కారా: కదనరంగంలో వున్న రిపోర్టర్‌

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

కా.రా. గారు తన కథల్లో అనుభవం నుంచి వచ్చే అవగాహనకు,  విజ్ఞతకు ఆఖర్న చైతన్యానికి  చాల ప్రాధాన్యతనిస్తారు. అది న్యాయమే. కాని ఆశ్చర్యంగా కారా గారి రాజకీయ అవగాహన మాత్రం ఆయన పరిశీలన నుంచి వచ్చింది. ఆ పరిశీలన నీళ్లల్లో వున్న తామరాకు పరిశీలన వంటిది. ఆ తామరాకు నీటిలో ఎంత మమేకంగా ఉంటుందంటే ఆ ఆకు మీద కూడ నీటి చుక్కలుంటాయి. అయినా ఆ తామర నీటి కొలది లోతుగా వుంటుంది. ఆ నీళ్లు అంటకుండా నీటిస్వభావం గురించి, బురద అంటకుండా బురద స్వభావం గురించి చెప్తుంది. కారా కదనరంగంలో వున్న రిపోర్టర్‌ వంటి కథకుడు.

ఒక కథకునికి ఉండవలసిన వస్తుగతదృష్టి (ఆబ్జెక్టివిటీ అనే అర్థంలో) అలవడడానికి బహుశా ఆయన నేపథ్యం ఆయనకు బాగా అనుకూలించింది. శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు. కాని ఆదివాసీ ప్రాంతంలో కాదు. మైదానప్రాంతంలో  పల్లెటూళ్లో పుట్టి పల్లెటూళ్లో పెరిగారు. పనిచేసే కులాల్లో కాదు. ఇవి ఆయనకు నిమగ్నమై వుంటే ఉండే ఆవేశానికి బదులు పరిశీలన వల్ల వచ్చే సంయమనానికి దోహదం చేసినయి. చిన్పప్పటినుంచే లెక్కలు కట్టే వృత్తికి తోడు ఆయన క్రమంగా లెక్కల విద్యార్థి, లెక్కల మాస్టారు అయ్యారు. కారా గారికి రానురాను మేస్టారు అనేది పర్యాయపదంగా స్థిరపడిరది. 1951 నుంచి 72 దాకా ఆయన కథల్లో మనకి లెక్కలమాస్టారుకుండే ఔచిత్యం (ప్రిసిషన్‌), పరిశీలన కనిపిస్తాయి. శైలిలో కూడ లెక్కల్లో  ఉండే దశలు (స్టెప్స్‌) కూడ అట్లా తప్ప ఊహించుకోలేని విధంగా వచ్చిపడతాయి. బహుశా తెలుగుకథకుల్లో చరిత్ర, భూగోళాలు, స్థలకాలాలు స్వప్నావస్థలో కూడ విస్మరించని అరుదైన స్పృహ గల వాళ్లలో ఆయనొకరు.

పొలిటికల్‌ ఎకానమీకి ఇవన్నీ ఒక వాతావరణాన్ని కల్పిస్తాయి. పరిసరాలను సమకూరుస్తాయి. ఈ సామాజిక దేశకాల పాత్రల నుంచి ఆ దేశ రాజకీయార్థిక నేపథ్యం ఏర్పడుతుంది. లెక్కల విద్యార్థిగా, మేస్టారుగా, శ్రీకాకుళం జిల్లావాసిగా 1857 నుంచి 1972 దాకా సామాజిక పరిణామాల నాడిని ఆయన పట్టుకున్నారు.

 

ఆస్తి సంబంధాలు శ్రమదోపిడీ

ఈ అవగాహన ఆయనకు 1951లో ‘అప్రజ్ఞాతం’ కథ రాసేనాటికే ఏర్పడుతున్నది. అప్పటికి దేశం నుంచి బ్రిటిష్‌వాళ్లు వెళ్లిపోవడం అధికారం కాంగ్రెస్‌ హస్తగతం కావడం, రాజ్యాంగ రచన, తెలంగాణలో కమ్యూనిస్టుపార్టీ సాయుధపోరాట విరమణ చేయడం జరిగిపోయాయి. మొదటి సాధారణ ఎన్నికల్లోకి పోబోతున్నాం.

‘అప్రజ్ఞాతం’ కథలో సుదర్శనం యువకుడు. బి.ఎ. పరీక్షలకు కూర్చున్నాడు. ఫలితాల కోసం ఎదురుచూస్తూ స్వగ్రామంలో ఉన్నాడు. వయసు ముదిరాక చదువులో ప్రవేశించడం వల్ల విద్యార్థే అయినా విద్యార్థిలా కనిపించడు.

అతనికి దొంగతనానికీ, దోపిడీకి ఉన్న తేడా మార్క్సిజం అధ్యయనం వల్ల అర్థమయింది మాత్రమే కాదు, ఊళ్లో సూరప్పడు వంటి ధర్మకర్త అయిన భూస్వామి దౌర్జన్యపూరితమైన భూసంబంధాల్లో కూడ అర్థమైంది. [1]

“నువ్వు దోపిడీని, దొంగతనాన్ని ఒక్కటే అనుకుంటున్నావు. దొంగతనమంటే నువ్విందాక చెప్పినట్టు ఎవరూ చూడకుండా ఎవరికీ తెలియకుండా కాటేసుక పోవడం. దోపిడీ అనేది వేరు. పట్టపగలు అందరూ చూస్తుండగానే  భుజబలంతోనో, ఆయుధ బలంతోనో, సంఘబలంతోనో ప్రతిఘటించడానికి అసమర్థుణ్ని చేసి దౌర్జన్యంగా ధనాన్నో బంగారాన్నో లేక ఇంకొక సంపదనో స్వంతదారుని చేత తెప్పించి పుచ్చుకొని మహారాజులా తీసుకపోతే – అదీ దోపిడీ”. (అప్రజ్ఞాతం – పే.112, కా.రా.కథలు) ఈ విషయం ఇంకా లోతుగా 113, 114 పేజీల్లో సుదర్శనం వివరిస్తాడు)

సూరప్పడు వంటి జగన్నాథభక్తుడు స్వయంగా తనకు, కూలీలకు ఎవరికీ సోయి కూడ లేకుండా చేసిన దోపిడీ వివరాలు చదివితే (పే.116,117) ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా  శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఆదివాసులను వడ్డీవ్యాపారులు, భూస్వాములు చేస్తున్న దోపిడీ గురించి – వాళ్లు తాము పోడు చేసుకున్న భూముల్లోనే తాము కంబారీలుగా మారడం గురించి దేశవ్యాప్తంగా మార్క్సిస్టు మేధావులు చేసిన విశ్లేషణంతా గుర్తుకొస్తుంది.

“రూపాయికి కాని వడ్డీ అంటే సంవత్సరానికి నూటికి ఏడువేలా?”

“ఇది గణితం. కావలిస్తే ఆ తరవాత కాగితం మీద వేసి చూడు”

ఈ గణితం నుంచి, ఈ శాస్త్రదృష్టి శాస్త్రీయదృష్టికి మారడం నుంచి ప్రారంభమైంది కా.రా. గారి రాజకీయ అవగాహన. లెక్కలు నిష్పక్షపాతంగా చేసినంతకాలం ఈ రాజకీయావగాహన ఇంకోతీరుగా ఉండడానికి వీలులేదు.

భూసంబంధాల్లో – అంటే భూస్వామి-కూలీ సంబంధాల్లో, వర్తకంలో షాహుకారు-రైతు సంబంధాల్లో, పరిశ్రమల్లో – ఫ్యాక్టరీ యజమాని-కార్మికుని సంబంధాల్లో ఈ దోపిడీ స్వభావం అర్థమైనా – (ఇది అర్థం కావడానికి గణితం చాలు) గణితం నుంచి మనిషి అవగాహన తాత్త్వికస్థాయికి పోతేనే దీనికి మూలాలు అర్థమవుతాయి. (గణితానికి – తత్వశాస్త్రానికి ఉన్న సంబంధం ఇవాళ కొత్తగా వివరించనక్కర్లేదు)

“…..ఆస్తంటూ ఎవరి దగ్గరకు ఏ మేరకు చేరినా అది అన్యాయార్జితమే. న్యాయంగా సంపాందించిన డబ్బు మనిషి భుక్తికి మాత్రమే సరిపోతుంది. కడుపుకి లేని పేదవారు ఈ లోకంలో ఉన్నంతకాలం అంతకుమించి చేసిన ఆర్జనంతా అన్యాయార్జితమే.

ఎవడిపొట్ట కొట్టందే మన పొట్టకు మించిన తిండి మన యింట్లో మిగలదు. పదిమంది ఆస్తి చెదిరితే గానీ ఒకడి ఆస్తి పెరగదు” (అప్రజ్ఞాతం- పే.120)

ఆస్తి, ఆస్తిసంబంధాలు, దోపిడీ గురించి 1951 నాటికే కా.రా. గారికి ఇంత స్పష్టమైన అవగాహన ఉండడానికి ఆయనకు ప్రధానంగా తోడ్పడింది పరిశీలన. బ్రిటిష్‌ ఏజెన్సీ నేపథ్యం నుంచి వచ్చిన రచయితలకు – గిడుగు – గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలు ఇవ్వాటివరకు – ఈ పరిశీలన అబ్బడానికి అక్కడ జరిగిన సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల పరోక్ష దోహదం ఉన్నది. గురజాడ వంటివారికి అది చదువుల వల్ల అబ్బవచ్చు – రాజాస్థానంలో ఉండి అటునుంచి పరిశీలించడం వల్ల కూడ కలగవచ్చు. కొందరికి ప్రత్యక్ష అనుభవం నుంచి రావచ్చు.

తర్వాతకాలంలో ‘యజ్ఞం’ (1964), శాంతి (1971) కథలలో ఈ ఆస్తి, శ్రమదోపిడీ, వర్గసంబంధాల గురించి ఇంకా పెద్ద కాన్వాసుపై – ఆరంభంలో చెప్పినట్లు ఈస్టిండియా కంపెనీ ఈ దేశంలోకి వచ్చి ఇక్కడి ప్రకృతివనర్లను, మానవ వనర్లను మూలాల నుంచి, మూలుగుల నుంచి పీల్చిన క్రమాన్ని పాత్రలు, సంఘటనలు – కథలో భాగంగానూ, వ్యాఖ్యానంగానూ పాత్రలనోటే చెప్పిస్తారు. ‘అప్రజ్ఞాతం’లో గుడిలో చేరినవాళ్ల చర్చ తప్ప, ఆ చర్చలో అనివార్యంగా రాజకీయాలు వస్తాయి గనుక వ్యక్తమయిన రాజకీయ అవగాహనే తప్ప – ఈ రాజకీయ అవగాహనకు రక్తమాంసాలిచ్చే సంఘటనలు ఆ కథలో లేవు. విచిత్రంగా ఈ చర్చ ముగిసినాక రెండు చిన్న సంఘటనలు జరిగాయి. సూరప్పడి కొడుకు జబ్బుపడి బతకడనుకున్నారు. సుదర్శనం అతడు బతకాలని తనకు నమ్మకంలేని దేవునికి మొక్కుకున్నాడు. అతడు బతికాడు. అట్లా తన విశ్వాసాలకు భిన్నంగా మొక్కుకున్నందుకు అతడు సిగ్గుపడ్డాడు. సుదర్శనం పరీక్ష ఫెయిలయ్యాడు. 1951 నవంబర్‌ నాటికి ఇది దేశంలో రచయితలకయినా,  బుద్ధిజీవులకైనా అవగాహనకు సంబంధించిన విషయమే. ఈ కథ ‘జయభారత్‌’లో 1951 నవంబర్‌లో అచ్చయిన నెలలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ పరిపూర్తి అయింది. సుదర్శనం ఏ వర్గ రాజకీయాల ఆధారంగా, ఆస్తి, దోపిడీ సంబంధాల చర్చ చేసాడో ఆ రాజకీయాలు అతి త్వరలో వర్గసామరస్యంలోకి, పార్లమెంటరీ రాజకీయాల్లోకి పరివర్తన చెందాయి.

ఇంక దాదాపు ఒక దశాబ్దం పైన ఇటువంటి చర్చకు తప్ప ఆచరణకు అవకాశం రాలేదు. 1964లో కమ్యూనిస్టుపార్టీ చీలికకు కారణమైన అనేకానేక విషయాల్లో ప్రజల హృదయాల్లో అట్టడుగున ఉడుకుతున్న అస్పష్టమైన వర్గసంబంధ అశాంతికి వ్యక్తీకరణ సామాజిక, రాజకీయార్థిక రంగాల్లో పొడసూపినట్లే సాంస్కృతిక వ్యక్తీకరణగా వచ్చిన ‘షాక్‌ ట్రీట్‌మెంట్‌’ ‘యజ్ఞం’.

1964లో వచ్చిన ‘యజ్ఞం’ 1965లో వచ్చిన ‘దిగంబరకవులు’ (ఇంకా ముందుగా వచ్చిన ‘రాత్రి’ కవితాసంకలనం – శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’ మొదలు, కె.వి.ఆర్‌., సి.విజయలక్ష్మి వంటి కవుల, కొ.కు., రావిశాస్త్రి వంటి కథకుల రచనలు – 1960-67 మధ్యన వచ్చినవి) చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలకు ముందరి పురుటినొప్పుల వంటివి. వీటిల్లో – ముఖ్యంగా  ‘యజ్ఞం’లో, దిగంబరకవుల్లో అసంబద్ధత (అబ్సర్డిటీ) ఉందనుకున్నా ‘షాక్‌ ట్రీట్‌మెంట్‌’ ఉన్నదనుకున్నా అది సమాజంలో ఉన్నదీ – అప్పుడా సమాజానికవసరమయిందీ.

పరిష్కారాల చర్చలోకి వెళ్లడానికన్నా ముందు కా.రా. గారి రాజకీయ అవగాహనకు బలమైన పునాదిగా ఉన్న భారతీయ సమాజాల గ్రామీణ రాజకీయార్థిక జీవితం – ఎంత వెనుకబాటుదయినా దీనికున్న స్వయం ఆలంబనశక్తి – 51 నుంచి ఆయన చాల కథల్లో  ప్రస్తావనకు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. గ్రామం – గ్రామంలో భూమిని సాగుచేసే రైతు ఆ వ్యవసాయ సంబంధమైన వృత్తులు – వాళ్ల పరస్పర సహాయ సహకారాల అవసరాలపై ఆధారపడిన ఆర్థికవిధానం – ఎంత బలహీనమైనది, సాధారణమైనదయినా సరే – ఈస్టిండియా కంపెనీ రాకపూర్వపు ఆర్థిక స్థితి ఇది. ఫ్యూడల్‌, రాజరిక పరిపాలనలోనూ, ఉత్తరాన విదేశీ దండయాత్రల్లోనూ – దోపిడీ జరగలేదని గానీ, ఈ ఆర్థిక చట్రం భగ్నం కాలేదనీ కాదు – కాని వృత్తులు చెదిరిపోలేదు. ‘సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు’ విధ్వంసం కాలేదు. ఆ ఆర్థిక విధ్వంసన ఈస్టిండియా కంపెనీతో ప్రారంభమై 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత బ్రిటిషిండియా పరిపాలన వచ్చి అది మన రాజకీయార్థిక వ్యవస్థగా మారిపోయింది.

‘కులంచే అతను సాలె. తండ్రికి ఒక్కడే కొడుకు. తల్లి లేదు. అతడి తండ్రి కులవృత్తి చేతే జీవిస్తుండేవాడు. ఆ సరికే యార్క్‌షైర్‌, లాంకాస్టర్‌ మిల్లుల రాక్షసహస్తాలు భారతదేశంలో నాలుగువంకలా లక్షలాది తంతువాయుల నోటిముందరి ముద్దలు ఒడుచుకపోనారంభించినా, ఈ మారుమూల పల్లెల వరకూ అవి సాగి ఉండలేదు.’ (సేనాపతి వీరన్న – కా.రా.కథలు, పే.230)

“గత రెండు దశాబ్దాలలో గుర్తింపరానంతగా మారే ప్రపంచంతో మారే మనదేశంతో పాటు మా నాడూ మా గ్రామం కూడ చాల మారిపోయింది.” (సేనాపతి వీరన్న – కా.రా.కథలు, పే.237)

ఇంక ఇక్కడినుంచి అంటే 237వ పేజీ పేరా 5 నుంచి 239వ పేజీ పేరా 3 వరకు వివరంగా గత రెండు దశాబ్దాల్లో – అంటే -1930ల నుంచి 53 దాకా ప్రపంచంలో, దేశంలో, నాడులో, ఊళ్లో వచ్చిన రాజకీయార్థిక పరిణామాలను కళ్లకు కట్టినట్లు విశ్లేషిస్తారు.

“రెండవ ప్రపంచయుద్ధం నాటి కంట్రోళ్లూ, ద్రవ్యోల్బణం ఫలితంగానైతేనేం, స్వాతంత్య్ర సిద్ధ్యనంతరం ప్రవేశించిన స్థానిక పరిపాలనా నగర సంబంధాల వల్లనైతేనేం, ఈ విధంగా జీవితావసరాల పద్దుల్లో అనవసరమైనవి కూడ చాల చేరిపోయాయి. పచ్చగడ్డి నుంచి బంగారం వరకూ సమస్త పదార్థాల ధరలూ పెరగడమే కాని వరగడం ప్రసక్తి లేదంటున్నాయి.” (సేనాపతి వీరన్న – కా.రా.కథలు, పే.238)

1951లో రాసిన ‘అప్రజ్ఞాతం’ నుంచి 53లో రాసిన ‘సేనాపతి వీరన్న’ నాటికి కారా గారి రాజకీయ అవగాహనలో పరిశీలన వల్ల మరికొన్ని వివరాలు చేరాయి. దానివల్ల విస్తృతి ఏర్పడింది. మొదటి సాధారణ ఎన్నికలు మాత్రమే కాదు, స్థానిక స్వపరిపాలన కోసం ఎన్నికలు, పంచవర్ష ప్రణాళిక వచ్చాయి. ఈ కథలో పంచవర్ష ప్రణాళిక ప్రస్తావన లేదుగానీ – ‘యజ్ఞం’, ‘కుట్ర’లలో వాటిపట్ల ఆయన అవగాహన కూడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

ఆస్తి సంబంధాలు, శ్రమదోపిడీ గురించి కారా గారికి ‘అప్రజ్ఞాతం’ (1951), ‘సేనాపతి వీరన్న’ (1953) కథలు రాసేనాటికే స్పష్టమైన వర్గదృష్టి ఏర్పడిరదనీ, యజ్ఞం నాటికి అది క్రియ (యాక్షన్‌)గా పరిణమించక తప్పని అశాంతికి గురయ్యారని చెప్పవచ్చు.

‘అప్రజ్ఞాతం’లో సాధ్యంకాని సంఘటనల చిత్రణ, కథానిర్వహణ, మానవసంబంధాల ఆర్ద్రత ‘సేనాపతి వీరన్న’లో కనిపిస్తాయి. ‘నా వర్గానికి చెందిన వారందరి తరఫున నేనే నెత్తిన వేసుకున్నందు’ (పే.241)వల్ల వచ్చిన కన్ఫెషన్‌లోని శక్తి అది.

ఆనాటి నుంచి ఇవ్వాటివరకు అది 1947, 67, 91 వంటి మైలురాళ్లను కూడ గణనలోకి తీసుకున్నా ఊర్ధ్వముఖంగానే సాగుతున్నది. 1967 దానికొక సమూలమైన సవాల్‌గా వచ్చింది. ఆ సవాల్‌ ముప్పై ఏళ్లకు పైగా కొనసాగుతున్నదే. దానికి దోపిడీ వెతుక్కుంటున్న జవాబుల చర్చను కథగాకన్న ఒక రన్నింగ్‌ కామెంటరీగా 1972లో ‘కుట్ర’లో కారా గారు చెప్పారు. అది శ్రీకాకుళం సెట్‌బ్యాక్‌ నాటి పరిస్థితి.

అభివృద్ధి గురించిన అవగాహన

ఆస్తి సంబంధాలు, శ్రమదోపిడీల గురించి మౌలిక అవగాహన నుంచే ఆయన ‘యజ్ఞం’ కథలో గానీ, తర్వాత రాసిన కథల్లోగానీ భూసంబంధాల్లో వచ్చిన మార్పులు, వ్యవసాయంలో వ్యాపారపంటలు, గ్రామాల్లోకి మార్కెట్‌ ప్రవేశం, డబ్బు ప్రవేశం, మిశ్రమ ఆర్థిక విధానం, గ్రామాల్లో వచ్చినట్లు చెప్పుకుంటున్న అభివృద్ధి, న్యాయం, విద్య, పంచాయితీవిధానం మొదలైన అంశాలను చిత్రించారు.

‘యజ్ఞం’లో ‘‘బాబూ యిక నాకత సెపుతాను ఇనండి’’  (పే.342) అని ఆరంభించి, తన కథ ముగించి అప్పు పత్రం మీద అప్పల్రాముడు వేలుముద్ర వేసే దాకా (పే.352) పదిపేజీలు పరచుకున్న ఆత్మకథ – ఈ దేశంలో రైతుల ఆత్మఘోష – రైతు వ్యవసాయకూలీగా మారి, అప్పులబారిన పడి – బానిసైన కథ. ఆ పదిపేజీలే కాదు ‘యజ్ఞం’ కథలోని రాజకీయార్థిక అవగాహన గురించి ఇప్పటికెంతో చర్చ జరిగింది. కనుక ఆ వివరాల్లోకి, విశ్లేషణలోకి పునరుక్తి భయంతో వెళ్లకుండా ఆ కథ శ్రీకాకుళ రైతాంగ పోరాటానికి ఎట్లా తెరదీసిందో (కర్టెన్‌రైజర్‌ అయిందో) మాత్రమే చెప్తాను.

శ్రీకాకుళం ఏజెన్సీలో  (బ్రిటిష్‌వాళ్లు ఆ పేరుతో పిలిచిన అడవిలో) సవరలు, జాతాపులు అనే ఆదివాసులు పోడుచేసుకుని బతికేవారు. అడవిని నమ్ముకొని బతికేవారు. అక్కడికి ఉప్పు, పులుసు రూపంలో షాహుకార్లు వచ్చారు. అడవిరక్షణ పేరుతో అడవి చట్టాలు వచ్చాయి. చట్టాల అమలుకోసం పోలీసులు వచ్చారు. ఉప్పు, పులుసు కోసమే కాదు నూలుతో మొదలై పెరిగిన నాగరిక అవసరాల కోసం ఆదివాసులు జీడిపప్పు, ఇప్పపువ్వు, తేనె మొదలు అడవిలోని సమస్త సంపదలు, తాము పోడుచేసుకున్న భూమి మాత్రమే కాదు తమ శ్రమ కూడ పణం పెట్టి మైదాన ప్రాంతాలనుంచి వచ్చిన భూస్వాముల, వడ్డీవ్యాపారుల కింద కంబారులుగా మారారు. అంటే తాము పోడుచేసుకున్న తమ కాళ్లకింది భూమిలో తామే బానిసలయ్యారు.

ఇదీ 1964 నాటికి శ్రీకాకుళ సవరలకు, జాతాపులకు వెంపటాపుసత్యం, ఆదిభట్ల కైలాసం తెలివిడి చేసిన సత్యం.

ఆ ఏజెన్సీ అంచున్న ఉన్న సుందరపాలెం అనే మైదానప్రాంత గ్రామంలో ఒక దళితుడైన అప్పల్రాముడు తన కొడుకు సీతారాముణ్ని అప్పుపత్రం మీద సంతకంపెట్టి ఆ స్థితికి నెట్టబోతున్నాడు. ఒక్క  సీతారాముణ్ననే కాదు,  కొడుకులందరినీ, శాశ్వతంగా వాళ్ల సంతానాలను, రైతులు వ్యవసాయకూలీలుగా, వ్యవసాయకూలీలు వెట్టివాళ్లుగా అంటే బానిసలుగా మారే పరిణామక్రమం చరిత్రలో విషాదకరంగా మరోమారు వచ్చిన సంధిదశలో అటు వర్గపోరాట అవసరం అశాంతిలో చీలిన కమ్యూనిస్టుపార్టీ – ఆ లక్ష్యంతో ఆదివాసులను కూడగడుతున్న శ్రీకాకుళ నాయకత్వం – అప్పటికి పేర్కొనదగిన వాళ్లు వెంపటాపుసత్యం, ఆదిభట్ల కైలాసం, రామలింగాచార

ఆ నిప్పందుకున్న నేపథ్యం మైదానప్రాంత సుందరపాలెం మాలపల్లెలో స్పష్టంగా మనం చూడవచ్చు. అప్పల్రాముడు చెప్పుకొచ్చిన ఆత్మకథలో పంచాయితీకి ముందురోజు ‘‘రాత్తిరి మాయింటికాడ తగువయింది’’ (పే.347) అని ఆరంభించి ఒక చర్చను ప్రస్తావిస్తాడు. ఆ చర్చంతా అభివృద్ధి గురించి గ్రామంలోని శ్రమజీవుల దృష్టితో చేసిన చర్చ. మాలవాడలోనే  ఎర్రయ్య ఇంటికి సుట్టపుసూపుగా వచ్చిన పెద్దమనిషి ఒకాయన ఆ చర్చలో జోక్యం చేసుకున్నాడు.

‘‘…..జరుగుతున్న దగా యెక్కడో మీకు తెల్నట్టే ఆయనకీ తెలవదు. దీనికంతటికీ కీలకం యిక్కడెక్కడా నేదు, పైనెక్కణ్నుంచో  వచ్చిన ముప్పు మనందర్నీ ముంచుతోంది.

పండిన పంటంతా కావందుల గోదాలకెళ్లాల. ఎల్లకుండా కూలోడు అడ్డు తగుల్తున్నాడు. ఎనకట్రోజుల్లో అయితే తన్ని సేయించుకునేవోరు. ఇప్పటిరోజుల్లో ఆ పప్పులుడకవు. కూలోడి అడ్డు  వదిలించుకోవాలంటే మిసీన్లు కావాలి. మిసీన్లు తేవాలంటే యెలట్రిసిటీ, రోడ్లూ కావాలి. అంతేకాదు, సదువుకున్న కూలోళ్లు కావాలి. అందుకనే యీ యిస్కూళ్లు. అందుకనే యీ రోడ్లు, యీ యలట్రిసిటీ. ఇయన్నీ మనకోసవే అనుకోడం మన బుద్ధితక్కువ. నీళ్లు తోడ్డానికి మిసీన్లొచ్చేసినాయనే గుంజుకుపోతున్నారు. రేప్పొద్దున దున్నడానికి, ఊడుపులకి, గొప్పులకు, కోతలకు కూడ మిసీన్లు రాబోతున్నాయి. అప్పుడు సూసుకోండి తడాఖా’’ అన్నాడు.

‘బాబయ్యా! మంచన్నది సెబ్బరైపోవడం నాకూ సిత్రంగానే వుంది. కాని జరిగింది జరగబోయేది సూస్తే ఆల్ని కాదనడవెలాగో నాకు తెలకుండున్నది.

నువ్వెవరికుపకారం సేస్తానని బయలెల్లినావు? అదెవరికుపకారం అవుతోంది?…. పున్నానికొచ్చినవోరిని నువ్‌ మొదలెట్టిన యెగ్గెం, పాపంలో దింపింది. దిగినాక తెలిసీ తెలీకా అందరం కూరకపోతున్నం’ (యజ్ఞం – కా.రా.కథలు, పే.347)

35 ఏళ్ల కింద ప్రారంభమైన ఈ యజ్ఞం ఇపుడు విశ్వరూపం దాల్చింది.

అప్పల్రాముడు చాల అమాయకంగా ‘మంచన్నది సెబ్బరైపోవడం నాకూ సిత్రంగానే వుంది’ అని అన్నాడుగానీ ఈ దేశంలో పెట్టుబడి వలస, మార్కెట్‌ ఆర్థికవిధానం వల్ల భూస్వామ్య సంబంధాలు రద్దయిపోతాయని, మిశ్రమ ఆర్థికవిధానంతో పంచవర్ష ప్రణాళికలతో సోషలిజం వస్తుందని భ్రమపెట్టినవారో, పడినవారో – ఈ ముప్పై అయిదేళ్ల ఈ అభివృద్ధిలో ‘యజ్ఞం’ కాస్త విశ్వీకరణ పొందిన రూపాన్ని మన ప్రజల అనుభవానికి తెచ్చారు. భూస్వామ్య సంబంధాలు, సామ్రాజ్యవాద బలంతో ఇంకా బలపడి దేశమంతా దళారీ రాజకీయాలకు తాకట్టుపడిన స్థితి ‘యజ్ఞం’ మరోమారు చదివినా ఊహించుకోవచ్చు.

‘కుట్ర’ (1972)లో బొంబాయిప్లాను మొదలుకొని 1972 వరకు సాగిన రాజకీయార్థిక కుట్రను వివరించిన మేస్టారు గత 27 ఏళ్లుగా ఇంకా ఏం జరిగిందో ఎప్పుడూ చెప్పే ప్రయత్నం చేయలేదు. నిజానికి ‘కుట్ర’ ఒక మోనోలాగ్‌, వ్యాఖ్యానం లేదా రన్నింగ్‌ కామెంటరీ అవుతుంది గానీ కథ కాదు. కథగా ‘యజ్ఞం’ మాత్రమే విశ్వీకరణ ఇవ్వాల్టి కుట్రకు ఒక  ప్రొఫెసీ – భవిష్యదవగాహన – సంచలనాత్మక కల్పన.

అందులోనే ఒక ప్రతిక్రియ – అటు శ్రీకాకుళం అడవిలో ప్రారంభమైన సంచలనం ప్రభావం కూడ చోటుచేసుకున్నది.

తన కొడుకును చంపి గోనెసంచిలో తలను, మొండాన్ని కట్టి తెచ్చి పంచాయితీ ముందు పడేసిన సీతారాముడి మాటల్లో అది వ్యక్తమవుతున్నది.

‘‘నువు మమ్మల్ని సచ్చిందాక బానిసబతుకు బతుకమన్నావ్‌. నీకు తెల్నప్పుడు అది సరే. ఇప్పుడు తెలిసినాకా నువు ఆ మాటే అంటే – ఇదిగో నాకిష్టంనేదు.

నా కొడుకు మీద నాకాశెక్కువ. నా కొడుకు బానిసబతుకు బతకడు. నా కొడుకు కంబారి కాడు.

అందుకే పరుగెత్తుకెల్నాను. ఒరేయ్‌! ఓరె, కొడుకా, నువు బానిస బతుకు బతుకుతావా – లేకపోతే సస్తావా? యీయాల సస్తే రేపటికి రెండు. రా నిన్ను సంపుతా’’నన్నాను. ఆడు పరుగెత్తుకొచ్చినాడు….’’

64లో రాసిన ‘యజ్ఞం’లో రెండు భవిష్యత్‌ వాస్తవాలు ఇమిడి ఉన్నాయి. అప్పటికే ప్రారంభమైన శ్రీకాకుళ ఆదివాసీ రైతాంగ సంఘర్షణలో వాటి ప్రభావం కనిపిస్తున్నది. అవి – తమ కొడుకులింక కంబారులు కావద్దు. బానిస బతుకులు బతుకొద్దన్న దృఢనిర్ణయం. అది సాధించాలంటే – పరుగెత్తాలి – అంటే నడకలుగా ఉన్న మార్పు ప్రయత్నం పరుగులుగా, గెంతులుగా మారాలి. కొడుకును చంపుకోవడమా, కొడుకు తండ్రిని చంపుకోవడమా, ఇద్దరూ కలిసిగానీ, విడిగా గానీ శత్రువును చంపడమా – ఆ తర్వాత శ్రీకాకుళంలో తేలిన అంశాలు. కాని కంబారిగా, బానిసగా బతుకొద్దంటే మాత్రం ఏదో గుణాత్మకమార్పు రావాలి. 1964 నాటికి అది షాక్‌ట్రీట్‌మెంట్‌గానే ఉంది. 68లో గానీ అది సాయుధప్రతిఘటన కాలేదు.

హింస శాంతి

అసమానతయే హింస, అందరికీ కనీస వనర్లు, జీవించే హక్కు గ్యారంటీ కావడమే శాంతి అనే అవగాహన కా.రా. కథల్లో అన్నింట్లో కనిపిస్తుంది. హింసాహింసల చర్చ, వాటిపై తన వైఖరి కారా గారు ప్రత్యేకించి వ్యక్తం చేసిన కథలు వీరుడు మహావీరుడు, హింస, శాంతి.

హింస గురించి, శాంతి గురించి బుద్ధిజీవులు తమ వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిన కాలంలోనే కారాగారు ఈ మూడు కథలు రాసారు.

‘ఇద్దరు దెబ్బలాడుతుంటే ఎవళ్లది తప్పని ఎవ్వర్నీ అడగక్కర్లేదు. అడిగితే ఆడిది తప్పని ఈడూ, ఈడిదే తప్పని ఆడూ ఎలాగూ సెప్తారు. అడక్కుండా ఆ పక్కన్నిలబడి ఆళ్లమొహాల్లోకి చూడు, తప్పెవళ్లదో ఎవడూ సెప్పక్కర్లేకుండానే కరక్టుగా నువ్వే చెప్పేస్తావు.

అందుకే నా సింపతీ అల్లిపురం వస్తాదు మీద కాక గంజిపేట రౌడీమీదే ఉండేది’ (వీరుడు-మహావీరుడు – కారా కథలు, పే.379)

‘అయితే మనిషికా ఫైటింగ్‌ స్పిరిటు వొక్కొక్కప్పుడలా వొచ్చేస్తాది. ఎలాటప్పుడు? న్యాయం నీ పక్కనుండాల, అవతలోడు ఫౌలుగేమాడాల. అదేవంటే, దౌర్జన్యానికి దిగాల, సూస్తున్నోళ్లు సీవ కుట్టినట్టు మాటాడకూరుకోవాల! జనం అవతలోడి బలానికి జడిసి అన్యాయానికి నోరెత్తకుండా వున్నారని నువ్వు గ్రహించాల. ఆ జనం పిరికితనం చూసి ఆడి జులుం మరీ మరీ పెరిగిపోతుండాల. అదిగో అలాటప్పుడు వొచ్చేస్తాది ఎక్కల్లేని ఫైటింగు స్పిరిటూ. అప్పుడు పిల్లిలాటోడైనా పిల్లపులైపోతాడు. పులిపిల్లలా ఎగిరి ఏనుగు కుంభస్థళవైనా అందుకోడానికి పంజా సాస్తాడు.’ (వీరుడు-మహావీరుడు, కా.రా. కథలు, పే.379)

న్యాయం వున్నవానిలో ఫైటింగ్‌ స్పిరిట్‌ వస్తుందని, అపుడు వాడు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినా అది న్యాయంకోసం చేసే పోరాటమే అవుతుందిగాని హింసకాదని ఏ అభ్యంతరం లేకుండా రచయిత ప్రతిపాదిస్తున్నాడు.

అల్లిపురం వస్తాదు, గంజిపేట రౌడీ ఈ అసమ యుద్ధంలోకి కొత్తపేట శాండో ప్రవేశిస్తాడు. విడదీయడానికి కాదు, గంజిపేట రౌడీకి సహాయం చేయడానికి కాదు. అల్లిపురం వస్తాదుకు సహాయం చేయడానికే.

అప్పటికప్పుడే నూరుసార్లు మన్నుతిని నూటొక్కటోసారి లెగడవే ఓ ఫీటుగా లెగుస్తున్న గంజిపేట వీరుడు –

‘లెంజకొడుకా? నేనియ్యాళ నీ సేతుల్లో సచ్చైనా పోతానుగానీ, నీ రకతం కళ్లజూడక మానన్రా’ అంటూ తూలి తూలి నిలబడుతూ కొత్తగా దిగిన శాండో కళ్లకడ్డవైతే యీడెవడన్నట్టు మసక్కళ్లు అప్పగించి చూసేడు.

కొత్తపేట శాండో తన సహాయానికే వచ్చాడని అల్లిపురం వస్తాదుకు తెలిసిపోయింది. అందుకే అంతవరకు కాలుసేయి తప్ప నోరు విప్పనివాడు

‘రారా బాడకావ్‌. నీకు ఏ లంజకొడుకడ్డుపడతాడో నేనూ సూస్తా’ అన్నాడు.

కొత్తపేట శాండో అమాంతం వెళ్లి గంజిపేట రౌడీ చెయి పట్టుకున్నాడు. పట్టుకున్న ఆ చెయ్యి వెనక్కి తిప్పుతూ అన్నాడు….. ఎవడితో? గంజిపేట రౌడీతో…. అంటే దెబ్బలు తింటున్నవాడితో, ఏవనీ?

‘‘ఇంక శాంతించు’’

‘‘ఆ మాట ఆడితో చెప్పు’’ (వీరుడు-మహావీరుడు, పే.381)

ఈ కథ కేవలం ఉస్తాదు, రౌడీల మధ్యన తగువుకాదు. కాదని చెప్పడానికి కథ చివరన కా.రా. గారే వ్యాఖ్యానం చేసారు.

‘…..బిగ్‌పవర్‌లో వున్న ఆకర్షణే అది. మనవనుకుంటాం గానీ యే కాలంలోనైనా, ఏ లెవెల్లోనైనా బిగ్గూ, స్మాలూ తేడాలు వుండేవుంటాయి’ (వీరుడు-మహావీరుడు, పే.383)

పాలస్తీనా – ఇజ్రాయిల్‌ల మధ్యన,  ఇరాక్‌ -కువాయిట్‌ల మధ్యన అమెరికా జోక్యం ఒక్కసారి గుర్తొస్తోంది ఈ నేపథ్యంలో మళ్లీ చదివితే.

హింస, న్యాయం సాపేక్షమైనవి. వర్గస్వభావం కలవి. వాటిని నిరపేక్షంగా నిర్వచించి, అహింసా సూక్తులు పలకడం హింసనే పోషిస్తుంది.

‘హింస’ కారా గారి కథల్లోనే కాదు తెలుగు సాహిత్యంలో అరుదైన కథల్లో ఒకటి. గుండెల్ని పిండేసే మానవీయస్పర్శ. పీడిత ప్రజల పట్ల, అందులోనూ సంఘపరిత్యక్త అయిన స్త్రీ పట్ల పరిపూర్ణ సానుభూతి – ఒక్కమాటలో చెప్పాలంటే – ఇవన్నీ ఎంత సహజంగా, ఎంత నైసర్గికంగా పసివయసులో వుండే కడుపేద ఇంటి అమ్మాయిలో వుంటాయో, ఆ ‘సంగి’ కళ్లనుంచి చెప్తారు రచయిత.

సంగి అక్క పైడమ్మ చేసిన పెళ్లి ఇష్టంలేక భర్తను వదిలేసింది. మారుమనువు ఆలోచన చేయకుండా బతకడానికి విశాఖపట్నం పోయింది. అక్కడ కూలీచేస్తూ బతుకుతున్నది. కాని ఊళ్లో జనం అనుమానం ఆమె ఒళ్లమ్ముకొని బతుకుతున్నదని. కావచ్చుననే సూచన కథలో వుంది. పైడమ్మ విశాఖపట్నం నుంచి నాలుగురోజులుందామని లేదా ఆ బతుకుమీద రోతబుట్టి ఇంటికి తిరిగొస్తే, కులపెద్దలు, బంధువులందరూ పైడమ్మ తల్లికి ఆమెను ఇంట్లో పెట్టుకోవద్దని పంపించివేయమని హితం చెప్తారు. హెచ్చరిక లాంటి హితం. అప్పటికే పైడమ్మ సోదరులెవరూ ఆ కుటుంబానికి సహాయం చేయడంలేదు. ఇంటితో సంబంధాలు కూడ తెంచుకున్నారు.

అక్క విశాఖపట్నంలో ఏం చేస్తుంది, ఎట్లా బతుకుతుంది, అక్కగురించి సమాజం ఏమనుకుంటుంది – వంటి ఏ విషయాలతో సంబంధం లేని రక్తబంధువు సంగికి అక్క రావడం ఒక సంబరం. ఒక పండుగ. ‘అప్ప వెచ్చని రక్తం ఆమె నాళనాళాన వేడిని నింపుతూ, ఆమెను పొదువుకుపోతుంటే’ నిద్దట్లోనే అక్క కావలించుకోగా వొదిగిపోవడమనే అనుభూతి ఒక్కటే సంగి రక్తానికి తెలిసిన పరమసత్యం.

కాని పైడమ్మ వచ్చిన దగ్గర్నించి ఆమెను తిరిగి పంపించే పథకాలూ చుట్టూ అల్లుకుంటున్నాయి. అందులో అందరూ కుట్రదారులనే కాదు, అసహాయులు కూడా.

‘‘ఏం సెయ్యడానికైనా నీ వశవా? నాలుగేళ్ల క్రితం దాకా నీ నట్టింట పెరిగిన బొట్టె ఏణ్నర్థం కితం పండక్కి నీ యింట పసుపూ కుంకం పుచ్చుకుంది. యియ్యాళ నియ్యింటికొస్తే నట్టింట పీటేసి నాలుగు మెతుకులెట్టలేప్పొన్నావు. ఎవరో ఎరగన్దానికెట్టినట్టు గుమ్మంలో ఆకేసి తిండెట్టినావు… ఏటుంది నీ సేతుల్లో’’ అంది సన్నాసమ్మ. (హింస, పే.410,411)

పెద్దమ్మ పైడమ్మకొచ్చిన కష్టాలు, పరిస్థితులు ఎంత హృదయవిదారకంగా వివరించినా లాభం లేకపోయింది. పోనీ బిడ్డెంట తాను పట్నం పోతానంటే మరి సంగి సంగతేమిటన్నది ముందుకొచ్చింది. ముక్కుపచ్చలారని సంగి బతుకు సరిగా తెల్లారాలే అన్నా ఆమె ఎంతగానో ప్రేమించే అక్కను పంపించేయాలన్నదే ఈ వ్యవస్థ క్రూరమైన నిర్ణయం.

ఉదయం సంగి కళ్లు విప్పేవరకే పైడమ్మ వెళ్లిపోయింది.

ఒక్కక్షణం చిన్నప్పట్లా, బావురుమని ఏడవాలనుకుంది. కాని ఏడవడం సంగికి నప్పదు. తల్లి దుఖం గుర్తుకొచ్చింది. ఆ శోకన్నం బరువు మొయ్యలేనంత కాగానే ఆ పిల్ల చప్పున లేచిపోయింది. ఊరికి ఆవడో, ఆవడపైనో వున్న శలకవైపు పోయింది.

ఆ చెలకలో, అంతా నిర్మానుష్యమైన చెలకలో మేకపిల్లలు తనకు తోడు. దూరాన ఒక మేకపిల్లను నక్కలు దాడిచేసి తిన్నాయి. మిగిలిన మేకపిల్లల హృదయవిదారకమైన అరుపులు విని, విపరీతమైన జాలి కలిగి, కన్నులు జేవురించగా

‘‘మాయ ముండల్లారా! రాకాసి ముండల్లారా! మీ పని సెపతానుండండి’’  అంటూ చుట్టూ చూసింది సంగి. ఎండిపోయిన తాటిమట్ట ఒకటి తప్ప ఇంకే ఆయుధమూ దొరకలేదు ఆ పిల్లకు. ‘యియ్యేళ్ల మిమ్మల్ని ఒకళ్లనో ఇద్దర్నో సంపిందాకా నానింటికి పోను’ అని శలకకడ్డంగా బయల్దేరింది.

‘తనకు పట్టని బాధ – ఎవరికో జరిగిన అన్యాయం’ అనకుండా ఆ యెండవేళ నక్కలకోసం వెతుకుతోంది సంగి.

నక్కలు తనకు చిక్కుతాయా? అసలెక్కడ చిక్కుతాయి? చిక్కితే తనేం చేయగల్దు? ఇలాంటి ప్రశ్నలామెకు తట్టలేదు. తట్టవుకూడ.

ఆమె ఆవేశం మనకు అర్థం కావాలంటే ఆమె స్థానంలో మనముండాలి. అంతేకాదు, ఆమె గుండెకూడ మనకుండాలి. (హింస, పే.419)

రచయిత ఈ వ్యాఖ్యానంతో ముగిసే కథకింక వ్యాఖ్యానం అనవసరం. న్యాయం గురించి ఒక రౌడీ, ఒక పహిల్వాన్‌ మధ్యన తగువును, హింస గురించి అక్కచెల్లెళ్ల, తల్లీకూతుళ్ల అనుబంధాన్ని తెంచిన వ్యవస్థ క్రౌర్యాన్ని ఆధారం చేసుకొని తన అవగాహన అందించిన కారా గారు శాంతి గురించి నేరుగా యజమాని కార్మిక సంబంధాల ద్వారానే ‘శాంతి’ కథలో వివరించారు. ఇది 1971లో రాసిన కథ గనక ఈ అవగాహనకొక రాజకీయ పరిణతి రావడం సహజమే. శ్రీకాకుళ రైతాంగ పోరాటం మొదలై, సెట్‌బ్యాక్‌కు గురవుతున్న దశ. విరసం ఏర్పడిన దశ. కారా గారి భావాల్లో చాల స్పష్టమైన వైఖరి ఏర్పడింది.

ఈ కథలో శాంతి గురించి ఒక కవి చెప్పిన మాటల్ని కూడ కార్మిక నాయకునిచేత చెప్పిస్తాడు. ఇలాంటివి ఆ కవి చాల చెప్పేవాడు. ఆవేశంలో అతిగా అన్నాడు అని అనుకున్నానే గాని అందులో నిజం చాల వుంది అనిపిస్తోందిప్పుడు అంటూ కార్మిక నాయకుడు విశ్వనాథం ‘‘న్యాయమైన కోర్కెలు మేం ఒదులుకోప్పోతే శాంతికి భంగం కలుగుతుంది. తీర్చవలసే కోరికలు వారు తీర్చకప్పోతే శాంతికి భంగం కాదు.

శాంతియుతమైన సంప్రదింపుల్లో యింతకాలవూ వారు మొరాయించింది అశాంతికి దారితీసేది కాదు. చట్టసమ్మతంగా మేం రేపు సమ్మె చేయబోతే అది అశాంతికి దారితీస్తుంది. ఆ నిప్పురవ్వలో దేశమంతా మండిపోతుంది.

ఘర్షణకి బాధ్యత ఎప్పుడూ ఒక పక్షానిదే. దేవుడికోసం, దేశం కోసం, మనిషి కోసం లేనివాడే ఎప్పుడూ త్యాగం చేయాలి. రెండోవాడిపై ఎవడు ఏమాత్రం ఒత్తిడి తెచ్చినా అది వాడి హక్కులమీదా, వ్యక్తిమీదా ఘోరంగా చేస్తున్న దాడిలా అనిపిస్తుంది. సమతాధర్మం అన్నది చదువుకున్న పెద్దలందరికీ ఒక్కలాగే అర్థమవుతుంది. నిజంగా చిత్రమైన సంగతి’’ (శాంతి, పే.578)

ఈ వ్యంగ్యంలో ఇవ్వాళ ఇంకెంత నిష్ఠురమైన నిజం కనిపిస్తుందో.

కారా కథల్లో మూడు సందర్భాల్లోనే పోలీసుల ప్రస్తావన వస్తుంది. సేనాపతి వీరన్నలో అతడు దొంగతనం చేస్తున్నాడనే అనుమానానికి దారితీసే పోలీసు కేసుల ప్రస్తావన వుంది. ‘హింస’లో పైడమ్మ కూడ పోలీసుకేసులో ఇరుక్కున్నది.

‘శాంతి’ కథలో మాత్రమే కార్మికుల సమ్మెను భగ్నం చేయడానికి అటు లాకౌటు, అరెస్టులు, పోలీసుల బందోబస్తు, ఇటు కార్మికనాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిడం – ఈ ఏర్పాట్లకన్నిటికీ తగినంత వ్యవధి పొందడానికే కలెక్టర్‌, ఎస్పీ, ఫ్యాక్టరీ యజమానితో కార్మికనాయకుల చర్చలు వంటి ఒక పూర్తి రాజకీయ వాతావరణం – రాజ్యాంగయంత్ర స్వభావం కనిపిస్తాయి.

కారా కథల్లో న్యాయము, పోలీసులు, రాజ్యాంగయంత్రం స్వభావం అర్థమయ్యే కథ ‘శాంతి’ ఒక్కటే. ఇది కూడ ‘కుట్ర’ వలెనే కథకన్నా, అంటే సంఘటనలకన్నా చర్చలమీద ఎక్కువ ఆధారపడి నిర్మాణమైంది.

‘ఆదివారం’ (సరియైన   మార్క్సిస్టు ఫెమినిస్టు దృక్పథం ఉన్న కథ). ‘హింస’, ‘నోరూమ్‌’ (పేదవాళ్ల ప్రేమకు, ప్రైవసీకి హృదయాల్లోనే గానీ నేలమీద చోటులేని విశాల ప్రపంచమిది), ‘ఆర్తి’ (కఠిన నిజాలైన ఆర్థికావసరాలలో నలిగిపోయిన ముగ్ధప్రేమ, పరిష్కారం మాత్రం ఊర్లో పెద్దలే చేస్తారు!), ‘చావు’ (‘అప్పుడు పెళయం తేవాల. అది తేవడం తప్ప ఆడికింకో దారినేదు. దానికాడ ఈ తుపాకులు గిపాకులు, బాంబులు, ఇమానాలు యియ్యేయీ ఆగవు. అది జొరావరులన్నిట్లోకి పెద్ద జొరావరి. దానికి ఇక తిరుగునేదు…. అయితే అది రావడమెలాగొస్తాదో ఎరికా..’’ మాటపూర్తి కాకుండానే …. దభీమని ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు ఓ కట్టెలమోపు అతడిముందు పడింది. తుళ్లిపడి తలెత్తితే  – రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు కట్టెలమోపులు ఒకదాని తర్వాత ఒకటిగా నేలబడి ఆ అదుటుకి కట్లు తెంచుకు చెదురుతున్నాయి. పే.640) ప్రళయం, అంటే విప్లవం వస్తే ఎట్లా అంగలుగా గెంతులుగా వస్తుందో కథాశిల్పరీత్యా కూడ గొప్పగా చిత్రించిన కథ.

‘చావు’, ‘జీవధార’ – కథలుగా ఎంత గొప్పవో, అంత వర్గదృష్టితో రాసినవి. పీడితప్రజల పక్షపాతంతో రాసినవి. జీవితంలోని పార్శ్వాలను వైవిధ్యంతో చిత్రించినవి. ఈ అన్ని కథల్లోనూ వర్గచైతన్యంతో కూడిన ధిక్కారస్వభావం, తిరుగుబాటు ప్రస్ఫుటమవుతాయి.

‘సేనాపతి వీరన్న’, ‘అభిశప్తులు’, ‘అశిక్ష-అవిద్య’, ‘యజ్ఞం’, ‘వీరుడు-మహావీరుడు, ‘ఆదివారం’, ‘హింస’, ‘నోరూమ్‌’, ‘ఆర్తి’, ‘భయం’, ‘శాంతి’, ‘చావు’, ‘జీవధార’ – వంటి అన్ని కథల్లోనూ ప్రధానపాత్రలు, నాయకులు, కష్టజీవులు, వృత్తిజీవులు, స్త్రీలు. కారా కథల్లోని రాజకీయ అవగాహన నైశిత్యం ఎక్కడంటే ఆయన కేవలం పేదలపక్షం కాదు. కష్టం చేసి దోపిడీకి గురవుతున్న పేదలపక్షం.

‘అభిశప్తులు’, ‘అశిక్ష – అవిద్య’, ‘ఆదివారం’, ‘హింస’, ‘ఆర్తి’, ‘చావు’ కథల్లో ఆయన పీడిత స్త్రీల విషయంలో ఎంత ఆర్తి కనబరుస్తారో అర్థమవుతుంది.

‘శాంతి’ కథ ద్వారా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు తమ హక్కులకోసం చర్చలు, సమ్మెలు చేయడమైనా వుందని సత్యం చెప్పినట్లుగానే  ‘ఆదివారం’ కథ ద్వారా  అసంఘటిత, అనుత్పాదకరంగంలో వున్న స్త్రీలకు (ఇంట్లో పనిచేసే పనిమనుషులు  ఇంక అందులో అధమతరగతి)  పనిగంటలూ లేవు. ఆదివారాలూ లేవు. కష్టం చేసే ఆ చేతులు నోరుపెట్టుకొని బతుకకపోతే వాళ్ల చిన్న చిన్న కోర్కెలు కూడ నెరవేరకపోవడం అలా వుంచి డొక్కారగట్టుకుని తిండికి అల్లాడవలసిందే.

‘హింస’, ‘నోరూమ్‌’, ‘ఆర్తి’, ‘జీవధార’లో పాత్రలన్నీ అట్టడుగువర్గాల నుంచి వచ్చినవాళ్లు – స్త్రీలు. కథలుగా కూడ ఇవి చాల గొప్పకథలు.

ఇంక కారా గారి కథల్లో తలమానికాలు అయిన ‘యజ్ఞం’, ‘చావు’ కథలు రెండూ దళిత జీవితాలను చిత్రించేవి. ‘చావు’ కథలో అస్పృశ్యత కూడ ఒక ప్రధానమైన అంశంగా నలుగుతుంది.

ఇంత నిశితమైన వర్గదృష్టి, రాజకీయ అవగాహన ఉన్న కారా గారు 1972 తర్వాత ఒక్క ‘సంకల్పం’ తప్ప కథలు రాయలేకపోయారు. ఆయన కథలన్నీ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విరమణ (1951) శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట సెట్‌బ్యాక్‌ (1972)కి మధ్యన వచ్చినవే. ఆయన అనుభవాలు కాకపోయినా ఆయన జీవితం చుట్టూ అల్లుకున్న గాఢమైన  శ్రీకాకుళ పరిసరాలు, ఉద్యమాలు ఆయన పరిశీలనకు ఎంతగానో తోడ్పడ్డాయి.

(ఆధారం – కాళీపట్నం రామారావుకథలు, ఆర్‌.కె.పబ్లికేషన్స్‌, విశాఖపట్నం – 1986)

 

[1] ‘యజ్ఞం’లో శ్రీరాములునాయుడు ధర్మమండపంలో నిలబడి అప్పల్రాముని అప్పు గురించి వర్గదృష్టితో తప్ప ఎట్లా చూడలేడో, చూడలేక తాను న్యాయమే చెప్తున్నాననుకుంటాడో (అది నాలుగుకాళ్ల మీద నడిచే ఆస్తి న్యాయం – శ్రమమీద ఆధారపడిన న్యాయం కాదు) ఇందులో సూరప్పడు కూడ ‘…దోపిడీ చేయలేదు. అతనివల్ల దోపిడీ జరిగింది’ (పే.125) అనుకుంటాడు.

  -వరవర రావు

vv.karaఏబై ఏళ్లుగా కవిత్వం, సాహిత్య రాజకీయ విమర్శ చేస్తున్నారు. ప్రజాపక్ష వక్త. విరసం వ్యవస్థాపక సభ్యులు. సృజన పత్రికను హన్మకొండ కేంద్రంగా నడిపారు మిత్రులతో కలిసి. ప్రత్యామ్నాయ రాజకీయాలకు మద్దతుదారు. చలినెగళ్ళు, స్వేచ్ఛ, సముద్రం, భవిష్యత్తు చిత్రపటం, ముక్తకంఠం, అంతసూత్రం — కవిత్వ సంపుటాల్లో కొన్ని. కొత్త కవితా సంపుటి బీజభూమి ఇటీవలే విడుదలయ్యింది. ఈయన రచనలు ఇంగ్లీషులోకి, హిందీలోకి, ఇంకొన్ని భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యాయి

గదులు ఖాళీగా లేవు!

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

ప్రపంచంలో అత్యంగా భయంకరమైంది, అత్యంత క్రూరమైంది పేదరికం లేక దారిద్ర్యం.

దారిద్ర్యం మనిషిని నిలువునా క్రుంగదీస్తుంది.

దారిద్ర్యం మనిషిని అసమర్ధుడిగా చేస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని లేకుండా చేస్తుంది.

దరిద్రుడికి ఆకలి, అనారోగ్యం, అవసరాలు తప్ప స్నేహితులు, బంధువులు ఎవరూ ఉండరు.

దరిద్రుడ్ని చూస్తే అంతా తప్పుకు తిరుగుతారు.

మాటలు, చూపులు, బాడీ లాంగ్వేజ్ ను బట్టి దరిద్రుడ్ని సులభంగానే గుర్తించవచ్చు.

ఎంతటి ప్రతిభ వున్నా దరిద్రుడు ప్రకాశించలేడు.

ప్రతిభ వున్న దరిద్రుడు మబ్బుపట్టిన సూర్యుడిలా అణగిపోవాల్సిందే. – ఇవన్నీ నూకరాజుకు తెలుసు. అతని బాల్యం, బాల్యంలో జరిగిన సంఘటనలు, పోటీల్లో చూపిన ప్రతిభ ఇవేవి అతనికి గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయాయి. నూకరాజు పుట్టింది పూరి గుడిసెలలోనే. కానీ అతడికి పెంకుటింటివాళ్ళు, భవనాల మనుషులతో పరిచయాలు, స్నేహాలు వున్నాయి. చదువు సగంలో ఆగినా ఈ యేడో, వచ్చే యేడో మెట్రిక్ పరీక్షకు కూచోపోతున్నాడు. అతడికొక ఫాక్టరీలో, చిన్నదే అయినా మంచి ఉద్యోగం వుంది. దేశమాత పేరు చెబితే అతడికి ఒళ్ళు పులకరించేది. అంతలో పాకిస్థాన్ దాడి వచ్చింది. హోమ్ గార్డుల్లో చేరాక దేశభక్తి పట్ల అతని అభిప్రాయాలు మారతాయి. అన్ని ఖర్చులు మానుకుని ట్యుటోరియల్ కాలేజీలో చదవాలని కోరిక. వీటన్నింటిని మించిన కోరిక ఒకటే. కొత్తగా పెళ్ళి చేసుకున్న భార్యతో ఏకాంతంగా ఒక విశాలమైన గదిలో గడపాలని.  కుటుంబసభ్యులతో కిక్కిరిసి వున్న ఇరుకు గుడిసె లోనుండి దూరంగా, అంటే ఏదో ఒక లాడ్జిలో – ఖరీదైనది కాకపోయినా, పరిశుభ్రంగా వుండే ఒక లాడ్జిలో, భార్యతో సుఖంగా గడపాలనే కోరిక తొలిచివేస్తుంటుంది. తన అవసరాలన్నీ చంపుకుని డబ్బు కూడబెట్టుకుని భార్యకు నచ్చచెప్పి పెద్దలను అంగీకరింపచేసి దూరంగా వున్న లాడ్జి హౌస్ కు వస్తాడు. కానీ లాడ్జి గుమాస్తా నూకరాజు వాలకం చూసి లాడ్జి ఇవ్వడం ఇష్టం లేక ‘నో రూమ్’ అని వెళ్ళగొడతాడు.

ఆ హాస్టల్ గుమాస్తా సహాయకుడిగా పని చేస్తున్న దేవుడు నూకరాజు పరిస్థితిని చూసి జాలి పడతాడు. ఒకప్పుడు దేవుడు కూడా నూకరాజు లాంటి పరిస్థితినే ఎదుర్కొని వుంటాడు. పెద్ద కుటుంబంతో, ఇరుకు గుడిసెలో వుండే దేవుడికి తన అసహాయత, తన ఉక్రోశం, తన చేతకానితనాన్ని అంతా భార్యను గొడ్డును బాదినట్లు బాదడంలో చూపించేవాడు. దాంతో కుదురుకున్న నలభైయవ ఏట అతని భార్య కోరుకున్న తీరిక కూడా అదే. వాళ్ళిద్దరే ఎవరికంటాబడకుండా సుఖంగా, ఏకాంతంగా గడపాలని. కానీ ఆమె కోరిక తీరకుండానే కన్నుమూస్తుంది. అంత నిర్లిప్తంగా బతుకీడుస్తున్న దేవుడు – నూకరాజు జంటలో తనను తాను చూసుకోగలుగుతాడు. వారి మీద జాలి పడతాడు.

లాడ్జి నుండి అవమానభారంతో వచ్చిన నూకరాజుకు, సినిమాకు వెళ్దామన్నా టిక్కెట్లు దొరకవు. మంచి హోటల్ కు పోలేక కుళ్ళు కాలువ పక్కన వున్న టీ షాపులో ఫలహారం తీసుకుని భార్యతో బయటికి వస్తాడు. తను అనుకున్నది ఏదీ జరగలేదు. అన్నీ అడ్డంకులే. దాంతో ఎక్కడ లేని కోపం ముసురుకుంటుంది. ఏదో కసి, ఎవరిమీదో ఆవేశం, ఎవరినైనా చితకదన్ని తన కసిని తీర్చుకోవాలనే ఆవేశం ముంచెత్తుకొస్తుంటుంది. అలాంటి సమయంలో లాడ్జింగ్ నుండి వస్తున్న దేవుడు వాళ్ళను గుర్తుపట్టి ఆపుతాడు. నూకరాజు కోపంతో ఉన్నట్లు గమనించి అతని భార్యతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తాడు. పరాకుగా ఒకదానికి బదులు ఇంకోటి మాట్లాడడంతో – నూకరాజు ఆగ్రహాన్ని, అవమానాన్ని తిరిగి రెచ్చగొట్టినట్లుగా గ్రహించలేకపోతాడు. దాని ఫలితం, నూకరాజు ఆ ముసలి దేవుడ్ని చితకబాదేస్తాడు. జనం అడ్డుకోవడంతో దేవుడు బతికిపోతాడు. భార్య సముదాయించి నూకరాజును రిక్షాలో తీసుకొనివెళుతుంది. ఏడుపును అణచుకొంటూ దెబ్బలతో దేవుడు లాడ్జింగుకు బయలుదేరుతాడు.

తనకు ప్రతికూలంగా పరిణమించిన పరిణామాలు పట్ల ఉక్రోశం, ఆవేశం, కసి కలగలిసిపోయి – తనను అవమానించిన గుమస్తాను, లాడ్జి ఓనరును చితకబాదాలనే కోపం, చివరికి అన్నెం పున్నెం ఎరగని దేవుడి మీద చూపించాల్సి వస్తుంది. తన నిస్సహాయతను, ఇంకో నిస్సహాయుని మీద తీర్చుకుంటాడు. గతంలో దేవుడు చేసిన పని మీద కూడా ఇదే. తన ఆవేశాలను, ఉద్వేగాలను భార్య మీద చూపించేవాడు. బయట తాము పడ్డ కష్టాలను, అవమానాలను తమ భార్యల మీద తీర్చుకోవడం గుడిసెవాసులకు మామూలే. ఇలా బాధలు పడింది దేవుడి పెళ్ళామే కాదు. అతని కూతురు పెద్దమ్మ అత్తారింట బాధలు పడలేక ఎందులోనో పడి చచ్చిపోతుంది.

లాడ్జిలో గదికోసం భార్యతో వచ్చిన నూకరాజు మంచిగా టక్ చేసుకొని బూట్లు వేసుకొని నీటుగానే వస్తాడు. “వేషం, గీషం అన్నీ బాగానే వున్నాయి కానీ బాగాలేంది కూడా ఏదో ఒకటి ఉండుంటుంది. రెండు కళ్ళలో ఒకటి గుడ్డిదైనా గుమస్తాగాడు సూడగానే దాన్ని పట్టేసినాడు.” అని దేవుడు సరిగానే ఊహిస్తాడు. ఇందులో గుమాస్తా తప్పేమీ లేదు. వాడు లాడ్జిని అలగా జనం నుండి దూరంగా, డబ్బున్న వాళ్ళ కోసం డబ్బులు వెదజల్లేవారికోసమే నడుపుతుంటాడు. చిల్లర జనాలు, చీప్ మనుషులు కనిపిస్తే డబ్బున్నవాడెవడూ ఆ లాడ్జికి రాడు. తన హోదాకు సరిపడే మరో లాడ్జికి వెళ్ళిపోతాడు. వాడు ఏ ముండను తెచ్చుకుని కులికినా వారికి అభ్యంతరం ఉండదు. రెంట్ కడతాడు. టిప్పులు వెదజల్లుతాడు. ఖరీదైన మనుషులు ఉంటారని తెలిసిన లాడ్జీల జోలికి పోలీసులు కూడా రారు. అందుకే ఈ లాడ్జీలన్ని అలాగా జనాన్ని దూరంగా                                         వుంచడానికే ప్రయత్నిస్తాయి. ఈ విషయాన్ని ఆ లాడ్జిని కడుతున్నప్పుడే మేస్త్రి ఆడకూలితో “ఈ మేడే వుంది. రేపొద్దున ఇందలో లాడ్జింగ్ యెడతారట. అందరిచ్చిందాని కంటే అర్ధో, రూపాయో ఎక్కువిస్తాను; నన్నోరాత్తిరి కిందల తొంగోనియ్ అను. నా నిలువెత్తు ధనం ఇచ్చినా నువ్వు కూల్దాని గున్నంత కాలం ఇందల అడుగెట్టనియ్యరు” అని చెప్పడం గమనించ తగ్గ విషయం.

మొత్తానికి ఈ కధ – కొత్తగా పెళ్ళైయిన భార్యతో ఏకాంతంగా సుఖంగా, ఒక రోజైనా గడపాలనే కోరికతో, లాడ్జీకి  వచ్చి భంగపడిన, నూకరాజు అనే యువకుడి కధ. ఇలాంటి కోరికలే వున్నా, అన్ని అణచేసుకొని నిర్లిప్తంగా బతికేస్తున్న ముసలి దేవుడు కూడా ఇందులో కనిపిస్తాడు. ప్రయత్నించి విఫలం అవుతాడు నూకరాజు. తన అశక్తతను గమనించి మిన్నకుండి పోతాడు దేవుడు. అందుకే నూకరాజు ప్రయత్నాన్ని మెచ్చుకొంటాడు. తన తరం కంటే తన తర్వాత తరం వారు అంటే ఇప్పటి వాళ్ళలో వున్న చొరవ, ధైర్యంను గమనించి  సెబాసో అనుకుంటాడు.

ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వచ్చినా పేదవాడికి కూడు, గుడ్డ, వసతిని సమకూర్చలేకపోతున్నాయి. ధనవంతుడు రోజు రోజుకు మరింత ధనవంతుడు అవుతున్నాడు. పేదవాళ్ళు మరింత పేదగా తయారవుతున్నారు. ఎలాంటి కష్టమెరుగనివాడికి అప్పనంగా వందలకొద్ది ఎకరాల భూమి దఖలు పడుతుంది. కష్టజీవులకు, నిరుపేదలకు జానెడు భూమి దొరకదు. ఇక్కడ ఈ కధలో రచయిత భూమి లేని నిరుపేదల గురించి చెప్పదలుచుకొన్నారు. కనీసావసరాలు కూడా తీర్చలేని నిర్భాగ్యుల గురించి చెప్పదలుచుకొన్నారు. అందులో భాగంగానే లాడ్జి హౌస్ నిర్మాణం గురించి చెబుతాడు. కూలీలు – మేస్త్రీ – కాంట్రాక్టరు కలిసి లాడ్జి కడితే కాంట్రాక్టరు లాభపడతాడని తేల్చారు. మనం కట్టిన ఈ లాడ్జిలో మనకే ప్రవేశముండదు అంటారు. ఇదంతా మాండలికంలో, వర్ణనలో చెప్పడం బాగుంది.

ఈ కధలో  కొత్త జంటకు కావాల్సింది ఏకాంతం. కుటుంబసభ్యులతో కిక్కిరిసిపోయిన ఆ ఒంటి గది గుడిసెలో ఆ కొత్త దంపతుల ఆరాటాన్ని ఎవరు అర్ధం చేసుకొంటారు? అందుకే వాళ్ళు లాడ్జి వైపు చూశారని అనుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబసభ్యులే కూడబలుక్కుని వాళ్ళకు ఏకాంతం కల్పిస్తారు. లేదా ఆ దంపతులే ఏదో ఒక రకంగా ఆ గుడిసెలో ఏకాంతం వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు. అంతే తప్ప లాడ్జింగుల వైపుకు వెళ్ళే ఖరీదైన ఆలోచనలు చేయరు. ఈ కధ చదువుతుంటే రాజశ్రీ వారు తీసిన “పియా కా ఖర్” సినిమా గుర్తుకు వస్తుంది. బాంబేలో పిచ్చుక గూళ్ళు లాంటి ఇళ్ళలో కాపురాలు చేసే వారున్నారు. అందులో కూడా కిక్కిరిసిన కుటుంబ సభ్యుల మధ్య తమ ఆశలు, ఆరాటాలు తీర్చుకోవడానికి కొత్త దంపతులు లాడ్జికి వెళతారు. అక్కడ పోలీసులు రెయిడ్ చేసి వాళ్ళను వ్యభిచార నేరం క్రింద పట్టుకొంటారు. తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళు దంపతులని చెప్పి తీసుకువస్తారు. చివరకు కుటుంబ సభ్యులంతా  కలిసి వాళ్ళకు ఏకాంతం కల్పించడంతో సినిమా సుఖాంతం అవుతుంది. ఈ సినిమాలో చూపించే దంపతులు మధ్య తరగతికి చెందిన వాళ్ళు. చదువుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళ వేషభాషలను చూసి లాడ్జిలోకి అనుమతిస్తారు.  నూకరాజు దంపతులను చూసి అలగాజనుల వ్యవహారమని తలచి గుమాస్తా వెళ్లగొడతాడు.

ఈ కధ వచ్చిన కొత్తల్లో చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇందులో వున్న సమస్యలకు లాడ్జీలను పరిష్కారంగా చూపడం నవ్వు తెప్పించింది. అక్కడి గుడిసె వాసులకు వున్న లాడ్జీల పరిజ్ఞానం మాలాంటి తెలంగాణా వాళ్ళకు లేకపోవడం ఒక కారణం కావచ్చును. లేదా మా దగ్గర లాడ్జీల సంస్కృతి లేకపోవడం వల్ల మేము సరిగా అర్ధం చేసుకోలేక పోయాం అనైనా అనుకోవాలి. నిజానికి ఆ పరిస్థితుల్లో ఆ జంట ఎలా ఆలోచిస్తుందనే విషయాన్ని కూడా రచయిత సరిగా పట్టుకోలేక పోయారు. గుడిసెవాళ్ళు లేదా కష్టజీవులు లాడ్జిలకంటూ బోలెడు డబ్బు పోసే బదులు, ఆ డబ్బుతో తన భార్యకు ఇష్టమైనవి తీసుకు వచ్చి ఆమె ప్రేమను చూరగొనాలనుకొంటాడు. ముఖ్యంగా స్త్రీలు అంత డబ్బును దుబారా చేయడానికి ఇష్టపడక, తమకు లేని వస్తువులను సమకూర్చుకోవాలని ఆశిస్తారు.

ఇంకా తెలివైన వాళ్ళయితే ఆ డబ్బుతో కుటుంబసభ్యులను తీర్ధయాత్రలకు తరిమేసి ఏకాంతాన్ని పొందగలుగుతారు. లేదా కొత్త దంపతుల తీర్ధయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన వాళ్ళకు ఏదో విధంగా హనిమూన్ కొరతను తీర్చగలుగుతాయి. ఇలా ఇరుకు ఇళ్ళలో గడిపేవారికి ఎప్పటికైనా స్వంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక కలుగుతుంది. మరింత డబ్బు సంపాదించే మార్గాలు కనుక్కుంటే మరింత విశాలమైన ఇంటిలోకి మారాలని అనుకుంటారు. ఆదాయం కొద్ది ఇల్లు సమకూరుతుంది. ఒక రోజు వ్యవహారంతో సరిపెట్టాలనుకుంటే తప్ప. ఆ విధంగా కూడా ఈ కధలో నూకరాజు ఆలోచించలేక పోతాడు. కధ చదివిన తరువాత సామాన్య పాఠకుడి ఆలోచనా ధోరణీ ఇలాగే కొనసాగుతుంది. మరి రచయిత ఉద్దేశించింది ఇదేనా? కానే కాదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళవుతున్నా మనుషులకు జానెడు భూమి దొరకని పరిస్థితిని తెలియచేసారు. కనీస అవసరాలు కాదు గదా, చిన్న చిన్న సరదాలు కూడా తీర్చుకోలేని నిస్సహాయ పరిస్థితిని తెలియజేశారు. పాఠకుడు నూకరాజు పరిస్థితిని చూసి జాలి పడి పడతాడు. కానీ అంతకంటే నికృష్టమైన పరిస్థితుల్లో బతుకుతున్న వేలాదిమంది మాటేమిటి? హోటల్ లోంచి వస్తున్న నూకరాజు ఒక చోట అరుగు మీద మనుషులు మందల్లా పడుకోవడం, ఇంకొక చోట పేవ్ మెంట్ మీద బారులు తీరి పడుకోవడం గమనిస్తాడు.

“వాళ్ళకు ఇల్లంటూ ఉండదు. ఎలా బతుకుతారో” అనుకున్నాడు నూకరాజు.

“అలానే… కుక్కల్లా”

నూకరాజు తుళ్ళిపడ్డాడు మనసులో.

వేలకు వేలు జనం బతుకుతున్నారు ఆ నగరంలో. చెట్ల కింద సంసారాలు, గట్ల మీద వంటలు, వడ్డనలు. వానొస్తే, వరదోస్తే కనబడ్డ అరుగులు ఎక్కుతారు. కరకర ఎముకలు కొరికే చలిలో, జరజర వర్షంలా కురిసే మంచులో, భగభగ మండి మసి చేసే ఎండలో, నీడంటూ లేని బ్రతుకులు. వెళ్ళు, వెళ్ళండి .. లే లే .. ఇక్కడ కాదు అంటూ కుక్కల్ని తరిమినట్టు తరుముతారు. బురదలో, రొచ్చులో, దీపాల్లేని బ్రతుకులు. దుప్పట్ల ముసుగు. పక్కవాళ్ళ రెప్పల బరువులు తప్ప మరుగుల్లేని చీకటి కాపురాలు.

జాలి కలగడానికి బదులు కోపం వస్తున్నది నూకరాజుకి. ఏదో సినిమాలో, ఎక్కడో ఎవరో జనం రోతకి, అన్యాయానికి, హింసకు విరగబడి తిరగబడ్డం చూసేరు. ఈ జనం మాత్రం ఎన్నాళ్ళయినా ఇంతే.

జనానికి నిజమైన అనుభవాలు అందవు. అందాలనే కోర్కెలు, ఊహలు కలిగినా ప్రమాదమే.

వాళ్ళను ఊహాలలో విహరింపజేయడానికి సినిమాలు బాగా పనికివస్తాయి. తెరమీద చూపిస్తున్నదే మాయ. ఆ మాయను కూడా మాయగా చూపిస్తారు మాయవెధవలు.

పెద్దవాళ్ళు పిల్లల్ని ఉత్తుత్త కబుర్లతో మభ్యపెట్టినట్లు, ప్రజలని ప్రభువులు మాయా వాగ్దానాలతో మోసగిస్తున్నట్లు, కొందరు మాయగాళ్ళు జనంను మాయానుభవాలతో మోసగిస్తున్నారు. జనం మోసపోవడానికి సిద్దంగా ఉన్నారు. అందుకు ముడుపులు కూడా చెల్లిస్తున్నారు. ఆ ముడుపులు బ్లాక్ రేట్లలో చెల్లించడానికి కూడా వారు సిద్దం. మోసగిస్తున్నారంటే వాళ్ళది తప్పు కాదేమో.

కుక్కల్లా పందుల్లా బతుకుతున్న జనాలకు తామెందుకు ఆ పరిస్థితుల్లో బతుకుతున్నారో ఆలోచించలేక  అలాగే అడ్జెస్ట్ అయితున్నందుకు కోపం. వాళ్ళను ఆలోచించకుండా కలల స్వర్గంలో విహరింప చేస్తున్న మాయా ప్రపంచం అనే సినిమాల మీద కోపం. ఆ కోపం, ఈ కోపం అంతా కలిసి గట్టు తెగిన వరదలా దేవుడి  మీద చూపించాల్సి వస్తుంది.

‘నో రూమ్’ లో ముగ్గురి కధలున్నాయి. లాడ్జి కట్టిన మేస్త్రీకి, దాన్ని మెయింటైన్ చేస్తున్న దేవుడికి, అందులో డబ్బుతోనైనా ఒక్క రాత్రి సుఖాన్ని పొందాలనుకునే నూక రాజుకి అది అందుబాటులో లేదనే విషయం ముగ్గురి కధనాల ద్వారా తెలియచేసారు. ఇందులో మేస్త్రీ దోపిడి స్వభావాన్ని చక్కగా గుర్తించి విశ్లేషిస్తారు. కానీ తన అవసరాల దృష్ట్యా దాంతో అడ్జెస్ట్ అయిపోతారు. ఏమి చేయలేని స్థితిలో దేవుడు నైరాశ్యంలో, నిర్లిప్తంగా బతుకు వెళ్ళదీస్తుంటాడు. నూకరాజులో పొడసూపిన తిరుగుబాటు చైతన్యాన్ని, అతని నిస్సహాయతలోంచి పెల్లుబకడాన్ని చక్కగా చిత్రీకరించారు. మొత్తానికి – స్వాతంత్ర్యానికి పూర్వం దేవుడికి, తర్వాత నూకరాజుకి గూడు కల్పించలేని సమాజం మీద విసురుగా ఈ కధని గుర్తించాలని ప్రముఖ విమర్శకులు ఎ.కె. ప్రభాకర్ అభిప్రాయాలు ఆలోచించదగినవే.

–  కె.పి. అశోక్ కుమార్

1888749_1047824525231610_1628769097923067855_n

కె.పి అశోక్ కుమార్ జననం, ప్రాధమిక విద్యాభ్యాసం సికిందరాబాద్ లోని మచ్చబొల్లారంలో జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్కియాలజీ, ఆంధ్ర సారస్వత పరిషత్ లో తెలుగు సాహిత్యం, అనంతపూర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో గ్రంధాలయ సమాచార శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వీరు హైదారాబాద్ లో గ్రంధపాలకుడిగా పని చేస్తూ ఇటీవలనే పదవీవిరమణ చేశారు. ‘హాలీవుడ్ సినిమాలు’, ‘కధావలోకనం’, ‘తెలుగులో మారుపేరు రచయితలు’ పుస్తకాలు వెలువరించారు. నాలుగు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రస్తుతం పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్ గా ఉన్నారు.  

 

 (వచ్చే వారం ఈ శీర్షికలో చివరి వ్యాసం: వరవరరావు  ‘కాళీపట్నం రామారావు కధలు, రాజకీయ అవగాహన’)

“నో రూమ్” కథ ఇక్కడ:

ఇల్లే మనిషికి భరోసానా?

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిజమే! మనిషికే కాదు. పశు పక్ష్యాదులకు కూడా గూడు తప్పనిసరి అవసరం. వానరుడి నుండి నరుడు చలికీ, వానకీ, ఎండకీ గుహలు వెతుక్కుంటూనే వున్నాడు. కూడు, గుడ్డ, గూడు జీవికి ఎప్పటికీ ప్రాధమిక అవసరాలే. వీటి కోసం మనుషులు వారి వారి స్థాయిలకు తగినట్టుగా కొందరు కష్టపడుతున్నారు, మరికొందరు అలవోకగా అంతస్థులు కట్టగలుగుతున్నారు.

అలా చిన్న గూడు కోసం తపనపడ్డ ఒకానొక అల్పజీవి కధే .. కాళీపట్నం రామారావుగారి “ఇల్లు”.

ఈ కధకు కేంద్రం పావనరామయ్య కావచ్చుగానీ, మనుషులు సొంతానికి ‘గూడు’ వంటిదైనా సరే చిన్న కొంప కోసం పడే యాతన ఎలా వుంటుందో చూపించారు. ఇల్లు అనేది నెత్తి మీద నీడ కోసమే కాక, మనిషికి భరోసా ఎలా కలుగుతుందో … ఆ భరోసా మనిషి ధైర్యంగా నిలబడటానికి ఎలా ఉపకరిస్తుందో చెప్పిన కధ.

పావనరామయ్య అప్పు చేసి మరీ కట్టాడు. ‘ఆ అప్పు తీరే దారీ కనబడటం లేదు. ఇంకా ఇంటికి చేయవలసిన పనులూ అట్టాగే వున్నయ్యి. వాటికీ డబ్బు లేదు. ఇంకో వైపు ఎదిగిన ఆడపిల్ల పెళ్ళికుంది. ఆ పిల్ల బాధ్యత తీరాలి, పిల్లాడింకా చేతికంది రాలేదు! అయినా ఇంటికోసమే ఆ వున్న కొద్ది మొత్తం ఖర్చు చేశాడు, – “కనీసం తులం బంగారం గానీ, సెంటు భూమి గానీ, చేరడు ఇల్లుగానీ ఉంటే నేనానాడు అంత పిరికి బ్రతుకు బ్రతిక ఉండనక్కర లేదని, ఆ రోజుల్లో నేను తరచుగా అనుకునేవాణ్ణి.” .. ఇది పావనరామయ్య లాంటి వారి ఆవేదన. ఇలాంటి వారందరికీ ఇల్లు అందుకు అవసరం, – అంతే తప్ప, విలాసానికో, సొంత ఆస్తి పెంపకానికో కాదు.

రెక్కల కష్టం తప్ప సొంతాస్తి చిల్లీ గవ్వలేని వాళ్ళకు పిల్లలే ఆస్తి. చివరి దశలో ఒక ముద్ద పెట్టి కడ తేరుస్తారని ఆశ పడతారు. ఆ ఆశ ఎంత బరువైందంటే ప్రతి క్షణం పిల్లలు ఎక్కడ దారి తప్పుతారోనని కాపలా కాసుకునే ఆందోళన అంత హింసాత్మకమైంది. – “వాడికి చెప్పించిన చదువంతా నా కోసమే చెప్పించుకున్నాను. బ్రతికి వుంటే వాడికి పెండ్లి నా శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని చేసే వాణ్ణి.” .. చనిపోయిన తన పెద్ద కొడుకు మీద కుటుంబ భారం వుందని తలచి, ఆ పిల్లవాడిని క్రమశిక్షణ పేరుతో తిట్టిన తిట్లు, పెట్టిన చీవాట్లు తలుచుకుని పశ్చాత్తాప్పడతాడతను. అందుకే భార్య దుఃఖం మీద ఎవరేమన్నా అతను మాత్రం ఏమీ అనుకోడు.

శేష జీవితం కొడుకు మీద ఆధారపడి వుందన్న అభద్రత ఆయన్ను క్షోభ పెట్టింది. అది తలుచుకుంటూ, “మనిషిలోసాహసానికైతేనేమీ, బ్రతుకులో ఆనందానికైతేనేమీ మూలం భరోసా – అది లేనినాడు మనిషి జీవచ్ఛవంగా తప్ప, మనిషిగా బతకలేడు” … ఇదీ పావనరామయ్య అభిప్రాయం. అట్లా ఆయనకు జీవితంలో భద్రతనిచ్చే చిన్న పిసరు ఆశ ఏ కోశానా లేకుండా పోయింది.

అయితే బ్రతుకులో భరోసా అందరికీ వుందా? వస్తుందా? అన్న ప్రశ్న ఉండనే ఉంది. ఏదో మేరకైనా ఇల్లుగానీ, తిండిగానీ అందరికీ సమకూరే అవకాశాలు లేని చోట కొందరికైతే ఇవి సమకూర్చుకోవడం ఎప్పటికీ ఒక జీవిత కాలపు యుద్ధమే! ఆ విషయం ఈ కధలో చెప్పకనే చెప్పారు. అద్దె కొంపలు కూడా లేని వాళ్ళను గురించి ప్రస్తావిస్తూ … ‘పోనీ పూరిపాకలు వేసుకోవచ్చు గదా! నామోషి అనుకోకపోతే …’ అన్న దానికి సమాధానంగా అవైనా వేసుకుని చూస్తే తెలుస్తుందంటారు.

నాలుగు తాటాకులు వేసుకున్నవాళ్ళు, అవి పీకి పారేయకుండా మున్సిపాలిటీ వాళ్ళ నోళ్ళు మూయించడం కోసం పడే నానా తిప్పలూ, సమర్పించుకునే నజరానాలు, ఎట్లా వుంటయ్యో చెప్తారు. అదే కాదు అసలు – “మీ గుడిసెలు అంటుకుంటే మా మేడలు కాలిపోతయ్యనే’ వర్గం, … ఆ వర్గాన్ని కాపాడే పాలనా యంత్రాంగం పని మీద ఇక్కడ విమర్శ పెడతారు.

పాలనా యంత్రాంగం కాపాడేది పై వాడి మేడల్నే కాదు … కింద వాళ్ళు ఎప్పటికీ మేడ కట్టకుండా తగు జాగ్రత్తలతో కనిపెట్టి వుండే బాధ్యత కూడా దాని నెత్తి మీదనే ఉంది. దాని కోసం చట్టాలు చేస్తుంది, ఆ చట్టాలు చేసే వాళ్ళు ఎప్పుడూ పైతరగతి వాళ్ళే!

పిల్ల పెళ్ళి కన్నా, ఇల్లు కట్టడానికే నిర్ణయించుకున్నావ్?”… అన్న బావమరిది ప్రశ్నకు – “ఈ ఇల్లు కొనడమొక్కటే నేను నా జీవితంలో ఆడగల జూదం – ఇల్లు కొంటే నేను నా ముసలితనాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాను. అదృష్టం బాగుండి ఇల్లు దక్కించు కోగలిగితే నా కన్నా, నా పిల్లలు గొప్ప అదృష్టవంతులు కాగలరు. దక్కించుకోలేక పోవడానికి చాలా కాలం పడుతుంది. ఈ లోగా దేవుడు హాని చేయకపోతే నేను కన్ను మూసేయకపోను”… ఇంత అంతిమ కోర్కెగా ‘ఇల్లు’ ఎట్లా రూపు దిద్దుకుందీ?

మనిషి సొంతింటిలో చనిపోవాలనే కోరికా? లేక ఇల్లుంటే పిల్లలు, తల్లిదండ్రులను కనిపెట్టి చూస్తారన్న జిజ్ఞాసా? ఏది ప్రధానం? ఇందులో ఏది ముఖ్యమో తరువాత సంగతి గానీ, ఆ ఇంటికోసం జీవిత కాలమంతా పడే ఆందోళన అంతింతా కాదు.

“పశువులకూ, పక్షులకూ కూడా తమ స్వంత గూడంటూ వుంటుంది. మనిషి చచ్చిందాకా బతికి కూడా గూడు కట్టుకోలేక పోతున్నాడు.” దీనికి ఎవరిని ఏమనాలో తెలియడం లేదు,” .. “బ్రతుకు బ్రతుకల్లా శ్రమ పడి కూడ పెట్టిందంతా ధార పోసినా కానీ ఒక గూడు రాక పోవడం చాలా అన్యాయం.”

అట్టా మిగిల్చిన ‘ఫ్రావిడెంటు ఫండే’ గాక మరి కొంత అప్పు కూడా చేసి కట్టిన ఇల్లు ఎట్లాంటిదీ? ‘బొమ్మరిల్లంత’! కొడుకు పెళ్ళయి కోడలొస్తే ఎక్కడుండటమనే సమస్య ఇంటి కొచ్చిన వాళ్ళకే అర్ధమయినంత చిన్నది. గట్టిగా లావుగా వుండే వాళ్ళు ఒకరు నిల్చుంటే, రెండో వాళ్ళు వొరిగి నడిచేటంత ఇరుకు గది. ఆ ఇంటి కోసం పావన రామయ్య జీవితమంతా తపస్సు చేసి మరీ కట్టాడు.

అంత చిన్న ఇంటి కోసం కష్టపడటం సరే! మరి అంత చిన్న కొంప అతనికి భరోసా ఎలా అయ్యిందీ? ఎలా వచ్చిందీ? అసలు ప్రశ్న ఇది. ఈ దేశంలో భూమి లేని వాళ్ళు, గుడిసె లేనివాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు కోట్లాదిమంది వున్నారనే స్పృహ పావనరామయ్య వంటి వాళ్ళకు లేక పోవడానికి కారణం యాదృచ్ఛికం కాదు.

ఉద్యోగమొక్కటే జీవికగా ఎంచుకోవడం, ఏ పనైనా చేసి బతకగలమనే ధైర్యం లేకపోవడానికి కారణం ‘శారీరక శ్రమ’ చేయలేక పోవడం, ‘శ్రమ’ మీద నమ్మకం, విశ్వాసం లేకపోవడమే, ‘పావన రామయ్య’ పిరికితనానికి మూలం. ఇది అతని అస్థిత్వంలోనే ఉంది.

తను అలా జీవించలేదు … తన పిల్లలూ ‘శ్రమ’ మీద జీవించగలరన్న నమ్మకమూ లేక పోవడమే ఈ హింస కంతా కారణం. ఉద్యోగం లేని వాళ్ళు ఎంతమంది లేరూ? అనుకుంటాడు తప్ప … వీధిలో ‘పునుగు’ లేసుకునైనా బ్రతుకుతారులే అనే సంకల్పం పావనరామయ్యకు కలగక పోవడమే అసలు సమస్య. అందువల్లే అన్నిటా లొంగుబాటునే ప్రదర్శిస్తాడు. చివరికి దేవుడు దయదలిస్తే కన్ను మూసేయకపోను!’ అని దుఃఖంతో తన కధను వినిపిస్తాడు.

శ్రమ మీద, శ్రమశక్తి మీద ఆధారపడక, దాని మీద విశ్వాసం లేకపోవడమే. ‘ఇల్లుంటే’ భరోసా వుంటుందని ఆశ పడతాడు. అయితే ‘ఇల్లు’ నిలుపుకోవడం అంతా సులువైందా? ఆ భరోసా నిలుస్తుందా?

-నల్లూరి రుక్మిణి

 10620207_1377561999204331_349738008332540516_o1970 నుండీ విద్యార్ధీ , మహిళా, పౌరహక్కుల ఉద్యమాలతో కలిసి నడిచిన నల్లూరి రుక్మిణి తన సామాజిక కార్యక్రమాల్లో భాగంగానే సాహిత్యం వైపు మళ్ళారు. అయితే ఇప్పటికీ సామాజిక ఆచరణకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. నల్లూరి రుక్మిణి ‘జ్ఞానం అందరిదీ’, ‘పరామర్శ’ అనే సాహిత్య వ్యాసాలు వెలువరించారు. ‘ప్రశ్నే ప్రశ్నార్ధకమైన వేళ’ ఆమె కవిత్వం. ఇంకా ‘నర్రెంక చెట్టు కింద’, ‘ఒండ్రు మట్టి’ ఆనే నవలలు రాశారు. ‘గీతల కావల’, ‘జీవన స్పర్శ’, ‘నెగడు’ ఆమె కధా సంపుటిలు. విప్లవ రచయితల సంఘంలో సభ్యురాలైన రుక్మిణి తన రచనలు బడుగు, బలహీన వర్గాలకు అండగా వుండాలని ఆకాంక్షిస్తారు.    

 

వచ్చే వారం ‘నో రూమ్ ‘ కధా పరిచయం కె.పి అశోక్ కుమార్

“ఇల్లు” కథ ఇక్కడ:

ఈనాటి అవసరం ‘రాగమయి’

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

స్వాతిశయచిత్తుడైన మగాడు పచ్చటి సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకో సంకల్పించగా, ఆ సంసారాన్ని చక్కదిద్దడానికి ఒక  స్త్రీమూర్తి పడే ఆరాటమే ఈ ‘రాగమయి’ కథ.

పెళ్ళయిన నెలకే పుట్టింటికి చేరిన జానకిచేత – ఎవరూ, ఏవిధంగానూ జరిగినదేమిటో చెప్పించలేక పోయారు. ఆడపిల్ల కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నాలు ఆ ఇంటి మగవారెవరూ చేసిన దాఖలాలు కనపడవు.

ఉమ – తన బహిఃప్రాణాలుగా భావించే పినతల్లి కొడుకు రాజశేఖరానికి, ఆడబడుచు జానకికి వివాహం జరిపించడానికి మధ్యవర్తిత్వం నెరిపి, సంబంధం కుదిర్చిన కారణంగా – జానకి నూరేళ్ళబ్రతుకూ బూడిదపాలు కావడానికి ఆమెనే బాధ్యురాలిని చేశాడు మరిది శేషగిరి. పరస్పర నిందారోపణల క్రమంలో భర్తతో, అత్తగారితో ఘర్షణపడి తాను కూడా తన పుట్టింటికి చేరుకున్న ఉమ, నెలరోజుల తరువాత జానకి నుంచి వెంటనే బయలుదేరి రమ్మని ఉత్తరం అందుకుని, వ్యవహారాన్ని ఒక కొలిక్కి తేకుండా తిరుగుముఖం పట్టరాదని నిశ్చయించుకుని పిన్నిగారింటికి వెళుతుంది.

ఇంగ్లీషు చదువులు చదవలేదని రాజశేఖరంపట్ల శేషగిరికి ఉన్న చిన్నచూపును హేళన చేస్తూ, కోడలి తరఫున వకాల్తా పుచ్చుకుని ఆదినారాయణమూర్తిగారు “తెలుగులో అతను చదవని కావ్యం లేదు….. సంస్కృతంలో పంచకావ్యాలు క్షుణ్ణంగా చదువుకున్నాడు” అంటూ అల్లుడి గొప్పతనాన్ని పొగిడితే –

“నీవేదో గొప్ప పండితుడవనుకుంటున్నావ్….. నిజానికి నీవంటి మూర్ఖుడు ఇంకొకడు లేడు….. నువ్వు చదువుకున్నావనే అనుకున్నానుకానీ నీ ఛాందసపు చదువు నిన్నిలా ఛాందసుణ్ణి చేసి విడుస్తుందనుకోలేదు” అంటూ అన్నమీద మండిపడుతుంది ఉమ. ఇదొక శిల్ప విన్యాసం.

ఉమ నోటిద్వారా పలికించిన సంభాషణలు, ఆమె వ్యక్తిత్వ వర్ణనలు ఆ పాత్రని సమున్నత శిఖరం మీద నిలబెడితే, ఆడబడుచును కూతురుగా ఎంచి, న్యాయం, ధర్మం పక్షాన నిలబడి పోరాటం సాగించిన ఉమ చివరికి “తను తన జీవితంలో ఎదురుపడినవారిలో ఎవ్వరితోనైనా ఎప్పుడో ఒకప్పుడు పోట్లాడకుండా విడిచిపెట్టిందా? తను ప్రతివారితోనూ ఇలా పోట్లాడటానికి ఏం హక్కు వుంది? వాళ్ళు సంబంధాలు తెంచుకోలేక పడి వుంటున్నారు కాని వాళ్ళు నిజంగా తనకు బుద్ధి వచ్చేటట్టు చేస్తే తను చేసేదేముంది? చివరకు గయ్యాళిగంపనే బిరుదు ఏనాడో ఒకనాడు తనమీద పడి ఊరుకుంటుంది. తను చేతులారా బంధువులూ, అత్తమామలూ, చివరికి భర్త మనసుకూడా విరుచుకుంటోంది” అనుకుని రోదించడం కథలోని అతి పెద్ద విషాదం.

ఉమ సేవలు లేందే ఆ ఇంట్లో గడవదన్న సంగతి, ఉమ పుట్టింటికి ప్రయాణమయ్యే సందర్భంలో మామగారు చెప్పనే చెప్పారు – “…..మీ అత్త ముసలిది….. ఇంక మీ ఆయన పరమ సోమరి….. వీళ్ళిద్దరూ క్షణం వేగలేరు. అందుచేత వీలైనంత వేగిరం బయలుదేరిరా” అని.

నిజానికి గృహవాతావరణంలో శారీరకంగా, మానసికంగా ఎవరెంత నొప్పించినా, మమకారాల్ని చంపుకోలేక పడి ఉండేది ఆడదే. కానీ, తానేదో అఘాయిత్యం చేస్తుంటే, చుట్టూ ఉన్నవారంతా పడి ఉంటున్నట్లు భావించుకుని, తనను తాను నిందించుకునే మానసికదౌర్బల్యంలోకి ఆడదాన్నినెడుతున్నాడు ప్రతి అవసరానికీ ఆమెపైనే ఆధారపడే మగాడు.

శేషగిరి – ఇద్దరు పిల్లల తల్లైన వదినను ‘ఆడపెత్తనం’ అని ఈసడించడంగానీ, శేఖరం – ‘స్త్రే బుద్ధిః ప్రళయాంతకః’ అంటూ తన భార్యను తృణీకరించిన తమ్ముణ్ణి దండించవలసింది పోయి భార్యపైనే చెయ్యి చేసుకోబోవడంగానీ, రాజశేఖరం – చేసిన తప్పేంటో చెప్పకుండా భార్యను పుట్టింటికి పంపేసి, అత్తవారు పండక్కి పిలిచినా వెళ్ళక, భార్యను మానసిక హింసకు గురిచెయ్యడంగానీ, పురుషాహంకారానికి నిదర్శనాలే.

భర్త పట్ల చెల్లెలి మనసు విరిచేసి ఆమె సంసారాన్ని అగ్నిగుండంగా మారుస్తున్న శేషగిరిని చిన్నక్క వెనకేసుకు రావడమైనా, కొడుకు దొంగవేషాలను దాచిపెట్టి, తానుగా కొడుకు విషయంలో అబద్ధాలాడి గిరిజమ్మగారు చేజేతులా శేషగిరిని చెడగొట్టడమైనా, కుటుంబవ్యవస్థలో పురుషాధిక్యతను స్థిరీకరించే, పెంచి పోషించే చేష్టితాలే.

జానకి రాజశేఖరంల దాంపత్యజీవనం గాడిన పడటంతో కథ సుఖాంతమైనా, ఉమ పాత్ర మనల్ని కలవరపెడుతూనే ఉంటుంది, గుండెను బరువెక్కిస్తూనే ఉంటుంది.

జానకి పుట్టింటికి రావడానికి కారణమేమిటి? అన్న ప్రశ్న పాఠకులను కథ మొదట్నించి చివరిదాకా వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని గొప్ప శైలీనైపుణ్యంతో కథలో హంసబకోపాఖ్యానాన్ని చొప్పించడంద్వారా సూచిస్తారు మాస్టారు. ఈ సందర్భంలో ఉమ, రాజశేఖరంలమధ్య రసవత్తరమైన, అర్థవంతమైన వాదోపవాదాల్ని నడిపించారు. ఒక రోజు కొంత సంభాషణ జరిగాక, మర్నాడు ఉమ ఆ వాదాన్ని కొనసాగించినప్పుడు “అయితే ఈ యుక్తులన్నీ ఆలోచించటానికి ఒక రాత్రీ, ఒక పగలూ పట్టిందా?” అని రాజశేఖరం వ్యంగ్యంగా అడిగితే, “లేదు, లేదు.. నెల్లాళ్ళూ … ఏకాంతంగా మడతకుర్చీలోపడి ఆలోచిస్తేనేగాని స్ఫురించలేదు” అని ఉమ చెప్పిన సమాధానం ద్వారా మగాడికి ఎగతాళిగా కనిపించే విషయాలు స్త్రీలను రోజులతరబడి మనోవేదనకు గురిచేస్తాయన్న కఠోర వాస్తవాన్ని తెలియజేస్తుంది.

ఇటువంటి మార్మిక సంభాషణలు కథంతా పరుచుకుని పాఠకుల ఊహాశక్తికి పదును పెడతాయి. మళ్ళీమళ్ళీ చదివేకొద్దీ కొత్తకొత్త అర్థాలు గోచరిస్తాయి.

తల్లిదండ్రులను, తోడబుట్టినవారిని వదిలి మూడుముళ్ళ బంధంతో అత్తవారింట అడుగుపెట్టిన స్త్రీ ఆ ఇంటివారినుంచి ఎటువంటి ప్రేమాభిమానాలను కోరుకుంటుందో, కోడలితో అత్తింటివారికి ఏవిధమైన అనుబంధం ఉండాలో తెలియజేసే గొప్ప కథ రాగమయి.

కారామాస్టారు ఈ కథ రాసే కాలానికి స్త్రీవాదం అన్న పేరు పుట్టి ఉండకపోవచ్చును గానీ, గృహచ్ఛిద్రాలలో స్త్రీలపై జరిగే మానసిక దాడిని విపులంగా చర్చించిన స్త్రీవాద కథే ఇది. కథ రాసిన కాలంనుండి ‘నేనెందుకు రాసేను?’ రాసేదాకా కూడా తెలుగు సాహిత్యంలో స్త్రేవాద భావజాలం ప్రవేశించకపోవడంవల్ల కారామాస్టారు ఈ కథని ఏ ప్రయోజనం సాధించలేని కథగా పేర్కొని ఉండవచ్చు. అంతమాత్రాన ఎప్పటికీ ఇది ప్రయోజన రహితమైన కథగానే నిలిచిపోతుందనలేం. నాటినుంచి నేటిదాకా కుటుంబ వాతావరణంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు అట్లాగే ఉన్నాయి. పరిష్కారమార్గాలు చర్చనీయాంశాలే అవుతున్నాయి. అందువల్లే ‘ఈనాటి అవసరం రాగమయి.’

-పాలపర్తి జ్యోతిష్మతి

Palaparthi Jyothishmathiపాలపర్తి జ్యోతిష్మతి 17 సంవత్సరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి 2001లో వి.ఆర్.ఎస్. తీసుకొన్నారు. కధలంటే ఇష్టంతో చిన్నప్పటినుండి వార, మాస పత్రికల్లో వచ్చే కధలు చదవటం అలవాటు చేసుకొన్నారు. ఇప్పటి వరకు 2006లో ‘కాకి గోల’ కవితా సంకలనం, 2014లో ‘సుబ్బలక్ష్మి కధలు’ కధా సంకలనం వచ్చాయి. ఈ రెండు పుస్తకాలు kingie.com లో దొరుకుతాయి. తన మనోభావాలను పదిమందితో పంచుకోవడానికి రచనా వ్యాసాంగాన్ని మాధ్యమంగా భావిస్తున్నానని అంటున్నారు. జ్యోతిష్మతికి బీనాదేవి అభిమాన రచయిత్రి.

వచ్చేవారం ‘ఇల్లు’ కధ గురించి నల్లూరి రుక్ష్మిణి పరిచయం

“రాగమయి” కథ ఇక్కడ:

హింసకీ అపకారానికీ మధ్య నడిచే కథ- వధ

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

“మంచి కథ” అంటే ఏమిటనే విషయం మీద పుంఖాను పుంఖాల చర్చలు విన్నాం, చదివాం. కానీ ఏదో ఒక నిర్ధారణకి రావడం కష్టమే. వ్యక్తిగతంగా నాకు చాలా చర్చలు అర్థం కూడా కావు. దేన్ని మంచి కథ అని అనడానికి వీలవుతుందో అన్న విషయం మీద ఏకాభిప్రాయానికి రావడం కూడా కష్టమే. అయితే ఒకటి మాత్రం అందరమూ ఒప్పుకోక తప్పదు.

కథ చదివి పక్కన పెట్టిన తరవాత కూడా పాఠకుడు దాన్ని గురించి ఆలోచించగలిగితే, ఆ కథలో చర్చకు పెట్టిన విషయాలని నిజ జీవితంలో జరిగే అనేకానేక సంఘటనలకీ, చుట్టూ నడుస్తున్న చరిత్రకీ అన్వయించుకోగలిగితే, అది నిస్సందేహంగా గొప్ప కథ. చెప్పిన విషయం abstract గా వుంటూనే, మన బ్రతుకుల్లోని నిజాలని టార్చి లైటు వేసి మన ముందు నిలబెట్టగలిగితే, ఆ అనుభూతి ఎన్నటికీ మనలని వదిలి పోదు. ఎన్ని సార్లు ఆ కథ చదివినా మనం లోతుగా, లోలోతుగా ఆలోచనలని ఆస్వాదిస్తూనే వుంటాము. మరందుకే కదా సాహిత్యం ఆలోచనామృతమయింది.

1956-67 మధ్య కారా మాస్టారు అయిదు కథలు రాసారు. (తీర్పు, ఇల్లు, వధ, యఙ్ఞం, మహదాశీర్వచనం) సంఖ్యాపరంగా చూస్తే పదకొండేళ్ళల్లో అయిదేనా అనిపించినా, కథలన్నీ వేటికవే ప్రపంచ సాహిత్యంలోని ఆణి ముత్యాల్లో నిలబడ్డ కథలు. ఆ అయిదిటిలో యఙ్ఞం కథ (1964) అన్నిటికంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆ తరవాత సంవత్సరం ఆయన “వధ” రాసారు. అయిదింటిల్లోనూ మనుషుల మధ్య వుండే సంబంధాల్లో లీలగా గోచరమయ్యే ‘ హింస ‘ ఏక సూత్రంగా కనబడుతుంది. మన జీవితాల్లో ఇంత హింస నిండి వుందన్న సంగతి మనకి తెలిసీ వుండకపోవచ్చు, తెలిసినా ఒక రకమైన నిర్లిప్తతతో దాన్ని భరిస్తూ వుండి వుండవచ్చు. ఈ హింసనే బట్టలిప్పి మనముందు నగ్నంగా నిలబెట్టి దాని గురించి ఆలోచించమని మనని సవాలు చేస్తాయి ఈ కథలు.

‘హింస ‘ శారీరకమైనదైనా, మానసికమైనదైనా, ఒకటే! మనిషిని బ్రతుకు కష్టపెట్టినప్పుడు సంఘర్షణ అవుతుంది, పక్క మనిషే కష్టపెట్టినప్పుడు అది హింస అవుతుంది. హింస గురించీ, హింసకి మన ప్రతిచర్యల గురించీ ఆలోచించక తప్పని దశలో వున్నాం మనం!

అసలు పన్నెండు పేజీల “వధ” లోని కథ మనకి తెలియనిదేమీ కాదు. కథంతా ఒక్కటే సంఘటన! తండ్రి ఆనతి తలదాల్చు తనయుడూ, ధర్మ స్వరూపుడూ అయిన రాముడు ఋష్యమూక పర్వతం వద్ద వాలి సుగ్రీవుల యుధ్ధం చూస్తూ ఆలోచిస్తున్నాడు. చెట్టు చాటునుంచి వాలిని చంపడాన్ని ఆయన అంతరాత్మ ఎంత మాత్రమూ సమర్ధించలేకపోతూ వున్నది. అప్పుడాయన ‘ తాను ఏం చేయడమా ‘ అన్న ధర్మ సంకటాన్ని పక్కన పెట్టి ‘వాలి ఏం చేస్తున్నాడూ ‘ అన్న విషయం గురించి ఆలోచించి, వాలి వధకు పూనుకున్నాడు.

రామాయణం లోని కథలకి ఎన్నో వ్యాఖ్యానాలూ, ఉపాఖ్యానాలూ వున్నాయి. స్థూలంగా వింటే ఇదేదో ‘రాముణ్ణి సమర్ధించే కథ కాబోలు ‘ అని అనిపించొచ్చు.

కానీ, లోతుగా చూస్తే, సున్నిత మనస్కుడైన మనిషికీ తప్పొప్పుల విచక్షణ చేయగలిగే మనిషికీ, అందులోనూ బలవంతుడైన వీరుడికీ, అడుగడుగునా ఎదురయ్యే ధర్మ సంకటాలు కనిపిస్తాయి. ఆలోచించనా శక్తీ, భుజబలమూ వున్న మనిషి చేయక తప్పని బాలన్స్ వాక్ అది.

పైకి చూస్తే వాలి సుగ్గ్రీవులది అన్న దమ్ముల కొట్లాట. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదు. కానీ, నిజంగా అంతేనా? తెలిసో తెలియకో తమ్ముడు సుగ్రీవుడు అన్న పట్ల అపచారం చేసాడు. అప్పుడు వాలి ముందు మూడు దారులున్నాయి. తమ్ముణ్ణి మన్నించి అక్కున జేర్చుకోవడం. లేదా తమ్ముణ్ణి ఆ చుట్టు పక్కల లేకుండా వెళ్ళ గొట్టడం, లేదా అతన్ని హత మార్చడం. కానీ, వాలీ ఈ మూడు దారుల్లో వేటినీ ఎన్నుకోలేదు. తమ్ముడి భార్య రుమను చెరపట్టి, సుగ్రీవుడు ఆ చుట్టు పక్కల నుండి పారిపోకుండా చేసాడు. భార్య పరాయి చెరలో వుందన్న రోషంతో సుగ్రీవుడు తనతో తలపడకా మానడు, ఒళ్ళు హూనం చేసుకోకా మానడు. ఈ మానసిక శారీరక హింసలో సుగ్రీవుడు అలిసిపోతూంటే ఆనందిస్తున్నాడు వాలి.

జంతువు ఆకలేసినప్పుడో భయపడ్డప్పుడో తోటి జంతువుని చంపుతుంది. అది అపకారం. ఆలోచనాశక్తి వున్న మానవుడు మాత్రమే తోటి ప్రాణిని చావుకీ బ్రతుక్కీ మధ్య వేలాడదీసి ఆనందించగలడు. అది హింస. బలహీనుణ్ణి బలవంతుడు హింసిస్తూంటే మిగతావారికి ఆ బలహీనుడి పక్షం వహించక తప్పదు. అప్పుడు ధర్మాధర్మ విచక్షణ కూడా పక్కన పెట్టకా తప్పదు. అలా ధర్మా ధర్మ విచకషణ పక్కన పెట్టి దుష్టుణ్ణి శిక్షించకపోవడమే ధర్మాత్రిక్రమణమవుతుందని రాముడు మరణించబోయే వాలితో అంటాడు.

సాంఘిక పరిణామంలో మనం మనిషి మనిషికి అపకారం చేయకుండా కట్టుదిట్టాలు చేసుకున్నాం, కానీ హింసించకుండా పెద్ద ఏర్పాట్లు చేసుకున్నట్టు అనిపించదు. ఇది ఆలోచించాల్సిన విషయం.

వస్తువు తో పాటు సమానమైన గాంభీర్యాన్నీ, గాఢతనీ కథనం సంతరించుకుందీ కథలో. సాధారణంగా కథల్లో వర్ణనలకెక్కువ చోటూ వుండదు. కథలో వర్ణనలు చేయదల్చుకుంటే దానికి తగినంత కారణం వుండాలి. ఈ కథలో మొదటి రెండు పేజీలూ అరణ్యాన్ని వర్ణించడానికే కేటాయించారు మాస్టారు. అయితే, ఆ వర్ణన ప్రపంచంలో వున్న జంతు న్యాయానికి ప్రతీకగా నిలిచి  పైన పచ్చగా అందంగా వున్నా, లోపల భయంకరమైన హింసాకాండ జరుగుతుందన్న విషయాన్ని సూచిస్తుంది.

అరణ్యంలో మూలనో ఒక్క మూలన ఎప్పుడూ కార్చిచ్చు రగులుతూనే వుంటుంది. అయినా తక్కిన అరణ్యమంతా తనకు పట్టనట్టు పచ్చగా కళకళ లాడుతూ చూపరులకు సృష్టి కర్త వైచిత్రి చాటుతూ వుంటుంది. అదే దానిలోని సొబగు…”

అన్న వాక్యాలు కాలానికతీతంగా మానవ సంఘానికి దర్పణం పడుతున్నాయంటే కాదనగలమా? వాలి సుగ్రీవుల వైషమ్యమూ, యుధ్ధరీతీ, రాముని మీమాంసా, నిర్ణయమూ ప్రతిదీ అలా అలా స్పృషిస్తున్నట్టే వున్నాయి, కానీ చాలా స్పష్టంగా వున్నాయి. అది కథనం లో ఆయనకున్న నైపుణ్యమూ, ఆయన గొప్ప హృదయ సౌందర్యమూ తప్ప ఇంకేమీ కాదు.

తన అంతరాత్మ చేస్తున్న మందలింపులనీ, చికాకునీ పక్కన పెట్టిన రాముడు చూసింది, వాలిలో మూర్తీభవించిన క్రౌర్యం, దౌష్ట్యం, మదాంధత గర్వం“, విన్నది “సుగ్రీవుని కంఠంలో అణచి వేయబడుతున్న ఆర్తనాదం“. అంతరాత్మనీ  ధర్మ పన్నాలనీ పక్కన పెట్టి బాణం వేసి వాలిని నేల కూల్చమని రాముడికి మనమే సలహా ఇవ్వమా?

లోకంలో దుష్టులందరూ యిలానే తాము చేయబోయే దౌష్ట్యానికి నేపథ్యం సృష్టిస్తారా,” అని కలవరపడ్డ రాముడినీ, తన తమ్ముడు లక్ష్మణుని ఆపాద మస్తకమూ చూసి, తన తమ్ములెప్పుడూ సుగ్రీవులు కారు. తానెన్నటికీ వాలి కానేరడు ‘ అని తలపోసిన ధర్మమూర్తి రాముడినీ నిలబెట్టి, నేటి సమాజానికి ఎటువంటి ఆదర్శమూర్తుల ఆవశ్యకత వుందో తెలియజేసిన కథ- ‘వధ ‘.

 -శారద

శారద

శారద

 

శారద ఆస్ట్రేలియాలో ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నారు. అడిలైడ్ నగరంలో నివాసం. శారదగారు రాసిన యాభై కధలతో ‘నీలాంబరి’ కధ సంపుటికి గత సంవత్సరం ఆవిష్కారం జరిగింది. శారదకు కుటుంబరావు, తిలక్ ఆంగ్లంలో చెహోవ్, సోమర్ సెట్ మాం ఇష్టం. ఇంకా ఈ మధ్య రాస్తున్న వారిలో చాలా మంది బాగా రాస్తున్నారని అన్నారు. కథా రచనలో మెలకువలని నేర్చుకోవడానికీ, ఆలోచనలని స్పష్టం చేసుకోవడానికీ, జీవితాన్నీ, సాహిత్యాన్నీ మధించడం తప్ప వేరే మార్గం లేదని శారద  అభిప్రాయం. శారద బ్లాగ్ www.sbmurali2007.wordpress.com.

వచ్చే వారం: పాలపర్తి జ్యోతిష్మతి ‘రాగమయి’ కధ గురించిన పరిచయం 

‘వధ’ కథ ఇక్కడ:

హింస – ప్రతిహింసలను సరి తూకం వేసి చూపిన కధ

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

‘హింస’ మొదటిసారి మనిషికి అనుభవమయ్యే స్థలాలు, కాలాలు అందరికి ఒక్క లాగే ఉండవు. కొంత మంది అదృష్టవంతులు జీవితమంతా హింసను ‘చూడకుండానే’ గడిపి వేయగలుగుతారు. చాలా మంది మధ్యతరగతి వారికి హింస మొదట కుటుంబంలోనే పరిచయం అవుతుంది. అలాటి వారికి సమాజంలో ఉండే హింసను గ్రహించటానికి కొంత వయసు, జ్ఞానం కావాల్సి వుంటుంది. కానీ ‘సంగి’ లాంటి సమాజానికి వల్నరబుల్ గా ఉండే చిన్న పిల్లలు హింసాయుత ప్రపంచంలో నిత్యం రాపిడికి గురౌతూ ఉంటారు. ఆ హింస ఎక్కడ నుండి ఉద్భవిస్తుందో, దానికి మూలకాలు ఏమిటో గ్రహింపు లేకపోయినా … వెంపర్లు ఘాటుగా, చేదుగా, దుఃఖంగా అనుభవమవుతూ ప్రతిచర్యకు వారిని పురికొల్పుతూ ఉంటాయి. శత్రువు ఎవరో తెలియని అయోమయ స్థితిలో కూడా హింసానుభవానికి సంబంధించిన పగ, ప్రతి హింసకు వారిని ప్రేరేపిస్తుంది. చూసే వాళ్ళకు ఆ హింస అసంబద్ధంగా అనిపించుకాక! అధికారానికి అది తలనొప్పిగా, సంఘ వ్యతిరేక శక్తిగా, ‘దువ్వేసి’ తొలగించాల్సిన ఉగ్రభావంగా అగుపించుకాక! సామాజిక నియమాలుగా చెప్పబడుతున్నవి ఎంత నిర్దేశించినా..  తలవొగ్గి ఉండమని శాస్త్రాలు ఎంత బుజ్జగించినా .. చట్టం, పోలీసు లాంటి రాజ్య నిర్మాణాలు ఎంత శాసించినా మానవ ఉద్వేగాలు సహజంగా బయలు దారిలోనే ప్రవహిస్తాయి.

విద్యార్ధులు ప్రభుత్వ హాస్టల్లో అధ్వాన్న వసతులకు వ్యతిరేకంగా రోడ్డు మీద పడుతుంటారు. కాశ్మీర్ లో మిలటరీ మీద ఆగ్రహంతో ప్రజలు రాళ్ళు రువ్వుతుంటారు. మణిపూర్ లో పారా మిలటరీ దళాలు చేసిన అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళలు నగ్న ప్రదర్శన చేస్తారు. మర్యాదస్తులకు అహేతుకంగా కనిపించే ఈ చర్యల వెనక అదృశ్యంగా వ్యవస్థ మీద కనబడని ఆగ్రహావేశాలు బుసలు కొడుతుంటాయి. దాదాపు నలభై ఏళ్ళ క్రితం పుట్టిన చిన్న ‘సంగి’కి ముందు ముందు ఇలా జరగబోతుందని తెలియదు. అయినా అదేమిటో సంగి కూడా అంతే ప్రవర్తించింది .. అచ్చు శ్రీకాకుళం పోరాటంలో గోసి పెట్టుకొన్న గిరిజనులు భూస్వాముల మీద తిరగబడ్డట్టు. కానీ ఇక్కడ సంగికి శత్రు స్పృహ తెలుస్తుంటుంది కాని శత్రువు ఎవరో తెలియదు.

‘హింస’ కధలో కాళీపట్నం రామారావు గారు ఒక పసిదాని సామాజిక, ఆర్ధిక జీవితం చుట్టూ అల్లుకొన్న హింసను కళ్ళకు కట్టించి దాని ప్రతి చర్యను శక్తివంతంగా సమర్ధించారు. 1968 ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ఈ కధను ప్రచురించారు. సాహిత్య ప్రయోజనాల్లో సమాజంలోని సంక్లిష్టతను అర్ధం చేయించటం ఒకటి అయితే ఆ పనిని కా.రా గారు గొప్పగా చేయగలిగారు ఈ కధలో. బారెడంత గోచి గుడ్డతో కధంతా తిరిగే సంగి ఈ కధా నాయకురాలు. కధ ప్రారంభం, ముగింపు రెండూ ఈ కధకు ప్రత్యేకంగా ఉంటాయి. తన చుట్టూ జీవిస్తున్న సమూహంలో వివిధ వ్యక్తుల నుండి ఒక్క రోజులో సంగి అనుభవాలు ఆ గొల్లపిల్లను ఉలికిపాటుకి, అంతర్మధనానికీ గురిచేసి కసికి ప్రేరేపిస్తాయి.

రామారావు గారి కధల్లో చిన్న ఆడపిల్లల ప్రస్తావన ప్రత్యేకంగా ఉంటుంది. చావు కధలో సిమ్మాద్రి, దాలి .. మహదాశీర్వచనంలో కామేశ్వరి.. హింస కధలో సంగి, నీలి – ఇలాంటి పిల్లలు తమ నేలబారు జీవితాలని ఎదురీదటానికి తల్లో తండ్రో లేక ఇద్దరో పడుతున్న కష్టాలలో మమేకం అవుతుంటారు. ఒక్క పూట కూలికి వెళ్ళకపోతే కలిగే పర్యవసానాలు అర్ధం చేసుకోగలిగిన పరిణితి వారి పేదరికం వాళ్ళకు నేర్పుతుంది. ఈ పిల్లలు ఎక్కడా బడి మొహం చూసిన దాఖాలాలు ఉండవు. ఈ కధలో సంగి, నీలి తమ లేత రెక్కలను పెట్టుబడిగా పెట్టి నిరంతర ఆకలి పోరాటంలో తలమునకలవుతుంటారు. కధ మొదలులోనే సంగి రూపం వర్ణిస్తూ “… ఆ వెల్తుర్లో సంగి మెడలో పగడాలూ, పూసలూ మకిలి మకిలిగా మెరుస్తున్నాయి. దాన్ని వేలాడే కొత్త పిన్నీసులు జిగజిగ లాడుతున్నాయి … కొట్టు దాటగానే వెనకానున్న నీడ సర్రన ముందుకొచ్చింది. బారెడు గోచిగుడ్డ మొలకు చుట్టుకొన్న బ్రహ్మరాక్షసిలాటి నీడన్చూసి, ‘శా, పయ్యాట గుడ్డ మర్సిపోనాను!’ అనుకుంది సంగి.” ఇక సంగి స్నేహితురాలు నీలి పరిచయంలోనే “ఒక చేతిలో – జానెడు నూనె సీసా, చిన్నబెల్లమ్ముక్కా; రెండో చేతిలో పట్టేడు చింతపండు వుండా …” తో కనిపిస్తుంది. అప్ప వచ్చిన రోజు తను ఎందుకు సంగిని కలవలేక పోయింది సంజాయిషీ ఇస్తూ నీలి “అడివవతల బుడువూరు సోవయ్య శేరికి తానూ తల్లి పప్పేత కెళ్ళేరు. రాను పోనూ ఆరు మైళ్ళు. ఏకువనగా నెగిసి పాసిపనంతా సేసుకుని యింటికిపడ్డ నీళ్ళన్ని మోసి ఆడుతూ బడుతూ యెల్తే యియ్యేళకు తేలేరు.” ఇంక సంగి పరిస్థితి – “తెల్లారేక యిలా నీళ్ళైనా పుక్కిలించలేదు. సిన్నాయిన కూతురు పారొచ్చింది. కాపోళ్ళ గుడ్డల మీద గడ్డలు పగలేయ్యాలిట! వొస్తదేమో కనుక్కోమంది సిన్నమ్మ. ‘యేల్రాదూ? మారాజులా గొస్తాది. తీసుకెల్లం’ది తల్లి. అంబళ్ళేలకు పనిపోదా అనుకుంది సంగి. కానీ గుడ్డెలమీదే పొద్దు పోయింది, తిరిగివొచ్చింది లగాయతు, దినవెచ్చాలు, తల్లికి వంట సాయం, ఇప్పుడు టీ.” కధ గడిచిన నలభై ఆరేళ్ళకు కూడా తలకు గుడ్డలు గట్టుకొని చేతిలో కొడవలో, దోకురుబారో పట్టుకొని తల్లి వెంట పనులకు పోతున్న సంగులు, నీలులు ఎంతమందో!

ఆకతాయి దాసు పట్నం నుండి వస్తూ ఆయన చూసిన దృశ్యాన్ని సుబ్బయ్య హోటల్లో జనానికి వివరిస్తుంటే, టీ కోసం చెంబు పట్టుకొని ‘సంగి’ ఆ పాక హోటల్ ప్రవేశంతో కధ మొదలువుతుంది. ఒక దానితో ఒకటి సంబంధం లేని సంగతులుగా అనిపించే ఈ రెండు విషయాలనీ రచయిత నేర్పుగా కలుపుతాడు. దాసు చెబుతున్నసంఘటనలోని స్త్రీ పైడమ్మ సంగి అప్పే (అక్క) అవటమే ఆ లంకె. ఆ పాకలో బైఠాయించిన ఆ సమాజం తన అక్కను ఎద్దేవా చేస్తున్నదన్న విషయం గ్రహించటానికి సంగికి కొంత సమయం పడుతుంది. చిన్న వయసులోనే కూలికి వెళ్ళి తల్లికి సాయం చేయటం తప్ప లోకం ఎరగని సంగిని ఆ హేళన ఆ రోజు ఆమె ఎదుర్కొన్న మొదటి హింస.

ఆ దృశ్యం కొనసాగింపులోనే, అప్ప ఇంటికి వచ్చిందని తెలిసీ ఇంటికి రావటానికి సందేహించిన స్నేహితురాలు నీలి వైఖరి కలిగించిన నిరాశ యింకో హింస. చాలా ఏళ్ళ తరువాత ఇంటికి వచ్చిన అప్పతో ఒక్క గడియ మాట్లాడటానికి కాలం చాలని బతుకులో ఉన్న సంగికి, అప్ప అందరి చర్చలకు కేంద్ర బిందువు ఎలా అయ్యిందో అర్ధం కాని అయోమయం ఆమె ఎదుర్కొన్న కొత్త రకం హింస. చుట్టాలు అందరూ కలిసి అప్ప బతుకుకి తీర్పు ఇవ్వటం, అది అంగీకరించాల్సిన నిస్సహాయ పరిస్థితిలో తల్లి దుఃఖం ఆమెకు అర్ధం కాని హింస. అప్పకు ఏమయ్యింది? అప్ప స్నానం చేస్తుంటే చూసి, ఏమి మార్పు వచ్చిందని అందరూ అప్పను నిప్పును చూసినట్లు చూస్తున్నారో అనుకొంటుంది. తల్లి దుఃఖం వెంటాడుతుండగా అప్పటి వరకు ఒంటరిగా వెళ్ళటానికి భయపడే ‘శలక’కు నిర్భయంగా, నిర్వికారంగా బయలుదేరుతుంది. గతంలో అక్కడ ఆమెను భయపెట్టిన ‘గుండెలు పగలవేసే నిశ్శబ్దం’ ఇప్పుడు ఆమెను ప్రశాంతంగా ఉంచుతుంది.

ఇక్కడ వరకు చదివిన పాఠకుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకోక తప్పదు. సంగిలాంటి పసిపిల్ల కఠిన దరిద్రంతో బతుకు పోరాటం కోసం చిన్నతనం నుండే కూలికి వెళ్ళటం ఈ దేశంలో వింత కాదు. కాని అంత పిందె వయసులో భయాన్ని జయించ గలగటం సంతోషానికి బదులు విషాదాన్ని కలగ చేస్తుంది. ఆ భయరహిత స్థితికి నేపధ్యం చాలా కఠినమైనది. గుండె లేనిది. ఆ నేపధ్యం ఆమెను తను బతుకుతున్న సమూహపు హృదయరాహిత్యాన్ని అనుభవింప చేసింది. ఒక జెండర్ వ్యభిచారం చేయటం అంగీకారంగాను, ఇంకొక జెండర్ చేయటం ఘోరమైన తప్పిదంగాను నిర్దేశించిన సమాజపు ద్వంద్వ విలువలను గ్రహింప చేసింది. గతి లేని పరిస్థితుల్లో అలాంటి ఘోరమైన తప్పు చేసిన ఆడపిల్లకు కుటుంబం నుండి కూడా తిరస్కారం తప్పని సరైన చేదు నీతిని అవగతం చేసింది. ఒక్కరోజులో వచ్చి పడిన ఈ ఎరుక, ఆమెను మౌనిగా మార్చేసిన ఆ కాఠిన్య సందర్భం కొస కంట తడిని రగిలిస్తుంది. అయితే సంగిలోని ఈ మౌనం ఆమె అంతర్గత దహనానికి వ్యక్తీకరణ. ఆ దహనం కసిగా మారి, తన కుటుంబాన్ని క్షోభింపచేసిన కనబడని శత్రువును ఎగిరి తన్నాలన్న క్రోధంగా వ్యక్తమౌతుంది.

రామారావుగారి కధల్లో ఎక్కువ కధల ముగింపులు పరిష్కారాన్ని ప్రత్యక్షంగా సూచించవు. కానీ ప్రతీకాత్మకంగా ముగింపు ఇచ్చిన కధ ‘హింస’. మేకపిల్లను చంపిన నక్కలను చేతి రాళ్ళతో వెంటాడి “యియ్యేళ మిమ్మల్ని, ఒకళ్ళనో ఇద్దర్నో సంపిందాకా నానింటికిపోను” అని ఆవేశించిన సంగి ఆక్రోశం అర్ధం కావాలంటే ఆమె బతుకుతున్న ‘చుట్టూ యిలారం’ పాకలోకి వెళ్ళాలి. కూలాడక గంజి తాగి ఆర్చుకు పోయిన ఆమె పేగులు గమనించుకోవాలి. అంత పేదరికంలో కూడా “అప్ప రక్తం నాళ నాళానా వేడిమి నింపుతూ ఆమెను పొదువుకొన్న” ప్రేమ బంధం గుర్తించగలగాలి. వ్యభిచారంలో దిగబడిపోయిన అప్పను ఇక పైకి లాగలేమని తీర్పునిచ్చిన బంధుగణం అసహాయతను అసహ్యించుకోవటమో, అర్ధం చేసుకోవటమో చేయాలి. కూతుర్ని ఇక కాపాడుకోలేనని గ్రహించి గొంతు వెలుగు రాసేదాకా ఏడ్చిన తల్లి శోకాన్నం సంగిలో కలిగించిన మొయ్యలేని బాధతో సహానుభూతి చెందాలి. ఇవన్నీ చేయగలిగారు కాబట్టే కారాగారు ఈ కధను ఇంత సహజాతి సహజంగా, అద్భుతంగా రాయగలిగారు.

 -బత్తుల రమాసుందరి

089బత్తుల రమాసుందరి ప్రకాశం జిల్లాలో ఈతముక్కల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో సీనియర్ లెక్చెరర్ గా పని చేస్తున్నారు. ఈమె రాసిన కొన్ని కధలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. ఇప్పటి వరకూ చదివిన తెలుగు సాహిత్యంలో రంగనాయకమ్మ, కారా, రావి శాస్త్రి, పతంజలి, పి. సత్యవతి, అల్లం రాజయ్య, రఘోత్తమరెడ్డి, ఆర్. వసుంధరాదేవి, బజరా, నామినీ, మధురాంతకం నరేంద్ర, స.వెం. రమేశు, బండి నారాయణస్వామి, వి. చంద్రశేఖరరావు, గోపిని కరుణాకర్, దాసరి అమరేంద్ర, … ఇంకా చాలామంది స్త్రీ, దళిత, మైనారిటీ, ప్రాంతీయ, భాషా అస్తిత్వవాద రచయితల అనేక రచనలు ఇష్టం. రమాసుందరి రచనలు ‘మోదుగపూలు’ (kadhalu.wordpress.com) లో చదవవచ్చు.

 

 “హింస” కథ:

బతుకంత సమస్యకి ప్రతిబింబం – ‘చావు’ కథ

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

చస్తే సమస్యలన్నీ తీరిపోతాయనుకొంటారు కొంతమంది. కానీ ‘చావు’ కూడా చచ్చే చావు కొందరికి. చచ్చిపోయాక కనీస అంతిమ సంస్కారానికి కూడా నోచుకోని శుష్క శరీరాల సమస్య మరింత జటిలమైనది. బతికినన్ని రోజులు సరైన తిండిగానీ, బట్ట కానీ, సరైన జీవితం కానీ, సుఖం కానీ, ప్రశాంతత కానీ కనీస గౌరవం కానీ లేని జీవితాలను చావు తరువాత కూడా ఇవే సమస్యలు వెంటాడం ఎంత దుర్భరం ?

దళితులకు బతుకే కాదు, చావు కూడా అత్యంత సమస్య అని చెప్పిన కధ ‘చావు’. కాళీపట్నం రామారావు గారు రాసిన ఈ కధ సృజన మాస పత్రికలో 1971 మార్చి సంచికలో అచ్చు అయ్యింది.

రెండు మూడేళ్ళనుంచి వర్షాలు సరిగా లేని కారణంగా పంటలు, పనులు లేక మాలపేట వాళ్ళంతా ఇంటికి ఇద్దరు ముగ్గురు పసిపిల్లలను, ముసలి వాళ్ళను వదిలేసి కోతలు, కుప్పలు, నూర్పిడి వంటి పనుల కోసం పక్క ఊళ్ళకు వెళ్ళారు. ఎరకయ్య, సావాలు కూడా అలా వెళ్ళినవాళ్ళలో ఉన్నారు. ఎరకయ్య తన ముసలి తల్లిని , ఇద్దరు చిన్నఆడ పిల్లలు సిమ్మాద్రి, దాలిని చిన్న కొడుకును ఇంటి దగ్గర వదిలేసి, ఇద్దరు కూతుళ్ళు కొడుకుని తీసుకొని పక్క ఊరికి పొలం పనికి వెళ్ళగా ఇంటి దగ్గర ముసలమ్మ నారమ్మ చనిపోతుంది. పిల్లలు ఎట్లాగో ఎరకయ్యకు కబురు చేరవేస్తారు. ఎరకయ్య, సావాలు మిగతావాళ్ళు ఆ రాత్రి నానా తిప్పలు పడి వస్తారు. ఎముకలు కొరికే చలి రాత్రిలో చనిపోయిన నారమ్మ వడిలి, శుష్కించి పోయిన ముసలమ్మ.

“.. ముక్కూ నోట బొక్కలన్నీ నీళ్ళు కారేసి, ఇనాగ – ముట్టుకుంటె పొట్ల పండు నాగ ఇచ్చిపోతాది శవం.” ఎక్కువ సేపు నిలబడే శవం కాదు. పైగా రాత్రికి కాల్చక పోతే పొద్దున్నే పనికి వెళ్ళలేరు. పేట అందరికీ పనిపోతుంది. కాబట్టి రాత్రికి శవాన్ని ఎలాగైనా తీసెయ్యాలి. తీసేయ్యాలంటే కావిడో – రెండు కావిళ్ళో కర్రలు కావాలి. ఎండాకాలమైతే ఏ వైపు వెళ్ళినా కర్రో, కంపో దొరుకుతుంది. కానీ పొయ్యి మీదకు దొరికే చలి రోజుల్లో పొయ్యి కిందకు దొరకటం కష్టమైన కాలం .. పంటల కాలం. ఇలాంటి స్థితిలో కాల్చటానికి వూళ్ళోవాళ్లను కర్రలు అడిగి తేవాలని కొందరు బయలుదేరతారు. అక్కడే ఉన్న సూరయ్య చనిపోయిన నారమ్మ గురించిన చిన్నప్పటి జ్ఞాపకాలను అందరికి చెబుతాడు.

కర్రల కోసం వెళ్ళిన వాళ్ళు కర్రలు లేకుండానే వెనక్కి వస్తారు. రాత్రిపూట కర్రలు అడిగిన వాళ్ళను కొందరు పొద్దున రమ్మని పంపిస్తారు. కొందరు తిట్టి పంపిస్తారు. ఏం తేకుండా తిరిగి వచ్చిన వాళ్ళను అప్పారావు తన ఆవేశంతో, ప్రశ్నలతో నిలదీస్తాడు. కాల్చటమా, పూడ్చటమా కాదు- అసలు ఏడ్వాల్సింది చచ్చిన శవాలకోసం కాదు – బతికున్నశవాల కోసం అంటాడు. చివరకు పూడ్చాలని నిర్ణయం తీసుకుంటారు కులపెద్దలు. కానీ యువకులు ఆలోచనలో పడతారు. చివరి నిమిషంలో కొందరు యువకులు ఊళ్ళో నుండి కర్రలు దొంగతనంగా ఎత్తుకొస్తారు. శవాన్ని కాలుస్తారు. ఇదీ కధ.

దళితుల జీవితంలోని ఘర్షణనూ దళిత సమాజాన్నీ నిరంతరం నియంత్రించే వ్యవస్థీకృత కుల అణచివేతనూ ఈ కథ ప్రతిబింబించింది.

స్వాతంత్ర్యం దళితుల జీవితంలో పెద్ద మార్పేమీ తేలేక పోయిందనేది సత్యం. గ్రామీణ రాజ్యం ఇంకా కుల పెత్తందారుల చేతిలోనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చింది దేశానికే కానీ, గ్రామాలకు కాదు. గ్రామాల్లో దళితులుగా పుడితే కష్టం! జీవితాంతం బానిసత్వం అనుభవించాల్సిందే! దళితులుగా మరణిస్తే కూడా కష్టమే! శవాన్ని తగలబెట్టటానికి – పూడ్చటానికి కూడా – సమస్యే. ఈ కథలో కాళీపట్నం రామారావుగారు శతాభ్థాల అణచివేతను ‘చావు’ కేంద్రంగా ప్రతిబింబించే ప్రయత్నం చేశారు. ఈ చావు కధ దళిత వాడల్లో పేరుకొని పోయి ఉన్న “దళిత అబలత్వా”న్ని ప్రశ్నిస్తుంది. దళిత వాడలోని ప్రజలు నిరంతరం ఎదుర్కొనే సమస్యల్లో మచ్చుకు ఒక సమస్య నారమ్మ మరణం.

పని కోసం, డబ్బుకోసం, ప్రతి అవసరం కోసం దళితవాడ జనం గ్రామం మీదే ఆధార పడాలి. ఆఖరికి మనిషి చచ్చిపోతే తగలపెట్టాటానికి కావలిసిన కట్టెల కోసం కూడా! కొంచెం అసంబద్ధంగా అనిపించినా ఇలాంటి స్థితిని దళితులు ఎదుర్కోవడం – ఈ దేశ దుస్థితికి నిదర్శనం.

ఎక్కడా కర్రలు దొరికే కాలం కాదు కాబట్టి ఊళ్ళో ఎవరినో ఒకరిని అడిగి తేవాలని అనుకొంటారు. ఊరంతా తిరిగి అడిగారు. పెదనాయుడి ఇంట్లో ఆయన భార్య కానీ, సుబ్బారాయుడు కానీ అతని భార్య కానీ ఎవరూ కర్రలు ఇవ్వటానికి ఇష్టపడలేదు. అట్లాగని ఊరివాళ్ళ ఇళ్ళ ముందు “నిల్వ” ఉంచుకొన్న కర్రలు వాళ్ళు కష్టపడి కొట్టి తెచ్చుకొన్నవి కావు. అవన్నీ దళిత శ్రమే. కాని వాళ్ళకు వాటి మీద హక్కు లేదు. పెద్ద కులాల వాళ్ళు చిన్న కర్ర ముక్క ఇవ్వటానికి కూడా సిద్ధంగా లేరు.

కులం దళితులకు అంటరానితనంతో బాటు లేనితనాన్ని, భావ బానిసతనాన్ని అంటగట్టింది. చిన్న అవసరం నుంచి పెద్ద అవసరం దాకా ఎవరో ఒకరి ముందు చేయి చాపాల్సిందే. ఇదీ యువతరానికి నచ్చలేదు. దళిత వాడల్లో పాత తరానికీ, కొత్త తరానికీ మధ్య నిరంతరం ఒక ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. యువతరం – అణచివేతనూ, బానిస బ్రతుకునూ ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. యువతరానికి వచ్చే సందేహాలనూ, ఆవేశాన్నీ, వాళ్లలోని తిరుగుబాటునూ – వయసు మళ్లిన తరం “అనుభవం” పేరు చెప్పి అణచివేస్తుంది. అప్పారావు యువతరానికి ప్రతినిధి. నిరంతర లేమి నుండి బయట పడాలనీ ఇతరుల మీద ఆధారపడే బానిసత్వం నుండి బయట పడి సొంత కాళ్ళ మీద నిలబడాలనీ ఆత్మ గౌరవంతో బతకాలనే యువతరం ఆలోచనలకు ఇతడు ప్రతినిధి. చదువు లేకున్నా ఆలోచన ఉన్నవాడు. ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను మూఢంగా ఎందుకు విశ్వసించాలని ప్రశ్నించిన వాడు.

‘కర్రలు దొరక్కపోతే కప్పెట్టేస్తారా?’

‘ఏం కప్పెడితే పనికి రాదా?’

‘కప్పెడితే ఏటవుద్దీ?’

అని ప్రశ్నిస్తాడు అప్పారావు. దళితులు భావజాల బానిసత్వం నుంచి, మానసిక సంకెళ్ళ నుంచి విముక్తం కాకుండా దళితుల విముక్తి జరగదు. ఎప్పటి నుంచో ఇట్లా ఒక ఆచారం ఉంది కాబట్టి మనమూ ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాగే చేయాలి అనే తర్కం, వివేచన లేని మూఢత్వం నుండి దళిత సమాజం తమను తాము విముక్తం చేసుకోవాల్సి ఉంది. నిజానికి అప్పారావు కూడా పూర్తిగా విముక్తం అయినవాడు కాదు. అతనికి కూడా కాల్చాలనే ఉంది. కాకపోతే కర్రల కోసం అందరినీ బతిమిలాడడం కన్నా – ఎక్కడో ఒక చోట ఎత్తుకొచ్చి పని కానివ్వొచ్చనేది అతని వాదన.

ఒకవేళ కాల్చకుండా పూడిస్తే ముసల్ది దయ్యమై పీడిస్తుందని ఒక మూఢ నమ్మకం. అయితే తురకలు, కంసాలి వాళ్ళు పూడుస్తారు కదా అని ఎరకయ్య లాంటి వాళ్ళ సందేహం. హిందూత్వ బ్రాహ్మణీయ మూఢ విశ్వాసాల నుండి దళితులు బయట పడకుండా విముక్తి సాధ్యం కాదు. దళిత సమాజంలో హిందుత్వపు గీతలు దాటని వాళ్ళు బానిస సంకెళ్ళ భావజాలం నుండి ఊహలో కూడా బయటపడలేరు. చైతన్యవంతులైన అప్పారావులాంటి వాళ్ళు కూడా లోలోపల అంధ విశ్వాసాల బంధాలను పూర్తిగా తెంచుకోలేరు.

వంద తరాలు గడిచాయో, వెయ్యి తరాలు గడిచాయో కానీ – వాళ్ళు అట్లాగా వీళ్ళు ఇట్లాగా ఉండటానికి కారణం కానీ, కారణం వెనుక దాగి ఉన్న కుట్ర కానీ తెలిసిందనుకొన్న అప్పారావులాంటి వాళ్ళు చట్రం లోపల నిలిచి అయినా కొన్ని ప్రశ్నలు వేసుకొంటారు. తమ దుస్థితికి కారణాలను అన్వేషిస్తారు.

ప్రతిసారీ Human Development Index భారతదేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెబుతుంది. సంపద పెరిగిందనీ కోటీశ్వరుల సంఖ్య పెరిగిందనీ చెబుతుంది. కానీ – “ .. సూజ్జూస్తండగే గొల్లలు, శగిడీలు, మాల, మాదిగలు సిన్నసిన్న రైతులందరు దుల్లిపోనారు. ఎవ్వరికీ సెంటు ముక్క మిగల్నేదు. కాపోళ్ళు బాగునేరు, అందల పెద్దనాయిళ్ళకీ సావుకోర్లకే సెందిపోయింది యీ బూదేవతంతా?” అన్న మాటలు వాస్తవ పరిస్థితికి నిదర్శనాలు. ప్రభుత్వాలు మాత్రం అబద్ధాల నివేదికల్ని అంతర్జాతీయ చిత్రపటం పై ఆవిష్కరిస్తూనే ఉన్నాయి. నానాటికీ దిగజారిపోయే దళిత జీవితాలు నివేదికలకూ లెక్కలకూ ఎక్కకుండా మిగిలి పోతున్నాయి.

కాళీపట్నం రామారావు గారు వాడ గురించి చెబుతూ “చెరువు గట్టున వెచ్చననిపించిన గాలి, వాడ మధ్య చివ్వున వెన్నులో పొడుస్తోంది. అతి యిరుగ్గా వుందా వాడలో – ప్రతి మట్టి గోడలోనూ, చలి పేరుకొని ఉండాలి. శీతాకాలపు పగుళ్ళను పెద్దవి చేసుకుంటూ చలిగాలి చావుగాలిలా వాడంతటా కమ్ముతోంది.” అంటారు. వాడ నిండా చలి ఉంది – గోడల్లో, పగుళ్ళలో పేరుకొని ఉంది. ఈ చలి భయపెడుతుంది. వణుకు పుట్టిస్తుంది. దళితుల్ని భయపెట్టించే ఈ చలి భూతం – “కుల భూతం.” నారమ్మ చనిపోయింది కూడా ఈ చలి సంకటంతోనే. బతికినన్నాళ్ళు ఈ చలితో చీదరింపబడి, అణచివేయబడి అన్ని రకాల దోపిడీకి గురై చనిపోయింది. రెండు కావిళ్ళ కట్టెల మీద కాలిస్తే కానీ ఇన్నాళ్ళ చలి నుండి నారమ్మకు విముక్తి లభించదని భావిస్తుంది కోడలు సావాలు.

కధలో “చలి” పాత్ర కీలకమయినది. “రాత్రి ముందుకు సాగిన కొద్దీ చలి అంతకంతకూ పెరిగి పోతుంది. వయసులో ఉన్న తననే గజగజలాడిస్తున్న చలి” లాంటి మాటలు కథ నిండా కనిపిస్తాయి. చలి – పెత్తందారీతనం. చలి కులం. చలి ఊరి అహంకారం. అప్పారావు “చలి సంకటం మనకి ఎన్నుబావుని పట్టీసింది. ఎవుకలు తీనేసింది. సీవూ నెత్తురు మరేటి మిగల్నేదు.” అంటాడు.

ఈ చలి నుండి దళితులు విముక్తం కావాలన్నది రచయిత కల. అదీ విప్లవం ద్వారా జరుగుతుందన్నది ఒక నమ్మకం. ఆ నమ్మకం కధలో అక్కడక్కడా ప్రతీకాత్మకంగా కనిపిస్తుంది.

చివరికి కొందరు యువకులు ఎక్కడినుంచో కట్టెలు తెస్తారు. సగం తవ్విన గొయ్యిని ఆపి శవాన్ని కట్టెల మీద కాలుస్తారు. “.. చెర్లో ములిగి వచ్చిన ఎరకయ్య తడి తలతో తడి గుడ్డల్తో తల్లి కాష్టం ముందు నిల్చున్నాడు. తక్కిన వాళ్ళు అటూ ఇటూ జరిగి అతనికి చోటిచ్చేరు. ఎర్రని మంటల వెలుగు ఆపాద మస్తకం, ముఖ్యంగా అతని ముఖం మీద ప్రతిఫలిస్తోంది.” అని రచయిత అతని అంతరంగంలో రగులుతున్న విప్లవ భావోద్వేగాన్ని, చలి నుండి విముక్తం కావాలనుకొనే అతని ఆకాంక్షను వ్యక్తీకరిస్తాడు. చలికి వణికినా – సారా తాగనంటాడు ఎరకయ్య. మత్తు లేకుండా – మైకంలో పడి వాస్తవలోకాన్ని మర్చిపోకుండా స్పృహతో ఉండి చలిని ఎదుర్కోవాలని ఎరకయ్య నిశ్చయించుకొంటాడు. తల్లి కాష్టం మంటల్లో వేడెక్కాక శీతాకాలం పట్ల తనకున్న భయం నుంచి విముక్తం కావాలనుకొంటున్నాననీ చెబుతాడు ఎరకయ్య. “.. ఈ సలీ సీకటి ఎప్పటికి తొలిగిపోతాయి? ఎర్రగా పొద్దెప్పుడు పొడుస్తాది? ఎప్పుడెండలో చేరిపోతావు” అని అంటాడు. తల్లిని గుర్తు చేసుకొంటూ చనిపోయాకైనా ఈ చలి నుండి విముక్తం కావాలని తన తల్లి కల కనేదనీ చెబుతాడు. ఆమె కల – జీవితం నుంచి విముక్తం కావడం కాదు – బానిసత్వం నుంచి విముక్తం కావడం – అన్నది – రచయిత దృక్పథం.

కాల్చటం, పూడ్చటం అనేవి రెండు ఈ పాత్రల మధ్య జరిగిన చర్చలో కీలకాంశాలు. నిజానికి ఈ కథలో దళితులు కాల్చే ఆచారం ఉన్నవాళ్ళు. “కుల సంప్రదాయం” అదే అని బలంగా నమ్మినవాళ్ళు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, కులపెద్దలు .. అందరిదీ అదే విశ్వాసం. కర్రలు దొరక్క మధ్యలో పూడ్చాలనుకొంటారు కానీ అనేక సందేహాలూ భయాలూ. చిట్టచివరికి కట్టెలు దొరికి కాలుస్తారు. ఏ ఆచారాలను వదులు కోవటం ద్వారా విముక్తి కలుగుతుందో, అనవసరపు భారం (Drudgery) తగ్గుతుందో వాటిని వదులుకోవాలి – కర్రలు దొరకని కారణంగా కాల్చే సంప్రదాయాన్ని వదులుకోవాలనుకొంటారు. కాల్చటం హిందూ సంప్రదాయం అనీ, పూడ్చటం తురకల వంటివారి ఆచారం అనీ కూడా అనుకొంటారు. పూడిస్తే దెయ్యాలుగా మారతారనే తమ నమ్మకాన్ని తలుచుకొని భయపడతారు. హిందూ దళితులుగా ఈ ఆచారం నుండి విముక్తి కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం జరగదు. మళ్ళీ ఇంకొక ముసలమ్మ చనిపోతే ఏం చేస్తారు? కట్టెల కోసం మళ్ళీ అందర్నీ అడుక్కొంటారా? దొంగతనం చేస్తారా? తిరుగుబాటు చేస్తారా? తమను తాము కట్టడి చేసుకొన్న ఆచారాల నుండి భావజాల బానిసత్వం నుండీ విముక్తి చేసుకోకుండా – తిరుగుబాటు సాధ్యమవుతుందా? మార్పుకి అవకాశం ఉందా?

దళితులు హిందూ మత పరిధిలో ఉండీ కుల వివక్షపై పోరాటం చేసి హక్కులు సాధించుకొనే అవకాశం ఎండమావి లాంటిది. యధాతధ గ్రామీణ సమాజంలో తిరుగుబాటుకి ఆస్కారం లేదు. అణచివేతలోకి, బానిసత్వంలోకి నెట్టే ఆచారాలను ధిక్కరించకుండా విప్లవం సాధించే ఆస్కారం లేదు. కుల బానిసత్వం నించి బయట పడాలని మతం మారి క్రైస్తవం ఇస్లాం లాంటి మతాలను ఆశ్రయిస్తే కుడా హిందూత్వ పెత్తందార్లు వదలడం లేదు. ఇవాళ దేశం నిండా మత మార్పిడులపై తీవ్ర చర్చ జరుగుతోంది. “ఘర్ వాపసీ” పేరిట తిరిగి దళితుల్ని అదే మురికి గుంటలో పాతేయడానికి బ్రాహ్మణీయ హిందూ సమాజం త్రిశూలాలతో బయలుదేరింది. కుల వివక్ష నుంచి విముక్తి జరగా కుండా బ్రాహ్మణీయ హిందూ వ్యవస్థ నుంచి అది పెంచి పోషించిన ఆచార సంప్రదాయాల నుంచి భౌతికంగా మానసికంగా బయట పడకుండా ఉన్నంత కాలం దళితులకు ఈ దేశంలో విముక్తి లేదు. అదే విధంగా హిందూత్వ బ్రాహ్మణీయ భావజాలాన్ని ధిక్కరించ కుండా – ఆ మానసిక స్థితి నుంచి అణచివేతకు గురైన సమాజాన్ని బయటికి తేకుండా ఈ దేశం విప్లవాన్నిసాధించడం జరగదు.

నిజానికి ఈ కధ వచ్చే నాటికి సాహిత్య చరిత్రను చూస్తే దిగంబర కవుల షాక్ ట్రీట్ మెంట్ నుండి సాహితీ సమాజం ఇంకా బయటపడనే లేదు. కంచికచర్ల కోటేశు కుల అహంకారుల చేతిలో దారుణంగా తగలపెట్టబడ్డాడు. నక్సల్బరీ, శ్రీకాకుళం, తెలంగాణ ఉద్యమాల సెగ తగ్గనే లేదు. 1970ల నాటికి విరసం పుట్టుకొని వచ్చింది. మార్క్సిజం ఇచ్చిన భౌతికవాదం హల్ చల్ చేస్తోంది. ఇలాంటి సాహిత్య సందర్భంలో అప్పారావు లాంటి యువకులు ఈ ఆచార వ్యవహారాలకు కేంద్రమైన మురికిగుంట లాంటి బ్రాహ్మణీయ హిందూత్వం ఏర్పాటు చేసిన వర్ణ వ్యవస్థని గుర్తించలేక పోయారు. ఆ మురికి గుంటలోనే నిలబడి కేవలం చుట్టూ ఏర్పడిన తరంగాన్ని ఛేదించాలనుకోవటం అంటే – దీనిని హైందవ విప్లవంగానే మనం గుర్తు పట్టాల్సి వస్తుంది. ఈ దేశపు దళితుల్లో ఈ వర్ణ వ్యవస్థ అంతం పట్ల అవగాహనను పెంచేదీ, దృష్టిని సారింపచేసేదీ కేవలం అంబేడ్కరిజం మాత్రమే. 1970ల నాటికి ఈ దేశంలో అంబేడ్కరిజం చేరుకోవాల్సిన ఊరి చివరి అంటరానివాడల్లో మార్క్సిజం మాత్రమే చేరుకోవటం వలన ఈ మురికి గుంటను గుర్తించలేని అంధులయ్యారు దళితులు.

ఏది ఏమైనా కాళీపట్నం రామారావుగారే చెప్పినట్లు ఈ కధ దళితుల జీవిత సంఘర్షణ. సుదీర్ఘమైన ఈ కధలో చావు కేంద్రంగా సామాజిక ఆవిష్కరణ జరిగింది. పాత తరానికీ కొత్త తరానికీ మధ్య వున్న దృష్టి అంతరం, మార్పును కోరే తరం ఆకాంక్ష అభివ్యక్తమయ్యాయి.

 -ఎం.ఎం. వినోదిని 

వినోదినిడా. ఎం.ఎం. వినోదిని యోగి వేమన విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి కోఆర్డినేటర్ గా పని చేస్తున్నారు. బ్లాక్, ఒక విలన్ ఆత్మహత్య లాంటి సంచలనాత్మక దళిత మహిళా కేంద్రకమైన కధలు రాశారు. ఇంకా బ్లాక్ యింక్, మరియా లాంటి కధలు అనేక పత్రికల్లో వచ్చాయి. వీరి పిహెచ్ డి థీసిస్ ‘స్త్రీవాద కవిత్వం – భాషావస్తు రూప నవీనత’ చాలా యూనివర్సిటీల్లో రిఫరెన్స్ గా వాడుతున్నారు. ఈమె రాసిన ‘తప్పిపోయిన కుమార్తె’ కధ ‘Parable of a Lost Daughter’ పేరుతో ఆంగ్లానికి అనువాదమై యూనివర్సిటీ కాలేజీల్లో డిగ్రీ విద్యార్ధులకు పాఠ్యాంశంగా ఉంది.   2013లో ఈమె ఆంగ్లం నుండి అనువాదం చేసిన ‘దాహం’ నాటకం (The Thirst, Oxford University press) గత తొమ్మిదేళ్ళ నుండి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎ కోర్సుకు పాఠ్యాంశంగా ఉన్నది. ఈ సంవత్సరం ‘వేగుచుక్కలు, అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం’ పుస్తకాన్ని హెచ్ బిటీ వాళ్ళు ప్రచురించారు.

గత కాలం రచయితల్లో కొడవటిగంటి ఇష్టమని చెబుతున్నారు. మద్దూరి, పైడి, గోగు శ్యామల, జూపాక సుభద్ర, గౌరీలతో బాటు అందరు దళిత అస్తిత్వవాద, ఇతర అస్తిత్వవాద రచయితల రచనలు ఇష్టమని చెబుతున్నారు. తన వర్గాన్ని- అందులో తను ప్రేమించే తల్లిని కూడా కుల దౌష్ట్యం కలిగి ఉండిన కారణంగా నిజాయితీగా విమర్శించి ఎండగట్టిన స.వెం. రమేశు దళితేతర రచయితల్లో ఇష్టమైన వాడని చెప్పారు. ఆయన చూపించిన దళితేతర మార్గం అత్యంత ప్రేమించదగ్గదీ, ఇతర రచయితలకు మార్గదర్శకమూ అని ఆమె అభిప్రాయం. 

వచ్చే వారం ‘హింస’ కధ గురించి బత్తుల రమాసుందరి పరిచయం

 చావు కథ ఇక్కడ:

 

మహదాశీర్వచనం: సీదా సాదా కథ చెప్పే అసాధారణ చరిత్ర

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

“రామారావుగారి కథలు దాదాపు ఏవీ పైకి తెలిసిపోవనీ, పురాతన చరిత్ర కోసం భూమి పొరలను తవ్వే ఆర్కియాలజిస్ట్ పొర పొరా వేరు వేరుగా విడదీసి చూపే దాకా చరిత్ర సమాచారం ఆవిష్కృతం కానట్టు – ఆయన కథలు కూడా పొర పొరా జాగ్రత్తగా విప్పితే కాని కథలో ఏ మాట ఎందుకు అన్నారో బోధ పడదనీ, ఆ కథ రెండోసారి చదివేటప్పుడు — అంతకు ముందు, మొదటిసారి చదివినప్పుడు తోచని లోతులు, గూఢ అర్ధాలు తెలుస్తాయనీ మరొక సారి చెప్పటం అవసరం -”

1986 అక్టోబర్ లో కాళీపట్నం రామారావు కథలు ఒక పాతిక ఆర్కే పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించబడినప్పుడు ‘ఈ కథలు రెండోసారి చదవటానికి ముందుమాట’ రాస్తూ వెల్చేరు నారాయణరావు చెప్పిన ముక్తాయింపు మాటలివి. నిజమే. కాళీపట్నం రామారావు కథలు రెండోసారి, మూడోసారి, మరొకసారి ఇలా మళ్ళీ మళ్ళీ చదివే క్రమంలోమానవేతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని అసలు కథలు తెలిసివస్తాయి. కొడవటిగంటి కుటుంబరావు మాటల్లో చెప్పాలంటే కాళీపట్నం కథలు చదివితే “జీవితం లోని అంతస్సంఘర్షణ కూడా దాని వెనక ఉన్న భౌతిక కారణాలతో సహా స్పష్టంగా -” అర్ధం అవుతుంది. అతిసాదాగా కనిపించే కారా కథల లోని ఆకర్షణ అదే. ఆ ఆకర్షణ లక్షణం వల్లనే కారా గారి ‘మహదాశీర్వచనం’ కథ నాకు చాలా నచ్చింది.

‘మహదాశీర్వచనం’ కథ 1967 ఏప్రిల్ 27 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో మొదట ప్రచురించబడింది. అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇరవై సంవత్సరాలు, ఆంధ్రరాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది. ఆర్ధికాభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి అసమానతలను తగ్గించటం ధ్యేయంగా సాగిన మూడవ పంచవర్ష ప్రణాళిక అప్పుడే ముగిసింది. వ్యవసాయంలో మిగులువిలువను పెంచి నూతన ధనిక వర్గం ఏర్పడటానికి కారణమైన హరిత విప్లవం ఈ కాలపుదే. అసమానతలు తగ్గకపోగా మరింత పెరగటానికి ఇది కారణమైంది. రూపాయి విలువ తగ్గి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మధ్యతరగతి జీవితం దుర్భరం కాసాగింది. భూ పరిమితి చట్టాల అమలులో వైఫల్యం .. పేద, సన్నకారు రైతుల, రైతు కూలీల బతుకులలోని పీడన, దోపిడీ .. నెహ్రూ వాగ్దానం చేసిన సోషలిస్ట్ సమాజం వాస్తవీకరించబడుతుందన్న ఆశను తుంచేశాయి. అసంతృప్త అశాంత ప్రజాజీవనం నుండి శ్రీకాకుళంలో గిరిజన రైతాంగ పోరాటాలు రూపం తీసుకొంటున్న కాలం ఇది. ఈ రాజకీయార్ధిక నేపధ్యం నుండి అధ్యయనం చేయవలసిన కథ ‘మహదాశీర్వచనం’.

ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం కేంద్రంగా ప్రారంభమైన ఈ కథ స్త్రీల కోణం నుండి నడపబడింది. ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మొదలై బాగా చీకటి పడ్డాక ఆరు ఏడూ గంటల ప్రాంతంలో కథ ముగుస్తుంది. మొత్తం మీద అయిదారు గంటల కాల వ్యవధి మీద నడిచిన ఈ కథను ఇంట్లో మొదలుపెట్టి ఊరి అవతల బడిలోని పోలింగ్ ఆఫీసులో ముగించటంలో ఉంది కారా నిర్మాణ శిల్పం. “ఆయన చావటానికి సిద్ధంగా ఉన్నాడు. రెన్నాళ్ళయీ మూన్నాళ్ళయీ కాదు. నాలుగు సంవత్సరాలై ..” అన్న ప్రారంభ వాక్యంతో ఇంటి యజమాని కామేశాన్ని పరిచయం చేసి.. వెనువెంటనే కొంచెం బియ్యం, వాటికెన్నో రెట్లు ముదురు నూకలు, చాలా మట్టిబెడ్డలు కలసి ఉన్న పాత చాట ముందు పెట్టుకొని, వాటిల్లోంచి బియ్యాన్ని ఏరి తీసుకోవటమో, రాళ్ళను ఎంచి పారేయ్యటమో తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలో గుమ్మం ఒడ్డున కూర్చున్న కామేశం భార్య సత్యవతమ్మను పరిచయం చేసాడు కారా. వీధి చీడీలో వదులు మఠం వేసుక్కూర్చున్న ‘వాడు’ అని సర్వనామంతో మరొక పాత్ర పరిచయం అవుతుంది అప్పుడే. కుక్కి మంచంలో ఉండుండి ఎగశ్వాసతో బెక్కుతుండే రోగి వైపు మన దృష్టి మరల్చి, రోగి స్థితికి అదిరిపోతూ రోగి శ్వాస చక్కబడితే తాను కుదుటపడే సత్యవతమ్మను కేంద్రంలోకి తెచ్చి, పన్నెండేండ్ల కూతురు కామేశ్వరిని ప్రవేశపెట్టి కధకుడు నాటకంలో సూత్రధారుడి వలె ఇక జీవన నాటకం చూడండంటూ తాను తప్పుకొన్నాడు.

సత్యవతమ్మ ఏడేండ్ల కొడుకు శంకరం తండ్రిని చూడటానికి వైద్యుడు ఆచార్లును వెంట పెట్టుకొని రావటంతో కథలో కదలిక మొదలవుతుంది. ఆచార్లు రోగిని పరీక్షించి మందులిస్తుండగా ఎదురింటి అరవై ఏళ్ళు పైబడ్డ శేషమ్మ అక్కడకు వస్తుంది. చలన చైతన్యాలు లేకుండా మంచంలో పడి ఉన్న కామేశం జీవితం సమస్తం ఆమె అంతరిక ఆలోచనల వల్ల, ఆమె అనుభవాల జ్ఞాపకాల కధనం వల్ల, వ్యాఖ్యానాల వల్ల పొరలు పొరలుగా పాఠకుల ముందు విచ్చుకుంటుంది.

శేషమ్మ సంభాషణ వల్ల కామేశానికి సత్యవతమ్మకు పెళ్లి శారదా బిల్లు హడావుడిలో జరిగిందని తెలుస్తుంది. వివాహ వయో పరిమితిని అమ్మాయిలకు 14 ఏళ్ళుగా, అబ్బాయిలకు 18 ఏళ్లుగా విధిస్తూ 1929 లో వచ్చిన బిల్లు ఇది . బిల్లు వస్తుందని తెలిసి ముందే పెళ్లిళ్లకు తొందరపడటం, ఆ బిల్లు వర్తించని నైజాం ప్రాంతాలకో, యానాం ప్రాంతాలకో వెళ్లి పెళ్లిళ్లు చేసుకురావటం జరిగింది. ఆ హడావుడిలో సత్యవతమ్మ పెళ్లి జరిగింది అంటే 1929లో జరిగిందన్నమాట. అప్పటికి ఆమె వయసు అయిదు ఏళ్ళు. రెండువందల శుల్కానికి కామేశం ఆమెను కొనుక్కొని పెళ్లి చేసుకొన్నాడు. అప్పుడతనికి 28 ఏళ్ళు. స్కూల్ మాష్టారిగా పని చేసి రిటైర్ అయి స్వగ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. భర్తను స్వార్ధపరుడని, పెళ్ళాం పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించనివాడని శేషమ్మ ఆరోపణగా మాట్లాడుతుంటే సత్యవతమ్మకు అరవై ఏళ్ళు జీవిత భారం మోసి అలసిపోయిన వ్యక్తి ఆఖరి దినాలు హాయిగా గడపదలచటంలో తప్పేమీ కనిపించలేదు అని ఆమె చిత్తవృత్తిని వ్యాఖ్యానిస్తాడు కధకుడు. దీనిని బట్టి కథ ప్రవర్తిస్తున్న కాలానికి కామేశం అరవై ఏళ్ళు దాటినవాడు. అంటే కధాకాలం 1962-63 కావాలి.

చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం మొదలైన వూళ్ళ ప్రస్తావనను బట్టి వాటికి సమీపంలో ఉత్తరాంధ్రలోని ఏ గ్రామంలోనో ఈ కథ ప్రవర్తించిందని అనుకోవచ్చు. ఆ గ్రామం – స్వాతంత్ర్యానంతర గ్రామం ఎలా ఉంది? ప్రాధమికమైన విద్య ఆరోగ్య వసతులే సమకూడలేదు. కొత్తబడి ఊరవతల పెంకుటింట్లో పెట్టబడింది.1960 కల్లా ప్రాధమిక విద్యను సార్వజనీనం చెయ్యాలని భారత రాజ్యాంగం సంకల్పం చెప్పుకున్నా మగపిల్లల చదువులు ఆడపిల్లల పెళ్ళిళ్ళు సమస్యగా భావించే స్థితి మారలేదు. ఇక ఆరోగ్యం ప్రభుత్వం కల్పించే సౌకర్యంగా అన్ని గ్రామాలకూ అందుబాటులోకి రానే లేదు.1959 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 730 రూరల్ డిస్పెన్సరీలు వచ్చినప్పటికీ కధ నడచిన గ్రామం వరకు ఆ అభివృద్ధి ఇంకా రానేలేదు. ఆచార్లు ఆ ఊరి ఆయుర్వేద వైద్యుడు. లేనివాళ్ళ కోసం హోమియో తెలుసుకొన్నాడని, ఉన్నవాళ్ళ కోసం అల్లోపతి ప్రాక్టీసు చేస్తాడని అతని గురించి కధకుడు చెప్పిన మాటలు గమనించవలసినవి. అవసరాన్ని బట్టికాక ఆర్ధిక అంతరాలను బట్టి అందివచ్చే వైద్యవిధానాలు వేరు వేరుగా రూపొందుతున్న అసమ సామాజిక స్థితి వైపు పాఠకుల దృష్టిని మళ్ళించే మాటలివి.

 

ఆరుగురు తిని కుడిచే పిల్లలతో ఒక్కతే సంసారం ఈదవలసిన స్థితిలో ఉన్న సత్యవతమ్మను చూసి ఆచారి అల్లోపతి వైద్యాన్ని హోమియోకి మార్చటమే కాక ఆమె దగ్గర ఫీజు కూడా తీసుకొనటం మానేసాడు. ప్రస్తుత కథా సన్నివేశంలో ఆచారి రోగికి ఉపశమనం కోసం ఒక ఇంట్రావీనస్ ఇంజక్షన్ ఇస్తాడు. సత్యవతమ్మ రెండు రూపాయలు ఫీజుగా ఇవ్వబోతే వద్దని వారించాడు. అది తాను కొన్నది కాదని తనకు అది ఎలా వచ్చిందో చెప్పాడు. వూళ్ళో నాయుడోళ్ళ పాపమ్మకు ఇదే జబ్బు. పట్నం పెద్ద డాక్టర్ ఆమె కోసం రాసిన ఇంజక్షన్ అది. ఆయన డజన్ రాస్తే వీళ్ళు రెండు డజన్లు తెప్పించారుట.. ఈ విషయం చెప్పి వారికి పైసలకు కొదవేమున్నది? అందులోను పంట ధాన్యాల ధరలు ఇలా మండుతున్నప్పుడు.. ! అని వ్యాఖ్యానిస్తాడు ఆచారి.

 

ఊళ్ళల్లో రైతుల దగ్గర ధాన్యం కొని అమ్మే వ్యాపార వర్గం ఒకటి రైతాంగాన్ని కనపడని దోపిడీకి గురిచేస్తున్న వైనాన్ని కారా అంతకు ముందే అప్రజ్ఞాతం కథలో (1951) చర్చారూపంగా భాగం చేశాడు. ఆ తరువాత 1966లో యజ్ఞం కథ ఇతివృత్తంలో భాగం చేసి మానవజీవన సంబంధాలను అవి ఎంత హింసాత్మకంగా ప్రభావితం చేస్తున్నాయో వాటి పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో చూపించాడు. 1967లో రాసిన మహదాశీర్వచనంలో కూడా ఆ ప్రస్తావన చేయలేకుండా ఉండలేక పోయాడు. వస్తూత్పత్తులను సమీకరించటం, నిలవ చేయటం, లాభాలకు అమ్ముకొనటం ఆ వర్గం చేసే పని. ఈ కథలోని నాయుడోళ్ళ చరిత్ర పంట ధాన్యాల అమ్మకాల చరిత్ర. కనుకనే వాళ్లకు పైసలకు కొదవలేదు. పెద్దఎత్తున ధాన్యం కొనటం అమ్మటం అలవాటైన వాళ్ళు కనుక ఇంజక్షన్లు కూడా రెండు డజన్లు తెచ్చి పడేసారు. అవి సాధారణంగా దొరకని మందులు. వాటిని అవసరానికి మించి కొని అట్టే పెట్టుకోనటం అంటే అవసరంలో ఉన్నవాళ్లకు అందకుండా చెయ్యటమే. అది తెలిసినవాడు కనుక ఆచారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా ఆ మందులు కొట్టువాడికైనా ఇచ్చెయ్యమని లేదా తన మోహాన అయినా కొట్టమని అడుగుతూనే ఉన్నాడు. ఎక్స్పైరీ డేటు దగ్గరపడ్డం చూసి తీసుకెళ్ళమని మొన్న ఇచ్చారు అని ఆ ఉదంతం చెప్పాడు. తద్వారా ప్రాణావసరం అయిన వాటిని కూడా పనికి రాకుండా పోయేంత కాలం నిలవ చేసుకొనే వర్గం, ఆ వర్గం విదిలించినవాటితో బతుకుకై పెనుగులాడే వర్గం – రెండింటిని ఎదురెదురుగా నిలిపి చూపినట్లయింది.

ఈ కథలో సన్నివేశం ఒకటే అయినా మూడో మనిషిగా శేషమ్మ, లోపలి మనుషులుగా సత్యవతమ్మ, కామేశ్వరి ఎవరి జీవిత అనుభవాల నుండి, అవగాహన నుండి జ్ఞానచైతన్యాల నుండి వాళ్ళు చేసిన ఆలోచనలు, చేష్టలు, సంభాషణలు కలిస్తేనే ఆ సన్నివేశం ఆకారం తీసుకొన్నది. సజీవ చిత్రమై భాసించింది. వీళ్ళల్లో కామేశాన్ని చాలాకాలంగా తెలిసిన మనిషి శేషమ్మ. పెళ్లి అయి కాపురానికి వచ్చిన కొత్తల్లో కళ్ళనిండా కామంతో అతను చూసే చూపులను ఎదుర్కొన్నది. పెళ్ళిచేసుకొని భార్యను చావకొట్టి హింసపెట్టటం చూసింది. ఆ భార్య చావగానే ఉన్న ఇద్దరు పిల్లల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించటం చూసింది. ఆడపిల్లను చెల్లెలు, మగపిల్లవాడిని బావమరిది తీసుకువెళితే రెండో పెళ్ళికి తొందరపడిన తీరు చూసింది. తన భర్త చనిపోయాక తన కొడుకు మీద మరిదిని, మరిది మీద అతడిని పోటీలు పెట్టి వాళ్ళిద్దరి భూముల మధ్య ఉన్న తన భూమిని తెలివిగా అమ్ముకున్నతీరు చూసింది. మొత్తం మీద కామేశం బుద్ధి మంచిది కాదన్నది ఆమె అభిప్రాయం. తను తన జీవిత సౌఖ్యం తప్ప తన తదనంతరం తనకన్నా 23 ఏళ్ళు చిన్నదైన భార్య, 12 ఏళ్ళలోపు పసిపిల్లలు ఆరుగురితో జీవితం ఎలా వెళ్ళ దీస్తుందా అన్న చింత ఆవంతైనా లేని అతని స్వార్ధబుద్ధిని శేషమ్మఏవగించుకొంటుంది. ఆమె దృష్టిలో అతను ‘పురీషంలో పురుగు’.

శేషమ్మ కామేశం గురించి చేసిన వ్యాఖ్యలు మూడు ఉన్నాయి. ఆచారి ఇంజక్షన్ ఇచ్చి రియాక్షన్ వస్తుందేమోనని కనిపెట్టుక కూర్చున్నాను అన్నప్పుడు ఆమె “ఆ జీవికి అంత అదృష్టం కూడానా” అంటుంది. అతని హీన చరిత్రను, రిటైర్ మెంట్ అప్పుడు పెద్ద భార్య కొడుకు వచ్చి చెప్పిన హితవును అహంకరించి తోసిపారేసి వచ్చి ‘నాదారి నేను చూసుకున్నాను నువ్వూ నీ పిల్లలూ ఏ గంగ లో దూకుతారో దూకండి’ అంటూ మంచమెక్కి పడుకున్న అతని వైఖరి గురించి నిరసనగా మాట్లాడి కొంతసేపు ఊరుకొని ఆ తరువాత ఆమె “మనిషికి స్వర్గం గాని, నరకం గాని ఎక్కడో వుండవు. చేసుకున్నవారికి చేసుకున్నంత – అని ఫలితం ఇక్కడే అనుభవిస్తాం” అంటుంది. ఈ రెండు వ్యాఖ్యానాలూ కూడా ఆమెకు జబ్బుతో ఉన్న అతని పట్ల ఏ సానుభూతి లేకపోవటాన్నే సూచిస్తాయి. స్వార్ధం తప్ప ప్రేమ, బాధ్యత లేని మనుషులు చుట్టుపక్కల వారి జీవితాలలో నింపే విషాద భీభత్సం కళ్లారా చూసిన మనిషి కనుక అనాయాస మరణానికి నోచుకోని కామేశాన్ని అదృష్టహీనుడి గానూ, చేసిన దుర్మార్గాలకు ఈ లోకంలోనే ఫలితం అనుభవిస్తున్నవాడిగాను భావించింది.

కామేశం అలా నాలుగేళ్ళుగా చావటానికి సిద్ధమై మంచంలో పడి వుండటం అతని కర్మఫలం అనుకున్నా అతని వల్ల కష్టాలు, నష్టాలు భరించిన భార్యాపిల్లలకు చావూ బతుకు కాని ఆ స్థితి అది మరొక నరకం. వాళ్ళ కోణం నుండి అతనెంత త్వరగా మరణిస్తే అంత మంచిది. శేషమ్మ ఆ భావాన్ని ప్రకటించే నిష్క్రమించింది. ఏమైనా అవసరమైతే కబురు చేయమని చెప్పి వెళుతూ నువ్వు బెంగ పెట్టుకోకు అని సత్యవతమ్మకు హితవు చెప్తుంది. ‘యేo జరిగినా దేవుడు మన మంచికే చేస్తాడని గుర్తెట్టుకో’ అని చెప్పిన మాటలో అతని మరణం నీ మంచికే అన్న సూచన వుంది. ఆమెను అందుకు సిద్దం చేయటమూ వుంది .

 

శేషమ్మ తరువాత కామేశం గురించి లోపలి నుండి సంపూర్ణంగా తెలిసిన మనిషి అతని భార్య సత్యవతమ్మ. ఐదో ఏట అతని భార్య అయి పదమూడు పద్నాలుగు ఏళ్ళకు కాపురానికి వచ్చింది. తరువాత పదిహేను, పదహారేళ్ళు ఆమె బ్రతుకో మహానరకం అంటాడు కధకుడు. ఆమె బ్రతుకును నరకం చేసిన శక్తుల గురించి కూడా కధకుడే సూచించాడు. భర్త కొట్టటం అందులో ఒకటి. భర్తగా అధికారం నిరూపించుకోవటానికో అహంకారాన్ని సంతృప్తి పరచుకొనటానికో, తనకంటే ఇరవై మూడేళ్ళు చిన్నదైన భార్యపై అనుమానంతోనో నిత్యం అతను కొడతాడు. భర్త వల్ల అవమానాలకు, హింసకు గురయ్యే స్త్రీ అందరికి లోకువే. అయినవాళ్ళ చేత, కాని వాళ్ళ చేత ఆమె చీవాట్లు తినటం అందువల్లనే కావాలి. పరాయి స్త్రీలను కామం నిండిన చూపులతో వేధిస్తూ అశ్లీలంగా మాట్లాడుతూ అవమానించే కామేశం వంటి పురుషులకు కొదువ లేని సమాజంలో శేషమ్మ వలెనే సత్యవతమ్మ కూడా ఒక బాధితురాలే.

 

నోటి రంకు ఆడవాళ్ళ చేత నిందలు పడిందని సత్యవతమ్మ గురించి కధకుడు చెప్పిన మాట గమనించదగినది. ఎవరీ నోటి రoకు ఆడవాళ్ళు? తమ భర్తలు పరాయిస్త్రీల వెంట పడుతుంటే వాళ్ళని మందలించలేక, భరించలేక వదిలివెళ్ళే సామాజిక అవకాశం, సాహసం లేక చేసుకొనే మానసిక సర్దుబాటులో భాగoగా తమ భర్తల తప్పు ఏమీ లేదని తమను తాము ఒక భ్రమావరణంలోకి ప్రవేశపెట్టుకొనేవాళ్ళు. తమ భర్తలను స్త్రీలే చెడుదారులకు ఈడుస్తున్నారని తమను తాము నమ్మించుకొని తోటి స్త్రీలకు అక్రమ సంబంధాలు అంటగట్టటంలో తృప్తిని వెతుక్కొనేవాళ్ళు. సత్యవతమ్మ బ్రతుకు నరకం కావటానికి వాళ్ళు కూడా కారకులయ్యారు. జబ్బులు సంకటాలు, కడుపులు, కడుపులు పోవటాలు, పుట్టీ పెరిగీ పోయే పిల్లలు – ఇవన్నీ ఆమె జీవితాన్ని మరింత దుర్భరం చేసాయి. జబ్బులు సంకటాలు భర్త వల్ల వచ్చినవై ఉండాలి. లేత వయసు కాపురం గర్భస్రావాలకు కారణమై ఉండాలి. పిల్లలు పుట్టి పెరిగి పోవటానికి భర్త పని చేసే జిల్లా గ్రామాలలో తగిన వైద్య సదుపాయాలు లేకనో, భర్త బాధ్యతా రాహిత్యం వల్లనో కావాలి. ఈ నిరంతర హింసాత్మక అనుభావాలు ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 

‘ముప్ఫయ్యో పడి సమీపించాక ఆమె జీవితం చక్క బడ్డది’ అంటాడు కధకుడు. చక్కబడటం అంటే ఏమిటి? పూర్తిగా లొంగిపోవటం. పదిహేను పదహారేళ్ళ కాపురంలో భర్త దెబ్బలవల్ల, గర్భస్రావాల వల్ల, పురుళ్ళ వల్ల, జబ్బుల వల్ల శరీరం చివికి పోయి .. అవమానాల వల్ల, పుట్టీ పెరిగిన పిల్లల మరణాలవల్ల, భర్త నిర్లక్ష్యం వల్ల కలిగిన దుఖ్ఖంతో మనసు అవిసిపోయి, మిగిలిన ఆరుగురు పసిపిల్లల కోసం బతక్క తప్పదని గుండె రాయి చేసుకొనటమే చక్కబడటం అంటే. అప్పటి ఆమె స్థితిని కధకుడు “పరరాజుతో పోరాటం సలిపి, సలిపి ఓటమి నంగీకరించిన రాజ్యలక్ష్మి ఆ రాజు పాలన క్రింద చల్లగా వర్ధిల్లినట్టు” అని వ్యాఖ్యానించటం గమనించదగింది. ఏడు పంక్తులలో సత్యవతమ్మ సంసార జీవితాన్ని వర్ణించి రెండు పంక్తులలో చేసిన ఈ వ్యాఖ్యానం ద్వారా కారా స్త్రీల జీవితం లోని హింసను,ఆరాట పోరాటాలను, ఓటములను, లొంగుబాట్లను అర్ధం చేసుకొనటానికి కావలసినంత అవకాశం పాఠకులకు కల్పించాడు.

కామేశం రిటైర్ మెంట్ ముందర సవతికొడుకు వచ్చి రిటైర్ మెంట్ వల్ల వచ్చిన డబ్బుతో తను ఉండే విశాఖపట్నంలోనే స్థలం కొని, పాక వేసుకొని ఒక భాగంలో ఉంటూ మరొక భాగం అద్దెకు ఇచ్చుకోమని ట్యూషన్ లు చెప్పుకొంటూ వచ్చేదానితో పిల్లలకు చదువు చెప్పించమని, తనకు చాతనైన సాయం చేస్తానని సలహా ఇస్తే అందులో మంచి తనకు కొంత అర్ధమైనా భర్తను సమ్మతింప చేయటానికి సత్యవతమ్మ ఏ ప్రయత్నమూ చేయలేదు. ఎందుకు చేయ లేదు? అంతకాలానికి పచ్చనవుతున్నతనబ్రతుకును మళ్ళా పొగలూ సెగలూ మధ్యకు ఈడ్వడం ఇష్టం లేక అంటాడు కథకుడు. కామేశం దృష్టి లో భార్య సలహాలిచ్చే సహచరి కాదు. తానేమి చేసినా చూస్తూ అనుసరిస్తూ జీవించవలసిన కట్టు బానిస. యజమానికి సలహాలిచ్చే సాహసం చేసే బానిస జీవితం నిప్పుల కుంపటే. తెలిసి తెలిసి కామేశాన్ని కదిపే సాహసానికి ఆమె ఒడి కట్టలేదు. అంతేకాదు. భర్త అన్న ఓకే ఒక బంధం వల్ల, దానిపట్ల తరతరాలుగా చూపవలసిన విశ్వాసం గురించిన బోధనలు ఒంటబట్టిన స్త్రీలకు ప్రతినిధిగా సత్యవతమ్మ అతనిలో స్వార్ధాన్ని కూడా అవసరమైనదిగా, అతి సహజమైనదిగా అనుకొనే స్థాయికి చేరుకొంటుంది. శేషమ్మ ఆరోపణలకు సమాధానం చెప్పే విఫలయత్నం ఆ క్రమంలోనే చేసింది.

 

పల్లెటూర్లో నెలకు నూరు రూపాయలుంటే రాజాలా గడిచిపోతుందని, అధమ పక్షం కూర్చొని తిన్నా పదేళ్ళు గడిపెయ్యగలను అని డంబాలు పలికిన భర్త నిర్వ్యాపారం వల్ల, జబ్బు వల్ల ఉన్నదంతా కరిగిపోయి .. తిండి గింజలకు, మందులకు, డాక్టర్ ఫీజులకు చేతిలో డబ్బాడక, ఒంటి మీద పుస్తే పుడకా పోగోట్టుకొన్న స్థితిలోనూ సత్యవతమ్మ భర్తను తప్పు పట్టలేక పోయింది. రూపాయి విలువ పడిపోవటం వంటి ప్రతికూల పరిస్థితులను తప్పు పట్టింది. నాలుగేళ్ళుగా చావటానికి సిద్ధంగా మంచంలో ఉన్న భర్త ఎగశ్వాస పెడుతుంటే మెడలో పసుపుతాడు వెతుక్కొని వణికే చేతులకు దొరికిన పసుపు కొమ్ము కళ్ళకద్దుకొనే విశ్వసనీయతకు రూపం ఆమె. ఆడవాళ్ళ ఈ అజ్ఞానం మీద, పరాధీనత మీద కారాకు ఉన్నఆగ్రహం ఈకథ ముగింపులో కనబడుతుంది. ఆరోజు ఆ వూళ్ళో జరిగిన పోలింగ్ లో చివరగా తన ఓటు వేసి సత్యవతమ్మ పోలయిన ఓట్ల సంఖ్యను వెయ్యికి పెంచింది. ఓట్లు లెక్కించిన ఆఫీసర్ ఆ విషయాన్ని గుర్తించి ‘ఆ అమ్మ ఎవరోగాని వెయ్యేళ్ళు పసుపు కుంకుమలతో వర్ధిల్లుతుంది’ అన్నాడు. ‘ఆ మనిషి హోదాలో చిన్నవాడైనా వయసులో పెద్దవాడు. ఆయన దీవన ఊరికనే పోరాదు’ అన్న వాక్యంతో కారా కథను ముగించాడు. వాస్తవాలతో సంబంధం లేకుండా చిరకాలం పసుపు కుంకుమలతో వర్దిల్లటం అనే దానిని నిరపేక్ష విలువగా నమ్మి ప్రవర్తించే మానవ ప్రవృత్తిని వ్యంగ్యమానం చేసాడు.

ఈ కథ ఇతివృత్తంలో మరొక ముఖం పన్నెండేళ్ళ కామేశ్వరి ద్వారా ఆవిష్కృతం అవుతుంది. బడికి పోయి చదువుకోవలసిన వయసులో ఆ పిల్ల తల్లికి ఇంటి పనిలో తోడయింది. బియ్యంలో రాళ్ళేరటం, బావి నీళ్ళు తోడి గోలెం నింపటం, తల్లి ఇంటలేని సమయంలో జబ్బుపడ్డ తండ్రిని కనిపెట్టుకొని ఉండటం – ఇవి ఆపిల్ల చేసే పనులు. ఇంట్లో వ్యవహారాలు అర్ధం అవుతుంటే వర్తమానం, భవిష్యత్తు కలగాపులగంగా ఆ పిల్ల ఆలోచనలలో సుడులు తిరుగుతుంటాయి. జీవితం పట్ల పిల్లలకు ఉండే సహజ కుతూహలం కామేశ్వరిలో ఉంది. శేషమ్మ తన నాయనమ్మ, మేనత్తల గురించి తండ్రి మొదటి భార్యగురించి, ఆమె పిల్లల గురించి చెప్తున్న విషయాలు విన్నది. తండ్రి మొదటి భార్యను చావకొట్టిన విషయం ఆ పిల్లకు వింతగా, కొత్తగా అనిపించకపోయి ఉండవచ్చు. కానీ తన ఈడులోనే చిన్న మేనత్తకు పెళ్లి అయిందని తెలిసి ‘అంత చిన్నప్పుడే పెళ్ళా’ అని ఆశ్చర్య పడింది. శేషమ్మ తండ్రి ప్రవర్తనను, ప్రవృత్తిని నిరసిస్తూ మాట్లాడుతుంటే తల్లి తల ఎత్తకుండా మధ్య మధ్య కన్నీళ్ళు తుడుచుకుంటున్న సందర్భంలో ఆమె స్థితిని వ్యాఖ్యానించే ‘కామేశ్వరికి అమ్మమ్మగారు శత్రువో మిత్రమో తెలియడం లేదు’ అన్న వాక్యం ఒకటి ఉంది. తల్లికి మాట సాయంగా వచ్చింది కనుక, తండ్రిలోని స్వార్ధ బుద్ధిని, దురహంకారాన్ని ఏకి పారేసింది కనుక మిత్రమనే అనుకొని ఉంటుంది. తల్లి మీద కోపగించి మాట్లాడటం తల్లి కన్నీళ్లు పెట్టటం బహుశ ఆమెను శత్రువు అనుకొనేట్లు చేసి ఉంటాయి.

అంటే కామేశ్వరికి తల్లి పట్ల సానుభూతి, తండ్రి పట్ల వైమనస్యం ఉన్నాయనుకోవాలా? ఉన్నాయనే సూచనలు కథాగమనం లో కనబడతాయి. కథ ప్రారంభంలోనే తండ్రి కనపడగానే కామేశ్వరి చప్ న తల తిప్పేసుకొనటం చూస్తాం. అది చాలు ఆమెకు తండ్రి పట్ల ఉన్న వ్యతిరేక భావం అర్ధం కావటానికి. వెనువెంటనే తల్లి గురించి ఆమె ‘రోజురోజుకూ చిక్కిపోతున్నట్టు కనబడుతున్నది’ అనుకొనటం తల్లిని ఎంత పరిశీలనగా చూస్తుందో తెలుపుతుంది. తల్లి ఓటు వెయ్యడానికి వెళ్తూ తండ్రికి కాపలా పెట్టింది. గుమ్మంలో తల్లి లాగే కూర్చొని ఉన్న కామేశ్వరికి వీధి వాకిట్లో ఆడుకొంటున్న తమ్ముడు శంకరం పక్కింటి అబ్బాయితో తాము విశాఖపట్నం వెళ్లిపోతామని చెప్పటం వినబడింది. ఎప్పుడు అన్న ఎదుటివాడి ప్రశ్నకు శంకరం గొంతు తగ్గించి ఇచ్చిన సమాధానం వినబడక పోయినా ఊహించ గలదు. తండ్రి మరణంతో గానీ అనివార్యం గా తమకు ఆ అవసరం రాదు.

 

తండ్రి మరణం గురించిన ఆలోచనలు లోలోపల కదలుతుంటే తండ్రి గుండె ఆగి పోయిందేమోనని పదే పదే చూస్తూ తన పాపపు ఆలోచనలకు తనను తానే మందలించుకొంటుంది. బతికి ఉన్న మనిషి మరణాన్ని ఊహించటం పాపమని లోకం చెప్పింది. అది వినీవినీ పెరిగిన పిల్ల కనుక పాపపు ఆలోచనలంటే భయపడుతుంది. అటువంటి ఆలోచనలు చెయ్యరాదని అనుకొంటుంది. అయినా ఎంత ప్రయత్నించినా వాటి నుండి తప్పుకోలేక యాతన పడుతుంది. అటువంటి సమయంలో తన తల్లికి కూడా తన ఆలోచనలవంటి ఆలోచనలొస్తాయా అన్న ఆలోచనలో పడుతుంది. రావచ్చు అని అనుమానo ఉన్నా రావనే సమాధాన పడుతుంది. కానీ నమ్మకం మాత్రం కుదరదు. తండ్రి చనిపోయి దిక్కులేని వాళ్లై అన్న దగ్గరకు వెళితే ఎలా ఉంటుందన్నంత వరకు ఆ పిల్ల ఊహలు పరుగెడుతూనే ఉంటాయి. తన నియంత్రణలో లేని ఈ ఆలోచనలతో వేగిపోతూనే తండ్రి కదులుతూ నాలుకతో పెదవులు తడుపుతుంటే గ్లూకోస్ నీళ్ళు తెచ్చి పోసింది. అవి తాగి మగతగా కన్నుమూసిన కామేశాన్ని చూస్తే ‘తండ్రి మరి చావడు’ అనిపిస్తుంది. అది ఆమెకు ధైర్యాన్ని ఇచ్చిందా, నిస్పృహకు లోను చేసిందా అన్నప్రశ్న వస్తే పరిస్థితులు, ఆ పిల్ల మానసిక ఉద్విగ్నస్థితి రెండవ దానినే సమాధానంగా స్ఫురింప చేస్తాయి. ఎవ్వరి సహాయం లేకుండా తమ బతుకు తాము బతకాలన్న ఆశ, విశ్వాసం కామేశ్వరిలో చూపాడు కారా. సత్యవతమ్మలో లేని గుణం అది. బాధలలో, బానిసత్వంలో క్రుంగిపోయే గతం సత్యవతమ్మ. బాధలలో నుండి పైకెగసి స్వతంత్రులం కావాలన్న భవిష్యత్ ఆశ కామేశ్వరి.

ఈ కథ ఎన్నికల హడావుడి నేపధ్యంలో నడుస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కీలకమైనవి ఎన్నికలు. చైతన్యవంతమైన ప్రజల వివేకవంతమైన ఎంపిక దానికి జీవశక్తి. స్వతంత్రం వచ్చిదశాబ్దం దాటినా దేశ ప్రజాస్వామ్యం ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్య వ్యవస్థగా సారవంతం కాలేదు. సత్యవతమ్మను ఓటు వెయ్యటానికి రమ్మని వెంట పెట్టుకు పోవటానికి నక్షత్రకుడి వలే ఒకడు వచ్చి వాకిటి ముందు కూర్చొనటం దానినే సూచిస్తుంది. సత్యవతమ్మ వలెనే జీవన సమస్యల వలయంలో పడి కొట్టుకొంటున్న చాలామంది జనం అయిదేళ్ళకొకమారు వచ్చిపోయే ఎన్నికల పట్ల నిర్లిప్తులు. వాడూ, వాడూ వచ్చి రారమ్మని ఒత్తిడి పెడితే తప్పనిసరి అయ్యో మొహమోటానికో వెళ్లి ఓటేసి వస్తారు. శేషమ్మ, ఆమె కోడలు పొద్దున్నే వెళ్లి ఓట్లు వేసి వచ్చి ఆతరువాత వంట వార్పూ చేసుకొన్నారు. ఎవరికీ ఓటు వెయ్యాలనిగానీ, ఎవరికి వేస్తే తమకు గ్రామ ప్రజలకు మేలు జరుగుతుందని గానీ వాళ్ళు ఆలోచించినట్లు కనపడదు. జబ్బు పడి మంచం లో ఉన్న భర్తను చూసుకొంటూ సాయంత్రం వరకు ఓటు వెయ్యటానికే వెళ్ళలేకపోయిన సత్యవతమ్మ ఓటు ఎవరికీ ఎందుకు వెయ్యాలని ఆలోచించటం అసలు జరగని పని. కానీ అందరూ వెళ్లి ఓట్లు వేసి వచ్చారు. అంటే ఎవరికీ ఓటు వెయ్యాలో ఎవరో చెప్పి పెడితే దానిని వేసి వచ్చారనుకోవాలి. తమ ఓటుతో అధికారంలోకి వచ్చేవాళ్ళకు తమ జీవన స్థితిగతులను మెరుగుపరిచే బాధ్యత వున్నదనిగానీ, అందుకోసం తాము వాళ్ళను నిలదీయ వచ్చనిగానీ ఊహకే రాని అనేకమందికి వాళ్ళు ప్రతినిధులు. ఈ పరిస్థితులలో ప్రజాస్వామ్యం భ్రమ తప్ప మరేమికాదు.

 

పోలింగ్ బూత్ దృశ్యాన్ని చూపి కథ చివరలో కాళీపట్నం రామారావు చేసిన వ్యాఖ్యానం దానినే సూచిస్తుంది. “టైమయ్యాక తలుపులు వేసుకొన్న పోలింగ్ ఆఫీసర్లు శాస్త్రోక్తంగా ఉత్తర విధులు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు మాట్లాడే తీరూ, కదలికా అర్దరాత్రి ఇంట్లో పడ్డ దొంగల చందంగా ఉంది”— ఉత్తర విధులు అంటే పోలింగ్ పూర్తయ్యాక చేసే పనులు అన్న ప్రస్తుతార్ధాన్ని చెప్తూనే మరణానంతర కర్మలు అన్న భావాన్ని వ్యంగ్యమానం చేస్తుంది. ఇంట్లోపడ్డ దొంగలచందం అన్నమాట పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలు సంతరించుకొన్న దోపిడి స్వభావాన్ని సంకేతిస్తుంది. అంతిమంగా ఈ కథ స్త్రీల భాగస్వామ్య పాత్రతో నిమిత్తం లేకుండా నడిచే కుటుంబ వ్యవస్థను, ప్రజల చైతన్యవంతమైన భాగస్వామ్య పాత్రతో నిమిత్తం లేకుండా నడిచే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సమాంతరంగా చూపి అవలక్షణాలతో కునారిల్లుతున్న వాటిని దీర్ఘ కాలం వర్ధిల్లాలని వాంఛించటం లోని అసంబద్ధతను గురించి హెచ్చరిస్తుంది.

మహదాశీర్వచనం కథను 1948 లో కొడవటిగంటి కుటుంబ రావు రాసిన ‘నిజమైన అపచారం’ కథతో కలిపి చదువుకోవాలి. జీవితంలో సుఖమన్నది ఎరుగక నానా కష్టాలు పడి చచ్చి స్వర్గానికి వెళ్ళిన కనకమ్మ కేసు విచారణ ఆ కథ. భూలోకంలో ఆమె పట్ల ఇతరులు చేసిన అపచారాల విచారణ అది. ఆ విచారణలో ఆమె క్షయ వ్యాధితో తీసుకొంటూ భర్త వైద్యం కోసం తన ఒంటి మీద నగలు అమ్మిన విషయం చెప్తుంది. అతను తన నగలు అమ్మకపోతే తానూ తనపిల్లలూ అంత త్వరగా ఆకలికి మాడి చచ్చేవాళ్ళం కాదంటుంది. ఆ నగలు అమ్మకముందే భర్త చచ్చిపోయి వుంటే తానూ తన పిల్లలు రెండేళ్ళు ఆలస్యంగా చచ్చేవాళ్ళమని, ఈ లోగా పిల్లలు కాస్త రెక్కలు వచ్చి ఏ మూటలు మోసి అయినా తమ బతుకు తాము బతకగలిగే స్థితికి వచ్చేవాళ్ళని వాపోతుంది. ఆ నాటి కనకమ్మ చచ్చింది కనుక తన ఆంతర్యాన్ని బయట పెట్టగలిగింది. బతికే ఉంది కనుక సత్యవతమ్మకు ఆంతర్యాన్ని బయట పెట్టే అవకాశం లేదు. తండ్రి చావుకు సంబంధించిన ఆలోచనలు తల్లికి రావా అని కామేశ్వరి వితర్కించుకొన్న విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అతని వైద్యానికి పుస్తెని అమ్ముకొన్నా అతను కిందట్టు మీదట్టు అవుతుంటే ప్రత్యామ్నాయంగా కట్టుకొన్నపసుపుకొమ్మును కళ్ళకద్దుకొనే లోకశిక్షణ నుండి తయారయిన పతివ్రత ఆమె. దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లమని పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన దీవన ఆమె పాలిట వరమా శాపమా ఆలోచించమని పాఠకుల వివేకానికి వదిలేసాడు కారా.

 

అలాగే ఈ కథ స్త్రీల జీవితాలకు సంబంధించిన పాత నిర్వచనాలను, విలువలను ప్రశ్నించిన ధిక్కరించిన, పునర్నిర్మాణానికి పూనుకొన్న స్త్రీల స్త్రీవాద కథతోనూ కలిపి చూడవలసినది. స్త్రీ సమస్య, కుటుంబ సమస్య వేటికవిగా ఉండవు, ఆర్ధిక రాజకీయ సమస్యల సంబంధంలోనే వాటిని అర్ధం చేసుకోవాలి, పరిష్కరించు కోవాలి అన్న కారా మాష్టారి శాస్త్రీయ దృక్పధo దీనిని మంచి కథగా చేసింది. ఇది ఇప్పటికి 47 సంవత్సరాల క్రితం వచ్చిన కథ. ఒక జాతి జీవనంలో దాదాపు అర్ధ శతాబ్ది కాలం అంటే తక్కువ కాదు. సామాజిక మార్పులు అనేకం వచ్చాయి. మధ్యతరగతి చైతన్యంలోనూ పరిణామం చోటు చేసుకొన్నది. ప్రజా ప్రయోజనాల రీత్యా చట్ట సవరణలు జరిగాయి. కొత్త చట్టాలు వచ్చాయి. ప్రజాసంక్షేమ విధానాలు రూపొందాయి. సంక్షేమ పధకాలు అమలులోకి వచ్చాయి. ప్రపంచీకరణ ఫలితంగా వచ్చిన నూతన ఆర్ధిక విధానాలు, ఒప్పందాలు ప్రజా జీవితంపై వేసిన ప్రభావం తక్కువది కాదు. అయితే ఇదంతా ఏ మంచికి దోహద పడుతుందో ఎవరి ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నదో స్పష్టం గా తెలుస్తూనే ఉంది. సంస్కరణలు ఎన్ని వచ్చినా కుటుంబ అధికార వ్యవస్థలో గానీ, రాజ్యాధికార వ్యవస్థలో గానీ మౌలికమైన మార్పులు ఏమీ రాలేదు. మానవ సంబంధాలు ఆశించినంతగా ప్రజస్వామికo కాలేదు. అన్ని రంగాలలో మానవీయ విలువల కోసం యుద్ధం అనివార్యమవుతున్న పరిస్థితులలో ‘మహదాశీర్వచనం’ కథా వస్తు జీవిత సంఘర్షణల నుండి, సందర్భం నుండి ఎంత దూరం ముందుకు రాగలిగామో పరీక్షించుకోవలసే ఉంది.

                                                                                             –కాత్యాయనీ విద్మహే

vidmaheసాహిత్యలోకంలో సగం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకొన్న కాత్యాయనీ విద్మహే సాహితీ లోకానికి సుపరిచితులు. పై అవార్డుతో బాటు ఎన్నో అవార్డులను అందుకొన్న కాత్యాయనీ 26 పుస్తకాలకు సంపాదకులుగా ఉన్నారు. 1980లో ‘రాయప్రోలు వంగమయ జీవిత సూచిక’ దగ్గర నుండి 1994 లో ‘మహిళా జనజీవన సమస్యలు మూలాల అన్వేషణ’, 1995లో ‘తెలుగు నవల కథానిక విమర్శా పరిణామము’, 1998 లో ‘సాంప్రదాయ సాహిత్యం – స్త్రీవాద దృక్పధం’, 2013లో ‘ప్రాంతీయ చైతన్యం – తెలంగాణా సాహిత్యం’ వరకూ మొత్తం 20 పుస్తకాలను ఆమె రాశారు. ఇవి కాక 25 పుస్తకాలకు సమీక్షలు, 24 పుస్తకాలకు ముందు మాటలు రాశారు.

మొదట్లో యద్దనపూడి సులోచనా రాణి, రంగనాయకమ్మలను ఇష్టంగా చదివిన కాత్యాయనీ రంగనాయకమ్మ నవలల ప్రభావం కొత్త చూపునూ స్త్రీ పురుష సమన్వయపు ఆలోచనను ఇచ్చాయని అన్నారు. కొడవటిగంటి, రావిశాస్త్రి, కారా, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, పి. సత్యవతి, ఓల్గా – ఇలాంటి వాళ్ళ రచనలు విస్తృత జీవితాన్ని, బహుముఖ జీవిత పార్శాలను పరిచయం చేశాయని అంటున్నారు. వరవరరావు, త్రిపురనేని మధుసూధనరావు ఉపన్యాసాలు, వ్యాసాలు .. సాహిత్యాన్ని, సమాజాన్ని అర్ధం చేసుకొని విమర్శనా దృష్టిని అభివృద్ధి చేశాయని అన్నారు.

జీవితాన్ని ప్రేమించిన మనుషుల సృజన, విమర్శ, సాహిత్యం, ఆచరణ ఇచ్చే జీవశక్తి నుండి ఈ తరం రచయితలు పుష్టివంతం కావాలని కోరుకొంటున్నారు కాత్యాయనీ .

వచ్చే వారం ‘చావు’ కధ గురించి వినోదిని

మహదాశీర్వచనం కథ ఇక్కడ:

అసహజమవుతున్న సహజాతాలే ‘ఆర్తి’!

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

 

“మనుషుల్లో ఉన్నన్ని రకాలు కధల్లోనూ ఉన్నాయి. ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నట్టు కధల్లో గొప్ప కధలు వేరు …
… కానీ, ఎవరూ చూడకుండా జరిగిన పనికి అంతరాత్మ సాక్షి అన్నట్టుగా, ఏది గొప్ప కధ అన్నదానికి కధలు చదవడంలో సమర్ధులే సాక్షి. కధలు అందరూ రాయలేనట్టే అందరూ చదవలేరు. ఏ కధనైనా చదవలసిన విధంగా చదివేవారు బహు తక్కువ. అందులోని సారం ఆఖరి బొట్టు దాకా గ్రహించేవారు ఇంకా తక్కువ …”
ఈ మాటలు మా గురువుగారి కధల్ని ఉద్దేశించి వాళ్ళ గురువు గారు అన్నవి. ‘కాళీ పట్నం రామారావు కధలు’కు ఉపోద్ఘాతం రాస్తూ కొడవటిగంటి కుటుంబరావు గారు ఈ మాటలు చెపుతూనే – “… కధా పరిణామం గురించి నాకున్న పరిజ్ఞానం సరి అయినదయితే ‘యజ్ఞం’, ‘ఆర్తి’ లాంటి కధలు ప్రపంచ యుద్ధానికి పూర్వం వచ్చివుండడం సాధ్యం కాదు. ఈ కధలలో విశేషమేమంటే, అట్టడుగు జీవితాల్లోని అంతస్సంఘర్షణ కూడా, దాని భౌతిక కారణాలతో సహా స్పష్టంగా కనిపిస్తుంది. ‘యజ్ఞం’ శ్రీకాకుళం పోరాటాలకు ముందు నడిచిన కధ అనాలి. ‘ఆర్తి’ వాటికి యింకా కొంచెం ముందుదేమో, అందుచేతనే అందులో అంతస్సంఘర్షణ మరింత స్పష్టంగా ఉన్నది. అంతస్సంఘర్షణలు జరిగిపోయినాక విప్లవం తల ఎత్తాలి. ఈ రెండు కధలకూ ఈ నాటి విప్లవోద్యమాలతో రక్తసంబంధం ఉన్నది-’’ అంటారు (1971)
సాహిత్య లోకం యజ్ఞాన్ని పట్టించుకొన్నంతగా ‘ఆర్తి’ని (పట్టించుకోవలసినంతగా) పట్టించుకోలేదు. ‘ఆర్తి’ కధని పట్టించుకోవలసినంతగా పట్టించుకొని వుంటే – అర్ధం చేసుకోవలసినంతగా అర్ధం చేసుకొనివుండి ఉంటే – ఆ చర్చల సారాంశాల ప్రభావం ‘తెలుగు కధ’ మీద పడి మనిషికి సంబంధించిన మరిన్ని చీకటి కోణాలకు ఇంకెన్నో వెలుతురు దారులు చూపించి వుండేది.

కొ.కు. గారే అన్నట్టు ‘యజ్ఞం’ కన్నా ‘ఆర్తి’ లోనే అంతస్సంఘర్షణ మరింత స్పష్టంగా వుంది. మరి ఆ అంతస్సంఘర్షణ మూలమేమిటో కధ ద్వారా కనిపెట్టగలిగితే యిప్పటికైనా ‘ఆర్తి’ తీరుతుంది. అయితే కొ.కు. గారు ప్రస్తావించినట్టు ‘యజ్ఞం’ కన్నా ‘ఆర్తి’ రచనాపరంగా ముందుది కాదు. యజ్ఞం 1964లో రాసింది. 1966లో అచ్చులోకి వచ్చింది. ఆర్తి 1969 అచ్చులోకి వచ్చింది. ఆర్తి ముందుదేమో అనడంలో ‘యజ్ఞం’ జరగడానికి ముందు ‘ఆర్తి’ అలముకున్న విస్తరిస్తున్న వొక దశ అని. కధా సందర్భాల రీత్యా ‘ఆర్తి’కి ఒక విధంగా కొనసాగింపే ‘యజ్ఞం’ అని కొ.కు. భావన అయి వుండొచ్చు. యజ్ఞమూ – ఆ కధ మీద జరిగిన చర్చోపచర్చలూ – అది మన ముందు పెట్టిన ప్రశ్నలూ – వ్యవస్థలో వచ్చిన మార్పులూ – దాని మూలాలూ – యివన్నీ చూపిన మీదట ‘ఆర్తి’ రాశారంటే – ఒకడుగు ముందుకేసి మనిషి మూలాల మనుగడ మీద అంటే సహజాతాల మీద కా.రా. దృష్టి పెట్టారని భావించవలసి వుంటుంది. అందుకు ఆర్తి కధ ఆసరానిస్తోంది.

శబ్దార్ధ రత్నాకరములో ఆర్తి అంటే పీడ, దుఃఖం, మనోవ్యధ, రోగము, వింటికొన అనే అర్ధాలు ఉన్నాయి. సామాన్యంగా ఒక కధా శీర్షికకున్న ఒక అర్ధానికి ఏ కధ అయినా ఒదుగుతుంది. కానీ అన్ని అర్ధాలకూ అన్ని విధాలా సరిగా సరిపోయేలా అర్ధం పడుతుంది ఆర్తి కధ.
కధా లక్షణాల్లో ముఖ్యమైన వాటిల్లో ‘క్లుప్తత’ వొకటి. క్లుప్తతని సాధించాలనుకొనే రచయితలు కారా కధల్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడం అవసరం. అవకాశం కూడా. క్లుప్తతకు గాఢత జోడించి పదం పదం తూసి అక్షరం అక్షరం రాసినట్టుంటుంది రామారావు గారి రచన. ఒక అక్షరం ఎక్కువ కాకుండా ఒక అక్షరం తక్కువ కాకుండా తూకం వేసినట్టుగా వుంటుంది. అక్షరం దగ్గర పొదుపరితనం పాటిస్తారాయన. ఎంత అవసరమో అంతే. అంతకు ఒక్క రవ్వ రాల్చరు. పాఠకుడి సమయం అంత విలువైనదిగా భావిస్తారు. గుర్తించి గౌరవిస్తారు. అంత పొదుపుగా రాసినా ఆర్తి కధ నిడివి చిన్నదేమి కా(లే)దు. అరవై పేజీలు (‘కాళీపట్నం రామారావు కధలు’ – తొలి ముద్రణ 1986 – పేజీ 467 నుండి 526 వరకు) వుంది.

ఊళ్ళోనే … కాదు కాదు – వాడలోనే బంగారి కొడుకు పైడయ్యకి తన కూతురు సన్నెమ్మనిచ్చింది ఎర్రెమ్మ. ఆవేటికి సంకురాత్రి ఆర్నెల్లు గదా, ఆర్నెల్ల కోపాలి కూతుర్ని తీసికెళ్తానంటుంది. వియ్యపురాలైన బంగారీ కాదనలేదు, పండగ రేపనగా వచ్చి తీసికెళ్ళు. పండగెళ్ళేక కాప్పోతే రెణ్ణెల్లుంచుకో నానడ్డనంటుంది. ఈ తగువు తాటాకుల మంటలా యెత్తురు కుంటుంది. నిట్ట పట్టిలా నిలిచీ కాలుతుంది. మొత్తానికి తగువు ముదిరి ముసిరి యెలాగ ముగిసిందన్నదే కధ. పైకి కనిపించే కధ. దిగితే గాని పాతర గుమ్మి లోతూ పల్లమూ తెలీదన్నట్టు కధలోకి దిగితే గాని అసలు లోతు అందదు. ఆ లోతులు పొరలు పొరలుగా అందటానికి కారా మాష్టారై బోధ చేసి కాదనడానికి లేదనటానికి వీలు లేని విధంగా పాత్రల్ని నప్పి మనల్ని ఒప్పిస్తారు. తోడుకున్నోళ్ళకి తోడుకున్నంత. ఎంత తెండితే అంత. మనుగడని గడగడలాడించిన మూలాలేవో అవి ఊట బావిలా ఉబికొచ్చి మన ముఖాల్ని, మస్తిష్కాలని ఫెడీల్మని తాకుతాయి. ఎటొచ్చీ చేదుకొనే శక్తి చదువరికి వుండాలి –

‘వెనుకటి రాజ్జాలు కాదు, రాజ్జాలు మారిపోయాయన్నారు. ఈ సారి రావ రాజ్జం వస్తందన్నారు. కొందరు – కాదు! మాలల రాజ్యం వొస్తోందన్నారు. మాలలకి ఉద్యోగాలు; మాలలకి ఇళ్ళు; మాలలకే బంజర్లన్నీ; మీ వాడే ఒకడు శాస్ త్రాలు రాస్తున్నాడ్రా!- అన్నారు కావందులు. అనడం, ఇనడవే తప్ప – యే బంజరు కాడికెళ్తే, ఆ బంజరు కాడే కర్రల్తో నిలబడేవారు కాపు నాయాళ్ళు …’
ఇంక భూమ్మీద … బూమేది? బువ్వేది?
బతుక్కి తోవేది?
‘ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తులల్లా, రెండే రెండు.
ఒకటి యిల్లు, రెండు వొళ్ళు.
మాల పేటలో యిల్లు అగ్రవర్ణులు కొనరు. అవర్ణులకు కొనే తాహతూ లేదు. అలానే ఒళ్ళు కొంచం కొంచెం అప్పుడప్పుడు అద్దెకివ్వడాన్ని శాస్త్రమూ శాసనాలూ అంగీకరిస్తాయి కాని దాన విక్రయ సర్వాధికారాలతో పూరా అమ్మడానికి అంగీకరించవు. కాబట్టి వాళ్ళలో చాలామంది కడుపేదలుగానే వుండి పోతున్నారు. లేకపోతే యేనాడో నిరుపేదలవ్వలసింది.’
ఊరుకాని ఊరు … కాలం కానీ కాలం … అవే స్థల కాలాలు! మరి పాత్రలకొస్తే- బంగారికి పెనిమిటి పోనూ వరుసగా నారాయుడూ కోటయ్యా పైడయ్యా ముగ్గురు కొడుకులు – అంటే బంగారింట నలుగురు మగ కూలీలు. ఇద్దరు ఆడకూలీలు –
మరి ఎర్రెమ్మ మొగుడా అవిటోడు. పెళ్ళి చేసి పంపిన సన్ని తోడ ఆరుగురు చెల్లెళ్ళు – అంటే సన్నితో కలుపుకున్నా ఎర్రెమ్మ యింట ఇద్దరే ఆడకూలీలు – అని అసలు లెక్క చెపుతారు లెక్కల మాష్టారు. బంగారి కోడల్ని ఎందుకు వదులుకోలేదో కూడా చెపుతారు. ఆవీటికి ముందు గొప్పులూ, వేరుశనగల వేతా … నెల్లాళ్ళు కూల్లుంటాయి. పండగ ముందు నెల్లాళ్ళు ముమ్మరంగా వరికోతలు. అందుకే పండగ ముందు తీసికెళ్తానంటుంది ఎర్రెమ్మ. పండగెళ్ళాక తీసికెళ్ళమంటుంది బంగారి.
అసలు కధ కంటికి కనిపించదు. అందుకే చూసినవాళ్ళు కూతురిని పుట్టింటికి ఎప్పుడు తీసికెల్తే ఏటని అనుకుంటారు. పంపడానికి ఒప్పుకొన్నాక ముందైతేనేం వెనకైతేనేం అని కూడా అంటారు. ఇలాటి తగువు గుద్దులేసుకుంటే మాత్రం తెగుతాదా? ఆ గుద్దులాట ఒక చోటగాని ఆగుతాదా? ఒళ్ళు కొవ్వెక్కి తెగబలిసి కన్ను మిన్నూ కానక కొట్టుకు చస్తున్నట్టు కనిపిస్తారు. ‘ఎంగిలాకుల కోసం వీధి కుక్కలు ఎందుకు చస్తాయో … ఆ విస్తళ్ళలో భోజనం చేసినవారికి అర్ధం కాకపోవచ్చు. ఏడాదిపాటు పేగులు మాడితే యెవరికైనా అందులో నీతి కనబడుతుంది’ అని కధ చూపించే అలవాటున్న మాష్టారు ఇలా ఒక మాట అనకుండా వుండలేక పోతారు.

కాదా… వీరకత్తెలిద్దరూ జుట్లూ జుట్లూ పట్టుకొని, రక్కుకొని, కొరుక్కొని, రాళ్ళతో యుద్ధాలాడి .. దెబ్బలు కాసిన ఎర్రెమ్మ చుట్టూ దాని పిల్లలు మూగి మొర్రోమంటే సన్ని తల్లితో వెళ్లింది. ‘ఇదిగో, యిప్పుడు దానెంట యెల్లినావో, మరీ గడపల అడుగెట్టవ్’ తెగేసి అత్త చెప్పినా అమ్మ వెంట వెల్లింది సన్ని.
ఆ విధంగా పెనిమిటి పెళ్ళాలయిన సన్నెమ్మా పైడయ్యా ఒకరికొకరు పరాయోలయినారు.
ఎందుకూ?
ఆకలి!
ఔను గదా … కూలాడితేగాని కుండాడదు కదా?!

మనిషికున్న సహజాతాల్లో మొదటిది ఆకలి. మొదాట కధ అక్కడే మొదలయ్యింది. ఈ ఆకలే బతుకుని సుట్టబెట్టీసింది. ఎవరాకలి వాళ్ళదే. మాష్టారే చెప్పినట్టు ‘వర్షావసాన వాగులు పుట్టి వరదలై పొంగినట్టు, వ్యక్తులలో పుట్టిన భయం, వెల్లువలై పొంగింది. గడ్డి మొక్కలు ముందు మునిగితే, గాలివానకి వృక్షాలూ, ఆముదపు చెట్లూ ఆ తర్వాత విలవిల్లాడుతున్నాయి అని – నిజమే, మనుషులూ గడ్డిపోచలే. ఉక్కిరి బిక్కిరి కాక తప్పుతారా?

ఒకరికొకరు కావలసిన సన్నెమ్మ పైడయ్య ఒకరికొకరు పరయోళ్ళగా వుండీ, వుండలేక – పైడయ్య మగాడు గనుక దొంగచాటుగా కలిసే చొరవ తీసుకున్నా – ఎవరో చూస్తారన్న భయం ఒక్కటేనా –ముందెల్తే గొయ్యా యనక్కెల్తే నూయ్యా … యిద్దరిదీ అదే పరిస్థితి. మనసులో యిష్టమున్నా పౌరుషాలూ పరాధీనతలదే పై చేయిగా మిగులుతుంది. ఏమీ మిగలకపోయినా ఇద్దరూ కలుసుకున్న కబురు వాడలో తెలిసిపోతుంది.

అమ్మలా అన్నీ అర్ధం చేసుకున్న నరసమ్మ నీ మొగుడు చెప్పినట్టు నడిచి కాపురాన్ని నిలబెట్టుకోమంటుంది. సన్ని ఎద పొయ్యలేక ఏడుస్తుంది. ఆడు రేతిరికి ఎక్కడికి రమ్మన్నాడో చెపుతుంది. తొంగోడానికి చోటు లేదు. వున్న చోట వీలు కాదు. బరితెగించి వెళ్ళి ఒళ్ళెరపెట్టి మొగిడ్ని దారిలోకి తెచ్చుకోవడం చేత కాదు. అందు మార్గం వల్ల అత్త కాదు కదా దాన్ని పుట్టించిన జేజేమ్మని ఎదిరించడం చేత కాదు.
మరి మొగుడు ఎవుల్నయినా మరిగితే, కాపురంలో నీళ్ళు కాదు, నిప్పులు కురుస్తాయన్న భయం.

మనిషి కున్న సహజాతాల్లో భయం కన్నా ముందున్నది కామం. కామం కూడా ఆకలే. దప్పికే. ఆకలిని అర్ధం చేసుకున్నట్టు కామాన్ని ఎవరూ అర్ధం చేసుకోరు. ఆకలికి దేబిరించి నీరసించిన ప్రాణం … ఎన్ని లజ్జుగుజ్జులయినా పడి కొట్లాడి పోట్లాడి ఆకలి తీర్చుకుంటుంది. కామమయినా అంతే. దేబిరించో దౌర్జన్యం చేసో సిగ్గొదిలి .. సెరమొదిలి ఆరాటపడి దప్పిక తీర్చుకుంటుంది.
ఆర్నెల్లయి ఆడమనిషి కోసం ఉపాసం వున్నాడు కాబట్టే పైడయ్యకు పెళ్ళాం సన్నెమ్మ మీద మోజున్నా – రావయ్య కోడలు .. యేపుగా కాసిన కాయాలా, నిండా విడ్డ పువ్వులా వుండి ఆశనిపించింది. ఆశ తీరక ఆ దప్పికతోటే ఊరికీ వాడకీ దూరంగా ఎక్కడో వున్న గంగమ్మని ఎతుక్కుంటూ వెళ్ళాడు. నీ కాడ యేదుంటే అదే యిమ్మన్నాడు. అక్కడితో ఆగక “నానార్నెల్లయి, ఆడమనిషి కోసం ఉపాసవున్నాను. ఇయ్యాల ఇంటికొస్తే మాయమ్మా అత్తా కుమ్ములాడుకొని మమ్మల్నిడదీసినారు. నిన్న రాత్తిరి దాన్ని తవిటప్ప ఇంటికి రమ్మన్నాను. దానికి నా బాధ అర్ధవైనట్టు నేదు. సెప్పకేం – కత్తెట్టి ఒక్కొక్కల్నో పోటు పొడిచేసి, ఆ యెంట నానూ సత్తునా అనుకున్నాను. కాని నాకాపాటి తెగువనేదు –’’ పైడయ్య తన అవస్థలను చెప్పాడు.

గంగమ్మ అర్ధం చేసుకుంది. ఒక దప్పికన్నా తీర్చాలన్న ఉద్దేశంతోనే “– ‘నీకు నాటు సారా పడతాదా?’ అంది తల్లిలా –“ అని మాష్టారు అక్కడ అమ్మని చేశారు గంగమ్మని.
పెళ్ళప్పుడో, సన్నీ కాపురానికి రాకముందో – ఇంకోసారి అడగానంటే, అలాగే కానిమ్మంది గంగమ్మ. మళ్ళీ ఇన్నాల్టికి వచ్చిన పైడయ్యను కాదంది. ‘నానిప్పుడు నీకొదెన్నవుతాను’ అని చెప్పింది. అంతకు ముందే గంగమ్మ చెప్పకముందే ఆమె భర్త మంచానుండి ‘నారాయుడూ’ అని పిలవడం సూక్ష్మ దృష్టి గల పాఠకుడు ముందే గ్రహిస్తాడు.
పైడయ్య మాటా మనోగతం మనిషి కప్పుకున్న మరిన్ని లోపలి పొరల్ని చీలుస్తుంది. సహజమైన సహజాతాల్ని బయట పెడుతుంది.
“మాయన్న అందరు పిల్లల మీద, పెళ్ళాడనంటే, మంచోడు – మంచి పనే చేసేడనుకున్నాను. అయితే ఆడు యెలాగా బరిస్తన్నాడా అని దిగులుగుండేది. ఇదిగిలాగన్న మాట: అని – నన్నడిగితే యిదీ మంచి పనేననాల. అత్తలాడూ సుకపడతన్నాడు. ఇత్తల నువ్వూ సుకపడతన్నావు. మనలాటి కస్టపాటు జాతికే వుంది, కడుపు సుకం లేనే లేదు. ఎయ్యి జనమలెత్తినా వస్తాదని నమ్మకవూ లేదు –

సుకాలన్నిట్లోకి సుకం ఆడ మగా ఒక్కాడ అనుబగించిందే – సుకం! ఇప్పుడిదీ (సారా) సుకవే. కానీ దీనికి కరుసున్నాది. ఇదయ్యాక రేపు కొంత దండుగున్నాది. ఆ సుకానికైతే కానీ కరుసునేదు – రేపు దండుగనేదు. పేదోడికి బగమంతుడు మిగిలించిన సుకవది.-“ అని పైడయ్య తన పరిస్థితికి వాపోతాడు.
పైడయ్యకు వేరే దారి లేదా? ఉంది. అది దారి కాదు. ‘ఇరుగమ్మకో పొరుగమ్మకో పాటుపడితే యిళ్ళిరగతీయాల: కన్నె పిల్లని సెరిపితే, కలకాలం దానుసురు తగుల్తాది. మరింక రోడ్డోర మనుసులున్నారు – ఆలా జోలీ కెళ్తే, ఆసుపత్రికి పోవడం సరే సరి – పన్లోకెళ్ళకండ పది రోజులుంటే కూల్డబ్బుల మాటేటి?’ పైడయ్యకు తోవ లేదు!
‘కడుపుకుండి, మనిషి దొంగతనం సెయ్యరాదు. కట్టుకున్న పెనివిటో, పెల్లవో వుండి కాని పని సెయ్యడం తప్పు. నీకింటి కాడ పెల్లం నేకపోతే సెప్పు. దానికొంట్లో సుకం నేదన్నా నానొప్పుకుంటాను. కానీ తీరి కూకొని కాపరాలు సెడగొట్టకు. అందరు మొగోళ్ళు ఒకటైనట్టే అందరాడోళ్ళం ఒకటే’ అంది రావయ్యకోడలు, పైడయ్య స్నేహితుడు కన్నయ్య తోటి.

వదిన్నవుతానన్న గంగమ్మ – అలా అన్నందుకు ఒగ్గేసిన పైడయ్యలను జాతి తక్కువగా లోకం చూసినా నీతికి తక్కువ కాదు. ఏ తోవా లేక దొంగతోవకొచ్చినా ఎవలతోవ ఆలకి వుండాలి గదా?!
అలాగ లేనపుడు దొంగ తోవయినా వొక తోవుండాలి. నారాయుడూ గంగమ్మ ఆ తోవనే నడుస్తున్నారు. గంగమ్మ మొగుడు అది దొంగ తోవనుకోడు. ఏ తోవా లేనపుడు ఏదో ఒక తోవుండాలని తెలుసుకొని అర్ధం చేసుకున్నాడు గనుకనే ‘నారాయుడూ’ అని కదలిక పసిగట్టి పిలవగలిగేడు.
మానవ సహజాతాల్లోని ఆకలి, కామం గురించే కాదు .. నిద్ర, భయం గురించి కూడా ‘ఆర్తి’ కధ మనకు ఎరుకలోకి తెస్తుంది.
ఆకలి రుచెరగదు. నిద్ర సుఖమెరగదు. నిజమే, కాని శాశ్వత నిద్రకే కాదు, ఒక రాత్రి తెల్లవారాలన్నా ఆరడుగుల నేల కావాలి. ఒక సారికి కాదు, రెప్పలు పడిన ప్రతిసారీ కావాలి. ఒళ్ళు వాల్చడానికి ఆసరా కావాలి. వెన్ను ఆన్చడానికి నేల ఆదరువు కావాలి. మరి ఎర్రెమ్మ యిల్లయితే నరసమ్మ అన్నట్టు పందుల గుడిసే.
‘…తొడుక్కోడానికి చింకి గుడ్డలేనా లేని పిల్లలు – ఈలీకలూ వాలికాలైన కోక ముక్కలు కప్పుకొని, యెముకలు కోరికే చలిలో ఆరు బయట పడుకోలేరు. ఒకళ్ళ మీదోకళ్ళు పడి పెద్దప్ప చుట్టూనో, తల్లి చుట్టో, ఆ గదిలోనే పడుకోవాలి. అంచేత పగలల్లా అత్తవారింట గడిపినా రాత్రికి తాను ఇంటికి తీసుకుపోతాడు పైడయ్య సన్నిని …’ అని పరిస్థితిని వివరిస్తారు మాష్టారు.

రాత్రి నిద్ర పోతూనే, మళ్ళీ తెల్లవారి లేస్తూనే సన్ని కన్నోరింటికి పెనిమిటితో రావడంలో నిద్ర సుఖమేమో గాని, మెలకువ కష్టం మాత్రం మామూలుది కాదు.
పోనీ నరసమ్మ యింట్లో తొంగుంటారంటే – ఏదో మాట కాడ మాటొచ్చి ఏదో అన్నదని సన్ని ఆల అత్తకి గుర్రు.
పైడయ్య పట్నంలో కలాసీ, పడుకోడానికి ‘గది లేదు, కూరల మార్కెట్ లోనే ఓ అరుగు మీద పడుకుంటాడు. చూరునున్న గోనె గుడ్డలూ, చాప ముక్కలూ పీకి వాటినోసారి గట్టిగా దులిపి పక్కలు పరిస్తే – పెద్దమ్మ పేరు చెప్పి చుట్టంగా వచ్చిన రావయ్య.. ముసలాడు నిద్ర పోలేదు. అక్కడ ఊరంతా అంత ఎలుగేటి? – యిక్కడీ సీకటేటి ?- అంటాడు. ఈ అరుగులు యింత గలీజుగా వున్నాయి, ఎప్పుడూ కడగరా – అంటాడు. దోవల్నీ, చీవల్నీ, నల్లుల్ని నలుపుకొంటూ – యిటూ అటూ పరిగెత్తే ఎలుకలూ, పందికొక్కులు యెక్కడ కరుస్తాయో అని భయపడుతూ, యెంతో రాత్రి దాకా నిద్ర పోలేదు.’ ఇవన్నీ చుట్టపు చూపుగా వచ్చిన రావయ్య గుర్తించాడు. పైడయ్య ఏనాడూ గుర్తించలేదు. కాబట్టే బతికేశాడు. అడక్కుండానే రావయ్య ‘నన్నడిగితే, తిండినేక ఏ గడ్డో కరిసి చావడం మెరుగు; పేనాలు ఒకపాలి పోతాయి.’ – అని చెప్పిందాకా పైడయ్య తనేలాంటి చోట వున్నాడో గమనించలేదు. ఆ ఊరి జనంలో అయిదో వంతు అలాగే బతుకుతున్నారని కధకుడు చెప్పి ‘పదిరాళ్ళు జేబులో వున్నప్పుడు పరవాలేదనిపించినా, డబ్బులు తక్కువైనపుడల్లా పైడయ్యకు ఆ మాటలు గుర్తొచ్చేవి.’ అని చెపుతారు. నిత్య రణగొణ ధ్వనుల నడుమ ప్రశాంత మహా నిద్ర అసహజమై పోయిన వొక సహజాతం!

మరో సహజాతం భయం! యిది అంతటా ఆవరించి వుంది. లేని దాని కోసం భయం. ఉన్నది కోల్పోతామేమోనని భయం. బతుకెలా గడుస్తుందో భయం. ఇవాల్టి గురించి భయం. రేపటి గురించి భయం. భయం … భయం .. ప్రతి క్షణం భయం!
కూతురు కాపురం ఏమయిపోతుందోనన్న భయంతో ఎర్రెమ్మ వియ్యపు రాలైన బంగారి యింటి మీద కొచ్చింది. తనకి వెన్నూ దన్నూ లేకపోయినా తెగించింది. తిట్లూ తన్నులూ తిన్న అనుభవం వుండనే వుంది. అల్లుడు సారా బడ్డీ దగ్గర తాగకుండా గంగమ్మ .. లంజ దగ్గరకేల ఎల్లినాడని – భయంతో లేని సంబంధాన్ని ఊహించి ఊరంతా వాడంతా గోల గోల చేసింది. పైడయ్య భయంతో పట్నం బయల్దేరేశాడు. అన్న భయంతో ఆగిపోయాడు.

ఈ తగవు ఎక్కడ తేలుతుందోనన్న భయంతోనే పైడయ్య చిన్నన్న కోటయ్య ఎర్రెమ్మని గత్తురు గత్తిరింది కాక గుఫీ దబీ దుబీమని మూడు గుద్దులు గుద్దేడు. కింద పడ్డ మనిషిని ఎడాపెడా నాలుగు తాపులు తన్నేడు. వెళ్ళవసిన దారి చూపించాడు. వెళ్ళి ఆగి తిట్టి పోసి నోటితో భయపెడదామనుకుంది ఎర్రి. ఎగిరెగిరి పడింది. తిట్టి పోసిందే గాని కోటయ్య సన్నిని తుండగుడ్డ నడుంకేసి లాక్కుపోయాడు.
ఎవరూ ఆపలేక పోయారు భయంతోనే. కోటయ్య ముందు కాకుండా వెనుకన పదిమందీ పది రకాల మాటలన్నారు. అదీ భయంతోనే.
ఊరికి తీర్పులు చెప్పే నాయ్డు పెద్దమనిషి, పెద్దరికం పోకుండా ‘పిలా తొత్తి కొడుకుని, రాకపోతే జుట్టట్టుకు ఈడ్చుకురా’ బారిక పాపయ్యకి ఆజ్ఞ నిచ్చాడు. ‘సిత్తం’ అని బారిక పాపయ్య అన్నాడేగాని కదల్లేదు. నాయ్డుకి అనుమానం వేసి ‘ఏం ఆడు తాగుతాడేట్రా?’ ఈసడించినా భయంతోనే. ‘ఉడుకు తగ్గేక, ఇంకో గంటకి ఆలె తవ పాదాల కాడ కొస్తారు గదా?’ ఉచిత సలహా యివ్వడంలోనూ, తిట్టుకుంటూ నాయ్డు ఆమోదించడంలోనూ భయం ఉంది!

తేలని తగువుని తన బలంతో భయం చూపెట్టి క్షణంలో పరిష్కరించేశాడు కోటయ్య.
ఆ భయం తీరకే ఊరి నాయ్డుని ఆశ్రయించింది ఎర్రెమ్మ. ఆమె వెంట పది పదిహేను మందిని వెంట తీసుకెల్లింది తనకు న్యాయం జరగదేమోనన్న భయంతోనే. బారిక పాపయ్య సలహాననుసరించి కోటయ్యను వాడి అత్తోరి ఊరికి పంపేసినా, పైడయ్యని యింట్లోనే వుంచి పెద్దోడు నారాయుడు నాయ్డు దగ్గరికి బయల్దేరినా ఆ భయంతోనే. నాయ్డు తిట్టినా, ‘చేతిలో కర్ర లేకపోయిందిగాని వుంటే తొత్తికొడుకును ఏకీలుకా కీలిరిసేసి ఆసుపత్రిలో పారేద్దును’ అని అన్నదీ భయంతోనే. నారాయుడు తప్పును అంగీకరించిందీ ఆ భయంతోనే . ఎర్రెమ్మ యెంత రేపెట్టినా, యింటిమీద కొచ్చినా దానింటి మీద పడకూడదని తనతో చెప్పాలని – దురితం కూడదని – దౌర్జన్యం పనికి రాదని – తగువులొస్తే తమలో తాము తన్నుకోడం కాదు, పెద్దల ముందు పెట్టి పరిష్కారం చేయించుకోవాలనడంలో – భయం వలన మాత్రమే అదుపులో వుంటారని నాయ్డుకి తెలుసు. భయపెట్టింనంత కాలమే నాయ్డు అధికారం, పెద్దరికం వుంటుందని మనకి తెలుసు. నాయ్డు మంచి చేసినా చెడు చేసినా.
ముందయితే సన్నెమ్మని దానమ్మ ఎర్రెమ్మకి అప్పగించు అని నాయ్డు తొలి తీర్పు యివ్వడంతో కధ మొదటికొచ్చింది. సమస్య ఉన్న కాడికే వచ్చింది. అయినా ఎర్రెమ్మ పక్షాన వున్న నరసమ్మకూ భయం పోలేదు కాబట్టే ‘బాబో అసలు మనిసినోగ్గేసినావ్..’ అని గుర్తు చేసింది. ‘అన్నట్టు మీయమ్మను కూడా తీసుకురా’ నాయ్డు నారాయుడితో అనడంలో వెలిగిన మొహాల్లో భయం పోలేదు. తమకున్న భయమే ఆలకీ వుండాలన్నదే వాంఛ. నిజానికి అక్కుర్లు బుక్కుర్లేడ్చిఅలసిపోయిన సన్నెమ్మ మొహం కడిగి, కొత్త కోక కట్టుకోమని అత్త బంగారి నయాన బయానా చెప్పడంలో తల్లి ఎర్రెమ్మకు ఏ మాత్రం తీసిపోలేదు.
మొత్తానికి సన్నెమ్మ తిరిగి తల్లి దగ్గరికే చేరింది. యధాతధ స్థితే మిగిలింది.

నాయ్డు లేపోతే, నాయ్డు కాపోతే, కాలం మారిపోతే, పద్దతులు మారిపోతే కూడా నాయ్డు స్థానంలోకి పోలీసులొస్తారు. కేసులవుతాయి. లాయర్లొస్తారు. వాదనలవుతాయి. తీర్పులిస్తారు. ఒకరికి న్యాయం జరిగిందనిపిస్తుంది. మరొకరికి అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. వ్యవస్థల తప్పొప్పుల ఫలితంగా వ్యక్తులు తప్పొప్పులు చేస్తారు. నేరస్తులవుతారు. శిక్షలనుభవిస్తారు.
అయితే కధలో అసిర్నాయుడు ఒకప్పుడు గాంధీ గారి శిష్యుడు కావడం వల్ల – యిప్పటి రాజకీయాలు కిట్టక పోవడం వల్ల – ‘బతుకు యీ వేళుండి రేప్పోయేది. ధర్మం కలకాలం నిలిచేది. దాన్ని తప్పితే లోకం తలకిందులు కాదా?’ అని నమ్మడం వల్ల – న్యాయాన్యాయాలు పక్కన పెట్టి మేలు చెయ్యడానికే పూనుకున్నాడని అర్ధమవుతుంది. అయితే కోటయ్య దోతరపుగా తిరగబడి చేసిన పరిష్కారమయినా, నాయ్డు నిదానంగా నిర్ణయాలు చేసిన పరిష్కారమయినా – రెండూ ఏక పక్షమే! రెండూ ఒకటే! రెండూ భయంతో అదుపులో పెట్టేవే!
కోటయ్యకు కులమే కాదు చదువూ లేదు. ఆలోచన లేదు. ఆపద ఎటునుంచి ఎటుపోయి వస్తుందో తెలీదు. రక్తం ఉడుకులెత్తితే ఉరుకులెత్తడం తప్పితే మంచేదో చెడేదో తెలీదు.

మంచీ చెడూ అన్నీ తెలిసిన నాయ్డుకి కులముంది. బలముంది. బలగముంది. ఆలోచన ఉంది. ఆపద ఎటు నుంచి ఎటు పోయి వస్తుందో తెలుసు. ఇహమూ పరమూ మీద నమ్మకమూ ఉంది. అందువల్ల తిండికి లేపోతే అడుక్కు తినండి అంటాడు. బిచ్చం దొరక్క పోతే, చావడమైనా మేలు అంటాడు. అంతే తప్ప ఉన్నవాడికెందుకుందో లేనివాడికి ఎందుకు లేదో – లేనివాడికి ఎప్పటికుంటుందో చెప్పడు. చెప్పలేడు. అందుకే దొంగతనమో దౌర్జన్యమో చేసి లేనిది సాధించుకుందామన్న వాళ్ళని ‘పట్టుదలగా అణుస్తాడు.’ యధాతధస్థితిని కొనసాగిస్తాడు.

‘ … మీ మాల పేట్లో రోజూ యేవారో ఓ వార, యెందుకో ఒకందుకు తిట్టుకుంటూనే వుంటారు గదా! ఎందుకోసవలా తన్నుకు చస్తారు? ఏం మీకు పంచుకుందికి ఆస్తులున్నాయని తన్నుకుంటారా? కలుపుకుందికి బూవులున్నాయని తన్నుకుంటారా? లేపొతే ఒక నీటి కాడ తగువా? ఒక దరికాడ తగువా? దేనికి మీ తగువులు?’ అని నాయ్డు అక్కడితో ఆగలేదు –
‘ఏదో భవంతుడు మీకింత రెక్కలిచ్చేడు. పదిమందీ పస్లోలలు ఒక్క నాడు తెచ్చినా, పది రోజులు గెంజి తాగి గడిపేసుకోగల్రు. అలాటప్పుడు నలుగురూ కలిసి మెలిసుంటే అదెంత హాయి, యిలా తెల్లారి లేస్తే తగవులు పడ్డం – యిదేం సుఖవు? మీకు మతులుండవా? లేకపోతే, అందులో ఏదో పురుగుండి అలా దొలుస్తుంటుందా?!’
ఏం చెప్తారా జనం ? యేం చెపితే నాయుడికి బోధపడుతుంది.!’ కధకుడు ప్రశ్నించడంలో దొరకబుచ్చుకోవలసిన జవాబు ఏదయితే వుందో – అది ఆర్తి కధ ద్వారా అందాల్సిందేదయితే వుందో – అదేనని మనకు అర్ధమవుతుంది.
స్థిరపరిచిన విలువలే చిరాయువుగా ఎందుకు నిలుస్తున్నాయో – కొత్త విలువలు ఎందుకు తలెత్తడం లేదో – తలొంచుకున్న జనం తలెత్తినపుడల్లా అవి నేరాలుగా ఘోరాలుగా ఎందుకు కనిపిస్తున్నాయో – జనం తమకి తామే శత్రువులుగా ఎందుకు నిలుస్తున్నారో – ఒకే కుటుంబమయిన వాళ్ళు వైరి పక్షాలుగా ఎందుకు మిగులుతున్నారో – నెయ్యాలు మాని కయ్యాలాడి కాట్ల కుక్కలెందుకవుతున్నారో ఏలుబడి చేసిన వాళ్ళకు ఏలిన వాళ్ళకి ఎరిక లేదనా?
అదెంత గాంధీ రాజ్యమయినా .. అది ‘రాజ్యమే’ కదా?!

సరే, మరి రెండో విడత పంచాయితీలో తగువుకి మూల కారణమేమిటో నాయ్డు అడిగినా ఎర్రెమ్మ గాని, తరుపున వచ్చిన వాళ్ళు గాని చెప్పలేకపోయారు. నారాయుడే రెండు పక్కల వున్నదేటో చెప్పాడు. అది కూడా చేతనైనంత నిష్పక్షపాతంగా వివరించాడు. నిజానికి నారాయుడు తన తల్లి తమ్ముళ్ళ కుటుంబం పక్క కదా మాట్లాడాలి. మరెందుకు మాట్లాడలేదలగ? భయం! కాదనేస్తారని భయం! తమ్ముడు కోటయ్య చేసిందానికి తప్పని ఒప్పుకోవడం వల్లే కాదు, ఎర్రెప్ప ఒంటరిదని దారీ తెన్నూ లేనిదని అవతల పక్షము వహించి మాట్లాడడంలో నిజమూ వుంది, తగవరితనంలో అంతకు మించిన బతుకు భయమూ వుంది.
అది సరే, చివరాఖరికి ‘ఎళ్ళి నీ అల్లుణ్ని బతిమాలి తీసుకుపో ‘ అని తీర్పిచ్చి నాయ్డు ‘.. ఉసూరు తగలడం జయం కాదు’ అని బంగారిని హెచ్చరించి వెళ్ళిపోయాడు.

కధ ముగిసి పోయిందా? సమస్య తీరి పోయిందా? అప్పటికి తీరినట్టుగున్నా మళ్ళీ తలెత్తదా? బతుకు భయంతో ఆసరా కోసం ఆదరువు కోసం కూతురు సన్నెమ్మని ఎర్రెమ్మ ఎనక్కి లాగదా? నా బతుకూ నా కోడలూ నా హక్కూ అని బంగారి ముందుకు లాగదా? అటులాగ యిటులాగా – ఎక్కడున్నది అక్కడే వుండదా? చెప్పినట్టుగా నడిచిపోతే, నాయ్డు ఇంతకాలంగా యిస్తున్నతీర్పులకి మాల పేట నిసంకుడయి పోవాల కదా?! అవుద్దా? అవదు! కుక్కల్లా కాట్లాడుకుంటూనే వుంటారు … యిక ముందూ – మనముందూ-
ఎర్రెమ్మకు బుద్ధుంతే బువ్వ తింటాదని నాయ్డు లోపాయికారాన చెప్పినట్టుగే – రాజీ పడి, తగువులు మాని నిగ్రహించుకొని మంచి చేసుకొని మసలుకోగలదా? బంగారో మాటంటే వాగే నోరు మూగయిపోగలదా? ఎన్నాళ్ళు నోరు కుట్టుకుంటాది? అదువు బతుకు కాదా? ఒక్కడే బతకలేక సతమతమై పోయిన పైడయ్యతో కూతుర్నంపి పట్నంలో కాపరమెత్తించగలదా? కడుపు నింపగలదా? కాలం దాటగలదా? ఏమో –

అదొక ఆశ .. ముందటికున్న దారి .. దారి కానీ దారి ..
కోడిగుడ్డు వారిస్తే సట్టిడు! నిజమే గాని, గుడ్డు దానికదే పిల్లయి పోదు కదా. అటుకెక్కించి పొదిగించాలా? అందల కరిగినవెన్నో .. పొదిగినవెన్నో .. ఎన్నో కొన్ని .. అవయినా కాకులకీ గద్దలకీ పిల్లులకీ పీడలకీ దొరక్కండా వుండాల. అంత వార్సాలంటే భూదేవికున్నంత ఓపికా సహనమూ వుండాల… రేపటి మీద నమ్మకముండాల ..
ఆశ కనబడితే శ్వాస ఆడుతుంది…
అవన్నీ కడుపు నిండిన మాటలు … నాయుడే అన్నట్టు ‘కడుపెప్పుడు నిండదో కానీ బుద్దులప్పుడు తప్పవు.’ మరి కడుపు నిండని ఎర్రెమ్మ యివన్నీ కానుకో గలదా? కాసుకో గలదా? ఇయాల దినం తీరడం గురించి తప్పితే, రేపటి దినం గురించి ఆగగలదా? ఆలోచించగలదా?
నాయ్డు మాట మీద నాయురాలు – పులుసొక్కటే కాదు! అన్నం, ఆకులో కూర పెట్టి ఏవేవీ మిగిలితే అవన్నీ యిచ్చినా – ఆ పూటకే. నాయుడి మాట మీద నడవడం ఆ రోజుకే. నెలా పది తిరిగీ సరికి దెబ్బలు మానిపోయినట్టుగే సుద్దులు మరిచిపోయి మళ్ళీ మొదటికే రాదా? ‘ఆర్తి’ .. పీడ, దుఃఖము, మనోవ్యధ, రోగము పోదా? వింటికొన మీద బతుకు కాదా?
అందుకు సాక్ష్యంగా పైడయ్యకు అన్నం తినక పోతే ఆకలి. తినబోతే వెలపరం. నిజమే, ‘మోచేతి కూడు’ అని ఎంచితే – ఎంచడానికి లేనిదేవుందా గుడిసలో?, పెళ్ళాంతో కలిపి. పెళ్ళామే కాదు, తన బతుకులోనయినా ఎంచలేనిదేదయినా వుందా పైడయ్యకి? పైడయ్యకే కాదు, మొత్తం మాల పేటోళ్ళకి? పైడయ్య పని చేసే పట్నంలో అయిదో వంతు జనాభాకి?
ఆకలైనా అప్పటికి పైడయ్య చెయ్యి కడిగేసుకోవచ్చు. కానీ తర్వాతయినా కతక్కా తప్పదు. కక్కకా తప్పదు! కక్కిన కూడు తినకా తప్పదు!! అందుకేనేమో ‘కక్కిన కూడు తినే కూడదు, తింటే కడుపు నిండా తినాల’నీ అంటారు.

సరి సరే .. కడదాకా కధ మారదా అంటే మారాల్సినవేవో మారనంత కాలం మార్సనంత కాలం యింతే. కవుకుల పడిపోడమే.
ఈ కవుకుల్లో అల్లకల్లోలమయి పోయిన బతుకు బతికినోలకి – సహజాతాలైన ఆకలి, కామం, నిద్ర, భయం… ఒకటేవిటి అన్నీ అసహజమయిపోతాయి. అందనివై పోతాయి. తప్పించుకోలేనివయి పోతాయి. ఈ మూలాలు దెబ్బ తినీసినాక మనుషులు మనుషులుగా మనలేరు.

‘ఆర్తి’ కధ ద్వారా కాళీపట్నం రామారావుగారు చెప్పిందీ చూపిందీ యిదే!

 -బమ్మిడి జగదీశ్వర రావు

 

bammidi ఎలాంటి సాహిత్య వారసత్వం లేని కుటుంబం నుండి వచ్చిన బమ్మిడి జగదీశ్వరరావు తన పదమూడో ఏట నుండే కధలు రాయటం మొదలు పెట్టారు. అమ్మ చెప్పే కధలతో ప్రారంభం అయిన ఆయన కధాభిరుచి ఇప్పటికి ఐదు కధా సంపుటిలు, అనేక చిన్నపిల్లల కధల సంపుటిలు, జానపద కధలు వేయటానికి దారులు వేసింది. రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టి తీగలు, హింసపాదు వీరి కధా సంపుటిలు. తధాగత ప్రచురణల క్రింద ‘అమ్మ చెప్పిన కధలు’ ఆరు సార్లు రీ ప్రింట్ అయ్యి ఇప్పుడు ప్రతులు దొరకటం లేదు. ఇవి కాక అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, ఊ కొడదాం, అనగా వినగా చెప్పగా, అల్లిబిల్లి కధలు ఇంకా చాలా జానపద కధలు పుస్తకాలుగా వచ్చాయి. అవార్డ్స్ కి దూరంగా ఉండే బజరా నేటి తరం రచయితలు ‘రాయకుండా ఉండలేక పోవటం’ కాకుండా ‘ప్రచారం లేకుండా ఉండలేక పోవటం’ గురించి అసంతృప్తి వెలిబుచ్చారు. బజరాకు చాలా మంది రచయితలతో పాటు కారా మాష్టారు, పతంజలి అంటే ఇష్టం.       

 వచ్చే వారం ‘మహదాశీర్వచనం’ కధా పరిచయం కాత్యాయని విద్మహే 

 

 ఆర్తి కథ ఇక్కడ:

 

నిలకడగా వుండనివ్వని ‘అప్రజ్ఞాతం’

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

ఋతువులతో పాటు రూపు మారే పొలాలు .. ‘బాయల్స్ లా’, ‘న్యూటన్స్ లా’ లతో కొంత సైన్సు .. మానవుని  కోర్కెలు అనంతాలు, శ్రమ నశ్వరము లాంటి పదాలతో అర్థశాస్త్రం .. డెబిట్లు, క్రెడిట్లు, లాభనష్టాల ఖాతాలతో గణకశాస్త్రం .. “మానేజ్ మెంట్ అంటే మిగతావారితో పని పూర్తి చేయించుకోవడం” వంటి నిర్వచనాలతో మానేజ్ మెంట్ చదువులు… తద్వారా ఉద్యోగంలో కుదురుకున్నా, అంతరంగం కుదుటపడలేదు. కుదరని రకరకాల చదువుల మధ్య సమన్వయం, జీవితానికి వీటితో అన్వయం.. ఇవి పూరింపబడని ఖాళీలుగా ఉండిపోయాయి.

అటువంటి స్థితిలో ‘అప్రజ్ఞాతం’ కథ చదవటం జరిగింది. చదివాక అది నిలకడగా కూర్చోనివ్వలేదు. ఏదో హాంటింగు.. ఒక స్లైస్ ఆఫ్ లైఫ్.. జీవితంలో పూర్తిగా జరగటానికి వీలున్న ఒక సంఘటన నా కళ్ళముందు జరిగినట్టు.. ఆ సంఘటనలో నేనూ పాలుపంచుకున్నట్టు.. అదీ ఒక పాత్రగా కాకుండా, పలు పాత్రలతో ఐడెంటిఫై ఔతూ.. కొంత సేపు అభిమన్యుడులా అందరి మధ్య చిక్కుకున్న ‘సుదర్శనం’లా, ఇద్దరు రైతులు ‘బుచ్చిలింగం’ ఇంకా ‘బైరాగి’ లను కలిపేసి రెండుగా విభజిస్తే వచ్చే పాత్రలా కాసేపు. నాకు తెలిసిన అనేకమంది నా పక్కన కూర్చుని ఉంటారు. నాకు తెలిసిన మాటలే వాళ్ళు మాట్లాడతారు. అవే అనుమానాలు వ్యక్తం చేస్తారు. తమ పట్ల సానుభూతి వ్యక్తం చేసే వారినే వేళాకోళం చేస్తారు. నాకు తెలిసిన షావుకార్లు ఇద్దరు ‘సూరప్పడు’ రూపంలో గుళ్ళోకి వస్తారు.

మళ్ళీ చూస్తే మానేజ్ మెంటు డెవలప్ మెంట్ ప్రోగ్రాములో ఇచ్చిన కేసు స్టడీ పేపర్లా కనిపిస్తుంది.

రూపాయి బిళ్ళగా ఘనీభవించిన చెమట దొర్లుకుంటూ ఏ ఏ మజిలీలు చేసుకుంటూ చివరకు ఎక్కడికి చేరుతుందో చూశాను. ఉత్పత్తి కారకాలు శ్రమ, భూమి, పెట్టుబడి, నిర్వహణలు తమ కంట్రిబ్యూషన్ కు ప్రతిఫలంగా వేతనాలు, రెంటు, వడ్డీ, లాభాలుగా పంచుకుంటాయని ఎకనామిక్స్ లో బోధిస్తారు. ఐతే నిజ జీవితంలో ఈ పంపకం, ప్రత్యేకంగా వ్యవసాయంలో 40/50 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అర్ధమైంది. జరిగే ఈ ప్రక్రియకు సాంఘికామోదం ఉండటం/ఉండేటట్టు చేయడం సిస్టం గొప్పదనం.

నిజానికి ఈ సిస్టం బ్రేక్ చేయలేనంత గట్టిదేం కాదు. రైతులు పెట్టుబడి కోసం అప్పు చెయ్యకుండా, స్థిరాస్థి ఐన భూమిని కొంత , చరాస్థి ఐన బంగారాన్ని కానీ పెట్టుబడిగా మర్చుకున్నా సమస్య కొంత తీరుతుంది. సుదర్శనం మాటల్లో “ఒక సామాన్యరైతుకి ఏటా కావలసిన వ్యవసామదుపు నాలుగైదు వందలు. భార్య వంటిని ఆ విలువకు మించిన బంగారం ఉంటుంది. అది తియ్యడు. పాతికసెంట్ల పొలమమ్మినా ఆ మదుపు చేతికొస్తుంది. ఆ పనీ చెయ్యడు.” (మార్కెట్టు, ధర ఇవి కూడా నిజానికి పెట్టుబడితో ప్రభావితమౌతాయి.) ఐతే ఆస్తి, బంగారం కుదువ పెట్టటానికి ఉన్న సోషల్ యాక్సెప్టెన్స్, ఆస్తి అమ్మకానికి లేదు. ఈ ప్రోసెస్ లో రైతు బంగారాన్ని, భూమినీ కూడా పోగొట్టుకుంటాడు.

కథలోనే సమస్యా, పరిష్కారం రెండూ ఉన్నాయి.

దెబ్బతినేవారికి దెబ్బతగిలిన విషయం అర్ధమౌతుంది కాని దెబ్బతగిలే క్రమం తెలియట్లేదు. ఆ క్రమం నాకు ఈ కథ తెలిపింది.

–ముళ్ళపూడి సుబ్బారావు

SRMullapudi

 

 

ముళ్ళపూడి సుబ్బారావు అంటే ‘రెండు నదుల మధ్య’ కధ గుర్తుకు వస్తుంది. 1995 ఆహ్వానం పత్రికలో ప్రచురించబడిన ఈ కధ తరువాత ఋతుపవనాలు, కధ 95, రెండు దశాబ్ధాల కధ సంకలనాలలో వచ్చింది. తరువాత వీరు రాసిన ‘పాలపుంత’ కధ ఆహ్వానం పత్రికలో వచ్చింది. చివరిగా 2011 లో ‘ఋణం’ కధ ఆదివారం అనుబంధంలో వచ్చి కధా 2011 లో ప్రచురితం అయ్యింది. ఇవి కాక సుబ్బారావు అనువాదం చేసిన ఏడు కధలు విపుల, ఆహ్వానం పత్రికల్లో వచ్చాయి. తనను తాను ఎక్కువగా పాఠకుడిగా పరిగణించుకొనే సుబ్బారావు ఒక దశలో ‘వసుంధర’ కధలు ఎక్కువగా చదివారు. తరువాత తిలక్, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు కధలు, ఆ పై గురజాడ, కాళీపట్నం, రఘోత్తమరెడ్డి కధలు ఇష్టపడ్డారు. సుబ్బారావుకి చార్లెస్ డికెన్స్, టాల్ స్టాయ్ రచనలు చాలా ఇష్టం.

 

వచ్చే వారం: బమ్మిడి జగదీశ్వరరావు  ‘ఆర్తి’ కధ పరిచయం

అప్రజ్ఞాతం కథ ఇక్కడ:

 

అదనపు విలువపై అధికారం నిర్ధారించే ‘తీర్పు’

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

 

తీర్పు వొక రాజకీయ కథ. అదొక పాఠం కూడా . శ్రామిక వర్గ దృక్పథం ఆ కథకి ఆయువుపట్టు.

రచయిత తాను నమ్మిన భావజాలాన్ని గానీ, తన ప్రాపంచిక దృక్పథాన్ని గానీ సాహిత్యంలో చెప్పడం వల్ల కళాత్మక విలువలు దెబ్బతింటాయని వొకప్పుడు కేవల అనుభూతి వాదులూ, ఆ తర్వాత శుద్ధ రూపవాదులూ , యిటీవల వామపక్ష ప్రగతిశీల దృక్పథాన్ని వ్యతిరేకించడమే ఫ్యాషన్ గా మార్చుకొన్న కొంతమంది పోస్ట్ మాడర్నిస్టులూ సణిగే సణుగుళ్ళూ  కూసే కూతలూ రాసే కొక్కిరాయి రాతలూ పస లేనివని నిర్ద్వంద్వంగా తిరస్కరించడానికి నిండైన వుదాహరణ 64 లో కాళీపట్నం రామారావు మాష్టారు రాసిన ‘తీర్పు’ కథ . నేనీ మాటలు యింత నిక్కచ్చిగా చెప్పడానికి బలమైన కారణాలే వున్నాయి. ‘తీర్పు’ కథలో కారా ప్రతిపాదించదలచుకొన్న సారం రూపానికి హాని చెయ్యలేదు. వస్తు నిర్వహణకి శిల్పం యెలా దోహదం చేస్తుందో లోతుగా తెలిసిన రచయితగా మాష్టారీ కథలో దర్శనమిస్తారు. వస్తువుకి విధేయమైన శిల్పం మాత్రమే పాఠకుణ్ణి యెటూ మెదలనివ్వక కట్టి పడేస్తుంది. వస్తు ప్రధానమైన యీ కథలో దృష్టి యెంతసేపూ సారం మీదే వుండేలా చేయడానికి కథా నిర్మాణ విషయంలో రచయిత తీసుకొన్న శ్రద్ధ ప్రతి పదంలోనూ  గోచరిస్తుంది.

పెట్టుబడులు – వనరులు – వుత్పత్తి సాధనాలు – శ్రమ – వుత్పత్తి ఫలాల గురించి , వాటి అదుపు గురించి మార్క్సిజం చెప్పిన సూత్రాలను అర్థం చేసుకోడానికి ‘తీర్పు’ కథ వొక పాఠంలా నాకెంతో తోడ్పడింది. తరగతి గదిలో భాషాధ్యాపకుడిగా సామాజిక శాస్త్రాంశాల్ని అన్వయిస్తూ సాహిత్యాన్ని బోధించే స్వేచ్ఛ వుండడం వల్ల ‘ తీర్పు’ కథని యెన్నో సందర్భాల్లో పిల్లలకి చదివి వినిపించాను, చేతిలో కథ లేనప్పుడు మౌఖికంగా చెప్పాను. ప్రతిసారీ కథలోని సారం మీద చర్చలు జరిగేవి. సుందర రామయ్య రెండో కొడుకు ఇచ్చిన తీర్పుకే అంతిమంగా ఆమోదం లభించేది. మాష్టారి తీర్పు కథని తొలిసారి నేనెప్పుడు చదివానో గుర్తులేదు కానీ – కథలోని ‘ రెండోవాడు’ నన్ను జీవితం పొడవునా ఆవహించిన హీరో అయ్యాడు. అతని నిర్ణయాత్మక ధోరణి , తర్కబద్ధమైన వాదనా పటిమ , చూపులో చురుకుదనం , మాటలో నైశిత్యం, ముక్కుసూటిదనం , హేతుదృష్టి , అభిప్రాయ వ్యక్తీకరణలో నిక్కచ్చిదనం, ఆశయసాధన పట్ల సడలని పట్టుదల , ఆధిపత్య నిరసన , తిరుగు బాటు తత్త్వం వంటి అనేకానేక గుణాలు నాకాదర్శమయ్యాయి.

మానవ శ్రమే సమస్త సంపదల సృష్టికి కారణమైనప్పుడు దానిమీద సర్వ హక్కులూ – అనుభవించడం, పరిరక్షించడం, పంచడం యేవైనా కావొచ్చు – అవి శ్రమ చేసినవారికే చెందుతాయన్న మార్క్సిజం మౌలిక సూత్రాన్ని అతి సరళంగా కళాత్మకంగా ఆవిష్కరించిన ‘తీర్పు’ కథ వొక విధంగా అన్యాపదేశ కథ.  అన్యాపదేశ కథల్లో అంతరార్థం తెలిసీ తెలియనట్టుగా దాగుడుమూతలాడుతూ మంచుపొర కింది పువ్వులా గోచరం కావడం వొక టెక్నిక్. అయితే వొక్కోసారి రచయిత చెప్పదల్చుకొన్న అంతరార్థం పాఠకుడికి అందదు. అలా అందక పోయినా రచయిత ప్రతిభ కారణంగా ఆ లోటు కనపడదు. పాత్రలూ సన్నివేశాలూ సంభాషణలూ సంఘటనలూ అన్నీ కలిసి వొక కథగా హాయిగా చదువుకోడానికి యెటువంటి  యిబ్బందీ కల్గదు. అంతరార్థం ద్యోతకం కాపోయినా అది కథగా మనగల్గుతుంది – యిది మరో టెక్నిక్. ‘తీర్పు’ కథలో అర్థం నిగూఢం  కాదు. అలా అని పూర్తిగా బహిరంగం కాదు. చదివిన ప్రతిసారీ పదాలపైనా పాత్రలపైనా  కొత్త కాంతి ప్రసరిస్తుంది. పదాల మధ్య, వాక్యాల మధ్య , నిశ్శబ్దంలోనూ దాగివున్న లోతుని ఆనందించగలం. పాత్రలు ప్రతీకలుగా గాక నమూనాలుగా కళ్ళముందు నిలుస్తాయి. జీవిత సత్యాల్ని బోధపరుస్తాయి. ఒక యింట్లో దేశం, వొక కుటుంబంలో సమాజం , అందులోని భిన్న వ్యవస్థలూ ఆవిష్కారమౌతాయి. ఆ యా సన్నివేశాల్లో పాత్రల మాటలూ చేతలూ ఆలోచనా సరళీ నడవడికా అందుకు దోహదం చేస్తాయి. వాటిని విశ్లేషించుకొనే  ముందు స్థూలంగా వొకసారి కథలోకెళ్దాం :

సుందర రామయ్యకి నలుగురు మగపిల్లలు. కడగొట్టుది ఆడపిల్ల. పెద్దవాళ్ళు ముగ్గురూ హైస్కూలుకు పోతున్నారు. రెండోవాడికి బళ్ళో అట్టలు చేయడం నేర్పేరు. అలాంటివి బళ్ళో చేసి అమ్మేరు. ఒక్కొక్కటి ముప్ఫై నయా పైసలకమ్మేరు. పెద్దవాడు అర్థరూపాయి ఖర్చుతో అరడజను చేయవచ్చని కనిపెట్టేడు. బజారులో ఆ అట్టలే ఒక్కొక్కటి ఆరణాలని చెపితే వాళ్ళ అమ్మ అర్థ రూపాయి యిచ్చింది. ఉన్నవాళ్ళు ఐదుగురే కాబట్టి అయిదు అట్టలే చేసుకుందామన్నారు. మిగిలిన డబ్బు – ఒక అట్టమీద అధికంగా పెడితే అది అందమయిన కాలికో అట్ట అయింది.

తాను పెద్దవాడు కాబట్టి, తనది పెద్ద క్లాసు కాబట్టి, ఆ అందమైన అట్ట తాను తీసుకుంటానన్నాడు పెద్దవాడు. అలా వల్ల కాదు నేను తీసుకుంటానన్నాడు రెండోవాడు – తల్లి మొదట పెద్దవాడికే యిచ్చేయమంది. రెండోవాడు వాదిస్తే వాడికే ఇచ్చేయబోయింది. తగువు తెగకపోవడంవల్ల తండ్రి దగ్గరకు వచ్చింది.

ఇక్కడ నుంచి అసలు కథ మొదలైంది. కుటుంబం దానికదే వొక యూనిట్ అయినప్పటికీ  సమాజం లోని అన్ని దృగంశాలూ అక్కడా వుంటాయి. కుటుంబంలో అందరూ సమానమేగానీ కొందరు ఎక్కువ సమానం. దానికి కారణాలు సవాలక్ష. పాతుకుపోయిన భూస్వామ్య విలువలు, అయాచితంగా ప్రవహిస్తూ వచ్చే పితృస్వామ్య భావజాలం, ప్రశ్నించరాని సంప్రదాయాలూ ఆచారాలూ,  జెండర్ వివక్ష, వ్యక్తుల బలాలు – బలహీనతలు, ప్రత్యేక ప్రేమాభిమానాలూ, నిర్వచించలేని వుద్వేగాలూ యిటువంటివన్నీ అక్కడ సంబంధాల్నిశాసిస్తాయి. నిర్ణయాల్ని నిర్దేశిస్తాయి.

కుటుంబ పెద్దగా సర్వాధికారాలూ సొంతం చేసుకొన్న సుందర రామయ్య న్యాయమూర్తి స్థానంలో కూర్చొని సమస్యని తన పెద్దరికంతో సులువుగా పరిష్కరించొచ్చు అనుకొన్నాడు. అయితే అతను ప్రజాస్వామ్య పద్ధతిని యెంచుకొన్నాడు. అసమానతల వ్యవస్థలో ప్రజాస్వామిక సంప్రదాయం యేమేరకు సరైన న్యాయం చేయగల్గుతుందో అతనికి తెలియదు. నిజానికతనికి యీ తగువు అంతగా నచ్చలేదు. అతను వర్తమానంలో యెంతగా జీవించాలనుకొంటాడో అంతగా వెనకటి కాలాన్ని ప్రేమిస్తాడు.

‘తన పిల్లలు త్రేతాయుగం నాటి శ్రీరామచంద్ర సోదరులను తలపిస్తూ, ఒక్కటిగా ఉండాలని అతని అభిమతం.’

ఎంత ప్రజాస్వామికంగా వుందామనుకొన్నా సుందరరామయ్య రక్తంలో దాగున్న ఫ్యూడల్ విలువల అవశేషాలు అతన్ని యిబ్బంది పెడ్తూ వుంటాయి. పెద్దకొడుకు తన ఔరసుడన్నభావన అతనిలో బలీయంగానే వున్నట్లుంది. వాడికి తన తండ్రి పేరే పెట్టుకొన్నాడు. వాడి పట్ల ప్రత్యేకంగా పక్షపాతం చూపించినట్లు కనపడకూడదని ప్రయత్నపూర్వకంగా ప్రజాస్వామిక కండువాని సర్దుకొంటూ వుంటాడు.

పెద్దవాడు – తెల్లగా నాజూగ్గా స్టయిలుగా వుంటాడు. కళ్ళల్లో కొంత తెలివి కూడా కనపడుతుంది. పెద్దకొడుక్కే వారసత్వపు హక్కులు వుంటాయన్నసంప్రదాయం వాడికి తెలిసినట్టే కనపడుతుంది. అందువల్ల పెద్ద అట్ట తనకే  దక్కాలని వాడి అభిమతం. తమ్ముడి ప్రతిఘటనతో వాడి అభిమానం దెబ్బతింది. దాన్ని దాచుకోడానికి బేలగా ప్రయత్నిస్తూ వున్నాడు. కానీ తండ్రి ప్రేమ తనవైపే మొగ్గుతుందని గట్టి నమ్మకం. తండ్రి తీర్పు తనవైపేనని వాడికి  భరోసా .

రెండోవాడు కాస్త బండగా వుంటాడు. వాడి మూసి వుంచిన పెదవుల్లో పట్టుదలా, తెరచి ఉంచిన కళ్ళల్లో నిబ్బరం కనిపిస్తాయి. చూసేవాళ్ళకి, వాడితో కొంచెం జాగ్రత్తగా వుండడం మంచిదనిపిస్తుంది. వాడి గురించి తండ్రికి ముందే కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి.

‘వాడు ప్రతిదానికీ యిట్టే సీరియస్ అయిపోయే రకమని సుందర రామయ్య అంతకుముందే వాడిని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొన్నాడు.’

నిజానికి న్యాయమూర్తికి యిటువంటి పూర్వ నిశ్చయాలు – ప్రిజుడీస్ వుండకూడదు. కానీ వాడిని కన్నతండ్రిగా అలా అభిప్రాయపడే హక్కు కూడా అతనికి సహజంగానే వుంటుంది. ఈ ద్వైధీభావం, సంఘర్షణా కథ పొడవునా అతనిలో కనిపిస్తూనే వుంటాయి. ప్రజాస్వామిక విలువలు వొక వైపు, భూస్వామ్య భావజాలం మరొకవైపు అతను మధ్యలో వేలాడుతూ వుంటాడు. అయితే తనలోని యీ వైరుధ్యాన్ని కనపడనివ్వని గాంభీర్యం కూడా అతను ప్రదర్శిస్తాడు. మార్క్సిస్ట్ పరిభాషలో – జార్గాన్ అనుకోకుంటే – అతణ్ణి సెమీ ఫ్యూడల్ అనొచ్చు.

అందరికీ సమన్యాయం ప్రసాదించిన రాజ్యాంగం వంటిది తల్లి. అర్థ రూపాయి పెట్టుబడి పెట్టిన కారణంగా పరిష్కారాన్ని తన చేతుల్లోకి తీసుకోవచ్చుగానీ ఆమె స్వేచ్ఛకీ పరిమితులున్నందువల్ల తగువుని వున్నత న్యాయపీఠానికి తీసుకువచ్చింది.  ఆమె నిర్ణయం చెయ్యలేక పోడానికి ఆడబిడ్డ – సుందరరామయ్య అక్క – కూడా కొంతవరకు కారణం కావొచ్చు.

సుందర రామయ్య అక్క పాత్రని రచయిత రాజ్యాంగేతర శక్తికి నమూనాగా తీర్చిదిద్దారు. అది మత ధార్మిక శక్తి కావొచ్చు;  ఆధునిక న్యాయ గ్రంధాల్లోకి బలవంతంగా చొచ్చుకొచ్చే కాలం చెల్లిన స్మృతులు కావొచ్చు.  చాలా సందర్భాల్లో యీ శక్తులు న్యాయవ్యవస్థని శాసిస్తాయి. అనూచానంగా వస్తున్న సంప్రదాయాల్నీ రీతీ రివాజుల్నీ ధర్మం పేర్న న్యాయంగా చెలామణీ చేయించాలని కంకణం కట్టుకొని ప్రయత్నిస్తాయి. అందుకే –

‘చిన్నప్పుడు తమ పుట్టింట్లో వారాలబ్బాయే యివ్వాళ తను హాజరయిన కోర్టులో జడ్జిగా కనిపించినట్టు ఆ అప్పగారు తమ్ముడి వంక ధీమాగా చూస్తోంది.’

విచారణ ప్రారంభమయ్యేసరికి  – దాదాపు అనగనగా కథలా మొదలైన కథ నాటకంగా రూపొందుతుంది. వాదాలూ ప్రతివాదాలూ సంభాషణలూ ఆంగిక సాత్త్వికాల్తో నిండిన పాత్రల హావభావాల్తో పాఠకుడి కళ్ళముందు వొక కోర్టు దృశ్యం సాక్షాత్కారమౌతుంది. ఇది శిల్పానికి సంబంధించిన అంశం. ఈ కథలో శిల్ప చర్చ అంత ప్రధానం కాదు. వస్తు నిర్వహణ ముందు అది గౌణమైపోయింది. వస్తువుకి శిల్పంతో  స్వచ్ఛందంగా వూడిగం చేయించడం కారా కథల్లో విశిష్టత. ‘ఈ తగువులింక నే తీర్చలేను’ అన్న వుత్కంఠభరితమైన వాచికంతో కథ యెత్తుగడ దగ్గరే  ఆ చాకిరీ మొదలైంది.  మళ్ళీ కథలోకెళ్తే …

నాల్గో పిల్లడు – తానందరికంటే చిన్నవాడు కాబట్టి యెంచుకొనే అవకాశం తనకివ్వాలంటాడు. ఇది బలహీన వర్గాల రిజర్వేషన్ విధానంలా వున్నప్పటికీ నిజానికి యింకా చిన్నది ఆడపిల్ల వుంది – రిజర్వేషన్ అమలు కావాలంటే  – అట్ట ఆ పిల్లకు చెందాలి. అయితే ఆ పిల్లకి తన హక్కులు వినియోగించుకొనే / సాధించుకొనే తెలివీ చొరవా యింకా యేర్పడలేదు.

మూడోవాడి దృక్పథం, ఆచరణా యిందుకు భిన్నం. అట్టల తయారీలో వాడి శ్రమ కూడా కొంత వుంది. ‘అవసరం’ దృష్ట్యా పెద్ద అట్ట తనకివ్వమంటాడు. లేదంటే అన్నివిధాలా శ్రమ చేసి అట్టలు సృష్టించినవాడు రెండవవాడే కాబట్టి వాడికివ్వడమే న్యాయమంటాడు. ప్రజాసంఘాల వాళ్ళు న్యాయానికి వత్తాసు పల్కినట్టు రెండోవాడి తరపున వకాల్తా తీసుకొన్నాడు. అట్టల ఐడియా పెద్దవాడిదే అయినప్పటికీ ‘ఒట్టి ఐడియా’లకు అట్టలు పుట్టవన్న భౌతికోత్పత్తి రహస్యాన్ని  వెల్లడించాడు. వనరులూ పెట్టుబడులూ యెవరికైనా సమభావంతోనే రాజ్యం సమకూర్చాలనే రాజ్యాంగ నైతికతని కూడా గుర్తు చేసాడు. రెండోవాడికి యింతకు ముందే తల్లి యిచ్చిన నైతిక బలం వుంది. ఇప్పుడు తమ్ముడి న్యాయబద్ధమైన తోడ్పాటు లభించింది. నిజానికి వాడికి అన్న పెద్ద ప్రతిద్వంద్వి కూడా కాదు. ఇక తన శ్రమఫలం మీద అధికారాన్ని స్థాపించుకోవాలంటే రెండు అడ్డంకుల్ని అధిగమించాలి. ఒకటి న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న తండ్రి – రెండు తండ్రి  నోటినుంచి తీర్పు వచ్చేలోపే దాన్ని ప్రభావితం చేసే మేనత్త.

తండ్రి మొఖానికి తగిలించుకొన్న  ప్రజాస్వామ్యంతోనే అతనిలో దాగివున్న ఫ్యూడల్ విలువలకి గండికొట్టాలి,  మొత్తం న్యాయప్రక్రియ పైనే ధాష్టీకం చేయగల మేనత్త యేకరువు పెట్టే ధర్మపురాండాలని కట్టడి చేయాలి. లేకపొతే తనకు న్యాయం దక్కదని రెండోవాడు గ్రహించాడు. ఇంటికి పెద్దవాడూ తండ్రి తర్వాత తండ్రంతటి వాడూ లేదా తండ్రికి తల కొరివి పెట్టేవాడూ కాబట్టి తీర్పు పెద్దవాడికి అనుకూలంగా మారకుండా జాగ్రత్తపడ్డాడు.

‘ఇంటికి పెద్దవాడు కదా – ఎప్పటికైనా – మీ తరువాత ….’ అన్న అసంపూర్ణ వాక్యంతో తండ్రి ముందు కాళ్ళకి బంధం వేశాడు. పెద్ద కొడుకు వైపు తీర్పునిస్తే అది పక్షపాతంతో కూడినదన్న అపవాదునెదుర్కొవాల్సి వస్తుంది కాబట్టి సుందర రామయ్యకి తన  ‘ధర్మ నిబద్ధత’ని నిరూపించుకోక తప్పని పరిస్థితి కల్పించిందీ వాక్యం. న్యాయ ప్రక్రియపై రెండోవాడి తొలి పట్టు యిది.

ఇప్పటిదాకా సుందర రామయ్య యెదుర్కొన్నది బాహిరమైన సంఘర్షణే. ఇక యిప్పుడు అంతరంగ మథనం ప్రారంభమైంది. అతని హృదంతరాళాల్లో గూడు కట్టుకొని వున్న ఫ్యూడల్ నీతి వొళ్ళు విరుచుకొంది. రెండోవాడికి అందమైన అట్ట దొరకుండా చేయడానికి దారులు వెతుకుతున్నట్టు ప్రవర్తిస్తాడు.

మేనత్త  ‘లోకాచారాలూ, సబవులూ’ మాట్లాడడంతో  – తల్లి మౌనంగా వుండలేకపోయింది. ‘పెద్దవాడి వంతు వాటా వేయడం – చిన్నవాళ్ళు ఎత్తుకోవడం రివాజు’ అని నోరు విప్పింది. మేనత్తకి కౌంటర్ యిచ్చేటప్పుడు రెండోవాడి గొంతులో ధ్వనించిన వెటకారం, కరకుదనం,  న్యాయమూర్తి పట్ల చూపే వొక విధమైన అవిధేయత సుందరరామయ్యకి విసుగు పుట్టించాయి. వాడి ధిక్కారం నెగ్గకూడదని అతను నిర్ణయించుకొన్నట్టు చూపుల్లో మాటల విరుపుల్లో తెలుస్తూ వుంటుంది. వాడి దేహ భాషా, వచో వైఖరీ, ప్రవృత్తీ అతనికి భయం కల్గించాయేమో కూడా. సంభాషణల్లో వినిపించే కాకువూ పాత్రల స్పందనల్లో రచయిత చెక్కిన సున్నితమైన భాషాశిల్పం ఆయా సందర్భాల్లో వ్యక్తుల మనస్తత్వాన్ని కళ్ళకు కట్టడానికి అమోఘంగా వుపయోగపడ్డాయి.

భార్య చెప్పినట్టు  నాలుగో వాడికిద్దామని సుందర రామయ్య  ప్రతిపాదించాడు. ఆడపిల్లకి – అందరికన్నా చిన్నదైనా – యీ పంపకంలో వాటా గురించి అతను ఆలోచించడు.

‘ఆడపిల్ల కదా అని ఆడపిల్లకిచ్చేయడం ఆడదాని వ్యవహారమనిపించింది సుందరరామయ్యకి.’ అతనిలోని ఫ్యూడల్ మనస్తత్వానికి యిక్కడికొచ్చేసరికి దాపరికాలక్కరలేకపోయాయి.

అప్పటికే నాల్గోవాడు సాదా అట్టకి సర్దుకొన్నాడని రెండోవాడు చెప్పినప్పుడు –

‘చదరంగం ఆడే ఆసామి ‘ఆటకట్టు’ ఎత్తువేశాకా చూసే చూపు వాడి కళ్ళల్లో కనిపించింది’  సుందర రామయ్యకి.

ఇది న్యాయాన్ని తనవైపు  తిప్పుకొనే క్రమంలో రెండోవాడి మలి విజయం. తాననుకొన్న తీర్పు యివ్వలేకపోతున్నందుకు న్యాయమూర్తికి ‘క్రమంగా చిరాకు ప్రారంభమైంది.’

సుందర రామయ్యలో వున్న సమస్త వైరుధ్యాలూ మూకుమ్మడిగా అతని మీద దాడిచేశాయి.

పెట్టుబడి తనదే కాబట్టి – సంపదనంతా జాతీయం చేసయినా తన ఆధిపత్యం నిలుపుకోవచ్చన్న వూహ కూడా అతనికి వస్తుంది. ‘అట్టలెవరివీ కావని దాచేస్తే’ అనుకొంటాడు. ‘లాటరీ వేస్తే?’ అతనిలో యెక్కడో మిగిలివున్న బలహీనమైన ప్రజాస్వామ్యవాది ఆలోచన. క్యాలికో అట్ట కన్నా మంచి అట్ట తను స్వయంగా చేసి పెద్దవాడికిస్తే  – అని వుద్వేగంతో నిండిన అతని గుండె చప్పుడు చేస్తుంది. ఒక అట్ట వేరుగా చేసినందుకు కోపం వస్తుంది. రెండోవాడు ‘అన్నీ ఒకలాటివే చేసుకుందామ’ని చెప్పినా పెద్దవాడే ప్రత్యేకమైన అట్ట ప్రతిపాదన తెచ్చాడని విన్నాకా అతనికి సమస్య మరింత జటిలమైంది. మొదట్నుంచీ  రెండోవాడే న్యాయమార్గం లో వున్నాడని తేలడంతో దిక్కు తోచలేదు. అలా అని తీర్పు వాడి వైపు చెప్పడానికి కూడా మనసొప్పలేదు. ‘ఎటుపోయినా ఓటమి ఎదురవడం చిరాకుని పెంచుతుంది’. అతని మౌనంతో కోర్టు హాల్లో ‘ఆర్డర్’ దెబ్బతింది.

ఆ బలహీన క్షణాల్ని ఆసరా చేసుకొని గ్రంథాలయాలమీదా ఆర్ట్ మ్యూజియంల మీదా దాడిచేసే మనువాద సాంస్కృతిక సైన్యంలా మేనత్త రెచ్చిపోయింది. ‘చిన్నంతరం – పెద్దంతరం’ గురించి మాట్లాడింది. ఇవ్వాళ అన్నని కాదన్నవాడు రేపు తండ్రిని కాదంటాడని రెచ్చగొట్టింది. పొరుక్కి ఉపకారమంటే పొయ్యార్పుకునే రకమని శీలహననం చేసింది. పరోపకార గుణం గురించి నీతి సూత్రాలు యేకరువు పెట్టింది. న్యాయం కోరేవాణ్ణి నేరస్తుడిగా తీర్మానించింది. వాడు జన్మలో బాగుపడడనీ పుట్టగతులుండవనీ భయపెట్టింది. పాపం చేస్తే పాపం; పుణ్యం చేస్తే పుణ్యం తప్ప యింకేదీ వెంటరాదని సిద్ధాంతీకరించింది.

ఇప్పుడు రెండోవాడు సమస్త కార్మిక వర్గానికీ ప్రాతినిధ్యం వహిస్తూ తీర్పు యివ్వబోతున్నాడు. మేనత్త వూదరగొడుతోన్న అశాస్త్రీయ భావజాలాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాల్సిన సందర్భం వచ్చింది.

‘ – ఒక్క అట్టలు తప్ప’ అని ఆమె మాటలకి ముక్తాయింపు పలికాడు.  యుగాలుగా సంకెళ్ళుగా మారిన విశ్వాసాలను తెంచుకొన్న సవ్వడి ఆ మాటల్లో వొక విలక్షణతతో వినిపిస్తుంది.

తమ హక్కుల్ని స్థిరీకరించుకోవాలన్నా సాధించుకోవాలన్నా తరాలుగా పాతుకుపోయిన అభౌతిక భావజాలాన్ని కూకటివేళ్ళతో పెళ్ళగించాలి – అప్పుడు మాత్రమే కార్మికవర్గ నియంతృత్వాన్ని స్థాపించుకోగల అంతిమ తీర్పుని యివ్వగలం – అన్న చైతన్యం, వుద్బోధ రెండోవాడు పల్కిన మాటల్లో అక్కడందరితోబాటు పాఠకుల చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి.

న్యాయ పోరాటంలో విజయం సాధించాలంటే పితృస్వామ్యం చుట్టూ పాత బూజుపట్టిన  సంప్రదాయాల చుట్టూ అల్లుకొన్న సమస్త సాంఘిక – సాంస్కృతిక కట్టుబాట్లని తెంచుకోక తప్పదు.  రాజ్యం, దాని పరిరక్షకులూ సరైన న్యాయం చేయలేరని నిర్ధారణ అయ్యాకా లేదా తీర్పు యేకపక్షంగా అధర్మబద్ధంగా వెలువడవచ్చని అనుమానించాకా బాధితులు తమకేం కావాలో తామే నిర్ణయించుకొని దాన్ని అమలు చేసే అధికారాన్ని సొంతం చేసుకోక తప్పదు.

తన శ్రమ ఫలంపై అధికారాన్ని  స్వయంగానే ప్రకటించడానికి సిద్ధమయ్యాడు రెండోవాడు. తానే తీర్పరి అయ్యాడు.

మొత్తం అయిదు అట్టల్లో రెండు సాదా అట్టలు – వొక్కో దానికీ  పావలా లెక్కన ధర కట్టి – పెట్టుబడి పెట్టినందుకు యిచ్చేశాడు. మిగతా మూడు అట్టలూ పెట్టుబడి పోగా – అదనపు విలువ ( కార్మికుడి శ్రమే యీ విలువకి మూలం – అది  లాభం పేరుతో పెట్టుబడిదారుల పెట్టెల్లోకి చేరుతోంది). దాని న్యాయబద్ధమైన పంపిణీని కూడా తానే నిర్ణయించాడు. ఐడియా యిచ్చినందుకు (బౌద్ధిక శ్రమకి) పెద్దవాడికి పావలా అట్ట వాటా , పనిలో సాయం చేసినందుకు మూడోవాడికి మరో పావలా అట్ట వాటా ప్రతిఫలంగా ( అది ఎక్కువేనని చెబుతూనే) యిచ్చేశాడు. క్యాలికో అట్ట తనకిష్టమైంది కాబట్టి తానుంచుకొన్నాడు. ఇది  తిరుగులేని అంతిమ తీర్పు.

కార్మిక వర్గ నియంతృత్వంలో వుండే  సమత్వ భావననీ, ప్రజాస్వామిక లక్షణాన్నీ , వుత్పత్తి సంబంధాల్లో పరిఢవిల్లే మానవీయతనీ , సమ న్యాయాన్నీ, శ్రమఫలం పై దాని సామాజిక పంపకంపై శ్రామికులకు లభించే సాధికారికతనీ రెండోవాడి తిరుగుబాటు ద్వారా ప్రతిపాదిస్తూనే రచయిత కథ ముగింపుని తెరచి వుంచారు.

రెండోవాడి ‘అఘాయిత్యాన్ని’ సుందరరామయ్య యెలా స్వీకరించాడన్నది ప్రశ్న. తరతరాల సంప్రదాయాలు , విలువలు వాటిద్వారా సంక్రమించిన అధికారాలు, సౌకర్యాలు , పెద్దరికం తల్లకిందులయ్యాకా ‘ఎర్రగా చాలా ఎర్రగా జేవురించిన  ముఖం’ యెటువంటి ప్రతిక్రియకి పూనుకొంటుందో కాలం నిర్ణయిస్తుంది. ఈ తీర్పునిచ్చిన రెండోవాడే శ్రీకాకుళం కొండల్లో పుట్టిన నిప్పందుకొని సత్యంవైపు నిలబడి వుంటాడు. వాడి గురించిన సుందర రామయ్య భయాలు ఆ విధంగా నిజమయ్యాయి. ఈ కథ పుట్టిన మరో పుష్కరానికి  42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫ్యాక్టరీల నిర్వహణలో కార్మికులకి భాగస్వామ్యం కల్పించే చట్టం రూపొందింది. దానిద్వారా నిర్వహణలో కార్మికుడు అభిప్రాయ వ్యక్తీకరణకి పరిమితమై అధికారానికి యెప్పటికీ దూరంగానే వుండిపోయాడు.

కథ 2011 ఆవిష్కరణ సభ. డిసెంబర్ 2, 2012న. విజయనగరంలో. వరసగా ఎడమ నుంచి... చెలం , సంపాదకుడు నవీన్ , సభకి అధ్యక్షుడు  అప్పల్నాయుడు , పుస్తకం ఆవిష్కర్త శ్రీపతి.   కారా మాష్టారి పక్కన ఎ . కె. ప్రభాకర్

కథ 2011 ఆవిష్కరణ సభ. డిసెంబర్ 2, 2012న. విజయనగరంలో. వరసగా ఎడమ నుంచి… చెలం , సంపాదకుడు నవీన్ , సభకి అధ్యక్షుడు అప్పల్నాయుడు , పుస్తకం ఆవిష్కర్త శ్రీపతి. కారా మాష్టారి పక్కన ఎ . కె. ప్రభాకర్

50 యేళ్ళ తర్వాత యివ్వాళ సుందర రామయ్యలు ప్రజాస్వామ్యపు ముసుగుల్ని సైతం వదిలేశారు. ఫ్యూడల్ విలువలకే సాంస్కృతిక జాతీయవాదం టాగ్ తగిలించి చెలామణి చేస్తున్నారు.  చట్టాలకీ న్యాయాలకీ అతీతంగా యెటువంటి విచారణలకీ తావులేకుండా దేశ విదేశ ధనికస్వాములకు దాస్యం చేస్తూ ప్రకృతి వనరులతో సహా సమస్త సంపదని స్వయంగా స్వాహా చేస్తూ ఆశ్రితులకి అడ్డగోలుగా పందేరం చేస్తూ నిర్లజ్జగా స్వైరవిహారం చేస్తున్నారు. కాదంటే – దుడ్డుకర్రనుపయోగించి రెండోవాడి మూడోవాడి నోళ్ళు మూయిస్తున్నారు. నిజానికి కార్పోరేట్ కల్చర్ లో యివాళ తాను చేస్తున్న  వుత్పత్తి తుది రూపం కూడా రెండోవాడికి తెలీదు. శ్రమ పరాయీకరణ పరాకాష్టకి చేరుకొన్న దశలో శ్రమఫలం పై అధికారం గురించి ఆలోచించే స్థితిలో లేడు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకొన్న హక్కులకి వాడు దూరమయ్యాడు. తల్లి పాపం అమాయిక – ఆమె యెప్పుడూ మౌన ప్రేక్షక స్థానంలోనే వుంది. మేనత్తలు సుందర రామయ్యల తెలివికీ తెంపరితనానికీ మురిసిపోతున్నారు. అందువల్ల ‘తీర్పు’ కథ 64 లో అందించిన  చైతన్యాన్ని యివ్వాళ కొత్త తరం అందిపుచ్చుకోవాల్సిన అవసరం మరింత యెక్కువగా వుంది.

1948 – 55 మధ్య చేసిన రచనల తర్వాత , దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత 64 లో వెలువడ్డ  తీర్పు దాదాపు అదే కాలంలో రాసిన యజ్ఞానికి కృత్యాద్యవస్థలానో డ్రెస్ రిహార్సల్ లానో డ్రై రన్ లానో వుంటుంది. శ్రీరాములు నాయుడికి సుందరరామయ్య చిన్న మోడల్ లా వుంటాడు. శిల్ప పరంగా తీర్పులో నాటకీయతే యజ్ఞంలో  విశ్వరూపం ధరించి పెద్ద రంగస్థలం మీదికెక్కింది. సుందర రామయ్య యింట్లో వెలసిన కోర్టు హాలే యజ్ఞంలో న్యాయమంటపమైంది. రెండుచోట్లా అది కూలుతున్న దృశ్యమే. అయితే తీర్పు సింగిల్ పాయింట్ కథ. యజ్ఞం బహుముఖీన కథ.

తీర్పు న్యాయబద్ధం కానప్పుడు కుహనా అభివృద్ధిపై ఫ్యూడల్ ఆధిపత్యంపై  నిరసనగా బానిస బతుకు మీద తిరుగుబాటుగా సీతారాముడు కన్న కొడుకుని చంపుకొన్నాడు. సీతారాముణ్ణి అటువంటి వున్మాద స్థాయికి నడిపించిన పరిస్థితుల్ని యజ్ఞం కథలో విస్తృతంగానే వర్ణించినప్పటికీ – దాని బీజాలు తీర్పు కథలోనే వున్నాయి. సమస్య పరిష్కారానికి ‘అట్టలన్నీ చించేస్తే పీడా పోతుంద’ని భార్య అనొచ్చన్న వూహ వొకానొక దశలో సుందర రామయ్యకి కల్గుతుంది. ఆ వూహే సీతారాముడిలో ధ్వంస రచనాత్మకమైన నిరసన రూపం ధరించిందేమో!

సీతారాముడికి తనకేం కావాలో తెల్సు; కానీ సాధించుకొనే దారి లేదు. తన కొడుకు కంబారిగా వుండకూడదంటే తాను తీర్పరి స్థానంలోకి రావాలని సీతారాముడికి తెలుసో లేదో గానీ తీర్పులో సుందర రామయ్య రెండో కొడుక్కి మాత్రం స్పష్టంగా తెలుసు. వాడికి మొదట్నుంచీ తనకేం కావాలో తెల్సు. దాన్ని సాధించుకోడానికి వున్న ఆటంకాలేవో తెల్సు. వాటినెలా అధిగమించాలో వాద ప్రతివాదాల క్రమంలో నేర్చుకొన్నాడు. న్యాయాన్నో చట్టాన్నో తన చేతుల్లోకి తీసుకొంటేగానీ సరైన తీర్పు లభించదనే యెరుక పొందాడు. ఉత్పత్తిలో న్యాయబద్ధమైన భాగస్వామ్యం కోరుకోవడం దగ్గర మొదలైన అతని పోరాటం సమ న్యాయం కోసం మొత్తం వ్యవస్థ పైనే తిరుగుబాటుగా పరిణమించింది. కార్మికవర్గ నియంతృత్వ స్థాపన దిశగా ప్రయాణించింది. అప్పుడు  వుత్పత్తి ఫలాలమీదే కాదు – పెట్టుబడులు, వనరులు, వుత్పత్తి సాధనాలమీద కూడా శ్రామికుడికే సర్వాధికారాలూ దక్కుతాయి. ఇదంతా వొక గతి తార్కిక క్రమం.  విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ. ఆ సంఘర్షణ క్రమాన్ని, శుద్ధ సిద్ధాంతాన్నీ కథగా మలచిన కారా మాష్టారి నేర్పు అద్వితీయం. పైకి సరళంగా కనిపించే యీ తీర్పూ నేర్పూ రెండూ నిజానికి యెంతో సంక్లిష్టమైనవి. తన తీర్పుని అమలు పరచడానికి కథ చివర్లో రెండోవాడు పడిన యాతన వంటి యాతనే కేవల సిద్ధాంతాన్ని కళాత్మకంగా జీవితానికి అన్వయించడంలో  రచయిత కూడా అనుభవించి వుండొచ్చు. అయితే కథ పూర్తయ్యేసరికి సంక్లిష్టత విడిపోయి పాఠకుడికి చేరువై రచయిత ఆశించిన ప్రయోజనం నెరవేరింది. ప్రయోజనోద్దిష్టమైన సాహిత్యానికి వొక పాఠంలా కథ రూపొందింది.

కారా 64 తర్వాత రాసిన కథల్లో ప్రతిపాదించిన సామాజిక – ఆర్ధిక – రాజకీయ దృక్పథానికి సైద్ధాంతిక భూమికనేర్పరచిన కథ ‘తీర్పు’. మాష్టారి సృజనాత్మక రచనా మార్గంలో పెద్ద మలుపు. తర్వాతి తరానికి ఆయన అందించిన ముందుచూపు.

 [తెలుగు కన్నడ రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయిన ఎ.కె. ప్రభాకర్ ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు , నిషేధ గీతాలు , జాంబ పురాణం , రెండు దశాబ్దాలు కథ , బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది , నోబెల్ కవిత్వం , తొవ్వ ముచ్చట్లు  జూలూరి గౌరి శంకర్ గారి యుద్దవచనం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పుస్తకం ఇటీవలే వచ్చింది. అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జనవిముక్తికి దారి తీయాలని ప్రభాకర్ కోరుకుంటున్నారు.  ]

 

 వచ్చే వారం: అప్రజ్ఞాతం కధ గురించి ముళ్ళపూడి సుబ్బారావు 

 

తీర్పు  కథ:

 

మధ్యతరగతి మనస్తత్వాల మీద కోల్డ్ కిక్ “వీరుడు మహావీరడు”

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

లోకం పోకడ మీద అధిక్షేపణ ఈ కధ. సగటు మనుషులకున్న నిష్క్రియాపరత్వం మీద, ఆ నిష్క్రియాపరత్వం కూడా బలవంతులకు అనుకూలంగా వుండేలా, బలహీనులకు క్రియారహితంగా వుండేలా, వుండటంలో అసమంజసం మీద వ్యంగ్యం. అందుకే యీ కధ చెప్పే కధకుడు (ఇతను సమాజపు సగటు ఆలోచనలకు ప్రతినిధి యీ కధలో) అంటాడూ “బిగ్ పవర్ లో వున్న ఆకర్షణే అది. మనం అనుకుంటాం గానీ యే కాలం లోనైనా ఏ లెవల్లోనైనా బిగ్గూ స్మాలూ తేడాలు వుండనే వుంటాయి…”

లోకమెప్పుడూ బిగ్ వైపే నిలబడాల, బలహీనుడి వైపు న్యాయమున్నా, బలహీనుడు బలవంతుడితో కొట్లాడేటప్పుడు న్యాయం వైపు వున్నాడు కదాని బలహీనుడి వైపు నిలబడకూడదు, బలవంతుడి వెనకాల యింకొందరు బలవంతులుంటారు కాబట్టి వీలైతే బలవంతుడి వైపే వుండి బలహీనుని మీద ఒక దెబ్బ వేయాల. అది కూడా వాడి మంచికేనంటాడు కధకుడు. “అవును గురూ! అలాంటోళ్ళు (వీరులు) ఏటనుకుంటారంటే జనం జూస్తూ అన్నేయాలు జరగనిస్తారా? అనుకుంటారు. అనుకుని-న్యాయం ధర్మం-అని పెద్ద పెద్ద కబుర్లతో చిక్కుల్లో పడతారు. పడి ఒకళ్ళకి తెద్దునా అందరికీ తెద్దునా అని క్రైసీసులు సృష్టిస్తారు. ఒక్క సారి జనం సంగతేటో తెలిస్తే మరింకెప్పుడూ అలాంటి ఎర్రికుట్టి ఏషాలెయ్యడు. అందికే ఆడి మంచికోరే నేను ఆడి మీద ఓ చెయ్యేసీసేను” అంటాడు కధ ముగిస్తూ.

కారా మాస్టార్ గారి ‘వీరుడు మహా వీరడు’ కధ 05-04-1968న ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో అచ్చయింది. మధ్య తరగతి సగటు మనిషి స్వభావాన్నీ, చంచలత్వాన్ని, జారుడుతనాన్నిఅద్భుతంగా పట్టుకుందీ కధ. కధ చెప్పే కధకుడు ఒక నగరవాసి. శ్రీరామ నవమి సంబరాలు జరిగే దినాలలో ఒక రాత్రి జేమ్స్ బాండ్ సినిమా చూద్దామని సెకెండ్ షోకి వెళ్ళి, టికెట్ దొరక్క, వుత్సవాలు జరుగుతున్న పందిళ్ళను చూస్తూ యింటికి వెనుదిరిగే క్రమంలో, ఒక పోట్లాటను చూస్తున్న గుంపులో ఆగి పోతాడు. ఆ పోట్లాట జరుగుతున్నది గంజి పేట రౌడీకీ, అల్లిపురం వస్తాదుకీ. కధకుడు అక్కడక్కడా గంజి పేట రౌడీని ‘వీరుడు’ అని చెప్తూ ఉంటాడు. ఇక మహావీరుడు ఎవడు అనేది పాఠకులు నిర్ణయించుకోవాల్సిందే. నిజానికి గంజి పేట రౌడి యింకొకడితో కొట్లాడుతుంటే, అల్లిపురం వస్తాదు మధ్యవర్తిగా వచ్చి కొట్లాట విడిపించినట్లే విడిపిస్తూ గంజిపేట రౌడీనీ పట్టేసి యింకొకడి చేత తన్నిపించాడనీ, తనకు జరిపిన అన్యాయం పట్ల కసితో గంజిపేట వీరుడు అల్లిపురం వస్తాదుకు సరిసాటి కాకున్నా ఎదిరిస్తూ తన్నులు తింటున్నాడనీ కధకుడికి తెలుస్తుంది. కధకుడికి గంజిపేట రౌడీలోని ఫైటింగ్ స్పిరిట్ నచ్చుతుంది.

“అయితే మనిషికా ఫైటింగ్ స్పిరిట్ వొక్కొక్కప్పుడలా వొచ్చేస్తాది. అలాటప్పుడు న్యాయం నీ పక్క నుండాల. అవతలోడు ఫాలు గేమాడాల. అదేవంటే, దౌర్జన్యానికి దిగాల. సూస్తున్నోళ్ళు సీమ కుట్టినట్టు మాటాడకూరుకోవాల! జనం అవతలోడి బలానికి జడిసి అన్యాయానికి నోరెత్తకుండా వున్నారని నువ్వు గ్రహించాల. ఆ జనం, పిరికితనం చూసి ఆడి జులుం మరీ మరీ పెరిగి పోతుండాల. అదిగో ఆలాటప్పుడు వొచ్చెస్తాది ఎక్కళ్ళేని ఫైటింగ్ స్పిరిటూ. అప్పుడు పిల్లి లాంటోడైన పిల్ల పులైపోతాడు. పులి పిల్లలా ఎగిరి ఏనుగు కుంభస్థళవైనా అందుకోడానికి పంజా చాస్తాడు.” అంటాడు కధకుడు. అట్లాంటి కొట్లాటను వింతగా జూస్తున్న జనం మీద కోపం వస్తుంది కధకుడికి. ఎందుకింత అన్యాయాన్ని జరగనిస్తున్నారని. జనం బలహీనుడైన గంజిపేట వీరుని వైపు నిలబడితే, అల్లిపురం వస్తాదు ఎంత బలవంతుడైనా భూమిలోకి దిగిపోడా అనుకుంటాడు. అయితే అల్లిపురం వస్తాదు ఏనుగంతవాడు. గంజిపేట వస్తాదు వీరుడు, యువకుడైనా వాడి ముందు ఎలుకంత వున్నాడు. కధకుడికి గంజిపేట రౌడీ మీద సానుభూతి వుంది, అతను అన్యాయాన్ని ఎదిరిస్తున్నాడనీ, ఎదురుగా వున్న బలవంతుడికి సమవుజ్జీ కాకున్నా ఎదురిస్తున్నతనికి జనం ఎందుకు సాయపడ్డం లేదనీ అనుకుంటూ తను కూడా గంజిపేట వీరుడితో కలసి వస్తాదుతో కలబడాలనుకుంటాడు. అయితే తను వేసుకొన్న టెర్లిన్ బట్టలు చిరిగిపోతాయని వెళ్లలేక పోతాడు. తను ఎప్పుడూ దెబ్బలాడక పోవడమూ, కసరత్ చేయక పోవడం గురించి చెడ్డ చిరాకు పడతాడు.

సరిగ్గా అట్టాంటి సమయంలో కొత్త పేట శాండో రంగ ప్రవేశం చేస్తాడు. దాంతో కధకుడికి గొప్ప యుద్ధం జరగబోతుందనే భయమూ, గంజిపేట వీరుడికి దన్నుగా నిలుస్తాడనే భరోసా కల్గుతాయి గానీ, కొత్త పేట శాండో గంజిపేట వీరున్నే శాంతించమంటాడు. నన్ను కాదు శాంతించమనాల్సింది, నీక్కలేజా ఉంటే అల్లిపురం వస్తాదుతో దెబ్బలాడమంటాడు గంజిపేట వీరుడు. శాంతించక తననే నిందిస్తున్న గంజిపేట వీరుడ్ని ఆదుకొంటే పెద్ద గొడవైపోతుందని ఎరిగిన కొత్త పేట శాండో, గంజిపేట రౌడీని అల్లిపురం వస్తాదు చేతుల్లోకి తోసేసి తన దారి తను వెళ్తాడు. ఆ నిష్క్రమణలో ఉన్న లాజిక్ తో మన కధకుడికి జ్ఞానోదయం అవుతుంది. బలహీనుణ్ణి సమర్ధించి బలవంతుడితో తంటా తెచ్చుకోవడమెందుకన్నదే ఆ లాజిక్. ఆ తర్వాత అంతవరకూ గంజిపేట వీరుడ్ని సమర్ధించిన వాడు విమర్శించడం ప్రారంభిస్తాడు. గంజిపేట వీరుడికి బలవంతుడితో పెట్టుకోకూడదు అనేది తోచనైనా తోచాల లేదా ఒకరు (కొత్తపేట శాండో లాంటి వాడు) చెప్పినప్పుడు విననన్నావినాల. అట్లా కాకుండా తనవైపు న్యాయముందనీ, జనమంతా తన వైపు రావాలనీ అనుకోవడం .. అనుకొని న్యాయం, ధర్మం అని పెద్ద పెద్ద కబుర్లతో చిక్కుల్లో పడ్డం .. పడి ఒకరికి తెద్దునా అందరికీ తెద్దునా అనుకోవడం తప్పు అంటాడు కధకుడు. అందుకే యిక ముందెప్పుడూ జనాన్ని నమ్ముకొని ఎర్రివేషాలెయ్యకుండా జనంతో కలిసి తనూ వాడి మీద ఒక దెబ్బ వేస్తాడు.

మధ్యతరగతి మనస్తత్వాల మీద ‘కోల్డ్ కిక్’ యీ కధ. ఈ జనం ఎలాంటివారంటే .. న్యాయం, అన్యాయం మీద బలవంతుడు బలహీనుడి మీద పోట్లాడుతుంటే ప్రేక్షకుల్లా చూసి ఆనందించమంటే ఆనందిస్తారు. బలహీనుడి పక్షం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తమ బట్టలు నలుగుతాయనుకొంటారు లేదా క్షణాల మీద తమ అభిప్రాయం మార్చుకొని తనకే మాత్రం అసౌకర్యం కలగకుండా బలవంతుడి వైపైనా నిలబడతారు. ఏ కాలంలోనైనా, ఏ స్థాయిలోనైనా బలవంతులపైనా ఉండే ఆకర్షణ అదేనంటాడు కధకుడు.

ఈ కధతో పాటు, కారా మాష్టర్ గారికి పేరు తెచ్చిన కధలన్నీ (యజ్ఞం, హింస, భయం, శాంతి, చావు, జీవధార, కుట్ర, సంకల్పం) కూడా రచయితకు ఎదురైన దైనందిన అనుభవాల మీద రాసిన కధలు కావు. తను కధ రాసిన కాలంలో నెలకొని వున్న సోషియల్ రియాలిటి చెప్పటానికి, తన కాలపు సోషియో – పొలిటికల్ – ఎకనామిక్ దృగ్విషయాల మీద (కాన్ సెప్ట్స్) లోతైన అవగాహనతో చిత్రించిన యితి వృత్తాలు. ఒక్కొక్క కధా ఒక్కో కాన్సెప్ట్ మీద రాసిందే.

బూర్జువా వర్గపు స్వభావాన్ని చిత్రించడానికి కారా మాస్టర్ వీరుడు మహావీరడు కధ రాశాడని తెలుస్తుంది. మధ్య తరగతి చైతన్యం మీద విమర్శనాత్మక వ్యాఖ్యానంగా యీ కధ నిలుస్తుంది. 1968 కాలానికి తెలుగు నేల మీద, జాతీయ అంతర్జాతీయ వేదిక మీద సామ్రాజ్యవాదపు ప్రభావం – బూర్జువా వర్గపు విస్తరణ, అవి కమ్యూనిష్టు వుద్యమాల మీద చూపుతున్న ప్రభావాల ప్రతిఫలనమే యీ కధ. ఆ కాలపు మధ్య తరగతి స్వభావం ప్రగతిదాయకంగా లేదన్నది రచయిత విమర్శ. అతి సంక్లిష్టమైన విషయాన్ని పాఠకుల ముందు నడిబొడ్డున నిలబెట్టి వీధి రౌడీల యుద్ధంగా చూపిస్తూ మధ్య తరగతి జనాల చైతన్యాన్ని చిత్రించే దృగ్విషయంగా మలచటంలో కారాగారి పరిణత శిల్పవిన్యాసం కన్పిస్తుంది.

చిన్న కధలో పెద్ద సత్యాలు ఆవిష్కరించడం గొప్ప కధా లక్షణం. ఏ సమాజంలోనైనా నిష్క్రియాపరత్వం, అన్యాయాల పట్ల స్పందన లేనితనం .. సమాజాన్ని బలవంతుల రాజ్యంగా మార్చుతుందనీ, ప్రగతిశీల శక్తుల వైపు ఎంత న్యాయమున్నా ఎంత ఫైటింగ్ స్పిరిట్ వున్నా అది వృధా అవుతుందనీ యీ కధ చెప్తున్న సత్యం. తెలుగు నేల మీద అణగారిపోయిన వుద్యమ శక్తికీ, వుద్యమ ఫైటింగ్ స్పిరిట్ కూ మధ్యతరగతిలోని నిష్క్రియా పరత్వమే కారణమైందనీ, యీ కధ 1968 లోనే చెప్తే, అది యీ రోజు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ మితవాదుల్నీ/మతవాదుల్నీ సమర్ధించే స్థితికి తెలుగు సమాజం చేరుకుందని అర్ధమవుతుంది.

కొన్ని దశాబ్ధాలుగా తెలుగు సమాజంలో జరుగుతున్నసకల అన్యాయాల మీద అణచివేతల మీదా వుద్యమశక్తులు ఎంతో పోరాట స్పూర్తితో పోరాడుతున్నాయి. మైదానాల్లోనూ అడవుల్లోనూ వెలుగులు నింపడానికి ప్రతిఘటిస్తున్నాయి. సమాజం వీళ్ళను వీరులూ/ శూరులూ త్యాగధనులూ అంటూ పొగుడుతుంది. వాళ్ళు ఓటు కోసం వస్తే ఒక్క సీటూ రాల్చదు, వాళ్ళు ఎన్ కౌంటర్ అయితే పెదవి విప్పదు. నిజమైన తీర్పు ఇవ్వాల్సి వచ్చినపుడు నిష్క్రియగా స్పందన లేకుండా వుండిపోవడం, వీలైతే రాజ్యం వైపు నిలబడ్డం, వీరుల్ని చూసి నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం మధ్య తరగతికే చెల్లుతుంది. ఈ వైఖరి మీద ఆగ్రహ ప్రకటనే “వీరుడు మహావీరడు” కధ.

 -జి.వెంకట కృష్ణ 

DSCN0059కర్నూలుకు చెందిన జి. వెంకట కృష్ణవి “గరుడ స్తంభం”, “చిలకలు వాలిన చెట్టు” కధల పుస్తకాలు వచ్చాయి. “లోగొంతుక”, “దున్నే కొద్దీ దుఃఖం”, “కొన్ని రంగులు, ఒక పద్యం” అనే కవితా సంపుటాలూ .. ఇంకా “ఒక నదీ – వరదా – మనిషి” అనే దీర్ఘ కవితా పుస్తకాలుగా వచ్చాయి. వెంకట కృష్ణ రచనలు ఎక్కువగా ఆంధ్రజ్యోతిలో, అరుణతారలో ప్రచురింపబడ్డాయి. తన సాహిత్య జీవితం మీద ఒకే ఊరివాడైన బండి నారాయణ స్వామి ప్రభావం ఉందంటారు. తొమ్మిది చదువుతుండగానే రంగనాయకమ్మ నవలలు, తిలక్ కవితలు చదివి వారి మీద అభిమానం పెంచుకొన్నానంటున్నారు. నేటి తరం రచయితలలో ఖదీర్ బాబు, వి. చంద్రశేఖరరావు  అంటే ఇష్టం.

వచ్చే వారం :’తీర్పు’ కధ గురించి ఎ.కె ప్రభాకర్

వీరుడు మహావీరడు కథ ఇక్కడ:

 

మూడవ దారే శరణ్యమా?

karalogo

నిర్వహణ: రమా సుందరి బత్తుల

కథాకాలానికి డెభై అయిదేళ్ళున్న సుభద్రమ్మకి ఆమె భర్త రామభద్రయ్యతో అరవై ఏళ్ళ సాహచర్యం. పథ్నాలుగేళ్ళ ప్రాయంలో అతనింట్లో మెట్టి అతని కోపపు కేకలకు తడబడి గుమ్మాలకు కొట్టుకుని పడబోయి అత్తగారి ఆదరణతో నిలదొక్కుకుని, ఆవిడ ప్రేమలోనూ భర్త కనుసన్నలలోనూ మెలిగి వాళ్ళ అభిప్రాయాలే తనవిగా చేసుకుని ఏడుగురు బిడ్డల్ని కని పెంచింది. ఆ అరవై ఏళ్ళలోనూ ఎవరింట్లో నైనా చుట్టపు చూపుగానో పని గడుపుగోడానికో కొద్ది రోజులు మాత్రమే వుండేది కానీ, శాశ్వత నివాసం ఆ పల్లెలోనే. తను మెట్టిన ఇంట్లోనే. అటువంటి సుభద్రమ్మకు ఆమె భర్త పోయిన పదిహేను రోజులకే తను ఎక్కడుండాలనే ప్రశ్న ఎదురైంది. ఎక్కడుంటే ఆమెకు సౌకర్యం, ఎక్కడుంటే ఆమెకు కాస్త ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ అని కాక ఆమె ఎక్కడుండడం ధర్మం అనే చర్చ వచ్చింది. ఎక్కడుండడం అని కూడా కాక ఎవరి దగ్గర వుండడం అని.

“ఇన్నాళ్ళూ నాన్నగారి బాధ్యత నీ మీదుంది. ఆయన ఇల్లు విడిచి రానన్నారు. ఏమీ చెయ్యలేక ఊరుకున్నాను. ఇప్పుడు నువ్వు నాదగ్గరుండడం ధర్మం” అన్నాడు పెద్దకొడుకు. “తమ్ముడిని కూడా అడగాలి కదా!” అందావిడ అప్పుడు. ఆడపిల్లలు పెళ్ళి చేసుకుని అత్తవారిళ్ళకు పోగా, తక్కిన కొడుకులు ఉద్యోగాల కోసం వేరే ఊళ్ళలో ఉండగా మూడో కొడుకు మాత్రం వున్న వూళ్ళోనే పొలం చూసుకుంటూ వుండిపోయాడు. వుంటే తనిప్పుడు మూడో కొడుకు దగ్గర వుండాలి. లేదా పెద్ద కొడుకుతో వుండాలి. ఒక చోటు ఎంచుకుని వెళ్ళి తరువాత ఇంకోచోటుకి వెడితే బాగుంటుందా? గౌరవంగా వుంటుందా?

ఆమె భర్త రామభద్రయ్యకు కాశీ యాత్ర చెయ్యాలనే సంకల్పం ఆయన జీవితంలో నెరవేరలేదు. మూడుసార్లు బయలుదేరి ఏదో ఒక అడ్డంకితో ఆగిపోయాడు. నాలుగోసారి ఆవిడే అడ్డం కొట్టింది. ఎందుకంటే తాము కాశీ వెళ్ళడం భగవంతుడికి ఇష్టం లేదనీ ఈసారి కూడా ఏదో అడ్దంకి వస్తుంది కనుక అసలు బయలుదేరవద్దనీ… ఆపైన వయసు మీదపడిన రామభద్రయ్య తనంతట తనే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆయన పోయాక ఆయన అస్థికలనైనా గంగలో నిమజ్జనం చెయ్యాలని ఆయన పిల్లలు నిర్ణయించారు. ఆమె కూడా వెళ్ళాలని అర్థించారు. ఆయన పక్కన లేకుండా ఈ విధంగా వెళ్లవలసి రావడం ఆమెకి కష్టంగానే వున్నది. కాశీవచ్చాక కూడా ఆమె మనసు స్థిమితంగా లేదు. అనంతమైన రైలు ప్రయాణం చేసి వచ్చిందిక్కడికి. తను తిరిగి ఇంటికి వెడుతుందా? భగవంతుడి సంకల్పం ఎట్లా వుందో?

ఈ ఆలోచన ఆమెకి ఇప్పుడు వచ్చింది కాదు. రామభద్రయ్య మంచాన పడ్డప్పుడు పిల్లల ప్రవర్తనల్లో ఆమె కనిపెట్టిన మార్పు ఇటువంటి ఆలోచనకు బీజం వేసింది. ఆయనను వాళ్ళు గౌరవించాల్సినంతగా గౌరవించడం లేదనిపించింది. చెయ్యీ కాలూ సరిగా వున్నంతవరకూ వుండే గౌరవం తరువాత వుండదు. అందుకే ఆయన పోయాక ఇంక తను బ్రతకవద్దు అనుకుంది. ఊళ్ళో ఎన్ని నూతులు లేవు కనుక అనుకుంది. కానీ ఆయన పోయాక ఆ పన్నెండు రోజుల్లో పిల్లలు ఆమె మీద చూపించిన ప్రేమాదరాలు మళ్ళీ ఆమెని ఆ ఆలోచనను కాస్త దూరం పెట్టేలా చేశాయి కానీ కాశీ లో అట్లా కాదు. మళ్ళీ అవే ఆలోచనలొస్తున్నాయి. అచ్చమైన సంప్రదాయ మధ్య తరగతి గ్రామీణ కుటుంబంలో పుట్టి, ప్రేమా గౌరవమూ అంటే భయభక్తులేననే నమ్మకంతో జీవించిన సుభద్రమ్మకి, తను తన అత్తగారి పట్ల చూపించిన భయభక్తులు తన కోడళ్ళు తనపట్ల చూపడం లేదని దుగ్ధ. వాళ్ల పద్ధతులు ఆమెకి నచ్చవు. తనకీ తన అత్తగారికీ మధ్య వున్న సామీప్యం తన కోడళ్ళకు తనతో లేదని అసంతృప్తి. రామభద్రయ్య జీవించి వుండగా అతనిపట్ల అందరూ గౌరవం చూపించాలని ఆరాటపడి అట్లా అందరి వెంట పడేది ఆవిడ. ఆయన మంచాన పడ్దాక చూపేవారు చూపేవాళ్ళు. లేనివాళ్ళు లేదు. అంతవరకూ తండ్రి కనుసన్నలలో నడిచిన మూడవ కొడుకు కూడా ఆయన్ని అడక్కుండానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇదంతా గమనించింది ఆవిడ.

కాశీలో పెద్దకొడుకు ఆమెతో అనేక విషయాలు మాట్లాడాడు. తన కుటుంబం సంగతి, తన కొడుకూ కోడళ్ల సంగతి. తన భార్య సంగతి. ఒక కుటుంబంలో భిన్నాభిప్రాయాలుంటాయని వినడం సుభద్రమ్మకి ఇదే మొదలు. తన కొడుక్కీ కోడలికీ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఏమిటో ఆమెకి అర్థంకాదు. ఏదో ఆపద ముంచుకొస్తున్నట్లు ఆమె గుండెలు దడదడలాడాయి.

కొడుకు చాలా చెప్పాడు. కొడుకు గొంతుతో రచయిత చెప్పిన మాటలు ఇవి.

ఇటువంటి ఘర్షణలు ….. నాయకత్వం యాజమాన్యం, పెద్దరికం వంటివి ఏర్పరుచుకున్నాక .. తరం మారి కొత్త తరం తలెత్తినప్పుడల్లా – వస్తూనేవున్నాయి. పెద్దరికం కోసం, నాయకత్వం కోసం పడుచుదనం పెద్దతరాన్ని సవాలు చేస్తూనే వుంది……. అనాదిగా జరుగుతున్న ఈ తరాల సంఘర్షణ గురించి, అందులో మనిషి పడే హింస గురించీ సుదర్శనం (పెద్ద కొడుకు) ముందే కొంత విన్నాడు. తన చుట్టూ సాగుతున్న ఘర్షణని గుర్తించడానికి, దాని పోకడ అర్థం చేసుకోడానికీ. ఆ వినికిడి కొంత ఉపయోగించింది….పోకడ అర్థం అయింది కానీ నివారణోపాయమే అర్థం కాలేదు. అట్టే ఆలోచిస్తే ఇది తప్పనిసరే కాదు, అనవసరమేమో కూడా! అధికారాలకీ అదిచ్చే సౌకర్యాలకీ అలవాటుపడ్ద ముందు తరం తనకు తానుగా వాటిని వొదులుకోలేదు. ఆ తరంలో లుప్తమైపోతున్న ఉత్సాహం, సామర్థ్యం తమలో ఉరకలు వేస్తుంటే కళ్ళాలు తమ చేతిలోకి తీసుకోడానికి కొత్త తరం ఉద్రేక పడక తప్పదు. ఈ విధంగా ప్రగతి కోసం ఘర్షణ అనివార్యం. ఇవ్వన్నీ తల్లికీ, భార్యకీ అర్థమయేలా చెప్పాడతను. అందుచేత రెండేళ్ళల్లో రిటైరవబోయే అతను తల్లితో పల్లెటూరిలో ఉండడానికి నిర్ణయం   తీసుకున్నాడు. డబ్బు ఖర్చుపెట్టడం విషయంలోనూ, సంపాదించడం విషయంలోనూ తరానికీ తరానికీ భిన్నమైన అభిప్రాయాలుంటాయి. ఆ విషయాన్ని పూర్తిగా ఆమోదించలేని అతని భార్య శకుంతల, డబ్బు దూబరా చేసే కోడలికి సంసారం అప్పజెప్పి అతనితో రాలేనంటుంది. అందుగురించి ఇద్దరూ వాదించుకుంటారు. కొడుకు చెప్పింది అర్థంచేసుకోడానికి ప్రయత్నించింది సుభద్రమ్మ. పదే పదే ఆమె ముందు రామభద్రయ్య మూర్తి ప్రత్యక్షం అవుతోంది. తనముందు మూడు దారులున్నాయి. ఒకటి పెద్దకొడుకుతో వెళ్ళి వుండడం. అక్కడ వాళ్ళింట్లో ఎవర్నీ పూర్తిగా ఎరగదు. వాళ్లల్లో వాళ్లకే అభిప్రాయ భేదాలున్నాయి. రెండవది మూడో కొడుకు దగ్గరుండడం. మొదట్నించీ తను ఆ కుటుంబంలో భాగం, ఆ ఊళ్ళోనూ భాగం. కానీ ఎవరిని కాదని ఎవరితో వుంటే ముందుముందు ఏ చిక్కుల్లో పడుతుందో తెలియదు. ఒకసారి మూసుకున్న తలుపులు మరొకసారి తడితే తెరుచుకుంటాయా? ఎటూ తేల్చుకోలేకపోయింది. ఆమెకి అన్నిటికీ పరిష్కారంగా మూడో దారివుంది. కానీ అది గౌరవంగా బ్రతుకుతున్న పిల్లల్నిఏ చిక్కుల్లో పడేస్తుందో అనే భయం ఎటూ తోచని స్థితి. ఇక అంతా సర్వేశ్వరుడిదే భారం అనుకుంది.

అస్థి నిమజ్జనం సమయంలో ఆమెకి మళ్ళీ రామభద్రయ్య మూర్తి కనిపించింది. నడివయస్సులో వుండే రామభద్రయ్య మూర్తి. చెంగులు ముడి వేసుకుని చెయ్యవలసిన సరిగంగ స్నానం ఇలా అస్థికలతో చెయ్యవలసి వచ్చింది అనుకుంది. అస్థి నిమజ్జనం తరువాత మూడు సార్లు గంగలో మునగమన్నారు. ఆమె సూర్యభగవానునికి నమస్కారం చేసి చివరిగా మరో మునక వేసింది. ఆ మునక తరువాత పెద్దగా అలలు లేచాయి. మునిగిన ఆమె లేవలేదు. మనుషులొచ్చి బయటికి తీశారు. ఎక్కువ నీళ్ళు తాగలేదు కనుక బ్రతికింది. మూడోదారి మూసుకుపోయినట్లే. మరి సుభద్రమ్మ ఇప్పుడెక్కడెక్కడుండాలి? అరవై ఏళ్ళు అలవాటుపడిన ఇల్లు ఆమె స్వంతం కాదా? కొడుకు తప్ప కోడలూ ఆమె పిల్లలతో ఏ మాత్రం సామీప్యం లేని ఇంట్లోనా? నేనిక్కడే వుంటాను ఎక్కడికీ రాను అని రామభద్రయ్యలా ఆమె అనలేక పోతోంది, ఎందుకు? స్త్రీ కావడం వల్లనా? ఇట్లా ఎన్నో ఆలోచనలు వస్తాయి పాఠకులకు.

ఆర్జనాశక్తీ ఉత్సాహం తగ్గిపోయాక హుందాగా పెత్తనాన్ని బదలాయించే బాధ్యత ఎరిగిన సుదర్శనం కథా? మొదటినించీ భయభక్తులతో మెలిగి చివరికి ఎక్కడుండాలో తేల్చుకోలేని సుభద్రమ్మ కథా? అధికారం కోసం రాజకీయాలలో జరిగే రక్తపాతం లాగే కుటుంబాలలో కొనసాగే మౌన హింస కథా? అన్నిటినీ స్పృశించిన ఈ కథ చాలా పెద్దది. తరాల అంతరాలు, గ్రామీణ జీవనం, స్త్రీల అధీనత. అందులోనే తోటి స్త్రీలపై ఆధిక్యం కోసం ఆరాటం. సంప్రదాయ క్రతువుల వర్ణనా అన్నీ కలిసి ఒక గ్రామీణ అగ్రకుల మధ్యతరగతి జీవితాన్నీ, అందులో స్త్రీల నిస్సహాయతనూ బాగా పట్టుకుని వ్రాసిన కథ. చాలాకాలం విరామం తరువాత మేస్టారు వ్రాసిన పెద్ద కథ.

-పి. సత్యవతి

image

పి. సత్యవతిగారు సాహిత్య లోకానికి నలభై ఏళ్ళనుండి చిరపరిచితులు. సత్యవతి కధలు, ఇల్లలుకగానే, మంత్ర నగరి, మెలుకువ అనే నాలుగు కధల పుస్తకాలను ప్రచురించారు. మొదటి, రెండవ తరాల ఫెమినిష్టుల గురించి రాసిన  ‘రాగం – భూపాలం’ అనే వ్యాస సంపుటి సత్యవతిగారి కలం నుండే వచ్చింది. ‘మా నాన్న బాలయ్య’, ‘ఇస్మత్ చుగ్తాయ్ కధలు’ ‘ఒక హిజ్రా ఆత్మ కధ’ లాంటి మంచి పుస్తకాలను ఆంగ్లం నుండి అనువాదం చేసి తెలుగు పాఠకులకు అందించారు. సమకాలీన సాహిత్యాన్ని నిత్యం చదువుతూ తన ఆలోచనలను, రాతలను సజీవంగా నిలుపుకొంటున్న సత్యవతిగారు నేటి యువ సాహితీకారులకు ఎందరికో ఇష్టులు.

వెంకటకృష్ణ  “వీరుడూ – మహా వీరుడు” కధను గురించిన  పరిచయం

 

 

‘సంకల్పం” కథ ఇక్కడ:

విలువల గురించిన సంవాదం – కారా ‘స్నేహం’ కత

karalogo

నిర్వహణ : రమాసుందరి బత్తుల

కారా మాస్టారి ‘స్నేహం’ కత చదవగానే మనుషుల మధ్య ఉండే సంబంధాలు, మ్మకాలు, విశ్వాసాలకు సంబంధించిన ఆలోచనలు నన్ను అలుముకున్నాయి. ఒక
మనిషి తనను నమ్మి సహాయార్ధిగా వచ్చినపుడు ఎవరైనా అతని పట్ల ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తారు?  తమ మధ్య అప్పటికే ఉన్న స్నేహాన్ని ఎలా వ్యాఖ్యానించుకుంటారు? వీటన్నింటి వెనుక ఉన్న విలువల చట్రం మనుషులను ఎలాంటి అనుభూతులకూ, అనుభవాలకూ గురి చేస్తుందీ అన్న ఆలోచనలు నన్ను నిలువనీయలేదు. ఈ ఆలోచనల వలయం నన్ను భావజాలానికి సంబంధించిన విషయాలలోనికి పడదోసింది.

భావజాలం ఎలా ఉనికిలోనికి వస్తుంది? దాని ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది? మానవ సంబంధాలను అది ఎలా ప్రభావితం చేస్తుందీ అన్నవి ఆసక్తికరమైనప్రశ్నలు. పరస్పర వైరధ్యాలు, విభిన్నత కలిగిన సమాజాలలో అనేక భావజాలాలు ఒకే సమయంలో ఉనికిలో ఉండడమే కాకుండా పరస్పరం పోటీ పడడం కూడా మనం చూస్తూ ఉంటాం. భావజాలం ఉనికిలోకి రావడానికీ, అది మిగిలిన వాటి కన్నా  ప్రబలంగా  మారడానికీ మనిషి అవసరాలే ప్రాతిపదిక.  తన అవసరాలకు ఆటంకంగా మారిన పాత    ఆలోచనలను, విధానాలను అడ్డు తొలగించుకోవడానికి మనిషి సంకోచించడు. నిరంతరమూ  మారుతూ ఉండే మనిషి అవసరాల మాదిరిగానే భావజాల ఉనికి, వాటి ప్రభావాలూ  సాపేక్షికాలు. సమాజంలోని వివిధ వర్గాల, అస్తిత్వాల ప్రయోజనాలు పరస్పరం సంఘర్షిస్తూ ఉన్నప్పుడు, వాటి ఘర్షణ భావజాలాల నడుమ ఘర్షణగా వ్యక్తమవుతూ  ఉంటుంది. వీటిని మనం విలువలు, విశ్వాసాలు, సంబంధాలు, విధానాల తాలూకు  ప్రశ్నలుగా, సంవాదాలుగా చూస్తుంటాం. ఇలాంటి ఒక సంవాదమే కారా ‘స్నేహం’.

అరవై తొమ్మిదుల్లో రాసిన ఈ కత, విషయరీత్యా చాలా చిన్నదే అయినప్పటికీ, ఈ  కాలపు తన ఇతర కతల్లాగానే అనేక అంశాలను పాఠకుల ముందుకు తెస్తుంది. ఈ కతను
పై నుంచి చూసినపుడు, నమ్మి వచ్చిన స్నేహితుడిని మోసం చేసిన కతగా  కనపడుతుంది. స్నేహానికి ఉన్న పాత అర్థాన్ని చెరిపేసి, ఒక కొత్త అర్థాన్ని  ప్రతిపాదిస్తున్న కతగా కనిపిస్తుంది. అయితే ఇది వీటికి మాత్రమే పరిమితమైన  కత కాదు. వీటిని కేంద్రంగా చేసుకొని మరింత లోతుల్లోకి తరచి చూసిన కత.

స్నేహానికి విలువనియ్యాలనీ, ఆపన్నుడై వచ్చిన సహాయార్ధికి తప్పనిసరిగా,  శ్రమకోర్చి అయినా సహాయం చేసి పెట్టాలనే విలువకు, జీవితం వైకుంఠపాళీ  కాబట్టీ – తన విలాసాలకు, తన అవసరాలకూ, తను మరింత ‘పైకెగబాకడా’నికీ వచ్చిన  అవకాశాన్ని ఏమాత్రమూ వెనకాడకూడదూ  అనే విలువకూ నడుమ జరిగే ఘర్షణను దాని  రక్త మాంసాలతో సహా అనుభవంలోకి తెచ్చే కత . ఈ ఘర్షణలో మనుషులలో ఏర్పడే  సంవేదనలను సెస్మోగ్రాఫుపై లెక్కించి చూపిన కత. కొత్త విలువలూ, కొత్త  విశ్వాసాలూ- పాత విలువలనీ, పాత విశ్వాసాలనూ ధ్వంసించి, ఆసాంతమూ  ముప్పిరిగొని తమ ఉనికికి మనుషుల చేతననే పతాకగా ఎగరేస్తూ తమను తాము  వ్యక్తం చేసుకొనే కత .

ఈ కతను చదవడం మొదలు పెట్టగానే పాఠకుడికి అర్థం అయ్యే  అంశాలు డాక్టరు  వేణుగోపాలరావు ఆతృత, అవసరం. రాజారావుతో అతనికి గల స్నేహం. వీటికి గల నేపథ్యం, ప్రాతిపదిక అతని చిన్ననాటి  స్నేహితుడు శివయ్య వచ్చాక గానీ  పాఠకుడి అవగాహనలోకి రావు. వేణుగోపాలరావు ఎదిగి వచ్చిన సమాజం ఎలాంటిది?

ఇప్పడు తను ఉన్న పరిస్థితులకూ, గతానికీ ఉన్న తేడా ఏమిటీ? తనను చదివించి, పిల్లనిచ్చిన మామతో, కట్టుకున్న భార్యతో అతని సంబంధాలు ఎలాంటివన్న విషయాలు ఒక్కొక్కటిగా వాళ్ళ సంభాషణలో బయటికి వస్తాయి. శివయ్యకూ, వేణూగోపాలరావుకూ ఉన్న స్నేహం గురించి కూడా అప్పుడే తెలుస్తుంది. అయితే వీటన్నింటికీ రచయిత ఉద్దేశించిన అర్థం, కత చివరలో వేణుగోపాలరావు  స్నేహానికీ, మానవ సంబంధాలకూ ఇచ్చిన వ్యాఖ్యానం ద్వారా గానీ  మన  అనుభవంలోకి రావు. ఆసాంతం చివరకు వచ్చాక రచయిత ఏం చెపుతున్నాడో మన మనసులో ఒక్కొక్కటిగా స్ఫురిస్తున్నపుడు, వాటిని రూఢీ చేసుకునేందుకు తిరిగి మళ్ళీ కథనంలో దొర్లిన అనేక సంగతులలోకీ, వివరాలలోకీ మనం ప్రయాణిస్తాం. ఇలాంటి శిల్పసంవిధానంతో  వేణుగోపాలరావునూ, శివయ్యనూ, రాజారాంనూ  అర్థం  చేసుకుంటాం.

వేణుగోపాలరావును మోసగాడని, స్నేహధర్మం పాటించని వ్యక్తని చెప్పడానికి  నిజానికి కతలో ఇన్ని విషయాలను చొప్పించనవసరం లేదు. అసలు రాజారావు పాత్రే  అవసరం లేదు. మరి రాజారావు పాత్రకున్న ప్రాముఖ్యత ఏమిటి?

వేణుగోపాలరావు గతానికి శివయ్య ఎలానో అతని వర్తమానానికి రాజారావు సంకేతం. మారిన తన అభిరుచులకూ, స్నేహాలకూ, సంబంధాలకూ అతను కొండ గుర్తు. అతను దళారీ
మాత్రమే కాదు. వేణుగోపాలరావులో ఇంకా మిగిలి ఉన్న గతకాలపు వాసనలకూ,  ఎగబాకడమొక్కటే పరమావధిగా ఉన్న వర్తమాన ఆకాంక్షలకూ మధ్య జరిగే  బలహీనమైన
ఊగిసలాటకు అతను వేదిక. శివయ్య తన కొడుకు ఉద్యోగం సిఫారసు కోసం  వేణుగోపాలరావును ప్రాదేయపడినప్పుడు ఒక దశలో డబ్బు ప్రసక్తి లేకుండానే పని  చేయిద్దామా అన్నట్టూ ఊగిసలాడతాడు గానీ,  రాజారావు అతనిని తొందరగానే  వాస్తవంలోకి తేలగొడతాడు. ఇలాంటి ఊగిసలాటను పాఠకుడు సరిగ్గా అంచనా వేసుకోవడానికి రాజారావు సున్నితపు త్రాసులా పనికొస్తాడు. గతానికి   సంబంధించిన పనికి రాని ‘చెత్త’ నుండి బయటపడడానికి ఉత్ప్రేరకంగా కూడా పని  చేస్తాడు. రాజారావు ‘స్నేహం’ లేకుండా వేణుగోపాలరావు, వేణుగోపాలరావు కాడు.  అలాగని  రాజారావుకు పూర్తిగా డబ్బు మీదనే నమ్మకమా? డబ్బు లేకుండా పని  జరగకూడదని అంటాడా?  అంటే అలా  ఎన్నటికీ అతడు అనడు. అప్పుడప్పుడూ కాస్త  నిజం కలిపితే గానీ అబద్దానికి విలువుండదు అన్నట్టుగా, అప్పుడప్పుడూ కాస్త  మెరిట్‍కు కూడా చోటు దొరుకుతే గానీ మిగిలిన వాటికి ఢోకా ఉండదు అని నమ్మే  మనిషి తను. వ్యవస్థ ఆయువుపట్టు తెలిసిన వాడు కనుకనే మెరిట్‌కూ స్థానం  దొరకక పోదని ఆయన మనకు భరోసా ఇస్తాడు.

వేణుగోపాలరావులో కలిగిన  ఊగిసలాట శివయ్యకు అర్థం అవుతుంది కానీ,  దానిలోని ప్రయోజకత్వం పట్ల ఆయనకు నమ్మకం ఏర్పడదు. ఇంకా, డబ్బులు లేకుండా  నడిపే వ్యవహారంలో అసలుకే మోసం వస్తుందేమోననే భయం కూడా కలుగుతుంది. దీనికి  వ్యతిరేక దిశలో రాజారావు పట్ల అతనిలో నమ్మకం స్థిరపడుతుంది. ఇది క్షణ కాలం పాటు మనలో విస్మయం కలిగిస్తుంది. కానీ, కాసులు రాలకుండా ఉద్యోగం  రాదన్న సంగతి సమాజంలో స్థిరపడిపోయిన విశ్వాసంగా మనలో స్ఫురించినపుడు  దీనికున్న ప్రాసంగికత మనకు ఎరుకలోనికి వస్తుంది.

చివరకు, ఈ మొత్తం సంబంధాలనూ మీనాక్షీదేవి సమక్షంలో సైద్ధాంతీకరిస్తూ,  శివయ్య అవసరం కొద్దీ వచ్చిన మనిషనీ, కాబట్టి అతని నుంచీ ఇంకా డబ్బు వసూలు  చేయొచ్చుఅని వేణుగోపాలరావు అన్నప్పుడు వెంటనే  అతనిపై మనకు ధర్మాగ్రహం  కలుగుతుంది. కానీ లోకంలో స్నేహమే లేదంటే విస్మయపడే ఆమె ముందర అతని  ప్రసంగం వొట్టి వాచాలతేననీ మనం త్వరలోనే పసిగడతాం. పదే పదే దేనినైనా  సమర్ధించాల్సి రావడం .. అది బలంగా నాటుకోకపోవడం వల్లనే అన్న అవగాహనతో  వేణుగోపాలరావు ఇంకా రాజారావులా రాటుదేలలేదని రూఢీ చేసుకుంటాం. ఇంకా తరచి  చూసినపుడు వేణుగోపాలరావు ఎంత అసందర్భ ప్రలాపో కూడా మనకు ఇట్టే  బోధపడుతుంది. మీనాక్షీదేవి గారి సమక్షంలో ‘విష్ణుమూర్తిలాగా పవళించి’,  లోకంలో స్నేహమనేదే లేదని ఉవాచించడం, ప్రతీదీ అవసరాల కోసం చేసుకున్న  ఏర్పాటే అనడం వల్ల ఆ మాట మీనాక్షీ దేవికి కూడా తగులుతుందని, అది ఆమెను  నొప్పించి తీరుతుందన్న జ్ఞానం అతనిలో లేకపోయింది. అదే ఉన్నట్లయితే అతను  బహు నమ్మకంగా రాజారావు శివయ్యను లోబరుచుకున్నట్టుగా మాటాడి ఉండేవాడు.
ఇక్కడ కూడా వేణుగోపాలరావు తన అనుభవరాహిత్యాన్నే బయటపెట్టుకున్నాడు.  అయితే ఈ మాటలకు మీనాక్షీదేవిలో కలిగిన ప్రతిస్పందన కతాగమనాన్ని పూర్తిగా  మార్చి, కతను ఇంకొక తలంలోనికి ప్రవేశపెడుతుంది. అప్పటి వరకూ మధ్యతరగతిలో  ఉండే నమ్మకాలూ, విశ్వాసాలూ, పైకెగబాకాలనుకునే వెంపర్లాటలూ, వాళ్ళలోని  ఊగిసలాటలూ చెబుతూవచ్చిన కత, మీనాక్షీదేవి ప్రతిస్పందనతో తిరిగి  విశ్వాసాలకూ, స్నేహాలకూ లోకంలో విలువ ఉండితీరుతుందన్న మరో తలంలోనికి  ప్రవేశిస్తుంది. ఇది ఇప్పటి వరకూ కత నడచిన తలానికి, పూర్తి వ్యతిరేక  దిశలోని మరో తలం. విలువల గురించిన సంవాదంలో మానవీయమయిన ‘థీరీ’.  అందువల్లనే, మూడు రూపాయల కోసం గొంతులు కోయగల వాళ్ళున్న లోకంలో, మూడు వందల  కోసం  డాక్టరుగారు ఇట్టాంటి ‘థీరీ’ లేవదీసుంటారు లెమ్మని ఆమె చప్పున  గ్రహించగలుగుతుంది.

సామాజిక గమనంలో వ్యక్తులు ఒక దశ నుండీ ఇంకో దశకు మారుతున్నప్పుడు, పాత  స్నేహాల స్థానంలో కొత్త స్నేహాలు చోటు చేసుకుంటున్నప్పుడు, పాత సంబంధాలను  వదులుకొని కొత్త సంబంధాలను స్థిరపరుచుకుంటున్నప్పుడు వాటి సవ్యతను  సమర్దించుకోవడానికి, వ్యాఖ్యానిచడానికీ ఒక కొత్త భావజాలం అవసరం. ఇట్టాంటి  అవసరాన్ని సందర్భసహితంగా, మానవ సంవేదనలతో సహా పట్టుకున్న కత ‘స్నేహం’.  ఇది విలువల గురించిన సంవాదాన్ని ముందుకు తెస్తున్నది.

అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

–అవ్వారి నాగరాజు

(ఎ.నాగరాజుగారు ప్రకాశం జిల్లాలో టీచరుగా పనిచేస్తున్నారు. ఈయన రాసిన కవితలు, వ్యాసాలు అరుణతారలోనూ, ఒకటీ అరా ఆంధ్రజ్యోతిలోనూ వచ్చాయి. తొలినాటి రచయితలలో శ్రీపాద అంటే ఇష్టపడతారు. మానవ భావోద్వేగాలను,  అందులోని ఘర్షణను ప్రతిభావంతంగా చిత్రీకరించిన అల్లం రాజయ్య, రఘోత్తం  రచనలు అంటే చాలా ఇష్టమట. దళితవాదంతో సహా, అన్ని అస్తిత్వ వాదాలూ  పరిమితులకు లోనయ్యాయని నాగరాజుగారు అభిప్రాయపడుతున్నారు. స్త్రీవాద  రచనలను చాలా సంవత్సరాలుగా కొనసాగిస్తున్న పి.సత్యవతిగారి కథలను  మెచ్చుకున్నారు. నాగరాజుగారి బ్లాగ్ minnalpoetry.blogspot.com)

 

 

( వచ్చే వారం  ” సంకల్పం” కథ గురించి  పి. సత్యవతి గారు పరిచయం చేస్తారు)

శాంతి-ఆలోచనా పరుల కథ

karalogo
నిర్వహణ: రమాసుందరి బత్తుల

 

కారా కథల మీద రాయొచ్చు కదా, శాంతి గురించి రాయండి అని మిత్రులు అడగ్గానే ఇపుడు కొత్తగా దివిటీ పట్టడమేమిటి అనిపించింది. బహుశా ఈ కాలపు పిల్లలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడం కోసం అడిగి ఉంటారనిపించింది. కారా కథలు మానేసిన తర్వాత(సంకల్పం మినహాయింపు) పుట్టిన పిల్లలం. పెద్దల మాటలు విని ఆ కథలు సేకరించి చదవడం తప్ప ఉడుకుడుకు అక్షరాలు చదివే అవకాశం లేదు. చదవడం వరకే అయితే కథ వేరు. కథలపై అభిప్రాయం చెప్పాలంటే మాత్రం స్థలకాలాల ఇబ్బందిని దాటాల్సి ఉంటుంది.

శాంతి 1971 కథ. 71 అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పాలా! నక్సల్బరీ గాలి శ్రీకాకుళం మీదుగా ఉత్తర తెలంగాణకు వ్యాపిస్తున్న కాలం. శ్రీకాకుళం ఆటుపోట్లమధ్య మిణుకుమిణుకు మంటుంటే ఉత్తర తెలంగాణలో కొలిమంటుకుంటున్న కాలం. సిపిఐ ఎంఎల్‌ ఆవిర్భవించి తొలిఅడుగులు వేస్తున్న కాలం. త్వరలోనే సాధిస్తాం అని ఆ ప్రయాణంలో ఉన్న వాళ్లు చాలామంది నిజంగానే నమ్మిన కాలం. ”కా.రా.గారు, ఐవి కూడబలుక్కుని సమిధలు, సరంజామా సమకూర్చుకుంటున్న” కాలం. కారాగారు సమకూర్చుకున్న సరంజామా ఏమిటో శాంతిలో కనిపిస్తుంది. యజ్ఞం మరి తొమ్మిది కథల్లో కనిపిస్తుంది. శ్రీకాకుళ ఉద్యమానికి అక్షరాండగా రాసిన కథలివి. ఇవి వర్గపోరాట చైతన్యపు కథలు . లోతూ విస్తృతీ ఉన్న కథలు.

కారా మాటలెంత పొదుపుగా సౌమ్యంగా ఉంటాయో రాతలు అంత విస్తారంగా ఘాటుగా ఉంటాయి. వీటిలో కొంత ప్రాపగాండా లక్షణం ఉంటుంది. విషయాన్ని వివరంగా చెప్పేయాలనే తపన ఉంటుంది. అది అప్పటి అవసరం కావచ్చునేమో! “వృత్తాంతం ద్వారా వ్యక్తమయ్యే అసలు విశేషమే కథ” అన్న స్వీయనియమాన్ని నిక్కచ్చిగా నిష్ఠగా పాటించిన రచయితగా కారా ఈ దశలో కనిపిస్తారు. ఏదో ఒక నిర్దుష్టమైన విషయాన్నిప్రతిపాదించడానికో వివరించడానికో సీరియస్‌ ఎజెండా పెట్టుకుని ఈ దశలో వరుసగా కథలు రాసినట్టు కూడా అనిపిస్తుంది. ఒక్కముక్కలో ఆయన కలం కార్యకర్త పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు.

అసమసమాజంలో శాంతి అనే పదం ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు ఉపయోగపడుతుందో వివరిస్తుంది శాంతి కథ. స్టేటస్‌కోయిస్టుల శాంతి మంత్రం వెనుక ఉన్న బూటకత్వాన్ని ఎండగడుతుంది. కథనిండా యజమాని- కార్మిక సంబంధాలపై లోతైన చర్చ ఉంటుంది. బలవంతుడి ఎత్తుగడలు, వాటిని చిత్తు చేసేందుకు బలహీనుల స్థిరచిత్తం, వీరిద్దరి మధ్యలో బ్యూరాక్రసీ తెలివితేటలు ఉంటాయి. జ్ఞానం, తెలివితేటలు, చిత్తశుద్ధి, అంకితభావం వగైరా లక్షణాలు మూర్తీభవించిన కార్మిక నాయకుడు, అన్నింట్లోనూ లౌక్యాన్ని చూపే ‘నిస్సహాయపు’ కలెక్టర్‌, ఎలాగైనా ఈ వ్యవస్థ తనకు అండగా నిలబడి తీరుతుంది అనే నమ్మకమున్న ధనబలశాలి మిల్లు యజమాని- మూడు ప్రధానపాత్రలుగా కథ సాగుతుంది.

ఈ కథ చదువుతున్నపుడు అపుడెపుడో సీఫెల్లో చూసిన క్యూబా సినిమా లాస్ట్‌ సప్పర్‌ గుర్తొచ్చింది. 1976లో వచ్చిన ఈ సినిమాలో చిత్రించిన కాలం పద్దెనిమిదివ శతాబ్ది చివరి రోజులకు సంబంధించినది. చెరుకు తోటల యజమాని, అతని బానిసలు, చర్చి ఫాదర్‌ మూడు కేంద్రాలుగా సాగేకథ. ఇక్కడ స్టీల్‌ మిల్‌ యజమాని అయితే అక్కడ షుగర్‌ మిల్‌ యజమాని. ఇక్కడ కార్మికులు అయితే అక్కడ బానిసలు. ఆధునిక కలెక్టర్ స్థానంలో చర్చి ఫాదర్‌. అందులోనూ శాంతి గురించి స్వేచ్ఛ గురించి చర్చ ఉంటుంది. కాకపోతే చర్చే ప్రధానం కాదు.

రెండు వేర్వేరు దేశాల్లో వేర్వేరు సామాజిక దశలకు సంబంధించిన జీవితాన్ని చిత్రించిన వేర్వేరు కళా ప్రక్రియలైనప్పటికీ బలవంతుడు, లేదా వారి ప్రతినిధి శాంతి మంత్రం పఠించే తీరు దాదాపు ఒకే రకంగా ఉంటుంది. యజమాని ఉదారంగా పన్నెండు మంది బానిసలను పిల్చి తనతో సమానంగా టేబుల్‌పై కూర్చుండబెట్టుకుని లాస్ట్‌ సప్పర్‌ జరుపుకుంటాడు. ఈ సందర్భంగా బానిసలకు- యజమానికి మధ్య జరిగే సంభాషణ, వారి హావభావాలు మర్చిపోవాలన్నా మర్చిపోవడం కష్టం. అంతేనా! యజమాని నదిదాకా తీసుకువెళ్లి వారి కాళ్లు కడిగి ఆ ‘పుణ్య తంతు’ కూడా జరిపించిన రెండు రోజులకే వారి తలకాయలన్నీ పోల్స్‌మీద వేలాడదీయడంలో మనకు ఆ నాటి బలవంతుల శాంతి స్వరూపం అవగతమవుతుంది.

లాస్ట్‌ సప్పర్‌ కూడా విప్లవ సినిమానే. కమ్యూనిస్టు సినిమానే. కానీ తొలిరీల్‌నుంచే ఇది కమ్యూనిస్టు సినిమా అనే ఎరుకను మనకు కలిగించరు. సినిమాలో దర్శకుని హృదయం ఎక్కడ ఉందో అర్ఠమవుతుంది, అంతే! బలవంతుడి శాంతి మంత్రం ఎంత బూటకమో కళాత్మకంగానే చెపుతారు. సినిమా పొడవునా మనం నవ్వుతాము, ఏడుస్తాము. పాత్రల వెంట నడుస్తూనే ఉంటాము. సినిమా సరే, రావిశాస్ర్తి కథలో! ఆ కోవకే చెందిన మరికొందరు గత, వర్తమాన, వర్థమాన రచయితల కథలో!

ఆ రచనలు చదువుతున్నపుడు కాసేపు వారి ఆధీనంలోకి వెళ్లిపోతాం. వారు సృష్టించిన పాత్రల వెంట తిరుగుతూ ఆ భావోద్వేగాల్లో భాగమవుతాం. ఆ పాత్రలతో బంధమేర్పడుతుంది. అలాంటి జీవితమే ఉన్న పాఠకుల జ్ఞాపకాలను కదిపి అలజడి రేపుతారు.రచయిత తాడు పట్టుకుని ఆడిస్తూ ఉంటాడు. మనం కోతుల్లాగా ఆడుతూ ఉంటాము. అది ఆర్ట్‌ మహిమ. శాంతి లాంటి కథలతో వచ్చిన చిక్కేమిటంటే ఇందులోని పాత్రలతో అలాంటి అనుబంధమేదీ ఏర్పడదు. పెద్దమనిషి గంభీరంగా విషయాలు చెపుతూ ఉంటే కాస్త ఎడంగా నుంచొని వింటున్నట్టు ఉంటుంది. ఇలాంటి కథలు మన మనసును పెద్దగా తాకవు. మేధనే తాకుతాయి.

ఇవి మన మేధను పెంచడం కోసం, వర్గపోరాట ద్పృక్పథాన్ని పదును పెట్టడం కోసం రాసిన రాజకీయ కథలు. విశాలమైన అర్థంలో రాజకీయం లేకుండా ఏ కళా ఉండదు. పైగా కారా రాసింది పీడితులకు అవసరమైన రాజకీయాలు. కాబట్టే వామపక్ష శిబిరం చాలా యేళ్లుగా ఎత్తుపీట వేసి గౌరవిస్తున్నది. కాకపోతే కళారూపం సమర్థంగా లేకపోతే అది రాజకీయవాసన గాఢంగా ఉన్న జీవులను తప్ప ఇతర జీవులను అంతగా ఆకర్షించదు. మోనోలాగ్‌గా మారిపోయే ప్రమాదం ఉంది. కారా కథలన్నీ అలాగే ఉన్నాయనే దుస్సాహసం చేయబోను. జీవధారను అలా అనగలమా! నోరూమ్‌ని అనగలమా!

కానీ శాంతి కథలో రాజకీయ చర్చల బరువుకు కళారూపం అణగిపోయిందేమో అనిపిస్తుంది. పాత్రల చిత్రణలో కూడా స్టీరియోటైప్‌ లక్షణం కనిపిస్తున్నది. మందు, విందు, పొందుల కలబోతగా నల్లని బొచ్చుశరీరం కలిగిన ఫ్యాక్టరీ యజమాని చిత్రణే తీసుకోండి. భార్యను పట్టించుకోక ఆమెను లైంగిక అసంతృప్తి అగ్గిమంటకు ఆహుతి చేస్తూ అతను మాత్రం రోజొక అమ్మాయితో కులకడం వంటి లక్షణాలు చూస్తే సాధ్యమైనన్ని “దుర్లక్షణాల’తో అతనిమీద కోపం తెప్పించాలనేది రచయిత వ్యూహంగా కనిపిస్తున్నది. కథాక్రమంలో అతని దోపిడిస్వభావం మీద కోపం తెప్పించవచ్చునుగాని కారా వంటి రచయితకు ఈ అడ్డదారేల! కుప్పబోసినట్టు ఇన్ని “దుర్లక్షణాలు’ లేకుండా కూడా ఫ్యాక్టరీ యజమానులు చాలామంది ఉంటారు. ఆధునిక పెట్టుబడిదారుల్లో అనేకులు మందు, చిందుల జోలికి పోకుండా కార్మికుడి కంటే ఎక్కువ గంటలే పనిచేయవచ్చును. వారు దోపిడీదారులు కాకుండా పోతారా!

సత్యమే శివం సినిమాలో సూటూ బూటూ వేసుకుని డాబుగా ఉన్న మనిషి సూట్‌కేస్‌ కొట్టేసే సీన్‌ ఉంది కదా, అదే సరైన రాజకీయ దృష్టికోణం అవుతుంది. సమాజంలో మంచిచెడులకు, ఎక్కువ తక్కువలకు దర్పణాలుగా స్థిరపడిన స్టీరియోటైప్‌ లక్షణాలను ఉపయోగించుకోవడం స్టేటస్‌ కోయిస్టులకు అవసరం. తాత్కాలికంగా మనకు కూడా ఉపయోగపడినట్టు అనిపించినా దీర్ఘకాలికంగా నష్టం చేస్తాయి. బహుశా ఆనాటికి కథలో చిత్రించిన సమాజం ఇంకా పాతదశలోనే ఉంది కాబట్టి ఫ్యూడల్‌ లక్షణాలు బలంగా ఉన్న సమాజంలో మంచిచెడులు ఇపుడున్న సమాజంతో పోలిస్తే బ్లాక్‌ అండ్‌ వైట్లో కనిపించే అవకాశం ఉంది కాబట్టి అప్పటి అవసరాలకు అనుగుణంగా రాశారు అనుకోవాలా!

సాంఘిక దురాచారాలమీద కాని, కొన్ని ప్రభుత్వ విధానాల దుష్ఫలితాల మీదకాని, వ్యవస్థలో కనిపించే కొన్ని దుర్లక్షణాల మీదకానీ లేక ఇదే కోవకి చెందిన మరేదో అవకరం మీదకాని, మన అభిప్రాయాలను కథగా చెప్పాలనుకుంటాము. కొన్ని పాత్రలను ప్రవేశపెడుతూ మొదటి పేరాని కథలా ఆరంభించి క్రమక్రమంగా కథను ఒక చర్చాగోష్టిలా సాగించి, మన అభిప్రాయాలను ముఖ్యపాత్ర ద్వారా చెప్పించేస్తాం. అలా చేస్తే అది కథ ముసుగేసుకున్న చర్చా వ్యాసమౌతుందిగాని కథ కాదు” అంటారు కారా.

ఈ లక్షణం శాంతి కథలో కూడా జొరబడినట్టు అనిపిస్తుంది. అయితే సౌష్టవం కొద్దిగా దెబ్బతిన్నప్పటికీ కథా రూపమైతే ఉన్నది. కుట్రలాగా కథ కాకుండా పోలేదు. కుట్రను కూడ కథ అనే వారు, ఆ మాటకొస్తే గొప్ప కథ అని కీర్తించే వారు ఉన్నారని తెలుసు. ఎవరి దృష్టికోణం వారిది. దృక్పథం లేకుండా భాషా నైపుణ్యంతోనూ క్రాఫ్ట్‌తోనూ చెమక్కుమనిపించి మాయమైపోయే కథలతో ఇబ్బంది ఉన్నట్టే క్రాఫ్ట్‌ను నిర్లక్ష్యం చేసి కథను రాజకీయ ఉపన్యాస వేదికగా మార్చే కథలతోనూ ఇబ్బంది ఉంటుంది. “కారా సాధారణ పాఠకుల రచయిత కాదు, ఆలోచనాపరుల రచయిత అన్న వల్లంపాటి అన్నపుడు కూడా ప్రశంసతో పాటు సున్నితమైన విమర్శనాధ్వని ఉందేమో అని అనుమానం.

 -జి ఎస్‌ రామ్మోహన్‌

 RAM MOHAN _ FB

 

42 సంవత్సరాల శ్రీరామ్మోహన్ గారు రెండు దశాబ్దాలు పైగానే పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఎదురీత, వర్తమానం, వార్త, ఆంధ్రజ్యోతి, ఈటీవీలలో పని చేశారు. ప్రస్తుతం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నారు. రష్యన్ సాహిత్యాన్ని ఎక్కువగా ఇష్టపడే రామ్మోహన్ గారు దొస్తోవ్ స్కీ , టాల్ స్టాయ్, మార్క్వెజ్ రచనలను ప్రేమిస్తారు. రావిశాస్త్రి, పతంజలీ, నామినీ, పి. సత్యవతి, బండి నారాయణ స్వామి రచనలు ఎక్కువగా ఇష్టపడతారు. మోహనరాగం పేరుతో ఉండే రామ్మోహన్ గారి బ్లాగ్ అడ్రెస్స్ gsrammohan.blogspot.in

 

వచ్చే వారం : అవ్వారు నాగరాజు ‘స్నేహం కధ’ గురించి పరిచయం చేస్తారు

 

శాంతి కథ ఇక్కడ చదవండి:

తాత్విక ‘జీవధార’

karalogo
నిర్వహణ: రమాసుందరి బత్తుల

’జీవధార’ కారా కధలన్నిటిలోకీ విశిష్టమైనది. ఇది కేవలం ఒక కధ కాదు. కారా కధలన్నిటా అంతర్వాహినిగా ప్రవహించి వాటిని సుసంపన్నం చేసిన ఆయన ప్రాపంచిక దృక్పధం. ఇది ఆయన తాత్విక జీవధార.

కారా తనకాలం విసిరిన సవాలును స్వీకరించి ప్రజలపక్షం తీసుకోవడంలో ఆయన నిబధ్దత ఉంటే , తను ఏ వైపు ఉన్నాడో ఆ ప్రజల జీవితాన్ని, వారి నిత్యజీవిత సంఘర్షణను అతి సమీపంనుండి నిశితంగా గమనించి అక్షరీకరించడంలో ఆయన సంవేదన ఉంది. నక్సల్బరిలో రాజుకొని దేశమంతా కార్చిచ్చులా అల్లుకుంటున్న విప్లవోద్యమానికి ఇరుసయిన వర్గ సంఘర్షణ తాలూకు ఆనవాళ్ళను తన చుట్టూ జీవితంలో కనిపెట్టగలగడంలోనే కారా అనన్య సామాన్యమయిన ప్రతిభ ఉంది.

ఆయన ఎంచుకున్న వస్తువు నీళ్ళు. మనిషి ప్రాధమిక జీవనాధారం. అందుకే ఆయన ‘జీవధార’ అన్నాడు. అదే మానవ నాగరికతకు ఆలంబన. అందరికీ సమాన హక్కులున్న ఒక సహజ వనరు. నీరు పల్లమెరుగు. అది దాని సహజ ధర్మం.

మరి పల్లానికి ప్రవహించాల్సిన నీరు బంగళాల మీది తోటల్లోకి ఎట్లా పరిగెత్తింది? శక్తి దానిని నడిపింది?

దాహం గొన్న మనిషికీ దాన్ని తీర్చే నీటికీ మధ్య శక్తి అడ్డుగా నిలిచింది?

దాన్ని దాచి కాపాడే శక్తి ఎక్కడుంది?

ఇనుప గేటులోనా? యజమాని గొంతు లోని భావన్ని కనిపెట్టి మీదికి దూకే ’బేపి’ల్లోనా? యజమాని మాట మాత్రమే వినిపించే నరసింహులులోనా? వీళ్ళందరి మీదుగా కనిపెట్టి చూస్తున్న పోలీసులూ, చట్టాలూ, కోర్టుల్లోనా? కారా మనల్ని ఈ ప్రశ్నలు అడగడు. జవాబులూ చెప్పడు. ఆయన తన మానాన తాను ఒక జీవన చిత్రాన్ని ఆవిష్కరించి వెళ్తాడు. రక్తమాంసాలున్న మనుషుల్ని మన ముందుంచి వెళ్తాడు. వాళ్ళతో కలసి అన్వేషించడం మనపని.

తొలి యవ్వన మాధుర్యం ’సిటం’ సేపు మైమరిపించినా జీవన కాఠిన్యతను మర్చిపోని అమ్మాజీ.. బతిమాలైనా, కొట్లాడయినా బ్రతకడం ముఖ్యమని, దీనికి మంది బలం అవసరమని గుర్తించిన సత్యవతి.. పల్లెనుండి వచ్చి నగరం ఉక్కపోతకి ఉక్కిరిబిక్కిరయినా బిడ్డ ఏడుపుకు కారణం తెలుసుకొని చెమట తుడుచుకొని స్తన్యమిచ్చినంత సులువుగా పరిస్థితులనర్ధం చేసుకోగలిగిన తవిటమ్మా.. రాజీపడటం తప్పుకాదనీ, తప్పదనీ చెప్పి పోరాటాన్ని ఫలప్రదంగా ముగించగలిగిన లౌక్యమున్న అప్పాయమ్మ .. ఇంకా ఇలాంటివాళ్ళే చాలామంది పేదోళ్ళవాడలోనుండి తాగేందుకు గుక్కెడు నీళ్ళకోసం రావుగారి గేటు ముందు నిలబడతారు. గేటు లోపల కూడా స్త్రీలే. కాకపోతే వాళ్ళ పేర్లే తెలీదు. ముసలావిడా, మధ్యవయసు స్త్రీ, తెల్లపిల్ల.

రచయిత ఇక్కడే తనెటు వైపు నుండి కధ చెబుతున్నాడో చెప్పకనే చెబుతాడు. వాడలోని వాళ్ళు తనకి పరిచితులు. బంగళా తనకి అపరిచితం, పరాయి. లోపల గదిలో వాళ్ళెందుకు నవ్వుకుంటున్నారో అమ్మాజీకెంత తెలుసో మనకూ అంతే తెలుసు. అంతకుమించి వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు మనకు పరాయి. కానీ అమ్మాజీ ఎంత అవమానపడ్డదో, సత్యవతి ఎంత రోషపడ్డదో, తవిటమ్మ ఎంత బెదిరిపోయిందో మనమూ అంతే అవమానపడతాం.. రోషపడతాం.. బెదిరి పోతాం. రచయితగా కారా మనల్ని తనతో పాటు వాడలోకి తీసుకెళ్తాడు. సత్యవతి మొదటిసారి తవిటమ్మ ఇంటికి వెళ్ళినట్టుగా మనంకూడా అట్లా గోడవారగా వెళ్ళి నిలబడతాం.

ఫోటో: కూర్మనాధ్

ఫోటో: కూర్మనాధ్

వీధి కొళాయి నుండి నీరు ఝాకొడుతూ వస్తున్నప్పుడు ఒకరినొకరు పలకరించుకున్నవాళ్ళు, ధార తగ్గేసరికి వాదులాడుకోవడం మొదలెడతారు. ఇంకా సన్నబడితే తోసుకుంటారు. కడవలు తిరగబడతాయి. ఇక్కడ శాంతిభద్రతలు కాపాడ్డానికి పోలీసులొస్తారు. కోర్టులు, కేసులు. పోనీ సరిపడినన్ని నీళ్ళివ్వచ్చు కదా! సత్యవతి మాటల్లో ’ఎక్కడలేని నీళ్ళు వీళ్ళలాటోళ్ళ మొక్కలకే సాలవ్’. అవి కూడా ఎలాంటి మొక్కలూ..? ఒక పువ్వు పూయని, ఒక కాయ కాయని మొక్కలు. ఆ బంగళాలోని టాపుని మున్సిపాలిటీ వాళ్ళు కట్టెయరు. వాడలోని వాళ్ళకి ఆ బంగళా వాళ్ళు ఒక కడవ పట్టివ్వరు. ముసలమ్మ మాటల్లో ఒకసారి పట్టుకోనిస్తే రోజూ వస్తారు. అదే అలవాటవుతుంది. ఆ తర్వాత హక్కవుతుంది. అసలు అందరికీ హక్కున్న నీరు కొద్ది మంది దెట్లయింది?.. ఇక్కడే ఈ కధ ’ప్రాసంగికత’ ఉంది.

ఈ దేశంలో’అభివృద్ధి’ పేరుతో జరిగిందీ, జరుగుతున్నదీ అందరికీ చెందిన సహజ వనరులను కొందరికి దఖలు పరచడమే. పెట్టుబడి బలపడని కాలంలో మౌలిక వసతులు, పరిశ్రమల పేరుతో నెహ్రూ ఆర్ధిక నమూనా చేసింది పెట్టుబడిదారులకు కావలసిన సౌకర్యాలు అందించడమే. రావుగారు వాడలోని వాళ్ళపేరుతో నీళ్ళూ కరెంటూ తెప్పించినందువల్ల జరిగింది ఆయన స్థలాల విలువ ఒకటికి పదిరెట్లు పెరగటమే.. ఒక కారు రెండు కార్లయ్యాయి. అదే నిష్పత్తిలో ఆయన హోదా కూడా పెరిగింది. సహజంగానే మున్సిపాలిటీ వాళ్ళు బాబుగారి టాపు కట్టేయడం మానేశారు. ఇంతా జేస్తే ప్రాణావసరమైన నీళ్ళు రావుగారి తోటలో పూలు పూయని , కాయలు కాయని మొక్కల విలాసానికి ఖర్చయిపోతాయి. అందుకే నీటి విలువ తెలిసిన తవిటమ్మ “మా ఊళ్ళో ఈ మాత్తరం తోట సొంతానికుంటే ఒక కుటామం సునాయాసంగా బతికేస్తది” అనుకుంటుంది.

ఇక్కడ నీరు ధర్మం తప్పింది. ఒక్క పువ్వుకీ, ఒక్క కాయకీ నోచుకోని తోట కోసం దారి తప్పింది. ఈదేశంలో ఇది నీటికి మాత్రమే పరిమితమైంది కాదు. మూడు పంటలు పండే నల్లరేగడి భూములనుండి మొదలుకొని దట్టమైన అడవులూ, పచ్చనికొండలూ, సముద్రతీరాలూ అన్నీ వాటి సహజధర్మాల్ని వదిలిపెట్టి, కుళాయిలోని నీళ్ళు మెరక మీద బంగళాలోనికి ప్రవహించినట్టుగా, రావు గారు పనిచేసిన కంపెనీల సంపదగా మారిపోయాయి. కాకపోతే ఇప్పుడు రావుగారి వారసులకు ప్రభుత్వ సాయం అవసరంలేదు. వాళ్ళే తవ్వుకోగలరు, పైపులు వేసుకోగలరు, కరెంటు చేసుకోగలరు, వీటన్నిటికీ ఆవసరమయిన అనుమతులిచ్చే ప్రభుత్వాన్ని కూడా వాళ్ళే గెలిపించుకోగలరు.

మరి వనరుల అసలు హక్కుదారులైన ప్రజలెట్లా బ్రతకాలి? ఎక్కడికెళ్ళాలి?

ఆ అనివార్యత లోంచే వీళ్ళు బంగళాల ఇనుప గేట్ల ముందు గుమి గూడతారు. గొడవపడతారు. బంగళాల వాళ్ళకు, వాటికి కాపలా కాసే నరసింహులులాంటి వాళ్ళకూ అది దొమ్మీలా కన్పిస్తుంది. పోలీసులూ కుక్కలూ ఉండనే ఉన్నాయి. అయినా అప్పాయమ్మ ముసలావిడతో “ఒక అందం ఉందని ఇరగబాటా, ఒక సందం ఉందని యిరగబాటా, లేప్పోతే మళ్ళూ మాన్నేలూ డబ్బూ మాకు మీకన్నా ఎక్కువుండాయని యిరగబాటా, ఏటి సూసుకొని మీ ముందు యిరగబడిపోతాం’ అన్నప్పుడు తలా ఒక బిందె పట్టుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇది కేవలం తన అహం సంతృప్తి పడటం వల్లనే కాదు, ఈ గొడవను కొనసాగించడవల్ల వచ్చే పర్యవసానాల పట్ల గల సంశయం వల్ల కూడా కావచ్చు. ఇక్కడే కలవాళ్ళ భయం లేనివాళ్ళ తెగింపుతో రాజీకొస్తుంది. అయితే ఇది కేవలం తాత్కాలికం. ఇద్దరు ముగ్గురై, ముగ్గురు పదిమందై కలవాళ్ళ గేటుముందు గొడవపడక తప్పదు. ఇది ఎప్పటిదాక?

ఈ కధ రాసేనాటికి కలవాళ్ళు, లేని వాళ్ళ మధ్య గొడవను శాశ్వతం గా ముగించేందుకు ఒక పెనుగులాట మొదలైంది. ఒక యుద్ధం, ఒక పోరాటం మొదలైంది. దమ్ముంటే కుక్కను విప్పమని సవాల్ చేసిన సత్యవతి లాంటి వాళ్ళు ఆ యుద్ధానికి సైనికులయ్యారు, సేనానులయ్యారు.

కలవాళ్ళూ లేనివాళ్ళ మధ్య తగవు ఏ అంశాన్నీ వదిలిపెట్టలేదు. పదేళ్ళ కిందటి పరిచయం శేషుబాబుకీ, ఆ యింటి ఆడపిల్లలకీ ’ఓ నువ్వా’ అనే వేళాకోళం. ఇదంతా అమ్మాజీకి అవమానకరమైన సందర్భం. మనసులో ఎర్రగా బుర్రగా టెర్లిన్ షర్ట్ టక్ చేసుకున్న శేషుబాబు గురించి ఊహయినా రానివ్వని అమ్మాజీ ’సవుద్రాల్ని’ మాత్రం రావొద్దని చెప్పలేదు.

తవిటమ్మ ఊరినుండి వచ్చింది. అమ్మాజీ వాళ్ళు షరాబులు కాకపోయినా వడ్రంగం పని ఎట్లా చేస్తున్నారా అని ఆశ్చర్యపోతుంది. నగర జీవితంలో కులాల నుండి వృత్తులు వేరవడం తవిటమ్మ అనుభవంలో లేని విషయం. రావు గారి కులమేంటన్న తవిటమ్మ ప్రశ్నకి సమాధానంగా అమ్మాజీ “ఏదో పెద్ద పనే” అంటుంది. వాడలోవాళ్ళకి బంగళా వాళ్ళంతా ఒక కులమే.

ఈ దేశంలో.. ఆమాట కొస్తే ఏ దేశంలోనైనా, కొద్దిమంది కలవాళ్ళు ఆసంఖ్యాకులైన లేనివాళ్ళ మధ్య కలహం ఇప్పటిది కాదు. ఇప్పుడప్పట్లో ముగిసేదీ కాదు. ఎన్నో అంతర్బహిర్ యుద్ధాలు జరగాలి. దానికి కావలసిన పూనికను ఈ కధ విజయవంతంగా అందిస్తుంది. అందుకే ఇది కేవలం కధ కాదు. తాత్విక ’జీవధార’.

                                                                                      –యెనికపాటి కరుణాకర్

కరుణాకర్

వై కరుణాకర్ ప్రకాశం జిల్లాలో టీచరుగా పని చేస్తున్నారు. కార్టూన్లు వేయటం వీరికి ప్రియమైన విషయం. Karunacartoon.blogspot.in పేరుతో ఉన్న కరుణాకర్ గారి బ్లాగ్ లో సీరియస్ పొలిటికల్ విమర్శ, కార్టూన్ల రూపంలో ఉంటుంది. కరూణాకర్ గారు రాసిన కధా విమర్శలు గతంలో అరుణతార, సాహిత్య నేత్రం పత్రికల్లో వచ్చాయి. స్వాతంత్రం ముందు రచయితల్లో కరుణకుమార అంటే ఇష్టమట. అల్లం రాజయ్య, కొడవటిగంటి కుటుంబరావు గారు ఈయన ఇష్టమైన రచయితలు. వర్ధమాన రచయితల్లో బమిడి జగదీశ్వరరావు, ఆర్. ఎం. ఉమామహేశ్వరరావులను ఇష్టపడతారు. విమల, తెరేష్ బాబు, మద్దూరి నగేష్ బాబు, కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని కవిత్వం చాలా ఇష్టం.

వచ్చే  వారం జి.ఎస్ రామ్మోహన్ గారి “శాంతి” కధ గురించిన పరిచయం

‘జీవధార’ లింక్ ఇక్కడ:

కష్టజీవి ఆత్మాభిమానం… ‘ఆదివారం’!

 

karalogo
నిర్వహణ: రమా సుందరి బత్తుల

పని చేసేవారికి కాకుండా ఆ పనిని చేయించేవారికీ, చేయించుకునేవారికి గౌరవాలు దొరికే సమాజం మనది. అందుకే శ్రామికులకు పనిచేసే అవకాశం కల్పించి వారిని పోషిస్తున్నామని ధనికులు భావిస్తుంటారు. వారి జీవితాలు తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడివున్నాయనే అభిప్రాయంతో ఉంటారు.

కానీ నిజానికి ఎవరు ఎవరిపై ఆధారపడివున్నారు?

పని మనిషి పొద్దున్నే వచ్చి ఇల్లు ఊడ్చి, అంట్ల గిన్నెలు తోమకపోతే గృహ వాతావరణం గందరగోళంగా తయారై, ఇంటిల్లపాది సుఖశాంతులకూ ముప్పు వచ్చే సందర్భాలు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఇళ్ళలో సాధారణం. కానీ అంత చాకిరీ చేసేవారికి ప్రతిఫలంగా కొద్ది మొత్తం ఇవ్వటానికే కొందరు బాధపడిపోతుంటారు.

ఆ శ్రామికులపై సానుభూతి చూపటం అటుంచి … వాళ్ళ ఆశపోతుతనం, షోకులూ, ఫ్యాషన్ల గురించి వ్యంగ్యంగా విసుర్లూ, జోకులూ, కార్టూన్లూ చలామణిలోకి వచ్చాయి. ఈ ధోరణి చివరకు సాహిత్యంలో కూడా ప్రవేశించింది. ‘జీతం పెంచాలా? ఇంకా నయం- ఆస్తి రాసివ్వమని అడగలేదు’ అని ఆశ్చర్యాలుపడుతూ పనిమనుషుల దాష్టీకాలకు గురయ్యే మధ్యతరగతి గృహిణుల కష్టాలపై జాలి కురిపిస్తూ కథలు కూడా వచ్చేశాయి. వీటిని రాసినవారు శ్రామికులపై సానుభూతి లేనివారని తెలుస్తూనేవుంటుంది.

కానీ వీటికి భిన్నంగా… యాబై సంవత్సరాల క్రితమే కాళీపట్నం రామారావు రాసిన ‘ఆదివారం’కథ ఓ కష్టజీవి ఆత్మాభిమానాన్నీ, స్థైర్యాన్నీ కళాత్మకంగా చిత్రీకరించింది. శ్రామిక పక్షపాతంతో రాసి పాఠకులను ఒప్పించేలా కథను తీర్చిదిద్దారు రచయిత.

డబ్బున్న ఓ ఇంటి కోడలి కోణంలో ఈ కథ నడుస్తుంది. ‘మా యింట్లో పనిమనిషి లేనిదే పూట గడవదని ఏనాడో తేలిపోయింది’ అంటుందామె. (ఇది ఇప్పుడు మనం చాలా ఇళ్ళలో గమనిస్తున్న నిత్యసత్యం.) ఆమె అత్త లౌక్యురాలైన అరవై ఏళ్ల వయసున్న పెద్దావిడ.

ఆ ఇంట్లో పని మనిషి అంకాలు. ఈమె భయపెడితే జడుసుకోదు. కలియపడదామంటే తిరగబడుతుంది. డబ్బాశకూ లొంగిరాదు. మనసులో విషయం దాచి మసిపూసి మారేడుకాయ చెయ్యడంలో తమకన్నా రెండాకులు ఎక్కువ చదివిందనీ, ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగలదనీ కోడలి అభిప్రాయం.

ఈ కొరకరాని కొయ్య అంకాలు వారానికో రోజు సెలవు కావాలని అడిగితే అత్త పేచీ పెట్టుకుంటుంది. వేరే పనిమనిషిని పెట్టుకోవాలని మూడు రోజులు ఎన్నిపాట్లు పడినా ఫలితం ఉండదు. గర్వభంగమై బింకం సడలిపోతుంది. కానీ ఏదోరకంగా తన పైచేయి ఉండాలని ఆదివారం కాకుండా మరే రోజునైనా సెలవు తీసుకొమ్మని అంకాలును ప్రాధేయపడుతుంది.

బలిష్ఠమైన మనిషి నిస్సహాయంగా బక్క వ్యక్తిని ఒప్పించటానికి ప్రయత్నిస్తుంటే ఆ అరుదైన దృశ్యం ఎవరికైనా సంతోషం కలగజేస్తుంది. ఇక్కడ అత్త మనస్ఫూర్తిగా కాకుండా ఎత్తుగడతోనే పని మనిషిని బతిమిలాడినా ఆ ఆక్రోశం వీనులవిందుగానే ఉంటుంది.

‘అంట్లు తోముతూ కూర్చుంటే నాకు నగుబాట్లుగా ఉంటుంది. ఆదివారం నాడు మాత్రం నా చుట్టాలు పక్కాలు మధ్య నా పరువు నిలబెట్టు.’ అని ప్రాధేయపడినప్పుడు- ‘దాసీ ముండన్నేనట- యీ యమ్మ పరువు నిలబెట్టాలట!’ అని ఆ పరువు డొల్లతనాన్ని అంకాలు బట్టబయలు చేస్తుంది.

అత్త తన పంతం నెగ్గించుకున్నానని తృప్తిపడటంతో కథ ముగుస్తుంది.

* * *

అంకాలు పాత్ర చిత్రణ గొప్పగా ఉంటుంది.   తనకు డబ్బు ఎక్కువ వస్తుందనేది కూడా పట్టించుకోకుండా తోటి పనిమనిషి సూరమ్మకు జరిగిన అన్యాయం గురించి ఆమె నిలదీస్తుంది.

‘నిజంగా కాయకష్టం చేసుకునే వాళ్ళ కష్టాలు యీ గవన్నెంటు కెప్పుడు పట్టాయి; మాకు వాళ్ళూ వీళ్ళూ రూలు పెట్టేదేవిటి; మేవే పడతాం రూల్సు’అనే ధీమా!

‘అదేటి కలకటేరా గవినేరా- నాలాగే పన్జేసుకునే కూలిముండ. దాన్తో సెప్పుకుంటే ఏటౌతాది?’ అంటూ వ్యంగ్యం!

‘అందరి పన్లూ ఆ ఒక్క గంటలోనే సేసీడానికి మాకేం పచ్చేతులూ, పది కాళ్ళూ ఉంటాయేటమ్మా? ఉన్నా అందరిళ్ళల్లోనూ ఒక్కపాలే పన్జేసీడానికి మావేం దేవతవా?’అంటూ ఎత్తిపొడుపు!

‘నిన్నూ నిన్నూ అడుక్కోడానికీ, నీ కాళ్ళూ నీ కాళ్ళూ పట్టుకు పిసకరించడానికీ నాకేం పట్టిందమ్మా. నానేం అవిటిదాన్నా, సెవిటిదాన్నా? … కష్టపడతాను.’ అని తిరుగులేని ఆత్మాభిమానం! .

కష్టజీవులకు ఇలాంటి ఆత్మాభిమానం అవసరమనీ; మోసపోయే అమాయకత్వం కాకుండా దీటుగా ఎదుర్కొనే తెలివితేటలు ఉండాలనీ రచయిత ఈ కథ ద్వారా సూచించినట్టు అర్థం చేసుకోవచ్చు.

* * *

kaaraa

కాళీపట్నం రామారావు రచనల గురించి చర్చించుకునేటపుడు పెద్దగా ప్రస్తావనకు రాని కథ ‘ఆదివారం’. మిగిలిన కథలకు అమితంగా ప్రాచుర్యం వచ్చేయటం ఇందుకో కారణం కావొచ్చు. ఇది 1968 జూన్ 7న మొదటిసారి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది

ఈ కథ వెనకున్న ఓ విశేషం ఏమిటంటే… కా.రా. తాను రాసిన నాలుగు సంవత్సరాలకు గానీ దీన్ని పత్రికకు పంపలేదు. అంటే ‘యజ్ఞం’ కంటే ముందే ఈ కథ రాశారన్నమాట!

 

‘తీర్పు (1.3.1964) రాసి నాకు కథ రాయడం వచ్చిందనుకున్నాను. ఇల్లు (1.4. 1964) రాసి పాత వాసనలు వదలేదని బాధపడ్డాను. ఆదివారం సరిగానే వచ్చినా పత్రికకు పంపకుండా నాలుగేళ్ళు దాచిపెట్టేను. యజ్ఞం (1.1. 1966 ) రాసేక నామీద నాకు నమ్మకం కుదిరింది. ’ అని కా.రా. 1986లో ‘నేను నా రచన’ అనే వ్యాసంలో రాశారు.

సహజసిద్ధమైన సంభాషణలు ‘ఆదివారం’ కథను ఆసక్తికరంగా మలిచాయి. ముఖ్యంగా మాండలిక, నుడికార ప్రయోగాలతో కథ పరిపూర్ణంగా, విశ్వసనీయంగా తయారైన భావన కలుగుతుంది..

– ‘అశిరమ్మంత గొంతు పెట్టుకొని ఆకాశమంత ఎత్తు లేచిపోయింది.’

– ‘అద్దముంది, ముఖముంది. అంతకు మించి నేనొక్కపొల్లు మాటన్లేదు.’

– ‘మౌన ముద్ర వహిస్తే కుదరదు. అనువులనో మినువులనో అనాలి.’

– ‘వీళ్ళ కట్టులో సగం కట్టుంటే మనం ఏనాడో బాగుపడుదుం’

అంకాలు, అత్తల పాత్రలను నిర్వహించిన తీరు, వారి మాట తీరులో రచయిత చూపిన వైవిధ్యం ఆకట్టుకుంటాయి.

శీర్షిక పేరు ‘ఆదివారం’ బాగా సరిపోయింది. సంఘర్షణ మొదలవటం- కొనసాగటం, రాజీ పడటం; పంతం నెగ్గించుకోవటం- ఇవన్నీ ఈ రోజు గురించే! ఈ కథలో అన్నీ స్త్రీ పాత్రలే ఉండటం ఒక విశేషం!

 – వేణు

 

ch venu

 

 

వేణుగారు పాతికేళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. సంగీతం, సాహిత్యం, చిత్ర లేఖనం ఈయన అభిమాన విషయాలు. ‘వేణువు’ పేరుతో వీరి బ్లాగ్ నెటిజన్స్ లో చాలా మందికి సుపరిచితమే. ఈనాడు, తెలుగువెలుగు, వాకిలి, పుస్తకం.నెట్ లలో వేణుగారి సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు వచ్చాయి. సాహిత్యాభిమాని అయిన వేణుగారికి రంగనాయకమ్మ, కొడవటిగంటి కుటుంబరావు అభిమాన రచయితలు.

 వచ్చే వారం “జీవధార” కధ గురించి వై. కరుణాకర్ పరిచయం 

కథ లింక్:

https://www.scribd.com/doc/242719892/%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-%E0%B0%95%E0%B0%A7

బ్రతుకు భయాన్నిపోగొట్టే కధ .. ‘భయం’

karalogo

నిర్వహణ: రమాసుందరి బత్తుల

 

29-raghavaబుజ్జీ!

ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడే కా.రా.కధ ‘భయం’ మరొకసారి చదివాను. అది నాలో రేపిన భావసంచలనంతో, జీవిత సాక్షాత్కారంతో, నమ్మిన ప్రాపంచిక దృక్పధం అలా అక్షరాల్లో పరుచుకుని కళ్ళెదుట నిలిచినపుడు కలిగే పారవశ్యం తో ఇదిగో .. ఇక్కడిలా మౌనంగా కూర్చుని ’సారంగ’ మాధ్యమంగా నీకు ఈ కధ ను చేరవేస్తున్నా.

‘భయం’- భలే కధ. భయాన్ని జయిస్తే ఏమవుతుందో చెప్పే కధ. భయం గుట్టును విప్పే కధ. అంతటా చీకట్లే కమ్ముకుంటున్నప్పుడు,ఆ చీకట్లకు కారణమైన పరిస్థితులు అర్ధమవుతున్నప్పుడు, భ్రమలు చెదిరిపోతున్నప్పుడు, కాటేసే పాఁవులు మీది మీదికొస్తా ఉన్నప్పుడు, మిర్రి మిర్రి చూస్తా ఉన్నప్పుడు వాటిని కొట్టాల, వొదిలిపెట్టాలో, లేక చేతుల్జోడించి దణ్ణాలు పెట్టాలో తేల్చుకోడానికి ఒక అవకాశమిచ్చే కధ.

కధ మొదలవడం మొదలవడమే అత్యంత ఆసక్తికరంగా ఉద్విగ్నభరితమైన సన్నివేశంతో మొదలవుతుంది. “ఓలమ్మ పాఁవర్రా..” అంటూ ఒక్క దాటువేసి వాకిట్లోకి వచ్చి పడింది పారమ్మ. పూరింటి గుమ్మంలో ఆమె ఎత్తిపడేసిన బుడ్డి దీపం భగ్ భగ్ మని మండుతోంది – ఇవీ కధలోని ఆరంభ వాక్యాలు.. ఇవి చదివిన ఎవ్వరైనా, ఏఁవైందా అని ముందుకెళ్ళకుండా ఆగగలరా? అద్భుతమైన ఎత్తుగడ గదా!

సర్వసాక్షి దృష్టికోణంలోంచి కధ చెబుతాడు కా.రా. ఇందుల. కానీ అది కేవలం చెప్పడమేనా అంటే కాదనిపిస్తుంది. ఫ్రేం తర్వాత ఫ్రేం గా దృశ్యాలు మనసు కళ్ళకు అలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మామూలు అర్ధంలో ’చెబుతాడు’ అని సింపిల్ గా ఎలా అంటాం? నువ్వే చూడు, పారమ్మకి పాఁవు కనబడ్డ చోటుని ఎలా చూపెడుతున్నాడో.. “అసలే సంజవేళ. దానికి తోడు పొరుగు పెరటి చింతచెట్టు జీబూతంలా పెరిగి ఉంది. ఆ అర చీకట్లో- పూరింటి ముంజూరు, ముంజూరు కింద పెల్లలు విరిగి పడ్డ పిట్టగోడ, పిట్టగోడ పక్కనున్నది కర్రల పొయ్యి, పొయ్యి వెనుక కరుదూపం పెచ్చులు గట్టిన పాత గోడ, గోడవతల మూలని పొయ్యికోసం తురిమిన కమ్మరేకులూ, తాటిగొడితెలూ…” – ఒకఛందోబద్ధ గేయం లాగ, కళ్ళముందు దృశ్యంలాగా లేదూ ఈ వర్ణన? – “ఎక్కడే?” అంది ముసలమ్మ. “అదిగాదా?…కమ్మరేకుల్లోకి తల, బైటికి తోకా!..గోడ వోరనుంది”- చూపు సరీగ్గా ఆనని ఆ ముసలమ్మ సంగతేఁవో గానీ నీకూ నాకూ మాత్రం పాఁవు కనపట్టం ఖాయం..అవునా కాదా? జలదరించే ఒళ్ళు సాక్షిగా అవునంటున్నావ్. కదూ..?

కధంతా ఇలాగే, ఏం చెప్పినా అది దృశ్యమానమయ్యేలా అత్యంత సహజమైన, నిరలంకారమైన సంభాషణలు, సన్నివేశాలు.

ఫోటో: కూర్మనాథ్

ఫోటో: కూర్మనాథ్

పారమ్మకి కనపడిన పాఁవు ఆమె పెనిమిటి గౌరేసుని కాటేసింది. పాఁవుల రాఁవులయ్య మంత్రమేశాడు. గౌరేసు బతికాడు. కానీ పురుడు వికటించి పారమ్మ చచ్చిపోయింది. మంత్రగాడి వైద్యం వికటించి గౌరేసు కాలు పుండైపోయింది. విషవైద్యుల మీద, పాఁవు కధల మీద భ్రమలు కోల్పోయిన గౌరేసు కొడుకు సత్యం తన పదిహేనోయేట మొదటిసారిగా ఒక పాముని కొట్టాడు. పాతికేళ్ళొచ్చేసరికల్లా ’పాముల సత్తెయ్య’ అనే పౌరుషనామం తెచ్చుకున్నాడు.

సత్తెయ్య తొలిసారి పాముని కొట్టే సన్నివేశంలో కోళ్ళగంపలో దూరి కోడిపిల్లల్ని పొట్టనబెట్టుకున్న పాముతో కోళ్ళు పోట్లాడతా ఉంటాయి. ముసలి నారయ్య ఎన్ని సార్లు తరిమినా కోళ్ళు ఆ చోటుని విడవట్లేదు, పాముని వొదలట్లేదు. ఇక్కడ రచయిత ఒక ఆసక్తికరమైన మాటంటాడు. “పాపిని చంపడఁవా మానడఁవా అనే మీమాంస మనుషులకే గాని కోళ్ళకున్నట్టులేదు..”. సత్తెయ్య ఆ పాముని చంపేశాక కూడా కొందరు ’భూతదయాపరులు’ ఇలా అంటారు “అయ్యో పాపం, ఎర మింగిన పాఁవర్రా..అలాంటి పాఁవుని సంపకూడదు” వ్యంగ్యంతో కూడిన ఈ కంఠస్వరం వెనుక రచయిత హృదయం మనకు అర్ధమవట్లా? మన బతుకులకు ముప్పుతెచ్చే వర్గ శత్రువు పట్ల ధర్మసూత్రాలు పాటించాలా లేక సామూహిక ప్రతిఘటనకు తెగబడాలా?..

ఇవిగో, సత్తెయ్య మాట్లాడే ఈ మాటల్లో కూడా రచయిత మనకి దొరుకుతాడు.

“పాఁవు మీకు బగమంతుడితో సమానఁవా? సెప్పండి. దండాలెట్టుకుందాం. పాఁవు మాయమైపోద్ది.- కాదు, దాన్ని సంపడం పాపమంటారా, తగువే నేదు. మీ పాఁవుని మీ ఇంటనే ఎట్టుకోండి, నానెల్లిపోతాను. అదీ ఇదీ కాదు- పాఁవు కరుస్తాదీ, అది ఇషప్పురుగూ – అంటారా, ఇక మాట్టాడకండి. సంపి అవతల పారేస్తాను. పుట్ట మీదెయ్యమన్నా యెయ్యను”

“సత్తెయ్య పాఁవుల యెడల భయభక్తులు నాశనం చెయ్యడమే కాకుండా, మంత్రతంత్రాల పట్ల విశ్వాసాలను కూడా పాడు చేసేవాడు”- సత్తెయ్య ఏ చారిత్రక శక్తులకు ప్రతినిధిగా చిత్రించబడ్డాడో మనకి అర్ధమవట్లా..?

ఇదిగో, ఒకనాడు సత్తెయ్యకీ,తన పెళ్ళాం రత్తాలుకీ జరిగిన ఈ సంభాషణ గమనిస్తే సత్తెయ్యా, సత్తెయ్యలో ఉన్న రచైతా స్పష్టంగా అర్ధమైపోతారు.

“పోనీ ఈ ఇంట్ల దూరిన పాఁవుని నువ్ సంపు, నాను కాదన్ను. ఎవళ అటకమీదో ఉన్న పాఁవుని నువ్వేల సంపాల?”

“ఒకలాగనుకుందాఁవు. నేనూ, మా నాయన, ముసలోళ్ళు, పిల్లలు..మేఁవందరఁవూ ఇక్కడ తొంగున్నాం.నువ్ గడపట్ల ఉన్నావ్. తెలిగేసున్నావ్. కర్ర కూడా నీ సేతికందువిడిగింది. సూర్లోంచి పాఁవొకటి వొచ్చింది. అది నీ కాసి సూణ్ణేదు. మా మీదికి పారొస్తోంది…నువ్వేటిసేస్తావ్? సస్తే మాఁవు గదా సచ్చేదని వూరుకుంటావా? నీ పేణఁవేనా వొదిలి మమ్మల్ని కాపాడతావా?”

ఈ ప్రశ్నకి మనందర్లో మెదిలే జవాబునే రత్తాలు సులువుగా ఇచ్చేసింది “నువు – మీరంతా నాకైనట్టు ఈ లోకవంతా నీకౌద్దా?”

సత్తెయ్యే మనం ఊహించని జవాబు ఠక్ మని చెప్తాడామెకు “అవుద్ది”

-ఈ మాట మనలో చాలా మందికి నమ్మబుద్ధి కాదు గదా. “ ఏంటీమనిషి? తనవాళ్ళూ, ఊళ్ళో వాళ్ళూ ఒకటేనంటాడేమిటీ..? వాళ్ళ కోసం తన ప్రాణాల మీదకైనా తెచ్చుకుంటానంటాడేమిటీ..? ఈ పాత్రనిక్కడ చాలా అవాస్తవికంగా చిత్రించాడబ్బా రచయిత..” అనిపిస్తుంది గదా. అంతేనా? ఇది నిజంగా అంత అసంబద్ద, శుద్ధ ఆదర్శ, అవాస్తవిక చిత్రణేనా? అలాంటి వాళ్ళసలుండరా? లేరా? లేరా? లేరా?

“ఎవ్వరో ఈ బిడ్డలూ…అడవి మల్లె పువ్వులూ…” జయరాజన్న పాట గుర్తు రావట్లా? అమరులెందరో గుర్తురావట్లా?..ఇప్పుడర్ధమవట్లా ఇక్కడి ప్రతీక?…దటీజ్ కా.రా. అందుకే ఆయన ’మాస్టారు’. వల్లంపాటి చెప్పినట్లు ‘గోప్యత’ ఆయన ప్రధాన కధన శిల్పం. వాచ్యత చాలా చాలా తక్కువగా గల కధారచయిత కా.రా. కధావస్తువును మరొక వస్తువు మీద ఆరోపించి గోప్యంగా సూచన చేయడం ఆయన పద్ధతి. ఈ అవగాహన మనకుంటే .. “కా.రా. రచయితగా భయస్తుడు. పరిష్కారాలన్నీ తెలిసీ స్పష్టంగా దేన్నీ చూపడు” అన్న కె.వి.ఆర్. మాటల్తో ఏ కోశానా ఏకీభవించలేం.

మరొక అద్భుతమైన పాత్ర .. నేను, అమ్మ, అమ్మమ్మ, అంకుల్, ఆంటీ.. మాలాంటి వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించే పాత్ర ‘సుబ్బాయమ్మ గారు’. పాఁవు చావాలి. దానివల్ల తనకో, తన పిల్లలకో నష్టం కలిగే అవకాశముంది కనుక. ఐతే దాన్ని ఏ సత్తెయ్యో, సొమ్ముల గురవయ్యో చంపాలి. తానూ, తన పిల్లలూ, మనవళ్ళూ ఆ చాయలకే రాగూడదు. ఇదీ సుబ్బాయమ్మ గారి ఆలోచనా దృక్పధం.

సుబ్బాయమ్మ గారి పాత్ర ను చూస్తే బాలగోపాల్ మాటలు గుర్తొస్తాయ్. “మధ్యతరగతి బుద్ధిజీవులకు ఒక లక్షణం ఉంటుంది. న్యాయాన్యాయాల సంఘర్షణ మన నిత్యజీవితానికి ఎంత దూరాన జరిగితే మనం అంత సులభంగా న్యాయం పక్షం వహిస్తాం. ఆ సంఘర్షణ మన జీవితానుభవానికి చేరువయ్యేకొద్దీ న్యాయం పక్షం వహించడం కష్టమవుతుంది”- ఎంత సరిగ్గా చెప్పాడో బాలగోపాల్! కదా?

సుబ్బాయమ్మగారి ఇంటి వెనుక ఒక పూరిల్లు. అందులో ఒక పాము. మెల్లగా కలుగులోకి పోతూ ఉంది. తోక బయటకు పెట్టి ఉంది. బండి తోలుకుని పోతున్న సత్తెయ్యను నడి దారిలో పట్టుకుని విషయమేంటో కూడా చెప్పకుండా ఇంటికి లాక్కుపోయింది సుబ్బాయమ్మ గారు. కలుగులోకి జారుకుంటూ ఉన్న ఆ పామును తాను తోకపట్టుకుని బైటకులాగి పడవేస్తే వెంటనే ఆ పడిన చోట దాన్ని కొట్టేందుకు ఒక ధైర్యమైన చేతోడు ఉండాలంటాడు సత్తెయ్య.

తన కొడుకుని ఆ జోలిగ్గూడా వెళ్ళొద్దని హెచ్చరించి పరుగు పరుగున వెళ్ళిన సుబ్బాయమ్మ పదమూడేళ్ళ వయసున్న ఒక సొమ్ముల కాపరి, సొమ్ముల గురవడ్ని వెంట పెట్టుకొచ్చింది. ఈ గురవడు ఉషారైనోడు. ఆలోచించగలవాడు. ఇంకా ఘనీభవించని స్పందించే గుండెకాయను కలిగి ఉన్నోడు. నీలాంటి, నీ తోటి పిల్లల్లాంటి వాడు. సుబ్బాయమ్మ మాటల్ని పట్టించుకోవద్దని నచ్చజెప్పబోయిన సత్తెయ్యను “ఓయ్ ఊరుకోవయ్యా! పాఁవు దూరింది ఆళ్ళ ఇరకలోనా? సాయానికి నువ్వూ నేనా? చెయ్యి సాయం తోడుండమంటే ఎలాగ సస్తారో మీరిద్దరూ సావండి గాని, నా కొడుక్కి మాత్రం దాని గాలి కూడా తగల్నానికి ఒల్లకాదంటాదా ఆ యమ్మ..? యీయిడే కన్నాదేటి కొడుకుని! నిన్నూ నన్నూ అమ్మ కన్లేదేటి?..”అని దబాయించినోడు.

మొత్తం మీద సుబ్బాయమ్మ కొడుకునొక పక్కా, సొమ్ముల గురవడ్నొక పక్కా నిలబెట్టి రెండు చేతుల్తో తోకనందుకుంటాడు సత్తెయ్య. కానీ పాఁవు ఎత్తు మార్చేస్తుంది. అంతా కంగాళీ ఐపోతుంది. సత్తెయ్యను కాటందుకుంటుంది పాఁవు. తర్వాత ఏమవుతుంది?.. సత్తెయ్య బతుకుతాడా లేదా?..

ఊరు ఊరంతా సత్తెయ్య చుట్టూ ఉంటే అక్కడ ఉండడానికి మనస్కరించని సొమ్ముల గురవడు మాత్రం మందకేసి నడిచాడు. తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఇంతకాలం తను చూసిన లోకమే , ఊరే ఇప్పుడు తనకి కొత్తగా కన్పిస్తున్నాయ్. మందలో పశువులన్నీ వేర్వేరు వర్గాలుగా కనిపించసాగాయ్. వాడికి ’ఎపిఫనీ(జీవిత సాక్షాత్కారం)’ కలిగింది. ఏమిటా ఎపిఫనీ? అది నీకూ,నాకూ కూడా కలుగుతుందా కధ చదివితే…? లేక మన జీవితానుభవాల్లోంచి మనకది కలిగితే దాన్నిక్కడ సరిపోల్చుకోగలమా…?

“ఏంటి ఈ ప్రశ్నలు వెయ్యడం” అంటావా? బుజ్జీ! నేనెంత చెప్పినా అది అసమగ్రమే అవుతుందమ్మా. మాష్టారి కధ, అందులోని సజీవమైన భాష, పాత్రపోషణ, సంఘర్షణ, నిర్మాణసౌష్ఠవం, పీడిత జన పక్షపాతం….-ఎన్నని చెప్పగలను? నువ్వే చదువుకో…ఇదిగో ఇక్కడ కధ లంకె నీ కోసం…- ఉండనా మరి

                                                                                    ప్రేమతో

                                                                                    నాన్న.

[రామిరెడ్డి రాఘవరెడ్డి గారు వృత్తి రీత్యా టీచరు. “ఊగులోడు”, “ఒక బాల కార్మికురాలు, నాలుగవ తరగతి ఏ సెక్షన్ ” ఇంకా కొన్ని కధలు ఆంధ్రజ్యోతి, నవ్య, ఆంధ్ర భూమి వారపత్రికల్లో వచ్చాయి. అయితే ఆయనకు ఇష్టమైన రచనా  వ్యాసంగం కవిత్వం. వీరివి  చాలా కవితలు అనేక పత్రికల్లో వచ్చాయి. పతంజలి, శివారెడ్డి ని ఎక్కువగా ఇష్టపడతారు.]

 వచ్చే వారం ‘ఆదివారం’ కధ మీద  సి. హెచ్ వేణు గారి పరిచయం

 

 

“భయం” కథ లింక్ ఇదిగో:

కా. రా మాస్టారి కథలు చెప్పే జీవితప్పాఠాలు..

karalogo

నిర్వహణ: రమాసుందరి బత్తుల

 

సమాజ గమనంలోని అంతర సూత్రాలు, దాని పొరల్లోని నిత్యయుద్ధాలను సూక్ష్మంగా గ్రహించగలిగిన వ్యక్తి, తన గ్రహింపును వీలైనంత సరళంగా పాఠకులకు అర్ధం చేయించగలిగితే అతడే జనం గుర్తు పెట్టుకొనే సాహితీకారుడు అవుతాడు. ఇక్కడ రచయిత బతికిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే తప్పు నిర్ధారణ చేసినట్లవుతుంది. ఆ కాలంలో, ఆ ప్రాంతాన్ని ఆవహించిన సంక్షోభాలు, రణాలు అతని వ్యక్తిత్వం మీద, రచనల మీద తప్పక ప్రభావం చూపుతాయి.

మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కాళీపట్నం రామారావు మాష్టారి సాహితీ ప్రయాణం ఆ పరిమితిని శైశవ దశలోనే దాటి సామాజికోద్రేకాలను అద్దుకొంటూ సాగి, ఆనాడు ఉత్తరాంధ్రలోని కొనసాగుతున్న ఉద్యమాలకు అనుసంధానమయ్యి పరిపక్వతను సంతరించుకొంది.

“మధ్యతరగతి మానసిక రుగ్మతలను ఎక్కువ చేసి చూపించిన” కధలుగా ఆయనే స్వయంగా చెప్పుకొన్న 48-55 మధ్య కధల్లో కూడా అంతర్లీనంగా ప్రాభవం కోల్పోతున్న బ్రాహ్మణ మధ్య తరగతి కుటుంబాల బంధాలను శాసిస్తున్న ఆర్ధిక సంబంధాల విశ్లేషణ ఉంది. ఈ కాలంలో ఈయన రాసిన “పెంపకపు  మమకారం”, “అభిమానాలు” లాంటి కధలలో ఆయన బీజ రూపంలో తడిమిన అంశాలు తరువాత కాలంలో ఆయన రాసిన కధల్లో వేయి ఊడల మహా వృక్షాల్లాగా విజృంభించాయి.

62-72 మధ్య కాలంలో ఉత్తరాంధ్రలో వచ్చిన ఉడుకు రామారావు గారి కలాన్ని పదును పెట్టినట్లుగా తోస్తుంది. ఉద్యమాలు ఈ కలాన్ని ఆవహించాయా లేక ఇలాంటి కధలు ఉద్యమాలను ఉత్తేజపరిచాయా అన్నంతగా పెనవేసుకొని ఆయన సాహిత్యప్రయాణం సాగినట్లు అనిపిస్తుంది. ఈ కాలంలో ఈయన రాసిన కధల్లో గాఢత బాగా చిక్కబడింది. వ్యక్తి నుండి వ్యవస్థకు ఈయన సాహిత్య ప్రయాణం ఈ కాలంలోనే జరిగింది. ‘ఆదివారం’, ‘చావు’, ‘ఆర్తి’, ‘కుట్ర’, ‘శాంతి’, ‘జీవధార’, ‘భయం’, ‘నో రూమ్’ కధలు ఈ కాలంలోనే వెలువడ్డాయి.

రామారావుగారి కధల్లో ఎక్కువ కధల ముగింపులు పరిష్కారాన్ని ప్రత్యక్షంగా సూచించవు. పరిష్కారం చెప్పక పోయినా సమాజంలో ఉన్న దరిద్రం, ఆకలి ఇంకా చాలా సామాజిక రుగ్మతల పట్ల ద్వేషాన్ని కలిగించే పని చేయటం ప్రజా సాహిత్యకారుల కనీస కర్తవ్యం. కధలకు ఉండాల్సిన ఈ సామాజిక ప్రయోజనం కారాగారి చివరి కధల్లో వంద శాతం నెరవేరిందని నిర్ద్వంద్వం గా చెప్పవచ్చు. తమవి కాని జీవితాల్లోకి వెళ్ళి కధను పండించటం అంత చిన్న విషయమేమీ కాదు. రచయితలు డీక్లాసిఫై అవ్వాలని ఆ నాడు విరసం ఇచ్చిన పిలుపును స్వాగతించారు రామారావుగారు.

72 తరువాత ఆయన కధలు రాయటం మానేశారు. (92 లో సంకల్పం కధ రాశారు) ఎందుకు రాయలేదు అన్న ప్రశ్నకు ఒక దగ్గర “వూరికే కధ రాయటం ఎంతసేపు? కానీ ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించుకొంటే అలవోకగా రాయలేక పోతున్నాను” అన్నారు. పదుల్లో గొప్ప కధలు రాసిన వ్యక్తికి కలం సాగక పోవటానికి చాలా సహేతుకమైన సందిగ్ధత ఇది. ప్రయోజనం లేని బఠానీ కధలు రాయలేక పోవటం వలన, వర్తమాన సమాజంలోని రాజకీయ సంక్లిష్టతను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవటం వలన .. ప్రజల కోసం నిజాయితీగా రాయాలనుకొన్న రచయితలు అందరూ ఎక్కడో అక్కడ ఆగిపోయే పరిస్థితే సహజమే అయినప్పటికీ ఈ విరామం సుధీర్ఘం. అయితే ఆయన కాలం కంటే కూడా ముందుకు వెళ్ళి తన చుట్టూ ఆవహించిన సమాజాన్ని అంచనా వేయగలిగారు అనిపిస్తుంది. చూసిన సంఘటనల నుండి తనకు గల స్థిరమైన ప్రాపంచిక దృక్పధం వలన కలిగే చైతన్యం.. ఆ చైతన్యం అంతస్సారంగా స్రవించిన కధలివి. పాత్రల నమూనాల్లోనూ, సంఘటనల్లోనూ, ఆలోచనా రీతుల్లోనూ, వైరుధ్యాల్లోనూ, ఘర్షణలలోనూ ఆయన కలం ఇప్పటి పరిస్థితులకు సారూప్యత ఉన్న సృజనను అందించింది. అది ఆనాటి తరానికే కాదు, ఈ తరం చదువరుల వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా రక్తమాంసాలు ఇచ్చిందని అనటానికి ఏ మాత్రం సందేహించనవసరం లేదు. తరువాత ఇంకొన్ని తరాల రచనల మీద ఈయన ముద్ర గాఢంగా పడింది.

రామారావు గారి కధలకు పరిచయం రాయమని నేను అడిగిన ప్రతి రచయిత, రచయిత్రి వెంటనే సంతోషంగా ఒప్పుకొన్నారు. కాళీపట్నం రామారావు గారి కధలకు ఇప్పుడు మళ్ళీ పరిచయం అవసరమా అనే ప్రశ్న సహజం. ఈ నవంబర్ లో తొంభైయ్యవ పుట్టిన రోజు జరుపుకొంటున్న కా.రా గారి కధలను మళ్ళీ ఒక సారి మననం చేసుకోవడం పాత తరానికి సంతోషకరంగానూ, కొత్త తరానికి ఉపయుక్తంగానూ ఉంటుందని భావిస్తూ ఈ శీర్షిక మొదలు పెడుతున్నాము. నేటికీ సమకాలీనం, సార్వజనీయం అయిన ఈ కధాంశాలను ఈ తరం పాఠకులకు అందించే ముందు సీనియర్ రచయిత(త్రు)లు ‘ఆ పాత మధురాల’ నెమరివేత, కొత్త రచయిత(త్రు)లు కారాగారి తాత్వికతను అర్ధం చేసుకొన్న ఇష్టం.. కలగలిపి పాఠకులకు అందించాలనేదే ఈ ప్రయత్నం.

ramasundari

ఎడిటర్ నోట్

ఈ శీర్షికని నిర్వహిస్తున్నందుకు రమాసుందరి గారికి ‘సారంగ’ కృతజ్ఞతలు. ఈ శీర్షికకి మీ  వ్యాసాలు నేరుగా రమాసుందరి గారికి manavi.battula303@gmail.com పంపండి. ఒక కాపీ సారంగ ఈమెయిలు కి కూడా పెట్టండి.