నేరాల బతుక్కి ఎదురీత!

trevor-noah-suit

 

రోజు కూడా ఆఫీసునుండి ఇంటికి వెళ్ళడానికి కారెక్కగానే NPRలో టెర్రీ గ్రూస్ ఫ్రెష్ ఎయిర్ ప్రోగ్రాం వస్తోంది. ఆనాటి అతిధి Trevor Noah. అతని గురించి నాకు అంతకు ముందు ఏమీ తెలియదు. తన ఆత్మకథ “Born A Crime:: Stories From a South African Childhood” మీద ఆరోజు ఇంటర్వ్యూ! అదే రోజు ఆ పుస్తకాన్ని అమెజాన్‌లో కొనేయడము, అది వచ్చిన వెంటనే చదవడం మొదలెట్టడమూ.

ట్రెవర్ నోవ తల్లి నల్లజాతి నేటివ్, తండ్రి స్విస్-జర్మన్ తెల్లవాడు. చట్త ప్రకారం జాతుల మధ్య లైంగిక సంబందాలు నిషిద్దం. అలాంటి చట్టాల మధ్య పుట్టాడు గనుక “నేను నేరానికి పుట్టాను” అంటాడు ట్రెవర్. ఈ పుస్తకం ట్రెవర్ నోవా జీవితం అనేకంటే ఆయన తల్లి పాట్రిసియ జీవితం, వివక్ష అధికారికంగా అమలవుతున్న చోట ఓ బాధితురాలి జీవితం, పల్లె నుండి పట్నానికి తన్ను తాను నడిపించుకొన్న పల్లెటూరి పిల్ల జీవితం, పితృస్వామ్య అధిపత్య వ్యవస్థలో నలిగి దానికి ఎదురొడ్డి నిలిచిన పడతి జీవితం, తన కొడుకే సర్వస్వంగా పెంచిన ఒంటరి తల్లి జీవితం, జీసస్‌ను తన రక్షకుడిగా మనఃస్పూర్తిగా విశ్వసించిన ఓ క్రైస్తవరాలి జీవితం.

ఇవి పుస్తకం చదువుతుండగా నాకు కనిపించిన కొన్ని కోణాలు. బహుశా మీరు చదివితే మీకు మరిన్ని కోణాలు కనపడవచ్చు. రచన ఆద్యంతం ఒక ఆహ్లాదకరమైన శృతిలో వుండి చివరిదాకా మూయనీయదు. కన్నీళ్ళు తెప్పించే ఘటనలను కూడా నవ్విస్తూ చెపుతాడు ట్రెవర్. బాధతో కన్నీళ్ళు వస్తుంటాయి..అదే సమయంలో పెదవులపై ఓ చిర్నవ్వుకూడా ప్రత్యక్షమవుతుంది మనకు.

ఉదాహరణకు డిల్లీ “నిర్భయ” దుర్ఘటనను గుర్తుకు తెచ్చే ఓ సంగతి ఇది. తనేమొ ఇంచుమించు ఆరేళ్ళప్పుడట. నెల్సన్ మండేలా జైలులోంచి విడుదయిలయిన రోజుల్లో..రోడ్లమీద తెగల మధ్య ఏవేవో గొడవలు, నిరసనలు. ప్రపంచం తల్లకిందులైనా తన తల్లి ఆదివారంనాడు చర్చికి వెళ్ళక మానదు. ఆరోజు కూడా చర్చికి బయలుదేరారు, ట్రెవర్ రానని ఎంత మొండికేసినా లాభం లేకపోయింది. తమ పాతకారును బయటకు తీద్దామంటే అది స్టార్ట్ అవకుండా మొండికేసింది. అప్పుడయినా ఆమె వెళ్ళకుండా మానేస్తుందేమొనని అతని ఆశ. ఉహు.. ఆమె కొంత దూరం నడిచి ఆ రూట్లో నడిచే ప్రైవేటు బస్సు (నల్లవాళ్ళున్న చోటకు ప్రభుత్వం నడిపే రెగ్యులేటెడ్ ప్రభుత్వ బస్సు సర్వీసులేవీ లేవట) పట్టుకొని వెళ్ళడానికి సిద్దమయింది. ఒకరు బస్సు నడిపే మార్గంలో మరొకరు ప్రయాణికులను ఎక్కించుకోకూడదని అవి నడిపే రౌడీ గుంపుల్లో ఒప్పందం.

అయితే బస్సుకోసం వేచి చూసి, చూసి ఇక రాదేమొననుకొని వాళ్ళు ఓ కారు ఆగితే అందులో ఎక్కబోతుండగా బస్సు వచ్చింది. వీళ్ళను ఎక్కించుకుంటున్నందుకు ఆ బస్సు డ్రైవరు దిగివచ్చి ఈ కారు డ్రైవరును కొట్తడం మొదలెట్టాడు. వీళ్ళు వాడికి ఎలానో నచ్చజెప్పి కారు దిగి బస్సు ఎక్కారు. ఆ బస్సులో వీళ్ళు తప్ప మరెవరూ లేరు. చిన్న పిల్లలను వేసుకొని ఒంటరిగా ఓ ఆడది అపరిచితుల కారులో వెళ్లడం ఎంత ప్రమాదమో ఈ బస్సు డ్రైవరు ఆమెకు నీతులు చెప్పడం మొదలెట్టాడట. కానీ ఈమె మరొకరు తనమీద పెత్తనం చేయడం సహించనిది. “నీ పని నువ్వు చూసుకో” అని చెప్పేసరికి వాడికి కాలింది.

అందులోనూ ఆమె మాట్లాడిన భాషను బట్టి ఆమె చోసా(Xhosa) జాతి అని అతనికి తెలిసిపోయింది. ఆ డ్రైవరేమో జులు(Xulu) జాతివాడు. జులు జాతి ఆడవాళ్ళు ఎక్కువగా సంప్రదాయం పాటించి ఇంటి నాలుగ్గోడలు దాటని వాళ్ళు. ఈమె ఓ మగాడికి ఎదురు చెప్పడం, అందులోనూ ఓ తెల్లతోలు పిల్లవాన్ని కలిగి వుండటం..వాని అహాన్ని దెబ్బకొట్టింది. (నిర్భయ వుదంతం గుర్తుకు రావట్లేదా?) “మీ చోసా ఆడవాళ్లతో ఇదే సమస్య. మీరంతా ఎవడితో పడితే వారితో తిరిగేవాళ్ళు. ఈరాత్రి నీకు బుద్ది చెప్పందే వదలను.” అంటూ వాడు ఎక్కడా ఆపకుండా బస్సు వేగం పెంచాడు. ఇక ఈమెకు ఏమి జరగబోతుందో అర్థమయ్యింది. అక్కడక్కడా రోడ్డు దాటుతున్నపుడల్లా వేగం తగ్గడం గమనించి అలాంటి ఒకచొట నిద్రమత్తులో జోగుతున్న ట్రెవర్‌ను ద్వారం లోంచి తోసేసి, మరో చిన్న పిల్లాడితో తనూ దూకేసింది. దూకిన వెంటనే పరుగు లించుకొని, దగ్గరలోని ఇరవైనాలుగ్గంటలూ తెరిచివుండే పెట్రోలు బంకు చేరారు.

“ఎందుకలా? ఎందుకు మనం పరిగెత్తాం?”

“‘ఎందుకు పరిగెత్తాం?’ ఏంటి? వాళ్ళు మనలని చంపాలని చూశారు.”

“నాతో ఎప్పుడన్నావ్ అలా? బస్సులోంచి అలా తోసేశావ్?”

“సరే నీతో అనలేదే అనుకో, మరెందుకు బస్సులోంచి దూకేశావ్?”

“దూకానా!!నేను నిద్రపోతుంటేనూ.”

“అంటే.. వాళ్ళు చంపేయడానికి నిన్ను వదిలేసుండాల్సింది.”

అలా తల్లీ-కొడుకుల వాదించుకుంటూ పోలీసుల కోసం ఎదురు చూస్తున్నారు.

కొడుకుతో ఆమె అంది, “హమ్మయ్య! దేవుడి దయవల్ల క్షేమంగా వున్నాము.”

అప్పుడు తొమ్మిదేళ్ళ ట్రెవర్ అంటాడు, “లేదు మమ్మీ, ఇది దేవుడి దయ కాదు. దేవుడు మనలని ఇంట్లో వుంచడానికే కారు స్టార్ట్ అవకుండా చేశాడు. మనం బయటకు వెళ్ళేట్లు చేసింది ఖచ్చితంగా దయ్యమే!”

“లేదు లేదు ట్రెవర్. అది దయ్యం పని కాదు. అది దేవుడి పథకమే. మనం ఇక్కడ వుండాలని దేవుడనుకొంటే దానికి ఓ కారణం వుండే వుంటుంది…”

“చూడమ్మా, నాకు తెలుసు నీకు జీసస్ అంటే ఇష్టమని. ఆయనకు అంత ఇష్టమయితే మనల్ని మన ఇంటి దగ్గరే కలవమను. ఈ రాత్రి జరిగిందేమీ సరదా కాదు.”

trevor-with-mother

ఆమె నవ్వుతూ మోకాళ్ళూ, మోచేతులూ పగిలి దుమ్మూ, రక్తం కలిసిపోయిన కొడుకును దగ్గరగా తీసుకొంది. అంత బాధలోనూ ట్రెవర్‌కూ నవ్వు వచ్చింది.

ఇది కేవలం ఓ చిన్న నమూనా మాత్రమే. మరింత సాగదీయకుండా వుండటానికి నేను ప్రతివాక్యాన్ని రాయలేదు గానీ, పుస్తకంలో ఇది చదివుతున్నపుడు, వాళ్ళిద్దరితోపాటు నాకూ బాధతో కూడిన నవ్వు వచ్చింది.

తను చిన్నప్పుడు బయటవాళ్లకు కనపడకుండా తన అమ్మమ్మ ఇంటిలో పెరిగాడు. తెల్ల పోలీసులకు కనపడితే తన తల్లిని “తెల్లవాడితో బిడ్డను కన్నందుకు” అరెస్టుచేసి నాలుగేళ్ళవరకూ జైలుకు పంపగలరు. అది నల్లవాళ్ళకు మాత్రమే ప్రభుత్వం కట్టిన ఒక కాలనీ. వసతులు అంతంత మాత్రం. ఏడెనిమిది ఇళ్ళకు కలిసి ఒక పబ్లిక్ టాయిలెట్ వుండేది. ముడ్డి తుడుచుకోవడానికి పాత వార్తాపత్రికల కట్ట ఆ పక్కన వేలాడదీసివుండేది. ఆ క్రింద వున్న పెద్ద గోతిలోని పెంటమీద ఈగలు ఝామ్మంటూ తిరుగుతుండేవి. ఆ ఈగలన్నా, ఆ వాసన వేసే చోటన్నా ట్రెవర్‌కు తెగ భయం. ఓరోజు బయట వర్షం కురుస్తోంది. తన పొట్ట కుతకుతమంటూ టాయిలెట్టుకెళ్ళమని తొందరపెడుతోంది. ఇంట్లో తన గుడ్డి బామ్మ తప్ప ఎవరూ లేరు. అప్పుడు ట్రెవర్ ఏమి చేశాడో, ఆ తర్వాత దేవుడు-దయ్యాల నమ్మకాలతో తన తల్లి, అమ్మమ్మ ఏమి చేశారో తెలుసుకుంటే పడీ, పడీ నవ్వుతారు.

ట్రెవర్ అమ్మ తన ఇంట్లో రెండో పిల్ల. తనకు ఓ అక్క, ఓ తమ్ముడు. అందరు నల్లవాళ్ళ ఇళ్ళకు వలెనే తన తండ్రి దూరంగా ఎక్కడో ఎదో గనిలో పనిచేస్తూ అప్పుడప్పుడూ ఇంటికివచ్చేవాడు. ఈమె చిన్నప్పట్నుంచి ఇంటికి కట్టుబడి వుండే రకం కాదు, అందుకనేమో బయటకు వెళ్ళి వస్తుండే నాన్న అంటే ఇష్టం. తన అమ్మానాన్నలు విడిపోతుంటే తన అక్కా, తమ్ముడిలా కాకుండా తను తండ్రితోవుంటానని మారాము చేసింది. కానీ తండ్రి తనను ఎక్కడ పెట్టగలడు. దూరంగా ఎక్కడో తెల్ల ప్రభుత్వం నల్లవాళ్ళకు కేటాయించిన రిజర్వు భూముల్లో సేద్యం చేసుకుంటూ వుండిన తన అక్కదగ్గర వదిలేసి వెళ్ళాడు. ఆ యింటిలో ఈమెలా ఇంకా పదిహేనుమంది పిల్లలు.

తెల్లవారింది మొదలు రోజంతా గొడ్డు చాకిరి. పొట్ట నిండని రోజుల్లో బురదమట్టిని నీళ్ళలో కలుపుకొని పొట్టనింపుకొన్న రోజులు. అంత అధ్వాన్నపురోజుల్లోనూ ఒక కాంతిరేఖ ఏమిటంటే ఆవూర్లో మిషనరీ స్కూలు వుండటం. అక్కడ ఈమె ఇంగ్లీషు నేర్చుకుంది. ఈమె తన అత్త చివరిరోజుల్లో వుండగా మళ్ళీ తన తల్లిని చేరింది. అక్కడ నేర్చుకొన్న ఇంగ్లీషు పరిజ్ఞానంతో క్లర్కు కోర్సులు చేసి క్లర్కుగా పనిచేయటం మొదలు పెట్టింది. ఇదేమీ చిన్న విషయం కాదు.

ఓక చోట దక్షిణాఫ్రికా జాతుల గురించి చెబుతున్నపుడు మన దేశపు ఆర్య-ద్రావిడ జాతుల మధ్య కొన్నివేల ఏళ్లకిందట ఇదే జరిగివుంటుందా అని ఆలోచన వస్తుంది. మూడొందల ఏళ్లక్రితం ఇండియా వెళ్ళేదారిలో మజిలీగా ఆగారు డచ్చి వాళ్ళు ఇక్కడ. అక్కడ వున్న నేటివ్స్‌తో సంబంధాల వల్ల, వీళ్ళ పొలాల్లో పనిచేయడానికి తెచ్చుకొన్న వేర్వేరు డచ్ కాలనీలనుండి తెచ్చుకున్న జాతుల వల్ల ఒక మిశ్రమ జాతి ఏర్పడింది. అసలు నేటివ్స్ (Khosian) పూర్తిగా అంతరించిపోయి, ఈ మిశ్రమ జాతులే మిగిలాయి. ఈ మిశ్రమజాతిని “రంగుజాతి”(Colored)గా పిలిచారు.

ఈ మిశ్రమజాతిలో కొందరిలో ఆఫ్రికన్ నల్లజాతి లక్షణాలు వుండవచ్చు, యూరోపియన్ తెల్లజాతి లక్షణాలు వుండవచ్చు, ఇండియన్ లక్షణాలూ వుండవచ్చు. ఇద్దరి రంగుజాతి తల్లిదండ్రులకు వారిద్దరి రంగూకానీ పిల్లలు పుట్టడం అసాధారణమేమీ కాదు. ద్రావిడులు నల్లవారు, ఆర్యులు తెల్లవారు అనుకుంటే, ఇద్దరి నల్ల తల్లిదండ్రులకు తెల్ల రంగుతో బిడ్డ పుట్టడం మనకు ఆశ్చర్యం కాదుగా!

ఇందులో అంతా అమ్మ గురించే కాదు, బాలుడిగా ట్రెవర్ అనుభవాలు, చిన్న చిన్న దొంగతనాలు, యువకుడిగా వాలంటైన్స్ డే గురించిన అవమానాలు కూడా బాగా చదివిస్తాయి. ఒక యూదుల స్కూల్లో, “హిట్లర్” పేరున్న తన మిత్రుడితో వెళ్ళి డాన్సు చేయడం, అక్కడ జరిగిన రసాభాస. మ్యూజిక్ సిడీలను కాపీ చేసి సీడీలు అమ్మే వ్యాపారం, ఓ వారం రోజులు పోలీసు కస్టడీలో జీవితం ఇదంతా అతన్ని మాటల్లోనే చదవడం చాలా గమ్మత్తుగా వుంటుంది.

పితృస్వామ్య వ్యవస్థలో పోలీసులు ఎలా పనిచేస్తారో చూస్తే అది ప్రిటోరియా అయినా మన పిఠాపురం అయినా ఒకటే అని తేలుతుంది. తన తల్లిని తన సవతి తండ్రి కొడితే ఆమె దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళుతుంది ఫిర్యాదు చేయడానికి. ఆ పోలీసులకు భర్త మీద ఫిర్యాదు చేయడం వింతనిపిస్తుంది. ఎంత గట్టిగా అడిగినా కేసు రిజిష్టర్ చేసుకోరు. చివరికి ఆ సవతి తండ్రి పోలీసు స్టేషనుకే వచ్చి పోలీసులకు అది చిన్న గొడవే అని సర్ది చెప్పి ఆమెను తీసుకెళిపోతాడు. అలాంటి కొన్ని ఘటనల తర్వాత అతను ఆమెను చంపడానికి తుపాకీతో కాలుస్తాడు కూడా!

trevor-grandmother

ఇలా వుంటుంది పోలీస్ స్టేషన్లో సంభాషణ.

ఇద్దరు చిన్న పిల్లలతో రాత్రిపూట కిలోమిటరు నడిచి పోలీస్ స్టేషన్ చేరుకున్న ఆమె అక్కడున్న ఇద్దరు పోలీసులతో..

“ఫిర్యాదు చేయడానికి వచ్చాను”

“దేనిమీద ఫిర్యదు చేయడానికి వచ్చావు?”

“నన్ను కొట్టిన ఓ మగాడి మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాను.”

“ఓకే.. ఓకే.. నిదానం, నిదానం. నిన్ను కొట్టిందెవరు?”

“నా భర్త”

“నీ భర్తా? నువ్వేం చేశావు? అతనికి కోపమొచ్చేటట్లా ఏమయినా చేశావా?”

“నేను… చేశానా? లేదు. అతను నన్ను కొట్టాడు. నేను అతనిమిద ఫిర్యాదుచేయడానికి వచ్చాను.”

“నో మాడమ్. ఎందుకు కేసు కేసంటావు? ఏం నిజంగానే కేసు పెడతావా? ఇంటికెళ్ళు, నీ భర్తతో మాట్లాడు. ఒకసారి కేసు పెట్టావంటే మళ్ళి వెనక్కు తీసుకోలేవు. అతనిమీద నేరగాడన్న ముద్ర పడుతుంది. అతని జీవితం మళ్ళీ ఇలా వుండదు. నీ భర్త జైలుకు వెళ్ళాలని నిజంగానే కోరుకుంటున్నావా?”

ఇలా ఆమె కేసు పెట్టమని పోరుతున్నంతలోనే ఆమె భర్త అక్కడికి చేరుకుంటాడు. అతని కళ్ళు ఇంకా మత్తులో వున్నట్లు తెలుస్తూనే వుంది. అయినా లోపలికి వచ్చి “హలో బాస్, మీకు తెలియదా ఆడవాళ్లతో వ్యవహారం? ఏదో కొద్దిగా కోపం వచ్చిందంతే!”

“తెలుసులేవోయ్! మాకు తెలుసు, అప్పుడప్పుడూ ఇలా జరుగుతూ వుంటుంది. ఏం పట్టించుకోకు.”

అంతే, పోలీసులు కేసు రాసుకోలేదు. అతన్ని కనీసం మందలించలేదు. పితృస్వామ్యంలో భర్త కొడితే భార్య పడి వుండాలి. అది మామూలు విశయం. పోలీసులు దాన్ని మామూలు విశయంగా తీసుకోకుండా మరెలా తీసుకుంటారు?!

ఇలా ఈ పుస్తకం నిండా ఎన్నింటినో మనం చూడవచ్చు.

*

 

 

 

 

వెంటాడే ప్రశ్నల పెరుమాళ్ నవల!

murugan

పెరుమాళ్ మురుగన్ గానీ ఆయన రచనలు గానీ నాకు తెలిసింది ఆయన రాసిన “మాధుర్భగన్” వివాదాస్పదమయ్యాకే. దీన్ని అనిరుద్దన్ వాసుదేవన్ ఆంగ్లంలోకి “One Part Woman” పేరుతో అనువదించారు. తమిళం మాతృక పేరు “మాధుర్‌భగన్”, “మాదోర్‌భగన్”, “మాధోర్‌భాగన్” ఇలా వేర్వేరుగా అక్కడక్కడా రాయబడింది. ఏదీ సరైనదో తమిళం తెలిసిన వారు చెప్పాలి.

కథంతా తృతీయ పురుషలో వుండినా అక్కడక్కడా ఆయా పాత్రల స్వగతంతో ప్రథమపురుషలోనూ వుంటుంది. వరుసక్రమంలో కథ నడిచినట్లున్నా సందర్బాన్నిబట్టి ఆయా పాత్రల ఆలోచనల్లో, సంబాషణల్లో వెనక్కి, ముందుకూ వెళుతూ వుంటుంది. అయినా ఎక్కడా వర్తమానాన్ని వదిలిపెట్టిన స్పృహ వుండదు. చాలా సహజంగా కథ నడుస్తూ వుంటుంది. నాకు అలవాటులేని పాత్రల పేర్లు కావడం వల్లనేమో కథ మొదలయిన చాలా సేపు “కాళి” అనగానే నాలో అమ్మాయి మెదిలేది. కాళి పేరులో అబ్బాయిని చూడటం కాస్తా యిబ్బంది పెట్టింది.

పిల్లలు లేని యువదంపతుల ఆవేదన ప్రతి దృశ్యంలోనూ కనిపిస్తుంది. కాసే చెట్టు, ఈనే ఆవు, పిల్లల కోడి, ఆడే పిల్లలు … ఇలా ప్రతిదీ ఆ కోణంలోనే వారికి కనిపిస్తుంటుంది. పిల్లలు నిజంగా వారికోసం కావాలా? లేక కేవలం సమాజపు మెప్పుకోసం, అంగీకారం కోసం కావాలా అన్న ప్రశ్న మనలను వెంటాడుతూవుంటుంది.

నవలా నేపథ్యం స్వాతంత్య్ర పూర్వం తిరుచెంగోడ్ పట్టణ పరిసర పల్లెలు, తిరుచెంగోడ్ తిరునాళ్ళు. కాళి, పొన్నయి అనే దంపతుల చుట్టూ అల్లబడిన నవల. పెళ్ళి అయిన మూడు నెలల నుండీ ప్రారంభమవుతుంది కథనం. పెళ్ళి అయి నెలలు గడిచేకొద్దీ పిల్లలు కలగని దంపతుల అవస్థలు ఎలా వుంటాయో ఈ ఆధునిక యుగంలో కూడా నాకు కొంత పరిచయమే. అలాంటిది ఎటువంటి వైద్యపరమైన చికిత్సలూ, బిడ్డలు కలగకపోవడానికి గల కారణాలు కనుక్కోగల పనిముట్టులూ లేని ఆ రోజుల్లో ఓ పల్లెటూరిలోనిలోని దంపతుల వ్యథ ఎలావుంటుందో చెప్పనలవిగాదు. కొంతమంది తెలిసీ, మరికొంతమంది తెలియకా పిల్లలు కలగని వారిని మానసిక వత్తిడికి గురిచేస్తూ వుంటారు. ఆ వత్తిడి ఎన్ని మార్గాల్లో, ఎన్ని విధాలుగా వుంటుందో తెలిస్తే ఓ విధమైన షాక్‌కు గురవుతాము.  

కథలోకి వస్తే కాళి, పొన్నయి ఒకరిపై ఒకరికి అనురాగమున్న కొత్త దంపతులు. పెళ్ళి అయిన మరుసటి నెల నుండే నెల తప్పలేదేంటని కంగారు మొదలవుతుంది. పిల్లలు పుట్తకపోవటమన్న బెంగ పీడిస్తూవుంటుంది. వూరి జనాలవల్ల రకరకాలుగా అవమానింపబడతారు. కాళి పెళ్ళికి ముందు తన మిత్రబృందంతో ఎంతో కలివిడిగా, హుషారుగా తిరిగినవాడు. కానీ పెళ్ళయిన కొన్ని నెలలనుండీ ఏదో సందర్భంలో మిత్రులనుండి తను నపుంసకుడు అన్న అర్థంలో మాటలు పడాల్సి వస్తుంది. అప్పటినుండి మెల్లమెల్లగా తనలోకి కుచించుకుపోతాడు. మొదట తన తల్లి రెండోపెళ్ళి గురించి మాట్లాడినా తన భార్య స్థానంలో మరో స్త్రీని వూహించుకోలేడు. అదీగాక తనలోనే లోపముండీ ఆమెకూ పిల్లలు పుట్టకుంటే ..అన్న ఆలోచనే భయంకరంగా అనిపిస్తుంది. తను కేవలం ఇంటికీ, పొలానికే పరిమితమయి ఈ బయటి హేళనల నుండి కాస్తా వుపశమనం పొందినా, పొన్నయి అవమానపడిన ప్రతిసారీ ఆమెను ఓదార్చలేక కృంగిపోతూవుంటాడు. ఇద్దరూ ఒకరిలోఒకరు కరిగిపోవడం ద్వారా వుపశమనం పొందుతూ వుంటారు.

ఆమె గొడ్రాలుతనాన్ని అలుసుగా తీసుకొని ఆమెను పొందాలని ప్రయత్నిస్తాడొకడు. వాళ్ళకు ఎలాగూ పిల్లలు లేరు కదా వారి తదనంతరం ఆస్తి తమపిల్లలకు చేజిక్కించుకోవచ్చని దూరపు బంధువులు తమ పిల్లలను వీరింటికి పంపుతూ వీరికి చేరువ చేయాలని చూస్తూ వుంటారు. ఓ అమ్మాయి పెద్దమనిషి అయినప్పుడు జరిపిన వేడుకలో పొన్నయిని దూరంగా వుంచుతారు. ఓ గొడ్రాలు దీవిస్తే ఆ అమ్మాయికి అశుభం అని వాళ్ళ నమ్మకం.

“కూడబెట్టి కూడబెట్టి ఏమి చేసుకుంటారు డబ్బుని, బాగా తిని, మంచి బట్టలు వేసుకొని హాయిగా వుండండి.” అంటుంది ఆమె ఆడపడచు ఒకసారి. “ఏం, ఇప్పుడు మేము ఆకలితో ఛస్తున్నామా? బట్టలు లేకుండా మీయింటిముందు బిత్తల తిరుగుతున్నామా?” అని పొన్నయి విరుచుకుపడుతుంది. పక్కవూరిలో తన స్నేహితురాలి ఇంట్లో పెళ్ళికి వెళుతుంది ఓసారి. ఆ స్నేహితురాలు ఈమెను తనకు సహాయపడటం కోసం పెళ్ళి సమయం కంటే బాగా ముందే రమ్మన్నా, ఎవరూ తోడులేకపోవడంతో అందరితో పాటే వెళుతుంది. “ముందే రమ్మని చెప్పినా ఇప్పుడు వస్తున్నావు, నీ కూతుర్లను తయారుచేసేసరికి ఇంత ఆలస్యమయ్యిందా?” అని నిష్టూరమాడుతుంది ఆమె. పొన్నయి అక్కడ కోపంతో ఏమేమో అని పెళ్ళి చూడకుండానే తిరిగి వెళ్ళిపోతుంది.

పొన్నయి ఎన్నోసార్లు తన పొలంలో ఏమి నాటినా విరగ్గాసింది. ఏ కోడిని పెంచినా పిల్లల్లని తెగ పొదిగింది. తన యింట్లో మేక, గేదె దూడలని కంటూనే వున్నాయి. తన పొరుగువారి పొలంలో ఒకసారి గొర్రులకు విత్తనం అందించే పనిచేస్తుంది పొన్నయి. అదికూడా ఆ పొలం యజమాని కోరితేనే! అయితే అదనులో విత్తకపోవడంవల్ల పంట ఆశించినట్లు రాదు. వూరంతా గొడ్రాలు చేయి తగిలిన విత్తనం ఎలా పైకి వస్తుందని గుసగుసలు పోతుంది.

గొర్రెలు తనపొలంలో పడి తింటున్న ఆక్రోశంలో పొన్నయి ఆ గొర్రెల కాపరిని తిడుతుంది. ఆ గొర్రెల కాపరి “వారసులు లేని ఆస్తిని మూటగట్టుకొని పోతావా” అని నిందిస్తుంది.

తన యింటికి వచ్చి ఆడుకునే పిల్లలను బాగానే చూసేది పొన్నయి. కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఆడుకుంటూ దెబ్బ తగిలించుకుంటే “పిల్లలుంటే కదా తెలిసేది పిల్లలని ఎలా చూసుకోవాలో” అని ఆ పిల్లాడి తల్లి రుసరుసలు పోతుంది.

ఇలా అనుదినమూ అవమానాలు పడే వాళ్ళకు నల్లుపయ్యన్ మామ ఒకడే ఊరట. అతను పెళ్ళిచేసుకోకుండా వుండిపోయివుంటాడు. పిల్లలు లేనంత మాత్రాన ఏ నష్టమూ లేదని, వూరి మాటలని పట్టించుకోవద్దని వీళ్ళకి స్వాంతన కలిగిస్తూ వుంటాడు.

చివరికి వీళ్ళకు ఇక పుట్టరని నిర్ణయానికి వచ్చిన పొన్నయి తల్లి, తండ్రి, అన్న, కాళి అమ్మ కలిసి పొన్నయిని తిరుచెంగోడు తిరునాళ్ళకు పదులాలుగవ రోజు తీసుకెళ్ళాలని యోచన చేస్తారు. కానీ అది పొన్నయికి, కాళికి ఎలా చెప్పాలో తెలియక తర్జనభర్జన పడతారు. చివరికి ఆ ఆలోచనని కాళి తల్లి కాళితో చెబుతుంది. కాళి సుతారామూ అందుకు ఒప్పుకోడు. ఓ ఏడాది పైగా పొన్నయితో ఆమాట చెప్పడానికి కూడా ఒప్పుకోడు. చెబితే తన ప్రతిస్పందన తీవ్రంగా వుంటుందని, ఒప్పుకోదన్న అంచనాలో వుంటాడు. కానీ ప్రతిసారి తిరునాళ్ళ పండగ రోజులని అత్తవారింట్లో గడిపే వాళ్ళకు ఆ ఏడాది నుండీ ఎందుకు కాళి వద్దంటున్నాడో పొన్నయికి అర్థంగాక నిలదీస్తుంది. అప్పుడు కాళి పెద్దవాళ్ళ ఆలోచనని బయటపెట్టి “పద్నాలుగవ రోజు నిన్ను పంపుతామంటున్నారు. వెళతావా?” అని కోపంగా అడుగుతాడు. అయితే భర్త అంతరంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోని పొన్నయి “నువ్వు వెళ్ళమంటే వెళతానంటుంది”. అందులో భర్త పట్ల ప్రేమ, బిడ్డల పట్ల కాంక్ష తప్ప తనకింకో దురుద్దేశం లేదు. అయితే ఈ సమాధానంతో కాళి నిరుత్తరుడవుతాడు.

ఇలా భార్యాభర్తల మధ్య, ఇరుగుపొరుగు మధ్య జరిగే మాటల ఘర్షణ, మనోభావాల ఘర్షణ, అంతరంగాల ఘర్షణ ఈ నవలంతా! ఇంతకీ ఆ తిరునాళ్ళలో పద్నాలుగవ రోజు విశేషమేమిటంటే… పెళ్ళయిన, పిల్లలు కలగని ఆడవాళ్ళు ఆరోజు ఏ అపరిచుడితోనే సంగమించి పిల్లలని కలగడమనే ఆచారం. దాన్నెవరూ తప్పుగా అనుకోరు. ఆ దేవుడే ఆ అపరిచితుడి రూపంలో వచ్చి గర్భదానం చేశాడనుకుంటారు. దాన్ని అప్పటి సంఘం ఆమోదించింది.

పొన్నయి వెళ్ళిందా? కాళి పంపించాడా? ఆ తర్వాత ఏమి జరిగింది అన్నదానికోసమే కాకుండా ఓ పిల్లలులేని దంపతుల ఆవేదన, అవమానాలు, అప్పటి పల్లె జీవితం చుడాలంటే తప్పక చదవాల్సిన నవల ఇది. amazon.comలో కొన్ని ప్రతులు ఇంకా దొరుకుతున్నాయి.

అయిదు మంది భర్తలను కలిగిన ద్రౌపదిని అంగీకరించి, ఇదే పద్దతిలో పుట్టిన పాండవులను, కౌరవులను అంగీకరించిన సమాజంలో, అలాంటి ఒక ఆచారం గురించి చెప్పినంతమాత్రానికి ఈ నవల మీద రచ్చ జరగడం ఆక్షేపణీయం. ఆ ఆచారాన్ని పక్కనబెట్టి ఓ గొడ్రాలు (ఈమాట అనాలంటే మనసు రావట్లేదు, కేవలం పిల్లలు కలగని స్త్రీ అనే అర్థంలో మాత్రమే అంటున్నాను) పడే రోజువారీ అవమానాలు, ఆ భర్త ఎదుర్కొనే అవమానాలు వీటిని గురించి చర్చ చేయాలి. కానీ అది పక్కన బెట్టి కేవలం తనకు నచ్చని ఓ కోణాన్ని మాత్రమే పైకి తెచ్చి రచ్చ చేశారు. ఈరోజుకీ పిల్లలు లేని ఆడవాళ్లని, భర్త చనిపోయిన ఆడవాళ్లని ఎన్నెన్నో మాటలతో అవమానించడం మనం చూడవచ్చు. ఆ విషయమై చర్చ జరిగివుంటే ఈ రచన ఆ బాధలు పడే స్త్రీలకు కొంతైనా స్వాంతన కలిగించి వుండేది!

*