ఎన్నెన్నో వర్ణాల పరికిణీ!

parikini600

అవును, అచ్చతెలుగు అమ్మాయి వేసుకొనే  – పరికిణీయే!

భరణి గారి కలంలో ఇన్ని కళలు ఉన్నాయా  ఇన్ని సొగసులు ఉన్నాయా అనిపించే మహత్తర విందు భోజనం ఈ కవితా సంకలనం. ఇవి నిజానికి భరణి అనుభవాల, అనుభూతుల నుండి రాలిన భావోద్వేగాలు. వీటిలో కవిత్వం మాత్రమే కాదు, కసి, కోపం, ద్వేషం, ప్రేమ, అసహనం, ఆప్యాయత, హాస్యం, భయం, వీరం అన్నీ కనిపిస్తాయి.

మరో చిత్రం ఏమంటే ? తెలుగులో ఎన్ని వర్ణాలో అనిపించేలా  వీటిల్లో పదప్రయోగాలు, విరుపులతో పాటు అన్ని యాసలూ కనిపిస్తాయి.  వినిపిస్తాయి.

మద్యతరగతి మనుషుల్లో కనిపించే చిత్రాలు, విచిత్రాలను తనదైన శైలిలో కళ్ళెదుట కనిపించేట్టు చేస్తారు భరణి. ఆయన శైలి మనతో మాట్లాడినట్టో లేదా నిలదీసి అడుగుతున్నట్టో అనిపిస్తుంది. అక్షరాలను ఆయుధాలుగా చేసి బాణాలుగా వదిలిన 26 కవితల ఈ సమాహారంలో ఒక్కో కవిత ఒక్కో సాక్ష్యం అనడం అతిశయోక్తి కాదు.

——-

మనకే సొంతమైన అందమైన పరికిణీని  మిడ్డీలు, చుడీలు మాయం చేస్తున్నాయనే ఆక్రోశం నుండి పుట్టినదే పరికిణీ.

మధ్యతరగతి సంసారంలో కష్టాలను అధిగమించలేక సతిపై తాండవమాడే  – మద్యతరగతి నటరాజు

ఆశల ఆవకాయ జాడీలను కళ్ళలో కలలుగా మార్చుకొని తృప్తిపడే సామాన్యుడి – ఖారం ఖారంగా

అందం, డబ్బులేక పెళ్ళికాని కన్యలతో ఆడుకొనే పెద్దల ఆట, ఆడపిల్లల వేట అయిన పెళ్ళిచూపుల ప్రహసనం

ఉద్యోగం పురుషలక్షణం అన్నారు, ” ఒక్కరోజన్నా ఉద్యోగం చేసి చచ్చిపోవాలి” అని ఆలోచించే అసహాయ  – గ్రాడ్యుయేట్

ఉడికీఉడకని అత్తెసరులాంటి సాహిత్యంతో సరస్వతిని చంపేస్తున్న మేధావుల సాహిత్యపు – మీల్స్ రెడీ

డబ్బే మనిషిని ఆడించే మాయ. ఆమాయలో ఘోరాలు ఎన్నో కదా అనే  – లచ్చింతల్లీ

శుభకార్యాలకు అపశకునంగా, అమంగళానికి అర్ధంలా అనుకొని విలువివ్వని పెద్దల గొప్పధనం చెప్పే –  బామ్మ

అర్ధంకాని అనేక ప్రశ్నలతో దేవుడ్నే అడిగే – చిలకప్రశ్న

వంట తప్ప మరేం రాదు అనుకొనే ఆలి గొప్పతనం అసువుగా చెప్పే – మా ఆవిడకు మంత్రాలొచ్చు

అద్బుతాలు ఆవిష్కరిచే చీర. రూపాలు మార్చుకొనే చీర. ప్రపంచంలో గొప్ప వస్త్రం ఏదయ్యా అంటే –  చీరే

రోబోట్ జీవితం, ఉదయం బ్రతికి రాత్రికి చచ్చే ఒకానొక – గుమాస్తా సూర్యుడు

శశిరేఖ, పార్వతి, మధురవాణి పాత్రేదైనా పలుకేను – సావిత్రి సావిత్రే అని

భువి నరకంలోనుంచి స్వర్గానికి చేరుకోవాలనే కూతురి ఓ లేఖ  – నాన్నకు….

 

ఇలాంటి ఆణిముత్యాలు మరెన్నో-  ప్రతి కవితలో అంతర్లీనంగా ఏదో ఒక సందేశం జతచేస్తూ, ఆలోచింపచేసేవిగా రాయడం ఒకెత్తు అయితే , ఎవరికైనా అర్ధం అయ్యేలా చిన్న పదాలతో భావాన్ని స్పురింపజేయడం మరొకెత్తు. భరణి చూసిన జీవితంలో చిత్రాలను అక్షరాలుగా మలచి అందించిన అందమైన ఈ పుస్తకం కేవలం చదువుకొని భద్రపరచుకోడానికే కాదు ఎవరికైనా ఇవ్వడానికి కూడా గొప్ప బహుమతిగా ఉంటుంది.

 

పుస్తకం – పరికిణీ

రచన- తనికెళ్ళ భరణి

వెల – 60

 

పేదవాళ్ళ పిల్లలు!

225px-robert_w-_service

ఈ దేశంలో పేదవాడికి పిల్లలు మాత్రమే పుడతారు , రిచీ రిచ్లకి మాత్రం వారసులు పుడతారు  అంటుంది ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సీ గ్రేడ్ మూవీగా రేట్  చేయబడిన ఈ మధ్య కాలపు బాలివుడ్  సినిమాలో ఒక క్యారెక్టర్ . నిజానికి అంత ప్రాక్టికల్ డైలాగ్ ఉన్న ఆ సినిమాకి చప్పట్లతో కూడిన గుర్తింపు రావాలి కాని మన దేశపు వాసనలలో అంత తెలివి ఊహించడం కష్టం. సరిగ్గా మనం అంతా ఈ సినిమా ప్రోమోలు కూడా చూడటానికి ఇష్టపడని సమయంలోనే బిగ్ బీ అద్బుతంగా తనదయిన వారసత్వపు షాయరీలకి భిన్నంగా బోలెడంత ఆత్మీయత కుప్పించిన ఉత్తరం సోషల్ మీడియాలో ఉదృతంగా ప్రచారం పొందుతుంది .

మోడరన్ థింకింగ్ అంటే పట్టుచీరలు గోరింటాకులు బదులు డిజైనర్  వేర్ డ్రెస్లు ,మెహందీలు వాడి పెళ్లిళ్ళు సంభరాలు చేసుకోవడం అనుకొనే ఆడపిల్లలకి , అభ్యుదయ వాదం అంటే మంగళ సూత్రాల నుండి పూసల గొలుసులకి ఎదగడం అనుకొనే స్త్రీ మూర్తులకి , వీళ్ళ ఇద్దరి నడుమ ఇంకో రకం ఉంది ,వాళ్ళేలా అంటే  “జియో రిలయన్స్ వాళ్ళ కష్ట ఫలం నీకంతగా నచ్చకపోతే  వాడుకోకు అంతే తప్ప అన్నిటిని విమర్శిస్తే  అసలు సమాజంలో ఉండటానికి నీకే అర్హత లేదనే ” అన్ అఫీషియల్ ఖాప్ చట్టాలు నిర్ణయించే మూకలుగా తయారయి ఆలోచన అంటూ ఉన్నవాడి బుర్ర చచ్చేదాకా చితకకోడతాం అంటూ భర్తలు ఎన్ని వేషాలు  వేసినా వాడు రాసిచ్చే భవంతుల కోసమో, అందించే వడ్డాణాల కోసమో భరించేస్తూ పైగా ఇదంతా పిల్లల  కోసం అన్న సెంటిమెంట్ అడ్డం పెట్టుకొనే న్యూ ఏజ్  మితవాద మతస్తు స్త్రీలు , వీళ్ళకి బుర్రలో కాస్త గుజ్జు ఉన్నవారెవరు ఈ జీవితాన రిలయెన్స్ లాంటి కొన్ని సంస్థల దగ్గర మాత్రమే అంతగా డబ్బు ఎందుకు కూడబడింది అన్న ప్రశ్నకి ,ఆ రాత్రికి రాత్రి పెరిగిన పెట్రోలు ధరలు కామన్ మ్యాన్ నడ్డి డైరెక్ట్గా విరచడం కాకుండా పెరిగిన ద్రవ్యోల్బణం తద్వారా పెరిగే ట్రాన్స్పోర్ట్  రేట్స్ , తడిచి మోపెడయ్యే సరుకుల ధరలు , పెరిగిపోయే ప్రతి ధర వెనక మర్మం వగైరా  ప్రశ్నలకి సమాధానాలు అడిగి తెలుసుకోలేరు, కనీసం తెలిసినా వాళ్లకి వివరించలేరు  .సో పైన రెండు రకాల ఆడవాళ్ళతో పాటు ఈ స్త్రీలు మాత్రమే కాకుండా వీళ్ళందరి వెనక పనిచేసే మనువాద మగ బుర్రలు అందరూ కలిసి అమితాబ్ బచ్చన్ ఇద్దరి  మనవరాళ్ళ పేరిట  రాసిన ఉత్తరానికి ఉబ్బి తబ్బిబ్బయి ఇదీ మన దేశ సంస్కృతీ ,సాంప్రదాయం అని జబ్బలు చరుచుకొని  ఉంటారు .

నిజానికి 21 వ శతాబ్దంలో సైతం వంశాలు, రక్తాలు అని తన  మొదటి లైన్లోనే నంద వంశం , బచ్చన్ వంశం గురించి అతి గొప్పగా రాసుకున్న ఒక వ్యక్తి ఈ దేశానికి ,  ఈ దేశపు సాధారణ ఆలోచనకి  బ్రాండ్  అంబాసిడర్ అంటే దేశం మొత్తం సిగ్గుపడాల్సిన సమయం కదా ఇది . అందునా మళ్ళీ ఈ వంశాలు పితృస్వామ్య వ్యవస్థ మళ్ళీ మళ్ళీ పునాదులతో సహా గట్టి పరుస్తూ తండ్రి తరపునవి మాత్రమే అయి ఉండాలి .ఆ వంశాలలో నుండి వచ్చారు కాబట్టి ఆ పిల్లలలిద్దరు జీవిత కాలం పాటు స్వీయ  నిర్ణయాలు తీసుకొండమ్మా అంటూనే మరోపక్క  పాపం పడక్కుర్చీ తాతగారు ముందు కళ్ళెం గా వేసిన (రాసిన ) వంశ గౌరవం ,లెగసీ అన్న మాటలు నిద్రలో సైతం మర్చిపోకుండా తమ లేత  భుజాల మీద జీవితాంతం మోస్తూనే ఉండాలి . పైగా ఇదంతా ఆడపిల్లలు కాబట్టి పెళ్ళయ్యే  వరకే , మళ్ళీ ఆ తరువాత ఇంకెవడో వంశం చరిత్రలు తవ్వి చదువుకొని అవెంత గొప్పవో , వాటి రక్తంతో కలిపి తామెంత  గొప్ప  వారసులని ఈ దేశానికి కొత్త వారసులుగా అందించగలరో ఇవ్వగలరో అన్న భావన  మొయ్యడంతో పాటు ఆ బ్రతుకే బ్రతకాలి  కూడా . రేపొద్దున వాళ్ళలో ఏ ఒకరికయినా ఏ కార్ డ్రైవర్ మీదో , పేవ్మెంట్ మీద బూరలమ్ముకొనే వ్యక్తితోనే వివాహం అన్న ఊహే రానివ్వని అద్బుతమయిన ప్రయోగం . మీ నిర్ణయాలు  మీరే తీసుకోవాలి అంటూనే ముందరికాళ్ళకి బంధం  వేయడం అన్న సామెతని హిందీ లో బిగ్ బీ గారు బాగా వంట పట్టించుకున్నారులా ఉంది . ఇక్కడ ఇంకో విషయం  హరివంశ్ రాయ్  బచ్చన్  పేరు  రెఫెరెన్స్ తో లిఖించినా ఆ ఉత్తరం వెనక బచ్చన్ లెగసీకి  కారణం ,ఇండస్ట్రీ కథలు కాకరకాయలు క్రియేట్  చేయడానికి, అవి అమ్ముకోవడానికి ఒక యాంగ్రీ యంగ్ మాన్ అవసరంతో పాటు మొత్తం మార్కెట్కి సబ్బులు బ్లేజర్స్ అమ్ముకోవడానికి రాజేష్ ఖన్నా తర్వాత ఒక లెజెండ్ని  సృష్టించాల్సిన  అవసరం ఉన్న కాలం ఒక్కటే కాదు , తన మీద తన వాచ్యం మీద, నటన వెనక  అమిత్ శ్రమ కూడా కాదనలేం . ఆ మాటకొస్తే  నటన విషయంలో అమితాబ్ బచ్చన్కి ఎదురులేదని  షారుక్ కాలపు మాబోటి మూవీ బఫ్స్ సైతం ముక్తకంఠంతో చెప్పగలం. అయినా నిజానికి అమితాబ్కి స్టార్ డం  రావడం వలన హరివంశ్ రాయ్ బచ్చన్ గొప్ప కవిగా మారిపోయారు అన్నవిషయం ,తన సమకాలికులలో తన కంటే అద్బుతంగా రాసిన పేరు రాక, జనం చదవక ఆ బెంగలోనే మరణించిన నిప్పులాంటి  కవి హృదయాలు ఎన్నో ఆ సమయంలో అని ఇక్కడ మనం  మర్చిపోకూడదు .

అసలయినా విషయం ఇదంతా కాదు . అసలు అంతలేసి  లెగసీలు లెజెండ్రీ  వంశాలు మెయిన్ టెయిన్  చేసే ఇంత గొప్ప రక్తాలు  మరి  తమ పిల్లలతో పాటు సమానంగా  మన ఊర్లలో  ఒక దళితవాడ  బిడ్డని  తీసుకెళ్ళి  పెంచి , పోషించి ఆ ఇంటి పేర్లతో సహా సమాజపు గౌరవాన్ని  రాసివొచ్చుగా ? వాళ్ళు చేస్తున్న  చారిటీలు వాళ్ళు సమాజం నుండి సంపాదించిన రూపాయిలో ౦.౦౦౦౦౦1 శాతం  తిరిగి పబ్లిసిటి స్టంట్స్ గా  అక్కడ ఇక్కడ బీద విదార్దులకి పెన్నులు కొని పెట్టి పండగ రోజు  అన్నదానం కింద బువ్వ పెట్టి నటించే నటనల  గురించి  ఇక్కడ  మనం  చర్చించడం  లేదు . అది పూర్తిగా ఇంకో సబ్జెక్ట్ . ఈ విషయం గురించి ఒక బచ్చన్లు ,  అంబానీలు , పాటిళ్ళు , ఇంకా ఇలాంటి ఎందరో సహా గాంధీలు గరికపాటిలు అని గర్వంగా చెప్పుకొనే అందరు లెగసీలనీ అడిగే ఏకైక ప్రశ్న ఏమిటంటే , ఒక్క బిడ్డని  ఒక్కరంటే  ఒక్క దళిత  బిడ్డని లేదా ఒక మైనారిటీ బిడ్డని ( వైస్ వర్సా )  మీ పిల్లలతో సహా  మీ ఇంటి పేరు ఇచ్చి పెంచుకోగలిగే  మానవత్వం  ఉన్నదా మీకు? అనువంశికంగా వచ్చే తెలివితేటలు పక్కన పెడితే వీళ్ళందరి బిడ్డలకి కలిపించే సదుపాయాలు అభిమానాలు ఒక అతి మామూలు  పేవ్మెంట్  పై బిడ్డకి  కలిపిస్తే , ఆ బిడ్డడు ఇంకో రోజున మరో అంభానీ మరో బచ్చన్  లేదా గాంధీ  కాలేడా ?  ఎందుకంటే  అనువంశికంగా వచ్చినా తలలు తీసే లక్షణాలు  సామ్రాజ్యాలని ఏలే శక్తి తర్వాత చాలా మంది వారసులలో హుళక్కి అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం కదా .ఆ లెక్కన కొందరియినా ప్రస్తుత సమాజపు లెక్కల ప్రకారం సామాజిక గౌరవం పొందే స్థితికి చేరలేరా అని .

ఇది మాత్రమే  కాదు ఈ మొత్తం విషయంలో ఇంకో అతి పెద్ద విషాదం ఏమిటి అంటే , అన్ని రకాల ఉద్యమాలలో  ఉన్నవారు సైతం ఎక్కువ శాతం తమ సొంత  రక్తమే  కావాలనుకోవడం భయంకరమయిన నిజం కదా ( కులాలు  మతాలూ ఎలాగు మన దేశంలో ఉద్యమాలని  నిను వీడని నీడలే అన్న విషయం  మనం ఎవరం మర్చిపోలేని  సత్యం ) అన్నిటి కంటే  దళిత కుటుంబాలలో మొదటి తరంలో లేదా రెండో తరంలో ఉద్యోగస్తులయిన వాళ్ళు , ఇప్పటికే కాస్తో  కూస్తో  స్తిరపడిన వాళ్ళు ఒక బిడ్డ తర్వాత అయినా మరో బిడ్డ విషయం ఆలోచించేప్పుడు తమ కులంలో తమ సెక్ట్ లోనో, తమ  సబ్ సెక్ట్ లో పిల్లలనయినా  అడాప్ట్ చేసుకోవడం ఎంత అవసరమో ఎందుకు గుర్తించడం లేదు ? ఎవరో ఎదో చేయడం లేదు అనో  లేక గేటెడ్  కమ్యునిటీస్ లో సెటిల్  అయ్యి  గ్రామాల్లో దళిత బిడ్డలు  మైనార్టీ  కష్టాలు  అంటూ హృదయపూర్వకంగానే అయినా బాధపడే కొందరయినా ఇలాంటి అడాప్షన్లకి  ముందుకు  రావడం  ఇప్పుడు తక్షణావసరం కదా? జరిగే నష్టాలని ఏకపక్షంగా ఆపే  శక్తిలేని  ఉద్యమకారులు మనసున్నవారు సమాజానికి మెరుగయిన  హ్యుమానిటీ అందించడానికి ఇలాంటివి ఒక ఆప్షన్గా ఆలోచించొచ్చు .

robertwservice201755

అదే సమయంలో ,తొందరలో జనాభా విస్పోటనానికి చైనా కష్టాలు మించిపోయే దేశంగా  మారిపోతున్న మనదేశానికి , (చైనా వస్తువులు  మనం చీప్ గా కొనుక్కుంటున్నప్పుడే  మనకి అర్ధం కావాలి కదా , అంత తక్కువ డబ్బు విలువ  చేసే  వస్తువులు తయారు చేసే   కార్మికులకి ఇంకెంత తక్కువ జీతాలు ఉంటాయో బ్రతుకులు ఎంతెంత  భారంగా ఉంటాయో)  మత యుద్ధాల కోసం మాట యుద్ధాలు చెలరేగే  కాలాలలో చావడానికి కనిష్టస్థాయి బంట్లుగా పెరిగే సంతానాల కోసం రెచ్చగొట్టే భగవత్లు ముల్లాలు కాకుండా ఒక ఇంటికి ఒక బిడ్డ మాత్రమే , మరో బిడ్డ కావాలంటే అడాప్టెడ్ మాత్రమే అన్న సామాజికాంశం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది . ఇందులో మళ్ళీ పిల్లలు కలగక  లేదా పిల్లలని కనడం ఇష్టం లేక అడాప్ట్ చేసుకోవడం అనే ఆప్షన్కి వెళ్ళే  జంటలు , అడాప్షన్ అని చెప్పి ఇంట్లో పనిపిల్లలుగా వాడుకోవడం ,ఇవన్నీ కాదంటే అడాప్షన్  పేరు మీద హ్యూమన్ ట్రాఫికింగ్ పెంచే అసహ్యాల వలన ఇప్పటికే బలవుతున్న తండాల  పసిబిడ్డలు లేదా  అనాధశ్రమాల బిడ్డల రైట్స్ గురించి జాగ్రత్త  తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది .

ఇలా ,ఒక మంచి ఆలోచనకి విత్తనం అయినందుకు  అమితాబ్ గారి ఉత్తరానికో థాంక్స్ చెప్పుకుంటూనే , మరి మీ ఇష్టం వచ్చిన  దుస్తులు  వేసుకోండి , మీ  చాయిస్లు మీరు  తీసుకోండి  అని వాళ్ళ ఆరాధ్య దైవం  చెప్పిన మాటలకి మరి మన దేశపు నయా  సతీ సావిత్రులు వారిని తమ బానిస రోబోలుగా మార్చుకున్న సంస్కృతీవాదులు అదే సినిమా  ఫీల్డ్  లో రాఖీ  సావంత్, సన్నీ లియోనీ మొదలైన  వారి విషయంలో అభిప్రాయాలు మార్చుకుంటారా అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ ప్రశ్న!

చివరగా ,చట్ట పరమయిన  అంశాలే కాకుండా సామజికాంశాలు మానసిక వైరుధ్యాలు కలగలిపిన దత్తతలు అంత సులువేం కాదు కాని , చాల మంది మనసున్న వారు రాసిన హృద్యమయిన ఇలాంటి కవితలు ముఖ్యంగా “ A promise made is a debt unpaid “ అని తేల్చేసిన రాబర్ట్  విలియం  రాసినAdoption మాత్రం కుప్పపోసిన మానవత్వాలుగా మనం బ్రతకొచ్చు అనే ఒక నిదర్శనం .

ఈ కవితకి మనకోసం తెలుగులో నాదయిన అనుసృజన

 

Adoption –  Robert William Service

~

తక్కువ స్నేహాలున్న

ఒంటరి మహిళగా

తల్లిదండ్రులెవరో తెలియని

రెండు చిన్న ప్రాణాలని

రాత్రిపూట అవాంఛిత కౌగిలింతలేవో

కాన్వెంట్ తలుపుల దగ్గర వదిలినట్లు

యాచిస్తున్న ఆ చిన్ని చేతుల దురవస్థని

నా సొంతం  చేసుకున్నాను.

 

ఈ పని వారికి నా పేరు ఇచ్చింది

వారే పాడు మురికివాడల నుండి వచ్చారో

ఇహేప్పటికి వారికి తెలియదు

నా సొంతవారిలానే చూడడం

వాంఛ శ్రమల ఇద్దరు అనాధలని

నా ప్రేమ , రక్షణ కాపాడింది

ఇప్పుడిక నా కొడుకు జాన్

తెల్లగా నిండయిన పొడవుతో ,

జోన్ కృష్ణవర్ణంలో మెరుస్తూ .

 

అబ్బాయి బార్ కౌన్సిల్ సభ్యుడు

అమ్మాయి నిర్మలమయిన నర్సు

ఇప్పుడెలా ఉన్నారు , ఎలా ఉండుండేవారు అన్న తలపుకే

క్షణపాటు చెడు విషమేదో మింగినట్లు నరకంగా ఉలిక్కిపడతాను

.

.

బహుశ జాన్ ఒక నేరస్తుడిగా

జోన్ వేశ్యగా స్తిరపడేవారేమో

*

 

 

 

బోయి భీమన్న ‘పైరుపాట’లో ప్రణయతత్త్వం

ప్రగతిశీల కవితావికాసయుగంలో చైత్యచోదనకు, సామాజిక న్యాయసాధనకు కృషిచేసిన బోయి భీమన్నగారి ‘పైరు పాట’ నృత్య సంగీత గేయరూపకం రచితమై ఇప్పటికి యాభై సంవత్సరాలు కావస్తున్నది. స్వాతంత్ర్యోద్యమం సఫలమైన దశాబ్దినాటి జాతీయ భావస్పందాన్నీ, ఆనాటి అభ్యుదయ కవిత్వాదర్శాలనూ పరిణామక్రమంలో మారుతూ వచ్చిన నేటి సామాజిక వాస్తవికతా దృగ్విషయంతో సరిపోల్చి, ఆ రచన కాలప్రవాహంలో ఎంతవరకు ఎదురీదినదీ పరిశీలిస్తే – దానికి సాహిత్య చరిత్రలో రాదగినంత గుర్తింపు ఈనాటికీ రాలేదనే అనిపిస్తుంది. కవి జీవితకాలంలో వెలువడిన వివాదాస్పద అనుకూల ప్రతికూల విమర్శలు రెండింటికీ అతీతంగా – కవి జీవితాని కంటె సుదీర్ఘమైన కావ్యజీవితాన్ని సమీక్షించి, గుణావగుణాల నిగ్గు తేల్చవలసిన సమయం ఇది. ఆయన సౌందర్యదర్శనాన్ని అధికరించి, సృజనవిజ్ఞానాన్ని ఉపలక్షించి, ప్రగతిశీల కాల్పనిక నవ్యకవిత్వోద్యమ కవులలో ఆయన స్థానాన్ని నిర్ణయింపవలసిన అవసరం ఉంది.

‘పైరు పాట’ తెలుగులో ప్రణయతత్త్వ ప్రతీకీకరణను అభ్యుదయాదర్శాలతో ప్రవేశపెట్టిన ప్రప్రథమ గేయనాటిక. మొదట ‘స్నేహ’ అన్నపేరుతో ఆకాశవాణిలో ప్రసారితమై, ఆ తర్వాత ‘స్నేహసుందరి’ అన్నపేరిట ఒక వారపత్రికలో ప్రకటితమైంది. ముద్రణ నాటికి ‘పైరు పాట’ అన్న నాట్యరంగప్రదర్శనీయమన్న సాంకేతికతతో వినూత్నాభిధానాన్ని సంతరించుకొన్నది. భీమన్నగారు మానవతావాదానుసారం గాంధీయుగచైతన్యంతో రచనలు చేస్తూనే కాల్పనికచైతన్యాన్ని అభిమానించారు. సంప్రదాయబలాన్ని తమ కవితాప్రక్రియలకూ, సిద్ధాంతాలకూ అండదండలుగా నిలుపుకొన్నారు. కాల్పనిక కవితాచైతన్యంలోనూ, సామ్యవాద వాస్తవికతలోనూ స్వీయానుభవాల నేపథ్యాన్ని గుర్తుపట్టారు. ఆ దర్శనసారాన్ని సొంత గొంతుకతో ఆలపించారు. దేశికవితారీతులను అభ్యసించి, తెలుగుదనానికి వెలుగునిచ్చే ప్రక్రియలను మాత్రమే తమ అభివ్యక్తిదీపికలుగా మలచుకొన్నారు. ఆ సంస్కారమంతా ‘పైరు పాట’లో రూపుదిద్దుకొంది. “ఇది నృత్యగాన సాహితి, బ్రదుకున సుఖమిచ్చు పదసరస్వతి, ప్రేమాస్పద…” అని విశ్వశ్రేయం తమ కవితాలక్ష్యమని, ప్రేమ తమ కవిత్వానికి ప్రాణప్రదమని చాటిచెప్పారు.

999394_382232561881202_503972310_n

‘పైరు పాట’కు రంగస్థలం భీమన్నగారికి బాల్యంనుంచి సుపరిచితాలైన గోదావరీతీరంలోని పైరుపొలాలు. ఈ రూపకంలో కథానాయిక స్నేహ ఒక మాల పిల్ల. పేదరికంలో పెరిగి పెద్దయిన యువతి ఆమె. పైరుచేల గట్లలో పచ్చగడ్డి కోసుకొనేందుకు ప్రతిసాయంత్రమూ పొలాల్లోకి వస్తుంటుంది. ఒక కామందు ఇంట్లో పాలేరుతనానికి కుదురుకొంటుంది. యజమాని ఇంటిపనులు నిర్వర్తించడం, పశువుల మేతకోసం ప్రతిరోజూ పంటపొలాల్లో తిరిగి గడ్డి కోసుకొని ఇంటికి తిరిగివెళ్ళటం, పంటతల్లి అందాలకు ఆనందించటం ఆమె దినచర్య. శీల ఆమె స్నేహితురాలు. ఆమెకూడా ఒక కామందు ఇంట్లో పనికి కుదిరినదే. శ్రీవత్స అనే అగ్రకుల విద్యావంతుడు ఆ పొలాల్లోనే షికారుకు వచ్చి స్నేహను చూసి ఆమెతో స్నేహం చేస్తాడు. ఇద్దరి మనస్సులూ ఆకర్షణకు లోనై, స్నేహం ప్రణయంగా మారటాన్ని భీమన్నగారు చాలా సున్నితంగా చిత్రించారు. శీల తన స్నేహితురాలి చిత్తవిభ్రమాన్ని గుర్తించి ఆమెను హెచ్చరిస్తూ ఉంటుంది. స్నేహ తాను గతి తప్పుతున్నానేమో అని భయపడుతుంది. ఎంత అభ్యుదయవాది అయినా అగ్రకులస్థుడు, గొప్పోళ్ళ బిడ్డ అయిన శ్రీవత్స తనను పెళ్ళి చేసుకుంటాడో లేదో అని కలవరపడుతుంది. అందనిదానికోసం ఎగబడుతున్నానేమో అని వెనకాడుతుంది. తన మనస్సును కట్టడి చేసుకొనే ప్రయత్నంలో అతనికి కనబడటం మానేస్తుంది. శీల అయోమయంలో పడుతుంది. శ్రీవత్సకు ఆందోళన కలుగుతుంది. శీలను అడిగి విషయం తెలుసుకొని ఆమె అనుమానాలను, అభ్యంతరాలను పరాస్తం చేసి స్నేహను పెండ్లిచేసుకొంటాడు.

‘పైరు పాట’ రూపకంలో అంకవిభాగానికి మారుగా భీమన్నగారు రంగవిభాగాన్ని అభిమానించారు. ఆ రంగాలు కాలగమనాన్ని సూచించేందుకు మాత్రమే పరికరించాయి. మొదటి ఆరు రంగాలకూ దృశ్యం ఒక్కటే. పచ్చని పైరుపొలం. చివరి రంగంలో నైపథ్యయవనికపై కల్యాణవేదికగా ఒక కుటీరాన్ని చిత్రించటమొకటే మార్పు. పుష్యమాసపు చల్లనివేళలో అననుభూతరతోత్సవులైన నాయికానాయకులు స్నేహ – శ్రీవత్సల మనస్సులలో ప్రేమభావం మొలకెత్తి, అంతలోనే మొగ్గతొడిగి, పూవై పూచి, నిండుగా పండి, పరిపక్వమవుతుంది. మొదట్లో స్నేహ శ్రీవత్సను విమర్శనాదృష్టితో చూస్తుంది. ఉన్నతవిద్యావంతుడైన అతని ప్రేమనిర్భరమైన వాక్యజాతంలోని గంభీరిమ అర్థం కాకపోయినా, క్రమంగా అదే భాషలో అతనికి జవాబు చెప్పటం నేర్చుకొంటుంది. ఆ అభ్యుదయపరిభాష ఆమెకు అలవడటం రూపకంలోని భావశబలతకు పరాకాష్ఠ.

మొదటి రంగంలో నాయికానాయకులకు పరస్పరాకర్షణ సిద్ధిసాధనను పొందినా శ్రీవత్స యెడ స్నేహ ఆభిముఖ్యం రెండవ రంగం దాకా అభివ్యక్తం కాలేదు. ఎంత ప్రార్థించినా ఆమె అతనికి తన పేరుచెప్పదు. శరణ్యాంతరం తోచక అతను తన స్నిగ్ధభావసూచకంగా ఆమెకు ‘స్నేహ’ అని పేరుపెడతాడు. అది ఆమె వాస్తవనామమై ఉండటం రూపకంలోని చిత్రకల్పనాకృతులలో ఒకటి. కథాసంవిధానంలో ‘పైరు పాట’పై కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం నాటకప్రభావం అడుగడుగున గోచరిస్తుంది. సంవాదశిల్పంలో రాయప్రోలు జాడలున్నాయి.

భీమన్నగారు ప్రతిపాదించిన ‘రసాద్వైత సిద్ధాంతం’ కూడా రాయప్రోలు ‘అమలిన శృంగార’ సిద్ధాంతానికి శాఖాంతరితమే. కాళిదాసు కావ్యకళాకమనీయదృశ్యాలను రమ్యంగా ఆధునీకరించారు. దుష్యంతుడు శకుంతలను చూసినప్పటి పుష్పోపమానమే ఈ కథలోనూ శ్రీవత్సకు స్నేహను చూసినప్పుడు స్ఫురిస్తుంది. “పచ్చపచ్చని పైరుచేలో, విచ్చివిచ్చని వింతపువ్వా!, నీకు నాకూ ఇంత దవ్వా, రేక విప్పగదే!” అన్న చరణంతో వారి ప్రేమకు అంకురార్పణ జరుగుతుంది. కాళిదాస నాయకుని వలెనే శ్రీవత్స స్నేహను గురించి, “ఎవరామె! ఎక్కడ పు, ట్టిందామె? ఏమిటి నే, ర్చిందామె? ఏమిటామె, స్థితిగతులు?” అని శీలను ప్రశ్నిస్తాడు.

శీల పాత్రనిర్మాణం అచ్చంగా శాకుంతలంలోని అనసూయ పాత్రనిర్మితికి తులనీయంగా సాగింది. రూపరూపణలో ప్రకృతికి కూడా మానవీయతాప్రకల్పనం, మనోవస్థానురూపమైన స్పందన, భావశబలత శాకుంతలంలో వలె ఇందులోనూ ప్రాకామ్యస్థితిని పొందాలని కవి ప్రయత్నించారు. నాయికానాయకుల ప్రణయసాఫల్యానికి పచ్చని పంటచేలు పరవశించి శ్యామలించిన సస్యాలతో ప్రాభాతిక మంగళగీతాన్ని వినిపించే సన్నివేశం మూలాన ‘పైరు పాట’ అన్న కావ్యనామం అర్థవంతంగా అమరింది.

Pairu Pata Cover Page

కాళిదాసు ప్రభావానికి ‘పైరు పాట’లో ఇంకా ఉదాహరణలను చూడవచ్చు. “పంపరమ్మ దీవించి, పచ్చని లతకూనలార!, పైరుగాలి సందిట్లో, పవళించిన పైరులారా!” అన్న దళం ‘అనుమతగమనా శకుంతలా, తరుభిరియం వనవాసబంధుభిః” అన్న కణ్వ మహర్షి వచనానికి ప్రతిరూపమే. “క్షితిరుహములార! పుష్పితలతికలార!, అనుమతింతురు గాక కల్యాణయాత్ర” అన్న పినవీరన శాకుంతలానువాదం (4-93) చూడండి. “ఎన్ని రాత్రు లీ యొంటరి, తిన్నెపైని కూర్చుండి, నా మది మడతలను విప్పి, మీ ముందర పరచితినో” అన్నది శాకుంతలంలోని “అమీ వేదిం పరితః లుప్తధిష్ణ్యా” అన్న కణ్వమహర్షి వచనానికే అనురణనం. శాకుంతలంలో వలె ‘పైరు పాట’ లోనూ ఏడే అంకాలున్నాయి. కథానాయిక స్నేహ శీలసౌందర్యాన్ని ఉద్దీపింపజేయటానికి భీమన్నగారు వివిధ రసభావాలను శాకుంతలంలో వలెనే ముగ్ధా శృంగారానికి పరిపోషకంగా ప్రవేశపెట్టారు. జానపదుల పవిత్ర ప్రణయానికి ప్రతీకగా శిల్పీకరించారు.

‘పైరు పాట’ సాహిత్యవిజయాన్ని సాధించిన చాలా సంవత్సరాల తర్వాత భీమన్నగారు “రసభావపుష్కలమైన కవితాసౌందర్యానికిది పరాకాష్ఠ” అని స్వయంగా తానే తన జ్ఞాపకాలను స్వీయచరిత్ర ‘పాలేరు నుంచి పద్మశ్రీ దాకా’లో నిండైన సంతృప్తితో నెమరువేసుకొన్నారు. “చిత్తంలో ప్రతిదెబ్బా, సుత్తి దెబ్బగా మలచిన, మానవతామూర్తిని మించి, మహితశిల్ప మేమున్నది?” అన్న దళాన్ని ‘పైరు పాట’లో ఉదాహరణీయమని శిరోవతంసీకరించారు. ప్రముఖ విమర్శకులు శ్రీవాత్సవ గారు ఆ రోజుల్లో దీనినొక విశిష్ట కావ్యవిశేషంగా, కవితా పూజాకుసుమంగా భావించారు. మానవతలో మహోన్నతిని చూపి, దానిని ప్రకృతిలో ప్రతిబింబింపజేసిన గేయకృతిగా ‘పైరు పాట’ను అభివర్ణించారు.

ప్రణయతత్త్వ ప్రతీకీకరణం

ప్రణయాన్ని ప్రతీకీకరించే లక్ష్యంతో వ్రాసినందువల్ల ‘పైరు పాట’లో సామాజికవైరుధ్యాలు, జీవితంలోని ఉత్థానపతనాలు, నిమ్నోన్నతాల భావసంఘర్షణ చిత్రణకు రాలేదు. ఇతివృత్తం కులాంతరవివాహమే అయినప్పటికీ – కులాల మధ్య ఏర్పడిన అడ్డుగోడలు ఇందులో నిజంగా అవరోధాలు కాలేదు. స్నేహ ఆందోళన, శీల హెచ్చరిక నిజానికి ఏ కులానికి చెందిన యువతికైనా వర్తించేవే. నాయిక ఇందులో శాకుంతలంలో జరిగినట్లు వివాహపూర్వపు వర్తనఫలితంగా మానసికోద్వేగానికి, ఒడిదుడుకులకు గురికాలేదు. సమాజం కాని, సంప్రదాయం కాని వీరి స్వచ్ఛందప్రేమకు అడ్డుపడలేదు. తల్లిదండ్రుల మందలింపులు, కులాల అంతరాలు చర్చకు రాలేదు. ఈ ఎన్నుకొన్న సంవిధానాన్ని బట్టి ఏ సందేశమూ ఇందులో లేదు. ఈ కథలో లాగా మనసారా ప్రేమించుకొన్న యువతీయువకులందరూ ఏ కష్టాలూ, కన్నీళ్ళూ లేకుండా నిజంగా హాయిగా పెళ్ళిచేసుకోగలిగితే ఎంత బాగుంటుంది! జీవితం ఇలాగే ఉంటే ఎంత ఆదర్శవంతంగా ఉంటుంది! అనిపించటమే ‘రొమాంటిక్ టైపిఫికేషన్’ అన్న ఈ ప్రణయతత్త్వ ప్రతీకీకరణ పరమోద్దేశం. స్వచ్ఛమూ, స్వచ్ఛందమూ, విమలమూ, విషాదరహితమూ అయిన ఇటువంటి ఆదర్శ మానవసంబంధాన్ని నెలకొల్పటమే విప్లవోద్యమం పార్యంతికఫలమని 1939లో మాక్సిం గోర్కీ రష్యన్ సాహిత్య చరిత్ర ‘ఇస్తోరియా రూస్కోయ్ లితెరతురీ’లో నిర్దేశించాడు. “వాస్తవికజగత్తులో లేని అపూర్వమైన అనుభవాన్ని ఆదర్శంగా లోకానికి అందివ్వడమే కాల్పనిక సాహిత్యోద్యమ లక్ష్యం” అన్నాడు. దీనినే మరికొంత విపులీకరిస్తూ ఎ.కె. ద్రెమోవ్ తన ‘రొమాంటిక్ టైపిఫికేషన్’ అన్న వ్యాసంలో, “సామాజికపురోగమనానికి దోహదం చేసే నూతనస్వప్నాలను కల్పనాజగత్తులోనికి తీసుకొనిరావటం నవ్యసాహిత్య సంప్రదాయాలలో ఒకటి” అని మరింత స్పష్టం చేశాడు. ప్రణయతత్త్వ ప్రతీకీకరణలోని అభ్యుదయాదర్శం వర్తమానం అనే పునాదిపైని ఒక నవసమాజాన్ని నిర్మించటమే” అని చాటిచెప్పాడు.

“వర్తమానపరిస్థితుల పట్ల అసంతృప్తిని కాల్పనిక రచయిత అభ్యుదయ కళాదర్శంగా పరివర్తించి, వాస్తవజగత్తులో చోటుచేసుకోనున్న అనివార్య పరిణామాలను సాహిత్యంలో ఘటితాంశాలుగా నిరూపించటం జరుగుతుంది. ఆ ఆదర్శానికి స్పష్టమైన రూపం లేనప్పటికీ, అందులో సంభావ్యత లోపించినప్పటికీ ఆగామి యుగంలోని దృగ్విషయాలన్నీ పాఠకులకు దృష్టిగోచరం అవుతాయి. కళాప్రపంచం లోని ఆ రసాత్మకత సమ్మోహకంగా భాసించి, సమాజం దానిని వాస్తవీకరించాలనే ప్రయత్నాన్ని మొదలుపెడుతుంది. సంఘజీవితంలో మార్పులు వస్తాయి. మానవప్రవృత్తి సంకుచిత స్వార్థం నుంచి విడివడి విశ్వశ్రేయోభిముఖంగా ప్రయాణిస్తుంది.”

అని ద్రెమోవ్ పేర్కొన్న సంవిధానమే, యాదృచ్ఛికమే అయినప్పటికీ భీమన్న గారి అసంకీర్ణచిత్రీకరణలో ప్రస్ఫుటిస్తుంది. ఈ అభ్యుదయాదర్శానికి అనుభూతి కవితారూపాన్ని ఇచ్చినందువల్ల ‘పైరు పాట’లో “కష్టానికి ఫలమేమిటి, కన్నీరొక్కటి తప్ప, ఇచ్చేవాడినే దోచి, పుచ్చుకుంటదీ లోకం. / మేడలు మిద్దెలు ఉన్నా, మెత్తని పానుపు లున్నా, హృదయం లేకున్నప్పుడు, వృథయే కద బ్రతుకంతా.” వంటి పంక్తులకు నివేశం ఏర్పడింది. కథాశిల్పం, పాత్ర మనోధర్మవిశదిమ, సంవాదశైలి మొదలైనవన్నీ ఈ మార్గానుసారం ప్రవర్తిల్లాయి.

సంగీత నృత్య నాటికగా ప్రదర్శనీయరూపాన్ని సంతరించుకొన్నందువల్ల ‘పైరు పాట’ భావుక మనోధర్మానుసారం స్వరప్రస్తారానికి, రాగవిస్తారానికి, రంగభూమిపై తాళమాధురికి జీవకళను ప్రసాదించే నృత్యాభినయకల్పనకు అనువైన గతిలో సలక్షణంగా సాగింది. సామాజికవాస్తవికతను అభ్యుదయాదర్శాలకు అనుగుణంగా మలిచి, భావిసమాజం తీరుసౌరులు ఈ విధంగా ఉంటాయన్న కాల్పనికచైతన్యాన్ని తెలుగులో ప్రప్రథమంగా ఆవిష్కరించింది. “కాలంతోపాటు సమాజమూ, సమాజంతోపాటు సాహిత్యరీతి, దానితోపాటు విమర్శనాపద్ధతీ పురోగమించాలి. అందుకు దేశం నోచుకోలేదు” అని భీమన్న గారు బాధపడ్డారు. “మళ్ళీ గుచ్చుకొన్నా తీగ లొత్తిగించి చూడగలవారికి ఆకుల మాటున అరుణకాంతులు వెదజల్లే పుష్పాలు లభింపకపోవు” అని భవభూతి లాగా ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఆ సహృదయధర్మానికి సమానధర్ములకు స్వాగతం!

-ఏల్చూరి మురళీధరరావు

murali

ఏరీ ఆ శబ్దవిధాతలు నేడు !?!

murali

గతితార్కికభౌతికవాదప్రభావఫలితంగా తెలుగులో ప్రగతిశీలకవిత్వం వెలువడసాగిన తొలిరోజులలోనే అభ్యుదయకవులు ప్రచారంలో ఉన్న పెక్కు పదాలకు ప్రవాహవేగంతో ముంచెత్తుతున్న నవీనభావాల అర్థసమర్పకశక్తి లేదని గ్రహించారు. సంప్రదాయధోరణిలో ధారుణిలో బలంగా వేరూని నిలిచిన ప్రతీకలకు కొత్తరంగులద్ది, రాజకీయరూపచిత్రాలుగా పరివర్తించి, వాటికి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ పౌరాణికశైలితో కాలానుగుణమైన నూత్నపరిభాషను కల్పించుకొని అజరామరమైన పదబంధా లెన్నిటికో నవ్యవిధాతలై రాణించారు. “క్రొత్త పాతల మేలి కలయిక”గా గురజాడతో ప్రారంభమైన ఈ మార్గాన్ని సుగమీకరించి భావకవులు “మామిడికొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిల, స్వామికి మ్రొక్కి” అభినవధ్వనిధారణకు ఉద్యమింపగా – అభ్యుదయకవులు “సకలప్రజాసముద్ధర్త, సుప్తోద్ధృతజీవశక్తి”తో ఉత్తుంగ ప్రగతిశిఖరాల నుంచి నవ్యజలపాతాలను ప్రవహింపజేశారు. కావ్యదృష్టి ఒకరికి అనంత రసవృష్టి, మరొకరికి దురంత ఖడ్గసృష్టి. ఈ అద్యతనుల అనర్ఘమైన కృషి ఫలితంగా భావంలోనే కాక భాషలోనూ సరికొత్త మార్పులేర్పడి ఆకర్షణీయమైన పదసంపద చిరస్మరణీయంగా వెలసి విలసిల్లింది. ఆ నవీన గద్గదనదద్గోదావరీవారి తెలుగువారి ఆలోచనాక్షేత్రాలను సస్యశ్యామలం చేసింది. కవుల పేరు వింటే కవితలూ, కావ్యాల నామధేయ రూపధేయాల కంటె ప్రచార భేరీభాంకారాల భాగధేయమే కనుపిస్తున్న కాలంలో ఉన్నాము మనం. కవికీ, కవిత్వానికీ నిలకడ లోపించింది. “నిత్యవేగి నా, చిత్తము; శబ్దమేరుటకు చిన్నము నిల్వదు!” అన్నారు కాని, విశ్వనాథ కావ్యసరణి ఇరవైయవ శతాబ్ది సాహితికి ప్రాణంపోసిన సంధానకరణి. ఆ సంజీవనీశక్తి కుశలకరాంగుళులలో రూపుదిద్దుకొని సాహిత్యసౌహిత్యికుల నాలుకలపై నాట్యం చేస్తున్న శైలీశైలూషి అందచందాలు అన్నీ ఇన్నీ కావు. సంప్రదాయకవిత్వపు గౌరీశంకరశిఖరం మీద నిలిచి విశ్వనాథ “జీవుని వేదన” సృజించి వ్యాపింపజేసిన అనల్ప కల్పనాశిల్ప శాలీనతకు దీటుగా శ్రీశ్రీ నేతృత్వంలోని అభ్యుదయకవిత్వంలో “మరోప్రపంచం” నేలకు దిగివచ్చింది.

జీవితచరమసంధ్యాసమయంలో ఉన్న చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారిని కవిత్వలక్షణం ఏమిటని శ్రీశ్రీ అడిగితే ఆయన అన్నారట: 1) రమ్యాక్షరనిబంధం వల్ల కంఠవశం కాగల రచన 2) జాతీయజీవనస్రవంతిలో నుంచి వేణికలల్లిన సన్నివేశాలతో మననం చేసుకోవటానికి అనువయిన పదసంచయనం 3) ధారావిశుద్ధి మూలాన రసనాగ్రనర్తకిగా ఉండటం.

శాస్త్రిగారు చెప్పిన ఆ మూడు లక్షణాలూ పదపరివృత్తిని బట్టి వస్తుతః సమానార్థబోధకాలే అయినా వాటిలో కొంత ఛాయావిభేదం లేకపోలేదు.

రమ్యాక్షరనిబంధమన్నది కవితాశైలికి సంబంధించిన మసృణత్వం. అది సందర్భవశమే కాని సర్వకాల సర్వావస్థాగతం కాదని పొరబడకూడదు. ‘రమ్యత’ అంటే పాఠకుడు ఒక రచనను చదివిన కొంతకాలం తర్వాత దానిని మళ్ళీ అధ్యయనం చేసినప్పుడు – ప్రతిపాద్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగలగటం వల్ల, జీవితంలో తాను పొందిన సుఖదుఃఖాల అనుభవపరిణామం వల్ల, ఆత్మసంస్కారం వల్ల ఆ రచన మరింత కొత్తగానూ, మరింత దీప్తంగానూ భాసించే స్వభావాన్ని కలిగి ఉండటం అన్నమాట. కవియొక్క ప్రతిభాశక్తి కాలాంతరంలోని పాఠకుల అవగాహన పరిధికంటె ఎన్నోరెట్ల గాంభీర్యౌన్నత్యాలతో విలసిల్లితే గాని ఆ రమ్యాక్షరనిబంధం సాధ్యం కాదు. కవి ఎన్నెన్ని పూర్వజన్మలలో ఆరాధించి ఎంతమంది మహాకవుల నుంచి మూటగట్టి తెచ్చుకొన్న పుణ్యఫలమో అది!

కవిత్వాన్ని జాతీయ జనజీవనస్రవంతిలో నుంచి వేణికలల్లిన సన్నివేశాలతో విశ్వజనీనంగా తీర్చిదిద్దాలన్న ఆదర్శంలో కవి మనీషిత, లోకహితైషిత గోచరిస్తాయి. వేణికలల్లటం కేవలం ఆఖ్యానశిల్పానికి పరిమితమైన ఔపచారిక శబ్దప్రవృత్తి కాదు. కథాగతులైన వ్యక్తుల శీలౌన్నత్యానికి, శీలభ్రష్టతకు కారణాలేమిటో నిరూపించి, లోకానికి ఉపదేశప్రాయమైన రచనను చేయగలగటం అన్నమాట. ఆ రచనకు మూలాన్ని జాతీయ జనజీవితాలలో నుంచి తీసుకోవటం వల్ల పాఠకుడు తన జీవితాన్ని దానితో సరిపోల్చుకొని, తన జీవితానికొక గమ్యాన్ని, ఒక ఆదర్శాన్ని కల్పించుకోగలుగుతాడు. కవిత్వ రచనోద్దేశం ఆ ఆదర్శకల్పనల ఫలమైన సమాజాభ్యుదయమే. ఒక్కొక్క యుగంలో పరిభాష మారుతుందే కాని పార్యంతికఫలశ్రుతి అదే.

ధారాశుద్ధి అంటే వర్షామేఘం నుంచి తెంపు లేకుండా స్రవించే నీటిచాలు లాగా కవిత్వం పరిశుద్ధమైన పదసంపదతో హాయిగా సాగిపోవటం. పద్యమైనా, గేయమైనా పాఠకులకే గాక రచించిన కవికి సైతం గుర్తుండని స్థితి ఏర్పడటానికి కారణం ఈ ధారావిశుద్ధి లోపమే. ఈ ధారావిశుద్ధి స్వస్వరూపంతో చదువరుల గుండెలకు హత్తుకొనిపోవాలనే విశ్వనాథ వారు కావ్యరచనావేళ ఒక పూర్తి సన్నివేశాన్ని పూర్తిగా మనస్సులో కూర్చుకొన్నాక లేఖకునికి చెప్పి వ్రాయించటం జరిగేది. అజంతా గారు ఒక గేయం పూర్తిగా మనస్సులో నిలిచిపోయిన తర్వాత దానిని ఎన్నోమార్లు నెమరువేసుకొని, ధారణను సరిచూసుకొని, నిబ్బరంగా కుదిరిందని అనిపించిన తర్వాతనే ఆ నిరాకార శబ్దస్రవంతిని కాగితం పైకి ప్రవహింపజేసేవారు. చెళ్ళపిళ్ళ వారికీ, శ్రీశ్రీకీ, ఎంతోమంది మహాకవులకూ అభ్యస్తపూర్వమైన కవితా రచనా దృగ్విషయం అది.

viswa

అనువాదాలపై ఆధారపడక స్వతంత్రావిర్భావవికాసాలను కలిగివుండటం కూడా ఉత్తమకవిత్వపు సాముద్రికలక్షణమని వెంకటశాస్త్రి గారు సూచించారట.

రూపానికి ప్రాధాన్యం ఇచ్చి వస్తువు విషయాన్ని ప్రసక్తింపలేదని ప్రథమదృష్టికి భాసింపవచ్చును గాని, ప్రతిపాద్యవస్తువుకు చిరంజీవిత వెంకటశాస్త్రిగారు అనుభవపూర్వకంగా చెప్పిన స్మరణయోగ్యత వల్లనే సిద్ధిస్తుందనేది అందరికీ తెలిసిన సత్యమే.

భావికాలికాకాంక్ష లేని కవిత్వానికి భవిష్యత్తు సంకోచప్రదమని శ్రీశ్రీ తరచు అంటుండేవారు. అపురూపమైన ఆ సగుణశక్తిసాధన తోనే శ్రీశ్రీ తనకాలంనాటి మూడు తరాలకు నాయకత్వం వహింపగలిగారు. అభ్యుదయకవులు ఆయనను శబ్దబ్రహ్మగా ఆరాధించి, అనుకరించి, పదికాలాలపాటు పదిలంగా నిలిచే పదబంధాలెన్నిటినో కవిత్వపరిభాషలో నియతంగా నిలిపారు. ఆయన ప్రకల్పించిన శబ్దపు తంత్రులను మ్రోగించి, నూతనస్వరాలను పలికించి, ఆత్మీయాదర్శాలతో జాతి అంతరంగసంగీతాన్ని వినిపించారు.

అభ్యుదయకవిత్వావిర్భావదశకం

గతితార్కికభౌతికవాదప్రభావఫలితంగా తెలుగులో ప్రగతిశీలకవిత్వం వెలువడసాగిన తొలిరోజులలోనే అభ్యుదయకవులు ప్రచారంలో ఉన్న పెక్కు పదాలకు ప్రవాహవేగంతో ముంచెత్తుతున్న నవీనభావాల అర్థసమర్పకశక్తి లేదని గ్రహించారు. సంప్రదాయధోరణిలో ధారుణిలో బలంగా వేరూని నిలిచిన ప్రతీకలకు కొత్తరంగులద్ది, రాజకీయరూపచిత్రాలుగా పరివర్తించి, వాటికి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ పౌరాణికశైలితో కాలానుగుణమైన నూత్నపరిభాషను కల్పించుకొని అజరామరమైన పదబంధా లెన్నిటికో నవ్యవిధాతలై రాణించారు. “క్రొత్త పాతల మేలి కలయిక”గా గురజాడతో ప్రారంభమైన ఈ మార్గాన్ని సుగమీకరించి భావకవులు “మామిడికొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిల, స్వామికి మ్రొక్కి” అభినవధ్వనిధారణకు ఉద్యమింపగా – అభ్యుదయకవులు “సకలప్రజాసముద్ధర్త, సుప్తోద్ధృతజీవశక్తి”తో ఉత్తుంగ ప్రగతిశిఖరాల నుంచి నవ్యజలపాతాలను ప్రవహింపజేశారు. కావ్యదృష్టి ఒకరికి అనంత రసవృష్టి, మరొకరికి దురంత ఖడ్గసృష్టి. ఈ అద్యతనుల అనర్ఘమైన కృషి ఫలితంగా భావంలోనే కాక భాషలోనూ సరికొత్త మార్పులేర్పడి ఆకర్షణీయమైన పదసంపద చిరస్మరణీయంగా వెలసి విలసిల్లింది. ఆ నవీన గద్గదనదద్గోదావరీవారి తెలుగువారి ఆలోచనాక్షేత్రాలను సస్యశ్యామలం చేసింది.

కవుల పేరు వింటే కవితలూ, కావ్యాల నామధేయ రూపధేయాల కంటె ప్రచార భేరీభాంకారాల భాగధేయమే కనుపిస్తున్న కాలంలో ఉన్నాము మనం. కవికీ, కవిత్వానికీ నిలకడ లోపించింది. “నిత్యవేగి నా, చిత్తము; శబ్దమేరుటకు చిన్నము నిల్వదు!” అన్నారు కాని, విశ్వనాథ కావ్యసరణి ఇరవైయవ శతాబ్ది సాహితికి ప్రాణంపోసిన సంధానకరణి. ఆ సంజీవనీశక్తి కుశలకరాంగుళులలో రూపుదిద్దుకొని సాహిత్యసౌహిత్యికుల నాలుకలపై నాట్యం చేస్తున్న శైలీశైలూషి అందచందాలు అన్నీ ఇన్నీ కావు. సంప్రదాయకవిత్వపు గౌరీశంకరశిఖరం మీద నిలిచి విశ్వనాథ “జీవుని వేదన” సృజించి వ్యాపింపజేసిన అనల్ప కల్పనాశిల్ప శాలీనతకు దీటుగా శ్రీశ్రీ నేతృత్వంలోని అభ్యుదయకవిత్వంలో “మరోప్రపంచం” నేలకు దిగివచ్చింది.

srisri-profile

రాయప్రోలు కాల్పనికజీవనదిలో నుంచి తీసిన భావకవితాకుల్యను మళ్ళీ విశ్వనాథ సంప్రదాయజలధిలో కలిపివేయడంతో భావకవితాయుగంలో ఒక సువర్ణావృత్తి పూర్తయింది.

ఆ ఉరవడికి తట్టుకొని స్వీయవ్యక్తిత్వాన్ని నిలుపుకొన్న సామాజిక శబ్దవిధాతలు అబ్బూరి రామకృష్ణారావు, ఉమ్రాలీషా, కృష్ణశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్య, కుసుమ ధర్మన్న, జాషువా, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి కనుపిస్తారు. ఆ తర్వాత శిష్ట్లా, శ్రీశ్రీ, నారాయణబాబులు సృష్టించిన అభ్యుదయ ప్రవర అనిసెట్టి సుబ్బారావు, ఆరుద్ర, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, రెంటాల గోపాలకృష్ణ, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఆవంత్స సోమసుందర్, దాశరథి, బైరాగి, అజంతా, కవిరాజమూర్తి, దేవరకొండ బాలగంగాధర తిలక్ మొదలుకొని కాళోజీ, డా|| సి. నారాయణరెడ్డిల దాకా నిరంతరాయితంగా కొనసాగింది.

బోయి భీమన్న, గుంటూరు శేషేంద్రశర్మ, కోవెల సుప్రసన్నాచార్య, మాదిరాజు రంగారావు, చెరబండరాజు, జ్వాలాముఖి, సుబ్బారావు పాణిగ్రాహి, కె. సత్యమూర్తి, శివారెడ్డి, వరవరరావు, ఇస్మాయిల్, వేగుంట మోహన్ ప్రసాద్, గద్దర్, వంగపండు ప్రసాదరావు, ఓల్గా, ఘంటసాల నిర్మల, పాటిబండ్ల రజని, ముకుందరామారావు, పెన్నా శివరామకృష్ణ, త్రిపురనేని శ్రీనివాస్, ఎండ్లూరి సుధాకర్, అఫ్సర్, యాకూబ్, శిఖామణి, ఖాదర్ మొహియుద్దీన్, సతీష్ చందర్, జూపాక సుభద్ర, గోగు శ్యామల, చల్లపల్లి స్వరూపరాణి, మానస చామర్తి మొదలైన సమాజ ప్రియంభావుక కవులు తమతమ తీరుల కొత్త దారులను అభిమానించి వర్తమాన శరతల్పం మీదికి ప్రగతిశీల నవ్యోక్తివైఖరుల సంజీవనీ కావ్యజలధారను అమృతాయమానంగా తీసుకొనివచ్చినవారిలో కొందరు. వీరిలో పెక్కుమంది తమ వరివస్యతో అభ్యుయానంతర కవితా క్షితిజరేఖలను దిగంతాలకు విస్తరించే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు.cherabandaraju

అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో అనూహ్యమైన వేగంతో మారుతున్న సమాజంలో ఈనాడు కవులు సామాజిక హృదయస్పందనకు నేతృత్వం వహింపలేకపోవటానికి కారణం ఏమిటి? సాహిత్యప్రక్రియలపై ప్రసారసాధనాలు, ప్రచార రాజకీయాల దాడి ఈ మధ్యకాలంలో పదునెక్కుతున్నది. సారస్వతవ్యాపారసంస్థల పురస్కారసంస్కృతి ఈ పతనావస్థకు ప్రతిఫలనం. అన్యభాషలలో వలె కాక తెలుగువారు కవుల చలనచిత్రరంగప్రవేశాన్ని విస్ఫారితనేత్రాలతో తిలకించటం వల్ల ప్రాంతీయ వాణిజ్యావసరాలు సాహిత్యపరిభాషను శాసించటం మొదలయింది. నిర్ణేతృక సర్వసైన్యాధ్యక్షపదవిని వదులుకొని కవులే బంట్లుగా బానిసతనానికి తలొగ్గుతున్నారు.  విజాతీయధోరణులతో స్వరూపస్థితిని కోల్పోతున్న జాతిని దళితవాదకవయితలు వచ్చి మేల్కొలుపకపోతే నేటి సాహిత్యం పూర్తిగా నిర్నిమిత్తమై, విస్మరణీయావస్థలోకి జారుకొనేదనటంలో అతిశయోక్తి లేదు.

ఓల్గా

ఓల్గా

శ్రీశ్రీ యుగప్రభావం నాటి ప్రతిభావిలసన క్రమంగా పరిమితం కాసాగినందు వల్ల కవులు అల్పప్రాయమైన రూపవాదానికి ప్రాధాన్యమిచ్చి, చిరంతనమైన సమసమాజాదర్శాన్ని గౌణీకరించి, కల్పనాశిల్పాన్ని అనాదరిస్తున్నారు. సాహిత్యికులలో వ్యుత్పత్తిగౌరవం, క్రాంతదర్శిత క్రమంగా సన్నగిల్లుతూ వస్తున్నాయి. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం వైపుకు పరుగులుతీస్తున్నది. అస్తిత్వవాదం నుంచి సంఘటితశక్తిగా ఆవిర్భవించి దళిత బహుజనకవిత్వం సమాజనిష్ఠం అవుతున్న రోజులలో కూడా కవులు వైయక్తికాదర్శాలతో వెలసిన వార్తాపత్రికలే వస్తునిర్దేశికలుగా సరిపెట్టుకొని, జాతిభవితవ్యం పట్ల మౌనం పాటిస్తూ స్వార్థ రాజకీయవిధాతల వేలుపట్టుకొని నడుస్తున్నారు. ప్రజాస్వామిక మానవసంబంధాలకు కట్టుబడిన చైతన్య ధనుష్పాణుల గొంతుక సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకొని ఇంకా బలంగా వినబడుతుందని ప్రజలు బ్రతుకుబాటలో తమకు దారిచూపే శబ్దవిధాతల పాటకోసం వెయ్యికళ్ళతో వేచిచూడక తప్పటం లేదు.

ఏల్చూరి మురళీధరరావు

ఛందోబందోబస్తులన్నీఛట్‌ ఫట్‌ ఫట్‌మని త్రెంచిన…శ్రీశ్రీ !

muraliఛందోవిరహితమైన శబ్దం లేదనీ, శబ్దవర్జితమైన ఛందస్సు ఉండదనీ కవిత్వరచన వ్యవస్థితమైన పూర్వపు రోజులలో “ఛందస్సు లేని కవిత్వ”మన్న ఊహకే ఉపాధి ఉండేది కాదు. గద్యబంధంలో కూడా వృత్తగంధాన్ని సంవీక్షించి గద్యాన్ని ఛందోభేదంగానే పరిగణించిన ఒకనాటి లాక్షణికుల కావ్యశాస్త్రనిర్దేశపు ముత్యాలగొడుగుకింద మన కవులకు ముక్తచ్ఛందమన్న తిరుగుబాటు ఆలోచన రావటానికి అవకాశం లేకపోవటం సహజమే. ఆ అవకాశం మధ్యయుగాలను దాటి ఆధునికయుగంలో ప్రప్రథమంగా పందొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచిభాషలో సంచయించి, గతితార్కికభౌతికవాద ప్రభావం వల్ల సోవియట్ రష్యాలో బోల్షెవిక్కుల విజయానంతరం ప్రపంచకవితారంగంలో చోటుచేసుకొన్న విప్లవాత్మకమైన పరిణామాల కారణంగా వివిధరీతుల విస్తరించింది. ఛందోనియమాలతోపాటు కనీసం గుర్తింపదగిన గతివిధానమైనా లేని కేవల భావలయాత్మకవచనంలో వృత్తరీతి లేని అసమగణాల సంవిధానంతో పదపంక్తులను రూపొందించుకొని కవిత్వరచన చేయవచ్చుననే స్వచ్ఛందధోరణి సరిక్రొత్తగా ప్రచారంలోకి వచ్చి, అచిరకాలంలో ఆ వ్యవస్థ విశ్వమంతటా ప్రాచుర్యాన్ని పొందింది. అందువల్ల వచనానికి చైతన్యస్రవంతి శిల్పం ఎటువంటిదో – పద్యానికి ఛందోముక్త “వెర్స్ లిబర్” అటువంటిదని పాశ్చాత్య లాక్షణికులు భావించారు.

తనకాలం నాటికే ప్రభావశీలమై, భారతీయ కవిత్వంలోకి ప్రవాహవేగంతో చొచ్చుకొనివస్తున్న ఈ ప్రయోగవాదం అవ్యవస్థావాద సిద్ధాంతకర్తల ప్రాయౌగికదృష్టితో ముగ్ధుడై ఉన్న శ్రీశ్రీ దృష్టిని ఆకర్షించటం సహజమే.

 

కమ్యూనిస్టు మేనిఫెస్టో చల్లని గొడుగునీడలో కర్తవ్యస్ఫూర్తిని పొందిన శ్రీశ్రీ ఆ భాషాకవుల మార్గంలో కొత్తదీపాల వెలుగులను చూశారు. దాని ఫలితమే మహాప్రస్థానం కావ్యసృష్టి. ఆ తర్వాతిది ఖడ్గసృష్టి.

 

ఖడ్గసృష్టిలో “ఛందోబందోబస్తు లన్నీ, ఛట్‌! ఫట్‌ ఫట్‌మని త్రెంచి” పారేయాలన్న వచనకవిత్వ మౌలికసూత్రీకరణను శ్రీశ్రీ ‘కొంటెకోణాలు’ గేయంలో అలవోకగా చెయ్యలేదు. శబ్దస్ఫూర్తిని మించిన భావవ్యక్తి అందులో ఉన్నది. శ్రీశ్రీ విశాలమైన వైదుష్యనేపథ్యం ఉన్నది.

 

1928లో శ్రీశ్రీ తొలి పద్యకవితా సంకలనం ‘ప్రభవ’ వెలువడింది. భాషపై ఎంతో ప్రభుత్వాన్ని సంపాదించి, పద్యరచనలో కొంత పరిణతిని సాధించినా – స్వీయవిమర్శ చేసుకోగలిగిన శ్రీశ్రీకి ఆ ప్రస్థానం సంతృప్తి నివ్వలేదు. ఆ సంపుటిలో చేర్చిన

అలఘుధ్వాంతవితానసంభరితరోదోంతర్మహాగహ్వర

స్థలి యంభోనిధి యయ్యె; సంతతజలస్రావాతిరేకంబునన్

విలయాంభోధరఘోషసమ్మిళితగంభీరాట్టహాసధ్వనీ

చలితప్రాకటదిగ్గజుండ వగుచున్ సంప్రీతి నర్తింపుమా శంకరా!

వంటి రచనల కూర్పు వస్తువివేకసాధనకే తప్ప ఆయన అంతరాత్మ అందులో ధ్వనింపలేదు. అందులోని “ధ్వనీచలిత” వంటి వాచకదోషాలను గుర్తింపగల వివేకబోధ ఉన్నవాడు. పౌర్వికుల నీడలో నిలిచి ఉండే నిస్తేజస్వి కూడా కాదు. దానికితోడు తన భావోద్వేజనకు సంప్రదాయకవిత్వంలో ఉన్న పరిమితి కూడా శ్రీశ్రీ గుర్తింపుకు వచ్చింది. ఆ పరిణామవయోవస్థలోని సందిగ్ధావస్థను ఆ తర్వాత ఆయన తన ‘సుప్తాస్థికలు’ కవితలో పరిష్కరించే ప్రయత్నం చేశారు. అప్పుడే మార్క్సిస్టు దర్శన కవితాదర్శనపు మహానిధి ఆయన చేతికి వచ్చింది. సరికొత్త ఛందోవిచితి సాక్షాత్కరించింది. ఆ అభిజ్ఞానం తోనే ఆయన నిగళాలను ఛేదించాలని నిశ్చయించుకొన్నారు.

 srisri

రష్యన్ భాషాచ్ఛందోనైపథ్యం

శ్రీశ్రీకి ఆంగ్లభాషాముఖంగా సోవియట్ సాహిత్యపరిచయం కలిగేనాటికే ఐరోపీయభాషాకుటుంబంలోని రష్యన్ ఛందోరీతులలో సంప్రదాయానువర్తన యుగం ముగిసి ఆధునిక ప్రయోగశకం పరాకాష్ఠకు చేరుకొన్నది. ఫ్రెంచి, జర్మను భాషానువాదాలతోనూ, జానపద సంగీత పరిచయంతోనూ అలెగ్జాందర్ పుష్కిన్ నూతన విద్యాద్వారాలను తెరిచి రష్యన్ ప్రజాజీవితాలలోకి ఆంగ్లేయులకు బైరన్ లాగా ఐరోపీయమారుతపోతాలను ఆహ్వానించాడు.  గెటే కవిత్వంలోని కాలాతీతమైన సౌందర్యదీధితి, షిల్లర్ ఆశావాదంతోడి ఆధ్యాత్మికభావసౌగంధ్యం,  షెల్లీ లలితభావవాదకల్పనాశిల్పంలో భావివిప్లవాల క్రాంతదర్శిత, బైరన్ శృంగారభంగీభణితిలోని అపురూపమైన రాజసం, బ్రౌనింగు ఆత్మాశ్రయధోరణి, హ్యూగో చిత్రణలోని విషాదకిర్మీరాలు, బార్బియర్ కవితలలోని అంతరంగసంగీతం పుష్కిన్ ఆవిష్కరించిన నూత్నచ్ఛందోగతులలోకి అడుగుపెట్టాయి. షేక్స్పియర్ సానెట్టుల విశ్వజనీన కావ్యవిశిష్టపదరచనారీతిని దెల్విగ్, ఓదోవ్‌స్కీ, పోలెజాఫ్‌లు; షెల్లీ కాల్పనికవాద లలితగీత సరణిని లెర్మొంతోవ్ ప్రవేశపెట్టి రష్యన్ ఛందోగతులకు నవీన యుగకర్త లయ్యారు. గొగోల్ నేర్పిన ధ్వన్యాత్మకవిప్లవశీలితను కవిత్వంలో ప్రవేశపెట్టి – పాతబడిన ఛందస్సులలో పరివర్తనను తీసుకొనిరావాలనీ, లేదా వాటిని పూర్తిగా పరిహరించి నవగతినిర్మితిలో స్వేచ్ఛాగానఝరుల సంగీతభంగీతరంగాలను నినదింపజేయాలనీ తుర్గెనీవ్, తొల్‌స్తోయ్ (టాల్‌స్టాయ్)లు ప్రయత్నింపసాగారు. పాశ్చాత్య విద్యాభ్యాసం చేసివచ్చిన నవకవుల ప్రభావంతో చెహొవ్ సమకాలీన జీవితంలోని నైరాశ్యాన్నీ, పాలకుల పతనావస్థనూ, సమాజంలో లోపిస్తున్న ఆదర్శాలనూ గుర్తించి సాహిత్యానికి స్వతంత్ర దిశానిర్దేశం చేయాలని సంకల్పించుకొన్నాడు. అక్షరసంహతిలో ఛందోనియమరహితమైన నవ్యపథాన్ని అభిమానించాడు. ఆ సమయంలో రష్యన్ ఛందోగ్రంథాలలోనూ, ఆంగ్లచ్ఛందస్సులను వివరించే రష్యన్ పాఠ్యపుస్తకాలలోనూ సంప్రదాయచ్ఛందస్సులకు నిరసనగా ప్రొక్రూస్టియన్ బెడ్ అనే కొత్త వైమర్శిక పదబంధం వచ్చి చేరింది.  తనకు మార్గదీపకులైన క్రొపోత్కిన్, బకూనిన్ వంటి అరాచకవాద సామాజిక సిద్ధాంతకర్తల ప్రబోధాల మూలంగా శ్రీశ్రీకి దీని పరిచయం కలిగి ఉంటుంది.

 

ప్రొక్రూస్టియస్ తల్పం

గ్రీకు పౌరాణికగాథల నుంచి సాహిత్యక్రియాకల్పంలోకి ప్రవేశించిన ఆధునిక పదబంధం ఇది. ఏథెన్సు నుంచి ఎల్యూసిస్‌కు వెళ్ళే పవిత్రమార్గంలో ఉన్న కొరిడల్లాస్ పర్వతశ్రేణికి రాజు పొసైడాన్ కొడుకు ప్రొక్రూస్టియస్. వట్టి కుతంత్రపరుడు. అతని వద్ద ఒక మాయాతల్పం ఉండేది. అది ఎటువంటివాళ్ళకైనా సరిగ్గా సరిపోతుందని, దానిమీద పడుకొనేవారికి ఆహ్లాదం కలుగుతుందని అతను ఆ దారిని వచ్చినవాళ్ళను మభ్యపెట్టి దానిపై పడుకోమనేవాడు. ఆ ఆగంతుకులు మంచం కన్నా పొడుగ్గా ఉంటే కట్టుతాళ్ళు బిగించి, వాళ్ళ కాళ్ళుచేతులు అందుకు సరిపడేట్లు నరికి ప్రొక్రూస్టియస్ పైశాచికానందం పొందేవాడు. పొడుగ్గా లేనివాళ్ళ కాళ్ళుచేతులు సాగలాగి తెగనరకటం మాత్రం తప్పేది కాదు. పొట్టివాళ్ళు పడుకొంటే ఆ మంచం మరీ పొట్టిదయ్యేది. కాళ్ళుచేతులు తెగగొయ్యటం తప్పేది కాదు. కాళ్ళుచేతులు నరికినా తప్పులేదు కాని అవి మంచాన్ని మించకూడదని అతని వాదన.

రష్యన్ లాక్షణికులు ఛందస్సును ఈ ప్రొక్రూస్టియన్ మంచం తోనూ, వ్యతిక్రమాన్ని సహింపని ఛందోనియమాలను కట్టుతాళ్ళతోనూ సరిపోల్చటం శ్రీశ్రీ దృష్టిని ఆకర్షించి ఉండాలి. అంతకు మునుపే మయకోవ్‌స్కీ కాల్పనికవాదుల ఆత్మాశ్రయ కృత్రిమాదర్శాలు ఆగామి సామ్యవాద సమాజంలో ప్రొక్రూస్టియన్ శయ్యాగతికి నోచుకోక తప్పదని విమర్శించటం మనకు తెలిసిన సంగతే.

 

గ్రీకువీరుడు థెస్యూస్ వచ్చి ప్రొక్రూస్టియస్‌ను మాటల్లో పెట్టి అదే మంచానికి కట్టి చంపినపుడు – నిజానికి అతని వద్ద రెండు మంచాలున్నాయని, బాధితుల ఒడ్డుపొడుగులను బట్టి వాటిని మారుస్తుండేవాడని రహస్యం బయటపడుతుంది.

 

ఛందోవ్యవస్థలో ఈ రెండే గద్యం, పద్యం అని సంకేతితా లన్నమాట. పద్యానిర్మాణం చేసేవారు పాదాక్షర గణానుసారం సిద్ధిసాధనకు శబ్దంలోని దీర్ఘానికి లేని లఘిమను, లఘువుకు కూడని దీర్ఘిమను కల్పించినా తప్పులేదు కాని, ఛందోభంగాన్ని మాత్రం సహించేందుకు వీలులేదన్న నియమం – “అ‌పి మాషమ్ మషమ్ కుర్యాత్, ఛందోభంగం న కారయేత్” అన్నది ప్రొక్రూస్టియన్ శయ్యాసంస్థితమైన భాష దుఃస్థితికి అద్దం పడుతుంది.

 

లాటిన్ భాషాచ్ఛందోవిధానంలో ఇది మరొక విధంగా ఉన్నది. పాదాంతంలో పదచ్ఛేదం వల్ల సాధించే భావలయకు ప్రొక్రూస్టియన్ లయ అని పేరు. ఇది మన ఛందోనిబంధంలోని అంత్యప్రాస విధివిధానంలో ఉన్నదే. “అందంగా మధురసని / ష్యందంగా …”, “జాతి జాతి నిర్ఘాత పాత సం / ఘాత హేతువై …”, “జగతి మరపు, స్వప్నం, ని / శ్శబ్దం, ఇది …” వంటి పాదాలు ఈ అంత్యప్రాస నియతిలోని వివిధ భావగతులకు ఉదాహరణాలు.

 0148

ఇంగ్లీషులో దీనినే డ్రోలరీ (శబ్దడోలిక = తూగు) అంటున్నాము.  శ్రీశ్రీ ప్రయోగాలలో ఇది విస్తృతంగా కనుపిస్తుంది.

 

శ్రీశ్రీని ప్రభావితం చేసిన మహాకవులలో ఒకరైన ఎడ్గార్ ఆలెన్ పో “ది పర్లాయిన్‌డ్ లెటర్” అన్న కథలో పారిస్ నగర రక్షకభటులు నేరపరిశోధనసమయాలలో సడలింపు లేని చట్టాలకు ఒదిగి, పరిశోధనలో స్వేచ్ఛాసంచారం లేక చేతులు కట్టి పడవేసినట్లు ఉండవలసి రావటాన్ని ప్రొక్రూస్టియన్ తల్పంతో ఉపమించటం కూడా పో అభిమాని అయిన శ్రీశ్రీ దృష్టిపథంలో ఉండే ఉంటుంది.

 

కానీ రష్యన్ లాక్షణికులు పై దృక్కోణాలను అనుసరింపక ప్రొక్రూస్టియన్ తల్పాన్ని కేవలం ఛందోబందోబస్తుల ఏర్పాటుకు పర్యాయపదంగా మాత్రమే పరిగణించారు. ఆ సాహిత్యప్రభావమే శ్రీశ్రీ అమోఘమైన వాక్కులో ఛందోబందోబస్తు లన్నీ, ఛట్‌! ఫట్‌ ఫట్‌మని త్రెంచి  అన్న వచనకవితాగతినిర్దేశక మార్గదీపక పదబంధంగా రూపుదిద్దుకొన్నది.

ఛందస్సుకు అక్షరగతులు, మాత్రానియమాలు కట్టుతాళ్ళన్న ప్రసక్తి లేకపోతే “ఛందో-బందోబస్తు” లన్న రూపణకు పద్యంలో స్థానం లేదు.

 

ఛందోరీతుల కల్పనలో సమకాలీన  తెలుగు కవుల ప్రభావం శ్రీశ్రీపై ఏమీ లేదని ఫలితార్థం. శ్రీశ్రీ సాధించిన ఛందోవిజయవిలాసం వల్ల తెలుగు సాహిత్యం మరింత ప్రజాసన్నిహితమై విశ్వతోముఖంగా వికసించిందనేది చర్వితార్థం.

 

 ఏల్చూరి మురళీధరరావు

ఒళ్ళు మరిచిపోయిన చందమామ!

br passportచక్కని రాచకన్నియలు సౌధములన్ శ్రవణామృతంబుగా
మక్కువఁ బాడుచున్ లయ సమానగతిం బడఁ జెండుఁగొట్టుచోఁ
జుక్కల ఱేఁడు మైమఱచి చూచుచు నిల్వఁగ నప్పురంబునం
దక్కట చెండు తాకువడి యాతని మేనికిఁ గందు గల్గెఁగా.
శంతనుమహారాజుగారి కాలమది. హస్తినాపురం సౌధాల మీద చూడచక్కని రాచకన్నెలు సంగీతం పాడుతున్నారు. చెవులకు (శ్రవణ) అమృతమయ్యేట్టుగా పాడుతున్నారు. చాలా ప్రీతితో ఇష్టపడి (మక్కువన్) పాడుతున్నారు. కనకనే శ్రవణామృతంగా ఉంది. అలా పాడుతూనే (పాడుచున్) చెండు ఆడుతున్నారు. పువ్వుల్ని బంతిలాగా కట్టి ఎగరెయ్యడం పట్టుకోవడం, ఒకరు ఇటు కొట్టడం మరకొరు అటు కొట్టడం-ఇలా పూల చెండుతో బంతి ఆడుతున్నారు. పోనీ కొందరు పాడుతున్నారు, కొందరు ఆడుతున్నారనుకుందాం. ఆడేవాళ్ళు- పాటలో ఉన్న లయకు సమానమైన గతి పడేట్టు ఆడుతున్నారు. నాట్యగత్తెలు రంగస్థలం మీద ప్రదర్శించే బంతి ఆట చూసినవారికి ఇది బాగా తెలుస్తుంది. సరే, లయానుకూలంగా చెండు కొడుతున్నారు. ఆటా పాటా అద్భుతంగా సాగుతున్నాయి (పాడుచున్-చెండుఁగొట్టుచోన్).
పక్కనే –ఆకాశంలో పోతున్న చందమామకు ఇది కంటబడింది. అతడసలే చుక్కల ఱేడు. వీళ్ళు చక్కని చుక్కలు. అమృతంలాంటి పాట. దానికి తోడు చెండాట. ఇంకేముంది-ఒళ్ళు మరచిపోయాడు. మైమరిచి అలా చూస్తూ సౌధంమీద నిలబడిపోయాడు. వాళ్ళు విసురుతున్న చెండు వచ్చి తన బొజ్జమీదనో వీపుమీదనో థపా థపా తగులుతున్నా ఆ జీవుడికి ఏమీ తెలీడం లేదు. అయ్యయ్యో! (అక్కట) పాపం-చెండు తాకులు (తగలడాలు) పడీ పడీ అతడి శరీరం కందిపోయింది! అదే- అతడి బింబంలో ఉన్న మచ్చ. మేనుకి కలిగిన కందు (మచ్చ), -అని సానుభూతి ప్రకటిస్తున్నాడు కవి.
ఇంతకీ- చెండు ఆడటం అనలేదు. చెండు కొట్టడం అన్నాడు. కనక ఇది తెలుగునాట ప్రసిద్ధమైన ఉట్టికొట్టడమే కావచ్చు. ఉట్టి బదులుగా- చెండు. ఆటా పాటా దరువూ పరుగూ ఎగరబోవడం నీళ్ళు పోయడం ఉట్టిచెండు అందకపోవడం గాలిలో చెయ్యి విసరడం అది చంద్రుడికి తగలడం వాడి వీపు కందిపోవడం-ఆహా! ఏమి కోలాహలం!!
సౌధాల ఎత్తు, కన్నెల సౌందర్యం, సంగీత విద్యా ప్రావీణ్యం, క్రీడాకుశలత, సరసత, సంపన్నత, తీరుబాటు- ఇలా ఎన్నెన్నో వ్యంగ్యాలు స్ఫురిస్తాయి ఇందులో.

 

మ.     ప్రతి జన్మంబు సుమంగళీత్వగరిమన్ బ్రాపింప నింద్రాణి సు
వ్రత చర్య న్వరుణానికిన్ రవి హరిద్రా చూర్ణ రాశి న్నభ
స్తత శూర్పంబున వాయనం బొసఁగఁ బ్రత్యక్సింధు వీచీ పటా
వృతి యొప్పన్గొని, చల్లు నక్షతలు నాఁబెంపొందెఁ దారౌఘముల్
(తారాశశాంకవిజయము. ఆ. 4. పద్య. 110.)
ఇంద్రునిభార్య శచీదేవి (ఇంద్రాణి) ప్రతిజన్మలోనూ తనకు ఇలాగే సుమంగళీత్వం లభించడం కోసం (ప్రాపింపన్ ) ఒక వ్రతంచేసి, సువ్రతచర్యలో భాగంగా, పశ్చిమదిక్కుకు అధిపతి అయిన వరుణుని భార్య – వరుణానికి, సూర్యుడనే పసుపుపొడి ప్రోగును (హరిద్రా- చూర్ణ – రాశిన్ ) – పసుపు ముద్దను ఆకాశమనే పెద్ద చేటలో (తత శూర్పము) వాయనం ఇచ్చింది. ఇవ్వగా – వరుణాని ఏమి చేసిందంటే – పడమటి సముద్రపు కెరటాలు (ప్రత్యక్-సింధు – వీచీ) అనే తన పైట చెంగును ఆ చేట మీద కప్పి (పట – ఆవృతి – ఒప్పన్ ) ఆ వాయనం ఒప్పుగా అందుకొంది. పెద్దలు ఇచ్చే ప్రసాదాలను కొంగుపట్టి తీసుకోవడం ముత్తైదువులిచ్చే వాయనాలను కొంగు కప్పి అందుకోవడం తెలుగింటి సంప్రదాయం. అలా అందుకొని – అభీష్టసిద్ధిరస్తు – వ్రతఫల ప్రాప్తిరస్తు అని కోరుతూ – ఇంద్రాణిమీద వరుణాని జల్లే శుభాక్షతలు అన్నట్టుగా (నాన్ ) ఆకాశంలో తారల గుంపులు (తార – ఓఘముల్ ) శోభించాయి.

మంచి ముత్యాల్లాంటి పద్యాలు

br passport

ఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో! సుమారు రెండు వేల సంవత్సరాలుగా నడుస్తోంది తెలుగు పద్యం. దీనితో కలిసి మనమూ నాలుగు అడుగులు వేద్దామంటారా. రండి మాతో పాటు. పద్యం కోసం పాదయాత్ర. పాడిందే పాటగా ఎక్కిన గుమ్మమే ఎక్కడం కాదు. భక్తితో భజన చెయ్యడమూ కాదు. చూడవలసిన చోట్లు కొన్ని ఉన్నాయి. ఎవరూ అంతగా దృష్టి పెట్టనివి. అవి చూద్దాం.

సముద్ర గర్భంలో ఆల్చిప్పలుంటాయనీ, వాటిలో ముత్యాలుంటాయనీ, వాటిని పట్టి తెచ్చి అమ్ముతారనీ విన్నాం. కానీ ఈ ముత్యాల వేట ఎలా ఉంటుందో తెలీదు. దీన్ని సూర్యాస్తమయం తారకోదయాలతో పోల్చి చెబుతున్నాడీ కవి.

178. చం.     శరనిధి సాంధ్యరాగ మనుచక్కని బచ్చెన యోడనెక్కి, దు
స్తరతర రశ్మి బద్ధ రవి జాలికు నీటను ముంచి, మౌక్తిక
స్ఫుర దురు శుక్తికల్గొని, నభోధరణిన్ సమయంపు బేరి ని
బ్బరముగఁ గొట్టి, రాలుచు సుపాణు లన, న్విలసిల్లెఁ దారకల్
(మిత్రవిందాపరిణయము. కుం. వేం. ఆ. 5. పద్య. 11.)

ముత్యాల వ్యాపారి కథను ముడిపెట్టాడు ఈ పద్యం లో – కవిగారు.

బేహారి –
బేరి = వ్యాపారి. సమయము అనే వ్యాపారి (బేరి). సాంధ్యరాగము అనే చక్కని రంగు
(బచ్చెన) ఓడను ఎక్కి సముద్రంలోకి (శరనిధి) ముత్యాలకోసం వెళ్ళాడు. సూర్యు డు (రవి)
అనే జాలరిని (జాలికున్ ) ఎక్కిం చుకుని మరీ వెళ్ళాడు. మధ్యలోకి వెళ్ళాక ఈ జాలికుణ్ని
శరనిధిలోకి దింపాడు. నడుముకి పొడవైన – తెగిపోని (దుస్తరతర) త్రాడుతో కట్టి
(రశ్మిబద్ధ) నీటను దించాడు. (రశ్మి = కిరణం. కిరణబద్ధుడై రవి పడమటి సముద్రంలోకి
మునగడం).

ఆ జాలరి – సముద్రగర్భంనుంచి ముత్యాలతో నిండి ఉన్న (మౌక్తికస్ఫురత్ ) పెద్ద పెద్ద
ఆల్చిప్పలు (శుక్తికల్) తెచ్చి తన బేరికి అప్పజెప్పాడు. ఆ శుక్తికలను ఆకాశమనే నేలమీద
(నభో – ధరణిన్ ) పోసి, లోపలి ముత్యాలు చితికిపోకండా నిబ్బరంగా వాటిని పగలగొట్టి,
వాటినుంచి ఆ సమయపు బేహారి (బేరి) రాల్చిన మంచి ముత్యాలు (సుపాణులు) అన్నట్టుగా
– ఆకాశంలో తారకలు విలసిల్లాయి.

చం.     సమయమహేంద్రజాలకుఁడుసారసమిత్రుఁడనేటి పద్మరా
గము వెస మాయఁ జేసి, కుతుకంబున “హా”యని నీలపంక్తులన్
భ్రమపడఁ జూపి “ఝా” యనుచుఁ బల్కి సుపాణులఁ జేసి చూపెఁ జి
త్ర మనఁగఁ బ్రొద్దుగ్రుంకెఁ దిమిరం బెసఁగెన్ దివినొప్పెఁ దారకల్
(హంసవింశతి, ఆ. 2. పద్య. 173.)

సూర్యుడు ఎర్రగా అస్తమించగా, నల్లని చీకటి పంక్తులు కమ్ముకున్నాయి. ఆకాశంలో తెల్లగా మిలమిలలాడుతూ నక్షత్రాలు కనిపించాయి. ఈ పరిణామక్రమం ఎలాగుందంటే:  కాలం అనే గొప్ప ఇంద్రజాలికుడు తన మంత్రదండం తిప్పి సూర్యుడనే (సారస మిత్రుడు-అనేటి) పద్మరాగమణిని చిటుక్కున (వెసన్) మాయంచేసి, ఆనందంతో (కుతుకంబునన్) ‘హా’ అని అరుస్తూ మరోసారి మంత్రదండం తిప్పి ప్రేక్షకులు భ్రమపడేట్టు ఇంద్రనీలమణుల్ని (నీలపంక్తులన్) చూపించాడు. పద్మరాగాన్ని నీలమణులుగా మార్చేసినట్టు. అంతటా నల్లటి కాంతులు పరుచుకున్నాయి. ఇప్పుడు మరోసారి దండం తిప్పి ‘ఝా’ అని అరుస్తూ ఇంద్రనీలాలను మంచిముత్యాలుగా మార్చేసి (సుపాణులన్-చేసి) చూపించాడు. ఆహా! ఎంత చిత్రం! ఎంత చిత్రం! అన్నట్టుగా-సూర్యబింబం క్రుంకింది, తిమిరం వ్యాపించింది (ఎసఁగెన్), ఆకాశాన తారకలు పొడిచాయి.

శైవల నీలముం గమలశాలియునైన యగడ్త నీరు ప
ద్మావళి వ్రాఁత తోడి కరకంచుగ నొప్పుచుఁ గోట శాటిలా
గై వఱలంగ హర్మ్య కనకాంశు నికాయము పేరఁ దత్పుర
శ్రీ విలసిల్లు నభ్రచర సింధువు-మౌళికి మల్లెదండగన్
(కళాపూర్ణోదయము 01-112)

ఇది ద్వారకా పురలక్ష్మి. ఈవిడ ఒక బంగారు చీర (శాటి) కట్టుకుంది. ప్రాకారమే (కోట) ఆ చీర. సౌధాల బంగారపు (కనక) అంశునికాయము- కాంతిపుంజం పేరుతో (వంకతో) అది అచ్చమైన శాటిలాగా భాసిస్తోంది (శాటి=చెంగావి చీర). ఈ శాటికి-కరక్కాయ రసంతో తీరిచి దిద్దిన అంచు ఉంది. కరక-అంచు. కరక్కాయ రసం కనక-నల్లటి అంచు. ఈ అంచుమీద ఉన్న వ్రాతపని (అద్దకం పని) పద్మాల వరుస. పద్మావళి దీని బోర్డరు. ఇంతకీ ఈ వ్రాతపనితో కూడిన కరకంచు ఏమిటి- అంటే-అగడ్త నీరు. నీరు మరి తెల్లగా ఉంటుంది కదా అది నల్లటి అంచు ఎలా అవుతుంది? నాచు తీగలు (శైవలం) కారణంగా అగడ్తనీరు నీలంగా ఉంది. కనక- కరకంచుగా ఒప్పుతోంది. అగడ్తలో –వికసించిన పద్మాలు చాలా చాలా ఉంటాయి కదా! అందుకని అగడ్తనీరు కమలాలు కలది కూడా (శాలియున్) అయ్యింది. ఇలా మొత్తానికి అగడ్తనీరు- పద్మావళి వ్రాఁతతోడి కరకంచుగన్ ఒప్పింది ఆ శాటికి.

హర్మ్య కనకాంశు నికాయము అనే బంగారు చీర ధరించిన తత్పురశ్రీ తన సిగలో ఒక మల్లెదండ తురుముకుంది. ఏమిటి ఆ మల్లెదండ అంటే- అభ్రచర సింధువు. దేవతల నది. ఆకాశగంగ. తెల్లగా ఉంటుంది గదా! అది ద్వారకాపుర లక్ష్మీదేవి మౌళికి మల్లెపూదండ కాగా-ఆ తల్లి అద్భుతంగా విలసిల్లుతోంది. జయహో! పింగళి సూరనా!!

చం.    పనుపడు వేణునాళములు పగ్గములుంబలెఁ గ్రింద బర్వు శో
భన కిరణప్రకాండములు భాసిలఁ జందురుఁడొప్పె నెంతయున్
మనసిజుఁ డెల్లప్రాణుల మనంబులు చేలుగ రాగబీజముల్
పెను జతనంబుతోడ వెదఁ బెట్టెడు రౌప్యపు జడ్డిగం బనన్
(ప్రభావతీప్రద్యుమ్నము. ఆ. 4. పద్య. 124.)

పూర్వకాలంలో పొలంలో విత్తనాలు నాటడానికి ‘జడ్డిగం’ అనే యంత్రం వాడేవారు.  ఇది ఒక పెద్ద పిడత. విత్తనాలు నింపి, దీనికి వెదురు గొట్టాలనమర్చి, వాటిద్వారా విత్తనాలు చాళ్ళలోకి జాలు వారేట్టు చేసేవారు. దీన్ని నాగలికి అమరుస్తారు. నాగలిని గిత్తలు లాగుతాయి. వాటి పగ్గాలు రైతు పట్టుకుంటాడు. పిడత ఖాళీ కాగానే మళ్ళీ విత్తనాలు నింపుతాడు. ఇదీ దీని కథ. చంద్రుడిని ఇటువంటి జడ్డిగంగా పోలుస్తూ కొత్త ఊహచేస్తున్నాడు కవి. విత్తనాలు నాటడంకోసం వెదురుగొట్టాల మాదిరి (వేణునాళములు) అలాగే పగ్గాల మాదిరిగానూ క్రిందకు జాలువారే అందమైన కిరణాలతో వెలుగొందే (కిరణప్రకాండములు భాసిలన్) చంద్రుడు- ఎంతయున్ ఒప్పెన్. ఎలా? మన్మథుడు (మనసిజుఁడు), ప్రాణులందరి మనస్సులు అనే చేలల్లో అనురాగబీజాలు, ఎంతో శ్రద్ధతో (పెను జతనంబు) నాటడానికి (వెదబెట్టుట) ఉపయోగిస్తున్న – వెండి (రౌప్యపు) జడ్డిగంలాగ చంద్రుడు కనిపిస్తున్నాడు.

అలవోకగా ఆమె అద్భుత జలవిన్యాసం!

br passportఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో! సుమారు రెండు వేల సంవత్సరాలుగా నడుస్తోంది తెలుగు పద్యం. దీనితో కలిసి మనమూ నాలుగు అడుగులు వేద్దామంటారా. రండి మాతో పాటు. పద్యం కోసం పాదయాత్ర. పాడిందే పాటగా ఎక్కిన గుమ్మమే ఎక్కడం కాదు. భక్తితో భజన చెయ్యడమూ కాదు. చూడవలసిన చోట్లు కొన్ని ఉన్నాయి. ఎవరూ అంతగా దృష్టి పెట్టనివి. అవి చూద్దాం.

**

          క్రీడాభిరామం శ్రీనాధుడిదే. మన వరంగల్లులోదే. అక్కడ ఒక చిన్నది అలవోకగా ఒక ప్రదర్శన ఇస్తోంది. కళ్ళు చెదిరిపోయే ప్రదర్శన .చూద్దామా-

        చం.      వెనుకకు మొగ్గ వ్రాలి కడు విన్నను వొప్పఁగఁ దొట్టి నీళ్లలో          

                   మునిఁగి తదంతరస్థమగు ముంగర ముక్కునఁ గ్రుచ్చుకొంచు లే

                   చెను రసనాప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే

                   రనుపమలీల నిప్పడు చుపాయము లిట్టివి యెట్టు నేర్చెనో

(క్రీడాభిరామము – పద్యం. 146)

ఓరుగల్లులో ఒక పడుచుపిల్ల చేస్తున్న అద్భుత విన్యాసాలను చూసి మంచనశర్మ ఆశ్చర్యచకితుడవుతున్న సందర్భం.

ఆ పడుచుపిల్ల – నిండా నీళ్ళున్న తొట్టెలోకి తన ముక్కెరను (ముంగర) విసిరేసింది.  ఆ తొట్టె చెంత – ప్రేక్షకులవైపు తిరిగి బోసి ముక్కుతో నిలబడింది.  చేతులు పొట్టకి పెట్టుకుని – అలవోకగా వెనక్కి వంగింది (మొగ్గవ్రాలి).  తొట్టె అంచుకి తన వెన్ను తాకకండా వంగింది.  తొట్టెనీళ్ళలోకి చాలా నేర్పు (విన్ననువు) ఒప్పేట్టు తలా మెడా ముంచింది.  అంతే నేర్పుగా అలవోకగా లేచి నిలుచుంది. ఇప్పుడు ఆమె ముక్కుకి ముంగర మెరిసిపోతోంది. చప్పట్లే చప్పట్లు.

చేటలో నల్లపూసలు పోసుకుంది.  ఒక చేత్తో పట్టుకుంది.  దారం ఎక్కించిన సూదిని మరో చేత్తో పుచ్చుకుంది.  చిగురాకులాగా ఎర్రగా ఉన్న తన నాలుకతో అతివేగంగా (శీఘ్రము) ఆ నల్లపూసలను దారానికి దండ గుచ్చింది.  సాటిలేని రీతిలో (అనుపమలీలన్‌) ఒయ్యారంగా నల్లపూసలపేరు తయారు చేసింది.  మళ్ళీ చప్పట్లే చప్పట్లు.

ఈ పడుచుపిల్ల ఇలాంటి విద్యలూ ఉపాయాలూ ఎన్ని నేర్చిందో ఎలా నేర్చిందో కదా – అని మంచనశర్మ ఆశ్చర్యపోయాడు.