జ్ఞాపకాల నీడలలో…

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

 

*

కూపస్థమండూకాన్ని మరపించే నిర్విరామ జాగృదావస్థ.

రెప్పలు విప్పుకున్న అతడి కళ్లలోకి వెలుగురేఖల్ని సూర్యుడు నిర్విరామంగా గుచ్చుతున్నాడు. సూది మొనల గాయాల్తో కనుగుడ్ల చుట్టూ, ఎరుపు రంగు చిక్కబడుతోంది. ఆ చిత్రహింసకి తెర లేపినవి, తెరిచున్న కిటికీ రెక్కలు.  ఆవిష్కృతమైన ఆ మనోజ్ఞ దృశ్యాన్ని అవి, అలవాటుగా తనివి తీరా చూస్తున్నాయి.

ఓ పక్కకి వొరిగి పడుకున్న అతడు, ఆ నొప్పి భరించలేక వెల్లకిలా తిరిగాడు.

కొలుకులమీద నులివెచ్చటి రక్తం తడి. జిగటగా అనిపించని కన్నీళ్లు, వేళ్ల చివళ్లతో తుడుచుకుని పైకి ఒకసారి చూశాడు. పంకా రెక్కల సవ్వడి. గాలి వీస్తున్నట్లుగా అనిపించటం లేదు. వినిపిస్తున్నట్లుగా ఉంది.  స్పష్టంగా కనిపిస్తున్న ఒక అస్పష్టత. అలవాటుగా మారిన మెలకువని రెచ్చగొడుతున్న అలసట.

ఆశల్ని ఊపిరిగా పీలుస్తున్న మెదడు. ఉన్నట్లుండి ఒక ఉక్కిరిబిక్కిరి. శ్వాస ఆడకుండా ఒక నిస్పృహ  అదుముతున్న అనుభూతి. స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించి సహాయం కోసం కేక వేశాడు. అరుపు గొంతులోనే  సజీవసమాధి అయింది. నిస్సహాయంగా కుడి ప్రక్కకి తిరిగి చూశాడు. ఒక అదృశ్యదృశ్యం గోచరించింది.

ఎదురుగా చెలి. ఆమె పెదాలపై విరిలా విప్పారిన విషహాసం. అతడి గుండెలమీద ఆమె కుడి చేయి.

అరచేతిలో కర్కశత్వం. అయిదు వేళ్లూ ముళ్లలా అతనికి గుచ్చుకున్నాయి. ఒకప్పుడు మైమరపు కలిగించిన స్పర్శ ఇప్పుడు వెరపు కలిగిస్తోంది. లోపం ఎక్కడుంది? ఆమె తనని ఉపయోగించుకుంటున్న విధంలోనా? తాను ఆమెని వినియోగించుకుంటున్న విధానంలోనా? బోధపడలేదతడికి.

ఈ మధ్యన జరిగిన సంఘటనలు కొన్ని ఒక్కసారిగా అతడికి గుర్తొచ్చాయి. అవి తలపుకి రావటం వెనక సైతం తనకెదురుగా ఉన్న చెలి హస్తముంది. ఆ విషయం అతడికి తెలుస్తోంది.

***

“ఇన్నాళ్లకి, నేను గుర్తొచ్చానా?” నిష్టూరంగా అడిగింది చెలి.

“నువ్వు నాతో లేకపోవటమే కదా నాకు గుర్తు రాకపోవటానికి కారణం!” అతడు జవాబిచ్చాడు.

“మాటలతో బాగా ఆడుకోగలవు. అవి నిజమని నమ్మించగలవు,” అంటూ ఆమె నవ్వింది. విడకుండానే విచ్చుకున్నట్లుగా అనిపించే పెదాలు. ఒక ముకుళితవికసనం.

“ఇక నుంచి నేను నీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. ఇది మాత్రం నిజం. నువ్వు నా మిగిలిన మాటలు నమ్మకపోయినా ఫర్లేదు. ఈ ఒక్క మాట మాత్రం నమ్ము,”

“నీ నెచ్చెలి అంత త్వరగా నిన్ను వదిలిపెడుతుందా?” అనుమానం వ్యక్తపరిచింది చెలి.

“ఇన్నాళ్లూ నిన్ను వదిలి ఆమె దగ్గర పూర్తిగా ఉండలేదా? అది నువ్వు సహించలేదా? మౌనం వహించలేదా? ఇప్పుడు అదే పని  తానూ చేస్తుంది,”

“నీ ఇష్టం,”

“నీ దగ్గరకు నేను రావటం, ఎవరికయినా అభ్యంతరమా?”

“నా జీవితంలో ఉన్నది నువ్వు ఒక్కడివే. నువ్వు దూరమయినప్పట్నుంచీ నేను ఒంటరినే!”

ఏదో ఒక రోజు అతడు తన దగ్గరకి వస్తాడని ఆమెకి తెలుసు. ఆమెకు కావాల్సిందీ అదే.

***

ఇప్పటివరకూ తనతో సఖ్యంగా సహజీవనం చేస్తున్న అతడు ఈ మధ్యన తరచుగా అన్యమనస్కంగా ఉండటం, నెచ్చెలి గమనించింది.

“ఈమధ్య మీకు నా ధ్యాస ఉండటం లేదు. పరధ్యానంగా ఉంటున్నారు. ఎదురుగా ఉన్నట్లే ఉంటున్నారు. ఎక్కడెక్కడికో వెళ్లివస్తున్నారు.  ఏమైంది మీకు?” ఒక రోజు అతడ్ని నిలదీసి అడిగింది. నిశ్చలచలనం.

“అలాంటిదేం లేదు. నువ్వనవసరంగా అనుమానపడుతున్నావు,” అతడు తన మనసు కప్పి పుచ్చుకోవటానికి ఒక విఫల ప్రయత్నం చేశాడు.

ఆ జవాబు చెప్పేప్పుడు అతడి చూపు ఆమె కళ్లలోకి సూటిగా లేదు. అదొక్కటి చాలు, అతడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అన్నది ఆమె తెల్సుకోటానికి!

“ఆ మాత్రం గ్రహించలేననుకోకండి. మీరు వెళ్తున్నది ఒకప్పటి మీ చెలి దగ్గరకేగా?” ఎప్పుడూ సరళీస్వరాలు వినిపించే నెచ్చెలి గొంతు ఉన్నట్లుండి పరుషంగా ధ్వనించింది.

ఈ విషయం ఆమెకెలా తెలిసింది? అతడికి అర్థం కాలేదు.

“బంధాన్ని ఎంతవరకు పెంచుకోవచ్చో తెలీకుండానే, ఆమెతో బలమైన అనుబంధాన్ని మీరు మళ్లీ కోరుకుంటున్నారు. నేను వద్దంటానని, ఆ విషయం నా దగ్గర దాచారు. అవునా?” అడిగింది.

“నీతో పాటు ఆమె కూడా కావాలనిపిస్తోంది. అందుకే ఆమె దగ్గరకి మళ్లీ వెళ్తున్నాను,” అన్నాడు అతడు.

“ఒకప్పటి మీ స్నేహం నాకూ తెలుసు. నాకు దూరం కానంతగా ఆమె దగ్గరకూ అపుడపుడు వెళ్తుండండి. అంతవరకూ నాకు అభ్యంతరం లేదు. కాని, అది వ్యామోహం క్రింద మారకుండా చూసుకోండి,”

ఆమె గొంతులో ధ్వనించిన ధృడత్వానికి అతడు విస్తుపోయాడు.

***

చెలి సాంగత్యంలో ఇంతకు ముందెరగని ఒక ఆనందం. ఆమె సాన్నిధ్యంలో నెచ్చెలి హెచ్చరిక అతడికి గుర్తు రావటం లేదు. ఇంతకుముందుకన్నా అతడు ఏకాంతాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాడు. ఇష్టపడుతున్నాడు. వీలు దొరికినప్పుడల్లా చెలితోనే గడపటానికి తాపత్రయపడుతున్నాడు. ఇవన్నీ నెచ్చెలి దృష్టిని దాటిపోలేదు.

“నా మాటని మీరెందుకు లక్ష్యపెట్టటం లేదు?”  ఒక రోజు అతడి చెయ్యి పట్టుకుని కోపంగా అడిగింది.

“…”

“నన్నెందుకు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు?”

“నీ కన్నా చెలితో గడపటమే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది. అందుకని!” అసలు విషయం చెప్పాడు అతడు. చెప్పింతర్వాత ఎందుకు చెప్పానా? అని బాధపడ్డాడు. గతజల సేతుబంధనం.

ఆ మాటతో నెచ్చెలి ముఖకవళికలు మారిపోయాయి.  దీపకళికని అంధకారం అంతమొందించింది.

***

“ఎంత సేపు మీలో మీరు ఉంటారు. బయటికి రండి. అలా  కాసేపు తిరిగొద్దాం,” అడిగింది చెలి.  నిక్వణం పలికిస్తానని నమ్మించి, విపంచి తంత్రుల్ని తెంచే ప్రయత్నం.

మొదట్లో ఆమె తనని ఆహ్లాదం కలిగించే ప్రదేశాల దగ్గరకే ఎక్కువగా తీసుకెళ్లేది.  క్రమంగా అది తక్కువైంది. ఇప్పుడు ఆమె తనను తీసుకు వెళ్తున్నది రెండే చోట్లకి.

ఒకచోట, ఒకప్పుడు  తనకు తెలిసి ఏమీ లేదు. ఆ శూన్యాన్ని ఇప్పుడొక శ్మశానం కౌగలించుకుంది. దాంతో అదిపుడు  అంతరించిన అంతశ్చేతనకి ఆలవాలం. చెవుల్లో ఇంకా ధ్వనిస్తున్న చరమగీతం చరణాలు. ఇంకా పూర్తిగా ఆరని చితులు. ఆర్తితో సగంలో ఆగిపోయిన మంటలు. అర్ధభాగం కాలి నిరర్థకంగా మిగిలిన అనుభవాల శవాలు. ఘనీభవించిన విషాదం. దాన్ని అశ్రువులుగా స్రవింపచేయటానికి ఉండుండి ఎవరో గుండెలు బాదుకుంటున్న చప్పుడు. దిక్కులు పిక్కటిల్లేలా ఒక ఏడుపు. అపస్వరఅష్టమస్వరం.

రెండోచోట నిన్నో మొన్నో ఆమని నిష్క్రమించిన వని, పూవని. పచ్చదనం వలువలు పోగొట్టుకుని నగ్నంగా నిలబడ్డ వాంఛావృక్షాలు. తలలొంచిన స్వప్నలతలు. వాటి వైఫల్యం. సాఫల్యత సిద్ధించకుండానే రాలిపోయిన సుమదళాలు. అలరించకుండానే అవనిలో కలిసిపోయిన సురభిళపరిమళాలు. కనిపించే మూగవేదన. వినిపించని మౌనరోదన. జలవీచికల బదులు మరీచికలు.

విభిన్నరూపాల్లో బీభత్సం, భయానక వాతావరణం. జుగుప్స, భయం; ఒక్కోదానికి ఒక్కో స్థాయీభావం.   ఇవేవీ తాను మళ్లీ మళ్లీ చూడాలనుకునేవి కావు.

సింహావలోకనం చేసుకుంటే, అంతా ఒక హింసావలోకనం. నెచ్చెలి తోడులో ఎంత వేదనయినా ఎక్కువగా వేధించేది కాదు. చెలి సాన్నిహిత్యం అలా అనిపించటం లేదు. ఒకప్పుడు అద్దంలో చూసిన అగ్నిపర్వతం ఇప్పుడు భూతద్దంలో దర్శనమిస్తోంది. భూతంగా మారిన ప్రస్తుతం, భూతంలా భయపెడుతోంది.

ధైర్యం తెచ్చుకుని చెలిని అడిగాడు, “నాకు చూపించటానికి ఇంతకన్నా మంచిచోట్లేవీ లేవా నా గతంలో?”

“క్లుప్తమైన సరిగమలు. లుప్తమైన మధురిమలు. సంక్షిప్తంగా నీ జీవితచిత్రం ఇది. వెన్నెలరాత్రులూ, విహారయాత్రలూ ఉండుంటే నువ్వడక్కుండానే నేను వాటిదగ్గరికే  నిన్ను తీసుకెళ్లేదాన్ని. వాటిని నీ నెచ్చెలి మాయం చేసింది. లేని వాటిని చూపించలేదని, నన్నని ఉపయోగం ఏముంది?” అన్నది ఆమె.

ఆ గొంతులో లీలగా ధ్వనించిన వెటకారం, అవలీలగా అర్థమైంది అతనికి.

Kadha-Saranga-2-300x268

***

నెచ్చెలి సోదరి ఇంతకుముందు రోజుకు ఒకసారైనా తన దగ్గరకు వచ్చేది. వచ్చినప్పుడల్లా తన చెల్లెల్ని  ప్రేమగా కౌగలించుకునేది. మనఃస్పూర్తిగా తనని పలకరించేది. ఉన్నట్లుండి రావటం మానేసింది. ఎందుకో తెలీదు.

“ఈ మధ్యన మీ అక్కయ్య కనపడటం లేదేం?” తనకి అందుబాటులో లేకుండా తలుపులు బిగించుకుని  దాక్కున్న నెచ్చెలిని అడిగాడు.

మౌనం సమాధానమయింది.

నేరుగా నెచ్చెలి సోదరినే అడిగితే సరి. ఉదయం ఆమె గృహోన్ముఖురాలయే సమయం.

ఆమె రాక కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. తేజస్సును విరజిమ్ముతూ, తేలుతున్నట్లుగా నడిచి వస్తూ దూరంగా ఒక కాంతిపుంజం. క్రమంగా అది పెద్దదయింది. ఆ రూపం ఒక ధవళవస్త్రధారిణిది. ఆమె సమీపిస్తున్న కొద్దీ పరిసరాలన్నిటా పరివ్యాపితమై ఒక సాంత్వనాగీతం.  మలయమారుతం.

“మీ కోసం ఎదురు చూస్తున్నాను,”

“నాతో మీకేం పని?”

“ఒక్క మాట అడుగుదామని,”

ఆగకుండా వెళ్తున్న ఆమె చెయ్యి పట్టుకుని ఆపాలని ప్రయత్నించాడతను. ఆమె వొంటి స్పర్శ అతడికి తెలీలేదు. కాని, అతడి స్పర్శ తనకి తగిలినట్లు, అది రుచించనట్లు ఆమె విదిలించుకుంది. ఓ క్షణం ఆగింది. రాత్రంతా తనకి తాను లేనట్లు బరువెక్కిన కళ్లు.

ఏమిటో చెప్పమన్నట్లు అతడి వంక అసహనంగా చూసింది.

“నా మీద కోపం వచ్చిందా? రావటం మానేశారు!”

“కోపం రాలేదు. మీరే తెప్పించారు,”

“బహిరంగంగా ఎందుకు? నా తలపుల్ని తెరుస్తాను. లోపలకి వస్తే ఆన్ని విషయాలూ సాకల్యంగా మాట్లాడుకోవచ్చు,” ఆప్యాయంగా  ఆహ్వానించాడతను.

“ఆ అవసరం లేదు,” కర్కశంగా జవాబిచ్చింది ఆమె.

“ఇంతకు ముందు రోజూ వచ్చేవారుగా?”

“అంతకు ముందు నా చెల్లెలు నీ దగ్గర ఉండేది. సుఖపడుతుండేది. నిన్ను సుఖపెడుతుండేది. అందుకని నేను స్వేచ్ఛగా రాగలిగేదాన్ని. ఇప్పుడా అవకాశం లేదు,” అంది ఆమె.

“ఇప్పుడు కూడా ఆమె నా దగ్గరే ఉందిగా?”

“ఉంది. కాని ఇంతకు ముందులా లేదు. చిక్కి శల్యమైంది,”

“మీకెలా తెలుసు?”

“నీకు కనపడనంతమాత్రాన, ఇంకెవరికీ  కనపడదనుకోకు,”

అందుకనేనా? ఎప్పటెప్పటి విషయాలో  ఒకటొకటి తన మీద దాడి చేస్తున్నది! వాటి వెనక ఉండి వాటిని చెలి రెచ్చగొట్టగలుగుతున్నది! పగబట్టినట్లు వాటిని తట్టి లేపి తనవైపు తరమగలుగుతున్నది!

నెచ్చెలి సోదరి వాటివంక నిర్నిమేషంగా చూస్తోంది.

***

కనపడిన రెండు నిజాలనీ అతడు జీర్ణించుకోలేకపోయాడు. అలాగే కూర్చుండిపోయాడు. ఒక్క నిమిషం తర్వాత తేరుకుని, “ఇప్పుడు నేనేం చెయ్యాలి?” ఇంకా తన ఎదురుగా నిలబడే ఉన్న నెచ్చెలి సోదరిని  నిస్సహాయంగా అడిగాడు.

“చేయగలిగిందేమీ లేదు. మా అమ్మ రాక  కోసం నువ్వు ఎదురు చూడాల్సిందే!”

“నెచ్చెలికి నా వల్ల జరిగిన హాని తెలిసి కూడా,  మీ అమ్మ నా దగ్గరకు వస్తుందా?”

“కన్నకూతుళ్లు కదా! రాక తప్పదు,”

“వచ్చి ఏం చేస్తుంది?” అయోమయంగా అడిగాడు అతడు.

“తన కూతుళ్లని తనతో తీసుకు వెళుతుంది,”

“నా సంగతో?”

“ఆమె వస్తే నీ దగ్గర నువ్వూ మిగలవు!” ”

-o) O (o-

 

 

 

తప్పుల వెనక మూగ రోదన!

 

 

టి. చంద్రశేఖర రెడ్డి

~

          పాఠకులు-పరిణామక్రమంలో కథకులో, సమీక్షకులో/విమర్శకులో అవుతారు. కాని, ఎంత మంది కథకులు తమ రచనలకు/వాటి పుస్తకరూపానికి నిబద్ధత గల ప్రూఫ్ రీడర్ అవుతారు?

ఈ ప్రశ్నకు సరైన జవాబు; వ్యక్తులెవరూ చెప్పనవసరం లేదు. తప్పులతడకలుగా వస్తున్నందుకు మూగగా రోదిస్తున్న రకరకాల రచనలే మౌనంగా సమాధానిస్తాయి.

ఆ రోదనకి కారణం రకరకాల ముద్రా రాక్షస చర్యలు.  వాటిని నివారించలేని, తొలగించలేని పరిస్థితులు.

అలాంటి వాటిని కొన్నిటిని ఈ వ్యాసం బహిర్గతం చేస్తుంది. ఈ ప్రయత్నానికి మద్దతుగా ఇచ్చిన ఉదాహరణలు నేను సృష్టించినవి.

అసలు రచనలనుంచే కొన్ని ఉదాహరణలు  ఇవ్వవచ్చు. ఇవ్వకపోవటానికి కారణం చెప్పకుండానే అర్థం చేసుకోవాల్సినది, చేసుకోగలిగినది.

  1. మన చేతిలో ఉన్న పుస్తకం కవరు పేజీ మీద కథల సంపుటి పేరు ‘విడాకుల పర్వం’ అని అందమైన అక్షరాలతో ఉంది. అదే సంపుటి వెన్నెముకపై ఆ పేరు కాకుండా  ‘నూరేళ్ల పంట’ అని ఇంకో పేరు అంతకన్నా అందంగా తీర్చిదిద్దబడింది. మొదటిది ప్రస్తుత కథల సంపుటి పేరు. రెండోది అదే రచయిత వెలువరించిన ఇంతకు ముందు కథల సంకలనం పేరు. కవరు పేజీ డిజైన్ చేసినపుడు ఒక చోట పేరు మార్చి, మరో చోట మార్చకపోవటంతో దొర్లిన పొరపాటిది. ఆ తప్పుతో, ఇప్పుడొక ప్రముఖ రచయిత కథల సంపుటి మార్కెట్లో ఉంది.
  2. రచనలో ప్రతి పేరా ఒక చోటే మొదలు కాకపోవటం. ఇది రెండు రకాలు. ఒకటి ప్రగతిపథంలో దూసుకుపోవటం. రెండవది వెనకబడిన వర్గానికి చెందాలనుకోవటం.

            “మీరిద్దరూ ఒకసారి నాతో బయటికి రావాలి” పెళ్లి జరిపిస్తున్న బ్రాహ్మణుడి సూచనతో పెళ్లికొడుకు లేచి నిలబడ్డాడు. అతడితో పాటు పెళ్లికూతురు కూడా లేచి నిలబడింది. వాళ్లిద్దరూ బ్రాహ్మణుడి వెంట ఫంక్షన్ హాల్ బయటికి నడిచారు.

“ఇప్పుడు బయట మాతో ఏం చేయిస్తారు?”  తన పక్కనే ఉన్న అన్నని నెమ్మదిగా అడిగాడు పెళ్లికొడుకు.

“మీ ఇద్దరికీ ఆకాశంలో ఉన్న అరుంధతీ నక్షత్రం చూపిస్తారు, ” అన్న లోగొంతుకతో జవాబిచ్చాడు.

వధువుతో పాటు అరుంధతి నక్షత్రం చూడటానికి ప్రయత్నిస్తున్న వరుడికి వివాహప్రక్రియలో,  ఒక భాగంగా ఈ క్రియ ఎందుకో  అర్థం కాలేదు.  పెళ్లైనతర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరికి లేదా ఇద్దరికీ చుక్కలు కనపడతాయనటానికి ముందస్తు సూచనా ఇది?  తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది అతడికి.

  1. 0 విడిగా జీవించాల్సిన పదాలు సహజీవనం చేయటం.

అప్పుడేవిచ్చుకున్నగులాబీలా (ఈ మూడు పదాలూ కలిసి ఉండకూడదు) ఉంది కొత్త పెళ్లి కూతురి ముఖం. ఆమె మెడలో తాను వేసిన మూడు ముళ్లు, ముళ్లై గుచ్చుకుంటాయా తనకి, ముట్టుకోబోతే?ఎర్రబడ్డ వధువు కళ్లు చూస్తున్న వరుడికి అనుమానం కలిగింది.

  1. 0 పదాల్లో అక్షరాల మధ్య సమైక్యత లోపించి విడిపోవటం.

ఇంట్లో ద్వారాలకీ, కిటికీలకీ వేలాడుతున్న తోరణాల్లో ఎండిపోయిన మామిడి ఆకుల వంకా తన చేతిలో ఉన్న కాగితాల వంకా మార్చిమార్చి చూశాడతను. అది అతడికి భార్య పంపిన విడా  కుల (విడాకుల అని ఉండాలి) నోటీసు.

  1. 0 వాక్యంలో ఒక పదం బదులు ఇంకో అర్థం వచ్చే పదం రాయటం.

ఇద్దరి వైపూ పెద్దలు కూర్చుని రాజీకి ప్రయత్నిద్దామని అనుకుంటున్న సమయంలో అర్థంతరంగా ఈ నోటీసు ఏమిటి? (అర్థంతరంగా అంటే అర్థంలో భేదంతో అని. అర్ధంతరంగా అని ఉండాలి)

  1. 0 ఒక వాక్యం (బ్రాకెట్లలో ఉన్నది) పూర్తిగా లేకపోవటం.

బాసింపట్టు వేసుకుని కూర్చున్న అతని పక్కన ఆమె-మోకాళ్ల మధ్యలో తలదూర్చి అతడి వైపు తమకంతో చూస్తూ. ఆమె కాళ్లు బార్లా చాపి ఉన్నాయి. (ఇద్దరి పాదాలనూ తాకి వెనక్కి మళ్లుతున్న సముద్రకెరటాలు). అతడికి, దోసిళ్లతో వాటిని పట్టుకుని తాగాలనిపించింది.

  1. ఓ పంక్తి చివర పదంలో ఓ అక్షరం ఉండిపోయి, మిగిలిన అక్షరాలు రెండో పంక్తి మొదట్లోకి వెళ్లిపోవటం. ఈ జబ్బు ఎక్కువగా ‘ఉ’ అక్షరంతో మొదలయ్యే పదాల్లో కనపడుతోంది.

కొడుకుల చేతుల్లో తియ్యటి చెరకు రసం. వరండాలోని మడత మంచంలోకి విసిరేయబడ్డ పిప్పి

న్నట్లుండి (ఉన్నట్లుండి అనే పదంలో అక్షరాలన్నీ ఒకే చోట ఉండాలి) ఖళ్లుఖళ్లున దగ్గుతోంది.

  1. అక్షరాలకి గుణింతం లోపించటం.

ఈ వయసులో తనకి ఆసరాగా నిలబడాల్సిన ఒక్క కొడుకూ, తనన (తనని అని ఉండాలి) ఇలా వదిలేస్తాడని తవిటయ్య కలలో కూడా ఊహించలేదు.

  1. ఒక వాక్యంలో భాగమో, వాక్యమో, వాక్యాలో-అదే పేరాలో రెండో సారి పక్కపక్కనే రావడం. ఇలాంటి పొరపాటు సాధారణంగా ఒక పేజీ చివరనుంచి, మరో పేజీ మొదటికి వెళ్ళినపుడు జరుగుతుంది.

చనిపోతూ భార్య కోరిన ఆఖరి కోరిక తీర్చటం వల్ల తనకీ పరిస్థితి దాపురించిందా? ఒక సారి తల బాదుకున్నాడతను. (పేజీ ముగింపు)

చనిపోతూ భార్య కోరిన ఆఖరి కోరిక తీర్చటం వల్ల తనకీ పరిస్థితి దాపురించిందా? ఒక సారి తల బాదుకున్నాడతను. (తర్వాత పేజీ మొదలు)

  1. 10. అవసరం లేని చోట ఒక అక్షరానికి గుణింతం వాడటం.

తన మనసు ఇంతగా పరిణితి ఎప్పుడు చెందిందో ఆమెకి తెలీటం లేదు. అది కూడా పరిణితి చెందితేనే తెలుస్తుందేమో? (పరిణితి కాదు పరిణతి).

  1. 11. అక్షరాలకి ‘ఒత్తు’ తప్పుగా ఇవ్వటం.

అలాగైతే సెకండ్లూ గంటలూ ఏమిటి? అతడికి అర్ధం కాలేదు (‘థ’ ఒత్తు బదులు ‘ధ’ ఒత్తు).

  1. 12. అసలు వాడకూడని ‘ఒత్తు’ ని వాడటం.

పెళ్ళిపీటల మీద కూర్చున్న అతనికి అవి ముళ్ళకంచెల్లా అనిపిస్తున్నాయి (‘ళ’ ఒత్తు ఏ అక్షరానికీ వాడకూడదు. అన్ని సందర్భాల్లోనూ ‘ల’ ఒత్తే వాడాలి).

  1. 13. పదంలో ఒక అక్షరానికి వాడాల్సిన గుణింతాన్ని ఇంకో అక్షరానికి ఉపయోగించటం.

ఆ భ్రమ కలిగించిన భయంతో ఉన్న అతడికి, పెళ్లికూతురు పెదాలపై చిరునవ్వు చూసి కొంచెం స్వాంతన కలిగింది. (‘సాంత్వన’ బదులు ‘స్వాంతన’).

  1. పదంలో వాడకూడని అక్షరాలని వాడటం.

కళ్యాణమంటపం అనే పదబంధంలో ‘మంట’ అనే పదం ఎందుకుందో, పెళ్లైన సంవత్సరానికి కాని అర్థం కాలేదతనికి (‘కళ్యాణ’ అని రాయకూడదు-‘కల్యాణ’ అని ఉండాలి).

  1. 15. పదంలో ఉండాల్సిన అక్షరాలు లేకపోవటం.

వద్దన్నా వెంటపడుతున్న ఆమె జ్ఞాపకాలు అతడి మనసును అతలాకుతం (అతలాకుతలం అని ఉండాలి) చేస్తున్నాయి.  

  1. 16. ఒత్తు సరిగా వాడి, అక్షరం తప్పు రాయటం.

గతం స్మశానమైతే స్మృతులు మరణించిన అనుభవాలకి సమాధులా? (‘స్మ’  కాదు, ‘శ్మ’ అని ఉండాలి).

  1. 17. ఒక పేజీ పూర్తిగా డి‌టి‌పి కాకపోవటం.

ఇంటిముందు నిలబడి అనుమానంగా కాల్ బెల్ నొక్కాడతను. లోపలినుంచి ఎవరో నడిచి వస్తున్నట్లు అడుగుల చప్పుడు. నెమ్మదిగా తలుపులు తెరుచుకున్నాయి.

(మధ్యలో ఒక పేజీ లేదు)

ఎదురుగా విశాలంగా వినీలంగా ఒక కల్లోలిత సముద్రం. ఉవ్వెత్తున లేచి పడుతున్న అలలు. ఆ హోరు వింటూ చేష్టలుడిగిపోయి అతడు నిలబడ్డాడు.

  1. 18. ఒక వాక్యంలో పదాలు తర్వాత వాక్యంలో భాగంగా మారటం.

ఆమెకి దుఃఖం వచ్చింది. అతడి మాటలు గుర్తొచ్చి, దూరంగా ఎవరో నవ్వుతున్న సవ్వడి (ఆమెకి దుఃఖం వచ్చింది అతడి మాటలు గుర్తొచ్చి అనేది ఒక వాక్యం. మిగిలింది ఇంకో వాక్యం.)

  1. సంబంధం లేని అక్షరాలు పదాలతో జత కట్టటం.

నీళ్లొచ్చినంత మాత్రాన నల్లాలూ, కళ్లూ ఒకటే అనుకుంటే ఎలా!1 (ఆశ్చర్యార్థకం, 7 అంకె కీ బోర్డ్ లో ఒకే ‘కీ’ గా ఉంటాయి. అందుకే రెండు ఆశ్చర్యార్థకాల బదులు ఒక ఆశ్చర్యార్థకం, వాక్యం చివర 7 అంకె వచ్చాయి.)

వివిధ ప్రక్రియల్లో రచనలు చేసేవారూ, తమ రచనలని పుస్తకరూపంలో తెచ్చేవారూ వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రూఫ్ రీడింగ్ చేస్తే, తమ రచనల్లో ముద్రారాక్షసకాండని నిశ్చితంగా గణనీయంగా తగ్గించొచ్చు.

కథలో మాండలికం ఎంత వరకూ?!

 

-టి. చంద్రశేఖర రెడ్డి

~

ఈ వ్యాసం-విభిన్న మాండలికాల్లో తెలుగు కథలు రాయటం గురించి.

ఒకప్పుడు కథలు గ్రాంథిక వచనంలో రాయబడేవి. తర్వాత అవి వ్యావహారిక భాషలో రావటం మొదలైంది. అడపాదడపా ఆ దశలోనే కథలు మాండలికంలో రావటం కూడా ఆరంభమైంది. ఈ ధోరణి ఊపందుకని ఇప్పుడు చాలా కథలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భిన్నప్రాంతాల మాండలికాల్లో వస్తున్నాయి. తెలంగాణా, రాయలసీమ, కోస్తా జిల్లాల మాండలికంలో; దాంతో పాటు ఇంతకు ముందు ఉపయోగించిన వ్యావహారిక భాషలో; ఆయా ప్రాంతపు రచయితల కలాలనుంచి కథలు జాలువారుతున్నాయి. ఈ ధోరణిలో స్పష్టంగా కనపడే విషయం-ఒక ప్రాంతపు రచయితలు, వాళ్ల కథలన్నీ ఆ ప్రాంతపు మాండలికంలోనే రాయకుండా, ఒకప్పుడు విస్తృతంగా ఉపయోగంలో ఉన్న వ్యావహారికభాషలో సైతం రాయటం.

కథ రెండు భాగాలుగా చెప్పబడుతుంది. కథకి సంబంధించిన నేపథ్యం, ప్రస్తుత పరిస్థితులూ, పరిసరాలూ మొదలైనవి ఒక భాగం. రెండో భాగం పాత్రల మధ్య సంభాషణ.

కొంతమంది రచయితలు, కథలో రెండు భాగాలనీ అంటే మొత్తం కథని; వాళ్లెన్నుకున్న ప్రాంతపు మాండలికంలో రాస్తున్నారు. ఉదాహరణకు కె. ఎన్. మల్లీశ్వరి గారి కథ “టెంకిజెల్ల”(ఆదివారం వార్త, 2 అక్టోబర్ 2011; కథ 2011 కథా సంకలనం), కొట్టం రామకృష్ణారెడ్డి గారి కథ ‘నూనె  సుక్క’ (బతుకమ్మ,3 ఆగస్ట్ 2014, ప్రాతినిధ్య 2014 కథా సంకలనం), స. వెం. రమేశ్ గారి కథ ‘పాంచాలమ్మ పాట’ (విశాలాక్షి అక్టోబర్ 2014-ప్రాతినిధ్య 2014 కథా సంకలనం).

కొంతమంది రచయితలు పాత్రల సంభాషణని మాత్రమే వాళ్లెన్నుకున్న ప్రాంతపు మాండలికంలో రాసి, మిగిలిన కథని; పైన చెప్పిన వ్యావహారికభాషలో రాస్తున్నారు. ఉదాహరణ-బెజ్జారపు రవీందర్ గారు రాసిన ‘మూడు తొవ్వలు’ కథ (ఆదివారం ఆంధ్ర జ్యోతి 23 అక్టోబర్ 2011, కథ 2011 కథా సంకలనం).

కొన్ని మాండలికాల్లో,  ఒక ప్రాంతపు వాళ్లకి తెలిసిన పదాలు, కొంచెం మార్పుతో మిగిలిన ప్రాంతాల్లో సైతం వాడబడతాయి. అలాంటి పదాల్ని ఏ మాండలికంలో రాసినా, ఆ మాండలికంతో పరిచయం లేని  పాఠకులు కూడా సులభంగా అర్థం చేసుకోగలరు. దీనికి కారణం, ప్రాథమికంగా వాళ్లకు పరిచయమున్న పదమే, ఉచ్ఛారణ పరంగా కొంత మార్పుకు లోనయి కథలో కనబడటం.

ఉదాహరణకు-చెప్పాడు అనే పదం. ఇది- చెప్పిండు, చెప్పినాడు గా మిగిలిన ప్రాంతాల్లో వాడబడుతోంది. దీని వలన చెప్పాడు అనే పదంతో పరిచయం ఉన్న  పాఠకుడు; చెప్పిండు, చెప్పినాడు పదాల విషయంలో చదవటానికి కానీ, అర్థం చేసుకోవటానికి కానీ ఎలాంటి అసౌకర్యానికీ గురి కాడు.   కాని, కొన్ని పదాలు పూర్తిగా ఆ ప్రాంతానికే పరిమితం. పాంచాలమ్మ పాట కథలో ఉపయోగించబడ్డ- బడిమి, ఇడవలి, అడిమ లాంటివి.

ఏ కథలో అయినా తెలిసిన పదాలని చదవడం, అవి చదవగానే అర్థం అవుతుంటే ముందుకు సాగడం సులభం. కారణం, ఉచ్ఛారణపరంగానైనా, అవగాహనపరంగా అయినా ఆ పదాలు తెలిసిన వాళ్లకి కథని అవగాహన చేసుకోవడంలో అవరోధాలు అనిపించవు కనక. నిజం చెప్పాలంటే ‘టెంకిజెల్ల’, ‘నూనె సుక్క’,  ‘పాంచాలమ్మ పాట’ కథలతో పోల్చుకుంటే ‘మూడు తొవ్వలు’ కథ నేను నాకున్న పరిమిత తెలుగు భాషా జ్ఞానంతో ఎక్కువ సౌకర్యవంతంగా చదవగలిగాను. కారణం-అందులో కథనం నాకు తెలిసిన భాషలో ఉండి, సంభాషణల వరకు మాత్రమే, సంబంధించిన పాత్రలు వాటి మాండలికంలో మాట్లాడుకున్నట్లు రచయిత రాయటం.

కథ చదవటం వేరు, కథని అర్థం చేసుకోవటం వేరు, కథని అనుభవించటం వేరు. టెంకిజెల్ల’, ‘నూనె సుక్క’, ‘పాంచాలమ్మ పాట’ కథలు, పూర్తిగా ఆయా ప్రాంతపు మాండలికాల్లో రాయటం వల్ల, వాటిల్లో ఎంత చదివించే గుణం ఉన్నా; చాలా పదాలకి అర్థం తెలియక పోవటం వలన నేను పట్టిపట్టి చదవాల్సి వచ్చింది. దీని వల్ల నేను ఆ కథలని చదవటం వరకే పరిమితమయ్యానని అనిపించింది. అర్థం చేసుకోవటం, అనుభూతిని పొందటం విషయంలో నన్ను నేను పూర్తిగా సంతృప్తి పరుచుకోలేక పోయినట్లుగా కనిపించింది.

బహుశా ఈ అనివార్య పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకుంటాను-కొన్ని కథల చివర, ఆ కథలో ఉపయోగించబడ్డ ఏ పదాలైతే మిగిలిన ప్రాంతాల పాఠకులకి తెలియటానికి అవకాశం లేనివని అనిపిస్తున్నాయో వాటి పట్టిక, అర్థాలతో  ఇస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఈ పట్టిక, కొన్ని కారణాల వల్ల ఇవ్వబడిన ఉద్దేశాన్ని నెరవేర్చటంలో విఫలమవుతోంది. ఎలాగంటే-

పాంచాలమ్మ పాట కథలో నాకు తెలియని పదాలు 97.   ప్రాతినిధ్య 2014 కథా సంకలనంలో ఈ కథ క్రింద, ఆ కథలో వాడబడిన మాండలిక పదాల పట్టిక వాటి అర్థాలతో ఇవ్వలేదు. అప్పటికీ ‘శబ్దార్థ చంద్రిక’ ని సంప్రదించి దడము, అలమట, కయ్య అనే పదాల అర్థం తెలుసుకుని ఆ పదాలను వాడిన సందర్భాలను అవగాహన చేసుకోగలిగాను. కాని. నిఘంటువులొ సైతం లేని అడిమ లాంటి పదాల విషయంలో ఏమీ చెయ్యలేకపోయాను. ఆ పదం నిఘంటువులో  చేర్చబడక పోవటానికి కారణం-నిఘంటువులో ఉన్న విధంగా రచయిత ఆ పదాన్ని రాయకపోవటమా? రాసినా అది ముద్రారాక్షసచర్యలకి గురి కావటమా? తెలుసుకోలేక పోయాను. వెలుతురు ప్రసరించాల్సిన సందర్భంలో ఇలా కొన్ని పదాలు, వాటి పెదాలు విప్పకపోవటం వలన అవగాహనారాహిత్యపు అంధకారంలో  చిక్కుకుపోయాను.

టెంకి జెల్ల కథలో నాకు తెలియని పదాలు 41 ఉన్నాయి.  అందులో 20 పదాలకు మాత్రమే, కథ 2011 సంకలనంలో కథ చివర అర్థం ఇవ్వబడింది. అందులో ఒకే అర్థం వచ్చే పదాలు 12 ఉన్నాయి.  మిగిలిన తొమ్మిది పదాల అర్థం తెలుసుకోవటానికి శ్రమించాల్సి వచ్చింది.  ఇది కాక, ఈ కథ విషయంలో నాకు ఇంకొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కథకి పేరుగా పెట్టబడిన ‘టెంకి జెల్ల’ పదానికే అర్థం తెలియలేదు. జెల్లకాయ అంటే చెంప దెబ్బ అని, నిఘంటువు చెపుతోంది. టెంకిజెల్లకి అర్థం కనపడలేదు. కథ చివర అర్థం ఇవ్వబడిన మాండలికాల్లో; జాకర్లు, కమ్మగట్టడం అనే పదాలు ఉన్నాయి. కానీ, ఆ పదాలు కథలో ఎక్కడా కనపడలేదు. నబవరులు అనే పదం కూడా ఇచ్చారు. కానీ కథలో సబవరులు అనే పదం మాత్రమే ఉంది. రెండిట్లో ఏది ముద్రణా దోషమో తెలియ లేదు.  గత్తర-అంటే ‘చెత్త’ అని అర్థం ఇచ్చారు. నాకు తెలిసి ఆ పదం అర్థం ‘ఉపద్రవం’. తెలుగు నిఘంటువు కూడా అర్థం అదే చెపుతోంది. పట్టికలో ఇచ్చిన ‘చెత్త’ అనే అర్థం, కథలో ఆ పదం వాడబడిన సందర్భంలో సరిగా ఇమడలేదు.

దీన్ని బట్టి అనిపించిందేమిటంటే- ఆ కథలో మిగిలిన ప్రాంతాల పాఠకులకు తెలియనివనుకుని  పదాల పట్టిక తయారు చేసినవాళ్లు, అన్ని ప్రాంతాల పాఠకుల భాషాజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ పట్టికని తయారించలేదని.

నేను ఆ కథ చదివిన సంకలనంలో కొట్టం రామకృష్ణారెడ్డి గారి కథ ‘నూనె సుక్క’ చివర కూడా; పాఠకుడికి తెలియని పదాలూ, వాటి అర్థాలూ ఇవ్వబడలేదు. అయినా, కథలో వాడిన భాష; ఉద్యోగరీత్యా నేను కొన్ని సంవత్సరాలు నివసించిన ‘మహబూబ్ నగర్’ జిల్లాది కావటం వలన కథలో నాకు తెలియని పదాలు తక్కువగా ఉన్నాయి.  మిగిలిన తెలియని పదాల అర్థాలు కూడా, రచయితకి ఫోన్ చేసి తెలుసుకున్నాను. కాని, ఒక ప్రాంతపు మాండలికాన్ని అర్థం చేసుకోవటానికి, అలా ఆ ప్రాంతంలో నివసించి ఉండటం అనే అవకాశం అందరికీ దొరకనిది.

నేననుకోవటం-‘పాఠకుడికి తెలియని పదాలు’ అన్నది ఒక అయోమయానికి గురి చేసే పదసమూహమని.   ఎందుకంటే, ఆ పదాలని, కథ రాసిన రచయిత గుర్తిస్తే, ఆ పట్టిక అసంపూర్ణంగా ఉండే అవకాశం ఎక్కువ.  టెంకి జెల్ల-కథ చివర్లో ఇచ్చిన పట్టిక, దీనికి దృష్టాంతం. వాస్తవానికి, ఒక ప్రాంతంలో వాడే పదాల్లో, మిగిలిన ప్రాంతానికి తెలియని పదాలు; ఆ మిగిలిన ప్రాంతాల వాళ్లే నూటికి నూరు శాతం గుర్తించగలరు. అలా గుర్తించబడిన పదాలకు, అసలు కథా రచయిత ద్వారా అర్థాలు చెప్పిస్తే ఆ పట్టిక తనకు నిర్దేశించిన పనిని నిర్దిష్టంగా చేయగలదు. అలా కాకుండా, ఏ కథ చివర ఏ కథారచయితయినా తానే తయారు చేసి ఒక పట్టిక ఇస్తే, అది ‘కంటి తుడుపే’ కాగలదు.

కథని చదవడం పాఠకుడిగా నాకు నేనై నా భుజాల మీద ఎత్తుకున్న బాధ్యత కనక, అది ఏ రూపంలో ఉన్నా చదవడం నాకు అవసరం. ఏ  కథలో పాత్రలు ఐనా ఒక ప్రాంతపు జీవితాల్లోంచి తీసుకోబడినపుడు, ఆ పాత్రలు ఆ ప్రాంతపు భాషలో మాట్లాడటం సహజం. కథకుడు, ఆ పాత్రల సంభాషణని ఆ ప్రాంతపు భాషలో వ్రాయటం కూడా సముచితం. కాని, సంభాషణలు కాక మిగిలిన కథంతా అదే భాషలో ఉండటం అవసరమా?

అవసరమే అని అలాంటి కథా రచయితలు విశ్వసిస్తే, ఒక ప్రాంతపు జీవితాల్ని  మిగిలిన ప్రాంతాల వాళ్లకి ఆ రచయితలు సంపూర్తిగా పరిచయం చేయాలనుకుంటే, ఆ ప్రాంతపు భాషలో మిగిలిన ప్రాంతాల వాళ్లకి తెలియటానికి అవకాశం లేని పదాలన్నిటినీ ఆ కథతో పాటు విధిగా పరిచయం చెయ్యాలి. అప్పుడే రకరకాల ప్రాంతాల మాండలికాల్లో రాసిన కథలని; తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాల పాఠకులు అర్థం చేసుకోగలరు. సరైన అనుభూతి పొందగలరు. అది సమగ్రంగా జరగనంతవరకూ, కొన్ని కథలు నాలాంటివాళ్లకి అసమగ్రంగానే అర్థమవుతాయి. అసంతృప్తిని మిగులుస్తాయి.

నా దృష్టిలో ఈ సమస్యకి పరిష్కారం: కథ అర్థం కాని, చేసుకోలేని పాఠకుల చేతుల్లో లేదు. కొంత కథారచయితల చేతుల్లో, మిగిలింది ఆ కథలు ప్రచురిస్తున్న మాధ్యమాల చేతుల్లో ఉంది.

ఈ పరిశీలన చేస్తున్న సమయంలో నేను చదవడం తటస్థించిన ఓ ప్రాంతపు మాండలికంలో రాయబడ్డ-ఒక కథ విషయంలో, కొంత స్వేచ్ఛ తీసుకుని నా మీద నేనే ఒక ప్రయోగం చేసుకున్నాను. ఆ కథ చదివిన అనుభూతి నాలో ఇంకా పచ్చిగానే ఉండగనే, ఆ కథని మొత్తం నాకు తెలిసిన వ్యావహారిక భాషలో రాసుకున్నాను. అసలు కథ పేరుకి సమానార్థం ఉన్న, నేను మాట్లాడే మాండలికంలో ఉన్న పదాన్ని, కథకి పేరుగా పెట్టుకున్నాను. అసలు కథ చదివిన అనుభూతిలోనుంచి పూర్తిగా బయటికి వచ్చిన తర్వాత, ఆ కథ నా స్మృతిపథంలోంచి చాలా వరకూ మరుగయేదాకా, మానసిక విరామం ఇచ్చి; నేను తిరగ రాసుకున్న కథని మరోసారి చదివాను. కథ ముగింపు ముందే తెలిసి ఉండటంవలన నాలోంచి తొలిగిపోయిన ఉత్కంఠతని మినహాయించి; అసలు కథ అందించిన అనుభూతికీ, నేను రాసుకున్న  కథ చదివి పొందిన అనుభూతికీ చెప్పుకోదగినంత తేడా చవిచూడలేక పోయాను.

ఈ అధ్యయనం వల్ల, మానవజీవితాలకు సంబంధించిన కొన్ని అనుభూతులకు, ప్రాంతాల ప్రమేయం ఉండదని నా వరకు నాకు తోచింది. ఇక పోతే, భాష అవరోధమా కాదా అనేది ఒక కథలో వాడిన మాండలికంతో అసలు పరిచయం లేని ఇంకో పాఠకుడెవరైనా ఆ కథని చదివి చెప్పవలసిన విషయం అని అనిపించింది.

అయితే, కథనం మాత్రం ఒక ప్రాంతపు మాండలికంలో ఉండి; సంభాషణలు అందరికీ పరిచయం ఉండటానికి అవకాశం ఉన్న భాషలో రాయబడ్డ కథలు ఇంతవరకూ నేను చదవటం తటస్థించలేదు. రాబోయే రోజుల్లో అవి కూడా వస్తాయేమో?

ఈ లోపులో కోరుకోవాల్సిన విషయం మరోటుంది. ఒక ప్రాంతంలో పుట్టి పెరిగి; ఆ ప్రాంతపు భాషతో విస్తృత పరిచయం ఉన్న రచయితలు; తమకు పరిచయం లేని మాండలికంలో కథలు పూర్తిగానో, సంభాషణల వరకో రాసి ఆ కథలని బలహీనపర్చే ప్రయత్నం చేయకుండా ఉంటే చాలని. ఈ ధోరణి ఈ మధ్య ఒక కథలో కనపడింది. అందుకనే ఈ మాట కూడా చెప్పాల్సి వచ్చింది.

***

అనిల్ ‘కథాయణం’ నుంచి ‘నాగరికథ’ దాకా!

kathayanam

-టి. చంద్రశేఖర రెడ్డి 

~

 

సారంగ-లో కథారచయిత అనిల్ ఎస్. రాయల్ తో వేంపల్లి షరీఫ్ గారి ముఖాముఖీలో ‘కథాయణం’ వ్యాససంపుటి, ‘నాగరికథ’ కథల సంపుటి గురించి ప్రస్తావన ఉంది. కథాయణం చదివింతర్వాత, నేను చదివిన ఇతర కథలను, కథాయణంలో  ఉన్న సూచనల్తో పోల్చి చూస్తే ఆ కథలకూ,  ఈ సూచనలకూ పొంతన లేదనిపించింది. అంతే కాదు. కథాయణంకు అనుబంధంగా కథనకుతూహలం-లో చెప్పిన క్లుప్తత ఆ కథల్లో లేనట్లు కనిపించింది.

కథాయణంలోనూ-కథనకుతూహలంలోనూ ఉన్న సూచనలు మిగిలిన రచయితల కథల్లో ఎందుకు అమలు కాలేదు? అవి అమలు చేయకూడనివా? అమలు చేయలేనంత కష్టమైనవా? అన్న అనుమానం వచ్చింది. నివృత్తి కోసం; ఆ సూచనలిచ్చిన రచయిత వాటిని తన కథల్లో ఎంతవరకు, ఎలా పాటించారో తెలుసుకోవాలని ప్రయత్నించాను. దాని ఫలితమే ఇది.

శీర్షిక గురించి సూచనలు: అవి ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

  1. కథల విషయంలో శీర్షిక వీలైనంత విభిన్నంగా ఉంటే మంచిది.

నాగరికథ-కథ ఒక నాగరికత ఎలా అంతమైందో శాస్త్రీయంగా తెల్సుకోటానికి చేసిన ఒక ఊహ. అందువల్ల కథకి నాగరికత అని కానీ, ఆ పదాన్ని నాగరి’కత’ గా మార్చి ‘కత’ నాగరికత కి సంబంధించిన కథ అనిపించేలా  శీర్షికగా పెట్టుకోవచ్చు. కానీ నాగరి’కత’ లో ఇమిడి ఉన్న ‘కత’ అనే పదం ఎక్కువమంది దృష్టిని  ఆకట్టుకోపోవచ్చు. అందుకనే, కత, కథగా మారి ‘నాగరికథ’ అయింది. కథాంశాన్ని క్లుప్తంగా, గుప్తంగా సూచించింది. విభిన్నంగా ఉంది.

  1. శీర్షికలో నూతనత్వమూ, వైవిధ్యమూ ధ్వనిస్తే మంచిది.

రెండు విరుద్ధ విషయాలని సూచించే పదబంధం వెంటనే ఆకట్టుకుంటుంది. ప్రియశత్రువు అలాంటి రెండు  విభిన్న పదాల మేళవింపు. అందుకే ఆ కథ పేరులో నూతనత్వం, వైవిధ్యం ధ్వనించింది. కథలో ప్రధాన పాత్ర పేరు ‘ప్రియ’ అవటం వలన కథాంశం అంతర్లీనంగా పాఠకుడికి అందింది.

  1. శీర్షిక చూడగానే, అర్థమైనా కాకపోయినా అది కథ చదవమని ప్రేరేపించాలి.

కుంతీకుమారి కథ, మహాభారతంలో కుంతీదేవిలానే కుమారిగానే తల్లిగా మారిన స్త్రీ కథ.  కనుక ఈ కథకి  ‘కుంతీదేవి’ అని పేరు పెట్టొచ్చు. అయితే ఇందులో ఒక ప్రమాదం ఉంది. ఈ కథ కూడా పెళ్లికి ముందే తల్లి అయిన ఒక స్త్రీ కథ అని పాఠకులు  ప్రక్కన పడేయొచ్చు. అలా కాక, కుంతీకుమారి అని కథకి పేరు పెడితే, మహాభారతంలో కుంతికి పుట్టింది కర్ణుడు. కుంతికి కొడుకు కాకుండా కూతురు పుట్టటమేమిటి? అనుకుని కథలోకి పాఠకుడు ఆకర్షించబడొచ్చు. మహాభారతంలో కుంతీదేవి ముందు తల్లి, తర్వాత శ్రీమతి అయింది. కుంతీకుమారి కథలో,  ప్రధానపాత్ర కుమారిగానే మిగిలిపోయింది. కథకి పెట్టిన పేరు పరోక్షంగా కథాంశాన్ని కూడా సూచించింది.

  1. కొన్ని సందర్భాల్లో కథాంశాన్ని వివరించేలా పేరు పెట్టటమే మంచిది.

మరో ప్రపంచం కథ,  పారలల్ యూనివర్సెస్ గురించి. తెలుగులో ఆ కథకి పెట్టిన పేరు ఆ కథాంశానికి నిగూఢ సూచన ఇచ్చింది. అలానే మిగిలిన రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, మరపురాని కథ-కథల  పేర్లు కూడా.

  1. కథలకి పేర్లు పెట్టే క్రమంలో చాలా మంది ఔత్సాహిక రచయితలు/రచయిత్రులు చేసే పొరపాటు: కథలో ప్రధాన పాత్ర పేరునే కథ పేరుగా ఎంచుకోవటం.

నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, తొమ్మిదింటికి పాత్రల పేర్లు కథ పేరుగా లేవు. ఒక్క మినహాయింపు ‘కల్కి’ ప్రధాన పాత్ర  అయిన ‘కల్కి’ కథ. ఆ కథకి ‘కల్కి’ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అన్న దాని గురించి కథాయణంలో వివరణ ఉంది.

  1. చప్పగా, సర్వ సాధారణంగా అనిపించే పదాలని, వాడీ వాడీ అరగదీసిన సామెతలని కథలకి శీర్షికలుగా ఎంచుకోకుండా ఉండటం ఉత్తమం.

నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, ఏ కథకీ సామెతలు పేర్లుగా లేవు.

  1. ప్రసిద్ధమైన కథల పేర్లని వీలైనంత వరకూ మళ్లీ వాడుకోకుండా ఉంటే మేలు.

నాకు తెలిసి కథలకి పెట్టిన పేర్లు  ప్రసిధ్ధకథల పేర్లు, ఇతర ప్రసిద్ధ సాహితీ ప్రక్రియల పేర్లు కూడా కావు.

  1. కథ పేరు ఎంత పెద్దదిగా ఉందనేది శీర్షికల విషయంలో మరో కీలకమైన విషయం.

నాగరికథ-లో ఉన్న కథల్లో; అన్నిటికన్నా ఎక్కువ అక్షరాలు, రెండే పదాలు ఉన్న పేరు-‘మరపురాని కథ’.  మిగిలిన తొమ్మిది కథల్లో, ఆరు కథలకు ఒక పదమే పేరు. మిగిలిన మూడిటికీ ఒక పదబంధం శీర్షిక.

  1. శీర్షికలో ఓ రకమైన అర్థాన్ని సూచిస్తూ, కథ పూర్తిగా చదివాక అందులో మరో అర్థం గోచరించేలా పేరు పెట్టటానికి నేను ప్రాధాన్యతనిస్తాను.

కథల పేరుకి వాడిన పదాలు వాటి అసలు అర్థమే సూచించటం; నాగరికథ, ప్రియశత్రువు, కుంతీకుమారి భిన్నమైన పదప్రయోగాలు కావడం; వాటివల్ల అందిన సూచన ప్రకారం కథ ఉండకపోవటం-ఈ కథల కథాంశం, శీర్షికల ద్వారా వేసుకున్న అంచనాకి భిన్నంగా ఉండటం సంబంధిత సూచన అమలుకు నిదర్శనం.

కొసమెరుపు:

  1. నాగరికథ కథాసంకలనంలో ఉన్న పది కథల్లో అయిదు కథల పేర్లు; రహస్యం (1967), మరపురాని కథ (1967)), మరో ప్రపంచం (1970), శిక్ష (1985), కల్కి (1997) కథలు ప్రచురించబడటానికి ముందే విడుదలైన తెలుగు చలనచిత్రాల పేర్లు. ఇది యాదృచ్ఛికం కావచ్చు-కాని గమనార్హం. కుంతీకుమారి లాగే ధ్వనించే కుంతీపుత్రుడు 1993 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రళయం కథ ముద్రితమైన తర్వాత 2015 లో అదే పేరుతో ఒక తెలుగు సినిమా విడుదలైంది. రీబూట్ కంప్యూటర్ కే కాదు చలనచిత్రరంగానికి కూడా చెందిన ప్రక్రియ.

ఎత్తుగడ పై సూచనలు: ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

  1. అత్యవసరమైతే తప్ప కథని వర్ణనలతో మొదలు పెట్టను. అత్యవసరమైనా కూడా కథని సర్వసాధారణమైన సన్నివేశంతో మొదలు పెట్టను.

నాగరికథ, మరో ప్రపంచం, కల్కి,  ప్రియశత్రువు కథలు ఒక సంభాషణతోనే మొదలవుతాయి. శిక్ష కథ  కథాయణంలో ఒప్పుకున్నట్లు ఒక వర్ణనతో, వైవిధ్యం కోసం  ప్రాస ఉన్న పదాల్తో మొదలైంది. ప్రళయం కథ సంభాషణతో కాకుండా ఒక గమనికతో మొదలవుతుంది.  రీబూట్, రహస్యం, మరపురాని కథలు భిన్నంగా మొదలయ్యాయి. మరపురాని కథ ఒకటే ఒక సాధారణమైన సన్నివేశంతో మొదలయినట్లనిపిస్తుంది.  కుంతీకుమారి అనువాదకథ. దాని ఎత్తుగడ మీద అనువాదకుడికి స్వేచ్ఛ లేదు.

  1. మొదటి పేరా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. వీలైతే మూడు నాలుగు లైన్లకు మించకుండా. అంతకన్నా చిన్నగా ఉంటే మరీ మంచిది.

నాగరికథ కథలో ఈ సూచన ఏడు లైన్లతో కొంచెం దారి తప్పింది. మరో ప్రపంచం, రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, కుంతీ కుమారి; రెండు లైన్లతో; కల్కి, ప్రియశత్రువు, మరపురాని కథ ఒక లైనుతో మొదలయ్యాయి.

  1. మొత్తమ్మీద, ఎత్తుగడ అనేది వీలైనంత క్లుప్తంగా ఉండి చదవబోయే కథపై ఉత్సుకత కలిగించాలి.

ఎత్తుగడతో ఉత్సుకత ఎలా కలిగించవచ్చో అన్నదానికి, నాగరికథ కథ మొదలే ఒక ఉదాహరణ. అది  కథాయణంలో ప్రస్తావించబడింది. కల్కి కథ అయితే మరీ క్లుప్తంగా రెండు పదాల్తోనే పాఠకుడ్ని కథలోకి లాక్కు వెళుతుంది. ఆ రెండు పదాలూ “ఇద్దర్ని చంపాలి.”

ముగింపుపై సూచనలు: ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

1.A.      ఎత్తుగడ భాగంలో, ‘కథని ఎలా మొదలెట్టినా ఆ ప్రారంభ వాక్యాలు పాఠకుల్లో ప్రశ్నలు రేపెట్టేలా చెయ్యాలి’ అని ఉంది. ముగింపులో ఆ ప్రశ్నలకి జవాబులు దొరకాలి అని చెప్పబడింది.

1.B.      అవి అరటిపండు వొలిచి పెట్టినంత విపులంగా ఉండనక్కరలేదు. కనీసం ఆ సమాధానాలు తామే వెతుక్కోవటానికి అవసరమైనంత సమాచారమన్నా కథలో లభించాలి.

ఉదాహరణకు-నాగరికథ కథ తీసుకుందాం. దీనిలో ‘ఎత్తుగడ’ టైమ్ మెషీన్ లో కాలంలో వెనక్కి ప్రయాణం చేయడం గురించి. హైస్కూలు విద్యార్థులకు గెస్ట్ లెక్చర్ ఇస్తున్న ఓ అణుశాస్త్రవేత్త వివరణతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత తాత గారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే కాలంలో వెనక్కెళ్లి ఆయన్ను చంపెయ్యడం గురించి ఒక ప్రస్తావన ఉంటుంది. కాలయంత్రం ద్వారా కాలప్రయాణం  గురించి  పాఠం చెపుతున్నపుడు అణుశాస్త్రవేత్తకి వాళ్ల తాతగారి గురించి సెల్ ఫోన్ ద్వారా ఒక వార్త వస్తుంది. క్లాసు అర్ధంతరంగా ఆగిపోతుంది. తాతయ్య దగ్గరకి హడావిడిగా మనవడి ప్రయాణం మొదలవుతుంది. దీంతో పాఠకుడి మెదడులో టైమ్ మెషీన్ గురించీ, అందులో వెనక్కి వెళ్లడం గురించీ, తాతయ్య గురించి వచ్చిన వార్త ఏమిటనే దాని గురించీ ప్రశ్నలు మొదలవుతాయి.

ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం పాఠకుడు తప్పనిసరిగా మిగిలిన కథలోకి వెళతాడు. కథనంలో టైమ్ మెషీన్ ఉందా? లేదా? ఉంటే ఎలా తయారయింది? దాన్ని ఎవరు తయారు చేశారు? అందులో కాలంలో ఎవరైనా వెనక్కి ప్రయాణం చేశారా? వెళ్లింది ఎలా? వెళ్లింది ఎవరు? ఆ ప్రయాణఫలితం ఏంటి? అనే దాని మీద తగినంత సమాచారం ఒక దాని తర్వాత ఒకటి కథకుడు అందిస్తాడు.

ఈ ప్రశ్నల్లో కొన్నిటికి జవాబులు కథలో నేరుగా ఉంటాయి. మిగిలిన ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవటానికి అవసరమైన ఆధారాలు కథలో ఉంటాయి. ప్రధాన పాత్ర ప్రత్యక్షపద్ధతిలో తెలిసిన వాటిని మొదట నమ్మదు. కాని నమ్మక తప్పదు. పరోక్షంగా తెలిసిన వాటిని మనవడు నమ్ముతాడో లేదో రచయిత స్పష్టంగా చెప్పడు.  నమ్మాలో వద్దో విశ్లేషించి తెలుసుకోవాల్సింది మనవడూ, అతడితో పాటు మనమూ.

  1. A. కథలకి రెండు రకాల ముగింపులుంటాయి-ప్రధానపాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో చూపటం ఒక రకం ముగింపు. ఇది క్రైమ్, సస్పెన్స్, డిటెక్టివ్, హారర్ కథలకి వర్తిస్తుంది.

2.B. పాత్రల అంతఃసంఘర్షణ చిత్రణపై దృష్టి కేంద్రీకరించే లిటరరీ ఫిక్షన్ కోవకి చెందిన కథలైతే ప్రధానపాత్ర వ్యక్తిత్వంలో వచ్చే మార్పు, ఆలోచనావిధానంలో కలిగే పరిణతి, లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం…ఇలాంటి విషయంతో ముగుస్తాయి.

నాగరికథ కథ పై రెండు వర్గాల్లో ఏ విభాగానికి చెందినది అనేది అప్రస్తుతం అనుకుంటే; ప్రధాన పాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో; లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం ఏమిటో; కథ ముగింపు చెప్పాలి.

ఈ కథలో ప్రధాన పాత్ర అణుశాస్త్రవేత్త. అతడిని వేధించే సమస్యా, పాఠకుడిని వేధించే ప్రశ్నల సారాంశం ఒకటే. సూచన 2-A ప్రకారం, ఆ పాత్ర తన సమస్యని పరిష్కరించుకోవాల్సింది, సూచన 2-B ప్రకారం ఇవ్వాల్సిన  సమాచారం. దాన్ని కథకుడు తాత ద్వారా, మనవడికి అందిస్తాడు. దాన్ని విశ్లేషించి మనవడు ఒక నిర్ధారణకి వస్తాడు. కాని, అదేంటో రచయిత పాఠకులకి చెప్పడు. దాన్ని కథ ముగింపిడికిట్లో పెట్టి, తెరిచి ఏముందో చూసే బాధ్యత పాఠకులకే వదిలేస్తాడు. అది సవ్యమా, సంభావ్యమా అన్నది వదిలేస్తే, అదిక్కడ చెప్పటం భావ్యం కాదు.

  1. రచయిత అనేవాడు ఎన్ని తిప్పలైనా పడి కథని కంచికి చేర్చాల్సిందే. కాడి మధ్యలో వదిలేస్తే కుదరదు.

నాగరికథ కథలో రచయిత కాడిని పాఠకులతో పాటు తాను కూడా మోసి కంచికి కూతవేటు దూరం దాకా  వచ్చాడు. ఊరు బయట తాను కాడిని వదిలేసి పాఠకులకి మిగిలిన ప్రయాణం ఎలా చెయ్యాలో, గమ్యస్థానం ఎలా చేరాలో చెప్పాడు. తమంతట తాము గమ్యం చేరిన తృప్తి కలగాలంటే ఆ కాస్త దూరం ప్రయాణించాల్సింది పాఠకులే.

  1. కాబట్టి ముగింపు అనేది తప్పనిసరిగా చిన్నదో పెద్దదో ఓ మార్పుని సూచించాలి.

ఈ సూచన కథలో ఎలా పాటించబడిందో చెపితే, కథ ఇంకా చదవని పాఠకులకి కథ చదువుతున్నపుడు కలిగే ఉత్సుకత మిగలదు.

  1. మీరనుకున్న ముగింపు కోసం ప్రధాన పాత్ర (లేదా ఇతర ముఖ్య పాత్రల) స్వభావాన్ని ఉన్నపళాన మార్చేయటం సరైన పద్ధతి కాదు.

నాగరికథ కథ లో అలాంటి మార్పేదీ లేదు.

  1. ముగింపు ఎలా ఉండబోతోందో కథనిండా క్లూస్ వదులుతూనే, మరో వైపు పాఠకుడిని మాయచేసి పెడదారి పట్టిస్తూ, చివర్లో అతన్ని ఆకస్మికంగా అసలు దారికి మళ్లించేదే అసలు ఊహాతీతమైన ముగింపు.

నాగరికథ కథలో మనవడికి కలిగిన అనుమానాల ద్వారా పాఠకులు పొందింది, వాళ్లకు అందిందీ అదే.

తుది మాట:

మిగిలిన తొమ్మిది కథల్లో ఏం జరిగిందో ఎలా జరిగిందో చూడాల్సింది పాఠకులే.

*

 

ఆమె అంతరంగం, అతని కథనం!

nadustunna katha

 మే నెల కథలు

మే నెలలో కథల సంఖ్య బాగా పెరిగింది.ఈ వ్యాసం రాస్తున్న ముగ్గురం కలిపి సుమారు 200 కథలు చదివాము. ఒక నెలలో ఇన్ని తెలుగు కథలు వస్తున్నాయా అన్న ఆశ్చర్యం, ఆనందం కథల నాణ్యత విషయంలో కలగటం లేదు. కొన్ని పత్రికలలో వార్తలు, వ్యాసాలు కథలుగా చలామణీ కాగలగడం సంపాదకుల అభిరుచిలేమిని సూచిస్తోందా లేక రచయితలలో అవగాహనాలేమిని సూచిస్తోందా అని బాధపడాల్సిన పరిస్థితి. మొత్తం మీద మొదటి వడపోతలో 26 కథలను ఎన్నుకోని, వాటి గురించి మేము ముగ్గురం కలిసి చర్చించాము. ఆ చర్చల పర్యవసానమే ఈ వ్యాసం. (మా దృష్టికి రాని మంచి కథ ఏదైనా వుంటే సూచించండి. ఈ నెల (జూన్) కథల గురించి మేము జరుపబోయే చర్చలో పాల్గొనాలనుకునేవారికి, సాదర ఆహ్వానం. ఫేస్ బుక్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి)

మే నెలలో కొన్ని చిత్రాలు జరిగాయి. కొంత మంది పురుష రచయితలు స్త్రీల సమస్యను కథాంశంగా ఎన్నుకోని కథలు రాశారు. కాండ్రేగుల శ్రీనివాసరావు “జీవన మాధుర్యం” అన్న కథలో వక్షోజాల కేన్సర్ గురించి రాస్తే, కె. వి. నరేందర్ “డబ్బుసంచీ” అన్న కథలో గర్భసంచి తొలగింపు గురించి రాశారు. “మరుగు” కథలో కూడా స్త్రీల సమస్యనే ప్రస్తావించారు వాణిశ్రీ. అలాగే డా. వి. ఆర్. రాసాని “తృతీయ వర్గం” గురించి కూడా రాయడం గమనింఛవచ్చు.

గత మాసం (ఏప్రిల్ 2014) ప్రముఖ రచయితలు పాత్రలుగా రెండు కథలు వచ్చిన సంగతి ప్రస్తావించాము. ఈ నెల కూడా అలాంటి కథ ఒకటి వచ్చింది. భగవంతం రాసిన “గోధుమరంగు ఆట” కథలో త్రిపుర ఒక కనిపించని పాత్రధారి.

ఇక ఈ నెల కథల్లోకి వెళ్దాం –

సాక్షి: శిరంశెట్టి కాంతారావు

టెక్నాలజీ పెరిగిపోతున్న కారణంగా, సాంప్రదాయక వృత్తుల వాళ్ళు పనులు కోల్పోవడం గత కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది. అలా వృత్తిని కోల్పోయి, అప్పులు మాత్రం మిగుల్చుకున్న ఓ కాటికాపరి కథ ఇది. ఇలాంటి కథాంశాలపైన గతంలో ఎన్నో కథలు వచ్చినా ఇంతకు ముందూ ఏ రచయితా ఎన్నుకోని కులవృత్తిని ఎన్నుకోవటం వల్ల ఈ కథ కొంతవరకు ప్రత్యేకంగా మారింది. మంచి కథనం, ఇతివృత్తానికి అనుగుణమైన మాండలికం మరింత బలాన్ని ఇచ్చింది. అయితే అవసరాన్ని మించి నిడివి వున్నట్లనిపించింది.

 

మరుగు: వాణిశ్రీ

బలాత్కారం నుంచి తప్పించుకుందో అమ్మాయి. ఆ విషయం పంచాయితీకి వచ్చినప్పుడు అవతలి పక్షం రాజీ కోరారు. దెబ్బతిన్న ఆత్మగౌరవానికి వ్యక్తిగత స్థాయిలో వెల కట్టడం ఎలా? ఈ కథలో సీతారత్నం పాత్ర అలా వ్యక్తిస్థాయిలో ఆలోచించలేదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఆ కారణాల్లోకి వెళ్ళింది. వెళ్ళి, అందరికీ పనికివచ్చే పరిష్కారాల అమలు తనకు చెల్లించాల్సిన మూల్యం అని స్పష్టం చేస్తుంది. వ్యక్తిగత స్థాయిలో జరిగిన అన్యాయానికి సామాజిక స్థాయిలో పరిష్కారాన్ని కోరడమనే కొత్త పరిహారాన్ని చూపించిన కారణంగా, ఇది నలుగురూ చదవాల్సిన కథ అయ్యింది. మంచి ఎత్తుగడ, ముగింపు, సామాజిక స్పృహ, ఇతివృత్తంలో సమకాలీనత, క్లుప్తత. చదివించే కథనం. అందరూ చదవదగ్గ కథ.

 

జీవన మాధుర్యం: కాండ్రేగుల శ్రీనివాసరావు

బ్రెస్ట్ కాన్సర్ కారణంగా ఒక వక్షోజాన్ని తొలగించడంతో వకుళలో అంతర్మథనం మొదలౌతుంది. ఈ అసమగ్ర రూపంలో భర్త తనను ఎలా చూస్తాడు అన్నది ఆమెని వేధించే ప్రశ్న. అయితే, భార్య పోగొట్టుకున్న భౌతికమైన విషయాన్ని లెక్కచేయనంత విశాలహృదయం భర్తకి ఉంది కాబట్టి కథ సుఖాంతంగా ముగుస్తుంది. దానిలో సంభావ్యతే ప్రశ్నార్ధకం. కథలో చూపించినది ఆదర్శవంతమైన పరిష్కారమే అయినా, అలా కాకపోతే ఎమౌతుందీ అన్న కోణం ఎవరికి వారు ఆలోచించుకోవచ్చు. ఒక వినూత్నమైన అంశాన్ని, ఇంకో సున్నితమైన అసంతృప్తి కోణంతో ముడిపెట్టి రాసిన మంచి కథ. వాస్తవికతని కొంచెం హద్దులు దాటించి శృంగారపరమైన అంశాలు స్పృశించడంతో వస్తువులో ఉన్న గాంభీర్యం కొంత చెదిరిపోవడం ఈ కథలో మనం గమనించవచ్చు.

 

సంస్కృతం మాష్టారు ఇస్మాయిల్: సాయి బ్రహ్మానందం గొర్తి

భాషకీ మతానికీ సంబంధం లేదని ఒక వైపు చెపుతూనే – మతం శాశ్వత అనుబంధాల ఏర్పాటుకు ఎలా ఆటంకమవుతుందో చెప్పటానికి ప్రయత్నించిన కథ. ఇస్మాయిల్ అనే ముస్లిం కుర్రవాడు తెలుగుకంటే సంస్కృతమే నయమని విశ్వం మాస్టారి దగ్గర చేరి సంస్కృతం భాషాజ్ఞానమే కాకుండా ఆయన ప్రేమాభిమానాలనీ సంపాదించి చివరకు సంస్కృతంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తాడు. విశ్వం మాస్టారికి ఇస్మాయిల్ అంటే ఎంత అభిమానం అంటే, చివరికి తన మనవడికి ‘ఇస్మాయిల్’ అనే పేరు పెడతారు. అయితే ఈ మనవడు, ఇస్మాయిల్ కూతుర్ని ప్రేమించడంతో మాస్టారు ‘నానా యాగీ’ చేసి శిష్యుణ్ణి దూరం పెడతారు. ఇరుమతాల మధ్యన ప్రేమ, అభిమానాలు ఉండగలిగిన అవకాశాలు ఉన్నా, మతం అనే సరిహద్దు దగ్గర అవన్నీ కనుమరుగైపోతాయన్న కుదుపు లాంటి వాస్తవికతని కథ పాఠకుడికి స్ఫురింపజేస్తుంది. ఈ వాస్తవికతని పట్టుకురావడమే కథలోని మంచి విషయం అనుకుంటూ ఉండగా, కథ ఒక ‘కొసమెరుపు’ లాంటి ఒక అందమైన విషయంతో ముగుస్తుంది. వాస్తవికత వేరు, ప్రేమాభిమానాలు వేరు అని పాఠకుణ్ణి రెండోసారి కుదుపుతుంది. మంచి కథాంశం, వాస్తవిక కథనం. మొదలు ముగింపులలో రచయిత చాకచక్యం గమనించతగ్గవి..

 

డబ్బు సంచీ: కె వి నరేందర్        

కడుపునొప్పికి పరిష్కారంగా గర్భసంచీని తొలగించాలని డాక్టర్లు మాధవికి చెప్పారు. మిత్రురాలి సలహా మీద ఓ ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదిస్తే, ముందు కొంత వైద్యం చేసి చూద్దాం అంటాడాయన. ఇలా వైద్యం చేద్దామన్న ధోరణి లేకపోగా, సమస్య ఉన్న ప్రతివాళ్ళకీ గర్భసంచీలు తొలగించడం వెనకాల కుట్ర ఏదైనా ఉందా? ఆరోగ్యశ్రీ పథకాలు ఇలా అమలవుతున్నాయా? మరికొంత సమాచారం తెలుసుకున్న మాధవి, దీన్ని రిపోర్ట్ చేసి దర్యాప్తు చేయించాలనుకుంటుంది. శరీరంలోని సమస్యలని వ్యవస్థలోని లొసుగులతో ముడిపెట్టి, సామాజికమైన పరిష్కారం వైపుగా మాధవి ఆలోచించడం బావుంది. కానీ, కథలో కొంత భాగం వ్యాస రూపం సంతరించుకుంది. ఒక వార్త ఆధారం చేసుకుని కొన్ని గణాంకాలను దృష్టిలో పెట్టుకుని రాయడం వల్ల ఈ కథ కొన్ని కథా లక్షణాలను కోల్పోనట్లైంది. ఆ గణాంకాలలో కూడా శస్త్రచికిత్సల సంఖ్యే చెప్పారు తప్ప అవసరం లేకుండా చేసినవెన్ని అనే ముఖ్యమైన విషయంపై దృష్టి పెట్టకపోవడం మరో లోపం.వస్తువు పరంగా ఆలోచింపజేసే కథ అయినా, రూపం విషయంలో మరింత శ్రద్ధ వహించి ఉంటే, కథ స్థాయి చాలా పెరిగి ఉండేది.

 

దో దివానే దో షెహర్ మే: పూర్ణిమ తమ్మిరెడ్డి

మధ్యతరగతి భారతీయుడి సొంతింటి కల! ఆ కల సాధారణ స్థాయిలో ఉన్నా, ఉన్నదానికీ కొనవలసినదానికీ ఉండే గాప్ ఉండనే ఉంటుంది. ఆ కల స్థాయి పెరిగే కొద్దీ ఈ గాప్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి ఓ పెద్ద కల కన్న నేటి తరం భార్యాభర్తలు, పెళ్లి అయ్యీ అవగానే, లోన్ వాయిదాలు కట్టడానికి మరింత సంపాదన కావాలి కాబట్టి అలా సంపాదించడం కోసం చెరో దేశంలో ఉంటారు. ప్రేమించి పెళ్ళిచేసుకున్న ఆ జంట మధ్య దూరం తెచ్చిన వ్యధ, కన్నీళ్ళు మిగతా కథ. కథనం చాలా గొప్పగా ఉన్నా, భార్యాభర్తలు స్కైప్ ద్వారా మాట్లాడుకుంటున్నట్లు సృష్టించడం వల్ల, కథంతా ఆ మూసలో ఒదిగే క్రమంలో క్లుప్తత లోపించినట్లుగా అనిపిస్తుంది. కథాంశంలో ఉన్న సంక్లిష్టత స్థాయికి తగ్గట్టుగా కథ నిడివి కూడా వుండి వుండుంటే బాగుండేది.

 

అమ్మ కడుపు చల్లగా: విజయ కర్రా

ఈ కథ గురించి మాట్లేడే ముందు, ఈ కథ వెనుక కథని కూడా తెలుసుకోవడం అవసరం. ఒక రచయిత ఇచ్చిన ఆలోచన ఆధారంగా మరో రచయిత సృష్టించిన కథ ఇది. ప్రక్రియపరంగా కొత్తగానూ, క్లిష్టంగానూ వున్నా విజయ కర్రా ఈ కథని సమర్థవంతంగా చెప్పడమే కాకుండా, మరో రచయిత ఇచ్చిన సమస్యకి ఆశావహమైన, సార్వజనీయమైన పరిష్కారాన్ని ఇవ్వగలిగారు. ఈ ప్రక్రియ ఫేస్ బుక్ లోని “కథ” గ్రూప్ లో జరిగింది.

 

ఓ చిన్న సమస్య మనసులో దూరి, మనసుని తొలుస్తూ మెలిపెడుతూ – మానవత్వపు ప్రాథమిక విలువలని గురించి ప్రశ్నిస్తూ వేధిస్తుంటే? ఓ తాతకి రెండు రూపాయలు దానం చేయలేని రాజుకి పట్టుకున్న సమస్య ఇది. సమస్య పెరిగి పెద్దదైపోయి పెనుభూతమైపోయి, జ్వరం తెచ్చుకొని కలవరించేదాకా వస్తుంది పరిస్థితి. ఈ సమస్య గురించి భార్య తెలుసుకొని, దానికి పరిష్కారం చూపించడం కథాంశం. ఇవ్వకపోవడానికి లక్ష కారణాలుండవచ్చు గానీ, ఇవ్వదలచుకుంటే ఇవ్వాలనే ఒక్క కారణం చాలు అన్న అంశాన్ని చాలా సున్నితంగా చెప్పిన కథ ఇది. కథకి మూల కారణం వృద్ధుడు – కానీ రచయిత్రి అతడి గతం గురించి ఒక్క పేరా మాత్రమే రాస్తుంది. కారణం కథకి వృద్ధుడి వర్తమానం ముఖ్యం. గతం కాదు. అది రచయిత్రి గ్రహించటం, అంతవరకే రాసి వదిలేయటం ఆ పాత్ర చిత్రీకరణంలో ఆమె చూపించిన జాగ్రత్తకి నిదర్శనం. అదే జాగ్రత్త – చంద్రంలో జాలిగుణం, అతడిలో సంఘర్షణ, దాని పట్ల భార్య సహానుభూతి – ఒక పద్ధతి ప్రకారం మోతాదు మించకుండా చిత్రించటంలో కనపడుతుంది. ‘అత్తత్తత్తా అని పగలంతా (చిన్నపిల్లవాడి) ఒకటే పాట, రాత్రేమో తాత.. తాత.. అని నీ కలవరింతలు’ లాంటి సందర్భోచితమైన వాక్యాల కథనం కథకి సరీగ్గా జతపడింది. కథలో చూపించిన పరిష్కారం, జీవితాల్లో చాలా విషయాలకి అన్వయించుకోదగ్గది కావడం వల్ల మంచి కథలని గుర్తుపెట్టుకొనే వాళ్ళ మనసుల్లో కొన్నాళ్ళపాటు ఈ కథ నిలిచి ఉంటుంది.

 

ఇరుకు పదును: బి పి కరుణాకర్

మరణించిన స్నేహితుడి భార్య అంటే రచయితకి ఒక సాఫ్ట్ కార్నర్. కానీ ఆమెకి తన భర్త మీద సదభిప్రాయం ఉండదు. భర్త ప్రవర్తన మీద రకరకాల అనుమానాలతో, కొన్ని ఆధారాలు తెచ్చి భర్త వ్యక్తిత్వం గురించి రచయిత దగ్గర కూపీలు లాగటానికి ప్రయత్నిస్తుంది. తమ స్నేహం కారణంగానో, లేక స్నేహితుడితో సంబంధం వున్న మరో మనిషి పక్కనే వుండటం వల్లో రచయిత ఆ విషయాలు చెప్పడు. కానీ కథ జరుగుతూ ఉండగా స్నేహితుడి భార్య పట్ల రచయిత అభిప్రాయం మారటం చూచాయగా పాఠకుడికి తెలుస్తుంది. ఇన్ని రకాల మానసిక కోణాలకి కథనం తావు ఇచ్చినా ఒక్క కోణం కూడా రచయిత నేరుగా పాఠకుడికి చెప్పకపోవటం కథలో ప్రత్యేకత.

 

చిన్న కథలో రచయిత ప్రతిభావంతంగా చొప్పించిన ప్రశ్నలను గమనించిండి.

 

అత్యంత విషాదకరమైన సన్నివేశంలో ఓ వ్యక్తిని చూసి, మనస్సులో ఎక్కడో ఏర్పరచుకున్న సానుభూతి – ఆ తరువాత ఎప్పుడో ఆ మనిషితో సంభాషించే క్రమంలో ఆవిరైపోతూ ఉండటం ఎలా ఉంటుంది? చనిపోయిన మనిషి గురించి సాక్షాత్తూ ఆ వ్యక్తి భార్యే నిందిస్తూ మాట్లాడుతూ ఉంటే దాన్ని స్వీకరించడం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తితో సంబంధం ఉన్న మరో మహిళ ఇవన్నీ అక్కడే కూచుని వినడం ఎలా ఉంటుంది? అసలు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ చనిపోయిన వ్యక్తి నిజంగా చేసిన తప్పులేవిటి? ఇప్పుడు అన్నీ అయిపోయాక, ఏది తప్పు, ఏది ఒప్పు? మనుషుల్ని మనం చూసే దృష్టికోణాలు రియల్ టైమ్ లో డైనమిక్ గా మారిపోవడం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకీ; ముగింపు వ్యూహాత్మకంగా, పాఠకుడికి ఊహాత్మకంగా వదిలివేసినందువల్ల ఉత్పన్నమయ్యే మరిన్ని ప్రశ్నలకి ఈ కథలో పాఠకుడే జవాబులు వెతుక్కోవాలి. అది రచయిత, పాఠకుడి తెలివితేటల మీద ఉంచిన నమ్మకం!

 

ఇవి కాక వస్తుపరంగానో, శైలి పరంగానో ప్రస్తావించదగ్గవిగా మేము భావించిన కథలు కొన్ని –

 

24.05.14 త్రిపుర వర్ధంతి సందర్భంగా భగవంతం రాసిన కథ “గోధుమరంగు ఆట”. రచయిత పేరు త్రిపుర పాత్రల్లో ఒకటి కావటం – రచయిత పై త్రిపుర ప్రభావం ఎంతగా ఉందో చెప్పకనే చెపుతుంది. అది అబద్ధం కాదన్నట్లు ఈ కథ పోకడ రుజువు చేస్తుంది. గొప్ప కథనం. అందుకనే కథలో ఇతివృత్తం ఏంటో (అసలు ఉందా?) కథనం తెలియనివ్వదు. ఇది కథకి బలమా?కాదా? అన్న మీమాంస వదిలేస్తే మంచి అనుభూతిని కలగచేసిన ప్రయత్నం. త్రిపుర కథల స్ఫూర్తితో, ‘భగవంతం కోసం‘ కథ ధోరణిలో రాయబడ్డ కథ. త్రిపుర స్మృతికి అంకితం చేయబడ్డ కథ. “ఆకాశంలో నక్షత్రపు జల్లు. భగవంతం రాడు. అట్నుంచి ఏడో నంబర్లోనూ రాడు, ఇట్నుంచి పదమూడో నంబర్లోనూ రాడు. నా పిచ్చి గాని.” అన్న నిరాశతో ముగిసిన ఆనాటి కథ, ఇవాళ రూపాంతరం చెంది “.. కానీ బయట ఆకాశం కింద ఒక అనంతమైన కాల్పనిక వేడుక నాకోసం ఎదురుచూస్తూ ఉంటే – మాటల్తో కాలాన్నెందుకు వృధా చేయడం అనుకుని – హోటల్లోంచి బయటకొచ్చేశాను” అనే నవీన స్ఫూర్తితో ముగియడం ఒక విశేషం!

 

ఈ నెలలోనే వచ్చిన మరో రెండు కథలను కథాప్రేమికులు పరిశీలించాలి. ఈ రెండు కథలు ప్రతీకాత్మకంగా రాసినవి కావటం మాత్రమే ఈ రెండింటి మధ్య వున్న సామీప్యం. వివిన మూర్తి రాసిన “జ్ఞానం కనిపించటం లేదు” కథ సామాజిక పరిస్థితుల మీద చేసిన వ్యాఖ్య అయితే, పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన “ఏనాడు విడిపోని ముడివేసెనే” కథ భార్యాభర్తల మధ్య పల్చబడే అనుబంధం గురించి వివరిస్తుంది.

 

ప్రతీకలతో కథ నడపడం కత్తి మీద సాములాంటిదని ఈ రెండు కథలు చెప్పకనే చెబుతున్నాయి. కత్తి మీద సాము ఎందుకంటే – జటిలంగా ఉన్న ప్రతీకలు సంక్లిష్టమైన పజిల్ లా తయారై, కథ పాఠకుడికి దూరం అవుతుంది. సులభంగా ఊహించగల ప్రతీకలు కథ మీద పాఠకుడికి ఉన్న ఉత్సాహాన్ని నీరుకారుస్తాయి. ప్రతి అంశానికీ ఒక ప్రతీక చొప్పున వాడుకుంటూ పోవడం వల్ల మొత్తం ప్రక్రియ పలుచబారే ప్రమాదం ఉంది. ప్రతీకలతో వున్న మరో సమస్య ఆ ప్రతీకలకు లేని అర్థాన్ని ఆపాదించే ప్రయత్నం. చిత్రకళ నుంచి సాహిత్యంలోకి వచ్చిన ఈ ప్రక్రియలో కొన్ని కొన్ని విషయాలకు ప్రతీకలు దాదాపు నిర్థారితంగా వున్నాయి. వాటిని వేరే అర్థంలో వాడటం వల్ల తెలివిడి కలిగిన పాఠకులకు కూడా కథ కొరుకుడు పడకపోయే సమస్య వుంటుంది. శిల్పంలో విభిన్నమైన ప్రక్రియగా వీటిని వాడటం ముదావహమే గానీ, కథలని ఇంత అస్పష్టంగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నది పెద్ద ప్రశ్న. (ఏది ఏమైనా ఈ కథలను పాఠకులు చదివి, వారికి స్ఫురించినంత మేర సారాన్ని గ్రహించే అవకాశం వుంది కాబట్టి ఈ కథలు చదివి/చదివిన వారు తమ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో చెప్పాలని మనవి)

 

ఈ నెల ఉత్తమ కథ

ఇద్దరి మనుషుల సంభాషణల్లో – వ్యక్తం అయ్యే అంశాలు, అవ్యక్తంగా ఉంచబడ్డ విషయాల మధ్య ఓ సున్నితమైన గాప్ వస్తుంది. ఈ గాప్ ఆ సన్నివేశంలో ఉన్న వ్యక్తులకి అవగాహనలోకి వస్తే, ఆ సంభాషణల్లో ఓ ఇబ్బంది వచ్చిచేరుతుంది. ఇదీ ఈ కథలోని ప్రాథమిక చిత్రం. ఆ సన్నివేశంలో ఇంకో వ్యక్తి కూడా ఉంటేనూ, మరో వ్యక్తి కనబడకుండా ఉంటేనూ ఆ ఇబ్బంది స్థాయి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ముఖ్యంగా – ఆ నలుగురు వ్యక్తుల మధ్యనా కొన్ని సంబంధాలో బాంధవ్యాలో మరోటో ఉన్నప్పుడు. ఇదొక సంక్లిష్టమైన చిత్రం. కథగా చెప్పడం కష్టం, చెప్పి ఒప్పించడం ఇంకా కష్టం. అలాంటి బాధ్యతని ప్రతిభావంతంగా నెరవేర్చారు బి పి కరుణాకర్ గారు ‘ఇరుకు పదును’ కథలో. ఎంతవరకూ చెప్పాలో దానికి కొంచెం తక్కువగానే చెప్పి, ఈ కథలో కరుణాకర్ గారు అటు క్లుప్తతనీ ఇటు అనుభూతి ఐక్యతనీ ఏకకాలంలో సాధించగలిగారు. అందువల్లా, పైన చెప్పిన ఇతర కారణాల వల్లా ఈ నెల వచ్చిన కథలలో “ఇరుకు పదును” ఉత్తమకథగా మేము భావించడం జరిగింది.

 

కథా రచయిత బి.పి. కరుణాకర్ గారికి అభినందనలు!! కరుణాకర్ గారితో “ఇరుకు పదును” గురించి సంభాషణ వచ్చేవారం.

 

ఈ వ్యాసంలో ప్రస్తావించిన కథలు:

సం. కథ రచయిత (త్రి) పత్రిక లింక్
1 అమ్మ కడుపు చల్లగా విజయ కర్రా ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 4 http://goo.gl/3oY7up
2 ఇరుకు పదును బి. పి. కరుణాకర్ ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 18 http://goo.gl/xxUKc5
3 ఏ నాడు విడిపోని ముడి వేసెనే పూర్ణిమ తమ్మిరెడ్డి ఈమాట – మే/జూన్ http://goo.gl/CPe5p6
4 గోధుమరంగు ఆట భగవంతం ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 25 http://goo.gl/Adb8oF
5 జీవన మాధుర్యం కాండ్రేగుల శ్రీనివాసరావు నవ్య, మే 14 http://goo.gl/ixJHPR
6 జ్ఞానం కనిపించటంలేదు వివినమూర్తి అరుణతార, మే
7 డబ్బు సంచి కె. వి. నరేందర్ నమస్తే తెలంగాణ, మే 4 http://goo.gl/nsCq6P
8 తృతీయ వర్గం డా. ఆర్. వి. రాసాని నవ్య, మే 21 http://goo.gl/ZZ2TfQ
9 దో దీవానే దో షహర్ మే పూర్ణిమ తమ్మిరెడ్డి కినిగే పత్రిక, మే http://goo.gl/XZ1EpG
10 మరుగు వాణిశ్రీ నవ్య, మే 7 http://goo.gl/LJHBxF
11 సంస్కృతం మాష్టారు ఇస్మాయిల్ సాయిబ్రహ్మానందం గొర్తి ఈమాట, మే/జూన్ http://goo.gl/E5AuQy
12 సాక్షి శిరంశెట్టి కాంతారావు కౌముది, మే http://goo.gl/xiLhrE

– అరిపిరాల సత్యప్రసాద్, ఎ.వి. రమణమూర్తి, టి. చంద్రశేఖర రెడ్డి

aripirala02. T Chandra Sekhara Reddy01. Ramana Murthy

మన కథలలో రాశి తప్ప వాసి ఎక్కడ?

 

nadustunna katha

నడుస్తున్న కథ ఏప్రిల్ కథలు:

ఏప్రిల్ నెల కథల సమీక్ష మీరు ఇప్పుడు చదవబోతున్నారు. ప్రతి నెలా కథలను చదివి ఆ పై నెలలో ఆ కథల సమీక్ష రాయాలని మా సంకల్పం. అయితే కథల సంఖ్య పెరగటం; వ్యక్తిగత, ఉద్యోగ కారణాలవల్ల మా ముగ్గురికి ఏప్రిల్ కథల గురించి చర్చించే అవకాశం కుదరలేదు. ఏ నెలకానెల పాఠకుల పఠనానుభూతి జ్ఞాపకంలో వుండగానే వాటి సమీక్ష చదివితే వారి అనుభవాలనీ, అనుభూతులనీ మా అభిప్రాయాలతో పోల్చుకునే అవకాశం ఈ సందర్భంగా కోల్పోతున్నందుకు మాకూ బాధగానే వుంది. అందుకు పాఠకులకు క్షమాపణలు చెప్పుకుంటూ, రాబోయే వ్యాసాలు సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని మనవి చేస్తున్నాము.

 

ఏప్రిల్ నెలలో వచ్చిన దాదాపు నూట డెబ్భై ఐదు కథలను పరిశీలిస్తే ఇప్పుడొస్తున్న తెలుగు కథలు రాశికే కానీ వాసి లెక్కకు రావన్న దిగులు మళ్ళీ కమ్ముకుంటోంది. నెల నెలా పది నుంచి పదిహేను కథలను మంచి కథలుగా పరిచయం చేస్తున్న మేము, ఈ నెల ఆ సంఖ్యను ఏడుకు మించి ఎంత ప్రయత్నించినా పెంచలేకపోవటం బాధాకరం. మా దృష్టిలోకి రాని మంచి కథలు ఒకటో రెండో వున్నా, మా అభిప్రాయాలతో విభేదించి మరో ఒకటి రెండు కథలను పాఠకులు సూచించినా, అవన్నీ కలుపుకుంటే కూడా మొత్తం కథలలో పది శాతం కూడా వుండదు కాబట్టి మేము పైన చెప్పిన వాక్యంలో ఏ మార్పు రాదు. ఇది తెలుగు కథకులు సమీక్షించుకోవాల్సిన విషయం.

 

ఈ నెల వచ్చిన కథలను పరిశీలించే ముందు ఏప్రిల్ నెలలో కొన్ని విశేషాలను గుర్తుచేసుకుందాం –

ఈ నెలలో గురజాడ ఒక పాత్రగా ఒక కథ (తనకు నచ్చిన కానుక: అనంత సురేష్, ఆదివారం ఆంధ్రజ్యోతి 4 ఏప్రిల్), శ్రీపాద ఒక పాత్రగా ఇంకో కథ (“మహావృక్షం”: సింహప్రసాద్, తెలుగువెలుగు) వచ్చాయి. అయితే, ఈ ప్రత్యేకత మినహా కథలు మాత్రం సాధారణంగానే వున్నాయి. అలాగే, ఒకే కథ ఇదే నెలలో రెండు ఇంటర్నెట్ పత్రికలలో రావటం కూడా గుర్తించవచ్చు.

 

ఇక మంచి కథల గురించి –

ఈ నెలలో వచ్చిన మంచి కథలలో వస్తుపరంగా వైవిధ్యం స్పష్టంగా కనపడుతోంది. “పరబ్రహ్మ”, “స్పార్క్” కథలు మంచి కథాంశాన్ని ఎన్నుకోని, ఆ నేపధ్యంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెబితే, “అస్తిత్వం”, “నేను నాన్న బిర్యాని”, “వెడ్డింగ్ ఇన్విటేషన్” వంటి కథలు అనుభూతి ప్రధానంగా నడిచాయి. ఈ కథలలో వున్న కథాంశం చాలా స్వల్పమైనదైనా కథని నడిపించిన విధానంలో ప్రతిభ వల్ల చదవతగ్గ కథలైనాయి. “పేరున్న రాజ్యం”, “తలుపులు” కథలువర్తమాన రాజకీయ పరిస్థితులమీద సంధించిన కథాస్త్రాలు. ఈ కథలన్నింటి గురించి స్థూలంగా పరిచయం చేసుకుందాం.

పరబ్రహ్మ: సింహప్రసాద్

గురువు నేర్పిన చదువుతో గురువునే మించి పోయాననుకునే శిష్యుడు మళ్ళీ గురువు గొప్పదనాన్ని తెలుసుకోవడం కథాంశం. స్వాతి కథల పోటీలో బహుమతి పొందిన ఈ కథని పరిశీలిస్తే కథాంశం పాతదైనా ఒక చెయ్యి తిరిగిన రచయిత చేతిలో ఎంత చక్కగా రూపుదిద్దుకోగలదో అర్థం అవుతుంది. ఇతివృత్తంలో నేటి గురువుల ట్రెండ్ ను ప్రస్తావించటం వల్ల సమకాలీన పరిస్థితులను సూచిస్తోంది. అయితే,కథ ప్రధమార్థంలో శిష్యుడికి గురువు లెక్కలు నేర్పే ప్రక్రియ అవసరాన్ని మించి జరిగిందేమో అనిపించింది.

 

అస్తిత్వం: శిరీష్ ఆదిత్య

ఢిల్లీ నగరంలో ఒంటరిగా వుంటున్న ఓ తెలుగు యువకుడు తెలుగు మాట్లాడే ఓ హోటల్ సర్వర్ తో పరిచయం పెంచుకుంటాడు. ఓనర్ కి తెలియకుండా అతనికి టిప్ ఇవ్వలేని చిన్న డైలమా. అది ఇవ్వకముందే సర్వర్ చనిపోవటం – ఇదీ కథాంశం. జీవితం తాలూకు అభద్రత, అజ్ఞానం, అనిశ్చితీ అసలే కుదిపేస్తున్న ఆ సమయంలో – వెంకటప్ప మరణం జీవితపు క్షణికత్వాన్ని కథకుడికి ఆవిష్కరింపజేసి, నాస్తికుడిగా ఉన్నవాడిని గుడి మెట్ల మీద నిలబెడుతుంది. ఈ కథ కూడా ముందే చెప్పినట్లు మంచి భాష, కథనం వల్ల చదివించేస్తుంది. చివర్లో యువకుడు వేసుకునే ప్రశ్నలు, మధ్యలో వెంకటప్ప వేసే ప్రశ్నలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. కథాంశంలో మరి కొంత కసరత్తు చేసివుంటే కథకు కండపుష్టి కలిగుండేది.

 

స్పార్క్ : విజయభాను కోటే

ఒక వైపు నుంచి చూస్తే బాల్యంలో లైంగిక దురాచారానికి బలైన అమ్మాయి ఆత్మస్థైర్యంతో నిలబడిన కథ. అలాంటి పరిస్థితులు ఆ అమ్మాయిల్లో ఎలాంటి నిర్వికారాన్నీ, వ్యధనీ కలగజేస్తాయో వాస్తవికంగా పట్టుకోవడానికి మంచి ప్రయత్నం చేసిన కథ. మరో వైపు నుంచి చూస్తే ఓ కుర్రాడి ఏక పక్ష ప్రేమ కథ. తాను ప్రేమించే అమ్మాయి తిరిగి ప్రేమించకపోతే కోపం తెచ్చుకోకుండా ఎందుకని ఆలోచించిన ప్రేమికుడి కథ. నిజమైన ప్రేమ అంటే అదే అని చాలామంది గ్రహించక పోయినా ఈ కథలో హీరో గ్రహించటం ఈ కథలో విశేషం. ముగింపును కూడా రచయిత్రి అటో ఇటో తొందరపడి తేల్చదు. ప్రయత్నం లేకుండా ఫలితం రాదు కదా అని ప్రశ్నార్ధకంతో వదిలేస్తాడు. అబ్రప్ట్ గా మొదలైన కథ ఇన్‌కంక్లూసివ్ గా ముగియటం కొంత వెలితి అనిపించినా – ‘సర్వ’పాత్ర మనస్తత్వం, జీవన నేపథ్యం దృష్టిలో పెట్టుకుంటే కథకు అంతకన్నా ఆచరణాత్మకమైన ముగింపు సాధ్యం కాదేమో అనిపిస్తుంది.

 

పేరున్న రాజ్యం: పాలపర్తి జ్యోతిష్మతి

సుస్థిర రాజ్యం ఏర్పరచుకున్న ప్రభువులు – అధికారమే పరమావధిగా ప్రజలని ఎలా మభ్యపెట్టి మోసం చేస్తూ ఉంటారనే విషయాన్ని ప్రతీకాత్మకంగా రాసిన కథ. చివరికి విసుగెత్తిన ప్రజలు ఏం చేస్తారన్నది ముగింపు. చాలా విచిత్రంగా, ఈ కథ వచ్చిన కొద్ది రోజులకే మన దేశపు రాజకీయాల్లో ఇలాంటి పరిణామం సంభవించడం కాకతాళీయమే అయినా, ఒక రచన చూడగల వాస్తవ దృష్టికోణాన్ని అది స్పష్టపరుస్తోంది. తను చెప్పదలుచుకున్నది సూచ్యంగా తప్ప వాచ్యంగా చెప్పకూడదనుకున్న రచయిత్రి తనమీద తాను విజయవంతంగా ప్రయోగించుకోగలిగిన నియతి. అంతర్లీనంగా దాగి ఉన్న దారపు పోగును పట్టుకోగలిగితేనే మంచికథ. లేకుంటే మామూలు కథగా అనిపించి బురిడీ కొట్టించగలిగిన కథ.

 

నేను, నాన్న, బిర్యానీ: ఇండ్ల చంద్ర శేఖర్

బిర్యానీ తినాలన్న బలమైన కోరికతో ఇస్మాయేల్ హోటల్ చేరిన ఓ మాష్టారుకి అక్కడ తండ్రి కనిపించడం, ఆయనకు ఆ రోజు ఉదయమే డబ్బులేదని చెప్పిన కారణంగా ఆయన్నుంచి తప్పించుకోవాల్సిన అవసరం. ఈ పరిస్థితిలో కొడుకు ఇంకా ఏమీ తినలేదని తెలుసుకున్న తండ్రి అతన్ని మరో హోటలుకి తీసుకెళ్ళి బిర్యానీ తినిపిస్తాడు. తండ్రి ప్రేమ కలిసిన ఈ బిర్యానీనే అద్భుతంగా అనిపిస్తుంది మేష్టారికి. ‘ఎదిగిన కొడుకు – నిర్లక్ష్యం చేయబడ్డ తండ్రి’ ఇతివృత్తంతో ఇపుడు తామర తంపరగా వస్తున్న కథల్లో ఒక కొత్త కోణం ఆవిష్కరించిన కథ. కొడుకు నిర్లక్ష్యం చేసినా తండ్రి ప్రేమ చెక్కు చెదరదని చెప్పిన కథ. క్లుప్తతతో కథకు ప్రాణం పోసిన రచయిత తాను చెప్పదలుచుకున్నదాన్ని సూచ్యంగా చెప్పటం కథలో విశేషం.

అయితే, మేష్టారు తన ఇన్నేళ్ళ జీవితంలో తండ్రి ప్రేమని ఎప్పుడూ తెలుసుకోలేదా? అలా స్వార్థపరుడిగా ఎందుకు ఉన్నాడు? లాంటి ప్రశ్నలకి ఎలాంటి కార్యకారణసంబంధమూ చూపించకుండా సన్నివేశాలని తనకు కన్వీనియెంట్ గా రచయిత మలచుకోవడం వల్ల కథ తాలూకు సంపూర్ణత్వం కొంత దెబ్బతింది. ఆ విషయాలనీ కథ పరిధిలోకి తీసుకొని వస్తే, అనుభూతిని ఇంకొంచెం ఎక్కువ పండించగలిగి ఉండేది.

 

వెడ్డింగ్ ఇన్విటేషన్: డా. వంశీధర్ రెడ్డి

కథకుడిలో కథని ప్రతిభావంతంగా చెప్పగలిగిన నేర్పు ఉంటే, దానికి ఎక్కడా తడుముకోవాల్సిన అవసరం లేని భాషమీద పట్టు తోడైతే సూది అంత ఇతివృత్తంతో గడ్డిమోపంత కథ ఎలా సృష్టించవచ్చు అనటానికి మంచి ఉదాహరణ. గొప్ప వైవిధ్యం ఉన్న వాతావారణం, దానికి అత్యంత సహజమైన కథన ధోరణీ, కథ చెప్పడంలో అనుసరించిన ఒక మోనోలాగ్ లాంటి ప్రక్రియా, అందులో చెణుకులూ మరికొన్ని మెరుపులూ – ఇవన్నీ కథని నిస్సందేహంగా ఒక గొప్ప కథగా మలిచాయి.

విమర్శకులలో, విశ్లేషకులలో తప్పకుండా చర్చ లేవనెత్తే కథ ఇది. కథలో సహజత్వాన్ని ఇంకొంచెం పొడిగించి వాడిన బూతులు కథకి అవసరమా కాదా అన్న అన్ని చర్చల్లోనూ ఈ కథని ఉదహరించుకుండా వుండలేము. సభ్యత ముసుగు వేసుకుని చూస్తే అభ్యంతరకరంగానూ, కథనంలో సహజత్వాన్ని కోరుకునే వారికి ఆశ్చర్యకరమైనంత సహజంగా కనిపించే కథ. డాక్టర్ వంశీధర్ రెడ్డిని కథారూపం పరంగా ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన కథ.

ఇన్ని విశేషణాలున్న ఈ కథ, ఒక విధివిలాసపు కథ కాకుండా, ఒక నిర్దుష్టమైన ప్రయోజనాన్ని, జీవితానికి సంబంధించిన ఏదైనా విశేషాన్ని అందించగలిగిన ఉద్దేశాన్నీ కూడా కలగలపుకొని ఉన్నట్టయితే, ఇంకొంత మంచి కథ కచ్చితంగా అయి ఉండేది.

 

తలుపులు: పెద్దింటి అశోక్ కుమార్

తెలంగాణ ఉద్యమం విజయవంతమైన తరువాత జరిగిన ఎన్నికల నేపధ్యంలో రాయబడిన కథ. కథకు సహజమైన తెలంగాణ మాండలికంలో రాయబడింది. పేదరికంతో పాటుతుఫాను చలిగాలి కూడా కమ్ముకున్న ఒక కుటుంబం గురించిన కథ. ఆ చలినుంచి చెల్లెల్ని కాపాడటం కోసం ఒక ఫ్లెక్సీని దొంగతనంగా తీసుకొచ్చి, తలుపుల్లేని ఆ ఇంటికి కొంత రక్షణ కల్పించాలి అనే ఆలోచనలో ఉన్న ఒక అన్న కథ. తీరా దాన్ని తెంపుకొని వచ్చాక, సదరు రాజకీయ పార్టీ కార్యకర్తలు నానా యాగీ చేసి ఆ కుర్రాణ్ణి కొట్టి ఫ్లెక్సీ లాక్కెళ్తారు. మంచి ఎత్తుగడ, పాఠకుడి దృష్టిని పక్కకు పోనివ్వని ముగింపు. ఇతివృత్తంలో సమకాలీనత. దానికి అనుగుణమైన భాష, కొరడా కొసలా చెళ్లుమనే ముగింపు. మంచి కథకి ఉండాల్సిన లక్షణాలు అన్నీ పుణికిపుచ్చుకున్న కథ.

 

ఇవీ ఏప్రిల్ లో వచ్చిన కొన్ని మంచి కథలు. ఈ కథలలో ఉత్తమమైన కథ కోసం పరిశీలించినప్పుడు, ఈ వ్యాసకర్తలు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న కథ తలుపులు”.అశోక్ కుమార్ గారి రచన ఆ ఉద్యమస్ఫూర్తిని సజీవంగానే వుంచుతూ, ఉద్యమానంతర పరిస్థితిని ఎంతో బాధ్యతతో గుర్తు చేస్తుంది.

ఈ కథలో ఆయివు పట్టు ఆ ఫ్లెక్సీ మీద వున్న బొమ్మ. ఏ పసిపిల్లాడు చెల్లెలిని చలినుంచి కాచడానికి ఫ్లెక్సీ దొంగతనం చేశాడో ఆ పిల్లాడి తండ్రి బొమ్మే ఆ ఫ్లెక్సీ మీద వుంటుంది. ఆ కుటుంబం తెలంగాణా పోరాటంలో అమరుడైన ఓ వీరుడిది. ఈ విషయం ఎంత బలమైనదంటే కథని ఈ వాక్యంతో ముగించి ఒక ఆశ్చర్యాన్ని, రాజకీయనాయకుల పైన కసిని పాఠకుల మదిలో రగిలించి ముగించవచ్చు.

కానీ, అశోక్ కుమార్ గారు కథని అలాంటి ఒక టెక్నిక్ తో ముగించడానికి ప్రయత్నించలేదు. అదీ ఈ కథలోని నిజాయితీ! గొడవ చేసిన రాజకీయ పార్టీల వాళ్ళు వెళ్ళిపోయాక, తల్లి కొడుకు తల నిమురుతూ, “వీడి పోరాటం ఇంకా మిగిలే ఉంది” అనడంతో కథ ముగుస్తుంది. పోరాటాల వల్ల సాధించాల్సింది సాధించినా, పోరాటాల అనంతరం అందుకోవాల్సిన ఎత్తులు ఇంకా మిగిలే ఉంటాయన్న అన్యాపదేశం ఈ కథ సారాంశం. తెలంగాణా సాధనతో ఆగకుండా రాష్ట్ర నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకీ సమాయత్తమవమని స్ఫూర్తిని రగిలిస్తుంది. అందుకే ఈ కథ తెలంగాణ నేపధ్యంలో రాయబడ్డ కథే అయినా అన్ని ప్రాంతాల వారికీ అన్వయం అవుతుంది. ఆ సార్వజనీతే ఈ కథని ఉత్తమ కథగా నిలబెట్టింది.

పెద్దింటి అశోక్ కుమార్ గారికి మరోసారి అభినందనలు!!

 

ఇక చివరిగా – ఈ వ్యాసంలో చర్చించిన కథల లిస్టూ,వీలైనచోట లింకులూ:

తలుపులు: పెద్దింటి అశోక్ కుమార్ (నమస్తే తెలంగాణ బతుకమ్మ, 27 ఏప్రిల్)http://goo.gl/WvdUpt

 

వెడ్డింగ్ ఇన్విటేషన్: వంశీధర్ రెడ్డి (కినిగే పత్రిక, ఏప్రిల్)http://goo.gl/Ud2D9g

 

నేను నాన్న బిర్యాని: చంద్రశేఖర్ ఇండ్ల (సాక్షి ఫన్ డే, 13 ఏప్రిల్)http://goo.gl/uhHZnC

 

పేరున్న రాజ్యం: పాలపర్తి జ్యోతిష్మతి (చినుకు, ఏప్రిల్)

 

స్పార్క్: విజయభాను కోటే(సాహితీ ప్రస్థానం, ఏప్రిల్)http://goo.gl/G69HD8

 

అస్థిత్వం: శిరీష్ ఆదిత్య (కినిగే పత్రిక, ఏప్రిల్)http://goo.gl/k9NkHD

 

పరబ్రహ్మ: సింహప్రసాద్ (స్వాతి వారపత్రిక, 11 ఏప్రిల్)

 

ఫిబ్రవరి: హాస్య కథల హవా!

 2 (1)

 

 

[ఫిబ్రవరి కథలలోకి వెళ్ళే ముందు ఓ చిన్నమాట. జనవరి నెల కథల పరిశీలనలో రెండు మంచి కథలు మా దృష్టిని దాటిపోయాయి. అవి – హిట్లర్ జ్ఞాపకాలు (డా. వి. చంద్రశేఖరరావు, పాలపిట్ట), చావుదేవర (రమాసుందరి, పాలపిట్ట). “హిట్లర్ జ్ఞాపకాలు” లేయర్డ్ గా సాగే కథనంతో కాలేజీ కేంపస్ లోని రాజకీయాలను పరిచయం చేస్తే, “చావుదేవర” సొగసైన ఒంగోలు మాండలికంలో సాగిన ఇద్దరాడవాళ్ళ కథ. రెండింటిలోనూ ప్రతీకాత్మకంగా రెండు జంతువులుండటం, రెండింటిలోనూ మిస్టిక్ లక్షణం వుండటం ఓ చిత్రమైన సామీప్యం. గత మాసంలో ప్రకటించిన జనవరి మంచి కథల జాబితాలో ఈ రెండు కథలూ తప్పకుండా చేర్చతగినవి. జరిగిన పొరపాటు సహృదయంతో అర్థం చేసుకోని క్షమించగలరని ఈ ఇద్దరు రచయితలను, పాఠకులను కోరుతున్నాము. మేము వీలైనంత సమగ్రంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాకున్న పరిమితుల వల్ల ఏవైనా కథలు/పత్రికలు మా దృష్టిని దాటిపోతే పాఠకులు సూచించడం ద్వారా ఈ కృషిని సమిష్టిగా, సమగ్రంగా చేయగలరని మళ్ళీ కోరుతున్నాము.]

 

ఇక ఫిబ్రవరి కథలలోకి వద్దాం –

ఫిబ్రవరి కథలలో రెండు ప్రత్యేకతలు వున్నాయి. మంచి కథల జాబితాలో చేర్చతగిన కథలలో చాలా వరకు హాస్యకథలు వున్నాయి. ఇది చాలా “ఆనందకరమైన” పరిణామం. రెండవది – చాలావరకు మంచి కథలు వెబ్ పత్రికలలో రావటం. సంఖ్యాపరంగా వెబ్ పత్రికలన్నీ కలిపితే కొన్ని కథలే వస్తున్నప్పటికీ వాటిలో మంచి కథల శాతం, ప్రింటు పత్రికలలో వస్తున్న మంచి కథల శాతం కన్నా ఎక్కువ వుండటం మరో పరిణామం. ఇది విస్తరిస్తున్న వెబ్ సాహిత్యానికి నిదర్శనమా లేక ప్రింటు పత్రికలలో క్షీణిస్తున్న ప్రమాణాలకు చిహ్నమా అన్నది మరింత లోతుగా పరిశీలించవలసి వున్నది. మరి కొన్ని నెలల పరిశీలన తరువాత ఈ విషయం గురించి మరింతగా మాట్లాడుకుందాం.

ఇందాక చెప్పినట్లు ఈ నెల హాస్య కథల హవా నడిచింది. ఓ అంతర్జాల పత్రిక హాస్య కథల పోటీ నిర్వహించి అందులో బహుమతి పొందిన కథలను ప్రకటించడం అందుకు ముఖ్యకారణం కావచ్చు. అయితే తెలుగు సాహిత్యంలో హాస్య కథల విషయంలో ఓ చిన్న చూపు వుంది. ప్రముఖ వార్షిక సంకలనాలలో హాస్యకథలు అరుదుగా చోటు చేసుకుంటాయి. ఎక్కడో సెటైర్ కథలలో తప్ప కథాంశంలో బలం వుండదనీ, పాఠకులను నవ్వించడమే తప్ప ఇలాంటి కథలతో సామాజిక ప్రయోజనం పెద్దగా వుండదనీ కారణం చెప్తారు. పాఠకులను నవ్వించడమే ఓ సామాజిక ప్రయోజనమనే వాదన కూడా వుంది. ఏది ఏమైనా హాస్య కథ రాయడం కష్టమైన పని. మంచి పరిశీలన (వస్తువు కోసం), మంచి వాక్య నిర్మాణం (శైలి) వుంటే తప్ప హాస్యకథలు పండవు. అందుచేత ఈ నెల హాస్య కథలను ప్రత్యేకంగా ప్రకటిస్తున్నాము. ఇవేవీ కాకపోయినా మిగిలిన (సో కాల్డ్ సీరియస్) కథలు ఇచ్చే నిరుత్సాహం నుంచి కాస్త తెరిపిగానైనా వీటిని చదువుకోవచ్చు.

ఇక మిగిలిన కథల గురించి –

గత మాసం చెప్పినట్లుగానే తెలుగు కథకులలో వస్తు వైవిధ్యం కోసం ప్రయత్నం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సమకాలీన అంశాలకు కథా రూపం ఇచ్చే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. రైతు కష్టాలు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు వంటి నిలవ కథాంశాలు అడపాదడపా కనపడుతున్నా వాటి సంఖ్య తగ్గుముఖం పట్టింది. వర్తమాన వస్తువులతో కథలు వస్తున్నా ఆ వస్తువు లోతుల్లోకి వెళ్ళే విషయంలో కొంత అలసత్వం కనిపిస్తోంది. వస్తు వైవిధ్యం ప్రోత్సహించవలసినదే కానీ, వస్తువు పట్ల మరికొంత గాఢమైన పరిశీలన లేకపోవడం లేదా అది కథలో ప్రతిఫలించలేకపోవడం మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ఓ గంభీరమైన విషయాన్ని కథలో ప్రవేశపెట్టినంత మాత్రాన అది గంభీరమైన కథ అయిపోదు. ఆ విషయం తాలూకు విభిన్న కోణాలు కథలో సూత్రామాత్రంగానైనా స్పృశించబడాలి.

ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గ కథలను చూద్దాం –

“సుపుత్రుడు” (బి. గీతిక, స్వాతి మాసపత్రిక) కథ రొటీన్ అనాధ వృద్ధుల కథ అయినప్పటికీ ఓ అనాథను తెచ్చి పెంచుకోవడంతో ముగిసే విభిన్నమైన ముగింపు ఉన్న కథ. “శివుడి పెళ్ళి” (జయంతి వెంకటరమణ, నవ్య వారపత్రిక) కథకు (పెళ్ళికి) ఆడపిల్లలు దొరకకపోవటం అన్న అంశం మీద ఆధారపడింది. ఇది సమకాలీనమే అయినా ఆ అంశం గురించి తక్కువ మాట్లాడటం వలనా, ఒక వ్యక్తి అనుభవంలా మాత్రమే మిగిలిపోవటం వలన చిక్కదనం కొరవడింది. “వెలుగు రేఖలు” (రాజేష్ యాళ్ళ, ఈనాడు ఆదివారం), “ఓటమి” (సనిహిత్, కౌముది) కథలు కార్పొరేట్ ప్రపంచంలోని ఉరుకులు పరుగుల గురింఛిన కథలు. రెండింటిలోనూ నాటకీయత ఎక్కువైనప్పటికి ఇప్పటి సందర్భానికి చెప్పవలసిన కథలు. “ఇదో రకం పోరాటం – ఈ నాటి పోరాటం” (గంటి భానుమతి, భూమిక) కథలో కూడా కార్పొరేట్ ప్రపంచం నేపధ్యం. అయితే అందులో స్త్రీ ప్రత్యేకమైన సమస్యలను ప్రతిపాదించారు. అలాగే “గడువు” (ప్రతాప వెంకట సుబ్బారాయుడు, స్వాతి వారపత్రిక) అదే ప్రపంచంలో నుంచి ఓ personality development కథను రాయగలిగారు. దొరికినదల్లా ’వాడుకునే’ లక్షణం గురించి “కొత్త పరుగు” (సి.యస్. రాంబాబు, సారంగ), అందినంతవరకు దోచుకునే లక్షణం గురించి “గుడి” (భువనచంద్ర, స్వాతి వారపత్రిక) ప్రస్తావించాయి. మనిషి యొక్క మౌలికమైన స్పందనలు – దయ, ఆశ, మోసం, మోహం వంటి గుణాలను విశ్లేషిస్తూ “వజ్రం” (జి. వెంకటకృష్ణ, ఆదివారం ఆంధ్రజ్యోతి), “కురిసిన మనసు” (జి. వెంకటకృష్ణ, నవ్య) కథలు కనిపిస్తాయి. చాలా పాత (సినిమా) కథాంశాన్ని కొత్తగా చెప్పిన “ముళ్ళగులాబి” (పులిగడ్డ విశ్వనాథరావు, తెలుగువెలుగు), కొంత అసహజంగా వున్నా ఆశావహంగా వున్న కథ “జనాగ్రహం” (డా. జి.వి. కృష్ణయ్య, స్వాతి వీక్లి) చెప్పుకోదగ్గవి.

వస్తుపరంగా చెప్పుకోదగ్గ ముఖ్యమైన కథ “టైలర్ శీను” (ప్రసాదమూర్తి, సారంగ). తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో రాసిన ఈ కథ వర్తమానంలోనే వుంది. అయితే వివిధ వృత్తుల గురించి వాటిని కోల్పోవడం గురించి మొదలైన ఈ కథ, క్రమంగా చెప్పదల్చుకున్న సమస్యలోకి వెళుతుంది. అందువల్ల చెప్పదల్చుకున్న సమస్య కొత్తగా వచ్చి చేరినట్లు, కథ దిశ మారినట్లు అనిపించే ప్రమాదం వుంది.

ఇక భాష, కథనపరంగా చెప్పుకోవాల్సిన కథలు కొన్ని వున్నాయి. పైన ప్రస్తావించిన “టైలర్ శీను” కథే కాకుండా, “తరళ మేఘచ్ఛాయ, తరువాతి ఎడారి” (వై. విశారద, కినిగె పత్రిక), “ఓ చిత్ర కథ” (పూర్ణిమ తమ్మిరెడ్డి, కినిగె పత్రిక) కథలు విశేషంగా చెప్పుకోదగినవి. కవితాత్మక ధోరణిలో సాగే వాక్యాలు “టైలర్ శీను” కథకు కొత్త అందాన్ని ఇచ్చాయి. “తరళ మేఘచ్చాయ..” చాలా పెద్ద కథ అయినప్పటికీ శైలి పరంగా చాలా మంచి అనుభూతి మిగిల్చింది. “ఓ చిత్ర కథ” ఓ చక్కని ఫోక్ లోర్ కథని అన్వయిస్తూ సాగింఛిన కథనం బాగుంది. అయితే “తరళ మేఘచ్ఛాయ, తరువాతి ఎడారి” కథలో వస్తు బలం లేకపోవటం; “టైలర్ శీను”, “ఓ చిత్ర కథ” కథలలో ఫోకస్ మారిపోవడం వంటి సమస్యలవల్ల కథ ప్రారంభంలో ఒక మంచి కథ చదవబోతున్నామన్న నమ్మకాన్ని కలిగించినా, కథ గడిచే కొద్దీ ఆ నమ్మకం పల్చబడినట్లు అనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే కథలన్నింటిలోనూ నాటకీయత ఎక్కువగా కనపడుతోంది. కథల్లో కనిపించే పాత్రలూ, జరిగే సంఘటనలూ మన చుట్టుపక్కల సాధారణంగా కనిపించేవీ, జరిగేవీ అయినప్పుడు మాత్రమే పాఠకులకి ఆ కథ నమ్మశక్యంగానూ, ఆలోచించదగినదిగానూ అనిపిస్తుంది తప్ప, కేవలం కథని నడపడం కోసమే పాత్రలనీ, సన్నివేశాలనీ సృష్టిస్తే అవి అసహజంగానూ, నాటకీయంగానూ కనిపిస్తాయి. పాఠకుడు అలాంటి కథని చదివిన వెంటనే మర్చిపోతాడు.

“శివుడి పెళ్ళి”, “సుపుత్రుడు”, “కురిసిన మనసు”, “గుడి” వంటికి కథలల్లో నాటకీయత పాళ్ళు కాస్త తూకం తప్పితే, “జనాగ్రహం”, “వెలుగురేఖలు”, “ఓటమి” వంటి కథల్లో దాదాపు అసహజత్వానికి దగ్గరగా వెళ్ళిపోయాయి. ఇది తెలుగు రచయితలు సమీక్షించుకోవాల్సిన అంశం. ఈ అసహజత్వానికి మరింత దోహదపడుతున్నవి సంభాషణలు. మామూలుగా మనం మాట్లాడుకునే విధానం కథలలో అరుదుగా కనపడుతోంది. చివర్లో ప్రసంగంలాంటి సంభాషణలు (ఇదో రకం పోరాటం…, వెలుగు రేఖలు మొదలైనవి), ఈ ప్రసంగం వల్ల ప్రధాన పాత్రలో తక్షణం మార్పు రావటం జరుగుతోంది. పాఠకుడికి కథా నేపథ్యం చెప్పడం కోసం పాత్రలు తమకు తెలిసిన విషయాలను vocalగా సంభాషించడం చాలా కథల్లో జరుగుతోంది. ఈ విషయం గురించి కూడా మరింతగా చర్చించాల్సిన అవసరం ఉన్నది.

వస్తుపరంగా బాగున్న కథలు కథనంలో వెనుకబడటం, కొన్ని కథలలో కథనం బాగున్నా వస్తు బలం లేకపోవటం, కథ తాలూకు లక్ష్యం స్థిరంగా లేకపోవటం, సహజత్వాన్ని దూరం చేసే నాటకీయత – ఈ నెల కథలలో ప్రధాన సమస్య. ఈ కారణంగా మొత్తం కథలలో ఉత్తమ కథ అంటూ ఏ ఒక్క కథ ఉండేందుకు ఆస్కారం లేదని మేము భావిస్తున్నాము.

 

ఫిబ్రవరి నెల హాస్యకథలు

వ్యాసం మొదట్లో ప్రస్తావించినట్టు, ఈ నెలలో కొన్ని మంచి హాస్యకథలు రావడం కొంత రిలీఫ్ కలగజేసింది. ఆ కారణం గానూ, రచయితల ప్రయత్నాన్ని అభినందించడానికి గానూ, ఒక్కో కథనీ పరిచయం చేస్తున్నాం!

ఆనందబాష్పాలు (గోతెలుగు, ఫిబ్రవరి) :: పి వి సాయిసోమయాజులు

మండుతున్న ఉల్లిపాయల ధరల గురించి. హాస్యకథ గా పర్వాలేదనిపించింది.

 

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (గోతెలుగు, ఫిబ్రవరి) :: అశోక్ పొడపాటి

సాఫ్ట్ వేర్ ఇంజనీరే తన అల్లుడు కావాలని పట్టుబట్టిన మామ కథ. కథనంలో మంచి హాస్యాన్ని అందించగలిగారు.

 

సుబ్బారావూ, బ్యాంకు అకౌంటూ (గోతెలుగు, ఫిబ్రవరి) :: రాజేష్ యాళ్ళ

ఇంటింటికీ తిరిగి ఎకౌంట్లు ఓపెన్ చేసే ఓ బాంకు పెట్టిన కష్టాల కథ. వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న మంచి హాస్యకథ.

 

 

ఫిబ్రవరి నెల కథలు

పైన వ్యాసంలో ప్రస్తావించిన ఫిబ్రవరి నెల కథలు ఇవి. చదివి, మీరూ వాటి మంచిచెడ్డల గురించి ఆలోచించదగ్గ కథలు.

కథ

రచయిత

పత్రిక

సంచిక

ఇదోరకం పోరాటం – ఈనాటి పోరాటం గంటి భానుమతి భూమిక ఫిబ్రవరి
ఓ చిత్ర కథ పూర్ణిమ తమ్మిరెడ్డి కినిగె పత్రిక ఫిబ్రవరి
ఓటమి సన్నిహిత్ కౌముది ఫిబ్రవరి
కురిసిన మనసు జి. వెంకటకృష్ణ నవ్య 19 ఫిబ్రవరి
కొత్తపరుగు సి. యస్. రాంబాబు సారంగ ఫిబ్రవరి
గడువు ప్రతాప వెంకట సుబ్బారాయుడు స్వాతి వారపత్రిక 7 ఫిబ్రవరి
గుడి భువనచంద్ర నది మాసపత్రిక ఫిబ్రవరి
జనాగ్రహం డా. జి.వి. కృష్ణయ్య స్వాతి వీక్లీ 14 ఫిబ్రవరి
టైలర్ శీను ప్రసాదమూర్తి సారంగ ఫిబ్రవరి
తరళ మేఘచ్చాయ, తరువాతి ఎడారి వై. విశారద కినిగె పత్రిక ఫిబ్రవరి
ముళ్ల గులాబి పులిగడ్డ విశ్వనాథరావు తెలుగు వెలుగు ఫిబ్రవరి
వజ్రం జి. వెంకటకృష్ణ ఆదివారం ఆంధ్రజ్యోతి 16 ఫిబ్రవరి
వెలుగు రేఖలు రాజేష్ యాళ్ళ ఈనాడు ఆదివారం 16 ఫిబ్రవరి
శివుడు పెళ్ళి జయంతి వెంకటరమణ నవ్య 26 ఫిబ్రవరి
సుపుత్రుడు బి. గీతిక స్వాతి  మాసపత్రిక ఫిబ్రవరి

(అకారాది క్రమంలో..)

—అరిపిరాల సత్యప్రసాద్, ఏ. వి. రమణమూర్తి, టి. చంద్రశేఖర్ రెడ్డి

02. T Chandra Sekhara Reddy

 01. Ramana Murthy03. Aripirala

రాయకుండా ఉండలేనితనం వచ్చేదాక రాయను: పెద్దింటి

ప్రతి నెల వచ్చిన కథలన్నీ చదివి, మేము నిర్ణయించుకున్న ప్రాతిపదికల ఆధారంగా మిగిలిన కథలకన్నా ఉత్తమంగా వున్న కథను ఎంపిక చేసి మీకు పరిచయం చేసే ప్రయత్నం ఇది. అంటే మేము ప్రకటించే కథ ఉత్తమకథా లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకుందని కాదు. కేవలం సాపేక్షంగా మిగిలిన కథల కన్నా బాగుందని మాత్రమే దాని అర్థం. ఇందులో మరో కోణం వుంది. మేము నిర్ణయించుకున్న ప్రాతిపదికలు కొంత మారిస్తే మరో కథ మంచి కథగా అనిపించే అవకాశం వుంది. అలాంటి ఇబ్బంది లేకుండా బాగున్నాయనిపించిన కథలను అన్నింటినీ ప్రకటిస్తున్నాము. అందువల్ల ఏ ప్రాతిపదికన చూసినా ఆ నెలకి ఉత్తమ కథ ఏదైనా ఈ లిస్టులో వుండే తీరుతుందని మా నమ్మిక. మా అభిప్రాయంతో విభేదించి, విశ్లేషణలతో మరో మంచి కథని పాఠకులు పరిచయం చేయగలిగితే మా ప్రయత్నం మరింత సఫలవంతమైందని మేము భావిస్తాము. అలాంటి చర్చకు తలుపులు తెరవడమే మా ముఖ్యోద్దేశ్యం.

img3

 

గతవారానికి కొనసాగింపుగా – జనవరి నెల కథగా ఎన్నికైన ‘ప్లాసెంటా’ (రచయిత: శ్రీ పెద్దింటి అశోక్ కుమార్)  గురించి చర్చిద్దాం.

ఉమ్మడి కుటుంబాలు అరుదైన నేపథ్యంలో – భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడం, తమ తమ ఉద్యోగం నిలబెట్టుకోవడానికి లేదా ఉద్యోగస్థాయి పెంచుకోవడటానికి వాళ్ళు పడే తాపత్రయం ఒక స్త్రీ జీవితంలో ఎలాంటి సమస్య సృష్టించింది ఆ సమస్యనుంచి బయటపడటానికి ఆమె ఏ మార్గాన్ని ఎన్నుకున్నది, దాన్ని ఎలా అమలు పరచిందీ అన్నది కథా వస్తువు. అంతేకాకుండా, వ్యక్తిగత స్థాయిలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలకి ఫేస్ బుక్ లాంటి వేదికలలో గుంపు మనస్తత్వాల ప్రోత్సాహం ఎలా ఉంటోందో చెప్పిన కథ కూడా. ఇతివృత్త పరంగా సమకాలీనత ఉన్న ప్రధాన సమస్యలని అనుసంధానించి నడిపిన కథ కనుక, ‘ప్లాసెంటా’ ఒక విభిన్నమైన కథగా అనిపించింది.

పరిష్కారం కచ్చితంగా చెప్పలేని కథలని నడపడం అంత తేలికైన పని కాదు. ఇలాంటి కథల్లో వస్తువు తాలూకు విభిన్న పార్శ్వాలని ప్రతిభావంతంగా చూపించి, పాఠకులు ఒక సమగ్ర అవగాహనకి రాగలిగిన పరిస్థితిని కలగజేయాలి. కానీ, కథ మళ్ళీ చర్చలాగానో, వ్యాసంలాగానో అనిపించకూడదు. వస్తువులోని గాంభీర్యతకీ, పఠనీయతలోని సౌకర్యానికీ మధ్య సరైన బ్రిడ్జ్ ఉంటేనే ఇలాంటి కథలు నప్పుతాయి. గుర్తుండిపోతాయి. మరి ఈ కథ ఎంతవరకూ ఈ విషయంలో సఫలమైంది?  చూద్దాం.

మంచి కథ ప్రారంభంలోనే కథ పట్ల ఉత్సుకతని కలిగించి పాఠకుడిని తనతో కథ చివరిదాకా ప్రయాణానికి మానసికంగా ఆయత్తం చేయగలగాలి. ప్లాసెంటా కథ ఎత్తుగడ, కొన్ని గందరగోళాల మధ్య దురదృష్టవశాత్తూ పాఠకుడికి ఈ సౌకర్యం కల్పించలేక పోయింది.

సమస్యని ఎదుర్కొనే వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి, ఆ వ్యక్తి జీవన పరిస్థితిని బట్టి ఎన్నుకొనే పరిష్కారాలు మారుతుంటాయి.  ‘ఈ పరిష్కారం ఆమోదయోగ్యం కాదు’, ‘ఫలానా పరిష్కారమే సరైనది’ అని కచ్చితంగా నిర్ణయించటం కష్టం. సుజన ఉద్యోగపరంగా విదేశాలకి పోవటం ఒక అరుదైన అవకాశంగా భావించింది. శైశవదశలో ఉన్న కన్నబిడ్డకి దగ్గరగా ఉండటంకన్నా అతడ్ని విడిచి వెళ్లటం వైపే ఆమె మనసు మొగ్గు చూపింది. కానీ బాబుని దూరం చేసుకోవటం కోసం ఆమె ఎన్నుకున్న మార్గం, అది అమలు పరచిన తీరు చాలా క్రూరంగా ఉంది.

కథనంలో ఎక్కడ కూడా సుజన బాబుని వదిలిపెట్టటానికి బాధ పడినట్లు మానసిక సంఘర్షణ అనుభవించినట్లు కనపడదు. వదిలించుకోవడానికి పడ్డ బాధే కనపడుతుంది. అవసరం బాధ్యతని ఎంత మర్చిపోయేలా చేసినా,  ఒక స్త్రీ తన మాతృత్వలక్షణాలని పూర్తిగా విస్మరించి ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యమా అన్నది ప్రక్కన పెడితే – అసహజంగా, నమ్మశక్యంగా అనిపించకపోవడం కథలో కొట్టొచ్చినట్లు కనపడే లోపం.  ఓ పాత్రని సహజత్వానికి దూరంగా కర్కశంగా చిత్రీకరించడం ద్వారా అనుకున్న ముగింపు వైపు కథని నడపడం అనేది రచయిత తనకి అనువుగా కథని డిజైన్ చేసుకోవడమే!

కథ చెప్పడంలో ఇలాంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ, పాఠకుడిలో ఆలోచన రేకెత్తించడంలోనూ, ఓ వర్తమాన సమస్యని చర్చకి తీసుకురావడంలోనూ ఈ కథ మిగిలిన (జనవరి) కథలకన్నా ముందు వుండటం వల్ల ఈ కథని ఉత్తమ కథగా నిర్ణయించడం జరిగింది. ఈ కథ విషయమై రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారితో సంభాషణ జరిపినప్పుడు ఆయన ప్రస్తావించిన అనేక కోణాలు ఇలాంటి చర్చకు సంబంధించినవే. అయితే – ఈ సంభాషణలో ఉన్నంత స్పష్టంగా ఆ అంశాలు కథలో ప్రతిఫలించి ఉన్నట్టయితే, ఈ కథ ఇంకొంత మంచి కథ అయివుండేది!

peddinti

ప్లాసెంటా కథా రచయిత శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారితో సంభాషణ:

ఈ కథా నేపధ్యం వివరించండి. ముఖ్యంగా ఈ ఆలోచన ఎలా వచ్చింది అది కథగా ఎలా రూపు దిద్దుకుంది?

 

ఇది ప్రస్తుతం అన్ని కుటుంబాల్లో ఉన్న సమస్య. ఏ ఇంటికి వెళ్ళినా ఎదురయ్యే సమస్య. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుని తీరిగ్గా ఉన్నారంటే వారింట్లో ఓ చిన్నపిల్ల తప్పకుండా ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఇది తప్పనిసరి. మెటర్నిటీ సెలవులు ఎక్కువగా ఉండవు. సెలవు పెట్టే వీలుండదు. ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. అందుకని ఈ పరిస్థితి.

 

నేను టీచర్ ను. మా కొలీగ్ ఒక అమ్మాయి మెటర్నిటీ లీవ్ నుంచి స్కూల్లో జాయిన్ అయింది. స్కూల్ కు బాబును తీసుకొచ్చింది. రెండు వారాల తరువాత బాబును తీసుకురాలేదు. ఎందుకని అడిగితే అమ్మ వద్దకు పంపానని చెప్పింది. కారణం అడిగితే DL కోసం ప్రిపేర్ కావాలంది. ఆ నేపధ్యంలోంచి ఈ కథ పుట్టుకొచ్చింది.

 

ఈ కథలో మీరు రాసిన సమస్య ఈ తరానికి చాలా అవసరమైనది, ప్రస్తుతాన్వయం (relevant) చేయతగినది కూడా .మీ కథా వస్తువులో సమకాలీనత వుండేలే మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు.

 

పరిశీలన చేస్తాను. అధ్యయనం చేస్తాను. వర్తమాన సమస్యలనే వస్తువుగా స్వీకరిస్తాను. సమస్య ఎక్కడుందో అక్కడ నిలబడి విశ్లేషణ చేస్తాను.

 

వస్తువు విషయంలో చాలా వర్తమానతని పాటించే మీరు, కథ నిర్మాణ వ్యవహారంలో తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? కథ డిజైన్ ని పూర్తిగా ముందే ప్లాన్ చేసుకుంటారా, లేక మనసుకి తోచింది రాసుకుంటూ పోతారా?

 

కథ మెదటి నుండి చివరి వరకు టైటిల్ తో సహా మనసులో అనుకున్నాకనే కథను రాస్తాను. అది కూడా అనుకోగానే కాదు. మనసులో ఉడికి ఉడికి కథను రాయకుండా ఉండలేనితనం వచ్చేదాక కథ గురించే ఆలోచిస్తుంటాను. రాసేప్పుడు కొత్త ఆలోచనలు వస్తే చిన్న చిన్న మార్పులు చేస్తాను. ఇంత ప్లాన్ వేసుకున్నా సింగిల్ సిటింగ్ లో ఎప్పుడూ కథను రాయలేదు. కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది.

 

ఇక కథలోకి వద్దాం –

సుజన మీద పాఠకులకి కొంత విముఖత ఏర్పడేటట్టుగా కథనాన్ని నడిపించారు. ఆమె వ్యవహరశైలి, ఆమెకు ఇతర మిత్రుల ప్రోత్సాహంఇదంతా ఒక కర్కశమైన లక్షణాలను ప్రదర్శించింది. ఇలా ఎందుకు చేశారు?

 

సబ్జెక్ట్ అలాంటిది. ఆమె కెరీర్ కోసం అమెరికా వెళ్లాలి. ఇంట్లో చిన్నబాబు ఉన్నాడు. అతనితో బాగా attachment ఉన్నది. ఇది నేటి ఆధునిక మహిళలకు జీవన్మరణ సమస్య. దేనిని ఎంచుకోవాలనే దాని మీద సంఘర్షణ. ఇది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన సమస్య. అయినా సామాజిక సమస్య. సుజనను వ్యతిరేకించిన తండ్రి ఉన్నాడు. అంటి ముట్టనట్టు ఉన్న భర్త ఉన్నాడు. ప్రోత్సహించిన మిత్రులు ఉన్నారు. ఎవరి ఆలోచనా పరిణితిలో వారి దీనిని విశ్లేషించారు. ఇదంతా కథా వస్తువులో ఒక భాగం.

 

సుజన తను చేసిన పనిని ఫేస్ బుక్ లో పెట్టినపుడు పలువురు లైక్ చేసినట్లు, అభినందించినట్లు రాశారు. సోషల్ నెట్ వర్కింగ్ ఆచారాలు అలవాటుగా, దురలవాటుగా, వ్యసనంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఒక “లైక్” వెనకాల నిజమైన స్ఫూర్తి, సమర్థన ఉందని మీరు అనుకుంటున్నారా

అనుకుంటున్నాను. కొంతయినా స్పూర్తి ఉంటుంది. వ్యసనంగా కాక అవసరంగా చూసేవాళ్ళు కూడా చాలా ఉంటున్నారు. సోషల్ నెట్ వర్క్ అలవాటుగా కాకుండా అవసరంగా మారింది ఈ రోజుల్లో. వంద లైక్ ల వెనకాల ఆకతాయితనం ఉన్నా సగమైనా నిజమైన స్పందన ఉందనుకుంటున్నాను. ఒక అభ్యర్థికి రక్తం కావాలని పోస్ట్ చేస్తే ఇవ్వడానికి వందల మంది ముందుకువచ్చారట. ఆర్థిక సహాయం కావాలని టీవీల్లో ప్రకటిస్తే వెల మంది స్పందించి విరాళాలు అందించిన సందర్భాలున్నాయి. చదువుకోలేని ఆర్థిక పరిస్థితి గురించి జిల్లా ఎడిషన్ పేపర్లో వచ్చినా విరాళాలు ఇస్తున్నారు. అందుకని ఒక లైక్ వెనక ఎంతో కొంత నిజమైన స్పందన ఉందనే అనుకుంటున్నాను.

 

స్త్రీలు కూడా సమానావకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ రోజుల్లో – వాళ్ళు కెరీర్ నీ, ఫామిలీ లైఫ్ నీ ఎలా బాలెన్స్ చేసుకోవాలి అని మీరు అభిప్రాయపడుతున్నారు. ఒకదానికోసం మరొకటి నిర్లక్ష్యం చేయాల్సిన పరిస్థితే వస్తే…?

స్త్రీ అప్పటికీ ఇప్పటికీ బాధితురాలే. సమాన అవకాశాలు అనేది వాస్తవం కాదు. ఈ రోజు అన్ని రంగాలో స్త్రీలు ప్రవేశిస్తున్నారని ఇదే సమాన అవకాశాలని మనం అనుకుంటున్నాం. కానీ అవకాశాల పేరున ఆమె మీద మరింత పీడనను పెంచుతున్నాం. ఇంట్లో నిశ్చింతగానో (పురుషుడు ఉన్నంతగా) ఇవతల భద్రంగానో ఆమె ఉంటుందని చెప్పగలమా? ఒక పురుషుడు జీవించినంత స్వేచ్ఛగా, రంధి లేకుండా స్త్రీ బతుకుతుందని చెప్పగలమా? అలాంటప్పుడు సమాన అవకాశమెలా అవుతుంది. అవకాశమంటే పొదటం ఒకటే కాదు. పొందినదాన్ని సమానస్థాయిలో అనుభవించడం కూడా.

 

వాళ్ళకూ కెరీర్ ముఖ్యమే. కానీ మాతృత్వమనే ఒక సమాజ నిర్మాణ బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇది చాలా సున్నితమైన సమస్య. చట్టాలో, నిర్బంధాలో ఈ సమస్యని పరిష్కరించలేవు. పురుష సమాజం అంతా ఆమెకు సహకరించాలి. బాధ్యత కొంతైనా పంచుకోవాలి. ఒకదాని కోసం ఒకటి అన్నప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న క్రమాన్ని సమస్యను బట్టి వారే నిర్ణయించుకోవాలి.

 

ప్రస్తుత యువతరం – వాళ్ళ బాధ్యతలని మర్చిపోయి కేవలం డబ్బు సంపాదన ధ్యేయాలతో తమ ఉనికిని కోల్పోతున్నారని మీరు అనుకుంటున్నారా?

లేదు. సమాజంలో మంచి – చెడు, బాధ్యత లేకుండా తిరగడం – బాధ్యతతో ఉండడం ఎప్పుడూ ఎక్కువనో తక్కువనో ఉన్నదే. కాకుంటే ఇప్పటి యువతరం కొంత ఎక్కువగానే బాధ్యతా రాహిత్యంగా డబ్బు మత్తులో ఉన్నారు. అందుకు కారణాలు అనేకం. వేగవంతమైన ప్రపంచం, అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం, డబ్బు అవసరం ఇలాంటివి. ముఖ్యంగా పిల్లలకు విలువలు నేర్పే ఇల్లు, పాఠశాలలు ఆరోగ్యంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ కథకు మూలం అదే.

 

పసి పిల్లల మనసు తెల్లకాగితం లాంటిదని శాస్త్రవేత్తలంటారు. పైగా శిశువు మూర్తిమత్వానికి పునాదులు తల్లి గర్భంలో ఉన్న ఆరు నెలలు, బయటకు వచ్చాక రెండేళ్ళ కాలమే ముఖ్యం. ఈ కాలంలో మెదడులో ఫీడయిన అంశాలతోనే శిశువు వ్యక్తిత్వ నిర్మాణం మొదలవుతుంది. ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ నిర్లక్ష్యంగా తల్లిదండ్రులూ, సమాజం వ్యవహరించి బాధ్యత గల యువతరం కోసం చూస్తే వేప చెట్టు నాటి మామిడి పండ్ల కోసం ఎదురు చూసినట్లే.

 

ఈ కథలో ప్రథాన సమస్యతో పాటు మీరు మరి కొన్ని ప్రస్తావించారు. పాల సీసాల కుట్ర, కులం-జండర్ వగైరాలు. ఇవి మీరు చెప్పదలచుకున్న విషయానికి అడ్డంకుల్లాగానీ, లేకపోతే బలవంతపు జస్టిఫికేషన్లు అని కానీ అనిపించలేదా?

లేదు. కథలో ఒక భాగమే. ముందే చెప్పుకున్నట్టు నవజాత శిశువు, శిశువు దశలోనే అనేక అంశాలు పిల్లల మెదట్లో స్ఠిరపడిపోతాయి. అవి పరిసరాల వల్ల, కుటుంబం, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి వల్ల జరిగే ప్రక్రియలు. మేం స్కూల్లల్లో మూడు నాలుగేళ్ళ పిల్లలను చూస్తాం. ఆ వయసులోనే ఆడపిల్లలు ఒదిగి ఉంటారు. మగపిల్లలు స్వేచ్ఛగా ఉంటారు. అలవాట్లలో కూడా తేడా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారు, ఏ కుటుంబాల నుంచి వచ్చారు అన్నది అద్దంలా కనిపిస్తుంది. అది వారికి ఎవరూ అంతవరకు బోధించలేదు. కానీ పరిసరాల నుంచి వారి మెదట్లో ఫీడయిన అంశలు అవి. భవిష్యత్ లో ఆ పిల్లలను నడిపించే అంశాలు అవి. తండ్రి కూతుళ్ళ మధ్య ఆలోచనా, పరివర్తనలో తేడాలను చూపిస్తున్నప్పుడు సమాజం, బహుళజాతి కంపెనీలు తల్లి బిడ్డలను ఎలా వేరు చేసి వ్యాపారం చేస్తున్నాయని చెప్పే క్రమంలో పాలసీసా అంశం వచ్చింది.

 

ఒక సరదా ప్రశ్న – ఇదే వస్తువుని, మనకన్నా ఓ రెండు మూడు తరాల ముందున్న రచయిత/త్రులలో (వారిప్పుడు మనమధ్యన లేకున్నా…) – ఎవరైతే బాగా రాయగలరని మీ ఉద్దేశం? అదే – వర్తమాన రచయిత/త్రులలో?

ఈ సమస్యను ఒక్క కోణంలో కాదు. అనేక కోణాల్లోంచి చూడవచ్చు. ఒకరు సెంటిమెంట్ గా చూడవచ్చు. ఒకరు స్త్రీ హింస కోణంలోంచి చూడవచ్చు. ఈ సమాజ నిర్మాణమనేది ఒక స్త్రీ మూర్తి ప్రసాదించిన భిక్షనే కాబట్టి ఒకరు త్యాగమే కోణం లోంచి, మరొకరు స్త్రీ చైతన్య కోణంలోంచి, ఇంకొకరు పురుషుడికి ఈ బాధ్యతలు ఏవీ లేవు కాబట్టి ఆ కోణంలోంచి, ఇంకో అడుగు ముందుకు వేసి తల్లి బిడ్డల మధ్య జరిగిన కుట్రల కోణంలోంచి మరొకరు ఇలా అనేక మంది గొప్పగా ఆవిష్కరించవచ్చు. కొత్తతరంలో అయితే గీతాంజలిగారు, కుప్పిలి పద్మగారు, ప్రతిమగారు ఇంకా చాలా మంది ఈ సున్నితమైన సమస్య గురించి అద్భుతంగా రాయగలరు.

 

ఇందులో చర్చించిన సమస్యని అధిగమించే దిశగా మనం ఏం చెయ్యాలి?

సమస్త మానవాళికి, సమాజ నిర్మాణానికి తొలి అడుగు తల్లి. అది ప్రకృతి సిద్ధం. చెట్టు మీద పువ్వు పూసి కాయ కాసినంత ప్రశాంతంగా తల్లిబిడ్డల మధ్య సంబంధం ఉండాలి. అందుకు తగిన విధంగా చట్టాలు, సమాజం రూపొందాలి. పురుషుడు మారాలి. నవజాత శిశుదశ శిశువు వ్యక్తిత్వ నిర్మాణంలో అత్యంత కోలకమైనది కాబట్టి ఈ వయసులో పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల భవిష్యత్ కోసమే కష్టపడి డబ్బు సంపాదిస్తున్నామన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ అనేది తమ పెంపకం వల్ల కూడా ఉంటుందన్న విషయం గుర్తించాలి.

మంచి కథల కోసం ఒక అన్వేషణ!

2 (1)

ఇది ప్రస్తుతం వస్తున్న కథల గురించి మాటా మంతీ. ఒక నెలలో వచ్చిన కథలన్నీ పరిశీలించి, అందులో కొన్ని ఉత్తమమైన కథలని ఎన్నుకోవడం, ఆ కథలను, కథకులను అభినందించుకోవడం ఈ శీర్షిక ప్రధాన ఉద్దేశ్యం.

ఈ పనిని మేము నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి.

వాటిల్లో ముఖ్యమైనదీ, మొట్టమొదటిదీ – ఇలాంటి ప్రయత్నం ఈ మధ్య ఏ పత్రికలోనూ జరగకపోవడం! ఏడాది తరువాత కొన్ని పత్రికలు ఒక సింహావలోకనాన్ని వెయ్యడం, కొన్ని సంవత్సర సంకలనాలలో సమీక్షా వ్యాసాలు రాయడం జరిగినప్పటికీ వాటికి ఎక్కువ కథలను స్పృశించే అవకాశం తక్కువ.

ప్రస్తుతం ఉన్న రకరకాల ప్రింట్ పత్రికల్లోనూ, ఆన్‌లైన్ పత్రికల్లోనూ కలిపి సగటున నెలకి దాదాపు నూట యాభై కథల దాకా వస్తున్నాయి. ఏ కథలో ఏముందో, ఏ కథ ఎవరు రాశారో, ఏ మంచి కథ ఎందులో వచ్చిందో, అసలు ఏ పత్రిక ఎప్పుడు వస్తోందో – ఈ విషయాలన్నీ పాఠకులకి ఓ పద్ధతి ప్రకారం చేరడం లేదని కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నాం. అసలు పత్రికలు దొరకబుచ్చుకోవటమే ఓ శ్రమగా మారిన తరుణంలో మంచి కథ వచ్చిందని తెలియడం, ఆ పత్రిక కోసం ప్రయత్నం చేసి చదవడం పాఠకుడు చేస్తాడని అనుకోవడం అత్యాశే అవుతుంది. అదీగాక, ఇన్ని వందల కథలని దాటుకునిగానీ ఒక మంచి కథని అందుకునే దాకా పాఠకుడికి ఓపిక ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. ఓ మంచి కథ పాఠకుడికి తెలియకుండానే మరుగున పడిపోవడం ఆ కథకీ, రచయితకే కాదు సాహిత్యానికీ సమాజానికి కూడా చెడు చేసినట్లే కదా? అలాంటి ఒక వెలితిని పూరించడం మా ప్రయత్నం తాలూకు మరో లక్ష్యం.

అంతే కాదు – కథల గురించిన మంచీ చెడ్డా మాట్లాడటం ఎవరో ఒకరు మొదలెడితే, అలాంటి సంప్రదాయాన్ని మిగతా పత్రికలు కూడా అనుసరిస్తే – ‘మంచి కథ’ గురించి ఆలోచనా, అవగాహనా, స్పృహా, అభిరుచీ అటు రచయితల్లోనూ, ఇటు పాఠకులలోనూ పెరిగి – మంచి కథలు మరిన్ని రావడానికి దోహదపడగలదన్న ఒక చిరు ఆశ కూడా మా ఈ ప్రయత్నానికి ఒక కారణం.

మంచి కథల వార్షిక సంకలనాలని ప్రచురిస్తున్నవారు, ఆన్‌లైన్ పత్రికల్లో వస్తున్న కథలని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాసిన కథకి డబ్బు రూపంలో ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ పత్రికలకి రాస్తున్న రచయిత/త్రులకి కనీసం గుర్తింపు రూపంలోనైనా సరైన న్యాయం జరగడం లేదన్న ఉద్దేశంతో, వాటిని కూడా మేము పరిశీలించాలీ అన్న సదుద్దేశంతో కూడా ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాం.

***

 

ఇలాంటి ప్రయత్నాన్ని ఏ ఒక్కరో చేస్తే, వ్యక్తిగతమైన మమకారావేశాల వల్ల నిర్ణయాల్లో కొన్ని లోటుపాట్లు జరిగే అవకాశం వుంటుంది. అలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం ముగ్గురం కలిసి కథలని విడివిడిగా చదివి; వస్తువు, కథానిర్మాణం, శైలి వగైరా అంశాల మీద మార్కులు వేసుకొని; తుది దశలో కథల బాగోగులు చర్చించుకొని మరీ మంచి కథలని నిర్ణయించడం జరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో – సబ్జెక్టివిటీ అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టేనని మేము భావిస్తున్నాం!

ఇంత చేసినా ఇది ముగ్గురి సమిష్టి అభిప్రాయమే తప్ప ఏ విధంగానూ యావత్ పాఠకలోకానికో, సాహితీ ప్రపంచానికో ప్రాతినిధ్యం వహించే నిర్ణయం కాకపోవచ్చు. అలాగే కొన్ని పరిమితుల కారణంగా ఏదైనా మంచి కథ/పత్రిక మా పరిశీలనలోకి రాకపోయే అవకాశం లేకపోలేదు. అంచేత మీ దృష్టిలోకి వచ్చిన మంచి కథ/పత్రికలను మాకు ప్రతిపాదించి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము.

 

***

జనవరి కథలు

జనవరి నెలకు గాను దాదాపు 140 కథలని పరిశీలించడం జరిగింది. ఈ క్రింది పత్రికల్లోని కథలని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది:

ఆదివారం అనుబంధాలు: ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సాక్షి, వార్త

 

వారపత్రికలు: జాగృతి, ఆంధ్రభూమి, స్వాతి, నవ్య

 

మాసపత్రికలు: రచన, నది, ఆంధ్రభూమి, చినుకు, తెలుగు వెలుగు, పాలపిట్ట, మిసిమి, స్వాతి, చిత్ర, విపుల, ప్రస్థానం, స్వప్న, ఆంధ్రప్రదేశ్

 

అంతర్జాల పత్రికలు: కౌముది, సారంగ, ఈమాట, వాకిలి, విహంగ, కినిగె, గోతెలుగు

 

కథలన్నీ చదివితే ముందు మన దృష్టిని ఆకర్షించేది – విభిన్నమైన వస్తువులని ఎంచుకోవడంలో రచయితలు చూపిస్తున్న ఆసక్తి. ఈ పరిణామం ముదావహం. సామాజిక నేపథ్యాలు నిరంతరం మారుతూ ఉండే పరిణామక్రమంలో తరచి చూస్తే, కొత్త కొత్త సామాజికాంశాలూ, వైరుధ్యాలూ, మానసిక కోణాలూ కనిపించక మానవు. అలాంటి వస్తువులని ఎన్నుకొని కథల చట్రంలో ప్రతిభావంతంగా బిగించగలిగిననాడు ‘కథ’ అనేది వర్తమానాన్ని అర్థవంతంగా విశ్లేషించుకోవడానికి ఉపయోగపడగల మాధ్యమం అవుతుంది. అలాగే వస్తువు పాతదైనా అందులో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా గుర్తించతగినదే.

చిత్రం: కృష్ణ అశోక్

చిత్రం: కృష్ణ అశోక్

ఇప్పుడున్న సంక్లిష్టమైన, సందిగ్ధమైన సామాజిక నేపధ్యం అలాంటి వస్తువులనే ఇస్తుంది. అందువల్ల అవి రచయిత అధ్యయనశీలతనీ, శిల్ప సామర్ధ్యాన్నీ పరీక్షకు పెడుతున్నాయి. అయితే, చాలా మంది రచయితలు కొత్త కథాంశాలను అందిపుచ్చుకుంటున్నా, పూర్తిస్థాయి అధ్యయనం లేకపోవడం వల్లో, అనివార్యమైన మమకారావేశాల వల్లనో ఆ కథాంశాలను చిక్కగా, సమగ్రంగా అందిచలేకపోతున్నట్లుగా తోస్తోంది.

 

ఈ నెల వచ్చిన కథలలో చెప్పుకోదగ్గ కథలను విశ్లేషిస్తే –

 

“ప్లాసెంటా” – పెద్దింటి అశోక్ కుమార్ (అమెరికా ఉద్యోగం కోసం చంటి బిడ్డను వదిలించుకోవాలని ప్రయత్నం చేసే తల్లి), “సహజాతాలు” – విహారి (చదువులు, దొరకని ఉద్యోగాలు వల్ల డిప్రెషన్ లు, కొన్ని తప్పని నిర్ణయాలు)  “డేగలు తిరిగే ఆకాశం” – అరిపిరాల సత్యప్రసాద్ (పీడోఫైల్ ప్రపంచంలో ఓ తండ్రి ఆవేదన), “ఇద్దరు బిడ్డల తల్లి” – వేంపల్లె షరీఫ్ (ప్రాంత, మత జనిత ఉచ్ఛారణా దోషాలు కూడా వివక్షకి కారణమే) ఇవన్నీ వస్తువైవిధ్యాలకి ఉదాహరణలుగా నిలిచే కొన్ని కథలు.

 

కథ ప్రయోజనాల అంశాలని కాసేపు పక్కన పెట్టగలిగితే, ప్రశంసార్హమైన కథనశైలితో కథను నడిపిన ఉదాహరణలు కూడా కొన్ని కనిపించాయి. “సాంత్వనములేక” – తాడికొండ కె శివకుమార్ శర్మ (ముక్తపదగ్రస్త అలంకారంలా దుమికే కథనం), “నిద్రకు మెలకువకూ మధ్య” – పలమనేరు బాలాజీ (మిస్టిక్), “అసమయాల అమావాస్య” – సాయిపద్మ (మాంత్రిక వాస్తవికత), “మంచు” – మూలా సుబ్రమణ్యం (మిస్టిక్ మనిషి ప్రధానపాత్రగా). ఈ కథలలో శైలిశిల్పాలు ఎంత బలంగా వుండి చదివించాయో కథాంశం కూడా అంతే బలంగా వుండుంటే అద్భుతమైన కథలుగా మారే అవకాశం వుండేది. శివకుమార్ శర్మ కథ గొప్ప కథకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఎంచుకున్న అంశాలను అన్నింటిని ముడి పెట్టడంలో కాస్త జారు ముడి పడిందని మా అభిప్రాయం.

 

కేవలం కథా కథనాలే కాకుండా సామాజిక/వ్యక్తిగత ప్రయోజనం రీత్యా ప్రస్తావించతగ్గ కథలు కొన్ని ఈ నెలలో కనిపించాయి. “ఆకలి” – పెద్దింటి అశోక్ కుమార్, “వారసులు” – జి. ఉమామహేశ్వర్, “ఇదేన్రీ హింగాయ్తూ” – ఓలేటి శ్రీనివాసభాను మెదలైనవి ఈ కోవకు చెందినవే. పాత కథా వస్తువు, సాధారణమైన కథనం ఉన్నప్పటికీ “సొంత సౌఖ్యము కొంత చూసుకు” – సింగరాజు రమాదేవి, (నవ్య, జనవరి 8), “పర్ణశాల” – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ (స్వప్న మాసపత్రిక)  వంటి కథలలో పరిష్కారాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

 

మొత్తం మీద చాలా కథలు ఆశావహ దృక్పధంతో ముగిసినట్లు, జనవరి కథలు ఆశావహంగానే అనిపించాయని చెప్పి ముగిస్తున్నాం.

 

జనవరి కథలని అనేక అంశాల ప్రాతిపదికన బేరీజు వేసుకుంటూ పోతే, ఈ కథ మా సమిష్టి అధ్యయనంలో జనవరి-2014 కథలలో ఉత్తమమైన కథగా నిలిచింది!

 

ప్లాసెంటా

తెలుగు వెలుగు

రచయిత: పెద్దింటి అశోక్ కుమార్

ఈ కథ గురించి మా విశ్లేషణ, రచయితతో ముఖాముఖి వచ్చే వారం…

 

మంచి ప్రయత్నం చేసిన ఇతర కథలు, పాఠకులు చదివి విశ్లేషించుకోగల వీలుగల మరికొన్ని కథలు:

  • సాంత్వనము లేక తాడికొండ కె. శివకుమార్ శర్మ (వాకిలి, జనవరి)
  • ఆకలి పెద్దింటి అశోక్ కుమార్ (నవ్య 22, జనవరి)
  • నిద్రకు మెలకువకూ మధ్య పలమనేరు బాలాజీ (నవ్య, 22 జనవరి)
  • డేగలు తిరిగే ఆకాశం అరిపిరాల సత్యప్రసాద్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 26 జనవరి)
  • అసమయాల అమావాస్య సాయిపద్మ (ఈమాట, జనవరి ఫిబ్రవరి సంచిక)
  • వారసులు జి. ఉమామహేశ్వర్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 19 జనవరి)
  • ఇద్దరు బిడ్డల తల్లి వేంపల్లె షరీఫ్ (నవ్య, 8 జనవరి)
  • ఇదేన్రీ హింగాయ్తూ ఓలేటి శ్రీనివాసభాను (నవ్య, 15 జనవరి)
  • సహజాతాలు విహారి (నవ్య, 1 జనవరి)
  • మంచు మూలా సుబ్రమణ్యం (ఈమాట, జనవరి-ఫిబ్రవరి)

– అరిపిరాల సత్య ప్రసాద్, ఎ.వి. రమణ మూర్తి, టి. చంద్ర శేఖర రెడ్డి.

   (లోగో :మహీ బెజవాడ)

02. T Chandra Sekhara Reddy03. Aripirala01. Ramana Murthy