పాట అంటే ‘ఎలక్ట్రిక్ గిటార్’ మోత కాదు: వడ్డేపల్లి కృష్ణ

వడ్డేపల్లి కృష్ణ

వడ్డేపల్లి కృష్ణ

   (  మే 24-26 వరకు డాలస్ నగరం లో జరుగనున్న ‘ తానా’ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ప్రత్యేక అతిథుల్లో ఒకరైన వడ్డేపల్లి కృష్ణ గారి సాహిత్య నేపథ్యం )

బాల్యంలో మా వూరు (సిరిసిల్ల) ప్రక్కనే ప్రవహించే  మానేరులో స్నానం చేస్తూ, నాటి జానపద సినిమాల ప్రభావంతో ఏటి ఒడ్డున ఏపుగా పెరిగిన తుంగల్ని పీకి కత్తులుగా ఝళిపిస్తూ, ఆనందంగా ఆడుతూ పాడుతూ గడిపేవాళ్లం. హైస్కూలు వరకు రోజులు అలాగే గడిచిపోయాయి. హాయిగా ఇప్పటిలా ‘ఎంసెట్’ టెన్షన్స్ లేవు గనుక స్కూలు అయిపోగానే సాయంత్రం వాలీబాల్, హాకీ ఆడుకునేవాళ్ళం. అనేక డ్రామాల్లో వేషాలు వేసేవాళ్ళం. ఆ డ్రామాలు నన్ను నటునిగానే గాక రాను రాను రచయితగా, ఆ తర్వాత అనేక సీరియళ్లు, సినిమా, డాక్యుమెంటరీలకు దర్శకునిగా తీర్చిదిద్దాయి. మా తెలుగుపండితుల కనపర్తి, నందగిరి  అనంత రాజశర్మగార్లు వ్యాకరణం యొక్క గొప్పతనాన్ని వివరించడం వల్ల ఆ రోజుల్లోనే చందస్సు బాగా ఒంటబట్టించుకున్నాను.


1966లో నేను నిజాం కాలేజీలో P.U.C చదువుతున్న రోజుల్లో హాస్టల్లో నా రూంమేట్స్‌గా డిగ్రీ చదువుతున్నవాళ్ళు వుండేవారు. వాళ్లకు రాని చందస్సును గణవిభజనను నేను చేసి చూపిస్తే ఆశ్చర్యంగా చూసేవారు. ఆ తర్వాత మాత్రాచ్చందస్సును కూడా మధించి, డా.సి.నా.రె. రచించిన లలితగీతం “సాగుమా ఓ నీలమేఘమా! గగన వీణా మృదుల రాగమా” మరియు దేవులపల్లి రచించిన సినీలలితగీతం “మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే!” అనేవి నాన్ను బాగా ఆకర్షించాయి. అలాంటీ గీతాల్ని నేనూ రాయాలన్న సంకల్పాన్ని కలిగించాయి. క్రమక్రమంగా నాచేత వందకుపైగా సినీగీతాల్ని వేయికి పైగా లలితగీతాల్ని భావయుక్తంగా రచింపచేసాయి.

1968 ఏప్రిల్‌లో ఒకనాటీ పున్నమిరాత్రి విశాఖ సముద్రతీరంలో ఉప్పొంగివచ్చే అలల్ని చూస్తూ అలవోకగా..
శిథిల శీల్పాల దాగిన – కథలగూర్చి ఎవడెరుగును ?
చితికిన బతుకుల లోపలి – వెతల గూర్చి ఎవడెరుగును ?
వాడిన కుసుమాలలోని – ఏడుపులను ఎవడెరుగును ?
వీడిన ప్రేమికులలోని – విరహాగ్నుల నెవడెరుగును ?
మినుకు మినుకు మను తారల – కునికిపాట్లనెవడెరుగును ?
సంద్రము చందురునకు గల – సంబంధమ్మెవడెరుగును ?
………………………………………………………

అంటూ ‘ఎవడెరుగును?’ అనే గేయం ఊపిరి పోసుకొని “స్రవంతి” జూన్ మాసపత్రికలో ప్రచురించబడింది. ఆ తర్వాత అనేక కవితలు ఆనాటి కృష్ణా పత్రిక, ప్రజామత, ప్రగతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి తదితర పత్రికల్లో వెలువడ్డాయి. 1963లో ‘లలితసంగీతం’ కోసం రచించిన నా  తొలిగీతి.

కనరా నీ దేశం! వినరా నా సందేశం!
కనులు తెరచి ఒక్కసారి కనరా నీ దేశం !
మనసుల్ని మంచినెంచి వినరా సందేశం!
//క//
నిత్యము దారిద్ర్యమ్మే నర్తించెను నేడు
సత్య, శాంతి సంపదలను స్థాపించగ చూడు.
//క//
ఆకశవాణిలో ప్రసారమైంది. ఆ తర్వాత నాకు బాగా పేరు తెచ్చిన “ఈ మా పాట”
జగతిరధం జైకొడుతూ ప్రగతిపథంపై పోటీ..
ప్రగతిపథం పైన జగతి పండువెన్నెలై రానీ…
స్వార్ధానికి కట్టనిమ్ము శాశ్వతముగ సమాధి..
అది యే దేశాభ్యుదయపు అందమైన పునాది..

అనేది 1972లో ప్రసారమైంది. అప్పటినుంచి నా లలితగీత జైత్రయాత్ర అవిచ్చిన్నంగా కొనసాగుతూ, ‘లలితగీతాలు’ అనే అంశం మీదే నేను ప్రప్రధమ ప్రామాణిక పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా పొందేలా చేసింది. క్రమంగా ‘దూరదర్శన్లోనూ నా లలితగీతాలనేకం ప్రసారమయ్యాయి. ఆ తర్వాత ‘సంక్రాంతి’, ‘మూడుపువ్వులు ఆరుకాయలు కల్యాణం’, ‘గేయనాటికలు’ తో పాటుగా, ‘ఉగాదివేళ- వసంతహేల’ సంగీత నృత్యరూపకం1989లో ‘నేషనల్ నెట్‌వర్క్’లో దేశమంతా ప్రసారమై మంచి పేరు తెచ్చింది. దూరదర్శన్‌లో ప్రసారమైన దేశభక్తి గీతాలు.

1. భరతభూమి నా దేహం – భరతజాతి నా దేహం!
మంచిని పరిపాలించే మానవతకు దాసోహం!
2. మనమంతా బంధువులం! మానవతాసింధువులం!
భారతపద్మంలో ఉదయించిహ్న తీయని తేనియ బిందువులం!

అనేవి మాజీప్రధాని వాజ్‌యేయి గారిచే దేశభక్తి గీత ఉత్తమ రచయితగా 1996లో సత్కరింపజేశాయి. 1987లో ఎన్.టి.ఆర్ మొదలిడి ఇటీవలి కె.రోశయ్యగార్ల వరకు అందరు ముఖ్యమంత్రులచే రాష్ట్రకవిగా సన్మానాల్ని అందజేశాయి. 2006 మరియు 2009 టివి.నంది అవార్డ్స్ కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరింపజేశాయి. 2003లో జరిగిన 13వ బాలల అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ‘జ్యూరీగా’ స్థానం  కల్పించాయి. ఏడు సంవత్సరాలు ‘సెన్సార్ బోర్డు (2005-2011) సభ్యునిగానూ అవకాశం కలుగజేశాయి.
సెప్టెంబర్ 1995లో నేను రచించిన

మనమంతా ఒక్కటనే మంచి మనసు పెరగాలి
జగమంతా ఒక్కటనే మంచి  రోజు రావాలి
మల్లిక మల్లికను చేరి మాలగ రూపొందును గాని
మాలను మలిచేందుకు ఒక దారమె ఆధారముగా.

అంటూ సాగిపోయే గీతం, ఆ నెలంతా ఆకాశవాణి అన్ని కేందరాల ద్వారా తెలుగు ‘సామూహిక గానం’గా ప్రసారమై, నాకేగాక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపును కలుగజేసింది.
నేను 1) కనరా నీ దేశం (గేయ సంపుటి) 2) అంతర్మధనం (కవితాసంపుటి) 3) వెలుగుమేడ ( గేయనాటికల సంపుటి) 4) వసంతోదయం (గేయ కథా కావ్యం) మొదలగు కావ్యాల్ని వెలువరించాక 1979లో ప్రథమ ప్రయత్నంగా బహు ప్రజ్ఞాశాలిని భానుమతిగారిని కలువగా సహృదయంతో ఆమె తాను చిత్రీకరిస్తున్న ‘రచయిత్రి’ చిత్రంలో బాణీకి పాటను రాసే అవకాశాన్ని కలిగించింది. ఆ తర్వాత నట సామ్రాట్ డా.అక్కినేని నాగేశ్వరరావుగారు తమ అన్నపూర్ణా ప్రొడక్షన్ వారి ‘పిల్ల జమీందార్’ చిత్రంలో మెలోడీ ప్రధానమైన
“నీ చూపులోన విరజాజివాన!
ఆ వానలోన నేను తడిసేనా? హాయిగా “
అనే యుగళగీతాన్ని చక్రవర్తిగారి బాణీకి రచించే సదవకాశాన్ని కలిగించారు. డా. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ గానం చేయగా ఆ రోజుల్లో ‘ సిలోన్’ ద్వారా మారుమ్రోగి, ఎంతో పేరు తెచ్చింది. కాని ఉద్యోగ రీత్యా నేను హైదరాబాద్‌లో సినిమా ఫీల్డ్ మద్రాస్‌లో వుండడం వల్ల ఎక్కువ అవకాశాల్ని పొందలేకపోయాను. అయినప్పటికీ గిడుతూరి సూర్యంగారి ‘అమృతకలశం’, కె. రాఘవగారి ‘పెళ్ళిళ్లోయ్ పెళ్లిళ్లు” మరియు ‘యుగకర్తలు (దర్శకుడు ఆదిత్య), పి.ఎన్. రాంచంద్రరావుగారి ‘లీడర్’, మౌళిగారి ‘అందరూ అందరే’ మొదలగు చిత్రాలకు మరికొన్ని గీతాలను రచించాను. ఆ తరవాత 1993లో ఏ. ఎం. రత్నంగారి ‘పెద్దరికం’ చిత్రానికిగాను ‘రాజ్-కోటి’ స్వరాలకు

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తెవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే
మురిపాల తేలించ మునిమాపులో
దివినుంచి రేరాజు దిగి వచ్చులే.

అనే డ్రీమ్ సాంగ్ రచించి రాణించాను.ఇప్పటివరకు వచ్చిన ‘టాప్ టెన్’ సినిమా పెళ్ళిపాటల్లో నా పాటకు నాలుగవ ర్యాంక్‌ను యిచ్చి ‘గూగుల్’ ఆదరించడం ఆనందంగా వుంది. ఆ తర్వాత 1994లో సింగితం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన “భైరవద్వీపం”చిత్రంలో ‘క్లైమాక్స్’లో

అంబాశాంభవి భద్రరాజస గమనా..
కాళీ హైమవతీశ్వరిత్రినయనా..
అమ్మలగన్న అమ్మవే! ఈ అమ్మ మనసునే ఎరుగవా
ఒక అమ్మగా నువ్వు కరగవా?…

అనే పల్లవి గల పాటను రచించి, ప్రఖ్యాతి గాంచాను. ఆ తర్వాత రేలంగి నరసింహారావుగారి దర్శకత్వంలో హీరో నరేశ్‌గారి ప్రోత్సాహంతో “మొగుడు పెళ్లాల దొంగాట”లో చందన్‌రాజ్ – సంగం వెంకటేశ్వరరావుగారి ప్రోత్సాహంతో ‘ఏంటీ బావా మరీను?” చిత్రాల్లో సినీగీతాల్ని భావప్రధానంగా రచించగలిగాను. వాటికి రాజ్‌కోటి, విద్యాసాగర్ చక్కని స్వరాల్ని సంపకూర్చారు. ఇలా అనేక చిత్రాలకు సినీ గీతాల్నే గాక 2004 నుండి అమెరికా ‘ఆటా’కు వరుసగా మూడుసార్లు 18వ ‘తానా’కు కూడా అర్ధవంతంగా స్వాగత గీత సంగీత నృత్య రూపకాల్ని రచించాను.
‘అమృత కలశం’ చిత్రానికి గాను నేను రచించిన జావళి
సిగ్గాయె సిగ్గాయెరా! స్వామి
బుగ్గంత ఎరుపాయెరా
సద్దుమణిగినవేళ నీ ముద్దు సరసాల
నాకెంతో సిగ్గాయెరా!
చిగురు పెదవులలోన తగని కోరికలాయె
ఎదలోని కోరికలు ఎగిసి శారికలాయె!..  //సి//

అంటూ సాగిపోయే గీతాన్ని రమేశ్‌నాయుడుగారు మనోహరంగా మలచి, సుశీలగారిచే సుమధురంగా పాడీంచారు. నా అదృష్టంకొద్ది భానుమతి, రమేశ్‌నాయుడు, చక్రవర్తి, రాజ్-కోటి, విద్యాసాగర్, ఇళయరాజా మొదలగు గొప్ప సంగీత దర్శకుల స్వరాలకు పాటలు రాసే అవకాశం చిక్కింది. అలాగే ఎ.ఆర్.రెహమాన్‌గారి స్వరాలకు ‘పోలీస్ కర్తవ్యం’, ‘గూధచారి నెం 1’ మొదలగు డబ్బింగ్ చిత్రాలకు తెలుగుదనం ఉట్టిపడే గీతాల్ని రచించే భాగ్యం నిర్మాత ప్రతాపరాజుగారి ద్వారా దక్కింది. అవి ఇప్పటికీ ‘జెమిని’ టీవీలో అనేకసార్లు ప్రసారమై ప్రజాదరణ కలిగించాయి. ఎందుకంటే ప్రస్తుతం ‘బీట్’ ప్రధానంగానే పాటలు వస్తున్నాయి. ‘బీట్’కు తగిన పదాల్ని ఎంచుకొని రచించగలగడం వల్ల పాటలోని సాహిత్యం కూడా ప్రసన్నంగా వినబడి, అవి హిట్ కాగలిగాయి. పాట అనేది కేవలం వింటే కాదు పేపర్ మీద చూసినా భావయుక్తంగా కనిపించాలి. మచ్చుకు నేను దర్శకత్వం వహించిన  ‘ఎక్కడికెళ్తుందో మనసు?’ అనే చిత్రం కోసం తెలుగు భాష – సంస్కృతి ఔన్నత్యాన్ని కొనియాడుతూ రచించిన రాజ్-దీప్ (బాలుగారి గాత్రంలో) స్వరపరచిన

తేటతేనెల చిలుకు పలుకు నా తెలుగు!
రాజహంసల కులు తళుకు నా తెలుగు!
అద్భుత సంస్కృతి విరియు రెమ్మ నా తెలుగు!
అమృతధారల కురియు అమ్మ నా తెలుగు!
ఆ తెలుగు తల్లికి అభివందనం!
అనురాగవల్లికి శ్రీచందనం!

అనే గీతాన్ని గమనించవచ్చు! నా దృష్టిలో పాట అనేది ప్రసన్నంగా వీణానాదంలా వినబడాలిగాని, బీట్ ప్రధానమై రూట్ మార్చుకొని ‘ఎలక్ట్రిక్ గిటార్’ మోత కాకూడదు.
‘దూరదర్శన్’లో, జెమిని, భక్తి టీవీలో దశాబ్దానికి పైగా పునఃహ్ప్రసారమవుతున్న ‘భక్తికవి పోతన’, ‘భారతీయ సంస్కృతి శిఖరాలు’, ‘శ్రీ గురురాఘవేంద్ర స్వామి'(దర్శకులు – కె.రాఘవేంద్రరవు) సీరియల్స్ నాకు రచయితగా, దర్శకునిగా సంతృప్తిని సమకీర్తిని కలుగజేశాయని సగర్వంగా చెప్పుకోగలను.