నిజాయితీగా మాట్లాడాలంటే నిర్భీతి ఉండాలి అని అంటారు. నిర్భీతి అనే క్వాలిటీ నిజాయితీగా మాట్లాడ్డానికి పూర్వగామిగా ( precursor) గా ఉండడం ఏమిటి ? మనకు ఏవన్నా నష్టం అంటే అది కూడా తీవ్రమైన నష్టం భౌతికంగానో, ఆర్థికంగానో లేదా మన అభిలాషకు, ఆశలకు ( aspirations ) విఘాతం కలుగుతుందనుకున్నప్పుడో భీతి ఉండాలి. అలాంటప్పుడు నిజాయితీగా మాట్లాడాలంటే వెనకా ముందు ఆలోచించుకోవాలి. ఐతే కొల్పోడానికి ఏమీ లేని తనం ఉన్నప్పుడు, కోల్పోడానికి సిధ్ధపడ్డప్పుడు, కోలుపోతను ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడ్డానికి భీతి ఎందుకు ? పైగా మనమొక తప్పులో భాగమై నప్పుడు, ఆ తప్పు డొంక తిరుగుడుగా, సూచనప్రాయంగా, నీళ్ళు నములుతూ కాక నిజాయితీగా ఉన్నదున్నట్టుగా ఒప్పుకోవాలంటే (ఏమీ కోల్పోలేని తనం వలన కలిగే ) నిర్భీతి తో పాటు పాశ్చాత్తాపం కూడా ఉండాలి. ఆ పాశ్చాత్తాపం ‘ అయ్యిందేదో అయ్యింది ..ఇక పద ‘ అన్నట్టు గాక Descriptive గా ఉంటే అందులో నిజాయితీ బలంగా ఉంటుంది.
‘ దళారీ పశ్చాత్తాపం ‘ అనే పుస్తకం విడుదల అయ్యాక ప్రపంచ బేంకు రాజకీయాలు చాలా దుమారమే లేపేసాయి. అంత వరకు ఈ రాజకీయాలు ఎవరికీ తెలియదని కాదు. ఐతే ఒక insider పబ్లిక్ గా నోరు విప్పి జరిగింది చెప్పడం తో , కేవలం విశ్లేషణ, గమనికల మీద ఆధారపడ్డ ప్రతి సామ్రాజ్య వ్యతిరేక వాదికి కాన్ ఫిడెన్స్ బల పడ్డది. ప్రతి సంస్థాగతమైన అన్యాయాల పట్ల ఒక ఖచ్చితమైన కంక్లూజన్ కు రావాలాంటే, శతృ స్థావరం నుండి ఒక్క వేగువైనా కావాల్సి వస్తుంది మనకు. శతృవు గురించి అంచనాకు రావడం ఒక ఎత్తైతే , వేగు సమాచారం ఒక బలమైన conviction ను నింపుతుంది. అది జరిగే యుద్ధం లో predictability ని తెస్తుంది. ‘ నిన్ను నీవు అర్థం చేసుకునే ముందు శతృవును అర్థం చేసుకో ‘ అనే మావో నినాదం సంపూర్తి అర్థాన్ని అప్పుడు సంతరించుకుంటుంది.
ఇంత ఉపోద్ఘాతం ఒక పుస్తక పరిచయానికి ఎందుకు అవసరమౌతుందో తెలుసుకోవాలంటే – అది ‘ ది లాస్ట్ బ్రాహ్మిణ్ ‘ కున్న ప్రత్యేకమైన ఫార్మాట్ ను గుర్తించడమే. ఇది ఆత్మకథ ఫార్మాట్ లో ఒక సనాతన బ్రాహ్మణుడి కుంచిత వ్యవహారాలను నిజాయితీగా పాఠకుల ముందు ఉంచే ప్రయత్నం. అది కూడా అది ఒక సనాతన బ్రాహ్మణ వంశం లో పుట్టి కుటుంబ బంధాలపై ఉండే ప్రేమ చంపుకోలేక కుటుంబ వ్యవహారాలపై ద్వేషం కలిగి ఉండే ఒక వ్యక్తి ఆ పుస్తక రచయిత కావడం ఈ ఫార్మాట్ ప్రధాన లక్షణం.
నాకు ఈ insider view అవసరం ముఖ్యంగా అఫ్సర్ ‘ చంకీ పూల కథ ‘ రాసినప్పుడు తోచింది. అగ్ర కుల మేధావులు మార్క్సిస్టులమని చెప్పుకునే వాళ్ళు మైనారిటీ వాదాన్ని, సెక్యులరిస్ట్ ఫైట్ ను ఆస్తికత్వం నాస్తికత్వం మధ్య పోటీ కింద కుదించేసి మాట్లాడ్డం చూడ్డానికి అందంగా articulate చేయడం , సాధారణ పాఠకులు డ్రైవ్ అయిపోవడం చూసి అనిపించింది ‘ వీళ్ళు కలిసి ఉన్నప్పుడు నిమ్న వర్గాల గురించి ఏమని ఊహించుకుంటూ ఉంటారో కదా ? ‘ అని. ‘ వీళ్ళు అగత్యం లేని పరిస్థితుల్లో నిమ్న వర్గాలను కూడ గట్టుకుని ఎలా పబ్బం గడపాలో అని ఆలోచిస్తూ ఉంటారు కదా ? ‘ అని. ‘ వీళ్ళ మాటలు ఆలోచనలు విన్న వాళ్ళెవరన్నా ఒక ఆర్టికల్ రాస్తే బాగున్ను కదా ? ‘ అని. నలుగురు అబ్బాయిలు గుమి కూడి ఒక అమ్మాయి గురించో , లేదా ఇక ఏదో సెక్సిస్ట్ టాపిక్ గురించో ఏం మాట్లాడుకుంటారో ఊహించి వారి గురించి అంచనాకు రావడం ఒక పద్దతి. ఐతే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి స్వయాన విని వారి గురించి ఒక అంచనాకు రావడం ఒక పద్దతి.
ఈ వేగులు అందించే సమాచారం లో మన అంచనాలు, విశ్లేషణకు లోతు వెడల్పును పెంచుతాయి.
“ఇలాంటి అభిప్రాయాలు మా నాన్న గారి నుంచి విన్నప్పుడల్లా ఆయన పట్ల నాకున్న వ్యతిరేకత మరింత ప్రబలమ్య్యేది. శ్రీ శృంగేరీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి శ్రీ కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి ప్రాతినిధ్యం వహించే సనాతన ధర్మం అంటే నాకు అరికాళ్ళ కింద మంటలు లేచేవి. మనిషిని మనిషిని విడదీసే ఈ కులాలు నిర్మూలింపబడాలని మానవులందరూ సమానంగ ఉండాలని నేను భగవంతుడిని మూగగా రోదించేవాడిని. మా నాన్న గారిని సనాతన ధర్మం నుండి బయట పడేయమని భగవంతుడిని ఒక సారి కోరుకున్నాను కూడా ” అని మధ్యలో ఒక చోట రచయిత చెప్తాడు. ఈ పుస్తకం మొత్తానికి ఇది భూమిక. రచయిత తండ్రి తీవ్ర అనారోగ్యం తో, మరణానికి చేరువలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, తండ్రి కి కళ్లనీళ్ళ ప్రయంతం సపర్యలు చేసుకుంటూనే , ఆయన psyche పట్ల చంపుకోలేని ద్వేషానికి పుస్తక రూపం ఇస్తూ ఉండే ఒక సంఘర్షణ వాతావరణం ఉండింది.
నాతో చాలా మంది అంటూ ఉంటారు ” బ్రాహ్మణులుగా పుట్టామండి…ఐతే మా చేతులో ఉందా ఏంటి ? మమ్మల్ని ఏ మాట మాట్లాడినా అలా వంకరగా విశ్లేషించడం ఏవన్నా భావ్యమా ? ” అని. పుట్టడం మన చేతులో లేదు. కాబట్టి మాకు మిగతా ఛాందస బ్రాహ్మణుల నుండి, బ్రాహ్మణ వాదులనుండి exemption కావాలి అని. ఈ వాదనలో ఒక సౌకర్యం ఉంది. ఈ ఆత్మ విమర్శలో ‘ ఈ తప్పేదో జరగడం బానే ఉందే ‘ అన్నట్టు ఉంటుంది తీరు. కులం పుట్టుకకు సంబంధించిన అంశం కాదు, అది నిర్దుష్ట సాంఘిక ఆర్థిక చట్రం కు సంబంధించింది అనే నిర్ధారణ జరిగాక ఈ లిబరల్ వాదనలు ఊపందుకున్నాయి. ‘ అసలు బ్రాహ్మణుడు అని నీకు ఇంకా ఎందుకు గుర్తు ఉంది ? ‘ అని అడిగితే ఏం తెలుస్తుంది ? భర్తనో భార్యనో బ్రాహ్మణ్ అయి ఉంటారు, ఇంట్లో సనాతన అచారాలు అలా కొనసాగుతూ ఉంటాయి, ప్రతి హిందూ పండక్కి ఇంట్లో సందడి ఉంటుంది, అడపా దడపా ఆఫీసుల్లో లిబరల్ బ్రాహ్మిణ్ అవ్వడం వల్ల అసలు సిసలు బ్రాహ్మిణ్ స్థాయిలో గౌరవం లేకున్నా ఉన్నత కులం వాడికుండె సగటు గౌరవం తక్కువ కాకుండా దొరుకుతుంటుంది, బంధువులు , మేధావులు చుట్టూ బ్రాహ్మణులే ఉండి బ్రాహ్మణ సందోహం ఆనందదాయకంగా లేకపోయినా తమ స్థాయిని గుర్తు చేసుకునే నిమిత్తం వరకైనా అలా ఉంటుంది. ఇదంతా సోషల్ కేపిటల్ వెన్నంటి ఉంటుంది. ఆ మాత్రం దానికి ‘ నన్ను exempt చేయండి ‘ అని వాదించి , కొత్త తరహా బ్రాహ్మణ హక్కుల కోసం వాదించడం ఎందుకు ? ‘ సరేనండి…ఇప్పుడు మమ్మల్నేం చేయమంటారు ? పుట్టుకను మార్చలేము కదా ‘ అని వితండ వాదం చేసినప్పుడు నేనంటాను ‘ కులం తెలిస్తే తలలు తెగిపడతాయి అనే రోజు వచ్చినప్పుడు ఇలానే మాట్లాడుతారా మీరు ? ‘ అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే – ఇవేవీ దాచుకోకుండా ‘ అవునండి . నేను బ్రాహ్మణుడిని. ఇది ప్రాయశ్చిత్తం చేసుకోవాలా వద్దా అనే నిమిత్తం లేకుండా నిజాయితీగా మాట్లాడుకునే క్షణాలు. ఇదుగో ఈ కుల నిర్మూలన లో నా చోటు ఎంటొ నాకు తెలీదు గాని – నా దగ్గర జరుగుతుంది ఇది ‘ అని చెప్పేస్తాడు ఈ రచయిత. రోహిత్ వేముల మరణానికి కారణమైన డాక్యుమెంటరీ ‘ ముజఫర్ నగర్ బాకీ హై ‘ ఫిల్మ్ మేకర్ బ్రాహ్మణుడు. ఒక ఇంటర్వ్యూ లో ” నేను బ్రాహ్మణ కులం లో ఉన్నా కాబట్టి నెను ప్లాన్ చేయని నేను ఊహించని అవకాశాలు నా చుట్టు ఉన్నాయి. కాబట్టి నేను సినిమా తీయగలిగాను. కులం అనేది లేకపోతే ఇంత కంటే ఇంకా బాగు తీయగలిగే వారు వచ్చే వారేమో ” అన్నాడు. బ్రాహ్మణుడు కుల నిర్మూలన ఉద్యమం లో చేరుతున్నప్పుడు ఖరాఖండిగా జనాలకే కాదు, తనకు తాను చెప్పుకోవాల్సిన నిజం ఇది. డీ బ్రాహ్మినైజ్ కావడం లో మొదటి మెట్టు తనకున్న Brahmin privileges ను గుర్తించడం. ఇవేవీ లేనట్టు తెలీనట్టు నటించడం, లేదా తనకు మాత్రం అవి సంబంధం లేనట్టు మొహం పెట్టి మిగతా బ్రాహ్మణులను తిట్టడం గమనించలేని మూర్ఖమైన స్థాయిలో దళితులు, ఆదివాసీలు ముస్లిములు ఈనాడు లేరు.
ఈ ఆత్మ కథ లాంటి సాంఘిక ఇతివృత్తం కలిగిన పుస్తకం లో ఒక సనాతన బ్రాహ్మణ తండ్రి తన మొదటి కొడుకు హిందువుగా మారడం ( సనాతన ధర్మం ప్రచారాన్ని కోరుకోదు. ఇతర వర్ణస్తులను సనాతన ధర్మాన్ని ఆకళింపు చేసుకోమని కోరుకోదు ) ఇంకో కొడుకు ( రచయిత ) నాస్తికుడిగా మారడం, తన వంశానికి ఇక తనే చివరి బ్రాహ్మణుడిగా గుర్తించి చివరి క్షణాల్లో కూడా అదే మనోవ్యధలోనే బతుకుతాడు.
ఈ పుస్తకం ఒక సోషియాలజీ సబ్జెక్ట్ లాంటి పుస్తకం. సనాతన వర్ణశ్రమ ధర్మం లో బతికే ఒక బ్రాహ్మణ తెగ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంది, ఎలా జీవిస్తుంది అని తెలియజేసే పుస్తకం. ఇస్లాం అని ప్రస్తావిస్తూ ఖురాన్ ఉంటుంది, క్రీస్తు బిడ్డలు అని ప్రస్తావిస్తూ బైబిల్ ఉంటుంది కాని హిందువు అని ప్రస్తావిస్తూ ఒక్క వేదం లేకపోయినా హిందువులు ఆ వేదాలను, ఆయా గ్రం థాలను నెత్తినేసుకుని తిరగడం భలే విచిత్రం. మొదటగా బ్రాహ్మిణిజం మాత్రమే మతం. అది ప్రజలను వర్ణాలుగా విడదీసింది. శ్రీ రామ కళ్యాణం బ్రాహ్మణుల ఆచారం. శివుడు, కృష్ణుడు వీళ్లందరూ బ్రాహ్మణుల ఇంటిలో మాత్రమే పరిమితం కావాల్సిన దేవుళ్ళు. Temple system బ్రాహ్మిణిజం ఈ సమాజం తో terms కుదిరించుకుని ఏర్పరుచుకున్న ఒక రాజీ. పూజారి వృత్తే కాని, బ్రాహ్మణుడి ప్రవృత్తి కాదు. ఈ విషయాలు తెలీక ప్రతి హిందు ఛాందస వాది , అఖండ భారతం అని ఊగిపోతాడు. మన దేశం లో హిందుత్వం అన్న మతమే లేదు. ఉంటే అది బ్రాహ్మణీయ హిందుత్వం మాత్రమే. బ్రాహ్మణిజం అన్ని కులాల ప్రజలకు దేవాలయ వ్యవస్థ ద్వారా చేరాక, ఆయా వర్ణాశ్రమ ధర్మాలకు లోబడి ఉన్నా ప్రతి వ్యక్తి బ్రాహ్మణుడిని అనుకరించే పద్దతి మొదలయ్యింది. దళితుల్లో క్షవరం చేసే దళితులు వేరుగా ఉంటారు. వాళ్ళు దళితుల్లో దళితులకు అధములు. సత్యనారాయణ వ్రతం బ్రాహ్మణులు మాత్రమే చేయాల్సిన వ్రతం. ఐతే ప్రతి ఒక్కరూ చేస్తారు. పౌరోహిత్యం లో వైదిక పౌరోహిత్యం వేరు. పౌరాణిక పౌరోహిత్యం వేరు. సనాతన ధర్మం లో ‘ ఘర్ వాప్సీ’ లేదు. ఎందుకంటే అది హిందుత్వాన్ని నమ్మదు కాబట్టి. ( బ్రాహ్మణీయ హిందుత్వానికి సంఖ్యా బలం అవసరం ఎందుకయ్యింది అన్నది ఈ వ్యాసానికి వెలుపలి అంశం. ప్రస్తుతానికి వదిలేద్దాం ) దానికి శూద్రుడైనా ఇతర మతస్థులైనా ఒకటే. ఘర్ వాప్సీ చేసి ప్రయోజనం లేదు. బ్రాహ్మిణిజం అనే మతం ఒక వర్గం లోనే ఉండాల్సిన మతం . ప్రచారప్రధానం అయ్యాక అది బ్రాహ్మణీయ హిందూత్వం అయ్యింది. మనుస్మృతి మన జీవన విధానం లో భాగమయ్యింది. ‘ వర్ణ ధర్మాన్ని అతిక్రమించడం అంటే తక్కిన వర్ణాల్లోకి బ్రాహ్మణ భావజాలాన్ని ప్రవేశపెట్టడం అన్న మాట ‘ అంటూ , రచయిత ఇలా అంటాడు ‘ మనుస్మృతి తగలబెట్తడం , భావొద్వేగాలను ప్రతిబింబిస్తుందే తప్ప , మనుస్మృతి సారాంశాన్ని మన జీవితాల నుండి వెళ్ళగొట్తలేదు ” ఇప్పుడు ప్రతి హిందువు ఒక బ్రాహ్మణుడిగా మారడం జరుగుతుంది. బ్రాహ్మణుల్లో వంటా వార్పు చేసే స్త్రీలు, ముట్టు బారిన పడే వీరు శూద్రులతో సమానంగా చూడబడతారు. బ్రాహ్మణ స్త్రీ లు ద్విజులు కాదు. వీరికి ఉపనయనం జరగదు. వేద మంత్రాలు చదివే అధికారం ఆ స్త్రీ లకు లేదు. బ్రాహ్మణుల్లో స్త్రీలు సాధారణంగా వీణ ఎక్కువ నేర్చుకుంటారు. సనాతన ధర్మ వ్యవస్థలొ బయటి ప్రపంచం తో మగ వాళ్ల కన్న కాస్తో కూస్తో ఎక్కువ interaction పెంపొందించుకునే వాళ్ళు స్త్రీలే. ఈ పుస్తకం లో రచయిత తన తల్లి పరిస్థితి గురించి ఎంత మనోవ్యధ చెందుతాడో కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది. బ్రాహ్మణులు వాడే తిట్లు వేరు. ‘ సప్త కట్ల వెధవ ‘ ‘ లబోడి శంఖం ‘ లాంటి తిట్లు కనబడతాయి.
ఇలా సోషియలాజికల్ స్టడీ తో పాటు , ఒక బ్రాహ్మణుడిగా ఇంకో బ్రాహ్మణుడి రచనులు ఎలా అంతర్లీనంగా connect అవుతాయో కూడా రచయిత వివరిస్తాడు. ” బ్రాహ్మణ స్త్రీ లను చలం లేచి పొమ్మన్నాడని సనాతనస్తులు కాని హిందూ పాఠకులు పొరబడ్డారు. కానీ చలానికి బ్రాహ్మణ కుటుంబాలలోని స్త్రీ లకు అంత ధైర్య సాహసాలు గానీ అవకాశాలు గానీ లేవని స్పష్టంగా తెలుసు. అందువలన సనాతన ధర్మ పీటాలకు అభ్యంతరం లేని ముస్లిం మతస్థులను తన రచనల్లో రహస్యంగా అభ్యర్థిబ్చాడు. ” ” చలం తన రచనల్లో వర్ణ ధర్మాన్ని అతిక్రమించే ఊహ కూడా చేయలేదు. తన రచనల్లో వివాహాన్ని అరికట్టడం ద్వారా జాతి సాంకర్యాన్ని వర్ణ సాంకర్యాన్ని నివారించ బూని నాడు ” ఇలా చలం గురించి బ్రాహ్మణ కోణం లో చూస్తునే విమర్శిస్తాడు. ఈ విశ్లేషణ ఎంత వరకు కరెక్ట్ అనే కన్నా , ఇందులో ఎన్నో తరాల నుండి జరుగుతున్న బ్రాహ్మణ మేధో అవినీతిని బట్టి మొత్తానికి కొట్టివేసే వాదనగా కూడా అనిపించదు. అలాగే ” శ్రీ శ్రీ రచించిన కవితా ఓ కవితా లోని భాషంతా బ్రాహ్మణుల అద్వైత పరమాత్మ తత్వానికి – శంకరాచార్య వేదాంతానికి పూర్తిగా సంబంధించినదే . విశ్వానాథ సత్యనారయణ , కవితా ఓ కవితా చదివి శ్రీ శ్రీని తెగ కౌగిలించెసుకున్నట్టు చెప్తాడు. ‘ అది పురోగమనంగా కనిపించినా దాని ఆత్మ సనాతనమే . అది ఆ కవిత గొప్ప తనం’ అని అంటాడు రచయిత. అంతే కాకుండా గురజాడను విమర్శిస్తూ ఇలా అంటాడు ‘ సత్య సంధుడైన సౌజన్యారావు పంతుల్ని వైదిక బ్రాహ్మణుడిగానూ, లిటిగెంటు క్లయింటు రామప్పంతుల్ని వియోగి గాను గురజాడ చిత్రించాడు. వైదికులు సహజంగానే వియోగులను అపహాస్యం చేస్తుంటారు. అంతెకాని గురజాడ ప్రత్యేకంగా బ్రాహ్మణులను విమర్శించింది లెదు ‘ అని కట్టే విరిచి నట్టుగా చెప్తాడు. ‘గురజాడ పూర్ణమ్మని వృద్ధుడికి యిచ్చి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాడు. తన కుమార్తెకు సైతం బాల్య వివాహమే చేసాడు.’ అని మనకు విశదీకరిస్తాడు. అలా చె ప్తూ బ్రాహ్మణ కవులు రచయితల పట్ల ఇలా ముగిస్తాడు. ” మొత్తానికి బ్రాహ్మలకు సరిపడేదేదో కమ్యూనిజం లో ఉంది . అదేదో యెంతో కాలానికి కాని నాకు తెలీలేదు ”
అంతే కాక చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి. మఠాలు ఎలా ఏర్పడ్డాయి, ఆది శంకరాచార్యుడు హిందువా బ్రాహ్మణుడా ? హిందుత్వం పై బుద్దిజం ప్రభావం , పదకొండవ పన్నెండవ శతాబ్దం లో దేవాలయాల పై దాడి దోపిడీ గురించి, చరిత్ర లో గుడికి ప్రాధాన్యత ఎంత ఉంది లాంటి విషయాలు కూడ మనం చూడవచ్చు.
రచయిత కుల నిర్మూలన పై ఆశవహంగా ఇలా theorise చేస్తాడు. ” పార్లమెంటును హేళన చేసే వాడు పార్లమెంటును ఏమీ చేయలేదు. పార్లమెంటు అంటే ఏమిటి అని తెలుసుకోడానికి ప్రయత్నించేవాడు మాత్రమే అందుకు భిన్నంగా పని చేస్తాడు. బ్రాహ్మణ సమూహం భారత దేశం లో కనిపించని పార్లమెంటు. అదీ బ్రాహ్మణత్వమంటే. బ్రాహ్మణులు వస్తు జాలం కన్నా కష్టమైన భావ జాలాన్ని ఉత్పత్తి చేశారు. దాని మన్నిక చాలా కాలం ఉంటుంది. అది తిట్లతోనూ హేళనతోనూ నిర్మూలన కాదు. దీనిని ఎదుర్కోవాలాంటే చరిత్ర తెలియాలి. చరిత్ర చలన సూత్రాలు తెలియాలి. మానవ పరిణామం తెలియాలి. సంస్కృతి తెలియాలి. భావజాలం ఉత్పత్తి కారణమైన మూలాలు తెలియాలి. తెలిసిన తర్వాత ప్రత్యామ్నాయ భావజాలాన్ని ఉత్పత్తి చేయగలగాలి ”
ఈ పుస్తకం లో అక్కడక్కడా బ్రాహ్మణ జాఢ్యం చాయలు కూడా లేకపోలేదు. వీరేశ లింగం సనాతన ధర్మానికి తీరని ద్రోహం చేశాడు అని ( సనాతన ధర్మమే ద్రోహం , దానికి తిరిగి ద్రోహం చేయడం ఏంటి ? ) , దీక్షితులు గారికి చందుడిలో మచ్చలా నల్లమందు అలవాటు ( అంటే ఆయన గారు చంద్రుడు లాంటి వాడు అన్న మాట ) అంటాడు. ఐతే ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే రచయితను అర్థం చేసుకోవాలి. ఇంత నిజాయితీగా రాస్తూ ఇలాంటి వాక్యాలు ఎందుకు దొర్లించాడు అని. రాణీ శివశంకర శర్మ గందరగోలవాది. ఆయన హిందూత్వాన్ని, కులాన్ని ఎంత నిరసిస్తాడొ, క్రైస్తవ్యాన్ని అంత నిరసిస్తాడు. హిందుత్వానికి వచ్చినా ఆ ప్రచార కాంక్ష సామ్రాజ్యవాద క్రైస్తవ కాంక్షగా చూస్తాడు. ఐతే వర్గ లక్షణం లేని మతం ఎలా ఉంటుందొ మనకు సరి అయిన వాదన దొరకదు. చాలా ఎలాబొరేట్ గా ఒక్కో పాయింట్ తీసుకుని ఆయన క్రైస్తవ్యానికి, హిందూత్వానికి పోలిక చూపిస్తూ రాస్తూ వస్తాడు. ముస్లిం మతస్తులు ఇక్కడ బతికి ఇక్కడే ఉండడానికి వచ్చారు. క్రైస్తవులు ఇక్కడ ఉండడానికి రాలేదు. కేవలం దోచుకోడానికి వచ్చారు లాంటి కంక్లూజన్స్ కనిపిస్తాయి ఈ పుస్తకం లో. ఇందులో కుటిలత్వం ఏమీ లేదు. కేవలం గందరగోళం. కొంచెం పిడివాద మూర్ఖత్వం తప్ప.
ఇలాంటి పాజిటివ్స్ నెగటివ్స్ తో చదవాల్సిన ఈ పుస్తకం సౌదా అరుణ తీసుకొచ్చారు. ఈ పుస్తకం ఏ పుస్తక శాలలో కూడా దొరకదు. కేవలం సౌదాను ప్రత్యక్షంగా కాంటాక్ట్ చేస్తే తప్ప దొరకదు. ప్రచురణ కర్తలు రివ్యూలపై అనాసక్తి ఉంది అని చెప్పారు. అయితే ఈ పుస్తకం ఫార్మాట్ ఇందులో ఉన్న అంశాలు ఎంతగానో ఆకర్శించడం వలన తప్పక షేర్ చేసుకోదలచి రాయాల్సి వచ్చింది ( మితృడు సౌదాకు తప్పని సరి సారంగ పత్రికా ముఖంగా క్షమాపణలు. పాఠకుడికి రివ్యూ చేసే హక్కు నేను ఉపయోగించుకుంటున్నాను )
Note : ఈ రివ్యూలొ చాలా చోట్ల ఇంగ్లీషు పదాలు దొర్లాయి. అయితే సంస్కృత పర్యాయ పదాలు వాడ్డం చాత కాక అవి అలాగే ఉంచడం జరిగింది. వ్యాసకర్త వద్ద మరింత స్పష్టత కోరదల్చుకుంటే pvvkumar@yahoo.co.uk వద్ద గాని, ఫేస్ బుక్ ID – P V Vijay Kumar వద్ద కూడ కాంటాక్ట్ చేయవచ్చు.
*
తాజా కామెంట్లు