సామాజికప్రయోజనమనేది ఒకటి కవిత్వానికి ప్రధాన లక్ష్యమయ్యాక సమాజంలో భిన్నవర్గాలలో ఉనికి సంబంధమైన పోరాటాలు మొదలయ్యాయి.ఈ మార్గంలో వస్తుగతంగా చైతన్యం వివిధమార్గాలలో కనిపిస్తుంది.ప్రాంతం ,జెండర్,సామాజిక మూలాల్లోంచి భిన్నమైన ఉనికి వ్యక్తిలో ఉండడం వలన కవితావస్తువుల్లోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి.ప్రధానంగా అణచి వేయబడుతున్న వర్గాలనుంచి ఇలాంటి కవిత్వం ఎక్కువ.మెర్సీ మార్గరేట్ కవిత కూడా ఇందుకు మినహాయింపు కాదు.వస్తుతః మెర్సీలో స్త్రీ సంబంధమైన గొంతు,సమస్యలు,సంఘర్షణ దాని తాలుకు సారం కనిపిస్తుంది.ఒకింత దళిత సామాజిక వర్గానికి చెందిన భావజాలమూ కొన్ని వాక్యాల్లో ఉంది.రూపం శిల్పం వీటి విషయంలో ప్రధానంగా పైరెండు మార్గాల్లో కనిపించే కవిత్వానికి ,మెర్సీ కవిత్వానికి మధ్య అభివ్యక్తిసంబంధమైన వైరుధ్యాలున్నాయి.సమస్య వస్తువుగా కన్నా,అది మనసు మీదవేసే ప్రతిఫలనాలమేరకు కలిగే సంవేదనా సారం కళాకృతిలో ఈ కవితలో కనిపిస్తుంది.
అనేకమంది కవులు,రచయితలు ఉనికి పోరాటలనుంచి ధిక్కరిస్తున్నది అణచివేతనే.వస్తువు కేంద్రాన్ని బట్టి వీటి రూపాలు వేరు.ఈ ధిక్కారం స్థానంలో సున్నితమైన సంవేదనత్మక వచనంతో మెర్సీ స్వేచ్ఛను అన్వేషిస్తుంది.”అణచివేయబడ్డానికీ,జయించబడ్డానికి మధ్య(133పే)రియానేవ్ కోసం(127పే)సముద్రాంబర(123పే)లాంటివి ప్రధానంగా స్త్రీ స్వేఛ్చను ప్రశాంత జీవనాన్ని ప్రతిపాదించేకవితలు.స్వేఛ్ఛను అస్తిత్వ వాదులు మానవ వాస్తవికతగా చెప్పారు.ఇది దాని చుట్టు ఉండే వర్గాలు,పదార్థాలు మూసలను ఛేదించుకుని వస్తుంది.స్వేఛ్ఛ నిర్వచనానికి లొంగనిది.వాస్తవమూ కాదు యథాతథమూ కాదు.కాని అలా నిర్వచించుకోకపోతే అర్థం చేసుకోలేం. బేర్డియేవ్ స్వేఛ్ఛను ప్రాక్తన అహేతుక స్వేఛ్ఛ(లేని అణచివేతను ఊహించేదిగా)అంతిమ హేతుబద్ధ స్వేఛ్చ(సంఘటన ద్వారా అణచి వేతను ఎరుకలోనికి తెచ్చుకునేదిగా)చెప్పాడు.మెర్సీలో అణచివేతను ప్రత్యక్షంగా చెప్పడం తక్కువే.ఈ రెంటి ప్రతిఫలనాల సారాన్ని కవిత్వం చేయడం ఎక్కువ.
1.”నీతల్లికి నువ్వు రాసిన ఉత్తరం మొలకెత్తింది/ఏడేళ్ళు నిన్ను ఇనుప ఊచలమధ్య నొక్కి పెట్టినా/చావే మనిషికి అంతం కాదు అని నువ్వన్న మాటలున్నాయే/ఆ మాటలు మనిషితనం ఉన్న ప్రతీచోట/మొలకెత్తుతున్నయ్/నువు చనిపోయాక మాట్లాడుతున్న నీ ఉనికిని/నేను అందరికీ చేర్చబోతున్నా”-(రియానేవ్ కోసం-127)
2.ఆపుకోలేని ఆగ్రహావేశాలను/కాళ్ళు,చేతులు దేహం మొత్తం ఆక్రమింపబడ్డ/అ వృక్షపు అధికార బల ప్రయోగం నుండి/విమోచింపబడ్డానికి/స్వేఛ్ఛా పోరాటం చేసి ప్రాణాలొదిలిన గాలిచేసిన ఆర్తనాదాలు విన్నాను”-(అణచివేయబడ్డానికి జయించబడ్డానికి మధ్య-133పే)
ఈ రెండు భావాంశాలు స్వేఛ్ఛను గురించి మాట్లాడినవే.నిర్మాణ గతంగా మొదటిది అఖ్యాన పద్ధతి(Narrative structure)లోని ఉద్దేశిత నిర్మాణం(intend structure)లో కనిపిస్తుంది.వాక్యాల్లో “నీ/రెహనాయ్”అనే సంబోధనలు కనిపించడం వల్ల ఈ నిర్మాణం కనిపిస్తుంది.”మొలకెత్తడం”ఈ భావనలోని ప్రధాన కేంద్రం(Focal point) గతంలోని అణచివేతను ఉద్దేశిస్తుంది.అందుకే భావంశంలో ఇది ముందుకు వెళ్ళింది.వస్తుగతంగా ఇది స్వేఛ్ఛను,అణచివేత మూలాల గురించి మాట్లాడింది.రెండవ భావాంశంలో ఉపవాక్యనిర్మాణం(Clausal structure)కనిపిస్తుంది.
వాక్యమంతా ఒకే వాక్యంలా కనిపించే కొన్ని ఉపవాక్యాలుగల వాక్యం.భావ ధార ఎక్కువగా ఉండటం వల్ల ,ఒకదానిపై ఒకటిగా అనుభవాలు సంలీనమవటం వల్ల అలాంటి వాక్యాలు వస్తాయి.ఈ గాఢాభినివేశం వల్ల కొన్ని వాక్యాలు ఒక వాక్యంగా రూపొందింపబడుతాయి.ఇలాంటి వాక్యాలు మెర్సిలో కొంత ఎక్కువగానే కనిపిస్తాయి.పై వాక్యంలో కర్మార్థకాలు ఎక్కువ.అందువల్ల పై వాక్యంలో “బడు”ప్రత్యయాలు కనిపిస్తాయి.పాత్రల స్థానాలను వాక్యరూపంలోకి ఊహించుకోవడంలో కొన్ని సార్లు ఇలాంటివి కలుగుతాయి.సాధనవల్ల అధిగమించడం కష్టం కాదుకూడా.మెర్సీలో ఒకింత పొడుగువాక్యాలు కనిపించడంలో కారణం ఇదే.
జీవితం నుంచి రాయడానికి ప్రేరేపించే వస్తువును,అంశం అదివేసిన ముద్రను కవిత్వం చేయడంకోసం మెర్సీపడే శ్రమ గమనించదగింది.సృజనసాంద్రత కోసం సంప్రదాయపద్ధతిలోనే సంకేతనిర్మాణం(encode structure)ఏర్పాటుచేసుకుంటుంది.ఈ క్రమంలో ప్రతీకను,ధ్వనిని నేర్పుగా ఉపయోగించుకోవడం కనిపిస్తుంది.
వృక్షం- పాతుకుపోయిన అధికారం(అణచివేతకు గురిచేసేది),గాలి-స్వేచ్ఛకు-సంకేతాలుగా కనిపిస్తాయి.అదేక్రమంలో ధ్వనిగత అర్థాన్ని సూచించే భాష(elliptical language)ను ఆధారం చేసుకుని నిర్మించిన వాక్యం-“కాళ్ళు,చేతులు,దేహం మొత్తం ఆక్రమింపబడ్డ”-లోకూడా స్త్రీని వ్యక్తం చేస్తాయి.
ఉద్వేగసంబంధంగా మాత్రమే కాక ఈ భావధార కళాసంబంధంగా కూడా దొంతరలు దొంతరగా వాక్యాలను రూపొందించడం కనిపిస్తుంది.ఒక అనుభవాన్ని,పలికోణాలను పలుమార్లు అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా వాక్యాల్లో ఈ విన్యాసం కనిపిస్తుంది.ఈ పునరవలోకనం (retrospection)ఒక సమానభావచ్ఛాయ గల వాక్యాలు రాసేందుకు ప్రేరేపిస్తుంది.
“ఎండిపోయిన విత్తనాల్లాంటి ప్రశ్నలు/చిక్కులు చిక్కులుగా ఉండలుచుట్టిపడేఅసిన ఊలు దారాల్లాంటి ప్రశ్నలు/రాయడానికి వాడనందుకు జబ్బుచేసి సిరా కక్కుకున్న ప్రశ్నలు/వెలుతురును మింగేస్తూ /గాజులోనే బందీ చేస్తున్న చిమ్నీలాంటి ప్రశ్నలు/గాలికూడా రెపరేపలాడకుండా /జీవాన్ని ఆవిరిచేసుకుంటూ/శ్వాస పీల్చుకోలేక వ్రేలాడుతున్న క్యాలెండరులాంటి ప్రశ్నలు/తెచ్చిపెట్టుకుని తినలేక వదిలేస్తే/కుళ్లిపోయి కంపుకొడుతున్న ప్రశ్నలు”-(ప్రశ్నల గది-)
ఇలా ఒక అనుభవంలో నిలబడి అనేక వాక్యాలను రాయడం అందులో ఉద్వేగాన్ని ,కళను ప్రసారం చేయడం కనిపిస్తుంది. కవిత్వీకరించడంలో కొన్ని పనులుమాత్రమే కాక మానసికంగా మెర్సీమార్గరేట్కు కొన్ని భావనాముద్రలున్నాయి”చీకటి”అలాంటిది.చీకటి అనేభావన చుట్టూ అనేక ఊహలు చేయడం కనిపిస్తుంది.చీకటి వరం(35పే)చీకటి దండెం(81పే)లాంటి కవితలు వాటి శీర్శికలతోపాటు ఉదయంవైపు నడక(47పే)వెంటిలేట్(106పే)చేతికంటికున్న మాటలు(87పే)దోసిలో నది(75పే)వీడ్కోలు(60పే)మొదలైనవి చీకటిని ప్రతిమలుగా ప్రతీకలుగా వాడుకున్న కవితలు
1.ఘనీభవించిన చీకటిపై జ్ఞాపకాల దారుల్లో నడిచొచ్చిన పాదముద్రలు
2.కనురెప్పల చీకటి-(106పే)
3.చీకటి అలలు(87పే)
4.రాత్రుళ్ళు చీకట్లో నిశ్శబ్దం నాట్యం చేసేది గోడలపై-(75పే)-ఇలాంటివి మరికొన్ని గమనించవచ్చు.కొత్తగా కవిత్వం రాసేవాళ్లకు సృజనశక్తి ఉండదనే అపోహ ఒకటుంటుంది.దాన్నుంచి తన కవితను తప్పించడానికి మెర్సీ బలమైన ప్రయత్నం చేసింది.వస్తువుతో పాటు శిల్పంపై దృష్టిపెట్టిన కవిత మెర్సీ మార్గరేట్”మాటల మడుగు”
(అనంత కవుల వేదిక-“చం”స్పందన-ఆత్మీయపురస్కారం పొందిన సందర్భంగా)
తాజా కామెంట్లు