మాస్టారి కథలకు ఆయువుపట్టు కథనం

సాహిత్యాన్ని తానెందుకు రాస్తున్నారో, ఎవరికోసం రాస్తున్నారో అనే విషయంలో కథారచయితగా కాళీపట్నం రామారావుకు చాలా స్పష్టత వుంది. ఈయన కథలు గ్రామీణ జీవితంలోని మానవ సంబంధాలను మార్క్సిస్టు తాత్విక దృక్పథంలో నుండి చూసాడు. అయితే తన కథల్లో ఎక్కడా ఆ పరిభాషను వాడలేదు. ఆ పరిభాషను వాడకుండానే కథా జీవితమంతా పరుచుకున్న మార్క్సిస్టు దృక్పథాన్ని పాఠక అనుభవంలోకి తీసుకు రావడంలో కాళీపట్నం రామారావు సఫలీకృతులయ్యారు.ఇదంత సామాన్యమైన విషయంకాదు. కథనం విషయంలో మంచి పట్టు వుంటే తప్ప ఇలాంటి నేత (craft) సాధ్యంకాదు. అందుకే ఆయన పాఠకులలో మార్క్సిస్టులు, మార్క్సిస్టు తాత్వికతను అభిమానించేవాళ్ళెంతమందున్నారో మార్క్సిస్టు భావజాలంతో సంబంధంలేని వాళ్ళు కూడా అంతమందున్నారు. దీనికి కారణం జీవితంపట్ల మనుషులపట్ల ఆయనకు గల నిశిత పరిశీలన వల్లనే పాఠక విస్తృతి సాధ్యమయ్యింది. పాత్రల విషయంలోగానీ, సన్నివేశం విషయంలోగానీ, మరే విషయంలోగానీ ఎప్పుడూ, గందరగోళ పడిన దాఖలా ఒక్క కథలో కూడా కనిపించదు. ఈ స్టేట్‍మెంట్ రాయకుండా ఉండలేని లౌల్యం నాకు మరోరకంగా రాయటంలో కనపడలేదు. మార్మికత పేరుతోనూ మాజిక్ రియలిజం పేరుతో తాము చెప్పదలచుకున్న అంశాన్ని ఏమాత్రం అర్థం కాకుండా కథ మొత్తాన్ని నిర్వహించే మేథో / గొప్ప కథకులకు నేర్పించే పాఠాలు కాళీపట్నం మాష్టారు కథలే. తానెంచుకున్న పాఠకులకు తన సాహిత్యం ద్వారా చేరువ కావడానికి, విషయాన్ని అవగతం చేయించడానికి, ఎంత విడమరచైనా, వాస్తవ సామాజిక స్థితిగతుల్ని ఎదిరించి పోరాడే శక్తిని, అవగాహనను అందించేందుకు తన జీవిత అనుభవాన్నంతా రంగరించి, ఎంతో ఓపికగా బుద్ధి తెలియని పిల్లలకు అనునయించి చెప్పే పాఠంలా ఆయన కథన శైలి సాగుతుంది. రచయితగానే కాదు ఆయన నివసిస్తున్న సమాజంలోని ప్రతి మనిషికి అందుబాటులో వుండే కథన శైలి ఆయనది. తన పాఠకుల్ని – గురువులను అనుసరించి నడిచే బడిపిల్లల్లాగా తన వెంట తిప్పుకుంటారు. తన కథలో సృజించిన ఒక సమస్య. ఆ సమస్యను అతి సమర్థవంతంగా ఒక్కొక్క స్టెప్‍ను సాధించిన రూపం. ఆతర్వాత మరో స్టెప్. వృత్తిరీత్యా లెక్కల మాష్టారవటం వల్ల ఒకొక్క లెక్కను సాధించి సమాధానాన్ని రాబట్టుకునే శైలి ఆయన కథల్లో కనిపిస్తుంది. సువిశాల కథా ప్రపంచంలో ఎవరిలోనూ ఎక్కడా కనిపించని ప్రత్యేకమైన శైలి. వర్తమాన కథకులు ముఖ్యంగా గ్రామీణ బడుగు వర్గాల కోసం రచన చేసే కథకులు ఆలోచించి, అలవరుచుకోవలసిన శైలీ శిల్పం కాళీపట్నం కథలది. . ( ఒక్క పి. సత్యవతి కథనంలో మాత్రం ఇలాంటి టెక్నిక్ చూడగలం. )

ధర్మం పేరిట, న్యాయంపేరిట కొనసాగుతున్న అన్యాయాలకు అక్రమాలకు గల ముసుగును తొలగించి పాఠకుల చైతన్యాన్ని ఆచరణలోకి తేవటం రామారావు కథల్లో కనిపిస్తుంది. ఏపాత్రకూడా స్థాయీ బేధం లేకుండా పాత్రలన్నీ ఒకానొక నీతికి కట్టుబడి ప్రవర్తిస్తాయి. అయితే నీతి అవినీతి మధ్యగల మర్మ రహస్యాన్ని తన తాత్విక భావజాలంతో బద్ధలు చేసి సమాజం కప్పిన ముసుగును క్రమక్రమంగా బట్టబయలు చేయడంలో ఆయన తాత్విక దృక్పథం నిర్వర్తించిన బాధ్యత ఈయన కథల్లో బహిర్గతమవుతుంది. ఆ తాత్వికత వల్లనే మనుషుల్ని కొట్టు, తరుము, నరుకు, పోరాడు, పొలికేక వేయించు లాంటి ఉద్వేగాలతో కాకుండా నింపాదిగా తత్వబోధ చేస్తాయి. వాటిని అందిపుచ్చుకున్న పాఠకులే కథాంశంలోని సారాన్ని గ్రహించగలుగుతారు.

సమస్యకు రచయిత పరిష్కారం చెప్పాలా వద్దా? అన్నది రచయిత చైతన్యానికి సంబంధించిన అంశం. ఏ పరిష్కారం చెప్పాలి అన్నది రచయిత భావజాలానికి సంబంధించిన అంశం. పరిష్కారాన్ని ఏ పద్ధతిలో చెప్పాలి అన్నది రచయిత శిల్ప పరిజ్ఞానానికి సంబంధించిన అంశం. శిల్పం ముసుగులో ఏది చెప్పకుండా ఏదో చెప్పినా, ఏమి చెప్పారో తెలియకుండా అస్పష్టంగా వదిలిపెట్టడం మంచిది కాదనేది కాళీపట్నం రామారావుగారి కథల్లో ఆవిష్కృతమయ్యే వాస్తవం. అందుకు అనుగుణంగానే ఆయన కథలలోని పరిష్కారాలుంటాయి. ఇది అవునా కాదా అన్న మీమాంసకు పాఠకుడు ఎక్కడా గురి కాడు. జీవితం అర్థం కావాలంటే జీవితాన్ని నడిపించే ఆర్థిక సాంఘిక రాజకీయ శక్తుల పాత్ర అర్థం కావాలి. కేవలం సాహిత్య ప్రమాణాలతోనే ఒక రచనను సమగ్రంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు

కథనం విషయంలో కనిపించే సుదీర్ఘత, సంభాషణల్లో కనిపించదు. సంభాషణల్లో రచయిత చాలా జాగ్రత్తగా, పొదుపుగా, గాఢమైన ముద్రను అందించేవిగా పాత్రల స్వభావాన్ని తీర్చిదిద్దుతారు. ఉద్యమాలు జీవితానుభవంలోంచి రావాలి తప్ప, పుస్తకాలలోంచి కాదు. ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధంలేని జీవితాలలో కూడా ఆర్థికసూత్రం ప్రధాన ప్రాత నిర్వహిస్తున్న తీరును కాళీపట్నం చాలా కథల్లో కనబడుతుంది. సమస్యా పరిష్కారాలలో జీవితాన్ని నడిపే గతితార్కిక సూత్రాలను తన కథలకు అంతస్సూత్రంగా చేసి ఆవిష్కరించటమే రచయితగా కాళీపట్నం రామారావు కథా రచనలోని ఉద్దేశిత లక్ష్యం.

మాజికల్ రియలిజమ్ పేరుతో పాఠకులకు అర్థంకాని ప్రయోగాలతో గందరగోళ పరిచే రచయితలు గొప్ప రచయితలుగా, మేథో రచయితలుగా గుర్తించబడటమే లక్ష్యంగా వున్న రచయితలు . ఒక కాఫ్కానో, డెరిడానో, మరో పుకోవ్ ,మార్క్వెజ్ లను చదివితేనే అర్థమయ్యే కథా రచయితలందరు కాళీపట్నం రామారావు కథల్ని మళ్ళీ మళ్ళీ చదవాలి. సాహిత్య రచన ద్వారా సామాజిక బాధ్యతా నిర్వహణలో చురుకైన, సజీవమైన పాత్ర నిర్వహించాలి. సాహిత్యాన్ని ప్రజలకు అత్యంత సమీపానికి తీసుకు పోవాలి. అంటే సమస్యలని ఆవిష్కరించటానికే పరిమితం కాకుండా పరిష్కారాల వైపుకు కూడా పోవాలనే సూచనను తన కథాసాహిత్యం ద్వారా గుర్తుచేయడమే కథల గురువు కాళీపట్నం రామారావు కథా దృక్పథం.

sreedevi k–కిన్నెర శ్రీదేవి

 

 

 

 

ఊపేసిన కారా కధలు

 

నేను సీరియస్ కధలు చదవడానికి ముందు నుంచే కధల పుస్తకాలు సేకరించి పెట్టుకోవడం అలవాటుగా ఉండేది. అలా సేకరించి పెట్టిన పుస్తకాల్లో “యజ్ఞంతో తొమ్మిది” పుస్తకం కూడా ఒకటి. పేపర్లలో, వీక్లీల్లో జరిగే చర్చను బట్టీ, బాగా వొచ్చిన సమీక్షల్ని బట్టీ పుస్తకాలు సేకరించేవాడిని. ఆ రోజుల్లో బాగా చర్చ జరిగిన పుస్తకాలలో ఇదీ ఒకటి కావడంతో నా దగ్గరకు చేరిందా పుస్తకం.

ఏదైనా మంచి పుస్తకం అని తెలిసి కొన్న వెంటనే చదవడానికి ప్రయత్నం చేసేవాడిని. మొదటిసారి అర్ధమయీ కానట్టుండేది. తరువాత్తరువాత మళ్ళీ పట్టుపట్టి చదివినపుడు కొంత కొంత అర్ధమయ్యేది. అర్ధమయ్యేకొద్దీ పాత్రలు నా చుట్టూ ఉన్నట్టనిపించేవి. జీవితం సంక్లిష్టంగా ఉన్నదశలో, పేదరికం మనుషుల్ని కసాయి వాళ్ళుగా చేసే రోజుల్లో, వివక్ష రాక్షసంగా రాజ్యమేలుతున్నపుడు ఈ కధల్ని చదివి ఊగిపోయాను.

కధల్లో పాత్రలు ఎంతో సజీవంగా ఉండేవి. నా చుట్టూ జరుగుతున్న జీవితం కధల రూపంలోకి వచ్చినట్లనిపించేది. పాత్రల మధ్య ఘర్షణ మనసును పిండేసేది. నా చుట్టూ జనాలకి జరుగుతున్నది, నాకు జరుగుతున్నది కధల రూపంలోకి వొచ్చినట్లనిపించేది. ప్రతి కధా చదివిన తరువాత గాఢమైన అనుభూతి కలిగేది. అర్ధంగాని విషయాలేవో అర్ధమవుతున్నట్టుగా అనిపించేది.

‘యజ్ఞం’ కధ మీద చర్చోపచర్చలు ఎక్కువగా జరిగాయి. కాబట్టి ఆ కధని ప్రత్యేకంగా చదివేవాడిని. చాలా పెద్ద కధ అయినా పట్టు బట్టి చదివేవాడిని. అయితే అప్పుడు ఆ కధలో అంత తాత్వికత ఉందని కానీ, ఒక్కో పాత్ర ఒక జీవితాన్ని సమగ్రంగా చిత్రీకరించిన వైనాన్నిగానీ, కధ నిండా అంతర్గతంగా రాజకీయాలు చిత్రితమైనవని గానీ తెలియలేదు. కధ ముగింపు మాత్రం సంచలనాత్మకం కావడంతో ఎక్కువగా ఆకర్షించింది. ఈ కధని ఆ రోజుల్లోనే రెండు మూడు సార్లు చదివాను. మొత్తమ్మీద ఈ కధలు చదివినప్పుడు కధలిలా రాయాలి అనేది అర్ధం అయ్యింది. భాషను ఈ విధంగా ఉపయోగించవచ్చు అని తెలిసింది. అక్కడక్కడ ఒకటీ అరా కధలు చదివిన దానికంటే కూడా ‘యజ్ఞంతో తొమ్మిది కధలు’ చాలా దగ్గరగా అనిపించిన కధలు. ఈ కధల ప్రభావం నా మీద ఎక్కువగానే ఉన్నాయనిపిస్తుంది.

మొదట కధలు రాసేటప్పుడు పేరున్న కధల్ని అనుకరించడం సహజంగా జరిగేదే. అలాగా నేను యజ్ఞం కధని అనుకరించి కధ రాయడానికి ప్రయత్నించాను. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒకమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అయితే పేదరికమొక శాపమైతే ఆ అమ్మాయికి అందం కూడా మరొక శాపమౌతుంది. అందువల్ల ఎంతో క్షోభ అనుభవిస్తుంది. ఎంతోమంది చేత హింసింపబడుతుంది. బలాత్కరించబడుతుంది. కట్టుకున్న భర్త అసహ్యించుకుంటాడు. ఆమె కూడా చనిపోవాలనే అనుకుంటుంది కానీ తనకొక కూతురు పుట్టడం వల్ల ఆ పిల్ల గురించి ఆలోచిస్తుంది. తరువాత తన కూతుర్ని గురించి ఆలోచిస్తే తాననుభవించిన హింస తన కూతురు కూడా అనుభవిస్తుంది కదా! అచ్చం తన పోలికలతోనే పుట్టిన ఆ పిల్ల పెరిగి పెద్దయి తనలాగే కష్టాలు అనుభవించగూడదని ఆ పిల్ల గొంతులో వడ్లగింజ వేసి చంపేస్తుంది. ఇలా యజ్ఞం కధని అనుకరించి కధ రాశాను. ఆ కధ ముగింపులాంటి ముగింపు ఇవ్వడానికొక కధ రాశానంటే ఆ కధ ప్రభావం నా మీద ఎంత ఉందో అర్ధమవుతుంది. హింస, నో రూమ్, ఆర్తి కధలు కూడా బాగా గుర్తుండిపోయిన కధలు. ఎందుకంటే పల్లెటూరి జీవితం, పేదరికం, అమాయకత్వం, దోపిడీ, కుటుంబ హింస, నిరక్షరాస్యత, అజ్ఞానం ఎంత దుర్భరంగా ఉండేవో చూసేవాడిని. కాబట్టి ఆ జీవితమే కధల్లో చదవడం వల్ల అర్ధమయీ కానట్టుండే జీవితం మరింత అర్ధం కాసాగింది.

భాష కూడా బాగా ఆకర్షించింది. ఉత్తరాంధ్ర మాండలికమైనప్పటికీ కారా మాష్టారు ఆ రోజుల్లోనే భాషను సరళం చేశారనిపిస్తుంది. ఎందుకంటే అస్తిత్వం పేరుతో, అర్ధంకాని మాండలికంతో రాసిన తెలంగాణా కధలెన్నో చదవలేక, చదివినా అర్ధం కాక ప్రక్క పెట్టేవాడిని. సంక్లిష్టం కాని మాండలీకం కావడం వల్ల కధలు చదవడానికి, అర్ధం చేసుకోవడానికి సులువయ్యేది. కధల శైలి, అతికిపోయినట్టుండే శిల్పం, జీవితాన్ని యధాతధంగా చిత్రించిన తీరూ ఖచ్చితంగా నేను కధలు రాయడానికి ఎంతో దోహదం చేశాయి. ప్రకాశం జిల్లా మాండలికం ఉపయోగించి కధలు రాయడానికి ‘యజ్ఞం’ కధ నాకు ప్రేరణ అయ్యింది.

DVR_7884–మంచికంటి వెంకటేశ్వర రెడ్డి

జీవితానుభవాలే కథలు

కథలు ఎలా రాయాలి అనే ప్రశ్నకు కారా గారి కథల నుండి సమాధానం

 

ఒజ్జ పంక్తి

photo(2)జీవితానుభవం నుండి జాలువారే సృజనానుభవం కథగా రూపుదిద్దుకుంటుంది. కవి కూడా ఋషిలాగా క్రాంతదర్శనం చేసి, సమాజంలో రాబోయే పరిణామాలను ముందుగానే ఊహించి, వాటిని కథలలో పొందుపరుస్తాడు. మార్పు వలన కలిగే కష్టనష్టాలపై ముందుగానే హెచ్చరించే  ‘సాహితీ పోలీస్’  రచయిత . ఈ లక్షణాలన్నీ కారా మాస్టారి కథలకు వర్తిస్తుంది. తెలుగు కథకు మారుపేరైన ‘యజ్ఞం’  కథ నుండి ఆయన కలం నుండి రూపుదిద్దుకున్న ప్రతి కథలోనూ, సమాజంలోని భిన్న పార్శ్వాలను ‘మల్టీవిటమిన్ టాబ్లెట్’ లాగా పఠితలకు అందించారు. రంగురాయిలా కనబడే కథావస్తువును ‘కారా’ తన శిల్పనైపుణ్యంతో పాలిష్ చేసిన రత్నంలాగా మలచి కథాత్మకంగా తయారుచేశారు .

చిన్నతనంలో గుంట ఓనమాలు దిద్దుతూ అక్షరాలను నేర్చుకుంటాము. అలాగే కథలు రాయాలనుకునే వారికి ‘కారా మాస్టారి’ కథలు గుంట ఓనమాలుగా  ఉపయోగపడతాయి. కమండలంలో  సాగరాన్ని బంధించినట్లుగా పెద్ద నవలలు చేయలేని పనిని ‘ సామాజికస్పృహ’  కలిగిన కారా కథలు/ కథానికలు  చేశాయి. పదాడంబరం లేని శైలితో , దిగువ , మధ్య తరగతి సమస్యల నేపధ్యంగా రాసిన కారా కథలు సమాజంపై బులెట్ల  లాగా పేలాయి. రచయితలను, పఠితలను ఆలోచింప చేశాయి. అనుసరించేటట్లు చేశాయి. వర్థమాన రచయితలకు నిఘంటువుగా నిలిచాయి. రాస్తే కథానికలే రాయాలి అన్నంత స్ఫూర్తిని నింపాయి.

స్వచ్ఛత, స్వేచ్ఛ, నిరాడంబరత, భవిష్యత్ దర్శనం అనేవి కారా కథల ప్రత్యేకత. ఈనాటి సమాజ స్వరూపాన్ని 50 సంవత్సరాల ముందే  ‘టైం మిషన్’ లో చూపినట్లుగా ఆయన కథలలో మనకి చూపించారు.  కాళీపట్నం రామారావు మాస్టారు ఒక ప్రాంతానికి, వర్గానికి, భావజాలానికి ప్రతినిధి అయ్యి కూడా కలంలో బలం, నిబద్ధత, నిమగ్నతలతో ఆయన చేసిన సాహితీసేవ ‘కేంద్ర సాహితీ అకాడమీ  పురస్కారాన్ని’  పొందేట్లు చేసింది. సమాజం పట్ల రచయితలకు గల గురుతర బాధ్యతలను తెలుసుకొని ,  ‘కారా‘  కథలను ఒజ్జ పంక్తిగా  చేసుకొని కలం పట్టే రచయితలు స్వాతి ముత్యం లాంటి అచ్చ తెలుగు కథా సాహిత్యాన్ని సృష్టించగలుగుతారు. అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకోగలుగుతారు.

డా. నీరజ అమరవాది .