నాట్స్ సంబరాలలో సాహిత్య సందడి

LITERARY flyer - Finalజూలై 4-6 తేదీలలో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి మూడవ అమెరికా సంబరాలలో భాగంగా జరగనున్న సాహీతీ కార్యక్రమాల సమాహాలిక “నాట్స్ సాహిత్య సౌరభం” విశేషాలను తెలుసుకోవడానికి నిర్వాహకులు అనంత్ మల్లవరపు గారితో ముఖాముఖి.

అనంత మల్లవరపు

అనంత మల్లవరపు

Qఅనంత్ గారు, నమస్కారం.  ముందుగా “నాట్స్ సాహిత్య సౌరభం” నిర్వహణ కమిటీ కి శుభాకాంక్షలు. ఈ “నాట్స్ సాహిత్య సౌరభం” కార్యక్రమాలను వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అయినటువంటి గిడుగు గారికి అంకితం ఇవ్వడం లో మీ సంకల్పం గురించి చెబుతారా?

ఈ సంవత్సరం మనం గిడుగు గారి 150 వ జయంతి జరుపు కుంటున్నాము. ఇది కేవలం కాకతాళీయం అయినప్పటికీ, సాహిత్యం సామాన్య ప్రజానీకంలోకి చొచ్చుకుపోవటానికి, ఆనాటి ఛాందస గ్రాంధిక భాషావాదులను ఎదిరించి గిడుగు వారు నడిపిన వ్యవహారిక భాషా ఉద్యమం మరిన్ని రచనలు వాడుక భాషలో రావటానికి దోహదం చేసింది. వాటి ఫలాలనే మనం నేడు అనుభవిస్తున్నాం. నాట్స్ సంబరాలలో భాగంగా మేము జరుపుతున్న సాహిత్య కార్యక్రమాలలో గిడుగు గారికి నివాళి అర్పించడం మా భాధ్యతగా భావిస్తున్నాం.

  1. Qనాట్స్ సాహిత్య సౌరభం లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేసారు? చాటి వివరాలు అందిస్తారా?

మా సాహిత్య సౌరభంలో వైవిద్యభరితమైన కార్యక్రమాలకి రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనవి  సమకాలీన భాష మీద చర్చా కార్యక్రమం, సంగీత నవ అవధానం,మా బాణి – మీ వాణి,ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ తో ముఖా ముఖి, పుష్పాంజలి, స్వీయ కవితా విన్యాసం మొదలైనవి.

Qసాధారణంగా అమెరికా లో అవధానం అంటే చాలా మందికి ఆసక్తి, ప్రతి మహాసభల లోను అవధాన ప్రక్రియ ఒక  ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది. ఈ సంబరాలలో అవధాన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?

సంగీత నవ అవధానం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ ప్రక్రియ సృష్టికర్త శ్రీ మీగడ రామలింగ స్వామి గారు నిర్వహిస్తారు. పాట, కీర్తన, గజల్ ని మిగతావారు కూడా ఆదరించినా తెలుగువారు పతాకస్థాయికి తీసుకెళ్ళిన కళాస్వరూపం పద్యం. అలాంటి పద్యాన్ని తెలుగు వారికి అందిస్తున్న అరుదైన కళాకారుల్లో ఒకరు మీగడరామలింగస్వామి గారు. ఈనాడు పద్యాల మాధుర్యాన్ని ప్రధానంగా అవధానాలు చేసే కవుల ద్వారా మనంవింటున్నాం. ఐతే పద్యం సొగసు పూర్తిగా కనిపించేది సంగీత పరిజ్ఞానం ఉన్న గాయకుడు గొంతెత్తిపాడినప్పుడు. సంగీతాన్ని దృష్టిలో పెట్టుకొని రామలింగస్వామి గారు ప్రవేశపెట్టిన ప్రక్రియ సంగీత నవ అవధానం. ‘నవ’ అంటే తొమ్మిది లేక కొత్త. ఏడుగురు ప్రాశ్నికులు(పృచ్ఛకులు), సంధాత, అవధాని కలిస్తే తొమ్మిది. వీరందరూ కలిసి నవ్యంగా చేసే అవధానం నవావధానం. పురాణం, ప్రబంధం, శతకం, నాటకం, అవధానం, ఆధునికం, శ్లోకం అనేవి ప్రాశ్నికుల అంశాలు. ఈ అంశాలలో ప్రాశ్నికులు అడిగిన పద్యాలు అడిగిన రాగంలో అవధాని ఆశువుగా ఆలాపించి ప్రేక్షకులని ఆనందింప జేస్తారు. మీగడ రామలింగస్వామి గారు సంగీత పరిజ్ఞానం అపారంగా కల ప్రముఖ రంగస్థల నటులు. పాండవోద్యోగవిజయాలు, గయోపాఖ్యానం, సత్య హరిశ్చంద్ర, అశ్వథ్థామ, గుణనిధి వంటి అనేక నాటకాలలో ప్రముఖపాత్రధారులు. ఎన్నో పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు రచించారు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని పరిశీలించి విశ్లేషణాత్మక వ్యాసాలు ప్రచురించారు. పద్యంలో ఉన్న మాధుర్యాన్ని మీకందించాలని మేము చేసే ఈ ప్రయత్నాన్ని రసహృదయులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

Qఅవధానం లాగే మరో ఆసక్తి కరమైన అంశం సిని సాహిత్యం – ఈ విభాగం లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు?

చలనచిత్ర సాహిత్యంలో భాగంగా “మా బాణి – మీ వాణి” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాము. ఇందులో ప్రముఖ సినిమా కవులు చంద్రబోసు గారు, రసరాజు గారు, వడ్డేపల్లి కృష్ణ గారు, సిరాశ్రీ గారు పాలుపంచు కుంటారు. వారందరికీ తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఇంతకుముందు వచ్చిన మధురమైన పాటల బాణీలు, తెలుగులో అనువాదం కానివి వారికి ముందు రోజు అందచేస్తే, వారు మరుసటి రోజు కార్యక్రమంలో ఆ బాణీలకు పాటలు రాస్తారు. వీటిని మధుర గాయకులు రాము ఆలాపిస్తారు. ఇందులో ప్రేక్షకులు కూడా పాలుపంచుకునే అవకాశం ఉంది.

Qమీ కార్యక్రమాల వివరాలు చూస్తే, చాలా వరకు కొన్ని కొత్త అంశాలు వాటికి తగ్గట్టు గా కొత్త తరం అతిధులు.  ఈ విషయం లో ఏమైనా ప్రత్యేకత పాటించారా?

తప్పకుండా! ఈనాడు కార్టూనిస్ట్ “ఇదీసంగతి” ఫేమ్ శ్రీధర్ గారిని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా ఆహ్వానిస్తున్నాం. ఆయన గురించి తెలియని తెలుగువాడు లేడంటే అతిశయోక్తి కాదేమో! ఆయనతో ముఖాముఖి, తెలుగు కార్టూన్ల మీద ప్రత్యేక ప్రసంగం ఉంటాయి. సాహిత్యరంగంలో ప్రతిభావంతులైన ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్‌ గారు ఈ కార్యక్రమాలలో మరో ముఖ్య అతిధిగా పాలుపంచుకుంటున్నారు.  అదేవిధంగా ఈతరం గీతరచయితలలో పంచదార బొమ్మ లాంటి మంచి పాటలను అందిస్తున్న సినీ గేయ రచయిత, గాయకుడు చంద్రబోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

Qచివరిగా, ఈ నాట్స్ సాహిత్య సౌరభం – కార్యక్రమ నిర్వహణ ద్వారా మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏమిటి? చూడాలనుకున్న మార్పు ఏమిటి?

తెలుగు భాష, తెలుగు సాహిత్యం అనేవి ఏ కొందరి మేధావుల సొత్తు కాదు. అది అందని ద్రాక్ష కాదు. అది తెలుగు మాతృభాషగా ఉన్నవారందరూ ఆస్వాదించేది. తెలుగు భాష మాట్లాడే వారందరూ తెలుగు సాహిత్యాన్ని చదవాలనీ, తద్వారా మానసిక సంతృప్తే కాకుండా, సామాజిక స్పృహ కూడా పెంపొందుతుందనేది నా నిచ్చితాభిప్రాయం. కాబట్టి సాహిత్య సభలని అందరూ ఆనందించాలని నేను కోరుకుంటాను. ఈ సందర్భముగా సాహిత్య మిత్రులకు, తెలుగు భాషాభిమానులకు నాట్స్ సాహిత్య కార్యక్రమాలకి రావలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను.

 ఇంటర్వ్యూ: షేక్ నసీం