ఎరువు..

satya2

దించిన నడుం ఎత్తకుండానే
కమ్మిన మబ్బుకుండ ఒట్టిపోయి
నాటిన నారు నీరిగిరిన మడిలొ
విలవిలలాడుతుంటే
నెత్తురు చిమ్మిన కళ్లు!

వానా వానా వస్తావా
ఈ నేల దాహం తీర్చుతావా!

ఆశలన్ని మొగిలికి చేరి
ఆవిరింకిన కనులలోకి
కాసింత తడి చేరుతుందా!

వాడు నలుదిక్కులా వేసిన
కార్పెట్ బాంబింగ్ పొరల పొరలుగా
బద్ధలై పచ్చదనంతో పాటు పసిపాపలను
హరించి ఇప్పడీ హరిత వనం కోతలు కోస్తున్నాడు!

నేలతల్లి నవ్వలు విరబూసేలా
నువ్వూ నేను కలిసి
ఓ మొక్క నాటుదాం
ఎరువుగా వాడినే పాతుదాం!!

*

ఈ చిన్ని అద్దంలో కౌముది!

 

-కేక్యూబ్ వర్మ

~

 

varmaచిన్న అద్దంలో కొండని చూపించడం లాంటిదే కౌముది గారిని  చిరు వ్యాసంలో పరిచయం చేయడం! ఆయన కవి, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు,అభ్యుదయ  రచయితల సంఘానికి క్రియాశీల కార్యవర్గ సభ్యుడు. ఖమ్మం జిల్లాలో అరసం  వ్యవస్థాపకుడు. కమ్యూనిస్టు  పార్టీ యువజన పత్రిక  “యువజన” కి సంపాదకుడు. “విశాలాంధ్ర” ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, అధ్యాపకత్వంలో స్థిరపడ్డారు. అక్షరోద్యమ నేత గా  మారుమూల ప్రాంతాల్లో రాత్రనకా పగలనకా పర్యటించి, అక్షర సేవలో కన్ను మూసిన ఉద్యమ శీలి.  ప్రజానాట్య మండలిలో కొన్ని వందల స్టేజీ నాటకాలపై నటించిన ప్రజా నటుడు, గాయకుడు. ఇవన్నీ కాక, రచయితగా అనేక కథలూ, అనువాద రచనలూ అందించిన సృజన శీలి.

అలనాటి కమ్యూనిస్టు ఉద్యమాలతో కలిసి నడిచిన కార్యశీలిగా, ప్రజా నాట్యమండలి కళాకారునిగా ప్రాచీన కవిత్వం నుండి అత్యాధునిక కవిత్వం వరకు విశ్లేషించే సాహిత్య పిపాసిని ఈ కొద్ది మాటల్లో  పరిచయం చేయడం -కొండను అచ్చంగా అద్దంలో చూపడమే.

చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సమకాలీన అంశాలను తన కవితలలో ప్రతిబింబిస్తూ వచన కవితా స్థాయిని ఏమాత్రం చెక్కుచెదరకుండా నిలిపి వుంచిన అక్షరశిల్పి కౌముది గారు. తన రచనా సమాహారం ’అల్విదా’ ముందుమాటలో ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్ చెప్పినట్లు కౌముదిగారు కవీ, రచయితా, విమర్శకుడూ, తన యవ్వన దశని ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమానికి పరిపూర్ణంగా వెచ్చించిన సమరశీలి, ప్రతిభాశాలి. ఇంతకుమించి ఆయనకు ఎలాంటి విశేషణాలు అవసరం లేదు. కొందరి సాహితీ మూర్తిమత్వాలు ఏ విశేషణాలకూ అందవు. అటువంటి కొందరిలో ఒకరు కౌముది గారు అని అంటారు. ఇది నిఖార్సయిన నిజం. తన రచనలలోని సమరశీలత ప్రగతిశీల ధృక్పథం నేటికీ మనలను కట్టి పడేస్తాయి. ఆలోచనలను ఉర్రూతలూగిస్తాయి. రచనలలోని సమకాలీన రాజకీయ ప్రాంతీయ స్థల కాల విశ్లేషణలు నాటి సమాజాన్ని మన కనుల ముందు సాక్షాత్కరింప చేస్తాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్ ఆవిర్భావం గురించి రాసిన ’ముక్తి వాహినీ విజయ్ కరే’ కవితలో

చెప్పు తల్లీ! చెప్పు మళ్ళీ

ఎందుకు పుట్టాడు దానవుడు

ఏ అపరాధం చేశాడని

వంగభూమిలో మానవుడు

 

నిద్రిస్తూన్న శిశువుమీద

నిండు చూలాలిమీద

మంచిమీద మానవత్వం మీద

అఘాయిత్యాల సంపుటి

అమ్మా! ఇది గుండె మీది కుంపటి!

….

 

మతాలు, గతానుగతికాలు

మనస్సును కుంచించే సంకుచితాలు కుత్సితాలు!

మానవతామృధ్జ్యోత్స్నావగాహుడైన మనిషికి

కానే కావు సమ్మతాలు

-అంటారు.

 

చలనశీలమైన సమాజంలో మార్పును కాంక్షించే అభ్యుదయ వాదిగా కౌముది గారు ’ఇలాగే వస్తుంది మార్పు’ కవితలో –

ఇలాగే వస్తుంది మార్పు

ప్రజలు వినిపించినప్పుడు తీర్పు

ఇలాగే వస్తుంది మార్పు

 

నగరాలు నినాదాలు యిస్తాయి

రాస్తాలు వూరేగింపులు తీస్తాయి

రేపటి వుదయానికి ఆకాశం

పంచరంగుల పోస్టర్లను ఆవిష్కరిస్తుంది

పిల్లగాలుల పత్రికా విలేకర్లు

ఈ వార్తను అందుకొని ఎగిరిపోతారు

దిక్కులు భేరీ భాంకృతుల్తో ఈ సత్యాన్ని ప్రకటిస్తాయి

-అని రేపటి మార్పుని ఓ గొప్ప ఆశావహ దృక్పథంతో ఆవిష్కరిస్తారు.

ప్రతీ కవితలో అన్నార్తుల అభాగ్యుల జీవన వేదనను చిత్రిస్తూ చివరిగా రేపటి తరంలోని మంచి మార్పును ఆశించి సాగిన కవిత్వం కౌముది గారిది. నాటి అభ్యుదయ భావజాలం నేటి సామాజిక స్థితికి కూడా దగ్గరగా వుండడం వారి రచనలలోని సజీవత్వానికి నిదర్శనం. ’ఉదయిస్తున్నాడు రేపటి రవి’ కవితలో

పాలులేక మరణించిన

పసిపాప సమాధిమీద

పాడె బట్ట నోచుకోని

పరమదరిద్రుడి శవం మీద

ఇరుకు బ్రతుకు, మురికి గుడిశ

ఆకటి, చీకటి, చిత్తడుల మీద

పచ్చ పచ్చగా వెలుతురు

పరుగెత్తుతూంది చూడు!

– అంటారు..

హరించిపోతున్న మానవత్వం కోసం పరితపించడం కౌముది గారి కవితలలో ప్రతి చోటా మనల్ని నిలువనీయదు. సూటిగా ప్రశ్నించడం తన కవితలలో ఓ గొప్ప లక్షణం. చాలా నిక్కచ్చిగా నిర్మొహమటంగా మనలోని సంకుచితత్వాన్ని మతతత్వాన్ని ప్రశ్నిస్తూనే రేపటి ఉషస్సుకోసం ఆరాటపడడం ప్రతి కవితలో ప్రస్ఫుటం. వెన్నెలను కలం పేరుగా మార్చుకున్నా తన రచనలలో మాత్రం అగ్నిశిఖలా వెలిగిపోవడం కౌముది గారి ప్రత్యేకత. చివరిగా మహాకవి, మహానాయకుడు మఖ్దూమ్ స్మృతిలో తను రాసిన కవితా పాదాలే తనకోసం ఉదహరిస్తూ ’అల్విదా’ తో ముగిస్తాను.

గీతశిల్పి వెళ్ళిపోయాడు

గీతం తెగిపోయింది

ఏ సంకేతమూ లేకుండా

ఎవ్వరికీ చెప్పకుండా

అనుకోకుండా తెగి

గాలిలో కరిగిపోయే నక్షత్రంలా

అకస్మాత్తుగా జారి

మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలా

ఉన్నట్టుండి హఠాత్తుగా

సభ మధ్యలోంచి తలవంచుకొని

షాయర్ వెళ్ళిపోయాడు

ముషాయరా ఆరిపోయింది…

 

*

 

సిద్దార్థా మిస్ యూ!!

 

 

-కేక్యూబ్ వర్మ
 
varma
నీ ఊరు నుండి
నీ వార్డు నుండి
ఒక్కో ఇటుకా పంపించుకాసింత పుట్ట మన్ను
రాగి కలశంలో నీళ్ళు
తీసుకొని గుంపుగా
డప్పులు మోగిస్తూ
నీ కోవెలలోనో నీ మసీదులోనో నీ చర్చిలోనో
సామూహిక ప్రార్థనలు చేసి పంపించుమీ అందరికీ ఇక్కడ కాంక్రీటు దిమ్మలతో
నువ్వూ నీ పిల్లలూ అబ్బురపడే
వీడియో గేంలలో తప్ప చూడని
మాయా మందిరాలను నిర్మిస్తాంకురచ ముక్కు ఉబ్బుకళ్ళ ఇంజనీర్లు
పోటీ పడి సర్రున జారే రోడ్లతోను
రయ్యిన ఎగిరే ఇమానాల రొదతోను
నిండిపోయే నగరాన్ని నీకోసం
హాంఫట్ అంటూ మరికొద్ది రోజుల్లో
ముప్పై వేల ఎకరాల పంట భూములను
మింగేస్తూ నువ్ కలలో కూడా
ఊహించని మాయాలోకాన్ని సృష్టిస్తారునువ్వూ నీ పాపలూ కలసి దూరంగా గుడిసెలో
టీవీలో అక్కడ తిరిగే ఓడలాంటి కార్లనూ
సూటూ బూట్లతో తిరుగాడే పెద్ద మనుషులనూ
హాశ్చర్యంగా చూస్తూ సల్ది బువ్వను రాతిరికి
ఎండు మిరపకాయతో మింగుతూ గుటకేయొచ్చువానలూ కురవనక్కర్లేదు కోతలూ కోయనక్కర్లేదు
ఆధార్లో నీ వేలి ముద్రలు మాయం
నీ కార్డుకు బియ్యం కోత
నీ బొడ్డు తాడుకు పేగు కోత తప్పదు
సెల్ ఫోన్లో మాత్రం చార్జింగ్ అవ్వకుండా చూసుకోబాబు గారో బాబు గారి సుపుత్రుడో
పైనున్న పెదాన మంత్రిగారో
తమ కెందుకు ఓటేయ్యాలో మెసేజిస్తారుట్విట్టర్లో ట్వీట్లకు కోట్ల స్పందనలు
నాగార్జున సాగర్ గేట్లెత్తిన ఉచ్చ కూడా బోయట్లేదంట

అమరావతిలో సిద్దార్థుడు పారిపోయాడంట

నీ పాడికి నువ్వే ఎదురు కర్రలు ఏరుకోవాలింక
నీకోసం ఏడ్చే తీరికెలేదిక్కడెవ్వడికీ
నిన్ను పాతడానికి ఆరడుగుల నేలా లేదిక్కడ!!

*

దారులు వేద్దాం….

-కేక్యూబ్ వర్మ 
ఇప్పుడు మూసుకుపోతున్న దారులను
తెరచే పని చేయాలి
ఒక్కో నదినీ ముక్కలు చేస్తూ ఎక్కడికక్కడ
గోడలు కడుతున్నాడు వాడు
ఇప్పుడు నదీ ద్వారాలను స్వేచ్చగా
తెరచుకోనివ్వాలి
ఒక్కో పర్వతాన్నీ పిండి చేస్తూ వాడు
గుండెల్ని తవ్వి ఎత్తుకు పోతున్నాడు
పర్వత పాదాలతో పాటు శిఖరాన్ని
నిబ్బరంగా ఎదగనివ్వాలి
నిటారుగా దారు వృక్షాలతో కలకలలాడుతున్న
పచ్చని అడవిని నరుక్కుపోతున్నాడు వాడు
నేల లోతుల్లోకి వేళ్ళని జొనుపుతూ ఆకాశాన్ని
అందుకునేలా పాతుకోనివ్వాలి
సాగర తీరాన ఇసుక లోతుల్లోకి చొరబడి
అలలనే మింగేయడానికి వస్తున్నాడు వాడు
గర్భంలోంచి ఎగసిపడే అలల కెరటాలను
తీరందాకా చేరనివ్వాలి
నిన్నూ నన్నూ మాంత్రిక పాచికలతో జూదరులను చేస్తూ
వాడు ఉనికినే తుంచుకుపోతున్నాడు
నేలను ఆనిన పాదాలతో వాడి గుండెలపై
ఎగిరి తన్ని తరిమేయాలి.
*

కళింగాంధ్ర కవిత్వ ‘పాయ’ల మురళీకృష్ణ

మా కళింగాంధ్ర ప్రాంతం నుండి చాన్నాళ్ళుగా కవిత్వం రాస్తున్న పాయల మురళీ కృష్ణ గత ఆగస్టులో ’అస్తిత్వం వైపు’ అన్న కవితా సంకలనం ప్రచురించారు. ఈ ప్రాంతం నుండి రాస్తున్న వాళ్ళలో తొంభై తొమ్మిది శాతం ఉపాధ్యాయ వృత్తిలోని వారే కావడం గమనార్హం. టీచర్ గా పనిచేస్తూన్న వారికి నిత్యమూ గ్రామాలలో జరుగుతున్న విధ్వంసం వివిధ వృత్తుల జీవన విధానం ప్రజల దైనందిన జీవితంతో అనుబంధం వారిని రచయితలుగా కవులుగా బాధ్యతతో వ్రాసే వారిగా నిలుపుతుందనుకుంటాను. మిగతా వృత్తులలోని వారి కంటే వీళ్ళకు పిల్లలతో అనుబంధం వుండడం కూడా అదనపు సౌకర్యమే.
MURALI_PHOTO025-page-001

ఒక కుటుంబ నేపథ్యం తెలుసుకొనే అవకాశం వారి పిల్లల చదువు వారి కుటుంబ ఆర్థిక సామాజిక స్థితి గతులను తెలుసుకొనేందుకు, పిల్లలను చూస్తూ వారితో సంభాషిస్తూ వారి రోజువారీ సమయంలో అత్యధికంగా వారితో గడవడం మూలంగా మంచి అవగాహన కలిగిస్తుంది. నిబద్ధత కలిగిన రచయిత కవికి ఇది ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. దీనిని కవిత్వీకరించడం ద్వారా సామాజిక ప్రస్తుత వాతావరణాన్ని మన కళ్ళముందు పద చిత్రాలుగా బ్లాక్ అండ్ వైట్ లో స్పష్టంగా చూపించే ప్రయత్నం మురళీ కృష్ణ కవిత్వంలో చూడవచ్చు. అనుభూతి చెంది ఆలోచనలకు ప్రేరణనిస్తాడు కవి.

ఈ సంకలనం ముందు మాటలో శివారెడ్డి గారన్నట్టు కవిత్వం జీవితంలో అన్ని పార్శ్వాలను వెలిగించే దివ్యశక్తి. లోలోన గుణించుకొని కవిత్వాన్ని అల్లే పద్ధతి మురళీలో వుంది. అది ఒక చిక్కని నేతగా అతని కవిత్వంలో కన్పడుతుందంటారు. ఈ కవితలు చదువుతుంటే ఇది అక్షర సత్యం అని ఒప్పుకోక తప్పదు.

 

’అత్యవసరం’ కవితలో

ప్రపంచం ఒక కుటుంబమౌతుంటే

మనిషి మాత్రం ఒంటరిగా చీలిపోతున్నాడు

ఒకప్పుడు హృదయాలను కలిపిన సాయంకాలాలు

ఇప్పటి ఏకాంతాలై శోకిస్తున్నాయి…. అంటూ సమూహం నుండి విడివడి పోతున్న మనిషి పట్ల ఆవేదనను వ్యక్తపరుస్తాడు.

 

“ఈ రోజేం కథ చెప్తారు మాష్టారూ!?” కవితలో

 

ఎన్ని విషాదాలనైనా

ఒక పసి నవ్వు కడిగి పారేస్తుంది

బడి ప్రాంగణంలో మాత్రమే

బ్రతుకు కల్మష రహితమై కన్పిస్తుంది

 

బడి చివరి గంట తర్వాత

బడి భవనం, నేనూ ఇద్దరం నిస్సహాయులమే

రేపటి ఉదయం వరకూ

రెక్కలు తెగిన పక్షులమే… అంటూ ఈ కవితలో మాస్టారుగా కాన్వెంటు బడులు సర్కారు బడులను మింగేస్తున్న వైనాన్ని చెపుతు టీచరుగా వృత్తి ధర్మాన్ని ఎంత నిబద్ధతతో పాటించాలో సవివరంగా వ్యక్తపరుస్తాడు.

 

పర్యావరణాన్ని మింగేస్తున్న విధ్వంసకర అభివృద్ధి మేకప్ వేసుకొని చేస్తున్న వినాశనం తద్వారా మనిషి కోల్పోతున్న సహచర సంపద పట్ల మక్కువను చూపే ప్రయత్నం “మొక్క” కవితలో ఇలా చెప్తాడు

PAYALA MURALI KRISHNA-page-001

భూమికీ ఆకాశానికి తేడా చెప్పమంటే

నేను మొదట మొక్కనే చూపిస్తాను

ఎన్ని చుక్కలున్నా

ఒక్క మొక్కను కూడా సరిపోవు కదా! అంటూ

 

మనుష్యుల మధ్యున్నప్పుడు

చాలా సార్లు పీడించే ఒంటరితనం

మొక్కల మధ్య నన్ను చూస్తే అంతర్ధానం అంటాడు.

 

“రేపటి సూర్యోదయానికి ముందు..” కవితలో బెస్త వారి బతుకుల్లో కంపెనీలు పెట్టిన చిచ్చు తద్వారా వారి జీవిక కోల్పోయినతనాన్ని మన కళ్ళముందు తడిగా ఆవిష్కరిస్తూనే వారికి విముక్తి మార్గాన్ని వారి ఐక్య పోరాటంలోనే సాధ్యమని చెపుతాడు.

 

అతడక్కడే ఉండేవాడు

ఎగసే కెరటాల సాక్షిగా

పగలంతా ఇసుక తిన్నెల మీద

ఈ సముద్రం ఒడ్డునే కూర్చుండేవాడు

నైలాన్ దారాలు ముందేసుకుని

సరికొత్త వస్తువును సృష్టించబోయే

శ్రామికత్వాన్ని ప్రేమించేవాడు

ఓ దారాన్ని తీసి మరో దారానికి కలుపుతూ

సునిశితంగా, వేగంగా

అతడు ముడివేయడం చూసేటప్పుడు

మనిషినీ మనిషినీ అంతే వేగంగా

కలపగలిగే వాడు ఎవరైనా ఉంటే బావుణ్ణనిపించేది

 

చివరిగా ఇలా

 

ఇప్పుడు కూడా అతడక్కడే ఉన్నాడు

తన వాళ్ళ పిడికిళ్ళు ముడివేస్తూ

సరిక్రొత్త మానవ వల అల్లుతున్నాడు

“వేట సముద్రం మీదకి కాదురా

ఒకానొక స్వార్థం మీదకని” చెప్పి

తెప్పల్ని నడిపే తెడ్లన్నీ

తిరుగుబాటు జెండాలు చేసాడు….. అంటాడు మురళీ.

 

అలాగే రైతు పొలాలకు దూరమై వలస బాట పట్టడాన్ని తనదైన శైలిలో “ఒక నిష్క్రమణకు ముందు” కవితలో చిత్రిస్తాడు మురళీ ఇలా

 

భవిష్యత్ ఛిద్రమై పోతున్న ఒకానొక దృశ్యం

ఎవరు మాత్రం ముందుగా ఊహించగలరు?

నడిచే దారులే కంటతడి తుడవలేక

వలసపొమ్మని సాగనంపుతుండడం

ఎవరు మాత్రం జీర్ణించుకోగలరు..!?

 

ఊరూ ఊరంతా భూమిని కరెన్సీగా మార్చేసుకుంటుంటే

విస్తరించే విధ్వంసానికి

విచ్చుకుంటున్న పచ్చదనం బలికాదని ఎలా నిర్ధారించగలరు!?

 

సమూహం నుండి తప్పని సరిగా విడివడుతూ మనిషి తన అస్తిత్వంవైపు ఎలా అడుగులేస్తూ ఉనికిని కోల్పోతాడో ఈ సంకలనం శీర్షిక “అస్తిత్వం వైపు” కవితలో తనదైన శైలిలో ఇలా ఆవేదనగా ఆవిష్కరిస్తాడు

 

కొంత విరామం తర్వాత

అతడలా నడిచి వెళ్తుంటాడు

ఆ రాదారుల కఠినమైన రాళ్ళల్లో

ఏవో చిగురించిన జ్నాపకాలు

సుతిమెత్తగా తగుల్తుంటాయి..

 

ఇంటికెళ్ళేసరికి

సాయంత్రమైపోతుంది

ఇంటి ముందు ఎవరో

దీపాలు పెట్టడం గమనిస్తాడు

వేగంగా అడుగులేస్తాడు

ఒక్క దీపమూ కనిపించదు

 

తన ఇరుగ్గదిలో

తన కోసం ఎవరో పరిచిన చాప మీద

అలాగే నిద్రపోతాడు

 

తెల్లవారిన తరువాత

అతడు లేడు

తనలో ఇంకెవరో తప్ప………….

 

చివరిగా “దారిలో ఒకవేళ…..” కవితలో

 

తంగేడు చెట్టు పసుపు పచ్చగా నవ్వే

ఏదో ఒక వేళ

ఈ దారిలో నా నడక ఆగిపోవచ్చు

అక్కడక్కడా ఉన్న రక్తపు చారలు

చెబుతున్న నిజాలను

కొన్ని పాద స్పర్శలు పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు… అంటూనే

 

ఇప్పుడు

నాతో కవిత్వం నడుస్తోంది

అప్పుడు

కవిత్వంతో నేను నడుస్తాను… అంటాడు కవి ఆశావహంగా…

 

ప్రతులకు..

పి. మురళీకృష్ణ

మెంటాడ – 535 273,

విజయనగరం జిల్లా. 9441026977 సంప్రదించవచ్చు.

-కేక్యూబ్ వర్మ

 varma

 

కాలాన్ని సిరాగా మార్చిన కవి

gournayudu

గంటేడ గౌరునాయుడి మాస్టారిని సాహిత్య లోకానికి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఇప్పటికే తన కథలతో కవితలతో మనందరికీ సుపరిచితులే. ఇటీవల ఆగస్టు 8న తన అరవై వసంతాలు నిండిన సందర్బాన్ని పురస్కరించుకొని ’ఎగిరిపోతున్న పిట్టలకోసం’ అనే కొత్త కవితా సంకలనాన్ని తీసుకువచ్చారు.

 

ఉత్తరాంధ్ర లేదా కళింగాంధ్రగా పిలువబడే ఈ ప్రాంతంలో గత నాలుగు దశాబ్ధాలుగా జరుగుతున్న విధ్వంసం అది సామాజికంగా ఒక్కో పొరను కప్పేస్తూ కమ్మేస్తున్న వైనాన్ని అలాగే వ్యక్తిగతంగా మనిషితనానికి దూరమవుతు రక రకాల ప్రభావాలకు ప్రలోభాలకు లోనవుతు తమ ఉనికినే కోల్పోతున్న సంక్షుభిత సందర్భాన్ని తన కథలలోను కవితలలోను ఆవిష్కరిస్తారు మాస్టారు. ఈ కవితా సంకలనంలోని కవితలు 2011 నుండి మొన్నటి వరకు వున్న కాలానికి వేలాడుతున్న చినిగిన చొక్కాలాంటి బతుకు వెతలు. మాస్టారి శైలి జీవితంలోని అన్ని పార్శ్వాలను తన నుడికారంతో స్థానిక మాండలికానికి దగ్గరగా సామెతలతో కలగలిపి చెబుతూ ఒక ధిక్కార స్వరాన్ని ఎలుగెత్తి మనముందు ఆవిష్కరిస్తుంది.

 

చాలా మంది ఇటీవల వామపక్షానికి దగ్గరగా వున్న మేధావులు రచయితలు కూడా అభివృద్ధి అంటే విధ్వంసం కాకుండా ఎలా జరుగుతుంది? అని ప్రశ్నిస్తూ చెరబండరాజు అన్నట్టు నీ ఖాకి నిక్కరు మార్చినారురో ఓ పోలీసన్న, నీ బతుకు మారలేదురో ఓ పోలీసన్న అన్నట్టుగా పొట్ట చేతబట్టుకొని నాలుగు గిన్నెలు ముంతలు ఓ సిమెంటు బస్తాలో మూటగట్టి మా వూరినుండి వెళ్ళే బొకారో ఎక్స్ ప్రెస్ ఎక్కి చైన్నైకి, విజయవాడ పాసెంజరెక్కి ఆ చుట్టుపక్కలకి, నాగావళీ ఎక్స్ ప్రెస్ ఎక్కి హైదరాబాద్ కి పల్లెలనుండి వలస పోతున్న వారిని చూసి ఆహా రైతు కూలీ జనం కార్మిక వర్గంగా రూపాంతరం చెంది వీళ్ళంతా కార్మిక వర్గ విప్లవాన్ని తీసుకు వచ్చేస్తారు, పెట్టుబడి పల్లెలన్నింటిని కబలిస్తూ పట్టణాలలో కలిపి మెట్రో పాలిటన్ సిటీలుగా స్మార్ట్ సిటీలుగా మారిపోతున్నాయి యింక వ్యవసాయం చేయాల్సినది పెట్టుబడిదారులే అని చెప్పకనే చెప్తున్నారు. ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లలో కాంప్లెక్సులలో ఉద్యోగాలు కావాలా? అన్న ప్రకటనలతో ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి కాబట్టి జనం వలస బాట పడ్తున్నారు అని ప్రకటిస్తున్నారు. ఇది ఒక పార్శ్వం మాత్రమె.

కానీ ఈ జీవన విధ్వంసం వెనక ఈ ప్రాంతంలో అమలు జరుగుతున్న విద్వంసకర అభివృద్ధి నమూనాలు కారణంగా ఇక్కడి జనం తమ విరిగిన రెక్కలతో నెత్తురోడుతున్న భుజాలతో ఎక్కడెక్కడికో ఎగురుకుంటూ కాంక్రీట్ స్లేబుల కింద నలిగిపోతున్న తమ జీవితాలను, అనారోగ్యకర పరిస్థితులలో బతుకుతు ఆ వచ్చిన అరకొర కూలీని దాచుకొని పండగలకు పబ్బాలకు పల్లెలకు వస్తూ తామంత సంతోషంగ వున్నామని మురిపిస్తూ తిరిగి తిరిగి మరల మురికి కూపాలకు పునరంకితమవుతున్నారు. ఈ జీవన నరకయాతనను, చిధ్రమవుతున్న మానవ సంబంధాలను మాస్టారు ఈ కవితలలో మనకు చూపిస్తారు. ఈ బలవంతపు వలసలు, ఇగిరిపోతున్న పచ్చదనం, సెల్ ఫోన్ రింగులతో మూగబోతున్న పల్లె పాటలు, ఏ ఆసరా లేక కునారిల్లుతున్న ముసలి బతుకులు, మేపుకు దూరమై కబేళా బాట పట్టిన పశుసంపద ఈ చిద్రమైన తీరును మాస్టారు చెబుతారు. ఇది కొంతమందికి అభివృద్ధికి వ్యతిరేకంగా అవసరంలేని వలపోతగా కనబడడం విషాదం. కవికి కాలాన్ని సిరాగా మార్చడమే కర్తవ్యం కదా? అది మాస్టారిలో మనం పరికించవచ్చు.

 

ఇంక మాస్టారి కవిత్వంలో ప్రతీకల వెల్లువ వుంటుంది. ఉదాహరణకు

 

ప్రతి ఉదయపు నడకా ఒక మధుర గీతమే కవితలో

 

అదృశ్య హస్తాలేవో దోసిళ్ళతో ఆకాశంలోంచి

వొంపుతున్న పుప్పొడి ధూళిని తమ చిట్టి రెక్కలతో పిట్టలు

కొమ్మల మీదా రెమ్మల మీదా ఆకుపచ్చ మెరకల మీదా

గరిక పరకల మీదా వెదజల్లుతున్నప్పుడు,

 

చీకటిని అడిగి బొగ్గును

వేకువను అడిగి సుద్దను తెచ్చి ఉషస్సు

తన నలుపు తెలుపుల బొమ్మ గీస్తున్నప్పుడు

హృదయలయకి శ్రుతి కలుపుతూ ఆలపిస్తాను

నా చరణయుగళ గమన గీతం… అంటారు

 

మాట్లాడుకోవాలిప్పుడు కవితలో

 

చీలికల సంగతి మరచి

చేతులు కలుపుకోవాలి,

ఏటిదారానికి కూర్చిన పూసలు కదా మన ఊళ్ళు

పూసా పూసా చెప్పుకునే ఊసులు కదా

మన ఇల్లూ వాకిళ్ళు

కరిగిపోతుంది తీరం

తెగిపోతుంది దారం

ఇప్పుడే.. యీ క్షణమే

మాట్లాడుకోవాలి..

 

ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల దుఖాన్ని ఇలా చెప్తారు

 

అనుకున్నదే, ఏదో ఒకనాటికి యీ తల్లకిందులు తప్పదని

నోరూ వాయీ లేనోళ్ళం

తీరూ తెన్నూ తెలీనోళ్ళం

ఎవలకేటి కాదనీసినాం? ఎవలి మాట కొట్టేసాం?

ఏలినవోరిదయ, మీరేతంతే మామదే అన్నాం

పేగులు తెగిపోతంటే పెదివిప్ప్పి ఒకమాటన్లేదు

బతుకు బుగ్గైపోతుంటే బితుకు బితుకుమని కూకున్నాం

మా నేల మాది కాదనీసినా మూగోల్నాగ మూల జేరిపోనాం…

 

అయ్యలారా!

అన్నం పొట్లాలు అందించిందాక ఆయువుండాలగదా

ఎలీకాప్టరొచ్చిందాక హంసెగిరిపోకుంట ఆగాల గదా

మరపడవలు తెప్పించేవరకి గురుకు జారిపోకుండ వుంతే గదా? అంటూ

 

కట్టండి నాయనా కట్టండి

మాము కప్పులడిపోయిన ఇసక దిబ్బల మీద

కట్టండి ప్రాజెక్టులు… అంటారు.

 

పెట్టుబడిదారీ మనస్తత్వాన్ని యిలా చెప్తారు మాస్టారు

 

యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది

మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తుంటాడు,

ఒక మారణ హోమం రగులుతూనే వుంటుంది

మరో మృత్యు యాగానికి ముహూర్తం నిర్ణయిస్తాడు.

 

మరణ మృదంగ నాదాలను మధుర సంగీతంగా

వినిపించగల మహా విధ్వాంసుడు వాడు

విద్యుద్ఘాతాలను బహుమతులుగా పంచగల

విద్వత్తు వాడిది……. అంటారు

 

అలాగే తెలంగాణా ఆకాంక్షను సమర్థిస్తూ

 

దుర్భరమే కావొచ్చు గాక ఎడబాటు

అదొక భవిష్యత్ పునస్సమాగమ సంతోష గీతిక,

వేదనా భరితమే కావొచ్చుగాక వేర్పాటు

అదొక మానవ మహోద్గమన సూచిక… అంటారు.

 

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగాక ఇంక రైతు చేసుకునే ఉగాది పండగ ఏముంటుంది అంటూ

 

గాదులు

ఇళ్ళముందునుంచి ఎగిరిపోయాక

ఉగాదులు ఒట్టి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి,

నాగలి

పురావస్తు ప్రదర్శనశాలలోకి పయనమైపోయాక

నాగేటి చాలొక చెదిరిన స్వప్నమైపోయింది….

లోహమహిషం ముందు నేను మోకరిల్లినపుడే

కొత్తామసకి కాలం చెల్లిపోయిందంటారు…

 

ఈ సంకలనంలో సద్దాం హుస్సేన్ ఉరిని టీవీలో చూస్తూ చలించి రాసిన ఈ కవిత

 

ఆకాశమంత నోటితో భూగోళం

నిరసన గీతం ఆలపిస్తుంటే

ఆత్మగౌరవ నినాదానికి అమావాస్య ముసుగువేసి

అహం నిస్సిగ్గుగా నవ్వింది.

ఆచ్చాదన లేని స్వేచ్చా విహంగం

ఉరితాడును ముచ్చటగా ముద్దాడింది

 

డాలర్ ఎగరేస్తున్న తుపాకీ మొనగాడి దగ్గర

భూగోళాన్ని వేలాడదీసే ఉరితాడు ఉందంటారా… అని ప్రశ్నిస్తారు.

 

గోర్కీ స్మృతిలో, భగత్ సింగ్ స్మృతిలో రాసిన కవితలతో పాటుగా తమ ఇంట్లో వొంగిన ఇంద్రధనస్సు మనవరాలిపైనా రాసిన కవితలతో పాటుగా ఉద్యమంలో అసువులు బాసిన వారిపట్ల సానుభూతితో రాసిన కవితలు ఇలా మనల్ని కదిలించి ఆలోచింప చేసే పద చిత్రాలతో నిండైన కవిత్వాన్ని మనకందించారు గౌర్నాయుడు మాస్టారు. తప్పక చదివి కదలాల్సిన కవిత్వం. ఇది స్నేహకళా సాహితి, పార్వతీపురం వారి ప్రచురణ. ప్రతులకు

 

గంటేడ కిరణ్ కుమార్

S.N.P. Colony,

Near Ramalayam, Belagam,

Parvathipuram – 535 501.

 

వెల: రూ.70/- లు.

  – కేక్యూబ్ వర్మ

 varma

 

 

మీరు ఒకసారి ఆగి చదవాల్సిన నరేష్ కవిత!

కవిత్వం కొన్ని సార్లు అలవాటుగా చదివేస్తూ పోలేం. అక్కడక్కడా కొద్ది సేపాగి మనల్ని మనం తడుముకుంటూ దాగి వున్న కాసింత నెత్తుటి గాయపు తడిని స్పర్శిస్తూ ఒక్కో పాదం అంచునుండి కిందకు పోగలం. వెళ్తూ మరల పైకి ఒకసారి చదవాలనిపిస్తుంది. చదివి కనుల తడిని తుడుచుకోబుద్ధి కాదు. అలాంటి కవిత్వం ఈ మధ్య యువ కవి కెరటం నరేష్ కుమార్ రాస్తున్నాడు. కవిసంగమం ద్వారా పరిచయమయిన ఈ అబ్బాయి కవిత్వం తనలాగే నిటారుగా నిబ్బరంగా మనముందు నిలిచి వుంటుంది.

nareshkumarచాన్నాళ్ళుగా కవిత్వం చదువుతున్న మీరు, రాస్తున్న మీరు ఒకసారి ఆగి చదవాల్సిన కవిత్వం నరేష్ కుమార్. వ్యక్తిగత పరిచయంలోనూ తన నవ్వు వెనక వుండే ఒక విషాదపు జీర ఈ కవి అక్షరంలో కూడా ఒదిగి వుంటుంది. ధిక్కార స్వరంలా గర్జించేటపుడైనా ఒక మార్థవం మూర్తీభవించడం గమనించవచ్చు. ప్రతి పాదంలోనూ స్వేచ్చగా ప్రతీకలకోసం తపన పడకుండా ఒక్కో పదం అల్లుకుపోతూ సూటిగా సరళంగా హృదయాన్ని తాకేట్టు చెప్పడం నరేష్ కవిత్వంలో మనకు ఎరుకవుతుంది.

ఇది ఇప్పుడు రాస్తున్న యువ కవుల ధారగా మనం గుర్తించ వచ్చు. కవిత్వాన్ని సుళువుగా నిస్సంకోచంగా నిర్భయంగా రాస్తున్న నేటి యువకవితరంలోని వాడిగా ఇటీవల ‘వాకిలి’లో వచ్చిన ఈ కవిత చదివి మరొక్క మారు అందరం చదువుదామని ఈ పరిచయం.

 

నిరాసక్తం

ఎందుకు వెలిగించి ఉంటారు
ఎవరైనా ఆ దీపాన్ని..!?
కంటి కొలకుల్లో మసిని తుడిచి వెచ్చని వెలుతురు
స్రవించేలా ….
జిగటగా కారే వెలుతుర్లో చేతిని ముంచాక
స్వచ్చమైన చీకటితో
మనసుని కడిగేసి
ఎవరో
వెలిగించే ఉంటారు ఆ దీపాన్ని..
ఎవరివో
కొందరు బాటసారుల
నిర్నిద్రా సమయాల
నిరాసక్త నిరామయపు
నిశ్శబ్దాన్ని కరిగించి
కర్పూరపు పొడిగా
రాల్చుకున్నాక
స్వచ్చంగా
స్వేచ్చగా
వెలుగుని ఎగరెసేందుకు
వెలిగించి ఉంటారు
కొన్ని పగిలిపోయిన
ఆకాశాల
ముక్కలని వెతికేందుకు
ఏవో ప్రమదా వనాల
చిత్తడి దారుల్లో
ఈ ప్రమిదని
వెలుగుల కాగడాగా
వాడేందుకేమో
ఏమో మరి…
ఎందుకోమరి
వారా దీపాన్ని ఒక
దేహంగా వెలిగించి ఉంచారేమో
బహుశా…
ఒకనాటి అనామక
పాదాలకంటిన
ఎర్రని పారాణి గానో
పోరాటపు వెలుగుల
నెత్తుటి గుర్తుగానో
ఆ దీపాన్ని
ప్రజ్వలించి ఉండవచ్చు
లేదంటావా…
కొన్ని అస్పృశ్యపు
ఆత్మ కథలు
రాయబడగా మిగిలిన
సిరాని ఎవరైనా
అక్కడ వొంపిఉండొచ్చు…
ఆ వెలుగుతో
ఒక కౄర
ద్వాంతపు దంతాన్ని
ద్వంసం చేసి
ఉండొచ్చు
ఐనా మిత్రుడా…!
ఎవరు వెలిగిస్తేనేం
ఆ వెన్నెల దీపం
అమ్మ గోరుముద్దా కావొచ్చు
ఒకనాటి ప్రేయసి గోటి ముద్రా
ఐ ఉండనూ వచ్చు..
శాశ్వతత్వపు చీకటిని
కాసేపు మరిచేందు కైనా
ఆ దీపాన్నలా వెలగనీయ్
ఏమో…!
ఒకవేళ
ఆ దీపం నీ నుండి
వేరైపోయిన
నువ్వె అయి ఉండొచ్చు….

ఈ కవిత చదివాక కవితను గురించి మరల విడమర్చి చెప్పనక్కరలేదు. తను కోరుకుంటున్న వెలుగు మనలోనే మనతోనే వుండి మాయమయి పోవచ్చనే ఆర్తిని ప్రదర్శిస్తూ మనకు ఓ జలదరింపును కలుగజేస్తుంది. చదివాక ఒక నిట్టూర్పు మనలనుండి బయటపడి ఒక జాగరూకతను గుర్తుచేస్తుంది. ఇలా యింత సూటిగా రాసే కవిత్వం నేటి అవసరం. అది నరేష్ కుమార్ కు పట్టుబడింది. మరిన్ని కవితలను ఈ కవి నుండి ఆశిస్తూ అభినందనలతో.

-కేక్యూబ్ వర్మ

varma

 

 

కటకటాల్ని వెక్కిరించిన కవిత: కిటికీ పిట్ట

kitiki pitta

మోహన్ చిత్రకారుడుగా ఆ రంగంలో లోతైన విశ్లేషణా వ్యాసాలతో “అరుణతార”లో రచనలతో సుపరిచితుడు. 2005-06 మద్య కాలంలో తీవ్రమైన నిర్బంధ కాలంలో మోహన్ ఒకరోజు అనంతపురంలో యూనివర్శిటీ దారిలో నడిచి వెళ్తుండగా తెల్ల సుమోలో యూనిఫాంలేని పోలీసులు బంధించి పదిహేను రోజులపాటు తీవ్రమైన చిత్రహింసలకు గురిచేయగా ఆ చిత్రహింసల కొలిమిలోంచి పెల్లుబికిన సాంద్రమైన ఆర్థ్రత నిండిన ఆగ్రహ వాక్యం ఈ ఖైదు కవిత్వం.

 

ఖైదులోంచి అనేకమంది కవులు రచయితల రచనలు మనం చదివాం. కానీ ఈ కవిత్వంలో ఉన్న కొత్త చూపు మానవీయత శత్రువును కూడా తనను తాను ప్రశ్నింప చేసుకొని మనిషిని చేసే సౌందర్యాన్ని తన కుంచెనుండి కలానికి ఒలికిన లేలేత నెత్తుటి రంగు పూసిన గాయాల చిత్రవర్ణ కవిత్వం ఇది. రచయితగా చిత్రకారునిగా నలుగురికీ సుపరిచుతుడైన మనిషిని తన రాజకీయ విశ్వాసానికి యింత తీవ్రమైన చిత్రహింసల పాల్జేసి రాజ్యం మానసికంగా తనని బలహీనుణ్ణి చేయబూనడం అమానుషం. కానీ రాజ్యానికి ఇవేవీ అంటని మట్టికాళ్ళ మహారాక్షసి కదా? తన కాళ్ళు నరికివేయబడ్తాయన్న భయం వెంటాడి మనుషులను వేటాడుతుంది. కానీ నిబద్ధత నిమగ్నతగల మనిషి తన సుదూర స్వప్నాన్ని ఈ దేశ శ్రామిక వర్గ విముక్తిలో కాంక్షించే వాడిగా చెక్కు చెదరని ఆత్మవిశ్వాస ప్రకటనగా తన కలాన్ని పదును పెట్టే అవకాశంగా ఈ ఖైదు సమయాన్ని కూడా సద్వినియోగం చేయగల ధీశాలత్వం ఇదే సామాజిక సందర్భం యిస్తుందని ఈ కవిత్వం మరోమారు నిరూపిస్తుంది.

 

నిజానికి ఖైదులో వున్నది ఖైదీ పేరుతోను తనకు కాపలాగా వున్న ఉద్యోగి జైలర్ పేరుతోను ఇరువురు వున్నది జైలులోనే కదా అన్న స్పృహ జీతం తీసుకునే వాడికి వుండదు కదా? వాడికి తను మనిషినే అన్న స్పృహ నశించి ఉద్యోగ ధర్మం పేరుతోనో, తన నిస్సహాయతతోనో తోటి మానవునిపై మృగంలా అమలుచేసే చిత్రహింసల గురించి ఒకింత బాధ్యతతోనే మోహన్ వారిపై కూడా సానుభూతి చూపడం కవి హృదయాన్ని పట్టిస్తుంది.

 

నువ్వయినా ఎన్నిసార్లని గాయాలు చేయగలవులే

నువ్వయినా ఎన్నిసార్లని ప్రేమలు కోల్పోగలవులే

నేనైనా ఎన్నిసార్లని నిన్ను ద్వేషించగలనులే

ఇదుగో ఇటు

నా ముఖంలోకి సూటిగా చూడు

నా కళ్ళలో నీకే వెన్నెలా కనిపించడం లేదూ

నా నుదిటిమధ్య నీకే సన్నని జీవరేఖా పొడగట్టడం లేదూ

 

హు.. అవున్లే

చూపును కోల్పోతేనే గదా

నీ చేతులకు అసహజ చర్యలు మొలుచుకొచ్చేది

కార్పణ్యపు బిరడాను బిగించుకుంటేనే కదా

నీ హృదయ సున్నిత సంస్పర్శలు బండబారేది..

ప్రియ శత్రువా

నువ్వేం దిగాలుపడకు!

నీ భ్రమల విచ్చిత్తి కోసమే

నే బతికి బట్టకడతా

నాపై నువ్వెన్ని గాయాలకైనా పాల్పడు

నీలో మూల మానవుడు అంతరించడు

 

“గాయానికి గాయానికీ నడుమ

కాసింత తెరిపి

నాకే కాదు నీకూ కావాలి” అంటాడు కవి.

 

“పునరుత్థానం ఒక పురాకాంక్ష

వేటలో అసువులు బాసిన

ఆదిమానవుని ఖననంలో పోసిన

ఇంత కుంకుమా ఎర్రగంధమూ

వియోగపు రద్దుకు గొప్ప ఆశ్వాసన” అని విశ్వాస ప్రకటన చేస్తాడు కవి.

 

“హింస పాలబడిన పురాశరీరాన్ని

నిలువెత్తుగోడల మధ్య పడదోసి కూడా

తలుపుల భద్రత కోసమో

తలుపుల్లో దాగిన బతుకు భద్రత కోసమో

తాళంపైన తాళమేసుకునే

సంశయాత్మల విచికిత్సకు

విరగబడినవ్వుతున్నా” అని జైలు వాతావరణాన్ని హేళన చేస్తూనే

 

తలుపులంటే చెట్ల రూపాంతరాకృతులే కదా

తలుపులంటే రెండు చెక్కల కలయికే కదా!

 

చెట్ల రుతు సౌందర్యాలను ఆరాధించేవాణ్ణి

రెక్కల ఆవరింతలో కదిలిపోయేవాణ్ణి

తలుపు భౌతిక చలనాలనౌ తుంపేయవచ్చు

మరి మనసు తిరిగే స్వప్న ప్రపంచపు సంగతో– అని ప్రశ్నిస్తాడు కవి.

 

మోహన్ ఇందులో ఖైదులోనుండే బయట తనకోసం వేచివున్న అమ్మా, నాన్నా, చెల్లెల గురించి, తను రోజూ చూసే మందారం కొమ్మ తెంపిన అమ్మాయి గురించి కవిత్వం రాసారు. చిత్రహింసల మద్యలోంచే తన రాజకీయ విశ్వాసాన్ని బలంగా ప్రకటిస్తూ తన నుండి ఏ ఒక్క రహస్యాన్ని పొందలేకపోయిన శత్రువుని హేళన చేస్తూ విస్పష్ట ప్రకటన చేస్తారు. ’దేహం దేహమే రహస్యమైన చోట దేశంలో కోటానుకోట్ల రహస్యాలు’ అంటాడు కవి. ఈ కవిత్వం మొత్తం సరికొత్త ఉపమాన చిత్రలిపితో తాననుభవించిన చిత్రహింసలను మన కళ్ళకు కట్టినట్టు చూపుతూ శత్రువు యొక్క అమానవీయతను వాని నిస్సహాయతను బట్టబయలు చేయడం మనల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తూనే కర్తవ్య నిర్వహణకు గుండె నిబ్బరాన్నిస్తుంది.

కేక్యూబ్ వర్మ

varma

కలని ఆయుధం చేసుకున్న కవి అరసవిల్లి!

arasavilli krishnaకవిత్వానికి కవికి మద్య ఏ తెరలూ లేని మనిషి వుండాలని కోరుకోవడం అత్యాశ కాదు కదా? ఈ మాటెందుకంటే కవులుగా కథకులుగా చలామణీ అవుతూనే మాస్క్ తీస్తే వాళ్ళలో ఓ అపరిచిత మనిషి దాగుంటాడన్నది చాలా మందిలో చూస్తుంటాం. కానీ అరసవిల్లి కృష్ణ తన కవిత్వానికి జీవితానికి లోపలి మనిషికి బాహ్య రూపానికి తేడాలేని స్వచ్చమైన మానవుడు. దర్జీగా దేహానికి సరిపోయే దుస్తులను మాత్రమే కాకుండా మనసు పొరలను చేదించే అక్షరాలను అల్లిక చేసే కవిగా సామాన్య జీవితం గడుపుతూ సరళమైన పదాల మద్య తన భావోద్వేగాలను “తడి ఆరని నేల” గా మనముందుంచారు.

 

కవిత్వాన్ని తన నెత్తుటిలోకి ఆహ్వానించుకొని దేహమంతా ప్రవహింప చేసుకొని అదే తడితో తన సహజమైన సరళ పద చిత్రాలతో మనముందు సామాజిక వాతావరణాన్ని చిత్రించడంలో అరసవిల్లి తనదైన శైలిని పట్టుకుని చిత్రిక పట్టి మనముందు ఆవిష్కరిస్తాడు. వర్తమాన సమాజంలోని అన్యాయాన్ని సామాజిక సంక్షోభాన్ని రాజ్య నిరంకుశత్వాన్ని ఆగ్రహంగా ఎండగడుతూనే దానిని నినాదప్రాయం కాకుండా హత్తుకునేట్టు చెప్పడం ఈయన కవిత్వంలో చూస్తాం. 2008 నాటినుండి విరసం సభ్యుడిగా వుంటూ “సామాజిక నిబద్ధతతో కవిత్వాన్ని సృజిస్తూన్న అరసవిల్లి ఉద్యమ కవిత్వంలో సౌందర్యాత్మక విలువల్ని ప్రోదిచేస్తూ కవిత్వ భాషలోనూ, అభివ్యక్తిలోనూ, నిర్మాణంలో ఒక విలక్షణతని సాధించారంటారు” ప్రముఖ విమర్శకులు గుడిపాటి.

 

 

మరణం తర్వాత ఓ దీపం

ఆరిపోకుండా వెలుగుతుంది

 

సౌందర్యం కాలుతున్న

వాసన వెంటాడుతుంది

 

ఓ దేశాన్ని వెతుకుతున్నాను

ఒకే దేశం రెండు చేతులుగా కన్పిస్తుంది

ఒక చేతిలో ఆయుధముంది

రెండవ చేతిలో స్వప్నముంది

 

రైతుల ఆత్మహత్యలు, బూటకపు ఎదురుకాల్పులు, సామూహిక మానభంగాలు రాజ్యం చేయిస్తున్న మానభంగాలు దహనకాండలూ ఇలా మన కళ్ళముందు నిత్యమూ జరిగే సామాజిక చిద్రపటాన్ని తన కవితా వస్తువుగా తీసుకొని అరసవిల్లి కృష్ణ కవిత్వ గానం చేస్తున్నారు.

 

మరణం వ్యక్తిగతం కాదు

మరణం సామూహిక విషాదం

 

భూమితో నా సంభాషణ

గర్భంలో దాగిన పిండం వింటుంది

వినడం మట్టి ప్రయాణంలాంటిది.

 

వినడం భూమికి తెలిసినంతగా

అధికారలాలసకు తెలియదు.

 

ఈ దేశంలోని నదులన్నీ

స్త్రీల కన్నీళ్ళతో ప్రవహిస్తున్నాయి

 

స్త్రీలు కదా

సమాధానాలుండవు

ఏనాటికయినా

అడవి మాట్లాడుతుంది

ఆ పదకొండుమందికీ

ఆకాశం వందనం చేస్తుంది.

నిబద్ధతా కవిత్వ ప్రేమా రెండీటిని బాలన్స్ చేసుకుంటున్న కవి అరసవిల్లి!

-కేక్యూబ్ వర్మ

varma

రాదారి ఆవల

కేక్యూబ్ వర్మ

కేక్యూబ్ వర్మ

వాక్యమేదీ కూర్చబడక

చర్మపు రహదారి గుండా ఓ నెత్తుటి దారమేదో అల్లబడుతూ

ఒకింత బాధ సున్నితంగా గాయమ్మీద మైనపు పూతలా

పూయబడుతూ రాలుతున్న పూరెక్కలను కూర్చుకుంటూ

ఒడిలోకి తీసుకున్న తల్లి తన నెత్తుటి స్తన్యాన్ని అందిస్తూ

బాధ ఉబకని కనులు మూతపడుతూ జీవమౌతూ

చిద్రమైన దేహాన్ని సందిట్లో ఒడిసి పడుతూ మురిగిన

నెత్తుటి వాసన వేస్తున్న పెదాలను ముద్దాడుతూ ప్రాణమౌతూ

చితికిన వేళ్ళ మద్య ఎముకల పెళపెళలతో కరచాలనమిస్తూ

కాసింత దప్పిక తీరా గొంతులో పాటలా జారుతూ

ఏదో మూయబడ్డ రహదారిగుండా ఒక్కో రాయీ రప్పా

తొలగిస్తూ తొలుస్తూ వెలుతురినింత దోసిలిలో వెలిగిస్తూ

సామూహిక గాయాల మద్య ఎక్కడో అతికీ అతకని

రాతి జిగురు కర కరమని శబ్దిస్తూ కలుపుతూ

ఈ ఇసుక నేలగుండా పాయలుగా ప్రవహించిన జీవధార

ఇంకిన జాడలను వేళ్ళ మద్య తడిని వెతుకుతూ

దీపం కాలిన వాసనేదో దారి చూపుతూ ఒకింత

ఆశపు వత్తిని ఎగదోస్తూ చమురు ఇరిగిన రాదారిలో పయనమౌతూ

గమ్యం అగోచరమయ్యే వేళ ఓ తీతువేదో గొంతు పగిలిన

రాగదీపమౌతూ రెక్క తెగి నేలకు జారుతూ

ఈ నెత్తుటి చిత్రాన్ని ఆవిష్కరించే సమయం

యింకా ఫ్రేం కాలేక రాతిరి ముడుచుకుంటూ ఆకు దోనెలో దాగుతూ

– కేక్యూబ్ వర్మ