బాబన్న ప్రశ్న

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

–      సుధా కిరణ్

~

Sudha Kiran_Photo

ఎందుకోసమీ కవిత్వం?

విద్వేషం కసితో  కత్తిదూసిన ఆ రాత్రి కోసంఆ రోజు కోసం కాకుంటే

వీధి మలుపున హృదయం గాయపడిన మనిషి

చరమ ఘడియలకి చేరువౌతున్న

మలిసంధ్య క్షణాల కోసం కాకుంటే

ఎందుకోసమీ కవిత్వం?

 

రాత్రిఅన్నింటికీ పైన ఆకాశం

రాత్రిఆకాశంలోఅనంతకోటి నక్షత్రాలు

………

అదిగోఅక్కడ నెత్తురోడుతున్న కళ్ళులేని మనిషి

      పాబ్లో నెరూడా

1

‘ఎవరు వాళ్ళు?

ఎవరు వాళ్ళు ?

ఎవరి కోవకు చెందినోళ్ళు?

ఎవరికోసం వచ్చినోళ్ళు?’

కంజిరపై కలవరించే కాలం కవాతు

‘కళ్ళులేని మనిషి’ కంటిచూపు పాట.

వసంత మేఘమై, మెరుపు నినాదమై

చీకటి ఆకాశాన్ని వెలిగించిన

కబోది కలల కాగడా పాట.

2

ఒక ఆకాశం
ఎర్రజెండాయై ఒదిగి

ఒక భూమి
కన్నీటి గోళమై ఎగసి

ఒక నక్షత్రం
అగ్నికీలయై రగిలి

ఒక మేఘం
పెను విషాదమై పొగిలి

ఏం చూడగలడు కళ్ళులేని మనిషి?

ఎక్కుపెట్టిన ఆయుధంలో
ఎర్రని ద్వేషాన్నా?

చుట్టుముట్టిన చావులో
నల్లని చీకటినా?

ఏం చూస్తాడు కళ్ళులేని
మనిషి చరమ క్షణాలలో?

పాట  పెఠిల్లున పగిలిన
మౌనాన్నా?
చూపు చిటుక్కున చిట్లిన
నెత్తుటి దృశ్యాన్నా?

ఏం చూస్తారు కళ్ళున్న
కలలులేని మనుషులు?

కమురు వాసనలో కాలిపోయిన కలలనా?
బొట్టు బొట్టుగా నెత్తురు యింకిన
ఇసుక రేణువులలో ఎండిపోయిన వేసవి నదినా?

3

అవును, మనవాళ్ళే
మనకోవకు చెందినోళ్ళే, మనకోసం వచ్చినోళ్ళే!

కత్తి మనది
కత్తి వాదరకు తెగిపడిన కంఠమూ మనదే

నిప్పురవ్వ మనది
అస్థికలు మిగలని చితాభస్మమూ మనదే

కాలిబాట మనది
దారితప్పిన బాటసారులమూ మనమే

4

శవపేటికలతో ఖననం కాని
జీవిత రహస్యం

ఎగసిన చితిమంటలతో
దహనం కాని సత్యం

నెత్తుటి నదిలో మరుగుపడని జ్ఞాపకం .

తెగిపడిన గొంతులో ఆగిపోని పాట

5

కళ్ళులేని కలల మనిషి
ప్రశ్నిస్తాడు.

“అనంతాకాశంలో

కనిపించీ కనిపించని

అంతిమ నక్షత్రాలనెవరు చూస్తారు?

అమరత్వపు అరుణ పతాకపు రెపరెపలలో

భ్రాతృ హననాలని గుర్తు చేసుకునేదెవరు?

కలల వెలుగులో

ఒకానొక చీకటి రాత్రి పీడకలలాంటి

చావులనెవరు నెమరు వేసుకుంటారు?

‘నలుగురు కూచొని నవ్వే వేళల’

మాపేరొకపరి తలచేదెవరు?”

కళ్ళులేని కలల మనిషి ప్రశ్నిస్తాడు

“మా జ్ఞాపకం

తలుపులు శాశ్వతంగా మూసివేసిన

చీకటిగది అవుతుందా?”

*

babanna

  1. బాబన్న (తలసిల నాగభూషణం)వరంగల్ జిల్లా సిపిఐ(ఎం.ఎల్) విమోచన విప్లవ గ్రూపు రైతు కూలీ సంఘం నాయకుడు. కళ్ళు లేకున్నా అన్ని వుద్యమాలలో చురుకుగా పాల్గొనేవాడు. లెక్కలేనన్ని సార్లు అరెస్టులు, చిత్రహింసలకి గురయ్యాడు. ‘గుడ్డివాడా నిన్ను కాల్చిపారేస్తాం’ ‘అడివిలో వదిలి వేస్తా’మని పోలీసులు చాలాసార్లు బెదిరించేవాళ్ళు. విప్లవ గ్రూపుల చీలిక తగాదాలలో, ఏప్రిల్ 26, 1990 న ఖమ్మం  పగిడేరు దగ్గర బాబన్నలక్ష్మణ్భాస్కర్ఘంటసాల నాగేశ్వర రావులను మరొక గ్రూపు దళం కాల్చి చంపింది. బాబన్నని ఇసుకలో తలదూర్చి, తొక్కి, తర్వాత అత్యంత క్రూరంగా కాల్చి చంపారు. తనని చంపుతామని ఆ గ్రూపువాళ్ళు ప్రకటించిన తర్వాత, బాబన్న చావుకు మానసికంగా సిద్ధ పడ్డాడు. ‘రాజ్యం చేతిలో చనిపోయిన వాళ్ళని అమర వీరులుగా ఎప్పుడూ గుర్తు చేసుకుంటారు. చీలిక ఘర్షణలలో చనిపోయే మాలాంటి వాళ్ళ సంగతేమిటి? ఇవాళ చీలిక ఘర్షణలలో మేం చనిపోతే, రేపు తిరిగి అందరూ ఐక్యమయ్యాక మమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా తలచుకుంటారా?’’ అని బాబన్న తన సహచరులని ప్రశ్నించాడు. తెలంగాణా, ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలలో వివిధ విప్లవ సంస్థల ఘర్షణలలో కనీసం వందమందికి పైగా చనిపోయి వుంటారు. ఘర్షణ పడి, పరస్పర హననాలకి పాల్పడిన తర్వాత, కొన్ని సంస్థలు తిరిగి ఐక్యం అయ్యాయి కూడా. బాబన్న ప్రశ్న విప్లవకారులందరూ వేసుకోవాల్సిన ప్రశ్న.
  2. బాబన్న పాటలు పాడేవాడు.‘ఎవరు వాళ్ళు?/ఎవరు వాళ్ళు ?/ఎవరి కోవకు చెందినోళ్ళు?/ఎవరికోసం వచ్చినోళ్ళు?’ అనే జనసేన పాటని బాబన్న అన్ని సభలలో, సమావేశాలలో పాడేవాడు. 

విస్మృతి

సుధా కిరణ్

 

జ్ఞాపకాలకీ, విస్మృతికీ మధ్య

దిగంత రేఖలా చెరిగిపోయిన

సన్నటి కన్నీటి పొరలాంటి గీత

జ్ఞాపకాలు

ఒక్కొక్కటిగా ఆకులవలె రాలిపోతూ

ఎన్నటికీ తిరిగి చిగురించని

శిథిల శిశిరపు కరకు జాడలు

జ్ఞాపకాలు..

చినుకులు చినుకులుగా

నిస్సహాయంగా నేలకు జారిపోగా

గాలి ముందు దీపంలా దీనంగా

మోకరిల్లిన ముదిమి మేఘం

అలలు అలలుగా విస్మృతి విస్తరించిన సముద్రమొకటి

తలపుల కెరటాలు తరలిపోగా దిగులు దీపస్తంభంలా నిలిచిన కడపటి తీరమొకటి..

 

జ్ఞాపకాల వెలుతురు

కొద్ది కొద్దిగా కుదించుకుపోతుందో

విస్మృతి చీకటి

మెలమెల్లగా విస్తరిస్తుందో

జ్ఞాపకాలు

జడివానలో కొట్టుకుపోతాయో

జ్ఞాపకాలు..

కరిగి, యిగిరి, ఆవిరై, ఎగిరి పోతాయో

మనుషులు, ముఖాలు, పేర్లు, మాటలు

జ్ఞాపకాలతో తెగని పెనుగులాట

చిరునవ్వులు, కన్నీళ్లు, గాయాలు, ఘటనలు

గుర్తుకురాని తనంతో ఎడతెగని యుద్ధం

చీకటిలో కదలాడే నిశ్శబ్దపు నీడలకై వెదుకులాట

వెలుగులో  కనిపించని నక్షత్రాలకై శూన్యాకాశంలో అన్వేషణ

వూడలుదిగిన మర్రిచెట్టులాంటి రాత్రి ఋతువులు లేని కాలమొకటి

కాలం కాటేసిన తలపుల వాకిలిలో తలుపులు మూసుకుపోయిన మలిసంధ్య జీవితమొకటి…

 

(ఓవెన్ డార్నెల్ కవిత ‘యాన్ అల్జీమర్స్ రిక్వెస్ట్’ కి కృతజ్ఞతలతో..)

*

Sudha Kiran_Photo

ఆకురాలు కాలం

                  సుధా కిరణ్

  • Sudha Kiran_Photo

 

 

 

 

ప్రలోభమై వచ్చిందో

ప్రహసనమై వచ్చిందో

అబద్ధపు చిరునవ్వై వచ్చిందో

ఆత్మీయ స్పర్శలేని కరచాలనమై వచ్చిందో

ఆకురాలు కాలం వచ్చింది

 

శిధిలాల మధ్య ఆకాశ హర్మ్యపు కలలా నేలకు దిగిందో

చితిమంటల కన్నీటిపై, సమాధుల పై నడుచుకుంటూ వచ్చిందో

చిగురుటాకులను చిదిమివేస్తూ, పత్రహరితాన్ని మెలమెల్లగా కబళిస్తూ వచ్చిందో

చెట్లని కుదిపి ఆకులని రాలుస్తూ, సుడిగాలిలా వడివడిగా పరుగులు పెడుతూ వచ్చిందో

ఆకురాలు కాలం వచ్చేసింది

 

రక్తసిక్తమైన చిమ్మచీకటి రాత్రిలా వచ్చిందో

రహస్యంగా పొంచి, చుట్టుముట్టిన వేకువజామున వచ్చిందో

ద్వేషపు తూటాలు కసితో పొట్టనబెట్టుకున్న పట్టపగలు వచ్చిందో

నెత్తురుకక్కుతూ, నిస్సహాయంగా వొరిగిపోయిన సంధ్య వేళలో వచ్చిందో

ఆకురాలు కాలం రానే వచ్చింది

 

సంకెళ్ళు తగిలించిన చేతులతో వచ్చిందో

శవాల చేతులలో దొరికిన ఆయుధమై వచ్చిందో

చెల్లాచెదురుగా పడిన కూలీల కళేబరాలతో వచ్చిందో

అడవిలో నరికిన మానులపై అంకెల సాక్ష్యమై వచ్చిందో

గుర్తుపట్టే లోపులోనే ఆకురాలు కాలం వచ్చేసింది

 

(ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత ‘ఏక్ దిన్ యూఁ ఖిజా ఆ గయీ’ కి కృతజ్ఞతలతో…ఆ కవితకి తెలుగు అనువాదం కూడా ఇక్కడ..)

 

 మూలం: ఫైజ్ అహ్మద్ ఫైజ్

అనువాదం: సుధా కిరణ్

 

ఒకానొక రోజున ఆకురాలు కాలం రానే వచ్చింది

పొరలుపొరలుగా బెరడు సైతం వూడిపోయి

నల్లని మోడులన్నీ నగ్నంగా వరుసలో నిలబడ్డాయి

రాలిపోయిన పసుపుపచ్చని పండుటాకుల హృదయాలు

దారిపొడవునా పరుచుకున్నాయి

రాలిన ఆకులని కాలరాసి  చిదిమి ఛిద్రం చేసినా

గొంతెత్తి అడిగే వాళ్ళు లేరు

 

కొమ్మలపై కలల్ని గానం చేసే పక్షుల

గొంతులకి వురితాడు బిగించి

పాటలని ప్రవాసంలోకి తరిమి వేశారు

రెక్కలు విరిగిన పక్షులన్నీ తమకుతామే నేలకూలాయి

వేటగాడు యింకా విల్లు ఎక్కుపెట్టనే లేదు

 

ప్రభూ! వసంతుడా, కనికరించు

పునర్జీవించనీ మరణించిన యీ దేహాలని

తిరిగి ప్రసరించనీ గడ్డకట్టిన గుండెలలో రక్తాన్ని

చిగురించనీ వొక మోడువారిన  చెట్టుని

గొంతెత్తి గానం చేయనీ వొక పక్షిని

(మూలం: ఏక్ దిన్ యూఁ ఖిజా ఆ గయీ)

 

 

 

” యిన్నాళ్ళ బ్రతుకే ఒక బోనస్” : ఆ పోరాట వీరుడి ఆఖరి వాక్యం!

పోరాటాల  మల్లారెడ్డి

పోరాటాల మల్లారెడ్డి

ఆగస్టు 23 (2011) వుదయాన  ఫోన్, మిత్రుడు కుంబాల మల్లారెడ్డి యిక లేడని. . క్యాన్సర్ వ్యాధితో యేడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం యిక ముగిసింది. అంతకు రెండు రోజుల ముందే పరామర్శించడానికి వెళ్లి, దిగులు పడుతూనే ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తే, ‘ఎప్పుడో పోవాల్సిన ప్రాణం కదా, యిన్నాళ్ళ బ్రతుకే ఒక బోనస్’ అని జవాబు చెప్పిన మనిషి.

ఏమని చెప్పుకోవాలి మల్లారెడ్డి గురించి? చీకటిలో కనిపించని నీడల గురించి, వెలుతురు మెరుపులలో విస్మృతమయే దీపాల గురించి, మాటల సవ్వడిలో వినిపించని మౌనం గురించి, సుదీర్ఘ పయనంలో గుర్తించని దురాల గురించి, వుత్సవంలో వెలుగు చూడని విషాదాల గురించి..ఎప్పుడో రాండాల్ స్వింగ్లర్ రాసాడు కదా..

వీధులన్నీ విద్యుత్తేజంతో వురకలేస్తూ

కరతాళ ధ్వనులతో మార్మోగుతున్నపుడు

కవాతు చేసే మన వూహల లయతోనే

భేరీలు మోగుతున్నపుడు

గొంతెత్తి పాడడం తేలిక ..

జనసమూహం జాగృతమై

మనం రుజువు చేయదల్చుకున్నదాన్నే కోరుకుంటున్నపుడు

కదంతొక్కేలా మాట్లాడడమూ తేలికే

కన్నుపొడిచినా కనిపించని కటిక చీకటిలో

నిప్పురవ్వని దావానలంగా విస్తరించే వొడుపుతో

వెలుగువైపు నడిపించడం అంత తేలిక కాదు

ఎవరు చూడనిదీ, గుర్తించనిదే అసలైన పని

మల్లారెడ్డి గురించి మాట్లాడటమంటే ఎవరు చూడని, గుర్తించని పనుల గురిచి చెప్పుకోవడమే.

ఎమర్జెన్సీ అనంతర కాలం కరీంనగర్ జిల్లాలో భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాల వెల్లువ పెల్లుబికిన కాలం. సిరిసిల్ల, జగిత్యాల జైత్రయాత్రల కాలం. ‘దొరల కాలికింది ధూళి ఎగిసి వాళ్ళ కళ్ళలో పడిన చోటు ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటించిన కాలం. రైతాంగ పోరాటాలు అటు సామాజిక ఆచరణలో, ఇటు సైద్ధాంతిక రంగంలో కొతాచుపునీ, కోణాలని ఆవిష్కరించిన కాలం. దానితోపాటు ఆ ఉద్యమాల ముందు కొత్త సమస్యలూ ముందుకొచ్చాయి. విశాలమైన పునాదిపై ఐక్యతని నిలబెట్టుకోవడం, ఉద్యమాన్ని సంఘటిత పరచుకోవడం, విస్తృతం చేయడం, భూస్వామ్య వ్యతిరేక ప్రతిఘటనని అభివృద్ధి చేయడం, భూస్వాములకి అనుకూలంగా ప్రభుత్వం అమలు జరుపుతున్న నిర్బంధాన్ని తట్టుకుని నిలబడటం – ఇవి ఆనాడు వుద్యమం ముందుకొచ్చిన సమస్యలు. 1982 లో సిరిసిల్ల, వేములవాడ రైతాంగ పోరాటాలపై ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ప్రచురించిన వ్యాసం ఆనాటికి ప్రభుత్వ నిర్బంధమే కీలకమైన సమస్యగా మారిన విషయాన్ని గుర్తించింది. ఆరోజులలో (రోడ్డు)పదిర గ్రామ సర్పంచిగా, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యువకుడు మల్లారెడ్డి.

1985 తర్వాత, ‘ఆట, పాట, మాట’ అన్నీ బంద్ అయిన కర్కశ, నిరంకుశ పాలన రాజ్యమేలింది. కరీంనగర్ జిల్లా రైతాంగ పోరాటంలో ముందుకొచ్చిన వ్యక్తులు, నాయకులు వుద్యమ విస్తరణ అవసరాల రీత్యా యితర ప్రాంతాలకి తరలడమో, బూటకపు ఎదురుకాల్పుల్లో బలికావడమో జరిగింది. ఆ రోజుల్లో మల్లారెడ్డి యేమయ్యాడో చాలామందికి తెలియదు. ఉవ్వెత్తున వుద్యమాలు యెగిసినప్పుడు మెరిసిన మనుషులు తర్వాతి కాలంలో వొడుదుడుకులు  యెదురైనప్పుడు తెరమరుగు కావడం సహజమే. మల్లారెడ్డి ఆచూకి మాత్రం చాలా మందికి తెలియలేదు. మిత్రులకీ, బంధువులకీ, శత్రువులకీ.

పార్టి రహస్య నిర్మాణంలో అనుసంధానకర్తగా మల్లారెడ్డి నిర్వహించిన బాధ్యతల గురించి యెవరు చెప్పగలరు? అవి అజ్ఞాత జీవితపు అజ్ఞాత వివరాలే కదా. ఒక వ్యక్తి బహు ముఖాలుగా, అనేక పేర్లు వొకే ముఖంగా, పరిచిత ముఖాల మధ్య వొక అపరిచితునిగా, అనామకునిగా నిలిచిన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించగలిగేదెవరు? చిరుద్యోగిగా, చిరువ్యాపారిగా, చిరపరిచిత మిత్రునిగా, చుట్టపుచూపుగా అప్పుడప్పుడూ వచ్చిపోయే బంధువుగా తారసపడే వ్యక్తి రూపాన్ని బట్టి అతను నిర్వహించే బాధ్యతలని యెవరూ వూహించలేరు. కలుసుకోబోయే మనిషిని బట్టి, స్థలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వొక వ్యక్తి యెన్నెన్ని పేర్లు, యెన్నెన్ని రూపాలలో యెదురవుతాడో లెక్కపెట్టిందెవ్వరు? ఎప్పుడు పొంచివుండే ప్రమాదాన్ని అలవోకగా ధిక్కరించిన  నిర్లక్ష్యంతో, అవసరానికి మించి యేమీ మాట్లాడని జాగ్రత్తని మేళవించి అనామకంగా మిగిలిపోవడానికి తాను చూపిన శ్రద్ధ విలక్షణమైనది.

ఉద్యమాలు సమూహపు స్వప్నాల లాంటివి. కొన్ని సార్లు కలలు చెదిరిపోవచ్చు. శత్రువులు చిదిమివేయవచ్చు. లాంగ్ స్టన్ హ్యూస్ వాయిడా పడిన కల గురించి చెబుతాడుకదా,

వాయిదా పడిన కలకి యేమవుతుంది?

ఎండిన ద్రాక్ష పండులా ముడుచుకు పోతుందా?

గాయంలా సలుపుతూ

 స్రవిస్తుందా?

కుళ్ళిన మాంసంలా

గౌలుకంపు కొడుతుందా?

తీయటి పొరలా

పేరుకపోతుందా?

బహుశా వొక దింపుకోలేని బరువులా

వేలాడుతుందా?

లేక పెఠీల్లుమంటూ

పేలిపోతుందా?

కల చెదిరినా లొంగిపో నిరాకరించేమనిషి యేమౌతాడు? మల్లారెడ్డి యేమయ్యాడు? ఏకాకి కాకున్నా మల్లారెడ్డి వొక వొంటరి మనిషి. తనదొక వొంటరి యుద్ధం. తానెంచుకున్న పోరాట రంగంలో పదిమందిని కూడగట్టి న్యాయం కోసం పోరాడాడు. నాయకత్వం కోసం, పేరు కోసం, ప్రాపకం కోసం అర్రులు చాచే కాలంలో తాను ముందుకి రాకుండా, తెరవెనుకే నిలబడి బస్తీ ప్రజలని సంఘటితం చేశాడు. మనసుని వెంటాడే కల చెదిరిన దు:ఖానికి మనిషిని నిలువెల్లా కుంగదీసే క్యాన్సర్ వ్యాధి తోడైతే యెలా వుంటుంది? ఇక్కడ కూడా మల్లారెడ్డి ద్రుడంగా నిలబడ్డాడు. తనవలెనే క్యాన్సర్ వ్యాధి పాలైన మరొక మితృనికి ఆసరాగా నిలబడ్డాడు. ఊరటనిచ్చేందుకు శాయశక్తులా కృషి చేశాడు. జీవితమొక యుద్ధరంగం.. కల చెదిరిన మనిషి వొక అనామక సైనికుడు.. మల్లారెడ్డిని తలచుకోవడమంటే కలల్ని నిలబెట్టుకోవడానికి మనిషి వొంటరిగానూ, సాముహికంగానూ చేయాల్సిన కృషిని బేరీజు వేసుకోవడమే.

ఎక్కడినుంచి వెలుగుతుందో తెలియదు

బయలుదేరి వెళ్లిపోయాక గానీ

గుర్తించని చిరునవ్వు వెలుతురు

మేఘాల చాటున కనిపించని నక్షత్రం

ఎందరికి ఆసరాగా నిలిచిందీ తెలియదు

ఒంటరి యుద్ధంలో గాయపడ్డాకగానీ

వెలుగులోకి రాని రహస్య జీవితం

మౌనంలో ప్రతిధ్వనించే నిశ్సబ్ద నినాదం

ఎప్పుడు ఎవరు నాటారో తెలియదు

తొలకరి జల్లు కురిశాక గానీ

కనిపించని రైతు పాదముద్ర

నాగేటి చాళ్లలో మొలిచిన రహస్యోద్యమ సందేశం

ఎటునుంచి ఎటు వీచిందో తెలియదు

కరచాలనం చేసి మాట్లాడాక గానీ

అనుభవంలోకి రాని సహజ స్నేహ పరిమళం

పంటపొలాల్ని మోసుకొచ్చిన సిరిసిల్ల పైరగాలి

మల్లారెడ్డికి జోహార్లు..

  సుధా కిరణ్