సైసైరా నరసింహారెడ్డి!

palegadu

The importance of history is two folds. One is to draw the awesome inspiration of the heroes born before us. The other one is to learn to cultivate the virtues leading to soliderity and prosperity of a nation, and how to avoid the defects leading to contrary results.

– పుల్లెల రామచంద్రుడు గారు రాజతరంగిణి గురించి రాస్తూ అన్న మాటల సారాంశం అది. ఆయన చారిత్రకుడు కారు కానీ చరిత్రకు ఒద్దికైన పాఠకుడు, అనుశీలి అనుకోవచ్చు. ఆయన అన్న ఆ మాటలు ఏ కొంచెం ప్రామాణికత ఉన్న చారిత్రక రచనకైనా వర్తిస్తాయి.

**********

నేటి రాయలసీమ ప్రాంతాల్లో ఓ సామెత/నుడికారం ఉన్నది. “పోవేయ్, పెద్ద పాలేగాడు తయారయినాడు”. ఇతర ప్రాంతాల వారికి, ఇదేదో తిట్టులా తెలుస్తున్నా, కొంచెం విచిత్రమైన, వింతయిన మాట. అయితే ఆ ’పాలెగాడు’ అన్న మాట వెనుక కొంచెం బరువైన చరిత్రే ఉంది. అందుకనే ఏమో, ’పాలెగాడు’  అన్న ‘పేరు’ మీదే ఎస్.డి.వి. అజీజ్ గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటచరిత్రను నవలగా రచించారు. ఈ చరిత్ర క్రీ.శ. 1846 లో మొదలయ్యింది. అంటే – ప్రథమస్వాతంత్రపోరాటానికి పదకొండు సంవత్సరాలకు ముందు.అప్పటికి  ఆ ప్రాంతాలకు ’రాయలసీమ’ అన్న శబ్దం స్థిరపడలేదు. అప్పటికది ’రేనాడు’.  విజయనగర సామ్రాజ్యపు రాజులు ఆ రేనాటిసీమలో 100 లేదా 200 గ్రామాలకు గుత్తగా ఓ అధికారిని పర్యవేక్షణకై నియమించారు. ఆ అధికారిని పారుపత్తెందారు లేదా ’పాళెయగారు’ అనేవారు. పాళెయగారు- పాలేగారు – పాలేగాడు అయింది. ఆ పాలేగాళ్ళలో కొందరు తాము రాజుకన్నా గొప్పగా అధికారులమన్నట్టు భావించేవారు. అలా ఆ సామెత పుట్టుకొచ్చింది.

అయితే ఆ ‘పాలేగాడు’ కు నిస్వార్థ పోరాట చరిత్ర కూడా ఉంది.

క్రీ.శ. 17 వ శతాబ్దం తర్వాత కుంఫిణీ ప్రభుత్వం భారతదేశంలో ఒక్కొక్క సంస్థానాన్ని లోబరుచుకుంటూ వస్తూంది. క్రీ.శ. 1799 లో టిప్పుసులతాను మరణించాడు. ఆ యుద్ధం తర్వాత రేనాటి సీమ, దుట్టుపక్కల ఇతర ప్రాంతాలు నిజాం నవాబుకు దక్కింది. ఆపై క్రీ.శ. 1800 అక్టోబరు 12 న నిజాం – సీమను బ్రిటీషు వారికి లీజికు ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతాలు సీడెడ్ డిస్తిక్ట్స్ గా పిలువబడుతూ వచ్చాయి.  ఆపైన బ్రిటీష్ ప్రభుత్వం 80 మంది పాలెగాళ్ళను కుట్రతో గుత్తికోటలో బంధించి లొంగదీసుకుంది. ఆ పైన భూమి శిస్తుకు తట్టుకోలేక కర్నూలులో తెర్నేకల్లు గ్రామస్తులు తిరుగుబాటు చేసి అమరులయ్యారు. 1839లో కర్నూలు నవాబు వాహబీ తిరుగుబాటు చేస్తే ఆంగ్లేయులు కుట్రతో అతణ్ణి బంధించారు. ఆ నేపథ్యంలో కర్నూలు జిల్లా కోయిలకుంట్ల, కడప జమ్ములమడుగు మధ్యన ఉన్న అరవై గ్రామాలకు చెంచురెడ్ల వంశానికి చెందిన జయరామిరెడ్డి పాలేగారు. ఇతణ్ణి నొస్సం పాలేగారు. ఇతని నివాసం నొస్సంకోట. ఈ పాలేగారుకు సంతానం లేకపోవడంతో – అతని మేనల్లుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అధికారం దక్కింది. నరసింహారెడ్డి – రూపనగుడిలో పుట్టాడు. జయరామిరెడ్డి ఆంగ్లేయులకు లొంగిపోయింది. ఆ ప్రభుత్వం అతనికి కేవలం 11 రూపాయల తనర్జీ (భరణం/నెలజీతం) ఏర్పాటు చేసింది. ఇది ఆ సంస్థానానికి ఏ మాత్రం చాలని భరణం.

ఆ నేపథ్యంతో మొదలైన నవల యిది.

 

*************

నరసింహారెడ్డి మీద రాయలసీమలో వీథిగాయకులు పాడుకునే జానపదగీతం ఒకటి ఉంది. దాన్ని ’రాయలసీమ రాగాలు’ అన్న పుస్తకంలో మల్లిక్ గారు ప్రచురించారు. అది ఇలా సాగుతుంది.

సైరా నరసింహారెడ్డి

నీ పేరే బంగార్పూకడ్డీ

 

రాజారావు తావుబహద్దరు నారసింహారెడ్డి

రెడ్డి కాదు బంగార్పుకడ్డి నారసింహారెడ్డి

ముల్ కోల్ కట్టె సేతిలో ఉంటే మున్నూటికీ మొనగాడు

రెడ్డి మాటలు ఏదాలురా రాండి సూరులారా (సైరా)

 

మొనగాండ్రకు రేనాటి గడ్డరా – రోషగాండ్రకు పెద్ద పేరురా

దానధర్మములు దండిగ జేసే – పురిటిగడ్డలో పుట్టినావురా

కల్వటాల దండదిగో రా సై – ముక్క ముళ్ళ దండదిగోరా సై

సంజామల దండదిగోరా సై – కానాల దండదిగోరా సై (సైరా)

….

….

బానిసగుండి పాయసం తాగుట మేలుకాదురన్నా

పచ్చులలాగా బతికితె రెండే గింజలు మేలన్నా (పచ్చులలాగా = పక్షులలాగా)

బయపడి బయపడి బతికేకంటే సావే మేలన్నా

ఈరుడు సచ్చిన జగతిలొ ఎప్పుడు బతికే ఉండన్నా (సైరా)

 

నరసిమ్మా అని దూకినాడురా రణంలోన రెడ్డి

తెల్లోలందరి కుత్తుకలన్ని కోసినాడు రెడ్డి

“కోబలీ” యంటా తెల్లసర్కరును నరికెను దండంత

గడ్డ కోసము సావో బతుకో తేల్చుకున్నరంత (సైరా)

 

(పూర్తి పాటకై తెలుగు అకాడెమీ వారి ’రాయలసీమ రాగాలు’ పుస్తకం చూడగలరు)

 

*************

narasimhaఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ – క్లుప్తంగా.

1846, జూలై పది.

కర్నూలు కోవెలకుంట్లలో బ్రిటీషోల్ల ట్రెజరీ కొల్లగొట్టి అక్కడి సైనికులను చంపి భీభత్సం సృష్టించాడు రెడ్డి. అతని పేరు బయటకు వచ్చింది. జూలై 26 న బ్రిటీషు వాళ్ళు లెఫ్టినెంట్ వాట్సన్ అనే వాణ్ణి, సైన్యాన్ని నొస్సంకోటకు పంపారు. భయంకరమైన యుద్ధం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. అయినా సరే, వాళ్ళ  సైన్యం రెడ్డి అనుచరుల చేతిలో చచ్చింది. వాట్సన్ యుద్ధంలో అంగవికలుడై పారిపోయాడు.

అక్కడి నుంచి రెడ్డి, ఆకుమళ్ళ గోసాయి వెంకన్న, ఓబన్న ..ఇలా నలుగురైదుగురు సహచరులతో,  నల్లమల అడవులకు స్థావరాన్ని మార్చినాడు. అక్కడ పీటర్స్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేవాడు. వాడు అక్కడ చెంచు వాళ్ళను తెగ హింసలు పెడుతున్నాడు. రెడ్డి అతణ్ణి చంపేశాడు. ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది.

బ్రిటిష్ వాళ్ళు ఇంగ్రిస్ అనే వాణ్ణి స్ట్రాటెజీ కోసం, కాక్రెన్ అనే వాణ్ణి ఫీల్డు మార్షల్ గా పెట్టి పథకం ఆలోచించారు. రెడ్డి తలకు పదివేల వరహాలు బహుమతి ప్రకటించారు. ఆ బహుమతి కాశపడి శ్రీనివాసరావు అనే వాడు (రుద్రవరం) రెడ్డి ఆనవాళ్ళు తెల్లవాళ్ళకు అందించాడు. కోళ్ళ పందేలు నడుస్తుండగా రెడ్డిని మాయోపాయంతో బంధించదల్చుకుంటే – ప్రజలే తిరగబడి, రాళ్ళతో కొట్టి చంపారు. రెడ్డి పట్టుబడలేదు. ఆంగ్లేయులు భంగపడ్డారు.

ఆపై ఆంగ్లేయులు నరసింహారెడ్డి తమ్ముని వరస అయిన మల్లారెడ్డికి ఆశ చూపి లోబరుచుకున్నారు. అతని ద్వారా నరసింహారెడ్డిని లోబరుచుకుందామనుకున్నారు. ప్రయత్నం బెడిసి కొట్టింది. నరసింహారెడ్డి భార్యాపిల్లలను బంధించారు. అదీ విఫలమయ్యింది. అతను అపూర్వ శౌర్యసాహసాలతో వారిని విడిపించుకుంటాడు రెడ్డి. చివరకు ఆంగ్లేయులు రెడ్డి ప్రాణస్నేహితులైన ఓబన్నను, గోసాయి వెంకన్నను వేరు చేసి చంప ప్రయత్నించారు. ఈ ప్రయత్నం పూర్తీగా ఫలించకపోయినా వారిద్దరూ గాయపడ్డం జరుగుతుంది.

ఆపై రెడ్డి ఎర్రమలకు వెళ్ళాడు. బ్రిటిష్ వాళ్ళు నాలుగు వైపులా ముట్టడి జరిపారు. ఆ యుద్ధంలో రెడ్డి బ్రిటీషు వాళ్ళను చాలామందిని చంపాడు. వాట్సన్ కూడా మరణించాడు. చివరకు దొరికాడు. అతని కాళ్ళు, చేతులకు సంకెళ్ళేసి కోవెలకుంట్లకు తెచ్చి విచారించి ఉరి తీశారు. (1847 ఫిబ్రవరి 6).

ఇది అజీజ్ గారు రచించిన నవల వృత్తాంతం చాలా క్లుప్తంగా. ఈ కథలో ఇక్కడ చెప్పని వివరాలు నవలలో చాలా ఉన్నాయి.

*************

నరసింహారెడ్డి చేసిన యుద్ధాలను, ఆంగ్లేయుల కపటోపాయాలను, స్థానిక సాంప్రదాయాలను, స్థానిక ప్రదేశాల వివరణనూ, ఆ నాటి భారతదేశ పరిస్థితినీ వివరిస్తూ రచించిన నవల యిది.

ఈ కథను పాపులర్ నవల లా రచించినా, అజీజ్ గారు – స్థానిక సాంప్రదాయాలు, సంస్కృతినీ చాలా లోతుగా వివరించేరు. ’బూతపిల్లి’, పెద్దమ్మ దేవర వంటి విషయాల వివరణ విస్మయకరంగా ఉంటుంది. ఆరంభంలోనే ’పొలికేక’ అన్న శబ్దం – దానివెనుక స్థానిక సాంప్రదాయాల వివరణ విశదంగా, కథలో భాగంగా ఉంది. ఈ జాతరలు, గ్రామ సాంప్రదాయాలు తెలియని వారికి, ఆ నేపథ్యం కాస్త ’భీభత్సం’ ఎక్కువయినట్టు అనిపించవచ్చు కానీ ఇవి చరిత్రలో భాగం. చారిత్రక నవల – ఇలా నిక్కచ్చి గానే ఉంటేనే బాగు. అలవి మాలిన వర్ణనలు గుప్పించి పేజీలు పెంచే ప్రయత్నాలు లేవు ఈ చారిత్రక రచనలో. చివరన ఆయా ఘట్టాలకు చెందిన ఫుటోలను జోడించారు.

ఒకట్రెండు సందర్భాల్లో బ్రిటీషు అధికార్ల గురించి కాస్త హాస్య ధోరణిలో వ్రాశారు. ఎన్నదగిన లోపం కాదు కానీ చారిత్రక రచనలో ఇటువంటివి అంత బాగోవని ఈ వ్యాసకర్త వ్యక్తిగత అభిప్రాయం.

ఈ నవలకు కళాప్రపూర్ణ. డా. కొండవీటి వెంకటకవి ముందు మాట రాశారు.

చరిత్రలో ఎందరో వీరులు కులమతాలకతీతంగా స్వాతంత్రోద్యమంలో పోరాడి అసువులు బాశారు. అయితే కొందరి పోరాట చరిత్ర మాత్రమే బాగా ప్రచారం కావడం జరిగింది. అది విచారకరం అని ప్రస్తావిస్తూ అజీజ్ గారి మాటలు అక్షరాలా నిజం.

తెలుగునాట పుట్టిన విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద విస్తృతమైన రచనలు లేవు. ఉన్నా ప్రాచుర్యం లేదు. ఈ నేపథ్యంలో మరుగుపడిన ఈ మహావీరుని చరిత్ర గురించి ఆసక్తి గలవారికి ఈ నవల తప్పక నచ్చుతుంది.

 

***