ఓ కురుక్షేత్ర సైనికుడి డైరీ

 సిద్ధార్థ గౌతమ్

Gouthamఐదవ రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు –

 నేను మూడు, నాలుగు రోజులు గుడారం లోనే ఉండాలని మా సేనాని అన్నాడని నా గుడారం లో నాతో పాటు ఉన్న సైనికుడు చెప్పాడు. అప్పటికీ నేను కోలుకోలేకపోతే నన్ను ఇంటికి పంపించేస్తారని కూడా చెప్పాడట. నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పి తను వెళ్ళిపోయాడు.

 ఎవరో వచ్చి నాకు తినటానికి తిండి, తాగటానికి నీళ్ళు ఇచ్చి వెళ్తున్నారు కాని, నా మనసంతా రణభూమి దగ్గరే ఉంది. లేచి నిలబడ్డాను. కాలు నొప్పిగా ఉంది. నాలుగు అడుగులు వేసాను. నొప్పి నాలుగింతలు అయ్యింది. అనవసరంగా లేచాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ నాలుగడుగులు వేయాలి. మళ్ళీ నొప్పి భరించాలి. ఎందుకొచ్చిన తలనొప్పని అక్కడే నేల మీద కూర్చున్నాను.

నేనొక సైనికుడిని. ఒక వైపు యుధ్ధం జరుగుతూ ఉంటే ఇలా గుడారం లో ఘడియలు లెక్కపెడుతూ ఉండటం చాలా బాధ కలిగిస్తోంది.

ఏదో చిన్న మూలుగు వినిపిస్తే అటు తిరిగి చూసాను. పక్క గుడారం బయట ఒకడు కింద కూర్చుని ఉన్నాడు. వాడి కాలుకీ కట్టు ఉంది.

“నువ్వూ నాలుగడుగులు వేసావా?” అనడిగాను.

“ఆరు..” అన్నాడు తన కాలు చూసుకుంటూ.

“నిన్న చనిపోయినా బావుండేది. ఇలా కదలకుండా గుడారానికి పరిమితమవ్వటం బాలేదు.” అన్నాను మాట కలపటానికి.

వాడు ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత నేనూ నిశ్శబ్దంగా ఉండి పోయాను. ఒక గంట సేపు అలానే కూర్చుని ఉన్నాను.

మా ఇంట్లోవాళ్ళు, మా ఊళ్ళో జనం..ఇప్పుడు ఏమి చేస్తూ ఉంటారో? అసలు వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న విధ్వంసం గురించి ఏమైనా తెలుసా? ఇంతటి మహాయుధ్ధం జరుగుతూ ఉంటే అందరూ ఇక్కడికి ఎందుకు రాలేదు? పక్క గుడారం బయట నేల మీద కూర్చుని ఉన్న వాడు ఎంత సేపటికి లోపలికి వెడతాడు? ఈ రోజు కౌరవులంతా హతమైపోతే రేపు అంతా సర్దుకుని ఇళ్ళకు వెళ్ళిపోవచ్చా? నేను గాయపడినందుకు మా సేనాని నా మీద కోపంగా ఉన్నాడా? ఏ ప్రశ్నకూ సమాధానం తోచట్లేదు.

బాగా దాహంగా ఉంది. కష్టంగా ఉన్నా..పైకి లేచి నిలబడ్డాను. నొప్పి భరిస్తూ నడిచాను. చెంబు లోని నీళ్ళు గొంతు లోకి దిగేసరికి ప్రాణం కాస్త కుదుట పడింది.

సూర్యాస్తమయం అయ్యింది. మా సైనికుల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. గుడారం లో నాతో ఉన్న సైనికుడు రాలేదు. పాపం ఏమయ్యిందో ఏమిటో. చాలా పొద్దు పోయాక వచ్చాడు. బానే నడుస్తూ ఉన్నాడు.

“ఇంత ఆలస్యమయ్యింది. ఏమి జరిగింది?” అనడిగాను వాడు లోపలికి రావటంతోటే.

“మన వాళ్ళు చాలా మంది పోయారు ఈ రోజు. భీష్ముల వారిని చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది. కృష్ణుడు ఏదో ఒకటి చేయకపోతే..పాండవులు ఇక ఎక్కువ కాలం పోరాడలేరు. మరోవైపు ద్రోణాచార్యులు సాత్యకి ని ఏ క్షణం లోనైనా చంపేలా ఉన్నారు. భీముడు రక్షించి ఉండకపోతే ఈ రోజు సాత్యకికి కూడా అంత్య క్రియలు జరిగేవి.” అన్నాడు..

నేను మారు మాట లేకుండా వింటూ ఉన్నాను.

“దుర్యోధనుడు పంపిన ఒక పెద్ద సమూహాన్ని అర్జునుడు హతమార్చేసాడు. మాకు కాస్త ధైర్యం వచ్చింది. లేకపోతే రేపు కౌరవులని ఎలా ఎదురుకుని ఉండేవాళ్ళమో ఏమిటో….నీకెలా ఉంది?” అనడిగాడు.

“నేను రేపు వచ్చేస్తాను. మన సేనానితో చెప్పు..” అన్నాను ఉద్వేగంగా

వాడు నా వైపు చూసి…”నువ్వే వెళ్ళి చెప్పి రా. ఆయన గుడారం దాకా నడిచి వెళ్ళి, తిరిగి రా..అప్పుడు చూద్దాం..” అన్నాడు.

ఉదయం జరిగిన నాలుగడుగుల ప్రయాణం గురించి చెప్పాను. తను లోపలికి వచ్చేటప్పుడు పక్క గుడారం బయట కూర్చుని ఉన్న సైనికుడిని లోపల కూర్చోబెట్టి వచ్చాను అని చెప్పాడు. ఇద్దరం నవ్వుకున్నాము. ఆ తరువాత పడుకునేదాకా మా కుటుంబాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము.

మరుసటి రోజు త్వరగా మెలకువొచ్చేసింది. నా కాలిగాయం ఎలా ఉందో చూసుకుని..మళ్ళీ పడుకోవటానికి ప్రయత్నించాను. నా పక్కనున్న సైనికుడు లేచి, యుధ్ధానికి వెళ్ళిపోయాడు.

మధ్యాహ్నం దాకా ఎలాగోలా గడిపాను. ఆ తరువాత నా వల్లకాలేదు. కాలు నొప్పిగా ఉన్నా లేచి నడుచుకుంటూ గుడారం బయటికొచ్చాను. ఒళ్ళంతా చమట పడుతోంది…ఐనా అలానే నడిచాను. ఒకసారి పక్క గుడారం వైపు నడిచాను. నిన్న బయట కనబడ్డవాడు లోపల పడుకుని ఉన్నాడు. పలకరిద్దామని వెళ్ళాను. నన్ను చూసాడు కాని, ఏమీ మాట్లాడలేదు.

“అలా ఉండకు.. నాకూ ఈ యుధ్ధం ఇష్టం లేదు. నాకూ ఇల్లు గుర్తొస్తోంది. ఇలా దిగులుగా కూర్చుని ఏమి లాభం చెప్పు. ఇలా చూడు..నాకూ గాయమయ్యింది.” అని నా కాలి గాయం చూపించాను.

“పద…ఇద్దరమూ కుంటుకుంటూ అలా తిరిగొద్దాం..” అని నవ్వించటానికి ప్రయత్నించాను..

వాడు తన కాళ్ళు చూపించాడు. పాపం…మూడు చోట్ల బాణాలు దిగాయి. నేను ఒక్క బాణానికే ఇంత కష్టమనుభవిస్తున్నానే..ఇంత బాధ ఎలా ఓర్చుకుంటున్నాడో ఏంటో..

“నాకాలికి బాణం దిగి..నేను కూలబడినప్పుడు…ఒక కౌరవ సైనికుడు నా కళ్ళ ముందు మా తమ్ముడిని కత్తితో పొడిచాడు. వాడిని కాపాడుకుందామని లేవటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఎవరో నా కాళ్ళకి మరో రెండు బాణాలు వేసారు. నేను చూస్తూ ఉండగానే మా తమ్ముడు కుప్పకూలిపోయాడు.” అన్నాడు. నాకు నోట మాట రాలేదు. ఏమనాలో, వాడిని ఎలా ఓదార్చాలో తోచలేదు. సాయంత్రం దాకా వాడి పక్కన్నే కూర్చుని ఉన్నాను. కానీ ఏమీ మాట్లాడలేదు. వాడు నిద్రపోతున్నప్పుడు ఏడ్చాను. నా కాలి నొప్పి, నేను మనసులో పడుతున్న సంఘర్షణ చాలా చిన్నవిగా కనబడ్డాయి.

రాత్రికి నా గుడారం లో ఈ రోజు ఏమి జరిగిందో చెప్పాడు నా సహచరుడు. నిన్న భీష్ముల వారు చంపినట్టు ఈరోజు ద్రోణాచార్యులు చంపారట. పాండవ సైన్యం బాగా దెబ్బ తింటోంది.

“పాపం ఆ పక్క గుడారం వాడి తమ్ముడు పోయాడట. ఆ విషయం తెలియకుండా నిన్న వాడి గురించి మాట్లాడుకుని నవ్వుకున్నాము…పాపం..” అన్నాను..మళ్ళీ ఏడుపొచ్చింది.

రెండు క్షణాలాగి..పక్కగుడారానికి వెళ్ళి పలకరించి వచ్చాడు. పడుకునే ముందు నా గాయం గురించి అడిగాడు.

ఆ తరువాత రెండు రోజులూ పక్క గుడారం లోనే గడిపాను. రోజులో చాలా భాగం పడుకుని ఉండేవాడు. ఒక్కోసారి మాట్లాడేవాడు.

యుధ్ధం లో తొమ్మిదవ రోజు రాత్రి..నన్ను, పక్కగుడారం వాడిని కూర్చోబెట్టి ఆ రోజు విశేషాలు చెప్పాడు నా సహచరుడు. భీష్మ పితామహుడు పాండవ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాడేమో అనిపించి..కృష్ణ పరమాత్ముడు బరిలోకి దిగాడట.

“భలే” అని అరిచాను నేను.

“కృష్ణుడు ఒక రథచక్రాన్ని చేతిలోకి తీసుకుని భీష్ముడిని హతమార్చటానికి వెళ్ళటం చూసి…ఇక ఈ పూట తో యుధ్ధం అయిపోయింది అనుకున్నాను సోదరా..ఆయన్ని అలాంటి ఉగ్రరూపం లో ఎన్నడూ చూడలేదు. ఆయన తన వైపు రావటం చూసి భీష్ముల వారు తన అస్త్రాలను కింద పెట్టేసారు.” అన్నాడు

నాకు ఆనందం…ఉత్కంఠ..

“అర్జునుడు పరిగెట్టుకుంటూ వచ్చి..’యుధ్ధం లో అస్త్రాలను తాకను ‘ అన్న తన శపథాన్ని కృష్ణుడికి గుర్తు చేసాడు. అర్జునుడు రావటం ఒక్క క్షణం ఆలస్యమయ్యుంటే…”

నాలో ఏదో నూతనోత్సాహం. కాలి గాయం ఎలా ఉందో చూసుకోలేదు. నడుచుకుంటూ మా సేనాని దగ్గరికెళ్ళాను. పాండవుల గుడారాలలో ఏదో ముఖ్యమైన చర్చ జరుగుతోంది..చాలా మంది ఉన్నారు అక్కడ.

మా సేనాని నా వైపు చూసాడు.

“నేను రేపు యుధ్ధానికి సిధ్ధమండి..” అన్నాను. నా కాలు చూపించమన్నాడు. చూపించాను. పరిగెట్టి చూపించమన్నాడు. చూపించాను.

ఇంకా ఏమైనా చెబుతాడేమో అని ఎదురు చూసాను. నన్ను మళ్ళీ చూసి…”రేపు అర్జునుడి రథసారథి గా కృష్ణుడు రావట్లేదు.” అన్నాడు.

ఆ మాట వినగానే తల మీద పెద్ద బండరాయి పడ్డట్టయ్యింది.

“నాకు కాలు నొప్పి ఇంకా తగ్గలేదండి..నేను రేపు రాను..” అనేసాను వెంటనే.

“రేపు ఒక్క రోజు శిఖండి ని రథసారథి గా నియమించమని కృష్ణుడే చెప్పాడు. భీష్ముడిని ఆపటానికి అదొక్కటే మార్గం. మనము భయపడవలసిన పని లేదు. ఆయన మనల్ని కనిపెట్టుకునే ఉంటాడు. వెళ్ళి విశ్రాంతి తీసుకో.” అన్నాడు మా సేనాని.

“ఐతే నేను రేపు ఉదయమే తయారైపోతాను. నాకు ఏమైనా సూచనలుంటే చెప్పండి.” ఏ తడబాటూ లేకుండా చెప్పాను..

ఆయనని ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు. నేనూ నా గుడారానికి తిరిగి వచ్చేసాను.

రేపు పదవ రోజు. ఈ యుధ్ధం గమనాన్ని మార్చే సంఘటన ఏదో జరగబోతోందని బలంగా అనిపిస్తోంది. అది మాకు అనుకూలంగానా, ప్రతికూలంగానా అన్నది తెలియదు. నిద్రొస్తోంది.

*

ఓ కురుక్షేత్ర సైనికుడి డైరీ -2

సిద్ధార్థ గౌతమ్

Goutham

రెండవ రోజు రాత్రి బట్టలు మార్చుకొని పడుకుందామని అనుకుంటుండగా పిలుపు వచ్చింది. మా సేనాని సమూహంలో ఉన్న సైనికులనందరినీ రమ్మన్నట్టున్నారు. అందరూ వరుసగా నిలబడ్డాము. అందరినీ ఆకాశం  వైపు చూడమన్నాడు సేనాని. చందమామ…సగం మూత పెట్టిన కుండ లోపలి పాలలా కనబడుతున్నాడు.

“రేపు సర్వ పాండవ సైన్యం అర్ధ చంద్రాకారం లో నిలబడి పోరాడబోతోంది. మన సమూహం ఎడమ వైపు నుంచి దాడి చేయాలి…” 

అని ఎవరెవరు ఏ  స్థానం లో నిలబడాలో వివరించాడు.

నన్ను  ఎడమవైపు చివర్లో నిలబెట్టాడు.

ఎవరి పక్కన ఎవరు నిలబడాలో గుర్తుంచుకున్నాము.

 కాస్త దూరం లో పాండవ సైన్యం లోని మిగతా సేనానులు తమ తమ సమూహాలకు సూచనలిస్తున్నారు.

మా సేనాని ఆవలించాడు.

 పాపం ఎంత అలసిపోయాడో. మమ్మల్ని వెళ్ళి విశ్రాంతి తీసుకొమ్మని చెప్పాడు.

నాకు అలసటగా ఉన్నా నిద్ర పట్టలేదు. గుడారం బయటికొచ్చి మళ్ళీ చంద్రుడిని చూసాను.

మేఘాలు కప్పేసాయి.  అర్థ  చంద్రాకరం కన్నా ఈ మేఘాల ఆకారం లోనిలబడితే బావుంటుందనిపించింది.

ఈ కొత్త ఆలోచన రేపు రాత్రి సేనాని తో చెప్పాలి.

చిన్నప్పుడు ఆరుబయట పడుకుని చండ్రుడిని చూస్తూ కబుర్లు చెప్పుకున్న రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు చందమామలో కుందేలుని చూసాము, చిన్న పిల్లాడికి అన్నం తినిపిస్తున్న అమ్మమ్మ ని చూసాము. యుధ్ధం లో శత్రువులని చంపటానికి కూడా చంద్రుడు ఉపయోగపడతాడని ఊహించలేదు. మేఘాల చాటున ఎర్రగా కనబడ్డాడు చంద్రుడు. వెళ్ళిపడుకున్నాను.

మూడవ రోజు –

రాత్రి మాకు ఇచ్చిన సూచనల ప్రకారం అర్ధచంద్రాకారం లో నిలబడ్డాము. కౌరవులు కూడా రాత్రి భోజనాల తరువాత కొత్త వ్యూహాలు వేసుకున్నట్టున్నారు. గత రెండు రోజుల్లా కాకుండా కొత్త ఆకారం లో నిలబడ్డారు. నా వెనకాల ఉన్న సైనికుడు “గరుడాకారం లో దాడి చేయబోతున్నారు..” అన్నాడు.  మాకైతే ఎలా నిలబడాలో ఆకాశం లో ఉన్న చంద్రుడిని చూపించి చెప్పాడు మా సేనాని. మరి కౌరవ సైన్యానికి అంత చీకటి లో ఎగురుతున్న గద్ద లను చూపించి ఎలా  సూచనలిచ్చారో?

అర్జునుడి రథం నా పక్కన వచ్చి ఆగింది. చిన్నగా రెండు అడుగులు వేసి  కృష్ణుడి పాదాలను దూరం నుంచే నమస్కరించుకుని మళ్ళీ నా స్థానానికి  వచ్చాను. కుడి వైపు చూసాను. అటు చివర భీమసేనుడు, మధ్యలో  ధర్మరాజు. కౌరవుల వైపు భీష్మ  పితామహుడు అందరికన్నా ముందు నిలబడి ఉన్నారు. గత రెండు రోజులుగా నేను పోరాడుతున్నకురుసైనికుడు వెనకాల ఎక్కడో ఉన్నాడు. నేను చెయ్యి ఊపాను. వాడు చూడలేదు కాని, వాడి పక్కన నిలబడ్డ మరో సైనికుడు చూసాడు. తనూ చెయ్యి ఊపాడు. తన పక్కనున్న వాడిని పిలవమని సైగ చేసాను. నా తలకి చిన్న రాయి తగిలింది. ఎవరు కొట్టారా అని పక్కకి చూసాను. మా సేనాని…కోపంగా చూసాడు నన్ను.

యుధ్ధ భేరి మోగించే వాడు నా పక్కనే  నిలబడి మోగించాడు. నా చెవులు తూట్లు పడేలా శబ్దం. రెండు క్షణాల పాటు తల తిరిగినట్టు అనిపించింది. కౌరవ సైన్యం మొత్తం మా అర్జునుడి మీదకు రావటం చూసి తేరుకున్నాను. ముందుకురికాను. భయం వల్లనో, కోపం వల్లనో తెలియదు కాని..ఒళ్ళు తెలియకుండా పోరాడాను.

 అర్జునుడి మీదకు వస్తున్న బాణాలు, ఈటెలు ఆపటానికి నా చేతనైనంత ప్రయత్నించాను.

కానీ.. ఆయనకు  సహాయపడటానికి, ఆయన్ని కాపాడటానికి  ఆయన రథసారధి ఉన్నాడు. శత్రువులు  ఎంత మంది దాడి చేసినా, ఎలా దాడి చేసినా..ఒక మహాసముద్రం లోకి సన్నటి కాగడాలు విసిరినంత వ్యర్థం.

ఇంతలో “ఘటోత్కచుడు…ఘటోత్కచుడు” అని ఎవరో అరిస్తే అటు చూసాను. భీమసేనుడి పక్కన ఆయన పుత్రుడు. ఈయన గురించి ఎన్నో కథలు విన్నాను, ఒకసారి దూరం నుంచి చూసాను. ఆయన్ని చూడగానే అందరిలో నూతనోత్సాహం. అందరితో  పాటు నేనూ కేరింతలు కొట్టాను.

ఇవేవీ పట్టనట్టు ఆయన, భీమసేనుడు దుర్యోధనుడి వైపు ఉరికారు. నన్ను వాళ్ళ వెంట వెళ్ళమని మా సేనాని ఆదేశించాడు. తండ్రీ కొడుకులు కలిసి దుర్యోధనుడి రధాన్ని ధ్వంసం చేసారు. నేను కూడా ఆ రథ చక్రాన్ని కాస్త విరగ్గొట్టాను. దుర్యోధనుడి రథం వెనక్కు తిరిగింది. నేను వదలకుండా దాని వెంట పరిగెట్టాను.

దూరంగా వెళ్లి  ఆగాక..దుర్యోధనుడు తన అక్కసు భీష్మపితామహుడి పై చూపించాడు. ఆయనపాండవ పక్షపాతి అని, అందువలనే వాళ్ళకు ఏ హానీ జరగకుండా చూస్తున్నాడని అన్నాడు. భీష్మ పితామహుడికి కోపంకట్టలు తెంచుకుని వచ్చింది. ఆయన్ని అలా చూస్తుంటే నాకు వణుకు పుట్టింది.

ఒక సింహం లా పాండవ సైన్యం పైకి దూకాడు. మా సైనికులని ఊచకోత కోసాడు. అర్జునుడు ఆయనని అడ్డుకోవటం తో ఆ వినాశనం కాస్త తగ్గింది. సాయంత్రమయ్యింది.

ghatotkach

ఈ పూట చనిపోయిన సైనికుల శరీరాలకు దహన సంస్కారాలు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఉదయం బధ్ధశత్రువులుగా కొట్టుకున్న ఇరువైపుల సైనికులు ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటున్నారు. నా  భుజం మీద ఏదో చేయి తగిలితే వెనక్కి తిరిగి చూసాను.

నేను మొదటి రెండు రోజులు పోరాడిన కురుసైనికుడు.

“బ్రతికే ఉన్నావా?” అనడిగాడు. నేను నవ్వి, ఔనన్నట్టు తలూపాను. “ఈ రోజు భీష్ముడి ప్రభంజనం లో నువ్వు కూడా పోయావేమో అని భయపడ్డాను. రేపటి నుంచి కృష్ణుడి పక్కనే  ఉండు. ఆయనొక్కడే నిన్ను కాపాడగలడు. జాగ్రత్త.” అన్నాడు. “మరి నీ పరిస్థితేంటి?” అనడిగాను.

“కృష్ణుడు మీ వైపు ఉన్నాడని తెలిసిన రోజే నేను హతమవ్వటం ఖాయం అని నాకు అర్థమైపోయింది. మా మహారాజులు తప్పులు చేసారు, మీ మహారాజులు శపథాలు చేసారు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని ఆలోచించకుండా మనలాంటి వాళ్ళు విశ్వాసంగా యుధ్ధం చేయాలి. నేనిక వెళ్తాను. నిన్ను చూసిపోదామని వచ్చాను.” అని వెళ్ళిపోయాడు.

రాత్రి ఏమీ తినకుండా గుడారానికి వచ్చేసాను.

నాతో పాటు గుడారం లో ఉన్న సైనికుడు ఇంకా పడుకోలేదు. తన పాదానికి గుచ్చుకున్న ముల్లు తీసుకుంటూ ఉన్నాడు.

“నేను తీస్తాను లే..” అని కింద కూర్చుని తన పాదం నా మోకాలి మీద పెట్టుకుని ముల్లు తీసాను.

“యుధ్ధం ఎంత దారుణమైనది సోదరా..” అన్నాడు. నేను ఏమీ సమాధానమివ్వలేదు.

“ఈరోజు భీష్ముడిని చూసి చాలా బాధకలిగింది. ఈ యుద్ధానికి వచ్చింది నాకు తెలిసిన భీష్మ పితామహుడు కాదు. ఈయన ఎవరో రాక్షసుడు. ఆమాట కొస్తే మన ధర్మ రాజుని చూస్తున్నా అలానే అనిపిస్తోంది.

భీష్ముడు, ధర్మరాజు లాంటి  మంచివాళ్ళు, గొప్పవాళ్ళు..ఒకరిని ఒకరు చంపుకోవటానికి యుద్ధం  చేయటమేమిటి? అసలు ఈరోజు చనిపోయిన సైనికులలో ఎంతమంది చెడ్డవాళ్ళు?” అన్నాడు. నేను నిశ్శబ్దంగా   ఉండేసరికి తనూ మాటలు ఆపేసాడు.

నా మనసేమీ బాగోలేదు. ఇల్లు గుర్తొస్తోంది. కృష్ణ పరమాత్మా…రేపు నేను నిద్ర లేచేసరికి ఈ యుధ్ధం ఆపేయవూ?

నాలుగవ రోజు –

ఉదయం లేచినప్పటినుంచి ఎవ్వరితోనూ మాట్లాడలేదు నేను. ఆకలిగా ఉంటే రెండు పళ్ళు తిన్నాను. నిన్న జరిగిన విధ్వంసం ఇంకా నా తలలో తిరుగుతూ ఉంది. అయిష్టంగా నే బయలుదేరాను. యుధ్ధం మొదలు పెట్టింది నేను కాదు..దీనినిఆపే శక్తీ నాకు లేదు. ఆదేశించిన పని చేయటం మాత్రమే నా చేతిలో ఉంది. యుద్ధానికి   వచ్చే ముందు చంపటానికి, చావటానికి సిధ్ధపడే వచ్చాను. కాని, ఇంతటి మనస్తాపం ఉంటుందని నేను  ఊహించలేదు, ఎవ్వరూ చెప్పలేదు. నాకే ఇలా ఉంటే..పాపం పాండవుల పరిస్థితి ఎలా ఉందో?

ఈ రోజు అభిమన్యుడి మీదకొచ్చారు కౌరవ సైన్యం. ఒక్కడిని చేసి అందరూ చుట్టు ముట్టి దాడి చేస్తున్నారు. అన్యాయమనిపించింది.

అభిమన్యుడు..తనని దాడి చేసినవారిని, చేయనివారిని..వందల మందిని చంపేసాడు. అన్యాయమనిపించింది.

దుర్యోధనుడు తన మిగతా సైన్యాన్నంతా  అభిమన్యుడిని చంపమని పంపాడు. అన్యాయమనిపించింది.

భీముడు, అర్జునుడు వచ్చి అభిమన్యుడికి  సహాయంగా నిలబడి యుధ్ధం చేసారు. ఈసారి భీముడిని అంతమొందించటానికి కొన్ని వేల ఏనుగులను పంపాడు దుర్యోధనుడు. అన్యాయమనిపించింది.

భీముడు ఉగ్ర రూపం దాల్చి నోరు లేని ఆ ఏనుగులను తన గద తో పిండి చేసేసాడు. అన్యాయమనిపించింది.

ఈ ఆలోచనలతో నాకు పిచ్చెక్కేలా వుంది.

ఎటు పరిగెడుతున్నానో..ఎందుకు పరిగెడుతున్నానో తెలియటం లేదు. రెండు క్షణాలు ఆగాను. కాలి మీద ఏదో చీమ కుట్టినట్టు అనిపించింది. మళ్ళీ పరిగెట్టాను. ఇప్పుడు  తేలు కుట్టినట్టు అనిపిస్తోంది. ఆగి కాలి వైపు చూసుకున్నా. బాణం…నా మోకాలి కింద. అది చూడగానే అసలు నొప్పి తెలిసింది. భరించలేని నొప్పి.

 అసలు ఈ బాణం  ఎవరు వేసారా అని అటూ, ఇటూ చూసాను. కూలబడిపోయాను. “అమ్మా..” అన్నాను బిగ్గరగా. మా అమ్మకి వినబడదు. “కృష్ణా…” అని పేగులు తెగేలా అరిచాను. ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయానో తెలియదు.

కళ్ళు తెరిచేసరికి నా గుడారంలో ఉన్నాను. పక్కన ఎవ్వరూ లేరు. లేవటానికి ప్రయత్నించాను. కాలు నొప్పి. కాలిలో దిగబడిన బాణం ఇప్పుడు లేదు. ఎవరో కట్టు కట్టారు. “మంచి నీళ్ళు” అన్నాను గట్టిగా. ఎవరో ఒకతను వచ్చి నీళ్ళు ఇచ్చాడు. “ఎవ్వరూ లేరా?” అనడిగాను. “అందరూ యుధ్ధానికి వెళ్ళారు. 

గాయపడిన వారిని చూస్తూ ఇక్కడే ఉండమని నాకు చెప్పారు. ఏమైనా తింటారా?” అనడిగాడు. వద్దని చెప్పాను. మా అమ్మ, నా భార్య పిల్లలు గుర్తొచ్చారు. ఏడుపొచ్చింది.

 నేను ఏడవటం చూసి ఆ నీళ్ళిచ్చినతను వెళ్ళిపోయాడు. 

ఎప్పుడు మళ్ళీ నిద్రలోకి జారుకున్నానో గుర్తు లేదు. 

*