భూమి గుండ్రమో, బల్లపరుపో…!

వరవరరావు

vv.karaభూమి గుండ్రంగా తిరుగుతుందని చెప్పిన శాస్త్రజ్ఞుని సత్యాన్వేషణదారిలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది విద్యార్థులు, అధ్యాపకులు భూమి తదితర ప్రకృతి సంపదలు, గనులు, కార్ఖానాలు, ప్రజలు ` పరస్పర సంబంధాల గురించి అధ్యయనం చేసి – ప్రకృతి –  ప్రజల పరంగా చూసినపుడు ఇపుడు జరుగుతున్నదంతా విధ్వంసక అభివృద్ధి అనే నిర్ధారణకు వచ్చారు. వాళ్ల అధ్యయనం తెలుగులో పుస్తకరూపంలో వచ్చినపుడు ముందుమాట రాస్తూ నేనూ పతంజలి వ్యంగ్యాన్ని ఆశ్రయించాను. ‘పతంజలి నవలల్లో చర్చ ముగిసి భూమి గుండ్రంగా కాక బల్లపరుపుగా ఉంటే బహుశా ఈ ప్రజాసమూహాలు చీమలవలె ఈ భూగోళం మీంచి కృత్రిమ జలప్రళయంలో, ఖనిజ భూకంపంలో విస్థాపన, విధ్వంసం అయి వుండేవారు కారేమో’ అని.

‘గోపాత్రుడు’ (1992)లో చర్చ ఇరుపక్షాల దొమ్మీలో ముగిసింది. మెజిస్ట్రేట్‌ భూమి బల్లపరుపుగానే వున్నదని తీర్పు ఇచ్చాడు. అయితే ఆయన భూమి గుండ్రంగా ఉందని సత్యజ్ఞానంతోనే వున్నాడుగానీ ఈ భూమిమీద వ్యవస్థ సత్యజ్ఞానంతో లేదుగనుక ఆ నిర్ణయానికి వచ్చాడు.

‘‘మన జ్ఞానానికి సార్థకత లేదు. మన విశ్వాసాలమీద మనకు విశ్వాసం లేదు. మన విలువలమీద మనకు గౌరవం లేదు. మన దేవుడిమీద మనకు భక్తి లేదు. మన నాస్తికత్వం మీద మనకు నమ్మకం లేదు. మనమీద మనకు గౌరవం లేదు. మనతోటి వాళ్లమీద మనకు మమకారం లేదు. మన ప్రజాస్వామ్యం మీద మనకు అవగాహనగానీ, గురిగానీ లేదు. మన జ్ఞానానికీ, విశ్వాసానికీ పొంతనలేదు. విశ్వాసానికీ, ఆచరణకీ పొందిక లేదు. భూమి బల్లపరుపుగా ఉన్నపుడు మాత్రమే ఇలాంటి జీవితం కళ్లబడుతుంది. మన భూమి బల్లపరుపుగా వున్నదిగనుకనే మన సమాజం ఇలావుంది.’’

ఈ విషయాన్ని ఆయన పుస్తకాల్లో చదివి తెలుసుకోలేదు. జీవితాన్ని పరిశీలించి నిర్ధారించుకున్నాడు.

మరి గోపాత్రుడు తండ్రికి భూమి బల్లపరుపుగా ఉందని ఎందుకనిపించింది? అతడు అటువంటి బతుకు బతికాడుగనుక. అతడు వైద్యుడుగా చెలామణీ అయ్యాడు. వైద్యమంటే ఏమిటో తెలియకుండానే మహావైద్యుడనిపించుకున్నాడు. జడ్డీపెట్టెలో తాటాకు పుస్తకాలు ఉన్నాయి. కాని అందులో ఏవుందో నరమానవుడికి ఎవరికీ తెలియదు. అది రాసిన అతని తాతయ్యకే తెలియదు…  ‘అందులో ఏవో ఉన్నాయని వూరందరూ అనుకున్నంత కాలమే నువ్వు సెలామణి అవుతావు అది గుర్తుపెట్టుకో. నోటు రాయని బాకీలు ఎగ్గొట్టీ…. నోటురాసిన బాకీలు వొచ్చేజన్మలో మానాయనే తీరుస్తాడని చెప్పు… నేను చచ్చి, దయ్యాన్నై నీకు చేదోడు వాదోడుగా ఉంటాన’ని హితబోధ చేసిన సందర్భంలో ‘మరో సంగతి భూమి గుండ్రంగా వుందిన ఎవరైనా సెప్పితే నమ్మొద్దు. భూమి బల్లపరుపుగా… నేను పడుకున్న మంచంలాగుంటుంది. మరిసిపోవద్దు.’ అని చెప్పాడు. ఇది సత్యశోధనలో వచ్చిన జ్ఞానం కాదు.

‘ఈ సంగతి మా నాయిన పోయేముందు నా సెవులో చెప్పి మరీ పోయాడు. మా తాత యీ రహస్యం మా నాయిన చెవిలో చెప్పి చచ్చిపోయాడట – నువ్వు కూడ నీ కొడుక్కు ఈ రహస్యం చెప్పాల….’ ఇది సత్యాన్వేషణలో పొందిన జ్ఞానం కాదు. వారసత్వ సంచిత స్వార్థ ప్రయోజనజ్ఞానం. కనుకనే రహస్యంగా వారసత్వంగానే అందించబడుతుంది.

ఇంక అక్కడినుంచీ ఇరుపక్షాలకూ స్వార్థప్రయోజనమే  రెండుపార్టీలుగా చీలడానికి కారణం తప్ప భూమి గుండ్రంగా వున్నదని అంటున్నవాళ్లంతా వెనుకటికి  మేజిలెన్ వలె పరిశోధనచేసి తేల్చుకున్నవాళ్లు కాదు. ఇపుడు పార్లమెంటులో భూఆక్రమణ బిల్లు మీద రెండు పార్టీలు తమ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు చీలి ప్రతిష్ఠంభన ఏర్పడుతుందో, అధికారంలో వున్న పార్టీ పడిపోతుందో అనిపించి – చివరకు అంతా ఒకటైపోయినట్లు.

అట్లా ఒకటి కాకపోతే పోలీసోడు అందరినీ బొక్కలో తోసి ఒకటి చేస్తాడు. ఇప్పుడు పోలీసంటే ప్రపంచ పోలీసు  అమెరికా.

‘భూమి గుండ్రంగా లేదు. భూమి బల్లపరుపుగా కూడ లేదు. భూమి నా టోపీలాగుంటది. భూమి పోలీసోడి  లాఠీ లాగుంటాది తెలిసిందా?’ అని అడిగి తెలీకపోతే మళ్లా ఒకసారి గదిలోకొచ్చి తెలిసేట్లు చేస్తానంటాడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌.

అయితే ఇన్‌స్పెక్టర్‌కున్న విశ్వాసాన్ని కూడ తాత్కాలికంగా మెజిస్ట్రేట్‌ వమ్ముచేసాడు.

‘ఇదేం న్యాయం, నల్లగౌనేసుకున్నోడి నమ్మకం తీర్పయిపోయి, మిగిల్నోల్ల నమ్మకాలు విలువలేకుండా ఎలాపోతాయి?’… ఇందులో ఏదో మత్లబు ఉన్నది.

అది డిఎస్పీ సిఐకి అర్థం చేయించాడు. సిఐ కుట్రకేసుల మీద కుట్రకేసులు బనాయించి అందులో మెజిస్ట్రేట్‌నే సాక్షిని చేసి ఇరికించాడు. సెషన్స్‌జడ్జి ‘‘ఒకవేళ కుట్రకేసంటూ పెడితే నీమీదే పెట్టాలని నాకు అనిపిస్తున్నదయ్యా’’ అన్నాడు. ఎందుకంటే మెజిస్ట్రేట్‌ తన పరిధి దాటి జీవితంవైపు తొంగిచూసాడు. ‘‘ప్రజాజీవితం పోలీసువారి చేతుల్లో సుఖంగా, శాంతంగా, చల్లగా ఉందని, భూమి ఒకవేళ బల్లపరుపుగా ఉన్నాకూడ పోలీసువారు దాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పిండిలాగ కలిపి, గుండ్రంగా చేయగలరని నేను నమ్ముతాను… మున్సఫ్‌ మేజిస్ట్రేట్‌గా నీ నమ్మకంకన్నా సెషన్స్‌జడ్జిగా నా నమ్మకానికి ఎక్కువ విలువుంటుంది గదా. అప్పుడేమంటావు?’’

‘‘కేసులు పరిష్కరించు. అదే నీ పని. జీవితాన్ని పరిష్కరించే బాధ్యత మనది కాదు’’ అని మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌కు హితబోధ చేసి సెషన్స్‌జడ్జి గారు కుట్రకేసుల కట్ట అందుకున్నారు.

హితబోధలో పోలీసుల శక్తి సామర్థ్యాలు ఏపాటివో ఆ సంగతి మేజిస్ట్రేట్‌కే కాకుండా పోలీసులకు కూడ జడ్జిగారు గుర్తుచేసారు గనుక సి.ఐ. తటాలున లేచి కుట్రకేసులన్నీ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు.

అయితే 92లో పతంజలి ఈ నవల రాసేనాటికే పోలీసోడి పవరూ, మెజిస్ట్రేటు పవరూ – ఆ మాటకొస్తే పిలకతిరుగుడు పువ్వు (95)లో సెషన్స్‌జడ్జి పవరూ, శాసనసభ, ప్రభుత్వపాలన, న్యాయవ్యవస్థ, మీడియా అన్నిటి పవరునూ శాసించే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మన దేశంలో నూతన ఆర్థికవిధానాల రూపంలో వచ్చింది. మీడియాకు సంబంధించిన పవరును ‘పిలకతిరుగుడుపువ్వు’లో కొంత, ‘పెంపుడు జంతువులు’లో వివరంగా పతంజలి చెప్పే ఉన్నారు.

‘పిలకతిరుగుడుపువ్వు’ 1995 ఇండియాటుడే సాహిత్య ప్రత్యేకసంచికలో అచ్చయింది. అప్పటికి సాధారణ ప్రజలు పోలీసుగా గుర్తించే రాజ్యాంగయంత్రం కూడ ప్రపంచబ్యాంకు ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే స్థితి మనదేశంలో వచ్చింది.

ఇరవయ్యేళ్లు గడిచిపోయాయి. పతంజలి నవలల్లోని ఫ్యూడల్‌ భూస్వామ్యం, పోలీసు వ్యవస్థగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రాజ్యాంగయంత్రం, సాపేక్ష స్వాతంత్య్రం కలిగి ఉంటుందనుకునే న్యాయవ్యవస్థ,  ప్రజాస్వామ్యానికి నాలుగోస్తంభమనుకునే మీడియా అన్నీ కార్పోరేటు ప్రయోజనాలు నెరవేర్చే దళారీలుగా మారిపోయాయి. ఇప్పుడు భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా లేదు. పోలీసుటోపీ లాగ లేదు. లాఠీలాగ లేదు.

సరుకుగా ఉన్నది. మార్కెటు సరుకుగా ఉన్నది. ఇప్పుడది ఆలమండ దొమ్మీకేసులోని సమస్యగా లేదు. ఇది మామూలు దొమ్మీకేసుగా కాక ప్రత్యేక దొమ్మీకేసుగా మున్సిఫ్‌మెజిస్ట్రేట్‌ గుర్తించినట్లుగానే ఇరవయ్యేళ్లు పోయాక మనం దీనిని పార్లమెంటు ముందు ఉన్న భూఆక్రమణబిల్లుగా గుర్తించాల్సి ఉన్నది. అదీ పతంజలి దూరదృష్టి, ముందుచూపు.

భూమి పోలీసుటోపీ లాగ ఉన్నదనుకున్నపుడు అధికారబలం, అది కూడ లాఠీలాగ ఉన్నదనుకున్నపుడు కండబలం – అందువల్ల వచ్చిన అధికారబలం అనుకునే సామాన్యజ్ఞానం (స్వతంత్రం వస్తే హెడ్డ్‌ బదిలీ అయిపోతాడా అనే ‘కన్యాశుల్కం’లోని జట్కావాని సమస్య వంటిదే) నుంచి వ్యవస్థగా చూసినపుడు మనం ఒక సంక్లిష్టజ్ఞానంలోకి కళ్లు తెరవాల్సి ఉంటుంది. అది వేమన చెప్పిన ఎవరైనాసరే ‘పసిడిగల్లవాని బానిసకొడుకులు’. ఆ పసిడి ఇవ్వాళ భూమి. గర్భంలో పసిడిమాత్రమే కాక సమస్త విలువైన ఖనిజాలు ఉన్నందువల్ల, మార్కెట్లో సరుకయినందువల్ల అది భూమితో సంబంధమున్న ప్రజల చేతినుంచి భూస్వామి చేతినుంచి ఇపుడు కంపెనీల చేతిలోకి వెళ్లిపోయింది. వెళ్లిపోతున్నది. కనుక భూమి గుండ్రంగా ఉన్నదో బల్లపరుపుగా ఉన్నదో కంపెనీవాడు నిర్ణయించేదే సత్యం. అందాకా ప్రజలు గుండ్రంగా ఉన్న భూమిమీద చీమలవలె పడిలేస్తూ పోరాడుతూ ఉండాల్సిందే.

~

 

 

సముద్రానికి కోపం వచ్చింది!

 varavara.psd-1

సముద్రానికి కోపం వచ్చింది. నేను చాల ఇష్టపడే సముద్రానికి. నను ప్రేమించిన సముద్రానికి.

సముద్రానికి కోపం వచ్చింది. నీళ్లను ఆక్రమించినవాళ్ల మీద. తీరాన్ని దోచుకున్నవాళ్ల మీద. ఇసుక తోడుతున్నవాళ్ల మీద. చెట్లు కొట్టేసే మనుషుల మీద కోపం వచ్చి చెట్లన్నీ ఊడ్చేసింది. గాలికి తలుపులు మూసుకునే వాళ్ల తలుపులు విరగదన్నింది. మనుషుల్ని పెద్ద మనసుతో క్షమించి ఆస్తుల్ని ధ్వంసం చేసింది.

సముద్రానికి కోపం వచ్చింది. నేను నిష్కారణంగా నవయవ్వనం నుంచి ప్రేమిస్తున్న సముద్రానికి. నేను తనలో ప్రకృతినీ, మనిషినీ పోల్చుకుని ప్రేమించిన సముద్రానికి.

నేనింకా ఎం.ఎ. లో, తాను బి.ఎ. లో ఉండగా నేనూ నా ప్రాణస్నేహితుడు పిచ్చిరెడ్డీ జీవితంలో ముగ్గుర్ని చూడాలనుకున్నాం – చలం, శ్రీశ్రీ, సముద్రం. మా పిచ్చి భరించలేని స్నేహ బృందం మూడూ కలిసొచ్చేలా 1961లో మమ్మల్ని అరుణాచలం పంపించారు. అప్పుడు మొదటిసారి మద్రాసు సముద్రాన్ని చూసాం. శ్రీశ్రీని ఆయన ఇంట్లో చూసాం. చలాన్ని రమణస్థాన్ లో.

సముద్రాన్ని దాని సార్థక అర్థంలో శ్రీశ్రీ అరవై ఏళ్ల సభలో 1970లో విశాఖలో చూసాను. ఇంక అప్పటినుంచీ విశాఖ సముద్రం నన్ను ఆవహించింది. సీసాండ్స్, సిరిపురం క్వార్టర్స్, ఏరాడ కొండ, భీమ్లీ, విజయనగరం, శ్రీకాకుళం దాకా బీచ్ రోడు. హెమింగ్వే ‘ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ ని తలపించే చలసాని ప్రసాద్ నలభై నిమిషాలు ఈదిన లాసన్ బే పాయింట్ భయం గొలిపే సుడిగుండం దరి. విరిగిపడుతున్న కెరటాల మధ్యన రాళ్లపై కూర్చొని ‘సముద్రం’ చదువుతూ దృశ్యీకరించుకోవాలని తీర్చుకున్న కోరిక.

సముద్రం ఒక భావన నుంచి నాలో అక్షరాకృతి దాల్చడం 1981లో ప్రారంభమైంది. కలకత్తా నుంచి వచ్చి విశాఖలో దిగి సీసాండ్స్ లో కృష్టక్కతో చెప్పి ఒక్కణ్నే సముద్రం దగ్గరికి వెళ్లి మధ్యాహ్నం దాకా కూర్చున్నాను.

నేను చూసివచ్చిన సముద్రం ఊసేమని చెప్పనూ

నా రక్తం ప్రతిధ్వనిస్తున్న సముద్ర నిశ్వాసాన్నీ

నా ఊపిర్లు ప్రతిస్పందిస్తున్న సముద్ర విశ్వాసాన్నీ విను.

విచిత్రంగా రెండవసారి ఉస్మానియా రీసర్చ్ స్కాలర్స్ హాస్టల్ లో గుడిహాళం రఘునాథం రూంలో సముద్రం నన్ను ఆవహించింది. మా మేనల్లుడు కొండన్న (రామగోపాల్), ఇంకా కొందరు విద్యార్థులు కలిసి అర్ధరాత్రి గడిచాక తార్నాకకు వెళ్లి ఎప్పటివలెనే చాయ్ తాగి వస్తున్నాం. ఎబివిపి వాళ్లు చూపింది నన్నయితే, నా వెనుక బ్యాచ్ లో వస్తున్న రీసర్చ్ స్కాలర్ రామకృష్ణపై కత్తితో దాడి చేసారు దుండగులు. అది మాకు హాస్టల్ కు చేరాకగానీ తెలియలేదు. ఆ రాత్రంతా సంచలనం. హల్ చల్. నేను రఘునాథం రూంలో పడుకున్నాను. పడుకోలేదు.

గదిలో కూర్చొని సముద్రాన్ని రాయబోతే

కాళ్ల కింద నీళ్లు

సముద్రపు మంటలాగ కళ్లల్లో నీళ్లు

ప్రజాసముద్రపు బాధల్లాగ.

‘శ్రీకాకుళాన్ని నెమరేసే కరీంనగర్ లాగ’ అని వాచ్యం అయిపోయావు అన్నాడు ఆ తర్వాత కాలంలో శివసాగర్. అది సముద్రం 2 ‘అగాథ సముద్రం’.

1982 ఆగస్టు నాటికి సముద్రం నన్ను మనిషయి ఆవహించింది.

‘సముద్రం నా వ్యసనమైంది.

సముద్రం నా గాయం, నా అవ్యక్త గేయం’ అయింది.

కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో పులి అంజయ్య నాయకత్వంలో రాడికల్స్ కూ ఎబివిపికీ ఘర్షణలు. బయట నర్సంపేట, నల్లబెల్లిల నుంచి హనుమకొండ కుమార్ పెల్లి దాకా జన్ను చిన్నాలు స్ఫూర్తి కేంద్రంగా రాడికల్స్ కూ సిపిఎం వగైరా రాడికల్ వ్యతిరేక శక్తులకూ ఘర్షణల మధ్య నా కాలేజికి రాకపోకలు మాత్రమే కాదు, ఇంట్లో ఉండడం కూడ ఉద్రిక్తంగా మారిన రోజుల్లో రాసిన కవిత ‘సముద్రం నా తీరం.’

‘నేను సముద్రంలోనే ఉన్నాను’ కాని ‘నేనింకా సముద్రాన్ని కాలేకపోతున్నాను.’

భూమిహారులు నన్ను సముద్రంలో పోల్చుకున్నారు

యుద్ధం నేను ఏ పక్షమో తేల్చుకుంది

సముద్రం ఆటుపోట్లలోని

అలను నేను కలను నేను కలతను నేను

గొప్పశాంతి కోసం మహా సంక్షోభంలో

స్వేచ్ఛను కోల్పోయిన సముద్రాన్ని నేను

సముద్రం స్వేచ్ఛలో సత్యమైన స్వేచ్ఛలో

స్వేచ్ఛను వెతుక్కుంటున్న నీటి చుక్కను నేను (సముద్రం -5)

మళ్లీ అటువంటి మానసిక స్థితిలోనే ఇవ్వాళ నన్ను ‘సముద్రం’ ఆవహించింది.

1977లో దివిసీమలో ఉప్పెన వస్తే డాక్టర్ రామనాథం నాయకత్వంలో మేం వెళ్లాం. ఆయనతోపాటు వెళ్లిన మనుషుల, పశువుల డాక్టర్లు నెలరోజులపాటు అక్కడ శిబిరాలు నిర్వహించారు. ఆ వివరమైన రిపోర్ట్ ‘సృజన’ ప్రచురించింది.

అప్పటికి ప్రభుత్వానికి ‘కల్లోలిత ప్రాంతాలు’ ప్రకటించడం, ఎన్ కౌంటర్లు చేయడం, ఎమర్జెన్సీ పెట్టడం తెలిసినంతగా ఉప్పెనకూ తుపానుకూ మధ్య ఉండే తేడా ఏమిటో తెలియదు. అందువల్ల వేలాదిమంది మరణించారు. కాని మత్స్యకారులు సాహసోపేతంగా ఉప్పెనతో పోరాడి వందలాది మందిని బతికించారు. ప్రజలు పోరాడి హక్కులు సాధించుకున్నారు.

ఇప్పటి ప్రభుత్వాలు ఎన్ కౌంటర్ల నుంచి కోవర్టు హత్యల దాకా తెలివిమీరాయి. అప్రకటిత ఎమర్జెన్సీ అచిరకాలం అమలు చేయడం నేర్చుకున్నాయి. సముద్రంలో తాము సృష్టించిన సంక్షోభానికి ‘హుదూద్’ అని పేరు పెట్టి పక్షిమీదికి తోసేయడం నేర్చుకున్నాయి. మనుషుల్ని అప్రమత్తుల్ని చేసి కాపాడిన పొగడ్తలు తెచ్చుకున్నాయి.

అప్పుడూ ఇప్పుడూ మనుషులు, సామాన్య మానవులు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో పరస్పర స్నేహ సహకారాలతో తమను తాము సంరక్షించుకుంటున్నారు.

ఏమున్నది సముద్రం

నీళ్లూ ఉప్పూ ఉప్పెనా తప్ప

ఏమున్నది జీవితం

చీమూ నెత్తురూ పోరాటం తప్ప.

– వరవరరావు

‘అరె దేఖో భాయి – చంద్రుడు కూడ జైల్లోనే ఉన్నాడు!’

varavara.psd-1

మొదటిసారి 1973 అక్టోబర్ లో ఆంతరంగిక భద్రతా చట్టం కింద అరెస్టయినపుడు వరంగల్ జైల్లోనే ఉన్నందువల్లనో, నేను రోజూ కాలేజికి పోతూ వస్తూ చూసే జైలు అయినందువల్లనో, నేనూహించుకున్నంత భయంకరంగానూ, ఇరుకుగానూ, మురికిగానూ జైలు లేనందువల్లనో, నాకేకాదు, నన్ను వారంలో కనీసం రెండుసార్లు కలవడానికి వచ్చే నా సహచరి హేమలతకు కూడ, ‘మీకిక్కడ కష్టంగా ఉందా’ అని అడగాలనిపించలేదు.

రెండవసారి, 1974 మే 18న అరెస్టయిన తీరే భయం గొలిపేదిగా ఉంది. ఉధృతంగా రైల్వే సమ్మె జరుగుతున్నది. అందులో కాజీపేట – డోర్నకల్ లైనంతా సమ్మె వెనుక సూరపనేని జనార్దన్ నాయకత్వంలోని విప్లవ విద్యార్థులు, రైల్వే కార్మికులు, విప్లవోద్యమాన్ని బలపరిచే అన్ని ప్రజాసంఘాలు, విరసం ఉన్నాయి. మా ఇంట్లో ‘జైళ్లు రైళ్లను నడపగలవా?’ కరపత్రాలు ఉన్నాయి. అప్పటికే సృజన ఆ శీర్షికతో ఒక రైల్వే కార్మికుని కవిత ప్రచురించి, అదే శీర్షికతో సంపాదకీయం రాసిన మేడే సంచిక వెలువడింది. కనుక అరెస్టు రైల్వే సమ్మె గురించే అనుకున్నాం.

మరొకవైపు మా మూడవ పాప పుట్టి ఇరవై రోజులయింది. తల్లి 104 డిగ్రీల జ్వరంతో మంచంపై ఉంది. నన్ను కాజీపేట పోలీసు లాకప్ లో పెట్టి, ఆ ఊళ్లో టీచర్ గా పనిచేస్తున్న మా రాగవులన్నయ్య అన్నంతెస్తే ఇవ్వడానికి నిరాకరించి ఎస్ ఐ ఆయననూ నన్నూ బండబూతులు తిట్టాడు. అంతకుముందే ఎస్పీ నన్ను అరెస్టు చేసి తన ఇంటికి తీసుకరమ్మని, షార్ట్స్ వేసుకొని, చేతిలో హంటర్ తో, రెండు ఆల్సేషియన్ కుక్కలను పెట్టుకొని, నన్ను నిలబెట్టి చాల అవమానకరంగా మాట్లాడి ఉన్నాడు. అక్కడినుంచి ఆ రాత్రే ఇంకో ముక్కు మొహం తెలియని మనిషితో కలిపి హైదరాబాదు సిసిఎస్ కు తెచ్చారు. మే 20వ తేదీన సికిందరాబాదు పదవ మెజిస్ట్రీట్ కోర్టులో మా ఇద్దరినే కాకుండా సిసిఎస్ లో మాతోపాటు కలిపి ఉంచిన చెరబండరాజు, ఎంటి ఖాన్, ఎం రంగనాథంలను, తిరుపతి నుంచి తెచ్చిన త్రిపురనేని మధుసూదనరావును హాజరుపరచినప్పుడు గానీ తెలియలేదు – మామీదనే కాదు కెవి రమణారెడ్డితో పాటు కొండపల్లి సీతారామయ్య, కెజి సత్యమూర్తి మొదలైన వారితో కలిపి మామీద సికిందరాబాదు కుట్రకేసు పెట్టారని, నాతో తెచ్చిన వ్యక్తి పేరు గోపాల రెడ్డి – ఊరు రామాయంపేట అని. కెవి రమణారెడ్డి గారు అప్పుడు మద్రాసులో ఉన్నారు గనుక అరెస్టు కాలేదు.

కోర్టు నుంచి ముషీరాబాదు జైలుగా పిలవబడే సికిందరాబాదు జైలుకు పంపించారు. మొదటిసారి వలె ఇది ముందస్తు డిటెన్షన్ కాదు. కనుక రాజకీయ ఖైదీలకుండే వసతులుండవు. పైగా బెయిల్ పిటిషన్ వేస్తే జస్టిస్ చెన్నకేశవరెడ్డి అనే హైకోర్టు జడ్జి ‘వీళ్లమీద ఉరిశిక్షలు వేయదగిన, లేదా ప్రవాసం పంపించదగిన రాజద్రోహం, చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చే నేరపూరిత కుట్ర, రాజ్యంపై యుద్ధం, పేలే ఆయుధాలు కలిగి ఉండడం, హత్య, హత్యాప్రయత్నం వంటి సెక్షన్లు ఉన్నాయి గనుక ఇవ్వన’ని బెయిల్ నిరాకరించాడు. పత్రికలు ఇవి ప్రముఖంగా ప్రచురించాయి. సహజంగానే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసారు.

ఈ స్థితిలో నన్ను మొదటిసారి చూడడానికే నా సహచరి నలభై రోజుల తర్వాత రాగలిగింది. అందుకని మొదటి ప్రశ్న ‘ఇక్కడ కష్టంగా ఉందా?’ అని. నేనేమో వసతి, సౌకర్యాలు పట్టనంత విప్లవ సహచర సాంగత్యంలో ఉన్నాను. సాహిత్యం, రాజకీయాలు, చర్చోపచర్చలు జరిపి, పాడి, హాస్యాలాడుకొని విప్లవ స్వప్నాల్లో మునిగిపోతాం. రోజులెట్లా గడిచిపోతున్నాయో తెలియడం లేదన్నాను. ‘అయితే మీకిక్కడ సుఖంగా ఉందా?’ అని అడిగింది. రెండు నెలల పసిపాపను వేసుకొని బస్సులో పడివచ్చిన తన అసహాయ నిష్ఠురం అందులో ఉంది. ఆరోజు 1974 జూన్ 27 రాత్రి రాసిన కవిత ఇది.

ఇందులోని ‘కవిమిత్రుడు’ మేమంతా ఖాన్ సాబ్ గా పిలుచుకునే ఎంటి ఖాన్. కుటుంబాలతో ఇంటర్వ్యూలు జరిగిన రాత్రి ఖైదీలెవరైనా అన్యమనస్కంగా తమ ప్రపంచంలో ఉంటుంటారు. ఆ రాత్రి నిద్రపట్టదు. అది తెలిసిన పెద్దమనసు ఖాన్ సాబ్ ది. మనసు మళ్లించడానికి, ఆహ్లాదపరచడానికి ‘అరె దేఖో భాయి – చంద్రుడు కూడ జైల్లోనే ఉన్నాడు. మనం నయం. ఆయనైతే ముళ్లతీగల్లో చిక్కుకొని ఉన్నాడు’ అని తేలికపరచే ప్రయత్నం చేసాడు. జైళ్ల లైవ్ వైర్ల (ప్రాణాంతక తీగెల) మీద శాంతి కపోతాలు చిక్కుపడతాయి. నిద్రకూ ఆశ్రయానికీ వెలియైన పేద పోలీసులు జైళ్లను కాపలా కాస్తుంటారు. అయినా గంటగంటకూ ఆవులిస్తూ ‘సబ్ ఠీక్ హై’ అని ఒంటరి సెంట్రీ ప్రకటిస్తుంటాడు.

–          వరవరరావు

-సెప్టెంబర్ 1, 2014

రక్తంలో డ్రమ్స్ మోగించే ఊరేగింపు!

Vv_writing

“ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహి నగర్ లో అక్టోబర్ 1970 దసరా రోజు సాగిన విప్లవ రచయితల సంఘం ఊరేగింపు యీనాటికీ నాకు కళ్లకు కట్టినట్లుగా రక్తంలో డ్రమ్స్ ను మోగిస్తుంది… ఒక చిన్న పోరాట రూపంగా ఊరేగింపు నాకనిపిస్తుంది.

ఉపన్యాసాలు మనిషిని వేదికి మీదికి తీసుకపోతే ఊరేగింపులు మనుషుల్లోకి తెస్తాయి. సంకోచం, బెట్టు, సిగ్గు, పోజ్, ఇన్హిబిషన్స్, కాంప్లెక్సులన్నీ పటాపంచలు చేసి పెటీబూర్జువా వయ్యక్తిక ఆలోచనల నుంచి గుంపు మనస్తత్వంలోకి, మంది ఆలోచనల్లోకి తెచ్చే డీక్లాసిఫయింగ్ లక్షణం ఊరేగింపుకు ఉన్నది.”

1974 జనవరిలో నా మూడవ కవితా సంకలనం ‘ఊరేగింపు’ వెలువడినపుడు నేను రాసుకున్న మాటలివి. ఇవ్వాళ ఖమ్మం వర్తక సంఘం హాల్ – వర్తక సంఘం హాల్ గానే మిగిలిందో, ఇంకా రూప సారాలు మార్చుకున్నదేమో గాని ఆనాడు మాకు అది పాణిగ్రాహినగరే. నీరుకొండ హనుమంతరావు రూపుకట్టిన పాణిగ్రాహి నగర్. నేనింకా ఆ హాల్ ముందు ఆయనతోనూ, రావెళ్ల వెంకటరామారావు తోనూ, ‘కౌముది’తోనూ ఊరేగింపు ముగిసిన శరద్రుతు సంధ్యాకాలం అస్తమిస్తున్న అరుణకాంతుల్లో ఉద్వేగంగా పరిచయం చేసుకుంటున్న జ్ఞాపకం.

అంతకుముందు నేనేమైనా ఊరేగింపుల్లో పాల్గొన్నానా? 1952-53లో ముల్కీ ఉద్యమం రోజుల్లో హనుమకొండ మర్కజీ విద్యార్థిగా మొదటిసారి క్లాసు బాయ్ కాట్ చేసి పాల్గొన్నాను. కనుక వ్యక్తిత్వం వికసించే క్రమంలో కలిగే తొలి అనుభవం ఏదైనా హృదయానికి హత్తుకుని ఎన్నటికీ చెరగని ముద్ర వేసినట్లుగా ఖమ్మం ఊరేగింపు ఎప్పుడూ నా జ్ఞాపకాల్లో కదం తొక్కుతూనే ఉంటుంది.

అప్పటికిప్పటికి వందల వేల ఊరేగింపుల్లో పాల్గొని ఉంటాను. ఒక అనుభవం – అధిక ధరలకు వ్యతిరేకంగా 1973 ఆగస్టులో వరంగల్ పోచమ్మ మైదానం నుంచి సుబేదారి కలెక్టరాఫీసుకు సాగిన వేలాది మంది ఊరేగింపు. మా ఊరేగింపులో మఫ్టీలో పాల్గొని, మాకన్న ఆవేశపూరితమైన నినాదాలిచ్చి, డిఐజి ఆఫీసు ముందుకు రాగానే మమ్మల్ని ఎంచుకొని లాఠీ చార్జ్ రూపంలో చితుకబాది పడేసిన అనుభవం.

varavara.psd-1

మరొక మరపురాని ఊరేగింపు కరీంనగర్ లో రైతుకూలీ సంఘం రెండవ మహాసభల సందర్భంగా 1983లో సాగిన ఊరేగింపు నాతో ‘భవిష్యత్తు చిత్రపటం’ రాయించింది. అంతకన్న చరిత్రాత్మకమైనది 1990 మే 6 న వరంగల్ జగదీశ్ నగర్ నుంచి కాజీపేట దగ్గు రాయలింగు, గోపగాని ఐలయ్య నగర్ దాకా సాగిన సుదీర్ఘమైన లక్షలాది మంది ఊరేగింపు. సందర్భం రైతుకూలీ సంఘం మహాసభలు. పద్నాలుగు లక్షల మంది పాల్గొన్న సభలు. ఊరేగింపు నక్కలగుట్ట దాకా వచ్చిన తర్వాత నేను, చలసాని ప్రసాద్ వచ్చి మిమ్మల్ని తీసుకపోతాం – అని కాళోజీకి మాట ఇచ్చాం. కాని ఆ ఊరేగింపు నుంచి ఎంత ప్రయత్నించీ బయటికి వెళ్లలేకపోయాం. అంత గొప్ప అవకాశం మావల్ల కోల్పోయినందుకు కాళోజీ కన్ను మూసేదాకా ఆ విషయం గుర్తుకు వస్తే మమ్ములను తిట్టేవాడు.

హైదరాబాదులో చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా టిడిపి తప్ప మిగతా పార్టీలు, ప్రజాసంఘాలు అన్నీ కలిసి చేసిన ఊరేగింపులో విరసం క్రియాశీలంగా పాల్గొన్నది. బషీర్ బాగ్ చౌరస్తాలో నేను, విమల మొదలైన సభ్యులం చూస్తుండగానే మా కళ్లముందే పోలీసు ఫైరింగ్ జరిగి ఊరేగింపు చెల్లాచెదరైంది. కళ్లల్లో నిండిన గంధకధూమం పొగలు, కసి, కన్నీళ్లతో బయటపడడమే కష్టమైపోయింది.

ఇంక కాళోజీ శతజయంతి, విరసం 44వ మహాసభల సందర్భంగా 2014 జనవరి 11న హనుమకొండ అంబేడ్కర్ భవన్ నుంచి ఆర్ట్స్ కాలేజి ఆడిటోరియం దాకా ఊరేగింపు బీటలు వారిన నేల పులపుల మొలకెత్తిన అనుభవం. నమ్మలేని పునరాగమనం. ప్రతి అడుగూ అమరుల నెత్తుటితో తడిసిన బాట.

–          వరవరరావు

 

ఈ జనరేషన్ జనరేటర్ లోంచి జన్మించిన విద్యుత్తు…

varavara.psd-1

‘రాత్రి’ కవితా సంకలనానికి తర్వాత, ‘దిగంబర కవులు’ కు ముందు, 1965లో రాసిన కవిత జీవనాడి.

‘రాత్రి’ కవితా సంకలనాన్ని ‘దిగంబర కవులు’కు కర్టెన్ రైజర్ అంటాడు చలసాని ప్రసాద్. ఇపుడాలోచిస్తే 1962 నుంచి 1965 దాకా దేశం రెండు యుద్ధాలు చూసింది – భారత-చైనా యుద్ధం, భారత – పాకిస్తాన్ యుద్ధం. మొదటిది మనం ఎన్నడూ గెలవలేమని తెలిసి తెచ్చిపెట్టుకున్నది. రెండవది ఎపుడయినా సరే గెలుస్తామనే గీరతో చేసింది. ఈ రెండూ దేశంలో మధ్యతరగతి, బుద్ధిజీవులను కవులతో సహా దేశభక్తి పూనకలో పడేసినవి. తెలుగు కవుల్లో కె. వి. రమణారెడ్డి, సి. విజయలక్ష్మి తప్ప ఎవరూ మినహాయింపు కారు. ‘స్వప్నలిపి’ లోనే కవిత్వాన్ని అనుభవించే అజంతా కూడ చైనా యుద్ధ సందర్భంలో ‘జెండాలకు కన్నీళ్లు లేవు’ అని ఫక్తు రాజకీయ కవిత రాశాడు. ఆ వాతావరణంలో కమ్యూనిస్టు పార్టీ చీలిక (1964) ఒక కుదుపుకు కారణమైంది. అటు శ్రామికవర్గంలోను, ఇటు యువతరంలోను ఒక అశాంతి నుంచి ఒక ఆన్వేషణ ప్రారంభమైంది. అది వ్యవస్థ మీద, ఎస్టాబ్లిష్ మెంట్ మీద, రివిజనిజం మీద అసహనం నుంచి, ఆగ్రహం నుంచి ఒక ఆశావాదంతో మానవావిష్కరణ కోసం తెగుతున్న సంకెళ్ల స్వరం.

కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు ‘అగ్నిశిఖలు -మంచుజడులు’, కేశవరావు ‘ఉదయించని ఉదయాలు’, ఎ రాఘవాచారి ‘మానవుడా’ దీర్ఘకవిత ఇంచుమించు వెనుకా ముందుగా ఇదేకాలంలో వచ్చాయి. వీళ్లే తర్వాతి కాలంలో మహాస్వప్న, నగ్నముని, జ్వాలాముఖి పేర్లతో ‘దిగంబరకవులు’లో చేరారు.

హైదరాబాదులొ దిగంబరకవులు, వరంగల్ లో ‘తిరుగబడు’ కవులు, విశాఖపట్నంలో సాగర గ్రంథమాల, యజ్ఞం, తిరుపతిలో రాడికల్స్ తలెత్తడానికి ముందుకాలం. శ్రీకాకుళం గిరిజనుల్లో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, రాములు అనే మరో టీచర్ తో కలిసి గిరిజన సంఘాలు పెదుతున్న కాలం. నవత కవిత్వ పత్రిక ఆగిపోతూ సృజన కోసం వరంగల్ మిత్రమండలి లోని సాహితీమిత్రులు నలుగురు కవి తిలక్ తో కలిసి ఆధునిక దృక్పథం, ప్రయోగం, సామాజిక చైతన్యం కోసం సాహిత్య పత్రిక పెట్టాలని కలలు కంటున్న రోజులు.

Vv_writing

‘నా యుగస్వరానికి’ నా తరం గాయకుణ్నని అందుకే ప్రకటించి ఉంటుంది. ‘రేపటి వెలుగులపై విశ్వాసం వీడ’కుండా నా తరం అశాంతిని పలుకుతూ, నాలో దాగి ఉన్న సుప్తాగ్నిని వెతుకుతున్న కాలం. ఎంత అస్పష్టమైందయినా, ఎంత అపరిపక్వమైందయినా అప్పటికది యుగవాణి. ఆ స్పష్టత, ఆ పరిపక్వత – ప్రపంచ స్థాయిలో చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం (1966) తో, దేశంలో నక్సల్బరీ (1967) తో వచ్చిందని ఇపుడు స్పష్టంగా చెప్పగలను. అందుకే, ‘ఈ జనరేషన్ జనరేటర్ లోంచి జన్మించిన విద్యుత్తును నేను’.

అవి ప్రపంచమంతా వియత్నామ్ యుద్ధంతో ఉత్తేజం పొందుతున్న రోజులు కూడ. అమెరికాలో బుద్ధిజీవులు, యువతరం, వియత్నామ్ ప్రజల పక్షం వహించి, వాళ్లకు సంఘీభావంగా విశ్వవిద్యాలయాల్లో, సాహిత్యరంగంలో నల్లజాతి ప్రజల పోరాటాలు నిర్మిస్తున్నకాలం. అందుకే రష్యాలో తలెత్తిన రివిజనిజం ‘రాకెట్టుతో చంద్రునిపై విజయాన్ని’ రాయించిన వైజ్ఞానికప్రగతితో గర్వపడుతుంటే ‘వియత్నామ్ ప్రజల విజయాన్ని మానవజాతి విజయం’గా యువతరం భావిస్తున్న కాలమది. ఇటువంటి స్పష్టత అప్పతికింకా నాకు ఏర్పడనప్పతికీ విప్లవమే, అంతే వర్గపోరాటం ద్వారా శ్రామికవర్గం సాధించే విజయమే మానవజాతిని దోపిడీ, పీడనల నుంచి విముక్తం చేస్తుందన్న ఆకాంక్ష హృదయంలో స్పందించి వెలువడినవే ‘జీవనాడి’ సంపుటం లోని ‘జీవనాడి’, ‘రేపు’ మొదలైన కవితలు.

‘1970-71లో రాస్తే ఈ కవిత్వం ఇట్లా ఉండేది కాదేమో.. కానీ నా వ్యక్తిత్వాన్ని తీర్చిందీ మార్గాన్ని పేర్చిందీ ఈ జీవనాడే అని నమ్ముతాను’ అని ‘జీవనాడి’ చరిత్రలో (15 మార్చ్ 1971) ఆనాడే రాసుకున్నాను.

–          వరవరరావు

మే 28, 2014