పునాది రాళ్ల ప్రార్థన

కర్లపాలెం హనుమంతరావు

 

karlapalemక్రీ. శ. 3015

హాట్ జూపిటర్నుంచి అరగంట కిందట బైలుదేరిన సూపర్ సానిక్ రాంజెట్ గోయిండా‘(గోవిందాకి.. గో ఇండియాకి సరిసమానమైన పదం) భూ కక్ష్యలోకి ప్రవేశించి అదేపనిగా గిరిటీలు కొడుతోంది. చిన్నపిల్లలు ఆడుకొనే టాయ్ ఏరోప్లేన్ రీమోట్ కంట్రోలురుతో తిరుగుతున్నట్లంది ఆ దృశ్యం.

గోయిండానుంచి చూస్తుంటే భూమండలం మొత్తం ఒక మండే పెద్దబంతిలాగా ఉంది.

స్పేస్ సెంటర్నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాంజెట్ లోని యువశాస్త్రవేత్తలిద్దరూ మాస్కులని మరోసారి సర్దుకొని స్క్రామ్ జెట్ సాయంతో సూటిగా భూమివైపుకు దూసుకు రావడం మొదలుపెట్టారు.

పొట్టిగా,  బూడిదగుమ్మడికాయంత బొద్దుగా  రేలంగిలాగా ఉన్నవాడిపేరు మొగానో. పొడుగ్గా,  పొట్లకాయంత సన్నగా రమణారెడ్డిలాగా ఉన్నవాడిపేరు  తనాకో. వాళ్ళిద్దరు ఇంటర్ యూనివర్సల్ స్పేస్ యూనివర్శిటీలో రీసెర్చి స్టూడెంట్లు.

స్క్రాంజెట్ ని రాంజెట్ ని రీమోట్ ద్వారా కంట్రోలుచేస్తూ హాట్ జూపిటర్ స్పేస్  సెంటర్లో కూర్చొని ఆపరేష్ డిస్కవర్ ఇండియా సూపర్వైజ్ చేస్తున్నాయన పేరు కబిల్. అతగాడు ఆ ప్రాజెక్టుకి గైడు కూడా. సినిమాల్లో ప్రకాష్ రాజ్ లాగా ఉంటాడు.

కబిల్ ముత్తాతలు కొన్నివేల ఏళ్లకిందట భూమ్మీద నివసించినవారు. ఐదువందల ఏళ్లకిందట భూమ్మీద జనాభా పట్టనంతగా ఎక్కువైపోయి వనరులు హరించుకుపోయి జీవనం మనుగడకే ముప్పు ముంచుకొచ్చినవేళ  గగనాంతర రోదసిలోని వేరే గ్రహాలకి  వలసపోయింది మెజారిటీ మానవజాతి. కబిల్ ముత్తాతలు సూర్యకుటుంబంలోని గురుగ్రహానికి చెందినవారే!

ప్రకృతి వికృతిగామారిన దారుణ దుష్పరిణామాల కారణంగా మిగిలిన జీవజాతులన్నీ క్రమక్రమంగా నశించిపోయాయి. ప్రస్తుతం భూమి ఒక మరుభూమిని తలపిస్తోంది.  అడవులు అదృశ్యమయ్యాయి. నీరు పాతాళంలోకి ఇంకిపోయింది. ఆక్సిజన్ కరువై  పూర్తిగా బొగ్గుపులుసు వాయువుతో నిండిపోయిన భూమ్మీదకు మొగానో, తనాకో ఎందుకొస్తున్నట్లు?!

తమ సౌరవ్యవస్థను బోలిన మరెన్నో గ్రహకుటుంబాలను వెదికి పట్టుకొని, పరిశోధించి దీసిస్ సమర్పించడం ఆపరేషన్ డిస్కరీ ఇండియాలక్ష్యం. ప్రాజెక్టులో భాగంగా కబిల్ గైడెన్సులో  రోదసీలో ప్రయాణిస్తూ ఇప్పటికే ఎన్నో పాలపుంతలను, నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించారు. గెలాక్సీలనన్నింటినీ గాలించేసె చివరి అంచెగా భూమ్మీదకు దిగుతున్నారు ఇప్పుడు.

భూతలంమీద వాతావరణంమాత్రం భయానకంగా ఉంది. సెగలు కక్కే వడగాలులు ఎడాపెడా కొడుతున్నాయి. కనుచూపుమేరంతా సహారానుమించిన ఎడారి దిబ్బలే!

ఓజోన్ పొర చిరిగిపోయి సూర్యరశ్మి భూతలాన్ని నేరుగా జీవజాతులన్నీ ఏనాడో నశించాయి.

ఇంత జీర్ణావస్థలో ఉన్న భూమ్మీదకు బాసు ఎందుకు దిగమంటున్నాడు యువశాస్త్రవేత్తలిద్దరికీ అంతుబట్టడంలేదు.

స్క్రామ్ జెట్ నేలమీదకు లాండయిన తరువాత విద్యార్థులిద్దరికీ గైడ్ కబిల్ కమాండ్స్ స్పేస్  విండోనుండి వినబడుతున్నాయి.

కంగ్రాట్ స్! వేలాది ఏళ్లకిందట రోదసీమండలం మొత్తంలో మహానాగరికతలు వెల్లివిరిసిన ప్ణ్యభూమిమీదకు మీరు ఇప్పుడు అడుగు పెట్టారు. కబిల్ హృదయంలో మాతృగ్రహంమీద భక్తి ఎంతలా పొంగిపొర్లుతున్నదో అతని గొంతులోని ఉద్వేగాన్నిబట్టే శిష్యులిద్దరికీ అర్థమయింది.

2015-07-18 13.27.12

కబిల్ గొంతు గంభీరంగా వినపడుతోంది. ఆ రోజుల్లో అమెరికా అగ్రరాజ్యంగా ఉండేది. అన్ని రంగాల్లో అదే ముందుండేది. తమ దర్పానికి దర్పణంగా వాళ్ళు నిర్మించుకొన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీని  ఫొటో తీయండి!

కెమారాని బాస్ చెప్పిన వైపుకి ఫోకస్ చేసి చూసాడు తనాకో. అక్కడ మట్టిదిబ్బలు తప్ప ఏవీ కనిపించలేదు!

అల్ ఖైదా వాళ్ళు ఆ అమెరికానెప్పుడో కైమాకింద కొట్టి పారేసారు. దాని నామరూపాలుకూడా మీకిప్పుడు కనిపించవుఅన్నారెవరో! ఆ గొంతు వినిపించినవైపు చూస్తే అక్కడెవరూ కనిపించలేదు! అదే విషయం తిరిగి బాసుకి చేరవేసారు శిష్యబృందం.

పోనీ సోవియట్ సోషలిస్తు రిపబ్లిక్ పేరుతో ఒకవెలుగు వెలిగి చివరకు  రష్యాలాగా మిగిలిపోయిన దేశాలగుంపువైపుకి మీ కెమేరా తిప్పండి! అట్టడుగు మానవుడి స్వేచ్చా స్వాతంత్ర్యాలకి నిర్మాణరూపం రెడ్ స్క్వేర్. షూటిట్!కబిల్ గాట్టి కమాండ్!

కెమేరా పొజిషన్ మారింది. అదే దృశ్యం! మటిదిబ్బలే మట్టిదిబ్బలు! ‘వాళ్ల ప్రభుత్వాలను వాళ్లే కూల్చుకొన్నారు. ముక్కలు చెక్కలయినా చివరికీ ఒక ముక్కా మిగల్లేదు! అంది ఇందాకటి గొంతే, శాల్తీ మాత్రం యథాప్రకారం కనిపించలేదు.

శిష్యులద్వారా సమాచారం విన్న కబిల్ అన్నాడీసారి లండబ్ టెన్ డౌన్ లో ఉద్దండ పిండాలుండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ల పాలనలో ప్రపంచం మొత్తంలో సూర్యుడు అస్తమించేందుకు అంగుళం  చోటైనా ఉండేది కాదంటారు. ఆ మహాసామ్రాజ్యపు మహారాజులు, రాణులు నివాసమున్న వీధిని మీ కెమేరాల్లో బంధించండి!

తనాకో కెమేరా అటు తిరక్కముందే అందుకొంది ఇందాకటి గొంతు నో యూజ్! ఆ సూర్యుడస్తమించని మహాసామ్రాజ్యం తరువత్తరువాత అమెరికా సింహానికి తోకమాదిరిగా తయారైంది. అల్ ఖైదా దెబ్బకీ  అమెరికాతో పాటే మాడి మసయింది!

ఓన్లీ వాయిస్ ఓవర్! నో పర్సన్ ఎట్ సైట్!

నుదుట దిద్దుకొనేటంత చిన్నదైనా అమెరికాన సైతం గడగడలాడించిన దేశం  జపాను. వారి నాగరికత చాలా ప్రాచీనమైనది. అయినా నాటి మానవుడు సాంకేతికంగా ఎంతటి ఉన్నత శిఖరాలను అందుకొన్నాడో జపానువారిని చూసి తెలుసుకోవచ్చు. వాళ్ల విసనకర్ర ఈక కనబడినా చాలు ఒక్క స్నాపు తీసుకోండి!అన్నాడు కబిల్ నిరాశను గొంతులో కనిపించనీయకుండా!

అణుధార్మిక విధ్వసంతో దానికదే బూడిదయింది!’ అంది ఆకాశవాణి ముక్తుసరిగా ఒక్క ముక్కలో.

ప్రపంచానికి ఫ్యాషన్ ఎలాఉంటుందో నేర్పించిన ఫ్రాన్స్!కబిల్ గొంతు.

ఎయిడ్స్ మహమ్మారి ఎప్పుడో ఆ శృంగారదేశాన్ని కబళించేసిందిఆకాశవాణి గొంతు.

క్యూబా..కబిల్ గొంతులో వణుకు.

ప్లేగు వ్యాధికి ఫినిష్అశరీరవాణి తాపీగొంతు. 

ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్.. కజికస్తాన్.. కబిల్ దేశాలపేర్లు గడగడా చదువుకుపోతున్నాడు.

అవన్నీ తాలిబాన్లకి స్థావరాలుగా మారిన తరువాత చరిత్రలో స్థానంలేకుండా పోయాయి. ఆఫ్రికా అడవుల్ని  కార్చిచ్చు,ఆస్ట్రేలియా ఖండాన్ని ఎల్లో ఫీవరు.. ఒక్కముక్కలో మీకు అర్థమయేటట్లు చెప్పాలంటే తుఫాన్లూ, భూకంపాలూ,సునామీలూ, కరువులూ, వరదలూ, యుద్ధాలూ, రోగాలూ.. అన్నీ అన్నింటినీ నామరూపాల్లేకుండా సర్వనాశం చేసేసాయి. అడుగూ బొడుగూ ఏమన్నా మిగిలున్నా రాజకీయాలు వాటిని నాకేసాయి. చివరికి మిగిలింది ..ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారే.. ఈ మట్టిదిబ్బలే!అశరీరవాణి ఆపకుండాచేసే ఆ అనవసర ప్రసంగానికి యువశాస్త్రవేత్తలిద్దరికి  తెగ వళ్ళు మండిపోయింది.

గురువుగారికి ఇష్టమైనదేమన్నా పట్టుకుపోదామనుకుంటే మధ్యలో వీడెవడు? పిలవా పెట్టాకుండా కల్పించుకొని  ఏదడిగినా బూడిదయింది.. మసయింది.. మన్నుకొట్టుకుపోయింది.. నాశనమయింది.. నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది.. మురిగిపోయింది.. మునిగిపోయిందిఅంటూ అపశకునాలు తప్ప వల్లించడం లేదు! రెండు వాయిద్దామంటే వాయిస్సేగాని శాల్తీ ఎదురుగా కనిపించి చావడంలేదు!

తమకు డాక్టరేట్ రాకుండా తోటి విద్యార్థులు చేస్తున్న కుట్ర కాదుగదా ఇది!

కడుపులోని మంటను కడుపులోనే ఉంచుకొంటే ఏం ప్రయోజనం?  కనబడ్డా కనబడకపోయినా ముందు కడిగిపారేస్తే సరి!

ఇందాకట్నుంచీ చూస్తున్నాం. ఏది చూద్దామన్నా లేదు పొమ్మంటావు! ప్రకృతిభీభత్సానికి సర్వం బూదిద అయిపోతే తమరెలా మిగిలున్నారు  మహాశయా?’ తనాకో ఇక తమాయించుకోలేక పెద్దగొంతుతో అరిచాడు

ఇంతకీ నువ్వెవరివి? మొనగాడివైతే మా ముందుకురా! సవాలు విసిరాడు మొగానో తన వంతు వంతగా.

బిగ్గరగా నవ్వు వినిపించింది. ఆ నవ్వుకు భూమి కంపించింది. మీరు నిలబడ్డ చోటులోనే భూమి అడుగున ఉన్నాను. పిల్లల్లారా!

మొగానో గబగబా గొయ్యితీయడం మొదలు పెట్టాడు. రెండు అడుగులుకూడా తవ్వకుండానే బైటపడిందా గొంతు తాలూకు  వింత ఆకారం.

నిట్టనిలువుగా ఉంది. ధగధగా మెరిసిపోతోంది. వంటిమీదంతా ఏవో గాట్లు.. పైనుంచీ కిందదాకా!

ఇలాంటి ఆకారాన్ని ఆ గ్రహాంతరవాసులు రోదసీమండలంలో ఇంతవరకు ఎక్కడా చూసింది లేదు. ప్రళయమొచ్చి భూమ్మీదున్న సర్వజీవజాలం దుంపనాశనమయినా.. చెక్కు చెదరకుండా.. నిట్టనిలువుగా.. తాజాగా.. తళతళలాడుతూ కనిపిస్తున్న ఆ ఆకారాన్ని చూడంగానే .. నిజం చెప్పద్దూ.. యువశాస్త్రవేత్తలిద్దరికీ ఒకింత గౌరవంకూడా కలిగింది. సాధ్యమైనంత వినయంగా  మనసులోని మాటను బైటపెట్టాడు తనాకో ఇంతకీ తమరెవరో సెలవిచ్చారు కారు సార్?’

ఆ ఆకారం చెప్పటం మొదలు పెట్టింది. పునాదిరాయి అంటారు నన్ను. వేల ఏళ్లకిందట ఇక్కడ ప్రజాస్వామ్యమనే పాలనావిధానం  ఒకటి వర్ధిల్లింది. ప్రజలే రాజులు. ప్రజలకొరకు, ప్రజలవలన, ప్రజలచేత నడిచే పరిపాలన అది. మరీ లోతుగా వెళ్ళొద్దు! మీరొచ్చిన పని మర్చిపోయి తరిగి వెళ్లడానికి తిప్పలు పడతారు. అంత తికమకగా ఉంటుందా రాజకీయ వ్యవహారం! ప్రజాస్వామ్యమంటే ప్రజలు ఎన్నుకున్న నాయకులు.   వాళ్ళు పాలించే ప్రజలు. ఈ మాత్రం అర్థం చేసుకోండి! ప్రస్తుతానికి  చాలు.!

ఇహ నేనెవరో చెబుతాను. వినండి! ఎన్నికల్లో నిలబడి గెలవడానికి నాయకులు ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేస్తారు. ప్రాజెక్టులు కట్టిస్తామని, పాఠశాలలు పెట్టిస్తామని, ఫ్యాక్టరీలు నిర్మిస్తామని.. వగైరా.. వగైరా! వాళ్ళు వాగ్దానాలు చేసినంతమాత్రాన జనం నమ్మాలని ఏముంది? నమ్మనివాళ్లని నమ్మించడానికి నాయకులు ఇదిగో.. ఇవాళే.. ఇక్కడే.. మీకు భవిష్యత్తులో కట్టబోయే  భారీ నిర్మాణానికి నాందీగా.. పునాదిలో ఓ రాయి వేసేస్తున్నాం!” అంటూ బ్రహ్మాండంగా  ఊరేగింపూ..  గట్రాచేసి  ఆర్భాటంగా మమ్మల్ని పాతేస్తారన్నమాట. మమ్మల్ని చూసి నమ్మి జనం ఓట్లేస్తే.. గెలిచేసి..గద్దెనెక్కి..  వాళ్ళు చేయాలనుకొన్న పనులన్నీ మళ్లీ ఎన్నికలొచ్చేసే లోపల సుబ్బరంగా చేసేసుకొంటారన్నమాట.

ఒక్క నిమిషం పునాదిరాయీ! చిన్నసందేహం! మరి వాగ్దానం చేసినట్లు నాయకులు ఎన్నికలు పూర్తయిన తరువాత నిర్మాణాలన్నీ చేసేస్తారుకదా! అయినా మీరింకా ఈ గోతుల్లో శిలావిగ్రహాల్లా పడి అల్లాడుతున్నారేంది?!’

పకపకా నవ్వింది పునాదిరాయి. మరదే ప్రజాస్వామ్యమంటే! సరే! ఇందాకట్నుంచీ ఏదీ కనిపించడంలేదని తెగ అల్లాడుతున్నారుగా! అమెరికా, రష్యా, చైనా, జపానంటూ ఎన్నడో అంతరించిపోయిన దేశాలను గురించి దేవులాడుకొంటున్నారుగా! వృథాగా వాటికోసం సమయం పాడుచేసుకోకుండా.. నన్నూ నా సోదరులనూ ఫోటో తీసుకుపోండి! అంతదూరంనుంచి వచ్చినందుకు ఆ మాత్రమైనా దక్కిందని సంతోషించండి!

నువ్వేగాక నీకు సోదరులుకూడా ఉన్నారా ఇంకా?! వాళ్ళూ నీకులాగే సజీవంగానే ఉన్నారా?!’ నోరెళ్లబెట్టడం తనాకో వంతయింది.

ఎందుకు లేరబ్బాయ్? వందలొందలు! మీ కెమేరాల మెమరీ కార్డు చాలదు! ఆన్ చేసుకోండి! వరసగా పరిచయం చేస్తాను. ఫ్లాష్ వేసుకోండి! అదిగో అది బ్రాహ్మణి సిమెంటు ఫ్యాక్టరీ పునాదిరాయి. ఇప్పుడు రద్దయిపోయిందనుకోండి!  పోలవరం అనే భారీ నీటిప్రాజెక్టుకి వేసిన పునాదిరాయి! అదిగో ఆ మూల ఉన్నది! ఇదిగో.. ఇవాళో.. రేపో.. అంటో యుగాలబట్టీ కథ నడుపుతున్నారు! ఇది  హంద్రీ నీవా సుజల స్రవంతి పునాదిరాయి. ఇది సిద్దిపేట స్పోర్ట్ స్ స్టేడియం పునాది రాయి. రెండు తెలుగురాష్ట్రాలు కలసి ఉన్నప్పుడు వేసిన పునాది రాళ్లిలాగా ఇంకా చాలా ఉన్నాయి.  అదిగో ఆ మూల వున్నదే .. అది హైదరాబాదనే అప్పటి తెలుగురాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ సమస్యల నివారణకని ప్రారంభించిన మెట్రోరైలు ప్రాజెక్టు పునాదిరాయి. స్థలంమారి ఆ ప్రాజెక్టు ఇప్పుడు మరో దిశలో సాగుతున్నది. అయినా దీనికి ముక్తి కల్పించే దిక్కు కనిపించడం లేదు.  ఇది బడాయిగడ్డా లోకాజ్ వంతెన తాలూకు పునాదిరాయి. ఇదిగో..  ఇది పుణ్యవరంలో వంతెన  నిర్మాణానికని వేసిన రాయి. ఇది పటాన్ చెరువులో వెయ్యి పడకల ఆసుపత్రికని అప్పటి ముఖ్యమంత్రి వేసిన శిలాఫలకం! ఇలా మీరు ఎక్కడ చూసినా చక్కని పునాదిరాళ్ళు అనాదిగా అనాథల్లా పడివుండటాన్ని గమనించవచ్చు!  ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రగతి లేదు. మా గతి మారలేదు, మా ఫొటోలు తీసుకొని మామీదగాని మీరు థీసిస్ సమర్పిస్తే  పట్టా గ్యారంటీ! ఆ విధంగానైనా మేము ఉపయోగపడ్డామని సంతోషిస్తాం.పునాదిరాయి నిట్టూర్పు.

అందంగా తళతళలాడే ఆ పునాది రాళ్లన్నింటినీ కెమేరాలో బంధించి తృప్తిగా తిరుగుముఖం పట్టారు యువశాస్త్రవేత్తలిద్దరూ!

స్క్రామ్ జెట్ ఇంజను స్టార్టుచేస్తూ మొగానో పునాదిరాయితో కృతజ్ఞతా పూర్వకంగా అన్నాడు మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం!

ఈ జన్మలోనే సుబ్బరంగా  తీర్చుకోవచ్చబ్బాయిలూ! మమ్మల్నిలా నిలువునా పాతేసినా పెద్దమనుషులు మీకు  వెళ్లేదారిలో ఏ నరకంలోనో.. పాతాళంలోనో  తప్పకుండా తగులుతారు.  పెద్దమనసు చేసుకొని ఒక్కసారివచ్చి మాలో కనీసం కొందరికైనా విముక్తి కలిగించి పుణ్యంకట్టుకోమని మా మాటగా విన్నవించండి.. చాలు!  అని కన్నీరు పెట్టుకొంది అ పునాదిరాళ్ళ సంఘం ప్రధాన కార్యదర్శి.

***

cartoons: Karlapalem Niranjan

చీకటి చీకాకులు

 కర్లపాలెం హనుమంతరావు

 

 

”జీవితం ఏమిటీ? వెలుతురూ.. చీకటీ! హుఁ.. హుఁ.. హుఁ!.. వెలుతురంతా చీకటైతే.. అందులోనే సుఖము ఉన్నదీ!’

‘చీకటీ.. చీకటీ అంటూ ఆ శోకన్నాలేవిట్రా?.. లేచి స్విచ్చి వేసుకుంటే వెలుతురు రాదా!’

‘స్విచ్చి వేసే ఉంది బాబాయ్! వెలుతురే లేదు’

‘అదేంటీ! కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయావా?  కట్టలేకపోయావా?’

‘కట్టలేకపోవడానికి అదేమన్నా కోట్లలో వచ్చిందా ఏమిటీ! వట్టి సర్ ఛార్జీనే కదా! కట్టినా కట్టకున్నా కరెంటు ‘కట్’తప్పదు కదా! మా కాంప్లెక్సులో వెలుతురు మొహం చూసి ఎన్నిరోజులయిందో తెలుసా? కొత్త ఇల్లు కదా.. అని బోలెడంత పోసి ఝిగేల్ ఝిగేల్ మనే ఛాండ్లియర్సుకూడా పెట్టించింది మా శ్రీమతి. విగ్రహం పుష్టి .. నైవేద్యం నష్టి సామెతగా ఉంది మా అపార్టుమెంటు పరిస్థితి. ఎల్ కే జీ చదివే మా సుపుత్రుడు నిన్నేం అడిగాడో తెలుసా బాబాయ్? ఎ ఫర్ ఏపిల్, బి ఫర్ బ్యాట్.. అని చదివేస్తూ  ఈ ఫర్ ఎలక్ట్రిసిటీ అని రాగానే ఈ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి డాడీ? అని ఆడిగాడు బాబాయ్!

‘అదేదో హైటెక్ సిటీ అనుకుంటున్నాడు కాబోలు పాపం పసివెధవ’

‘అదే మరి! పోనీ ఇదీ అని చూపిద్దామంటే.. ఇల్లు కట్టినప్పట్నుంచీ ఒక్క పూటైనా వచ్చి చస్తేకదా!’

‘అందరి సంబడం అలాగే ఉందిలేరా బాబూ! మా అపార్టుమెంట్లలో ఐతే పూర్తిగా ‘లిఫ్టు’ అనేదే తీసేసారు. ఎవరికి వాళ్లం సొంతంగా బక్కెట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఓపిక ఉన్నవాళ్ళు ఎలాగో మెట్లమీదనుంచే డేక్కొస్తున్నారనుకో!  కంప్లైట్ చేద్దామని కరెంటాఫీసుకు పోతే అక్కడా వాళ్ళు చీకట్లో తడుముకుంటున్నార్రా బాబూ!’

‘చీకట్లో ఇట్లాంటి చిత్రాలు చాలానే జరుగుతున్నాయ్ బాబాయ్! మొన్న గుళ్లో అదేడో సామూహిక వివాహాలు జరిపించారు చూసావా!వందమంది వధూవరులు ఒక్కటవ్వాలని వచ్చారు పాపం. పట్టపగలే కటిక చీకటి! ఏ పెళ్ళికొడుకు ఏ పెళ్ళికూతురు మెళ్ళో తాళి కడుతున్నాడో.. అంతుబట్టక పాపం నిర్వాహకులు ఎంతలా తల్లడిల్లిపోయారో తెలుసా? కరెంటు వాళ్ల నిర్వాకంమీద కంప్లైట్ చేద్దామని పోలీస్ స్టేషనుకు పోతే’

‘అర్థమైందిలే! అక్కడా చీకట్లో ఎవరూ కనిపించలేదనేగా చెప్పబోతున్నావ్? సందు దొఇకింది కదా అని.. సర్కారంటే గిట్టని నీలాంటి వాళ్ళంతా ఇట్లాంటి కట్టుకతలు పుట్టిస్తున్నారుగానీ.. నీళ్ళు పుష్కలంగా ఉంటే గవర్నమెంటు మాత్రం కరెంటెందుకివ్వదురా?’ ఇదివరకటి ప్రభుత్వాలకు ఈ కరెంటు కొట్టిన షాకు ఇప్పటి సర్కారులకు మాత్రం తెలీదనా! పవర్ లేదు పవర్ లేదు అని దొరల పరువుతీయాలని చూస్తున్నారుగానీ.. ఫారడే మహాశయుడు కరెంటు కనిపెట్టకముందుమాత్రం లోకం చల్లంగా సాగిపోలేదా! మన మూరగండడ రాయడు శ్రీక్రుష్ణదేవరాయలు కాగడాల వెలుతురులోనే సువర్ణపాలన సాగించాడు తెలుసా? మా చిన్నతనంలో ఈ కరెంటుగోల ఎక్కడిదీ! మా చదువులన్నీ ఆముదం దీపాల కిందనే  తెల్లారిపోయాయి. విసనకర్రలు, పాత పేపర్లు ఉన్నంతకాలం పంఖాల అవసరం ఏమంత ఉంటుందిరా! కోతల పుణ్యమా అని కరెంటుషాకుల దుర్మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాత్రిళ్ళూ నిశ్చింతగా బట్టలు ఆరేసుకుంటున్నాం కరెంటు తీగలమీద.’

‘అట్లా ఆరేసుకోబట్టే రాత్రిళ్ళు దొంగతనాలు ఎక్కువైపోయాయీ మధ్య మళ్లీ! ఇప్పటివరకు శివార్లవరకే చోరుల సామ్రాజ్యం పరిమితం. ఇప్పుడు నగరం నడిబొడ్డుక్కూడా వాళ్ల హస్తలాఘవం విస్తరిస్తోంది. దొంగలు, దోరవయసులో ఉన్నవాళ్ళూ కరెంటుకోతలకు పండగలు చేసుకుంటున్నారు. సరససల్లాపాలకు  ఎక్కడో  దూరంగా ఉన్న పార్కుల చాటుకోసం  పాకులాడేవాళ్ళు  కోడెవయసుగాళ్ళు. ఇప్పుడంత శ్రమ పడటంలేదు. సర్కారువారి పుణ్యమా అని నగరం నడిబొడ్డులే కోడెకారుకు పడకగదులై పోతున్నాయ్ బాబాయ్!’

‘సర్వే జనా సుఖినోభవన్తు- అనే గదరా ఏ ప్రభువైనా కోరుకొనేది! జనభాలో సగమైనా ఎలాగోలా సుఖపడుతున్నారని సంతోషపడక అలా కుళ్ళుకోవడమేం సబబుగా లేదబ్బీ!ఏం? దొంగలుమాత్రం సుఖంగా బతకద్దా? పని చేసినా చేయకున్నా పగలంతా పెళ్ళివారిల్లులా ఫెళ్ళున వెలిగిపోవాలంటావ్ ప్రభుత్వాఫీసులు? దొంగవెధవలకూ వాళ్ల వృత్తి క్షేమంగా చేసుకునే సావకాశం వద్దంటావ్?! పెద్దవాణ్ణి. అనుభవంతో చెబుతున్నా..విను! చీకటి పడకముందే పిల్లకాయలకి రెండుముద్దలు తినిపించి పక్కలెక్కించెయ్! ఇంచక్కా మీ అమ్మగారు చెప్పే చందమామ కథలన్నీ వింటూ పడుకుంటారు. చక్కటి పాటలూ నేర్చుకుంటారు. పాడు టీవీ నోరు మూతపడీంతరువాత పెద్దవాళ్ళకుమాత్రం ఇంకేం పొద్దుపోతుందీ? తెల్లార్లూ కాలక్షేపంకోసం చిన్నతనంలో నేర్చుకున్న ఆంజనేయ దండకాలూ, అష్టోత్తరాలూ మళ్లీ మళ్ళీ నెమరేసుకుంటారు. బోలెడంత పుణ్యం సంపాదించుకొంటారు. ‘

‘చీకటిమూలకంగా కుటుంబ నియంత్రణ పథకాలు మళ్లీ మొదటికొస్తున్నాయ్ బాబాయ్!’

మరేం ఫర్లేదు. ఏడాదికి మూడొందలరవైయ్యైదు రోజులు  పసుపు కుంకుమలని.. సీమంతంనోములని.. ప్రసవవేదమని,బాలింతలాలింతలని.. ఏవేవో పేర్లతో సర్కార్లు సొంతమనుషులకుమించి ఆదుకుంటూనే ఉన్నవాయె! శబ్దవేధి అని మనకో వేదకాలంనాటి విద్య ఉంది. కటిక చీకట్లో కూడా కంటి సాయం లేకుండా  శబ్దాలను బట్టి వస్తువులజాడను పసిగట్టే గొప్పకళ అది.ఎందుకూ కొరగాని ఇంజనీరింగు చదువులమీద పడి ఆనక  బాధపడే బదులు.. శబ్దవేధిని ఓ కోర్సులా పౌరులందరూ నిర్బంధంగా అభ్యసిస్తే సరి.. ఈ చీకటి పాట్లు, చీకట్లో పాటలు తప్పుతాయి! వేలెడంత లేని బుడతడు కూడా రెండ్రెండ్లెంతరా అని అడిగితే ఠక్కుమని సెల్ తీస్తున్నాడు! కరెంటే లేనప్పుడు ఇంక  చార్జింగేముంటుంది! సెల్లేముంటుంది! ఎందుకైనా మంచిది.. మళ్ళీ పిల్లాడికి నోటిలెక్కలు గట్రా ఇప్పట్నుంచే  గట్టిగా నేర్పించు! మోటార్లమీద ఆధారపడి ఇబ్బందులు పడేబదులు.. పాతకాలంనాటి ఏతాములు మళ్లా బైటికి తీస్తే వ్యవసాయం నిరాటంకంగా సాగిపోదా! బియ్యంమిల్లులు ఆడకపోతేనేం? అత్తాకోడళ్ళు  దంపుడు పాటలు పాడుకొంటూ ఇచక్కా ధాన్యం దంచుకుంటే పోదా?’

‘ ఎందాకా ఇలా చీకట్లో దంచుకోడాలు బాబాయ్?’

‘చెత్తనుంచి కూడా కరెంటు తీయచ్చని అంటున్నారు గదరా ఈ మధ్య! నీళ్ళక్కరువుగానీ, మనదేశంలో చెత్తాచెదారానికి కొదవేముంది? ఆ సాంకేతిక నైపుణ్యం అభివృద్దయ్యేదాకా పోనీ ఓ పని చేయచ్చు! బియ్యంలో రాళ్ళు తింటే పెళ్ళినాడు జడివానలు కురుస్తాయనిగదా పెద్దలు చెబుతారు! పెళ్ళికావాల్సిన కుర్రకారునంతా సేకరించి  కిలోరూపాయిబియ్యం ఓ రెండు కిలోలు బలవంతంగానైనా బొక్కించి పెళ్ళిపీటలమీద కుదేస్తే సరి.. వానలే వానలు. నీళ్ళే నీళ్ళు. కరెంటే కరంటు!.ఇక నీ సెటైర్లుండవు!’

***

తన్మయత్వం అంటే…?

చదివేటప్పుడు పాఠకుడు నేను ఎక్కడ ఉన్నాను?’ అని ప్రశ్న వేసుకుంటే నేను ఇక్కడ ఉన్నానుఅని స్వీయ లోకం నుంచి కాకుండా మరోలోకం నుంచి మారు బదులు వస్తే అదే తన్మయత్వంఅంటారు ప్రముఖ సాహిత్యవేత్త కవికొండల వెంకటరావుగారు యనభై ఏళ్లకిందట ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకని రాసిన ఒక వ్యాసంలో. వారి అబిప్రాయం ప్రకారం పాఠకుడు తన దృష్టిపథాన్ని విడిచిపెట్టి.. కవి దృష్టిపథాన్ని విడిచి పెట్టి.. చదివే అంశం దృష్టిపథం వెంటబడి పోవడమే ఆ తన్మయత్వ ముఖ్య లక్షణం. వాస్తవంకూడా అంతేననిపిస్తోంది.

రామాయణం రాసిన వాల్మీకి కథ కాదు. చదివే పాఠకుడి కథ అంతకన్నా కాదు. సీతారాముల కథ. మనల్ని మనం  మరచి, వాల్మీకినీ మరచి, సీతారాములనే స్మరించుకుంటో చదువుతాం కదా.. అదేనేమో వెంకటరావుగారు ఉటంకించిన ఆ పరలోక శక్తి! నిజమే. శ్లోకం ప్రతిపదార్థమో.. తాత్పర్యమో తెలుసుకుంటో అంతః సారంలోకి వెళ్ళకుండా పదే పదే ఎంత వల్లె వేసినా అది పురాణ పఠనం అవుతుందేమో  గానీ తన్మయత్వం కాబోదు గదా! ఆ తన్మయలోక ప్రయాణానికి టిక్కెట్టు దొరకటం అంత సులభం కూడా కాదేమో!

అంశా’న్నే లక్ష్యంగా తీసుకోవడం -అంటున్నారు వెంకటరావు గారు. అంటే ఏమిటో? బాహ్య స్వరూపమైన భాషను అనా అర్థం? ఆంతరంగికమైన భావాన్ని అనా అర్థం? రెండూ కాదు. అంశం ప్రతిపాదించే ధర్మం అని అనుకుంటా వెంకటరావుగారి ఉద్దేశంలోఉన్నది.

 ధర్మం ప్రతిపాదించని అంశం అంటూ ఏదైనా అసలు ఉంటుదా? ఉండదేమో. ధర్మం సహజ లక్షణం మర్మం. ఆ మార్మికత మీద లక్ష్యం ఉంచడమే తనయత్వం సాధించే ప్రక్రియల్లోని ముఖ్య మార్గం అనిపిస్తోంది.  రావణాసురిడి పది తలలమీదో, రాములవారి ధనుర్విద్యా పాటవం మీదో దృష్టి లగ్నం చేస్తే పర శక్తి కనికరించదు. సీతారాముల చరిత్ర ముఖ్య ధర్మం  నైతికత. భాతృధర్మం, పితృవాక్య పరిపాలన, ఏకపత్నీవ్రత సంకల్పం. నిష్ట, నైష్టిక ప్రవృత్తి, శరణాగత ఆర్త త్రాణ పరాయణత్వం లాంటి చరిత్రోదితాలైన ‘ధర్మా’లమీద దృష్టిసారిస్తేనే తన్మయత్వం సాధ్యం అయేది.

unnamed

రావుగారి లెక్క ప్రకారం ఈ ధర్మం మళ్లీ రెండు విధాలు.

1.విశ్రుతం

2.విస్మృతం

ప్రచండ వేగంతో వీచి, పెద్ద పెద్ద చెట్లను పడదోసి, భయంకరమైన వాననీటితో ముంచెత్తే గాలివాన ఆర్భాటం లాంటిది కేవల శ్రుత ధర్మం అయితే..  దూదిగుట్టలాగా విశాల ఆకాశానికి ఒక మూల ఒదిగి  సూర్యకాంతికి ఆరుతున్నట్లుండే తెలిబూది మేఘంలాంటిది విస్మృత ధర్మం.

ప్రకృతిలో  ఆ రెండు ధర్మాలూ విడివిడిగా ఉండవు. ఒకే ఒరలోని  రెందు కత్తుల్లా ఉన్నా.. ముందు మన మనసుకు తళుక్కుమని  తట్టేదే ప్రధాన ధర్మం. తుఫాను వీచేటప్పుడు విరామాన్ని గురించిన ఆలోచన తోచదు కదా! కదలక మెదలక  నిలబడి ఉన్న మేఘ శకలాన్ని చూసినా అంతే! అలాగే అప్పటిదాకా అది చేసిన ప్రయాణం కాని, ఇకముందు చేయబోయే ప్రయాణాన్ని గురించి గానీ మనసుకు తట్టదు. తుఫానుది చలనం.. మేఘశకలానిది నిశ్చలనం.. ప్రధాన ధర్మాలు కావడమే ఇందుకు కారణమేమో! అయితే ఇది కేవలం బాహ్యలోక లక్షణం మాత్రమే.

 

కావ్య ప్రపంచంలో అలా ఉంటుందా?  రెండు ధర్మాలూ ఒకే చర్యలో సమ్మిశ్రితంగా  ఉండి.. పాఠకుడి మనోనేత్రానికి ఒకేసారి దృగ్గోచరం  అవుతుంటాయి కదా! అంశం పరిపూర్ణంగా ప్రత్యక్షం అయే దాకా ఉత్కంఠను నిలిపి ఉంచేదీ ఈ సమ్మిశ్రిత ధర్మ సూత్రమే.

ఆకాశంలో నిలకడగా ఉన్న మేఘాన్ని కాళిదాసు మహాకవి దేశ దేశాల వెంట తిప్పి విశ్రుతం చేసాడు. విస్మృతిలో ఉన్న మేఘానికి విశ్రుత ధర్మం ఆపాదించడమే మేఘదూతంలో మహాకవి చూపించిన గడుసుదనమేమో! అక్కడ పాఠకుడు తన్మయత్వం పొందాలంటే ముందు విస్మృత స్థితిలో ఉన్న మేఘాన్ని దర్శించాలి. దాని వెంట దేశదేశాలు తిరుగుతున్నట్లు ఉహించుకుని శ్లోకాలు చదువుకోవాలి. మనన చాతుర్యం లేకుండా కేవలం పఠన చాతుర్యంతో  తన్మయత్వాన్ని సాధించడం అంటే   తివిరి ఇసుమున తైలంబు తీసే ప్రయాసే అవుతుంది.

అయితే ఆ తన్మయత్వపు స్థాయి చదువరి పఠన చాతుర్య భేదాల మీద ఆధారపడి ఉంటుంది. సుడిగాలి బాలకృష్ణుణ్ని ఎగరేసుకు పోయే తృణావర్తుని కథ చదువుతున్నాం అనుకుందాం. కథ వరకూ చదివి ఊరుకుంటే అది విశ్రుతం. తన్మయత్వానికి ఇ అక్కడ తావన్నదే లేదు. ఆ సుడిగాలిని అచి మందస్మితారవిందంతో కిందకి దిగివచ్చే బాలకృష్ణుణ్ని విస్మృతికి తెచ్చుకుంటేనేగాని సంపూర్ణ తన్మయత్వం సాధ్యం కాదు.

 తన్మయత్వాన్ని పాఠకుడి స్మృతిపథంలోకి మళ్ళించే రసవిద్య బాధ్యత  కృతికర్తది అయితే.. కావ్య పఠనంలోని తన్మయత్వ స్థాయిని అందిపుచ్చుకునే శక్తి చదువరి  బుద్ధిస్థాయి ఆధారితం. ఆ సృజన శక్తి  కవులందరికీ ఒకే విధంగా వశం కానట్లే.. ఈ పఠన కౌశలమూ చదువరులందరి బుద్ధి స్థాయికీ ఒకే విధంగా అందదు. ఆ రస రహస్యం అంతుబట్టకే కావ్య(కవిత్వ)లోకంలో అప్పుడూ ఇప్పుడూ ఇన్నిన్ని వృథా కుమ్ములాటలు!

 

(ఆంధ్ర పత్రిక 1931 సంవత్సరాది సంచిక లోని కవికొండల వెంకటరావుగారి తన్మయత్వంగల్పిక చదివిన తరువాత కలిగిన ఆలోచనలు)

 – కర్లపాలెం హనుమంతరావు

65591_493465577379457_2073403944_n