ప్రముఖ రచయిత జాన్సన్ చోరగుడితో…ముఖాముఖి
- ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిగా, అంతకు మించి అభివృద్ది- సామాజిక అంశాల వ్యాఖ్యాత గా అరవై వద్ద ఆగి, వెనక్కి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తున్నది ?
ఈ ప్రశ్న ఇప్పుడు మీరు అడిగారు, కాని ఎవరూ అడక్క ముందే నాకు నేనుగా దీన్ని – స్థల కాలాల మధ్య నేను అంటూ నా ‘సొంత సంతకం’ వ్యాస సంకలనంలో ముందు మాటగా ప్రకటించాను. “గత మూడు తరాల్లో – తొలి దశలో చర్చి, తర్వాత దశలో రాజ్యం నా కుటుంబాన్ని ఆదుకుంది. చరిత్ర (కాలం) ఒక తరంగంలా మా కుటుంబంలోకి ప్రవేశించి, ఇంటిల్లిపాదినీ అది తన మీద ఉంచుకుని మరీ వర్తమాన పౌరసమాజ ప్రధాన స్రవంతి లో మమ్మల్ని కలిపిందని అన్నాను.”
అయితే ఇప్పటి నా ఈస్థితి – ఇది నేను నిరంతర అధ్యయనం, కృషి, త్యాగం తో సాధించుకున్నవి. మీరు అడగొచ్చు ఏమి త్యాగం చేశారని ? ప్రభుత్వ సర్వీస్ లో – ఆర్డర్ ఆఫ్ ది డే గా మారిన అపసవ్యాలు చాలా వున్నాయి. ఇప్పుడున్న ప్రమాణాల్లో – వాటికి దూరంగా వుండటం కూడా త్యాగమే!
- సుదీర్ఘ కాలం, 34 ఏళ్ళు పాటు ప్రభుత్వ ప్రచార శాఖలో పనిచేశారు. మీ వ్యక్థిగత స్థాయిలో ఇప్పటికీ మీ సర్వీసులు ప్రజలకు ప్రయోజనకరమని మీరు నమ్ముతున్నారా ?
నిజానికి క్లిష్టమైన ప్రశ్న ఇది. కాని జవాబు చెబుతాను. విషయం ఏదైనా కాలము – ప్రాంతము కొలమానాన్ని నేను ప్రామాణికంగా పాటిస్తాను. ప్రభుత్వాలు మారుతుంటాయి గాని, రాజ్యము – ప్రజలు రెండూ స్థిరంగా వుంటాయి. ఆ రెండింటి మధ్య నిరంతరంగా వుండే ఘర్షణ లో ప్రభుత్వాలు ‘కెటాలిస్ట్‘ పాత్ర పోషిస్తుంటాయి. ఒకప్పుడు ప్రజలకు సేవ చేయడానికి ఏర్పడ్డ సమాచార – ప్రసార శాఖలు, ఇప్పుడు ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నాయి. ఎవరు ‘రిస్క్’ లో వుంటే వాళ్ళ పక్షంగా పనిచేయాల్సిన పరిస్థితి అయింది. అర్ధమయింది కదా, ఇప్పుడు బలంగా వున్నది ఎవరో. ‘యాస్పిరేషనల్ సొసైటీస ’ మధ్య పనిచేసే ప్రభుత్వాల మనుగడ ఇంతకంటే బలంగా వుండే అవకాశం తక్కువ. నిజానికి మేము నాలుగు వైపుల వీటిని 24 / 7 గార్డ్ చేయాలి. అయినా, మా పని ఫలితాలు పాక్షికమే!
ఇలావుందా, మళ్ళీ రేపు ఇవి తలకు మించిన వాగ్దానాలతో జనం ముందుకెళ్ళి మళ్ళీ ఇదే ‘రిస్క్’ తో కొనసాగుతాయి. మాకు మళ్ళీ ఇదే గార్డు పని. ఇలా ప్రజలకోసం పని చేయాల్సిన ఓ శాఖ నిరంతరాయంగా ప్రభుత్వం కోసం పనిచేయడం ఏ భౌగోళిక ప్రాంతంలో వున్నదో – అక్కడి ప్రజలు నిత్యం సమాచార చైతన్య స్థితిలో వున్నారని, మనం అర్ధం చేసుకోవాలి.
- అంటే తెలిసి కూడా ‘సెల్ఫ్ రిస్క్’ తోనే ఇప్పటి ప్రభుత్వ నాయకత్వాలు ఈ ధోరణి తో పనిచేస్తున్నాయని అంటున్నారా?
అందులో అనుమానం ఏముంది? ఒకే సమయంలో అందరూ నాయకత్వ స్థానాల్లో వుండడం కుదరదు కదా. ఎవరి స్థానాలు నుంచి వాళ్ళు ‘ఆపరేట్’ చేస్తారు. అందరూ కల్సి ‘కాలాన్ని’ ఇప్పటి స్థితి నుంచి తదుపరి స్తితికి తీసుకెళతారు. కాకపొతే, ‘వర్చువల్’ స్థానాల్లో వున్నవారు ఆ గెలుపును క్లెం చేయరు. ‘రియల్’ స్థానాల్లో వున్ వారు ఆ పని చేస్తారు.
అధికార స్థానలో వుండీ కూడా ‘రిస్క్’ ఎదుర్కోవడం అంటున్నారు, అది ఎటువంటిది?
నేను అంటున్నది నేరుగా వచ్చే ‘రిస్క్’ గురించి కాదు. మన కారణంగా మనo ప్రాతినిధ్యం వహించే సమాజానికి ఎదురయ్యే ‘రిస్క్’ గురించి. చూడండి – శ్రీ వి.పి సింగ్ 1989-90 మధ్య కేవలం ఒక ఏడాది ప్రధానిగా వున్నారు. కాని, ఆ ఏడాదిలోనే మన దేశానికి అతి కీలకమైన – మండల్ కమీషన్ నివేదిక పార్లమెంట్లో చట్టమై, ఇప్పుడు అది అమలవుతూ వుంది. 1978 లో మురార్జీ దేశాయ్ కమీషన్ వేస్తే, 1980 చివర అది – 27% వెనుకబడిన తరగతులకు అన్ని రాజ్యాంగపరమైన రాయితీలు ఇవ్వాలని నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత అది అమలు కావడానికి పదేళ్ళు పట్టింది!
1992-95 మధ్య నేను గోదావరి జిల్లాల్లో డిపీఅర్వో గా వున్నాను. ఒక అధికారిక లంచ్ ఇష్టాగోస్టిలో (వి పి సింగ్ – స్థానిక సమాంతర సామాజిక వర్గ) ఓ మాజీ మంత్రి నాతో ఇలా వాపోయారు – ‘ఇప్పుడు గొడ్ల దగ్గర పాలు పితకడం రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఐపోయిందండీ!’ అని. అప్పట్ని0చీ ఇప్పటివరకు జరిగింది మనం చూస్తూనే వున్నాం.
దీనికి ముగింపు ఏమంటే – ‘పోలిటీ’ నిరంతరం ‘లిటరేచర్’ కు దారులు తెరుచుకుంటూ వెళుతుంది అనే ఓ విశ్వజనీన సత్యానికి ఇది మనకాలపు ఉదాహరణ. ఆ తర్వాత, మొదట మాకు వద్దే వద్దని ; కాలక్రమంలో తలొగ్గిన – ఆర్ధిక సంస్కరణలు ఈ దశను ఎక్కణ్ణించి ఎక్కడికి తీసుకెళ్ళాయో కూడా చూశాం. దీనివల్ల లాభమా నష్టమా అనే మాట అటుంచితే, ఇవేవి కూడా తర్వాత కాలంలో ఇలా అవుతుందని తెలిసి చేసినవి కాదు.
అంటే మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ?
సింపుల్. నడుస్తున్న కాలక్రమంలో ఎవరి సమయంలో వాళ్ళు – తమ పాత్ర పోషించి నిష్క్రమిస్తారని. ఉనికి కోసం మనం మన ‘బ్రాండ్లు’ వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాము గాని, కాలం మీద అటువంటివేమీ శాశ్వితంగా వుండవని.
ఎందుకంటే, జరుగుతున్న‘ప్రాసెస్’ మన కంటే పెద్దది. అయితే, మనం మైలురాళ్ళు అంటుంటాము కదా – అవి మాత్రం చరిత్ర లో ‘రికార్డ్’ అవుతాయి. వాటిలో కూడా ముందు వెనుకలు వుంటాయి కాని, చివరికి దాచగలిగింది మాత్రం ఏమీ వుండదు. వెనకున్నవి కూడా ముందుకు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న కొత్త చరిత్రలు అవే! గత పాతికేళ్ళ ఈ ‘ర్యాలీ’ లో – చివరన ‘టైల్ ఎండర్స్’ గా ఉన్న మనకు కూడా ఇప్పుడు ప్రతిదీ స్పస్టంగానే కనిపిస్తున్నది. అయితే మనం ఎటు చూస్తున్నాం ? అనేది ఎవరికి వాళ్ళం వేసుకోవలసిన ప్రశ్న.
అంటే ఇప్పటి వర్ధమాన సమూహాల ప్రస్థానం పట్ల మీకు అనుమానాలు ఉన్నాయా?
వీరి సమస్య – లక్ష్యాల నిర్ణయంలో ఉందనిపిస్తున్నది. జరగాల్సి వున్న ‘ప్రాసెస్’ లో లోతుల్లోకి వెళ్ళగలిగే గమనం కంటే, విస్తరణకే అధిక ప్రాధాన్యత వుంటున్నది. అందుకు వాళ్ళనూ నేరుగా తప్పు పట్టలేము. సామాజిక – ఆర్ధిక నేపధ్యం అందుకు కారణం అని ఒక పక్క తెలుస్తూనే వుంటుంది. అలాగే మరో పక్క కంటి ముందు కర్రకు కట్టిన ‘రాజ్యధికారం’ క్యారెట్ ఎటూ టెంప్ట్ చేస్తూనే వుంటుంది. సరిగ్గా ఇదే కాలంలో క్రియాశీలమైన ‘మార్కెట్ ఎకానమీ’ వీళ్లను ఏదోపక్కకు తనతో ఈడ్చుకుపోతున్నది. తర్వాత ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఆగి, వెనక్కి తిరిగి చూసుకునేసరికి జీవితకాలం చరమాంకానికి వస్తున్నది. అక్కడ లెక్కలు వేసుకుంటే, పొందిన వాటికి పోగొట్టుకున్న వాటికి మధ్య – ఎక్కడా పొంతన కుదరడం లేదు! అలాగని, పోగొట్టుకున్న వాటి ఖరీదు(కాస్ట్) తో పొందినవి ఆనందం కలిగిస్తున్నవా? అంటే అదీ లేదు!
ఈ మీ ధోరణి మీ టార్గెట్ గ్రూప్ కు ఎప్పటికి చేరుతుందంటారు?
నేను అడ్రెస్ చేస్తున్నది, మొదటినుంచీ కూడా అందరినీ. ప్రతి ఒక్కరినీ మనం అడ్రెస్ చేస్తున్నప్పుడు, ‘టార్గెట్ గ్రూప్’ అని గీతలు గీయడం ఎంతవరకు కరెక్టో తెలియదు. అయినా ఈ పనిలో వున్నది నేను ఒక్కణ్ణే కాదు, నాలా చాలా మంది వున్నారు, వుంటారు. కొత్త తరాల్లో ఇంకా వచ్చే వాళ్ళ సంఖ్య రెట్టింపు అవుతుంది.
అయినా, గతంలో మనం చూసిన చాలా వాటి మాదిరిగానే – సరళీకరణ రెండవ దశ మొదటి దానికంటే మరింత మార్ధవంగా వుంటుంది. ఇకముందు ఘర్షణ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ‘ఇంక్లూజివ్ గ్రోత్’ స్థానంలోకి, ఇప్పుడిక ‘ఇంక్లూజివ్ గవర్నెస్’ వస్తుంది. అప్పుడు ఈ గమనాన్ని ‘డైజెస్ట్’ చేసుకుని, దానికి ‘ట్యూన్’ అయ్యి రాసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది.
అయినా ఈ క్రమం మొత్తాన్ని స్థూలంగా మనం అర్ధం చేసుకోవడానికి, ఒకసారి చరిత్రలోకి వెళ్ళి – ఖడ్గాన్ని పక్కన పడేసి, మొక్కల్ని నాటించడం మొదలెట్టిన అశోకుణ్ని ఒకసారి గుర్తు చేసుకోగలిగితే, మన పని చాలావరకు సుళువు అవుతుంది.
యు.పి.ఎ-2 లో – ‘కళింగ రాష్ట్రాల్లో’ అప్పటి దాకా వున్న తుపాకుల స్థానంలోకి ఫుట్ బాల్ మైదానాలు రావడం ఇప్పటికే చూశాం. అదక్కడ ఆగలేదు. ఎన్.డి.ఎ ఆ క్రమాన్ని మరింత విస్తరిస్తూ, ఏకంగా నాగాలాండ్ లో పడిన పీటముడిని వదులుచేయడం చూశాం! సరిహద్దున ఉన్న బంగ్లాదేష్ తో పశ్చమ బెంగాల్ కు ఉన్న ఇష్యూస్ సంప్రదింపులకు ప్రధాని మోడి మమతా బెనర్జీ ని తనతో డాఖా తీసుకెళ్ళడం చూశాం. మారుతున్న కాలానికి తగినట్టుగా మారి, రాజ్యం ప్రయోజనం కోసం ప్రభుత్వాలు తమకు తాముగా విస్తరించుకుంటున్న ‘కాంటూర్స్’ ఇవి. ఇంతకు ముందు నేను – ‘యాస్పిరేషనల్ సొసైటీస్’ కోసం ప్రభుత్వాలు తలకు మించిన వాగ్దానాలు చేస్తాయని అన్నాను , సూక్ష్మ స్థాయిలో చూసినప్పుడు – ఇదంతా పెంచుకుంటూ వెళుతున్నఆ ‘కాంటూర్ల’ లో భాగమే!
ఇంతకు ముందు మీ ‘సొంత సంతకం’’ ముందు మాటలో కూడా – ‘కాంటూర్ల వద్ద నేను పని చేస్తున్నాను, బౌండరీలు దాటి వచ్చేశాను ’ అన్నారు. ఏమిటవి మీరంటున్న కాంటూర్లు?
నిజమే ‘సొంత సంతకం’ లో నేను ఆ మాట అన్నాను. అయితే – ‘స్థల కాలాదుల మధ్య నేను…’ అంటూ అలా చెప్పాను. అప్పుడు ఇప్పుడు కూడా స్థల-కాలాలే నాకు ప్రామాణికం. చూడండి – గడచిన పాతికేళ్ళలో మనం చూస్తూ వుండగానే భూమి (ప్రపంచం) ఇంత చిన్నది అయింది కదా, మరి ఇంకా ఉనికిలోకే రాని మనం చూడని మరో తరం – మనం ఇప్పుడున్న ఈస్థలంలో ఎలా వుండబోతున్నదీ ఒక్కసారి మనం ‘విజులైజ్’ చేస్తే, మనకు ఏమి కనిపిస్తుంది? మరి మనకు ఉండాల్సిన చూపు – మన మధ్య మనమే గీసుకున్న ‘బౌండరీలా’ మధ్యా లేక అంతకు మించిన ‘కాంటూర్ల’ కావలా?
అయినా ఇక్కడ ఓ మాట చెప్పాలి. ఇదంతా నా యాభైల తర్వాత మొదలయిది. 2006 తర్వాత విశాఖలో ఉన్నప్పుడు, మరోసారి బైబిల్ చదవడం మొదలెట్టాను. అప్పుడది పూర్తిగా మునుపటికి భిన్నంగా అర్ధంకావడం మొదలయింది. అదే కొన్ని వ్యాసాలుగా అప్పట్లో రాశాను. స్థల-కాలాల మధ్య నిలబడి చూడవలసిన అంతిమ అవసరం అప్పుడే స్పష్టమైంది. ఇప్పుడు నా స్టాండ్ ఏమిటో నాకు తెలుసు. దాంతో కనిపిస్తున్న ప్రతిదీ (కనీసం) అర్ధమవుతున్నది. అది ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా, అవసరం మేరకు తీసుకోవడం అనేది మనకుండే విచక్షణ.
మరి మనవద్ద మిమ్మల్ని అర్ధం చేసుకునేవారు ఉన్నారని మీరు అనుకుంటున్నారా?
అది మనకు సంబంధం లేని ప్రశ్న.
‘రాయడం’ నాకు తెలుసు. అయినా మన పని మనం చేసుకువెళుతూవుంటే… ఆ క్రమంలో అటువంటి వారు ఎప్పుడో ఒకసారి తారసపడతారేమో. ఆ కంటెంట్ జనానికి చేరే క్రమంలో మనం అర్ధమైన వాళ్ళు కూడా వుంటే వుండొచ్చు. అయినా ఒకటి రెండు స్వీయ అనుభవాలు చెప్పాలి.
విశాఖలో ఉండగా 2008 లో ఒకరోజు ఉదయం 10 గం. లకు ఆఫీస్ కు బయలుదేరి వెళుతుండగా కాళీపట్నం రామారావు గారు ఫోన్ చేసి ‘రామాటాకీస్ జంక్షన్లో ఉన్నాను, మీతో మాట్లాడాలి ‘అన్నారు. నేను అయన్నికలిసి పెద్దాయనతో రోడ్డు మీద ఏమి మాట్లాడతాం అని ;
‘మీ తర్వాత పని ఏమిటి?’ అడిగాను.
జగదాంబ వద్ద ఏదో పని వుందన్నారు, దానికి దగ్గర్లో జిల్లా కోర్టుల ముందు వున్న మా డిపీఅర్వో ఆఫీస్ కు తీసుకెళ్ళా. ఇద్దరం డిపీఅర్వో గదిలో కూర్చున్నాం.మమ్మల్ని చూసి ప్రెస్ లాంజ్ లో వున్న జగదీశ్వరరావు గారు (హిందూ) వచ్చారు. కాఫీలు అయ్యాక, ‘కారా’ – నేను ఇద్దరమే మిగిలాం.
‘ఒక విషయం మీతో చెప్పాలని వచ్చాను’ అని మొదలెట్టారు. ‘కన్ను సహకరించక అన్నీ చదవడంలేదు, కాని చదివే కొద్దివాటిలో మీవి వుంటాయి’ అన్నారు.
కాస్సేపు ఆగి – ‘ మీ చూపుకు పాదాభివందనం చేస్తున్నాను ’ అన్నారు. దానికి ముందు గాని దాని తర్వాత గాని ఇంకేమీ లేదు.
నేను నమస్కారం చేశాను.
వస్తానని లేచారు. డ్రైవర్ ను ఇచ్చి దింపి రమ్మన్నాను.
ఎవరితో అన్లేదు.
అర్ధం కాలా. వయస్సు సమస్య కావచ్చు అనుకుని, చానాళ్ళ తర్వాత ‘కారా’ తో సాన్నిహిత్యం వున్న మిత్రుడు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారిని జరిగింది చెప్పకుండా అడిగాను,
‘….అది గాని ఆయనకు ఊత పదమా? ’ అని. ‘ ఆయన అలాంటి మాటలు అనరు ’ అన్నారు తుమ్మేటి. ఇది జరిగిన ఏడెనిమిది ఏళ్ల తర్వాత ఈ మధ్యనే నా భార్య కృష్ణవేణి కి జరిగింది చెప్పాను.
మరో సంఘటన –
విశాఖలోనే చలసాని ప్రసాద్ గారు పరిచయం. ఇద్దరి ఊళ్ళ మధ్య చుట్టరికం కలిసింది. 2014 చివర ఒక రోజు ఫోన్. ‘ఇప్పుడే ఈ షాపులో మీ ‘ సొంత సంతకం ’ పుస్తకం చూశాను. నాకు ఒక కాపీ పంపండి, ఫలానా మిత్రుడి ఇంట్లో దిగాను’ అని. పంపాను.
కొన్నాళ్ళకు బెజవాడ ఐ ఎం ఏ హల్లో జరిగిన ఓ సాహిత్య సభలో కలిసి పలకరించుకుంటూ టీ తాగాం, సభలో కూర్చున్నాం. ఇంతలో వర్షం. మధ్యలో, అనుకోకుండా టాయ్ లెట్స్ వద్ద ఇద్దరమే కలిశాం. నా పుస్తకం గురించి ఆయన అక్కడ ప్రస్తావించారు! “చదివాను, వూ…రాయాలి… రాస్తేనేగా… తర్వాత వాళ్లకు తెలిసేది… “ అనుకుంటూ అక్కణ్ణించి నిష్క్రమించారు.
చిన్న నవ్వుతో జవాబు ఇచ్చాను.
మిమ్మల్ని ఎలా చూడాలని లేదా ఎలా అర్ధం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు?
నన్ను వదిలేయండి.
నేను రాసిన నా రచనలు చూడండి. 2001 జనవరిలో విడుదల అయిన నా – ‘మన విజయవాడ’ లో (పేజి:48) –‘మన విజయవాడ కధను ఎక్కడ ముగించాలి?’ అంటూ… ‘ఈ నగర ఆత్మకధకు ఫుల్ స్టాప్ పెట్టడం కుదిరే పని కాదు, అంటూ ఇది 24X7 నగరం, ఇది ఒక రైల్వే ఫ్లాట్ ఫారం వంటిది, వూరంతా మత్తుగా జోగుతున్నప్పుడు ఏ నిశి రాత్రి లోనో – ఓ కొత్త రైలు రావొచ్చు, మళ్ళీ అప్పుడు యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటూ మరో కొత్త అధ్యాయం రాస్తాను. అయితే…రాబోయే కొత్త రైలు రాజధాని ఎక్స్ ప్రెస్సా?’ అని ముగించాను. మీకూ తెలుసు, అప్పటికి ‘టీఅరెస్స్’ ఇంకా పుట్టలేదు.
2001 నుంచి రాసిన నా ‘సొంత సంతకం’ వ్యాసాలు చూడండి. అందులో – ప్రజలు, ప్రాంతము, అని ఏకంగా రెండు అధ్యాయాలే వున్నాయి. 2010 తర్వాత విభజన జరిగే వరకు అటు వున్నాను, జరిగాక ఇటు వున్నాను. జరిగిన వెంటనే – ‘దేశం చూపు ఇప్పుడు ఎపి వైపు!’ అని రాశాను. మన విశాఖను అమెరికా స్మార్ట్ నగరం అంది! భారత్ – తన ఆగ్నేయ ఆసియా దేశాల సంబంధాల విస్తరణ కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ‘షోకేస్’ చేస్తున్నది. ఆగ్నేయ ఆసియా దేశాల ప్రభుత్వాలు, కంపెనీలు వచ్చి ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాయి.
మమతా బెనర్జీని ప్రధాని బంగ్లాదేష్ తీసుకు వెళ్ళడమైనా, శివరామ క్రిష్టన్ కమిటీ నివేదిక స్పూర్తి దెబ్బ తినకుండా, రాజధాని విషయంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవను కేంద్రం అనుమతించడమైనా – మునుపటి ఎల్లలు చెరుగుతున్న ‘ప్రాసెస్’ లో భాగం గానే చూడాలి. అలా కాకుండా, మొదటినుంచీ మనకు తెలిసిన – ‘ఐదేళ్ళ ఎపిసోడ్’ గా చూస్తే కన్ ప్యూజన్ తప్ప మరేమీ మిగలదు.
ఇప్పుడు కూడా ‘ఆ… సి ఎం కోసమా ఇదంతా?’ అంటే , ఇంక చెప్పడానికేముంది.
ప్రభుత్వాలు వచ్చి పోతుంటాయి. కాని, రాజ్యం నికరం అనే ఎరుక కలిగివుండే స్థాయికి – ఇప్పటికీ మన మధ్య తరగతి కూడా రాకపోవడం ఇంక ఎంత మాత్రం మంచిది కాదు. అయితే, రాజ్యం పట్ల వారికి ఆ ఎరుక రాకుండా నిరంతరం నిఘాతో చూసే ప్రభుత్వ చతురతను అర్ధం చేసుకోలేకపోవడమే – ఇప్పటి విషాదమంతా. వాస్తవానికి, రాజ్యం అంతరిస్తుంది అనేది మనం చదివిన శాస్త్రం!
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్ల ప్రాసెస్ ను విస్మరించడం ఎలా కుదురుతుంది?
2016 నాటికి మన దేశంలో సంస్కరణలు మొదలై 25 ఏళ్ళు అయింది. ఇక్కడ్నించి ఒక పదేళ్ళు వెనక్కి వెళదాం. పోనీ మీ సౌలభ్యం కోసం 2004 నుంచి చూద్దాం, దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఎపి కి 22 సెజ్ (ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు)ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు వాటిలో వరసగా పారిశ్రామిక వాడలు వస్తున్నాయి. వాటి రవాణా కోసం ఇప్పుడు ఇక అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి – విత్తనం చెడ్డదా లేక నేటి మొక్క, రేపటి చెట్టు చెడ్డవా? దీన్నే నేను కాలము-ప్రాంతము అంటున్నది. ఇప్పుడు మీరు మీ ఐదేళ్ళను ఎక్కడని వెతుకుతారు? దాన్ని ట్రేస్ చేయడం మీ వల్ల అవుతుందా?
రిటైర్ అవుతున్నారు కనుక అవుట్ ఆఫ్ ఆఫీస్ ఇవన్నీ చెప్పారు, ఇక ముందు మీ ప్లాన్స్ ఏమిటి?
కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేశాను. చేస్తూనే సమాంతరంగా నాదంటూ ఒక చూపును స్వంతం చేసుకోగలిగాను. దాన్ని ఇప్పుడు మరింత స్వేచ్చగా అది తాకినంత మేర దిగంతాలకు సారించడానికి ప్రయత్నిస్తాను.
నా ఆలోచనలను రేపటి తరం గీటురాయి మీద చూసుకోవడానికి ఇంట్లోనే నాకు ఒక లగ్జరీ కుదిరింది! కూతురు అల్లుడు ఆర్ధిక శాస్త్రవేత్తలు. కొడుకు సామాజిక శాస్త్రవేత్త. రేపు కోడలుగా ఏదో ఒక సామాజిక రంగ నిపుణురాలే రావచ్చు. మా అందరికీ ఆక్సిజన్ మా హోం మేకర్ కృష్ణవేణి. విస్తృత ఎరీనా లో ఇకముందు ఇది ఫ్యామిలీ మిషన్!!
*
తాజా కామెంట్లు