నాకు నచ్చిన చిత్రం: జయభేరి

‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యా కుచద్వయం; ఏక మాపాత మధురం అన్యదాలోచనామృతం.’ సంగీతం చెవిన పడినంతనే మధురం. సాహిత్యం అలా కాదు. ఆలోచిస్తే అమృతం. ఆలోచింపచేసే దే సాహిత్యం.” అని అంటారు దాశరధి రంగాచార్యులు గారు తమ ఋగ్వేద పరిచయ పుస్తకంలో. సినిమా అనేది- ఒక కళ. నటన, నాట్యము,  సంగీతము, సాహిత్యము మరియు దృశ్యము- సమపాళ్ళలో మేళవించి చెక్కిన శిల్పమే, ఈ దృశ్య కావ్యము. తెలుగు చలనచిత్ర స్వర్ణ యుగములో అజరామరమైన చిత్రాలు అందించినవారిలో శ్రీ పి. పుల్లయ్య ఒకరు. వందల చిత్రాలకు కధా, మాటలు, పాటలు సమకూర్చి, తన పదునైన సంభాషణలతో, ప్రేక్షకుల గుండె లోతులను తట్టినవాడు ఆచార్య ఆత్రేయ. ఒక రచయితగా, సినీ కవిగా, మాననీయ వ్యక్తిగా, అంతకంటే అందరిచే గురువుగా మన్ననలందుకున్న ఒకే ఒక వ్యక్తి, శ్రీ మల్లాది రామసృష్ణశాస్త్రి గారు. మేటి సంగీత దర్శకులలో తలమానికమైన సంగీత రసగుళికలు అందించినవారు, శ్రీ పెండ్యాల నాగేశ్వరరావుగారు. ఈ ఉపోత్ఘాతమంతా ఎందుకంటే- ఈ అందరి మహామహుల అనితర సాధ్యమైన సాధనవల్ల, 1959లో శారదా ఫిలిమ్స్ పతాకంపై, శ్రీ వాసిరెడ్డి నారాయణరావు/ ప్రతిభా శాస్త్రి గార్ల నిర్మాణములో రూపొందుకున్న మహత్తర సంగీత, సాహిత్య , సందేశాత్మక దృశ్యకావ్యం, జయభేరి.

 

క్లిష్టమైన ఇతివృత్తంతో కొన్ని చిత్రాలు, ఇతివృతాలు ప్రధానంగా కొన్ని చిత్రాలు వచ్చాయి. మనకు ప్రేమ కథలు, కులాంతర విహాహాలు అరుదు కాదు. కవుల, కళాకారుల జీవితము, మతము, ఆచారాల కథనము క్రొత్తవి కావు. కాని వీటన్నిటిని రంగరించి, సంగీత సాహిత్యాలను మేళవించి, వైవిధ్యంగా, కష్టతమమైన అంశాలను అతి మెళుకువగా విశ్లేషించిన చిత్రాలు బహుకొద్ది. ఆ కోవలో ప్రజలను ఆలోచనాపరులను చేస్తూ, కళల మరియు మానవ పరమావధిని జనరంజకంగా చెప్పి, సంస్కరణకు ఉద్యుక్తులను చేసే మకుటాయమానమైన సందేశాత్మక చిత్రం, ‘జయభేరి’. ఆత్రేయ తెలుగువారికి అందించిన మరొక కావ్యం, ఈ జయభేరి.

ఒక సంగీత తపస్వికి, ఒక మహత్తమమైన గురువుకి ఆలోచనాసరళిలో తేడాలుండవచ్చు. ఆ విభేదము మనుషుల, మనసుల మధ్య ఈర్శ, ద్వేషాల కతీతమై, కళ పరమావధికి, దాని భవితకు చెందినదైతే, దాని పర్యవసానము ఏమిటి? కళ ప్రయోజనం, విద్వత్ సభలలో ప్రదర్శించి, పెద్దలను మెప్పించుటయే పరాకాష్టయని ఒకరు, జన సామాన్యానికి దూరమైన కళ, సంకుచితమై, సమసిపోతుందని, కళ బహుజన హితము, ప్రియము కావాలని తపించే వారొకరు.

జయభేరికి ముందూ, తరువాత కూడా ఎన్నో సంగీత, సాహిత్య, నాట్య పరమైన చిత్రాలు వచ్చాయి. రావచ్చు కూడా! ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ చిత్రంలోని ఒక సన్నివేశాన్నో, లేక ఒక అంశాన్నో తీసుకొని, మరిందరు చిత్రాలు తీశారేమో కానీ, ఆ ఆదర్శాన్ని ప్రతిబింబించలేదు . అంతేకారు, సంగీతము, సాహిత్యము, అభినయము సమపాళ్ళలో పోటీపడి, తమ సత్తా చాటుతూ సమ్మిళితమై, ఆనందముతో పాటు, ఆలోచనామృతాన్ని కలిగించిన తీరు నాటికి, నేటికి జయభేరి జయభేరియే! మధురమైన సంగీతముతోపాటు, మెదటికి పదునుబెట్టే మాటలు, పాటలు మనుషులను ఆలోచింప చేస్తుంది. మతము, ఆచారము, సాంప్రదాయము, ఈర్ష, అసూయలు – మానవత్వాన్ని విడిచి, మరిచి విజృంభిస్తే – మంచికి, మనసుకి, కళకి మనుగడ కరువు అవుతుందని కనులముందు ప్రత్యక్ష పరుస్తుంది.

పెండ్యాల నాగేశ్వరరావు గారు చక్కని శాస్త్రీయమైన బాణీలు కూర్చటంతోపాటు, కన్నడ మరియు చక్రవాక రాగాలను మిళితంచేసి, సృష్టించిన ‘విజయానంద చంద్రిక’ రాగంలో మల్లాది వారి సాహితికి మన ఘంటసాల ప్రాణము పోయగా, అక్కినేని అద్భుతంగా అభినయించిన పాట, ‘రసిక రాజ తగు వారము కామా’. గురు శిష్యుల సరళిని మమేకం చేస్తూ, పండిత పామరుల ప్రశంసలు పొంది, సినీ వినీలాకాశంలో ఒక తారగా నిలిచిపోయింది. ఈ ఒక్కపాటపై శ్రీ సత్యనారాయణ వులిమిరి గారు ఆరు పేజీల వ్యాసము వ్రాశారు. ఆనాటి మేటి గాయకులు: ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ మరియు రఘురాజ్ పాణిగ్రాహి కలిసి ఆలాపించిన, మల్లాది వారి, ‘మది శారదా దేవి మందిరమే’ మరొక అనితర సృజన. విజ్ఞుల అభిప్రాయంలో సంగీత-సాహిత్యపరంగా తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు సృజించబడిన మూడు అగ్రతమమైన పాటలలో, ఈ రెండు పాటలను ఉదాహరిస్తారంటే (మూడో పాట ‘జగతేకవీరుని కథ’ లోని ‘శివశంకరి శివానందలహరి’), జయభేరి అందుకున్న శిఖరాలేమిటో మరి నొక్కి చెప్పవలసిన అవసరం లేదేమో!

కధాగమన ప్రస్థానంలో, మూర్ఖుల ఛాందసాన్ని నిరసిస్తూ మనసులను నిలదీసే ఆత్రేయ సమయానుచిత వాదనకు, మహత్తర సందేశాన్ని జోడించి మహాకవి శ్రీశ్రీ అందించిన ‘నందుని చరితము వినుమా’ పాట ఒక కలికితురాయి. దేవుని చూడాలనే ఓ నిస్సహాయ చిన్నవాని ఆక్రందనకి, మూగబోయిన గొంతుని సవరించి, ఆలయాలలోనే దేవుడు లేడని, నందునికి మోక్షమిచ్చే శివుడున్నాడని, తన పాటతో అండగా నిలిచే అద్భుత అక్కినేని నటన మనముందుయించి, పుల్లయ్యగారు మన కంట కన్నీరు కురియించ, దీనికి మరి ప్రతి లేదు! ఈ పాటను, కుల నిర్మూలన ప్రచారానికై, ఆనాడు ప్రభుత్వము 16యమ్ యమ్ ప్రింట్లు తీసుకొన్నారని అంటారు పులగం చిన్నారాయణగారు తమ ‘ఆనాటి ఆనవాళ్ళు’ పుస్తకములో.

పెండ్యాల నాగేశ్వరరావు గారు అందించిన మరికొన్ని ఆణిముత్యాలు:

 

  • రాగమయి రావే.. అనురాగమయి రావే (మల్లాది)
  • సవాల్ సవాల్ అన్న చిన్నదానా.. సవాల్ పై సవాల్ (మల్లాది)
  • నీవెంత నెరజాణనౌర (మల్లాది)
  • సంగీత సాహిత్యమే మేమే నా శృంగార (మల్లాది)
  • నీ దాన నన్నదిర, నిన్నే నమ్మిన చిన్నదిర (మల్లాది, చిత్రంలో లేదు)
  • యమునా తీరమున.. సంధ్యా సమయమున (ఆరుద్ర)
  • ఇంద్ర లోకంనుండి తెచ్చినారయ్యా (ఆరుద్ర)
  • హోయ్ వల్లో పడాలిరా పెద్ద చేప (ఆరుద్ర)
  • ఉన్నారా.. జోడున్నారా.. న్నానోడించే వారున్నారా (కొసరాజు)
  • దైవం నీవేనా, ధర్మం నీవేనా (నారపరెడ్డి, టి‌.ఎం. సౌందర్ రాజన్ పాడారు)

 

ఆచారాల అనాచారానానికి తమ్ముని, కడకు భార్యను కూడా త్యజించవలసిన పాత్రలో గుమ్మడి; తల్లి కాని తల్లిగా తన మరిది భవిత కోసం ప్రాణ త్యాగం చేసే ఇల్లాలుగా శాంతకుమారి; లోన వ్యక్తిత్వానికే విలువయిచ్చే మాననీయ గురువుగా నాగయ్య; ప్రజారంకంగా పాలించే కళా హృదయుడైన రాజుగా ఎస్‌.వి. రంగారావు; నాట్యంతో పాటకు జీవంపోసి, చాకచక్యంతో రాజా దండన నుంచి భర్తను కాపాడుకొనే పాత్రలో అంజలిదేవి; రాజ నర్తకిగా కపట యోచనతో ఒక తోటి కళాకారుని జీవితాన్ని కడతెర్చే కరకు పాత్రలో రాజసులోచన, మతం కోసం మానవత్వాన్ని పణంగా పెట్టె రాజగురువు పాత్రలో ముక్కామల, మనకు మరపురాని అనుభూతిని కలిగించారు. మరియు రమణారెడ్డి, రేలంగి, చదలవాడ, సూర్యకాంతం పోటీపడి, అత్యుత్తమ నటన అందించన ఈ చిత్రం, మీరు చూసివుంటే మరొక్కమారు చూడండి, లేకపోతే మీరు తప్పక చూడవలసిన చిత్రాల జాబితాలో ముందుంచండి.  ఈ విశ్లేషణని ముగించడం చాలా కష్టమనిపించింది. ఆలోచించగా, నాకు కనిపించిన ఈ Lancelot Hogben మాటలతో సశేషం (from his book ‘Mathematics for the Million’):

“Our studies in Mathematics show us that whenever the culture of a people loses contact with the common life of mankind and becomes exclusively the plaything of a leisure class, it is becoming a priestcraft. It is destined to end… To be proud of intellectual isolation form the common life of mankind and to be disdainful of the great social task of education is as stupid as it is wicked. It is the end of progress in knowledge. History shows that superstitions are not manufactured by the plain man. They are invented by the neurotic intellectuals with too little to do.”

ఆలాగునే యుగాల పరిణామములో, మహర్షుల తపో యజ్ఞములతో, సకల జీవకోటి శాంతి కోసం- ఆవిర్భవించిన మన వేదాలు, ధార్మిక వర్తన, సాహిత్యము, సంగీతము, ఇతర కళలు ఈనాడు సామాన్యునికి, యువతరానికి ఎంత చేరువలో ఉన్నాయి? వాటిని భూమార్గాన్ని పట్టించే భగిరధ ప్రయత్నము, ఆలోచించండి, ఎవరి చేతిలో ఉందో?

*