోసం, తనను అర్ధం చేసుకునే ఒక తోడు కోసం అతను రహస్యంగా పడే తపనా, ఆర్తీ అతని ఉత్తరాలన్నింటిలో కనిపిస్తాయి. గ్రీస్ అనుభవం అతన్ని జనసామాన్యానికి ఎంతో కొంత దగ్గర చేసింది కానీ, ఇప్పటికీ తనదైన ఏకాంతదుర్గంలో తను ఉంటున్నాడు. ఎదుటి వాళ్ళ మనోభావాలపై బొత్తిగా ఖాతరు లేకపోవడం, అదిలించి బెదిరించి పని చేయించుకోవడం, ముక్కోపం, ఎదుటివాళ్లకు ఎంతో హాస్యాస్పదమనిపించేలా తన గురించి తను గొప్పగా ఊహించుకోవడం…అన్నీ మామూలే.

అదలా ఉండగా, తన పేరుకు ముందు ‘డాక్టర్’ అని ఉండాలని అతని చిరకాలవాంఛ. ఒక విశ్వవిద్యాలయంనుంచి డాక్టరేట్ తెచ్చుకున్నాడు కూడా.

(సశేషం)

 

 

 

 

తొలి తవ్వకాలలో చితాభస్మం దొరికింది!

స్లీమన్ కథ-13

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

క్రిస్టమస్ రోజును పిల్లలతో గడపే అవకాశం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఉండేవాణ్ణని వాషింగ్టన్ లో ఉన్నప్పుడు అనుకున్నాడు. తనను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పిన సోఫీ ప్రాణాలు కాపాడడానికి, ఆకాశమే హద్దుగా ఏమైనా చేసి ఉండేవాడినని ఇప్పుడు అనుకుంటున్నాడు. హాంబర్గ్, బెర్లిన్ లలో ఉన్న పేరుమోసిన డాక్టర్ల నందరినీ ఆమె మంచం దగ్గరికే రప్పించి ఉండేవాడు. తను స్వయంగా ఆమెకు అహర్నిశలూ పరిచర్యలు చేసి ఉండేవాడు. ఆమె పట్ల తన ఆర్తీ, అంకితభావమూ బహుశా ఆమె ప్రాణాలను కాపాడి ఉండేవి. ఎంతో నైర్మల్యం, నిష్కల్మష హృదయం కలిగిన ఈ దేవతపై తన ప్రేమలో ఎలాంటి స్వార్థమూ, లైంగికవాంఛా లేవనీ; అది పూర్తిగా అమలిన ప్రేమ అనీ మనసుకు చెప్పుకున్నాడు.

ఆమె శవపేటిక ఫోటో పంపమని ఉత్తరం రాశాడు. ఆమెతో కలసి ప్రపంచాన్ని పది సార్లైనా చుట్టిరావడానికి తన ఆస్తి నంతటినీ కరిగించి ఉండేవాణ్ణని తోబుట్టువులకు రాశాడు. తను అమెరికా వెళ్లబోయేముందు సోఫీ తన తలవెంట్రుకనొకదానిని తనకు పంపితే దానిని నిర్లక్ష్యంగా ఓ పెట్టెలో పడేసిన సంగతిని గుర్తు చేసుకుని తన కృతజ్ఞతారాహిత్యానికి కుమిలిపోయాడు. ఆ తలవెంట్రుకను తన జీవితం మొత్తంలోనే ఒక పవిత్రనిధిగా భావిస్తాననీ, దానిని వజ్రాలు పొదిగిన బంగారు తొడుగులో ఉంచి జీవితాంతం గుండెలకు హత్తుకుంటాననీ అనుకున్నాడు.

సోఫీని అతను ప్రేమించింది స్వల్పకాలమే. ఆ తర్వాత తన మనసులోంచి ఆమెను తుడిచేసుకున్నాడు. అతని హృదయానికి దగ్గరైన అతి కొద్దిమందిలో ఆమె ఒకతె. మిన్నా మెయింక్, సోఫీ స్లీమన్…ఈ ఇద్దరే తనను నిస్వార్థంగా ప్రేమించారనుకున్నాడు. తన జీవనగమనంలోని అనేక ఘట్టాలలో సోఫీని ఎంతో ఇష్టంగా గుర్తుచేసుకున్నాడు. ఎకతెరీనాతో పెళ్ళికి ముందు తోబుట్టువులకు ఉత్తరం రాస్తూ ఆమె గురించి వాకబు చేశాడు. ఆమెను పెళ్లాడడం గురించి ఆలోచిస్తున్నట్టు అందులో సూచించాడు. అది, పదిహేనేళ్ళ క్రితం. అయితే, ఆమెపై ఒక స్పష్టమైన అభిప్రాయం ఏదీ అతనికి లేదు. ఇప్పుడామె హఠాత్తుగా కన్ను మూసింది. అంతే హఠాత్తుగా సమాధిలోంచి లేచి వచ్చి అతన్ని వెంటాడుతోంది.

మతం మీద, పరలోకం మీద అతనికి పెద్ద నమ్మకం లేదు. మానవప్రయత్నాన్నే నమ్మాడు. మనిషే అన్నిటికీ కొలమానం అనుకున్నాడు. తగిన పరిశ్రమా, నైపుణ్యాలే పెట్టుబడిగా సంపద గడించి ఈ భూమ్మీద లభించే సకల సౌఖ్యాలను అనుభవించే హక్కు ప్రతివారికీ ఉందని అనుకునేవాడు. కానీ ఇప్పుడా తాత్వికత పునాదులు కదిలిపోతున్నట్టు అనిపిస్తోంది. సోఫీ మరణంపై అతని దుఃఖవివశత్వంలో అతిశయం, స్వానుభూతి ఉన్న మాట నిజమే. వాటితోపాటు, ఆ వెంటనే జర్మనీకి వరసపెట్టి రాసిన ఉత్తరాల్లో అతనప్పుడన్న నైరాశ్యస్థితీ ఉట్టిపడుతోంది. సోఫీ తన జీవితం చివరి ఆరునెలలలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించిందని తెలిశాక అతనిలోని దుఃఖం, అపరాధభావం మరింతగా కట్టలు తెంచుకున్నాయి. తన సంపదలో లక్షో వంతు ధారపోసినా ఆమె సుఖంగా జీవించి ఉండేదన్న ఊహ ఛెళ్ళున చరచినట్టై తన పట్ల తనకే ఏవగింపు కలిగి, సిగ్గుతో చితికిపోయాడు. ఒక్కసారిగా ఆత్మపరిశీలనలో కూరుకుపోయాడు. అసలు తనెందుకు జీవిస్తున్నాడు, ఇన్ని ఆస్తిపాస్తులుండి కూడా తనకు సంతోషం ఎందుకు కరవైపోయింది; ఇంటికీ, ఇల్లాలికీ, పిల్లలకీ, వెచ్చని ఆత్మీయస్పర్శకూ దూరంగా, ఓ బిచ్చగాడిలా దేశదిమ్మరి జీవితం ఎందుకు గడుపుతున్నాడన్న ప్రశ్నలతన్ని ముంచెత్తాయి. ఎక్కడో భగవంతుడున్నాడు, ప్రపంచంలో ఏమూలో ఇంత శాంతి దొరుకుతుందనుకున్నాడు.

అలా కలగుండు పడుతున్న సమయంలోనే, తన బాల్యాన్ని మంత్రముగ్ధం చేసిన హోమర్ అతనికి హఠాత్తుగా గుర్తుకొచ్చాడు. ట్రాయ్ కథను పొందుపరిచిన ఇలియడ్ కర్తగా కాదు; ఒడిస్సే కర్తగా! అందులోని నాయకుడు ఒడీసియస్ కూడా తనలానే  దేశదిమ్మరి. తిరిగి తిరిగి చివరికి స్వస్థలమైన ఇథకా చేరుకుంటాడు. అయోనియన్ సముద్ర తీరంలో ఎత్తైన కొండమీద ఉన్న తన కోటకు వెళ్ళి భార్య పెనొలోపిని కలసుకుంటాడు. తను కూడా వెంటనే బయలుదేరి ఇథకాకు వెళ్ళాలి! అక్కడి ఒడీసియస్ కోటను అధిరోహించాలి. ఏమో ఎవరు చెప్పగలరు…ఏదో అద్భుతం జరిగి తను వెతికే తన పెనొలోపి అక్కడ కనిపించినా కనిపించవచ్చు. తన దేశదిమ్మరి జీవితానికి అంతటితో తెర పడినా పడచ్చు.

***

స్లీమన్ ఏ విషయంలో నైనా సత్వర నిర్ణయాలు తీసుకునే మనిషిగా పైకి కనిపిస్తాడు. కానీ అది కొంతవరకే నిజం. డబ్బుకు సంబంధించిన విషయాల్లోనూ, ఎంతో జటిలమైన వ్యాపార లావాదేవీల్లోనూ అతని బుర్ర పాదరసంలా పనిచేసి, అప్పటికప్పుడు తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటాడు. వ్యాపారపు లెక్కలు కట్టడంలోనూ అంటే చురుగ్గా పనిచేస్తాడు. కానీ ఇతర విషయాల్లో, ముఖ్యంగా వ్యక్తిగత విషయాల్లో చాలా మందకొడిగానూ, అనిశ్చితంగానూ వ్యవహరిస్తాడు. తన బలహీనతలు, లోపాలు ఆ సమయంలో జుట్టు విరబోసుకుని అతని ముందు ప్రత్యక్షమవుతాయి. ఇంతవరకూ సాగిన అతని జీవిత క్రమాన్ని చూస్తే, అది తిరిగిన ప్రతి ముఖ్యమైన మలుపు వెనకా ఒక విచిత్రమైన పోలిక కనిపిస్తుంది. తన చేతిలో లేని ఏ అదృశ్యశక్తులో ప్రతిసారీ అతన్ని ఆ మలుపు వైపు నెట్టాయి.

ఇప్పుడు కూడా అతనికి హఠాత్తుగా హోమర్ గుర్తొచ్చి ఆయన ఇతిహాసాలకు రంగస్థలమైన గ్రీస్ కు బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకోడానికి, చరిత్ర మీద మొదటినుంచీ తనకున్న ఆసక్తి ఒక్కటే కారణం కాదు. పురాతత్వశాస్త్రంలో తనకు గొప్ప పరిజ్ఞానం, ప్రావీణ్యం ఉన్నాయనీ కాదు. చనిపోయి దయ్యంలా వెంటాడుతున్న సోఫీ, భార్య తిరస్కృతీ, ఒంటరితనం అతన్ని అటువైపు బలవంతంగా తోశాయి. సోఫీ మరణం కలిగించిన దుఃఖం అతనిలో అంతర్మథనాన్ని రేపి తనకంటే అన్నివిధాలా శక్తిమంతమైన భగవంతుని ఉనికి గురించి ఆలోచింపజేసింది. ఆ దివ్యశక్తికి దాసోహమై తన జీవితాన్ని దాని చేతుల్లో పెట్టడం తప్ప మరో మార్గం లేదనిపించింది. తన జీవితశోధన; ఎంతో ఉత్సాహం, ఉత్సుకత నిండిన బాల్యంవైపు, బాల్యంలో తనను సూదంటురాయిలా ఆకర్షించిన హోమర్ వైపు అతన్ని నడిపించింది. ఈ సంక్షోభ క్షణాలలో హోమర్ అతనికి గుర్తొచ్చింది ఒక కవిగానో, తన భాషాశాస్త్ర అధ్యయనానికి ప్రేరణ అయిన ఒక సంక్లిష్ట భాషలో సిద్ధహస్తుడిగానో, అటిక్ నాటకకర్తలకు పితామహుడిగానో కాదు…మనిషి శిరసెత్తుకుని జీవించగలిగిన ఒక అద్భుత సమ్మోహకర సత్య ప్రపంచాన్ని సృష్టించిన దేవుడిగా!

1868 వేసవిలో అతను గ్రీసుకు బయలుదేరాడు. అప్పటికే తనో పురాతత్వశాస్త్ర కావాలని నిర్ణయించుకున్నాడు. ఇథకా వెళ్ళి అక్కడ ఐటియొస్ కొండ మీద ఒడీసీయస్ కోటను తవ్వి తీయాలని సంకల్పించుకున్నాడు. ఒడీసియస్ తన సుదీర్హయాత్రను ముగించుకున్నాక చింకిపాతలతో ఒక బిచ్చగాడి వేషంలో ఆ కోటలోకే ప్రవేశించాడు.

స్లీమన్ ముందుగా రోమ్ కు, నేపుల్స్ కు వెళ్ళి అక్కడినుంచి ఓడలో కోర్ఫుకు దారితీశాడు. అక్కడ ఒకరోజు మాత్రమే ఉన్నాడు. కోర్ఫు పురాతన నామం కొర్సైరా. హోమర్ పేర్కొన్న స్చేరియా దీవి బహుశా అదే నని ఊహ. అది ఫెయేషియన్ల నివాసప్రదేశం. ఫెయేషియన్ల రాజు అల్సినొవస్ కు అక్కడ అద్భుతమైన సౌధం ఉంది. ఒడీసియస్ సముద్రతీరానికి నగ్నంగా కొట్టుకు వచ్చినప్పుడు అల్సినొవస్ కూతురు నౌసికాయే అతనికి ఎదురై దుస్తులిచ్చి చక్కటి రథం మీద రాజసౌధానికి తీసుకెళ్లింది. ఆ సౌధం ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తాయేమోనని స్లీమన్ వెతికాడు కానీ కనిపించలేదు. దగ్గరలో ఉన్న ఒక ప్రవాహాన్ని చూసి, నౌసికా తన దుస్తులు ఉతుక్కుని చెలికత్తెలతో విహరించిన ఇతిహాసప్రసిద్ధమైన ప్రవాహం అదే కావచ్చనుకున్నాడు. అందులో నగ్నంగా ఈతకొట్టాడు. ఆ తర్వాత, అక్కడే ఉన్న పొదలను చూశాడు. నౌసికాను, ఆమె చెలికత్తెలను చూడగానే ఒడీసియస్ దాక్కొన్న పొదలు అవే అయుంటాయనుకుని వాటి వెనక నగ్నంగా నిలబడి కాసేపు తనను ఒడీసియస్ గా ఊహించుకుని సంతోషించాడు. కాకపోతే అతనికోసం ఏ కన్యలూ వచ్చి అక్కడ వాలలేదు. అతన్ని తీసుకెళ్లడానికి ఏ అద్భుతరథమూ రాలేదు!

మరునాడు ఆవిరిపడవ ఎక్కి సెఫలోనియా వెళ్ళాడు. అయోనియా దీవులలో అదే పెద్దది. దాని పురాతన రాజధానిని రోమన్లు ధ్వంసం చేశారు. అక్కడ ఆసక్తికరమైన దేదీ అతనికి కనిపించలేదు. అక్కడినుంచి  ఓ చిన్న సముద్రపు పాయను దాటి ఇథకాలో అడుగుపెట్టాడు. ఇతర దీవులను చూసినప్పుడు హోమర్ పేర్కొన్నవేనా అన్న అనుమానం కలిగింది కానీ, ఇథకాలో మాత్రం ప్రతిదీ హోమర్ ను గుర్తుచేసింది. “ప్రతి కొండ, గుట్ట, సెలయేరు, ఆలివ్ తోపు అచ్చంగా హోమర్ వర్ణించినట్టే ఉన్నాయి. ఒక్క గెంతులో వందతరాల వెనక్కి, గ్రీకు వీరుల ఉజ్వల యుగంలోకి వెళ్ళి పడ్డాను” అని రాసుకున్నాడు.

ఇథకాలో అడుగుపెట్టిన మరుక్షణం ఎవరో మంత్రించినట్టు అయిపోయాడు. దేనినీ విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క చోటుకీ వెళ్ళాడు. ప్రతిదీ కళ్ళు విప్పార్చుకుని చూశాడు. 120 డిగ్రీల ఎండ కాస్తోంది. అయినాసరే పట్టలేని సంతోషంతో పిచ్చెత్తినట్టు తిరిగాడు. హోటళ్లు లేవు. ఇద్దరు వృద్ధకన్యలు నడిపే సత్రంలో వసతి దొరికింది. ఓ మిల్లు పనివాడు పరిచయమయ్యాడు. అతని దగ్గర ఓ గాడిద ఉంది. స్లీమన్ ను ఆ దీవి అంతా తిప్పి చూపిస్తానన్నాడు. దీవి సన్నగా, ఎత్తుపల్లాలతో ఎనిమిది(8) అంకె ఆకారంలో ఉంది. హోమర్ ఇతిహాసం ప్రకారం ఒడీసియస్ కోట ఈ దీవిలోనే ఉంది.

ఆ మిల్లు పనివాడి పేరు పానగిస్ ఆస్ప్రైరికా. ఒడీసియస్ కు చెందిన కథలన్నీ అతనికి కరతలామలకం. వాటిని విరామం లేకుండా వల్లిస్తూపోయాడు. స్లీమన్ మధ్య మధ్య అతని వాక్ప్రవాహానికి అడ్డుతగిలి, “ఫోర్సిస్ ఓడరేవు అదేనా? అప్సరసల గుహలు ఎక్కడున్నాయి? లయర్టిస్(ఇతను ఒడీసియస్ తండ్రి అనీ, లేదా తండ్రి లాంటివాడనీ రెండు వాదాలు ఉన్నాయి)పొలం ఎక్కడుంది” అంటూ ప్రశ్నలు గుప్పించేవాడు. ఆ మిల్లు పనివాడు ఓ కథల పుట్ట. అవి తప్ప అతనికింకేమీ తెలియవు. స్లీమన్ కు విసుగొచ్చి, “ఇక్కడి రోడ్లు అంతూపొంతూ లేకుండా సాగుతున్నాయి. అలాగే ఇతగాడి కథలు కూడా” అని రాసుకున్నాడు. అయితే స్లీమన్ కు అతను బాగా నచ్చాడు. ఇద్దరూ జంటగా తిరిగారు. ఆ గ్రామస్తులు కూడా అతనికి నచ్చారు. అక్కడి రైతులు సీదా సాదాగానూ, స్నేహపాత్రులుగానూ, శ్రమజీవులుగానూ కనిపించారు. వాళ్ళలో సహజమైన ఉదాత్తత ఉట్టిపడుతోందనీ, వాళ్ళ కళ్ళలో నిజాయితీ ప్రతిఫలిస్తోందనీ, తమ పూర్వీకుడైన ఒడీసియస్ కు అన్నివిధాలా తగిన వారసులనీ అనుకున్నాడు. అన్నింటినీ మించి, ఒడీసియస్ నివసించిన కోటను తవ్వి తీయబోతున్నానన్న ఊహ అతనిలో అంతులేని ఆనందోత్సాహాలు నింపింది. రెండు రోజుల తర్వాత ఐటియొస్ కొండ ఎక్కాడు.

అది పెద్దగా ఖర్చులేని చిన్న ప్రారంభం. వెంట నలుగురు పనివాళ్లు, ఒక గాడిద. ఏడాది మొత్తంలోనే ఎండలు బాగా మండే కాలం కనుక, ఉదయం అయిదుకే బయలుదేరాలని ఉత్తర్వు చేశాడు. తను నాలుగుకే లేచి, సముద్రస్నానం చేసి, ఓ కప్పు బ్లాక్ కాఫీ తాగి బయలుదేరాడు. కొండ ఎక్కడానికి రెండు గంటలు పట్టింది. పైకి వెళ్ళాక పెలొపనీసెస్ పర్వతాలను ఆనుకుని ద్రాక్షమద్యం రంగులో ఉన్న సముద్రం కనిపిస్తుందనుకున్నాడు(హోమర్ తన ఇలియడ్ లో అలా వర్ణించాడు). ఆ ఎత్తునుంచి గ్రీస్ మొత్తాన్ని చూడచ్చేమో నని కూడా అనిపించింది.

మొదటిరోజు తవ్వకాల్లో చెప్పుకోదగినవేవీ దొరకలేదు. ఓ రైతు ఒక పురాతన కలశాన్ని, ఓ వెండి నాణేన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. కోరింత్ కు చెందిన ఆ నాణేనికి ఒకపక్క మినర్వా(ఒక గ్రీకు దేవత) శిరస్సు, ఇంకో పక్క ఓ గుర్రపు బొమ్మ ఉన్నాయి. మరునాడు, ఓ వలయాకారపు గోడ లోంచి మొలుచుకొచ్చిన చెట్ల కొమ్మలను పీకించి, దాని ఈశాన్యం దిక్కులో తవ్వమని పనివాళ్ళకు చెప్పాడు. సరిగ్గా అక్కడే ఒడీసియస్ తన శోభనం గదిని నిర్మించి ఉంటాడని అతనికి మెరుపులా తోచింది.

పనివాళ్లు అక్కడ తవ్వకుంటూ పోయారు. మూడు గంటల తర్వాత, 3 మీటర్ల వెడల్పు, 4.75 మీటర్ల పొడవు ఉన్న ఒక భవనం తాలూకు పునాదిరాళ్ళు బయటపడ్డాయి. ఒడీసియస్ శోభనం గదిని కనిపెట్టాననుకుని స్లీమన్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. అక్కడ, మట్టి కప్పేసిన ఒక అర్ధచంద్రాకారపు రాయి కనిపించింది. దానిని జాగ్రత్తగా పైకి తీసి, తనే చేతిగొడ్డలితో అక్కడ తవ్వడం ప్రారంభించాడు. నాలుగు అంగుళాల లోతున ఓ సున్నితమైన కలశం తగిలింది. గొడ్డలి దెబ్బకు అది ముక్క ముక్కలైపోయింది. ఆ తర్వాత మరో ఇరవై కలశాలు బయటపడ్డాయి. కొన్ని నిటారుగానూ, కొన్ని పక్కలకు ఒరిగిపోయీ ఉన్నాయి. వాటన్నింటిలో బూడిద ఉంది. అది కచ్చితంగా మనుషుల చితాభస్మమే అనుకున్నాడు. వాటి పక్కనే బలికి ఉపయోగించే ఆరంగుళాల కత్తి, పెదవులకు రెండు వేణువులను ఆనించుకుని ఉన్న అమ్మవారి మట్టిబొమ్మ, కొన్ని జంతువుల ఎముకలు కనిపించాయి. శాసనాలేవీ కనిపించలేదు.

స్లీమన్ ఉత్సాహానికి పట్టపగ్గాలు లేవు. పనివాళ్ళ వైపు తిరిగి, ఈ కలశాల్లో ఒక దాంట్లో ఒడీసియస్ చితాభస్మం ఉండి ఉంటుందన్నాడు. “క్యుమై నుంచి తెచ్చి, నేపుల్స్ మ్యూజియంలో భద్రపరచిన పురాతన కలశాల కన్నా కూడా ఇవి చాలా పురాతనమని నేను నమ్ముతున్నాను. వీటిలో ఉన్నది ఒడీసియస్, పెనొలోపిల చితాభస్మమో, వాళ్ళ వారసుల చితాభస్మమో కావడానికి ఎంతైనా అవకాశముం”దని డైరీలో రాసుకున్నాడు.

ఈ తొలి ఫలితాలు అతనిలోని పురావస్తుదాహాన్ని అమాంతం పెంచేశాయి. మొదటిసారి తనో పవిత్రస్థలిలో నిలబడి ఉన్నాననీ, ఎన్నో రహస్యాలను పొదవుకున్న పురాతనగతం ఆ భూమిలోంచి తననే తేరిపార చూస్తోందనీ అనుభూతి చెందాడు. అతనూహించినట్టు, బయటపడింది శోభనం గది కాదు; చితాభస్మం. అయినాసరే, కృతజ్ఞతాభావం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అనాయాసంగా లభించిన ఈ తొలి ఫలితాలు అతనికొక నష్టమూ కలిగించాయి. తనలో స్వభావసిద్ధంగానే ఒక గొప్ప పురాతత్వశాస్త్రవేత్త ఉన్నాడని ఇప్పుడు మరింత గట్టిగా నమ్మడం ప్రారంభించాడు. ఆ తదుపరి తవ్వకాలలో కూడా ఇదే ప్రణాళికను అనుసరిస్తూవెళ్ళాడు. ప్రతిచోటా ఓ ‘ఈశాన్యం మూల’ ఉండనే ఉంటుంది. హోమర్ పంక్తుల్ని పదే పదే నెమరువేసుకుంటూ, ఒకవిధమైన స్ఫురణతో ఒక ప్రదేశాన్ని ఎంచుకునేవాడు. ఇక్కడ నిధి నిక్షేపాలు ఉండచ్చని నిర్ణయానికి వచ్చేవాడు. అక్కడ తవ్వమని పనివాళ్ళకు చెప్పేవాడు. ఒక ప్రదేశాన్ని తను ఎందుకు ఎంచుకున్నాడో, ఎప్పుడో కానీ సహేతుకమైన వివరణ ఇచ్చేవాడు కాదు. స్ఫురణతోపాటు, తను గతంలోకి పయనిస్తున్నానన్న ఉత్సుకతా, ఉత్సాహాలే అతన్ని ముందుకు నడిపించాయి.

తొలి ఫలితాల రోజున అతను ఎంత ఉత్తేజితుడైపోయాడంటే; దహించే ఎండనూ, దప్పికనూ కూడా మరచిపోయాడు. మధ్యాహ్నం అయ్యేసరికి, పొద్దుటినుంచీ తాము ఏమీ తినలేదన్న సంగతి గుర్తొచ్చింది. పనివాళ్లను భోజనానికి పంపేసి తను ఆ కొండ కొనకు కొంచెం దగ్గరలో ఉన్న ఒక ఆలివ్ చెట్టు నీడలోకి వెళ్ళాడు. అంతలో ఒక విషయం అతనికి మెరుపులా స్ఫురించింది. ఇరవయ్యేళ్ళ తర్వాత స్వగృహానికి వచ్చిన యజమాని ఒడీసియస్ ను గుర్తుపట్టి అతని పెంపుడు కుక్క ఆర్గస్ పట్టలేని సంతోషంతో మరణిస్తుంది. అది చూసి ఒడీసియస్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సరిగ్గా తను నిలబడ్డ చోటే ఆ ఘటన జరిగి ఉంటుందని స్లీమన్ అనుకున్నాడు. ఆ ఊహతోపాటు మరికొన్ని ఊహలూ గొలుసుకట్టుగా అతని బుర్రను తాకాయి. బహుశా ఇక్కడే, లేదా ఇక్కడికి దగ్గరలోనే పందుల కాపరి యూమస్ ఈ మాటలు అనుంటాడనుకున్నాడు: ”ఒక మనిషి ఎప్పుడైతే దాస్యంలోకి జారిపోయాడో అప్పుడే సర్వసాక్షి అయిన ఆ జియస్ అతని విలువలో సగం హరించేస్తాడు.”

బ్రెడ్డుతోనూ, వైన్ తోనూ భోజనం చేశాక పనివాళ్లు కునుకుతీశారు. స్లీమన్ తవ్వకాన్ని కొనసాగించాడు. మద్యం ప్రభావం చూపించింది. ఇథకా వైను, బోర్డా వైనుకన్నా మూడురెట్లు ఘాటుగా ఉందనుకున్నాడు. ఆ రోజు తవ్వకాల్లో ఇంకేమీ దొరకలేదు. ఆ మరునాడూ అంతే…

(సశేషం)

 

 

 

ఒంటినిండా ఒంటరితనాన్ని కప్పుకుంటూ…

స్లీమన్ కథ-12

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పందొమ్మిదో శతాబ్ది, అరవయ్యవ దశకం నాటి ఫ్రాన్స్ బూర్జివాయిజీకి లొంగిపోయి ఉంది. నెపోలియన్-3 గద్దె మీద ఉన్నాడు. జబ్బు మనిషి. మాట నత్తి. ఎక్కడికెడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అతనికే తెలిసేది కాదు. ఎవరూ ఆయనను లెక్క చేసేవారు కాదు. చక్రవర్తినీ, ఆయన అందాల భార్య యుజినీని పరివేష్టించి ఉండే ఆస్థానసభ్యులు కూడా ప్రజలకుదూరంగా, ఎందుకూ పనికిరాని బాపతుగా ఉండేవారు. ఆ రోజుల్లో ఫ్రాన్స్ నిద్రమత్తులో జోగుతున్నట్టు ఉండేది. వృద్ధిలోనూ, తెలివిలోనూ యూరప్ మొత్తంలోనే మొదటివరసలో ఉన్నారనుకునే ఫ్రెంచి ప్రజలు కాస్తా అప్పటికి సెడాన్ విధ్వంసం దిశగా క్రమంగా అడుగులేస్తున్నారు.

సర్బాన్ లో చదువు ప్రారంభించిన స్లీమన్ చెరువులో చేపలా ఫ్రాన్స్ జీవనసరళిలో కలసిపోయాడు. సంపన్నుడు కనుక తను కోరుకున్న విధంగా జీవించే వెసులుబాటు అతనికుంది. ఓ ఉంపుడుగత్తె, విలాసవంతమైన రెస్టారెంట్లు, ఉన్నతవర్గాలతో సావాసం… ఏవీ అతనికి అందని పండ్లు కావు. పండితుడిగా సాటి పండితుల్లో అంతే తేలిగ్గా కలసిపోగలడు. ఆపైన; అమెరికా, క్యూబా, జర్మనీ, రష్యాలలో భారీ పెట్టుబడులు ఉన్న వర్తకప్రముఖుడిగా పారిస్ లోనూ యధేచ్ఛగా ఆస్తుల కొనుగోళ్ళు, అమ్మకాలు జరుపుకోగలడు.

బోయిస్డ్ బొలోని అనే చోట కొన్ని ఇళ్ళు కొన్నాడు. వాటికి అవసరమైన మరమ్మతులు జరిపించడం, సదుపాయాలు కల్పించి అద్దె కివ్వడం ఇప్పుడతని వ్యాపకాల్లో ఒకటి. మరమ్మతులకు, ఫర్నిచర్ కు అయ్యే ఖర్చు చూసి గుండెలు బాదుకునేవాడు. నిన్నటివరకూ ప్రతిక్షణాన్నీ నగదుగా మార్చుకుంటూ తీరిక లేకుండా గడిపిన ఈ అంతర్జాతీయ వ్యాపారవేత్త ఇప్పుడు ఇళ్ల ఏజెంట్ గా మారి గంటల తరబడి వాల్ పేపర్ చర్చలతో కాలం దొర్లించడం అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతుంది. సంసారజీవితం నింపిన చేదు, దుర్భరమైన ఒంటరితనం అతన్ని దిక్కుతోచని స్థితికి నెట్టాయి. వ్యాపారాలు కట్టిపెట్టడమే తన సమస్యలన్నింటికీ పరిష్కారమనుకున్నాడు. ఐశ్వర్యం తెచ్చిపెట్టే సుఖాలను దోసిళ్లతో జుర్రుకుంటూ ఫ్రాన్స్ లో ఉల్లాసంగా గడపచ్చనుకున్నాడు. కానీ ఆ రెండు అంచనాలూ తప్పాయి. నిస్సారంగా రోజులు గడుస్తున్నాయి.

అయితే, రోజువారీ కార్యక్రమాలను పద్ధతిగా జరుపుకునే అలవాటులో మార్పులేదు. ఇన్ని గంటలు చదువుకీ, ఇన్ని గంటలు ఇళ్ల బాడుగ వ్యవహారాలకూ, ఇన్ని గంటలు విందు వినోదాలకు కేటాయించుకుంటున్నాడు. థియేటర్లకు, గుర్రప్పందేలకూ వెడుతున్నాడు. గొప్పింటి మహిళల ఇళ్లనుంచి కూడా ఆహ్వానాలు అందుకుంటున్నాడు. తన లాంటి దేశదిమ్మరులందరికీ స్వర్గధామమైన పారిస్ లో ఎంతో కొంత ఓదార్పును పొందుతున్నాడు కానీ, మొత్తానికి అతని జీవితం చుక్కాని లేని నావ అయింది. తరచుగా సెయింట్ పీటర్స్ బర్గ్ వైపు గాలి మళ్ళుతోంది.

అన్నింటినీ మించి పిల్లల మీద బెంగపడుతున్నాడు. వాళ్ళు ఎకతెరీనా పెంపకంలో ఉన్న సంగతిని తలచుకున్నప్పుడల్లా కోపంతో రగిలిపోతున్నాడు. ఆమెకు ఉత్తరాలు రాస్తూ నయానా భయానా తనవైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నువ్వు వస్తానంటే డ్రెస్డన్ ఇంటికి మకాం మార్చేస్తాననీ, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాననీ రాశాడు. గుర్రపు బళ్ళు, గుర్రాలు, నగలు, పారిస్ లో లభించే అత్యంత ఖరీదైన దుస్తులతో సహా నువ్వు ఏది అడిగితే అది ఇస్తాననీ; నీ జీవితాన్ని నాతో పంచుకుంటే చాలనీ అన్నాడు. “నేనిప్పుడు పూర్తిగా పారిస్ వాసిని అయిపోయాను. కనుక డ్రెస్డన్ లో మనం చిలకా గోరింకల్లా సంతోషంగా గడప”చ్చని హామీ ఇచ్చాడు.

ఆమె ఎప్పుడో కానీ జవాబిచ్చేది కాదు. నీ మొహం చూడననీ, నీతో కాపురం చేయననీ, ఎట్టి పరిస్థితిలోనూ పిల్లలు నా కళ్ల ముందు ఉండాల్సిందేననీ ఓ ఉత్తరంలో ఖండితంగా చెప్పింది. దానికతను, “భార్యనుంచి కోరేది ఏదీ నీనుంచి కోరను. ఇద్దరం అన్నా, చెల్లెల్లా ఉందాం. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నువ్వు నా కళ్ల ముందు ఉంటే చాలు. ఇప్పుడు నేనున్న అపార్ట్ మెంట్ అద్దెకిచ్చేసి, బోయిస్డ్ బొలోనిలో ఓ బ్రహ్మాండమైన భవంతిని కొంటాను. 40వేల ఫ్రాంకులు ఖర్చుపెట్టి దానిని అందంగా తీర్చిదిద్దుతాను. సెయింట్ పీటర్స్ బర్గ్ లో, డ్రెస్డన్ లో నేను కొన్న భవనాలు, ఇప్పుడు పారిస్ లో కొనబోతున్నదీ-అన్నీ నీవే. నీ ఆనందం కోసమే. నువ్వు ఎప్పుడనుకుంటే అప్పుడు ఈ మూడింటి మధ్యా తిరుగుతూ ఉండచ్చు” అని రాశాడు.

ఈ ప్రలోభాలేవీ పనిచేయకపోవడంతో బెదిరింపులు అందుకున్నాడు. నీకూ, పిల్లలకూ పంపే డబ్బు ఆపేస్తానన్నాడు. “మరీ మూర్ఖంగా మతిలేకుండా ప్రవర్తిస్తూ నీకు నువ్వే చెరుపు చేసుకుంటున్నావు. నువ్విలాగే ఉంటే నా ఆస్తి లోంచి పిల్లలకు కూడా చిల్లిగవ్వ ఇవ్వను. అందువల్ల రేపు వాళ్ళు అడుక్కుతినే పరిస్థితి వస్తే అందుకు నీదే బాధ్యత. మరీ తెగే దాకా లాగుతున్నావు. నీతో పూర్తిగా విసిగిపోయాను. ఇదే చివరి ఉత్తరం. జీవితంలో మళ్ళీ నీకు ఉత్తరం రాయను” అన్నాడు.

కానీ, మళ్ళీ మళ్ళీ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. వేడికోళ్ళు, బుజ్జగింపులు, బెదిరింపులు…అన్నీ మామూలే. “నీ కోసం, పిల్లలకోసం నా జీవితాన్నే సంతోషంగా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాను. అయినాసరే మొండిగా బండగా ప్రవర్తిస్తున్నావు. పిల్లల పేర రాసిన లక్షల ఆస్తిని, ఇదిగో ఇప్పుడే రద్దు చేసేస్తున్నాను” అని రాశాడు. ఎకతెరీనాలో ఎలాంటి చలనమూ లేదు. ఆమెకు సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ పెద్ద ఇల్లు, అత నామె పేర రాసిన భారీ మొత్తాలు ఉన్నాయి. ఆపైన మంచి ఆస్తిపాస్తులున్న బంధువర్గం ఉంది.

బట్టతల, నెరిసిన జుట్టుతో అసలు వయసు కంటే పెద్దవాడిలా కనిపిస్తున్న స్లీమన్; లోపల ఇంత అశాంతినీ, ఒంటరితనాన్నీ మోస్తూనే పైకి మాత్రం ఓ విద్యార్థిలా బుద్ధిగా సర్బాన్ యూనివర్సిటీకి వెళ్ళొస్తున్నాడు. వ్యాపారం జోలికి ఇక వెళ్లకూడదని ఎన్నోసార్లు అనుకున్నాడు. అన్నిసార్లూ ఆ మాట తప్పుతూనే వచ్చాడు. రోజూ విధిగా లండన్ టైమ్స్ లోని ఫైనాన్షియల్ పేజీలు చదివేవాడు. మనీ మార్కెట్ ను అధ్యయనం చేసేవాడు. కొన్ని రకాల బాండ్లకు కాగితం డబ్బు రూపంలో చెల్లింపులు జరపాలని అమెరికా రాజకీయనాయకులు ఒత్తిడి తెస్తున్నట్టు చదివాడు. అందువల్ల లక్షల డాలర్ల మేరకు లావాదేవీలు జరుగుతాయనీ, బంగారం విలువ విపరీతంగా పెరిగిపోతుందనీ, కాగితం డబ్బు చలామణిలోకి రావడంతో బాండ్ల చెల్లుబాటు పడిపోతుందనీ అనుకున్నాడు. అమెరికాలో తనకు భారీగా ఆస్తులు ఉన్నాయి కనుక వాటి విలువ ఎక్కడ తరిగిపోతుందో నని భయపడి వెంటనే అమెరికాకి ప్రయాణం కట్టాడు.

1868లో న్యూయార్క్ వెళ్ళి, అక్కడినుంచి వాషింగ్టన్ చేరుకున్న వెంటనే ఖజానా మంత్రిని కలసుకున్నాడు. బాండ్ల చెల్లుబాటును తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పడంతో ఊరట చెందాడు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ను మర్యాదపూర్వకంగా కలసుకున్నాడు. “జాన్సన్ చాలా సీదా సాదా మనిషి. ఆయనకు యాభై అయిదేళ్ళుంటాయి. క్యూబా గురించి కాంగ్రెస్ లో ఇటీవల ఆయన చేసిన ప్రసంగం సంతోషం కలిగించిందని చెప్పాను. అమెరికావైపు క్యూబా మొగ్గు చూపుతోందనీ, అది అమెరికాలో విలీనమయ్యే రోజు ఎంతో దూరంలో లేదనీ ఆయన చెప్పాడు” అని ఓ జర్మన్ మిత్రుడికి రాశాడు. క్యూబాలో తనకున్న భూములు సురక్షితంగా ఉంటాయన్న నమ్మకం అతనికి చిక్కింది.

వాషింగ్టన్ అతనికి నచ్చింది. కిందటిసారి వచ్చినప్పుడు న్యూయార్క్ ఎంతో బాగున్నట్టు అనిపించినా, ఇప్పుడు పారిస్ ను చూసిన కళ్ళతో చూశాక వీధులు ఇరుకిరుగ్గా ఉన్నాయనీ, వీధి దీపాల ఏర్పాటు సరిగా లేదనీ, మొత్తం న్యూయార్క్ నగరమే గంద్రగోళంగా ఉందనీ అనుకున్నాడు. నగరం అంతర్యుద్ధ ప్రభావం కింద ఇంకా నలుగుతూనే ఉన్నట్టు అనిపించింది. ఎంతోమంది యూరోపియన్లలానే దక్షిణాది రాష్ట్రాల దుస్థితికి జాలిపడ్డాడు. “ఇప్పటికీ ఇక్కడి ప్రజల్ని పరాజితులుగా చూస్తున్నారు. వాళ్ళు రాజకీయప్రాతినిధ్యం లేకుండా  సైనికపాలన కింద మగ్గిపోతున్నారు. డబ్బు లేదు, బ్యాంకులు లేవు, తమ బాగోగులు తాము చూసుకునేందుకు సాయపడే వ్యవస్థ ఒక్కటీ లేదు” అని రాశాడు.

ఆఫ్రో-అమెరికన్లపై అతనికి ఎంతో ఆసక్తీ, ఇష్టమూ కలిగాయి. కొన్నాళ్ళపాటు వాళ్ళ స్కూళ్లను సందర్శించాడు. చర్చిలకు వెళ్ళి మతప్రసంగాలు విన్నాడు. వాళ్ళ గుణగణాలను ఆకాశానికి ఎత్తుతూ డైరీలో పేజీలకు పేజీలు నింపేశాడు. అయితే, అంతే హఠాత్తుగా వారిపై ఆసక్తి తగ్గిపోయింది. ఆ స్థానాన్ని అమెరికా రైల్వే వ్యవస్థ ఒక్కసారిగా ఆక్రమించుకుంది. మహా సరస్సు(Great Lakes)ల వరకూ విస్తరించిన అన్ని రైలు మార్గాలలోనూ ఓ డైరక్టర్ లా ప్రయాణం చేసి, వాటిని సునిశితంగా తనిఖీ చేశాడు. ఇంతకుముందు వచ్చినప్పుడు అమెరికన్ రైల్వేలు నష్టాల మీద నడుస్తున్నాయనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం తప్పనుకున్నాడు. పెట్టుబడి మీద పది శాతం లాభం వస్తున్నట్టు గుర్తించి సంతోషించాడు.

డైరీలో ఇతర విషయాలు కూడా రాసుకున్నాడు. వాటిలో నీలిమందు ధర, ఎగుమతి అవుతున్న ఆహారధాన్యాల పరిమాణం, అప్పటికి ముప్పై ఏళ్ల చికాగో అభివృద్ధికి సంబంధించిన గణాంకాలు, ఇండియానాపొలిస్ లోని భవనాల సైజు, ప్రస్తుత మార్కెట్ రేట్లలో కలప విలువ మొదలైనవి ఉన్నాయి. మళ్ళీ తను వ్యాపారప్రపంచంలోకి వెడుతున్నట్టు అతనికి అనిపించింది. నిజానికి అతనెప్పుడూ ఆ ప్రపంచానికి దూరంగా లేడు. ఇండియానాపొలిస్ అతనికి నచ్చింది. అక్కడ ఎంతోమంది వ్యాపారవేత్తలను, రాజకీయముఖ్యులను పరిచయం చేసుకున్నాడు. వాళ్ళతో సంభాషణ అప్పుడప్పుడు విడాకుల చట్టం మీదికి మళ్లుతూ ఉండేది. ఇండియానా రాష్ట్రం ఆ చట్టంలో సవరణలు తెస్తోంది.

స్లీమన్ కాలిఫోర్నియాలో ఉన్నప్పుడే ఆ రాష్ట్రం యూనియన్ లో చేరింది. తను అమెరికా పౌరుణ్ణి అయ్యానని అతను చెప్పుకునేవాడు కానీ, అధికారికంగా పౌరసత్వం తీసుకోలేదు. భార్యకు విడాకులివ్వడానికి ఇండియానా చట్టం అనుకూలంగా ఉన్నట్టు కనిపించడంతో అక్కడి మిత్రుల సాయంతో పౌరసత్వం పొందడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇండియానాపొలిస్ లో ఓ ఇల్లు కొనుక్కుని పిండి పదార్థాల వ్యాపారంలో ఆసక్తి చూపించాడు. ఎకతెరీనాతో తెగతెంపుల ప్రయత్నాలు అతనిలో ఆశాభావాన్నీ, ఉత్సాహాన్నీ నింపాయి. అమెరికా యాత్ర పొడవునా ఎంతో ఉల్లాసంగా గడిపాడు. ఓ రైల్వే అధికారిలా సర్వే చేస్తూ రైలు మార్గాలను చుట్టబెట్టడమే కాదు; ఎన్నో లాభసాటి పెట్టుబడులు పెట్టాడు. ప్రభుత్వంలో ముఖ్యులనుకున్న వాళ్లందరినీ కలసుకున్నాడు. మంచి తెలివీ, నిశితదృష్టీ ఉన్న ఈ వ్యాపారవేత్తను చూసి అంతా ముగ్ధులయ్యారు.

పైకి ఉల్లాసంగా ఉన్నా లోలోపల ఒంటరితనం కుంగదీస్తూనే ఉంది.  సెయింట్ పీటర్స్ బర్గ్ కూ, జర్మనీకీ అతను రాస్తున్న ఉత్తరాలు; తన డైరీ రాతల్లో వెల్లివిరిసే ఉత్సాహానికి భిన్నమైన చిత్రం చూపిస్తున్నాయి. ఎకతెరీనాకు విడాకులివ్వాలని అతను మనస్ఫూర్తిగా అనుకోడంలేదు. ఆమె తననా పరిస్థితికి నెడుతోందని అనుకుంటున్నాడు. వేడికోళ్ళు, బుజ్జగింపులతోపాటు; తను తప్పులు చేశానని ఒప్పుకుంటూ, ఇకముందు నిన్ను నెత్తినపెట్టుకుంటానని హామీ ఇస్తూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. రష్యాలో క్రిస్టమస్ రోజైన జనవరి 6వ తేదీన వాషింగ్టన్ హోటల్ గదిలో ఒంటరిగా గడుపుతూ తన ముగ్గురు పిల్లల్నీ, క్రిస్టమస్ ట్రీనీ తలచుకున్నాడు. పిల్లలకి కానుకలిచ్చి వాళ్ళతో సంతోషంగా గడిపే అదృష్టం లేనందుకు కంట తడి పెట్టుకున్నాడు. తన మీద తనకే విసుగూ, కోపమూ ముంచెత్తాయి. పిల్లల సంతోషాన్ని పంచుకుంటూ వాళ్ళతో గడపడంలో పొందే ఆనందం ముందు లక్ష అమెరికన్ డాలర్లు కూడా దిగదుడుపే ననుకున్నాడు. పైగా ఆ మరునాడే తన 46వ పుట్టినరోజు కావడం అతని మనోవ్యధను మరింత పెంచింది. తన దుఃఖాన్ని వెళ్లబోసుకునేందుకు మనిషి కనిపించక ఒంటి నిండా ఒంటరి తనాన్ని కప్పుకుని ఆరోజంతా వాషింగ్టన్ వీధుల్లో దయ్యంలా తిరిగాడు.

ఓ మిత్రుడిచ్చిన పరిచయలేఖను తీసుకుని వాషింగ్టన్ లోని ప్రష్యా రాయబారి బేరన్ వన్ గెరోల్ట్ ను కలసుకున్నాడు. ఆయన సాదరంగా ఆహ్వానించి అతని వ్యాపారాల గురించి అడిగాడు. మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చానని చెప్పి స్లీమన్ తన పారిస్ జీవితం గురించి, సెయింట్ పీటర్స్ బర్గ్ లో తను గడించిన సంపద గురించీ చెప్పడం ప్రారంభించాడు. దాంతో ఉన్నట్టుండి ఆ రాయబారి కోపంతో కేకలు లంకించుకున్నాడు.”అలా అయితే ఫ్రెంచి రాయబారినో, రష్యన్ రాయబారినో కలవకపోయారా? ఇక్కడ అమెరికాలో రష్యన్లు ఎక్కువమంది లేరు. జర్మన్లు చాలామంది ఉన్నారు. మీతో మాట్లాడే తీరిక నాకు లేదు” అనేశాడు. తన్నుకొచ్చే కోపాన్ని దిగమింగుకుంటూ స్లీమన్ తక్షణమే బయటికి నడిచాడు. ఫిబ్రవరిలో న్యూయార్క్ లో ఫ్రాన్స్ కు వెళ్ళే ఓడ ఎక్కబోతూ తన చివరి ఉత్తరాన్ని ఆ ప్రష్యన్ రాయబారికే రాశాడు.  తను కలవడానికి వచ్చినప్పుడు ఎలా అవమానించిందీ, ఎలాంటి మాటలన్నదీ, తన ఆత్మాభిమానం ఎలా దెబ్బతిన్నదీ అందులో పూసగుచ్చినట్టు రాస్తూ తూలనాడాడు. చివరగా, “యువర్ ఎక్సెలెన్సీ, మీరు నాపట్ల చూపించిన దారుణ అమర్యాదే నా అమెరికా పర్యటన మొత్తంలో ఒక చేదుజ్ఞాపకంగా మిగిలిపోయిందని విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలోనూ సభ్యత, సంస్కారం, మర్యాద వెల్లివిరిసే దేశంగా అమెరికాను కలకాలం గుర్తుపెట్టుకుంటాను. కానీ, ఈ ప్రతి ఒక్కరిలోనూ మీరు మాత్రం ఉండరు” అని రాశాడు.

తిరిగి పారిస్ చేరుకున్నాడు. అప్పటికి ఫ్రాన్స్ క్షితిజాన్ని యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. భాషాశాస్త్ర అధ్యయనాన్ని పునఃప్రారంభించి ఎప్పటిలా సర్బాన్ యూనివర్సిటీలో క్లాసులకు వెళ్లివస్తున్నాడు. థియేటర్ ను సందర్శిస్తున్నాడు. మరోవైపు మరిన్ని ఇళ్ళు కొంటూ ఇళ్ల యజమాని పాత్రనూ గొప్పగా రక్తి కట్టిస్తున్నాడు. గ్యాస్ బర్నర్లు, స్నానాల గదులు వగైరాల గురించిన తన అధ్యయన సమాచారంతో పేజీలకు పేజీలు నింపేస్తున్నాడు. అంతలోనే వీటన్నింటిపై విసుగు పుట్టింది. మరోసారి అతని జీవన దిక్సూచి చంచలించడం ప్రారంభించింది. తన జీవితమంతా కిరాయిదార్లకోసం మెరిసిపోయే స్నానాల తొట్టెలు, అద్దాలు కొనుగోలు చేయడంతో ముగిసిపోవలసిందేనా అనిపిస్తోంది.

అస్థిమితంగా, అశాంతిగా రోజులు గడుస్తుండగా; ఏకకాలంలో హఠాత్తుగా జరిగిన రెండు ఘటనలు అతని జీవనగమనాన్ని మార్చేశాయి. మొదటిది, అతను సర్బాన్ యూనివర్సిటీలో పురాతత్వశాస్త్రానికి సంబంధించిన కొన్ని తరగతులకు హాజరయ్యాడు. రెండోది, అతని దగ్గరి బంధువైన సోఫీ స్లీమన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆమెకు యాభై ఏళ్ళు ఉంటాయి. పెళ్లి చేసుకోలేదు. నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాననీ, నీతో కలసి ప్రపంచయాత్ర చేయాలని ఉందనీ ఆమె రాసింది. దానికతను జవాబు రాస్తూ, చిన్నప్పుడు కల్కోస్ట్ లో ఇద్దరూ కలసి ఆడుకున్న రోజుల్ని నిరాసక్తంగా గుర్తుచేసుకున్నాడు. ఆపైన ప్రష్యా రాయబారికి రాసిన ఉత్తరంలోలానే ఎత్తిపొడుపులు జోడిస్తూ పరుషవాక్యాలు గుప్పించాడు. ఒకప్పుడు నీ ప్రేమను అర్థిస్తే తిరస్కరించావనీ, ఇప్పుడు వయసులో నా కంటే పెద్ద అయిన నీతో అవారాలా తిరిగే ఉద్దేశం లేదనీ అన్నాడు. నీలాంటి ఓ అనుభవజ్ఞురాలితో కలసి ప్రపంచయాత్ర చేసే అవకాశాన్ని అదృష్టంగానే భావిస్తాను కానీ, ఒక సన్యాసినితో కలసి తిరగలేననీ, అంతకంటే దుర్భరస్థితి ఇంకొకటి ఉండదనీ, నీలాంటివాళ్లకు ఈ సువిశాల ప్రపంచం కన్నా ముక్కు మూసుకుని ఒక మూల కూర్చునే ఆశ్రమజీవితమే సరిపోతుందనీ నిష్టురమాడాడు.

సోఫీ స్లీమన్ కు ఆ ఉత్తరం చేరనేలేదు. సరిగ్గా అతనా ఉత్తరం రాసిన రోజునే ఆమె మరణించింది. ఆ కబురు తెలియగానే స్లీమన్ దుఃఖంలోనూ, పశ్చాత్తాపంలోనూ కూరుకుపోయాడు.

(సశేషం)

 

 

 

చైనా గోడ మీంచి ఇటుక తెచ్చుకున్నాడు! 

 

స్లీమన్ కథ-11

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పర్వతాలు, ఎడారి మీదుగా మెలికలు తిరుగుతూ 14వందలమైళ్ళ దూరం వ్యాపించిన చైనా గోడ గురించి స్లీమన్ కు చిన్నప్పటినుంచీ తెలుసు. తను అక్కడికి వెళ్ళినట్టు, ఆ గోడ ఎక్కినట్టు కలలుగనేవాడు. అంతకంటే విశేషంగా, అతి పురాతనకాలంలో ఈ భూమ్మీద గొప్ప సృజనాత్మక నైపుణ్యాలు కలిగిన ఓ అద్భుతమైన జాతి ఉండేదనీ, అది అంతర్ధానమైపోయిందనీ, చైనా గోడ దగ్గరికి వెడితే ఆ జాతికి సంబంధించిన రహస్యాలను పట్టుకోవచ్చుననీ అనుకునేవాడు.

పెకింగ్ ను సందర్శించిన మరునాడే నౌకరును వెంటబెట్టుకుని మంచూరియా సరిహద్దుల్లో, చైనా గోడకు సమీపంలో ఉన్న కౌ-పా-కౌ కు బయలుదేరాడు. రెండు రోజుల తర్వాత అక్కడికి చేరాడు. అతనిలో ఉల్లాసం, ఉత్సాహం ఉరకలేస్తున్నాయి. ఎండ బాగా కాస్తోంది. తలకు అరబ్ తలపాగ చుట్టుకున్నాడు. దారి పొడవునా ఉన్న గ్రామాల వాళ్ళు అతనివైపు వింతగా చూశారు. ఆయన చైనా గోడ చూడడానికే ఏకంగా యూరప్ నుంచి వచ్చాడని నౌకరు చెప్పినప్పుడు అతనేదో తమాషా చేస్తున్నాడనుకుని అంతా నవ్వేశారు. ఆ సరిహద్దు గ్రామాలవాళ్లు స్లీమన్ కు ఎంతో నచ్చారు. అమాయకత్వం, ఔదార్యం మూర్తీభవించిన ఈ జనాలు పెకింగ్ లో తను చూసిన క్షీణజాతికన్నా భిన్నంగా ఉన్నారనుకున్నాడు.

ఎండ మొహం మీద పడి చురుక్కుమనిపిస్తోంది. పైగా ప్రయాణంతో అలసిపోయాడు. అయినాసరే, గోడ దగ్గరికి చేరుకోగానే ఎండ తీవ్రతా, అలసటా అన్నీ మరచిపోయాడు. అప్పటికప్పుడు దానిని ఎక్కడానికి సిద్ధమయ్యాడు. గోడ దిగువున ఉన్న గుట్ట ఎగుడు దిగుడుగా, పైకి పొడుచుకొచ్చిన రాళ్ళతో అడుగు తీసి అడుగు పెట్టలేనట్టుగా ఉంది. ఎవరైనా సహాయకులు తోడు వస్తారేమోనని వాకబు చేశాడు. చివరికి నౌకరుతో సహా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఒంటరిగానే ఎక్కడానికి సిద్ధమై అతి కష్టం మీద పైకి చేరుకున్నాడు.

తనతో ఒక కొలతబద్దను తీసుకెళ్లాడు. గోడకు ఉపయోగించిన ఇటుకల పరిమాణాన్ని కొలిచాడు. అవి 67 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల ఎత్తు, 17 సెంటీమీటర్ల మందం ఉన్నాయి. ఆ తర్వాత గోడ ఎత్తు కొలిచాడు. అది కొన్ని చోట్ల 20 అడుగులు, కొన్నిచోట్ల 30 అడుగుల ఎత్తుంది. కాపలా బురుజుల మధ్యదూరం 300 అడుగులుంది. ఆ ఇటుకలు కచ్చితంగా క్రీ.పూ 200 నాటి హన్ రాచరిక కాలానికి చెందినవనుకున్నాడు. కానీ నిజానికవి క్రీ.శ. 1400 నాటి మింగ్ రాచరిక కాలానికి చెందినవి. ఆ ఎత్తైన గోడ మీంచి కింద దూరదూరాలకు వ్యాపించిన కొండలు, గుట్టలు చూస్తూ అతను పట్టలేని తమకంతో మైమరచిపోయాడు.

ఆ ఎత్తునుంచి ప్రపంచం చాలా చిన్నదిగానూ, ఓ నీడలానూ కనిపిస్తున్న ఆ అద్భుత దృశ్యాన్ని ఎంతసేపు చూసినా అతనికి తనివితీరలేదు. సాయంత్రంవరకూ ఆ గోడమీదే ఉండిపోయాడు. మధ్యాసియానుంచి విరుచుకుపడుతున్న ఆటవికపు దాడులనుంచి ఆ గోడను కాపాడడానికి చేసిన వీరోచిత పోరాటాల గురించి తను చదివినవన్నీ గుర్తుచేసుకున్నాడు. జావాలో, సియేరా నెవాడాలో ఎత్తైన ప్రదేశాలనుంచి తను కిందికి చూసినప్పుడు కనిపించిన అద్భుత దృశ్యాలను నెమరేసుకున్నాడు.

sliiman

చీకటి పడుతున్న సమయానికి గోడనుంచి ఓ ఇటుకను జాగ్రత్తగా వేరుచేసి దానిని ఓ తాడుతో ఎలాగో వీపుకి కట్టుకున్నాడు. ఆ తర్వాత పొట్టను గోడకానించి నెమ్మదిగా కిందికి జారాడు. దిగిన వెంటనే ఇటుకను చూసుకున్నాడు. అది భద్రంగా ఉన్నందుకు పొంగిపోయాడు. విపరీతమైన దాహంతో మంచినీళ్ళకోసం కేకలు పెట్టేటప్పటికి అక్కడి రైతులు పరుగుపరుగున నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకు తను తెచ్చిన ఇటుకను సగర్వంగా చూపించాడు. ఆ ఒక్క ఇటుక కోసం అంత దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడాలా అనుకుంటూ వాళ్ళు పగలబడి నవ్వేశారు. “నేను మంచినీళ్లు అడగ్గానే వెంటనే తీసుకొచ్చి ఇచ్చిన ఔదార్యం, దయా కలిగిన ఈ జనం కచ్చితంగా తమ జీవితంలో ఎప్పుడూ నల్లమందు సేవించి ఉండ”రని డైరీలో రాసుకున్నాడు.

తన ప్రయాణానుభవాలను అతను వెంటనే కాకుండా కొన్నిరోజుల తర్వాత డైరీలో పొందుపరిచాడు. ఒకప్పుడు చైనాకు రక్షణ కుడ్యంగా ఉండి ఇప్పుడు శిథిలమవుతున్న ఈ అద్భుతనిర్మాణం తనను ఆకట్టుకున్నంతగా ప్రపంచంలో మరేదీ ఆకట్టుకోలేదన్నాడు. జావా అగ్నిపర్వతాలను, హిమాలయాలను, సియేరా నెవాడా శిఖరాలను, దక్షిణ అమెరికాలోని కార్డిల్లేరా పీఠభూమిని అధిరోహించానని చెబుతూ తన పర్వతారోహణ నైపుణ్యాలను అతిశయోక్తులతో చాటుకున్నా; చైనా గోడ మీంచి కిందికి చూసినప్పుడు తను పొందానని చెప్పిన భావోద్వేగాలు మాత్రం నిజం.

చైనా గోడ తను చిన్నప్పటినుంచీ ఊహించుకుంటున్నదానికంటే కూడా వందరెట్లు వైభవోపేతంగా ఉందనీ, తనను ఆశ్చర్యచకితం చేసిందనీ, మతిపోగొట్టిందనీ, తనలో గొప్ప ఆరాధనాభావాన్నీ, ఉత్తేజాన్నీ నింపిందని రాశాడు. ఎత్తైన పర్వతశిఖరాలతో పోటీపడుతున్న బురుజులతో ఈ బ్రహ్మాండమైన గోడను చూస్తున్నకొద్దీ జలప్రళయానికి ముందునాటి ఓ మహోన్నతజాతి ఏదో దీనిని నిర్మించినట్టు తోస్తూ వచ్చిందనీ అన్నాడు. ఇంకా ఇలా రాశాడు:

క్రీ.పూ. 220 ప్రాంతాలలో దీనిని నిర్మించినట్టు నాకు తెలుసు. అయినాసరే, మామూలు మనుషులు దీనిని నిర్మించారంటే నాకు నమ్మశక్యం కావడంలేదు. అంత పెద్ద పెద్ద బండరాళ్లను, భారీ గ్రానైట్ శిలలను, అన్నన్ని ఇటుకలను అక్కడికి ఎలా రవాణా చేశారో, వాటిని అంత పైకి ఎలా తరలించారో అంతుబట్టలేదు. గోడ దిగువనే ఉన్న లోయలో ఆ ఇటుకల్ని కాల్చి ఉంటారని అనిపించింది. ఉత్తరం వైపునుంచి వచ్చిపడుతున్న శత్రువులను నిలవరించడానికి ఉద్దేశించిన ఇంత పెద్ద నిర్మాణం చేయాలంటే హెర్క్యులస్ కు ఉన్నంత శక్తి కావాలి.

ఈరోజున ఇంత ఘనమైన నిర్మాణమూ నిర్లక్ష్యానికి గురై పాడుబడినట్టు ఉంది. సైనికులకు బదులు బురుజుల్లో పావురాలు ప్రశాంతంగా గూడు కట్టుకుంటున్నాయి. వసంతాగమనాన్ని సంకేతిస్తున్న పసుపు, ఊదారంగు పువ్వుల మధ్య తొండలు తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. ఇప్పుడీ కట్టడం భూమ్మీంచి ఎప్పుడో నిష్క్రమించిన ఒక యుగం తాలూకు అంత్యక్రియల చిహ్నమా అన్నట్టు మిగిలిపోయింది.

ఇప్పటినుంచీ తన డైరీని అతను చాలా జాగ్రత్తగా రాశాడు. ముందే ప్రచురణకు ఉద్దేశించాడా అన్నట్టుగా చక్కని మాటలు, వాక్యాలు పొదుగుతూ వర్ణనాత్మకశైలిలో రాసుకుంటూ వెళ్ళాడు. ఇవే రోజుల్లో మిత్రులకు రాసిన ఉత్తరాల్లో కూడా రచయిత కావాలన్న తన ఆకాంక్షను నొక్కి చెప్పేవాడు. కావలసినంత సంపాదించుకున్న తర్వాత రచయితగా గడపడాలన్నదే మొదటినుంచీ తన జీవితాశయమనీ; రష్యాను విడిచిపెట్టి యూరప్ లో ఎక్కడో ఒకచోట స్థిరపడి సహరచయితలతో పరిచయాలు పెంచుకుంటూ రచనకే అంకితమైపోవాలనుకుంటున్నాననీ, నా దృష్టిలో ఇంతకన్నా గొప్ప వ్యాసంగమేదీలేదనీ రాసేవాడు. ఈ తూర్పు దేశాల యాత్రానుభవాలను పొందుపరుస్తూ తన నలభై మూడో ఏట వెలువరించిన మొదటి పుస్తకం తొలి పుటల్లోనే తన భావిజీవితంలో ప్రాధాన్యం వహించబోయే ఇతివృత్తమేమిటో సూచించాడు. అవి—కూలుతున్న శిథిలాలు, బ్రహ్మాండమైన పురాతనపు రాతి కట్టడాలు, సమాధైపోయిన ఉత్సవపూరిత గతం…

ఓసారి చైనా గోడను చూసి, దానిమీద నిలబడిన తర్వాత  ఇక ఆ దేశం మీద అతనికి ఆసక్తి తగ్గింది. మిగతా యాత్రావిశేషాలను క్లుప్తంగా, యధాలాపంగా రాసుకుంటూ వెళ్ళాడు. చైనా మహిళల విలక్షణమైన నడక మీద మాత్రం కాస్త ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. వాళ్ళ పాదాలను దగ్గరగా చూశాననీ, గెంతుతున్నట్టు వాళ్ళు ఎలా నడుస్తారో కచ్చితంగా చెప్పగలిగిన యూరోపియన్ రచయితలెవరూ తనకు కనిపించలేదనీ రాశాడు. ఆ తర్వాత, మూడు కాలివేళ్ళను అరికాళ్ళలోకి ఎలా చొప్పిస్తారో, ఆ విలక్షణమైన నడకను ఎలా సాధిస్తారో వివరించాడు. చైనీయుల నాటకాల గురించి కూడా రాశాడు. నటులు ధరించే బరువైన జలతారుదుస్తులు, ముసుగులు, వారి హావభావాలు, పురుషపాత్రధారులు పెద్ద గొంతుతో మాట్లాడడం-అన్నీ అతనికి విచిత్రంగానే అనిపించాయి.

అక్కడినుంచి జపాన్ వెళ్ళాడు. ఆ దేశం అతన్ని మత్తులో ముంచెత్తింది. ఎంతో ఆహ్లాదభరితంగానూ, ఓ నిగూఢప్రదేశంగానూ, నమ్మశక్యం కాని ఓ దేవకన్యల కథలానూ అనిపించింది. తరచు వర్షం పడుతున్నా, రాబర్ట్ థామస్ లాంటి స్నేహపాత్రుడైన దుబాషీ వెంట లేకపోయినా  అక్కడ ఉన్నన్ని రోజులూ చాలా ఉల్లాసంగా గడిపాడు. అక్కడి కబుకీ నాటకాలకు వెళ్ళాడు. బహిరంగస్నానశాలలను సందర్శించాడు. జపాన్ మహిళలు ధరించే సిల్కు కిమోనాలను, వాళ్ళ స్నేహశీలతను చూసి ఆనందించాడు. అక్కడి విదేశీ రాయబారులతోనూ స్నేహంగా మెలిగాడు. స్నానశాలకు వెళ్లినప్పుడు అతని వాచీ ఛైనుకున్న ఎర్రని పగడం కుతూహలం కలిగించడంతో దానిని చూడడానికి అక్కడి యువతులు చుట్టూ మూగడం, వాళ్ళ చొరవా అతన్ని ముగ్ధుణ్ణిచేశాయి. తను దిగిన చిన్న చిన్న సత్రాలు, అక్కడి సిబ్బంది మాటి మాటికీ వంగి అభివాదం చేయడం, ఎక్కడికి వెళ్ళినా సభ్యత, గౌరవం వెల్లివిరిసే వాతావరణం అతనికి ఎంతగానో నచ్చాయి. తన జపాన్ అనుభవాలను చాలా తీరుబడిగానూ, అక్కడ గడిపిన ప్రతిక్షణాన్నీ నెమరేసుకుంటూనూ ఒకవిధమైన మైకంతో రాశాడు. అతని పుస్తకంలో ఆ భాగాలే అత్యుత్తమంగా నిలిచాయి.

అదృష్టవశాత్తూ జపాన్ మికాదో[చక్రవర్తి]కి, షొగున్[సైనిక గవర్నర్: చక్రవర్తే నియమించినా 1192-1867 మధ్యకాలంలో సైనిక గవర్నర్లే పూర్తి అధికారాన్ని చలాయిస్తూ వచ్చారు. సైనిక గవర్నర్ కీ, చక్రవర్తికీ మధ్య తరచు ఘర్షణలు తలెత్తుతూ ఉండేవి]కూ మధ్య స్వల్పకాలిక శాంతి నెలకొనే అరుదైన రోజుల్లో స్లీమన్ జపాన్ ను సందర్శించాడు. అప్పటికి పన్నెండేళ్ళ క్రితమే అమెరికా నౌకాదళాధికారి కమొడోర్ పెరీ(1794-1858) ఎడో(Yedo)అఖాతం మీదుగా జపాన్ చేరుకుని తన డిమాండ్ల పత్రాన్ని చక్రవర్తికి ఇవ్వబోయినప్పుడు, అక్కడ ఇద్దరు చక్రవర్తులున్న సంగతి తెలిసి తెల్లబోయాడు. స్లీమన్ అక్కడికి వెళ్లడానికి ముందు సంవత్సరమే చోషును పాలించే దైమ్యో(సామంతరాజు) విదేశీ నౌకలపై అదే పనిగా కాల్పులు జరిపించినందుకు ప్రతీకారంగా బ్రిటిష్, ఫ్రెంచ్, అమెరికా, డచ్ నౌకాబలగాలు షిమొనోసెకీ(ఒక జపాన్ నగరం)పై పెద్దయెత్తున దాడిచేశాయి.

అయితే, సమకాలీనచరిత్రపై స్లీమన్ కు ఆసక్తి లేదు. జపాన్ అతని కళ్ళముందు ఉత్సవభరితంగా ఆవిష్కృతమైంది.  చరిత్రప్రసిద్ధమైన తోకైదో రాజమార్గం మీదుగా వర్ణరంజితంగా సాగిన షొగున్ ఊరేగింపును చూసి మైమరచిపోయాడు. దాని అద్భుతత్వానే కాక, ఆటవికత్వాన్ని కూడా కళ్ళకు కట్టిస్తూ ఎంతో జాగ్రత్తగా చిత్రించుకుంటూ వచ్చాడు.

 ఆ ఊరేగింపు ముందుభాగంలో వెదురు కర్రల మీద పెద్ద పెద్ద సామాను మోస్తూ కూలీలు నడిచారు. వారి వెనకాల తెలుపు, నీలం, నలుపు రంగు దుస్తులు ధరించి, విల్లమ్ములు తదితర ఆయుధాలు పట్టుకున్న సైనికులు నడిచారు. వారి వెనక వాళ్ళ అధికారులు అధికార లాంఛనాలతో పసుపు, నీలం, లేదా తెలుపు కోట్లు ధరించి గుర్రం మీద వచ్చారు. వారి వెనకాల సామాన్లు మోస్తూ మళ్ళీ కొందరు కూలీలు, వారి వెనకాల గుర్రం మీద తెలుపు దుస్తులతో మరింత పెద్ద అధికారులు; వారి వెనకాల బల్లేలు ధరించిన సైనికులు, శతఘ్ని, పదాతి దళాలు; వారి వెనక కూలీలు, వారి వెనక గుర్రాల మీద మరింత పెద్ద హోదా ఉన్న వారు; వారి వెనక మళ్ళీ సైనికులు, వారి వెనక నాలుగు అలంకృత అశ్వాలు, వాటి వెనక అశ్వపాలకులు వచ్చారు.

చివరగా ఓ అందమైన గోధుమరంగు గుర్రం మీద షొగున్ వచ్చాడు. అతనికి ఇరవయ్యేళ్లు ఉంటాయి. చక్కని ముఖం. రంగు కొంచెం నలుపు. బంగారు జలతారు పని చేసిన తెల్లని అంగరఖా ధరించాడు. మెరుగుపెట్టిన టోపీ పెట్టుకున్నాడు. అతని బెల్టుకు రెండు కృపాణాలు వేలాడుతున్నాయి. అతనికి అటూ ఇటూ ఇరవైమంది ప్రముఖులు తెల్లని అంగరఖాలు ధరించి గుర్రాల మీద వచ్చారు.

ఆ ఊరేగింపు స్లీమన్ మనసుకు ఎంతగా హత్తుకుపోయిందంటే, మరునాడు ఆ ప్రదేశాన్ని చూడడానికి గుర్రం మీద వెళ్ళాడు. ముందురోజు తను నిలబడ్డ చోటుకు దగ్గరలోనే, దుమ్ముధూళితో నిండిన రోడ్డు మీద పూర్తిగా ఛిద్రమైపోయిన మూడు మృతదేహాలను చూసి విస్తుపోయాడు.  రైతులో, సైనికులో గుర్తుపట్టడానికి వీల్లేనంతగా అవి చిన్నాభిన్నమైపోయి ఉన్నాయి. ఎవరో, ఏమిటో అర్థం కాక ఆ భీకరదృశ్యాన్ని గుడ్లప్పగించి చూస్తూ కాసేపు ఉండిపోయాడు. అదే చోట రెండువేలమంది సైనికులతో, సేవకులతో మిరుమిట్లు గొలిపేలా సాగిన షొగున్ ఊరేగింపును తను కళ్ళారా చూశాడు. కానీ ఆ ఊరేగింపు ఈ మూడు మృతదేహాలను తొక్కుకుంటూ సాగినట్టు తనకు తెలియనే తెలియలేదు!

అప్పటికే అస్వస్థుడిగా ఉండి ఓ ఏడాదిలో మరణించబోతున్న బక్కపలచని షొగున్ ఆదేశాల మీదే ఆ ముగ్గురినీ నరికి చంపారా?! మృతదేహాలను అక్కడే ఎందుకు వదిలేశారు? వాటిని తొక్కుకుంటూ ఎందుకు వెళ్లారు? కుతూహలం చంపుకోలేక యొకొహామాకు తిరిగొచ్చి దీని గురించి జాగ్రత్తగా ఆరా తీశాడు. చివరికి అతనికి అందిన సమాచారం ఏమిటంటే, షొగున్ ఊరేగింపుగా వెడుతున్నప్పుడు పొరపాటున కూడా ఎవరూ రోడ్డుకు అడ్డంగా వెళ్లకూడదు. మామూలుగా అయితే ముందుగా హెచ్చరిక సిబ్బందిని పంపించి ఊరేగింపుకు ఎవరూ అడ్డు రాకుండా చూస్తారు. కానీ ఆరోజు ఎలా జరిగిందో కానీ పొరపాటున ఓ రైతు రోడ్డుకు అడ్డంగా వచ్చాడు. అప్పుడు ఒక అధికారి చూసి, అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేయమని తన సైనికుల్లో ఒకరిని ఆదేశించాడు. ఆ సైనికుడు అందుకు తిరస్కరించాడు. అప్పుడా అధికారి పెద్ద కరవాలం తీసి మొదట సైనికుణ్ణీ, తర్వాత రైతునీ నరికి చంపేశాడు. సరిగ్గా అదే క్షణంలో గుర్రంమీద అక్కడికి వచ్చిన అతని కంటే పై అధికారి ఇది చూసి ఇతనికి మతిచలించిందేమో అనుకుని అప్పటికప్పుడు అతన్ని చంపేశాడు. అలా ఆ రోడ్డు మీద పడున్న మృతదేహాలలో ఒకటి రైతుది, ఒకటి సైనికుడిది, ఇంకొకటి సైనికాధికారిదీ అన్నమాట!

యొకొహామా నుంచి ఎడో నగరానికి వెళ్ళాడు. అక్కడి పెద్ద పెద్ద కోట బురుజుల్ని, ప్రాసాదాలను, కిక్కిరిసిన రోడ్లను చూసి ముగ్ధుడయ్యాడు. సెప్టెంబర్ ప్రారంభానికల్లా జపాన్ మొహంమొత్తింది. తన యాత్రానుభవాలను వెంటనే కాగితం మీద పెట్టాలని కూడా అనుకున్నాడు. దాంతో ‘ది క్వీన్ ఆఫ్ ది ఏవాన్’ అనే ఓ చిన్న ఇంగ్లీష్ నౌక ఎక్కి పసిఫిక్ మీదుగా శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరాడు. కావలసినంత సమయం చిక్కడంతో చైనా-జపాన్ యాత్రా విశేషాలను రాయడం ప్రారంభించాడు. అది 220 పేజీల పుస్తకం అయింది. రెండేళ్ల తర్వాత దానిని La chine et le Japon au temps present అనే శీర్షికతో పారిస్ లో ముద్రింపజేశాడు. ఈ తొలి పుస్తకం అతనిలో సంతృప్తిని, గర్వాన్ని నింపింది.

జపాన్ నుంచి బయలుదేరిన కొన్ని రోజుల తర్వాత, తను సెయింట్ పీటర్స్ బర్గ్ కు వ్యతిరేక దిశలో సరిగ్గా భూమి అంతానికి చేరుకున్నా ననుకున్నాడు. కానీ అతని ఊహ తప్పు. కనీసం ఓడ కెప్టెన్ ను అడిగి ఉంటే ఆ సంగతి చెప్పేవాడు.

ఇప్పటికీ ఇల్లూ వాకిలీ పట్టని ఈ దేశదిమ్మరి కొన్ని రోజులు మాత్రం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండి, తర్వాత ఓడలో నికరాగువాకు బయలుదేరాడు. మరోసారి పనామా మీదుగా వెళ్ళడం ఇష్టంలేక నికరాగువాను దాటి హవానా వెళ్ళాడు. అక్కడ కొంత ఆస్తిని కొన్నాడు. కొన్ని వారాలు అక్కడ గడిపిన తర్వాత మెక్సికో వెళ్ళాడు. ఆ నగరంలో ప్రతిదీ అతనికి నిరుత్సాహమే కలిగించింది. చివరికి 1866 వసంతంలో పారిస్ చేరుకున్నాడు. అక్కడ సైనే, కెతీడ్రా ఆఫ్ నోట్రె డేమ్ కు దగ్గరలో ఒక అపార్ట్ మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు, తన నలభై నాలుగో ఏట, తనేం కాదలచుకున్నాడో స్పష్టత వచ్చినట్టు అనిపించింది. విద్యార్థిగా మారి సర్బాన్ యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతూ భాషాశాస్త్రవేత్త కావాలని నిర్ణయించుకున్నాడు. విరామ సమయంలో తన చైనా, జపాన్ యాత్రావిశేషాలను ప్రచురించాలనుకున్నాడు.

మూడు విడతలుగా అపారమైన సంపదను మూటగట్టి, ప్రపంచంలోని సగం దేశాలను చుట్టి, ఏమాత్రం అనుకూలించని భార్యతో ముగ్గురు పిల్లల్ని కని, పదమూడు భాషలు నేర్చి, ఓ పెద్ద గ్రంథాలయాన్ని సమకూర్చుకున్న ఈ పెద్దమనిషికి తన జీవితాన్ని ఎటు తీసుకెళ్ళాలో ఇప్పటికీ తెలియడం లేదు.

కాకపోతే, క్రమంగా అతని అడుగులు ట్రాయ్ వైపు పడుతున్నాయి…

(సశేషం)

 

 

 

భారత్ ను చూసి భయపడ్డాడు…చైనాలో నరకం చూశాడు!

స్లీమన్ కథ-10

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

భార్య ఎకతెరీనాతో అన్యోన్యక్షణాలు మళ్ళీ వెనకబెట్టాయి. ఎప్పటిలా ఎడమొహం, పెడమొహం. వాళ్ళ కాపురం చాలావరకూ భోజనం బల్లకు, ముక్తసరి మాటలకు పరిమితమవుతోంది. అయినా 1858లో రెండో సంతానం కలిగింది. ఈసారి ఆడపిల్ల, పేరు నతాల్య.  భార్యనుంచి దూరంగా పారిపోవాలన్న తహతహ ఆ ఏడాది వేసవిలో అతన్ని మరీ ఊపిరాడనివ్వకుండా చేసింది. మళ్ళీ సంచారానికి సిద్ధమయ్యాడు. ఈసారి తను చూడాలనుకున్న దేశాలన్నీ చూసిరావాలనుకున్నాడు.

మొదట స్వీడన్, డెన్మార్క్ లకు వెళ్ళాడు. వ్యాపార అవసరాలకోసం అప్పటికే అతను స్వీడిష్, డేనిష్ భాషల్ని నేర్చుకున్నాడు. ఈ దేశాల్లో తను అదనంగా నేర్చుకోవాల్సిందేమీ కనిపించలేదు. ఆ వెంటనే జర్మనీ వెళ్ళి తండ్రినోసారి చూసి ఇటలీ వెళ్ళాడు. అక్కడినుంచి గ్రీస్ వెళ్లాలనుకున్నాడు కానీ, అంతలో మనసు మార్చుకుని ఈజిప్టుకు దారితీశాడు. అక్కడ ఓ సాధారణ యాత్రికునిలా నైలు నదిపై దహబియాలో సెకండ్ కాటరాక్ట్ వరకూ ప్రయాణిస్తూ అరబ్బీ నేర్చుకున్నాడు. కైరో నుంచి వర్తకుల గుంపుతో కలసి జెరూసలెం వెళ్ళాడు. ఆ నగరం అతని కేమంత ఆసక్తిని కలిగించలేదు. స్మిర్నా, కిక్లాడెస్ దీవుల మీదుగా ఎథెన్స్ కు చేరుకున్నాడు.

[దహబియా: నైలునదిపై నడిపే ఒక రకం బోటు] [సెకండ్ కాటరాక్ట్: నదుల్లో ఎత్తైన గుట్టలు, రాళ్ళమీంచి నీళ్ళు వేగంగా కిందికి పడదాన్ని కాటరాక్ట్ అంటారు. నైలు నదిలో ఆశ్వాన్ నుంచి ఖార్టూమ్ వరకూ అలాంటి కాటరాక్టులు ఆరు ఉన్నాయి.]

ఎథెన్స్ లో ఒక మంచి హోటల్ లో దిగాడు. కొండ ఎక్కి పురాతనగిరిదుర్గా[ఎక్రోపోలిస్]న్ని చూశాడు. ఈ సందర్శన అతనికి పూర్తి సంతృప్తినిచ్చింది. ఎథెన్స్ ఎలా ఉంటుందని తను ఊహించుకున్నాడో సరిగ్గా అలాగే ఉందనుకున్నాడు. వెలుగులు విరజిమ్ముతున్న ఆ నగరం తనలోని నైరాశ్యపు చీకట్లను తరిమికొట్టిన అనుభూతి అతనికి కలిగింది. థియోక్లిటస్ విమ్పోస్ ఇచ్చిన పరిచయలేఖల సాయంతో కొంతమంది గ్రీకు పండితులను కలసుకున్నాడు. అతని గ్రీకు ఉచ్చారణ ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేనట్టు ఉందని వాళ్ళు అభినందించారు. ట్రాయ్ వీరుడు ఓడిసస్ నివసించిన ఇథకా దీవిలో కొన్ని మాసాలు గడపాలని అనుకుంటున్నాననీ, దానిపై ఓ పుస్తకం రాసే ఉద్దేశం కూడా ఉందనీ అతను చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించి భుజం తట్టారు. మరికొందరు పండితులకు పరిచయలేఖలు ఇచ్చారు.

తీరా అతను ఆ దీవికి బయలుదేరి వెళ్లబోతుండగా సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి తంతి వచ్చింది. 1857 ఆర్థికసంక్షోభంలో దివాళా తీసిన ఓ వర్తకుడు అతనిపై  హై కోర్టులో దావా వేసినట్టు అందులో ఉంది. నిజానికి ఆ వర్తకుడే స్లీమన్ కు కొంత మొత్తం బాకీపడ్డాడు. దానిని చెల్లించే బదులు స్లీమనే తనను మోసగించాడంటూ ఎదురు అభియోగం తెచ్చాడు. దావాను కొంతకాలం వాయిదా వేయచ్చునా అని అడుగుతూ స్లీమన్ తంతి పంపించాడు. కోర్టు వీల్లేదని చెప్పింది. దాంతో అతను హుటాహుటిన సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగి వచ్చాడు. ఆ రావడం రావడం అయిదేళ్లపాటు మళ్ళీ అక్కడినుంచి కదలలేకపోయాడు.

దావాలో అతనే గెలిచాడు. కానీ ఇతర ఆసక్తులకు మళ్ళీ దూరమయ్యాడు. యధాప్రకారం వ్యాపారంలో పీకల్లోతున కూరుకుపోయాడు. అదే అసహనం, చిటపటలు, ఏజెంట్లను దుమ్మెత్తిపోస్తూ ఉత్తరాలు…అయినాసరే ఏజెంట్లు అతన్ని సహించేవారు. కారణం-ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద దిగుమతి వ్యాపారుల్లో అతనొకడు. చెల్లింపులు సక్రమంగా జరిపేవాడు. పైగా అతనిప్పుడు వ్యాపారాన్ని ఇంకా విస్తరిస్తున్నాడు. ఇంతవరకూ ఆలివ్ నూనె, నీలిమందు వ్యాపారానికే ప్రధానంగా పరిమితమయ్యాడు. ఇప్పుడు కాటన్, తేయాకు వ్యాపారంలోకి కూడా పెద్ద ఎత్తున అడుగుపెట్టాడు.

1861లో అతను కీలకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాడు. వ్యాపారం బహుముఖాలుగా వృద్ధి చెందింది. ఆ ఏడాదే మూడో సంతానం కలిగింది. ఈసారి కూడా ఆడపిల్లే. వ్యాపారవృద్ధిని దృష్టిలో ఉంచుకుని అమ్మాయికి నడేజ్దా అని పేరు పెట్టారు. ‘ఆశ’ అని ఆ మాటకు అర్థం. 1862-63లో పోలండ్ లో తిరుగుబాట్లు సంభవించి ఆ దేశంతో రష్యా వాణిజ్యాన్ని దెబ్బతీసినా, విచిత్రంగా స్లీమన్ వ్యాపారం మాత్రం అనూహ్యస్థాయిని అందుకుని అతనికి మూడో భాగ్యాన్ని మూటగట్టింది. కాలిఫోర్నియా బంగారం భూముల నుంచి, క్రిమియా యుద్ధం నుంచి గడించిన మొత్తాల కన్నా ఇది చాలా పెద్దది. ఒక్క నీలిమందులోనే పెట్టుబడి మీద 6 శాతం వడ్డీ గిట్టి, 15 లక్షల పౌండ్ల వార్షికలాభం సమకూడింది. తనింక ఎట్టి పరిస్థితుల్లోనూ దివాళా తీయబోనన్న భరోసా అతనికి చిక్కింది.

గృహజీవితం మాత్రం ఎప్పటిలా అశాంతిని రేపుతూనే ఉంది. ఇద్దరి మధ్యా ఎడతెగని కీచులాటలు. వాళ్ళ కలహ కాపురంలో ఇప్పుడు కొత్తగా పిల్లల పెంపకం, చదువు వచ్చి చేరాయి. సెర్గీ లో మంచి చురుకుదనం, తెలివీ ఉట్టిపడుతూ చదువులో బాగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రికి ఎంతో ఇష్టుడూ అయ్యాడు. పిల్లల పెంపకం, చదువే స్లీమన్ కు ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం విరమించడమే కాదు, ఏకంగా రష్యానుంచే పూర్తిగా మకాం ఎత్తేసి జర్మనీ వెళ్లిపోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. భార్యతో విభేదాలు, పంతాలు కూడా అందుకు ప్రేరణ అయ్యాయి.

డ్రెస్డెన్[తూర్పు జర్మనీ నగరం]లో స్థిరపడే ఉద్దేశంతో అక్కడో ఇల్లు కొనుక్కున్నాడు. పిల్లల్ని తీసుకుని వెంటనే డ్రెస్డెన్ కు రమ్మని భార్యకు తంతి మీద తంతి పంపించాడు. ఆమె ససేమిరా రానంది. ‘నీతో దాంపత్యం నెరపాలన్న కోరిక నాకెంతమాత్రం లేదు, నువ్వు ఎవత్తెనైనా ఉంచుకున్నా నాకు అభ్యంతరం లే’దని తెగేసి చెప్పింది. దాంతో అతను బెదిరింపులు ప్రారంభించాడు. తను సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చి పోలీసుల సాయంతో పిల్లల్ని బలవంతంగా తీసుకుపోతాననీ, వాళ్ళను డ్రెస్డెన్ లో ఉంచి జర్మన్ చదువు చదివిస్తాననీ హెచ్చరించాడు. ఓ ఉన్నతాధికారికి కూడా భార్యపై ఫిర్యాదు చేశాడు. కానీ అతని గోడు ఎవరూ వినిపించుకోలేదు. ఏ ఒక్కరి నుంచీ సానుభూతి దక్కలేదు. వట్టి నిరంకుశుడివనీ, తిరుగుబోతువనీ భార్య దుర్భాషలాడింది.

అతను దిక్కు తోచని స్థితిలో పడ్డాడు. అంతలో స్టెఫన్ సొలొవీఫ్ అనే వ్యక్తినుంచి అతనికి రావలసిన ఓ భారీ మొత్తం అందింది. అది చేతిలో పడగానే రష్యానుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. వ్యాపారాన్ని అమ్మేశాడు. కొంత మొత్తాన్ని భార్య పేరున, పిల్లల పేరున పెట్టాడు. తీరా అవన్నీ అయిన తర్వాత అతనికి ఏం చేయాలో తోచలేదు. అయిదేళ్ళ క్రితం ఆగిపోయిన సంచారాన్ని పునఃప్రారంభించడం తప్ప మరో దారేదీ అతనికి కనిపించలేదు. దానికీ ఓ ప్రణాళికంటూ ఏమీలేదు. యాత్రానుభవాలను గ్రంథస్థం చేస్తూ తనో రచయితగా మారితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు. అయితే తన రచనలమీద అతని కేమంత గొప్ప అభిప్రాయంలేదు. తనవన్నీ పైపై రాతలే తప్ప లోతున్నవి కావనీ, అవి పునాదుల్లేని ఇంటిలా కుప్పకూలిపోతాయనీ ఓ సందర్భంలో రాసుకున్నాడు.

1864 ఏప్రిల్ లో ట్యూనిస్(ట్యునీసియా రాజధాని)లో ఉన్నాడు. కార్తేజ్ శిథిలాలను నోరు వెళ్లబెట్టుకుని చూశాడు. ఆ తర్వాత మరోసారి ఈజిప్టును సందర్శించాడు. అక్కడినుంచి భారతదేశానికి వచ్చాడు. ఇక్కడ అతని భాషానైపుణ్యాలేవీ పనిచేయలేదు. ఉర్దూ కానీ, ఇతర భారతీయభాషలు కానీ అతనికి ఆసక్తి కలిగించలేదు. సిలోన్, మద్రాస్, కలకత్తా, బెనారెస్, ఆగ్రా, లక్నో, ఢిల్లీ చూశాడు. హిమాలయ పాదాలదగ్గరికి వెళ్ళాడు. భారత్ లోని విపరీతమైన వేడి, రణగొణధ్వనులు అతన్ని భయభ్రాంతం చేశాయి. సింగపూర్ మాత్రం ఉల్లాసం కలిగించింది. చైనా వెడుతూ మధ్యలో ఆగిన జావా కూడా అతనిలో ఆనందం నింపింది. చైనా యాత్ర సుదీర్ఘంగానూ, తీరుబడిగానూ సాగింది. ఆ దేశం మీద అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కనీసం అక్కడ గొప్ప పండితులు, విద్వత్తును గౌరవించేవారూ ఉంటారని తలపోశాడు.

కానీ చైనా పర్యటన అతనికి నరకం చూపించింది. అక్కడి తిండి, వసతి, దుమ్మూధూళీ, దృశ్యాలు వాసనలు- ప్రతిదీ అతని సహనాన్ని పరీక్షించాయి. చిన్నపాటి రెండు చక్రాల బళ్ళలో ప్రయాణం మరింత కంపరం కలిగించింది. చైనాలో తను కలసుకున్న ఒకే ఒక వ్యక్తిపై మాత్రం డైరీలో ప్రశంసలు కురిపించాడు. అతను చైనాలో స్థిరపడిన ఒక ఆంగ్లేయుడు. పేరు, రాబర్ట్ థామస్. అతను క్రైస్తవప్రచారకుడిగా ఉండేవాడు. తర్వాత మతం మీద నమ్మకం పోయి, చీఫూలోని కస్టమ్స్ హౌస్ దగ్గర దుబాషీగా ఉంటున్నాడు. స్లీమన్ అతన్ని ఇష్టపడడానికి కారణం, తనలానే అతనికీ చాలా భాషలు తెలుసు. రష్యన్, స్వీడిష్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీస్, ఇటాలియన్, జపనీస్, చైనీస్ భాషల్లో ధారాళంగా మాట్లాడగలడు. ఇంకా విశేషం ఏమిటంటే, స్లీమన్ నేర్చుకున్న పద్ధతిలోనే ఇతను కూడా ముందుగా మాటల్ని, వాక్యాల్ని రాసుకుంటూ వాటినుంచి కథలు అల్లుతూ ఈ భాషల్ని నేర్చుకున్నాడు. “వినమ్రత, తెలివీ మూర్తీభవించిన ఈ వ్యక్తి” కాస్త సంపాదన వైపు కూడా దృష్టి పెట్టి ఉంటే మరింత రాణించేవాడని స్లీమన్ రాసుకున్నాడు.

రెండు చక్రాల బండి మీద నానా అవస్థలు పడుతూ 1865 ఏప్రిల్ 30న తీసితిన్ నుంచి రాజధాని పెకింగ్ చేరుకున్నాడు. ఆ ప్రయాణంలో ప్రతి క్షణాన్నీ ఏవగించుకున్నాడు. బండిలో లోపల కూర్చోడానీకీ, నిలబడడానికీ కూడా వీలు కాక ఎక్కువ సేపు బండి మొగ దగ్గర రాట మీద కూర్చునే ప్రయాణం చేశాడు. సాయంత్రానికి పెకింగ్ చేరుకున్నాడు. అప్పటికి అతనిలో సహనమూ పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఆ నగరం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాతిగోడల్ని చూసి ముగ్ధుడయ్యాడు కానీ, లోపలికి వెళ్ళగానే మాత్రం భయపడిపోయాడు. హోటళ్లు లేవు. ఓ బౌద్ధ మఠంలో గది దొరికింది. కిరాయి 12 ఫ్రాంకులన్నారు. గీచి గీచి బేరమాడితే 6 ఫ్రాంకులకు తగ్గించారు. ఆ గదిని చూడగానే నీరుగారిపోయాడు. ఇటుకలతో పేర్చిన పడక. సన్యాసులు నీళ్ళు చల్లడంతో నేల అక్కడక్కడ బురద బురదగా ఉంది. చిన్న చిన్న టేబుళ్లు, స్టూళ్లు. గోడలమీద పెద్ద పెద్ద రాతపత్రాలు వేలాడుతున్నాయి. వాటి మీద చైనా భాషలో కన్ఫ్యూషియస్ సూక్తులు రాసి ఉన్నాయి. ఒక బౌద్ధమఠంలో వాటిని ప్రదర్శించడం అతనికి వింతగా అనిపించింది.

భోజనం కోసం వాకబు చేశాడు. ఈ సమయంలో భోజనం దొరకదని సన్యాసులు చెప్పారు. ఆకలితో, అలసటతో నిద్రలోకి జారిపోయాడు. పొద్దుటే అయిదు గంటలకు నౌకరు వచ్చి లేపాడు. ఓ గిన్నెలో చద్దివాసన కొడుతున్న అన్నం, గ్రీన్ టీ తీసుకొచ్చాడు. వాటిని చూడగానే అతను బిత్తరపోయాడు. దానికితోడు అది ఉప్పులేని చప్పిడి కూడు. టీలో పాలూ, చక్కెరా లేవు. ఇక్కడ పాలూ, చక్కెరా దొరకవని నౌకరు చెప్పాడు.  అతని చేత ఉప్పు తెప్పించుకున్నాడు. చోప్ స్టిక్స్ తో తినడం చేతకాక, వేళ్ళతోనే తీసుకుని తిన్నాడు. కత్తులు, ఫోర్కులే కాదు సరికదా; పాలూ, చక్కెరా కూడా లేకుండా వీళ్ళు ఎలా బతికేస్తున్నారనుకుని ఆశ్చర్యపోయాడు. వట్టి అడవిజనాలనుకున్నాడు.

నౌకర్ని పంపించి గుర్రాలు తెప్పించాడు. రోజంతా నగరంలో తిరుగుతూ గడిపాడు. ఎక్కడబడితే అక్కడ ముష్టివాళ్లు, చెత్త ఏరుకునే వాళ్ళు కనిపించారు. మరణశిక్షలు అమలు చేసే ఓ బహిరంగప్రదేశంలో తెగిపడిన శిరస్సులను చూసి భయవిహ్వలుడైపోయాడు. అర్థంపర్థంలేని అంత్యక్రియల తంతు చూసి విస్తుపోయాడు. కొన్ని దేవాలయాలను దర్శించాడు. వెలిసిపోయి పెచ్చులూడుతున్న దేవుళ్ళ వర్ణచిత్రాలు చూసి పూజార్లను తిట్టుకున్నాడు. దేవుళ్ళకు తొడిగిన పట్టు గౌన్లు చీలికలు పేలికలై దారప్పోగుల్లా వేలాడుతున్నాయి. అట్ట కిటికీలు కూడా ఎక్కడికక్కడ చిరిగిపోయి ఉన్నాయి. చుట్టూ దట్టంగా అల్లుకుపోయిన తీగలు ఆలయం మొత్తాన్నే తినేస్తున్నట్టు అనిపించింది.

మధ్యలో వర్షం పడి వీథులన్నీ బురద బురద అయిపోయాయి. అతనెక్కిన గుర్రానికి అడుగు తీసి అడుగువేయడం కష్టమైపోయింది. దాంతో అతనిలో కోపం నసాళానికి అంటింది.

అప్పటికి చైనా యువ సామ్రాజ్ఞి త్సూ షీ సింహాసనం మీద ఉంది. యాంగ్సీ లోయలో తైపింగ్ తిరుగుబాటు సాగుతోంది. మొత్తం దేశమే విస్తృతమైన మార్పుల దిశగా పయనిస్తోంది. కానీ స్లీమన్ డైరీ రాతల్లో ఆ ఊసు కొంచెమైనా లేదు. అతను పెకింగ్ లో గడిపింది, చూసింది ఒక్కరోజు. ఆ ఒక్క రోజు సందర్శనతోనే ఆ నగరం గురించి అనేక తొందరపాటు నిర్ణయాలు చేసేశాడు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ఊహించుకుంటూ కాగితాలు నింపేశాడు.

ఉదాహరణకు, అతనికా నగరంలో అక్కడక్కడ తెల్ల గ్రానైటుతో నిర్మించిన పేవ్ మెంట్ల తాలూకు శిథిలాలు, ప్రతిచోటా పురాతనకాలపు మురుగు కాల్వల శిథిలాలు, స్తంభాలపై వెలిసిపోయి తునకలు తునకలైన కళాకృతులూ, మట్టిలో సగం కూరుకుపోయిన విగ్రహాలు కనిపించాయి. ఈ నగరంలో అనేకచోట్ల బ్రహ్మాండమైన గ్రానైట్ వంతెనలున్నాయనీ, వాటిలో సగం శిథిలావస్థలో ఉన్నాయనీ ; ఈ శిథిలాలను బట్టి చూస్తే ఒకప్పుడు ఈ నగరంలో రకరకాల నైపుణ్యాలు కలిగిన గొప్ప నాగరికులు ఉండేవారని తెలుస్తుందనీ, ఇప్పుడీ నగరవైభవం అన్ని విధాలా క్షీణించిపోయి, అనాగరికులతో నిండిపోయిందన్నాడు. చప్టా చేసిన పరిశుభ్రమైన వీథులతో, అద్భుత ప్రాసాదాలతో, చక్కని మురుగు నీటి పారుదల వ్యవస్థతో విలసిల్లిన ఈ నగరం ఇప్పుడు మురికి ఓడే చవకబారు ఇళ్లతో తనే ఓ పెద్ద మురుగుకాల్వగా మారిపోయిందన్నాడు. మొత్తానికి నగరం మొత్తం భూమిలో సమాధై తవ్వకాలకు ఎదురుచూస్తున్నట్టు అతనికి కనిపించింది. అన్నింటినీ మించి శిథిలాలపై అతని కున్న మక్కువా, ఆసక్తీ ఈ రూపంలో బయటపడింది.

వాస్తవం ఏమిటంటే పెకింగ్ లో అప్పటికేనాడూ చప్టా చేసిన వీథులు, రాతితో నిర్మించిన మురుగునీటి కాల్వలు, గ్రానైట్ వంతెనలు లేనేలేవు.  చైనా గురించి, చైనీయుల అలవాట్ల గురించి ముందుగా తెలుసుకుని వాటిని సక్రమంగా అర్థం చేసుకుని ఉంటే అతని రాతలో ఇలాంటి పొరపాట్లు దొర్లేవి కావు. ఆ సహనం లోపించడమే అతనిలో సమస్య.  మెరిసిపోయే ప్రాసాదాలు కూడా అతనికి శిథిలాలుగా కనిపించడానికి కారణం, చుట్టూ ఉన్న చెట్ల ఆకులు వాటిని కప్పేయడం. బాహ్యపరిసరాలను సాదాసీదాగా ఉంచుకుని, లోపల అందంగా, కళాత్మకంగా తీర్చిదిద్దడం చైనీయుల అలవాటు. తను నగరంలో తిరిగినప్పటి వాతావరణం, తన అలసట, విసుగు కూడా తన పరిశీలనను ప్రభావితం చేస్తాయని అతనికి తట్టలేదు. తగిన అధ్యయనం, శిక్షణ లోపించడంతో అపోహలను, తప్పుడు అభిప్రాయాలనే నిజమని నమ్మి కాగితం మీద పెట్టడం ఇలాంటి విడ్డూరపు చిత్రణకు దారితీసింది.

ఆ తర్వాత అతను ప్రపంచ వింతలలో ఒకటైన చైనా గోడను సందర్శించాడు. అక్కడో చిన్న దొంగతనానికి కూడా పాల్పడ్డాడు…

(సశేషం)

 

గ్రీకు మద్యం సేవించి మత్తెక్కిపోయాడు!

స్లీమన్ కథ-9

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

1854 శిశిరంలో ఏమ్ స్టడామ్ లో జరిగిన నీలిమందు వేలంలో పాల్గొని అతను రష్యాకు తిరిగొస్తున్నాడు. అప్పుడే క్రిమియా యుద్ధం బద్దలైంది. రష్యన్ రేవులను దిగ్బంధం చేస్తున్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ కు చేరాల్సిన సరకును నౌకల్లో కోనిగ్స్ బర్గ్ కు, మేమల్ కు తరలించి అక్కడినుంచి భూమార్గంలో పంపిస్తున్నారు. ఏమ్ స్టడామ్ లో ఉన్న స్లీమన్ ఏజెంట్ నీలిమందు నింపిన వందలాది పెట్టెల్ని, భారీ పరిమాణంలో ఉన్న ఇతర సరకుల్ని నౌకలో మేమల్ కు పంపించాడు.

స్లీమన్ అక్టోబర్ 3న కోనిగ్స్ బర్గ్ చేరుకుని ఎప్పటిలా గ్రీన్ గేట్ సమీపంలోని ఓ హోటల్ లో దిగాడు. ఉదయం లేవగానే కిటికీలోంచి బయటికి చూశాడు. ఆ హోటల్ ద్వారగోపురం మీద బంగారు అక్షరాల్లో రాసి ఉన్న జర్మన్ పంక్తులపై అతని దృష్టి పడింది.

Vultus fortunae variatur imagine lunae:

Crescit, decresit, constans persistere nescit.

 

The face of fortune varies as the image of the moon

Waxes and wanes, and knows not how to remain constant.

(ఐశ్వర్యపు ముఖం చంద్రబింబంలానే మారిపోతూ ఉంటుంది

పెరగడం, తరగడం తప్ప దానికి స్థిరత్వం తెలియదు.)

ఈ పంక్తులు అతను ఎరిగున్నవే. అప్పుడప్పుడు తండ్రి దగ్గర ఉటంకించేవాడు. తండ్రి కూడా తరచు ఇవే మాటలు కొడుక్కి అప్పగించేవాడు. కానీ ఈసారి మాత్రం ఈ మాటలు ఆశ్చర్యకరమైన ఉధృతితో స్లీమన్ ను తాకాయి.  వాటిలో ఓ హెచ్చరిక ధ్వనిస్తున్నట్టు అనిపించింది.  కచ్చితంగా ఏదో దారుణం జరగబోతోందనుకున్నాడు. వెంటనే టిల్సిట్ కు, అక్కడినుంచి మేమల్ కు బయలుదేరివెళ్ళాడు. ముందురోజు రాత్రి మేమల్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగి అనేక ప్రాంతాలు బూడిదైనట్టు అతనికి మార్గమధ్యంలో తెలిసింది. అతను వెళ్ళేటప్పటికి ఆ నగరమంతా ఇంకా పొగ పరచుకునే ఉంది. తగలబడిన గిడ్డంగులు సెగలు చిమ్ముతూనే ఉన్నాయి.

‘అయిపోయింది… అంతా అయిపోయింది…వందలాది నీలిమందు పెట్టెలు దగ్ధమైపోయాయి… సర్వనాశనమైపోయాను’ అనుకున్నాడు స్లీమన్. అతనికి పిచ్చిపట్టినట్టు అయిపోయింది. వెంటనే తన  ఏజెంట్ దగ్గరకు పరుగెత్తాడు. అతను ఏమీ మాట్లాడకుండా పొగలు కక్కుతున్నవైపు చేయి చూపించాడు.

స్లీమన్ బుర్ర కాసేపు మొద్దుబారిపోయింది. వెర్రి చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అతని ఆలోచనలు పరి పరి విధాలుగా పోయాయి. తను పూర్తిగా దివాళా తీశానని నిర్ణయానికి వచ్చాడు. మళ్ళీ మొదటి నుంచీ ప్రారంభించాల్సిందే ననుకున్నాడు. ఇలా అడుగంటిన ప్రతిసారీ తిరిగి పైకి లేవగలిగానని తనకు తనే ధైర్యం చెప్పుకున్నాడు. కాస్త రుణసాయం చేయమని కోరుతూ తను ష్రోడర్స్ కు ఉత్తరం రాస్తాడు…ఇంటిని, ఎస్టేట్లను అమ్మేస్తాడు…ఇకమీదట కూడుకు, గుడ్డకు సరిపోయేంత అతి తక్కువ ఖర్చుతో ఎలాగో బతికేస్తాడు…!

ఇప్పుడిక్కడ ఉండి చేసేదేమీలేదు, వెంటనే సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్ళిపోయి పరిస్థితిని చక్కదిద్దుకోమని మనసు తొందరపెట్టింది. సరిగ్గా అతను తిరుగుప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో వెనక నుంచి ఎవరో భుజం తట్టారు. వెనుదిరిగి చూశాడు. మేమల్ లో స్లీమన్స్ కు ఏజంట్ గా ఉన్న మేయర్ & కోలో హెడ్ క్లెర్క్ నని అతను పరిచయం చేసుకున్నాడు. అంతకంటే ముఖ్యంగా, నీలిమందు పెట్టెల్లో ఏ ఒక్కటీ నష్టపోలేదనీ, అన్నీ భద్రంగా ఉన్నాయన్న శుభవార్తను చెవిన వేశాడు. అదెలా జరిగిందంటే, నీలిమందుతో నౌకలు మేమల్ చేరిన సమయానికి అక్కడి గిడ్డంగులన్నీ వేరే సరకుతో నిండిపోయి ఉన్నాయి. దాంతో వాటికి కొంత దూరంలో అప్పటికప్పుడు చెక్కతో కొన్ని గిడ్డంగులను ఏర్పాటు చేసి సరకును వాటిలో ఉంచారు. అదృష్టవశాత్తూ మంటలు ఈ తాత్కాలిక గిడ్డంగులదాకా వ్యాపించలేదు!

ఇది వినగానే ముంచెత్తిన సంతోషంతో స్లీమన్ ఉక్కిరి బిక్కిరైపోయాడు. కొన్ని నిమిషాలపాటు నోటి వెంట మాటరాలేదు. ఏదో అదృశ్యశక్తి మరోసారి విధ్వంసం అంచుల నుంచి తనను వెనక్కి లాగిందని అనుకున్నాడు. పట్టలేని ఆనందం అతన్ని పసిపిల్లాణ్ణి చేసింది.

ఇప్పుడు హడావుడిగా సెయింట్ పీటర్స్ బర్గ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. మేమల్ లోనే మకాం పెట్టి తన సరకు అమ్మకాన్ని దగ్గరుండి చూసుకున్నాడు. ఎడాపెడా లాభం చేసుకున్నాడు. ఒక్కోసారి తనకే నమ్మశక్యం కానంత మొత్తాలకు బేరాలు కుదుర్చుకున్నాడు. యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని లాభాలు గుంజుకోడానికి అతను కొంచెమైనా సందేహించలేదు. నీలిమందు, ఇతర అద్దకాలు కాక; తుపాకీమందుకు, తూటాల తయారీకీ వాడే సూరేకారం, గంధకం, సీసం వగైరాలను కూడా అమ్మి భారీగా సొమ్ముచేసుకున్నాడు.  ఇంతకుముందు కాలిఫోర్నియా బంగారు భూములనుంచి అదృష్టాన్ని మూటగడితే ఇప్పుడు క్రిమియా యుద్ధం నుంచి మూటగట్టాడు. 1855 చివరినాటికి అతని సంపద విలువ 10 లక్షల డాలర్లకు చేరింది.

***

ఇతర విషయాల్లో కూడా అతనికి అదృష్టం  కలిసొచ్చింది. ముఖ్యంగా, సంసారజీవితంలోని సంతోషాన్ని ఇప్పుడే మొదటిసారి చవిచూస్తున్నాడు. ఎందుకోగానీ ఎకతెరీనా అతని మీద ఇష్టం చూపించడం ప్రారంభించింది. ఆ ఏడాదే  కొడుకు పుట్టాడు. పేరు, సెర్గీ. కొన్ని మాసాలపాటు భార్యపట్ల కృతజ్ఞతాభావం అతనిలో పొంగిపొర్లింది. జార్ వేసవి విడిది అయిన పీటర్ హాఫ్ కు దగ్గరలో ఒక ఎస్టేట్ తోపాటు భార్యకు నగానట్రా కొనిపెట్టాడు. కొన్నిరోజులు విశ్రాంతిగా గడపడానికి ఫ్రాన్స్ తీసుకెడతానని మాట ఇచ్చాడు.

ఇవే రోజుల్లో అతను పోలిష్, స్వీడిష్ భాషలు నేర్చుకున్నాడు. అంతకు మించిన విశేషం ఇంకొకటుంది. క్రిమియా యుద్ధం అందించిన రెండో భాగ్యానికీ, పుత్రలాభానికీ అదనంగా అతనికి మరో మహత్తరమైన కానుక అందింది. అది, గ్రీకు భాష!

ఫస్టెన్ బర్గ్ లో తను పచారీకొట్టులో పనిచేస్తున్నప్పుడు ఒక తాగుబోతు నోట హోమర్ పంక్తులు విన్నప్పటినుంచీ అతనికి గ్రీకు భాషపై విపరీతమైన ఇష్టం ఏర్పడింది. ఎప్పటికైనా ఆ భాష నేర్చుకోవాలని అప్పుడే అనుకున్నాడు. నాయ్ స్ట్రీలిజ్ లోని జిమ్నాజియంలో సరిగ్గా గ్రీకు క్లాసులోకి అడుగుపెట్టబోతున్నప్పుడే తన చదువుకు విఘ్నం కలగడం అతని మనసులో ఒక వెలితిగా ఉండిపోయింది. అయితే ఈ మధ్యలో పది భాషలు నేర్చుకున్నాడు కానీ; తను అమితంగా ప్రేమించే గ్రీకులోకి తలదూర్చే ధైర్యం చేయలేకపోయాడు. ఆ భాష తనను పూర్తిగా మంత్రించి వశం చేసుకుంటుందని భయపడ్డాడు.

ఇన్నేళ్లలో హోమర్ కు, గ్రీకు హీరోలకు సంబంధించి అనేక భాషల్లో వచ్చిన పుస్తకాలను సేకరించి పెట్టుకున్నాడు కానీ, కావాలనే గ్రీకు పుస్తకాల జోలికి వెళ్లలేదు. వెడితే ఆ భాషలోని హోమర్ రచనలన్నింటినీ కంఠతా పెట్టేవరకూ తను ఇంకే పనీ చేయలేననుకుని వెనకాడాడు. ఇప్పుడా ఖరీదైన వ్యాసంగంలోకి దిగడానికి తగిన తాహతు తనకు వచ్చిందనుకున్నాడు. అయినాసరే, తన వ్యాపారబాధ్యతల్లోకి గ్రీకు మరీ చొరబడకుండా జాగ్రత్త తీసుకుంటూనూ వచ్చాడు.

వారంలో ఆరు రోజులు ఆఫీసుకు అంకితమవుతూనే, ఆదివారాలు మాత్రం రోజంతా ఇంట్లో తన చదువు గదిలో తలుపులేసుకుని అధ్యయనంలో గడిపేవాడు. అప్పుడప్పుడు అధ్యాపకుని పక్కన పెట్టుకునేవాడు. అలా ఆరు ఆదివారాల్లో ప్రాచీన గ్రీకుభాషలో పొడవైన, సంక్లిష్టమైన వాక్యాలు రాయగలిగిన స్థితికి వచ్చాడు. ఆ వెంటనే ఆధునిక గ్రీకులో రాయడమూ నేర్చుకున్నాడు. అతనిలోంచి ఆ భాష ఊటలా ఉబికిరావడం ప్రారంభించింది. ఆ భాష సౌందర్యానికీ, అందులోని స్పష్టతకూ పరవశించిపోయాడు. అంతవరకూ తను ఊహించినదానికంటే కూడా ఉజ్వలంగానూ, అద్భుతంగానూ ఆ భాష తోస్తూవచ్చింది. ఆనందం పట్టలేక, నాయ్ స్ట్రీలిజ్ లో చిన్నప్పుడు తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడికి, హోమర్ మాట్లాడిన ఆ పురాతన భాషలో ఓ పెద్ద ఉత్తరం రాశాడు. అందులో అప్పటివరకూ సాగిన తన జీవితగమనాన్ని వివరించాడు. తీవ్రనైరాశ్యంలో కూరుకుపోయిన చీకటి క్షణాలలో కూడా గ్రీకుభాషలోని పవిత్ర షట్పదులు(షట్పది: ఆరు పాదాలు కలిగిన ‘హెక్సామీటర్’), సోఫొక్లీస్(క్రీ.పూ. 497-406: గ్రీకు సంగీత, నాటకకర్త) సంగీతం తనను “ఉత్తేజశిఖరాలకు ఎత్తేసా”యన్నాడు. “ఆ భాషతో నేను మత్తెక్కిపోయా” ననీ, ఒక భాష ఇంత ఉదాత్తంగా ఉండగలదా అనిపించి ఆశ్చర్యచకితుణ్ణయిపోయాననీ రాశాడు. “ఇతరులు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నాకు మాత్రం గ్రీసుకు గొప్ప భవిష్యత్తు ఉన్నట్టు అనిపిస్తోంది. శాంటా సోఫియాపై గ్రీకు జెండా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అన్నింటికన్నా నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది, మూడు శతాబ్దాల టర్కీ ఆధిపత్యం తర్వాత కూడా గ్రీకులు తమ జాతీయభాషను పదిలంగా కాపాడుకుంటూ ఉండడం” అన్నాడు.

ఎప్పటిలానే అతని ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకపోయాయి. సోఫొక్లీస్ మూలంతో తృప్తిపడకుండా దానిని ఆధునిక గ్రీకులోకి అనువదించితీరాలనుకున్నాడు. ప్లేటో(క్రీ.పూ. 4వ శతాబ్ది: గ్రీకు తత్వవేత్త, గణితశాస్త్రజ్ఞుడు) రాసిన ప్రతి రచననూ, డెమొస్తనీస్(క్రీ.పూ. 384-322: గ్రీకు రాజనీతిజ్ఞుడు, వక్త) చేసిన ప్రతి ప్రసంగాన్నీ తప్పనిసరిగా చదవాలనుకున్నాడు. గ్రీకు పదాల జాబితాలతో, వాక్యాలతో, ఆ భాషలో తనతో తనే జరిపే సంభాషణలతో, సుదీర్ఘమైన స్వగతాలతో నోటుబుక్కులు నింపేశాడు. ప్రసిద్ధమైన నిజ్నీ నొవ్ గ్రాడ్ తిరునాళ్ళకు వెళ్లినప్పుడు, తను బస చేసిన సత్రంలో రాత్రంతా కూర్చుని ఆ తిరునాళ్ళు తనలో రేపిన భావపరంపరను ప్రాచీన గ్రీకులో వర్ణించుకుంటూ వెళ్ళాడు.

ఆ తర్వాత ఆ భాషలో ఆత్మభారాన్ని దింపుకోవడమూ ప్రారంభించాడు. ఉద్రేకం, కర్కశత్వం, డబ్బు యావతో సహా– తన లోపాల జాబితాను తనే రాసుకున్నాడు. మెక్లంబర్గ్ కో, అమెరికాకో; చివరికి డబ్బూదస్కంతో పనిలేకుండా పండ్లు తిని బతికే ఆదివాసులు నివసించే భూమధ్యరేఖా ప్రాంతాలకో పారిపోవాలన్న తన విచిత్రమైన కోరిక గురించి కూడా రాసుకున్నాడు. గొప్ప శ్రావ్యత, సౌందర్యం నిండిన గ్రీకును దేవతల భాషగా అతను జీవితాంతం నమ్మాడు. ఆ భాష అతనికి ఎలా సర్వస్వం అయిందంటే; దానితో గడిపే ఆదివారాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేవాడు. సూట్ కేసులో గ్రీకు పుస్తకాలు నింపుకుని తిరునాళ్ళ వెంట తిరునాళ్ళను చుట్టబెడుతూ భార్యకు దూరంగా సంచారం జరిపే క్షణాలకోసమే జీవించేవాడు.

రెండేళ్లపాటు అతను రాసుకున్న గ్రీకు నోట్సు 35 నోటు బుక్కులకు విస్తరించింది. తన అత్యంత రహస్య ఆలోచనలను కూడా వాటిలో రాసుకున్నాడు. తన అంతరంగంలోని చీకటి కోణాలను బయటపెట్టుకున్నాడు. తనమీద తనే వ్యాఖ్యలు చేసుకున్నాడు. “నాకు తెలుసు, నేనో అల్పబుద్ధిని, పిసినారిని. ఈ డబ్బుపిచ్చి నుంచి, లోభత్వం నుంచి నేను బయటపడాలి. యుద్ధకాలమంతా డబ్బు గురించి తప్ప నేనింకొకటి ఆలోచించలేదు” అని ఒకచోట రాసుకున్నాడు. తనపై తనే అసహ్యాన్ని కుమ్మరించుకున్నాడు. బయటిశక్తులు మాత్రమే తననీ రంధినుంచి బయపడవేయగలవని అనుకున్నాడు. పైకి నైతిక కాఠిన్యాన్ని ప్రదర్శించే తనలో గుప్తంగా స్త్రీచాపల్యం ఎలా ఉందో; తిరునాళ్ళలో అందరు వర్తకుల్లానే తను కూడా తప్పతాగి ఆడవాళ్ళ గురించి అశ్లీల సంభాషణల్లో వాళ్ళతో ఎలా పోటీ పడేవాడో వెల్లడించుకున్నాడు.

రాను రాను అతను ప్రపంచాన్ని గ్రీకు కళ్ళతో చూడడం ప్రారంభించాడు. కాన్ స్టాంటినోపుల్(టర్కీ లోని నేటి ఇస్తాంబుల్) పై తమకే హక్కు ఉందన్న గ్రీకుల వాదనను అతను గట్టిగా సమర్ధించేవాడు. రష్యన్లు కూడా ఆ నగరంపై హక్కును చాటుకునేవారు కనుక స్లీమన్ వైఖరి వాళ్ళకు నచ్చేది కాదు. తన ఉద్యోగుల్లో ఒక్కరైనా గ్రీకుజాతీయుడు ఉండాలని అతను కోరుకున్నాడు. రష్యన్ మాట్లాడగల గ్రీకుజాతీయుని కోసం కొన్ని మాసాలపాటు వెతికాడు. ఒక్కరూ దొరకలేదు. చివరికి ఒక ట్యూటర్ ను పట్టుకున్నాడు. అతని పేరు థియోక్లిటస్ విమ్పోస్. సెయింట్ పీటర్స్ బర్గ్ లో చదువుకున్న విమ్పోస్,  గ్రీక్ ఆర్థడాక్స్ చర్చిలో ప్రీస్టుగా ఉన్నాడు. మంచి స్నేహపాత్రుడు. ఏథెన్స్ యాసలో స్వచ్ఛమైన గ్రీకు మాట్లాడగలడు.

నేరుగా స్లీమన్ చదువు గదిలోకి వెళ్ళి పుస్తకాలను తిరగేసే చొరవ ఉన్న అతి కొద్దిమందిలో అతనూ ఒకడు. స్లీమన్ ఆదివారాల్లో ఇచ్చే సాయం విందులకు విమ్పోస్ తోపాటు మరికొందరు పండితులు హాజరయ్యేవారు. అలా వాళ్లమధ్య గడుపుతున్నకొద్దీ ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతానికో పారిపోవాలన్న కోరిక స్లీమన్ లో అడుగంటుతూవచ్చింది. ఎంతైనా తనొక యూరోపియన్ ననీ, సాధ్యమైనంత త్వరగా వ్యాపారాన్ని వదిలేసి  శేషజీవితాన్ని పండితునిగా గడపాలనీ ఇప్పుడు అనుకుంటున్నాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి పూర్తిగా నిష్క్రమించి జర్మనీలోని ఓ పెద్ద యూనివర్సిటీలో చేరి చదువుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశాడు. అయితే ఏ ఒక్క విద్యార్హత కానీ, శిక్షణ కానీ లేని తనను చేర్చుకుంటారా అన్న సందేహం కలిగి ఆ ఆలోచనను పక్కన పెట్టేశాడు. ఓ వ్యవసాయక్షేత్రాన్ని కొనుక్కుని శాస్త్రవిజ్ఞాన ఆసక్తులకు అంకితమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన మళ్ళీ బుర్రను తొలవడం ప్రారంభించింది. రైన్ నది వెంబడే ఓ వ్యవసాయక్షేత్రం కోసం గాలిస్తున్నానని 1856 జూలైలో ఓ మిత్రుడికి ఉత్తరం రాశాడు. అయితే ఆ ఉత్తరం రాయడానికి కొన్ని వారాలముందు మరో మిత్రుడికి ఉత్తరం రాస్తూ; తను ప్రపంచాన్ని చూసింది తక్కువనీ, మొత్తం ప్రపంచమంతా చుట్టిరావాలనుకుంటున్నాననీ, ఒక రచయితగా రాణించగలనేమో ఆలోచిస్తున్నాననీ రాశాడు.

వ్యాపారాన్ని ఇక కట్టిపెట్టాలని 1857లో గట్టిగానే అనుకున్నాడు. అయితే సరిగ్గా అప్పుడే యూరప్ ఆర్థికసంక్షోభంలో చిక్కుకుంది. దాంతో అతను వ్యాపారాన్ని పొడిగించకతప్పలేదు. ఎన్నో విదేశీ కంపెనీలు దివాళా తీసాయి. లండన్, పారిస్, హాంబర్గ్, ఏమ్ స్టడామ్ ల నుంచి తనకు రావలసిన బకాయిలు 30 లక్షల టేలర్ల మేరకు పేరుకుపోయాయి.  ఉన్నదంతా పెట్టుబడి పెట్టిన తను ఈ దెబ్బతో చితికిపోయానని అనుకున్నాడు. అంకెలు తారుమారుచేసీ, పెద్ద పెద్ద ప్రమాదాలకు ఎదురొడ్డీ; ముఖ్యమా, కాదా అని చూడకుండా వ్యాపారం తాలూకు ప్రతి కోణాన్నీ స్వయంగా పర్యవేక్షించీ వ్యాపారం మూలపడకుండా చూసుకోగలిగాడు.

1858 ప్రారంభానికి గండం గట్టెక్కి స్థిమితపడ్డాడు. ఇక ఇప్పుడు గ్రీస్ ను సందర్శించే సమయం వచ్చిందనుకున్నాడు.

                                                                                                                          (సశేషం)

 

 

 

 

 

వివాహం జరిగింది…విషాదం మిగిలింది

స్లీమన్ కథ-8

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, అష్ట్రఖాన్ కాలర్ తో లాంగ్ కోటు, తార్తార్ తరహా మీసకట్టు, చేతిలో నల్లమద్దికర్రతో చేసిన బెత్తం…విజయశిఖరాలకు ఎగబాకిన ఒక వ్యాపారవేత్తకు ముమ్మూర్తులా సరిపోయే వేషం అతనిది!

[అష్ట్రఖాన్ కాలర్:  నైరుతి రష్యాలో, ఓల్గా డెల్టాలోని ఒక నగరం అష్త్రఖాన్. ఇక్కడి ‘కేరకుల్’ గొర్రెలు మంచి బిగువైన, వంకీలు తిరిగిన ఉన్నికి ప్రసిద్ధి. కొన్ని రోజుల వయసు మాత్రమే ఉన్న గొర్రెనుంచి తీసిన ఉన్ని మరింత శ్రేష్ఠం.  పిండదశలో ఉన్నప్పుడే ఉన్ని తీయడమూ జరుగుతుంటుంది. అలాంటి ఉన్నితో చేసిన కాలర్ ను అష్ట్రఖాన్ కాలర్ అంటారు. ఆ కాలర్ తో కోటు ధరించడాన్ని సంపన్నవర్గాలు హోదాకు, ప్రతిష్టకు చిహ్నంగా భావిస్తాయి]

అతనికి సొంత గుర్రపు బండి ఉంది. సువిశాలమైన అతని నివాసం, సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఓ అత్యుత్తమ వీధిలో ఉంది. అందులో రెండు డ్రాయింగ్ రూములు, ఏడు పడగ్గదులు, అయిదు ఇతర గదులు, ఓ పెద్ద వంటగది, గుర్రపుశాల, ఓ పెద్ద నేలమాళిగ, గుర్రపు బండి ఉంచడానికి ఒక గ్యారేజి…! అత్యంత శ్రేష్ఠమైన అన్ని రకాల మద్యాలూ ఆ నేలమాళిగలో అందుబాటులో ఉంటాయి. ఎంతో ఖరీదు చేసే మూడు జాతిగుర్రాలు ఆ గ్యారేజిలో సిద్ధంగా ఉంటాయి.

అతను కాలిఫోర్నియా బంగారం భూములనుంచి ఓ పెద్ద సంపదను కొల్లగొట్టుకొచ్చాడన్న ప్రచారం నగరమంతటా మోతెక్కిపోయింది. దాంతో, సాహసికుడైన ఈ వ్యాపారవేత్తనుంచి ఆహ్వానం అందుకోడానికి రాచకుటుంబీకులు, వ్యాపార ప్రముఖులు తహతహలాడారు.  అతనిలో డాబుకూ, దర్పానికీ లోటులేదు. ఉన్నతవర్గాలలో కలసిపోవడానికి అవసరమైన నాజూకు పద్ధతులను అప్పటికే అలవరచుకున్నాడు. ఒక్కోసారి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. ఒకే ఒక్క అతిథి గదిని అలంకరించడానికి ఓసారి వెయ్యి రూబుళ్ళు వెచ్చించాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ మొత్తంలో అతనంత అదృష్టవంతుడు, అంత స్నేహయోగ్యుడు ఇంకొకరు లేరని అందరూ అనుకుంటున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్షుడు కాదగిన వాళ్ళ జాబితాలో అతని పేరు కూడా ఉంది!

ఇదంతా పైకి కనిపించే మనిషి గురించి. కానీ లోపలి మనిషి వేరు. ఇద్దరి మధ్యా పోలిక లేదు. అతని లోపల జ్వాలలు రేగుతున్నాయి. తీరని లైంగికేచ్ఛ అతనికి పిచ్చెక్కిస్తోంది. ఇల్లు అమరింది కానీ, ఇల్లాలు, పిల్లల కోసం తపిస్తున్నాడు. గతంలో ఓసారి ఎకతెరీనా లిషిన్ ముందు పెళ్లి ప్రతిపాదన చేశాడు. అప్పటికే తను సంపన్న వర్తకులలో ఒకడు. కానీ లిషిన్ ఇష్టపడలేదు. అయినా అతనిలో ఆశ చావలేదు.

Ikaterina Lishin

సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చిన మరునాడే ఆమె ఇంటికి వెళ్ళాడు.  ఆ తర్వాత కూడా కొన్ని వారాలపాటు తరచు ఆమెను కలసుకుంటూనే వచ్చాడు. రాను రాను ఆమెను తను గాఢంగా ప్రేమిస్తున్నట్టు అనిపించింది. తన జీవితాంతం ఆమెను ప్రేమిస్తూనే ఉండాలని కూడా అనుకున్నాడు. మంచితనం, దయ, నిరాడంబరత, ఏం చెప్పినా శ్రద్ధగా వినే తత్వం సహా తను కోరుకునే సుగుణాలు అన్నీ ఆమెలో అతనికి కనిపించాయి. తన ఇంట్లో ఉన్నా, వర్తకప్రముఖుల ఇళ్ళల్లో విందు వినోదాలలో పాల్గొంటున్నా ఆమె ఒకే తీరుగా నిండుకుండలా ఉంటుందనుకున్నాడు. అతనామెను అమితంగా ఆరాధించాడు. ఆమె సంతోషం కోసం ఏమైనా చేస్తానని వాగ్దానం చేశాడు.

ఆమె పెళ్ళికి ఒప్పుకుంది!

ఆ క్షణంనుంచీ అతను భూమికి ఆమడ ఎత్తున ఊరేగాడు. 1852 అక్టోబర్ 12- పెళ్లిరోజున ఇంటికి ఇలా ఉత్తరం రాశాడు:

ఈరోజు ఎకతెరీనా లిషిన్ అనే ఒక రష్యన్ యువతికి భర్తనయ్యే సంతోషం నాకు దక్కింది. శారీరకంగా, మానసికంగా కూడా నా భార్య ఓ పరిపూర్ణస్త్రీ. మంచితనం, నిరాడంబరత, తెలివి, వివేకం మూర్తీభవించినది. ఆమెపై నా ప్రేమ, గౌరవాలు రోజు రోజుకీ ఇనుమడిస్తున్నాయి. ఈ సంతోషభరితమైన వివాహాన్ని పురస్కరించుకుని జీవితాంతం సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను.

అయితే, తన వివాహం గురించిన ఇంత అందమైన ఊహా ఇసుకగూడు కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. “ఈ పెళ్లి పూర్తిగా ఒక తప్పుడు నిర్ణయం. నాకిప్పుడు పిచ్చెక్కేలా ఉం”దని…ఆ తర్వాత కొన్ని వారాలకే తోబుట్టువులకు ఉత్తరం రాశాడు. కొంతమందిలో కోరికల మంట మృదువుగా, కనిపించీ కనిపించని జ్వాలలా ఉంటుందనీ, కానీ నాలోని తీరని కోరికల మంట దావాగ్నిలా మారి నన్నే దహించివేస్తోందనీ ఆవేదన చెందాడు.

భార్యనుంచి అనురాగపు వెచ్చదనాన్ని ఆశించాడు. కానీ ఆమె దేనికీ లొంగని జడపదార్థం అయింది.  అంతమంది రష్యన్ యువతుల నుంచి తను ఏరికోరి వరించిన ఈ యువతి; స్త్రీ సహజమైన ఎలాంటి సున్నితత్వమూ, స్పందనా లేని పరమ గయ్యాళి అతనికి అర్థమైంది. అతనితో పడకను పంచుకోవడానికి ఆమె నిరాకరించింది. మాటి మాటికీ అతన్ని సూటిపోటి మాటలతో హింసిస్తూవచ్చింది. ఆమె కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందనీ, తను చస్తే ఆస్తిని ఎగరేసుకుపోవడానికి చూస్తోందనే భావన అతనిలో బలపడిపోయింది.

మిన్నా మెయింక్ తో అతని ప్రేమ, పెళ్ళికి దారితీయలేదు. ఎకతెరీనా లిషిన్ తో పెళ్లి, ప్రేమకు దారితీయలేదు. మొత్తానికి ప్రేమా, పెళ్లీ…రెండూ అతనికి కలసి రాలేదు!

ఈ పెళ్లి అతనికి ఎంతటి ఆఘాతం అయిందంటే; సలహాను, ఓదార్పునూ కోరుకుంటూ తోబుట్టువులతోపాటు మిత్రులకు కూడా వరసపెట్టి ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. అయితే ఎవరి నుంచీ ఎలాంటి ఓదార్పూ దొరకలేదు. “నువ్వన్నట్టు ఎకతెరీనాకు నీ మీద ప్రేమ లేదనే అనుకుందాం. అయినాసరే నిన్ను పెళ్లాడిన మేరకు ఆమె తన జీవితాన్ని త్యాగం చేసిందన్న వాస్తవాన్ని నువ్వు మరచిపోకూడదు” అని ఏమ్ స్టడామ్ నుంచి ఒక మిత్రుడు రాశాడు. “బహుశా ఆమె మరీ అంత చెడ్డది కాకపోవచ్చు, నీ పిసినారితనం చూసి భయపడి ఉంటుంది, ఆమె పట్ల మరింత ఉదారంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఆమె నీపై ప్రేమాభిమానాలు చూపవచ్చు”అని  సలహా ఇచ్చాడు. తోబుట్టువుల నుంచి వచ్చిన స్పందన కూడా ఇదే ధోరణిలో ఉంది. “నువ్వో పెద్ద జడపదార్థానివి కనుకే నీ భార్య అలా అయుంటుంది, కాస్త మనిషిలా ప్రవర్తించడం నేర్చుకొ, నువ్వు ఒకరికి ప్రేమ ఇస్తేనే ప్రేమ పొందగలుగుతా”వని హితవు చెప్పారు.

అయితే, మనిషిగా జీవించడం ఎలాగో నేర్పే స్కూలు ఏదీ అతనికి దొరకలేదు!

దాంతో చేసేది లేక పూర్తిగా తన వ్యాపారప్రపంచంలో కూరుకుపోయాడు. ఆ ప్రపంచానికి తనే యజమాని. అక్కడ ఎలా వ్యవహరించాలో, ఎలా రాణించాలో అతనికే బాగా తెలుసు, ఎవరూ నేర్పనక్కర్లేదు.

స్వభావరీత్యానే అతనిలో ఓ జూదగాడు ఉన్నాడు. రష్యాకు తిరిగొచ్చాక తన సంపదనంతటినీ నీలిమందు వ్యాపారం మీద పెట్టేసాడు. మార్కెట్ ను తనే నియంత్రించే స్థాయికి వెళ్ళాడు. పెళ్ళైన కొన్ని వారాలకే మాస్కోలో తన కార్యాలయ శాఖను తెరిచి దాని నిర్వహణ బాధ్యతను మిత్రుడు అలెగ్జీ మద్వీవ్ కు అప్పగించాడు. ఇప్పటికీ రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేస్తున్నాడు. ఇంటికి వెళ్లడం చాలా అరుదైపోయింది. ఎప్పుడూ ధుమధుమలాడుతూ పెడసరపు మాటలతో నొప్పించే భార్యకు ఎదుట పడడానికి జంకి, సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన ముఖ్యకార్యాలయంలోనే ఎక్కువగా గడుపుతున్నాడు. మధ్య మధ్య దేశదిమ్మరిలా రష్యా చుట్టివస్తున్నాడు.

మనసుకింత ఆనందాన్నీ, విశ్రాంతినీ కలిగించే ఇతరేతర ఆసక్తులేవీ అతనికి లేకుండా పోయాయి. చిన్నప్పటినుంచీ తను అభిమానిస్తూ వచ్చిన హోమర్ కూ; గ్రీకు, రోమన్ పురాతన చరిత్రకూ కూడా దూరమైపోయాడు. ఇప్పుడతనికి పూర్తిగా వ్యాపారమే మత్తుమందూ, వ్యసనమూ  అయిపోయింది. క్రోన్ స్టట్ షిప్పింగ్ జర్నల్  ప్రతులను తండ్రికి పంపడంలో మాత్రం ఆనందం పొందేవాడు. అందులో; వచ్చి పోయే సరకు రవాణా నౌకల పేర్లు; ఆ సరకు యజమానులు, దానిని అందుకోబోయే వాళ్ళ పేర్లు ఉంటాయి. వాటన్నింట్లోనూ హెచ్. స్లీమన్ & కోకు నీలిమందు తీసుకువెడుతున్న నౌకల జాబితాయే పెద్దది. 1853లో ఆ కంపెనీకి పదమూడు నౌకల్లో నీలిమందు రవాణా జరిగినట్టు, ఆ కంపెనీ నుంచి మూడు నౌకలు బయటికి వెళ్ళినట్టు అప్పటి నివేదిక చెబుతోంది.

అయితే ఇది పాక్షిక సమాచారం మాత్రమే. ఇంకా వేలాది వాహనాల్లో కోనిగ్స్ బర్గ్ నుంచీ, మేమల్ నుంచీ అతని కంపెనీకి సరకు రవాణా అవుతుండేది. తన వ్యాపార పరిమాణం ఇప్పుడు నెలకు పది లక్షల సిల్వర్ రూబుళ్లనీ, అంతూపొంతూ లేకుండా అది ఇంకా పెరుగుతూనే ఉందనీ, డబ్బు సంచుల మీద డబ్బు సంచులు, బంగారం మీద బంగారం వచ్చిపడుతున్నాయనీ తండ్రికి ఉత్తరం రాశాడు. అయినాసరే, జీవితంలో తను కోరుకున్న సంతోషం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించని సంగతినీ బయటపెట్టుకున్నాడు.

వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతజీవితం గడపాలన్న పాత కల ఇప్పుడు కొత్తగా తిరగబెడుతోంది. అయితే ఒక తేడా: మెక్లం బర్గ్ కు బదులు అమెరికా వెళ్ళిపోయి, అక్కడో వ్యవసాయకభూమిని కొనుక్కుని అక్కడే ఉండిపోవాలని  ఇప్పుడు అనుకుంటున్నాడు. “పల్లె జీవితాన్నే నేను ఎక్కువ ఆనందించగలననిపిస్తోంది. వ్యవసాయంలోనూ, దానిని అభివృద్ధి చేసుకోడంలోనూ చేతినిండా పని ఉంటుందనే నేను నమ్ముతున్నాను” అని అమెరికాలోని ఓ మిత్రుడికి రాశాడు.

నిజానికి ఒక వ్యవసాయదారునిలో ఉండవలసిన లక్షణాలేవీ అతనిలో లేవు. ముఖ్యంగా విత్తు నాటి అది పంట అయ్యేవరకూ ఓపికగా ఎదురుచూడడం అతనివల్ల కాదు. ఉరుకులూ పరుగుల జీవితం అతనిది. ఊపిరి సలపనంత వేగంగా నిరంతరం పని చేస్తూ ఉండవలసిందే. రోజులో ఏ కొన్ని క్షణాలైనా వ్యాపార సంబంధమైన పనిలో గడపకపోతే అతనికి వల్లమాలిన కోపం వస్తుంది. వ్యవసాయం గురించిన ఊహల్లో మరోసారి మునిగి తేలుతున్న ఈ రోజుల్లోనే తండ్రికి ఉత్తరం రాస్తూ, “ఇక వ్యాపారం కట్టిపెట్టి ప్రశాంత జీవితం గడపమని మంచి ఉద్దేశంతోనే నువ్వు సలహా ఇచ్చావు కానీ, దానిని నేను పాటించలేను. క్షణం తీరిక లేని కార్యకలాపాల్లో కూరుకుపోవడానికి నేను అలవాటు పడిపోయాను. ఎలాంటి అనుకూల పరిస్థితుల్లోనైనా సరే, కాస్సేపు స్తబ్ధంగా గడిపితే పిచ్చాసుపత్రిలో చేరాల్సివస్తుంది” అన్నాడు.

అప్పటికే అతను ఒక్కొక్కసారి పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఉద్యోగులు, పనివాళ్లు ఏ చిన్న పొరపాటు చేసినా ఆగ్రహంతో ఊగిపోతూ కేకలు లంకించుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఏజంట్లు తన ఆదేశాలను వెంటనే అమలు చేయనప్పుడు వాళ్ళకు రాసే ఉత్తరాల్లో కూడా ఓ రాక్షసుడిలా విరుచుకుపడుతున్నాడు.

అమెరికాకు పారిపోవాలన్న ఊహ అతన్ని వెంటాడుతూ వచ్చింది పెళ్ళైన ప్రారంభ సంవత్సరాలలో! అయితే, 19వ శతాబ్ది మధ్యకాలంలో రష్యాలో ఉంటూ అమెరికా కలలు కనడమంటే విధ్వంసాన్ని కొని తెచ్చుకోవడమే. ప్లేటో (క్రీ.పూ. 428-348)సృష్టించిన ఊహాద్వీపం ‘అట్లాంటిస్’లానే అప్పటికింకా అమెరికా చాలామంది దృష్టిలో ఒక పౌరాణిక ఊహా ప్రదేశమే. అక్కడి జనం సంపూర్ణ స్వేచ్ఛతో జీవిస్తూ ఉంటారు. కోపమూ, క్రౌర్యమూ నిండిన అధికారవర్గపు నిఘా చూపుల కింద నిరంతరం జీవించే దుస్థితి వారికి ఉండదు. దోస్తోయెస్కీ రాసిన ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవలలో స్విద్రిగైలోవ్ అనే పాత్ర అమెరికా వెళ్లాలని ఎప్పుడూ కలలు కంటూ ఉంటాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ శీతాకాలం రోజున అతను ఓ పెద్ద అధికార భవనం దగ్గర తచ్చాడుతూ ఉంటాడు. ఆ భవనం కాపలాదారుకూ, అతనికీ ఇలా సంభాషణ జరుగుతుంది:

schliemann

కాపలాదారు: ఇక్కడ నీకేం పని?

స్విద్రిగైలోవ్: అవును, నాకిక్కడ పనేం లేదు.

కాపలాదారు: అయితే ఎందుకొచ్చావ్?

స్విద్రిగైలోవ్: వెళ్లిపోతున్నాను.

కాపలాదారు: ఎక్కడికి?

స్విద్రిగైలోవ్: అమెరికాకు.

కాపలాదారు:  అబ్బో, అమెరికాకే!?

స్విద్రిగైలోవ్ రివాల్వర్ తీస్తాడు. కాపలాదారు నిర్ఘాంతపోతాడు.

కాపలాదారు: వద్దు, వద్దు, నువ్విక్కడ ఇలాంటి పని చేయకూడదు. ఏం, వేళాకోళంగా ఉందా?

స్విద్రిగైలోవ్: నేను చేస్తున్నది మంచిపనే.

కాపలాదారు: కాదు, కచ్చితంగా కాదు.

స్విద్రిగైలోవ్: ఇందువల్ల ఎవరికీ ఎలాంటి అపకారం లేదు. ఇదీ మిగతా చోట్ల లాంటిదే. వాళ్ళు నిన్నేమైనా ప్రశ్నిస్తే, అతను అమెరికా వెడుతున్నాడని చెప్పు.

స్విద్రిగైలోవ్ రివాల్వర్ ను తన కణతలకు గురిపెట్టుకున్నాడు.

కాపలాదారు: వద్దు, వద్దు, ఆ పని చేయద్దు. ఇది నిజంగానే తగిన చోటు కాదు.

స్విద్రిగైలోవ్ ట్రిగ్గర్ నొక్కాడు.

రష్యన్ సాహిత్యం మీద కానీ, అక్కడి తాత్విక వాతావరణంలో సంభవిస్తున్న కల్లోలం మీద కానీ స్లీమన్ ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. కాకపోతే రష్యన్ భావోద్రేకాలలో అనివార్యంగా అతనూ పాలుపంచుకుంటున్నాడు. రష్యన్లలానే అతను కూడా అమెరికా తరహా స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. కాలిఫోర్నియాలో కొన్ని మాసాలపాటు దానిని చవి చూశాడు కూడా. అదే సమయంలో రష్యన్లలానే అమెరికా జీవన విధానాలను కొన్నింటిని ఏవగించుకుంటున్నాడు. అమెరికా గురించిన కలల్ని తన ఉత్తరాలలో అతను యధాలాపంగా ప్రస్తావిస్తూ రావడం వెనుక వివాహ వైఫల్యం తాలూకు విషాదం ఉంది.

ఇప్పుడైతే వ్యాపారం ఒక్కటే అతన్ని పట్టుకుని నడిపిస్తోంది. ఆందోళనతో అప్పుడప్పుడు ఉన్మాదం అంచులు తాకుతూ, భార్యను ద్వేషిస్తూ, ఏజంట్లతో గొడవ పడుతూనే; తన ఆవర్జాల(లెడ్జర్లు)ను ముందేసుకుని కూర్చోడంలో భద్రతను, ఓదార్పును పొందుతున్నాడు. సంపద పెరుగుతున్న కొద్దీ, అతనికి దాని అవసరం తగ్గిపోతోంది. అయినప్పటికీ, అతనికి ఉనికీ, ఊపిరీ అన్నీ వ్యాపారమే అయింది. అదే అతని ధ్రువతార. అతని చూపు పడిన ప్రతిదీ లాభంగా మారాల్సిందే. చాలా అరుదైన తీరిక సమయాల్లో మాత్రం తండ్రికి, తోబుట్టువులకు ఉత్తరాలు రాస్తూ, వాటిలో నీతులూ, నిత్యసత్యాలూ బోధిస్తూ, అన్నింట్లోనూ మితంగా జీవించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఉపశమనం పొందేవాడు. అతని ఉత్తరాల్లో తప్పనిసరిగా పుల్ల విరుపు ధోరణి ఉండేది. అయినాసరే, అతను పంపే స్వల్ప మొత్తాలకు వాళ్ళు ప్రతిసారీ కృతజ్ఞతలు చెప్పేవారు. ఓసారి తండ్రికి ఇలా ఉత్తరం రాశాడు:

నీ ఖాతాలో 500 టేలర్లు జమ చేయమని ఈరోజే పోస్ట్ లో ఉత్తర్వులు పంపించాను. హైన్ రిచ్ స్లీమన్ తండ్రిగా నీ హోదాకు తగినట్టు డేంజింగ్ లోని నీ కొత్త నివాసంలో అన్ని హంగులూ సమకూర్చుకోడానికి వినియోగిస్తావన్న అత్యంత ఆశాభావంతో ఈ మొత్తం పంపుతున్నాను.

ఈ డబ్బును పంపడంలో నా ఉద్దేశం, నీ ఇంట్లో చక్కని పరిశుభ్రతను పాటిస్తూ, భవిష్యత్తులో ఒక యోగ్యుడైన సేవకుణ్ణీ, యోగ్యురాలైన సేవకురాలినీ నువ్వు నియమించుకునితీరాలనే. నీ పళ్లేలూ, పాత్రలూ, కప్పులూ, కత్తులూ, ఫోర్కులూ అన్నీ శుభ్రంగా, మెరిసిపోతూ ఉండాలనీ; ఇంటి నేలను వారానికి మూడుసార్లు శుభ్రంగా కడిగిస్తావనీ, ఇప్పటి నీ వయోభారానికి తగినట్టుగా టేబుల్ మీదే భోజనం చేస్తూ ఉంటావనీ ఆశిస్తున్నాను.

కోట్లకు పడగెత్తిన అతని ఆదాయంతో పోల్చితే తండ్రికి పంపిన ఈ 500 టేలర్లు చిల్ల పెంకులతో సమానం. అదలా ఉంచితే, ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టకుండా తన వ్యాపారాన్ని శాఖోపశాఖలుగా అతను విస్తరిస్తున్నాడు. జార్ కొత్త శిక్షాస్మృతిని జారీ చేయబోతున్నట్టు అతనికి తెలిసింది. దాని ముద్రణకు తప్పనిసరిగా మంచి నాణ్యమైన కాగితం వాడతారనీ, వేలాది ప్రతులు అచ్చువేస్తారనీ అతనికి వెంటనే స్ఫురించింది. దాంతో అందుబాటులో ఉన్న నాణ్యమైన కాగితాన్ని కొనేసి ప్రభుత్వానికి అమ్మజూపాడు. ప్రభుత్వం అతని ప్రతిపాదనను అంగీకరించింది.

అయితే, అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యమూ కుప్పకూలి, అతన్ని మళ్ళీ బికారిగా మార్చగల భయోద్విగ్నక్షణాలూ త్వరలోనే ఎదురయ్యాయి…

                                                                                                                         (సశేషం)