ట్రోజన్ యుద్ధంలోనూ ఒక ‘అర్జున విషాదయోగం’

 

స్లీమన్ కథ-29

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కల్లూరి భాస్కరం

యుద్ధ సందర్భంలో భార్యతో మాట్లాడుతూ హెక్టర్ అంటాడు:

ఆ రోజు వస్తుంది,  నా అంతరాత్మ చెబుతోంది,

మన పవిత్రనగరం ట్రాయ్ ధూళిధూసరితమైపోతుంది,

ట్రాయ్, ధైర్యశాలి అయిన రాజు, అతని రాచపరివారం, అంతా సర్వనాశనమైపోతారు.

ట్రోజన్ల దుఃఖం నన్ను అంతగా కదిలించడంలేదు సుమా-

దుఃఖం అనివార్యం- హెక్యూబా* దుఃఖం, నా తండ్రి దుఃఖం,

శత్రు పాదాల దగ్గర రక్తధూళిలో పడిఉన్న ఎందరో ఉత్తముల దుఃఖం- అనివార్యం.

నా మృత్యువును నేను తలపోస్తున్నాను, నా చావు నీకు కలిగించబోయే శోకం నన్ను చిత్రవధచేస్తోంది:

కంచు కవచం ధరించిన శత్రువు నిన్ను బానిసత్వంలోకి ఈడ్చుకు వెడుతుంటే నువ్వు పెట్టే ఆర్తారావం నా గుండెల్ని పిండుతోంది.

ఆర్గోస్ లోని ఎవరి మగ్గం దగ్గరో వాళ్ళు నీ చేత పని చేయిస్తారు

లేదా ఎక్కడో ఏ మారుమూల ఊరికో వెళ్ళి కడవతో నీళ్ళు మోస్తావు,

ఏం చేసినా నీ ఇష్టానికి విరుద్ధంగానే, నువ్వు బందీవి.

దుఃఖిస్తున్న నీతో వాళ్ళు అంటారు:

“ తమ నగరం కోసం పోరాడుతున్న రోజుల్లో ట్రాయ్ ఆశ్వికసేనకు నాయకత్వం వహించిన ఘన సేనాని హెక్టర్  ఇల్లాలా! ఇటు చూడు”

ఆ మాటలకు, నిన్ను దాస్యం నుంచి విముక్తం చేసే నాలాంటి వాడు ఎవరూ లేనందుకు,

నీ దుఖం మరింత పొంగి పొర్లుతుంది.

నీ దుర్భరశోకం, నిన్ను బానిసగా మార్చిన వైనం నా చెవిన పడకముందే

నాకు చావు రావాలి, భూమి నా మీద విరుచుకుపడి నన్ను పాతాళానికి తొక్కేయాలి.

దేదీప్యమానుడైన ఆ వీరుడు అలా మాట్లాడుతూ కొడుకువైపు చేతులు చాచాడు,

తండ్రి దేహంపై లోహపు మెరుపులూ, శిరస్త్రాణంపై గుర్రపువెంట్రుకల తురాయీ చూసి భయపడిన బాలుడు-

చక్కని మొలనూలు ధరించిన దాది వైపు ఏడుస్తూ పరుగెత్తాడు.

తల్లిదండ్రుల ముఖాల్లో నవ్వులు విరబూసాయి,

ఉజ్వలుడైన  హెక్టర్ ధగద్ధగాయమానమైన శిరస్త్రాణాన్నితీసి నేల మీద ఉంచి తన గారాల పట్టిని చేతుల్లోకి తీసుకుని లాలించాడు.

తను సృష్టించిన పాత్రపై ప్రేమ పెల్లుబికితే తప్ప ఇలాంటి సన్నివేశాలను ఇంత దుస్సహ గాఢతతో, ఇంత ఆర్ద్రంగా ఎవరూ రాయలేరు. ఇలియడ్  మొత్తాన్ని హెక్టర్ పక్షాన చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఇతిహాసం పొడవునా అతను మాట్లాడుతూనే ఉంటాడు. ఒక్కోసారి ధిక్కారపూర్వకంగా గర్జిస్తూ, ఇంకోసారి కోపంతో వణకుతూ, మరోసారి ప్రసన్నతనూ, నిగ్రహాన్నీ పలికిస్తూ అతని గొంతు ఇతిహాసమంతటా బిగ్గరగా  వినిపిస్తూ ఉంటుంది. “ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ విధ్వంసం మన మీద వచ్చిపడింది. దానిపై తిరగబడుతూ, గడచిపోయే ప్రతి ఒక్క క్షణం నుంచీ మనకు దక్కే అల్ప సంతోషాన్ని జుర్రుకుందాం” అంటాడతను. విచిత్రంగా ఈ మాటలు ఆధునికతకు సమాధానాలుగా ధ్వనిస్తాయి. హోమర్ ను చదువుతున్నకొద్దీ మనం ఆధునిక ప్రపంచంతో ముఖాముఖీ తలపడుతున్నామన్న ఒక విచిత్ర స్ఫురణ నిరంతరాయంగా కలుగుతూ ఉంటుంది.

మానవ అంతఃకరణలోని అరాచకరాక్షసుని హింసాత్మక స్వైరవిహారానికి అఖిలెస్ ప్రాతినిధ్యం వహిస్తాడు. అతను కేవలం చంపడం కోసమే చంపుతాడు. అందులోనే వెర్రి ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. అతని దృష్టిలో విధ్వంసం ఒక  ఉత్తమోత్తమ పుణ్యకార్యం . అతనిది రాతిగుండె అనో; పగ, ప్రతీకారం మూర్తీభవించినవాడనో అనడం, అతని భయానకప్రవృత్తిని తక్కువ చేసి చూపడమే. అతని సంహారకాండకు ఒక లక్ష్యం ఉండదు. ఒక వేటగాడిలా వెంటాడి వెంటాడి మరీ చంపుతాడు. అందులో పిల్లలు, వృద్ధులు అన్న విచక్షణ లేదు.  అపరాధభావన లేదు. ప్రపంచాన్ని అమితంగా ద్వేషిస్తాడు. దానిని నిర్ధూమధామం చేయడంలో తను పొందే తృప్తి కన్నా అతనికి మరేవీ ఎక్కువ కావు. శత్రుగృహంలో ఉన్న హెలెన్ ను విడిపించడం కోసం అతను  యుద్ధంలో పాల్గొనలేదు; చంపడంలో ఉండే సంతోషాన్ని పిండుకోవడం కోసం, ట్రాయ్ మొత్తాన్ని బూడిదకుప్పగా మార్చడం కోసం పాల్గొన్నాడు.

achilles_dragging_hector_s_body_in_front_of_troy__by_jacktzekov-d82vnjg

అందరికంటే ఎక్కువగా  హెక్టర్ మన ఆలోచనలకు దగ్గరగా ఉంటాడు. అతనిలో ఎలాంటి భ్రమలూ లేవు. అతని చేతిలో ఎలాంటి మంత్రదండమూ లేదు. నేటి మన కాలపు ఛాయలు అతనిలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. శకునాలను ధిక్కరిస్తాడు. విధిని తప్పించుకోడానికి మానవసాధ్యమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాడు, అదే సమయంలో, అది తప్పించుకోలేనిదనీ అతనికి తెలుస్తూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా హుందాగా, గౌరవప్రదంగా నడచుకుంటాడు; అయితే గౌరవమర్యాదలు యుద్ధాలను గెలవలేవనీ అతనికి తెలుసు. హోమర్ చెప్పినట్టుగా అతని ముఖంలో నిశీథి తాండవిస్తూ ఉంటుంది. మరోవైపు, అతను ఎంతటి వీరుడంటే, “కోటగుమ్మంలోంచి రివ్వున యుద్ధానికి దూసుకువెడుతుంటే దేవతలు కూడా అతన్ని పట్టుకోలేరు”. చివరికి, తన కవచాన్ని కోల్పోయిన స్థితిలో, కంఠంలో దిగబడిన ఒక కత్తిపోటుతో అతని జీవితం అంతమవుతుంది. అప్పటికీ కసి తీరని శత్రువు అతని మృతదేహాన్ని దుమ్ములోంచి ఈడ్చుకువెళ్ళాడు.  దేవతలు తనను త్యజించి శత్రుపక్షం వహించడమే అతని పతన,పరాభవాలకు కారణం. విచిత్రం ఏమిటంటే, తన జీవితం ఇలాగే ముగుస్తుందని అతనికి ముందునుంచీ తెలుసు. **

ప్రతి కాలంలోనూ జనం హోమర్ ను చదువుకున్నారు. కానీ నేటి కాలంలో చదువుతున్నంత విస్తృతంగా, శ్రద్ధగా ఎప్పుడూ చదవలేదు. అందుకు తగిన కారణమే ఉంది. హోమర్ ప్రకృతికి అద్దం పట్టాడు. అతను వర్ణించిన ప్రపంచం సరిగ్గా నేటి ప్రపంచమే. ట్రాయ్ దగ్ధమైన తర్వాత ఈ మూడువేల సంవత్సరాలలో ప్రపంచం పెద్దగా మారింది లేదు. నాటి ఆ మంట ఇంకా రగులుతూనే ఉంది. అందులో చిక్కుకున్నవారు బయటపడడానికి పంటిబిగువు పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రతిచోటా విధ్వంసగ్రస్తుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. మనందరం ట్రోజన్లమే.*** అంధుడైన హోమర్ పురాతన ద్వీపాల వెంబడి సంచరిస్తూ నేటి మన దురవస్థను విస్తారమైన కాంతిమంతతతో వర్ణించాడు. అలాగని అతను ప్రవక్త ఏమీ కాదు; మానవావస్థను అతనంత నగ్నంగా, ఘనంగా వర్ణించినవారు లేరు.

పాశ్చాత్య నాగరికత మూలాలు వెతికే ప్రయత్నంలో స్లీమన్ ట్రాయ్ అన్వేషణకు వెళ్ళాడు. అతనూ ఆధునికత ఆవహించినవాడే. అశాంతి, అభద్రత, నీడల మధ్య సంచారం సహా విక్టోరియన్ల జాడ్యాలన్నీ అతనికీ ఉన్నాయి. అదే సమయంలో, ఈ సంకీర్ణ ఆధునిక నాగరికత గుప్పించే ప్రలోభాలనుంచి తప్పించుకోవాలన్న దృఢనిశ్చయమూ అతనిలో అసాధారణస్థాయిలో ఉంది. తనవైన మూలాల నుంచి తను దూరమయ్యాడన్న ఎరుక అతనికుంది. అందుకే తన మూలాలను అన్వేషించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతిపురాతన గతంలోకి… ఎలాంటి దారి గుర్తులూ లేని ప్రదేశాలకు సైతం వెళ్లాలనుకున్నాడు. ****

విచిత్రం ఏమిటంటే, ఆధారాలను పట్టించుకోకుండా సిద్ధాంతాలను అల్లే పండితులపట్ల ఆధునికులలో ఉండే తిరస్కారభావం స్లీమన్ లోనూ ఉంది.  అందుకే, హోమర్ కల్పితవ్యక్తి కాడనీ, ఇప్పటికీ జనం జ్ఞాపకాలలో వెచ్చగా ఉన్న యుద్ధాల గురించి రాసిన ఒకనాటి సజీవవ్యక్తి అనీ తిరుగులేని ఆధారాలతో నిరూపించాలనుకున్నాడు. ఆ సంకల్పాన్ని హద్దులు దాటిస్తూ, తను అగమెమ్నన్ ముఖాన్ని గుర్తుపట్టానని అతను అన్నప్పుడూ; ‘హెలెన్ స్వర్ణహారకిరీటాన్ని’ భార్య నుదుట అలంకరించినప్పుడూ అందరూ వెక్కిరింపుగా నవ్వారు. అయితే, అతని భావన నిజమైనా కాకపోయినా కనీసం అది అసాధ్యమని మాత్రం ఎవరూ అనలేరు.

హోమర్ లో అంతవరకూ పాఠకుల దృష్టిని పెద్దగా ఆకర్షించని ఛాయామాత్ర ఉల్లేఖలు కొన్నింటికి రక్తమాంసాలను కల్పించి, ముందులేని ప్రాధాన్యతను వాటికి సంతరించడం స్లీమన్ చేసిన గొప్ప దోహదాలలో ఒకటి. తను జరిపిన తవ్వకాలలో అతనికి గట్టి లిఖిత ఆధారాలు ఏవీ కనిపించకపోయినా; అతను బయటపెట్టినవాటిలో అనేకం హోమర్ చిత్రణలకు అనుగుణంగా ఉండి, అతని పద్యాలను అప్పుడే తవ్వి తీసి అపనమ్మక ప్రపంచం ముందు పెట్టాడా అన్న భావన కలిగిస్తాయి. ఏమైతేనేం, తను పాశ్చాత్యనాగరికత మూలస్థానాన్ని కనిపెట్టాడు, అంతే! ఇంతకు మించి చెప్పుకోవడం అనవసరం.

అసలు ట్రాయ్ లో ఏం జరిగింది, యుద్ధం ఎందుకు చేయవలసివచ్చిందన్నది ఈ రోజుకీ మనకు తెలియదు. హోమర్ నిజంగా ట్రాయ్ ను సందర్శించాడా అన్నది కూడా తెలియదు. కానీ ట్రాయ్ పతనగాథ ఏమాత్రం సందేహించడానికి వీలులేనంత ప్రామాణిక వివరాలతో, పటిష్టమైన చట్రంతో మన ముందుకు వచ్చింది.*****  హోమర్ ఒక కవిగా తన అభిరుచికి అనుగుణంగా వీరులను తీర్చిదిద్దాడు. కొందరిని ఉన్నతీకరించాడు, కొందరిని వక్రీకరించాడు. తన సానుభూతులన్నిటినీ హెక్టర్ లో గాఢంగా రంగరించాడు. హెలెన్ ను పారిస్ ఎత్తుకువెళ్లడం వల్లనే ట్రోజన్ యుద్ధం జరిగిందని అతను నమ్మాడు. అయితే, ఆర్థిక కారణాలతో కాకుండా అర్థరహిత కారణాలతో కూడా తరచు యుద్ధాలు జరిగాయన్న సంగతిని విస్మరించిన ఆధునిక పండితులు మాత్రం, దర్దనెల్లెస్ పై ఆధిపత్యం కోసమే ట్రోజన్ యుద్ధం జరిగిందని భావించారు.

ఇక, ట్రోజన్ యుద్ధం గురించి గ్రీకు పురాతన చరిత్రకారుడు హెరోడొటస్ (క్రీ.పూ. 484-425)కథనం మరోవిధంగా ఉంది.

(సశేషం)

****

అథోజ్ఞాపికలు

*హెక్యూబా: రాజు ప్రియామ్ భార్య.

**హెక్టర్ లో విచిత్రంగా మహాభారతంలోని అర్జునుడి పోలికలు, కర్ణుడి పోలికలూ కూడా కనిపిస్తాయి. అతను మనం తేలిగ్గా పోల్చుకోగలిగిన మానవమాత్రుడిలానే వ్యవహరిస్తాడు. విధికి ఎదురు తిరగలేని మానవనిస్సహాయతను అంగీకరిస్తూనే, మానవప్రయత్నంతో ధైర్యంగా దానిని ఎదుర్కోడానికి సిద్ధమవుతాడు. మనిషిలోని దుఃఖం, వేదన, ఆనందం, ఆశ, నిరాశ మొదలైన అన్ని రకాల అవస్థలను ప్రతిబింబిస్తాడు. మహాభారతంలోని అర్జునుడు కూడా ఈ మానవస్వభావానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. ‘నరుడు’ అన్న అతని మరో పేరే దీనిని సూచిస్తూ ఉండచ్చు. హెక్టర్ లానే అర్జునుడు కూడా యుద్ధఘట్టంలో సందేహాలు, సందిగ్ధాల మధ్య నలుగుతాడు. విషాదానికి లోనవుతాడు. హెక్టర్ లానే యుద్ధానంతర విధ్వంసాన్ని పదే పదే ఎత్తి చూపుతాడు.

ఇంకోవైపు, హెక్టర్ అంతమైన తీరు కర్ణుని గుర్తుచేస్తుంది. అతను కవచాన్ని కోల్పోవడం, ఆ స్థితిలో కంఠంలో శత్రువు కత్తి దిగబడడం కర్ణుని అంతిమక్షణాలకు కొంచెం దగ్గరగా ఉన్నాయి.  దేవతలు హెక్టర్ కు ప్రతికూలంగా మారి శత్రుపక్షం వహించి అతని చావుకు కారణమైనట్టే, దేవతల రాజైన ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలను హరించి అతని చావుకి ఒక కారణమయ్యాడు.

***ఇక్కడ కూడా మహాభారతంతో ఇలియడ్ కు పోలిక కుదురుతున్నట్టుంది. పాశ్చాత్యులందరూ ట్రోజన్లు అయితే, మనం భారతీయులం కురుక్షేత్రయుద్ధ వారసులం. ట్రోజన్ యుద్ధం పాశ్చాత్య సమాజాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పిందనుకుంటే, కురుక్షేత్రయుద్ధం భారతీయసమాజాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పింది. నా విస్తృత అధ్యయనంలో ఈ చర్చ ఒక భాగం కాబోతోంది.

****మనకులానే పాశ్చాత్యులకు కూడా ఆధునికత ఒక సమస్య కావడం ఇక్కడ ఆసక్తికరం.

*****ఇక్కడా మహాభారతంతో పోలిక కుదురుతోంది. మహాభారతయుద్ధం నిజంగా జరిగిందో లేదో మనకీ తెలియదు. కానీ యుద్ధ చిత్రణ మాత్రం నిజంగా జరిగిందన్న భావన కలిగిస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. chandolu chandrasekhar says:

    సర్ , అలూరి బైరాగి అనే కవి కుడా ,దాస్తోవస్కి రాసిన క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవలలో ,అర్జునుడి నిర్వేదం వుందని బ్రమపడ్డారు .పాత గోడకి కొత్త రంగేయడం ,కొత్త వాటి కి పాతవి పులమడం ,అవసరమా !

  2. భాస్కరం కల్లూరి says:

    “పాత గోడకి కొత్త రంగేయడం ,కొత్త వాటి కి పాతవి పులమడం ,అవసరమా !”
    ‘పాత’ మీద మీ ఆగ్రహాన్ని, అసహనాన్ని అర్థం చేసుకోగలను చంద్రశేఖర్ గారూ…ఒక (వయో)దశలో అలాగే అనిపిస్తుంది. దానినలా ఉంచితే ఒక వాక్యంలో అడిగిన మీ ప్రశ్నకు పదివాక్యాలలో కూడా సమాధానం సాధ్యమని తోచడం లేదు. అయినా ప్రయత్నిస్తాను. ఇది సంపూర్ణమని అనుకోను.
    1.పాతగోడ అయినప్పుడు అదసలు అక్కడ ఎందుకు ఉంది? అది పడిపోవాలి, లేదా పడగొట్టాలి. కానీ మీరు ఆ మాట అనలేదు చూడండి. అది ఉందంటే ఏదోవిధంగా ఉపయోగపడుతోందన్న మాట. ఉపయోగపడుతున్న పాతగోడకు కొత్తరంగు వేయడంలో తప్పేమిటి?
    2.పాత-కొత్తలను ఎక్కడ విడదీయాలి? ఒక ప్రవాహంలోని నీటిని పాతనీరు-కొత్తనీరుగా వేరుచేయడం సాధ్యమేనా? రెండూ కలసిపోయే ఉంటాయి. అలాగే భూత-భవిష్యత్-వర్తమానాలను ఎలా విడదీయాలి? మూడూ కలసిపోయే ఉంటాయి. మన శరీరాలనే తీసుకోండి. వీటిలోని జన్యువులు ఎంతకాలంగా సంక్రమిస్తున్నాయి? వాటిని పాతవిగా కొత్తవిగా విడదీసి పాతవి నిర్మూలించగలమా?
    3. నేడు మనం ఎంతో ఆగ్రహాన్ని, అసహనాన్ని ప్రకటిస్తున్న అనేకానేక సమస్యలు మనకు ఎక్కడినుంచి సంక్రమిస్తున్నాయి? పాతనుంచీ లేదా గతం నుంచే కదా? ఉదాహరణకు, కులం, మతం, పురుషాధిపత్యం, ధనిక-నిర్ధనిక తేడాలు వగైరాలు. వీటి రూపంలో పాత, లేదా గతమే కదా చర్చలో ఉంటోంది? మీరన్న గోడ ఉపమానంతో చూసినా పైన చెప్పిన సమస్యలనే గోడకు మనం కొత్త అవగాహన అనే రంగు వేసుకోవలసిందే కదా!
    4. పాత గోడకు కొత్త రంగు వేయడం అవసరమా అన్న మీ ప్రశ్నను పొడిగిస్తే ఉండే ఇంకో ప్రమాదాన్ని గమనించండి. అప్పుడు చరిత్ర, పురావస్తు శాస్త్రం, పురామానవశాస్త్రం, పురాతన సాహిత్యం వగైరాలు అన్నీ శూన్యమైపోతాయి. అంటే ఇంతవరకూ ఉన్న సృష్టి సమస్తం అంతర్ధానం అయిపోయి, లేదా వాటన్నిటి జ్ఞాపకాలు మనలో పూర్తిగా చెరిగిపోయి మనం కొత్తగా పుట్టాల్సి ఉంటుంది. సాధ్యమా?
    5. రామాయణం, మహాభారతం, పురాణాలు, వేదాలు మొదలైన పేర్లు, వాటిలోని కథలు, ఇతివృత్తాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాయి. కానీ ఇంకోవైపునుంచి చూడండి. వాటిలో మనుషులు ఉన్నారు. వారి అనుభవాలు, ఆలోచనలు, తాత్వికతలు, మంచి చెడులు ఉన్నాయి. యుద్ధాలు ఉన్నాయి. యుద్ధ మధ్యంలో సందిగ్ధానికి, విషాదానికీ లోయనైన అర్జునుడు, హెక్టర్ లాంటి పాత్రలున్నాయి. పైన చెప్పినట్టు వాటికి ప్రవాహగుణం ఉంది. అంటే అవి వర్తమానంలోకి ప్రవహిస్తున్నాయి. అలాగే వాటిలో ఒక సమాజమూ, దానికి వర్తమానంలోకి ప్రవహించే గుణమూ ఉన్నాయి. ఆ సమాజాన్ని, నేటి సమాజంతో పోల్చుకుని నేటి కాలానికి అనుగుణంగా దానిని మార్చుకోవాలనుకున్నా దాని ఆధారం పాత రూపంలో మనకు ఎదురుగా ఉండాలి. అప్పుడే కొత్తగా ఆలోచించి కొత్తవి నిర్మించుకోగలుగుతాం.
    6. సింపుల్ గా చెప్పాలంటే, పాతను అర్థం చేసుకోకుండా, అందులో ఉన్న నేటి సమస్యల మూలాలను చూడకుండా కొత్తగా మనం దేనినీ నిర్మించలేము. మనం ఒక భవనం కట్టాలంటే దానికి నేల అనే ఆధారం ఉండాలి. పాత అనేది ఆ నేల లాంటిది.
    ముందే చెప్పినట్టు ఈ వివరణ సంపూర్ణమనుకోను. కానీ ఈ తక్కువ నిడివిలో ఇంతకన్నా చెప్పడం సాధ్యం కాదేమో!

  3. శ్రీనివాసుడు says:

    భాస్కరం గారూ!
    ** పాతను అర్థం చేసుకోకుండా, అందులో ఉన్న నేటి సమస్యల మూలాలను చూడకుండా కొత్తగా మనం దేనినీ నిర్మించలేము.**

    అలా చేయకుండానే, సరియైన అవగాహన లేకుండానే రాజ్యాంగంలో మనది సెక్యులర్ (మతరహిత, లౌకిక) రాజ్యం అని వ్రాసుకున్నామని నా భావన. ఆ ప్రకారంగానే రాజ్యం అన్ని విషయాల్లో ప్రవర్తించాలని నిర్దేశించడం వాస్తవ విరుద్ధమవుతుందేమో! నా ఆలోచన సరియైనదో, కాదో చెప్పగలరా?

    మరొక కోణమేమంటే, వైదిక ధర్మాన్ని గురించి, సనాతన వాఙ్మయాన్ని గురించి ఏ ప్రస్తావన తెచ్చినా అది తిరోగమనమే అవుతుందనే భావజాలం సరియైనదేనా?

  4. భాస్కరం కల్లూరి says:

    శ్రీనివాసుడుగారూ…నా అవగాహన ఇదీ: రాజ్యం ఒక భౌగోళిక ప్రదేశంలోని భిన్న మతాలు, భాషలు, ఆచారాలు, సంస్కృతులు, విశ్వాసాలకు చెందిన ప్రజల ఉమ్మడి సంకల్పానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజ్యానికంటూ ఒక మతం ఉండదు. ఉండడం, పై అవగాహనకు విరుద్ధమవుతుంది. రాజ్యం ఒక లౌకికవ్యవస్థ. ప్రజల మనుగడకు చెందిన లౌకిక వ్యవహారాలను చూస్తుంది. భిన్న మతాలు, భాషలు, ఆచారాలు కలిగిన ప్రజల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఉమ్మడి వ్యవస్థగా రాజ్యం అవసరమైతే మధ్యవర్తి పాత్ర వహిస్తుంది. రాజ్యానికి గల ఈ మతాతీత లౌకికస్వభావం మన రాజ్యాంగంలోనే కొత్తగా తెచ్చిపెట్టికున్నది కాదు. రాజ్యానికి గల లౌకిక స్వభావం రాజ్యమంత పాతది. మనం గణవ్యవస్థలోకి వెడితే, అంతవరకూ ఇంకో గణంతో పరిచయం లేకుండా ఒంటరిగా మానవబృందాలు ఉన్న దశలో వేరే మానవబృందాలు తారసపడినప్పుడు వాటి మధ్య ఘర్షణ ఏర్పడేది. క్రమంగా ఘర్షణ కన్నా సయోధ్య ఉభయుల మనుగడకు తోడ్పడుతుందన్న అవగాహన పెరిగిన కొద్దీ వారి మధ్య ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఏర్పడ్డాయి. మనుగడకు తోడ్పడేది ఏదైనా లౌకిక స్వభావం కలిగినదే. ఆవిధంగా లౌకికవాదం అనేది గణవ్యవస్థ అంత పాతది.
    ఎంతో పురాతన గతంలో వైవిధ్యపు,లౌకికత్వపు వేళ్ళు పాతుకుని ఉన్న మనదేశాన్ని పాకిస్తాన్ వంటి కొత్త మతప్రాధాన్య రాజ్యంతో పోల్చుకోలేం. దురదృష్టవశాత్తూ ఇప్పుడు అదే జరుగుతోంది.
    వైదికధర్మం గురించీ, సనాతన వాఙ్మయం గురించీ ఏ ప్రస్తావన తెచ్చినా తిరోగమనమే అవుతుందని వాదించే భావజాలం ఉంటుందనుకోను. ఒకవేళ అలా వాదించేవాళ్లు ఉంటే వాళ్ళతో ప్రతివాదం పెట్టుకుని మన సమయాన్ని వృథా చేసుకోనక్కర్లేదు. ఇప్పటి అవగాహనకు, లోకధర్మానికి విరుద్ధంగా ఉన్నవాటిని కూడా ఇప్పుడు నొక్కి చెబితే అది తిరోగమనమవుతుంది. ఉదాహరణకు సనాతనవాదుల్లా ఆడపిల్లకు చదువు అవసరం లేదనీ, బాల్యంలోనే వారికి వివాహం చేయాలని ఇప్పుడు కూడా ఎవరైనా అంటే అది తిరోగమనమవుతుంది. అలాగే, పరిస్థితుల రీత్యానే అయినా వెనకటివారు ప్రకృతికి దగ్గరగా పర్యావరణ అనుకూలంగా జీవించగా ఇప్పుడు మనం ప్రకృతికి దూరంగా పర్యావరణ విధ్వంసకరంగా జీవిస్తున్నాం. దీనిని తిరోగమనం అనలేము కానీ, విధ్వంసంవైపు వెడుతున్నానమని అనవచ్చు.
    విషయం లోతైనది. ఇక్కడ మరింత విస్తరించడం సాధ్యం కాదు కనుక ఇక్కడితో ఆపేస్తాను.

  5. chandolu chandrasekhar says:

    సర్ ,నేను మీ వస్తువు కి ఉపమానం చెప్పెను .కాని ఉపమానాన్ని కి ఉపమానం జావాబు ,కాదు .గీతలొ అర్జున నిర్వేదం ఏమిటి ?ట్రోజన్ లో నిర్వేదానికి పోలిక ఎలా !దస్తోవస్కి నవలలో హత్యకి , రాజ్యాల రక్త దాహాని కి లింకేమిటి , దిని తాత్వికతని విశ్లేషణచెప్పడి వస్తువు లేకుండా నీడ,పదార్దం లేకుండా భావం వుండదని తెలుసు .మీరు మళ్ళిరామాయణం భారతం చదవండి .దానిలో మనుషులు లేరు .వాటి ధర్మాలు వున్నై .రామాయణ ,భారతంలలో ఎ వ్యవసాయ పద్దతులు వున్నై ,దశరధుడు ,అతని భార్యలు ,కొడుకులు .భారతంలో వందమంది కౌరవ సంతతి ,పాండవ సంతతి ఎవడో చాకిరి చేస్తే మదమెక్కి కన్ను కానక ,పెళ్లాలిని,కొడుకులను జూదం లో పెడుతూ ,త్రాగి తుళ్ళే పరాన్న భుక్కులకి ఆదాయం ఎ ఉత్త్పత్తిసంబందాల నుండి వస్తుంది , అమనుషులు ఏరి ,రాముడి ని కృష్ణ గురించి కావ్య్లలో చదువుతాం .హిస్టరీ లో విరు తగలరు .అందుకే శ్రీశ్రీ ఎ వెలుగులకీ ఈ ప్రస్తానం అంది .రామాయణ ,మహాభారత ,గీతలో మనిషి కి పనికొచ్చే వెలుగు ఏదో చెప్పి పుణ్యం కట్టుకోండి .అ అర్జున నిర్వెదమెదొ ,పొలం పండని రైతులకి ,కడుపు నిండని కష్టజీవులకి ,కార్మ్కిలకి చెపితే పనిమానేసి ఆత్మ హత్యల జోలికి పోకుండా నిర్వేద సుఖమేదో అనుభవిస్తారు .

  6. అజిత్ కుమార్ says:

    ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా వివాహవయస్సును ఎవరో చెప్పేమాటల ప్రకారం కాకుండా మీరు స్వంతంగా ఆలోచన చేసి చెప్పడానికి ప్రయత్నించగలరా దయచేసి…

  7. CHANDOLU CHANDRASEKHAR
    APRIL 24, 2016 AT 5:39 AM
    మీరు మళ్ళిరామాయణం భారతం చదవండి .దానిలో మనుషులు లేరు .వాటి ధర్మాలు వున్నై .రామాయణ ,భారతంలలో ఎ వ్యవసాయ పద్దతులు వున్నై ,దశరధుడు ,అతని భార్యలు ,కొడుకులు .భారతంలో వందమంది కౌరవ సంతతి ,పాండవ సంతతి ఎవడో చాకిరి చేస్తే మదమెక్కి కన్ను కానక ,పెళ్లాలిని,కొడుకులను జూదం లో పెడుతూ ,త్రాగి తుళ్ళే పరాన్న భుక్కులకి ఆదాయం ఎ ఉత్త్పత్తిసంబందాల నుండి వస్తుంది………
    HARIBABU
    రామాయణంలో ఉండాల్సిన మీ వ్యవసాయం గురించి తర్వాత ఆలోచిద్దాం గానీ ఈ ఉత్పతి శక్తులూ,సమాజ బంధాల్లో వాటి ప్రాధాన్యత గురించి నాకో నాలుగు అతిచిన్న డౌట్లు ఉన్నాయి,తీరుస్తారా?కమ్యునిజంలో ఉన్న రామాయణం ఏమిటో మీకే అర్ధమవుతంది!
    Question1:ఉత్పత్తి శక్తులు వాటంతటవి ఆటోమ్యాటిగ్గా సమాజాన్ని ప్రభావితం చహెసేస్తాయా?అవి మార్కెట్ వేదిక మీద నిల్బడి ధర నిర్ణయించబడ్డాక అప్పుడు ఎక్కువ విలువైనది ఎక్కువగానూ తక్కువ విలువైనది తక్కువగానూ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు మార్క్సు గారు వర్ణించిన అన్ని ఆద్శలలోనూఒ అక్కడ ప్రభావితం చేస్తున్నది మార్కెట్ ఒక్కటే – కాదా?ఒక్క్పె దశలో ఒక్కో రకం ఉత్పత్తి శక్తులు ప్రబావితం చేసినా అన్నీ అద్శలాలోనూ అంతర్లీనంగా మార్కెట్ ఉంటుంది,అవునా కాదా?అంటే,అన్నివేళలా అన్నైదశల్లో మానవసమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఒకే ఒక్క అంశం మార్కెట్ – కాదంటారా?
    Question2:మనిషి వస్తుగత వాది – అంటే అతని ప్రపంచం మొత్తం తనతోనే మొదలవుతుంది. మరి ఈ బలమయిన నేను అనే మౌలిక లక్ష్యానికీ కమ్యునిష్టు సిధ్ధాంతం మనిషికి చెప్పే తొలి సుభాషితమయిన స్వంత ఆస్తి రద్దుకీ మధ్య సమన్వయం యేలా కుదురుతుంది? మిగతా మతాల వాళ్ళు “నేను , నాది అనేది వొదులుకోండి, అంతా మంచిగా వుంటుంది” అని చెప్తున్నట్టు మీ మతంలో దానికి ప్యారలల్ గా వినిపించే స్వంత ఆస్తి రద్దు అనే ఒక తింగరి మాటని ప్రచారంలోకి తెచ్చారు, కానీ స్వంత ఆస్తి రద్దు సాధ్యమా? మీ ఇంట్లో గోడ మీద వేలాడే మార్క్సు గారి బొమ్మ అక్కడికి యెలా వచ్చింది?కొంటే వచ్చింది,అవునా కాదా? కొనాలంటే ఒక్క రూపాయి అయినా సరే మీ దగ్గిర స్వంత ఆస్తి వుండి తీరాలి, అవునా కాదా?
    Question3:వర్గరహిత సమాజం యేర్పడినాక రాజ్యం అంతరించి పోతుందనే కంటి తుడుపు వ్యాఖ్యతో శ్రామిక వర్గ నియంతృత్వం నిక్కచ్చిగా అమలవుతూ శాశ్వతంగా కొనసాగే విధంగా రాజ్యం యేమి చేయాలనేది చెప్పకపోవటం అసలైన మూర్ఖత్వం కాదా!వస్తుగత వాది అయిన మనిషిని వర్గరహిత సమాజపు నియమాలకి పట్టి వుంచాల్సిన అవసరం లేదనుకున్నాడా?హెగెల్ చెప్పిన దాన్ని తిరగేసినా యెలా చేసినా మార్క్సిష్టు కార్యాచరణ అంటే గతితార్కికంగా పుట్టుకొచ్చే వైరుధ్యాల్ని మనం కోరుకున్న దిశకి నదిచేలా సమన్వయం చెయ్యడం అయినప్పుడు వర్గ రహిత సమాజంలో కూడా మిత్రవైరుధ్యాల విషయంలో నైనా ఆ అవసరం వుంటుంది కదా?వర్గరహిత సమాజం ఆవిర్భవించెయ్యగానే మానవుడిలోని వస్తుగత వాంఛ హఠాత్తుగా అదృశ్యమైపోతుందా – అది మ్యాజిక్కా,తాయెత్తా?అసలు ఒక ప్రాంతంలో వర్గరహిత సమాజం ఆవిర్భవించిందని యెలా గుర్తు పట్టాలి?
    Question4:ప్రపంచ చరిత్రలో ఇదివరకే జరిగిన విషయాల్ని యెందుకు జరిగాయో చెప్పడం వరకూ బాగానే వుంది కానీ మార్క్సు గారు అత్యుత్సాహంతో కొన్ని ప్రిడిక్షన్స్ కూడా చేశాడు – మొట్టమొదట కమ్యూనిజం అమేరికా లాంటి పారిశ్రామికంగా వ్యాపారపరంగా యెదిగి తను దోపిడీ అని నిర్వచించిన వ్యవహారం దిట్టంగా నడుస్తున్న చోట వచ్చే అవకాశం వందన్నాడు.రష్యా లాంటి పారిశ్రామికంగా వెనకబడీనవి అంటే దోపిడీ అనేది ప్రజలకి అనుభవంలోకి రాని దేశాల్లో వచ్చే అవకాశం లేదన్నాడు.తను రాదు అని చెప్పిన చోట రానూ వచ్చింది కరిమింగిన వెలగపండు మాదిరి పోనూ పోయింది!తను వస్తుంది అని చెప్పిన చోట ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు కూడా కనపడటం లేదు?పైగా నిన్నటి రోజున చార్లీ చాప్లిన్ అనే హాస్యగాడు పొరపాటున “కామ్రేడ్” అనే మాటని వాడినందుకు నానా యాగీ చేసి అమరికా నుంచి గెంటేస్తే స్విట్జర్లాండులో బతకాల్సి వచ్చింది!వారు అశాస్త్రీయమైనవి అని వెక్కిరించే నోస్త్రదామస్ జోస్యాలూ బ్రహ్మంగారి కాలజ్ఞానాలూ కూడా నిజమవుతూ పూర్తి శాస్త్రీయమైన మార్క్సు గారి ప్రిడిక్షన్లు యెందుకు అబధ్ధాలైనాయి?!
    P.S:యేదో పెద్ద వీరావేశంతో “మదమెక్కి కన్ను కానక ,పెళ్లాలిని,కొడుకులను జూదం లో పెడుతూ ,త్రాగి తుళ్ళే పరాన్న భుక్కులకి ఆదాయం” అంటూ విరుచుకుపడుతున్నారుగా,వీటికి జవాబు చెప్పకుండా మళ్ళీ పురాణాల గురించి నోటితీట కామెంట్లు వెయ్యకండి!వేస్తే భూమి బద్దలవదు,ఆకాశం భళ్ళున పగిలి భీబత్సాలేమీ జరగవు గానీ మీ పాండిత్యం ఎంతో మీ సరుకేమిటో సారంగ వీక్షక్య్లకి తెలిసి మీ పరువు పోతుంది.

  8. chandolu chandrasekhar says:

    హరి గారు ,మార్క్ ఫెయిల్ ఐ , బ్రహం గారి కాల జ్ఞానం నిజం అయింది , అంటే మీరు ,K BR ఎంత మేధావులో సారంగ ప్రేక్షకులకు మీ మేధా ఏపాటిదో అర్ద్ద మైతుంది . ఆవేశం కాదు , ఆలోచన కావలి , మీ నుండి నేర్చుకువటానికి , నేను ఎప్పుడు సిద్దమే.నేను జాతస్య హిందువు ని ఐన , మత దుర్మార్గాన్ని ఒప్పుకోను ,hindu or musilm ,christianty .christianty సామ్రాజ్యవాద మతం ఇక ఇస్లాం ఎంత దుర్మగమతమో , ఒకరు చెప్పేది కాదు ,ఇస్లాం లో పశువుకి కన్నా గౌవరమ్ వుంటుంది కాని స్త్రీ కి వుండదు .ఈవాళ ముస్లిం హక్కుల కోసం నిలబడింది భారత్ లో హిందూ మేధావులే ,ప్రజల మిద జరిగే ప్రతి దాడిని నేను ఖండిస్తాను . మైనారిటీ ముసుగు లో మత భీభ త్స్యన్ని క్షం మిచను. నాకు తెలియక పోవచ్చు ,తెలుసుకుంటాను ,తప్పులేదు . తెలియక పోవటం పెద్ద నేరమేమి కాదు .నేను నిరంతర విద్యార్దిని .

  9. chandolu chandrasekhar
    April 26, 2016 at 7:25 am
    హరి గారు ,మార్క్ ఫెయిల్ ఐ , బ్రహం గారి కాల జ్ఞానం నిజం అయింది , అంటే మీరు ,K BR ఎంత మేధావులో సారంగ ప్రేక్షకులకు మీ మేధా ఏపాటిదో అర్ద్ద మైతుంది .
    HARIBABU
    “ఉత్పత్తి శక్తులు” అనే మాట ఎత్తుకున్నారు.ఆ పదమూ,దాని వాడుకా ఏ భావజాలానికి సంబంధించినవో అందరికీ తెలుసు!అంత భీకరంగా పురాణపాత్రల్ని పెళ్ళాల్ని జూదంలో పణంగా పెట్టేవాళ్ళు,ఏ ఉత్పత్తి శక్తులకి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారో చెప్పండి అని నిలదీస్తున్నారు.తీరా మీరు వాడిన మాటలకి సంబంధించిన ప్రశ్నలు అడిగితే నేను జాతస్య హిందువుని అనటంలో మీ పాండిత్యం ఎంతటిదో ఎప్పటిదాకానో ఎందుకు ఇప్పుడే నిరూపించుకున్నారు.మీరు వాడిన మాటకి అర్ధమే తెలియదు,దాని గురించి ప్రశ్న అడిగితే “నేను కమ్యూనిష్టుని కాదు,జాతస్య హిందువుని” అని తప్పించుకుంటున్న మీకు పైనుంచి మొదలుకుని మీరు భాస్కర్ గారిని అడిగిన ప్రశ్నలు అడిగే పాటి పాండిత్యం ఉందా?మీరు మాట్లాడే మాటని గురించి ప్రశ్నలు అడిగితే ముస్లిం,క్రిస్టియానిటీ అంటూ ఆకుకి పోకకి అందని సమాధానాలు చెప్తారేంటి?

    మెరు మాట్లాడుతున్న మాటలకే మీకు అర్ధం తెలియదు,మరి హిందూ పురాణాల గురించి ఎందుకో అంత భీబత్సప్రదర్శన చేస్తున్నారు?హిందువులు తేరగా దొరికారు కాబోలు ” ఉత్పత్తి శక్తులు ” అనే మాట వినగానే దడుచుకుని నోరు మూసుకుంటారను అనుకున్నారేమో?నేను వేసిన నాలుగు ప్రశ్నలూ మార్క్సిజం సిద్ధాంతంలొని అతి ముఖ్యమైన నాలుగు సూత్రీకరణలని గురించిన అత్యంత మౌలికమైన ప్రశ్నలు.మీకు గానీ ఇక్కడ ఇంకెవరికయినా కమ్యునిష్టు సిద్ధాంతంతో ఏమాత్రం పరిచయం ఉన్నా నాకు కమ్యునిజం గురించి ఎంతో కొంత తెలుసుననే విషయం స్పష్తమవుతుంది.
    ఒక గ్రీకు సాహితీ రూపంతో అర్జున విషాదయోగం పోలికనే భరించలేని మీరు జాతస్య హిందువు అని చ్హెప్పుకుంటే నమ్మటానికి ఇక్కడెవరూ చెవుల్లో పూలు పెట్టుకోలేదు.విద్యార్ధి లక్షణమే మీలో ఉంటే మీ ప్రశ్నల్లో అంత అహంకారం ఉండేది కాదు.
    మీకు తెలియని దాని గురించి అతిగా రెచ్చిపోయి నోరు పారేసుకోవద్దు. ముఖ్యంగా ఒక మాట వాడబోయేముందు ఎవరయినా డౌట్లు అడిగితే చెప్పగైగే పాండిత్యం ఉంటేనే వాడండి,లేకపోతే ఇలాగే చిరుగుతుంది!

మీ మాటలు

*