చిన్ననాటి మిత్రురాల్ని
ఇన్నేళ్లకి చూసేక
ఏ బరువూ, బాదరబందీ లేని
తూనీగ రోజులు జ్ఞాపకం వచ్చాయి
నచ్చినప్పుడు హాయిగా ముసుగుతన్ని
నిద్రపోగలిగిన, నిద్రపోయిన రోజులు
జ్ఞాపకం వచ్చాయి
చిన్ననాటి చిక్కుడు పాదు
గులాబీ మొక్కలు
సన్నజాజి పందిరి
కళ్లకు కట్టాయి
అక్కడే ఎక్కడో
పుస్తకాల అరల్లో చిక్కుకున్న
మా అలిబిల్లి ఉత్తరాలు
పుస్తకాల అట్టలో
పిల్లలు పెడుతుందనుకున్న
నెమలీక
మనసు నుండి వద్దన్నా
చెరగకున్నాయి
మేం కోతులమై వీర విహారం చేసిన జాంచెట్టు
అందని ఎత్తుకెదిగి పోయిన కొబ్బరి చెట్టు
మమ్మల్ని చూసి
అలానే భయపడుతున్నాయి
నీళ్ల బిందెనెత్తేసిన చెరువు మెట్లు
గొబ్బి పూల పొదల్లో గుచ్చుకున్న ముళ్లు
అలానే పరిహసిస్తూ ఉన్నాయి
పుట్టిన రోజు నాడు
నెచ్చెలి కట్టి తెచ్చిన
కనకాంబరం మాలని
గీతాంజలి మొదటి పేజీలోని
తన ముత్యాల చేతి రాతని
ఇన్నేళ్లు భద్రంగా దాచిన
మా ఇనుప బీరువా ప్రశంసపు చూపు
నేస్తం చెమ్మగిల్లిన చూపయ్యింది
ఇంట్లో పోయాయని అబద్ధం చెప్పి
తెలిసో తెలీకో
చెలికి బహుమతిచ్చేసిన
ఇత్తడి జడగంటలు
ఇప్పటికీ మురిపెంగా దాచుకున్న
తన వస్తువుల పెట్టె కిర్రుమన్న శబ్దం
నా గుండె చప్పుడయ్యింది
జాబిల్లి వెన్నెట్లో డాబా మీద చెప్పుకున్న కబుర్లు
జాజిమల్లెలు చెరిసగం తలల్లో తురుముకున్న క్షణాలు
ఇళ్ల వాకిళ్లలో కలిసి వేసిన కళ్లాపి ముగ్గు
పెరటి నూతి గట్టు కింద నమిలి ఊసిన చెరుకు తుక్కు
అన్నీఅన్నీ…విచిత్రంగా
మేం నడుస్తున్న ప్రతీ చోటా
ప్రత్యక్షమవుతూ ఉన్నాయి
అదేమిటో ఎప్పుడూ జ్ఞాపకం రాని నా వయస్సు
ఈ పుట్టిన రోజు నాడు
చిన్ననాటి మిత్రురాల్ని చూసేక జ్ఞాపకం వచ్చింది
ఆరిందాల్లా కబుర్లు చెప్తూ
సరి కొత్త యౌవనం దాల్చి
మమ్మల్ని మేం అద్దం లో చూసుకున్నట్లు
అచ్చం ఒకప్పటి మాలా
చెంగున గెంతుతున్న నేస్తం కూతుళ్ళని చూసేక జ్ఞాపకం వచ్చింది
రంగెయ్యని తన జుట్టుని
జీవిత పర్యంతం కాయకష్టం
ముడుతలు వార్చిన తన చెంపల్ని చూసేక
నా వయస్సేమిటో జ్ఞాపకం వచ్చింది.
-కె.గీత
painting: Anupam Pal (India)
నుదుటి మీదకొక తెల్ల వెంట్రుక
చికాగ్గా-
పండుటాకు కొమ్మను
ఒరుసుకుంటున్నట్లు-
శిశిరం మొదటిసారి
నిర్దయగా తలుపు విరుచుకు పడుతున్నట్లు
నాలో ఎక్కడో పెళపెళా
కొమ్మలు విరిగిపోతున్న చప్పుడు
కొత్త సంవత్సరం వస్తుందంటే
కొత్త బాధేదో నెత్తిన తడుతూన్నట్లుంది
ఎప్పుడు పెద్దవుతామా
అన్న చిన్నప్పటి
ఎదురుచూపు కళ్ల కాయలు
కళ్ల దిగువన వద్దన్నా మొలుస్తున్నాయిపుడు
అదేం విచిత్రమో!
ఎప్పుడూ చెంపలపై వయసు విత్తనాలు
జల్లినట్లు జ్ఞాపకం లేదు
కరిగి కన్నీరయ్యే
కాలాన్ని నిబ్బరంగా మోసిన
మేరు గంభీర భుజాలేనా ఇవి?
ఇప్పుడు నేలవైపు చూస్తున్నాయి?!
చిన్నప్పుడే నయం
ముసుగులుండేవి కావు
భయాలుండేవి కావు
కొత్త సంవత్సరపు బాధలుండేవి కావు
అద్దం ముందు నిల్చుంటే
ఇప్పటిలా
మరెవరో కనిపించేవారు కారు
తలమీద ఏముందో తడుముకోవలసిన అవసరం ఉండేది కాదు
జీవితపు రెండో భాగం
నెత్తిన తెల్లగా గుచ్చుకునే ముల్లయ్యి మొదలయ్యింది
ఏం ఎరువు పడుతూందో గానీ
నిద్రపోయి లేచేసరికి కవలలు పుట్టుకొస్తున్నట్లు-
రోజూ పనిగట్టుకుని
కలుపునేరి పారేస్తున్నా
సంవత్సరం గడిచే సరికి తలంతా
పుట్టగొడుగు మడయ్యింది
నుదురు ఎగుడు దిగుడు తిన్నెల ఇసుక ఎడారి అయ్యింది
అయినా నా పిచ్చి గానీ
ప్రవాహం లో నావ వెనక్కి ప్రయాణిస్తుందా!
తలపు పండకున్నా తల పండక మానుతుందా!
తలకు రంగున్నట్లు
మనసుకీ రంగుంటే ఎంత బావుణ్ణు
కాలం గబ గబా
మింగడానికి వస్తున్నా
తెల్లదనాన్ని మళ్లా రంగుల్లో విక్షేపించడానికి
కొన్ని కొత్త జీవిత పట్టకాలు కావాలిప్పుడు
నాణానికి రెండు వైపులూ చూపించే
సరికొత్త కళ్లజోడు కావాలిప్పుడు.
-కె.గీత
అల్లం రాజయ్య గారితో ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసాను. అసలు ఆయనను ఇంటర్వ్యూ చేసే అర్హత నాకు ఉందా.. అని ఎన్నో ప్రశ్నలు.
మరో అరగంటాగి వస్తారా, కూర వండుతున్నా అన్నారు. అయితే ఇప్పుడే వస్తాను, ఇంటర్వ్యూ అంటే మరీ ఫార్మల్ కాదులెండి అని మరో పది నిమిషాల్లో ఇంటి బెల్లు కొట్టాను. ఆయన తన కథల్లోని సామాన్య రైతు పాత్రల్లా సజీవంగా కళ్ల ముందు ఎటువంటి భేషజం లేకుండా లోనికి ఆహ్వానించారు. అంత వరకు ప్రశ్నలు వేసిన మనసుని పక్కకు నెట్టి పరిచయంగా వంటింట్లో నిలబడి, ఆయన చేస్తున్నది గమనిస్తూ మాట్లాడడం మొదలు పెట్టాను. వాళ్ల చిన్నమ్మాయి ఇంట్లో ఉన్నారు రాజయ్య గారు. అమ్మాయి వచ్చే లోగా కాస్త వండి పెట్టాలన్న ఆప్యాయత కలిగిన ఆ తండ్రి హృదయానికి . అందుకు జోహార్లు మనసులో అర్పించకుండా ఉండలేకపోయాను. అలా ఆయన్ని చూడగానే మా నాన్నగారు జ్ఞాపకం వచ్చి క్షణం లో బిడియాలన్నీ పోయాయి నాకు.
అమెరికా లో మీకు బోరుగా లేదాండీ. అనడిగాను, ఏమీ లేదమ్మా, ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక పనితో పొద్దు పోతుంది. ఈ పిల్లల్ని వాళ్ల చిన్నప్పుడు పట్టించుకునే సమయం లేకపోయింది. ఇప్పుడైనా వీళ్లతో గడపడం బావుంది. అన్నారు. మనుమరాలిని ఒక పక్క ఆడిస్తూ. అక్కడ గంట సేపు ఉందామనుకున్న నేను నలభై ఏళ్ల తన జీవన యానం గురించి ఆయన చెప్తూంటే ఆ దృశ్యాలన్నిటిలోకి ప్రవేశిస్తూ, ప్రవహిస్తూ మైమరిచి మూడు గంటలైనా అక్కడే ఉండిపోయాను. ప్రతి సంఘటన ఆయన మాట్లాడుతూంటే ఆ వెనుకే నేను అక్కడ అడుగుపెడ్తూ ఉన్నాను. అదొక అద్భుతమైన భావన. గుండె చెమ్మగిల్లిన కన్నీటి అలజడి. పోరాటాల అలుపెరగని ఆయాసం. సమాజం, మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాల తాత్త్విక యోచన. అడవి పొడవునా పరుచుకున్న మట్టి తీగెల రక్త సింధూరం. రాయడం తక్షణ అవసరమని భావించి నలభై ఏళ్ల పాటు ఉధృతంగా రచనోద్యమాన్ని భుజానికెత్తుకున్న అలుపెరగని శ్రామికుడు.
ఒక శ్రమ జీవి, ఒక ఉద్యమ కర్త, పీడిత జనం తరఫున నిలబడ్డ కథకుడు, ఉపాధ్యాయుడు….రకరకాల రూపాల్లో నా చుట్టూ ప్రత్యక్షమైన అల్లం రాజయ్యలలో కథకుడితో ఇంటర్వ్యూ ఇది.
Qకథా రచయిత కావడానికి దోహదపడిన మీ తొలి రోజుల గురించి చెబుతారా?
నేను తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా, మంథని తాలూకా లోని దగ్గరలో ఉన్న మారుమూల గ్రామమైన గాజుల పల్లి లో పేద రైతు కుంటుంబానికి చెందిన వాడిని. అప్పట్లో గ్రామాలలో భూస్వామ్య వివక్ష ఉండేది. పేద వాళ్ల పట్ల చాలా వివక్ష ఉండేది. అంతరానితనం బాగా ఉండేది. మేం మధ్య కులాలకు చెందిన వాళ్లం. మా నాన్న ఊర్లో పెద్దమనుషులలో ఒకరు. సహజంగానే మా ఇంటి ముందు పంచాయితీలు జరిగేవి. వాటి సారాంశమంతా పేద ప్రజల్ని ఎలా అణిచిపెట్టాలనే. ఇవన్నీ చూసి చిన్నతనంలో నాకు బాగా బాధ కలిగేది. నా మీద చెరగని ముద్ర వేసాయి. మాతో పాటూ పొలాలలో పనిచేసే మనుషులపట్ల వివక్ష అంతా అన్యాయమైందనే భావన కలిగేది.
1965 ప్రాంతం లో నేను అయిదో తరగతి చదివే సమయంలో మా అమ్మమ్మ ఊరుకు వెళ్లాను. అది మా ఊరి కంటే పెద్ద గ్రామం. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిన గ్రామం. అక్కడే దొరల వ్యవస్థని, అనేక గ్రామీణ వృత్తుల్ని నేను చూసాను. అక్కడికి వెళ్లాక ఇంకా బాగా అంతరాలకు సంబంధించిన విషయాలు బాగా అర్థం అయ్యాయి. అక్కడి నుంచి మంథనికి హైస్కూలు చదువు కోసం వెనక్కు వచ్చాను మళ్లీ.
Qస్వయంగా మీరు వివక్షని అనుభవించేరా?
అంతే కదా. నేను వెనక్కు వచ్చే సమయానికి నాకు బాగా ఊహ తెలిసింది. క్లాసులలో మొదలుకుని అన్ని చోట్లా ఒక కులాన్ని, మరొక కులం వాళ్లు వివక్ష గా చూసేవారు. హైస్కూలుకు లో అడుగు పెట్టిన తొలి నాళ్లలోనే ఒక యుద్ధవాతావరణం ఏర్పడింది. మేం గ్రామీణ పిల్లలం దుమ్ము కొట్టిన కాళ్లతో, ఒంటి నిండా వెండి ఆభరణాలతో, జుట్టు తో, వ్యవసాయ పిల్లల్లా, ఎక్కడో అడివి నుంచి వచ్చిన వాళ్లలా కనిపించే వాళ్లం. మమ్మల్ని అంతా విచిత్రంగాచూడడం, ప్రతీ దానికీ అపహాస్యం చేసేవాళ్లు. దాంతో మా హైస్కూల్లో రెండు గ్రూపులుగా ఏర్పడి అస్తిత్వాల కోసం కొట్లాటలు జరుగుతూ ఉండేవి.
అప్పటి భయంకరమైన భూస్వామ్య సమాజాల్లో మనుషుల మధ్య వివక్ష, హింస, దోపిడీ అన్నీ బాగా ఉన్న వ్యవస్థ అది. ఆ క్రమంలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన నేను జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం పిల్లలందర్నీ పోగుచేసి చుట్టు పక్కల గ్రామాలన్నీ తిరిగి కర్రల్ని సంపాదించి స్వయంగా పాటుపడ్డాను.1969 లో చివరి హెచ్ ఎస్సీ లో స్కూల్లో జనరల్ సెక్రటరీగా అగ్ర కులాలకు వ్యతిరేకంగా నిలబడి గెలిచాను.
ఇక విద్యార్థి జీవితం ముగిసాక ఉద్యోగాలలో ఎవరు ఉంటున్నారు అనే ఆలోచన మొదలైంది. సహజంగా అన్ని ఉద్యోగాలలోనూ ఆంధ్ర ప్రాంతం వారే ఉండే వారు. అప్పట్లోనే నేను ప్రత్యేక తెలంగాణా ఉద్యమం లో బాగా ఉధృతంగా పాల్గొన్నాను. అందువల్ల మా చదువు కూడా ఒక సంవత్సరం పోయింది. కేవలం విద్యార్థి ఉద్యమం కావడం వల్ల అప్పట్లో ఉద్యమం పూర్తిగా నిలబడలేకపోయింది. అది కొంత హింసాత్మకంగా మారింది కూడా.
Qపుస్తకాలతో మీ అనుబంధం గురించి-
అదే వస్తున్నా. ఇక మరో పక్క నా జీవితంలో రచయితగా అంకురార్పణ జరుగుతూ వచ్చింది. ఎనిమిదో తరగతి నుంచీ నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. మా మేనత్త, మా ఇండ్లల్లో ఓరల్ ట్రెడిషన్లో చాలా కథలు చెప్పేవారు. అంతే కాకుండా గ్రామాలలో జానపద కళాకారులు చెప్పే కథల్ని బాగా వినే వాళ్లం. ఎనిమిది లో లైబ్రరీకి మొదటిసారి వెళ్లాను. లైబ్రరీ ఎంతగా ఇష్టమైందంటే దాదాపు హెచ్ ఎస్సీకి వచ్చే సరికి నేను లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివేసాను. అక్కడే రష్యన్ సాహిత్యం, రవీంద్రనాథ్ టాగూర్, బంకించంద్ర , ప్రేం చంద్ ఇలా భారతీయ సాహిత్య కారులే కాకుండా, ప్రపంచ సాహిత్య కారులందరూ రాసిన సాహిత్యాన్ని చదివేసాను.
Qమీరు చదివిన సాహిత్యం ఎలా ప్రభావితం చేసింది?
ఒక పక్క ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, మరో పక్క వ్యక్తిగత జీవితంలో సాహిత్య పరిచయం. ముఖ్యంగా చలం రచనలతో బాగా ప్రభావితమయ్యాను.
సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలనే తపన తో అస్తవ్యస్త, గందరగోళ జీవితం ప్రారంభమైంది. రాజకీయాలు, సాహిత్యమూ మధ్య చదువు వెనక పడిపోయింది.
70 లలో వరంగల్ లో కాలేజీలో చేరాను. చేరాక పునరాలోచన మొదలయ్యింది. చదువైన సంవత్సరం తర్వాత కొంత గందరగోళ పరిస్థితినించి బయటికి వెళ్లాలనిపించి వ్యవసాయం చేసాను. మళ్లీ అక్కడా గిట్టుబాటు ధరలు లేకపోవడం, గ్రామాల్లో ఉండే సంక్షోభం వల్ల మళ్లా బయటికి వెళ్లిపోయాను. ఆనాటి గ్రామీణ సంక్షోభం, బయటి నుంచి వచ్చిన నాగరికతకు చెందిన కొత్తఆలోచనలు, గత జీవితంలోని పరిస్థితుల నించి వరంగల్ కు వెళ్లాను. అక్కడ సాహితీ మిత్రులు కలిసారు. కరీంనగర్ చుట్టు పక్కల పేద ప్రజలకు ఏదైనా న్యాయం జరిగేదుందా అని నిరంతరం ఆలోచన చేసేవాణ్ణి. నేనుచదివిన సాహిత్యంలో ఇతర ప్రాంతాలలో ఉన్న హాయైన జీవితం మా తెలంగాణా ప్రాంతంలో ఎందుకు లేదనే ప్రశ్న వెంటాడేది. 73 ప్రాంతం లో ఒక పక్క ఉద్యమ జీవితంతో బాటూ వివాహ జీవితం ప్రారంభమైంది. వెనువెంటనే నేను ఉద్యోగం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రయత్నంలో భాగంగా నాకు 75 లో అదిలాబాద్ లో ఉద్యోగం రావడం తో నా ప్రస్థానం కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ కు మారింది.
Qమీ మొదటి కథ “ఎదురు తిరిగితే” గురించి చెప్పండి.
ఎమర్జెన్సీ సమయానికి గ్రామాలకు వెళ్ళడం, ప్రజల్ని కొంత ఉత్తేజితుల్ని చేసేవాళ్లం. పత్రికలకు కరపత్రాలు రాసేవాణ్ని మొదట. మా ఊరికి పి.వి.నరసింహారావు వచ్చినపుడు ఆ సభలో ఉన్న ఒక హరిజనుడు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్యాయాల గురించి అడిగిన ప్రశ్నలకు స్పందించి నేను మొట్టమొదట “ఎదురు తిరిగితే” కథని యథాతథంగా పేర్లు కూడా మార్చకుండా రాసేను. ఆ కథలో గ్రామీణ దోపిడీ, అణిచివేత, అసంబద్ధ సంబంధాలు, గ్రామీణ వ్యవస్థ కు సంబంధించి ఒక పరిపూర్ణ చిత్రం అది. తర్వాత “క్రాంతి ” అనే పత్రికను కొద్దిరోజులు నడిపాం. ఇక కరీంనగరలో మిత్రులందరం కలిసి “విద్యుల్లత” అనే పత్రికను ప్రారంభించారు.
Qమీ రచనా ప్రస్థానం గురించి చెప్పండి.
మిత్రులు “బద్లా” అనే కథా సంపుటి వేసారు. అది ఆ తర్వాత బాన్ అయ్యింది. అందుకోసం నన్నొక కథను అడిగారు. అప్పటికే నేను కథ రాసినా అందులో చేర్చే సాహసం చెయ్యలేదు. నిజానికి పదోతరగతి నుంచి డైరీలు, కవితలు, కథలు రాసేవాణ్ణి. “ముగింపులు-ముందడుగులు” అని నవల కూడా రాసేను. అప్పటి సాహిత్యం అంటే సుమారుగా మూణ్ణాలుగు వేల పేజీలు రాసి ఉంటాను. అదంతా గాంధీ ప్రభావంతో రాసిన అహింసా రాతలు. అవన్నీ ఎక్కడా ప్రింట్ చేయించలేదు. కాలక్రమంలో అన్నీ ఎటో పోయాయి. అయితే అలా నాకు రచన అలవాటు అయ్యింది. అయితే నా ప్రాంతపు ప్రత్యేకత అప్పటికి నా రచనల్లోకి అడుగుపెట్టలేదు. మొట్ట మొదటగా “ఎదురు తిరిగితే” తో సిసలైన కథా ప్రస్థానం ప్రారంభమైంది.
Qకథల గురించి-
భారతీయ సమాజంలో ఉత్పత్తి విధానంలో ఉండే అమానవీయతని గురించి నేను సిరీస్ ఆఫ్ స్టోరీస్ రాసాను. అందులో మొదటిది మహదేవుని కల- ఉత్పత్తి విధానంలో ఉత్పత్తికి, వ్యక్తిగత ఆస్తికి వచ్చిన సంఘర్షణ కు రూపం ఆ కథ. రెండోది “మనిషి లోపలి విధ్వంసం”. వ్యవసాయాధార భారతీయ సమాజంలో ఉత్పత్తి విధానం మనిషి లోపల విధ్వంసానికి ఎలా కారకమవుతుందో చిత్రించాను. తర్వాత మధ్యవర్తులు. చదువు భూమి పుత్రుల్ని వేరుచేసి, మరలా వాళ్లనే వాహికలుగా చేసుకుని కింది సెక్షన్లని దోపిడీ చెయ్యించడం.
నీల, కమల కథలు స్త్రీల సమస్యలకు సంబంధించినవి. ఏ సమాజం మారినా స్త్రీ పాత్ర మరలా ఒకటే. అత్యంత అమానవీయ, అప్రజాస్వామికంగా మహిళల్ని చూడడానికి వ్యతిరేకంగా రాసినవి.
ప్రత్యర్థులు- రాజకీయ నాయకులకు సంబంధించినది. ఒక సమాజంలో ఎందుకు ఒక వ్యక్తి భూస్వామి గానూ, మరొక వ్యక్తి దోపిడీకి గురవుతూ కనిపిస్తాడు. అనేది ప్రశ్న.
చివరిది “అతడు” – ఇలాంటి అమానవీయ సమాజంలో నేడు అన్ని రకాల వైరుధ్యాలను అర్థం చేసుకుని, పరిష్కరించి, ప్రజలను ముందుకు తీసుకుపోయే కార్మిక వర్గ పార్టీ గురించి రాసినది.
ఇక కార్మిక కథలు. బొగ్గు గనులకు సంబంధించిన కథలు అనేకం రాసేను. నాతో రచయితలు అందరి కథలూ కలిపి సమిష్టిగా దాదాపు 50,60 అన్ని రకాల పుస్తకాలు
ప్రచురించేం. నాకు ఉద్యోగం, ఉద్యమం, వ్యక్తిగతం, రచన..ఇలా నాలుగు జీవితాలుండేవి. అన్నీ సమతూకం గా చూసుకుంటూ క్రమంగా రాసిన కథలన్నీ మొదట ప్రజా తంత్ర లో, తర్వాత ఎక్కువగా సృజన ,అరుణ తార, ఆంధ్ర జ్యోతి లాంటి అన్ని పత్రికలలో అచ్చయినాయి.
Qమీ “మనిషి లోపలి విధ్వంసం” కథ అన్ని భారతీయ భాషలలోకి అనువాదం అయ్యింది కదా? ఆ కథ లో ఉన్న గొప్ప ఫిలసాఫికల్ థాట్ గురించి చెప్పండి.
మాడ్ ఆఫ్ ప్రొడక్షన్ “మనిషిలోపలి విధ్వంసం”. భారతీయ ఉత్పత్తి విధానం మనుషుల్ని వ్యక్తిత్వం లేకుండా ఎందుకు తయారుచేస్తూంది? ఆత్మహత్యలకు ఎందుకు ప్రేరేపిస్తూంది?
మనిషికి చావు, పుట్టుకలు ఎక్కడి నించి ప్రారంభం అవుతాయి? నా ఉద్దేశ్యంలో మనిషికి చావు పుట్టిన మొదటి సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది. చిన్నతనం నుంచీ వేసే ప్రతి ప్రశ్ననీ సంహరించి రోజూ మనిషిని చంపుతూ ఉంటాం. ముందుగా కుటుంబం ఒక భయంకరమైన యూనిట్, తర్వాత స్కూలు , ఉద్యోగం, ఉత్పత్తి విధానం ఇవన్నీ అంత కంటే భయంకరమైన యూనిట్లు, కాంపులు. ఇన్నిటిని తప్పించుకుని మనిషి ఎక్కడ బతుకుతాడు? ఒక రోజులో నిర్ణయమవుతుందా మనిషి చావు? విధ్వంసమనేది ఎక్కడ జరుగుతుందనే కథ”మనిషి లోపలి విధ్వంసం”. ఇది అన్ని భారతీయ భాషల్లోకి ట్రాన్సిలేటయ్యింది. ఇంటర్నెషనల్ లెవెల్ కు కూడా పోయింది. అలెక్స్ అనే అతను ఈ కథ మీద ఎంఫిల్ చేయడానికి అమెరికా నుంచి వచ్చాడు నా దగ్గరికి.
Qనవలల గురించి-
జగిత్యాల జైత్యయాత్ర 79 లో జరిగిన తర్వాత మొత్తం గ్రామాలలో ఉండే భూమి సమస్య, రైతు కూలీ పోరాటాల సంఘటనలకు ప్రతి స్పందనగా “కొలిమి అంటుకున్నది” నవల రాసేను. ఆ తర్వాత ఊరు, అగ్ని కణం నవలలు. “అగ్నికణం”భూస్వామ్య ప్రాంతంలో మహిళలకు సంబంధించిన మానవీయ జీవితాలకు సంబంధించిన నవల.
ఇక గ్రామాలలో నిర్బంధం వచ్చాక అడవి పరిశీలన మొదలైంది. ఇక అప్పటి నుంచీ ఆదివాసీ కథల్ని రాయడం మొదలుపెట్టాను. చాలా మంది రాసేరు. అందులో భాగంగా నేను, సాహు కలిసి రాసిన పరిశోధనాత్మక నవల “కొమరం భీం”. నా చివరి నవల “వసంత గీతం”. అదంతా సాయుధ దళాల చిత్రీకరణ.
Qవిరసంతో మీ అనుబంధం గురించి చెప్పండి.
రైతు కూలీ సంఘాల ఏర్పాటు, విరసం లో సభ్యత్వం ఇదంతా ఒక ప్రయాణం. ఆ ప్రయాణం లో భాగంగా నేను తెలంగాణా, రాయల సీమ, కోస్తా ఆంధ్ర జిల్లాలన్నిటి తో పాటు, ఇతర రాష్ట్రాలలో కూడా తిరుగుతూ ఉండేవాణ్ణి. విరసంలో నేను ఎప్పుడూ సభ్యుడిగానే ఉన్నాను. నేను ప్రధానంగా రచయితను. సమాజంలోని మార్పులని రికార్డు చేసేవాణ్ణి. అందుకే నేనెప్పుడూ నాయకత్వ సమస్యలకు పోలేదు. ఆ జిల్లాలకు సంబంధించిన అనేక కథలు అంటే రైతుకూలీ సంఘాలు, ఉద్యమాలు-మారేదశలు, సంఘాల్లో వచ్చే సమస్యలు వీటికి సంబంధించిన కథలు రాసేను.
Qఎవరికోసమైతే మీరు రచనలు చేసే వారో వాళ్లకు మీ రచనలు చేరేవంటారా?
నా మొదటి రోజుల్లో నేను ఓరల్ ట్రెడిషన్ లో రాసేవాణ్ని గనుక అనేక గ్రామాల్లో అవి చదువుకునే వాళ్లు.
ఎమర్జన్సీ తర్వాత నా మొదటి కథ అచ్చయ్యింది. నేను మా ఊరికి పోతూంటే ఒక చోట ఒక అరవై మంది నిలబడి ఒకతను కథ చదువుతుంటే వింటున్నారు. అది తీరా చూస్తే నా కథ. అందులో ఉన్న వ్యతిరేకులు నన్ను కొట్టటానికి కూడా సిద్ధమయ్యారు. అలా నా కథ నా మీదనే ఎదురు తిరిగింది కూడా.
కార్యకర్తలకు చెప్పుకోవడానికి వీలైన కథలు కొన్ని రాసాను. అవి ముఖ్యంగా చైనా మొ.న దేశాల్లో ఉద్యమాల పాత్రను తెలియజేసేవి. మేధావి-మూర్ఖుడు-బానిస మొ.న చైనా కథలు ఇలాంటివి. రైతుకూలీ మహాసభలు జరిగినప్పుడు అప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనలూ అర్థంకావడానికి 3 గంటల వ్యవ్యధిలో ప్రదర్శించే పెద్ద నాటకాన్ని రాసేను.
Qసమాజంలో పీడన ఏదైనా మారిందంటారా ఇప్పటికి?
కింది సెక్షన్లలో కొంచెం తిండి దొరుకుతూంది ఇప్పుడు. పీడన రూపం మారినా భయంకరమైన దోపిడీ,హింసా తగ్గిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఉద్యమాలు, ఎకనామిక్ గ్రోత్, మార్కెట్ వ్యవస్థ లో పెరిగిన స్కిల్డ్ వర్కర్ అవకాశాలు ఇవన్నీ కారణాలు. ఇక దోపిడీ అన్ని రంగాలకు విస్తరించింది.
Qఆదివాసీ సమాజాలలో ఏదైనా మార్పు వచ్చిందా?
వనరులకు తప్ప ఆ సమాజం దగ్గర మార్కెట్ ఎకానమీకి పనికొచ్చే స్కిల్ లేదు. కనుక వాళ్లను నిజంగా అభివృద్ధి చెయ్యడానికి సంబంధించి మనస్ఫూర్తిగా ఏ సమాజమూ సిద్ధంగా లేదు. ఇప్పుడూ వనరుల దోపిడీ కొనసాగుతూనే ఉంది. అక్రమ గనులు తవ్వకాల వల్ల నిర్వాసితులయిపోయిన జీవితాలెన్నో. ఆదివాసీ సమాజాలు సామ్రాజ్యవాద వ్యతిరేకంగా సమీకరించబడుతూ ఉన్నాయి. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.
Qతెలంగాణా రచయితగా మీకు ఎప్పుడైనా ఐడెండిటీ క్రైసిస్ ఏదైనా వచ్చిందా?
లేదు. నాకెప్పుడూ రాలేదు. ముందుకుపోతున్న జీవితంలో ముందుకు తీసుకెళ్తున్న అనేక మందితో కలిసి నడవడం పట్ల ఉన్నదృష్టి నా రచనలపట్ల ఎప్పుడూ లేదు నాకు.
ఆచరణ ముఖ్యమైనది. అదీగాక ఎవరు మంచి కథ రాసినా అది నాదే అన్న భావనకు లోనవుతాను. నాకు తెలిసినంతవరకు సాహిత్యం వ్యక్తిగతమయింది కాదు. అది నా స్వంత ఆస్తి కాదు. అందుకే నాకు సంక్షోభం లేదు.
Q2000 తర్వాత మీరు రచనలు చెయ్యకపోవడానికి కారణం ?
నా వరకు నేను భూస్వామ్య, పెట్టుబడిదారీ, ఉద్యమ సమాజాల్ని చిత్రించాను. 2000 నుండీ ఇప్పటివరకూ జరుగుతున్న ఈ పెను మార్పుల్ని చిత్రించలేదు.
అంతా ఇంకా పరిశీలన చేస్తూ ఉన్నాను. ప్రపంచ విప్లవాల్లో వచ్చిన ఒంటరితనం గురించి రాయాలని అనుకుంటున్నాను. ఏదో ఒక ప్రక్రియ రోజూ రాస్తాను. కానీ ఫిక్షన్ రాయలేదు. చాలా మంది రచయితలు రాసిన వాటీకి చేదోడు, వాదోడుగా ఉండడం, చదవడమూ చేస్తున్నాను ఇప్పటికీ. అవసరమైతే క్లాసులు, చర్చావేదికలు పెట్టడం మొత్తంగానైతే సాహిత్యం తోనే తిరుగుతున్నా.వీరోచితమైన, విషాద భరిత ఉప్పెన లాంటి జీవితంలో నడిచొచ్చిన వాణ్ణి. నాకు తప్పకుండా రాయాలనిపిస్తే రాస్తాను ఎప్పుడైనా. రాయాల్సిన అవసరం పడాలి అంతే.
ఇంటర్వ్యూ: కె.గీత
రాజయ్య గారి ఫోటో: అల్లం చందన
వాళ్లిద్దరూ
ఈ ప్రపంచంలో ఇప్పుడే కొత్తగా ఉద్భవించినట్లు వాళ్ల ప్రపంచంలో వాళ్లుంటారు
చెట్టు కాండాన్ని కరచుకున్న తొండపిల్లలా
ఆ పిల్ల ఎప్పుడూ “డాయీ ” ని పట్టుకునే ఉంటుంది
పిల్లకు డాయీ లోకం
డాడీకి పాపాయి ప్రాణం
ఉన్నట్లుండి పిల్లని గుండెకు హత్తుకుని
ముద్దుల వర్షం కురిపిస్తూ
నిలువెత్తు వానలో పూల చెట్టు కింద నిలబడ్డట్లు
హర్షాతిరేకంతో మురిసి పోతుంటాడా నాన్న
అమ్మ కడుపు నించి పుట్టలేదా పిల్ల
నాన్న పొట్ట చీల్చుకుని ఉద్భవించినట్లుంది
పాల గ్లాసునీ, నీళ్ల గ్లాసునీ నాన్న పట్టుకుంటే తప్ప తాగదు
ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే అతడు
పాపాయితో గల గలా కబుర్లు చెబుతాడు
పాపాయి వచ్చీ రాని ఊసులేవో బాగా అర్థమైనట్లు
తల పంకిస్తూ పిల్ల తలనిమురుతాడు
ఎప్పుడూ వెనక్కి చూడని వాడు
ఆఫీసుకెళ్తూ
తలుపు జేరేస్తూ
రోజూ మళ్లొక్కసారి వెనక్కి వచ్చి పాపాయిని చూసుకుంటాడు
నాన్న గుండెపై నిద్రించే
పసిదానికి నిద్రాభంగం కాకూడదని
మడత కుర్చీలోనే కునికి పాట్లు పడతాడు
“డాయీ” అని పిల్చినప్పుడల్లా “అమ్మా పాపాయి”
అని గబుక్కున పరుగెత్తుకెచ్చే అతడు
పిల్లకాలువల్ని ఎత్తుకుని ఉప్పొంగిన నదీ ప్రవాహంలా
నాన్న భుజమ్మీద ఆనందంగా ఒరిగే పాపాయి
నదీ కెరటాల్ని కప్పుకుని స్థిమితంగా నిద్రోయే పిల్లకాలువలా
కనిపిస్తారు
పాపాయికి జ్వరం వచ్చినప్పుడు పొద్దుటికి లంఖణాలు చేసినట్లు
పీక్కుపోయిన నాన్న ముఖం
చిర చిరలాడే ఎండలో నెర్రెలు చాచిన నేలలా కళ్లలో దు:ఖ జీరలు
పిల్ల కి నయమయ్యేంత వరకు బాధతో గర గరలాడే నాన్న గొంతు
పాపాయికి అర్థమైనట్లు ఆత్రంగా నాన్న భుజాన్ని అల్లుకుని
చెవులు చీకుతుంది
పిల్ల బాధ నాన్నకు ప్రాణ సంకటమయ్యినట్లు
తనలో తను గొణుగుతూ పిల్లని హత్తుకుని ప్రార్థిస్తూంటాడు
అంతలోనే అంతా నయమయ్యి హుషారు వచ్చిందంటే
బువ్వాలాటలు
బూచాటలు
ఏనుగాటలు
వీళ్లే కనిపెట్టినట్లు
గొప్ప ఉత్సాహంతో నవ్వులు వినిపిస్తూంటాయి
వాళ్లిద్దరి సంతోషాలు ఇల్లంతా ఇంద్ర ధనుస్సులై దేదీప్యమానం చేస్తాయి
నక్షత్రాలు బిలా బిలా పక్షులై రెక్కలారుస్తూ
ఇంట్లో వాలతాయి
చురుకైన పాపాయి కళ్లే
నాన్న పెదవులై మెరుపై మెరిసినట్లు
నాన్న ప్రేమంతా
స్పర్శై గుండెల్లో పులకింతై మొలిచినట్లురెండే మాటలు
ఇంట్లో ప్రతిధ్వనిస్తూంటాయి
డాయీ- పాపాయీ
ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
తాజా కామెంట్లు