కన్నపేగు

GNK Varma

సాయంత్రం జోరుగా వాన పడింది.చెట్ల కొమ్మల మధ్య ఆకుల మీద పడ్డ వర్షపు చినుకులు, ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. వాన జోరుగా కురవడంతో వాతావరణం చల్లబడింది.

అప్పుడే ఆఫీసులో విధులు ముగించుకుని ఇంటికి చేరిన పురుషోత్తమ రావు, గేటుతీసి లోనికి అడుగుపెడుతూనే “యశోదా.. బయట బాగా చలిగా ఉందోయ్..పైగా వర్షంలో తడిసొచ్చాను. నీచేత కాస్త వేడి వేడి మిర్చీలు వేయించవోయ్..” అంటూ భార్య యశోదకు ఆర్డర్ చేసాడు.

వంటింట్లో ఉన్న యశోద నుంచి ఏ స్పందనా రాలేదు. “కనీసం నీ చేత ఏ టీ నో, కాఫీనో పెట్టివ్వవోయ్..గొంతులో పోసుకున్టే కాస్త చలైనా తగ్గుతుంది..” ఈసారి కాస్త అభ్యర్థనగా అడిగాడు. అయినా యశోదా నుంచి ఎలాంటి స్పందనా లేకపోయేసరికి, యశోద ఎందుకో తన మీద కోపంగా ఉన్నట్టు అర్థమైంది పురుషోత్తమ రావుకి.

ఏమైందో తెలుసుకునే ప్రయత్నంలో, నెమ్మదిగా కిచెన్ లోకి అడుగు పెడుతూనే..”త్వరగా రెడీ అవవోయ్.. సినిమాకెళ్దాం..” అన్నాడు పురుషోత్తం. “ఆ.. వెళ్తారు..వెళ్తారు.. ఒఠ్ఠి సిన్మాలకేంటి, మీరు ఎక్కడికైనా వెళ్తారు. మీలో ఆ ఉడుకు రక్తం కావాలసిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువ పోసినట్టున్నాడు ఆ దేవుడు. అందుకే మీరిలా వేళా పాళా లేకుండా.. ఇంకా యువకుడిలాగే ఫీలవుతున్నారు.” మొదటిసారి నోరు తెరచి ఉక్రోషంగా అన్నది యశోద.

ఆ మాటలకు నవ్వుతూ దగ్గరికి రాబోయాడు పురుషోత్తం. యశోద వెంటనే గిర్రున వెనక్కి తిరిగి కిటికీలోంచి బయటకు చూస్తోంది. తనకు దగ్గరగా వచ్చిన పురుషోత్తం కూడా ఏమిటా అని కిటికీలోంచి తొంగి చూసాడు.

బయట పచ్చని చెట్టు కొమ్మల మధ్య ఒక పక్షి గూడు కట్టింది. అందులో దాని పిల్లలు కూడా ఉన్నాయి. ఆ తల్లి పక్షి దాని పిల్లల నోట్లో ఒక్కో గింజ ఎక్కన్నుంచో ఏరుకొచ్చి వేస్తోంది. చాలా ఆహ్లాదకరంగా ఉందా దృశ్యం. “ఎంత సేపు చూస్తావోయ్..? కాస్త నన్ను కూడ పట్టించుకో..” అంటూ యశోద కళ్ళ మీద వెనక నుండి చేతులు పెట్టి తనవైపుకు తిప్పుకోబోయాడు. ఆశ్చర్యంగా పురుషోత్తం చేతులు తడయ్యాయి..!!

“ఏయ్ పిచ్చి పిల్లా.. ఏడుస్తున్నావా..? అయినా నీకిప్పుడు కన్నీరు పెట్టుకోవాల్సినంత కష్టం ఏం వచ్చిందని ఏడుస్తున్నావ్..?” అనూనయిస్తూ అడిగాడు పురుషోత్తమ రావు. “ఇంకా ఏం కష్టం రావాలి..? ఇప్పుడు పడుతున్న బాధ చాలదా..??” గొంతులో దుఖం సుడులు తిరుగుతుండగా అంది యశోద. “నువ్విప్పుడు ఏం కష్టపడిపోతున్నావో కాస్త అర్థమయ్యేట్టు చెప్పు..” అన్నాడు. “ఇంకా ఎలా చెప్పాలి..? ఏం చెప్పాలి మీకు..? పిల్లల్ని కని కూడా పిల్లల్లేనట్టు గొడ్రాలులా బతుకుతున్నానని చెప్పాలా..??”

Kadha-Saranga-2-300x268“ఇంతకీ ఏం మాట్లాడుతున్నావ్ నువ్..?

“”అవునండీ.. తొమ్మిది నెలలు, వాళ్లను కడుపులో మోసి, పురిటి నొప్పుల బాధను అనుభవిస్తూ వాళ్ళని కని, అల్లారు ముద్దుగా వాళ్లను పెంచుకుంది, వాళ్ళిలా చదువుల పేరుతో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే ఇలా పిల్లలు లేని గొడ్రాలులా జీవించడానికేనా…?”

“యశోదా.. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నీకు..? ఇన్ని రోజులూ లేని పిల్లల మీద బెంగ ఇప్పుడెందుకొచ్చింది..?”

“సాధారణంగా మనిషి హృదయం తనకు నచ్చని విషయాల పట్ల రెండు విధాలుగా స్పందిస్తుంది. మొదటిది తనకు నచ్చని విషయాన్ని ఎలాగోలా అలవాటు చేసుకోవడం లేదా రెండోది దాన్ని ప్రతిఘటించడం. ఇన్ని రోజులూ నాకు నా పిల్లలు దూరమవుతున్నారన్న నాకు నచ్చని విషయాన్ని అలవాటు చేసుకోడానికి ప్రయత్నించాను. కానీ ఇక అలవాటు చేసుకునే శక్తి, ఓపికా నాలో లేవు. అందుకే ఇలా ప్రతిఘటిస్తున్నా.. చూడండి.. ఆ పక్షి  తన పిల్లల కోసం ఎంత అందమైన గూడు కట్టిందో.. తాను సంపాదించిన ఒక్క గింజైనా సరే, తన బిడ్డ నోటికి ఎలా అందిస్తుందో..? అలా తన పిల్లలకు ప్రేమతో తినిపిస్తూ ఆ తల్లి పొందే ఆనందం మీ మగాళ్ళకు ఎన్నటికీ అర్థం కాదు. ఆ పక్షి ఒక మూగ ప్రాణి, అలాంటిది అదే తన పిల్లలపై అంతటి అవ్యాజమైన ప్రేమను చూపిస్తుంటే, మనం మనుషులమండీ.. మరి మనం మన పిల్లల మీద ఇంకెంత ప్రేమ కురిపించాలి..?” యశోద కంటి నుండి అశ్రుధార పాయలు పాయలుగా కారుతోంది.
“నువ్వే అన్నావ్ గా.. ఆ తల్లి పక్షి తన పిల్లల మీద విపరీతమైన ప్రేమను పెంచుకుదని.., రేప్పొద్దున ఆ పిల్ల పక్షికి రెక్కలొచ్చాక, ఆ తల్లి పక్షిని విడిచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగొస్తుందో రాదో కూడా తెలియదు. ఆ విషయం ఆ తల్లి పక్షికి కూడా తెలుసు.  మరి తన బిడ్డ మళ్ళీ తిరిగి రాదని తెలిసిన ఆ తల్లి పక్షి నీలాగే కంట తడి పెడుతుందా చెప్పు..?: అన్నాడు కూల్ గా పురుషోత్తం. “ఎలాగూ మళ్ళీ తిరిగి రాదని ఆ తల్లి వాటినేం వదిలేయడం లేదు కదా..?” అంది యశోద. పురుషోత్తం ఏమీ అనలేక మౌనంగా ఉన్నాడు.

అయినా మనకిప్పుడు ఏం తక్కువైందని చదువుల పేరుతో వాళ్ళనిలా ఎక్కడో దూరంగా పారేశారు..?” అడిగింది యశోద. “మనకిప్పుడు ఏం తక్కువైందని కాదోయ్.. రేప్పొద్దున వాళ్ళకేమీ తక్కువ కాకూడదని..” బదులిచ్చాడు పురుషోత్తం.
“అంటే..?”,
“అంటే ఈ రోజు మన దగ్గర పేరు, ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను సంపాదించిన దాన్ని బట్టి నాకు గౌరవమిస్తుంది ఈ సమాజం”.

“మరి మనకుంటే మన పిల్లలకున్నట్టేగా.. మన తర్వాత ఇవన్నీ వాళ్ళకు గాక ఇంకెవ్వరికి చెందుతాయ్..??” అడిగింది యశోద. “అది కాదోయ్.. మనవన్నీ మన పిల్లలవే కాదనను. కానీ తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి కదా…?”

“ఓహో సంపాదన కోసమా…?? అయితే ఇవన్నీ సంపాదించడానికి మీరు మీ వాళ్ళకు, ఎన్నేళ్ళు దూరమయ్యారు..? అసలు మీరెప్పుడైనా మీ వాళ్ళను వదిలిపెట్టి ఉన్నారా…?? మరిప్పుడు మన పిల్లల విషయంలో మాత్రం ఎందుకిలా..?” మళ్ళీ ప్రశ్నించింది యశోద.

పురుశోత్తం “యశోదా.. అప్పటి మన పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు నాలుగు ఉద్యోగాలకు ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు ఒక్క ఉద్యోగానికే నలభై మంది ఉంటున్నారు. ప్రపంచం మొత్తం పోటీ ప్రపంచంగా మారిపోతుంది. దేర్ ఈజ్ ఎవ్రీవేర్ ఎ హెవీ కాంపిటీషన్ నౌ…” నువ్వు కూడా చదువుకున్నావు కదా..నీకు తెలియందేముంది..??” బదులిచ్చాడు పురుషోత్తం. “మీరెన్నయినా చెప్పండి. అసలు మన పిల్లలకి మన పక్కింట్లో ఎవరుంటున్నారో, ఎదురింట్లో ఎవరున్నారో తెలుసా..? అదంతా ఎందుకు..? మీకు అయిదుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెల్లు కదా..? పోనీ వాళ్ళ పేర్లయినా తెలుసా వీళ్ళకు..? ఇదిలాగే కొనసాగితే రేప్పొద్దున మనకేదైనా ఆపదొస్తే మనకు సాయం చేయడానికి కాదు కదా.. కనీసం మనల్ని పరామర్శించడానికైనా ఎవరైనా వస్తారా..??” అడిగింది యశోద.

“అలా మనకేదయినా ఆపద వచ్చినపుడు మనం మరొకరి సాయం కోసం చేతులు చాచకుండా.. మనకు వాళ్ళూ వీళ్ళూ ఎందుకు..?? మనకు మన పిల్లలున్నారు. మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనల్ని సాకే శక్తి వాళ్ళకి ఉంటుంది.” అన్నాడు పురుషోత్తం.

“నేను బంధాలు, బాందవ్యాల గురించి మాట్లాడుతుంటే మీరు మళ్ళీ డబ్బు గురించి మాట్లాడుతున్నారు.” అరిచింది యశోద.

పురుషోత్తం చాలా కూల్ గా “ఓసి పిచ్చిదానా.. ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఈ బంధం, బాంధవ్యం, అనుబంధాలకు విలువలు లేవు. తీపి ఉన్నచోటికే చీమలు చేరుతాయి. మనం ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిన పనిలేదు.”

“అంటే మనం మన పిల్లలకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, మానవ విలువలు నేర్పుతున్నామా లేక కేవలం డబ్బు ఎలా సంపాదించాలో నేర్పుతున్నామా..?” అడిగింది యశోద.

3429_3570562079439_642447821_n

చిత్రం: సత్యశ్రీనివాస్

“అంటే… మనం వాళ్ళకు ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి సాయం కోసం ఎదురు చూడకుండా ఎలా బతకాలో నేర్పుతున్నాం. అలా బతికితేనే సమాజం లో మనకూ, మన పిల్లలకు గౌరవ మర్యాదలు దక్కుతాయి..” చెప్పాడు పురుషోత్తం.

“మీరెన్నయినా చెప్పండి. మీ మాటలతో నేనేకీభవించను. పెద్దోన్ని మెడిసిన్ పేరుతో విజయవాడలో, చిన్నోన్ని ఇంజనీరింగ్ పేరుతో విశాఖలో పడేశారు. మనమేమో ఎక్కడో చివరాఖరున ఉన్నాం. ఏం ? ఇక్కడ వాళ్ల చదువులకు తగ్గ కాలేజీలు లేవా..?? “మళ్ళీ ప్రశ్నాస్రం సంధించింది యశోద. ఈసారి పురుషోత్తం నోరెత్తలేదు.

“నాకేమో వాళ్ళతో రోజుకి కనీసం ఒక్కసారైనా మాట్లాడాలని ఉంటుంది. కానీ అదేం దురదృష్టమో వాళ్లకు మాత్రం నాతో మాట్లాడే తీరికుండదు. పెద్దోడికి ఫోన్ చేస్తే మెడికల్ క్లాస్ లు ఉన్నాయమ్మా అంటాడు. చిన్నోడికి చేస్తే లాబ్,లేదా ప్రాజెక్ట్ వర్క్ అంటాడు. వాళ్ళకు వాళ్ళను కని, పెంచిన అమ్మకంటే వాళ్ళ క్లాసులు, లాబ్ వర్కులే ముఖ్యమా..?? వాళ్ళు కూడా మీకే ఎప్పుడూమీకే ఫోన్ చేస్తుంటారు. మీరు, మీరు అంతా మాట్లాడుకున్నాక, నాతో మాట్లాడకపోతే నేను అలిగి ఏడుస్తానేమోనని, చివరగా ఫోన్ నాకిమ్మని మీకు సిఫార్సు చేస్తారు. ఆ అల్పానందంలో నేనేదో మాట్లాడాలనుకునేలోపే, వాళ్ళు ‘అమ్మా తిన్నావా..ఆరోగ్యం జాగ్రత్తా అంటూ నాకే జాగ్రత్తలు చెప్తారు. అప్పుడనిపిస్తుంది ‘ఇంతకీ నేను వీళ్లని కన్నానా, లేక వీళ్ళే నన్ను కన్నారా..?” అని. ఈ మాటలంటున్నపుడు యశోద కళ్ళలో కన్నీటి ధార, గొంతులో జీర కనిపించాయి పురుషోత్తం కి.

పురుషోత్తం కి ఏం మాట్లాడాలో తోచక అలాగే నిల్చున్నాడు. మళ్ళీ యశోదనే “వాళ్ళు పండగ సెలవులకని పండగ ముందు రోజో, లేక పండగ రోజో ఇంటికొస్తారు. హమ్మయ్య కనీసం ఇప్పుడైనా నేను నా పిల్లలతో మనసారా మాట్లాడొచ్చు అనుకునేలోగానే వాళ్ళు లగేజ్ ఇంట్లో పడేసి, “అమ్మా ఫ్రెండ్స్ ని కలిసి చాలా రోజులైంది, వాళ్ళను ఒకసారి కలిసొస్తా..” అంటూ పెద్దాడూ, “అమ్మా ఫ్రెండ్స్ తో గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకోడానికి వెళ్తున్నా..” అని చిన్నోడు, నేనేదో అనేలోపే వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళ పక్కన కూర్చుని, నేను చేసిన పిండి వంటలు, వాళ్ళకోసం స్పెషల్ గా చేసిన వెరైటీ వంటకాలు. వాళ్ళకు నా చేత తినిపిస్తూ, వాళ్ళు చెప్పే ముచ్చట్లన్నీ వినాలన్న ఆశ నాలో చప్పున చల్లారిపోతుంది. పోనీ రాత్రయినా వస్తారు కదా అనుకుంటే, ఏ రాత్రి తొమ్మిదింటికో పదింటికో వస్తారు. భోజనం కలిపి వాళ్ల రూం కి తీసుకెళ్తే, “సారీ మాం.. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నాం. అక్కడే తినేసి వచ్చాను. నువ్వెళ్ళి తినేసి పడుకో..: అని ఓ ఉచిత సలహా ఇస్తారు. అప్పుడిక చేసేదేం లేక బాగా అలసి పోయారు కదా.. పండగ హడావిడి అంతా అయ్యాక మాట్లాడొచ్చులే అనుకుంటే.. పండగ ఇంకా పూర్తవ్వక ముందే “అమ్మ వెళ్తున్నామంటూ” నానా హైరానా చేస్తారు. “అప్పుడేనా.. ఇంకో రెండ్రోజులుండండ్రా ” అంటే క్లాసులు మిస్సవుతాయమ్మా అంటూ దాటేస్తారు. ఇంక నేను వాళ్ళతో మనసారా మాట్లాడేదెప్పుడు..?” అంటూ యశో జవాబుల్లేని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. పురుషోత్తం మౌనంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి యశోద పిల్లల మీద బెంగతో కనీసం వాళ్ళ ఫోటోలు చూసైనా సంతృప్తి పడాలనుకుని, ఫోటో ఆల్బం తీసి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోపై సుతారంగా తడిమింది.

పురుషోత్తమ రావు తన కన్న బిడ్డల్ని మర్చిపోలేక, వాళ్ళు స్కూల్లో సాధించిన బహుమతులూ, కప్పులను ఆత్మీయంగా ముద్దు పెట్టుకున్నాడు.

ఆ ఇద్దరి కళ్ళలోనూ ఎన్నటికీ ఇంకిపోని ఓ మహా సముద్రం దాగుంది.

-జి.ఎన్.కె.వర్మ

***

పరిచయం:

పూర్తి పేరు నవీన్ కుమార్ గదరి .  జన్మ స్థలం వరంగల్ జిల్లాలోని, ఓ మారు మూల గ్రామం. ఇంటర్మీడియట్ వరకు మా ఊళ్ళో, చుట్టు పక్కల ఊళ్ళలో చదువుకున్నాను. డిగ్రీ కి వచ్చేసరికి దగ్గరలోని వేరే పట్టణానికి మారాల్సి వచ్చింది. డిగ్రీ పూర్తయిన తర్వాత, ఐ సి ఐ సి ఐ బాంక్ లో ఉద్యోగ రీత్యా విశాఖలో ఒక సంవత్సర కాలం పాటు ఉన్నాను. తరువాత, మళ్ళీ పై చదువులు చదవాలని కోరిక నాలో ఇంకా చావక CA చదువు కోసమని, చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్ళీ హైదారాబాద్ కి వచ్చేసాను. ప్రస్తుతం CA చదువుతూ హైదరాబాద్ లో ఉంటున్నాను.