మంచి అభిరుచిని మనమే సృష్టించాలి!

 

-మోహన కృష్ణ  ఇంద్రగంటి 

~

mohanakrishnaకథ-2014ని ఆవిష్కరించుకుంటున్న ఈ సభలో  ఇప్పటివరకూ రకరకాల నేపధ్యాలు, ఆ నేపధ్యాలకీ సాహిత్యానికీ మధ్య ఉన్న సంబంధం గురించి చాలా మంది మాట్లాడారు. ఉధ్యమ నేపధ్యం గురించి సంధ్య గారు మాట్లాడారు. తర్వాత నాటకాలు, థియేటర్ గురించి బిక్షు గారు, పబ్లిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనుంచి మన రాయుడుగారు మాట్లాడారు. అయితే ఈ నేపధ్యాలన్నింటికంటే కంటే కూడా నా దృష్టిలో అతి తక్కువ సాహిత్యంతో సంబంధం వున్న రంగం గురించి నేను మాట్లాడబోతున్నాను, అది సినిమా రంగం.

ఇప్పుడు నా దృష్టిలో సినిమాకీ సాహిత్యానికీ అతి తక్కువ లింక్ ఉంది అంటే సంబంధం వుంది, అది ఎప్పుడో తెగిపోయింది, అది ఎందుకు తెగింది అనేది చాలా ఆసక్తికరమైన విషయం, ఎందుకలా జరిగింది అనేది మనం కాస్త ఆలోచించాల్సిన విషయం, చర్చించాల్సిన విషయం అంటే అలా చర్చించాలని మనకు ఆసక్తి ఉంటే! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నేను కొత్తలో టొరంటో లో చదువుకొని ఫిల్మ్ స్కూల్ లో చదువుకొని, రకరకాల ఉత్సాహాలూ, ఆదర్శాలూ, మంచి మంచి సినిమాలు తియ్యాలని, కొత్త రకమైన సినిమాలు తియ్యాలని మంచి మంచి కధలని ఆడాప్ట్ చెయ్యాలి సాహిత్యం నుంచి అనే ఆశలతో వచ్చిన నాకు విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యేవి, ఇలా నేను ఎం.ఏ లిటరేచర్ చేశానండీ, ఎం.ఫిల్ చదివానండీ , ఎం.ఎఫ్.ఏ ఫిల్మ్ మేకింగ్ లో చేశానండీ అని చెప్తే, చాలా మంది నాతో ‘అదేంటండీ ఇంత చదువుకొని మీరు సినిమాల్లోకి ఎందుకొచ్చారు?’ అని అడిగేవారు. ఆ ప్రశ్నకు నాకు చాలా నవ్వు వచ్చేది.

ఏ ఎం.బి.ఏ చదువుకుంటేనో, ఐ.ఐ.టి చదువుకుంటేనో లేకపోతే ఐ.ఐ.టి చదువుకున్నవాళ్లు ఇంత చదువుకొని ఇంజనీర్లు ఎందుకవుతున్నారండీ, సైంటిస్ట్ ఎందుకవుతున్నారండీ అని బహుశా వారు అడగరేమో ! కానీ ‘చదువుకొని సినిమాల్లోకి ఎందుకొచ్చారు?’ అని చాలాకాలంగా ఒక ప్రశ్న ఉండేది, చాలా కాలం నుంచి వస్తున్న ప్రశ్న అది. నేను కూడా ఆ ప్రశ్న ను ఎదుర్కొన్నాను కొంతకాలం పాటు. ఇంకోటి ఏమిటంటే ‘ మా అబ్బాయి ఎందులోనూ పనికి రావట్లేదండీ, కొంచం మీ దగ్గర పెట్టుకోండి అసిస్టెంట్ డైరెక్టర్ కింద’ అంటే సినిమాల పట్ల జనరల్ ఇంప్రెషన్ ఏం ఏర్పడిందంటే ‘జనరల్ గా ఎందుకూ పనిరాని వాళ్ళు సినిమాల్లోకి రావచ్చు, చదువక్కర్లేదు సినిమాలకి’ అని ఒక ఇంప్రెషన్ ఏర్పడిపోయింది.

ఈ సినిమా తాలూకు సృజనాత్మకత ఏదైతే ఉందో, సినిమాల్లో ఏదైతే క్రియేటివిటీ ఉందో దానికి చదువు అక్కర్లేదు, ఒకరకమైన ఆర్టిస్టిక్ మైండ్ ఉంటే సరిపోతుంది’ ఇలాంటి ఒక దురభిప్రాయంతో మనం చాలా కాలంగా సినిమా రంగంలో చాలామంది అంటే, పాపం ఇక్కడికి వచ్చినవాళ్లు, చదువుకున్నవాళ్లు వెనక్కి వెళ్ళి పోవడం, చదువురాని వాళ్ళు ఏమీ కుదరకపోతే ఈ రంగంలోకి రావచ్చు అనే ఒక దురభిప్రాయం రావడం కూడా జరిగింది నా దృష్టిలో. అయితే ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే డిగ్రీలకీ సృజనాత్మకతకీ, అంతర్గత సంస్కారానికీ సంబంధం లేదు. మీకొక ఎం.బి.ఏ ఉండడం వల్ల ఎం.ఏ ఉండడం వల్ల లేదా ఐ.ఐ.టి లో ఏదో డిగ్రీ ఉండడం వల్ల అద్భుతమైన సినిమాలు మీరు తీస్తారని గ్యారంటీ లేదు, అలా అని చెప్పి ఏమీ చదువుకోని వాళ్ళు బాగా తీయలేరు అని కూడా లేదు. ఈ పోజిబిలిటీలో నుంచి ‘చదువు అక్కర్లేదు’  అనే ఒక దురభిప్రాయం పుట్టింది. అక్కడ చదువు అంటే ఏమీ చదువు లేకుండా, డిగ్రీల్లేకుండా సాంస్కృతిక విద్య ఉంటే మీరు మంచి సినిమాలు తీయొచ్చు.

అన్నీ చదువుకొని పెద్ద పెద్ద విదేశాలకి వెళ్ళి చదువుకున్న వాళ్ళకి కూడా సాంస్కృతిక విద్య లేకపోవచ్చు, సాహిత్యం గురించి కానీ ఇతర కళల గురించి కానీ ఒక అవగాహన లేకపోవడం, ఆ కళలన్నింటినీ ఎలాగ రంగరిస్తే వాటిలో నుంచి సినిమా అనేది పుడుతుంది అనే వాటిపట్ల ఒక సాంస్కృతికమైన, సామాజికమైన దృష్టిలో నుంచి అర్ధం చేసుకొనే సామర్ధ్యం లేనప్పుడు మంచి సినిమా పుట్టదు. దానికీ పెద్ద పెద్ద డిగ్రీలు చదవడానికీ సంబంధం లేదు. కావున సమస్య ప్రాధమికంగా ఏమిటంటే, వృత్తి విద్యలు చదవడం ఆ రకమైన విద్యలు చదవడం కాదు సాంస్కృతిక విద్య కొరవడడం సమాజంలో.

9cf0d62d1f_rounded

ముఖ్యంగా నా దృష్టిలో గత ఇరవై ముప్పై యేళ్ళగా సాహిత్యానికీ సినిమాకీ వున్న లింక్ కట్ అయిపోవడం వలన మనకి ఈ విధమైన ఒక భావ దారిద్ర్యం బాగా పెరిగిందని చెప్పొచ్చు. కేవలం సాహిత్యానికీ సినిమాకే కాదు అసలు జీవితానికీ సాహిత్యానికీ కూడా లింక్ కూడా తగ్గుతూ వచ్చింది. దానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయ్, నా దృష్టిలో ఏ సమాజంలో అయితే కళల స్థాయిని బట్టి ఆ సమాజం యొక్క సంస్కృతీ స్థాయిని మనం గుర్తించవచ్చు, కొలమానం అని చెప్పొచ్చు . ఒక సాహితీ వాతావరణం తో పాటూ ఇతర కళలు సంగీతం, చిత్రకళ, నృత్యం, జానపద కళలు వీటన్నిటికీ ఒక ఆర్ధిక రాజకీయ సామాజిక పరిస్థితులకీ మధ్య ఉండే ఇంటరాక్షన్ ని ఎదైతే అంటామో, ఈ మధనం లో నుంచి ఒక సాంస్కృతిక వాతావరణం పుడుతుంది. ఆ వాతావరణం లోని చైతన్యమూ, ఆ వాతావరణం సృష్టించే శక్తి నుంచి కళలు తిరిగి తమని తాము పరిపుష్టం చేసుకోగలుగుతాయి. ఇదొక సైకిల్ లాగా ఉంటుంది.

అయితే ఎప్పుడైతే మనం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ప్రస్తుతం రెండు రాష్ట్రాలున్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో , నా దృష్టిలో ఏమైందంటే దాదాపు ఎనభైల్లో నుంచి హ్యూమానిటీస్  ని సోషల్ సైన్సెస్ ని మనం స్కూల్స్ లోనూ కాలేజెస్ లోనూ చంపేశాం, అంటే సాహిత్యం అనవసరం, కళలు అనవసరం, చరిత్ర అనవసరం, రాజనీతి శాస్త్రం అనవసరం, తర్వాత సోషియాలజీ , సామాజిక శాస్త్రం మనం చదవక్కర్లేదు. యాంత్రోపాలజీ అనవసరం, ఇవన్నీ అనవసరం, ఎందుకూ పనికిరానివాళ్లు చేసే సబ్జెక్ట్స్ ఇవి. ఏవైతే పాశ్చాత్య దేశాల్లోని యూనివెర్శిటీల్లో చాలా బాగా ఆదరిస్తారో, వాటిని మన ప్రభుత్వాలు అవి అనవసరం అని భావించి అవతలపడేసి, కేవలము ఉద్యోగాలేవొస్తాయ్, కంప్యూటర్ సైన్సెస్ కానీ లేకపోతే  ఎం.బి.ఏ లు కానీ లేకపోతే సి.ఏ కానీ చార్టెడ్ అకౌంటెన్సీ అని ఉండేది మా చిన్నప్పుడు, వృత్తి – మీకు ఇమ్మీడియెట్ గా ఉద్యోగం వచ్చేదే ముఖ్యం, మిగతావన్నీ అనవసరం, మిగతావన్నీ టైమ్ పాస్ కాలక్షేపం. కాబట్టి మీరు ఏం చేసినా కూడా నేర్చుకోవచ్చండీ, కధలు రాయాలంటే మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, పెయింటింగ్ కావాలంటే మీరు టైమ్ పాస్ కి వేసుకోండి, కావాలంటే నాటకాలు ఆడుకోండి, ఈ విధమైన ఒక థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేటస్, (సెకండరీ స్టేజ్ అని కూడా అనకూడదు) ఇవ్వడం వలన ఏమైందంటే ఒకరకమైన సామాజిక అవగాహన, ఇప్పుడు సాహిత్యమనేది నా దృష్టిలో వ్యక్తులకీ సమాజానికీ మధ్య వారధి. సాహిత్యమే కాదు, అన్నీ కళాలూ!

మన ప్రపంచాన్ని మనం అర్ధం చేసుకోవడానికి ఈ కళాలన్నీ ఉపయోగపడతాయ్. ఎప్పుడైతే ఆ లింక్ తెగిపోయిందో, ఎప్పుడైతే ఆ విలువలు మెటీరియలిజం, ఇండివిడ్యువలిజం ద్వారా కబళించబడ్డాయో, అప్పుడు జీవితానికీ సాహిత్యానికీ మధ్య ఒక రప్చర్ వచ్చేసింది. అది సినిమా రంగానికి కూడా ఎక్స్టెండ్ అయిపోయింది. విపరీతంగా అయింది. ఇలా అవడంవలన ఏంటంటే, మన సినిమా రంగం పూర్తిగా వ్యాపారాత్మకమైన సినిమా వైపు వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే సినిమా అంటే కేవలం ఒక పక్కా వ్యాపారం, ‘ఏది అతి త్వరగా, అతి ఎక్కువగా, అతి తక్కువ శ్రమతో,  అత్యంత ఎక్కువ డబ్బులు సంపాదించగలదో అది సినిమా’  అని ఒక అభిప్రాయం ఏర్పడింది. ‘ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నామండీ’ అని ఒక ఆర్గ్యుమెంట్ ఉందండీ అది తప్పు నా దృష్టిలో. ఎందుకంటే ప్రేక్షకుడికి ఒక అజెండా ఉండదు, వాళ్ళు చూపించిందే చూస్తారు. పదే పదే చూపించిందే వాళ్ళ అభిరుచి కింద మారుతుంది. కాబట్టి ఈ అభిరుచిని సృష్టించేది కళాకారులు. ఆ అభిరుచిని సృష్టించే కళాకారుల అంతర్గత సంస్కారం మళ్ళీ ఈ సమాజం యొక్క  సాంస్కృతిక స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. సో, ఇట్స్ లైక్ ఎ సైకిల్ ! కొంతమంది అనుకుంటారు, సామాజిక స్పృహతో సినిమా తీయడమంటే , ఉపన్యాసాలండీ ! లేకపోతే ఆర్ట్ సినిమా అని మనకొక దురభిప్రాయం. అది కూడా కాదు.

సామాజిక స్పృహ అంటే ప్రతి సినిమాలోనూ  మీరు ఏదో సోషల్ ఇష్యూస్ తీసుకొని దాని గురించి ఉపన్యాసాలు ఊగదప్పడ ఉపన్యాసాలు దంచమని కాదు. ఎందుకంటే ఉపన్యాసాలకి సినిమా వేదిక కాదు, అది అందరికీ తెలుసు. సినిమా అనేది ఒక కళా రూపం. నవలకీ వ్యాసానికీ ఎంత తేడా ఉందో అలాంటి తేడానే సినిమాకీనూ pamphleteer కీ!

అయితే ఏంటంటే సినిమాలు తీసే వ్యక్తి తన  యొక్క చుట్టూ పక్కల ఉన్న సాంస్కృతిక రాజకీయ ఆర్ధిక వాతావరణాన్ని జీర్ణించుకొని తన సృజనాత్మకతలోనుంచి డిస్టిల్ చేసి తన కళా రూపం ద్వారా వ్యక్తపరచడం అనేది కళాకారులు చేసే పని. అది పెయింటింగ్ ద్వారా అవొచ్చు. మరి సినిమా అవొచ్చు, అది నాటకం కావొచ్చు, పాట రాయడం కావొచ్చు, కవిత రాయడం కావొచ్చు!

ఈ విధమైన ప్రక్రియ, తను ఆకళింపు చేసుకున్నదంతా తను ఎంచుకున్న కళారూపం ద్వారా ప్రకటించడానికి ప్రయత్నిస్తాడు కళాకారుడు. దానికి సాంస్కృతిక వాతావరణం వైబ్రంట్ గా ఉండాలి. అలా వైబ్రంట్ గా లేనప్పుడు, ఈ అన్నీ రంగాల మధ్యలో ఒక విధమైన  వైబ్రంట్ ఇంటరాక్షన్ లేనప్పుడు ఆరోగ్యకరమైన అర్ధవంతమైన కళ పుట్టే అవకాశం చాలా తక్కువుంటుంది నా దృష్టిలో. సినిమాకీ సాహిత్యానికీ మధ్యలో అదీ జరిగింది. ఆ రప్చర్ రావడం వలన వైబ్రంట్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ లో నుంచి సినిమాలు పుట్టే అవకాశం లేకుండా పోయింది.

బి. ఎన్. రెడ్డి గారు

బి. ఎన్. రెడ్డి గారు

సాహిత్యానికీ జీవితానికీ ఎప్పుడైతే సంబంధం తెగిపోయిందో, ఎప్పుడైతే తెలివిజన్ వచ్చి చదవడాన్ని చంపేసిందో, ఎప్పుడైతే కమర్షియలైజ్డ్ తెలివిజన్ కానీ ఎప్పుడైతే కమర్షియలైజ్డ్ ఫిల్మ్ మేకింగ్ వచ్చిందో ఆ లింక్ తెగిపోయింది. ఒకప్పుడు బి.ఎన్ రెడ్డిగారు, కె.వి. రెడ్డిగారు కాలంలో గొప్ప గొప్ప రచయితలు సినిమా రంగం లో పని చేయడం జరిగింది. పద్మరాజుగారు గానీ కృష్ణ శాస్త్రిగారు గానీ శ్రీశ్రీ  గారు గానీ లేకపోతే డి.వి. నరసరాజు గారు గానీ సినిమా రంగం లో పనిచేయడం జరిగింది. వాళ్ళు సాహిత్యాన్ని చదువుకున్నారు, సాహిత్యం నుంచి కధల్ని ఆడాప్ట్ చేశారు.

చాలా మందికి తెలీదు, కె.వి.రెడ్డి గారి ‘పెద్దమనుషులు’ హెన్రీ హుడ్సన్ రాసిన ‘పిల్లర్స్ ఆఫ్ సొసైటి ‘ అనే నాటకం నుంచి స్పూర్తి  పొంది రాసిన స్క్రిప్ట్ అది అని. అలాగే ‘ మల్లీశ్వరి’ బుచ్చిబాబు గారి ‘ రాయలవారి కరుణకృత్యం’  స్పూర్తి తో తీశారని చెప్తారు. ‘ బంగారుపాప ‘ అని బి.ఎన్ రెడ్డిగారిది ‘శైలస్ మార్నర్’ అని ఒక ఆంగ్ల నవల జార్జ్ ఎలియట్ రాసినది. ఆఫ్ కోర్స్ ‘కన్యాశుల్కం’ సినిమాగా తీశారు. ఎంతోమంది గొప్ప రచయితలు, రచయిత్రులు ఉన్న మన తెలుగు సాహిత్యం నుంచి ఎప్పుడూ ఎందుకు మనం అడాప్ట్ చేయట్లేదు అనేది నాకు ఎప్పుడూ  చాలా ఆశ్చర్యం కలిగించే విషయం.

నా దృష్టిలో బెంగాల్ లో ఠాగోర్ ఎంత పెద్ద రచయితో తెలుగులో చలం కూడా అంత పెద్ద రచయిత. అలాంటి రచయిత కధల్లో నుంచి ఒక్క కధని కూడా మనం అడాప్ట్ చేయలేదు ఇప్పటి వరకూ. ‘గ్రహణం’ నవలని 2004 లో ఫస్ట్ టైమ్ నేను రైట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చలం గారి కూతురు సౌరీస్ గారు ఆశ్చర్యపోయారు, ‘ ఎందుకు మీరు ‘ అని! అంటే ఎప్పుడూ ఎవరూ అసలు ఆ ఇంటరెస్ట్ కూడా చూపించట్లేదు. పోనీ అలా అని అవి ఏమైనా ఆర్టీ స్టోరీసా ! అంటే కాదు. చాలా డ్రమాటిక్ గా వుంటాయి కధలు. కధలో చాలా నాటకీయత ఉంటుంది. సినిమాలో చాలా ఒదిగిపోయే కధలు.

చలం గారే కాదు మీరు ఏ రచయితనైనా తీసుకోండి, కొడవటిగంటి కుటుంబరావుగారు తీసుకోండి, బుచ్చిబాబు గారి కధలు తీసుకోండి, తిలక్ గారి కధలు తీసుకోండి, రావిశాస్త్రిగారి కధలు తీసుకోండి, లేకపోతే కాళీపట్నం రామారావుగారి కధలు తీసుకోండి, శ్రీపాద  సుబ్రహ్మణ్యశాస్త్రి గారివి తీసుకోండి. సమకాలీన రచయితల్లో గోపిని కరుణాకర్, మహమ్మద్ ఖాదిర్ బాబు, గోగు శ్యామల గారు ఇలా చాలా మంది, అన్నీ పేర్లు నేను చెప్పలేను కానీ రకరకాల రచయితల యొక్క కధలని మనం అడాప్ట్ చేసుకొని వాటిని సినిమా కింద తీయగలిగే అవకాశం ఉంది. లేకపోతే ఆ రచయితలకి సినిమా రంగంతో ఒక విధమైన లింక్ ఏర్పడితే అసలు ఆలోచనా ధోరణి మారే అవకాశం ఎక్కువ ఉంది. డెబ్భైల్లో ఎనభైల్లో పాపులర్ సాహిత్యం నుంచే మన సినిమాలు వచ్చాయి యద్దనపూడి సులోచనా రాణిగారు, మాదిరెడ్డి సులోచన గారు, కోడూరు కౌసల్యాదేవి గారు, ఆర్.సంధ్యాదేవి గారు , యండమూరి వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు ఇలా వీళ్ళందరి నవలలు సినిమా కింద తీసినప్పుడు పెద్ద సక్సెస్ ఫుల్ అయ్యాయి కమర్షియల్ గా.

యండమూరి

యండమూరి

ఆ తర్వాత ఎనభైల్లో స్కూళ్ళలో, నేను చదువుకున్న టైమ్ లో తెలుగు చచ్చిపోయింది ఫస్ట్. స్కూళ్ళలో తెలుగు చదవడం పొయ్యి ఇంగ్లీష్ మీడియం పిచ్చి పట్టుకుంది. తర్వాత గ్రాడ్యువల్ గా తెలివిజన్ వచ్చింది. ఎప్పుడైతే తెలివిజన్ వచ్చి సీరియళ్ళు ఇవీ పెరిగాయో చదవడం అనే అలవాటు పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత ఈ డిజిటల్ రెవొల్యూషన్ అనండీ, ఐ.టీ. అనండీ, తర్వాత వీటి వలన వీడియో గేములు, ఫేసుబుక్కులూ, ట్విట్టర్లూ ఎక్కువైపోయి మనకి ఏకాంతం లో పుస్తకం చదవడం, ఒక పెయింటింగ్ ని ఆస్వాదించడం లేదా ఒక నాటకాన్ని వెళ్ళి చూడడమో, నృత్య ప్రదర్శనని చూడడమూ, ఇలాంటి అవకాశాలన్నీ పోయాయి, అసలు తగ్గిపోయాయి సమాజంలో ! తగ్గిపోయి సినిమా తెలివిజనూ పూర్తిగా ఆక్యుపై చేసేశాయ్. అయితే ఆ ఆక్యుపై చేసినప్పుడు పోనీ సాహిత్యం నుంచి ఏమైనా సినిమాలు తీస్తున్నారా, సాహిత్యం నుంచి కధలు తీసుకుంటున్నారా, లేకపోతే సాహితీ విలువలున్న రచన మనకేమన్నా కనబడుతూ ఉందా సినిమాల్లో అనేది చూస్తే మనకేం లేదు.

ఒక విచిత్రం ఏమిటంటే  సాహిత్యం అనేది ఎంత కనబడకుండా ఉంటే సినిమాకి అంత మంచిది అన్న అభిప్రాయం కూడా ఏర్పడిన వాళ్ళు, చెప్పిన వాళ్ళూ కొంతమంది ఉన్నారు. ‘సాహితీ విలువలు అనవసరమండీ సినిమా కధకి’, ‘సినిమా కధ వేరు. అది వేరే జంతువు దాన్ని నిర్మించే విధానం వేరు’ ఇలాంటి కొన్ని చాలా అభిప్రాయాలు ఉన్నాయ్. సినిమా కధని నిర్మించే విధానం వేరన్నదానిలో కొంత వరకూ నిజముంది కానీ దానిని సాహిత్యం నుంచి దూరంగా నెట్టేయాల్సిన అవసరం ఉందనేది మాత్రం చాలా చాలా తప్పు అభిప్రాయం. దానివల్ల ఏమవుతోందంటే సాహితీ విలువలుండి కొంచం మంచిగా అందంగా ఒక వాక్యాన్ని రాయడానికి గానీ లేకపోతే ఒక పాటను రాయడానికి గానీ ఒక మంచి మెలోడియస్ పాటను కట్టడానికి గానీ ఇవన్నీ పెద్ద సమస్యలైపోయాయి ఇప్పుడు మనకు.

ఏంటంటే ఇవన్నీ కమర్షియల్ గా వైబుల్ కాదు అనే ఒక అభిప్రాయం కూడా ప్రబలంగా ఉంది. దాని వలన మనకి ఆ విధమైన లింక్ తెగిపోవడం వలన, సాహితీ విలువలు అనేది ఒక నెగెటివ్ క్వాలిటీ అయిపోవడం వలన కూడా మనకి ఉన్నతమైన స్థాయిలో ఉండే సినిమాలు రావట్లేదు. ఉన్నతమైన స్థాయి అంటే చాలా మందికి ఇంకొక దురభిప్రాయం కూడా ఉంది, మనం ఏ జోనర్ తీస్తున్నాము అనేదానితో సంబంధం లేదు మనం హారర్ తీయొచ్చు, పోలిటికల్ థ్రిల్లర్స్, రొమాంటిక్ థ్రిల్లర్స్ తీయొచ్చు, పక్కా ఫార్శికల్ కామెడీ చేయొచ్చు, లేకపోతే మర్డర్ మిస్టెరీస్ . ఏదైనా మీరు తీసే సినిమా ఏ రకం అనేదానికి సంబంధం లేదు. ప్రతీదానిలోనూ, ఆగతా క్రిష్టీ మర్డర్ మిస్టేరీస్ రాసింది కానీ గొప్ప సాహితీ విలువలు దానిలో ఉంటాయి. షెర్లాక్ హోమ్స్ రాసిన ‘ఆర్థర్ కొనన్ డోయ్లే’ లో గొప్ప రచన ఉంటుంది. అలాగే పి.జి.ఉడ్ హౌస్ రాసిన హాస్యం లో గొప్ప రచన ఉంటుంది. సో, సాహిత్యానికీ జోనర్ కీ సంబంధం లేదు. అలాగే సినిమా ఏ జోనర్ లో మీరు తీసినా దాన్లో గొప్ప సాహితీ విలువలు చూపించగలిగే ఎబిలిటీ మనకుండాలి.

ఇప్పుడు మీరు తమిళం లో గానీ మళయాళం లో గానీ కన్నడలో కొంతవరకూ గానీ లేకపోతే హిందీ లో గానీ ఇంకా సాహిత్యం నుంచీ నవలల నుంచీ కధలు తీసుకొని వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. మనకు అది లేదు, ఎందుకు లేదు? ఎందుకంటే సినిమాలు తీసే మెజారిటీ వాళ్ళకి సాహిత్యం అసలు తెలీదు, సంబంధం కూడా లేదు, గొప్ప రచయితలు ఎవరని వాళ్ళని అడగండి వాళ్ళకి తెలీదు, అస్సలు. ఎవరైనా సమకాలీన సాహిత్యం , గొప్ప పుస్తకాలూ గానీ క్లాసికల్ లిటరేచర్ గానీ చదువుతారా అసలు! అస్సలు లేరని మనం అనలేమ్, చాలా కొద్ది మంది లిటరల్ గా నా ఎక్స్పీరియన్స్ లో అయితే చాలా కొద్ది మంది. వేరే సినిమాలు చూసి మనం ఆ ఐడియాలను ఎలా తీసుకోవాలి అని చూస్తున్నామే తప్ప, అసలు సాహిత్యం నుంచి ఏవైనా మంచి కధలు తీసుకోవచ్చా అని చూడట్లేదు. అది ట్రెడిషినల్ లిటరేచర్ అవ్వొచ్చు  లేదా సమకాలీన సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యం కావొచ్చు, ఆల్టర్ నేటివ్ సాహిత్యం కావొచ్చు అసలు ఆ పోకడలు లేకపోవడం వల్ల ఇప్పుడు మనకు ఆ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను.

ఒకప్పుడు అసలు ఐజస్టైన్ అనే గొప్ప ఫిల్మ్ డైరెక్టర్ రాశాడు , అసలు సినిమాలోకి వచ్చిన కొన్ని టెక్నిక్స్ సాహిత్యం నుంచి కూడా వచ్చి ఉండొచ్చు, గ్రిఫిక్ అనే అతను పార్లెల్ కటింగ్ అనేది ఇన్వెంట్ చేశాడు, అంటే ఒక సన్నివేశం జరుగుతుండగా వేరే ఒక సన్నివేశాన్ని దానితోపాటూ చూపించడం, మన సినిమాల్లో మనకు ఇది బాగా అలవాటైపోయింది. ఇప్పుడు హీరోయిన్ ని కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్లిపోతూ ఉంటారు, అక్కడ హీరో కి ఆ విషయం తెలిసి బయల్దేరుతాడు, ఈ అమ్మాయిని రక్షించడానికి. సో, ఇక్కడ ఇది కొంత అది కొంత చూపించడం ద్వారా కధ లో టెంపో ని ప్రేక్షకుల్లో ఆసక్తిని టెన్షన్ నీ పెంచే టెక్నిక్ పార్లల్ కటింగ్ అంటారు. అది ఒరిజినల్ గా చార్ల్స్ డికెన్స్ నుంచీ బహుశా గ్రిఫిక్ నేర్చుకున్నాడేమో అని ఐజస్టైన్ ప్రతిపాదించాడు ఒక వ్యాసం లో. ఎందుకంటే డికెన్స్ రాసిన శైలిలో అది ఉంది, అతని నవలా రచనా పద్ధతిలో. దానికొక ఉదాహరణ కూడా ఇస్తాడు ఆ వ్యాసంలో , అది ‘ వంటింట్లో కెటిల్ లో నీళ్ళు మరుగుతూ ఉంటాయి, బయట ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది. వేరేగదిలో జరిగే సంభాషణకీ అక్కడ కెటిల్ లో నీళ్ళు మరగడానికీ మధ్యలో ఇంటర్ కట్ చేస్తూ ఉంటాడు డికెన్స్. అదే సినిమా రంగంలో సినిమా ఆడాప్ట్ చేసుకుంది అని ఐజస్టైన్ అన్నాడు. సో, ఆ లింక్ ఎప్పటికీ ఉంటుంది.

ముఖ్యంగా సినిమా అన్ని కళల యొక్క సమాగమం. అంటే పెయింటింగ్, లిటరేచర్, ఫోటోగ్రఫీ మ్యూజిక్, డాన్స్, డ్రామా ఇవన్నీ కలిసి సినిమా తయారయ్యింది. అంటే కేవలం సాహిత్యమే కాదు వీటన్నింటిలో దేని నుంచి లింక్ తెగిపోయినా కూడా సినిమా పుష్టిగా ఉండే అవకాశం లేదు. అయితే సినిమాలో కూడా సాహిత్యం ఎక్కువ ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే  రచనల ద్వారా, స్క్రీన్ ప్లే కానివ్వండి, డైలాగులు కానివ్వండి పాత్రల పరంగా కానివ్వండి. సాహిత్యంతో ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఆరోగ్యకరంగా ఉండాలి సినిమాకి. ఎప్పుడైతే అవి లేవో, గత ఇరవై యేళ్లుగా పూర్తిగా రప్చర్ అయిపోయి డామేజ్ అయిపోయిందని నా ఉద్ధేశ్యం.

మళ్ళీ దాన్ని ఫిల్మ్ మేకర్స్ ఏ విధంగా అయితే తమిళం లో గానీ మలయాళంలో గానీ ఫిల్మ్ మేకర్స్ పనిగట్టుకొని ఆ పని చేస్తున్నారో మళ్ళీ అలాంటి ఒక స్పూర్తి తో యువ దర్శకులు రచయితలూ ముందుకొచ్చి తెలుగులో పూనుకుంటే తప్ప ఆ గాప్ ని పూడ్చితే తప్ప మనకి అర్ధవంతమైన ఆరోగ్య వంతమైన సినిమాలు వస్తాయని నేను అనుకోవట్లేదు.

కాబట్టి సాహిత్యానికి ఇప్పుడు ప్రస్తుతం  ‘ఇమ్మీడియట్ నీడ్ ఆఫ్ ద హవర్ ‘ అంటాం కదా, సినిమా రంగంలో ఏమిటంటే సాహితీ విలువలున్న రచనలని మనం వృద్ధి చెందేలా చెయ్యాలి. సాహిత్యానికీ సినిమాకీ ఉన్న లింక్ ఎదైతే ఉందో అది తెగిపోయింది నా దృష్టిలో ఒక ఇరవై యేళ్ళుగా, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం వెంటనే ఉందని నేను భావిస్తున్నాను.

(తెనాలిలో  కథ-2014 ఆవిష్కరణ సభలో ప్రసంగం. ప్రసంగానికి లిఖిత రూపం: రేఖా జ్యోతి)

*