కొత్త ఆలోచనలతో…

katha

 

(కథాసాహితి పక్షాన)

ఈ 26వ సంకలనంలో కొత్త ఆలోచనలు, అభిరుచులతో మీ ముందుకొస్తున్నాం.

అందులో మొదటిది సంపాదకుల మార్పు. ప్రతి సంవత్సరం మా పక్షాన ఇద్దరు సంపాదకులు ఎన్నిక చేసిన కథలతో ఈ సంకలనాన్ని ప్రచురించాలని భావించాం. ఈ ప్రయత్నంలో తొలి అడుగు ఇది. ఈ కథ 2015కి ఆడెపు లక్ష్మీపతి, ఎ.వి. రమణమూర్తి సంపాదకులు. దాదాపు వారి తుది నిర్ణయం మేరకే ఈ కథల ఎన్నిక జరిగింది. ఒకటి, రెండు విషయాల్లో మా సలహాలు తోడయ్యాయి. అడిగిన వెంటనే బాధ్యతలు స్వీకరించి, అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో చర్చలు సాగించి, కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు ఉన్నా ఎంతో సంయమనంతో వ్యవహరించి, కథలను ఎన్నిక చేసిన సంపాదకులిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వచ్చే సంవత్సరం మరో ఇద్దరు సంపాదకుల ఎన్నికతో కథ 2016 వస్తుంది.

ఈ సంకలనం నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రసిద్ధ కథారచయిత రాసిన ముఖ్యమైన కథను చివర్లో అనుబంధంగా ఇవ్వాలనేది మరో కొత్త ఆలోచన. ఈ తరం రచయితలు, గతకాలపు గొప్ప కథలను చదివి కథారచనలో మెళకువలను నేర్చుకోగలరని, పాఠకులు ఈ మేలు కథల్లోని గొప్పదనాన్ని ఆస్వాదించాలని ఆకాంక్ష. అందుకే ఈ సంవత్సరం తొలి ప్రయత్నంగా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కలుపు మొక్కలు కథని ప్రచురిస్తున్నాం. అనితరసాధ్యమైన వారి రచనాశైలికి, కథానిర్మాణానికి మచ్చుతునక ఈ కథ.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చాలా పట్టణాల్లో బాలోత్సవ్ లు నిర్వహిస్తున్నారు. అందుకు స్పూర్తి కొత్తగూడెం బాలోత్సవ్. ఈ ఉత్సవాల్లో తెలుగు సాహితీసృజన పై పలు పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో ఒకటి కథారచన, అప్పటికప్పడు కథా వస్తువును ప్రకటించి, కథ రాయమని కోరితే వందలమంది బాలబాలికలు గంటలో కథ రాసి మెప్పించగలుగుతున్నారు. అలాంటివారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే వారు రాసిన కథల్లో ముఖ్యమైన వాటిని అనుబంధాలుగా ఈ సంకలనంలో చేర్చాలని ఇంకో ఆలోచన.

ఎక్కడో లోతట్టు తమిళనాడులో నివసించే తెలుగు అక్షరం రాని తెలుగువారి గోసను తెలియజెప్పే అట్ట పుట్టింది ఆ ఊరు కథను అందిస్తున్నాం. దీన్ని రాసిన మార్టూరి సంజనాపద్మం పదమూడు సంవత్సరాల వయస్సులో తెలుగు అక్షరాలు నేర్చుకుని వారి యాసలో ఈ కథను రాసింది. ఇలాంటి మరో పదిహేను కథలతో రేగడి నీడల్లా అనే సంపుటిని ప్రచురించింది. కాకినాడలోని క్రియ సంస్థ నిర్వహించిన బాలోత్సవ్ కథల పోటీలో మొదటి బహుమతి వచ్చిన తాడాల కుసుమ సాయిసుందరీ రాణి కథ దైవం మానవ రూపేణని కూడా ఈ అనుబంధంలో చేర్చాం, ఈ అమ్మాయి ఓ మారుమూల గ్రామం (మాచర) జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. పిల్లల్లో సృజనాత్మక సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందించి, ప్రోత్సహించాలనే ఉద్దేశ్యమే ఈ ప్రయత్నం.

ఎప్పట్లాగే ఈ సంకలనాన్నీ తెలుగు కథాప్రియులు, పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ…

 

*

రజనీగంధ

పాపినేని శివశంకర్

పాపినేని శివశంకర్

పువ్వులంటే యిష్టం

ఇంటి ముందు గుప్పుమని పిలుస్తూ

పసితనానికి తావులద్దినపొన్నాయి చెట్టు –

పూలేరి కాడలు తుంచి

బూర లూదటమంటే యిష్టం

కిలకిలల పూలరేకులంటే యిష్టం

రేకుల కోమలత్వం ఇష్టం

విరిసిన ధనియాల చేల మీదగా

తావుల తలపులు మోసుకొచ్చే గాలులంటే యిష్టం

గాలుల్లో సోలిపోయి నిద్రించే రాత్రులంటే యిష్టం

రజనీ నీల మోహన రూపానికి

రాగాలద్దే రేరాణులంటే యిష్టం

images

పూలకు తల్లి ఒడి అయినందుకే

పులకిస్తుంది నేల

కల్మషలోకాన్ని కాస్త నిర్మలం చేసేందుకే

ఆ రెక్కల దేవకన్యలు ఇక్కడికి దిగి వచ్చాయి

పువ్వులంటే యిష్టం

పువ్వుల్లాంటి మనుషులంటే యిష్టం

మనుషుల్లో ప్రవహించే మలయ మారుతాలంటే యిష్టం

నడిచే దారమ్మట కనపడని పూలచెట్లేవో బారులు తీరితే యిష్టం

ప్రపంచం పూలతోటయ్యే

కోకిలల కాలం కోసం స్వాగత గీతాలు రాయటమంటే

మరీ యిష్టం.

-పాపినేని శివశంకర్

rajinigandha

మాయపొరల్ని ఎప్పటికప్పుడు ఒలుచుకోవాలి!

Kavita 2012 

(మేడే నాడు విజయవాడలో విడుదలయిన ‘కవితా2012’కి ప్రముఖ విమర్శకులు పాపినేని శివశంకర్ రాసిన ముందు మాట)

Every child is an artist, the problem is staying
an artist when you grow up.                                                        Pablo Picasso

 

‘కళ్లుంటే ఉంటే చూసి, వాక్కుంటే వ్రాసీ’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఎవరూ చూడలేనివి చూడగలగటం, ఎవరూ రాయలేనివి రాయగలగటం మనిషిలో సృజనాత్మకతకి సంబంధించినవి. శ్రీజ అనే పాఠశాల చదువరి దేన్ని చూసి, ఏమి వ్రాసిందో చూడండి.

‘అమ్మ తుడుపుతుంది చెడును
పొరపాట్లను తుడుపుతుంది రబ్బరు
నల్లబూడిదను తుడిపి
తెల్లకాంతిని వెలిగిస్తుంది రబ్బరు
రబ్బరు, రబ్బరు, తెల్లని రబ్బరు’

పెద్ద పెద్ద విషయాల మీద గంభీరమైన కవిత్వం వ్రాయటం ఒక రకంగా తేలిక. చిన్న చిన్న సంగతుల మీద రాయటం చాలా కష్టం. ఒకానొక అవధానంలో కలం పాళీ మీద సీసపద్యం చెప్పమన్నప్పుడు తిరుపతి వేంకటకవులంతటి ఆశుకవులే కాస్త ఆలోచించాల్సి వచ్చింది. ఈ చిన్నారి తెల్ల కాగితాన్ని జీవితంతో, దానిమీద తప్పుల నల్లదనాన్ని బ్రతుకులోని చెడుతో అన్వయించింది. ‘మనం చేసే చెడును తుడపడానికి రబ్బరు ఉందా?’ అని ప్రశ్నించుకొని ‘మనం చేసే మంచి పనులే చెడును తుడపడానికి ఉపయోగపడే రబ్బరు’ అని లోతైన చూపుతో ముగించింది. నిసర్గమైన సృజనాత్మకత అది.
ఈ సృజనాత్మకతకి పునాది ఏది? చిరుగాలికి సైతం చిగురుటాకు చలిస్తుంది. కొలను అలలు కూడ మనసులో మల్లెల మాలలూపుతాయి.అదే సహజస్పందన. ప్రకృతి తనలోని చరాచర రూపాల ద్వారా అశేషమైన నమూనాల నిచ్చింది. వాటికి రంగు రూపు, కొలత ఉంటాయి.  కవి  గాని కళాకారుడు గాని ఆ మూలసంపదనుంచే తన మూలకాలు గ్రహిస్తాడు. వాటిని దృశ్యాలుగా, ప్రతీకలుగా, సంకేతాలుగా మలుచుకొంటాడు. అందుకెంతో ఊహాశక్తి ఉండాలి. ఊహే సృజనకి ప్రారంభం అన్నాడు బెర్నార్డ్‌ షా. ఊహని కళగా మలచగలిగే కల్పనాశక్తి కావాలి.  దానికి చక్కని రూపం ఇవ్వటానికి చిక్కని భాష, భావపద చిత్రాలు ఎట్లాగూ అవసరమే.
స్పందనాశీలం ఉన్నప్పుడు రెక్క చిరిగిన సీతాకోక చిలక రాతిమీద  పడినప్పటి ‘నిశ్శబ్ద విషాదధ్వని’ వినగలడు కవి. తనలోని ‘చెట్టు చిగిరింత’ గమనించగలడు. ‘కొండగోగుల రేలపాట’కు చెవియొగ్గగలడు. రామప్ప ‘ఉలి కళ’లోని కళకళ దర్శించగలడు. ఆకలిగొన్న పావురాళ్లకి నాలుగుగింజలు వేస్తున్న పాపలో ఆ స్పందనాశీలమే కదా కదలాడుతున్నది? అదే కదా మగవాళ్ల ‘మృగ ` తృష్ణ’ని ప్రశ్నిస్తున్నది?
సృజనశీలికి ‘కల్లోల కడలిలో అలల కవాతు’ కనపడుతుంది. ‘ఎండ కూడా పండువెన్నెలే’ అవుతుంది. పాట ‘ప్రాణప్రవాహ’మవుతుంది. ‘విరబూసే కలలకు అలసట’ లేదని ఒక ప్రాకృతిక భావుకురాలు భావిస్తే, ‘విత్తనాలవుతున్న మనుషుల్ని, మనుషులవుతున్న విత్తనాల్ని’ ఒక విప్లవ సృజనకారుడు గుర్తిస్తాడు. కలం యోధుడిలో ‘ఉద్యమ నెలరేడు’ను కనుగొంటాడు. ఆ స్పందనకి, సృజనకి ఈ సంకలనం ఒక అద్దం.

ఈ తరళత్వాన్ని, సృజన తత్వాన్ని మొద్దుబార్చే పరిస్థితుల మధ్య ఇవాళ కవి నిలబడి ఉన్నాడు. పికాసో అన్నట్టు శ్రీజ బాల్యంలోని సృజనాత్మకత నిండు జవ్వనంలోను మిగిలిఉంటుందా అన్నదే సమస్య. యాంత్రికమైన చదువులు, ఆందోళన నిండిన ఉద్యోగాలు, ఆర్థికదాహాలు, వ్యక్తులు హోదాలుగా మారిపోవటాలు, అధికార దర్పాలు, అమానవీయతని అలవాటు చేస్తున్న మొరటు దృశ్యమాధ్యమాలు మొదలైనవెన్నో మనిషిలోని సున్నితమైన స్పందనాతంత్రుల్ని తెంచివేస్తున్నాయి. సృజనపుష్పాన్ని చిదిమేస్తున్నాయి. ఆ మాయపొరల్ని ఎప్పటికప్పుడు ఒలుచుకోవాలి. వంచనావిద్యని అవిద్య చెయ్యాలి. కలలతో, కళలతో జీవితమృదుత్వం కాపాడుకోవాలి.

గుంటూరు 25 ఏప్రిల్‌ 2012

తొమ్మిదేళ్ళ అనుబంధం : సాహితీ మిత్రులు

మనిషిని పరిపూర్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే అనివార్యంగా మనం కవిత్వాన్ని ఆశ్రయించవలసి వుంటుంది.

మనిషిలోని మానుషత్వం కవిత్వంలో ప్రకటితమవుతుంది. కవిత్వం ద్వారా పరిపుష్టమవుతుంది. యుగయుగాలు, దేశదేశాల మనుషుల సుఖదుఃఖాలు, జయాపజయాలు, ఆరాట పోరాటాలు, అంతస్సంఘర్షణలు, ఉత్థానపతనాలను కవిత్వం కళ్ళకు కట్టినట్టు చిత్రిస్తుంది. నిజానికి మనిషిలోని మానుషత్వపు చరిత్రే కవిత్వ చరిత్ర. మానవ జీవన సారాన్నీ, రూపాన్నీ వివిధ స్థాయిల్లో అత్యంత శక్తివంతంగా అభివ్యక్తం చేయగలిగింది ఒక్క కవిత్వం మాత్రమేనని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

ఏ దేశానికి చెందిన వాడయినా, ఏ కాలానికి చెందిన వాడయినా మానవ సంవేదనని మనం కేవలం కవిత్వం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. ప్రపంచంలోని ఏ జాతి జనుల హృదయనాళ స్పందననయినా ఆ జాతి సృష్టించిన కవిత్వంలో మాత్రమే మనం స్పష్టంగా గుర్తించగలం. కవిత్వంతో మనం అనుబంధాన్ని కొనసాగించటమంటే మొత్తంగా మనం మానవత్వంతో అనుబంధాన్ని పెంచుకోవడమే.

మిగిలిన అన్ని సాహితీ రూపాలకన్నా కవిత్వం అత్యంత ప్రాచీనం. ఇది అందరూ ఆమోదిస్తున్న ఒక వాస్తవం. అయితే ఒక్క కథని మాత్రమే కుడీ ఎడంగా కవిత్వమంత ప్రాచీనమయినదిగా భావించవచ్చు. వందల వేల సంవత్సరాలు ఈ రెండు ప్రక్రియలు కలిసి కొనసాగాయి. అయితే కవిత్వం మన మాతృభాష అంత సహజంగా వుంటుంది. అమితమయిన ఆనందంలోనూ, భరింపశక్యం కాని దుఃఖంలోనూ మనిషి తన మాతృభాషనీ, కవిత్వాన్నీ సమీపిస్తాడు. అనగా మానవీయ భావనల అభివ్యక్తికి అత్యంత ఆత్మీయమయిన మాధ్యమం కవిత్వం.

మహాకవి శ్రీశ్రీ స్ఫూర్తితో రూపం దాల్చిన సాహితీమిత్రులు, విజయవాడ అందుకే ఈ రంగాన్ని తన కార్యక్షేత్రంగా ఎంచుకుంది. అవాంతరాలు ఎన్ని ఎదురయినా అవిచ్ఛిన్నంగా ముందుకు సాగిపోతున్నది. క్రమం తప్పకుండా కవితా వార్షికలను ప్రచురిస్తున్నది. ఇది సాహితీమిత్రులు సగౌరవంగా, సవినయంగా సమర్పిస్తున్న తొమ్మిదో కవితా సంపుటం. ఇది ఒక మహా సంకల్పం. సహృదయులయిన మీ అందరి ఆశీస్సులు, చేయూతా నిరంతరం మాకు అవసరం.

కవులకు అధ్యయనం అవసరం. మరీ ముఖ్యంగా ఇతర కవుల రచనల్ని కొనుక్కుని మరీ భద్రపరచుకోవటం కవితాప్రియులందరూ తప్పనిసరిగా ఆచరించవలసిన సత్సంప్రదాయం. ఇది యేదో వ్యాపార ప్రయోజనం కోసం అంటున్నది కాదు. కవిత్వాన్ని కలకాలం కాపాడుకోవటం కోసం, అనుభవ పూర్వకంగా చెబుతూన్న కఠిన వాస్తవం. తెలుగు కవితా సంపుటాల్ని కొనండి ` తెలుగు కవిత్వానికి జీవం పోయండి. ఇది మా నినాదం. మా మనసు లోతుల్లోంచి వస్తూన్న వినతి.

ఎప్పటిలాగే, ఈ యేడాది కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ‘కవిత`2012’ వెలువరించటానికి సహకరించిన సంపాదక ద్వయం డాక్టర్‌ పాపినేని శివశంకర్‌, దర్భశయనం శ్రీనివాసాచార్యలకు కృతజ్ఞతలు కేవలం లాంఛనం కోసమే. వాళ్ళిద్దరూ వాస్తవానికి సాహితీమిత్రులు, విజయవాడ నుంచి విడదీయలేని విశిష్ట భాగస్వాములు.


అలాగే ఈ ఏడాది ‘కవిత`2012’ కు ఎంపికయిన కవులందరికీ మా కృతజ్ఞతలు..

శుభాకాంక్షలతో…

విశ్వేశ్వర రావు, సాహితీ మిత్రులు