ఆ పిల్ల …

Spring Explosive

-రమాసుందరి 

 

ఈ పిల్ల నాకు గుర్తుంది

అపుడెపుడో పచ్చని ఆకులు సన్నని జల్లుతో జోడు కట్టినపుడు

నేరేడు పండ్ల చెట్టు కింద నుండి పుస్తకాలు

గుండెకు హత్తుకొని తలవంచుకొని నడిచి వస్తూ ఉండేది.

ఆ పిల్ల నాకు ఏయూ అవుట్ గేటు కాడ

గద్దరు పాడుతుంటే బొంగురు గొంతుతో కోరస్ యిస్తూ కనబడేది

ఏడాదికోసారి శ్రీకాకుళం బొడ్డపాడులో

స్థూపం దగ్గర వంటరిగా కూర్చొని ఉండేది.

తరువాత యూనివర్సిటీ గోడల్లో

జేగురురంగులో వంకర టింకరగా యింకి పోయి కనిపించింది

సుల్తాన్ బజార్ గల్లీలో మారుమూల షాపులో

న్యూస్ ప్రింట్ కాగితంలో పెళుసు బారి స్థిరపడింది.

ఇటీవల చానా రోజులుగా ఆ పిల్ల కనబడలేదు.

మళ్ళీ చూశానా పిల్లని మొన్నా మధ్య

నెమలి ఈకలంత మెత్తదనంతో స్పర్శిస్తుంది చిన్నిపాపలను

మందపు అద్దాలతో తీక్షణంగా చూస్తోంది ఎవరి వైపో

ఆదర్శమో, ఆచరణో, ఆయుధమో ఏవో ఆ పిల్ల భుజం మీద వేలాడుతున్నాయి

చెట్లు కమ్ముకొన్న ఆకాశం కింద

చల్లని దారుల్లో

ఆ పిల్ల నాలో నుండి సాగిపోవడం చూశాను

వద్దు వద్దని నా గొంతు పెగలక ముందే

తిరిగి వచ్చి నా దగ్గరే కూర్చొని అడవి కబుర్లు చెప్పింది

యిత్తులు వేసి వచ్చిందంట కొలిమిని ఊదీ వచ్చిందంట

పంటలు పండే కాలం తొందరలోనే ఉందన్నది.

ప్రేమగా ఆమెను తాకబోతే

చెయ్యి పెగిలి ఉంది

కాలు కమిలి ఉంది

ఇదిగో చూడని

మర్మాంగాన్ని తెరిచి చూయించింది

గుత్త సంపదదారుడు కార్చిన సొంగ

పొంగి పొరులుతుంది అక్కడ

వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను చూసి

వెక్కిరింతగా నవ్వింది

నిన్ను చూసి నువ్వు ఏడ్చుకొంటావెందుకని ప్రశ్న వేసింది

వేలు బెట్టి గుండెకు ఆనించి

నా కళ్లలోకి చిరునవ్వుతో చూస్తూ

నువ్వు యింకా బతికే ఉన్నావని చెబుతూ

మాయమయి పోయింది.

*

రమాసుందరి

రమాసుందరి

 

 

 

 

 

 

 

 

 

మట్టి పరిమళం ఎగజిమ్మిన కధలు

 

 

రమాసుందరి

రమాసుందరి

కొంతమంది వ్యక్తులు ఉంటారు. స్వాప్నిక సుషుప్త అవస్థలో మనకు అత్యంత చేరువగా ఉంటారు. స్నేహంగా స్పర్శిస్తారు. ప్రేమగా సంభాషిస్తారు. అమితంగా స్పందిస్తారు. మన ప్రాచీన స్మృతిలో పోగొట్టుకొన్నదాన్నేదో గుర్తు చేస్తారు. చెయ్యి పట్టుకొని అందమైన తోటల్లోకి, అద్భుతమైన సమాజంలోకి మనల్ని విహంగ విహారం చేయిస్తారు.  అలాంటి వ్యక్తులు కధలలో పాత్రలుగా మారితే నిజ జీవితంలో మనసు మారుమూలల్లోకి వెళ్ళి పేరుకొని పోయిన అశుచిని శుద్ధి చేస్తారు. ఆ పాత్రలే ఒక సైన్యంగా మారి మనిషిలో దాగున్నశత్రువును హతమారుస్తాయి. అలాంటి  పాత్రలు ఉన్న కధలు మనిషి పరిమళంతో, స్వచ్ఛమైన స్నేహ పరిమళంతో, కులరహిత సమాజ పరిమళంతో, కల్తీలేని ప్రేమ పరిమళంతో, నికార్సైన అనుబంధాల పరిమళంతో, బలమైన జ్ఞాపకాల పరిమళంతో, అడవి పరిమళంతో, త్యాగాల పరిమళంతో, సహజీవన సౌందర్య పరిమళంతో, సమసమాజాన్ని స్వప్నించిన  యువతీ యువకుల ఆశల పరిమళంతో .. యిన్ని పరిమళాలు కలగలిసిన  ‘జాజి పూల పరిమళం’తో మనసంతా సుగంధం చేసి సంతోష పెడతాయి.

‘జాజిపూల పరిమళం’ పుస్తకం (కధలు) ఎందుకు చదవాలి అంటే నేను చాలా కారణాలు చెబుతాను. అవన్నీ నా యిష్టానికి, తత్వానికి సంబంధించినవి. వాటితో సంబంధం లేకుండా  ‘కధను ఎంత సులభంగా చెప్పవచ్చో’, ‘సంభాషణలు ఎంత సహజంగా రాయవచ్చో’, ‘కధనాన్ని ఎంత నిరలంకారంగా నడిపించవచ్చో’ ఈ కధల ద్వారా  నేర్చుకోవచ్చు. వీటన్నిటిని మించి పుస్తకం ద్వారా అబ్బే సంస్కారం ఒకటి ఉంటుంది. దాన్ని ఈ కధల ద్వారా పుష్కలంగా అందుకోవచ్చు. సమాజాన్ని అపోసన పట్టిన వ్యక్తుల నుండి జిజ్ఞాస గలిగిన వ్యక్తులు అందుకొనే ఎరుక  అద్భుతమైన ఆహ్లాదాన్నిఇస్తుంది. మనసు తెరిచి మంచిని ఆహ్వానించే వాళ్ళు ఆ ఆహ్లాదాన్ని అమితంగా పొందవచ్చు. దాదాపు నలభై కధలు ఉన్న ఈ పుస్తకంలో కొన్ని కధలు పురుషాధిక్యత, స్త్రీ పురుష సమానత్వం, సామాజిక కుటుంబిక దొంతరలలో స్త్రీలపై జరిగే అణచివేతలను  మైక్రో లెవెల్ లో చర్చించాయి. అయితే ఈ పుస్తకంలో సగం కధల్లోని కధా వాతావరణం పాఠకులకు కొత్తగా ఉంటుంది. కొన్ని సమస్యలు కూడా కొత్తవే. మనుషుల మధ్య సంబంధాలకూ, అనుబంధాలకూ, త్యాగాలకూ, సంతోషాలకూ కొత్త అర్ధం ఈ కధలు తెలియచేస్తాయి. ఈ కధల్లో ప్రధాన పాత్రలు స్త్రీలే. చైతన్యవంతులైన స్త్రీలు సమాజాన్ని అర్ధం చేసుకొనే క్రమాన్ని అద్భుతంగా రాశారు షహీదా.

కులం మనిషి జీవితంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది? ‘దేవుడే అందర్నీ చేశాడు కాబట్టి మనుషులందరూ సమానమే’ అనే ప్రాధమిక భావన నుండి ‘కులం తోటివారి నుండి మనల్నివేరు చేస్తుంది’ అనే స్పృహ పిల్లలకు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా పరిణితి చెందినట్లు. అగ్రకుల లాభ ఫలాలు అనుభవం అయ్యే పిల్లల్లో కూడా కులం లేని జీవితంలో ఉన్న మాధుర్యం, సహజత్వం అనుభవం అయ్యాక యిక దాన్ని ప్రతిఘటించటం అనివార్య చర్య అవుతుంది. ఆ ప్రతిఘటన ఒక్కోసారి నిరసనగా  ‘మీరు! మేము??’ కధలో శ్రీవిద్య లాగా బాత్రూమ్ లో నీళ్ళు పారబోయటం దగ్గర కనిపిస్తుంది.  ఇంకోసారి ‘విభజన రేఖలు’ కధలో శిరీషలాగా తనకు కూడా వీరన్నలాగే ఆకులోనే అన్నం పెట్టమని భీష్మించిన ధిక్కారంగా మారుతుంది. కులం గురించి ఇంకా గాఢంగా చర్చించిన కధ ‘ఒకటీ, ఒకటీ ఎప్పుడూ రెండేనా?’  సమాజపు కట్టుబాట్లను ఎదిరించిన ‘సక్సెస్ ఫుల్ దళిత యువకుడు’, ‘ప్రోగ్రెసివ్ అగ్రకుల యువతు’ ల మధ్య చివురించిన ప్రేమ వారిద్దరికి సంబంధించినదైనా పెళ్లి మాత్రం సమాజానికి సంబంధించిందనే అవగాహన ఈ కధ నేర్పుతుంది. ‘చదువుకొని పైకి వచ్చిన దళిత యువకులను అగ్రవర్ణ యువతులు ఎగరేసుకొని పోతే మా దళిత ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది కదా’ అనే ప్రశ్నకు చలించి పోయిన మౌనికకు ‘కులాంతర వివాహాలు చేసుకొని కుటుంబానికి పరిమితం అయితే యిలాంటి ప్రశ్నలే వస్తాయి. కుల నిర్మూలన కోసం ఆ దంపతులు కృషి చేస్తేనే ఆ వివాహానికి నిజమైన అర్ధం ఉంటుంది.’ అని అంతర్లీనంగా కధ యిచ్చిన జవాబు ఎంత సముచితమైనది! ఈ జవాబు విప్లవోద్యమంలో కలిసి పని చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకొంటున్న అనేకమంది యువతీ యువకులకు చక్కటి వివాహ సందేశం. గుంపుగా కలిసి తిరిగే చిన్న చేపలు అన్నీ కలిసి ఒక పెద్ద చేపను స్ఫురింప చేస్తాయనే అనే అర్ధవంతమైన ప్రతీకతో కధ ముగుస్తుంది.

ఈ పుస్తకంలో చక్కటి ప్రేమ కధలు కూడా ఉన్నాయి. ఆ ప్రేమలు రూపం, డబ్బు, హోదా, కెరీర్ లాంటి కృతకపు విలువలను మోసే వ్యక్తులను కాకుండ వస్త్ర, అలంకార రహితమైన వ్యక్తి నికార్సైన ఆత్మలను ప్రేమిస్తాయి. వ్యక్తులతో అనుసంధానమైన సామాజిక బాధ్యతలను ప్రేమిస్తాయి. వ్యక్తి ప్రేమ నుండి సామాజిక ప్రేమకు అవి ప్రవహిస్తాయి. అందుకు సంబంధించిన షరతులకు తలవొగ్గక పోతే ఆ ప్రేమను తిరస్కరిస్తాయి. కొంకణీ  వెళ్ళే రైలులో తారసపడిన ఒకప్పటి ప్రియురాలు ‘సుజీ’ చిక్కిపోయి, కళ్ళు గుంటలు పడి, వెంట్రుకలు నెరిసి పోయి ఉన్నా ఆలోచనలలో యవ్వనంగానే ఉంది. ఆరెంజ్డ్ మారేజ్ చేసుకొన్న ఆమె ఒకప్పటి ప్రియుడు మందుల కంపెనీలో పని చేస్తుంటే ఆమె ఒక మతోన్మాద వ్యతిరేక సంస్థలో పూర్తి కాలం పని చేస్తుంది. ఇద్దరూ గతాన్ని వడబోసుకొంటారు. ఈ కధలో బాబ్రీ మసీదు కూడా ఒక పాత్రే. ప్రేమికులను విడదీసిన దుష్ట పాత్ర. ఆ దుష్టత్వం పరోక్షంగా వాళ్ళిద్దరినీ విడదీసింది. ‘నేను లేక పొతే తను ఉండలేదనే అనుకొన్నాను అన్నాళ్ళూ …. కానీ నాలాంటి బలహీనుడికే తన అవసరం ఎక్కువుందని అర్ధం కావడానికి ఎంత కాలం పట్టిందో … తనదేముంది తన విలువలతో బతికేస్తుంది …’ అనుకొంటాడతను. ‘పైకి ఎంత అభ్యుదయంగా ఉన్నా నీలో తొంగి చూసిన ఆ హిందుత్వవాదిని ఆ రోజు చూసి తట్టుకోలేకపోయాను… నిన్నే కాదు ఎవర్నీ, దేన్నీ సగం సగం ప్రేమించడం రాలేదురా, ఇప్పటికీ అంతే …’ చెప్పుకొంటుందామె. అయితే ఆమె ప్రేమద్వారా పొందిన ఉన్నత సంస్కారం అతనిలో నిగూఢంగా దాగి ఉంది. గుజరాత్ అల్లర్లలో తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డను తెచ్చి సాక్కుంటాడు. ఆ విషయం అప్పటికే తెలుసుకొన్న సుజీ అతని ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళింటికి అతిధిగా వెళ్లడానికి ఒప్పుకోవటంతో కధ ముగుస్తుంది.

అలాంటిదే ఇంకో కధ  ‘విప్లవంలో ఓ ప్రేమ కధ’. ‘అతను నక్సలైట్లలో కలుస్తాడు నాకు తెలుసు. బతుకు పాడు చేసుకోకు’ ఎస్సై హితబోధ. ‘అతనలా ఉంటాడనే నేను యిష్టపడింది. అందుకోసం వదిలేయమంటాడేంటి?’ ఆమె విస్మయం. ఆమె విశ్వాసం ఆమె ప్రేమ మీద మాత్రమే కాదు. అతని ప్రిన్సిపుల్స్ మీదా, జీవితం పట్ల అతనికి గల దృక్పధం మీద, అన్యాయాన్ని ఎదిరించి దేనికైనా సిద్దపడే అతని స్వభావం మీద. ఇతరుల కోసం త్యాగం చేసే తత్వం, నిస్వార్ధం లేకుండా అతను లేడు. అతని పై శ్యామల ప్రేమా ఉండదు. విప్లవానికి వారిద్దరూ ఉండరు. ప్రేమ అనే మాటను ధైర్యంగా ఉపయోగించే అవకాశం కల్పిస్తుంది శ్యామల. ఆ నమ్మకంతోనే అడివికి వచ్చి అమరురాలు అవుతుంది.

మదర్ థెరేసా మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకొనే వాళ్ళకీ, మదర్ థెరేసాల అవసరమే లేని సమాజం రావాలని కోరుకొనేవాళ్ళకు ఉన్న తేడా ఎంత? సమాజాన్ని యిలాగే ఉంచి ఉద్ధరిద్దామని అనుకొనేవాళ్ళకూ, దాన్ని సమూలంగా మార్చివేయాలని కోరుకొనే వాళ్ళకూ ఉన్నంత తేడా. బడుల్లో సోషల్ వర్క్ క్లాసుల గురించి క్రిటికల్ గా రాసిన కధ ‘సోషల్ వర్కూ – సోషలిజమూ’. ఇంచుమించు ఇలాంటి సందేశాన్నే మోసుకు వచ్చిన కధ ‘జ్ఞాపిక’.  ‘లోపలి’ నుండి వచ్చిన ఒక మహిళా రోగి నర్మద బాధ్యత సంతోషంగా స్వీకరిస్తాడు శంకర్. కొద్దిగా కోలుకొన్నాక ఆసుపత్రి నుండి యింటికి తీసుకొని వెళతాడు. ఆమెతో సాహిత్యం, సినిమాల గురించిన అభిప్రాయాలు పంచుకొంటాడు. కలిసి వండుకొని కబుర్లు చెప్పుకొంటారు. ఆమె ప్రేమ కవిత్వాన్ని బిడియంగా చదువుతుంటే విని ఆస్వాదిస్తాడు. కొనే ప్రతి వస్తువు దగ్గర ఆమె ‘ప్రజల డబ్బు’ అంటూ జాగ్రత్త పడుతుంటే అబ్బురపడతాడు. ఆమెతో గడిపిన ప్రతి క్షణం ఒక గొప్ప అనుభవంగా, పాఠంగా దోసిలి పడతాడు. ఆమె ‘లోపలికి’  వెళ్ళి పోయే రోజు దగ్గర పడుతుంది. దిగులుగా అలిగి కూర్చోంటాడు. ఎన్ని రోజులుగానో అతనిని వేధిస్తున్న ప్రశ్నకు జవాబు చెప్పటానికి ఆమె సంసిద్ధం అవుతుంది ఆమె అప్పుడు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె దాచుకొన్న భరిణా, అందులో వంద రూపాయల నోటూ ఎవరి జ్ఞాపికలు? ప్రేమించి ఆమెతో అడవి దాకా అడుగులు వేసిన ఆమె భర్తవనే అనుకొంటాడు. కానీ ఆమె వెళుతూ చెప్పిన చివరి పాఠం అన్నిటి కంటే అమూల్యమైనది. డబ్బే లేని సమాజం రావాలని కోరుకొనే వాళ్ళు డబ్బు దాచుకోనవసం లేదు. ఆ నోటు ‘తీసుకోవటమే తప్ప యివ్వటం చేతకాని’ ఆమె చిన్నప్పటి పనిమనిషి యిచ్చినది. పార్టీ తనలాంటి పేద ప్రజల విముక్తి  కోసం పనిచేస్తుందనే నమ్మకంతో పంపిన పార్టీ చందా అది. అలాంటి లక్షలాది విప్లవాభిమానుల ఆశలనూ, కోరికలనూ మనసులో మోసుకొని నర్మద ‘లోపలికి’ వెళ్ళి పోతుంది.

పార్టీలు, ప్రజా సంఘాలు ఎలా నడవాలి? ఎవరి కోసమైతే పని చేస్తున్నామో ఆ  పేద ప్రజల మీదే ఆర్ధికంగా ఆధారపడితే వాళ్ళు ఏమి యివ్వగలరు? అసలు వాళ్ళను ఎలా అడగగలం? ఇలాంటి సందేహాలు విప్లవోద్యమంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో వస్తాయి. ఆ సందేహాలకు చెంప చెళ్లుమనే సమాధానం ‘అర్ధ శేరు ధాన్యం’ కధ చెబుతుంది. సంఘం కోసం బియ్యం, డబ్బులు అడుగుతూ పేద దళిత వాడకు వెళతారు. ఎవరికి తోచింది వాళ్ళు కాదనకుండా యిస్తారు. దరిద్రం, అనారోగ్యం, పోషహాకార లోపం పిల్లల్లో, మహిళల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. చివరి ఇంట్లో భర్త వలస పోయి ఉంటాడు. భార్య జ్వరం వచ్చిన కొడుకుకు గుడ్డ కూడా కప్పలేని దారిద్యంతో ఉంటుంది. ఆమెను మంచి నీళ్ళు మాత్రం అడిగి పోయించుకొని తాగి తిరిగి రాబోతారు. ‘అందరిండ్లలో అడిగిన్రు .. మమ్మల్నడుగుత  లేరన్నా?’ ఆమె ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ‘సగం శేరు దంచిస్తా’ అని వాళ్ళను కూసోబెట్టి అక్క వేస్తున్న ఒక్కొక్క పోటు వాళ్ళ సందేహాలను పటాపంచలు చేస్తుంది. ఎంత ఆర్ధ్రమైన కనువిప్పు! పేద వాడల్లో విరాళాలు వసూలు చేయటం అంటే వాళ్ళతో బంధాన్ని గట్టి పరుచుకోవటమే కదా.

రహస్యోద్యమాన్ని వెన్నుతో కాచిన వాళ్ళు విప్లవ సానుభూతిపరులు. కుటుంబాలకు కుటుంబాలు, తరాలకు తరాలు ఉద్యమాలకు  నిండు హృదయంతో సహాయ సహకారాలు అందించటం వలనే అవి మనగలిగాయి. ఏళ్ళ క్రితం అందించిన ఆయుధాలను భద్రంగా దాచి ఇవ్వాల్సిన వాళ్ళకు యివ్వాల్సిన పద్దతిలో అందచేయటం చేయటంలో పార్టీకి గుర్తు చేసిన కర్తవ్యం ‘మళ్ళీ మొదలు పెట్టమని’. ఆ సమూహాలు ఎన్ని రోజులు పార్టీకి భౌతికంగా దూరంగా వున్నా మానసికంగా అక్కడే ఉంటాయి. ఆ కార్మికవర్గ మనస్తత్వాన్ని కళ్ళకద్దుకొని ఆ కర్తవ్యాన్ని తలకెత్తుకోవాలనే చెప్పే కధ ‘మొదలు’.

ఎన్ని కధలు! ఎంత జీవితం! ఎంత ఘర్షణ! ఎన్ని పోరాటాలు! ఎన్ని మథనాలు! ఎన్ని సందేశాలు! ఇవన్నీ ఎంత సహజంగా రాయగలిగారు షహీద! నీటిలో చేపలాగే ప్రజలలో మమేకమైన వారికే కదా ఇంత బతుకు తెలిసేది! ప్రజల ఆకాంక్ష, వాంఛ, భాష, నడక, నడత తెలిసిన వాళ్ళు మాత్రమే కదా ఇంత బాగా వ్యక్తీకరించగలిగేది!

*

పిచుకమ్మలందరు గెలిచే సమాజం మనకింకా రాలేదు: స.వెం.రమేష్

ramasundari

రమాసుందరి

“కాకికి కడవడు, పిచుక్కి పిడుకుడు” కధ మనమందరం చిన్నప్పుడు అమ్మమ్మల నుండి, నాయనమ్మల నుండి విన్నదే. పిచుకమ్మ “ఆబగూబలు అణిగిపోయేదాక; అక్కులు, చెక్కులు ఎండిపోయేదాక; ఆయిలో ఊపిరి కోయిలోకి వచ్చే దాక” చాకిరి చేసి పండిస్తే; కాకి తనకు కడివడు, పిచుక్కి పిడికెడు పంచింది. “కయ్య నాది, పైరు మీద పెట్టుబడి నాది.” అంది. పిచుకమ్మకు జరిగిన ద్రోహం విని అందరం కళ్ళనీళ్ళు పెట్టుకొన్న వాళ్ళమే. అదే అఘాయిత్యం మన ఇంట్లో జరిగితే ఆ కళ్ళనీళ్ళు రాలుతాయా? స. వెం. రమేష్ కి రాలాయి. కళ్ళనీళ్ళు రాలటమే కాదు, కళ్ళు ఎరుపెక్కి కసిగా “కాకికి కడవడు, పిచుక్కి పిడుకుడు” కధను తిరగ రాసాడు.

తన కుటుంబంలో జరిగిన ఆర్ధిక,కుల దోపిడీ, అణచివేతలను తన భాషాసౌందర్యంతో, తన విశిష్ట కధా కౌశల్యంతో తూర్పార పట్టాడు.  తన అవ్వలు, అమ్మలు చేసిన  పాపాలను వీపు మీద మోస్తూ ఈ కధ రాసాడు. అంటరానితనాన్ని నిర్ధాక్షిణ్యంగా చీల్చి చెండాడిన కర్కశత్వం ఈ కధకుంది. ఆర్ధిక దోపిడి మూలాలు చూయించిన విస్తృతత్వం ఈ కధకుంది. తరాలు మారిన కులం పునాది కదలలేదనే చేదు నిజం ఈ కధ చెబుతుంది. దళితుజనుల స్వీకరణ తమ సౌకర్యానికే  జరిగింది కాని, హృదయ పరివర్తనతో జరగలేదన్న కఠిన వాస్తవం ఈ కధ చెబుతుంది. రూపం మార్చిన అణచివేత, భూతం లాగా దళితులను ఇంకా వేధిస్తుందని చెబుతుంది.

తన ఇంటి మాలితి (పాలేరుకి స్త్రీలింగం) మంగమ్మ జామపండ్లతో బాటు పంచి ఇచ్చిన కమ్మని అమ్మతనాన్ని, నిజాయితీతో కూడిన సేవల సౌకర్యాన్ని బాల్యంలో అనుభవించిన ప్రాణం, ఆమెకు జరిగిన అన్యాయాల పరంపరను కూడ గుర్తెరిగింది. ” నిన్న నేనూ, మీ అవ్వ కొట్టిన దెబ్బలలకు దడుసుకొని జెరం వచ్చింది వాడికి. తగ్గినాక వస్తాడులే” అని కళ్ళు తుడుచుకొన్నమంగమ్మ గుండె కోతను తన గుండెలోతుల్లో గీసి దాచుకొన్నాడు. పిచుకమ్మ కధ చెబుతూ కొతుకు పడిన మంగమ్మ గొంతులో దుఃఖజీరల వెనుక, పిచుకమ్మలో తనను తాను చూసుకొన్న ఆమె అంతరంగాన్ని ఆకళింపు చేసుకొన్నాడు. పెరిగి పెద్దై ఈ కధ రాసి మనల్ని కూడ ఆత్మావలోకనం, ఆత్మ విమర్శ చేసుకోమని చెబుతున్నాడు.

Qప్రళయ కావేరి కధల్లో సామూహిక జీవన సౌందర్యం, పల్లె ప్రజల జీవానానందాలు, మానవతా విలువలు కలగలిసి దృశ్యీకరించారు. కులాల ప్రసక్తి ఉండింది కాని, కుల వివక్షత గురించి లేదు. కధలో మీరు లేవనెత్తిన అంశాల వెనుక మీ మారిన దృక్కోణం ఏమైనా ఉందా?

ప్రళయ కావేరి కధలు నా బాల్యానికి చెందినివి. బాలుడిగా నాకా అనుబంధాలే గుర్తు ఉన్నాయి. కాని ఎదిగిన మనసుతో ఇప్పుడు పరికిస్తే మా కుటుంబం పాటించిన వివక్ష నా జ్ఞానానికి అందింది. సరిదిద్దలేని, క్షమించలేని అణచివేతకి, వివక్షకి కొన్ని తరాలుగా మన పెద్దవాళ్ళు పాల్పడ్డారు. ఈ మధ్య ఒకాయన ఏదో చర్చలో “మా తాతలు చేసిన తప్పులకు మమ్మల్ని ఎందుకు భాధ్యుల్ని చేస్తారు? ” అని అడిగారు. తప్పక బాద్యత వహించాలి అంటాను నేను . అలా బాధ్యత వహించటానికి మనం సంసిద్ధంగా లేనట్లైతే మనం మారనట్లే. నేను ఎంత సంస్కర్తనైనా ‘బ్రాహ్మిణిజం’ అనే పలుకుకు ఉడుక్కొంటున్ననంటే నాలో ఆ బీజాలు మిగిలి ఉన్నట్లే. ఆధిపత్యానికి పర్యాయపదమే బ్రాహ్మనిజం.

Qప్రళయ కావేరి కధలో ఎంతో ప్రేమించి రాసిన అవ్వ పాత్రను, కధలో తీవ్రంగా తులనాడారు. ప్రళయకావేరి వరదల్లో చనిపోయిన ఆమె చావును, ఆమె పాప ప్రతిఫలంగానే కసిగా తీర్మానించారు. ఇదెలా సాధ్యం?

నా దగ్గర మిత్రులు కూడా దాన్ని ఖండించారు. నేను దేవుడు, దెయ్యాన్ని నమ్మను.  అయితే సహజ ప్రాకృతిక న్యాయం ఒకటి ఉంటుందని నమ్ముతాను. ఈ కధ ప్రధాన ఉద్దేశం తరాలు మారినా కులవివక్ష రూపం మార్చుకొన్నదే కాని, నిర్మూలించబడలేదు అని చెప్పటమే. ఒక దళిత అధికారిని, ఒక పేద అగ్రకులస్థుడిని గ్రామాల్లో స్వీకరించే విధానాన్ని పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్ధం అవుతుంది. దళిత అధికారికి సపర్యలు చేయ వచ్చు. భక్తి శ్రద్ధలు ప్రదర్శించవచ్చు. కాని అగ్రకులాల హృదయపూర్వక స్వీకరణ మాత్రం తమ కులానికి చెందిన పేదవాడికే ఉంటుంది. ఈ దుర్మార్గానికి మా కుటుంబం అతీతం కాదు. కాబట్టి ఈ ఇతివృత్తాన్ని మా కుటుంబం నుండే మొదలు పెట్టాను.

Qనన్ను, మీ పాఠకులందరినీ అబ్బురపరిచేది మీ విశేష భాషా పరిజ్ఞానం. మీరు ప్రళయ కావేరీ సరస్సు ప్రాంతాన్ని వదిలి పెట్టినా ఇప్పటికీ అక్కడి మాండలికం, వాడుక వస్తువులు, అక్కడి శ్రమలు కంఠోపాఠంగా మీ కధల్లో వినిపిస్తారు. ఇది మీ జ్ఞాపకశక్తికి సూచికగా అనుకోవాలా?

అది నాకు ఆ భాష మీద, ప్రాంతం మీద అభిమానం. అమ్మ ప్రేమలో తీపి, అమ్మ భాషలో తీపి మరచిపోగలిగినవి కాదు. అయితే తెలుగు భాషకు సంభంధించి నాకు కొన్ని మనస్థాపాలు ఉన్నాయి. భాషల అభివృద్ధిలో ఆరు మెట్లు ఉన్నాయి. తమిళం ఆరు  మెట్లూ ఎక్కేసింది. తెలుగు మూడో మెట్టు దగ్గర ఆగిపోయింది.  శ్రీపాద, చలం మొదలైన వారి తరువాత తెలుగు వాక్యం ఆగిపోయింది.

ఇక్కడ భాషా సంసృతులని వెన్నంటి కాపాడుకోవాల్సిన  కవులు, మేధావులు ఉదాసీనత వహిస్తున్నారు. మనది కాని దాన్ని మోస్తున్నారు. కవితల్లో కూడ యధేచ్చగా ఆంగ్లాన్ని వాడుతున్నారు. నాకో దళిత స్నేహితుడున్నాడు. అతను బాతిక్, జానపద కళాకారుడు. పేరు పుట్టా పెంచల దాసు. ఎక్కువ చదువుకోలేదు. సాహిత్యం మీద ప్రీతి ఉన్నవాడు. అతను ఈ కవుల కవిత్వాన్ని ఆస్వాదించే అర్హత లేనివాడా? కవి, రచయిత తాను శ్రమించి పాఠకుడికి అర్ధం చేయించగలగాలి. పాఠకుడు శ్రమించాలని కోరుకోకూడదు.

భాష స్థాయి పెరగాలంటే స్థానికీకరణకి ప్రాముఖ్యత పెరగాలి. తెలుగు నాట ఎన్నోమాండలికాలు ఉ న్నాయి. ఈ మాండలికాలు అన్నిటినీ నిర్మూలించి ఒక మాండలికాన్నిమాత్రమే ‘ప్రామాణికం’ చేస్తున్నారు. ప్రపంచీకరణను ఎదిరించాలన్నా స్థానికీకరణ అవసరం ఉంది. ( ఆయా ప్రాంతాల వంటలను రక్షించుకోవటం). దళితులు మూలవాసులు కాబట్టి వారి మాండలికం, వారి జీవనవిధానం, వారి ఆహరపు అలవాట్లు సంరక్షిస్తూ, తెలుగు ప్రజలు దళితీకరణ చెందాలంటాను. ఈ కార్యం తమిళనాడులో చాలా వరకు జరిగింది. ద్రవిడ ఉద్యమం వారికి చాలా సహాయ పడింది.

Qకధలో కష్టపెట్టిన కాకి ఓడిపోయినట్లు, కష్టపడిన పిచ్చుక  గెలిచినట్లు రాసారు. అది మీ అభిలాషా? నిజంగా అలా జరిగిందా?

(నవ్వు) ఈ కధ నా జీవితంలో జరిగిందే. ఇక్కడ ఇంతే జరిగింది. కాని కాకమ్మలందరూ ఓడి పోయి, పిచుకమ్మలందరు గెలిచే సమాజం మనకింకా రాలేదు.

Qదళిత అణచివేత, వివక్షతలను మీరు పేర్కొన్నప్పుడు మీ కుటుంబంలో స్త్రీ పాత్రలకే దాన్ని మీరు పరిమితం చేసారు. పురుషులని అతీతంగా ఉంచారు. దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా?

నాకు 14 మంది అమ్మమ్మలు. వాళ్ళ మధ్య పెరిగాను. స్త్రీల బలాలను, బలహీనతలను దగ్గరగా చూసిన వాడిని. కాబట్టే నా కధలన్నీ స్త్రీల చుట్టే ఎక్కువగా తిరుగుతాయి.