గత శనివారం హైదరాబాద్ లమాకాన్ లో ఒక మరాఠీ ప్రజాగాయకురాలి ప్రోగ్రాము జరిగినది. ఆవిడ పేరు “శీతల్ సాథే”. చాలా రోజుల క్రితం ఆవిడ పాడిన మరాఠీ పాటలు కొన్ని నేను ఇంటర్నెట్ లో విన్నాను. భయం లేని ఆవిడ స్వరం, నిజాయితీ నిండిన ఆవిడ పాటలు నాకు చాలా కాలం వరకు గుర్తున్నాయి. ఇప్పుడు స్వయంగా చూసే అవకాశం దొరికింది. అదే ప్రోగ్రాముకి ప్రముఖ డాక్యుమెంటరీ దర్శకులు ఆనంద్ పట్వర్ధన్ కూడా వచ్చారు.
లమాకాన్ లో జరిగిన ఆ ప్రోగ్రాము లో జరిగిన విశేషాలని ఇక్కడ రాస్తున్నాను.
శీతల్ సాథే గురించి:
మహారాష్ట్ర లో పేద దళితులపై జరుగుతున్న అత్యాచారాలకి వ్యతిరేకంగా పోరాడుతున్న “కబీర్ కాలా మంచ్” అనే కళాకారుల బృందంలో శీతల్ ఎన్నో సంవత్సరాలు పని చేసారు. ఆ బృందాన్ని మతతత్వ సంఘాలూ, పోలీసులూ కలిసి చిన్నాభిన్నం చేసారు. నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని తప్పుడు కేసులు పెట్టి వేధించారు.
2013 ఏప్రిల్ లో శీతల్, ఆవిడ భర్త, కవి, సచిన్ మాలీ కలిసి మహారాష్ట్ర అసెంబ్లీ ముందు పాటలు పాడుతూ సత్యాగ్రహం చేసారు. పోలీసులు వారినీ, బృందంలోని ఇతర కళాకారులతో సహా అరెస్టు చేసారు. అప్పటికే గర్భవతిగా ఉన్న శీతల్ కి మూడు నెలల తర్వాత ముంబాయి హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇది జరిగి ఇప్పటికి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. సచిన్ మాలీతో సహా మిగిలిన వారందరూ ఇంకా జైలులోనే ఉన్నారు. ఇంతవరకూ విచారణ కూడా మొదలవ్వలేదు. రెండు సార్లు బెయిల్ నిరాకరించబడింది. ఇప్పుడు సుప్రీం కోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేస్తున్నారు. శీతల్ కి ఇప్పుడు రెండేళ్ల బాబు ఉన్నాడు.
ప్రస్తుతం శీతల్ కొంత మంది కళాకారులని కలుపుకుని సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకుని మహారాష్ట్ర మొత్తం తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తున్నారు. జైలులో సచిన్ మాలీ రాసిన పాటలని కూడా శీతల్ పాడుతూ ఉంటారు.
ఎన్నో వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన వర్గాల ప్రజలని represent చేస్తూ, ఒక సెక్యులర్, డెమోక్రాటిక్ సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని చాటి చెప్తూ, చాలా సూటిగా ఆత్మని తాకేలా ఉంటాయి శీతల్ పాటలు.
గత కొంత కాలంగా, శీతల్ ప్రదర్శన ఇచ్చిన ప్రతి చోటా ABVP గ్రూపులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ దళిత కళాకారులని “దేశద్రుహులు” అని వాళ్ళనడం యాదృచ్చికం కాదు.
ప్రదర్శన గురించి:
శీతల్ ముఖ్యంగా మరాఠీ గాయకురాలు. ఆవిడ తన పాటలని మరాఠీలోనే పాడుతూ, ప్రతి వాక్యానికీ తనకి వచ్చిన హిందీలో explain చేస్తూ పాడారు. భాష వేరయినా పాటలలోని భావం ప్రేక్షకులని ఖచ్చితంగా చేరుతుంది. ఆ పాటలలోని నిజాయితీ, ప్రశ్నించే తత్వం నాకు బాగా నచ్చాయి. ఆవిడ చెప్పిన కొన్ని మాటలు ఆలోచింపజేసేవి గా ఉన్నాయి.
పాటలు ఎందుకు పాడాలి అని చెప్పే పాట ఒకటి పాడుతూ “పాటలు మనిషిలో ఉన్న అమానవవత్వాన్ని పోగొట్టడానికి పాడాలి. ఇంకా ఉన్నతమయిన మనిషిగా చెయ్యడం కోసం పాడాలి.” అన్నారు.
ఆవిడ భర్త సచిన్ మాలీ రాసిన ఒక హిందీ పాట ఇలా సాగింది.
“इनसान को अछूत और गुलाम किया है
कैसा ये करम है
कैसा ये धरम है”
తెలుగులో
“మనిషిని అంటరాని బానిసని చేసింది
ఇదేమి కర్మం. ఇదేమి ధర్మం”
మొత్తం పాటని ఈ కింద వీడియోలో వినండి.
ఆ బృందం తమ పాటలతో కబీర్ ని, తుకారాం ని తలుచుకున్నారు. అంబేద్కర్ ని, భగత్ సింగ్ ని గుర్తుచేసుకున్నారు. కుల వ్యవస్థని ప్రశ్నించారు, మతతత్వాన్ని విమర్శించారు. మొత్తం ప్రదర్శనని ఈ కింద వీడియోలో చూడవచ్చు.
పాటల కార్యక్రమం ముగిశాక ఆనంద్ పట్వర్ధన్, శీతల్ గార్లతో కొద్దిసేపు చర్చ జరిగింది. ప్రేక్షకులలో కొద్దిమంది అడిగిన ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు ఇచ్చారు.
ఆనంద్ పట్వర్ధన్ మాట్లాడుతూ ఇలా అన్నారు. “దేశానికి సంబంధించిన విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఎవరు Nationalistలు ఎవరు anti-nationalist లు.. మీలాంటి, నా లాంటి, శీతల్, రోహిత్ వేముల లాంటి వాళ్ళని, దేశ ప్రజల్లో చాలా మందిని anti-nationals అంటున్నారు. ఇలా అంటున్న వారు ఎవరో కాదు. దాదాపు వంద సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఒక Religious country గా మార్చాలని ప్రయత్నం చేస్తున్న వారు. దాదాపు వంద సంవత్సరాల పాటు ఈ దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని వారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం నడుస్తున్నప్పుడు ముస్లిం లీగ్ తో చేతులు కలిపి బ్రిటీష్ ప్రభుత్వాన్ని సమర్థించిన వారు. మన జాతీయ పతాకాన్ని వాళ్ళెప్పుడూ ఆమోదించలేదు. కాషాయ జెండానే కావాలన్నారు. భారత రాజ్యాంగాన్ని వద్దని మనుస్మృతి నే రాజ్యాంగంగా కావాలన్నారు. అలాంటి వాళ్ళు ఇవ్వాళ మనల్ని anti-nationals అంటున్నారు. దీన్ని మనం ప్రశ్నించాలి.”
ప్రశ్న: “కబీర్ కాలా మంచ్” తో మీ ప్రయాణం ఎలా మొదలయ్యింది?
ఆనంద్: “1997 వ సంవత్సరంలో ముంబైలోని రమాబాయి కాలనీలో కొందరు అంబేద్కర్ విగ్రాహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచారు. దానికి నిరసన తెలుపుతూ రోడ్డు మీదకి వచ్చిన నిరాయుధులు అయిన ఆ జనం మీద పోలీసులు కాల్పులు జరిపి పది మంది ప్రాణాలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ చనిపోయిన వాళ్లకి న్యాయం జరగాలని మహారాష్ట్ర ప్రజలు కోరుతూనే ఉన్నారు. ఆ సంఘటన జరిగిన పది సంవత్సరాల తర్వాత 2007లో నేను రమాబాయి కాలనీలో శీతల్ ప్రదర్శన చూశాను. అప్పటి నుంచి వాళ్ళు నాకు తెలుసు.
2011 లో పోలీసులు వీళ్ళ మీద కేసులు పెట్టి, వీళ్ళలో ఒకరిని అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టారు. అప్పుడు కొన్నిరోజులు వీళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఈ సమయంలో నేను రమాబాయి కాలనీ లో జరిగిన సంఘటనల ఆధారంగా దళితుల మీద జరుగుతున్న అత్యాచారాల మీద “జై భీమ కామ్రేడ్” అనే సినిమా పూర్తి చేసాను. అందులో కబీర్ కాలా మంచ్ గురించి కూడా చూపించడం జరిగింది. ఆ సినిమా ద్వారా ప్రజలకి వీళ్ళ గురించి తెలిసింది. Civil Society నుంచి మద్దతు దొరుకుతుండటంతో వీళ్ళు అజ్ఞాతం నుంచి బయటికి వచ్చి స్వచ్చందంగా లొంగిపోయారు. మేము మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము. ఒకటి రెండు నెలల్లో జైల్లోంచి బయటపడి మిగతా కళాకారుల్లాగే ప్రదర్శనలు ఇచ్చుకోవచ్చు అనుకున్నాము. కానీ ఇప్పటికీ వీళ్ళలో ముగ్గురు జైల్లోనే ఉన్నారు.
ఎవరైతే రోహిత్ వేములని దేశద్రోహి అన్నారో వాళ్ళే ఇప్పటికీ శీతల్ ని కూడా దేశద్రోహి అంటున్నారు. తను ఇచ్చే ప్రదర్శనలని అడ్డుకుంటూనే ఉన్నారు.”
ప్రశ్న: నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది హిందుత్వవాదులు, మనువాదులు ఉన్నారు. వాళ్ళు రకరకాల వాదనలు చేస్తారు. వాటిని ఎలా counter చెయ్యాలి?
ఆనంద్: “వాళ్ళ వాదనలకి వ్యక్తిగతంగా సమాధానాలు చెప్పడం అన్నది అంత ఉపయోగకరం కాదు. ఎందుకంటే 5, 6 ఏళ్ల వయసు నుంచి చెడ్డీలు వేసుకుని శాఖలలో పెరిగిన వాళ్లకి ఆ భావజాలం మెదడులో నిండిపోయి ఉంటుంది. అటువంటి వాళ్ళ మెదడులోకి కొత్త ఆలోచనలు ఎక్కించడం అనేది దాదాపు అసాధ్యం. దానికి బదులు మనం తటస్థంగా ఉన్న మామూలు జనంతో మాట్లాడితే మంచిది. మామూలు జనం దేశానికి ఏదో ఆర్థికంగా మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో వాళ్ళని సమర్థిస్తున్నారే తప్ప వాళ్ళ మతతత్వ భావజాలాన్ని సమర్థించి కాదు. ఇప్పటికీ తటస్థంగా ఉన్న జనమే ఎక్కువ. వాళ్ళతో మాట్లాడి విషయాలు విడమర్చి చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.”
శీతల్: “కొంచం తేలిక భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. Ideology ని Ideology తోనే ఎదుర్కోగలం. ఎందుకంటే అన్నిటికీ మూలం Ideology లోనే ఉంటుంది. మనల్ని అణిచివేసే వాళ్ళకి కూడా ఒక Ideology ఉంటుంది. వాళ్ళు వాళ్ళ Ideology ని ముందుకు తీసుకువస్తుంటే, దానిని ఎదుర్కోగల ఒక counter Ideology ని నిలబెట్టడం మనం చెయ్యాల్సిన పని. వాళ్ళ Ideology చెప్పే ప్రతి విషయాన్ని తిప్పికొట్టగల సత్తా ఉన్న Ideology లు మనకు తయారుగానే ఉన్నాయి. వాటిని బాగా అధ్యయనం చేసి, బలపరిచి, ప్రచారం చెయ్యడం ద్వారానే వాళ్ళ Ideology ని అడ్డుకోగలము.”
ఆనంద్: “అంతే కాకుండా, మన దేశంలో చాలా అద్భుతమయిన Rationalist Tradition ఉంది. ఉదాహరణకి బుద్ధుడు, చార్వాకుడు తో మొదలు పెట్టొచ్చు. దానిని మనకి స్కూళ్ళలో కాలేజీలలో నేర్పించడం లేదు అంతే. నేడు చరిత్రని తిరగరాసే ప్రయత్నాలని మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మనం ఒక విచిత్రమయిన సందర్భంలో ఉన్నాము. దేశంలో మధ్య యుగాల భావజాలం, so called Free market economy రెండూ ఒకే సారి నడుస్తున్నాయి.”
ప్రశ్న: ప్రగతిశీల (Progressive) వాదులని అందరినీ Anti-Nationalist లు అని ముద్ర వేసి Corner చేస్తున్నారు. దీనిని ఎలా ఎదుర్కోవాలి?
ఆనంద్: ఇది చాలా విస్తృతమయిన కుట్రలో భాగంగా జరుగుతోంది. మామూలు జనానికి రచయితలు, కవులు, కళాకారులు, విద్యార్థుల పట్ల అవిశ్వాసాన్ని కలుగజేసి తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం ఇది. ఎవరు ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నారో ప్రజలకి అర్థమయ్యేట్టు చెప్పడం ద్వారానే దీన్ని అడ్డుకోగలం.
శీతల్: ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. “ఎవరైతే దేశాన్ని కులాల వారీగా, మతాల వారీగా, జాతుల వారీగా విభజించాలి అనుకుంటున్నారో వాళ్ళు తమని తాము దేశభక్తులమని చెప్పుకుంటున్నారు. ఎవరైతే కులాలు పోయి, మత భేదాలు పోయి, జాతి వివక్ష పోవాలి అంటున్నారో వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు.” ఈ తేడా మనం బాగా అర్థం చేసుకోవాలి.
ముగింపుగా ఆనంద్ పట్వర్ధన్ ఇలా అన్నారు. “మన దేశం ఫాసిస్టు దేశం అని నేను అనను. కాని ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీనిని మనం ఆపాలంటే మనం చాలా విస్తృతంగా Alliances చేసుకోవాలి. సంకుచితమయిన భావజాలాలో ఇరుక్కుని దీన్ని సాధించలేము. అంబేద్కర్ వాదులు, మార్క్స్ వాదులు, గాంధీ వాదులు ఎవరైనా సెక్యులర్ భావాలు ఉన్నవాళ్ళు, మానవ విలువలని సమర్ధించేవారంతా ఒక్కటవ్వాలి.”
శీతల్ మాట్లాడుతూ.. “నేను నా పాటల్లో కుల వ్యవస్థని అర్థం చేసుకోవాలనీ, కుల వినాశనం జరగాలనీ విరివిగా చెప్తుంటాను. తుపాకి ద్వారా వ్యవస్థని మార్చవచ్చు అని Dogmatic communist లు, నక్సలైట్లు అనుకుంటారు. కాని హింసకి సమాధానం హింసతో ఇవ్వలేము. ఒక మనిషిని చంపడం ఏ సమస్యకి పరిష్కారం కాదు. రాజ్య హింస, నక్సలైట్ హింస, ఫాసిస్టు హింస.. ఏ హింసయినా ఒక్కటే. దానిని మనం వ్యతిరేకించాల్సిందే.”
ఈ మొత్తం చర్చని ఈ కింద విడియోలో చూడవచ్చు.
కొసమెరుపు:
లమాకాన్ నిర్వాహకులు మాట్లాడుతూ ఇలా అన్నారు. “నిన్న నన్ను పోలీస్ స్టేషన్ కి రమ్మన్నారు. మీ దగ్గర మావోయిస్టుల ప్రోగ్రాము ఏదో జరుగుతోందట కదా అని C.I. నన్ను అడిగారు. వాళ్ళు ప్రజల గీతాలు పాడతారు అని చెప్పాను. “వాళ్ళు కబీర్ పాటలు పడతారు కదా? వాళ్ళు ముస్లిములు కదా? అసలు ఇలాంటి లెఫ్టిస్టుల ప్రోగ్రాములు మీరు ఎందుకు పెడతారు లమాకాన్ లో?” అని అడిగారు. నేను కూడా లెఫ్టిస్టునే అని చెప్పాను. వాళ్లకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్ లో ఉన్న భగత్ సింగ్ ఫోటో చూపించి ఆయన కూడా లెఫ్టిస్టే అని చెప్పాను. ఇదిగోండి ఇప్పుడు కూడా పోలీసులు బయటే ఉన్నారు. లోపలికొచ్చి టీ తాగుతూ పాటలు వినమని చెప్పాను. రాలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.. We are actually under a fair amount of attack. It’s coming from everywhere, not just from a couple of parties we are talking about.”
శీతల్ పాడే పాటల లోని గంభీరత్వం వేదిక అంతా ఆవరించి ఉండగా, శీతల్ గారి అబ్బాయి – రెండేళ్ల బుడత – స్టేజీ మీద ఆడుకుంటూ, అటూ ఇటూ తిరుగుతూ, అమాయకంగా నవ్వుతూ ఉంటే… రాబోయేది పసి పిల్లల ప్రపంచమే అనే ఆశ కలిగింది.
*
Lamakaan Website – www.lamakaan.com
Anand Patwardhan website – www.patwardhan.com
Sheetal Saathe Wikipedia page – https://en.wikipedia.org/wiki/Sheetal_Sathe
తాజా కామెంట్లు