రెటమతం గురించి…ఒక  సంభాషణ

 

 

రాణీ శివశంకర శర్మ

రాణీ శివశంకర శర్మ

కుడి ఎడమైతే నష్టమేమీ లేదు. ఎడమ కుడి అయినా కొంప మునిగేదేమీ లేదు. ఒక బ్ర్రాహ్మణుడి మరియూ అబ్రాహ్మణుడి లేక సగం భ్రాహ్మణుడి సంభాషణ నదీ సముద్రాల సంగమం కావొచ్చు. అంటే నది సముద్రంలోకలిసిపోతుందనే అర్థమేమీ కాదు. అది అంతఃస్రవంతిగా తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. సంగమాలు ప్రళయాలు కావు కదా. అలాగే ఒక రెట మతం లేక పూర్తి ఎదురుమతంగా భావించబడినదే శుభ శకునంగా పరిణమించవొచ్చు. అలాంటి శుభ శకునమే ఇస్లాం అంటాను నేను.

ఇస్లాంని టెర్రరిరిజానికి పర్యాయ  పదంగా మార్చేసిన కాలంలో- ఇస్లాంకి, భరత ఖండపు సంస్కృతులకి జరిగిన వివాహ ఫలితంగా జన్మించినదే సూఫీయిజం. సంగమాలను మనం పూర్తిగా నిర్వచించలేకపోవొచ్చు. అవి సహజంగా సంభవిస్తాయి. వాటి పుట్టుక తర్వాత వాటిని మనం నిర్వచిస్తాం. అది ప్రణాళిక ప్రకారం జరిగేది కాదు. అందుకే ఆ సంగమాలని మనం అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ విఫలమవుతాం.

నిజమే, ఇస్లాం ఎదురు మతమే. దాని ప్రకారం ప్రకృతీ, దేవుడూ వేరువేరు. అవి ఎప్పుడూ, ఎక్కడా కలవవు. కానీ భారతీయ సంస్కృతులలో పాంథీఇజానికే పెద్ద పీట. అంటే దేవుడు సృష్టిగా అవతరించాడన్న మాట. సృష్టే దేవుని మొదటి అవతారం. అవతార భావన దీనికి కొనసాగింపే. కానీ ఇస్లాంలో అవతారాలే లేవు. ఇంకా క్రైస్తవం నయం. దైవ కుమారుడు అవతరించాడు కదా! నేనూ, దేవుడూ ఒకటేనని అతడు చాటుకున్నాడు. దీనిలో అద్వైతం ఉందని వివేకానందుడు అన్నాడు. యూదు, ఇస్లాం మతాలని ఫక్తు చాందస మతాలుగా నిర్వచించాడు కూడా. నిజమే, క్రైస్తవానికీ, అద్వైతానికీ, హిందూ అవతార భావనకీ పోలిక సాధ్యమే. కానీ ఇస్లాంతో ఇలాంటి పోలిక ఏమీ లేదు. ఇస్లాం ఎదురు మతమే. రెట మతమే. కానీ ఇస్లాంతోటే భారతీయ సంస్కృతి దాంపత్యం నెరపింది. చలం బ్రాహ్మణ స్త్రీలు ముస్లీం పురుషులతో ప్రణయ కలాపం నెరపడమే కాదు, ప్రాచీన సంస్కృత పండితుడు, అలంకార శాస్త్రవేత్త, జగన్నాధ పండిత రాయలు ఒక ముస్లీం స్త్రీని వివాహం చేసుకొని ప్రేమ కవిత్వం రాసాడు. వెంకటేశ్వర స్వామి కూడా అంతే.

భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయన్నట్టుగా ఉందీ కథ. సైద్ధాంతికంగా చూసినపుడు ఇస్లాం నుంచీ సూఫీయిజం వరకూ జరిగిన పరిణామం ఇటూవంటిదే. “అనల్‍హక్” (అహం బ్రహ్మాస్మి) అన్నందుకు ఒక సూఫీ యోగిని ముస్లీం మత పెద్దలు చంపేసారు ( దీ్నినే మళయాల రచయిత వైకం మహమ్మద్ బషీర్ కథగా రాసాడు).  మొగల్ రాజ వంశీయుడు, దారాషికోహో ఉపనిషత్తులని తురక భాషలోకి అనువాదం చేసి స్వమతం వారిచేత, సకుటుంబీయుల చేత వివక్షకు గురయ్యాడు. అంటే ముస్లీంలు తిరుగుబాటు జెండా ఎగురవేసి ఇతర సంస్కృతులతో సంగమించడానికి ఉద్యమించారు. అంటే దూరంగా ఉండిపోవల్సిన ఇస్లాం దగ్గరైంది. దగ్గర కావల్సిన క్రైస్తవం దూరమైంది. ఈ చరిత్రని ఎందుకు మరుగు పరుస్తారు? మనుస్మృతిని ప్రేమించేవాళ్ళు మనుస్మృతి ఏమి  చెప్పిందో గ్రహించాలి. కులాల, వర్ణాల నిరంత సాంకర్యం గురించి మను స్మృతి వేనోళ్ళ చాటింది. భారతీయ సంస్కృతులు చాటుతున్నది కూడా సాంకర్య చరిత్రే, సంగమ చరిత్రే. అది కుడి ఎడమల సంగమం. ఇస్లాంతో సోకాల్డ్ హిందూ దేవతలు, హిందూ సంస్కృతి జరిపిన ప్రణయ కలాపం ( “హిందూ” అనే పదాన్ని స్పష్టత కోసం వాడుతున్నాను, అంతే).

ఈ ఆలోచనలూ, సందర్భమూ ఇట్లా పెనవేసుకొని నడుస్తూ ఉన్నప్పుడు, ఈ ఆలోచనలు మరొకరితో పంచుకోవొచ్చు కదాని నాకు దగ్గరలో ఉన్న అవ్వారి నాగరాజుని మా ఊరికి రమ్మన్నాను.  ఇంట్లో కూడా తోడుగా ఎవరూ లేరు. తను ఫోన్ చేయగానే రావడానికి అంగీకరించాడు. కాసేపు సాధారణ మర్యాదలు అయిపోయాక మాట వెంట మాట  కలిసాక,  తను మామూలుగానే, మీరు రాతల్లో ఎక్కువగా ముస్లీం అనుకూలతని కనపరుస్తుంటారు కదా ఏమిటీ కథ అని అడిగాడు. అసలే ఇది ఒక పక్క హిందూ పాసిస్ట్ వాదులూ, అన్నింటినీ ఒకే తక్కెడతో సరిచూడగల  నాస్తికపు పెద్ద మనుషులూ విరుచుక పడుతున్న కాలం కదా.

వెంటనే నేను నాస్తికుల సంగతి పక్కన పెట్టండి. వాళ్ళు హిందూత్వ సిద్ధాంత కర్త వీర సావర్కర్ మానస పుత్రులు. ఆ సావార్కారేమో, హిట్లర్ నోట్లో నుండీ ఊడి పడ్డవాడు. అంటే ప్రొటెస్టంట్ క్రైస్తవపు జాతీయతా వాదం నుంచి. ఆ జాతీయత తీసుకొచ్చిన జాతి విధ్వేషం నుంచీ. ఈ పెద్ద మనుషులకు దేవుడూ లేడూ, ప్రకృతీ లేదూ అన్నాను. వాళ్ళు వొట్టి సంకుచిత మానవ కేంద్రక వాదులు

అన్నింటికన్నా ముఖ్యంగా ఇస్లాం కలోనియలిష్ట్ మతం కాదు అన్నాను. అదేంటో చెప్పరాదూ అన్నాడు తను.

నేను మానవసమాజంలో సర్వ సమగ్రమైన, హింసా రహితమైన దేన్ని గురించీ మాట్టాడం లేదు. స్వర్ణ యుగాల గురించి కూడా ప్రస్తావించడం లేదు. ఒకే మాట చెబుతున్నాను. ఇస్లాం కలోనియలినిజం కాదు అని మాత్రమే అని గట్టిగా అన్నాను.

ఈ దేశంలో ఇస్లాం నడక కూడా శైవ, వైష్ణవాల్లాగే. అవి కొట్టుకున్నాయ్. చంపుకున్నాయ్. తర్వాత కలిసి కొత్త రూపు ధరించాయి. ఇస్లాం కూడా ఇక్కడి సంస్కృతులతో అటువంటి సంబంధమే నెరిపింది. నిజానికి, శైవ వైష్ణవాల పుట్టుకకి మూలం ఇస్లామే.  థీయిజం, ఒకే దేవుడూ అనే భావాలు ప్రాచీన భారత దేశంలో కాళ్ళూనుకోలేదు. ఉపనిషత్తుల్లో కూడా ఈ భావాల ప్రసక్తి తక్కువ. శ్వేతాశ్వేతతరోపనిషత్తులో ఈ భావాలు కొంత వరకు ఉన్నాయని, అది ఆధునికమైనదని ఇండాలిజష్ట్, ప్రిట్స్ స్టాల్ చెప్పారు (వేదాస్). కనుక ఇస్లాం రాక  భారతీయ సంస్కృతిని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. కేవలం మతాంతరీకరణల గురించి ఎందుకు మాట్లాడతారు? ఇస్లాం కొత్త మతాల ఆవిర్భావ వికాసాలకు కారణమైంది. అందువల్ల నేడు హిందూయిజం అని చెబుతున్న దాంట్లో ఇస్లాంది చాలా భాగమే ఉంది. అందువల్ల హిందూ వాదులు వాస్తవికంగా అయితే దారాషికోహోకు ఉత్సవాలు జరపాలి. ఇస్లాంకు సాంస్కృతికంగా  ఋణపడి ఉన్నామని బహిరంగంగా ప్రకటించాలి. కానీ హిందూ వాదులు చేస్తున్న దేమిటి? ఇస్లాంని రెటమతమనీ, ఎదురు మతమనీ ఉగ్రవాదమనీ నిందించి తమ మూలాల్ని తామే చెరిపి వేసుకుంటూ మహా పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. వాళ్ళు రూట్స్ కోసం అన్వేషించాలి అన్నాను.

అయితే మీరు ఇస్లాంని కౌగిలించుకొని, క్రిష్టియానిటీని సైద్ధాంతికంగా ఎందుకు విమర్శిస్తారు? రెండింటిలోనూ విస్తరణ వాదం ఉంది కదా? అసలు ఏ మతానికైనా విస్తరణ కాంక్ష సహజమే కదా. క్రిస్టియానిటీ విషయానికే వొస్తే అది దళితులకు మేలు చేసిందని అంటారు కదా  అంటాడు తను.

అసలు మనిషే విస్తరణ వాది. మనిషి ప్రకృతినీ, ఇతర జీవులని ఎక్స్ ప్లాయిట్ చేస్తూ విస్తరించాడు. విస్తరణ వాదం దానికదే కలోనియలిజం కాదు. విస్తరణ వాదంలో ఆధిపత్యం ఉంటుంది. కానీ కలోనియలిజంలో అదనంగా ఙ్ఞానాధిపత్యం ఉంటుంది. క్రైస్తవం కలోనియలిజంగా చారిత్రక పాత్ర నిర్వహించింది. వలస క్రైస్తవం నిర్వహించిన ఆ చారిత్రక పాత్ర మీదే నా వ్యతిరేకత. పదకొండవ శతాబ్ధికి చెందిన ముస్లీం పండితుడు అల్ బెరూని బ్రాహ్మణుల సంకుచిత దృక్పథాన్ని విమర్శించాడు. భరత ఖండంలోని అనేక లోపాల్ని ఎత్తి చూపాడు. వలస క్రైస్తవులు చేసినది మాత్రం ఇది కాదు. వాళ్ళు ఇతర సంస్కృతులని ద్వేషించలేదు. నిర్వచించారు. తమ కంటే హీనమైన సంస్కృతులుగా, తమకన్నా అనాగరికమైనవిగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాలని శాస్త్రాలని బూకరించారు. చరిత్రని, మతాన్ని కలగాపులగం చేసారు. దీని నుంచే ముస్లీం వ్యతిరేకత పుట్టింది. దాన్నే హిందూవాదులు స్వీకరించారు. అందుకే హిందూ వాదులు ప్రచ్చన్న క్రైస్తవులు.

“డెవిల్ ఆన్ ది క్రాస్”- పేరుతో ఆఫ్రికన్ రచయిత, గుగీ ఒక నవల రాసాడు. దాన్ని మనవాళ్ళు  “మట్టికాళ్ళ మహారాక్షసి” అని అనువాదం చేసారు. వలస వాద అభివృద్ధి పట్ల ప్రేమే దానికి కారణం. ఆయనే ఇంగ్లీషు భాషాధిపత్యాన్ని నిరశించాడు. వలస వాదానికి వ్యతిరేకంగా ఆఫ్రికన్ సంప్రదాయంలో ఒక మాట ఉంది. వాడు ఒక చేత్తో బైబిల్, మరో చేత్తో తుపాకీ పట్టుకొని వొచ్చాడని. కళ్ళు తెరచి చూసేటప్పటికి బైబిల్ మాచేతుల్లో ఉంది. మా నేల మాత్రం వాడి అధీనమైంది. క్రైస్తవ కరుణ క్రూరమైన కరుణ(లాస్ట్ బ్రాహ్మిన్).

దగ్గర కావల్సింది దూరమైందీ- అన్నారు కదా అది ఎట్లా? అని అడిగాడు తను.

ఏ సంస్కృతీ ఏకశిలా సదృశం కాదు. మతాలు కూడా అంతే. క్యాథలిక్ క్రైస్తవాన్ని పరిశీలిస్తే ప్యాగన్ మతాల ప్రభావం కనపడుతుంది. మాతృ దేవతారాధన కూడా కనపడుతుంది.  మన స్థానిక ఆచార సాంప్రదాయాలతో చాలా పోలికలు కనపడతాయి. అందుకే అద్వైత దృష్టీ, అవతార భావన వంటి పోలికలు మన పురాణాలని గుర్తుకి తెస్తాయి. ఆ రకంగా క్రిస్టియానిటీ మనకు దగ్గర. అయితే ఇలాంటివేవీ మనకు ఇస్లాంలో కనిపించవు.  కానీ ఆధునిక కాలంలో సంస్కరణ వాదంగా వొచ్చిన ప్రొటెస్టింటిజం, గ్రంథానికి  ప్రాధాన్యం పెంచి బహుళ కథనాలకి ఆస్కారం లేకుండా చేసింది. మోనోపలీని, జాతీయతా భావం పేరుతో ఇతర జాతి విధ్వేషాన్నీ పెంచి హిట్లర్ మన్నన కూడా పొందింది. ప్రొటెస్టెంటిజం ప్రవక్త, లూథర్ ఉద్యమిస్తున్న రైతుల్ని కుక్కల్లా కాల్చి చంపమన్నాడు. యూధుల్నిదేశం నుంచీ తరిమేయమన్నాడు (రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ థర్డ్ రీక్). ఇదంతా ఆధునిక పారిశ్రామిక పెట్టుబడిదారీ అభివృద్ధి భావజాలంగా పరిణమించింది. మన నాస్తికులూ, హేతువాదులు కూడా ఈయన శిష్యులే. హిందూవాదులని కూడా ఈయన జాబితాలోనే చేర్చవొచ్చు. లిబరల్ ఫాసిస్ట్ దేశమైన అమెరికా ప్రొటెస్టెంట్ దేశమే.  అక్కడ ఒక్క క్యాథలిక్కూ ప్రథాన మంత్రి కాలేదు. కాలేడు. ఈ విషయాన్ని కంచె ఐలయ్యగారు ఒక వ్యాసంలో రాసారు.  ప్రొటెస్టంట్ సహజాత ముస్లీం విద్వేషానికి  అమెరికా ఇప్పుడు ప్రచార కర్త అయి కూర్చుంది. ఈ ప్రొటెస్టంట్లని అనుసరిస్తూనే ఆర్య సమాజం పుట్టింది. బ్యాక్ టూ బైబిల్ అని వాళ్ళంటే, బ్యాక్ టూ వేదాస్ అని దయానంద సరస్వతి అన్నాడు. వీరి  ముస్లీం విద్వేషం కూడా అక్కడ నుండి వొచ్చిందే. ఈ ప్రొటెస్టంట్ భావజాలమే చివరికి హిందూ ఫాసిజంగా రూపు మార్చుకొంది. ప్రొటెస్టెంట్ క్రైస్తవం, జినోయిజం, హిందూయిజం ఇప్పుడు చెట్టాపట్టాలు వేసుకొని విహరిస్తున్నాయి. జాతి విధ్వేషం వీటి సాధారణ ధర్మం.

అయితే మరి ఇస్లాం ఉగ్రవాదం మాటేమిటి? అని తన ప్రశ్న

ఉన్నది అమెరికన్ ఉగ్రవాదమే. వేదికమీద ఏం జరుగుతున్నది కాదు. తెర వెనుక జరిగేదే ముఖ్యం. సద్దాం హుస్సేన్ సంగతే తీసుకోండి. ఆయనని అమెరికా మీడియా గొప్ప ప్రజాస్వామిక వాదిగా సెక్యులరిస్టుగా, సంస్కర్తగా ఒకప్పుడు కీర్తించింది. ఒక ఉదయాన హఠాత్తుగా ఉగ్రవాదిగా చిత్రించింది. ఇరాక్‍ని ధూర్త దేశం అంది( మీడియా కంట్రోల్- నోం చాంస్కీ).

(రాణీ శివశంకర శర్మ అనే బ్రాహ్మణుడు – జంధ్యం వేసుకునే శూద్ర కులపు అవ్వారి నాగరాజు మాటా మంతీ)

రోహిత్ వొక సాంస్కృతిక ప్రశ్న

 

-రాణీ శివశంకర శర్మ
~

రాణీ శివశంకర శర్మ

ఈనాడు మనం యేది మాట్లాడాలన్నా “రోహిత్” నామస్మరణతో మొదలుపెట్టాల్సివస్తుంది. అతడొక గాఢమైన స్మృతిగా మారిపోయాడు.దళిత సాంస్కృతిక స్మృతిగా మారిపోయాడు.

నిజానికి విద్యార్దుల మరణాలు మన రాష్ట్రంలో మరీ కొత్తేమీ కాదు. అందులో దళిత విద్యార్దుల మరణాలు కూడా సర్వసాధారణమై పోయాయి. సాధారణంగా ఆత్మహత్యలు మౌనంలో ముగుస్తాయి. అవి తీవ్ర పరాజయ రూపంగా ఉంటాయి. కానీ రోహిత్ మరణం వట్టి ఆత్మహత్యేనా?
కానే కాదు. అతడి మరణం చీకట్లోకి మౌన నిష్క్రమణగా కాక, అక్షరాలుగా మార్మోగింది. ఆ అక్షరాలు అశక్తతనీ, వుడుకుమోత్తనాన్నీ, ద్వేషాన్నీ వెదజల్లేవి కావు. యీ వ్యవస్థ బోలుతనాన్ని స్పష్టం చేస్తూనే, వొక ప్రత్యామ్నాయ తత్వాన్ని చెప్పి పోయాయి. అందు వల్ల రోహిత్ మరణానికి ఎంతో మంది బతుకు కంటే ప్రాముఖ్యత ఏర్పడింది. అది రోహిత్ మరణాన్నికాక, చాలా మంది జీవించి వున్నామని భ్రమిస్తున్న వాళ్ళు నిజానికి జీవించి లేరని, యిప్పటికే మరణించారని నిర్ధారించింది. కృత్రిమత్వం, స్వాభావికత లోపించడం, ఆత్మ వంచన, పర వంచనల్ని కవితాత్మకం చేసింది.
యిది అగ్ర వర్ణాలకి పెద్ద తలనొప్పి. యెందుకంటే అధికారం ద్వారా, ధన బలం ద్వారా మాత్రమే అగ్ర వర్ణాలు బతికి బట్టకట్టకలుగుతున్నాయి. అవి సాంస్కృతికంగా మరణించాయి. రోహిత్ చనిపోయి, పూర్తిగా మౌనంలోకి జారిపోకుండా అగ్ర వర్ణాల మరణాన్ని నిర్ధారించే శాసనాన్ని లిఖించి పోయాడు. అందుకే అంత అలజడి. యిప్పుడు అగ్రవర్ణాలు పూర్తిగా ఆత్మ రక్షణలో పడిపోయాయి. తమ నైతిక పతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరణించిన వ్యక్తిపై బురద చల్లుతున్నాయి.
నిజానికి అగ్రవర్ణాలు సాంస్కృతికంగా యెప్పుడో స్తబ్ధతకు గురయ్యాయి. అక్షరం వారి దగ్గర నుంచి యెప్పుడో ఎగిరి పోయింది. “నను వరించిన శారద లేచిపోవునే” , అని జాషువా ప్రశ్నించాడు. యిప్పుడా శారద పూర్తిగా వాడలలోనే నివాసం ఉంటుంది. అగ్రహారం వైపు కన్నెత్తి చూడడం లేదు. పూర్వం బ్రాహ్మణులలో, అగ్రవర్ణాలలో ఉన్న గొప్ప కవులూ, మేధావులూ ఇప్పుడూ కరువయ్యారు. యిందుకు తెలుగు సాహిత్యమే మంచి ఉదాహరణ.
దానికి కారణమేమిటి? ధన సంపాదన, అధికార లాలస యివే ప్రధానం కావడం వల్ల అగ్రవర్ణాలు అక్షరంపై మక్కువ వదిలి వేసాయి. అందుకే అక్షరం కూడా వాళ్ళని వదిలేసింది. అగ్రవర్ణాలు నిరక్షరాశ్యులుగా మారిపోయారు. పుస్తకాల పురుగులుగా కాక కంప్యూటర్ పురుగులుగా మారారు. యంత్రాల్లో యంత్రాలుగా మారిపోయారు. అందుకే శ్రీపాద, చలం, విశ్వనాధ, శ్రీశ్రీ, భైరాగి లాంటి కవులూ, రచయితలూ వారి నుండి ఆవిర్భవించడం మానేశారు. హృదయ స్పందన కలిగించే అక్షరాలు వారి నుంచీ అదృశ్యమయ్యాయి.
దీనికి కారణం, బ్రిటీష్ వారి కాలం నుంచీ ఆధునికత వల్ల వచ్చే ప్రయోజనాల మీద దృష్టి  వారిలో అధికమైంది. యెప్పుడైతే ఆ ప్రయోజనాన్ని వారు అంది పుచ్చుకోవడం మొదలు పెట్టారో, ఆ ప్రయోజనాలే వారికి సర్వస్వమై పోయాయి. వారికి సాంప్రదాయకంగా వస్తున్న కళలూ, శాస్త్రాలూ, కవిత్వమూ, వాఙ్మ్ యాల పట్ల ఆసక్తి సన్నగిల్లింది. ముఖ్యంగా బ్రాహ్మణుల పరిస్థితి ఇది.
దీనితో బౌద్ధికంగా,  సాంస్కృతికంగా క్షీణించి పోయిన బ్రాహ్మణులలో అగ్రవర్ణ దురహంకారం మాత్రమే మిగిలింది. అక్షరం వలస పోయింది. బ్రాహ్మణులు నిరక్షరాస్యులుగా మారిపోయారు.
నిజానికి ఆధునికత అక్షరాస్యతను పెంచడంలేదు. నిరక్షరాస్యతను పెంచుతోంది. అక్షరం నిజానికి చాలా గాఢమైనది. అది మౌఖికంగా కానీ, లిఖిత రూఫంలో కానీ గాఢమైన ముద్ర వేస్తుంది. అటువంటి ముద్ర వేసే శక్తిని కోల్పోయినప్పుడు అక్షరం మరణించినట్లే. నిరక్షరాస్యత రాజ్యం చేస్తున్నట్లే.
భాష కేవలం సమాచార సాధనం కాదు. అది కమ్యూనికేషన్ స్కిల్ కాదు. భాష కమ్యూనికేషన్ స్కిల్‌గా మిగిలి పోవడం అంటే నిరక్షరాస్యత వ్యాపించినట్లే.  భాష రక్త ప్రవాహం వంటిది. అది సమాజంలో సంబంధాలను ప్రభావితం చేస్తుంది.
కానీ నేటి కళా రూపాల్ని చూడండి. టీవీలో ప్రోగ్రాములు, సినిమాలు చూడండి. అటువంటి లక్షణమేమీ కనపడదు. యెటువంటి ప్రభావాన్నీ కలిగించకపోవడానికే “వినోదం” అని పేరు. యాంత్రికంగా చూస్తాం, మరచి పోతాం. సినిమాలలో దృశ్యాలూ, పాత్రలూ రిచ్‍గా కనపరచడం రివాజుగా మారిపోయింది. మన దరిద్రపుగొట్టు మొహాల్లో కొద్ది సేపు సంతోషాన్ని పోలిన దాన్ని అది కలుగ జేస్తుంది. మన జీవితంలోని లోపలి బయటి దారిద్ర్యాల్నీ, శూన్యాల్నీ మనం ఈ దృశ్యాల ద్వారా పూరిస్తున్నాం. రోహిత్ ప్రస్తావించిన శూన్యం రోహిత్‍కు మాత్రమే సంబంధించినది కాదు, మొత్తం సమాజానికి సంబంధించింది.
ఈ సమాజం యెటువంటిది? యాంత్రికమైనది, సంపదనీ, అధికారాన్నీ ఆరాధించేదీ, స్పందన శూన్యమైనది, వెరసి నిరక్షరాస్యమైనది.
ఆధునిక యంత్ర నాగరికత విశాల దృక్పథాన్ని పెంచింది అనేది భ్రమ మాత్రమే. నిజానికి అది మనుషులలో సంకుచిత మనస్తత్వాన్ని  పెంచింది. స్థలకాలాలకు సంబంధించిన విశాల దృక్పథాన్ని బలహీనపరిచింది. యిటీవల నోమ్ చాం‍స్కీ అనే అమెరికా మేధావి మాట్లాడ్తూ అమెరికాలో కొన్ని వేల సంవత్సరాల క్రిందట మాత్రమే విశ్వం ఆవిర్భవించిందని విశ్వసిస్తారని అన్నాడు. సుదీర్ఘమైన కాలం గురించి భారతీయ పురాణ గాధలు దిగ్భ్రాంతి కలిగించేట్టుగా ఊహించగలిగాయి. ఉదాహరణకి- బ్రహ్మకాలం. ప్రముఖ సైన్స్ రచయిత కార్ల్ సాగాన్ స్థలకాలాల గురించి భారతీయ పౌరాణిక దృష్టిని కొనియాడారు. రోహిత్ తన చివరి లేఖలో ప్రస్తావించినది యీయన గురించే. అనంత స్థల కాలాల గురించి యీ వైఙ్ఞానిక పౌరాణిక ఊహల వల్లనే తన మరణాన్ని కూడా నక్షత్ర లోకాల్లో అంతులేని గమనంగా ఊహించగలిగాడు. మరణం గురించిన ఆలోచనలు కూడా అతనిలో అంత ఊహాశక్తిని మేల్కొలిపాయి. కానీ ఆధునిక జీవితం సంకుచిత వలయాల్లో తిరుగుతోంది. మానవ అస్తిత్వం యిరుకుగానూ, ఖాళీగానూ తయారుకావడాన్ని రోహిత్ పసిగట్టాడు. అందుకే మనుషులు ప్రకృతిని ప్రేమింఛలేకపోతున్నారనీ, కృత్రిమత్వం పెరిగిపోయిందని బాధపడ్డాడు.
అంబేద్కర్ మనవడు ఆనంద్ తేల్‍తుంబ్డే ఆధునికతలోని మానవ కేంద్రక దృష్టిని విమర్శించాడు. మితిమీరిన సంపద వుత్పత్తి సామ్యవాదానికి దారితీస్తుందన్న మార్క్స్ భావంలోనే ఖాళీ వుందన్నాడు. అధిక వుత్పత్తి అనర్ధదాయకం అన్నాడు. అది ప్రకృతిని నిర్విచక్షణగా కొల్లగొట్టడంగా మారిపోయిందన్నాడు.
పాశ్చాత్య అభివృద్ధి నమూనాపై దళిత బహుజన మేధావుల్లో కూడా సందేహాలు మొదలయ్యాయి. యీ సందేహాలు పురోగతి అనే భావంలోని లోపాన్ని బట్టబయలు చేస్స్తున్నాయి. వెనక్కి తిరిగి దళిత స్మృతులని వెతికి పట్టుకొనవలసిన అవసరాన్ని కర్ణాటక బహుజన మేధావి డి ఆర్ నాగరాజు స్పష్టం చేస్తున్నారు. “పల్లె కన్నీరు పెట్టింది” గేయంలో గోరటి వెంకన్న  కుల వృత్తుల, కుల సంస్కృతుల ప్రాచీన స్మృతుల చప్పుడులో తాను మునిగి, మనని ముంచెత్తాడు.
అగ్ర వర్ణాలు ప్రకృతికీ, సంస్కృతికీ దూరంగా జరిగి పోతుంటే, దళిత బహుజన మేధావుల ప్రయాణం దానికి పూర్తి వ్యతిరేక దిశలో సాగుతోంది. దీన్ని మన అగ్ర వర్ణ మేధావులు కూడా గుర్తించలేక పోతున్నారు. అరిగి పోయిన అభ్యుదయ, నాస్తిక సిద్ధాంతాల్ని వల్లిస్తున్నారు. రోహిత్ సైన్స్ దృక్పథం పరిశీలిస్తే యీ సంగతి స్పష్టమవుతుంది.
రోహిత్ స్టీఫెన్ హాకింగ్‍ని కాక, కార్ల్ సాగాన్‍ని అభిమానించాడు అనే విషయం చాలా ప్రధానమైందని మిత్రుడు నరహరి అన్నాడు. నిజమే, స్టీఫెన్ హాకింగ్ దృక్పథం పూర్తిగా ప్రాగ్మాటిక్. ఐన్‍స్టీన్ నుంచీ కార్ల్ సాగాన్ వరకూ వొక మత పర దృక్పథం కొనసాగుతూ వొస్తుంది. అది స్టీఫెన్ హాకింగ్ దృక్పథానికి పూర్తిగా వ్యతిరేకం. హాకింగ్ యీ ప్రపంచాన్ని సృష్టించిన “గాడ్ ఫ్యాక్టర్” గురించి యిటీవల ప్రస్తావించారు. సైంటిస్టులు వ్యతిరేకించారు, కానీ దాని వల్ల స్టీఫెన్ హాకింగ్‍కి మత పర దృక్పథం ఉందని చెప్పలేం.
అసలు మతపర దృక్పథం అంటే ఏమిటి ? యిక్కడ నేను ఐన్‍స్టయిన్ ప్రతిపాదించిన కాస్మిక్ రెలిజియన్ గురించి ప్రస్తావిస్తున్నాను. విశ్వాన్నీ, ప్రకృతినీ పరిశీలించడంలో మనిషి తన అహాన్ని అధిగమించడం. అది ఐన్‍స్టీన్ ప్రస్తావించిన మత దృక్పథం. కార్ల్ సాగాన్ కూడా కాస్మిక్ రెలిజియన్ గురించి మాట్లాడాడు. మరింత ముందుకు వెళ్ళి హిందూ పురాణాల్లోని స్థలకాల దృక్పథంలోని విశాలత్వానికి దిగ్భ్రాంతి చెందాడు. యిక్కడ సైన్సూ, పురాణమూ యేకమయ్యాయి. అరలు అరలుగా విడిపోయిన మానవ ఙ్ఞానం వొకచోట సంగమించే నదీ సంగమాన్ని కార్ల్ సాగాన్ కలగన్నాడు. రోహిత్ హృదయం కూడా అక్కడనే విహరించింది. కార్ల్ సాగాన్ సహ రచయిత్రి, సహచరి నుంచి రోహిత్ మరణాంతరం అతనికి మద్ధతుగా లేఖ రావడం విధి వైచిత్రి. ఙ్ఞాన మహా సాగరాన్ని మధించడంలో కార్ల్ సాగాన్ చూపిన విఙ్ఞత ఐన్‍స్టీన్ చూపిన దృక్పథానికి కొనసాగింపే. క్రీస్తూ, బుద్ధుడూ వంటి మత ప్రవక్తలూ, రుషుల అంతర్దృష్టి, ప్రయోగాల మీద ఆధార పడిన సైంటిస్టుల దృక్పథం కన్నా గొప్పది అని ఐన్‍స్టీన్ అంటాడు.
“వాట్ షుడ్ బీ”, ప్రపంచానికి వొక లక్ష్యాన్ని మతమే యిస్తుందని ఆయన భావించాడు. మొత్తంగా మతమంటే మనిషి తన అహాన్ని త్యజించి ప్రకృతి ముందు పసిపిల్లవాడిలా నిలబడడం అనే అర్థాన్ని ఐన్‍స్టీన్ ఆశ్రయించాడు. ఙ్ఞానం ఙ్ఞానం కోసమేనన్నాడు. కార్ల్ సాగాన్ ఐన్‍స్టీన్ దృక్పథాన్ని ప్రశంసించాడు. ఆనంద్ తేల్ తుంబ్డే బౌద్ధాన్ని  మానవకేంద్రక దృష్టి నుంచి విముక్తం చేసే దృక్పథంగా కీర్తించినపుడు మతం అంటే దేవుడు, దెయ్యం అతీంద్రియ శక్తి అనే భావాల కంటే విశాలమైన దృక్పథం కనబడ్తుంది.
కానీ స్టీఫెన్ హాకింగ్ దృక్పథం సంకుచితమైనది. దుందుడుకుతనం, విశ్వంలోకి విస్తరించడం అనేవి ప్రాగ్మాటిక్ దృక్పథంలోని ప్రధానమైన అంశాలు.  గ్రహాంతర జీవుల పట్ల భయాందోళనలు కూడా ఆయనకు యెక్కువ.  కారణం దుందుడుకుతనం.  దురాక్రమణ దృక్పథం నుంచే అమెరికా నాగరికత ఏర్పడింది. నాగరికత ఆవిర్భావంలో భాగంగా అనేక జాతులు అంతరించాయి. అలాగే గ్రహాంతర వాసులవల్ల మానవ జాతి కూడా అంతరించవచ్చునన్న భయం ఆయనకి వుంది. అదే సమయంలో దురాక్రమణ, దుందుడుకుతనంలేనిదే మనిషి మనుగడ అసాధ్యమన్న దృక్పథం ఆయనకు ఉన్నాయి. అహాన్ని జయించడం అనే మత దృక్పథం ఆయనలో శూన్యం. విశ్వాన్ని నడిపే అతీంద్రియ శక్తి గురించి మాట్లాడినా ఆయనది మత దృక్పథం అనలేం. ఆయనది పాశ్చాత్య కేంద్రక దృక్పథం. పాశ్చాత్య విస్తరణ కాంక్షకి ఆయన చెప్పే కాస్మిక్ సిద్ధాంతం అద్దం పడ్తుంది. యింక భూమి నివాస యోగ్యం కాదు. వేరే గ్రహాన్ని వెతుక్కోవాలి అనడంలో యీ విస్తరణ కాంక్ష్యే విస్తృత రూపంలో కనబడ్తుంది.
భూమినే తల్లిగా పూజించడం, భూమిని కేంద్రంగా భావించడం వర్ధిల్లిన ప్రాచీన సమాజాల్లో భూమినీ, మానవ సమాజాన్నీ మెరుగు పరచడం యెలా అనే దృక్పథం ఉండేది. కానీ విశాల విశ్వమంతా ఆక్రమించాలనే భావన మనిషిలో మరింత దుందుడుకుతనాన్ని పెంచే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీనికి భిన్నమైనదే విశాల విశ్వభావన. మనిషిలోని యీగోని తగ్గించి, ప్రకృతిని ఆరాధించే స్థితికి తీసుకు వెళ్తుందనే దృక్పథం . యీ దృక్పథమే రోహిత్ దృక్పథం కూడా. రోహిత్, స్టిఫెన్ హాకింగ్‍లా కాక హేతువునీ, కల్పననీ(ఊహనీ) ఏకం చేసాడు. అతనిలో కలలూ, నక్షత్ర లోకాలూ ఐక్యమయ్యాయి.
యింత విశాలంగా, గాఢంగా పరిశీలించిన వ్యక్తిని గౌరవించే స్థాయిలో మన సమాజం లేదు. ప్రాచీన భారతీయ విశ్వ దృక్పథంలోని విశాలత్వం, యిక్కడి మనుషులలోని యిగోని తగ్గించలేక పోయింది. దానికి కారణమేమిటి?
నిజానికి మన సమాజాలు ప్రాచీన సమాజాల కన్నా సంకుచితంగా మారిపోయాయి. పురాణ కథనాలు మనుషుల మీద గాఢమైన ముద్ర వేయగలిగేవి. కుల పురాణాలు కూడా అటువంటి గొప్ప పాత్రని నిర్వహించేవి. నేటి మన కళలు కానీ, చదువులు కానీ పూర్తిగా కృత్రిమత్వాన్ని సంతరించుకున్నాయి. అవి మన దృక్పథాన్ని విశాలం చేసే అవకాశం సన్నగిల్లింది. దీన్నే ఆధునిక నిరక్షరాశ్యత అంటాను.
ప్రాచీన కాలంలో కంటే మనలో సహనం తగ్గిపోయింది. చిందు ఎల్లమ్మ అంటుంది – బ్రాహ్మణ నింద ఉన్నప్పటికీ పూర్వం బ్రాహ్మణులు జాంబపురాణాన్ని చూసేవాళ్ళు. యిప్పుడు మమ్మల్ని తిడుతున్నారంటూ చూడడానికే నిరాకరిస్తున్నారని చిందు ఎల్లవ్వ చెప్పారు. అంటే విమర్శని సహించే శక్తి ఆధునిక
 యుగంలో సన్నగిల్లింది.
టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది చదువుకి అర్థాన్ని మార్చేసింది. భాషని కుదింపజేసింది. అంతిమంగా సంకుచిత దృక్పథాన్ని పెంచింది. నిజానికి, ఆధునిక పూర్వయుగాల్లోని దళితులు నిరక్షరాస్యులు అనే నిర్ధారణ ఆలోచించకుండా చేసిన నిర్ధారణగా కనిపిస్తుంది. కుల వృత్తులూ, కుల విద్యలూ, కుల పురాణాలూ, పటం కథలూ, యింతేకాక దళిత కళాకారుల్లో మాతృభాషని చదవడం, రాయడం వచ్చేవి. అంతే కాదు కఠినమైన సంస్కృత పదబంధాల్ని వుపయోగించేవారు. మీరు ఎప్పుడైనా తెలంగాణా వెళ్ళి చిందు భాగవతుల్నీ, ఢక్కలి జాంబపురాణ కళాకారుల్నీ కలిస్తే వాళ్ళూ ఏ మాత్రం నిరక్షరాశ్యులని పిలవలేమని తెలుస్తుంది. వొక విధంగా చెప్పాలంటే తెలంగాణా దళిత అంతశ్చేతన అనవచ్చు. శుభ కార్యాలు జరపడానికి  మేము బ్రాహ్మణుల్ని పిలవం. యెందుకంటే  మేం చదువుకున్న వాళ్ళం అంటుంది చిందు ఎల్లవ్వ. దళిత జీవితాన్ని నిరక్షరాశ్యతతో నిండిన చీకటిగా వర్ణించడం కుదరదనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే.
తెలంగాణాలో ఢక్కలి మొగిలిని నేను కలిసాను. అతడు అనేదేమిటంటే  అసలు వేదాలు మా దగ్గరే ఉన్నాయి. వాటిని మీ బ్రాహ్మణులు( వశిష్టుడు) దొంగిలించారు అంటారు. అంటే అసలైన ఙ్ఞానం దళితుల వద్దే వుందన్న మాట.
కానీ ఆధునిక యుగం ప్రాచీన సమాజ కథనాల్నీ పురాణాల్నీ వెర్రి పురాణ గాధలుగా తిరస్కరిస్తుంది. కానీ కార్ల్ సాగాన్ శివతాండవంలో విశ్వరహస్యాన్ని చూసాడు. బ్రహ్మ జీవితంలో కాల విస్తృతిని చూసాడు. అంటే ప్రాచ్య పురాణాల్ని ఙ్ఞాన చరిత్రలో ప్రధాన భాగం చేసాడు. అతడే మన రోహిత్‍కి ఆదర్శప్రాయుడు.
హిందూ వాదులు పాశ్చాత్య నాగరికతా శాపగ్రస్తులు. అందుకే రోహిత్‍కి ఉండే విశాల దృష్టి వారికి లేదు. కార్ల్ సాగాన్ కాదు, స్టిఫెన్ హాకింగ్, అతని పాశ్చాత్య  దుందుడుకు తనం వారికి ఆదర్శం.
రోహిత్ పాశ్చాత్య మానవ కేంద్రిత ఆధునికతని నిరసిస్తూ చివరి లేఖలో కూడా ప్రకృతి ప్రేమని చూపాడు. మార్పు, అభివృద్ధి పేరుతో పెరుగుతున్న కృత్రిమత్వాన్నీ, విధ్వంసాన్నీ నిరసించాడు.
పాశ్చాత్య ఆధునిక నాగరికతకి నిరంతరం వొక  శత్రువు అవసరం. ఎందుకంటే విస్తరణ, దుందుడుకు తనాలే దాని స్వభావం. ప్రస్తుతం దాని శత్రువు ముస్లీంలు (హిందువులు ప్రచ్చన్న క్రైస్తవులు, ప్రచ్చన్న అమెరికన్లు, కనుక విడివిడిగా వారి గురించి చెప్పడం వ్యర్ధం). యీ ఆధునికతనే ఆదర్శంగా తీసుకోవడం వల్ల దళిత ముస్లీం ఐక్యత యింతవరకూ సాధ్యం కాలేదు. దళిత ముస్లీం ఐక్యతతో కూడిన విద్యార్ధి ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా యీ ఆధునిక సామ్రాజ్యవాదానికి ముప్పుగా పరిణమించాడు రోహిత్.
పౌరాణిక యుగంలోనైనా, సైన్స్ యుగంలోనైనా కాస్మిక్ దృక్పథానికీ, సామాజిక దృక్పథానికీ మధ్య తాత్విక సంబంధం ఉంటుంది.
స్థలకాలాల్లో దురుసుగా విస్తరిస్తూ పోవడమే ,మానవ జాతి లక్ష్యం అనేది వొక భావన. యిది ఙ్ఞానాన్ని ఆధిపత్యంగా మారుస్తుంది.
అనంతమైన స్థల కాలాలలో మనిషి స్థానం చాలా స్వల్పమని, అందువల్ల మనిషి ప్రకృతినీ తోటి మనుషుల్నీ జీవుల్నీ ప్రేమించడమే మానవ ఙ్ఞానపు అంతిమ లక్ష్యమనీ మరో దృక్పథం. యీ కాస్మిక్ కల్చరల్ దృక్పథమే రోహిత్ దృక్పథం. యీ దృక్పథాన్ని మొగ్గలోనే తుడిచేయాలని చూస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదపు వికృత శిశువే హిందూయిజం.
రోహిత్ మరణం గ్రహణం మాత్రమే. అతని తాత్విక సందేశం అమరం.
peepal-leaves-2013

సూఫీలు మనకి అర్థం కానేలేదు!

 

 

(గత గురువారం తరువాయి)

రాణీ శివశంకర శర్మ

రాణీ శివశంకర శర్మ

ఈ రాజ్యాధికారభావన, ఆధిపత్యవాంఛ పెరగడంతో సూఫీలూ పూర్వరుషులూ చేసిన కృషి మరుగున పడిపోతోంది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెరిటోరియల్ భావన, హద్దులు గీసుకొనే నైజం దేశంలోని బహుళత్వాన్ని రద్దు చేసింది. ఒకేజాతి అనే భావనకి దారితీసింది. ముస్లింలు పరాయివాళ్ళయ్యారు. ఇలాంటి ఏకశిలా సదృశ జాతి నిర్మాణం పూర్తిగా ఆధునికం. అంబేద్కర్ వంటి మేధావి కూడా ఈ ఉచ్చులో చిక్కుకు పోయాడు. ముస్లింలు ప్రమాదకరమైన వాళ్ళని, జనాభా మార్పిడే పరిష్కారమని ఆయన అన్నాడు.

భారతదేశపు బహుళత్వం జాతి నిర్మాణం లేకపోవడం వల్లే సాధ్యమైంది. జాతి నిర్మాణానికి బహుళత్వం సమిధగా మారింది. ఒకే జాతిని నిర్మించాలన్న ఆతృతే బ్రాహ్మణీయ హిందూయిజానికి ఆధారభూమిక.

అంబేద్కర్ కానీ, అంబేద్కర్ని విమర్శించిన రంగనాయకమ్మ కానీ సంస్కృత బ్రాహ్మణ గ్రంధాల్నే టార్గెట్ చేయడం ద్వారా అవే భారతీయ సంస్కృతికీ, నీతికీ, చట్టాలకీ ప్రాతినిధ్యం వహిస్తాయనే భావనని పెంచి పోషించారు. నిజానికి బ్రిటిష్ పూర్వ సమాజంలో స్థానిక పంచాయతీలు తీర్పులు చెప్పేవి. అవి చాలా బహుళమైనవి. ఈ పంచాయతీలలో ఏ కులానికి ఆ కులంగా విడివిడిగానూ, మొత్తం గ్రామానికి అన్ని కులాల సభ్యులతో కలిసినట్టివీ జ్యూరీలుండేవి. చాలా మంది పొరబడుతున్నట్టు బ్రాహ్మణులకు వీటి మీద పెత్తనమేమీ ఉండేది కాదు.

నిజానికి అన్ని గ్రామాల్లోనూ బ్రాహ్మణులు ఉండే అవకాశమే లేదు. ఉన్నా అందరికీ సంస్కృతం రాదు. విలియం జోన్స్ అనే ఇంగ్లీషు దొర మనుస్మృతిని ఆంగ్లంలోకి అనువదించాడు. దానిప్రకారం బ్రిటిష్ వాళ్ళు హిందూలాని సృష్టించారు. సదరు విలియం జోన్స్ చేతిలో బైబిల్ బదులు మనుస్మృతిని పట్టుకొని ఇంగ్లాండ్ లోని సెయింట్ పాల్ చర్చి ముందు విగ్రహంగా మారాడు. మనుస్మృతిని పట్టుకున్న పెద్దమనిషి విగ్రహం ఇండియాలో మాత్రం కనబడదు అని రాశారు వెండీ దోనిగర్.

అంబేద్కర్ ప్రతికూల పద్ధతిలో మనుస్మృతికి ప్రాచుర్యం కల్పించారు. ఆయన పంచాయతీ చట్టాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాదు, సూఫీయిజం ఆయన అధ్యయనం చెయ్యలేదనీ అందుకే ముస్లింలని మతతత్వవాదులుగా చిత్రీకరించారని గెయిల్ ఆమ్ వెద్ కు ఒప్పుకోక తప్పలేదు. బ్రిటిష్ వారు బ్రాహ్మలకి, వారి గ్రంధాలకి, ప్రాధాన్యం పెంచారు. ఇటువంటి సంస్కర్తలు వారినే అనుసరించారు.

రంగనాయకమ్మనే తీసుకోండి. రామాయణ విషవృక్షం పేరుతో సంస్కృత వాల్మీకి రామాయణంపై ప్రతి వాక్య ఖండన చేశారు. హిందూవాదుల దృష్టిలోనూ రంగనాయకమ్మ దృష్టిలోనూ రామాయణమంటే సంస్కృత రామాయణమే. హిందూవాదులకి ఎ.కె.రామానుజన్ మీద వచ్చినంత ఆగ్రహం రంగనాయకమ్మ పైన రాకపోవడానికి కారణం అదే. లోపల్లోపల ఇద్దరి మధ్యా ఒక అంగీకారం వుంది. ఎకె రామానుజన్ వివిధ దృష్టులతో రాయబడ్డ అనేక వేల రామాయణాల గురించి మాట్లాడాడు. అవి కేవలం సంస్కృత భాషలోనివి కావు. ప్రజల నాల్కలపై నాట్యం చేసే రకరకాల కథనాలవి. బహుళత్వం అంటే భయపడే హిందూవాదులు రామానుజన్ కి వ్యతిరేకంగా తీవ్ర గందరగోళం సృష్టించారు.

రంగనాయకమ్మ, అంబేద్కర్ లాంటి ఆధునిక సంస్కరణ వాదులు సంస్కృత పురాణాలకీ, సంస్కృత బ్రాహ్మణ ధర్మశాస్త్ర గ్రంధాలకీ తీవ్ర ప్రాచుర్యం కల్పించారు. దీన్నే వైరభక్తి అంటారు. అసలు హిందూయిజం అంటే యేమిటి? దాన్నెలా నిర్వచిస్తారు? అని నిలదీయకుండా హిందూయిజం ఇలాంటిది అలాంటిది అని నిందించడం ద్వారా లెఫ్టిస్టులు హిందూవాదుల వలలో చిక్కిపోయారు. వారికి ప్రాచుర్యం కల్పించారు.

అంబేద్కర్ జనసామాన్యంలోని జానపదాల్లోని ఆచార వ్యవహారాల గురించి యేమీ మాట్లాడలేదు. తన కుటుంబానికి చెందిన కబీర్ పంథీ గురించే నోరు విప్పలేదు. తద్వారా సూఫీ సంస్కృతిని నిర్లక్ష్యం చేశాడు. అందువల్లనే ముస్లింల గురించి హిందూవాదుల్ని మించి నిందించాడు. మౌఖిక సూఫీ సంప్రదాయాన్ని పక్కన బెట్టి మళ్ళీ గ్రంథస్థ బౌద్ధంలో సాంత్వన కోరాడు.

ప్రొటెస్టెంటిజం గ్రంధానికి ప్రాధాన్యం పెంచింది. కేథలిక్ క్రైస్తవంలోనివి కానీ, క్రైస్తవ పూర్వ సమాజాలకు చెందినవి కానీ, గ్రంథేతర బహుళ కథనాల్ని చిన్నచూపు చూసింది, రూపుమాపింది. దాన్నే ఆదర్శంగా తీసుకున్నారు ఆధునిక మేధావులు. పుస్తకాల పురుగులుగా మారిపోయారు. కళ్ళకీ చెవులకీ అందే వాటిని చిన్నచూపు చూశారు. ఈ ప్రొటెస్టెంటిజం ప్రభావం మన కొంప కూడా ముంచింది. మన సంస్కరణ భావాలకు కూడా ఈ ప్రొటెస్టెంటిజమే మూలం. ప్రకృతిని స్వేచ్ఛగా పరిశీలించిన పరిశోధకులను కాథలిక్కుల కంటే ప్రొటెస్టెంట్లు ఎక్కువ హింసించారని అంటాడు మార్క్సు.

చరిత్ర పుస్తకాలకి పరిమితమైతే పురాణం జీవితాల్లోకి విస్తరిస్తుంది. పౌరాణిక ఊహలకు విస్తృతీ పరిధీ ఎక్కువ. పురాణానికి వాస్తవమనే పరిధి లేదు. అది వాస్తవాన్నే ప్రభావితం చేస్తుంది. వాస్తవాన్ని సృష్టిస్తుంది. మహారాష్ట్రలోని వొక గ్రామంలో ఉన్న సీత గుడికి వొక కథ ఉంది. పట్టాభిషిక్తుడైన రాముడు సీతను విడిచిపెట్టినప్పుడు ఆమె ఆ గ్రామంలో ఆశ్రయం కోరింది. ఆ గ్రామస్తులు నిరాకరించారు. దానికి పశ్చాత్తాపంగా సీతకి గుడి కట్టి పూజిస్తున్నారని స్థల పురాణం. ఒక స్వచ్ఛంద కార్యకర్త అక్కడికి వెళ్లి సీత పట్ల చూపిన అనుచిత వైఖరికి ప్రాయశ్చిత్తంగా స్త్రీలకి ఆస్తిహక్కు కల్పించాలని కోరగానే అక్కడి పురుషులు అందుకంగీకరించి ఆస్తి హక్కు కల్పించారు (Hinduism – An alternative history).

అందువల్ల పాజిటివ్ పద్ధతిలో పురాణకల్పనల్ని జోడించడం సమాజానికి చాలా మేలు చేస్తుంది. అందుకే చారిత్రక పురుషులకన్నా పురాణపురుషులు ఎక్కువ ప్రభావశీలురని రాం మనోహర్ లోహియా అంటాడు. భారతదేశంలో పురాణం చరిత్రని తనలో కలిపేసుకుంటుంది. అందుకే ఫక్తు చారిత్రక పురుషుల జ్ఞాపకాలు మనకు తక్కువ. స్వచ్ఛత వాస్తవికత అనే భ్రమల నుంచి భారతీయులు ఎప్పుడో బయట పడ్డారు. వాస్తవాలకి తమ దృష్టి కోణాన్ని జోడించి, శుష్క వాస్తవంలో జీవించడం కాక కల్పనని వాస్తవంగా మలచుకోవాలని, కలలని నిజం చేసుకోవాలనేది భారతీయ తత్త్వం. దీన్ని భారతీయుల అజ్ఞానంగా భావించేవాళ్ళే అజ్ఞానులు. దీన్ని చీకటిగా చరిత్రహీనతగా భావించే వాళ్ళే దివాంధులు.

అందుకే గాంధీ పురాణపురుషులనే స్మరించాడు. కబీర్ లా ఈశ్వర్ అల్లా తేరే నామ్ అన్నాడు. అంతేకానీ అశోకుడినో అక్బర్ నో తలవలేదు. శ్రీశ్రీ కి కూడా ఈ రహస్యం తెలుసు. అందుకే అతని కవితల్లో పురాణ ప్రతీకలే కనిపిస్తాయి కానీ చారిత్రక ప్రతీకలు కనిపించవు. పురాణంలో చరిత్ర లీనమై గాఢమైన స్మృతిగా మారింది. అది మెలకువకీ స్వప్నానికీ సంధి కుదిర్చింది. చరిత్రనీ పురాణాన్నీ అభేదం చేసింది. అందుకే దళిత కవులు కూడా పురాణప్రతీకల చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. పురాణాలని సరికొత్తగా వ్యాఖ్యానించాలని చూస్తున్నారు. గ్రీసులోలా మనకి పురాణం గతం కాదు, వర్తమానం.

పురాణం స్థలకాలాల్ని అధిగమించేలా చేసింది. మతాల సరిహద్దుల్ని చెరిపేసింది. వెంకటేశ్వరస్వామికీ బీబీనాంచారికీ పెళ్లి చేసింది. పీర్లపండగని సృష్టించింది. చరిత్రకీ శక్తి లేదు. చరిత్ర కార్యకారణ సంబంధం లో బంధిస్తుంది. ఓడిపోవడం గెలవడం అనే భావాల్ని బలం చేస్తుంది. స్వర్ణయుగం చీకటియుగం అంటూ కాలాన్ని స్పష్టంగా విభజిస్తుంది. మార్క్సు లాంటి వాళ్ళు కూడా దీనికి అతీతంగా లేరు.

ఈ కాలవిభజన ఏం చేస్తుంది? బ్రిటిష్ కి పూర్వం చీకటి రాజ్యం చేసిందని, ముస్లింలు రాకపూర్వం ఎప్పుడో స్వర్ణయుగం వుందని భావించేలా చేస్తుంది. ఆ పూర్వయుగాన్ని ఆ స్వర్ణయుగాన్ని హిందూ వాదులు హిందూ యుగం అన్నారు, దళితవాదులు బౌద్ధయుగం అన్నారు. అందరూ కలిసి ఇండో అరబిక్ కల్చర్ కి గల ప్రాధాన్యాన్ని తుంగలో తొక్కారు. ఇదే మతతత్వానికి పునాది.

ఈ పాశ్చాత్య క్రైస్తవ సంకుచిత దృష్టిపై ధ్వజమెత్తాడు దళితకవి పైడి తెరేష్ బాబు.

వచ్చే ప్రతిదాన్నీ స్వాగతించాలన్న ఉదారత్వంతో

ఎక్కువ సార్లు స్వాగతించింది పతనాన్నే  (నేనూ నా వింతలమారి ప్రపంచమూ)

‘వచ్చెనిదే బంగారుకాలం’ అని సంస్కర్త గురజాడ చేసిన కీర్తనలకి పూర్తివిరుగుడు తెరేష్ బాబు వాక్యం.

అమ్మానాన్నలను మమ్మీడాడీలుగా మార్చినదానా

అమ్ముకోవడంలో ఉందన్నమాట

అసలు జన్మ సార్ధకం

ఇక్కణ్ణుంచి చేపలు మాంసము చలువరాయి తదితరాలు

ఎగుమతి అయినట్లే

నేనూ నీకోసం ఎగుమతి కావడం

ఎంతమధురం!

పడ్డాం కదా కొట్టుకుపోదాం అనడమే

అసలు సిసలు ప్రవాహ స్పృహ.

ఈ వాక్యాలకి వ్యాఖ్యానాలు అనవసరం. సుదీర్ఘ కాలపు పాశ్చాత్య ఆధిపత్యం మనని స్వంత ఆలోచన లేనివారిగా మార్చేసింది. “ఇక్కడి చర్మం కింద అక్కడి చైతన్యం విషాదం” యీ విషాదం నుంచే హిందూవాదులూ కంచె ఐలయ్య లాంటి వలసవాద బహుజనవాదులూ పుట్టుకొస్తున్నారు. “మరో రెండు వందలేళ్ళు మనం బ్రిటిష్ వలస పాలనలో ఉంటే దేశంలోని శూద్ర ఛండాల శక్తులు మరిన్ని అవకాశాలు పొందగలిగేవి” అంటారు కంచె ఐలయ్య (ప్రజాతంత్ర మార్చ్ 25, 2001). దళిత మేధావి గెయిల్ ఆమ్ వెట్ భారీడ్యాం లను మోన్ శాంటో కంపెనీని ప్రపంచీకరణను సమర్ధించారని బి. చంద్రశేఖర్ రాశాడు (చంద్రయానం). అంబేద్కర్ కూడా పాశ్చాత్యం తీసుకువచ్చిన మెగా ప్రాజెక్టుల విధానాన్ని సమర్ధించాడని అరుంధతీరాయ్ విమర్శించింది (ఆనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ కి ముందుమాట).

నన్ను భీభత్సాల పాలు చేసి

నా జవసత్వాల్ని పీల్చేందుకు

నా నట్టనడి గుండెలో

నీ ప్రతినిధుల్ని భద్రంగా నాటావు.

యీ పరిస్థితిలో ఆత్మజ్ఞానం ఎలా సాధ్యం? రమణమహర్షి ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని పదేపదే చెప్పడానికి యీ వలసవాద పరాయీకరణ కారణమైందా? అసలు మనం కార్యకారణ సంబంధాన్ని చూసే తీరే వలసవాద కలుషితమైంది. వలసవాద అభివృద్ధి నమూనాని ప్రశ్నించే శక్తిని మనం కోల్పోయాం.

ఆ యీ పరిస్థితుల్లో గాంధీ పాశ్చాత్యంలో ప్రాచ్యాన్ని కనుగొనవలసి వచ్చింది. పాశ్చాత్యం భారతదేశపు గుండెల్లో తన ప్రతినిధుల్ని నాటడం వల్ల పరాయీకరణ మొదలైంది. దాంతో టాల్ స్టాయ్, థోరో వంటి పాశ్చాత్యుల నుంచి గాంధీ స్ఫూర్తి పొందవలసి వచ్చింది.

పాశ్చాత్య అభివృద్ధి నమూనాకి ప్రత్యామ్నాయాన్ని వెదకడం కష్టమై పోయింది. స్థానికంగా వెదకడం మరీ కష్టమై పోయింది. ఏమంటే, స్థానికుల్లో చాలామంది తమ గతమంతా చీకటిగా భావించారు. యింకా చెప్పాలంటే తమ గతం విచ్ఛిన్నమైపోయిందని, తమ స్మృతులు పూర్తిగా చెదిరిపోయాయని భావించారు. స్మృతులలో ఉమ్మడితనాన్ని మినహాయించడమంటే స్మృతుల్నే ధ్వంసం చేయడమనే సత్యాన్ని విస్మరించారు. అలాగే తమ గత స్మృతుల్ని అవమానకరంగా భావించారు. గతంలో అవమానం, హింస వుండొచ్చు. అవమానమూ హింసలే గతం కాదు. స్మృతుల్ని మొత్తంగా దహనం చెయ్యడం ఆత్మ విచ్ఛిత్తికి దారితీసింది. తెరేష్ బాబు మాటల్లో ‘పాశ్చాత్యమే నా ప్రేయసి’ అని ప్రకటించుకొని ముద్దులతో మూతి కాల్చుకోవలసి వచ్చింది.

పాశ్చాత్య ప్రేయసిని ముద్దాడడం వల్ల మన కార్యకారణ సంబంధం పరిశీలన అనేది ఎంతగా కలుషితమైందో ఎంతగా పాశ్చాత్య వలస వాద పంక నిమగ్నమైందో తెలుస్తుంది. ఇస్లాంను విశ్లేషించే టప్పుడు అంబేద్కర్ ముస్లింలు ఉండటంవల్ల జరిగిన దౌర్జన్యాలను పెద్దవిచేసి చూపించారు. ఉమ్మడి సంస్కృతి, సంక్లిష్ట సంస్కృతిలోని ప్రధాన అంశాలను, మొగలులు రాజపుత్రులు సాధించిన రాజకీయ ఐక్యతను, సూఫీలు సన్యాసుల బోధనలను ఆయన విస్మరించారు. ఆయనకు ఇస్లాం మీద అంత సానుభూతి యేమీ లేదు. టర్కీ ముస్లిం దాడుల సమయంలో బౌద్ధారామాలను నాశనం చేసినందువల్లే ఇండియా నుంచి బౌద్ధం కనుమరుగైందని ఆయన భావించాడు. హిందూ జాతీయవాదులు భావించినట్లు గానే ముస్లిం దురాక్రమణ దారులు బలవంతపు మతమార్పిడులకి ఒడిగట్టారని అంబేద్కర్ భావించాడు (Ambedkar-Towards an Enlightened India by Gail omvedt).

ఈ అభిప్రాయాలు హిందూవాదులకి వుపయోగించాయని దళిత మేధావి గెయిలీ ఆమ్ వెట్ అంగీకరించారు. ఉమ్మడి సంస్కృతి, సూఫీలు సన్యాసుల బోధలు మన మేధావుల చెవికెక్కలేదు. అందుకే ఏకశిలాసదృశ జాతి నిర్మాణం కోసం కలలు, ఆ క్రమంలో బౌద్ధం పేరుతోనో మరో పేరుతోనో ముస్లిం జాతి వ్యతిరేకత వంటి యూరోపీయ ప్రొటెస్టెంట్ ఫాసిస్టు భావజాలం రాజ్యం చేసింది. దానినుంచే హిందూ ఫాసిజం పురుడు పోసుకుంది. హిందూ ఫాసిజం బహుళ సంస్కృతుల స్థానాన్ని దురాక్రమించింది.

“అసలు విశ్వజనీనమైన అభివృద్ధి నమూనాలోనే దానికి అపరిచితమైన జీవన విధానాలను అర్ధం చేసుకోలేని లోపం ఉంది. తనకు తెలీని దాన్ని, ఇతరాన్ని అది భరించలేదు” (డి.ఆర్.నాగరాజు)

*