తెలంగాణా రచయితలూ/ కవులు ఇప్పుడేం చేయాలి?

వ్యక్తిగత వైఖరులను సవరించుకోవాలి: కె. శ్రీనివాస్
Box content
195922_10150100454781059_8264333_nతెలంగాణ రచయితలు చాలా చేశారు. ముఖ్యంగా కవులు, పరిశోధకులు చాలా చేశారు.  కవుల్లో కూడా పాట  కవులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణా వాద కథ మాత్రం రావలసినంత రాలేదు. నవల అయితే మరీ హీనం.  ఉద్యమప్రయాణం చివరి మజిలి కి చేరిన దశలో, నిరాశా నిస్పృహలు ముంచెత్తుతున్నప్పుదు, కవులు చేయాల్సింది ఆశను అందించడమే.  పరిణామాలు మన చేతుల్లో లేనప్పుడు, సంకల్ప బలాన్ని పోరాట స్ఫూర్తి నమ్ముకోవాలి. వాటిని కవులు గుర్తు చేయాలి. వచనం రాయగలిగిన వాళ్ళంతా వ్యాసాలు రాయాలి. శ్రీశ్రీ వంటి ఉద్యమ రచయితలు అనేక సందర్భాల్లో వివిధ ప్రక్రియల ద్వారా తమ అభిప్రాయాలను చెప్పారు. అందరినీ ఒకే గాట కట్ట కూడదు.
కాని, మన రచయితలకు అధ్యయ న ఆసక్తి తక్కువ. పేరు మీద ప్రచురణ మీద ఉన్న ఆసక్తి  సందర్భానికి అవసరమైన విశ్లేషణలను వ్యాఖ్యలను పాఠకులకు అందించడం మీద ఉండదు. విరివిగా విస్తృతంగా రాయాలి, నాణ్యత తక్కువైనా, తగిన సమాచారం, సందేశం ఉంటే చాలు అనే ఆచరణాత్మక ద్రుష్టి ఉండాలి . అందుకు వ్యక్తిగత వైఖరులను సవరించుకోవాలి. హైదరాబాద్ తో  తాదాత్మ్యాన్ని చెప్పే ఒక్క మంచి పోయెమ్ తెలంగాణా కవుల నుంచి రాలేదు. సీమాంధ్రు లను సంబోధిస్తూ రాసే సవాల్ కవిత్వాలే ఎక్కువ వస్తున్నాయి. అటువంటి వ్యక్తీకరణ రూపాన్ని  అధిగమించే ప్రయత్నం కూడా లేదు.  అనేక అస్తిత్వ వాద ధోరణుల్లో ఉండే కొన్ని అవలక్షణాలు   తెలంగాణ సాహిత్య రంగంలో కూడా బలపడ్డాయి. ప్రస్తుత సందర్భంలో అవసరమైన ధైర్యాన్ని, సందేశాలను ఇస్తూనే, తెలంగాణా సాహిత్య రంగ పునర్నిర్మాణం గురించి కూడా ఆలోచించాలి.
* *
తెలుగు-ఉర్దూల మధ్య వారధి కావాలి: స్కై బాబా
Box content
తెలుగు-ఉర్దూల మధ్య వారధి కావాలి: స్కై బాబా
skyహైదరాబాద్ పై సీమ, ఆంధ్ర ప్రాంతాల వారు గొడవ మొదలు పెట్టడం తో తెలంగాణ కవులు, వాగ్గేయకారులం కలిసి ఉర్దూ తెలుగు కవి గాయక సమ్మేళనం సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఏర్పాటు చేశాం.. దాదాపు 200 మంది కవులు వాగ్గేయకారులు పాల్గొన్నారు. 1953లో దాశరధి అధ్యక్షతన ఉర్దూ-తెలుగు ముషాయిరా జరిగిందట. ఆ తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకు ఉర్దూ-తెలుగు కవులు కలిసి పాల్గొన్న కవి సమ్మేళనం ఇదేనట! హైదరాబాదీ తెహజీబ్ ని అందరికీ తెలియజేయాలంటే ఉర్దూ-తెలుగు ముషాయిరాలు, సమ్మేళనాలు విరివిగా జరపాలి..
పై కార్యక్రమం కూడా నా ఆలోచనతోనే అలా రూపొందిన కార్యక్రమం. ఈ ఆలోచన 2 ఏళ్ల క్రితం నుంచే చేస్తున్న నేను ఉర్దూ-తెలుగు తెలంగాణ ముస్లిం కవితా సంకలనం కూడా వేసే పనిలో ఉన్నాను. ఆ సంకలనం ఈ వారం లో రానుంది.
తెలంగాణ లో కవులు, రచయిత లంటే తెలుగు వారితో పాటు ఉర్దూ వారు కూడా. ఆ విషయం నేటి ఉద్యమకారులు, సాహిత్య సంస్థలు విస్మరించాయి. ‘గంగా జమున తెహజీబ్’ కి హైదరాబాద్ రాజ్యం పెట్టింది పేరు. ఆ హిందూ-ముస్లిం అలాయిబలాయి సంస్క్రుతి గత 60 ఏళ్లుగా మాయమవుతూ వొచ్చింది. తిరిగి దానిని జీవింప జేసుకోవడం నేటి తెలంగాణ కవులు రచయితల బాధ్యత. దాని వల్ల ఇరు మతాల వారిలో సోదర భావం పెంపొందుతుంది. దేశంలోనే ప్రసిధ్ధి పొందిన ఉర్దూ రచయితలు మనకు ఉన్నారు. ఉర్దూ రచనలు తెలుగులోకి, తెలుగు రచనలు ఉర్డులోకి అనువాదాలు జరగాలి. తెలుగు-ఉర్దూ సాహిత్యకారుల కోసం ఒక అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయాలి.
* * *
ప్రాంతీయ వివక్ష తెలంగాణా సాహిత్యంలోనూ వుంది: ఎంవీ పట్వర్ధన్
Box content
ప్రాంతీయ వివక్ష తెలంగాణా సాహిత్యంలోనూ వుంది: ఎంవీ పట్వర్ధన్
మన పోరాటం అస్తిత్వం గూర్చే ఐనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అది బహు ముఖీనం అవుతుంది. అప్పుడూ ప్రాంతీయ భావాలు మరో రూపంలో పెల్లుబుకుతాయి. ఇప్పటి తెలంగాణా ఉద్యమ కవిత్వాన్ని గమనిస్తే అది ఏ రెండు మూడు ప్రాంతాల నుండో ఉద్ధృతంగా వచ్చినట్టు కనిపిస్తుంది.కానీ నిజం అది కాదు. మరి ఎందుకీ అభిప్రాయం అంటే పత్రికలూ,సుప్రసిద్ధ కవుల ధోరణే అని చెప్పాలి. చల్లకు వచ్చి ముంత దాచినట్లు ఎందుకు?ఉన్నదున్నట్టు చెప్పేస్తా.

ఈ పోరాట క్రమంలో ఉదాహరణకు ఆదిలబాదు జిల్లానుండి వచ్చిన సాహిత్యం వివక్షకు గురయింది.ఆదిలబాదు నుండి వచ్చిన ఎన్నో పుస్తకాలు గుర్తింపు పరంగా తొక్కి పెట్టబడ్డాయి.నేను జనాంతర్గామి -తెలంగాణా ఉద్యమ దీర్ఘ కవిత రాసి సమీక్షకు పంపిస్తే ఏ పత్రికా సమీక్షించలేదు.కవిత్వం బాగుంటే లాంటి మాటలు వద్దు.పత్రికా సమీక్షలకు ఏ కొలమానాలో చాలమందికి తెలుసు.ఈ అభిప్రాయం తప్పైతే ఆ బాధ్యత అ అభిప్రాయాన్ని కలిగిచిన పత్రికలదే! ఇంకా అనేకులు రాసిన పుస్తకాల పరిస్థితీ ఇదే.ఈ ప్రాంతం నుంచి ఏ ఒక పుస్తకానికో అవార్డు వచ్చినంత మాత్రాన అది ఈ ప్రాంత కవులందరికీ గుర్తింపు అనే మాటల్లో నాకు విశ్వాసం లేదు.

ఏ ఉద్యమ కార్యక్రమంలోనైనా ఆదిలాబాదుకు ప్రాధాన్యత అంతంత మాత్రమే.ఎప్పుడూ తల్లిచాటు బిడ్డలా అప్రాధాన్య పాత్రను పోషించాల్సిందే.అనవచ్చు గుర్తింపు కోసం ఇంత తహతహ దేనికని.నిజంగా మీరే చెప్పండి.ఎంతో కొంత గుర్తింపు కోరుకోని రచయిత ఉంటాడా?

ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్న విషయం చిన్నదిగ కనబడవచ్చు.కొంత అపరిపక్వంగానూ.కానీ రేపు ఇదే మనసులకు మాంచలేని గాయాన్ని చేస్తుంది.ప్రస్తుత తెలంగాణా రచయితలూ,పత్రికలూ చేయాల్సిందేమంటే అన్ని ప్రాంతాల వారికీ సమాన అవకాశాలివ్వడం.

మన పోరాటంలో ముఖ్య భూమిక మాండలీకందే.సందేహం లేదు.కానీ దురదృష్టవషాత్తు మనది తెలుగు భాషే కాదనుకునే దాకా వెళ్ళిపోయాం.ఇప్పుడు రాష్త్రాన్ని కొంతైనా సాధించుకున్నం గదా ఇక నైనా భాషకూ,మాండలీకానికి ఉన్న తేడాను మనం గుర్తించాలి.రేపు పూర్తి స్థాయిలో రాష్ట్రం ఏర్పడ్డాక మనం మాట్లాడేది తెలుగు కాకుండా పోదు కదా!మరణాంతాని వైరాని అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది. మన రచయితలు తెలుగు భాషనూ రచయితలను గౌరవించడమంటే తెలంగాణను వ్యతిరేకించడం కాదన్న గ్రహించిన విషయాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి.మనమిన్నిన్ని రాయడానికి మాధ్యమం తెలుగే కదా!ఒక విజయం తరువాత తప్పనిసరిగా శాంతి పునరుద్ధరణ జరగాలి.

కుల సంకులాలను గూర్చి నేను మాట్లాడదల్చుకోలేదు.ఒక విశాల లక్ష్యంకోసం అన్ని అక్తులూ ఉద్యమిస్తాయి.ఏది ప్రతీప శక్తి అన్నది అనుభవం మీద గాని తెలువదు.ఎప్పుడూ నమ్మకం ఘనీకృతంగా కాక ఇష్యూ బేస్డ్ గా ఉండాలి.ఇది చర్చకు మీరు పెట్టిన అంశం ఐనా కాకపోయినా నా రాతలోనూ కొన్ని చర్చనీయాంశాలు లేకపోలేదు.

 

**
బయటికిరాని తెలంగాణా రచనలను వెతికిపట్టుకోవాలె: శ్రీరామోజు హరగోపాల్
Box content
బయటికిరాని తెలంగాణా రచనలను వెతికిపట్టుకోవాలె:    శ్రీరామోజు హరగోపాల్

haragopalకవులు, రచయితలకు ఎప్పుడేం రాయాల్నో తెలిసినవిద్యే. ఎల్లపుడు ప్రజలపక్షం వహించే వాళ్ళనే కవులని, రచయితలని గుర్తుంచుకుంటున్నాం.యివాళ్టి సంగతి ప్రత్యేకసందర్భం. తెలంగాణరాష్ట్రం కోసమేనైతే కవులేం చెయ్యాలె, రచయితలేం రాయాలెనన్నదానికి ఇంకా నిజం కానిదానికి, కోటి అనుమానాలు వున్నదానిగురించి రాసేదేం లేదు కాని, మనకల నిజమైతుందన్న ఆశతో రాయడం వేరేసంగతి.

ఏండ్లుపూండ్లుగా తెలంగాణాలో కవులేం రాస్తున్నరో అదే రాస్తాలో రాస్తరు.కాళోజి లెక్కనె ప్రజలగొడవే రాసి ధిక్కారం గొంతుతోనే లేస్తరు. తెలంగాణాసాయుధపోరాట కాలం నుంచి పాట,పోరాటం ధరించిన కవుల వారసత్వం నిలుపుతరు.ఎప్పటికప్పుడు మారుతున్న పోరాటాలకు జెండాలై నినాదాలిస్తరు. ఊరేగింపుల ముందునిలుస్తరు. ఇపుడు ప్రజల్లో వున్న భయాలు, ఆ భయాలను పురిగొల్పుతున్న దుర్మార్గపు అరాచకీయ వ్యవస్థలపట్ల ప్రజల్ని మేలుకొల్పి మేల్కొనివుండేటట్టు చూస్తరు.

మాసిపోయిన మనతెలంగాణాభాషను కవులు, రచయితలు రాయడం అలవాటుచేసుకోవాలె. మనం మన భాషను మన ముసలోల్ల దగ్గర నేర్చుకోవాలె, ఆ భాషను సేకరించాలె, నిఘంటువులని తయారు చేసుకోవాలె. భాషావేత్తలు తెలంగాణాభాష ఎట్ల ప్రత్యేకమైందో చెప్పాలె.ఎంత కాలం నుండి ఎంత సంపన్నంగా వుండేదో రాయాలి. బయటికిరాని తెలంగాణా రచనలను వెతికిపట్టుకోవాలె. అన్ని రకాల సాహిత్యాన్ని సేకరించి, పరిష్కరించాలి.

చరిత్ర విషయంలో తెలంగాణాకు చాలా అన్యాయం జరిగింది. ఇక్కడి ప్రాచీన, ఆధునిక చరిత్ర నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడున్న అపారమైన చారిత్రక పూర్వయుగ విశేషాలు కాని, శాసనాలు కాని, శిల్పసంపద గాని ఏదో పట్టీపట్టనట్లు కొంచెమే పేర్కొనబడ్డయి. మన చరిత్రను మనం యదార్థంగా రాసుకోవాలె. ఆ పనికి ఎవరైన పూనుకోవాలె కదా.

మనసంస్కృతి – మన సంప్రదాయాలని ( మతాతీతంగా, కులాతీతంగా) నిలబెట్టుకోవాలె. వాటిలో మన జీవనసంస్కృతిని దొరకబట్టుకుని కాపాడుకోవాలె. మనతెలంగాణాను మనం మళ్ళీ డిస్కవర్ చేస్కోవాలె.అందుకు తెలంగాణాను పునర్నిర్మాణం చేసుకోవాలె. దానికి కవి,గాయక,రచయితలు అందరు సనాతన సంచార మౌఖిక, లిఖిత సంప్రదాయాల్నన్నింటిని పరిశోధించాలె. ఇప్పటిదాకా నిర్లక్ష్యానికి గురైన మన భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర లన్నింటిని మళ్ళీ తిరగరాసుకోవాలె. ఇదొక సంధి సందర్భం. ప్రత్యేక పోరాటమెంతనో ఆ తర్వాత కూడా అంతే పటిమతోని పోట్లాడాలె. తెలంగాణాపోరాట చరిత్రను రేపటితరం కోసం నిష్కర్షగా రాసిపెట్టాలి. కవులు రేపటి తెలంగాణాలో ( ఎంత గొప్పగా వూహించినా అది మళ్ళీ ఈ రాజ్యలక్షణాలను వొదులుకునేదైతే కాదుగదా, అందుకని బద్మాష్ పాలకులతో తగాదా తప్పదుగా ) ప్రజల చేతుల్లో పదనెక్కిన పద్యమై, పాటై,కవితలై మోగుతరు.

——————————————————————————————————————

                    (గమనిక: ఈ అంశంపై మీ అభిప్రాయాలను editor@saarangabooks.com కి పంపండి)