సంగీతం నేర్చుకునే విద్యార్థులకి మాయామాళవ గౌళ, మలహరి రాగాల తర్వాత “వరవీణా మృదు పాణీ”అనే గీతంతో మోహన రాగాన్ని పరిచయం చేస్తారు. వర్ణాల దగ్గరకొచ్చే సరికి పూచి శ్రీనివాసయ్యంగార్ (రామనాథపురం)”నిన్నుకోరి యున్నానుర”అనేవర్ణం చాలా పాప్యులర్ అది తప్పక నేర్పుతారు.
నాకు తెలిసిన వొకటి రెండు క్షేత్రయ్య పదాలూ ఈ రాగం లోనే వుండటం విశేషం
వొకటి “ముందటి వలె నాపై నెనరున్నదా సామి ” ఇది “ఆత్మగౌరవం “సినిమాలో వాడుకున్నారు దీనికి కాంచన నృత్యం రక్తిగా వుంటుంది. రెండవది “మక్కువ దీర్చరా మువ్వ గోపాలా” ఇది కూడా “లేతమనసులు” సినిమాలో వస్తుంది అభినయించినది గీతాంజలి.
నృత్య తారలందరూ అభినయం చేసే నారాయణ తీర్థ తరంగం “బాల గోపాల మా ముగ్థరా కృష్ణ “కూడా వున్నది మోహనలోనే!
ఇక కీర్తనల విషయానికొస్తే త్యాగరాజ స్వామి చాలా కీర్తనలు రాశారు వాటిలో ప్రముఖమయినవి
“నను పాలింపగ నడచి వచ్చితివా
దయరానీ దయరానీ దాశరథీ
మోహనరామా ముఖజిత సోమా
ఎవరురా నిను వినా గతి మాకూ ”
ముత్తు స్వామి దీక్షితర్ కీర్తనలలో “కాదంబరీ ప్రియాయై”
మైసూర్ వాసుదేవాచార్ “రారా రాజీవ లోచనా ”
జి.యన్ .బి. “సదా పాలయ సారసాక్షి “కూడా మోహనలో పేరొందిన కీర్తనలు
సినిమా పాటల గురించి చెప్పాలంటే మోహన రాగం ఆధారంగా యెంతో మంది సంగీత దర్శకులు కొన్ని వందల పాటలు చేశారు అన్నీ చెప్పుకోవడం సాధ్య పడే విషయం కాదు కాబట్టి కొన్ని టిని గుర్తు చేసుకోవచ్చు.
అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి సినిమా పాటలలో రాగాలని నిర్ణయించడం లో కొన్ని కష్టాలున్నాయి. ఈ పాటలలో రాగం లో అన్య స్వరాలొస్తుంటాయి వొకోసారి పల్లవొకరాగంలో చరణం వొక రాగంలో వుండొచ్చు వొకో సారి దగ్గరగా వున్న వేరే రాగఛ్ఛాయలు కలిసిపోయి కనిపించ వచ్చు వుదాహరణకి మోహనకి దగ్గరగా వున్న పహాడీ రాగఛాయలు కొన్ని పాటలలో కనిపించ వచ్చు అదీ సంగతి
ఇప్పుడు యేయే సంగీత దర్శకులు ఈ రాగంలో యెలాంటి పాటలు చేశారో గమనిస్తే మనకు వారి సృజనాత్మకతా ఆ రాగ స్వరూపం అర్థమవుతుంది.
రాగం వొకటే అయినా స్వరాలూ అవే అయినా స్వరాల అమరికను బట్టీ ట్యూన్ నడకను బట్టీ పాటలు విభిన్నంగా అనిపిస్తాయి ఎస్.రాజేశ్వరరావు గారు మంచి పేరున్న దర్శకులు ఆయన మోహనలో వర్జిత స్వరాలయిన “మధ్యమ,నిషాదాలను” వుపయోగించి పాటకు కొత్త అందం తెస్తారని పేరు.
ఆయన పాటలు
.మధుర మధుర మీ చల్లనిరేయి(విప్రనారాయణ -భానుమతి,రాజా)
.ఎచటినుండి వీచెనో యీ చల్లని గాలి(అప్పుచేసి పప్పుకూడు).
పాడవేల రాధికా(ఇద్దరు మిత్రులు).
.మదిలో వీణలు మ్రోగె(ఆత్మీయులు)
.నీవు రావు నిదుర రాదు(పూలరంగడు).
.ఇది చల్లని రేయైనా (పూజాఫలం)
మోహన రాగ మహా మూర్తిమంత మాయే(మహామంత్రి తిమ్మరుసు)
మహా సుఖమైన పాట ఈ పాట ఇష్ట పడని వారుండరేమో. మీరజాలగలడా నాయానతి వ్రతవిధాన మహిమన్ ఈ పాట రచన ట్యూనింగ్ స్థానం నరసింహా రావు గారిదయినా దానికి చిలవలు పలవలు కల్పించి రాగప్రస్తారం కల్పించిన ఘనత పెండ్యాలదే.
తెల్లవారవచ్చె తెలియక నాసామి(చిరంజీవులు )మల్లాది వారి రచనకు వన్నె తెచ్చినది ఘంటసాలతో బాటు లీల
తిరుమలగిరి వాసా(రహస్యం)
మౌనముగా నీ మనసు పాడినా వేణు గానమును వింటినే(గుండమ్మకథ)
తిరుమల మందిర సుందరా (మేనకోడలు)
చందన చర్చిత నీలకళేబర-జయదేవ అష్టపది(తెనాలి రామకృష్ణ)
మక్కువ దీర్చర మువ్వ గోపాల(లేతమనసులు)క్షేత్రయ్య పదం
మదిలోని మధురభావం పలికేను మోహనరాగం -ఈ పాటలో ఘంటసాలతో గొంతు కలిపినది మధుర గాయని బాలసరస్వతి.
పిలిచినదీ పలికినదీ పరవశమై నవ మోహన రాగం-సుశీల,బాలూ పాడిన యీ పాట “సీతారాములు” లోనిది మోహన రాగానికి నమూనా గా ఈ పాటను చెప్పుకోవచ్చు.పాట మొదలయ్యే ముందు “వరవీణా” వినిపించారు చరణాల మధ్యలో “నిన్నుకోరి” వర్ణం వినిపించారు
ఇలాగే అచ్చంగా మోహన రాగం వినిపించే పాట “నీసరి మనోహరీ జగాన లేనే లేరుగా” పాడినదిసుస్వరలక్ష్మితో ఘంటసాల సంగీతం పామర్తి -చిత్రం(బభ్రువాహన)
ఇంకో అద్భుతమైన పాట “మల్లెపూవులు విరిసెరా”
కె.వి. మహదేవన్ సారధ్యం (ఇల్లాలు)
ఈ మధ్య వచ్చిన సినిమాలలో కీరవాణి చేసిన “ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వ మవుతున్నదో “కూడా చాలా మంచి పాట
మచ్చుకి హిందీ సినిమాలలో పాటలు కూడా రెండు మూడు చూద్దాం
సయోనారా సయోనారా-లతా -శంకర్ జైకిషన్ (లవ్ ఇన్ టోక్యో)
ఈపాట నన్ను చాలా కాలం వెంటాడింది
ఎన్ని పాటలు విన్నా మోహన రాగంలో వొక పాట మాత్రం నా మనసుని వేరే లోకాల్లోకి అలాగ్గా చేయి పట్టుకుని లాక్కెళుతుంది మనసంతా వొక మార్మికమయిన మాయ కమ్ముకుంటుంది.
తీరాచూస్తే అది తెలుగు సినిమా పాట కాదు హిందీ సినిమా పాట కాదు “అమర్ భూపాలీ “అనే మరాఠీ సినిమాలోని “ఘనశ్యామ సుందరా శ్రీధరా “అనే పాట.
ఈ సినిమా 1951లోప్రఖ్యాత నిర్మాతా,దర్శకుడూ అయిన వి. శాంతారాం”రాజ్ కమల్ కళా మందిర్ “పేరిట తీసిన సినిమా “హోనాజీ బాలా” అనే వొక గోవులను కాచుకునే సామాన్యునిలో వున్న అసామాన్య మయిన ప్రతిభను గురించి చెప్పే నిజ జీవిత గాథ.మరాఠీ దేశంలో వున్న “లావణీ “అనే సంగీత నృత్య విశేషాన్ని వెలుగులోకి రావడానికి తోడ్పడింది యితనేనట.
ఇందులో కథానాయకుడుగా నటించి పాడింది పండిట్ రావ్ నగరేకర్ అతనితో గొంతు కలిపి అమృతాన్ని వొలికించింది లతామంగేష్కర్ అనే కోయిల అజరామరమైన సంగీతాన్ని అందించింది వసంత్ దేశాయ్ .ఈ సినిమాలో సంగీతం అత్యున్నత స్థాయికి చెందినదని మహాకవి శ్రీశ్రీ కూడా మెచ్చుకున్నారొకచోట.
1952లో కాన్స్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో “గ్రాండ్ ప్రయిజ్ అఫ్ ది ఫెస్టివల్ “కి నామినేట్ చేశారు యీ చిత్రాన్ని.
“ఘనశ్యామ సుందరా” పాటకి “ఇమ్మోర్టల్ సాంగ్ ” అనే అవార్డ్ వచ్చింది.
అంతర్జాతీయంగా మోహన రాగ బావుటా యెగరేసిన ఈ పాటను వినండి
తాజా కామెంట్లు