యాష్ లీలో ధర్మారావు ఊహల ప్రతిధ్వనులు

సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-10

 

‘వేయిపడగలు’, ‘గాన్ విత్ ద విండ్’-రెండూ వెయ్యి పేజీలు దాటిన బృహన్నవలలు.  తీరా వాటి మధ్య పోలికలు, తేడాలలోకి తొంగి చూడబోతే అదీ అంత భారీగానూ మారేలా కనిపించింది. కనుక వీలైనంతవరకు సంక్షేపించక తప్పదు.

రెండు రచనలూ చిత్రించినది ఒకానొక వ్యవస్థాపతనాన్నే, అయినా మళ్ళీ రెండు వ్యవస్థల మధ్యా తేడా ఉంది. స్థూలంగా చెబితే, వేయిపడగల వ్యవస్థ కాలికంగా ఎక్కువ నిడివీ, లోతు, ఘనీభావస్థితీ కలిగినదైతే; గాన్ విత్ ద విండ్ చిత్రించిన వ్యవస్థకు అంత కాలికమైన నిడివీ, లోతూ లేవు. మధ్యయుగాలనాటి వేయ్యేళ్ళ అంధచరిత్రనుంచి యూరప్ బయటపడి, పునరుజ్జీవన రూపంలో తెచ్చుకున్న అసాధారణ క్రియాశీలత అమెరికాలోకి ప్రసరించిన పరిణామంలో భాగమే గాన్ విత్ ద విండ్ లోని కులీన సమాజం. యూరప్ లో జరిగినట్టు, వేయిపడగల వర్ణ సమాజపు, లేదా ఆ వర్ణసమాజం గురించిన ఊహల తాలూకు పునాదులను కదిలించి పెద్ద ఎత్తున క్రియాశీలం చేయగల, పునరుజ్జీవనంతో పోల్చగల పరిణామం భారతదేశంలో ఆధునికకాలంవరకూ లేదు. లేకపోగా ఆ స్తబ్ధతను, ఘనీభవ స్థితిని, క్రియాశీల, పోరాటరాహిత్యాలను తాత్వికీకరించి ఘనంగా కీర్తించడం ఉంది. వేయిపడగల రచయిత ఒకచోట ఇలా అంటాడు:

ఆమె(జమీందారు రంగారావు పెళ్లాడిన ఆంగ్లేయయువతి శశిని) యొక స్వతంత్రదేశమున పుట్టినది. అచ్చటి మరియాదలకు అలవాటులకు పరదేశములవారు వచ్చి భిన్నముగా నడచినచో ఆమె మనస్సు చాలా బాధపడి యుండును. కాని తన యీ భిన్నప్రవర్తన యిచ్చటి దేశప్రజలకు బాధ కలిగించునని యామెకు యూహయే కలుగలేదు. కలుగవలసిన అవసరము లేదు.

ఈ దేశప్రజలు వచ్చిన కష్టములు దైవికములని వాని నోర్పుతో సహింతురు. తమ కిష్టము లేమి సూచించరు. ఒక విషయమున, ఒక కార్యాచరణమున, తమ యిష్టము లేమిని ప్రతిఘటించి తెలుపుట, శశిని పుట్టిన దేశమున ప్రధాన ధర్మము. తత్ప్రకృతులకు ప్రతిఘటించకపోవుట అంగీకారము క్రిందనే లెక్క!

మొదటి వాక్యాలలో అశక్తతనుంచి పుట్టే ఆక్రోశమూ, నిష్టురత్వమూ వ్యక్తమవుతుంటే; రెండో వాక్యాలు అశక్తతను తాత్వికీకరిస్తూ ప్రతిఘటనలేమిని గుణంగా, ఘనంగా చూపిస్తున్నాయి. ఇది అశక్తతను, అది కలిగించే న్యూనతను ఆధిక్యంగా చిత్రించుకునే ప్రయత్నం.

ఈ అశక్తతకుగల పర్యవసానాలలో ఒకటి రాజీపడడం. మరోచోట మంగమ్మ అనే పాత్రతో వేయిపడగల రచయిత ఇలా అనిపిస్తాడు:

సంఘములో కాని, మతములో కాని, మరొకదానిలో కానీ మీ రెన్ని మార్పులైన తేవచ్చును. ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, తద్వారా భక్తియో, జ్ఞానమో కలుగుటకు వీలుండెనేని మీరు తెచ్చిన మార్పు శిరోగ్రాహ్యము.

సంఘంలోకానీ, మతంలో కానీ మీరు ఎన్ని మార్పులైనా తేవచ్చు ననడంలో స్పష్టంగా వ్యక్తమవుతున్నది, మార్పులతో రాజీపడడమే. అయితే, ఆ మార్పులు ‘ఇంద్రియ, మనోనిగ్రహాలు; తద్వారా భక్తి, జ్ఞానాలు’ కలిగించేవిగా ఉండాలని షరతు పెడుతున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, ‘నీకు నా కూతురినిచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు సకల సంపదలూ సాధించుకు రావా’లని పాతాళభైరవి సినిమాలో నిరుపేద అయిన తోటరాముడికి రాజు షరతు పెడతాడు. తోటరాముడు నేపాళ మాంత్రికుని జయించి పాతాళభైరవిని మెప్పించి సంపదలతో తిరిగి వచ్చాడంటే అది సినిమా! నిజ జీవితం సినిమా కాదు. భక్తి, జ్ఞానాల సంగతి దేవుడెరుగు; ఇంద్రియ, మనోనిగ్రహాలనే మెట్లు ఎక్కడమే రచయిత చెప్పినంత తేలిక కాదు. అమాయకత్వమనాలో మరేమనాలో తెలియదు కానీ; లౌకిక ప్రాతిపదికపై నడిచే సంఘానికి రచయిత అలౌకికమైన, ఆధ్యాత్మికమైన సిలబస్ విధిస్తున్నాడు!

విధించడమే కాదు, వేయిపడగల రచయిత గిరిక, ధర్మారావు, హరప్పల ద్వారా భక్తి, జ్ఞాన, కర్మమార్గాలనే సిలబస్ ను అమలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది వ్యవస్థా పతనాన్ని ఆపలేకపోయింది. చివరికి అరుంధతి రూపంలో పతివ్రతాధర్మం ఒకటి మిగిలిందని ధ్వనించి సంతృప్తి ప్రకటిస్తాడు.

లౌకికంగా క్రియాశీల, పోరాటశీలతలు లోపించిన మహాస్తబ్ధతలో మన ఊహల్ని అస్పష్ట, అవ్యక్త, అధ్యాత్మిక సీమల్లోకి నడిపించి శాంతిని, సమాధానాన్ని వెతుక్కోవడమే ఇది. అలాగని లౌకికజీవితాన్నీ, వాస్తవికతనూ అంత తేలిగ్గా ఎగరగొట్టడమూ సాధ్యం కాదు. దాంతో లౌక-అలౌకికతల మధ్య అంతులేని సంఘర్షణ, సంక్లిష్టత, వైరుధ్యాలు! నిస్సహాయతను నిర్లిప్తతగా ఎంత ఉన్నతీకరించుకున్నా వ్యవస్థాపతనంపట్ల తప్పని దుఃఖం!

రచయిత ఆదర్శీకరించిన చాతుర్వర్ణ్యవ్యవస్థ ఆయన ఊహలో ఉన్నట్టు అచ్చంగా అంత ఆదర్శవంతంగానూ ఎప్పుడైనా ఉందా అంటే, ఉండగల అవకాశమూ లేదు.  పునాదులను కదిలించి ఉపరితలంలో కీలకమైన మార్పును తేగల ఒక మహత్ పరిణామమేదీ లేకపోవడం; ఫలితంగా సుదీర్ఘకాలం వెంబడి కరడుగట్టిన భావజాలమూ, సమాజంపై దాని వక్రప్రతిఫలనమూ, ఆ రెంటి మధ్యా వైరుధ్యాలూ అలా ఉండగానే చాపకింద నీరులా పాకుతూ వచ్చిన మార్పులు; అవి ఎలాంటివో తెలుసుకుని స్పందించేలోగానే అవి జీవితంలో భాగం కావడం! వాటిపై ఏం చేయాలో తోచని నిస్సహాయత! ఇదీ వేయిపడగలు రూపు కట్టిన భారతీయసాంప్రదాయిక సమాజపతనం.

గాన్ విత్ ద విండ్ చిత్రించినది ఇందుకు భిన్నం. అందులోని కులీన సమాజం వేయిపడగల సమాజంలా తీసుకుని తీసుకుని మరణోన్ముఖమవుతున్న సమాజం కాదు. క్రియాశీలంగా మారి చావో రేవో తేల్చుకోవాలనుకుంటుంది. సాయుధ పోరాటానికి దిగుతుంది. ఓడిపోతే పోవచ్చు కానీ అందులో నాన్పుడు లేదు. వేయిపడగలకు రంగస్థలమైన సుబ్బన్నపేటలో ఆధునికమైన మార్పులు సాపేక్షంగా ఎక్కువ కాలవ్యవధిలో సంభవిస్తే; గాన్ విత్ ద విండ్ కు రంగస్థలమైన జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో అంతర్యుద్ధ పర్యవసానంగా నాలుగైదేళ్ళ వ్యవధిలో దాదాపు హఠాత్తుగా సంభవిస్తాయి. యుద్ధానికి ముందు పదివేల జనాభాతో ఒక పెద్ద గ్రామంలా ఉన్న అట్లాంటా యుద్ధకాలంలో ఎలా పెరిగిందో, యుద్ధానంతరం నగర స్థాయిని ఎలా అందుకుందో; ఆ క్రమంలో అది భౌతికంగానూ ఆత్మికంగానూ కూడా ఎలా మారిపోయిందో రచయిత్రి అద్భుతంగా కళ్ళకు కట్టిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రేష్టత్వం నిండిన సాంప్రదాయిక జీవనం నుంచి జారిపోయి సామాన్యత అనే ప్రవాహంలో అది గుర్తుపట్టలేనంతగా కలసిపోతుంది.  ఒక యుద్ధం తెచ్చిపట్టే భౌతిక, మానసిక పరివర్తనకు అంతర్యుద్ధకాలపు అట్లాంటా ఒక గొప్ప నమూనా. సుబ్బన్నపేటలో వచ్చిన మార్పుల చిత్రణ కూడా  ఇంచుమించు ఇలాగే ఉంటుంది కానీ; అది కల్పిత గ్రామమైతే అట్లాంటా వాస్తవికం.

కథాకల్పన, పాత్రచిత్రణ సహా రచనా సంబంధమైన వివిధాంశాలలో ఇద్దరు రచయితలమధ్య మౌలికమైన తేడాలూ ఉన్నాయి. ఆ తేడాలు మళ్ళీ ఇద్దరి దృక్పథాలలో ఉన్న తేడాను వ్యక్తీకరిస్తాయి. వేయిపడగలులో ధర్మారావు ప్రధానపాత్ర. రచయిత భావజాలం ప్రధానంగా అతని ముఖంగానే వ్యక్తమైంది. కథాకాలానికి ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి గతించాడు కనుక అతన్ని పక్కన పెడితే, ధర్మారావు తర్వాత చెప్పుకోదగిన పాత్రలుగా గిరిక, గణాచారి, అరుంధతి, రంగారావు, హరప్ప, పసరిక, కుమారస్వామి, మంగమ్మలు కనిపిస్తారు. అయితే వీరందరూ ధర్మారావు ప్రభావంలో మొదటి నుంచీ ఉన్నవారు, లేదా తర్వాత వచ్చిన వారే(ఉదాహరణకు రంగారావు, మంగమ్మ) తప్ప విరుద్ధభావజాలానికి చెందినవారు కాదు. రాధాపతి, చక్రవర్తి, వామనరావు తదితరులు విరుద్ధభావజాలంగలవారైనా ధర్మారావుతో తులతూగేవారు కాదు. అంటే ఏమిటన్నమాట! వేయిపడగల రచయిత ప్రణాళిక ఏకపక్షం. ఆయన భావజాలానికి తగిన ప్రతివిమర్శ కానీ, దానితో సమానప్రతిపత్తిగల పోటీ భావజాలం కానీ లేవు. సుదర్శనంగారు అన్నట్టు వేయిపడగలను ఆత్మాశ్రయకావ్యమనుకుంటే అది అలా ఉండడానికి ఒక సమర్ధింపు అవుతుంది.

ఇందుకు భిన్నంగా గాన్ విత్ ద విండ్ రచయిత్రి దృష్టి వస్త్వాశ్రయంగా ఉంటుంది. అందులో ప్రధానపాత్ర ఎవరన్న పరిశీలన చేయబోతే ఒకరు కాదు, నలుగురు పైకి తేలతారు: స్కార్లెట్ ఒహారా, రెట్ బట్లర్, మెలనీ, యాష్ లీ! రచయిత్రి స్కార్లెట్ ముఖంగా కథ చెబుతున్నట్టు కనిపించే మాట నిజమే. స్కార్లెట్ ప్రధానపాత్రే. అంతమాత్రాన రెట్ బట్లర్ తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదు. అలాగే మెలనీ, అలాగే యాష్ లీ…

ఇలా నాలుగు పాత్రలకూ ప్రాధాన్యం లభించడానికి కారణమేమిటి? రచయిత్రి ఈ నలుగురి ముఖంగా నాలుగు దృక్పథా(లేదా ఒకే దృక్పథంలోని భిన్నచ్చాయ)లకు దాదాపు సమస్థాయిని కల్పించడమే. ఈవిధంగా వేయిపడగల లోని ఏకపక్షతకు భిన్నంగా రచయిత్రి బహుళపక్షతకు చోటిచ్చింది. మరోలా చెప్పాలంటే, కాన్ఫడరేట్ గా ఏర్పడి యూనియన్ తో యుద్ధం చేసిన  అమెరికా దక్షిణ రాష్ట్రాలు ఏ భావజాలానికి ప్రాతినిధ్యం వహించాయో ఆ భావజాలాన్ని రచయిత్రి నిరాకరించనూలేదు, స్వీకరించనూలేదు. ఆ భావజాలానికి కాల్పనిక స్థాయిలో యాష్ లీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కాకపోతే స్కార్లెట్, రెట్ బట్లర్ ల రూపంలో రచయిత్రి దానికి ప్రతిపక్షాన్ని సృష్టించింది. అలాగే, పాతను పూర్తిగా నెత్తిన పెట్టుకోవడం, కొత్తను పూర్తిగా తృణీకరించడం చేయలేదు. మెలనీ రూపంలో రెంటి మధ్యా మానవీయత అనే అతుకు పెట్టి ఒక గొప్ప సమన్వయాన్ని సృష్టించింది.

గాన్ విత్ ద విండ్ కు పరిమితమై చూసినప్పుడు ప్రాధాన్యక్రమంలో యాష్ లీ ది నాలుగవ స్థానమే. బహుశా నవల చదివిన పాఠకులందరికీ అదే అభిప్రాయం కలుగుతుంది. కానీ వేయిపడగలతో పోల్చి చూసేటప్పుడు అతను  ప్రథమస్థానంలోకి వస్తాడు. అతనిలో అడుగడుగునా ధర్మారావు పోలికలు కనిపించి ఆశ్చర్యం గొలుపుతాయి. ధర్మారావులానే అతను కూడా భావుకుడు. స్వాప్నికుడు. సాహిత్యప్రేమికుడు. సాంప్రదాయికత మీద గాఢమైన అనురక్తి ఉన్నవాడు. అవ్యక్తంలోని సౌందర్యాన్ని ఆరాధించేవాడు. అయితే ఒక తేడా; ధర్మారావుకు భిన్నంగా అతను పతనమవుతున్న వ్యవస్థ పక్షాన ఆయుధం పట్టి యుద్ధం చేస్తాడు. అయితే ఆ యుద్ధ ప్రయోజకత్వం మీద నమ్మకంతో కాదు. అయినా ఎందుకు యుద్ధం చేశాడంటే ‘స్వధర్మా’న్ని పాటించడానికి తప్ప మరో సమాధానం కనిపించదు. సాటి యువకులే కాక, తండ్రులు, తాతలు కూడా యుద్ధంలోకి దిగినప్పుడు అతను దిగకపోవడం ఊహకు అందని విషయం. యుద్ధసందర్భంలో యాష్ లీ మహాభారతంలోని అర్జునుని గుర్తుచేస్తాడు. యుద్ధానంతర పరిస్థితులగురించి అర్జునుడు వ్యక్తం చేసిన భయాలే యాష్ లీ లోనూ వ్యక్తమవుతాయి. అయినా సరే అర్జునుడు స్వధర్మానుసారం యుద్ధం చేసినట్టే యాష్ లీ కూడా చేస్తాడు. భార్య మెలనీకి రాసిన ఒక ఉత్తరంలో యుద్ధం గురించిన అతని ఊహలు ఇలా ఉంటాయి:

పడుకుని నక్షత్రాలవైపు చూస్తూ అనుకుంటాను, “దేనికోసం నువ్వు యుద్ధం చేస్తున్నా”వని. మన రాష్ట్ర హక్కుల కోసం, కాటన్ కోసం, డార్కీల కోసం, మనం ద్వేషించే ఆ యాంకీ(అప్పట్లో అమెరికాలోని ఉత్తరాదివారిని సూచించే నిందార్థకం)ల కోసం. కానీ నా పోరాటానికి ఇవేవీ కారణాలు కావు. నేను ట్వెల్వ్ ఓక్స్ (అతని నివాసం)ను మాత్రమే చూస్తున్నాను. తెల్లని స్తంభాలపై ఏటవాలుగా పడే వెన్నెలను, వెన్నెల్లో వికసించే చంపకాలలో వ్యక్తమయ్యే అలౌకికతను, ఎర్రని ఎండ కాసే మధ్యాహ్నం వేళ కూడా పక్క వసారాలో చల్లని నీడ పరుస్తూ ఎగబాకే గులాబీలను గుర్తుచేసుకుంటూ ఉంటాను. అమ్మ ఆ వసారాలో కూర్చుని కుట్టుపని చేసుకుంటున్న నా చిన్నప్పటి దృశ్యం కళ్ళకు కడుతూ ఉంటుంది. సంజె వేళ అలసిపోయి పొలాలనుంచి భోజనానికి ఇళ్లకు వెడుతూ డార్కీలు పాడుకునే పాటలు, బావిలోకి బొక్కెన దింపి నీళ్ళు చేదుకుంటున్న ధ్వనులూ వినబడుతూ ఉంటాయి. పత్తి పొలాల మీదుగా నదికి దారితీసే బాట తాలూకు పొడవాటి దృశ్యం, మసకచీకటిలో దిగువ భూములనుంచి పైకి లేచే పొగమంచు…వీటి కోసమే నేను ఇక్కడ ఉన్నాను. మృత్యువు, కష్టాలు, కీర్తిప్రతిష్టల మీద నాకు ప్రేమ లేదు. ఎవరిపట్లా  ద్వేషమూ లేదు. బహుశా ఇంటినీ, దేశాన్నీ ఇలా ప్రేమించడాన్నే దేశభక్తి అంటారు కాబోలు. కానీ, ఇది అంతకన్నా లోతైనది.  పైన చెప్పినవన్నీ నేను దేనికోసం నా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టానో, నేను ఏ జీవితాన్ని ప్రేమిస్తున్నానో దానికి ప్రతీకలు మాత్రమే. పాత రోజులకోసం, నేను గాఢంగా ప్రేమించిన పాత జీవితం కోసం పోరాడుతున్నాను. అయితే అవి శాశ్వతంగా అంతరించాయనిపిస్తోంది. ఎందుకంటే, గెలిచినా, ఓడినా మనం ఆ జీవితాన్ని కోల్పోతాం.

ఈ యుద్ధాన్ని, తద్వారా మనం స్వప్నించే కాటన్ సామ్రాజ్యాన్ని గెలిచినా మనం పరాజితులమే అవుతాం. కారణం, మనం విభిన్న వ్యక్తులుగా మారిపోతాం. వెనకటి ప్రశాంత జీవనసరళులు నిష్క్రమిస్తాయి. ప్రపంచం కాటన్ కోసం దేవిరిస్తూ మన గుమ్మంలో పడిగాపులు పడుతుంది. అప్పుడు, కాటన్ ధర మనం ఎంత చెబితే అంత. ఎవరి డబ్బు కక్కుర్తిని, సంపద పోగేసేకునే ప్రవృత్తిని, వ్యాపార ధోరణిని ఏవగించుకుంటున్నామో; ఆ యాంకీలలానే మనం కూడా మారిపోతాం.

ప్రమాదాలకూ, పట్టుబడడానికీ, గాయాలకూ, చివరికి మృత్యువుకు కూడా నేను భయపడడంలేదు. వెనకటి కాలానికి మళ్ళీ ఎప్పటికీ వెళ్లలేమనే భయపడుతున్నాను. నేను పాతకాలం వాణ్ణి. ఒకరి నొకరు ఊచకోత కోసుకునే ఈ ఉన్మత్త వర్తమానానికి చెందను. ఎంత ప్రయత్నించినా ఏ భవిష్యత్తులోనూ ఎక్కడా ఇమడలేనని అనిపిస్తోంది. నాలో ప్రవహించే రక్తమే నీలోనూ ఉంది కనుక నువ్వూ అంతే. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు; కానీ గత మంత అందంగా, తృప్తికరంగా మాత్రం ఉండదు.

పాతకాలం గురించిన యాష్ లీ ఊహల్లో ధర్మారావు ఊహల ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. రుక్మిణమ్మారావుతో అతను అన్న మాటలే చూడండి: “తల్లీ! ప్రాతదంతయు పోవుచున్నది. క్రొత్తదంతయు వచ్చుచున్నది….నేను, మీ యందరును నశించిపోవుచుండగా చూచుటకు మాత్రము పుట్టిన మూర్తిని. నేనును ఈ కాలమునకు తగినవాడను కాను. ఇవి యన్నియు చచ్చిపోవుచున్న యొక జాతి చివరి మెరుపులు!”

ఇంకా ఆశ్చర్యకరంగా, వేయిపడగల రచయితలానే యాష్ లీ కూడా వ్యక్తావ్యక్తంగా ఉండడంలోనే సొగసు ఉందనుకుంటాడు. అతనొకచోట స్కార్లెట్ తో అంటాడు: యుద్ధంలోకి అడుగుపెట్టేవరకూ, జీవితం తెర మీద ఆడించే నీడల్లా తప్ప వాస్తవికంగా ఎప్పుడూ కనిపించలేదు. అదే నాకు ఇష్టంగా ఉండేది. ఆయా వస్తువుల బాహ్యరేఖలు మరీ ప్రస్ఫుటంగా ఉండడం నాకు నచ్చదు. అవి ఒకింత అవిస్పష్టంగా, మసక మసకగా ఉండాలి”

వేయిపడగల రచయిత అంటాడు: “అవ్యక్తమైన స్వరము మధురమైనట్లు, అవ్యక్తమైన భావము సుమనోరంజకమైనట్లు, అవిస్పష్టమైన వెలుగులలో శోభ యెక్కువ యున్నది. పూర్తిగా కనబడినచో జ్ఞానము, కనపడి కనబడనిది మాయ. మాయలోనే యున్నది సౌందర్యము.

యాష్ లీ యుద్ధం నుంచి తారా(స్కార్లెట్ పుట్టిల్లు)కు వచ్చిన తర్వాత ఒకరోజున అతనికీ, స్కార్లెట్ కు జరిగిన సుదీర్ఘ సంభాషణ అతనిలోని ధర్మారావు పోలికలను మరింతగా ఆవిష్కరిస్తుంది. వాటిని స్పృశించే ముందు, ఇద్దరి సారూప్యతను ఒక్క వాక్యంలో చెప్పాలంటే;

గాన్ విత్ ద విండ్ ను పూర్తిగా యాష్ లీ ముఖంగా చెప్పి ఉంటే, (కొన్ని తప్పనిసరి తేడాలతో) అది మరో ‘వేయిపడగలు’ అయ్యేది!

      (సశేషం)

విశ్వనాథ నుంచి మిచెల్ దాకా…

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-9

*

దేశాలు, మనుషులు, సంస్కృతులు, సాహిత్యాలు, భాషలు వగైరాలలో భిన్నత్వం ఉంటుంది, నిజమే. కానీ ఏకత్వమూ ఉంటుంది. ఎంచి చూస్తే ఏకత్వమే ఎక్కువ ఉంటుందేమో కూడా.  కొందరు కేవలం భిన్నత్వాన్నే చూడడం, కొందరు ఏకత్వాన్ని కూడా చూడగలగడం వారి దృష్టి భేదాన్ని మాత్రమే సూచిస్తుంది. సగం నిండిన గ్లాసు ఉదాహరణతో చెప్పుకుంటే, కొందరికి నిండిన అర్థభాగం కనిపిస్తే, మరికొందరికి ఖాళీగా ఉన్న అర్థభాగం కనిపిస్తుంది.  వేయిపడగల రచయిత ఫ్రాక్ పశ్చిమ సాహిత్యాలలోనూ సంస్కృతీ, ఆచార వ్యవహారాలలోనూ, మనుషుల ప్రవర్తనలోనూ అంతటా భిన్నత్వమే చూస్తాడు. అందులోనూ శ్రేష్టతా, న్యూనతా అన్న తారతమ్య దృష్టిని ప్రదర్శిస్తాడు.  అది ఒక్కోసారి హాస్యాస్పదంగా కూడా పరిణమిస్తుంది. ఉదాహరణకు, ఒక విషాద ఘటనను ప్రస్తావించి దానిపై పాశ్చాత్యులైతే “బ్యూటిఫుల్ బ్యూటిఫుల్” అని స్పందిస్తారని ఒకచోట ఎద్దేవా చేస్తాడు. అది జాతులు, వారి మనః ప్రవృత్తులు, భాషలు, వ్యక్తీకరణల మధ్య తేడాగా సూత్రీకరిస్తాడు.

నిజానికి ఒక విషాదఘటనపై పాశ్చాత్యులందరి స్పందనా ఆ మాటలోనే వ్యక్తమవుతుందని చెప్పడం శ్రుతిమించిన సాధారణీకరణే. అదీగాక ఒక సృజనాత్మక వ్యక్తీకరణపై, అందులోని వస్తువుతో సంబంధం లేకుండా అలాంటి స్పందన, మన దగ్గర సహా సార్వత్రికంగా కనిపిస్తుంది. ఒకవిధంగా వేయిపడగల రచయిత చేసిన సాధారణీకరణ రససిద్ధాంతానికే వ్యతిరిక్తం. శోక, బీభత్స, వీరరసాదులు వస్తువుగా ఉన్న కావ్య, నాటక, చలనచిత్రాలను మనం పనిగట్టుకుని చదివి, దర్శించి అనుభవిస్తున్నామంటే కారణం, వాటి వెనుక ఉన్న సృజనాత్మక ప్రతిభా వ్యుత్పత్తులు కలిగించే ముగ్ధత్వమే. ఆ ముగ్ధత్వాన్ని ఎవరైనా సరే రచయిత ఎద్దేవా చేసిన మాటలో కాకపోతే, తత్తుల్యమైన మాటల్లోనే వ్యక్తీకరిస్తారు.

భిన్నత్వాన్ని మాత్రమే చూసే దృష్టి మహాకవులను, పండితులను కూడా ఇలాంటి అతార్కిక, అసంబద్ధ నిర్ధారణలవైపు నడిపిస్తుంది. కేవలం భిన్నత్వాన్ని, అందులోనూ శ్రేష్టతా, న్యూనతా అనే తారతమ్య వివేచననే కొలమానాలుగా తీసుకున్నప్పుడు ఆయా దేశాలు, భాషల వారు ఎవరి సాహిత్యాన్ని వాళ్ళు ఆనందించవలసిందే తప్ప ఇంకొకరివి ఆనందించే అవకాశం ఉండదు. కానీ అలా జరగడం లేదు. పాశ్చాత్య సాహిత్యం వైపు మనం ఆకర్షితులైనట్టే ప్రాచ్య సాహిత్యం వైపు వారూ ఆకర్షితులు కావడం సార్వజనిక వాస్తవం.  భిన్నత్వాన్ని కేవలం ‘వారు వేరు, మేము వేరు’ అని విడగొట్టడానికి కాక, పరస్పరపూరకానికి అవకాశమిచ్చే జాగాగా అర్థం చేసుకున్నప్పుడు దృష్టి మారుతుంది. అప్పుడు దేశాలు, మనుషులు, సంస్కృతులు, సాహిత్యాల వెనుక ఏకత్వాన్ని దర్శించే వీలు కలుగుతుంది. ప్రత్యేకించి సాహిత్యం ప్రతిఫలించే మానవ అనుభవం నిండా ఏకత్వమే ఉంటుంది.

చరిత్రలోకి వెళ్ళి చూస్తే, భిన్నత్వం మనుషుల్ని విడగొట్టి ఘర్షణకూ, యుద్ధాలకూ దారి తీయించిన అనుభవాలు ఉన్నట్టే;  ప్రపంచంలోని భిన్న భిన్న సమాజాలు, వ్యక్తులు మానవ అనుభవంలోని ఏకత్వాన్ని దర్శిస్తూ; భిన్నత్వాన్ని పరస్పర పూరకమైన ఒక అవకాశంగా చూస్తూ ఒకరికొకరు దగ్గరై పరస్పరం వికాసం చెందిన అనుభవాలూ ఉన్నాయి. విశ్వనాథ వంటి గొప్ప సృజనశీలి, సాహిత్యమర్మజ్ఞుని దృక్పథాన్ని భిన్నత్వం విశ్వరూపంలో కమ్మేసి ఆయన చేత అతార్కికమైన, సంకుచితమైన నిర్ధారణలు చేయించిందంటే కారణం; నాటి చారిత్రక, సామాజిక నేపథ్యం. వలసపాలనలో ఆత్మన్యూనతలో మగ్గుతున్న జాతి ఆ న్యూనతా భావననే ఆధిక్యంగా మలచుకోడానికి ప్రయత్నించింది. ఎంతైనా ఇదొక తాత్కాలిక భావోద్రేకమే తప్ప స్థిరసత్యం కాలేదు. గురజాడ మీదుగా ప్రారంభమయిన ఆత్మవిమర్శ విశ్వనాథ దగ్గరికి వచ్చేసరికి ఆత్మోత్కర్షగా ఎందుకు పరిణమించిందో తెలుసుకోవాలంటే ఆ ఇద్దరి మధ్యకాలంలోని పరిణామాలలోకి తొంగి చూడవలసి ఉంటుంది.

దానిని అలా ఉంచితే…

‘వేయిపడగల’ గురించి రాస్తూ అందులోని ధర్మారావు పాత్రను విశ్లేషిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన రచనలు రెండు: మొదటిది, త్రిపురనేని గోపీచంద్ నవల ‘అసమర్థుని జీవయాత్ర’. రెండోది, మార్గరెట్ మిచెల్ నవల ‘గాన్ విత్ ద విండ్’.

‘అసమర్థుని జీవయాత్ర’లో వ్యక్తమైన గోపీచంద్ తాత్విక సంఘర్షణను ఆర్. ఎస్. సుదర్శనం ‘సాహిత్యంలో దృక్పథాలు’లో తనదైన కోణంలో విశ్లేషించారు కానీ అందులోని సీతారామారావుకు, ‘వేయిపడగలు’ లోని ధర్మారావుకు ఉన్న పోలికలను, తేడాలను ఎందుకో ప్రస్తావించలేదు. ఈ ఇద్దరి మీదా తండ్రి ప్రభావం ఉంది. అయితే, వల్లమాలిన అహం, ఆభిజాత్యం నిండిన తండ్రి ప్రభావం నుంచి బయటపడి; సరళత, సామాన్యత నిండిన తల్లివైపు పయనించలేకపోయిన సీతారామారావు, జీవితాన్ని ప్రశ్నల ముళ్లడొంకగా మార్చుకుని చివరికి ఉన్మత్తావస్థకు చేరుకుంటాడు. ఆ దశలో రామయ్యతాత అతనికి జీవితం గురించి బోధిస్తాడు కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందనుకున్న సీతారామారావు ఆత్మహత్య చేసుకుంటాడు.

లౌకికంగా చూసినప్పుడు ధర్మారావు కూడా సీతారామారావులానే నిష్క్రియుడే. సీతారామారావులా భిన్న రూపంలో శ్రేష్టతా-సామాన్యతల వివేచనలో గడిపినవాడే. మళ్ళీ భిన్నరూపంలోనే అతనిలోనూ సీతారామారావులో ఉన్నట్టు ఆత్మోత్కర్ష, లోకవిమర్శ, లోకనింద ఉన్నాయి.  తేడా అల్లా, సీతారామారావు శ్రేష్టత్వం నుంచి సామాన్యతవైపు పయనించడానికి కనీసం విఫలయత్నమైనా చేశాడు కానీ; ధర్మారావు శ్రేష్టత్వపు ఊహల్లోనే ఆగిపోయాడు.  చివరివరకూ అసామాన్యుడైన తండ్రి ప్రభావంలోనే ఉండిపోయాడు. అలాగే బాహ్యజగత్తుకు, ఆంతరిక జగత్తుకు మధ్య సామరస్యాన్ని కల్పించుకోడంలో సీతారామారావు ఎదుర్కొన్న తీవ్ర సంఘర్షణ ధర్మారావులో లేదు. ఇద్దరి మధ్యా ఇంకో ముఖ్యమైన తేడా, జీవితం గురించి బోధించడానికి సీతారామారావుకు ఒక రామయ్యతాత ఉన్నాడు. కానీ ధర్మారావు విషయానికి వస్తే, రామయ్యతాత, సీతారామారావులు అతనిలోనే ఉన్నారు. తనే లోకానికి గురువు కనుక ఇంకొకరికి బోధకు అతను చెవి యొగ్గే ప్రశ్నే లేదు.

మరీ లోతుగా వెళ్లడానికి ఇది సందర్భం కాదు కానీ; అసలు ధర్మారావుకు సమాధానంగానే గోపీచంద్ సీతారామారావును సృష్టించాడా అన్న సందేహం కలుగుతుంది. ఈ కోణంలో ఇంతకుముందు ఎవరైనా పరిశీలించారా అన్నది కుతూహలజనకమైన మరో అకడమిక్ ప్రశ్న.

విచిత్రం అనిపించవచ్చు కానీ,  ‘వేయిపడగలు’తో పోల్చి చూడాలన్న గాఢమైన కుతూహలం కలిగించే మరో నవల ‘గాన్ విత్ ద విండ్’. రెంటి మధ్యా తేడాలు ఎలాగూ ఉంటాయి. వాటితోపాటు కొట్టొచ్చినట్టు కనిపించి ఆశ్చర్యం గొలిపే పోలికలూ ఉన్నాయి. ముందుగా తేడాల విషయానికి వస్తే, అతి పెద్ద తేడా ఆ ఇద్దరు నవలాకర్తల మధ్యే ఉంది. విశ్వనాథ(1895-1976) కన్నా మార్గరెట్ మిచెల్(1900-1949)వయసులోనూ, ఆయుఃప్రమాణంలోనే కాదు; సాహిత్యసృష్టిలోనూ, బహుముఖీన పాండిత్యంలోనూ కూడా చిన్నదే. ఆమె కౌమార వయసులో రెండు నవలలు రాసినా పరిమాణంలోనే కాక, ప్రసిద్ధిలోనూ చెప్పుకోవలసిన నవల గాన్ విత్ ద విండ్ ఒక్కటే.  ‘అట్లాంటా జర్నల్’లో జర్నలిస్టుగా పనిచేసిన మిచెల్ 1926 లో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, చీలమండకు తగిలిన గాయంతో ఇంటికే పరిమితమై అమెరికా అంతర్యుద్ధ(1861-1865) నేపథ్యంతో నవల రాయడం ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేసింది. గాన్ విత్ ద విండ్ నేషనల్ బుక్ అవార్డు, పులిట్జర్ అవార్డు పొందడంతోపాటు చలనచిత్రంగా కూడా చరిత్ర సృష్టించింది. మిచెల్ తన 49 వ ఏట, 1949 ఆగస్టు 11న అట్లాంటాలో భర్తతో కలసి ‘ఏ కాంటర్బరీ టేల్’ సినిమాకు వెళ్ళి వస్తూ రోడ్డు దాటుతున్నప్పుడు కారు ఢీకొనడంతో చనిపోయింది.

అబ్రహాం లింకన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు జరిగిన అమెరికా అంతర్యుద్ధానికి మూల కారణం బానిసత్వ సమస్య. యూనియన్ ప్రభుత్వం బానిసత్వాన్ని రద్దు చేయడానికి సంకల్పించింది. బానిసల శ్రమ మీద పత్తి వ్యవసాయక్షేత్రాలను అభివృద్ధి చేసి భారీ ఎత్తున కాటన్ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఏడు దక్షిణాది రాష్ట్రాలు(ఆ తర్వాత మరో నాలుగు రాష్ట్రాలు కలసి పదకొండు అయ్యాయి) బానిసత్వం రద్దును వ్యతిరేకిస్తూ ‘కాన్ఫెడరేట్’ గా ఏర్పడి యూనియన్ తో యుద్ధానికి దిగాయి. 1861నుంచి దాదాపు అయిదేళ్లపాటు జరిగిన ఈ అంతర్యుద్ధంలో 6 లక్షల 20 వేల నుంచి 7లక్షల 50 వేల మంది వరకు చనిపోయినట్టు అంచనా. రెండు ప్రపంచయుద్ధాలలో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ.  దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న మౌలిక నిర్మాణాలు అన్నీ దాదాపు ఈ యుద్ధంలో ధ్వంసమయ్యాయి. చివరికి యూనియన్ సేనలే గెలుపొందాయి. యుద్ధానంతర పునర్నిర్మాణ చర్యలూ వెంటనే మొదలయ్యాయి. అంతర్యుద్ధంతో మిచెల్ కు ఉన్న ఆత్మీయ సంబంధం, అందులో ఆమె తాత పాల్గొనడం. ఆ యుద్ధం గురించిన కథనాలను ఆ కాలానికి చెందిన అమ్మమ్మలు, నాయనమ్మల ద్వారా ఆమె చిన్నప్పటినుంచీ వింటూ వచ్చింది. వాటికి తనదైన కాల్పనికతను, దృక్పథాన్ని, పాత్రచిత్రణ నైపుణ్యాన్నీ జోడిస్తూ వెయ్యి పేజీలను మించిన, గొప్ప ఐతిహాసిక స్థాయి గల నవలగా మలచింది.

బానిసత్వపు పునాదుల మీద లేచిన ఒక కులీన తరహా సమాజమూ, అందులోని యువతీ యువకుల కాల్పనిక మోహాలు, వ్యామోహాలు, ప్రణయావేశాలూ, విందు వినోదాలూ, విలాసాలూ, శౌర్యోత్సాహాలూ, డాంబికాలు, కట్టుబాట్లు, ఆచారాలు, ఆభిజాత్యాలు, వైభవోపేతమైన తమ జీవితం శాశ్వతమూ, స్థిరమూ అన్న భ్రమలతోసహా—అన్నీ తమ కళ్ళముందే- కేవలం నాలుగైదేళ్ళ స్వల్పవ్యవధిలో– కుప్ప కూలిపోవడాన్ని గాన్ విత్ ద విండ్ ఉద్వేగభరితంగా రూపుకట్టింది. ఆ పతనం వ్యక్తులలో కలిగించిన మానసిక, భౌతిక కల్లోలాన్ని; యుద్ధం వాళ్ళ జీవితాలలో తెచ్చిపెట్టిన అనూహ్యమైన మార్పులను అనితరసాధ్యమనిపించే రీతిలో ఆవిష్కరించింది. యుద్ధానికి ముందూ-తర్వాతా ఇతివృత్తంగా ప్రపంచ సాహిత్యంలో వచ్చిన ఎన్నదగిన రచనల్లో గాన్ విత్ ద విండ్ నిస్సందేహంగా ఒకటి. గాన్ విత్ ద విండ్ లాంటి యుద్ధరచన ప్రత్యేకించి భారతీయ సమాజానికి విలక్షణమైన, వినూత్నమైన ఎరుకను, అనుభవాన్నీ కలిగిస్తుంది. ఎందుకంటే, మహాభారతం తర్వాత ఒక యుద్ధం తాలూకు పూర్వాపర పరిణామాలను, పరిస్థితులను అతి పెద్ద కేన్వాస్ పై  ఐతిహాసిక ప్రమాణంలో చిత్రించిన రచన మరొకటి మనకు లేదు.

మహాభారతాన్ని కళ్ల ముందు నిలుపుకుంటూ; చరిత్ర, పురాచరిత్ర, మానవపరిణామచరిత్రలను కూడా తడుముతూ గాన్ విత్ ద విండ్ గురించి మాట్లాడుకోవడం నా వరకు ఎంతో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలిగించే వ్యాసంగం. కానీ  సందర్భం కాదు కనుక దానిని అలా ఉంచితే, వేయిపడగలు, గాన్ విత్ ద విండ్ దాదాపు ఏక కాలంలో వెలువడిన రచనలు. మిచెల్ తన నవలను 1926లో రాయడం ప్రారంభించగా 1936లో అది ప్రచురితమైంది. విశ్వనాథ వేయిపడగలను 1934లో 29 రోజులలో చెప్పారు. అంటే, అప్పటికి గాన్ విత్ ద విండ్ ప్రచురితం కాలేదు. వేయిపడగలు 1937-38లలో ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడిన తర్వాత 1939లో పుస్తకరూపంలో ప్రథమముద్రణ పొందింది.

రెండింటి మధ్యా ప్రధానమైన పోలిక— ఒకానొక కులీన, శ్రేష్ట, సాంప్రదాయిక సమాజం ఎలా పతనమైందో చిత్రించడం. మిచెల్ చిత్రించిన సమాజం, వేయిపడగలు చిత్రించిన వర్ణసమాజంతో పోలిక ఉన్నదే. వేయిపడగల వర్ణ సమాజంలో అట్టడుగున శ్రామికవర్ణం(గోపన్న) ఉన్నట్టే గాన్ విత్ ద విండ్ లో బానిసల రూపంలో శ్రామికవర్ణం ఉంది. బానిసలలో కూడా మళ్ళీ హెచ్చు తగ్గులు. పొలంలో పనిచేసే బానిసల కంటే గృహంలో పనిచేసే బానిసలు ఉన్నతస్థానంలో ఉంటారు. యజమాని-సేవక సంబంధాల చట్రంలోనే మళ్ళీ యజమానులకూ, గృహ బానిసలకు మధ్య ఆత్మీయ సంబంధాలు ఉంటాయి. యజమానుల్లానే బానిసలు కూడా వ్యవస్థతో తాదాత్మ్యం చెందుతారు. వేయిపడగలలో చిత్రితమైన యజమాని-సేవక సంబంధాలు కూడా ఈ తరహాలోనే ఉంటాయి. సాంప్రదాయిక సమాజాలుగా కట్టుబాట్లు, ఆచారాలు, స్త్రీ-పురుష వివక్ష మొదలైన అంశాలలో కూడా రెండింటి మధ్యా పోలికలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మిచెల్ చిత్రించిన సమాజంలో  కొంతవరకు హైందవ సాంప్రదాయిక సమాజ ప్రతిబింబాన్ని చూడచ్చు. సామాజికంగా వస్తున్న మార్పులు విశిష్ట జీవితాన్ని, విశిష్ట వ్యక్తులను కబళించడాన్నే కాదు; అందరినీ అవి సామాన్యత అనే ప్రవాహంలో ఎలా ముంచి తేల్చుతున్నాయో కూడా రెండు రచనలూ చిత్రిస్తాయి. లోతైన సంస్కారం, అనుభూతి గాఢత లేని వారు ఆర్థికంగా, సామాజికంగా పైకి రావడాన్నీ; అవి ఉన్నవాళ్ళు అట్టడుగుకు జారిపోవడాన్ని రెండు రచనలూ రూపుగడతాయి. అలాగే, వేయిపడగలు దళితోద్ధరణ గురించి, దళితులు స్వతంత్రించడం గురించి చెబితే; గాన్ విత్ ద విండ్ బానిసల ఉద్ధరణ గురించి, వారు స్వతంత్రించడం గురించి చెబుతుంది.

ఈ పోలికల మధ్యే కీలకమైన తేడాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాచ్య, పాశ్చాత్య జీవన తాత్వికతలకు చెందినవనుకుంటే, కొన్ని ఇరు రచయితల దృక్పథ భేదానికి చెందినవి. గాన్ విత్ విండ్ కు వేయిపడగలకు ఉన్నంత బరువైన భావజాలవారసత్వం కానీ, అందుకు సంబంధించిన ఘర్షణ కానీ లేవు.  వేయిపడగలలో లౌకిక-అలౌకిక జగత్తులు ఒకదానికొకటి సమాంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. గాన్ విత్ ద విండ్ లో అలాంటిది లేదు. అది కేవలం పాత నీటిని కొట్టేసి కొత్త నీరు చేరుతున్న లౌకికమైన ఒకే ప్రవాహంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే, గాన్ విత్ ద విండ్ కు ఉన్న అంతర్యుద్ధ నేపథ్యం వేయిపడగలకు లేదు. అందులో ఉన్నది భావజాల ఘర్షణే తప్ప భౌతిక ఘర్షణ కాదు.

ఈ ఇద్దరు రచయితల దృక్పథ భేదాన్ని తరచి చూస్తే తేలే ఫలితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సాహిత్య సృష్టిలోనూ, ధిషణలోనూ విశ్వనాథ భుజాల వరకూ కూడా రాలేని మిచెల్ ఆయన కన్నా ఎక్కువ పరిణతిని చాటుకుందా అనిపిస్తుంది.

దాని గురించి తర్వాత…

*

 

ఆ నిర్లిప్తత భయావహం

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-8

 

sudrarsanamలౌకికం-అలౌకికం; సామాన్యత-అసామాన్యత అనే ద్వంద్వాల మధ్యనే ‘వేయిపడగలు’ నవల మొత్తం సాగుతూ ఉంటుంది. అయితే, అవి వేటి కవిగా ఉండిపోవడం తప్ప;  వాటి మధ్య ఒక లంకె ఉంటుందనే స్ఫురణను రచన కలిగించదు. అలౌకిక ప్రపంచంలో అర్థవంతంగా అనిపించే పాత్రలు లౌకిక ప్రపంచానికి వచ్చేసరికి తేలిపోతాయి. ఉదాహరణకు అలౌకికతనుంచి చూస్తే రామేశ్వరశాస్త్రి అసామాన్యుడు. “మా తండ్రి నేమనుకొంటివి? ఆయన లోకసామాన్యుడు కాదు. ఆయన గొప్పతనము దౌర్భాగ్యులకు యెట్లు తెలియును?” అని అరుంధతితో ధర్మారావు అంటాడు. లోకసామాన్యుడు కాని వ్యక్తి గొప్పతనం లోకంలోని అసంఖ్యాకులైన దౌర్భాగ్యులకు తెలియనప్పుడు ఆ గొప్పతనం వల్ల లోకానికి ఏమిటి ఉపయోగం అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.

లౌకిక జీవనానికి వస్తే, రామేశ్వరశాస్త్రి మొదట్లో సంపన్నుడు. జమీందారు తర్వాత అంతటివాడు. కానీ చేతికి ఎముక అన్నది లేకుండా దానధర్మాలు చేశాడు. బంధువులనూ, పేదలనూ, రైతులనూ, వర్తకులనూ కూడా ఆదుకున్నాడు. చివరికి చితికిపోయి శేషజీవితంలో దుర్భర దారిద్ర్యాన్ని ఎదుర్కొన్నాడు. బంధువులే కాక, అతని సాయంతో వృద్ధిలోకి వచ్చిన రైతులు, వర్తకులూ కూడా మొహం చాటేశారు. తను వివాహమాడిన మిగతా మూడు వర్ణాల స్త్రీలకు; భోగస్త్రీకి ముందే ఆస్తి పంచి ఇచ్చిన రామేశ్వరశాస్త్రి కొడుకు ధర్మారావుకు మాత్రం పేదరికన్నే మిగిల్చిపోయాడు.

‘వేయిపడగల’ రచయిత వాస్తవానికి రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా సామాజిక పరిణామ చరిత్రను చెబుతున్నాడు.  బ్రిటిష్ కాలంలో లేదా ఆధునికత అడుగుపెడుతున్న దశలో బ్రాహ్మణ్యం అగ్రహారాలనూ, ఇతర ఆస్తులనూ కోల్పోయి ఆర్థికంగా అణగారిపోతూవచ్చింది. అగ్రహారం భూములు  రైతుకులాల పరమయ్యాయి. దానికితోడు, తెలుగు ప్రాంతాలలోని గోదావరీ, కృష్ణా మండలాలలో నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల  వ్యవసాయం అభివృద్ధి చెంది చూస్తుండగానే రైతుకులాలవారు ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఉచ్చదశను అందుకోవడం మొదలైంది. రెండు మూడు తరాల వ్యవధిలోనే సంభవించిన ఈ పరివర్తనకు తెలుగు ప్రాంతాలలోని బ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో సాక్షిగా నిలిచాయి. తాత తరంలో బ్రాహ్మణభూస్వామి కింద పాలెకాపులుగా ఉన్న రైతుకులాలవారు మనవడి కాలానికి వచ్చేసరికి రాజకీయంగా ఉన్నతపదవులు అందుకోవడం, బ్రాహ్మణ యువకులు ఉద్యోగాలకోసం వారిని ఆశ్రయించడం ఈ పరివర్తన క్రమాన్ని ఆశ్చర్యస్ఫోరకంగా  మన కళ్ళముందు నిలుపుతాయి.

ఆర్థికక్రమశిక్షణ, కుటుంబ భవిష్యత్తుపట్ల బాధ్యతా రాహిత్యాలతో బ్రాహ్మణులు ఆర్థికపతనాన్ని కొని తెచ్చుకున్నారన్న విమర్శ బ్రాహ్మణ్యంలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పతన చరిత్రలోని ఒక పార్స్వాన్నే హాస్యబీభత్సవంతంగా ‘కన్యాశుల్కం’ చిత్రించింది. ‘వేయిపడగల’లోని రామేశ్వరశాస్త్రి ఉదంతాన్ని చదువుతున్నప్పుడు ఆయన మరీ ముందు వెనకలు చూడకుండా దానాలు, సాయాలు చేసి కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టాడన్న భావన పాఠకులకు కలుగుతుంది. కానీ రచయిత వైపునుంచి ఆ అభిప్రాయం కానీ, విమర్శ కానీ ఉండవు. ఉండకపోగా రామేశ్వరశాస్త్రి ఆర్థికక్షీణతను కార్యకారణ సంబంధానికి అతీతమైన ఓ దైవఘటనగా, ఓడలు బండ్లు సామెతలా నిర్లిప్తంగా తీసుకోవలసిన పరిణామంగా చెబుతున్నట్టు ఉంటుంది. అదీగాక  రామేశ్వరశాస్త్రి అసామాన్యవ్యక్తి కనుక అతని లౌకిక ప్రవర్తనను సైతం లౌకిక కొలమానాలతో చూడకూడదన్న ధ్వనీ వ్యక్తమవుతూ ఉంటుంది.  అతను ఏం చేసినా ఒప్పే, ఏం చేయకపోయినా ఒప్పే. ప్రశ్నలకు, విమర్శలకు, కలిమిలేములతో సహా అన్నిటికీ అతను అతీతుడు. అసలు అతని, అతని కుటుంబపోషణ బాధ్యత అతనిది కాదు; రాజుదీ, లేదా సమాజానిదీ. విచిత్రమేమిటంటే, రచయిత రామేశ్వరశాస్త్రిని లౌకికానికి అందనంత పై మెట్టున నిలుపుతూనే; అతని వల్ల సహాయాలు పొందిన బంధువులు, బ్రాహ్మణేతరుల కృతఘ్నతను ఎత్తిపొడవకుండానూ ఉండడు.

ధర్మారావు లౌకిక జీవన చిత్రణ కూడా ఇలాగే ఉంటుంది. తేడా అల్లా, దాన ధర్మాలు చేయడానికి అతనికి తండ్రి ఏమీ మిగల్చలేదు. ఇంగ్లీష్ విద్యతో ఉద్యోగానికి అర్హత అయితే సంపాదించాడు కానీ, మొదట్లో ఉద్యోగం కోసం ఎలాంటి ప్రయత్నం చేయడు. ఇల్లు గడవడానికి స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుంటాడు. మధ్యలో జాతీయకళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తాడు కానీ అందులో ఇమడలేక విడిచిపెట్టేస్తాడు. కళ్ళముందు భార్య అనారోగ్యంతో చిక్కిశల్యమవుతున్నా మందు ఇప్పించలేని లేమిలో మగ్గిపోతాడు తప్ప ఉద్యోగం కోసం ప్రయత్నించకపోవడం పాఠకులకు విపరీతంగా అనిపిస్తూ ఉంటుంది. చివరికి జమీందారు రంగారావు కొడుకు హరప్పకు గురువుగా నియమితుడైన తర్వాత సంభారాలు కోట నుంచే వస్తుంటాయి. దాంతో తిండి సమస్య పరిష్కారమవుతుంది కానీ, చేతిలో డబ్బు ఆడని పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా రచయిత చెప్పదలచుకున్నది, ధర్మారావు కుటుంబ పోషణ చూసుకోవలసినది రాజు, లేదా సమాజమనే. అంటే, మారిన కాలంలో కూడా రచయిత వర్ణవ్యవస్థ తాలూకు బ్లూ ప్రింటును అమలు చేయడానికి ప్రయత్నించాడు.

viswanatha

రచయిత కల్పించే ఊహ ప్రకారం రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల డబ్బు సంబంధం కూడా ఓ తాత్విక ప్రశ్నలా ఉంటుంది.  డబ్బుతో వారికి అవసరం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఎంత డబ్బు అవసరమైనా వారు దాని వెంట పడరు, అదే తమ వద్దకు రావాలి! డబ్బు దగ్గర కూడా రచయిత బ్రాహ్మణ, బ్రాహ్మణేతర భేదం తీసుకొస్తాడు. ధర్మారావు మిత్రుడు కిరీటి తన మేనమామకు రాసిన ఉత్తరంలో ఇలా అంటాడు:

నీవు నెలకు మూడువందలు తెచ్చుచున్నావు కనుక నీవే వివేకవంతుడవు కావు. ధనము సంపాదించుట వివేకము కాదు. ఏదో మనము బ్రాహ్మణేతరులము కనుక నెమ్మదిగా అందులోనుండి యందులోనికి మ్యాజిస్ట్రేటును, తహసీల్దారును, ఇంగ్లీష్ హెడ్ క్లార్కును, హుజూరు శిరస్తాదారును, డిప్యూటీ కలెక్టరునైనది. కానీ ప్రత్యేకముగా మనము రాజ్యాంగవేత్తలమా? మహాకవులమా? మహాశిల్పులమా? మతకర్తలమా? ఏమని?

సామాన్యార్థంలో చెప్పుకుంటే భౌతిక సంపద కన్నా జ్ఞానసంపద గొప్పదీ, సమాజం పోషించదగినదే. కానీ, పై వాక్యాలు  జ్ఞానసంపద ఉన్నవారికీ, ‘అలాంటి జ్ఞానసంపద’ లేని వారికీ మధ్య తారతమ్యాన్ని ఎంచి; జ్ఞానసంపద ఉన్నవారినీ, వారి జ్ఞానాన్నీ కూడా  ఎత్తు పీట మీద కూర్చోబెడుతున్నాయి. అసలు ఏది జ్ఞానమన్న మౌలిక చర్చ ఒకటి ఉండనే ఉంది. నిర్దిష్ట వర్గానికి చెందిన నిర్దిష్ట జ్ఞానమే జ్ఞానం కాదు. జ్ఞానం బహుముఖాలుగా ఉంటుంది. ఆ చర్చలోకి వెడితే కిరీటి నోట పలికించిన పై అభిప్రాయం అసమగ్రంగా తేలిపోతుంది. ఎంత గొప్ప జ్ఞానమైనా సామాన్యీకరణ చెంది ప్రజల పరం అయినప్పుడే దానికి విలువా, సార్థకతా.  కానప్పుడు అది అలంకారప్రాయంగా మారి షో కేస్ కు పరిమితమవుతుంది.

ధర్మారావుతో పోలిస్తే, అతని భావజాలంతో ప్రభావితుడై, దాని పక్షాన పోరాడిన కుమారస్వామి విశిష్ట వ్యక్తిత్వాన్ని చాటుకుంటాడు. కులం చెడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతను ధర్మారావులానే ఉద్యోగంలో ఇమడలేక రెండు ఉద్యోగాలను వదిలేస్తాడు. ధర్మారావులా అతనికి కోటనుంచి సంభారాలు వచ్చే పరిస్థితిలేదు. అయినా సరే, దుర్భర దారిద్ర్యాన్నైనా అనుభవిస్తాను తప్ప, ఆత్మగౌరవం చంపుకుని ఉద్యోగం చేయనని అతను నిర్ణయించుకుంటాడు. ఆవిధమైన పోరాటశీలం కానీ, త్యాగం కానీ ధర్మారావులో లేవు. చివరికి మంగమ్మ తన ఆస్తిని కుమారస్వామికి రాయడంతో అతను ఆర్థికసమస్యలనుంచి బయటపడడం వేరే విషయం.

లౌకికంగా చూసినప్పుడు; ఊళ్ళో ఇళ్ళు అంటుకుని, తన ఇంటిని కూడా మంటలు చుట్టు ముట్టే ప్రమాదఘట్టంలోనూ  ధర్మారావు ప్రవర్తన విపరీతమనిపించి విస్మయం కలిగిస్తుంది. అతనిని ఒకవైపు నిర్లిప్తుడిగా, నిష్క్రియుడిగానే కాక; ఇంకోవైపు అసామాన్యుడిగా, అధికుడిగా చూపడానికి ఇక్కడా రచయిత తాపత్రయపడతాడు. బ్రాహ్మణుల ఇళ్లకు దగ్గరలో, వేణుగోపాలస్వామి గుడి వెనక  మత్స్యమాంసాలను అమ్మే మార్కెట్ అవతరించడం ద్వారా ధర్మానికి జరిగిన హాని ఈ అగ్నిప్రమాదానికి కారణంగా చూపుతాడు. ఊళ్ళో జనం మంటలు ఆర్పడానికి రంగంలోకి దిగినా ధర్మారావు మాత్రం కుటుంబంతో బయటకు వచ్చి నిలబడిపోతాడు. ఇతరుల ఇళ్లను ఆర్పడానికి సాయపడడు సరికదా; తన ఇంటిని కాపాడుకోడానికి కూడా ప్రయత్నించడు. తల్లి సామాన్లు బయటికి తీసుకురాబోతే వారిస్తాడు. అప్పుడతని మాటలు ఇలా ఉంటాయి:

ధర్మము, అగ్ని, తస్కరుడు, రాజు; వీరు నలువు రన్నదమ్ములు. ధర్ము డందరిలో పెద్దవాడు. అతని కవమానము చేసినచో తక్కిన మువ్వురకును కోపము వచ్చును. అగ్ని తగులబెట్టును. తస్కరుడు దొంగిలించును. రాజు రాబడి పన్నని, అదనపు పన్నని లక్షవిధములుగా ధనము హరించును. మనము ధర్మావమానము చేసినచో  కానిమ్ము. పాతికవేల ఇల్లే పోయినప్పుడు వంద, రెండు వందల రూకల సామాను రక్షించునా?

దీనికి కొస మెరుపు ఏమిటంటే, “అతని యింటి మీద నెక్కి యెవరును నీరు పోయలేదు” అన్న రచయిత ఫిర్యాదు. అంటే, ధర్మారావు ఇంటి మంటలను ఆర్పే బాధ్యత కూడా సమాజానిదే కానీ అతనిది కాదన్నమాట. లౌకిక వ్యవహారాలలో ధర్మారావులో చిత్రించిన ఈ నిర్లిప్తత, నిష్క్రియత భయం గొలుపుతాయి. ఇలాంటి జడీభూతస్థితికి తాత్వికార్థమిచ్చి ఆకాశానికి ఎత్తిన జడభరతుడిలాంటి ఉదంతాలు మన పురాణ ఇతిహాసాలలో కనిపిస్తాయి.  ధర్మారావు పాత్ర చిత్రణలో రచయిత ఊహల్ని అలాంటి నమూనాలు ప్రభావితం చేసి ఉంటే ఆశ్చర్యంలేదు. అయితే ఈ నిర్లిప్తతకు, నిష్క్రియతకు ఎంత గొప్ప తాత్విక అర్థాన్ని ఆపాదించినా, వాటికి సంస్కృతీ సంప్రదాయాల విచ్ఛిత్తీ, పారతంత్ర్యం వంటి లౌకిక పర్యవసానాలు ఉండకుండా ఎలా ఉంటాయి? ఆ పర్యవసానాలపైనే కదా ధర్మారావు ముఖంగా, ఇతర పాత్రల ముఖంగా రచయిత నవల పొడవునా చేసిన విమర్శ?!

ధర్మారావు భావజాలంతో ఏకీభవించేవారి వైపునుంచి చూసినా, స్వరాజ్యోద్యమం అలాంటి లౌకిక పర్యవసానాలనుంచి దేశాన్ని బయటపడేయడానికి ఉద్దేశించిన ఒక కీలక సందర్భమే. కానీ ధర్మారావు మాత్రం ఆ ఉద్యమంలో పాల్గొనడు. పాల్గొనకపోగా స్వరాజ్యోద్యమం గురించి అతని అభిప్రాయం ఇలా ఉంటుంది:

నాకు చూచిన కొలది, దేశమందరు నుద్యమములో చేరినచో స్వరాజ్యము రేపే వచ్చును. కానీ యెవరికి వారు స్వార్థపరాయణులై యున్నారు. అట్టి సమయములో మరియు నిబ్బందులలో నున్నవారు తమ జీవితమార్గమును చెడగొట్టుకుని సంకటపడినందువల్ల నాకు లాభము కనిపించలేదు.

దేశంలో అందరూ ఉద్యమంలో చేరితే రేపే స్వరాజ్యం వస్తుందంటాడు. కానీ ఎవరికి వారు స్వార్థం చూసుకుంటున్నారంటాడు. వారిలో తనూ చేరతాడన్న స్పృహ మాత్రం అతనిలో ఉండదు. ఇంకోవైపు, మరీ ఇబ్బందులలో ఉన్నవారు తమ జీవితమార్గాలను చెడగొట్టుకుని కష్టాలను కొని తెచ్చుకోవడం వల్ల ఎలాంటి లాభమూ లేదంటాడు. అంటే, మిత్రుడు రాఘవరావులా తను స్వరాజ్యోద్యమంలో చేరకపోవడానికి కారణం, అతని కంటే తను ఎక్కువ ఇబ్బందులలో ఉండడమే నని సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ సంజాయిషీ అతనిలోని భద్రలోగ్ మనస్తత్వాన్ని బయటపెట్టి భీరువుగా చూపిస్తుంది తప్ప అతనిపై గౌరవాన్ని కలిగించదు. తాము పడే ఇబ్బందులు ఎక్కువా తక్కువా అన్నది చూసుకుని ఎవరూ స్వరాజ్యోద్యమంలో చేరలేదు. ఉద్యమంలో చేరి జీవనోపాధులను చెడగొట్టుకోవడమే కాదు, ఆస్తులను కోల్పోయినవారు కూడా ఎందరో ఉన్న సంగతి మనకు తెలుసు.

అదలా ఉంచితే, గాంధీ నాయకత్వంలోని స్వరాజ్యోద్యమంలో ధర్మారావు చేరకపోవడానికి భావజాల పరమైన విభేదాలు ఉండనే ఉన్నాయి. ఉదాహరణకు, దళితుల దేవాలయప్రవేశానికి ధర్మారావు వ్యతిరేకి. ఆ వ్యతిరేకతను రచయిత ఒకచోట ఇలా చిత్రిస్తాడు:

గణాచారి ధర్మారావులు కలసి దారి వెంట పోవుచుండిరి. ఒక పంచముడు ఎదురుగా వచ్చుచుండెను. గణాచారి తొలగి పోబోయినది. అతడు మరియు సమీపమునకు రాబోయెను. ధర్మారా వతనితో, ‘ఒక్క పది యేండ్లాగుము. అప్పుడు గణాచారియే యుండదు. అప్పుడు మనమందరమును కలసి దేవాలయములోనికే పోదము. స్వామి కప్పుడు గణాచారి ప్రసక్తి యుండదు. మూలమైన బీజాక్షరపీఠమున శక్తి యప్పటికి సమూలముగా నశించును. నేను నీ వాడను పద’ యనెను. అతనికి తెలియలేదు. ధర్మారావు వంక వెర్రిమొర్రిగా చూచుచు నతడు దూరదూరముగా పోయెను.

ధర్మారావు మాటల్లోని వెక్కిరింత, వ్యంగ్యం స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి. గాంధీతో భావజాల విభేదాలే ధర్మారావు స్వరాజ్యోద్యమంలో చేరకపోవడానికి కారణమని రచయిత సూచించి ఉంటే అది ధర్మారావుకు కొంత గౌరవప్రదంగా ఉండేది. అటువంటి స్పష్టత రచయితకు ఉండకపోవడానికీ అవకాశముంది. గాంధీ నాయకత్వంలో కాకపోయినా తనతో భావసారూప్యమున్న వ్యక్తులతోనో, సంస్థతోనో కలసి ధర్మారావు స్వరాజ్యానికి ప్రయత్నించి ఉండవచ్చు. అదీ చేయలేదు.

అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. అతని నిర్లిప్తత, నిష్క్రియత లౌకిక విషయాలలోనే. అలౌకిక విషయాలలో అతను క్రియాశీలిగా, నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నవాడిలా కనిపిస్తాడు. అది, దేవాలయం కేంద్రంగా సాంప్రదాయికతను లేదా వర్ణవ్యవస్థను పరిరక్షించడం. అలౌకిక జీవులుగా తోచే గణాచారి, గిరిక, పసరికలకు అతను అక్షరాలా అంగరక్షకుడిగా వ్యవహరిస్తాడు. ఆ ఘట్టాలలో అతను ఎంత క్రియాశీలంగా ఉంటాడంటే, మరో ధర్మారావు అనిపిస్తాడు. ఈ సందర్భాలలో రచన కూడా అనూహ్య వేగాన్ని, సంవిధానాన్ని పుంజుకుని పాఠకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ముఖ్యంగా పసరికను ఒక ఆంగ్లేయుడు అపహరించి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు ధర్మారావు దానిని అడ్డుకుని పసరికను విడిపించిన తీరు మరింత ఆకట్టుకుంటుంది.

అదలా ఉంచితే, వ్యవస్థా పరిరక్షణలో భాగంగా యువరాజు హరప్పకు గురువుగా మారి అతన్ని కర్మయోగం వైపు నడిపించినట్టు, దేవదాసి అయిన గిరికను భక్తిమార్గంలో పరిణతను చేస్తున్నట్టు అర్థమవుతూ ఉంటుంది.  అయితే ఆ గురుత్వం చుట్టూ నిగూఢత అనే తెర వేలాడుతూ ఉంటుంది. చెల్లెలైన గిరిక చేత సాధన చేయించడంలో అది మరింతగా వ్యక్తమవుతుంది. గిరిక పూర్తిగా అతిమానుష లోకంలోనే జీవిస్తూ ఉంటుంది. ధర్మారావు లౌకిక జగత్తు నుంచి, మధ్య మధ్య గిరికకు చెందిన అలౌకిక జగత్తులోకి పయనిస్తూ ఉంటాడు. పాఠకుల్ని ఆకట్టుకునే అంశాలలో ఈ అన్నా-చెల్లెళ్ల అనుబంధ చిత్రణ ఒకటి.

లౌకికంగా చూసినప్పుడు సామాన్య పాఠకులలో గిరిక పాత్ర కూడా ఎన్నో ప్రశ్నల్ని రేపుతుంది. ఆ భక్తి ఏమిటో, అంత చిన్న పిల్ల దేవుణ్ణే(వేణుగోపాలస్వామి) పతిగా వరించి లౌకిక పరిసరాలు పట్టకుండా అతని స్మరణలోనే గడపడమేమిటో అనిపిస్తుంది. నాస్తికుల సంగతి అలా ఉంచి భక్తులకు సైతం విడ్డూరం గొలిపేలా ఆమె భక్తితత్పరత ఉంటుంది. శారీరకంగా ఆమెలో ప్రకృతిసహజమైన ఎదుగుదల, సౌందర్యం, లావణ్యం ఉంటాయి. కానీ మానసికంగా ప్రకృతి సహజమైన కోరికలకు అతీతంగా ఉంటుంది. వేణుగోపాలస్వామితోనే ఆమె శృంగారానుభవం. ఈ చిత్రణ చివరికి ప్రకృతికి, దైవానికి మధ్య వైరుధ్యంగా పరిణమిస్తుంది. గిరిక ఉదంతాన్ని విడిగా చిత్రిస్తే భక్తికి ఆమె ఒక పరాకాష్టగా కనిపించి భక్తులను అలరించి ఉండేదేమో కానీ; సామాజికవస్తువుతో కూడిన నవలలో భాగం చేయడం వల్ల సార్వత్రిక సమాజం ఈ పాత్రతో ఎలా అనుసంధానమవుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పసరిక పాత్రతో పోల్చి చూసినప్పుడు ఈ తేడా అర్థమవుతుంది. పర్యావరణానికి ప్రతీకగా సృష్టించినది కనుక పసిరికతో సార్వత్రిక సమాజం తేలికగా అనుసంధానం కాగలుగుతుంది. భక్తి అనేది పర్యావరణం వంటి సార్వత్రిక అంశం కాదు కనుక గిరికతో అలాంటిది సాధ్యం కాదు. మళ్ళీ లౌకికంగా చెప్పుకుంటే గిరిక పాత్ర ద్వారా రచయిత దేవదాసీ వ్యవస్థను అసలు అర్థంలో నిరూపించడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. అయితే గిరిక దేవదాసీ వ్యవస్థకు అచ్చమైన ప్రతినిధి అవుతుందా, ఏ కాలంలోనైనా దేవదాసీలు ప్రకృతి సహజమైన స్పందనలకు దూరంగా గిరికలా పూర్తిగా దేవుడికే అంకితమై ఆయనే లోకంగా జీవించారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఎవరివరకో ఎందుకు, గిరిక తల్లి రత్నగిరి కూడా అలా లేదు. ఆమె రామేశ్వరశాస్త్రికి భోగస్త్రీ అయింది.

  (సశేషం)

 

 

 

 

జ్ఞానానికి అడ్డుగోడ

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-7

 

sudrarsanamధర్మారావు ఊహాప్రపంచంలో అప్రత్యక్షానికి, అతీతజ్ఞానానికి, అవ్యక్తానికే ప్రముఖస్థానం. నేత్రాల కన్నా మనసుకు, మనసుకన్నా ఆత్మకే ప్రాధాన్యం. అతని సిద్ధాంతాలు, సూత్రీకరణలు అన్నీ వీటి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అంటే, ఎంతసేపూ ప్రత్యక్షం నుంచీ, వాస్తవికత నుంచీ దూర దూరంగా పయనించడమే.

ఒక చోట మడికి, పరిశుభ్రతకు మధ్య తేడాను ఇలా చెప్పుకొస్తాడు:

“పరిశుభ్రముగా నుండవలయును గాని, మడిలో ఏమున్నదనును. పరిశుభ్రముగా నుండుటలో మాత్రమేమున్నది?…ఏనాది వారు, కొందరు నీచజాతివారు అసహ్యమైన దేహములతో గుడ్డలతో తినుట లేదా? వారనాగరకులు, బుద్ధిమాలినవారు, నేను నాగరకుడను, నాకు పరిశుభ్రముగా నుండవలయు ననును. పరిశుభ్రముగా నుండుట నాగరకత యైనచో భోజనము చేయువేళ మడిబట్ట యని, దానితో నింకెవరిని తాకనని నియముగా నుండుట మరియు నాగరకత యేమో! మురికి యుండుట లేకపోవుటలలోని తారతమ్యము ప్రత్యక్షము; శుభ్రమైన వస్త్రమునకు, మడిబట్టకును గల తారతమ్య మప్రత్యక్షము. నీవు దేవుడున్నాడందువేని అది అప్రత్యక్ష విషయము. అప్రత్యక్షమై బుద్ధిమంతునిచేత నూహింపబడునదియే మతము. అదియే దివ్యము. అది నీ సామాన్యజ్ఞానమును దాటి యుండును. సద్విషయమును నీ వాచరించవేని యది నీకే నష్టము.”

ఇంకోచోట రచయిత ఇలా అంటాడు:

“అవ్యక్తమైన స్వరము మధురమైనట్లు, అవ్యక్తమైన భావము సుమనోరంజకమైనట్లు, అవిస్పష్టమైన వెలుగులలో శోభ యెక్కువ యున్నది. పూర్తిగా కనబడినచో జ్ఞానము, కనబడి కనబడనిది మాయ. మాయలోనే యున్నది సౌందర్యము.”

ఈ మాటలు సాహిత్య సందర్భానికి వర్తించేటట్టు ఉన్నా, రచయిత తాత్వికతకూ సమానంగా వర్తిస్తాయి.

ఏనాది వారు, అలాంటి ‘నీచజాతివారు’ ‘అసహ్యమైన దేహాలతో గుడ్డల’తో తినడానికి కారణమైన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి ధర్మారావుకు అక్కర్లేదు. ఆ పరిస్థితులు మారితే వారూ పరిశుభ్రతకు మళ్ళవచ్చునన్న ఊహ అతనికి లేదు. ఆ ఊహ కలగడానికి అతనిలో పరిణామస్పృహే లేదు. ఆ స్పృహ ఉండడం అతని సిద్ధాంతాలకు భంగకరం కూడా. కనుక అతని దృష్టిలో తను విశ్వసించే చాతుర్వర్ణ్యవ్యవస్థలానే, నీచజాతులన్నవి కూడా ఒక స్థిరసత్యం. అవి ఎప్పటికీ స్థిరంగా ఉండవలసిందే. ఎందుకంటే, కొన్ని ‘నీచజాతులు’ ఉండడంలోనే వర్ణవ్యవస్థ ఉనికి కూడా ఉంటుంది. అవి పరస్పర ఆధారితాలు.  ఈ ‘నీచజాతు’ల విషయాన్ని పట్టించుకోని ధర్మారావు, పరిశుభ్రత గురించి వాదించే ‘నాగరకుల’తో పోటీపడి, మడిబట్ట కట్టుకోవడం అంతకంటే నాగరకం అంటాడు. ఆపైన శుభ్రతకు, మడికి తారతమ్యం అప్రత్యక్షం, అంటే కంటికి కనిపించదంటాడు. మడితోపాటు అప్రత్యక్షాలైన దేవుణ్ణీ, మతాన్నీ కూడా తీసుకొచ్చి అవి దివ్యాలంటాడు. మతం కేవలం బుద్ధిమంతుని ఊహకు మాత్రమే అందుతుందని, సామాన్యజ్ఞానాన్ని దాటి ఉంటుందనీ అంటాడు. ఇలాంటి సద్విషయాలను ఆచరించకపోతే నీకే నష్టమని బెదిరిస్తాడు.

లోకం ప్రత్యక్ష, వ్యక్త, వాస్తవికజ్ఞానాన్ని అనుసరించి నడుస్తుంది. అలాగని అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానం లేదనీ అనాల్సిన అవసరం లేదు. అది వ్యక్తుల స్థాయిలో అనుభూతమయ్యే జ్ఞానం కావచ్చు. కానీ సాముదాయిక స్థాయిలో ప్రత్యక్ష, వ్యక్త, వాస్తవికజ్ఞానానికే ప్రాధాన్యం.  ఈ జ్ఞానరంగాన్ని ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ, ఉపయోగకరంగా మలచుకుంటూ ఉన్నప్పుడే  ప్రపంచం అందరికీ సమానంగా వాసయోగ్యం అవుతుంది. ఎంత అసామాన్యజ్ఞానాన్నైనా సామాన్యీకరించి అధికసంఖ్యాకులకు అందుబాటులోకి తేకపోతే దానివల్ల లోకానికి ఉపయోగం ఉండదు.  ఒక పోలిక చెప్పుకుంటే, ఒకప్పుడు మహర్షులు దివ్యదృష్టితో ఎక్కడ ఏం జరుగుతోందో దర్శించేవారంటారు. అది నిజమో, కాదో మనకు తెలియదు. ఒకవేళ నిజమే అనుకున్నా ఆ దివ్యదృష్టి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం. అదే శాస్త్రవిజ్ఞానానికి వస్తే, టెలివిజన్ రూపంలో అలా చూడగల అవకాశాన్ని అది సాముదాయికం చేసింది. ఇలా అప్రత్యక్ష అతీతజ్ఞానాన్ని సామాన్యీకరించి సాముదాయకం చేయాలన్న దృష్టి ధర్మారావులో కనిపించదు. శాస్త్రవిజ్ఞానానికీ, ఆధ్యాత్మికతకూ మధ్య విరోధాన్ని ఊహించుకుని శాస్త్రవిజ్ఞానం కన్నా ఆధ్యాత్మికమే గొప్పదని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. ఒకచోట ఇలా అంటాడు:

“సర్వశాస్త్రములు ఆదిహేతువును కాదు, తద్వికారములను గూర్చియే యుపన్యసించును. ఈ యీ పదార్థములయందీ ధర్మమున్నదని యుపన్యసించును గాని యా ధర్మమేల యున్నదో శాస్త్రము చెప్పలేదు. ఆకాశమునం దా నైల్య మేల కనిపించుచున్నది? వాయువో, జ్యోతిస్సో యేదో యొకానొక తరంగసమితి ప్రసరించుటవలన ఈ నీలవర్ణ మేర్పడుచున్నది. దానిని శాస్త్రజ్ఞులైన సి.వి. రామన్ గారు కనిపెట్టిరి. దానికే ‘రామన్ గారి సిద్ధాంతమ’ని పేరు వచ్చినది. ఆ రీతిగా అట్టి తరంగప్రసారమువలన ఆ నీలవర్ణ మేల ఏర్పడవలయు నన్న ప్రశ్న కా మహానుభావు డేమి చెప్పును? అట్టి తరంగ ప్రసరణ మా నైర్మల్యమునకు హేతువనునది ధర్మము. ఆ శాస్త్రజ్ఞుడా ధర్మమును చూచెను. ఆయన చూడక ముందా ధర్మమున్నది. ఆ ధర్మము నిత్యమైనది. తన్నిత్యతా జ్ఞానముండుట కాస్తిక్యమని పేరు. చంద్రుడు, నక్షత్రములు, ఆకాశము; యీ సర్వము తద్ధర్మోపన్యాసమునే చేయుచున్నవి.

…ఆ ధర్మము శాస్త్రజ్ఞులు చెప్పిననే కానీ యితరులు విశ్వసించరట! ఆ శాస్త్రజ్ఞులనైనను, అందరు శాస్త్రజ్ఞులు ఒప్పుకొనవలయునట! వారును పదార్థవిజ్ఞానశాస్త్రవిషయోపన్యాసము లొప్పుకొందురట. ఆధ్యాత్మికవిజ్ఞానశాస్త్ర విషయములందు సందేహమేనట! భౌతికమునకు ఆధ్యాత్మికమునకు నడుమ నున్న మహాసముద్ర మెవ డుల్లంఘించగలడు?”

ఇలా అన్న ధర్మారావు,  మిగతా వానరవీరులెవరూ చేయలేని సముద్రోల్లంఘనను ఆంజనేయుడు ఒక్కడే చేయడాన్ని ఉదహరిస్తాడు. ఆంజనేయుడి సముద్రోల్లంఘనను మిగతావారు విశ్వసించారు కనుక సరిపోయింది కానీ, విశ్వసించకపోతే అతని బతుకేమయ్యేదంటాడు. ప్రతిదీ అందరి అనుభవంలోకి రావలసిందే నంటే, ఐన్ స్టీన్, రామన్, బోసు మొదలైనవారు చెప్పినవన్నీ అందరి అనుభవంలోకి వస్తున్నాయా, అయినా విశ్వసించడం లేదా అని ప్రశ్నిస్తాడు. “ఇది ధర్మమని చెప్పినచో విశ్వసించవలయును…ఒకడు తర్కముచే చూచిన దొకడు విశ్వాసముచేత చూచును”: ఇదీ అంతిమంగా అతని నిర్ధారణ.

visanaa

దీనినిబట్టి ఏమర్థమవుతోంది? శాస్త్రవిజ్ఞానంతో సహా అన్ని రకాల జ్ఞానాలకూ ఆఖరి మెట్టు ఆధ్యాత్మికజ్ఞానం. అది ఎలాంటి జ్ఞానమంటే, అప్రత్యక్షం, అవ్యక్తం, అతీతం! అది ఏ కొందరికో మాత్రమే అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రాని అసంఖ్యాకులు ఏం చేయాలంటే, తమకు అనుభవంలోకి వచ్చిందని చెప్పిన ఆ కొద్దిమందినీ నమ్మాలి! ఏ కొందరి అనుభవంలోకో వచ్చే ఆధ్యాత్మికజ్ఞానాన్ని అన్ని జ్ఞానాలకూ ఆఖరి మెట్టుగా నిలబెట్టి, ఆపైన తర్కాన్ని, ప్రశ్నల్ని నిషేధించి విశ్వాసాన్ని స్థాపించడమంటే ఏమిటి? జ్ఞానాన్వేషణకు హద్దులు గీయడమే! నువ్వెంతైనా జ్ఞానాన్వేషణ చేయి, అది అంతిమంగా విశ్వాసం దగ్గర ఆగిపోవాలి!

జ్ఞానంలోనూ ధర్మారావులో విభజన దృష్టే. శాస్త్రజ్ఞానమే అయినా, ఆధ్యాత్మికజ్ఞానమైనా జ్ఞానం అనేది ఒకదానితో ఒకటి ముడిపడిన సరళరేఖలాంటిదే. కానీ ధర్మారావు శాస్త్ర, ఆధ్యాత్మికజ్ఞానాలను పరస్పర సమాంతరాలుగా ఊహించుకుంటాడు. రెండింటి మధ్యా పోటీ పెడతాడు. ధర్మారావు చెప్పే ఆధ్యాత్మికజ్ఞానాన్ని కూడా శాస్త్రవిజ్ఞానం పరీక్షకు పెడుతుంది తప్ప మొండిగా నిరాకరించదు. దేనినైనా మొండిగా నిరాకరించేది శాస్త్రవిజ్ఞానమే కాదు. కాకపోతే, ఏ జ్ఞానమైనా నిరూపణకు అందాలని చెబుతుంది. ఇందుకు భిన్నంగా  ఆధ్యాత్మికజ్ఞానం విశ్వాసాన్ని నొక్కి చెబుతుంది.  ఎప్పుడైతే విశ్వాసం అనే అడ్డుగోడను కట్టేశారో, ఆ తర్వాత ఇక జ్ఞాన విస్తరణా ఉండదు, వికాసమూ ఉండదు. ధర్మారావు ఊహల పర్యవసానం అలా ఉంటుంది.

శాస్త్రవిజ్ఞానం నిరూపణ మీద ఆధారపడుతుందన్న అవగాహన ధర్మారావులో లేదు. అందులోకి కూడా విశ్వాసాన్ని తీసుకొచ్చి, ‘శాస్త్రజ్ఞులు చెబితే కానీ నమ్మరట’ అని ఎత్తిపొడుస్తాడు. వాస్తవం ఏమిటంటే, ఐన్ స్టీన్, బోస్, రామన్ లాంటి శాస్త్రజ్ఞులు చెప్పారు కనుకే ఎవరూ గుడ్డిగా నమ్మడం లేదు. వారి సిద్ధాంతాలు, సూత్రాలు తాము అర్థం చేసుకోగలిగిన, నమ్మగలిగిన భౌతికప్రమాణాలకు అనుగుణంగా ఉండి, నిరూపణకు అందుతున్న మేరకు నమ్ముతారు. అధ్యయనమూ, ప్రయోగమూ, నిరూపణా అనేవి శాస్త్రవిజ్ఞానరంగంలో నిరంతరం సాగుతూనే ఉంటాయి.

మనుషులను విశిష్టులుగా, సామాన్యులుగా విభజించే ప్రయత్నంలో రచయిత పశుపక్ష్యాదులను కూడా విభజిస్తాడు. అనసూయ(చిన్న అరుంధతి తల్లి, ధర్మారావు అత్త), ధర్మారావుల మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది:

అన:…యాథార్థ్య మతీతజ్ఞాన విషయము గాని యెక్కువమంది చెప్పునది కాదు. గొర్రెలు మంద యుండును. ఏనుగులు రెండో, మూడో. గౌరవ మేనుగులకే. ఏనుగు గొప్ప యేమనినచో యేమని చెప్పగలము? అది మనసునకే తెలియును.

ధర్మా: ధర్మము కూడ నట్టిదే. అదియు మనసునకే తెలియును. మన మేనుగుల కిచ్చినంత గౌరవము పాశ్చాత్యులీయరు.

ఎక్కువమంది చెప్పలేని, మనసుకు మాత్రమే తెలిసే యాథార్థ్యం అనే అతీత జ్ఞానంతో కానీ, ఏనుగుల గొప్పతనంతో కానీ అసంఖ్యాకులకు పనేమిటన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. సమస్య ఏమిటంటే, రచయిత నొక్కి చెప్పే అప్రత్యక్ష, అతీత జ్ఞానం కేవలం జ్ఞానస్థాయిలోనే ఉండిపోదు. బౌద్ధికజీవితంపైనే కాక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయజీవితంపై వాటి ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది. లౌకికమైన అన్ని రంగాలలోనూ విశిష్టత, సామాన్యత అనే తారతమ్యాలు ఏర్పడతాయి. విశిష్టత, సామాన్యతా సూత్రాన్ని రాజకీయ పరిపాలనారంగాలకు అన్వయిస్తే అది వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల అనుశాసనం మాత్రమే చెల్లుబాటు అయ్యే రాచరికం అవుతుంది. అధికసంఖ్యాకుల ఆమోదం మీద సాగే ప్రజాస్వామ్యం దానికి పూర్తి భిన్నం.

రాచరికవ్యవస్థతో సంపూర్ణ తాదాత్మ్యాన్ని చాటుకున్న వేయిపడగల రచయిత, అధికసంఖ్యాకుల ఆమోదానుసారం నడిచే ప్రజాస్వామ్యాన్ని తృణీకరించిన సందర్భాలు అనేకచోట్ల కనిపిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని నిరాకరించడమంటే వైవిధ్యాన్ని నిరాకరించడమే. ఆయన కసలు ప్రజాస్వామ్యపు మౌలిక స్వభావమే అర్థం కాలేదు. “రాజును నా వంటి వాడే యని వీతిలో నిలుచుండి యనుము. ఏమగును? ఉరికి జానెడు బెత్తుడులో నుందువు” అని ధర్మారావు ఒకచోట అంటాడు.  ప్రజాస్వామ్యంలో ప్రధానిని, ముఖ్యమంత్రిని, మంత్రులను నిస్సంకోచంగా విమర్శించవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజలే ప్రభువులు. మంత్రులు వారి ప్రతినిధులు, సేవకులు మాత్రమే. రాచరికంలో ప్రభునింద తప్పైతే ప్రజాస్వామ్యంలో ప్రజానింద తప్పవుతుంది. రచయిత ప్రాపంచిక దృక్పథం ప్రకారం సామాన్యులు, అసామాన్యుడి ముందు తమ అల్పత్వాన్ని అంగీకరించి అతని ఆధిపత్యానికి తలవంచాలి. అతడు ఏం చెబితే అది నమ్మాలి. ఈ నమ్మడం అనేది కేవలం అలౌకిక విషయాలకు మాత్రమే కాక, అన్ని లౌకిక విషయాలకూ వర్తిస్తుంది. సామాజికంగానే కాక సృష్టి సహజంగా కూడా మనుషుల సామర్ధ్యాలలో, ఆలోచనాసరళిలో, జీవన విధానాలలో, ఆహారపు అలవాట్లలో, విశ్వాస, అవిశ్వాసాలలో వైవిధ్యం ఉంటుంది. కానీ విశిష్టత- సామాన్యత అన్న విభజన సూత్రం ఆ వైవిధ్యాన్ని గుర్తించదు. తనదైన మూసలోకి అందరూ రావలసిందే నని శాసిస్తుంది. రానివాళ్లపై హింసను ప్రయోగిస్తుంది. గోరక్షణ పేరుతో గుజరాత్ లోని ఉనాలో దళితుల వీపులపై లాఠీల స్వైరవిహారం ఒకానొక ఉదాహరణ. విశ్వాసి కానివాడికి, ప్రశ్నించేవాడికి ఈ స్కీములో చోటు ఉండదు. అవిశ్వాసి నోరు ఎత్తడానికి వీలులేదు. నోరెత్తితే అతని జీవితం నరకమవుతుంది. భౌతికంగానే గల్లంతు అవుతుంది. అలనాటి చార్వాకుడి నుంచి, ఇటీవలి కల్బుర్గి, ధభోల్కర్ ల వరకు ఇందుకు అనేక ఉదాహరణలు.

ప్రజాస్వామ్యం రాచరికానికి పూర్తిగా తలకిందుల రూపం. ఇందులో అధికసంఖ్యాకుల మాటకే చెల్లుబాటు. అధికసంఖ్యాకులు ఆమోదించిన రాజ్యాంగం ప్రకారమే ఇందులో పరిపాలన సాగాలి తప్ప కొందరు రుద్దే విశ్వాసం ప్రకారం, కొందరి మనసులో ఉన్న ఊహల ప్రకారం; అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానం ప్రకారం పరిపాలన సాగదు. జ్ఞానాన్ని అందరికీ అందనంత ఎత్తుకి తీసుకువెళ్లడం విశిష్టుల పాలనలో పద్ధతి. జ్ఞానాన్ని జనానికి అందే ఎత్తుకి తీసుకురావడం ప్రజాస్వామ్యంలో అనుసరించవలసిన పద్ధతి. ప్రజాస్వామ్యం ఎవరి వ్యక్తిగత విశ్వాసాలనూ ప్రశ్నించదు. సాముదాయిక ప్రయోజనాలనే ఉమ్మడి ప్రాతిపదికపై అది పనిచేస్తుంది. సామాజిక సామరస్యానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించనంతవరకు అది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛనూ అడ్డుకోదు.

అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రజాజీవితంలోకి తీసుకొచ్చినప్పుడు జరిగే నష్టం బహుముఖంగా ఉంటుంది. అది పరిపాలనారంగంలో పారదర్శకతను హరిస్తుంది. భావోద్వేగ అంశాలను నినాదాల రూపంలో ముందుకు తెస్తుంది. పాలకుల చుట్టూ కాంతి వలయాన్ని సృష్టించి వారిని దైవసమానులుగానే కాదు,  దైవాలుగా, మెసయ్యాలుగా మారుస్తుంది.  రకరకాల వైరుధ్యాలపై తెర కప్పి జనంలో అయోమయాన్ని సృష్టిస్తుంది. జనం నమ్మకాలను, బలహీనతలను, భావోద్వేగాలను అధికారానికి నిచ్చెనమెట్లుగా వాడుకుంటుంది.  ఆ ప్రయత్నంలో జనాన్ని బెదిరిస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, హింసకు పాల్పడుతుంది.

పైన ఉదహరించిన  “సద్విషయమును నీ వాచరించవేని యది నీకే నష్టము”  అన్న ధర్మారావు మాటలో ఉన్నది బెదిరింపు, బ్లాక్ మెయిలే. అప్రత్యక్ష, అతీత జ్ఞానాల పేరుతో విశ్వాసాన్నిజనం మీద రుద్దడంలోనే మాయలూ, మోసాలూ అడుగుపెడతాయి. ‘వేయిపడగ’ల కంటే చాలా ముందే వెలువడిన గురజాడవారి ‘కన్యాశుల్కం’ నాటకంలో సారాయి దుకాణం వెనక తోటలో బైరాగి, మునసబు సోమినాయుడు, సాతాని మనవాళ్ళయ్య, జంగం వీరేశ, దుకాణదారు రాందాసు, హెడ్ కానిస్టేబుల మధ్య జరిగే సంభాషణ ఇందుకు చక్కని నమూనా:

మునసబు: గురూ! బంగారం సేస్తారు గదా, అదెట్టి హరిద్దోరంలో మటం కట్టించక మాలాటోళ్లని డబ్బెందు కడుగుతారు?

బైరాగి: మేం చేశే స్వర్ణం మేవే వాడుక చేస్తే తల పగిలిపోతుంది.

హెడ్: అవి వేరే రహస్యాలు. వూరుకొండి మావా! గురోజీ! హరిద్వారంలో చలి లావు గాబోలు?

బైరాగి: నరులక్కద్దు. మాబోటి సిద్ధులకు చలీ, వేడీ, సుఖం, దుఃఖం యెక్కడివి?

హెడ్: ఆహా! అదృష్టవంటే సిద్ధుల్దే అదృష్టం.

మునసబు: గురూ, హరిద్దోరం నుంచి యెప్పుడు బైలెళ్ళారు?

బైరాగి: రెండు రోజులయింది. మొన్న వుదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం శేవించాం. ఖేచరీగమనమ్మీద ఆకాశమార్గాన పోతూవుండగా మీ వూరి అమ్మవారు వనం దగ్గర గమనం నిలిచిపోయింది. యేమి చెప్మా అని యోగదృష్టిని చూసేసరికి అమ్మవారి విగ్రహము కింద ఆరునిలువుల లోతున మహాయంత్రం వొకటి స్థాపితమై కనపడ్డది. అంతట భూమికి దిగి, అమ్మవారిని శేవించుకొని ప్రచ్ఛన్నంగా పోదావనుకుంటే యీ భక్తుడు మమ్మల్ని పోల్చి నిలిపేశాడు.

దుకాణదారు: చూడగానే నేను సిద్ధుల్ని పోలుస్తాను గురూ!…

మునసబు: సుక్కేసేవోళ్లని మా బాగా పోలుస్తావు! మా వూరమ్మోరు జగజ్జనని! మా చల్లని తల్లి.

ధర్మారావు చెప్పే అప్రత్యక్షాన్ని ప్రత్యక్షీకరిస్తే ఇలాంటి సన్నివేశాలు ఏర్పడతాయి. తన నీడను చూసి తనే భయపడినట్టుగా, అప్రత్యక్షజ్ఞానాన్ని సృష్టించినవాడే దానిని నమ్మవలసీ, భయపడవలసీవస్తుంది. ‘కన్యాశుల్కం’ నుంచే ఇంకో సన్నివేశం. బ్రహ్మరాక్షసిని సీసాలో బంధించానంటూ పూజారి గవరయ్య, అతని తోడుదొంగ అసిరిగాడు లుబ్ధావధాన్లుతో ఒక ఆట ఆడుకుంటారు:

లుబ్ధావధాన్లు: బాబ్బాబు! సీసా నా యింట్లో పెట్టకు. మీ యింట్లో పెట్టించండి.

గవరయ్య: మా పిల్లలు తేనె సీసా అని బిరడా తీసినట్టాయనా, రెండు దెయ్యాలు వచ్చి మళ్ళీ మీ యింట్లోనే వుంటాయి.

లుబ్ధా: అయితే సీసా భూస్థాపితం చెయ్యండి.

గవ: భూస్థాపితం మజాకా అనుకున్నారా యేవిటీ? భూస్తాపితం చెయ్యడానికి ఎంత తంతుంది! పునశ్చరణ చెయ్యాలి, హోమం చెయ్యాలి, సంతర్పణ చెయ్యాలి.

లుభ్దా: నా యిల్లు గుల్ల చెయ్యాలి.

(సశేషం)

అతని ఊహా వైపరీత్యం!

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-6

 

sudrarsanamనిజానికి ‘వేయిపడగలు’ లోని ధర్మారావు ఒక మనస్తత్వ సంబంధమైన కేసు. నవలలో చిత్రితమైన మేరకు అతను జీవితం పొడవునా చేసినది ఒకటే… వాస్తవిక జగత్తు అనే చతురస్రంలో కాల్పనిక జగత్తు అనే వలయాన్ని ఇరికించే ప్రయత్నం. అది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. అయినా విసుగూ, విరామం లేకుండా ధర్మారావు చేసింది అదే. ఆ వైఫల్యమే అతనిలో నిస్పృహ, నిర్వేదం, నిస్సహాయత, నిష్క్రియతా పెంచి; స్వరాజ్యోద్యమంలో పాల్గొన్న అతని మిత్రుడు రాఘవరావుతో పోల్చినా అతనినొక నిరుపయోగిగా మార్చింది. అలాంటి ధర్మారావును యోగిగా, విరాగిగా, నిర్లిప్తుడిగా చూపించబోవడం రచయిత విశ్వసించే తాత్వికతలోని ఒక వైచిత్రి.

ధర్మారావుకు చెందిన కాల్పనిక జగత్తు ఒక విశిష్టమైన జగత్తు. అందులో అందరూ విశిష్టులే ఉంటారు. వారిది ఎంతో విశిష్ట సంప్రదాయం. వారిలో గాఢమైన, లోతైన రసజ్ఞత, అనుభూతి సాంద్రతా ఉంటాయి. వారు మనసును నియమించుకుని, నిగ్రహించుకోగల స్థితిలో ఉంటారు. వారిలో అతీతమైన, అలౌకికమైన జ్ఞానం వెల్లివిరుస్తూ ఉంటుంది. వాస్తవిక జగత్తు అందుకు భిన్నం. అందులో అంతా సామాన్యులు, నేలబారు మనుషులు;  లోతైన రసజ్ఞత, అనుభూతి గాఢత  లేనివారు, లౌకికమైన సుఖాలకోసం, సంపదకోసం పాకులాడేవారు ఉంటారు. గొప్ప జ్ఞానిగా, వివేకిగా  రచయిత చిత్రించిన ధర్మారావులోని భ్రమాజనిత విశ్వాసం ఎలాంటి దంటే; ఒకప్పుడు ఈ దేశంలో అందరూ విశిష్టులు, ఉన్నతులే  అయిన  వ్యవస్థ నిజంగా ఉండేది!

ధర్మారావు ఊహల్లోనూ, అతను మిగతా పాత్రలతో జరిపే సంభాషణల్లోనూ ఈ విశిష్టతా-సామాన్యతల మధ్య వివేచన నవల అంతటా జరుగుతూనే ఉంటుంది. పింగళి సూరన కావ్యం ప్రభావతీ ప్రద్యుమ్నం చదివి రసస్ఫూర్తిని పొందిన ధర్మారావు, అందులోని “(కొన్ని) భాగములు నేటి కసభ్యములుగా నగుచున్నవి. గాఢమైన శీలము చచ్చినకొలది ప్రాణములు ప్రతి సంగతిలో లోతులు వాంఛించవు. పైపై మెరుగులతో తృప్తి చెందును. అదియే నాగరికత యని విర్రవీగును” అనుకుంటాడు. మిత్రుడు రాఘవరావుతో కలసి రెడ్డి రాజుల రాజధాని అయిన కొండవీడుకు వెళ్ళి అక్కడి శిథిలాల మధ్య తిరుగుతున్నప్పుడు, “ఆ రెడ్లు, వారి పరాక్రమము, వారి ఔదార్యము, వారు పోషించిన కవులు” వారి హృదయాలను ఆనందభరితం చేస్తాయి. “అది యొక పుణ్యసమయము. మన మపుడైన బ్రతికి యున్నాము కాదు” అని ధర్మారావు అనుకుంటాడు. ఇంకోచోట, “రసమునందు పర్యవసించుట యెవనికి? రసజ్ఞుడైన వానికి. ప్రతివిషయము నెవడు హృదయము దాక తెచ్చుకొనగలుగునో వాడు రసజ్ఞుడు. ప్రతివాడు నట్లు చేయలేడు…భగవంతుడెంతయైన లోతైన విషయము. ఆ లోతు మహాపరిపక్వ దశయందున్న దేవదాసి మనస్సునకే తెలియుచున్నది” అనుకుంటాడు.

రాణి రుక్మిణమ్మారావుతో మాట్లాడుతూ, “తల్లీ! ప్రాతదంతయు పోవుచున్నది. క్రొత్తదంతయు వచ్చుచున్నది. రంగాజమ్మగారిని చూడుడు! ఆమె పూర్వపు భావోన్మాదము, పాతివ్రత్యము, వర్ణస్వచ్ఛతకు చిహ్నమైన మూర్తి. అవి యన్నియు యామెతో నంతరించినవి. కృష్ణమనాయుడుగారు పూర్వరాజచిహ్నము. ఆయనతో అది పోయినది. దేవదాసితో దేవదాసీత్వమే నశించిపోవును. మీతో మహారాజ్ఞీత్వమే నశించును…నేను మీ యందరును నశించిపోవుచుండగా చూచుటకు మాత్రము పుట్టిన మూర్తిని. నేనునూ ఈ కాలమునకు తగినవాడను కాను. ఇవి యన్నియు చచ్చిపోవుచున్న యొక జాతి చివరి మెరుపులు!” అంటాడు.

రాచరికవ్యవస్థతోనూ, గతంతోనూ ధర్మారావు తాదాత్మ్యం ఎంతటి దంటే, “కోటకు కోట యాకృతి పోయి యొక పెద్ద ధనవంతుని యింటి యాకారము పడినది” అనుకుని బాధపడతాడు.

ఇంతకీ ధర్మారావుకు అంత ఆదర్శవంతంగా కనిపించిన సుబ్బన్నపేటలోని రాచరిక వ్యవస్థ ఎలాంటి పునాదుల మీద లేచింది? అది మరో ఆశ్చర్యం. రచయిత ఏ మాత్రం దాపరికం లేకుండా దానిని బయటపెడతాడు.  అయిదారు జతల ఎడ్లను కిరాయికి తిప్పుకుంటూ  జీవించే వీరన్ననాయడు అనే సాధారణ సంసారి, టిప్పు సుల్తాన్ పై యుద్ధానికి వెడుతున్న ఇంగ్లీష్ వారికి తన ఎడ్లనిచ్చి సాయపడతాడు. వారు శ్రీరంగపట్నాన్ని దోచుకుంటారు. అప్పుడు వీరన్ననాయడు తనవంతు దోపిడీకి అవకాశమిమ్మని అడుగుతాడు. వారు కోటలోని ఒక కొట్టును చూపించి దానిని దోచుకొమంటారు. అతని అదృష్టం కొద్దీ దానినిండా నవరసులు ఉంటాయి. వాటిని అతను రహస్యంగా ఎడ్లకు ఎత్తుకుని ఇంటికి తోలుకుంటాడు.

veyi

ఆ దోచుకున్న ధనబలంతోనే అతను సుబ్బన్నపేటకు రాజవుతాడు. స్థానికంగా ఉన్న ఒక బ్రాహ్మణుడు అతనికి తోడవుతాడు. ఫలానా చోట కోట కట్టుకోమని అతనే చెబుతాడు. బ్రాహ్మణునికి కావలసింది ఆ ఊళ్ళో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టించడం. కోట నిర్మాణం, గుడి నిర్మాణం ఒకేసారి మొదలవుతాయి. వారిద్దరి అన్యోన్యత అలా ప్రారంభమై నానాటికీ బలపడుతుంది. విశేషమేమిటంటే,  వీరన్ననాయడు ఏ కులంవాడో రచయిత మొదట్లో ఎక్కడా చెప్పడు. కానీ రాజు కాగానే ‘క్షత్రియు’డైపోతాడు. మన దేశంలో వివిధ రాచవంశాల పుట్టుక గురించి ఇక్కడ విశ్వనాథ వాస్తవాన్నే బయటపెడుతున్నారు. ఈ దేశంలోనే ఉన్న ఇతర రాజ్యాలను దోచుకునో; లేదా దేశీయుడా, విదేశీయుడా అన్న తేడా కూడా చూడకుండా దోపిడీ శక్తులకు సాయపడో గడించిన సంపద పునాదుల మీద లేచినవవి. దోచుకున్న వ్యక్తి ఏ కులానికైనా చెంది ఉండవచ్చు; కానీ అధికారబలం, ధనబలం లభించగానే  బ్రాహ్మణ్యం అతనికి క్షత్రియత్వం కల్పిస్తుంది. ఇది ఉభయతారకమైన ఏర్పాటు. దోచుకున్న సొమ్ము అయితేనేం, అందులో కొంత దేవాలయానిర్మాణం వంటి దైవకార్యాలకు వినియోగిస్తే అది పవిత్రమైపోతుంది. ఈ రోజున కూడా తిరుపతి హుండీలో నల్లడబ్బు ఏ ప్రమాణంలో చేరడం లేదు?

ధర్మారావు ఊహాజగత్తులో అత్యంత విశిష్టంగా, ఆదర్శవంతంగా రూపుదిద్దుకున్న సుబ్బన్నపేట జమీందారి యథార్థరూపం ఇదీ. తన ఊహాశాలితను కాస్త నేలమీదికి మళ్లించి జమీందారీ మూలాలను తడిమి ఉంటే, అది దోపిడీ సొమ్ము మీద లేచిన వైభవోపేత నిర్మాణం అన్న సంగతి ధర్మారావుకు తెలిసేది. కానీ వాస్తవికత అనే నేల విడిచి ఊర్ధ్వయానం  సాగించడమే తప్ప కిందికి ప్రసరించే తత్వం అతని ఊహాశాలితకు లేదు. ఆ ఊర్ధ్వయానంలో పై పైకి వెళ్ళిపోయి కింద వాస్తవిక ప్రపంచం అనేది ఒకటుందన్న సంగతిని కూడా అతను ఒక్కోసారి మరచిపోతాడు. కావ్య రసాస్వాదన విషయానికే వస్తే, అతను తరచు రసప్రపంచంలో తప్ప మనుష్యలోకంలోనే ఉండడు. కావ్యజగత్తు గురించిన అతను చేసిన కింది  ఊహలు, వ్యవస్థ గురించిన అతని  కాల్పనిక ఊహలకూ యథాతథంగా వర్తిస్తాయి:

“ఓహో! కావ్యజగత్తు కల్పితజగత్తనుకొంటిని. కావ్యజగత్తే యథార్థమైన జగత్తు. అపరిపక్వమైన మనస్సులు, కృత్రిమ ప్రకృతులు, అసహజమైన మనోభావములు కలిగిన మనమే కల్పిత జగత్తు. యథార్థమైన మనోభావములు, నిర్మలమైన హృదయము, మహానాగరకత పొందిన బుద్ధీంద్రియములు కలిగినచో, తన దృష్టి, తన రక్తము కల్మషరహితమై, ధర్మగుణభూయిష్ఠములైనచో శీలము నందంత గాఢత్వముండును. అంత యేకాగ్రత యుండును…వర్ణసంకరము లేని రక్తము స్వచ్ఛమైనది.”

రాచరికవ్యవస్థ గురించిన అతని ఊహలు ఇంకా ఎంత హాస్యాస్పదంగా వ్యక్తమవుతాయంటే; అవి నవ్వునీ, బాధనీ కూడా కలిగిస్తాయి. అతనొకసారి ఇలా అనుకుంటాడు:

“మా తండ్రి నన్నేమో మహావైదికుని చేయవలెననుకొనెను. అన్న రామచంద్రరాజును గొప్ప విలుకానిని చేసి, అతనికి బ్రహ్మోపదేశము చేసి అధర్వవేదము పునరుద్ధరించి బ్రహ్మాస్త్రము మొదలైనవి కల్పితములు కావు, యథార్థములని రుజువు చేయించి, జగత్తు మరల క్షత్రియులచే నేలించవలయు ననుకొన్నాడు.”

ఈ నవల రచించే కాలానికి ఎంతో ముందే యుద్ధతంత్రంలోకి ఆధునిక మారణాయుధాలు ప్రవేశించాయి. మరో ఒకటిన్నర దశాబ్దాల కాలంలో అణ్వాయుధాలు కూడా ప్రయోగంలోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మారావు విలువిద్య గురించి, అధర్వవేదాన్ని పునరుద్ధరించి బ్రహ్మాస్త్రం మొదలైనవి కల్పితాలు కావని నిరూపించడం గురించి, జగత్తును(ఒక్క భారతదేశాన్నే కాదు) క్షత్రియులచే ఏలించడం గురించి కలలు కనడం అతని మానసికవైపరీత్యాన్నే సూచిస్తుంది. అతని ఊహలు పరిణామశీలాన్ని గుర్తించకపోవడమే కాదు; కాలాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తున్నాయి. క్షత్రియుడి పాలనను జగత్తు మొత్తానికి విస్తరింపజేస్తున్నాయి.

అతని ఊహలు, మధ్య మధ్య రచయిత చేసిన నిర్ధారణలు హాస్యాస్పదాలే కాదు; తర్కానికీ, హేతుబద్ధతకూ, శాస్త్ర నిరూపణకూ, చరిత్రకూ నిలవనట్టు ఉంటాయి. ఒకచోట రచయిత ఇలా అంటాడు: “ఏదో బలహీనపు గాలి మన దేశము మీదికి విసిరెను. ఆజానుబాహులై, విశాలవక్షులై, యేనుగు తొండము పూని విరువగల జాతికి; గుజ్జులై బక్కపలచనై, తెల్లవారి లేచినంతనే యేదియో యాహారము లేకపోయినచో తపతపలాడిపోవు జనులు పుట్టిరి.” మనదేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా ఒకప్పుడు అందరూ ఆజానుబాహులు, విశాలవక్షులు ఉండి; ఇంకొకప్పుడు అందరూ గుజ్జులు, బక్కపలచని వారు ఉండడం జరుగుతుందా? శరీరాకృతులు కానీ, ఆరోగ్యఅనారోగ్యాలు కానీ, ఆయుర్దాయంకానీ ఆయా కాలాలలో పుష్టికరమైన ఆహారలభ్యత, వైద్యసేవలు, ఆర్థిక సమానత లేదా అసమానత  మొదలైన భౌతిక, శాస్త్రీయ కారణాలపై ఆధారపడి ఉంటాయి తప్ప నిత్యసత్యాలుగా ఉండవు.

రక్తం, వర్ణం మొదలైన ప్రాతిపదికలపై జాతులను, మనుషులను విడగొట్టి చేసే ఊహలు కూడా అంతే అతార్కికంగా, అశాస్త్రీయంగా ఉంటాయి. ఆయా భాషల్లోని ఆయా వైచిత్రుల సమగ్రత తెలియడం, అవి అర్థమవడం ఆ దేశాల్లో పుట్టి ఆ భాషలు చిన్నప్పటినుంచి మాట్లాడితే కానీ సాధ్యం కాదని ధర్మారావు అనుకుంటాడు. “ఒక జాతి గుణములు, మతాభిప్రాయములు, తజ్జాతి రక్తము నెట్లుండునో, ఆ జాతి మాట్లాడు భాషలోని సమగ్రమైన రసాభావాదులర్థము చేసికొనుట కూడ శరీరములోని తద్రక్తము వలననే సంభవించు నని”  ఊహించుకుంటాడు. “వర్ణసంకరము లేని రక్తము స్వచ్ఛమైనది” అనుకుంటాడు. “ఆవు చురుకైన జంతువు. బర్రె మందమైన జంతువు…ప్రకృతిలోని యా మాంద్యము దాని రక్తమందున్నది. ద్రవ్యమును బట్టియే గుణము వచ్చినది. వాని రెండింటికి నవినాభావ సంబంధమున్నది. బ్రాహ్మణుని చూడగానే బ్రాహ్మణుడని తెలియుచున్నది. తుని వైపు క్షత్రియులను చూడుము. వెంటనే క్షత్రియుడని తెలియును…క్రైస్తవుడు క్రైస్తవునివలె కనిపించుచున్నాడు. అది భేదమే. అది వర్ణమే…అందర మొక్కటి యను సిద్ధాతము పశువులన్నియు నొక్కటియే యను సిద్ధాంతము వంటిది…అట్లే భిన్న వర్ణములందు భేదములున్నవి” అంటాడు. “ఆత్మలో భేదము లేదు. జీవునిలో భేదమున్నది…జలమే తాను తన యున్న భిన్నప్రదేశమును బట్టి భిన్నత్వము తెచ్చుకున్నది. తదుపాధిగత గుణదోష సంక్రాంతిచేత జీవుడు భిన్నుడగుచున్నాడు” అని తీర్మానిస్తాడు.

పోనీ వాదానికి రక్తభేదం, వర్ణభేదం ఉన్నాయని ఒప్పుకున్నా; అవి సంకరం కాకుండా ఎప్పుడైనా ఉన్నాయా? ప్రపంచచరిత్రలోకి వెడితే వర్ణసంకరం, జాతి సంకరం కాని కాలమే కనిపించదు. నాగరికత సోకని ఏవో మారుమూల ఆదివాసుల ప్రాంతాలలో తప్ప; నాగరికత పరిధిలోకి వచ్చిన ప్రపంచ జాతులు, మనుషుల మధ్య సాంకర్యం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. వర్ణసాంకర్యం గురించి మహాభారతంలోని అర్జునుడే గగ్గోలు పెట్టిన ఉదాహరణ ఉండగా, ‘వేయిపడగలు’ రచయిత ఏ వర్ణస్వచ్ఛత గురించి మాట్లాడుతున్నట్టు?

ఇంకోచోట, “కులవిద్యయే  కూడు బెట్టును. ఇప్పుడు కులవిద్యలు చెడిపోయి, సంపాదించుటకు చదువు కొనవలసివచ్చుచున్నది” అంటాడు. ఇక్కడ కులవిద్య అనే మాటను వృత్తి విద్యగా తీసుకుంటే బ్రిటిష్ పాలనలో వృత్తులు క్షీణించి వాటిని ఆశ్రయించుకున్న జనం అల్లాడవలసివచ్చిన మాట నిజమే. వారికి తగిన ప్రత్యామ్నాయం అభివృద్ధి చెందని మేరకు పై అభిప్రాయంలో కొంత నిజం ఉన్నమాట వాస్తవం. అయితే, కులవిద్య అన్నప్పుడు ఏ విద్య ఏ కులానిది; ఎక్కడ హద్దులు గీయగలం అనే ప్రశ్న వస్తుంది. బ్రాహ్మణులు మంత్రులుగా, సేనానులుగా లేరా? యుద్ధాలు చేయలేదా? అలాంటప్పుడు వారి కులవిద్య ఏదని చెబుతాం? అలాగే, వర్ణవ్యవస్థ ప్రకారం రాజ్యాధికారం క్షత్రియుడిది అనుకుంటే, రాజ్యాధికారంలోకి వచ్చిన వాళ్ళు అందరూ క్షత్రియులేనా? రాజులుగా ఉన్నవాళ్ళు అందరూ పుట్టు క్షత్రియులు కారనీ, వారికి క్షత్రియత్వం కల్పించారనీ, అందుకు హిరణ్యగర్భ క్రతువు వంటి అనేక ప్రక్రియలను అనుసరించారనీ తెలిపే ఉదాహరణలు అనేకం కనిపించడం లేదా? కులవిద్యనే అంటిపెట్టుకుని ఉంటే, ఒక వ్యవసాయదారుడు, ఒక కమ్మరి, కుమ్మరి, రజకుడు అధికారి, మంత్రి కాగలరా?

ఎలాంటివాడు ధర్మారావు? ఒకవైపు ఒక సంప్రదాయం చచ్చిపోతోందంటాడు. ఏదో బలహీనపు గాలి దేశం మీదికి విసిరిందంటాడు. ఒక మహా ప్రచండవాయువు వీస్తూండగా ఒరిగిపోయే వృక్షాలను నిందించి ఏం లాభమంటాడు. ఎవరిలోనూ ఉత్తమగుణాలు లేవంటాడు. మహార్థవంతమైనవన్నీ నశించిపోతున్నాయనీ, అల్పప్రయోజనములైనవన్నీ విజృంభిస్తున్నాయంటాడు. ఇంకోవైపు, ఇంతటి విపత్కరస్థితిలో కూడా కులవిభజన, వర్ణవిభజన, జాతి విభజన అంటూ ఎక్కడికక్కడ మనుషుల్ని చీల్చి మాట్లాడుతూ ఉంటాడు. అందరూ ఉమ్మడిగా ఎదుర్కొంటున్న పతనం నుంచి బయటపడడానికి ఐక్యంగా ఏం చేయాలన్న ఆలోచనే అతనిలో కనిపించదు. అతని ఉద్దేశంలో వర్ణవ్యవస్థ మళ్ళీ అవతరించి, జగత్తును అంతటినీ ఏలే అధికారం తిరిగి క్షత్రియుడికి కట్టబెడితే చాలు, అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయి.

అతనిలోని విభజిత దృష్టికి అంతే కనిపించదు. మనుషుల్నే కాదు మతాలను విభజిస్తాడు, సాహిత్యాన్ని విభజిస్తాడు, శిల్పాన్ని విభజిస్తాడు, చిత్రకళను విభజిస్తాడు. ఈ విభజనలో కొన్ని చోట్ల ఎక్కడైనా, ఏ కొంచమైనా వాస్తవం ఒకింత తళుక్కు మంటే అనవచ్చు. కానీ అతనిలో విరాట్ రూపంలో వ్యక్తమయ్యే స్వ, పర చింతన దానిని పూర్తిగా కప్పివేస్తుంది. అన్ని నదులూ సముద్రంలో కలసినట్టు ధర్మారావు ఊహలన్నీ ఆత్మోత్కర్షలో కలుస్తాయి. ఎందులోనైనా సరే మనమే గొప్ప. “మన దేశమునందు పుట్టిన దేనికి మాపులేదు. ఖద్దరు గుడ్డకు మాపేమిటి? అది యెప్పుడును పవిత్రమే. ఎప్పుడును నిర్మలమే” వంటి నిర్ధారణలు సర్వత్రా కనిపిస్తాయి. మళ్ళీ ‘మన దేశీయులు’ అన్నప్పుడూ అక్కడ మరో విభజన:

“మన దేశమనగా నాల్గు హద్దులు గల ప్రదేశమని కాదర్థము. ఇచ్చటి మతము, సంఘము, ఆచారములు సర్వము నని యర్థము. ఈ భూఖండము నందు పుట్టినంతలో నొరిగినది లేదు. మన మతసంఘాచారములయందు పుట్టవలయును. వాడూ మన దేశస్థుడు.”

(సశేషం)

 

 

 

ధర్మారావులో ఒక ‘అపరిచితుడు’

 

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-5

 

sudrarsanamదుఃఖించే మనిషిని చూడండి. అప్పుడతని, లేదా ఆమె ముఖకవళికలను చూడండి. దుఃఖం కళ్ళను తడిపి, ఆ తర్వాత, సృష్ట్యాదినుంచీ తన లోపల గడ్డ కట్టిన  ఒక పెద్ద మంచుఖండం వేదనా విలయాగ్నికి కరిగి ఒక మహా ప్రవాహంలా మారి కళ్ళు అనే రెండు ఇరుకు బిలాలనుంచి ఒక్కుమ్మడి ముందుకు దూకడానికి ప్రయత్నిస్తోందా అన్నట్టు ఉంటుంది!

ఎప్పుడైనా, ఎవరిదైనా సరే దుఃఖం హఠాత్తుగా మనల్ని ఒక అలౌకిక జగత్తులోకి తీసుకుపోయి అస్తిత్వం తాలూకు అనాది ఆర్తారావాన్ని శబ్దంగానూ, నిశ్శబ్దంగానూ కూడా ధ్వనిస్తుంది.

ప్రతి దుఃఖం వెనుకా గొప్ప కారణం ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి దుఃఖమూ అర్థవంతం కావాల్సిన అవసరమూ లేదు. అమ్మతో అయిదేరాళ్ళ కుర్రాడు జనసమ్మర్దంలోకి వెళ్లినప్పుడు, అంతవరకూ పక్కనే ఉన్న అమ్మ, అంతలో కనిపించకపోతే భయవిహ్వలతతో బావురు మన్నప్పుడు కూడా ఆ దుఃఖంలో అస్తిత్వపు అనాది ఆర్తారావమే తళుక్కుమంటుంది.  కొత్తగా అత్తింటికి వెళ్ళే నవవధువు తల్లిదండ్రులను విడిచి వెళ్ళేటప్పుడు పడే దుఃఖం కూడా అలాంటిదే. బిడ్డ పోయినప్పుడు తల్లి, తల్లి పోయినప్పుడు బిడ్డ పడే దుఃఖం వీటికన్నా సహస్రాంశాలు పెద్దవిగా, అర్థవంతమైనవిగా మనకు అనిపించవచ్చు.  కానీ దుఃఖితుడిలో అలాంటి తేడాలు ఏవీ ఉండవు. ఆ క్షణంలో తన దుఃఖమే తీవ్రం. అందుకు దారి తీయించినదే గొప్ప కారణం.

దుఃఖానికి ఇంకొక విలక్షణ స్వభావం కూడా ఉంది. దుఃఖితుడు, అతని లోపాలోపాలు, దుఃఖకారణాలు, అందుకు సంబంధించిన తర్కవితర్కాలు సహా అన్నింటి నుంచి అది వేరుపడి స్వతంత్రను స్థాపించుకుంటుంది. అప్పుడా అశ్రుధార ఏ మాలిన్యాలూ అంటని స్వచ్ఛజలం. తన ‘పరమపావన వంశాన్ని’ వెలగా చెల్లించి కొనుక్కున్న ‘కడజాతి’ ఇల్లాలు మరణించినప్పటి నిగమశర్మ దుఃఖం కూడా అంతటి స్వచ్ఛమే.

ఒక కోణం నుంచి చూస్తే గొప్ప అనుభూతి గాఢత నిండిన కవిత్వమూ, గొప్ప దుఃఖమూ విమర్శకు అతీతాలు. ‘వేయిపడగలు’ పేరుతో వేయి పుటల మీదుగా ప్రవహించినది, విశ్వనాథవారి అలాంటి మహాదుఃఖం. మహాకవితాత్మక దుఃఖం. అది గతించిన, గతించిపోతున్న ఒకానొక వ్యవస్థను గురించిన దుఃఖం. బహుశా అప్పటికి ఎంతోకాలంగా హృదయంలో సుడులు తిరుగుతున్న ఆ దుఃఖం ఒకానొక క్షణంలో కట్టలు తెంచుకుని ఇరవై తొమ్మిది రోజులపాటు ఏకబిగిని ప్రవహించి అక్షరరూపం ధరించి మహా శోకప్రవాహం అయింది. ఆ ప్రవాహపు ఉరవడిలో మనం ఉక్కిరిబిక్కిరవుతాం, అప్రతిభులమైపోతాం, మనకు తెలియని ఒకానొక అపూర్వ జగత్తులో …అనేకానేక సందేహాలు, విచికిత్సల మధ్య దిక్కు తోచని స్థితిలో కొట్టుకుపోతాం.

రచనాంతంలో, ‘ఏమి మిగిలింది?’ అని ప్రశ్నించుకున్న ధర్మారావుతో, ‘నేను మిగిలాను’ అని చిన్న అరుంధతి అంటుంది. ‘అవును. నీవు మిగిలితివి. ఇది నా జాతి శక్తి. నా యదృష్టము. నీవు మిగిలితివి’ అని ధర్మారావు అంటాడు. కానీ, పుస్తకాన్ని మూసేసి,  ఇంతకీ రచన ఏం చెప్పిందని సవిమర్శకదృష్టితో ప్రశ్నించుకునే పాఠకునికి ధర్మారావుకి లభించిన సంతృప్తి లభిస్తుందా అంటే సమాధానం దొరకదు.

ఒక కారణం, రచన పరిణామశీలాన్నే నిరాకరించడం. రచయిత చిత్రించినది, కాంక్షించినది ఎటువంటి మార్పులకూ, కొత్తదనానికి చోటివ్వని…కాలంలో ఘనీభవించిపోయిన ఒక వ్యవస్థను! రచన చివరిలో ఇలా అంటాడు:

“ఆహా! ఏమి కాలము!  ఏమి మార్పు! ఎన్నెన్ని ప్రాతవి నశించిపోయినవి? ఎన్నెన్ని క్రొత్తవి తలచూపినవి! లోకమంతయు నూత్నత్వము శక్తి యనుకొనుచున్నది. నూత్నత్వము నూత్నత్వమే కానీ శక్తి యెట్లగును? కొత్తలో గాడిదపిల్ల కూడ కోమలముగానే యుండును. ఆహా! ఎంత నశించిపోయినది? నశించిపోయినదానిని చూచినచో కడుపు తరుగుకొని పోవుచున్నది. ఈ నశించిన దంతయు వ్యర్థమై తేజోరహితమైనదైనచో దుఃఖము లేదు. నా జాతి యింత దైవోపహతమైన దేలకో? ఈ జాతి చేసిన పాపమున కంతులేదు కాబోలు!”

నిత్య పరిణామానికి సాక్షులుగా ఉండి, దానిని సహజంగా తీసుకుని, పాత, కొత్తల మధ్య ఒక సమన్వయానికి నిరంతర సాధన చేసే జనాలముందు పై వాక్యాలు ముందుకీ, వెనక్కీ కూడా  వెళ్లలేని ఒక అడ్డుగోడను రెండు వైపులా నిర్మిస్తాయి. అయోమయాన్ని కల్పిస్తాయి. విశ్వనాథవారు లక్షించిన వ్యవస్థే కానీ, మరొక వ్యవస్థే కానీ ముందు వెనకల ఎలాంటి పరిణామసూత్రమూ  లేకుండా స్వయంభువుగా అవతరించి అలా ఉండిపోయిందా అని ప్రశ్నించుకున్నప్పుడు రచనలో సంతృప్తి కరమైన సమాధానం దొరకదు.

రచయిత లక్ష్యం స్పష్టమే. చాతుర్వర్ణ్యవ్యవస్థను అత్యంత వైభవోపేతంగా, ఆదర్శప్రాయంగా చిత్రించడం. నాలుగు వర్ణాల వారూ ఎవరి ఎవరి వృత్తి ధర్మాల పరిధిలో వారు ఉంటూనే దేవాలయం, దైవభక్తి కేంద్రంగా పరస్పర ప్రేమాభిమానాలతో హృదయైక్యతతో ఉండడం. ఇందులో పంచములకు స్థానం లేదు. అయితే, ఈ వ్యవస్థకు కాల్పనికప్రపంచంలో ఉన్నంత ఉనికి వాస్తవిక ప్రపంచంలో కనిపించదు. అందుకు తగినట్టే ఇందులోని పాత్రలు రామేశ్వరశాస్త్రి, ధర్మారావు, కృష్ణమనాయుడు, రుక్మిణమ్మారావు, సరోజిని, హరప్ప, గిరిక, గణాచారి, పసిరిక, రంగాజమ్మ, రత్నగిరి మొదలైన పాత్రలు కాల్పనిక ప్రపంచజీవులుగా, అతి మానుషులుగా కనిపిస్తారు. పెళ్లై అత్తింటికి వచ్చిన ధర్మారావు భార్య పెద్ద అరుంధతిని కూడా ఆశ్చర్యచకితం చేసిన అతిమానుష స్వభావం వారిది.  ధర్మారావు మిత్రులు కిరీటి, సూర్యపతి, కుమారస్వామి, రాఘవరావు తదితరులు, మంగమ్మ  వాస్తవిక ప్రపంచానికి చెందిఉంటూనే ధర్మారావుకు చెందిన అతిమానుష కాల్పనిక జగత్తుపట్ల సానుకూలతను, ఆరాధనాభావాన్ని చాటుకుంటూ ఉంటారు. రాధాపతి, చక్రవర్తి, పత్రికాసంపాదకుడు వామనరావు తదితరులు  ఆ భావజాలానికి ప్రతివాదులు. కుమారస్వామి అయితే ధర్మారావుకు విస్తరిత రూపమే. ధర్మారావులోని భావతీవ్రతే అతనిలోనూ ఉన్నా, ధర్మారావు ఉగ్రతను శాంతం కప్పి ఉంచితే కుమారస్వామి ఉగ్రత నేరుగా వ్యక్తమవుతుంది. కుమారస్వామి అని పేరుపెట్టడంలో దేవతల సేనాని అయిన కుమారస్వామిని రచయిత దృష్టిలో ఉంచుకున్నట్టు అనిపిస్తుంది. చివరిలో చిన్న అరుంధతిని పెళ్లాడిన ఘట్టంలో ధర్మారావుకి శివునితో సామ్యం కనిపిస్తుంది.

viswanatha

రామేశ్వరశాస్త్రి, కృష్ణమనాయుడు, రుక్మిణమ్మారావు, సరోజిని తదితర పాత్రలను అలా ఉంచితే; నవలలో దాదాపు చివరివరకు జీవించిన గిరిక, గణాచారి, పసిరికలు పూర్తిగా అతిమానుషప్రపంచంలోనే ఉండిపోతారు. ధర్మారావు ఒక్కడే అతిమానుష, వాస్తవిక ప్రపంచాలకు మధ్య లంకెగా ఉంటూ, వాటి మధ్య పరిభ్రమిస్తూ, రెండింటి తారతమ్యాలను అడుగడుగునా వివేచించుకుంటూ  గడుపుతాడు. అతని స్థితిని రచయితే ఇలా చెబుతాడు:

“ధర్మారావునకు రెండు జగత్తులు. ఒక జగత్తులో మూకీభావము. మరొక జగత్తులో అనియత వాగ్వ్యాపారము. ఒక జగత్తు దివ్యము, ఒక జగత్తు భౌమము. భౌమములో అతి భౌమము. ఒకటి పునీతము, ఒకటి ఇంద్రియ పరాభూతము. దివ్యమునుండి భౌమమునకు వచ్చుట ఎంత కష్టమో, దీనినుండి దానికి పోవుటయు అంతే కష్టముగా నున్నది. సెలవులు వచ్చినచో గణాచారి, దేవదాసి, పసిరిక, అరుంధతి! సెలవులు లేనిచో కిరీటి, శివరావు, కళాశాల”.

దివ్యజగత్తులో గడిపే ధర్మారావుకు భౌమ(భూసంబంధమైన)జగత్తులో గడిపే ధర్మారావుకు మధ్య ఎంతో వ్యత్యాసం. భౌమ జగత్తులో గడిపే ధర్మారావు పాఠకులు హృదయాలపై గాఢంగా ముద్రపడతాడు. ఈ జగత్తులో అతను నిరహంకారి, నిగర్వి, గొప్ప మానవీయత కలిగినవాడు, వ్యక్తిత్వమూ, శీలమూ, స్వాభిమానమూ, స్నేహశీలమూ ఉన్నవాడు. వాటితోపాటు కొన్ని లౌకికమైన బలహీనతలూ ఉన్నవాడు. అతని స్నేహశీలాన్ని, మానవీయతను, కృతజ్ఞతను వెల్లడించే హృద్యమైన ఘట్టాలు నవలలో అనేకం ఉన్నాయి. మిత్రుడు రాఘవరావు భార్య మశూచితో చనిపోయినప్పుడు, అంతిమ సంస్కారానికి ఎవరూ సాయపడనప్పుడు; ధర్మారావు, అతని మరో మిత్రుడు సూర్యపతి స్వయంగా శవాన్ని శ్మశానికి తీసుకెళ్లి పాతిపెట్టిన ఘట్టం వాటిలో ఒకటి. అలాంటిదే జేబుదొంగ అయిన ఆసిరి అనే కుర్రవాడిని ఆదరించిన ఘట్టం. నాయర్ అనే ఒక దుకాణదారు తన అవసరానికి రెండు రూపాయలు ఇచ్చి ఆదుకున్నప్పుడు, తన చేతిలో డబ్బు పడీపడగానే అతని బాకీ తీర్చడానికే ధర్మారావు  తొలి ప్రాధాన్యం ఇస్తాడు. తీరా అతని దుకాణానికి వెడితే, అతను తీర్థయాత్రలకు వెళ్ళినట్టు తెలిసి ఎంతో నిరాశ చెందుతాడు. ఇది అతనిలో కృతజ్ఞతాబుద్ధిని చూపుతుంది.  అతను అనుభవించిన పేదరికం మన మనసుల్ని మెలిపెడుతుంది.

లౌకికంగా అతను కూడా అందరూ ఎదుర్కొనే సాంసారిక సమస్యలు ఎదుర్కొంటాడు, డబ్బు కోసం ఇబ్బంది పడతాడు. ఇంగ్లీషు చదువుతాడు. ఉద్యోగం కోసం ఆరాటపడతాడు. ఒక యవ్వనవంతుడిలో ఉండే సహజమైన వాంఛలు అతనికీ ఉంటాయి. మళ్ళీ తను కూడా అందరిలానే ప్రవర్తిస్తున్నానే అన్న స్ఫురణా ఉంటుంది. తన కార్యానికి తానే వందరూపాయలు పుట్టించుకుని అత్తవారింటికి వెడతాడు. వెళ్ళే ముందు దేవాలయానికి వెళ్ళి శివపార్వతులను చూసి, శివుడికే సంసార జంజాటం తప్పనప్పుడు తనెంత అనుకుంటాడు. ‘ధర్మారావు సగము విరాగి, అతనిలో వైరాగ్యమెంతయో లాలసత యంత’ అని రచయిత అంటాడు. అయితే శోభనం గదిలో పడక మీద భార్య సరసన ఉండి కూడా అతను దైవచింతనలోకి జారుకోవడం కొంత విపరీతంగా అనిపిస్తుంది. అది రక్తికే కానీ, భక్తికి సందర్భం కాదు. అతనిదా వయసూ కాదు. నవలలో విశేషంగా ఆకట్టుకునే వాటిలో ఒకటి, దాంపత్య శృంగార చిత్రణ. దానిని విశ్వనాథ అంత అందంగా, హృదయదఘ్నంగా చిత్రించినవారు మరొకరు లేరేమో ననిపిస్తుంది.

ఇదే ధర్మారావులో కొన్ని ఇతర లక్షణాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది విశ్వనాథ వాస్తవికతను అనుసరించిన ఫలితం కావచ్చు. ఎవరితోనైనా వాదించేటప్పుడు ధర్మారావు ఆవేశపడతాడు. అదే సమయంలో తాను ఆవేశపడుతున్నానన్న స్పృహ అతనిలో ఉంటుంది. అలాగే, సారంగధర నాటకానికి వెళ్లినప్పుడు ఒకవైపు నాటకం జరుగుతుండగానే తనూ, కుమారస్వామి అందులోని పాత్రధారులపై, వారి ఆహార్య, అభినయాలపై వ్యాఖ్యలు చేస్తారు. అది పక్కవారికి ఇబ్బందికరమన్న చిన్న విషయం ధర్మారావుకు స్ఫురించదు. ఒక ప్రేక్షకుడు దానిని ప్రశ్నించినప్పుడు కోపం పట్టలేకపోయిన ధర్మారావు తెలిసిన ఒక రౌడీని అతనిపైకి పురిగొల్పుతాడు.

ఇక ధర్మారావు, అతని భావజాలం… అదొక విచిత్ర సంబంధం. ధర్మారావు వ్యక్తిగత లౌకిక ప్రవర్తనలో  వక్రత, సంకుచితత్వం, అమానవీయత, అహంకారం  లేవు. కానీ అతను త్రికరణశుద్ధిగా విశ్వసించే భావజాలంలో అవి ఉన్నాయి.  భావనాత్మకంగా, లేదా సిద్ధాంతపరంగా చెప్పుకుంటే  ఆ భావజాలంలోనూ వక్రత, సంకుచితత్వం, అమానవీయత లేవు. కానీ ఆ భావజాలపు లౌకికప్రతిఫలనంలో ఉన్నాయి. వ్యక్తిగా ధర్మారావులో ఆధిక్యభావన, కింది కులాలపట్ల వివక్ష, ఇతర జాతులపట్ల తృణీకారభావం లేవు. కానీ భావజాలం దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ వ్యక్తమవుతాయి. అవి కూడా వాస్తవానికి ఆ భావజాల నిర్మాణంలో ఉన్నాయి. సనాతనధర్మం, హిందూ వ్యవస్థా ధర్మం అనేవి ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వం ద్వారా దృశ్యమానమవుతున్నాయని సుదర్శనంగారు అన్నారు కానీ వాస్తవానికి వాటిలోని వక్రత, సంకుచితత్వమే ధర్మారావులో దృశ్యమానమవుతున్నాయని భావించడం న్యాయం. మనకిప్పుడు బాగా తెలిసిన ఒక పోలికతో చెప్పాలంటే, ధర్మారావు, అతని భావజలాల సంబంధం ‘అపరిచితుడు’ సినిమాలో హీరో తరహాలో ఉంటుంది.

ఆ భావజాలానికి కాల్పనిక జగత్తులో ఉన్న ఉనికి లౌకిక జగత్తులో లేకపోవడం ఈ వైరుధ్యానికి కారణం. అందులో ప్రాధాన్యం వహించే చాతుర్వర్ణ్యవ్యవస్థ అందరినీ ఇముడ్చుకోగలిగినంత వైశాల్యం కలది కాదు. పంచములకు, మతేతరులకు, విజాతీయులకే కాదు సరికదా; దేవాలయం కేంద్రంగా ఉన్న ఆ వ్యవస్థలో, చాతుర్వర్ణ్య వ్యవస్థలోనే ఉన్న నాస్తికులకు కానీ, ఆ వ్యవస్థను ప్రశ్నించేవారికి గానీ స్థానం ఉండదు. ఆవిధంగా అది ఇరుకుగానే కాక, నిరంకుశంగా కూడా మారుతుంది. దేవాలయాన్ని, దేవుడినీ, మతాన్ని వ్యక్తిగతం చేసి; భిన్న ప్రాతిపదికపై అందరినీ కలిపే ఏర్పాటుకు అందులో అవకాశం లేదు. ఆ వ్యవస్థలోని మూసుకుపోయిన లక్షణమే ధర్మారావు ఆలోచనల్లోనూ మాటల్లోనూ వ్యక్తమవుతూ ఉంటుంది. అతని దృష్టిలో తన దేశానికి, మతానికి, సంప్రదాయానికీ, సాహిత్యానికి, శాస్త్రాలకూ చెందినవన్నీ గొప్పవే; అందులో చెడు ఉండడానికి అవకాశమే లేదు. ఇతరుల మతాలలో, సంప్రదాయాలలో, సాహిత్యంలో అతనికి అన్నీ లోపాలే కనిపిస్తాయి. ఈ రకమైన అతని తారతమ్య వివేచనలో అక్కడక్కడ అర్థవంతమైన, లోతైన భావాలు కనిపించినప్పటికీ ఆ వివేచన  చాలాచోట్ల అశాస్త్రీయంగానూ, హాస్యాస్పదంగానూ పరిణమిస్తుంది. అతను వర్ణభేదం, జాతిభేదం రక్తంలోనే ఉన్నాయని అంటాడు. ఇతర జాతులలోని చెడును విమర్శించేటప్పుడు అలాంటిదే స్వజాతిలోనూ ఉన్న విషయాన్ని విస్మరించి ఆ చెడును ఆ ఇతర జాతి మొత్తానికే ఆపాదిస్తాడు. ఉదాహరణకు, బ్రాహ్మణ యువతి అయిన మంగమ్మ కూడా డబ్బు మీద ఆశతో రామేశ్వరం అనే బ్రాహ్మణేతరునితో సంబంధం పెట్టుకుంటుంది. అలాగే డబ్బుకోసం జమీందారు రంగారావును పెళ్లాడిన ఆంగ్లేయయువతి శశిని చర్య మాత్రం ఆ జాతి స్వభావంగా  కనిపిస్తుంది. లౌకికంగా హృదయవైశాల్యం ఉన్నవాడిగా  కనిపించే ధర్మారావు భావజాలం దగ్గరికి వచ్చేసరికి కరడుగట్టి కనిపిస్తాడు.  జాతిమతవర్ణభేదాలను ఎత్తి చూపుతూ మనుషుల్ని ఎక్కడిక్కడ చీల్చి తనను ఆధిక్యస్థానంలో నిలుపుకుంటాడు. ఇందులో పరవిమర్శే తప్ప ఆత్మవిమర్శ తక్కువగా ఉంటుంది.

veyi

ఆధునికమైనవీ, నేడు ప్రగతిశీలకంగా భావించే వాటిని అన్నిటినీ ధర్మారావు మూలమట్టంగా వ్యతిరేకిస్తాడు. అతని దృష్టిలో బాల్యవివాహాలే మంచివి. పంచములు దేవాలయంలోకి రాకూడదు. విద్యుద్దీపాలకన్నా ఆముదం దీపాలే శ్రేష్టం. పర్యావరణం గురించి, ప్రకృతిపట్ల ఆనుకూల్యత గురించి అతని ముఖంగా, లేదా ఇతర పాత్రల ముఖంగా  రచయిత చెప్పే అనేక విషయాలు అర్థవంతంగా ఆలోచనీయాలుగా  కనిపిస్తాయి. అయితే పరిణామగతిలో కొంత మంచితో పాటు చెడూ కొత్తగా వచ్చి చేరుతూ ఉంటుందనీ, ఆ చెడును తొలగించే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉండాలన్న స్పృహకు బదులు; అసలు పరిణామశీలాన్నే వ్యతిరేకించి గతంలోనే ఘనీభవించాలన్న ఒక అసహజమైన, సృష్టి వ్యతిరేకమైన ధోరణి వ్యక్తమవుతూ ఉంటుంది.

ధర్మారావులో ప్రశ్నను, విమర్శను కూడా నిషేధించే వైఖరి కనిపిస్తుంది. భార్య అరుంధతి తన మామగారు రామేశ్వరశాస్త్రి నాలుగువర్ణాల వారినీ పెళ్లి చేసుకోడంగురించి, ఆయనకు రత్నగిరి అనే భోగం స్త్రీవల్ల కలిగిన దేవదాసి గిరిక గురించి ఎత్తినప్పుడు అతనికి కోపం వస్తుంది. ఆ ప్రస్తావననే అతడు నిషేధిస్తాడు. ప్రశ్నకన్నా విశ్వాసమే అతని ఆలోచనాసరళికి కేంద్రబిందువు అవుతుంది.

అసలు ధర్మారావుకు ఆదర్శప్రాయమైన ఆ వ్యవస్థ అంత ఆదర్శవంతంగానూ ఎప్పుడైనా ఉనికిలో ఉందా అని ప్రశ్నించుకుంటే దానికీ సమాధానం దొరకదు. ఆ వ్యవస్థకు తనలానే మొత్తం బ్రాహ్మణ్యమంతా ప్రాతినిధ్యం వహిస్తోందా అంటే, మంగమ్మ భర్త, ఉపాధ్యాయుడు అయిన జోశ్యులు తన వ్యక్తిత్వాన్ని చంపుకుని తాలూకా బోర్డు అధ్యక్షుడైన రామేశ్వరం ప్రాపు కోసం ఎందుకు పాకులాడతాడు? తన భార్యను అతను లొంగదీసుకునే పరిస్థితిని ఎందుకు కల్పిస్తాడు? మంగమ్మ డబ్బు మీద ఆశతో ఎందుకు కాలుజారుతుంది? ధర్మారావు అత్తగారివైపు వారు కూతురిపట్ల అంత నిర్దయగా, ధర్మవిరుద్ధంగా ఎందుకు వ్యవహరించారు? రామేశ్వరశాస్త్రి మంచి స్థితిలో ఉన్నప్పుడు అతని వల్ల లాభపడిన బంధువులు అతను చితికిపోగానే ఎందుకు మొహం చాటేశారు?

కనుక ధర్మారావు తను లక్షించిన ఆ వ్యవస్థకు ప్రతినిధి తనొక్కడే తప్ప, సాటి బ్రాహ్మణ్యం తోడు కూడా అతనికి లేదు. మరి బ్రాహ్మణ్యం ఇలా ఎందుకు దిగజారింది అంటే అందుకు కారణం పరాయి పాలన, పాశ్చాత్యపు పోకడలని ధర్మారావు చెప్పగల సమాధానం. అసలు అంత గొప్ప వ్యవస్థ పరాయి పాలనకు, పాశ్చాత్యపు పోకడలకు ఎందుకు అవకాశమిచ్చింది; ముందే తను దిగజారడం వల్ల అలా జరిగిందా, లేక అది జరిగినందువల్ల తను దిగజారిందా? ఏది ముందు, ఏది వెనక? అన్న ప్రశ్నలకూ సమాధానం దొరకదు.

(సశేషం)

 

 

 

 

ధర్మారావు గెలిచాడు!

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-4

 

sudrarsanam‘వేయిపడగలు’పై సుదర్శనంగారి విశ్లేషణ తీరును రెండు ఉపమానాలతో చెప్పుకోవచ్చు. రెండూ పరస్పర విరుద్ధమైనవి.

మొదటగా, ఇంగ్లీషు చదువుల శిక్షణ నుంచి లభించిన  సునిశితమైన తర్కమూ, హేతుత్వమూ అనే సూది మొనను దానికి తాకించి చూశారు. దాంతో అది గాలిబుడగలా పేలి పోయింది. అయితే, అలా పేలిపోతే ఎలా?  ధర్మారావు అనే పాత్రను సనాతన ధర్మాన్ని దర్శించిన జ్ఞానిగానూ, వ్యవస్థాధర్మానికి సాధికార వ్యాఖ్యాతగానూ, అతనిది ఆజన్మ సిద్ధమైన జ్ఞానమార్గంగానూ రచయిత చెబుతున్నాడే! కనుక రచయిత ధర్మారావు గురించి చెప్పిన దానికీ, ధర్మారావు నడవడికీ మధ్య నున్న వైరుధ్యంలో మన అవగాహనకు అందనిది ఏదైనా ఉందేమో!

తీరా అదేమిటో చూద్దామనుకునేసరికి నవల గుండ్రాయిగా మారి సూదిమొనే వంగిపోయింది.

ఈ పరిస్థితిలో, తనకు సైతం సానుకూల దృక్పథం ఉన్న హైందవ ధర్మమూ, తాత్వికతా అనేవి నవలలో ధర్మారావు మనస్తత్వంలోని వక్రత నుంచీ, సంకుచితత్వం నుంచీ వ్యక్తమవుతున్నాయి కనుక అవే నిజమైన హిందూ ధర్మమూ, తాత్వికతా  కావన్న నిర్ధారణకు రావడమే మార్గం.  రచయిత చిత్రించదలచుకున్నది నిజమైన హిందూధర్మ, తాత్వికతలు కాక;; వాటికి ఆలంబనంగా తనను తాను భావించుకునే ధర్మారావు అనే, వక్రత, సంకుచితత్వం మూర్తీభవించిన వ్యక్తి ఆత్మకథను! ఆపైన, అసలు రచయిత చిత్రించదలచుకున్నది హైందవ వ్యవస్థను, తాత్వికతను కాదు, తెలుగు దేశాన్ని, తెలుగుదనాన్ని!

హైందవ ధర్మమూ, తాత్వికతా, ధర్మారావులోని వైరుధ్యాలు…ఈ గంద్రగోళాన్ని అంతటినీ పక్కన పెట్టేసి, కేవలం సాహిత్య కోణం నుంచి ఒక రచనగా ‘వేయిపడగ’లను అంచనా వేయడం అంతకన్నా సురక్షితమైన మార్గం. ఆ విధంగా చూసినప్పుడు అందులో గొప్ప పఠనీయత ఉంది. అద్భుతమైన పాత్రపోషణ ఉంది, తెలుగుదనం ఉంది. ఆధునికత తెలుగువారి జీవితంలో తీసుకొచ్చిన అనేకానేక పరిణామాలను ఒక చిన్నసైజు విజ్ఞాన సర్వస్వం స్థాయిలో చిత్రించడం ఉంది. అది, కాల్పనికోద్యమకాలంలో వెలువడిన ఆత్మాశ్రయకవిత్వ శాఖలో ఒక అపురూపమైన కావ్యం!

ఈవిధంగా సుదర్శనంగారి వేయిపడగల పరిశీలన అందులోని హైందవ ధర్మ, తాత్వికతల పరిశీలనతో ప్రారంభించి అది సంతృప్తి కలిగించకపోవడంతో, దానిని తెలుగుదేశమూ, తెలుగుదనాలకు కుదించి ఒక ఉత్తమ సాహిత్య సృష్టిగా నిలబెట్టడంతో ముగుస్తుంది.

ధర్మారావు గురించి రచయిత చెప్పిన దానికీ, ధర్మారావు నడవడికీ మధ్యనున్న వైరుధ్యం ఎలాంటిదన్నది పరిశీలించకపోవడం –విశ్వనాథ ప్రాతినిధ్యం వహించే భావజాలానికి బాహ్య మిత్రుడిగా ఆయనకు గల పరిమితి.

***

అసలు ఆ వైరుధ్యంలోనే హిందూ ధర్మ, తాత్వికతలు ఉన్నాయని ఎందుకు అనుకోకూడదు? ధర్మారావు, అతని తండ్రి రామేశ్వరశాస్త్రే ఆ  హైందవ ధర్మానికి, తాత్వికతకు అసలు సిసలు ప్రతినిధులు ఎందుకు కాకూడదు? వాటికి భిన్నమైన, నిజమైన హైందవధర్మమూ, తాత్వికతా వేరే ఉంటాయని ఎందుకు అనుకోవాలి?

ఎందుకంటే, వాటిలో తనూ ఒక వదులైన భాగమే అయినా, వాస్తవంగా వాటి జన్మస్థానంతోనూ, అక్కడి జీవితాలతోనూ, వారి తలపులతోనూ  గాఢమైన పరిచయం లేని బాహ్యుడు కనుక!

దూరం నుంచి చూసినప్పుడు అదొక గొప్ప రొమాంటిక్ అడ్మిరేషన్ కలిగిస్తుంది. అందులో భాగమై చూసినప్పుడు భిన్నంగా కనిపిస్తుంది. అందుకే దాని తలుపులు చాలావరకు మూసి ఉంటాయి. తెరచుకున్నప్పుడు కూడా బయటినుంచి చూసినప్పుడు కలిగే రొమాంటిక్ అడ్మిరేషన్ ను నిలబెట్టే మేరకే ఓరగా తెరచుకుంటాయి.

విశ్వనాథ దృష్టిలో రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల గురించి తను చెప్పినదానికీ, వారి నడవడికీ మధ్య ఎలాంటి వైరుధ్యం ఉండడానికి వీలులేదు. అంత పెద్ద లోపాన్ని ఆయనకు ఎలా ఆపాదిస్తాం? కనుక ఆ వైరుధ్యం బయటినుంచి చూసినప్పుడు కలిగే భ్రాంతి. అంతర్గతంగా చూసినప్పుడు అందులో వైరుధ్యం ఉండడానికి అవకాశం లేదు. అది రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల దృష్టిలో కూడా వైరుధ్యం ఎప్పుడవుతుంది? వారు కూడా దానిని, గుర్తించి అంగీకరించినప్పుడు. వారు గుర్తించే అవకాశం లేదు కనుక అది వైరుధ్యం కానే కాదు. ఆపైన అది  వైరుధ్యమా, కాదా అన్నది నిర్ధారించవలసిన అధికారం కూడా వారిదే కనుక; ఇంకొకరు అలాంటి ఆరోపణ చేయడం చెల్లదు.

కనుక రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా హైందవ వ్యవస్థా, తాత్వికతలను చిత్రించడంలో విశ్వనాథ నిజాయితీని పాటించారు. వారు అలా తప్ప ఇంకోలా ఉండే అవకాశమే లేదు. ఒక వ్యక్తి జీవన సరళే అతని తాత్వికతను అభివృద్ధి చేస్తుందని అనుకుంటే, రామేశ్వర శాస్త్రి, ధర్మారావుల జీవితమే వారి తాత్వికత. వారే హైందవ ధర్మ, తాత్వికతలకు నిర్ణేతలు, భాష్యకారులు, హక్కుదారులు కనుక వారి జీవితమే హైందవధర్మ, తాత్వికతలకు ప్రతిబింబం.

విశ్వనాథ అజాగ్రత్త ఉంటే ఎక్కడ ఉంటుందంటే, హైందవధర్మ, తాత్వికతలను చిత్రించడానికి ఆధునిక ప్రక్రియ అయిన నవలను స్వీకరించడంలో. ఆపైన దానిని ఇంగ్లీషు చదువుల శిక్షణనుంచి సంక్రమించే తార్కికతా, హేతుత్వాల ఉపకరణాలతో చూసినప్పుడు అది ఎలా పరిణమిస్తుందన్న సంగతిని విస్మరించడంలో. ఆధునిక నవలా ప్రక్రియలో వ్యక్తుల జీవిత చిత్రణ విధిగా వాస్తవికతను అనుసరిస్తుంది. అలాగే, హైందవ వ్యవస్థా, తాత్వికతలను వస్తువుగా తీసుకున్నప్పటికీ  రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల జీవితచిత్రణలో ఆయన వాస్తవికతను అనుసరించారు. తీరా చూస్తే ఆ వాస్తవికత ఆయనకు తెలియకుండానే వస్తువుకీ, పాత్రలకూ మధ్య వైరుధ్యాన్ని ఎత్తిచూపి రెండింటి పట్లా అపోహలకు దారితీయించింది.

సుదర్శనంగారే దీనిని గుర్తించి మిల్టన్ పారడైజ్ లాస్ట్ తో పోలిక తెచ్చారు. ఆయన ఇలా అంటారు:

“మిల్టన్ తన పారడైజ్ లాస్ట్ (Paradise Lost)లో సృష్టించిన సైతాన్ (Satan)పాత్ర కవి ఉద్దేశానికి భిన్నంగా, అంటే వీరోచితంగా, ఆకర్షణీయంగా రూపొందడం వల్ల, “He was of the Devil’s party without knowing it” అనే విమర్శ వచ్చింది. కొంతవరకు ఈ విమర్శ విశ్వనాథ ఈ మూడు నవలలకూ(ఏకవీర, వేయిపడగలు, చెలియలికట్ట)వర్తిస్తుంది.”

హైందవ ధర్మ, తాత్వికతలు ఎంత విశిష్టమైనవి, లోతైనవి అన్నది వేరే పరిశీలన. రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా  వాటి ప్రతిఫలనం ఎలా ఉందన్నదే ఇక్కడ విచారణ.

viswanatha

విషాదం ఏమిటంటే, రామేశ్వరశాస్త్రి, ధర్మారావులు తమ ప్రతిబింబం ఎలా ఉందో చూసుకోడానికి ఎదురుగా వేరే అద్దం ఏదీ లేదు. తామే అద్దం. తాము ఎలా ఉన్నారో చెప్పడానికి, లేదా ప్రశ్నించడానికి వేరొకరికి తాహతు లేదు, అధికారం లేదు, జ్ఞానం లేదు. తాము ఉన్నదే జ్ఞానకాంతులు విరజిమ్మే లోగిలిలో. గడప దాటితే అవతల అంతా అజ్ఞానాంధకారం. అంతిమ పర్యవసానం…తులనాత్మకంగా చూడడానికి అవతల మరొకటి లేని స్థితిలో, ఉన్నా చూడదలచుకోని స్థితిలో, తమ విశ్వాసాలను, కోరికలను, లౌల్యాలను, తమ జీవన సరళిని, అందులో ఇతరులకు వైరుధ్యాలుగా కనిపించేవాటితో సహా అన్నిటినీ ధర్మబద్ధం చేసి, తాత్వికీకరించి చివరికి తాము సైతం అవే నిజమనుకునే భ్రమలో గూడులో రెక్కలు ముడుచుకుని ఉండిపోవడం!

తాత్విక స్థాయిలో బ్రహ్మం ఎలా అనిర్వచనీయమో, ఎలా కంటికి కనిపించదో, ఎలా ద్వంద్వాలకు, ప్రశ్నలకు, సందేహాలకు అతీతమో జీవనస్థాయిలో రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల నడవడి కూడా అంతే. రామేశ్వరశాస్త్రి యోగి, వర్ణాశ్రమధర్మాల ముద్ద కట్టిన మూర్తి. కానీ పైకి భోగిలా, రసికుడిలా కనిపిస్తాడు. ఆయన నాలుగువర్ణాల స్త్రీలనూ పెళ్లి చేసుకున్నాడు. ఒక భోగాంగనను చేరదీశాడు. నాలుగువర్ణాల వారినీ పెళ్లిచేసుకునే అర్హత ఆయనకు తప్ప ఇంకొకరికి లేదు. ఎందుకులేదని ప్రశ్నించడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం ఆయనకు ఒక్కడికే ఆ అర్హత కల్పించింది. మళ్ళీ ఆ ధర్మశాస్త్రానికి కర్త ఆయనే.

ధర్మారావూ అంతే. అయితే, అతని దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి మారింది. ఆధునికత విజృంభిస్తోంది. ఇంగ్లీషు చదువులు రాటుదేలుతున్నాయి. తాము ముడుచుకుని ఉన్న భ్రమల గూడుమీదే దెబ్బలు పడుతున్నాయి. అంతవరకు తమకు ఆశ్రయమూ, అధికారమూ ఇచ్చిన  జమీందారీ వ్యవస్థా, దానితోపాటే తమ ఆశ్రయమూ, అధికారమూ కుప్ప కూలుతున్నాయి. ధర్మారావు తమ జ్ఞాన కాంతుల లోగిలి నాలుగు గోడల మధ్య నుంచి అప్పుడప్పుడు ఆజ్ఞానాంధకారపు బాహ్య పరిసరాలలోకి రావలసి వస్తోంది. ఇంగ్లీషు చదవవలసివస్తోంది. కానీ భౌతికంగా అతను బాహ్య పరిసరాలలోకి వస్తున్నా అతని ఆత్మ మాత్రం తన భ్రమల గూడును విడిచి రావడంలేదు. దాని మీద దెబ్బలు పడుతున్న కొద్దీ అతను మరింతగా అందులో ముడుచుకుంటున్నాడు. బాహ్య పరిసరాలు ఎంత మారుతున్నా, వాటికి అనుగుణంగా తానూ ఎంతో కొంత  మారుతున్నా అతని ఆత్మలో మార్పు లేదు. అది ఎప్పటిలానే తన భ్రమల గూడును పట్టుకుని వేలాడుతూనే ఉంది. శిథిలమవుతున్న  ఆ గూడును తలచుకునే అతనిలో నిస్పృహా, నిర్వేదం. అదే వేయిపడగలు.

మారిన పరిస్థితిలో, బహుశా తండ్రి రామేశ్వరశాస్త్రికి అదనంగా, ధర్మారావు జీవితంలో అస్తిత్వం తాలూకు అభద్రత ప్రవేశించింది.  ఆ అభద్రత రెండు రకాలు. మొదటిది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అభద్రత. ఇంగ్లీషు చదువుకుని ఉద్యోగం వైపు మళ్లి ఆ అభద్రతను జయించవచ్చు. ధర్మారావు కాకపోయినా ధర్మారావు వారసులు అదే చేయబోతున్నారు. రెండవది, తమ సాంస్కృతిక, మత, తాత్విక, ధార్మిక, రాజకీయ ఆధిపత్యానికి కలుగుతున్న అభద్రత.

ధర్మారావు వైపునుంచి చెప్పుకుంటే  ఈ రెండు రకాల అభద్రతలకు అంతస్సంబంధం ఉంది. సమాజంలో తను అల్పసంఖ్యాకవర్గం. శ్రమ చేయలేడు. బలిష్టుడు కాదు. ఈ బలహీనతలనే బలంగా మార్చుకోవడం, అవి కల్పించే అభద్రతనుంచే భద్రతను నిర్మించుకోవడం –ఇదీ అతని తాత ముత్తాతలనుంచీ జరుగుతూ వచ్చింది. ఈ ప్రయత్నంలోంచే అతని మతం, తాత్వికత, ధర్మశాస్త్రం, సాహిత్యం, సమస్త వాఙ్మయం పుట్టాయి.  ఇప్పుడు వీటన్నిటితో కూడిన వ్యవస్థకే అభద్రత వాటిల్లింది. ఇందుకు ధర్మారావుకు కనిపించిన పరిష్కారమేమిటంటే, ఆ అభద్రతను ఎదుర్కోవడానికి, అలాంటి అభద్రత నుంచే పెంపొందించిన వ్యవస్థలోనే తిరిగి భద్రత వెతుక్కోవడం!

ఒక కోణం నుంచి చూస్తే ధర్మారావు పాత్ర జాలిగొలుపుతుంది. అతనిలో తాను సర్వాధికుడినన్న భావన. అది అతనిలో అధికారాన్ని, అహాన్ని మాత్రమే కాదు; తన ఊహలను, అభిప్రాయాలను సమానఫాయీలో ఇంకొకరితో పంచుకోలేని ఒంటరితనాన్నీ అతనిపై విధిస్తుంది. అతను వ్యాఖ్యానించని విషయం ఉండదు. కానీ అవతల ఉన్నది ఎవరు? అతని వ్యాఖ్యలపై  ప్రతిస్పందించడానికి అతనితో సమానమైన జ్ఞానమూ, స్థాయీ లేని మూగ శ్రోతలు. వక్తా, శ్రోతా కూడా తనే. తన గొంతు ప్రతిధ్వని తనకే వినిపిస్తుంది. గోడకు కొట్టిన బంతి తిరిగి తన దగ్గరకే వచ్చినట్టుగా తన అభిప్రాయాలూ, వ్యాఖ్యలూ మళ్ళీ తన దగ్గరకే వస్తాయి.

veyi

అతని మాట, ప్రజాస్వామికమైన డైలాగ్ కు అవకాశం లేని, ఒక మోనోలాగ్. అక్కడ ప్రైవేట్, పబ్లిక్ అన్న తేడా  చెరిగిపోతుంది. డైలాగ్ కు అవకాశం లేని స్థితిలో అతని ప్రైవేట్(వైయక్తిక)ఊహాప్రపంచమే పబ్లిక్ గా మారిపోతుంది. డైలాగ్ కు అవకాశం లేనప్పుడు అక్కడ తర్కం, హేతుత్వం ఉండవు. పైగా అవి అక్కర్లేదన్న అహం ఉంటుంది. చరిత్ర ఉండదు. అది అక్కర్లేదన్న అహం ఉంటుంది. సాలె పురుగు తనలోంచే దారాన్ని సృష్టించుకుని, దానితో గూడు కట్టుకుని అందులో ఎలా ఉండిపోతుందో; తన ఊహల దారాలతో తనే అల్లుకున్న గూడులో తను ఉండిపోవడం…ఇదీ అతని బౌద్ధిక జీవితం.

తనే లోకానికి గురువు. కనుక వేరెవరికీ, ఎప్పటికీ శిష్యుడు కాలేని పరిస్థితి అతనిది. దాంతో అతనికి కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు. ఋష్యశృంగుడు ఉన్నచోట అనావృష్టి ఉండదు. అలాగే, తన ఉనికే లోకకళ్యాణం కోసం!

తీరా  సుదర్శనంగారు తర్కమూ, హేతుత్వమూ అనే తూనిక రాళ్ళతో వేయిపడగలను తూచబోయేసరికి అది తేలిపోయింది. అందులో బరువైన సరకు బదులు డొల్ల కనిపించింది. అయితే ఆ డొల్లను పట్టుకుని ఉన్న మనిషి నిజం. తన భ్రమల గూడుపై పడుతున్న దెబ్బలకు అతను పడుతున్న కలవరం, అస్తిత్వ భయం, అవి కలిగించే హృదయభారం నిజం. అవి నవలలో ప్రతిభావంతంగా వ్యక్తమయ్యాయి.

***

ముందే చెప్పినట్టు, ధర్మారావును తెలుగుదనం మూర్తీభవించిన వ్యక్తిగానూ, వేయిపడగలను ఆధునికత  తెలుగునాట తెచ్చిన  మార్పుల చిత్రణగానూ కుదించడం ధర్మారావు బౌద్ధిక జీవితానికి ‘బాహ్యు’నిగా సుదర్శనంగారికి గల పరిమితి. నిజానికి ధర్మారావు భారతదేశమంత వైశాల్యం కలిగిన పాత్ర. అతని సంఘర్షణ మూలాలు భారతీయ సమాజం తాలూకు అతి పురాతనపు లోతుల్లో ఉన్నాయి. భారతదేశపు సామాజిక, సాంస్కృతిక, మత, రాజకీయ స్థితిగతులకు అతను శాసనకర్త. ఇంత వైవిధ్యవంతమైన దేశాన్ని తన దృష్టికోణం అనే మూసలో ఇరికించడానికే అతని నిరంతర ప్రయత్నం. ఆ ప్రయత్నంలో అతనికి విజయాలూ ఉన్నాయి, అపజయాలూ ఉన్నాయి. అతని పెనుగులాట ఎంత వైయక్తికమో, అంత వ్యవస్థాగతం. చరిత్ర పొడవునా జరుగుతున్నఅతని పెనుగులాటా, అందులో అతని గెలుపు, ఓటముల చరిత్రే ప్రధానస్రవంతికి చెందిన భారతీయ వాఙ్మయం.  పాశ్చాత్య నాగరికతా ప్రభావమూ, అవైదిక ధోరణుల విశృంఖలత్వమూ నేపథ్యంగా వేయిపడగలులో చిత్రితమైనది– అతని అనేకానేక పెనుగులాటలలో ఒకటి మాత్రమే.

వేయిపడగలు అతని ఒకానొక తాత్కాలికమైన  ఓటమిని చెబుతుంది. అది అతనికి కలిగించిన నిర్వేదాన్ని, నిస్పృహను చెబుతుంది. అయితే తన చరిత్రలో అనేకసార్లు జరిగినట్టుగా , అంతులేని నిరీక్షణ తర్వాత అతను మళ్ళీ గెలిచాడు. ఇప్పుడు కనుక ధర్మారావు చరిత్రను తిరగరాస్తే, అది ఒక విజేత చరిత్ర అవుతుంది. ఇప్పుడతనిలో నిస్పృహా, నిర్వేదం లేవు. వాటి స్థానంలో అతని ముఖం నిండా విజయదరహాసం!

(సశేషం)

 

 

 

వేయి ప్రశ్నల ‘పడగలు’

 ‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-3

 

sudrarsanamవిశ్వనాథ భావజాలానికి ఆర్.ఎస్ సుదర్శనం ‘బాహ్యమిత్రు’డే కాక’, ఇంగ్లీషు చదువుతో భారతీయేతర గవాక్షం నుంచి దానిని చూసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించిన వ్యక్తి అన్న సంగతిని మరోసారి గుర్తుచేసుకుని ‘వేయిపడగల’కు వద్దాం.

వేయిపడగలు ఆయనకు పెద్ద పజిల్ గా మారింది. అనేక ప్రశ్నలు, సందేహాలతో పాటు చికాకునూ కలిగించింది. ‘ఏకవీర’లో కనిపించిన తాత్విక పటిమ కానీ, స్పష్టత కానీ ఆయనకు అందులో కనిపించలేదు.

‘నేతి నేతి’ అనే పద్ధతిలో ఆయన పరిశీలన ఇలా సాగుతుంది:

“వాఙ్మయమనగా నేమి?” అని ప్రశ్నించి చివరగా, “కావ్యాత్మయే కాక, కావ్యశరీరము, కావ్యస్వరూపము కూడా నీ జాతి సిద్ధాంతముల మీద నాధారపడియుండును…” అన్న విశ్వనాథ వారి వివరణను తీసుకుని, కావ్య శరీరము, కావ్యాత్మ వేయిపడగలులో ఎలా అనుసంధింపబడ్డాయో సుదర్శనం పరిశీలించారు. ముందుగా కావ్యాత్మను తీసుకుంటే, నవలలోని పాము- అంటే కథాస్థలమైన సుబ్బన్నపేటలో జమీందారు కట్టించిన ఆలయంలో,  బ్రాహ్మణుడు ప్రతిష్టించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు హిందూ వ్యవస్థాధర్మానికి ప్రతీక.  దానికి అతీతమైన, మౌలికమైన సనాతన ధర్మానికి అక్కడే ప్రతిష్టితమైన శివలింగం, లేదా నాగేశ్వరస్వామి ప్రతీక. కథా ప్రారంభంలో రచయిత ఈ ఇద్దరు దేవుళ్ళకు(అంటే వ్యవస్థాధర్మానికీ, సనాతన ధర్మానికీ)భేదం పాటిస్తాడు. కానీ ఆ వెంటనే మొదలుపెట్టి, రచన అంతటా రెంటికీ మధ్య అభేదాన్ని పాటించాడు. ఈ విధంగా, ఏకవీరలో ఉన్న తాత్విక స్పష్టత వేయిపడగలులో ముందే లోపించింది.

పోనీ వ్యవస్థాధర్మంతో అభేదం పొందిన ఆ సనాతనధర్మ నిరూపణే కావ్యాత్మ అవుతుందా? ఆ నిరూపణ ఇందులో చిత్రితమైన పాత్రల ద్వారా జరగాలి. ఇందులోని ముఖ్యపాత్ర ధర్మారావు. అతను ధర్మానికి ప్రతినిధి అని రచయిత ఉద్దేశం. అయితే, ధర్మారావు ఏ ధర్మానికి ప్రతినిధి; వ్యక్తి ధర్మానికా, వ్యవస్థాధర్మానికా, సనాతనధర్మానికా అని ప్రశ్నించుకుంటే  సంతృప్తికరమైన సమాధానం దొరకదు.  రచయితేమో, అతను సనాతనధర్మాన్ని దర్శించిన జ్ఞాని, వ్యవస్థాధర్మానికి సాధికారవ్యాఖ్యాత, లోకవ్యవహారానికి సాక్షీభూతుడు అంటాడు. అతనిది ఆజన్మ సిద్ధమైన జ్ఞానమార్గమనీ; భక్తి, కర్మమార్గాలను అనుసరించేవారికి కూడా అతను గురువనీ అంటాడు.

కానీ అతని నడవడి చూద్దామా అంటే ఇవేమీ కనిపించవు. అతను ఏకవీరలా సాధకుడు కాడు. అతనిలో సందేహాలూ, సంఘర్షణలూ లేవు. అయినా అతన్ని సనాతనధర్మాన్ని దర్శించిన జ్ఞాని అని రచయిత ఎలా (పూర్వజన్మ సుకృతం వల్ల కాబోలని సుదర్శనంగారి వ్యంగ్యం)అన్నారో? ఇక లోకవ్యవహారానికి సాక్షీభూతుడు అయ్యే నిర్లిప్తత అతని మనస్తత్వంలోనూ లేదు, దానిని సాధించే పరిస్థితులు అతని జీవితంలోనూ లేవు. ఆపైన అతనిలో ఎంతసేపూ లోకవిమర్శ తప్ప ఆత్మవిమర్శ లేదు. స్వోత్కర్ష మాత్రం కావలసినంత. జ్ఞానమార్గంలో అతను పొందిన పరిణామ మేమిటో రచయిత ఎక్కడా చెప్పలేదు. పైగా అతనిలో హిందూ వ్యవస్థా ధర్మానికి తనే వ్యాఖ్యాతా, సొంతదారు ననే విపరీత అహంకారం.

ధర్మారావు కర్మయోగి, జ్ఞానయోగి అయితే, కొత్త కొత్త పద్ధతుల మీద; జీవిత విధానాల మీద అంత ద్వేషభావం దేనికి? అది జిజ్ఞాసువు లక్షణం కాదు. అతనిలో సమన్వయ దృష్టిలేదు. అతనికి కొత్త ఒక రోత పాత ఒక నీతి. మారుతున్న పరిస్థితులలో కూడా హిందూధర్మం సృజనాత్మక శక్తే నని నిరూపణ చేసే ఉద్దేశమే నవలకు ఉన్నట్లైతే ధర్మారావు సృష్టి మరొక విధంగా ఉండేదన్న సుదర్శనం, ఇక్కడ కూడా ‘మాలపల్లి’తో పోలిక తెస్తారు. ధర్మారావుకు భిన్నంగా ‘మాలపల్లి’ నవలలోని సంగదాసు, రామదాసులు పాత కొత్తల సంగమస్థానంగా, మేలు కలయికగా కనిపిస్తారు.

కనుక కావ్యాత్మ సనాతనధర్మ నిరూపణ కాదు. సనాతన, వ్యవస్థా, వ్యక్తి ధర్మాల మధ్య స్పష్టమైన తేడాను పాటిస్తూ వీటి మధ్య సంబంధాన్ని నిరూపించే తాత్వికదృష్టిని వస్తు విన్యాసంలో రచయిత పాటించలేదు.

పోనీ  వ్యవస్థాధర్మనిరూపణ కావ్యాత్మ అవుతుందా? రచయిత చెప్పినట్టు వ్యవస్థ నాలుగు స్తంభాల ధర్మమంటపం. స్వామి(భగవంతుడు), రాజు, బ్రాహ్మణుడు, గణాచారి(కాలం)…ఈ నలుగురూ నాలుగు స్తంభాలు. స్వామి, ప్రభువు, ధర్మారావు(ధర్మం)ల మధ్య అభేద తాదాత్మ్యం.  ధర్మాచరణ రాజు కర్తవ్యం, ధర్మప్రచారం బ్రాహ్మణుని కర్తవ్యం. పసరిక పైరుపచ్చకు ప్రతీక, దేవదాసి శృంగారయుతమైన భక్తిమార్గం, హరప్ప వైదిక కర్మానుష్ఠానం, గోపన్న సేవావృత్తి. ఇదీ వ్యవస్థకు చెందిన అవయవ విభాగం. ఈ వ్యవస్థకు కేంద్రంలో ధర్మారావు. ఈ ధర్మారావు ఎటువంటి వ్యక్తో పైన కొంత చెప్పుకున్నాం. మరికొన్ని విషయాలు తర్వాత చెప్పుకుందాం.

జమీందారు, అంటే రాజువైపునుంచి, ధర్మాచరణలో జరిగిన ఒక లోపంతో నవల ప్రారంభమవుతుంది. ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి మాసికాన్ని జమీందారు నిర్లక్ష్యం చేస్తాడు. ధర్మారావు రుణగ్రస్తుడైనట్టు సేవకుడు గోపన్న వెళ్ళి చెప్పిన తర్వాతే తండ్రి మాసికానికి ధర్మారావుకు జమీందారు డబ్బు ఇస్తాడు. ముందే తెలుసుకోకపోవడం జమీందారు ధర్మాచరణలో జరిగిన లోపం. అందుకే అతనిని కలలో వేయిపడగల పాము కాటువేసి శిక్షిస్తుంది.  ఇక్కడ ధర్మాచరణ సమ్యక్ స్వరూపం మనకు ఏం తెలిసినట్లు అని సుదర్శనంగారి  ప్రశ్న.

రచయిత చిత్రీకరణ ప్రకారం, “రామేశ్వరశాస్త్రి వర్ణాశ్రమధర్మముల ముద్దకట్టిన మూర్తి, భారతదేశము యొక్క ఆత్మ, త్రయీధర్మవిద్య కొక వ్యాఖ్యానము.” మరోవైపు, రామేశ్వరశాస్త్రి అందగాడు, రసికుడు, దేశము నాలుగుమూలలా తిరిగివచ్చినవాడు. ఆయన వితరణ బుద్ధి హద్దులేనిది. జమీందారు తర్వాత జమీందారు. నాలుగువర్ణాల ఆడబడుచుల్నీ పెండ్లాడి ఒక భోగాంగనను చేరదీసినవాడు.  ఇలాంటి వాడు భోగి కానీ యోగి ఎలా అవుతాడని సుదర్శనంగారి ఆక్షేపణ. “వర్ణాశ్రమధర్మాల ముద్ద కట్టిన మూర్తి” గా రచయిత  చిత్రించిన రామేశ్వరశాస్త్రి గృహస్థుగానే మరణించాడే, మరి ఆయన పాటించిన ఇతర ఆశ్రమధర్మాలు ఏమిటన్నది ఆయన లేవనెత్తిన మరో ప్రశ్న. అలాగే రామేశ్వరశాస్త్రి చేసుకున్న వర్ణాంతరవివాహాలపైనా అనేక ప్రశ్నలు. అవి వర్ణధర్మాన్ని సమర్థిస్తున్నాయా అంటే, సమర్ధించడంలేదు. అవి నేటి వర్ణవిభేదాలకు పరిష్కారం సూచిస్తున్నాయా అంటే ఆ పరిష్కారం ఎంతమందికి నచ్చుతుంది? దాని యథార్థ స్వరూపం ఏమిటి? ఇలా వ్యవస్థా నిరూపణ ‘ఆదర్శం’ నుంచి ‘యాథార్థ్యం’లోకి దిగివస్తుందంటారు సుదర్శనం.

veyi

ధర్మారావు ‘బ్రాహ్మణత్వం’ అన్న ఆదర్శానికి ఎటువంటి సమర్థన అన్నది ఆయన సంధించిన మరో ప్రశ్న. బ్రాహ్మణత్వం అంటే కేవలం ‘ధర్మప్రచార’మేనా? ఈ విధంగా తర్కిస్తే నవలలో వ్యవస్థా ధర్మ నిరూపణం అసంతృప్తినే కలిగిస్తుంది. ఆకృతి(Form)కి తగిన పుష్టి(Substance) జరగలేదని అనిపిస్తుంది. అంతిమంగా చెప్పాలంటే,  నవలలో రచయిత సమర్థించబూనుకున్న వ్యవస్థకు అసలు ఉనికే లేదు– ఇదీ సుదర్శనంగారి నిర్ధారణ.

మొత్తానికి ఆయనకు ఇదొక  పెద్ద చిక్కుముడి. విశ్వనాథవారి మాటలను పట్టుకుని ఇందులో కావ్యాత్మ సనాతన ధర్మమా, లేక హిందూవ్యవస్థా ధర్మమా అన్నది వెతకబోతే ఆ దారి ఇలా మూసుకుపోయింది. “ఏతావాతా తేలే దేమిటంటే: హిందూ వ్యవస్థ యొక్క ఆదర్శాన్నీ, దాని పటుత్వాన్నీ నిరూపించే ఉద్దేశమే ‘వేయిపడగల’ కావ్యాత్మ అనటానికి, పాత్రచిత్రణమూ, కథాగమనమూ, దాని స్ఫూర్తీ  అందుకు భిన్నంగా ఉన్నా” యన్న నిర్ధారణకు వచ్చారు.

మరి ఇప్పుడేం చేయాలి? దారి మార్చుకోవాలి!

రామేశ్వరశాస్త్రి ‘వర్ణాశ్రమ ధర్మాలు ముద్దకట్టిన మూర్తి’ కాకపోతేనేం, అతనొక ఉత్తముడైన మానవుడే. ఆయన కానీ, ధర్మారావు కానీ ఆనాటి బ్రాహ్మణవర్గానికి ఏవిధంగానూ ప్రతినిధులు కాకపోతేనేం, తమలోని మానవత్వానికీ(సుదర్శనంగారు ఈ మాటను మానుషత్వం అనే అర్థంలో వాడినట్టుంది), దాని విశిష్టతకూ ప్రతినిధులు. అలాగే, అందులోని మిగిలిన పాత్రలు కూడా. “వారిలో ప్రకాశితమవుతున్నది వ్యక్తిగతమైన విశిష్టతే! ఇటువంటి వ్యక్తుల ద్వారా సమకాలీన సమాజంలోని వర్ణవిభేదాలను, వర్గీకరణను సమంజసమని సమర్థించడం ఎట్లా? నవలలో ధర్మారావు ద్వారా జరిగే వ్యాఖ్యానానికి, సమర్థనకూ ఈ దోషం సర్వత్రా ఉంది. అందువల్ల నవలలో వాచ్యముగా జరిగినంత మేర వ్యవస్థ నిరూపణము యాథార్థ్యం దృష్ట్యా జరగలేదనే చెప్పాలి” అని సుదర్శనంగారి తీర్మానం.

ఇలా ‘వేయిపడగలు’ కావ్యాత్మ సనాతన ధర్మ నిరూపణమా, లేక వ్యవస్థా ధర్మ నిరూపణమా అన్న విచికిత్స నుంచి బయటపడిన సుదర్శనంగారు, చివరికి అది ‘ధర్మారావు జీవిత చరిత్ర’ అని తేల్చారు. అది అతని మనస్థితికీ, ఆ మనస్థితికి కారణాలైన సాంఘికపరిస్థితులకూ దర్పణం అన్నారు. కనుక నవల కావ్యాత్మ ధర్మారావు వ్యక్తిత్వమే! సనాతనధర్మమో, హిందూ వ్యవస్థా ధర్మమో కావ్యాత్మ అనుకోవడం వల్ల వాటి నిరూపణ అసంతృప్తిని కలిగించి విమర్శలను రేకెత్తిస్తోంది కానీ, ఇలా దృష్టి మార్చుకుని, నవల కావ్యాత్మ ధర్మారావు వ్యక్తిత్వమే అనుకుని చూసినప్పుడు చిక్కుముడి విడిపోతుంది…. సనాతనధర్మం, హిందూ వ్యవస్థా ధర్మం అనేవి ఇందులో గౌణమే తప్ప ప్రధానం కావు. అవి ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వం ద్వారా మనకు దృశ్యమానమవుతున్నాయి. ఆ మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వం వాటిలోనూ దృశ్యమానమవుతున్నాయి…

ఇలా అనుకున్న సుదర్శనంగారు, ఇక్కడ చేసింది ఒకవిధమైన శస్త్రచికిత్స. తల్లి ప్రాణాన్ని కాపాడలేకపోయినా కనీసం బిడ్డనైనా కాపాడే ప్రయత్నం లాంటిది. విశ్వనాథ లక్షించిన వ్యవస్థాధర్మ నిరూపణ లేదా స్వీయ భావజాలం అనే ‘తల్లి’ నుంచి, ‘పాత్రలు’ అనే బిడ్డను వేరు చేసి వాటిని స్వతంత్ర జీవంతో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో తల్లిని పక్కన పెట్టేశారు. అప్పుడిక ఆ పాత్రలలో ఎలాంటి వైరుధ్యాలు, వైపరీత్యాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగతమైనవే తప్ప వ్యవస్థకు సంబంధించినవి కావు. ఇలా పాత్రల ముఖంగా చూసినప్పుడు విశ్వనాథ ఆదర్శం సార్వత్రిక హిందూ వ్యవస్థాధర్మాన్ని చిత్రించడం కాదు, తెలుగు దేశాన్ని, తెలుగుదనాన్ని చిత్రించడం!

ఇలా సుదర్శనంగారి ప్రకారం, నవలలో సుబ్బన్నపేటే తెలుగుదేశం. సుబ్బన్నపేట అంటే ధర్మారావు. ఇది కావ్యశరీరం. ధర్మారావు పాత్ర సమర్థించినది క్రమంగా అదృశ్యమవుతున్న గ్రామీణమైన తెలుగుదనాన్ని. ఆంగ్లభాషా, పాశ్చాత్య నాగరికతా సోకని తెలుగుదనం నిలబడలేదనే అతని ఆవేదన. అందులో లోటుపాట్లు అతనికి కనిపించవు. అదంతా హిందూధర్మ స్వరూపమే నని అతను భ్రమపడతాడు. దాని సమర్థనకోసం తను అహంభావం పెంచుకున్నా ఫరవాలేదనుకుంటాడు. తరచు భావం కంటే అహంభావమే అతనిలో ముందుకు వస్తుంది. రైలు మార్గాలు, ఎలక్ట్రిసిటీ, ఫ్యాక్టరీలు, డబ్బు చలామణి, శారదా చట్టం, వితంతు వివాహాలు, హరిజనుల ఆలయప్రవేశం సహా అన్నిటినీ వ్యాఖ్యానిస్తాడు. అన్నిటినీ వ్యతిరేకిస్తాడు. ఇంగ్లీషు చదువుకుంటాడు, కానీ ఇంగ్లీషును ద్వేషిస్తాడు. తండ్రి మాసికానికి జమీందారు దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు, “నేను యాచించలేదు…ఆయనయే ఇచ్చెను” అని, భంగపడిన ఆహాన్ని సమర్థించుకుంటాడు. “అతనిలో స్వాభిమానము మెండు, దానికి బాధాకరమైన సత్యాన్ని దర్శించే చొరవ, సాహసం అతనిలో లేవు. ఆ పరిస్థితిలో సత్యరూపాన్ని భిన్నంగా తనకు అనుకూలంగా దర్శించే ప్రయత్నం చేస్తాడు. అందువల్లనే అతని ప్రవర్తన కూడా సమయానుకూలంగా ఉంటుంది” అని సుదర్శనంగారి వ్యాఖ్య.

ధర్మారావు అబద్ధం ఆడడానికి కూడా వెనుకాడడు. తను చదువుతున్న కళాశాలలో క్రైస్తవ విద్యార్థులు హిందూ మతాన్ని అవమానించినప్పుడు హిందూ విద్యార్థులు చేసిన సమ్మెలో అతను పాల్గొనడు. “ఎదిరించి నీ వేమైన చేయగలవా?”అని ఉపదేశిస్తాడు. ఇక్కడ సుదర్శనంగారి వ్యాఖ్య ఇలా ఉంటుంది: “ఇక్కడ ధర్మరక్షణ కంటే ఆత్మరక్షణ ప్రధానమైనది! ధర్మారావునకు హిందూ ధర్మముతో తాదాత్మ్యము, అది తనకు ఉపయోగపడునంతవరకే. దానికి తాను ఉపయోగపడవలసి వచ్చినప్పుడు వాగ్వాదము, వ్యాఖ్యానము కావలసినంత! ఇక్కడ అసలు విషయం, జమీ లేకపోయినా ధర్మారావు జమీందారు బిడ్డ. కష్టములను ఎదుర్కోవడం కంటే వాటిని తప్పించుకోవడమే అతని స్వభావం.”

ధర్మారావు కవి, భావుకుడు కూడా. తను కష్టపడి సాధించగలిగినదేమీ అతనికి మిగిలినట్లే తోచదు: ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలలో ధర్మారావు ఇటు అర్థం కోసం కానీ, అటు మోక్షం కోసం కానీ ప్రయత్నం చెయ్యడు. తనే ధర్మావతారం. పెళ్లి చిన్నతనంలోనే జరగడంవల్ల కామానికి ఇబ్బంది లేదు. ఇక సాధించవలసిందేమిటి? లోకానికి గురువు కావడం! ధర్మారావు గురుత్వం వహించని, సలహా ఇవ్వని అతనితో సంబంధం లేని పాత్రలేదు. ఏ విధంగానైనా అతనికి సమవుజ్జీయో, అధికుడో అయ్యే పాత్ర కనిపిస్తే అతనికి నవలలో చరిత్రే లేదు. వాదంలో ధర్మారావు ముందు ఓడిపోనివారు లేరు. తన గొప్పదనాన్ని గుర్తించని వారి మీద రౌడీలను పురిగొల్పడానికి వెనుదీయడు. ఇక అతని పనేమిటన్నది చూస్తే, స్వామికి ఉత్సవాలు జరిపించడం తప్ప ఏమీ చేయడు. ధనవంతురాలు, ‘పతిత’ అయిన మంగమ్మతో అతనికి ‘రహస్య’ సంబంధం. భార్య అనారోగ్యంతో ఉన్నా, మంగమ్మ ఇంటికి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వస్తుంటాడు.

సుదర్శనంగారి ప్రకారం, తులనాత్మకంగా చూస్తే, ధర్మారావుతో పోల్చగల పాత్ర రవీంద్రుని గోరా. కానీ ఇద్దరి వ్యక్తిత్వాలలో ఎంతో తేడా. ధర్మారావులానే హైందవవాది అయిన గోరా, చివరికి ‘సర్వ ధర్మాన్ పరిత్యజ్య ‘ అన్నట్టుగా, “నేనీరోజున భారతీయుడిని. హిందువు, ముస్లిము, క్రైస్తవుడు…ఎవరైనా కానీ, నాలో ఇప్పుడు ఎలాంటి మతఘర్షణా లేదు. ఈ రోజున భారతదేశంలోని అన్ని కులాలూ నా కులమే” అనుకునే స్థితిని చేరుకుంటాడు. కానీ ధర్మారావుకు సర్వధర్మాలూ తనే నన్న భావము. అతను అసలు పయనించనే లేదు, గమ్య స్థానం చేరుకోవడమెక్కడ? ఈ భేదమే రవీంద్రుని విశ్వకవిని చేస్తే, ఆయన కంటే ప్రతిభావంతుడైన విశ్వనాథను తెలుగు కవిసమ్రాట్ గానే నిలిపిందని సుదర్శనంగారి వ్యాఖ్య. “‘నౌకాభంగము’ నుంచి ‘గోరా’వరకు రవీంద్రుడు ఎన్ని మెట్లు పైకి ఎక్కెనో, ‘ఏకవీర’నుంచి ‘వేయిపడగల’వరకు విశ్వనాథ అన్ని మెట్లు క్రిందికి దిగెను” అన్నది ఆ వెంటనే ఆయన చేసిన మరో కీలకమైన వ్యాఖ్య.

ఇలా ధర్మారావులోని లక్షణాలను సుదర్శనంగారు ఎత్తి చూపుతూనే, అతను ఆదర్శప్రాయుడు కాకపోతేనేం, “రాగద్వేషాలూ, రక్తమాంసాలూ, కష్టసుఖాలూ కలిగిన మనిషి. అచ్చమైన తెలుగువాడు. వ్యవస్థా ధర్మానికి, యోగమార్గానికి ప్రతినిధిగా తృప్తి కలిగించకపోయినా తెలుగుదనం ముద్దకట్టిన మూర్తి ధర్మారావు” అంటారు. ఆయన దృష్టిలో, (‘ఏకవీర’కు ఉన్నట్టు)’వేయిపడగలు’కు ఒక తాత్విక దృక్పథం ఆలంబనంగా లేకపోవచ్చు, కానీ అది కాల్పనికోద్యమకాలంలో వెలువడిన ఆత్మాశ్రయకవిత్వ శాఖలో ఒక అపురూపమైన కావ్యం. తెలుగుదేశంలో శిథిలమై అదృశ్యమవుతున్న పూర్వ నాగరికత చివరి మెరుగుల్ని చూచిన విశ్వనాథ హృదయం సంక్షోభించి వెలువడిన సుదీర్ఘ నిశ్వాసమే వేయిపడగలు. అది ఒక వైయక్తిక హృదయోద్వేగం. అంతేకాదు, సుదర్శనంగారి దృష్టిలో వేయిపడగలు, డి. హెచ్ లారెన్స్ నవల The Rainbow తో పోల్చదగింది కూడా.

***

ఈవిధంగా సుదర్శనంగారు వ్యవస్థాధర్మ నిరూపణం అనే ‘తల్లి’ నుంచి ‘పాత్రలు’ అనే బిడ్డను వేరు చేయడమే కాదు; రచనను  వైయక్తిక హృదయోద్వేగాన్ని చాటే గొప్ప సాహిత్యప్రతిపత్తి కలిగిన ఆత్మాశ్రయకావ్యస్థాయికి ఎత్తి సహృదయతను నిరూపించుకున్నారు. నవలలో ప్రకటితమైనది ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వాల మూసలోంచి వ్యక్తమవుతున్న  హైందవవ్యవస్థా ధర్మమే తప్ప అదే అసలు హైందవధర్మం కాదన్న భావనను ధ్వనింపజేశారు. అంటే, ఇందులో ప్రకటితమైన హైందవ ధర్మ, తాత్వికతలకు భిన్నమైన హైందవ ధర్మమూ, తాత్వికతా వేరే ఉన్నాయని ఆయన భావించారన్నమాట.

అలా భావించడంలో సుదర్శనంగారి ‘బాహ్యతా’, ‘మిత్రతా’ కూడా వ్యక్తమవుతున్నాయా?!

(సశేషం)

నీ పేరు జస్టిన్..

siva “నీ పేరు జస్టిన్”(Your Name is Justine) : ఇది పోలాండ్ చిత్రం. డైరెక్టర్ ఫ్రాంకో .

మారియోలా ఒక అందమైన యువతి. పోలాండ్ లోని లక్సెంబర్గ్ లో అల్లారు ముద్దుగా చూసుకునే తన అమ్మమ్మతో భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటూ హాయిగా జీవించే యువతి. తన అమ్మమ్మలా పాతతరం మనుషుల్లాగా సాదా సీదాగా సాఫీ జీవితం కాకుండా జీవితం ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా, భిన్నంగా, ఉత్తేజకరంగా తీర్చిదిద్దుకోవాలని ఉవ్విళ్ళూరుతూ కోటి కోరికలతో తపన పడుతూ ఉంటుంది. ముగ్గురు స్నేహితురాళ్ళలో ఉద్యోగం సంపాదించుకుని జీవితంలోని ప్రతి అడుగులో విజయం సాధించబోతున్న ప్రత్యేకమైన దానిలా ఉంటుంది .

ఆమెకు “ఆర్ధర్” అనే అందమైన ప్రియుడుంటాడు. ఒక రోజు ఆర్ధర్ మారియోలా దగ్గరి కొస్తాడు. ఒక సెలవు దినాన్ని యూరప్ వెళ్ళి సముద్రతీరంలో సృజనాత్మకంగా, అద్భుతంగా గడుపు దామని ఊరించే కబుర్లతో నచ్చజెప్పి మారియోలాను ఒప్పిస్తాడు. ఆర్థర్ ఆమె మాజీ ప్రియుడు కాబట్టి యూరప్ చుట్టూ విహార యాత్ర అనగానే మురిసి పోతుంది మారియోలా. విడిపోయిన ఆమెను తిరిగి పొందడానికి, ప్రేమగా మాట్లాడుతూ పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చి పెళ్ళికి ముందు అతని తండ్రి మారియోలాను చూడాలను కుంటున్నాడు కాబట్టి జర్మనీకి వెళదా మంటాడు. జర్మనీ లోని కొలోన్ లో ఉన్న ఆర్థర్ వాళ్ళ కుటుంబాన్ని సందర్శించడానికి పోలాండ్ నుండి ప్రయాణం చేయబోతున్నామని చెబుతాడు ఆర్ధర్. ట్రిప్ ప్రారంభానికి ముందు, అతను ఆమె నివసించే ప్రాంతానికి వచ్చి ఆమెను రకరకాల భంగిమల్లో నవ్విస్తూ కొన్ని ఫొటోలు, ఆమె అమ్మమ్మతో సహా కొన్నిఫొటోలు తీస్తాడు. నాన్న తమ పెళ్ళికి తొందర పడుతున్నాడనీ, ఆయనకి మారియోలాను చూపించడానికి జర్మనీకి తీసికెళ్తున్నానని కూడా అమ్మమ్మతో చెబుతాడు. తాను జర్మనీలో కాబోయే మామగారిని చూడ బోతున్నాననుకుని దారిలో చాలా ఉద్విగ్నంగా కొన్ని జర్మన్ పదాలు కూడా నేర్చు కుంటుంది మారియోలా. జర్మనీ దాటగానే బెర్లిన్ లో ఒక అపార్ట్ మెంట్ కి తీసికెళ్తాడు ఆర్ధర్. ఆ ఇంట్లో చంటిపాపతో ఉన్న ఒక మహిళ తనవంక వింతగా చూడడం, ఆ ఇంటి వాతావరణం అసాధారణంగా, తేడాగా ఉండడంతో ఆర్ధర్ తో “వెంటనే ఇక్కణ్ణుంచి వెళ్ళిపోదాం, వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం” అని అంటుంది మారియోలా. “ఒక్క రాత్రికే సర్దుకుందాం” అని అంటాడు ఆర్ధర్.

ఇంతలో ముగ్గురు రాక్షసుల్లాంటి మృగాళ్ళు వస్తారు. అతి కౄరంగా ఉన్న ఒకడు సరాసరి మారియోలా దగ్గరకొచ్చి దౌర్జన్యంగా మీద చెయ్యేస్తాడు. “ఇక నీకు ఎంతమాత్రమూ నీ అసలు పేరు మారియోలా అని ఉండదు. ఈ రోజునుంచి నీ పేరు జస్టిన్“అని అంటాడు. ఒక పక్క నుంచి తీవ్రంగా ప్రతిఘటిస్తూనే,”ఇతను మీదకొస్తున్నాడం”టూ గొప్ప నమ్మకంతో ప్రియుడికి అమాయకంగా ఫిర్యాదు చెయ్యబోతుంది మారియోలా. అందులో ఒకడి దగ్గరనుంచి నోట్ల కట్టలు అందుకుంటూ ప్రేక్షకులకు కనిపిస్తాడు ఆర్ధర్. ”నీ ప్రియుడు ఆర్ధర్ నిన్ను మాకు అమ్మేశాడు” అంటాడు చెర బట్టిన వాడు. ఆమె ప్రియుడు లోపల పైశాచిక ప్రవృత్తి గల అతి కౄరుడు. మారియోలాను పాస్ పోర్ట్ తో సహా ఒక వేశ్యను అమ్మినట్లు అమ్మేసి మరుక్షణంలో మాయమవుతాడు!

లక్సెంబర్గ్ సరిహద్దు దాటి జర్మనీలోకి ప్రవేశించి బెర్లిన్ లోని ఒక ఇంటికి తీసికెళ్ళే వరకూ ఆనందంగా ఉంటుంది మారియోలా. అంతే! ఆమె జీవితంలో సంతోషపు ఘడియ లంతరించిపోతాయి! మరుక్షణంలో జీవితం ఊహించని విధంగా భయానకంగా మారిపోతుంది! ఇక మారియోలా జస్టిన్ గా చెలామణీ అవుతూ ఉంటుంది!

అప్పటినుంచి జస్టిన్ జీవితంలో చూడలేని, భరింపరాని లైంగిక హింస మొదలవుతుంది. చెరబట్టిన ముగ్గురిలో ఇద్దరు జస్టిన్ ని చెప్పనలవి కానన్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఆమె వారించిన కొద్దీ విపరీతంగా కొట్టి కొట్టి రక్తాలు కారేలా చేస్తారు. వారిలో ఇద్దరు ఒకడి తర్వాత ఒకడు పశువులకంటే హీనంగా, నీచాతి నీచంగా ప్రవర్తిస్తారు.  జస్టిన్ కూడా చాలా బలంగా మంచి శరీర దారుఢ్యంతో ఉండి తన కున్న శక్తి నంతా ఉపయోగించి ధీటుగా ఎదిరిస్తూనే ఉంటుంది. ప్రచండంగా, భీకరమైన పోరులో శక్తి కొద్దీ శత్రువుతో పోరాడినట్లు ప్రతిఘటిస్తూనే ఉంటుంది. కానీ ఆమె శక్తి చాలదు. పెనుగులాడీ, పెనుగులాడీ నిర్జీవంగా మిగిలిపోతుంది ప్రతిసారీ. వారి రాక్షసత్వం ముందు ఆమె నిస్త్రాణంగా నిస్తేజంగా మిగిలిపోతూ ఉంటుంది. ఒకసారి కాదు,అనేకసార్లు ఆమె మీద బలప్రయోగం చేస్తారు. రోజుల తరబడి అత్యాచారం కొనసాగిస్తారు. చివరికి ఆమె కొట్టొద్దని దీనంగా వేడుకునే పరిస్థితికి వస్తుంది. వస్తూ,పోతూ తాళాలు వేసి బంధిస్తూ ఉంటారు. ఆ ఇల్లొక భూతాల కొంప లాగా, పాడుపడిన కొంపలాగా పరమ మురిగ్గా ఉంటుంది. ఎవరూ ఉండరు. తాగుదామంటే పంప్ లో నీళ్ళు రావు. ఫ్రిజ్ తెరిస్తే తినడానికేమీ ఉండవు. అమ్మమ్మను తల్చుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆకలితో అలమటించిపోతూ, ధ్వంసమైపోతున్న తన జీవితాన్ని తలచుకుని భయంకరమైన మానసిక సంఘర్షణకు గురౌతుంది. ఇంట్లో దయ్యం పట్టిన దానిలా తిరుగుతూ, తిండికోసం వెతుక్కుంటూ, అందంగా ఉన్న తన జుట్టును ఒక కత్తిని దొరిక బుచ్చుకుని బర బరా కోసేసు కుంటుంది.బట్టలు ఎక్కడివక్కడ చింపేసుకుంటుంది. అపార్ట్ మెంట్ కిటికీ తలుపుల్ని తన బలాన్నంతా ఉపయోగించి ఊడదీసి బయటికొచ్చి రక్షించమంటూ వెర్రి కేకలు పెడుతుంది. ఎవరికీ వినిపించని ఆమె కేకలు అరణ్య రోదనగానే మిగిలిపోతాయి. ఆ రాక్షసులు సుడి గాలిలా వస్తూనే ఉంటారు. భీభత్సం సృష్టిస్తూనే ఉంటారు!

వారిలో మూడోవాడు మాత్రం నేను నిన్నేమీ చేయను, నమ్మమంటాడు.  లైంగికంగా ఏ విధంగానూ వేధించడు. ఆమెను చూసి జాలి పడినట్లే, కనికరించినట్లే చేస్తాడు. ఒకరోజు తినడానికి కాస్త తిండీ, తాగడానికి డ్రింకూ తెచ్చిస్తాడు. అప్పుడప్పుడూ వచ్చి కాస్త తిండి, అవసరమైన చిన్న చిన్న వస్తువులు తెచ్చి పెడుతూ దయగా ఉంటాడు. నేను చెప్పినట్లు వింటే నీకిక్కడనుంచి విముక్తి కలిగిస్తానని నిరంతరంగా సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు. నిస్సహాయస్థితిలో ఉన్న ఆమె వినక చేసేది కూడా ఏమీ లేదు. అతడికి వేరే ప్రణాళిక లుంటాయి!

ఆమెను బయటికి తెచ్చి ఒక హోటెల్ లో కాల్ గర్ల్ గా నియమిస్తాడు. ఆ హోటెల్ రూం రష్ ని కాలింగ్ బెల్ మోగడం – వాడొక పక్కన నిలబడి డబ్బు వసూలు చేసుకోవడం ద్వారా సూచిస్తాడు డైరెక్ట్రర్ ఫ్రాంకో. విటులుగా వచ్చిన ప్రతి ఒక్కరిని “నేను మోసపోయాను.నన్ను మా అమ్మమ్మ దగ్గరికి చేర్చి సహాయం చెయ్యమ”ని వేడుకుంటుంది. ప్రతి అడుగులోనూ పదునైన బాకులు పొంచి చూస్తున్నట్లు, పగబట్టినట్లున్న ఆమె జీవితంలో అంతటి అదృష్టమేది?

ఇంతలో ఒకరోజు ఎక్కడినుంచో ప్రియుడి రూపంలో ఉన్న కిరాతకుడు ఆర్ధర్ ఊడిపడతాడు.”నీకొక చెడు వార్త” అంటూ అమ్మమ్మ మరణం గురించి చెప్తాడు. అప్పటివరకూ అంతటి దుఃఖంలోనూ “అమ్మమ్మా! నీ రాజకుమారి కఠినమైన జైల్లో ఉంది. ఎవరూ చొరబడలేని కోట బురుజులున్న రాజ భవనంలో బంధింపబడి ఉంది. స్వేచ్చగా ఎగిరే పక్షుల్ని చూడాలనుకుంటుంది”అని అనుకుంటూ అమ్మమ్మని తల్చుకుని ఊహల్లోనైనా సేదదీరే జస్టిన్ కి ఆ ఆశ కూడా లేకుండా పోతుంది. పట్టరాని కసితో ఆర్ధర్ ని చంపేస్తుంది! జైలుకి వెళ్తుంది!!

మూడేళ్ళ జైలు శిక్ష ముగిశాక కూడా మన మారియోలా గొప్ప ఆశాజీవిగా కనపడుతుంది.తన జీవితాన్ని మళ్ళీ పునర్నిర్మించు కోవాలనుకుంటుంది. కానీ తన చుట్టూ ఉన్నబయటి ప్రపంచమంతా మారిపోయి ఉంటుంది. తనకి అమ్మమ్మ లేదు! ఊళ్ళో ఎవరూ లేరు! ఉన్న ఇద్దరు దోస్తులు గుర్తొస్తారు గానీ తాను జీవితం నుంచి ఎంత దూరం జరిగిందో తెలుసుకుని నిస్తేజపడుతుంది. అసలు న్యాయం ఎక్కడుంది? ప్రేమకు అర్ధమేమిటి? స్వేచ్చ అందని వస్తువేనా? అనడంతో సినిమా ముగుస్తుంది. ప్రేక్షకుల హృదయాలు భారమవుతాయి.

మహిళలు తరతరాలుగా ఆర్జించి పెట్టి ఈ సమాజానికి అందించిన జ్ఞానం, మాతృస్వామ్య వ్యవస్థనుంచి ఇంటిపెద్దగా వారి పాలనానుభవం, శక్తి సామర్ధ్యాలు, అందం, అధికారం, అనేకరకాల స్వభావాలతో ఈ ప్రపంచాన్ని అర్ధవంతం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని అగ్ర రాజ్యాలతో సహా ఏ దేశంలోనూ మహిళల్ని మానవులుగా సమాజంలో సగ భాగంగా భావించడం లేదు. మనసుని మెలిపెట్టే బాధతో, గుండెలవిసిపోయేలా గింజుకుని, ఊపిరాడక అల్లాడిపోయే ఈ జస్టిన్ పాత్రను ప్రపంచీకరణ నేపధ్యంలో దేశ దేశాల్లోని మహిళలు నిస్సహాయమైన పరిస్థితుల్లో లైంగిక దోపిడీకి బలవుతున్న మహిళలకు ప్రతీకగా చూడాలి.

ఈ సినిమా.కథలు రెండూ “ఒసామా”, “నీ పేరు జస్టిన్” మహిళలపై ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృతమైన అసంబద్ధ క్రూరత్వం గురించి చెప్తాయి. ఒక శతాబ్దం వెనక్కి నెట్టే  ఇటువంటి పాత రాతియుగం ఆలోచనలు నమ్మటం కష్టం. మనం నవ నాగరికుల మని మురిసి పోతున్న ఈ కాలంలోనే ప్రపంచంలోని కొన్ని మూలల్లో జరుగుతున్న అమానుష చర్యలివి!

బూర్జువా ప్రపంచంలో బాల్యాన్ని,యవ్వనాన్ని, జీవితాన్ని పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా ఆ యా దేశాల్లో స్త్రీల పట్ల

జరుగుతున్న వ్యవస్థీకృత హింసలను ఎంతో ఆర్ధ్రంగా అర్థం చేసుకుని నిజాయితీగా ప్రాణాలకు తెగించి గొప్ప స్కోప్ లో బర్మెక్ తెరకెక్కిస్తే, లైంగిక బానిసత్వాన్ని ఇతివృత్తంగా తీసుకుని దిగ్భ్రాంతి కలిగేలా చిత్రాన్ని మలిచారు డైరెక్టర్ ఫ్రాంకో. మన చలం లాగా స్త్రీల స్వేచ్చ కోసం తపించి ఆర్తితో పని చేసిన ఈ ఇద్దరికీ స్త్రీజాతి తరఫున ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది.

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా 1913 లో ప్రపంచ సినిమా విశ్వవేదిక మీద కొచ్చింది. సరిగ్గా శతాబ్ద కాలం గడిచాక కూడా అంటే 2013 లో వచ్చిన ఈ రెండు సినిమాలను పరిశీలిస్తే స్త్రీల జీవితాలు ఏమాత్రం మెరుగుపడలేదనీ,వారు ఆత్మ గౌరవంతో జీవించే పరిస్థితులు అగ్రదేశాలతో సహా ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవనీ రుజువైంది.

ఆశ్చర్యకరంగా వేరు వేరు ప్రాంతాల్లో తీసిన ఈ రెండు సినిమాల్లోనూ దుర్భర పరిస్థితుల్ని అనుభవిస్తున్న కథానాయికలిద్దరూ కూడా అమ్మమ్మ ప్రేమలో స్వాంతన పొందుతారు!

“చీకటి థియేటర్ లో సినిమా చూడడం ఒక ధ్యానం లాంటిది.  నా దృష్టిలో ఇంకే కళారూపం ఇలాంటి అనుభూతిని ఇవ్వ లేదు.  చికాకులు, మానసిక ఒత్తిడితో ఒంటరి దీవులుగా మారిపోయిన నేటి మానవ కుటుంబాన్ని సమైక్య పరచే ఏకైక శక్తి సినిమా-అంటారు ఆదూర్ గోపాలకృష్ణన్. స్త్రీలూ, పిల్లలూ, అట్టడుగు ప్రజలు, బలహీనులు. సమానత్వాన్ని కోరుకుంటారు. కాస్త మెరుగైన పరిస్థితుల్లో ఉన్న మనమందరం ప్రపంచ కుగ్రామం లోని వారి పట్ల సహానుభూతితో ఉందాం. ప్రపంచం సినిమా ద్వారా బాధాసర్పదష్టులకు దగ్గరవుదాం!

ఎక్కడో తాలిబన్ లో కదా “ఒసామా”కథ, పోలాండ్ లో కదా “నీ పేరు జస్టిన్” కథ జరిగింది అని తేలిగ్గా తీసుకోనక్కరలేదు. మన దేశంలో మొన్న మన నిర్భయకీ, నిన్నమన జిషాకీ జరిగిన ఘోరాల సంగతేమిటి? పసిపాపల పట్ల ప్రతిరోజూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు?

నటీ-నటుల గురించి, చిత్ర నిర్మాణం గురించి ఎంతైనా రాయొచ్చు. కానీ కేవలం కథలకే పరిమితమవుతున్నాను. 2013 లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో “Osamaచిత్రాన్ని, 2013 లోనే “celebrating women” పేరిట జరిగిన 18 వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో “Your Name is Justine” (“నీ పేరు జస్టిన్”) చిత్రాన్ని చూశాను.

(సెప్టెంబర్ 10,11 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్వహించిన సదస్సు కోసంనన్ను ప్రభావితం చేసిన సినిమా సాహిత్యం” అనే అంశంపై రాసిన వ్యాసం)

                                                                                                                                    –

 

 

 

 

పంటని వాగ్దానం చేసే కవిత్వం ఏదీ?!

Art: Rafi Haque

Art: Rafi Haque

కవిత్వం గాలిలోంచి పుట్టలేదు. ఆకాశం నుండి రాల లేదు. ఏ దేవుడో వరమిస్తే మొలకెత్త లేదు. కవిత్వం ఎలా పుడ్తుంది అని ఒక కవిని నిద్ర తట్టి లేపితే ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు కలిగే ఆలోచనల వల్ల పుడ్తుంది అంటాడు. ఒకడు విశ్వంతో మమేకమైతే ( అదెలా ఉంటుందో కొంచెం  సంశయాత్మకత   ఉన్నా సరే ) కవిత్వం పుడ్తుంది అంటాడు. ఒకడు ప్రకృతి లో పవళిస్తూ ఉంటే కలిగే ఆలోచనల్లో కవిత్వం పుడ్తుంది అంటాడు. మరొకడు కడుపు కాలితే పుడ్తుంది అంటాడు. ఈ కవిత్వం అన్నది ఎటువంటి బ్రహ్మ పదార్థం ? ఎలా పుడుతుంది ? ఈ  తర్కాన్ని జాగర్తగా అర్థం చేసుకుంటే మనం కవిత్వం గురించి వచ్చే చర్చలను చాలా మట్టుకు అర్థం చేసుకునే ప్రయత్నంలో సఫలం అవ్వచ్చు. లేదా గాలి ఎటు వీస్తే అటు వీచి పోతాము.

అసలు సమాజం ఎలా పరిణామం చెందిందో అందులో భాష ఎలా పుట్టిందో ఏ నియమాలననుసరించి పుట్టిందో తెలుసుకోకుండా కవిత్వం ఎలా పుడ్తుంది అని చర్చించడం అస మగ్రంగా ఉంటుంది.

ఆదిమానవుడి ప్రపంచంలో ప్రకృతి  ప్రధాన పాత్ర పోషించింది. అప్పట్లో ఆదిమానవుడి  పరస్పర సంబంధం ప్రధానంగా ప్రకృతి తోనే నడిచింది. ప్రకృతికి మాటలు రావు , వినిపించవు. చెట్టు ను బతిమాలో బామాలో పళ్ళు సంపాయించుకునే  యాంత్రికవిధానం లేకపోవడంతో మనిషి తన చేతులకు కాళ్ళకు పని చెప్పవలసి వచ్చింది. లేపొతే మనిషి అంతరించాల్సిన ఆగత్యం వస్తుంది. ప్రకృతితో ఉండే  పరస్పర సంబంధం  లో మానవుడు తన అవసరాల దృష్ట్యా తన అవయవాలను భౌతికంగా ఉపయోగించాల్సి వచ్చింది. ఆ క్రమంలో మనిషి చేతులు కాళ్ళు రూపాంతరం చెంది ఒక పరిణామ క్రమంలో మనిషి నాలుగు కాళ్ళ జంతువు నుండి మనిషిగా విభిన్న రూపం దాల్చుకోవాల్సి వచ్చింది. కొద్దిగా  మళ్ళి ఆలోచిస్తే మనిషి మొట్ట మొదటి ఉత్పత్తి పని ముట్టు చేయి. మనిషిలో ఎదుగుదల జరగడానికి కారణం శ్రమ. ఈ పనిముట్టు అనగా చేయి, దానితో పాటు తదితరై అవయవాలలో జరిగిన మార్పు, అందుకు సమన్వయంగా మెదడు అభివృద్ధి చెందడం ఒక మానవ శ్రమ విధాన క్రమంలో అవసరమయ్యింది.  ఇదే పరిణామాన్ని జీవ పరిణామ సిధ్ధాంతాలు మనకు సులువుగా వివరిస్తాయి. ఇక మెదడు అభివృద్ధిచెందిన తర్వాత లేదా చెందుతున్న క్రమంలో తనకు అవసరమైన పనుల గురించి మనిషికి చైతన్యం పెంపొందడం సహజం అయ్యింది. అలా కాకపోయి ఉండి ఉంటే మనిషి  అంతరించిపోయే వాడు.

శ్రమ

Physiological development ——–> pshychological development

 

అంటే మనిషి భౌతిక మానసిక పరిణామ క్రమంలో ప్రకృతి లో మనుగడకు కావాల్సిన  కనీస పరస్పర సంబంధం  ఎంతైతే కావాలో అంత కలిగి ఉన్నాడు. ఆ మాట కొస్తే ప్రతి పక్షికీ ప్రతి జంతువుకు కూడా  స్మృతి చేతన  ఉంటుంది. అప్పుడు భాష అవసరం లేదు ఎందుకంటే – మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా కేవలం భౌతిక అవసరాల కోసం ప్రకృతి తో ఉండే  పరిమిత పరస్పర సంబంధం కు భాష అనవసరం. ఏం మనిషి కూడా అలానే చీమలానో తేనెటీగలానో ఆ మాత్రం  స్మృతి చేతన  తో బతక లేడా ? బతకలేడు. బతికి ఉంటే మనిషి కాకుండా ఏ ఏనుగో, గుర్రమో అయి ఉండేవాడు. ఐతే అతని అవయవాలు అతని భౌతిక అవసరాలు పూరించడానికి అనుగుణంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని గమనించాలి.

ఒక విషయం అర్థం చేసుకుందాము. మానసిక ఎదుగుదల భౌతిక ఎదుగుదల ఒక అనుసంధాన క్రమంలో జరిగింది. అంటే గంట క్రితం ఆలోచించిన విషయానికి ఇప్పుడు మాటలు పుట్టితే ఇక మాటల అవసరం ఏముంది ? లేదా ఇప్పుడు చేసిన పని మన మెదడులో ముద్రించుకోడానికి ఒక రోజు పడితే ఇక పని ఎలా చేయగలం ? కాబట్టి మానసిక ఎదుగుదల అన్నది శారీరక ఎదుగుదలతో పాటు జరగాల్సిన ఒక అనివార్య క్రమంగా మనం చూడొచ్చు.

మెదడు అభివృద్ధి జరిగాక మనిషిలో చైతన్యం అన్నది మొదలయ్యింది. చైతన్యం అంటే The manner in which we interpret, analyse, remember and use the information about the social world . అంటే చుట్టు పక్కల ఉన్న పదార్థాలతో ఉండే ఒక  నిరంతర పరస్పర సంబంధంవలన మనిషికి ఆలోచనలు కలిగాయి . ఎందుకంటే ఈ చైతన్యం వలన మనిషికి  pattern recognition    అర్థం అవుతూ వచ్చింది. ఇదంతా ఒక  ఏక కాల ప్రక్రియ. ఏ ఒక్క గంటలో జరిగిన విధానం కాదిది. కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టింది.

పొద్దున్నే లేచి ఆది మానవుడు లేచి రాతి గొడ్డలితో చెట్టును కొడ్తే ‘ ఠక్ ‘ ‘ఠక్ ‘ అనే చప్పుడే వచ్చేది. అలాకాక ఒక రోజు హఠాత్తుగా ‘ఖణేళ్ ‘ ‘ ఖణేళ్ ‘ అన్నదనుకోండి. వెంటనే అది మొద్దు ఐనా కాకపోయి ఉండాలి లేదా మొద్దుకు ఈ గుణం కొత్తగా ఐనా వచ్చి ఉండాలి అన్న విషయం తర్కించగలడు. అది తేలకపోతే మనిషి మొద్దు మీద ఆధారపడ్డం అన్నా వదులు కోవాలి లేదా ఆ విషయాన్ని శొధించాలి. ( అంటే ఏ ‘X’ మనిషో ‘Y ‘ మనిషో ఐనా మనకెందుకు అని ప్రొసీడ్ అయి ఉండొచ్చు. ఆ   వ్యక్తిగత నడవడిక సామాజిక గతి క్రమాన్ని వివరించదు. పైగా ఈ మార్పు ఒక్క క్షణంలో జరిగింది కాదు ). కాబట్టి జాగర్తగా గమనిస్తే పదార్థం ( అంటే పరిసరాల మొత్తం అని సింపుల్ గా చెప్పొచ్చు ) వలన చైతన్యం కలిగింది. చైతన్యం ఒక రకంగా చూస్తే ఆలోచనల సముదాయము.

పదార్థం ——— > చైతన్యం 

పరిసరాలలో ఉన్న వైరుధ్య భావనల వల్ల ( ‘మొద్దు ‘  గురించి వివరించిన ఉదాహరణలో చూసినట్టు ) క్రమ క్రమంగా ఆలోచనల సమూహం పెంపొందుతూ వచ్చింది. చైతన్యం అన్నది ఒక  శరీర ధార్మిక మార్పు (Physiological change)  దశ నుండి పదార్థం చేత ప్రభావితం చేయబడ్డది. మరింత పరిణతి చెందుతూ వచ్చింది. ఇది జాగర్తగా గమనిస్తే పదార్థం తో జరిగిన ఒక శ్రమ విధానం వలన ఉద్భవించిన విశేషఘటన ( phenomenon)   గా చెప్పొచ్చు.

మనిషి ఈ క్రమంలో పదార్థం పట్ల పెంపొందించుకున్న అవగాహన వలన లోహం కనుక్కోగలిగాడు. దాని వలన ఉండే ఉపయోగాలు గుర్తించగలిగాడు. ఇదే క్రమంలో ఒక ఉత్పత్తి విధానం ఒక పంపిణీ విధానం అమలు లోకి వచ్చాయి. అదే క్రమంలో తనతో పాటు జీవించే తోటి మానవులతో  పరస్పర సంబంధం  మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే మనిషి ప్రకృతి తో పరస్పర ప్రతిస్పందన క్రమంలో ఎదుగుదల చెంది తన చుట్టూ ఉన్న సమాజంతో  కూడా పరస్పర ప్రతిస్పందన ను ఏర్పరుచుకోవడం అవసరం అనే ఒక సందర్భానికి లాగ బడ్డాడు. అంత వరకు సైగలకు పరిమితమైన  సంభాషణ పద్దతికి ఒక భాష అవసరం అయ్యింది. మనం ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటూ వస్తుంటే భౌతిక ఎదుగుదల కు సమన్వయంగా వచ్చిన మానసిక ఎదుగుదల వలన, ఆ మానసిక ఎదుగుదల ఫలితంగా ఏర్పడిన చైతన్యం వలన మరియు ఉత్పత్తి విధానం లో ఒరవడి పెంపొందడం వలన ఆ క్రమంలో మారుతున్న మానవ సంబంధాల వలన ఒక సంస్కృతి  ఏర్పడాల్సిన దిశ అవసరం అని తెలుస్తుంది.

ఇంకా చూద్దాం. సైగలకు పరిమితమైన కమ్యూనికేషన్` పద్దతి క్రమంగా సన్నగిల్లి భాష అవసరం ఏర్పడింది. నాగలి తయారు చేసే దశకు వచ్చే లోపు అనగా సుమారు లోహ పరికరాలు విరివిగా వాడ్డం మొదలు పెట్టడం మొదలు పెట్టాక భాష వచ్చింది అని కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం. ఐతే అంతకు ముందో అంతకు తర్వాతనో మొత్తం మీద భాష మారిన సామాజిక లేదా మానవ సంబంధాలకు అనుగుణంగా అవసరం అయ్యింది. ఆ భాష లేకపోతే పెద్ద మొత్తంలో ఉన్న సాంఘిక అవసరాలు తీరలేవు.

ఇంతవరకు గమినించిందేంటి ? 

  1. మనిషి తన భౌతిక అవసరాల కొరకు శ్రమ చేసే క్రమంలో ఎదుగుతున్నప్పుడు మెదడు a అభివృద్ధి అన్నది శారీరక ఎదుగుదల క్రమంలో అవసరం అయ్యింది.ఆ క్రమంలోనే మనిషి జంతువు నుండి వేరు పడ్డాడు.
  2. మానసిక ఎదుగుదల వలన కలిగిన చైతన్యం వలన ( దీని నిర్వచనం వ్యాసంలో ముందు చూసాము ) పదార్థంతో జరిగే నిరంతర పరస్పర సంబంధం వలన ఉత్పత్తి విధానాని ప్రభావితం చేయగలిగాడు.
  3. ఉత్పత్తి విధానం పెంపొంది సామర్థ్యము పెరుగుతున్నప్పుడు సైగలకు పరిమితమైన సంభాషణ పద్దతి అనివార్యంగా మారాల్సిన పరిస్థితి సమాజంలో ఏర్పడింది
  4. తన చైతన్యంతో కొత్తగ ఏర్పడిన ఉత్పత్తి విధానం పంపిణీ విధానానికి అనుగుణంగా మరియు తన సాంఘిక అవసరాలకు అనుసంధానంగా మనిషి సౄష్టించుకున్న సంభాషణా మాధ్యమం భాష.
  5. పదార్థంతో ఉండే నిరంతర పరస్పర సంబంధం వలన చైతన్యం పెంపొంది ఆలోచన కలుగుతుంది. ఆ చైతన్యం వలననే మనిషి శ్రమ సంబంధాలను మెయింటెయిన్ చేయగలిగాడు. ఇది భాషకు మూలం అయ్యింది.

 

ప్రకృతి సహజంగా అనుసరించే  సహజమైన్ డైయెలిక్టిక్స్   ఉన్నాయి. వాటి ప్రకారమె మనిషి జననం, భాషా జననం జరిగింది. ‘ మనిషికి ఈ పరిణామ క్రమంలో తోక ఎందుకు రాలేదు?’ అని అంటే కోతి ఈ సృష్టిలో ఏర్పడే విధానాన్ని చర్చించినట్టు అవుతుంది తప్ప మనిషి గురించి కాదు. ఇది కేవలం జీవ పరిణామంగా మాత్రమే చూస్తే మనం  జీవ శాస్త్రం  దగ్గర మాత్రమే ముగిస్తాము. డార్విన్` జీవ పరిణామ సిద్ధాంతం సమాజ చలనాన్ని వివరించదు. అది డార్విన్ తప్పు కాదు. దాన్ని  వ్యాఖ్యానించే వాళ్ళది తప్పు. ఆ రకంగా చూస్తే మనకు మన మనుష్య సమాజ పరిణామాన్ని అర్థం చేయించడానికి  ఆంత్రోపాలజీ, ఫిలాసఫీ అవసరం లేదన్నమాట. సాంఘిక చలనాన్ని అర్థం చేసుకోడానికి  డైయెలిక్టిక్స్   అన్వయించడానికి ఆయా విషయాలకు మాత్రమే సంబంధించిన శాస్త్రాన్ని చూస్తే చాలా  పరిమితమైన దృష్టి   అవుతుంది. ఆ క్రమంలో మన ముందు ఉన్న ఒక ప్రాథమిక చట్రాన్ని ఉపేక్షించాల్సి వస్తుంది.

ప్రతి పరిణామము కేవలం సహజమే కాదు. ఆ సహజత్వానికి ఒక నియమం ఉంది. ఒక సహజమైన అవసరం ఉంది. లేపొతే జీవం మనుగడనే సాధ్యం కాదు. భాష పుట్టుక ఎంత చారిత్రక, సాంఘిక అవసరమో మనం గమనించాము. అందుకు చైతన్యం ఎలా దోహద పడిందో ఆ చైతన్యం పదార్థం నుండి ఎలా పుట్టిందో చూసాము.భాష పుట్టుక గమనిస్తే లోహ యుగం ప్రారంభమయ్యాకనే మొదలయ్యింది. ఇదేదో  కేజువల్ గా జరిగిన విషయం లోహం కనుగొనడం మానవ జీవితంలో ఒక విప్లవం. దీనితో ఉత్పత్తి విధానం విపరీతమైన మార్పులకు గురి అయ్యింది. అందుకనుగుణంగానే ఉత్పత్తి సంబంధాలు మారాయి. మారిన మానవ సంబంధాలకనుగుణంగానే సైగలతో ఉన్న  సంభాషణ పద్దతి ప్రతిబంధకమై నిలదొక్కుకోలేక భాష అవసరం వచ్చిపడింది.

ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. తేనె టీగ తన తుట్టెను కట్టుకుంటుంది. దానికుండే ఒక  లిమితెద్  చొన్స్చిఔస్నెస్స్   అది. తేనె టీగకు తుట్టె నిర్మించే ముందు తన తుట్టె ఏ రూపంలో ఉంటుందో ఎంత పొడవుంటుందో ఎంత వెడల్పు ఉంటుందో తెలుస్తుందా ?. అదే మానవుడు తనను ప్రకృతినుండి రక్షించుకునే క్రమంలో తన శ్రమ విధానం లో పెరిగిన  సామర్థ్యము వలన , పదార్థం పట్ల తనకున్న చైతన్యం వలన తాను కట్టుకునే గుడిసె పొడవు, ఎత్తు, వెడల్పు ఎంత ఉంటుందో కట్టక ముందే చెప్పగలడు.మనిషిలో ఉన్న  abstract thinking, logical thinking  వలన (  శరీరానికి మెదడుకు ఉన్న సమన్వయంలో భాగంగానే ఆపై మారిన మానవ సంబంధాల ఫలితంగా ఇలా ఏర్పడాల్సిన పరిస్థితి ఉంది అని గమనించాము) ఊహించే లక్షణం మనిషి మెదడుకు అబ్బింది.ఈ ఎదుగుదల ఏ ఒక్క క్షణం లోనో ఏదో ఒక్కరి లోనో ఒక్కసారిగా కలిగినది కాదు అని గమనం లో ఉంచుకోవాలి.

సమాజ పరిణామ క్రమంలో సమాజంలో కొన్ని institutions  కూడా ఏర్పడగలిగాయి. పెళ్ళి, కుటుంబము, మతము లాంటి కొత్త  institutions  ఏర్పడ్డం మొదలయ్యింది . ఐతే మనిషి తనకున్న Abstract thinking, logical thinking  వలన కలిగిన పరిజ్ణ్జానాన్ని ఉత్పత్తి , పంపిణీ విధానం ( ఇంకో రకంగా చెప్పాలంటే మొత్తంగా ఉత్పత్తి సంబంధాలు అనవచ్చు) వీటిలో ప్రయోగిస్తూ కొత్తగా ఏర్పడిన  institutions   లో కూడా ఉపయోగించడం మొదలయ్యింది. మనిషి దేహానికి సింహం తల తగిలించడం , లేదా ఏనుగు తల తగిలించడం జరిగింది. ఐతే క్రమ క్రమంగా మనుష్యుల్లో వర్గాలు ఏర్పడ్డంతో సమాజాన్ని నడిపే పగ్గాలు సమిష్టిగా ఉండడం ఆగిపోయింది. ఇదే పరిజ్ణ్జానన్ని తన కట్టుబాట్లలో చూయించాడు. తన అలవాట్లలో చూయించాడు. తన రుచుల్లో చూయించాడు. తనకవసరమైన భాషలో కూడా చూయించాడు. ఆ విధంగా భాష లో ప్రయోగం జరగడం తార్కిక క్రమం లో జరగాల్సిన ప్రక్రియ అయ్యింది. నిజానికి ఈ పరిస్థితి సుమారు 4000 సంవత్సరాల క్రితం మించి ఉండదని కొంత మంది చరిత్ర కారుల అభిప్రాయం. భాష పరిణామం చెందాల్సిన అవసరం చూస్తే మళ్ళీ మనం పదార్థంతో జరుగుతున్న  పరస్పర సంబంధం దగ్గరే ఆగాల్సి వస్తుంది.

ఏర్పడిన వర్గాల దౄష్ట్యా , తెగిపోయిన సమిష్టి సంబంధల దౄష్ట్యా ఏదైనా విషయాన్ని సంఘంలో ఆమోదించే క్రమానికి ఒక  ప్రభావశీల భావ వ్యక్తీకరణ  (effective expression)   అవసరం అయ్యింది. ఇదేదో ఒక్క రోజులో ఏర్పడిన ఆలోచన కాదు. అందుకు ఒక విషయాన్ని హత్తుకునేలా అర్థం చేయించడానికి ఆమోదింపజేయడానికి కళలు, సాహిత్యం అవసరమయ్యాయి. ఇందుకోసం సాధారణ వచనాలు సరిపోలేదు. మారిన ఉత్పత్తి సంబంధాలు, ఏర్పడిన వివిధ వర్గ సంస్కౄతులు, మనిషికి ఉన్న భావావేశ వృద్ధి (  emotional development )  ఒక భిన్న భావ వ్యక్తీకరణ జననానికి అవసరాన్ని, అనుకూలతను సూచించాయి ( భాష మొదలు కాక ముందు మానవుడి భావావేశాలకు సంబంధించిన ఎదుగుదల చాలా ప్రాథమిక స్థాయిలోనే ఉండిందని చెప్పుకోవచ్చు. మనకు రాతి యుగం నాటి అవశేషాలు గమనిస్తే మనిషి వేటాడిన జంతువుల బొమ్మలు లాంటివి కనిపిస్తాయి తప్ప ఎక్కడా మనిషి భావావేశాలు ప్రతిబింబించే అవశేషాలు పెద్ద  ప్రాముఖ్యంగా   దొరకవు).

అదే విధంగా సమాజంలో ఏర్పడిన  వైవిధ్య సాంఘిక స్థాయిలలో సమాజం మీద ఆధిపత్యం గురించి, స్వంత ఆస్తి పరిరక్షణ క్రమంలో సాంఘిక అస్తిత్వాన్ని మరింత గట్టి పరుచుకునే క్రమంలో, భిన్న సంస్కృతుల్లో భాగంగా – భాష వివిధ భిన్న రూపాలను ఏక కాలంలో కొనసాగించాల్సి వచ్చింది కూడా. అంటే భాష సమిష్టి ప్రయోజనాల కోసం ఏర్పడి సమాజ పరిణామ క్రమంలో ఆయా సమాజాల్లో ఏర్పడిన  institutions  ను బట్టి, వర్గ సమాజాన్ని బట్టి, సంస్కృతి లో కలిగిన చీలికలను బట్టి ( ఈ మూలకాలన్నిటినీ కలిపి పదార్థం అంటారు అని అనుకున్నాము ) మార్పు చెందుతూ వచ్చింది.

ఏం వర్గ సమాజం ఏర్పడకపోయి ఉండి ఉండొచ్చు కదా? అటువంటి వర్గ సమాజం మాత్రం ఎందుకు అవసరమయ్యింది ? అంటే వర్గ సమాజ జననం స్థూలంగా గమనిస్తే నిజానికి మనుష్య సమాజంలో వెనుకబాటు కాదు. అది ఒక రకంగా అభివౄద్ధి. ఒక తెగ ఇంకొక తెగపై దాడి చేసినప్పుడు గెలిచిన తెగ ఓడిపోయిన తెగను పూర్తిగా నిర్మూలించే వారు. ఐతే ఉత్పత్తి విధానంలో మార్పుల వల్ల వారిని చంపడం కంటే అలా ఓడిపోయిన తెగను తమ ఉత్పత్తి విధానంలో భాగం చేసి వారిని దోచుకుంటూ వారికి బానిస స్థాయిని కల్పించిండంలో ఎక్కువ ప్రయోజనం కనిపించింది. అప్పటి బానిస వ్యవస్థ ఏర్పడ కూడదు అనుకుంటే మొత్తం మనుష్య జాతి అంతా అంతరించి పోయేదేమో !

మన సమాజంలో ఐతే వర్ణ వ్యవస్థ ఏర్పడ్డం వలన ఆధిపత్య వర్గాల ప్రయోజనం కొరకు పాలక వర్గాల భాషనే అధికారిక లేదా అదే సామాజిక భాషగా చెలామణీ అయ్యింది.అదే సంస్కృతమై వెలిసింది.   Known ruling classes  వారి భాషలైన ప్రాగ్ , ద్రవిడ, పాళీ భాషలకు సముచితమైన సాంఘిక స్థాయి కల్పించలేదు. సంస్కృత భాష ప్రాకౄతిక వ్యావహారిక భాషలపై గొడ్డలి పెట్టు అయ్యి ఒక వర్గ ప్రయోజనాలలో భాగమైన మూలకం అయ్యింది. తమ సంస్కృతికి కి  superiority  ని పులిమే క్రమంలో సంస్కృతానికి దైవత్వం ఆపాదింపబడింది ( ఇక మనిషి అంటూ వాడ్డం మానేద్దాం. ఎందుకంటే సమిష్టి ప్రయోజనాల నుండి వ్యక్తిగత లేద వర్గ పరమైన ప్రయోజనాలు ముందుకొస్తున్నప్పుడు సంస్కృతి కూడా చీలి పోయింది మనుష్యులతో పాటు ).

ఇక సాహిత్యం అంత:పుర గోడలకు పరిమితమై పోయింది. సంస్కృత సాహిత్యం మెజారిటీ ప్రజలనుండి విడివడింది. సంస్కృతం అంటే అదో దైవత్వ రూపం కలిగి ఉండాలి అనో, అదో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్న వారి సొత్తు అనో, సంస్కృతం మానవాతీత సంస్కృతిలో భాగం అన్నట్టుగానే project  అయ్యింది. అధ్యాత్మికత ముసుగులోనూ దైవత్వం ముసుగులోనూ ఇలా ముక్కు మూసుకుని తపస్సు చేస్తే , లేదా ఉపాసన చేస్తే కవిత్వం పుడ్తుంది అన్న భావన కలిపింపజేసే ప్రయత్నాలు జరిగి ఇలాంటి అభ్యాసం తుచ్చ మానవులకందరికీ రాదు అన్న విశ్వాసాన్ని పాలక వర్గాలు కల్పించినట్టు మనకు స్పష్టమౌతుంది.

ఇందుకు అప్పటి బ్రాహ్మణీయ హైందవ మత వ్యవస్థ బాగా తోడ్పడింది. ఆ రకంగా చూస్తే  vernacular languages  పుట్టుక సామాజిక సాంస్కృతిక పరిణామంలో ప్రజా సంస్కృతి యొక్క విజయంగా చెప్పొచ్చు. భాష, సాహిత్యము, దానితో పాటు కళలు , సంస్కృతులలో   సమభావము నశించి పాలక వర్గం వేపు ఒక భాగం, ప్రజల వేపు ఒక భాగం అయ్యి చీలిపోయాయి. సమిష్టి ప్రయోజనాలు అన్న భావన నశించాక సాహిత్యంలో ప్రజలకు సంబంధించి ఎన్నో కుట్రలు జరిగాయి. సాహిత్యం ప్రజలకు సంబంధించిన విషయంగా కాక తమ ఆధిపత్యాన్ని నిర్ణయించే మూలకంగా చేయాలని మన సమాజంలో ఎన్నో ఎత్తుగడలే నడిచాయి. ఇందుకు వర్ణ వ్యవస్థ బాగా తోడ్పడింది.సాహిత్యం ఎలా పుడ్తుందో కవిత్వం ఎలా పుడ్తుందో అనే ఒక విశ్వాసాన్ని, పదార్థాన్ని వదిలేసి బ్రహ్మ పదార్థంగా చిత్రీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయని గమనించవచ్చు.

ఐతే భూస్వామ్య వ్యవస్థ కూలుతున్న క్రమంలో పెట్టుబడి దారి ప్రజాస్వామ్యం ముందుకొస్తున్న తరుణంలో మన దేశంలో  sanskritisation ప్రభావం దాని వెనక ఉన్న శక్తులు అనివార్యంగానే బలహీనపడ్డాయి.  తమ మనుగడను విస్తృతం చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

  1. భాషకే కాదు సంస్కౄతికీ, సాహిత్యానికీ , మూలము పదార్థం . ఆలోచనలు విడిగా ఉండవు. పదార్థంతోనే ముడివడి ఉంటాయి.
  2. మనిషి సమిష్టి ప్రయోజనాల కోసం భాష ఏర్పడింది.ఎదుగుతున్న ఉత్పత్తి సంబంధాలను మనగె చేయాలంటే భాష అనివార్యం అయ్యింది.
  3. మనిషికిదెవెలొప్ ఐన abstract thinking, logical thinking సమాజ పరిణామ క్రమంలో ఏర్పడిన  institutions  లో ఉపయోగించుకోవడం జరిగింది
  4. సమాజం లో వర్గాలు ఏర్పడ్డంతో భాష, సంస్కౄతి సాధారణ ప్రజానీక సంస్కౄతి, భాషలతో విడివడ్డాయి. ఇందుకు మత, వర్ణ వ్యవస్థలు మన సమాజంలో బాగా తోడ్పడ్డాయి.
  5. సంస్కృతం సాధారణ ప్రజల భాషను చావు దెబ్బ తీసి తనకో దైవత్వ రూపాన్ని పులుముకుంది. ఇది వర్ణ వ్యవస్థ పుణ్యమే. ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాలు కాపాడుకునే క్రమంలో జరిగింది.
  6. సాహిత్యం అన్నది ఏ ఒక్క వ్యక్తిగత పరిణ్గానం వలన పుట్టుకు రాలేదు. మనిషి తన సాంఘిక అవసరాల కోసం చేసిన ఎన్నో ప్రయోగాల్లో భాషపై జరిగిన ప్రయోగం ఒకటి. అందులో భాగం సాహిత్యం.
  7. భాషకు దైవత్వం ఆపాదించడం సాహిత్యానికి మానవాతీత రూపాన్ని పులమడం సన్స్క్రితిసతిఒన్ అవుతుంది. దీని వలన ఆధిపత్య సంస్కృతి ఏదైతే చలామణిలో ఉందో అది అభివౄధ్ధి చెందడానికి తోడ్పడింది.

 

సాహిత్యం అన్నది బ్రహ్మ పదార్థం కాదు. మరో సారి అనుకుందాము. సాహిత్యం అన్నది బ్రహ్మ పదార్థం కాదు. ఇది ఏ ఋషి హిమాలయాల్లో ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని పరధ్యాన్నంగా ఉన్నందు వల్ల మాత్రాన పుట్ట లేదు. ఎందుకంటే మనిషి ఆలోచన పదార్థం లేకపోతే లేదు. పదార్థాన్ని వదిలి పెట్టి మనిషి ఆలోచనలు రెక్కలు కట్టుకుని ఎగర లేవు. నీల్స్ బోరు పరమాణు నమూనాను కనుక్కోక పోయి ఉంటే ఇక ప్రపంచంలో ఏ రసాయన మూలకాలు ఉండేవి కావు అన్నది ఎంత తప్పో అలాగే కేవలం వ్యక్తిగత పరిజ్ణ్జానాఇకి, మానవ సమాజ అభివౄద్ధికి ఉపయోగ పడే సాహిత్యానికి లింకు పెట్టడం అంతే తప్పు. ఒకప్పుడు రాజు సింహాసీనుడై మధువు సేవిస్తూ ‘ మేము ఆనంద డోలికల్లో తేలియాడుచున్నాము. ఏది మన రాజ నర్తకి ఊరువుల మీద ఒక బహు సుందరమగు పద్యం వినిపించుము ‘ అన్న ఆదేశంతో సాహిత్యం పుట్టుకొచ్చిన చరిత్ర ఉంది. సాహిత్యం అంతపురానికి పరిమితమై వర్ణ వ్యవస్థ చట్రంలో అగ్ర భాగాన ఉన్న వర్గాల ప్రయోజనాలు వారి విలాసాలు తౄప్తి పరిచే విధంగా ఉపయోగపడింది.

చరిత్ర కారులకు ఉదయ పూర్ రాజుల కోటలో ‘ అనంగరంగం ‘ అనే గ్రంథం లభించింది. అందులో మొదటి  చప్తెర్  ‘ లింగ స్థూలీకరణం ‘. ఒక నాడు సాహిత్యమంటే అదే అన్నట్టు శౄంగారం గొప్పదైన నవరసం అని ( శౄంగార రసం అన్నది విశ్రాంతి అధికంగా ఉన్న వర్గాల వారి విలాస కేళికి సంబంధించిన విషయంగానే పరిమితమయ్యింది. దిగువ వర్ణాలు సమాజానికి తమ శ్రమ నందించి సేవ చేసే విషయంలోనే తమ జీవితాన్ని చూసుకున్నారు ) చలామణీ కూడా చేసారు. అందరూ అదో అద్భుత ప్రక్రియ అని అందులో జరిగిన ప్రయోగాలను నోరు తెరుచుకుని చదివి అసలు సాహిత్య ప్రయోజనాన్ని మనకు కాకుండా చేసారు. శ్లోకాలు ఏ చందస్సును పాటించాయి అని తీక్షణంగా పరీక్షించే ముందు మనం శృంగార రసం పేరుతో రాజుల ‘ లింగ స్థూలీకరణ ‘ గురించి ఆందోళన చెందిన కవి సమూహాన్ని, ఆ సాహిత్య కల్పన తీరు తెన్నులను గమనించడం వదిలేస్తే ఇది సాహితీ కౄరత్వం తప్ప ఏమీ కాదు . సాహిత్యం దేవుడి గొప్ప తనాన్ని ఎంతో ఆధ్యాత్మికంగా వర్ణించడానికి ఉపయోగపడ్డది. ఒక మనిషిని పట్టుకుని ‘ నీవు తక్కువ వాడివి పెద్ద పనికొచ్చే లక్షణాలు ఏమీ లేవు ఉత్పత్తి విధానంలో నీ స్థానం ఇదే ‘ అని బోధించడానికి వాడిని బలవంతంగా ఒప్పించడానికి సాహిత్యం ఉపయోగ పడింది.

‘చాతుర్వర్ణం మయా సౄష్ట్యాం గుణ కర్మ విభాగశ తస్య కర్తార మపిమాం వ్ద్యికర్తార మవ్యయం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం ‘ (క్లుప్తంగా చెప్తే నాలుగు వర్ణాలను నేనే సౄష్టించాను. అందులో శూద్రుని పని మిగతా వర్ణాలకు పరిచర్య చేయడమే ) సాహిత్యం పుట్టుక కొన్ని ప్రయోజనాలను ఆశించి జరిగింది. అది ఖచ్చితంగా ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు మాత్రమే దౄష్టిలో పెట్టుకుని జరిగింది అన్న వాస్తవాన్ని ఇక్కడ గమనించగలరు.

ఐతే సంస్కౄత భాష కాల క్రమేణా బ్రాహ్మణీయ వ్యవస్థ తో పాటు బలహీన పడడంతో వ్యావహారిక భాషలో సాహిత్యం కూడా ఏక కాలంలో అభివౄధ్ధి జరగడం జరిగింది. తెలుగులో గురజాడ, గిడుగు రామ్మూర్తి తదితర కవులు తెలుగు సాహిత్యంలో  sanskritisation   ను కాదని దేశీయ చందస్సులో తెలుగు సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు. ఐతే అప్పటికీ ఇప్పటికీ కవిత్వం అన్నా, సాహిత్యం అన్నా ఒక బ్రహ్మ పదార్థం అదో మానవాతీత రూప ప్రమేయం తోనే పుడ్తుంది అని దాన్ని అడపా దడపా ఆధ్యాత్మికతకు లింకు పెట్టి చూడ్డం జరుగుతుంది.

చరిత్రను గమనిస్తే సాహిత్యం ఎప్పుడైనా ఏదో సామాజిక ప్రయోజనం ఆశించకుండా పుట్టదు. పుట్టలేదు. ఐతే పదార్థం ఎప్పుడూ మార్పులకు గురవుతుంది.అందువల్ల చైతన్యం మార్పులకు గురవుతుంది. తద్వారా సాహిత్యం మార్పులకు లోనవుతుంది అన్న ప్రక్రియను అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయా సమాజ ప్రయోజనాలు ఆయా వర్గ సమాజ లక్షణాలు బట్టి వేరు వేరుగా ఉంటాయి. పైన చూసిన శ్లోకం ఎలా పుట్టుకొచ్చింది ? ఇందులో ఎంత గొప్ప సాహిత్యం ఉన్నది అని లొట్టలు వేసుకుని చర్చించే ముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయం – ఇది రాజులకు పురోహిత వర్గానికి ప్రజలను విధేయులుగా ఉంచే ప్రయత్నంలో భాగంగా, పాలక వర్గల ప్రయోజనాన్ని ఆశించే సౄష్టించ బడినది. అది మరవ రాదు. ఇక ఎంత గొప్ప ప్రయోగం జరిగినా సాహిత్యంలో ఒరిగిందేమిటి ? రాజ్య ప్రయోజనాల కోసం కవిత్వం రాయాలంటే అప్పుడు కవులు ప్రజల నుండి రారు. అది సాధారణ ప్రజలు భాగస్వామ్యం కాలేని సాహిత్యం అవుతుంది. ప్రయోగం మీద ఉన్న మక్కువ ప్రయోజనం మీద చూయించలేదు కవులు. వారి అజెండా  మొత్తం వర్ణ చట్రంలో బిగి వేయబడ్డది.

ఐతే సాంఘిక ప్రయోజనాలు ఆశించి కూడా సాహిత్యంలో ప్రయోగాలు జరిగాయి. సాహిత్య శిల్పాల్లో ప్రయోగాలు జరిగాయి. ఈ విషయాన్ని సింపుల్ గా అర్థం చేసుకోడానికి ఒక ఉదాహరణ చూద్దాం. బాల సాహిత్యం కుచేల కథ, గజేంద్ర మోక్షం , భక్త ప్రహ్లాద లాంటి బ్రాహ్మణీయ సాహిత్యం నుండి విడివడి వ్యావహారిక భాషలోనే ఎదిగే ప్రయత్నం జరుగుతుంది. చిన్న పిల్లలను బుజ్జగించడానికి , పడుకోబెట్టడానికి ఉపయోగపడే సాహిత్యం కావాలి. చిన్న పిల్లలను ప్రజాస్వామికంగా  త్రేత్  చేయడానికి బాల సాహిత్యం కావాలి.ఆ ప్రయోజనాలను దౄష్టిలో పెట్టుకుని వచ్చిన అందరికీ తెలిసిన ఒక తెలుగు  ఋహ్య్మె  చూద్దాము ‘ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోట కెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుక్కుమన్నావా ‘ ఇక్కడ దయ చేసి గమనించండి. సాహిత్యం ఎటువంటి రూపాన్ని మలుచుకుంటుందో.  కొట్టో తిట్టో పిల్లలను మేనేజ్ చేయాలి అన్న వాదన సన్నబడుతుంది. ఈ చైతన్యంతోటే ‘చిట్టి చిలకమ్మ ‘ పుట్టింది. సాహిత్యానికి ఎటువంటి ప్రయోజనాలు లేవు అన్న  హైపో తిసిస్   కు అనంగీకారం తెలిపే మంచి ఉదాహరణ ఇది.

ఆ రకంగా ఇది ఒక మంచి సాహితీ ప్రయోగానికి చిహ్నము. అలాగే ఒక వ్యక్తి భావన, వ్యక్తి ఆలోచన పదార్థం పట్ల ఉన్న అవగాహన ద్వారానే రూపుదిద్దుకుంటుంది.  మీకు కవిత్వం రాయాలంటే నది ఒడ్డు కెళ్ళొచ్చు. కవిత్వం రాయాలంటే ఆదివారం చార్మినారు వద్దకు వెళ్ళొచ్చు. మీ ఇంట్లో నెట్ ముందు కూర్చోవచ్చు. పదార్థంతో వల్ల కలిగిన వైరుధ్య భావనల మధ్య జరిగే సంఘర్షణ మనలో అవగాహనను పెంపొందిస్తుంది. ఐతే పదార్థం పట్ల మీ అవగాహన ఎలా పెంపొందుతుందో దాన్ని బట్టే మీ కవిత్వం వస్తుంది. మీ పక్కనే కూర్చున్న వ్యక్తి కి అదే వాతావరణం , పదార్థం పట్ల వేరు అవగాహన కలిగించవచ్చు. ఏది సరి ఐనది ఏది కాదు అన్నది వ్యక్తులు నిర్ణయించే సమస్య కాదు. కాబట్టి వ్యక్తిలో కవిత పుట్టుక గురించి మనం గెన్రలిసె చేయలేము. ఐతే సాంఘిక వ్యవస్థలో సాహిత్యం ఒక భాగమని మరిచి చేసే ఏ ప్రయోగమైనా – ఒకప్పుడు ప్రాచుర్యం లభించిన హేతుబద్దమైన ఆధారం లేని  ఎంపిరికల్ అప్ప్రోచ్   లేని ‘ ఆయిల్ పుల్లింగ్ ‘ ప్రయోగంలానే – మిగిలి పోతుంది.

ఉదాహరణకు మీరు ఒక పాత దేవాలయంలో మహా నిశ్శబ్దంలో ధ్యానం చేస్తూ కూర్చున్నారనుకోండి. అప్పుడు మోగిన గంట మీకు  Evil dead  సినిమా చూసిన అనుభూతిని గుర్తు చేయొచ్చు. మీ ఆఫీసు రిసెప్షనిస్టు నవ్వు లో ఉన్న అనుభూతి గుర్తు రావొచ్చు. లేదా అదో విప్లవ నినాదంగా అనిపించవచ్చు. మీ సాంస్కౄతిక నేపథ్యాన్ని బట్టి మీకు కలిగే భావనలు వేరు. ఐతే అందువల్లనే కవిత్వం పుడుతుంది అని సూత్రీకరించడం అందులోనే ఒక కవితా రూపం జననం దాగుంది అని సైద్ధాంతీకరించడం పూర్తిగా అశాస్త్రీయం. ఒక రకంగా మోసం చేసే ప్రయత్నం కూడా. ఇది మనలో ఉన్న  మధ్య తరగతి భయాలను  సపోర్ట్    చేస్తుంది తప్ప కవిత్వం పట్ల హేతుబద్దమైన ఆలోచనను పుట్టించలేదు. పైగా అలా ఒక కవితా రూపాన్ని ఊహించి దానికో ఆధ్యాత్మిక రూపాన్ని లేద దైవత్వాన్ని తగిలించడం , సామాన్యులకు సాధ్య మయ్యే విషయం కాదిది అని అన్నట్టు  ప్రొజెక్ట్   చేయడం భాషను, సాహిత్యాన్ని  సన్స్క్రితిసె  చేసే ప్రయత్నం తప్ప ఏమీ కాదు.

అలా ప్రయోగం మేనియాలో పడితే సాహిత్యానికి సమాజానికి వచ్చే ప్రాథమిక ప్రయోజనం ఏమీ లేదు. ఏదో హాబీగా కవిత్వాన్ని చూసుకోడానికి, విశ్రాంతి సమయాన్ని ‘ఖుషీగా’ గడపడానికి, భాష పైన  అచదెమిచ్ ఎక్ష్పెరిమెంత్స్   చెయడానికి ఒకరిద్దరు వ్యక్తులు చేసే ప్రయత్నంగా తప్ప ఇక వేరే విధంగా చూడలేము. ఇది ప్రధానంగా ‘ విశ్రాంతి వర్గాల ‘ ఉల్లాస ప్రక్రియ. మనకు చరిత్ర చెప్పిన సత్యం ఏమంటే ఈ ప్రయోగాలు పుట్టిన మరుక్షణం మరణం తేదీలు లెక్కించేలా ఉంటాయి. ‘ ఆయిల్ పుల్లింగ్ ‘ ప్రయోగాలు ఇవి. ” Literature is not merely a form of language gimmick ‘. భాషలో ప్రయోగం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం.

ప్రయోగం కన్నా ప్రయోజనం ముఖ్యం అని వ్యక్తిగా ఒక్కరు గుండె నిండా నమ్మినా అందులో భాగంగానే ప్రయోగాలు అని అర్థం చేసుకున్నా, ఒకే ఒక్క కవిత రాసినా, ఒకే ఒక్క ప్రయోగం చేసినా ప్రస్తుతానికి అది చాలు. ఆ సమిధ ఆరిపొయేలోపు ఇంకో సమిధ వెలగడం ఖచ్చితం. అదే క్రమంలో వందలు వేలు ‘ చిట్టి చిలకమ్మలూ పుట్టుకొస్తాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ‘ విత్తనం మరణించి పంటను వాగ్దానం చేస్తుంది ‘ (శివ సాగర్ ) అన్న నియమం ప్రకృతికే కాదు సాహిత్యానికీ వర్తిస్తుంది.

నరాలు తెంచే

ఇసుక రాళ్ళ వొత్తిళ్ళు మరిచి

కంఠం పెగల నీయని

ప్రాణ కంటక వలయంలో చిక్కుకున్న

నిలయ విద్వాంసులారా !

పడిపోయిన గాయకులారా !

తడి ఆరిన బతుకుల గాథల్లో

నిప్పులు కురిపించే తప్పుడు నియమాలతో

వాస్తవాల కళ్ళు చిదిమే కల్పనా కథకులారా !

కాల గమనంలో

సముద్ర తరంగాలు తలలు వాల్చినా

కవితా హౄదయం సరికొత్త మార్గాలు తొక్కినా

రూపు మాసిన రాజ సౌధాల్ని కీర్తించే

అంత రంగం ఏ మాత్రం మారని

వంది మాగధ నేపథ్య కవనాలు రచించే

ఆత్మ వంచనకొడిగట్టిన కవులారా !

ఆకాశ హర్మ్యాల రాకాసి ముఖాల్ని వదిలి

ఆనంద నిలయ సోపానాలు కూల్చి రండి !!

( చెరబండ రాజు )

 

 

Bibliography :

  1. Social anthropology – S L Doshi, P C Jain
  2. Social and Cultural Anthropology – Nigel Rapport and Joanna Overling
  3. Marxist – Leninst Philosophy – T Vlasova
  4. సాహిత్యంలో వస్తు శిల్పాలు – త్రిపురనేని మధుసూదన రావు
  5. ౠగ్వేద ఆర్యులు – రాహుల్ సాంకౄత్యయన్

 

( మరింత చర్చకు లేదా క్లారిటీ కోసం రచయిత మెయిల్  pvvkumar@yahoo.co.uk  లేదా ఫేస్ బుక్  ID ” P V Vijay Kumar “ లో కాని కాంటాక్ట్ చేయవచ్చు )

 

 

 

 

ఆ రెండు సినిమాలు- రెండు ఆత్మగౌరవ పతాకలు!

movie-pink

వొకానొక రాత్రి పార్టీలో కలిసిన ముగ్గురు కుర్రాళ్ళతో ఆ ముగ్గురు అమ్మాయిలు, డ్రింక్స్ తీసుకుంటూ, నవ్వుతూ తుళ్ళుతూ వున్నప్పుడు జరుగుతుంది అది. చొరవ తీసుకుని, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి, లొంగదీసుకోవాలనుకుంటారు ఆ కుర్రాళ్ళు.  అమ్మాయిల్లో ధైర్యవంతురాలైన వొక అమ్మాయి, మినాల్, వేరే గత్యంతరంలేక, ప్రతిఘటిస్తున్నా వినిపించుకోని ఆ కుర్రాడిని, చేతికందిన బాటిల్తో ముఖాన కొడుతుంది. కంటి  దగ్గర గాయమై రక్తమోడుతున్న అతన్ని వదిలి, మిగతా స్నేహితురాళ్ళని (ఫలక్, ఆండ్రియా ) తీసుకుని బయట పడుతుంది.

జరిగింది పీడకలగా మరచిపోయి ముందుకు సాగిపోవాలనుకుంటారు.  కాని ఆ కుర్రాళ్ళు, వాళ్ళ మరొక స్నేహితుడు  వదిలిపెడితేగా. ఆ అమ్మాయిలకు వాళ్ళ హద్దు (ఔకాత్ అంటే స్టేటస్) ను గుర్తు  చేయాలనుకుంటారు. వాళ్ళ ఇల్లుగలాయనకు ఫోన్ చేసి వాళ్ళ చేత ఇల్లు ఖాళీ చేయించమని బెదిరిస్తారు. వాళ్ళను కూడా ఫొన్ చేసి బెదిరిస్తారు, వెంబడిస్తారు. మినాల్ నైతే కార్లోకి గబుక్కున లాక్కొని, నడుస్తున్న కారులోనే రేప్ చేసినంత పని చేస్తారు. ఇంత జరుగుతుంటే ఇక ఆ అమ్మాయిలకు ఆ కుర్రాళ్ళ  మీద పోలీసు కేసు పెట్టక తప్పని పరిస్థితి. అక్కడినుంచీ పోలీసు స్టేషన్లలో పని తీరు, వ్యవస్థ ఇవన్నీ ముందుకొస్తాయి. అభియోగి రాజవీర్ వొక రాజకీయ నాయకుడి కొడుకు. ఈ నమోదైన కేసు గురించి ముందు వారికే చెప్తారు, వారు చెప్పినట్టే పాత తేదీతో వొక కేసును ఈ అమ్మాయిల మీద (హత్యా ప్రయత్నం)  నమోదు చేస్తారు.

ఇప్పుడు ఈ విషయాన్ని చర్చకు పెట్టాలంటే కోర్ట్ రూం డ్రామా కంటే సులువు పద్ధతి యేముంది?

అప్పుడు వస్తాడు దీపక్ సెహగల్ (అమితాభ్) అన్న లాయర్. పక్క బిల్డింగులో వుంటాడు. వీళ్ళను గమనిస్తుంటాడు. మినల్ ని వాళ్ళు కారులో యెత్తుకెళ్ళిపోవడం చూస్తాడు. పోలీసుకు ఫొన్ చేసి ఫిర్యాదు చేస్తాడు. ఇప్పుడు కోర్ట్ లో వీళ్ల తరపు లాయర్.

మనకు సమాజంలో కొన్ని నమ్మకాలు, అభిప్రాయాలు బలపడ్డాయి. డ్రింక్స్ తీసుకునే అమ్మాయిలు మంచి కుతుంబంలోంచి వచ్చిన వారు కాదు, సన్స్కారవంతులు కాదు. అలాగే రాత్రి పూటలు  పార్టీలకు వెళ్ళేవారు, మగవాళ్ళతో నవ్వుతూ మాట్లాడే వాళ్ళు, జీన్స్, స్కర్ట్ లు వేసుకునేవాళ్ళు. కోర్ట్ లో గనక ఆ అమ్మాయిలు అలాంటి వారు అని నిరూపించ గలిగితే, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని, డబ్బుల దగ్గర తేడాలొచ్చి వాళ్ళల్లో వొక అమ్మాయి హత్యా ప్రయత్నం చేసిందని నిరూపించడం తేలికవుతుంది.

వొక స్త్రీ ఆమె భార్య కావచ్చు, వ్యభిచారి కావచ్చు, ప్రియురాలు కావచ్చు, యెవరైనా కావచ్చు, ఆమె వద్దన్న తర్వాత ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేదాన్ని అత్యాచారంగానే గుర్తించాలి. ఆమె “వద్దు” (నో) అంటే ఆ మాటకు వొక్కటే అర్థం. అది మగవాళ్ళంతా అర్థం చేసుకోవాలి.

ఇవీ దీపక్ కేసులో తన వాదన ముగించాక చెప్పే చివరి మాటలు.

ఈ సినిమా యే విషయం చెప్పదలచుకుంటున్నది అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా మంచి చిత్రం. అందరి నటనా (ముఖ్యంగా అమ్మాయిలది) చాలా చక్కగా వుంది. అనిరుద్ధ రాయ్ చౌధరి దర్శకత్వం కూడా చెప్పదలచిన విషయం వైపుకు కథను నడిపిస్తుంది. చూసే వారిని కట్టి పడేస్తుంది కథనం. మగవారి ఆలోచనల్లో మార్పు తేగలిగితే సినిమా విజయం సాధించినట్టే.

 

కాని కొన్ని విషయాలు వున్నాయి. దీపక్ వొక bipolar disorder తో బాధపడుతున్న వ్యక్తి. అలాంటి వాళ్ళు శరీరంలో హార్మోన్లు యెక్కువైనా, తక్కువైనా అకారణంగానే చాలా దుక్ఖంలో కూరుకుపోవడమో, కారణంలేకుండానే చాలా ఉత్సాహంగా వుండడమో చేస్తారు. అలాంటి వ్యక్తికే స్పష్టంగా అర్థం అవుతున్న విషయం, ఆరోగ్యంగా వున్న సమాజానికి యెందుకు అర్థం కాదు? వాతావరణ కాలుష్యానికి అలవాటు పడిపోయిన మనుషుల మధ్య దీపక్ మాత్రం మాస్క్ తొడుక్కునే బయటకు వెళ్తాడు. యేదో అనారోగ్యంతో బాధ పడుతున్న భార్యను ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ, వొక బాధ్యతగల భర్తగా సేవలు చేస్తుంటాడు. ఈ సందర్భం వచ్చినప్పుడు ఈ అమ్మాయిలకు న్యాయం జరగాలని వాళ్ళ తరపున కేసు వాదిస్తాడు. పితృస్వామ్యంలో ఆ అమ్మాయిలకు జరిగిన అన్యాయానికి ఇతను పితృ స్థానంలో నిలబడి సరి చేయాలనుకుంటాడు.

సినిమాలో ముగ్గురు అమ్మాయిలూ వొక రకంగా వొంటరే. వాళ్ళ ఇళ్ళ నుంచి ఈ కష్టకాలంలో తోడుగా నిలబడటానికి యెవరూ వుండరు. ఫలక్ ప్రేమిస్తున్న మనిషి కూడా ఆమెకు సపోర్టివ్వడు. తమ పనులేవో చూసుకుంటూ, తమ కాళ్ళ మీద నిలబడ్డ ఈ ముగ్గురు అమ్మాయిలూ చాలా ధైర్యం కనబరుస్తారు. కోర్ట్ లో మాత్రం బేల అయి పోతారు. యెలాంటి ధైర్యవంతులైన స్త్రీలనైనా మెడలు వంచి నిస్సహాయ పరిస్థితుల్లోకి నొక్కేసే బలమూ, తెలివి తేటలూ  వున్న వ్యవస్థ అది.

శత్రువు దుర్మార్గుడే కాదు, తెలివైనవాడు కూడా.  కోర్ట్ సీన్ లో రాజవీర్ తన సహజ స్వభావం బయటపడేలా మాట్లాడటంతో కేసు తేలిపోతుంది. ఎమోషనల్ గా కాకుండా తెలివిగా ప్రవర్తించి వుంటే కేసు ఇంత తేలికగా గెలిచేపనేనా? వాస్తవానికి అత్యాచారాల కేసులలో చాలా మటుకు తగినన్ని సాక్ష్యాధారాలు లేవనో, లేదా వేరే కారణాల వల్లనో కొట్టివేయబడుతున్నాయి.

masaan

యెందుకో 2015లో వచ్చిన సినిమా “మసాన్” గుర్తుకొస్తున్నది.

వారణాసి గంగా నదీ తీరం. సంస్కృత పండితుడు సంజయ్ మిశ్రా నదీ తీరంలో (శ్రాద్ధ కర్మలు అవీ చేసుకునేవాళ్ళకి అవసరమయ్యే సరంజామా అమ్మే) వొక దుకాణం నడుపుతుంటాడు. అతని కూతురు రిచా చడ్డా చదువుకుంటూ పార్ట్ టైం పని చేస్తుంటుంది. అదే నదీ తీరంలో శవాలను తగలబెట్టే కుటుంబంలో విక్కీ కౌశల్ అనే కుర్రాడు ఎంజినీరింగు చదువుతుంటాడు. ఇంటిదగ్గర వున్నప్పుడు తండ్రికి శవాలు తగలబెట్టే పనిలో సాయ పడుతుంటాడు.

సినిమా ఈ రెండు కుటుంబాల కథ. రిచా చడ్డా వొక అబ్బాయిని ఇష్టపడుతుంది. వొక రోజు వాళ్ళిద్దరూ చాటుగా వొక లాడ్జిలో గది తీసుకుని మోహాల మైకంలో తేలిపోతున్న వేళ పోలీసులు రైడ్ చేస్తారు. పోలీసులు అమ్మాయి ఫొటొని మొబైల్ లో తీస్తారు. అబ్బాయి మాత్రం గిలగిల లాడి పోతాడు. పరువు పోతుందని బహయం, తండ్రి భయం. వదిలి పెట్టమని ప్రాధేయపడతాడు. యెంతో కొంత తీసుకుని వదిలి వేయ మంటాడు. ఇలా చిక్కిన గొర్రెలను అంత తేలికగా వదిలిపెడతారా పోలీసులు? పిరికివాడైన అబ్బాయి సందు దొరకగానే విడిపించుకొని బాత్రూం లో దూరి తలుపు వేసుకుంటాడు. తర్వాత నిస్సహాయంగా తన చేతిని మణికట్టు దగ్గర కోసుకుంటాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు గాని బతకడు. అలా ఇద్దరు చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మయి వొక్కతే బలిపశువు అయ్యింది.

నువ్వు లాడ్జికి యెందుకు వెళ్ళావు అని పోలీసు అడిగితే ఆమె “కుతూహలం” కారణంగా చెబుతుందే తప్ప యెలాంతి సిగ్గు, అపరాధ భావన వ్యక్త పరచదు. వాళ్ళ నాన్న అడిగినా అదే జవాబు. abettment to suicide నుంచి ఆమెను తప్పించాలంటే మూడు లక్షలు రెండు నెలల్లో చెల్లించే వొప్పందం ఆ పోలీసు, ఆమె తండ్రి మధ్య. ఫిక్స్ దిపాజిట్ లో  దాచుకున్న లక్ష మొదటి వాయిదాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా డబ్బు యెలా సమకూరాలా అన్నది వాళ్ళకు పట్టిన శని. ఆమెకు కొన్ని అదనపు సమస్యలు. “నువ్వు వాడితో పడుకున్నావుగా, నాతో పడుకోవడానికేం”, అని వేధించే వాళ్ళు. 12000 వచ్చె వుద్యోగం వూడతం, వేరే వుద్యోగంలో కుదురుకుంటే 5500 మాత్రమే రావడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా సూక్ష్మంగా చూపిస్తాడు దర్శకుడు నీరజ్ ఘైవాన్ (ఇది ఇతని మొదటి చిత్రం).

మరోపక్క తక్కువ కులానికి చెందిన విక్కీ, అగ్ర కులానికి చెందిన అమ్మాయి శ్వెతా త్రిపాఠి ప్రేమించుకుంటారు. అతని కులం తెలిసిన తర్వాత కూడా అతన్నే చేసుకుంటానని, అవసరమైతే లేచి వస్తానని, పెళ్ళి అయ్యాక పెద్దవాళ్ళు నెమ్మదిగా చల్లబడతారనీ అంటుంది. కాని దానికి ముందే ఆమె వొక బస్సు ప్రమాదంలో మరణిస్తుంది.  ఆమె శవాన్ని అతనే దహనం చేయాల్సి వస్తుంది.

ఈ రెండు జంటలూ చాలా నిజాయితీ గా, స్వచ్చంగా, అమాయకంగా, నిర్మలంగా వుంటాయి. అమ్మాయిల విషయానికి వస్తే ఇద్దరూ చాలా ధైర్యన్ని కనబరుస్తారు. రిచా చడ్డా తన బాడీ లాంగ్వేజ్ తో (నిటారు గా నిలబడే/కూర్చునే/నదిచే తీరు; సిగ్గు/అపరాధభావనా లేశమాత్రమైనా కనబడని తీక్షణ కళ్ళు, తడబాటు లేని సూటిగా వచ్చే మాటలు; తన మీద తనకున్న నమ్మకం). పోతే శ్వేతా త్రిపాఠి కవిత్వన్ని ప్రేమించే సున్నిత మనస్కురాలు. కాని తమ మధ్య వున్న కులపు అడ్డుగోడల గురించి తెలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయం అవసరమైతే పారిపోయి అయినా వివాహం చేసుకోవాలి, పెద్దవాళ్ళని నెమ్మదిగా వొప్పించవచ్చు.

రోజూ యెన్నో శవాలు తగలబడుతుండే ఆ భూమికలోనే ఈ రెండు ప్రణయ గాథలు. (మసాన్ అంటే స్మశానం).

ఈ రెండు సినిమాలు పోల్చింది కూడా ఈ స్త్రీల ధైర్య-సాహసాలకి, ఆత్మ విశ్వాసానికి, ఆత్మ గౌరవానికీ.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

యెందుకో 2015లో వచ్చిన సినిమా “మసాన్” గుర్తుకొస్తున్నది.

 

వారణాసి గంగా నదీ తీరం. సంస్కృత పండితుడు సంజయ్ మిశ్రా నదీ తీరంలో (శ్రాద్ధ కర్మలు అవీ చేసుకునేవాళ్ళకి అవసరమయ్యే సరంజామా అమ్మే) వొక దుకాణం నడుపుతుంటాడు. అతని కూతురు రిచా చడ్డా చదువుకుంటూ పార్ట్ టైం పని చేస్తుంటుంది. అదే నదీ తీరంలో శవాలను తగలబెట్టే కుటుంబంలో విక్కీ కౌశల్ అనే కుర్రాడు ఎంజినీరింగు చదువుతుంటాడు. ఇంటిదగ్గర వున్నప్పుడు తండ్రికి శవాలు తగలబెట్టే పనిలో సాయ పడుతుంటాడు.

 

సినిమా ఈ రెండు కుటుంబాల కథ. రిచా చడ్డా వొక అబ్బాయిని ఇష్టపడుతుంది. వొక రోజు వాళ్ళిద్దరూ చాటుగా వొక లాడ్జిలో గది తీసుకుని మోహాల మైకంలో తేలిపోతున్న వేళ పోలీసులు రైడ్ చేస్తారు. పోలీసులు అమ్మాయి ఫొటొని మొబైల్ లో తీస్తారు. అబ్బాయి మాత్రం గిలగిల లాడి పోతాడు. పరువు పోతుందని బహయం, తండ్రి భయం. వదిలి పెట్టమని ప్రాధేయపడతాడు. యెంతో కొంత తీసుకుని వదిలి వేయ మంటాడు. ఇలా చిక్కిన గొర్రెలను అంత తేలికగా వదిలిపెడతారా పోలీసులు? పిరికివాడైన అబ్బాయి సందు దొరకగానే విడిపించుకొని బాత్రూం లో దూరి తలుపు వేసుకుంటాడు. తర్వాత నిస్సహాయంగా తన చేతిని మణికట్టు దగ్గర కోసుకుంటాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు గాని బతకడు. అలా ఇద్దరు చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మయి వొక్కతే బలిపశువు అయ్యింది.

 

నువ్వు లాడ్జికి యెందుకు వెళ్ళావు అని పోలీసు అడిగితే ఆమె “కుతూహలం” కారణంగా చెబుతుందే తప్ప యెలాంతి సిగ్గు, అపరాధ భావన వ్యక్త పరచదు. వాళ్ళ నాన్న అడిగినా అదే జవాబు. abettment to suicide నుంచి ఆమెను తప్పించాలంటే మూడు లక్షలు రెండు నెలల్లో చెల్లించే వొప్పందం ఆ పోలీసు, ఆమె తండ్రి మధ్య. ఫిక్స్ దిపాజిట్ లో  దాచుకున్న లక్ష మొదటి వాయిదాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా డబ్బు యెలా సమకూరాలా అన్నది వాళ్ళకు పట్టిన శని. ఆమెకు కొన్ని అదనపు సమస్యలు. “నువ్వు వాడితో పడుకున్నావుగా, నాతో పడుకోవడానికేం”, అని వేధించే వాళ్ళు. 12000 వచ్చె వుద్యోగం వూడతం, వేరే వుద్యోగంలో కుదురుకుంటే 5500 మాత్రమే రావడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా సూక్ష్మంగా చూపిస్తాడు దర్శకుడు నీరజ్ ఘైవాన్ (ఇది ఇతని మొదటి చిత్రం).

 

మరోపక్క తక్కువ కులానికి చెందిన విక్కీ, అగ్ర కులానికి చెందిన అమ్మాయి శ్వెతా త్రిపాఠి ప్రెమించుకుంటారు. అతని కులం తెలిసిన తర్వాత కూడా అతన్నే చేసుకుంటానని, అవసరమైతే లేచి వస్తానని, పెళ్ళి అయ్యాక పెద్దవాళ్ళు నెమ్మదిగా చల్లబడతారనీ అంటుంది. కాని దానికి ముందే ఆమె వొక బస్సు ప్రమాదంలో మరణిస్తుంది.  ఆమె శవాన్ని అతనే దహనం చేయాల్సి వస్తుంది.

 

ఈ రెండు జంటలూ చాలా నిజాయితీ గా, స్వచ్చంగా, అమాయకంగా, నిర్మలంగా వుంటాయి. అమ్మాయిల విషయానికి వస్తే ఇద్దరూ చాలా ధైర్యన్ని కనబరుస్తారు. రిచా చడ్డా తన బాడీ లాంగ్వేజ్ తో (నిటారు గా నిలబడే/కూర్చునే/నదిచే తీరు; సిగ్గు/అపరాధభావనా లేశమాత్రమైనా కనబడని తీక్షణ కళ్ళు, తడబాటు లేని సూటిగా వచ్చే మాటలు; తన మీద తనకున్న నమ్మకం). పోతే శ్వేతా త్రిపాఠి కవిత్వన్ని ప్రేమించే సున్నిత మనస్కురాలు. కాని తమ మధ్య వున్న కులపు అడ్డుగోడల గురించి తెలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయం అవసరమైతే పారిపోయి అయినా వివాహం చేసుకోవాలి, పెద్దవాళ్ళని నెమ్మదిగా వొప్పించవచ్చు.

 

రోజూ యెన్నో శవాలు తగలబడుతుండే ఆ భూమికలోనే ఈ రెండు ప్రణయ గాథలు. (మసాన్ అంటే శ్మసానం).

 

ఈ రెండు సినిమాలు పోల్చింది కూడా ఈ స్త్రీల ధైర్య-సాహసాలకి, ఆత్మ విస్వాశానికి, ఆత్మ గౌరవానికీ.

 

 

ఎల్దమొస్తవా…

 

 

ananya“ఇండియా వెళ్లావట కదా? పదిరోజుల్లో ఏం చేద్దామని వెళ్లావు? ఏం చేశావు? పోనీ చివరి రోజు ఏం చేశావు?” షాపులో కనిపించిన ఒక స్నేహితురాలు గుక్కతిప్పుకోకుండా అడిగేసింది.

సంతోషంగా లిస్ట్ చదవబోయాను, “కన్హయ్య కుమార్ ను కలిసి మా పాప తనకోసం గీసిన బొమ్మ ఇచ్చాను,  ….”

“కన్హయ్య కుమార్ ఎవరు?”

“జె ఎన్ యు లో స్టూడెంట్ లీడర్… పోనీ… రోహిత్ వేముల…”

“….”

“దళిత్…”

“అతనెవరు? ఎవరు వీళ్లంతా?”

ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోవడమంటే ….

*

విశాఖ పొలిమేరలు దాటింది కారు. రామకృష్ణ బీచికి వెళ్లకుండా ఈ ముగ్గురు తమిళులతో రావడం సరైందేనా అనుకుంటూనే ఉన్నాను. నాకు తమిళం రాదని, ఇంగ్లీషు వచ్చని తెలిసినా తమిళంలోనే మాట్లాడుకుంటున్న వాళ్లపట్ల కాసింత కోపం కూడా వచ్చేసింది.

నేను పెద్ద మాటకారిని కాదు. అయినా డ్రైవర్ భాస్కర్ ను ఏవో చిన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండిపోయాను. వాళ్ళేనా తెలీని భాష మాట్లాడుకునేది? భాస్కర్ కు ఇంగ్లీషు, తమిళం రెండూ రావు. నా తెలుగు అతనికి, తన తెలుగు నాకు అర్థమవడం కష్టంగా ఉంది. అయినా సరే, తెలుగు తెలుగే. చుట్టుపక్కల ఊర్ల గురించి, కొండల గురించి అతను చెప్పే విశేషాల గురించి నేను వాళ్లకు చెప్పను గాక చెప్పను. వాటి గురించి అతనికే సరిగ్గా తెలీదని నాకు అర్థమయిందన్న విషయం కూడా చెప్పను. ఒక కొండను ఒకసారి ఎర్రకొండ అంటాడు, అహా అది కాదు వేరేది అంటాడు. హోర్నీ. నా కలల విశాఖ ప్రయాణం ఇట్లా ముగియబోతోందా?  కృష్ణ నన్ను వీళ్లతో ఇరికించేశారే. వీళ్లు వెళ్లేచోట రామకృష్ణ బీచి కంటే చూడాల్సిన బీచి మరొకటి ఉందని అన్నారు. అది ఏదో సముద్రం ఒడ్డున ఊరు. న్యూక్లియర్ ప్లాంటు కట్టబోయే చోటు. వీళ్లకు అక్కడేం పనో ఇంకా సరిగ్గా అర్థం కావడం లేదు. ఆ ఊర్లో మమ్మల్ని కలుసుకోబోయే వాళ్లకు ఇంగ్లీషు సరిగ్గా రాకపోవచ్చని, అవసరమైతే సహాయం చెయ్యమని చెప్పారు.

విజయనగరం బోర్డు కనిపించేసరికి “విజయనగరం అంటే శ్రీకృష్ణదేవరాయలి రాజధానే కదూ?” వెనక నుంచి సుందర రాజన్ ఇంగ్లీషులో అడిగిన ప్రశ్నకు తత్తరపడ్డాను. ఒకింత కలవరపాటు కూడా. చరిత్ర పాఠాలు కళ్లముందు గిర్రున తిరిగాయి. అవుననీ, కాదనీ, హంపి కాదూ అనీ మనసంతా ఉక్కిరిబిక్కిరైంది. ఇక ఉండబట్టలేక భాస్కర్ ను అడిగాను. ఔనన్నాడు, వెంటనే కాదన్నాడు. ఆఖరికి ఔననేశాడు. ఒకసారి అతని ముఖంలో చూసి ఇక మాటమార్చడని తేల్చుకుని, నిట్టూర్చి “ఔనట” అని వెనక్కి తిరిగి అన్నాను.

భాస్కర్ వెనక ఉన్న సీట్లో కూర్చున్న అమర్తరాజ్ కొంటె నవ్వు అప్పుడప్పుడే అలవాటౌతోంది. నా వెనక ఉన్న సీట్లో కూర్చున్న సుందర రాజన్ నవ్వుతున్నాడో లేదో కనిపించలేదు. వాళ్లిద్దరి మధ్య కూర్చున్న ఉదయకుమార్ నవ్వుతున్నాడో లేదో అర్థమవడం కష్టం. ఎప్పుడూ ఒక చిర్నవ్వు ప్రశాంతమైన ఆ ముఖంలో వెలుగుతుండడం గమనించాను.

కాసేపాగి, “ఇంతకీ మీరు నిజనిర్ధారణ కమిటీకి చెందిన వాళ్లా?” అని అడిగాను. నవ్వేసి, కాదన్నాడు అమర్తరాజ్.

mamata1

అమ్మన్నాయుడు (CITU – Centre of Indian Trade Unions, a CPI(M)-affiliate), సుందర్ రాజన్, గోవింద రావు (CITU), మమత, కె. రాము (మానవహక్కుల వేదిక), ఉదయకుమార్, థవుడు (ప్రజాశక్తి జర్నలిస్టు), కె.వి. జగనాథ రావు (మానవహక్కుల వేదిక), తేజేశ్వర రావు (CITU).

 

మధ్యలో తెలుగు మిత్రులు కలుసుకున్నారు. పేర్లు చెప్పుకున్నాం. అందరి ముఖాల్లో చిర్నవ్వు. ఎప్పట్నుంచో తెలిసున్నవాళ్లలా పలకరింపులు. ఏ ఊరివాళ్లైతేనేం, ఏ రాష్ట్రం వాళ్లైతేనేం, ఏ దేశం వాళ్లైతేనేం – కలిసి పనిచెయ్యబోతున్నామని తెలిసినప్పుడు అన్ని ఎళ్లలూ చెరిగిపోతాయి.

వెళ్లాల్సిన ఊరు చేరుకోవడానికి వేరే రోడ్డు ఎక్కాలని, వాళ్ల కారు ఫాలో అవమని చెప్పారు. పొదలతో, చెట్లతో, వాటిని కలుపుతూ అల్లుకుపోయిన తీగెలతో పచ్చగా ఉంది అక్కడంతా. మధ్యలో చిన్న చిన్న పంట పొలాలు. వరి నాటుతున్న మహిళలు కనిపించారు. అక్కడక్కడ రెల్లుదబ్బులతో వేసిన గుడిసెలు, ఒక చర్చి కనిపించాయి.

చర్చి గోడమీద ఊరిపేరు, “పాతర్ల పల్లి“.

ఆ ఊరు దాటాక మళ్లీ పచ్చని చెట్లు, చిన్ని చెలకల పొలాలు. ఇంకొక ఊరు కనిపించింది. గుడిసెలు లేవు. అన్నీ పక్కా ఇళ్లే.

బడి గేటు మీద పేరు చదివాను, “పాతర్ల పల్లి“

అరే, ఈ రెండు ఊర్లకు ఒకటే పేరా?

కాదు. ఇవి రెండు ఊర్లు కాదు. ఒకటే ఊరు. ఇందాక చూసింది వెలివాడ.

నేను ఆశ్చర్యపోతుంటే, “అన్ని ఊర్లు ఇట్లనే ఉంటయ్ కద మేడమ్” అన్నాడు భాస్కర్.

“మా వైపు కూడా ఇట్లాగే ఉంటాయి.” అదేం కొత్త విషయం కాదన్నట్లు చెప్పాడు ఉదయకుమార్.

“మా కర్నూల్ వైపు ఇట్లా ఉండవు. అన్ని కులాలు, మతాలు కలగలిసిపోయి ఉండవు కానీ, ఒక వాడ తరువాత ఒకటి, ఆనుకునే ఉంటాయి. మాలమాదిగ వాళ్ల వాడలు కూడా” అనేసి చిన్నప్పుడు, పదేళ్లు, పెరిగిన మా ఊరిని గుర్తు చేసుకున్నాను.

హఠాత్తుగా, రెడ్ల ఇళ్లకు మాల వాడకు మధ్య కల్లాలు గుర్తొచ్చాయి. ఊరిమధ్యలో అవెందుకు అని ఎప్పుడూ అనిపించలేదు. ఎంత దారుణం!! చిన్ననాటి స్నేహితురాలు రంగమ్మ గుర్తొచ్చింది. ఆ కల్లాల్లో తెగ ఆడుకునేవాళ్లం. చీకటవగానే తనొక వైపు, నేనొక వైపు వెళ్లిపోవడం గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ విషయం ఇంతవరకు ఎందుకు తట్టలేదు? తట్టినా ఏం చేసేదాన్ని? నా చేతులతో మంచినీళ్ల గ్లాసెత్తి దోసిట్లోకి నీళ్లు వంపినదాన్నే కాదూ? అదెప్పుడో చిన్నతనంలో ఐతేనేం? ప్రశ్నించలేని అధైర్యాన్ని పక్కన పెడితే, అసలు ప్రశ్నే ఎప్పుడో గాని రాలేదు. ఆ గిల్ట్ ఎప్పటికీ పోనిది.

“న్యూక్లియర్ ప్లాంట్ వస్తే చానా ఉద్యోగాలొస్తయంట కద మేడమ్?” భాస్కర్ అడిగిన ప్రశ్నతో కొంచెం సర్దుకున్నాను.

“వస్తాయి కానీ ఊరివాళ్లకు కూలి పనుల లాంటివే ఉంటాయి. స్వంతంగా వాళ్లు చేసుకుంటున్న పనులు మానుకుని కూలీ పని ఎందుకు చెయ్యాలి? ఆ పనీ అయిపోయాక సిటీలకు వలసపోవాల్సిందే.” అతనికి అర్థమయ్యే విషయాలు చెప్పాను.

మధ్యలో ఒకచోట కార్లు ఆపి న్యూక్లియర్ పవర్ పార్క్ ప్రపోజ్డ్ సైట్ అంటూ చూపించారు శ్రీకాకుళం మిత్రులు. అంత పచ్చదనం, ప్రశాంతత ఇంకెక్కడా ఉండదేమో అన్నట్లుంది ఆ ప్రదేశం. అట్లాంటి చోట పొగలు కక్కే బ్రహ్మాండమైన రియాక్టర్లను ఊహించలేకపోతున్నాను.

“ఈ ప్రదేశం ఏ ఎర్త్ క్వేక్ జోన్ కిందకి వస్తుంది?” తెలుగు మిత్రులను అడిగాడు సుందర రాజన్.

అనుకోని ప్రశ్న ఎదురైనట్లుంది వాళ్లకు. కాసేపు ఆలోచించి, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి, “నాలుగు అనుకుంటా” ఒకరు అన్నారు. కాదనిపిస్తోంది. ఉన్నదే ఐదు జోన్లు. ఎంత దురాశపరులైనా, అలక్ష్యంగా ఉన్నా మరీ నాలుగో జోన్లో ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోరనిపిస్తోంది. ఏమో ఎవరు చెప్పోచ్చారు. రాజధాని, అమరావతి, వెట్ ల్యాండ్స్ మీద కడుతున్నప్పుడు.

కొన్ని నిమిషాలు అక్కడ గడిపి కొవ్వాడలో జనాలతో మాట్లాడదామని బయల్దేరాం. అప్పటిదాకా ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్న ముగ్గురు తమిళులు సీరియస్ అయ్యారు.

దార్లో, “ఇక్కడ భూకంపాలు వస్తాయా?” అని భాస్కర్ ను అడిగాను.

“2014 లో భూమి కొంచెం కదిలింది మేడమ్. పెద్దది కాదు. ఏం నష్టం జరగలేదు.” భాస్కర్ చెప్పిన విషయాన్ని వాళ్లకు చెప్పాను.

కొవ్వాడ చేరుకునే ముందే సముద్రం కనిపించింది. బీచ్ ని ఆనుకుని ఊరు. చేపలు పట్టడం వాళ్ల వృత్తి అని విన్నాను. కానీ పడవలేవీ కనిపించలేదు. కొంతమంది ఆడవాళ్లు బీచిలో వలలాంటిది ఏదో తయారు చేస్తున్నారు. ఊరికి, బీచికి మధ్య ఒక అరుగు మీద కొంతమంది యువకులు పేకాట ఆడుకుంటున్నారు.

“పనులేం లేవు. ఇంకేం చేస్తారు?” ఎవరో అన్నారు. పనులు లేకపోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు.

నా సందేహం నా ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించినట్లుంది. “వీళ్లు మత్స్యకారులు మేడమ్. ఇప్పుడు చేపలు లేక సముద్రం లోకి వెళ్లటం లేదు.”

“చేపలు లేకపోవడం ఏమిటీ?” చాలా విచిత్రంగా అనిపించింది నాకు.

“చుట్టుపక్కల ఉన్న ఫార్మాసూటికల్ ప్లాంట్ల నుంచి వచ్చే టాక్సిక్ వేస్ట్ అంతా ఇక్కడికే వస్తుంది మేడమ్. కొన్నేళ్ల నుంచి ఈ చుట్టుపక్కల చాలా దూరం వరకు చేపలు లేవు. ఇంతకుముందు చేపలు పట్టలేనోళ్లు, వలలు తయారు చేసుకునేవాళ్లు. ఇప్పుడు హ్యామక్లు ఎక్కువగా తయారు చేస్తున్నారు. అవన్నీ గుజరాత్, మహారాష్టృ లాంటి చోట్ల అమ్ముకుంటారు.”

గొంతులో ఏదో అడ్డంపడ్డట్లైంది. ఇస్మత్ చుగ్తాయ్ ప్రస్తావించే ముళ్ల బంతి!

ఇంతలో అక్కడ కొంతమంది కుర్రవాళ్లు గుమిగూడారు.

“ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని రానిస్తారా?” అని అడగమన్నాడు సుందర రాజన్.

అందరికంటే ముందు నిలబడ్డ ఒక అబ్బాయి, “రానివ్వం!” ధీమాగా, కోపంగా అన్నాడు. ఆ అబ్బాయికి పదహారు, పదిహేడేళ్లు ఉంటాయేమో. తీక్షణమైన ఆ అబ్బాయి చూపు ఇక జీవితాంతం నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది.

మెట్లెక్కి ఆ అరుగుమీద కూర్చున్నాం. మాముందు ఊరి యువకులు. అమర్తరాజ్ మాతో కూర్చోలేదు. కాసేపు అందరి ఫోటోలు తీసి వెళ్లిపోయాడు. భాష రాని చోట ఒక్కడు అట్లా వెళ్లిపోతే ఎట్లా? పోనీ, చిన్నపిల్లవాడా ఏమన్న. సముద్రం ఫోటోలు తీస్తున్నాడేమో.

ఊరి వాళ్లు మాట్లాడేముందు సుందర్ రాజన్ను, ఉదయకుమారన్ను పరిచయం చేసుకోమన్నారు తెలుగు మిత్రుల్లో ఒకరు. ఇంగ్లీషులో అతను చెప్పేది నన్ను తెలుగులో చెప్పమన్నారు. అప్పటికప్పుడు చెప్పే మాటలను తర్జుమా ఎప్పుడూ చెయ్యలేదు. అయినా, ‘సరే’ అనేశాను.

సుందర్ రాజన్, ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ అనే సంస్థ నుంచి వచ్చాడని, అంటే భూమి మిత్రులు అని అర్థమని వివరించాను. న్యుక్లియర్ పవర్ ప్లాంట్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటున్నాడు. తమిళనాడులోని కూడంకుళం అనే ఊర్లో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ మధ్యే ఫుకొషిమా వెళ్లొచ్చాడు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వల్ల ఒరిగే లాభాల కన్నా, జరిగే నష్టలే ఎక్కువ అని, క్యాన్సర్ లాంటి అనారోగ్యాల బారిన పడతారని చెప్పాడు. ప్రభుత్వం ప్రజల తరుపున ఆలోచించడం లేదని చెప్పాడు.

కూడంకుళం అన్న పేరు నోరు తిరగలేదు. కూడబలుక్కుంటూ ఆ ఊరి పేరుని పలికినప్పుడు, సుందర రాజన్ శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని వేరేవాళ్లకు తెలియకపోయినా పక్కనే కూర్చున్న నాకు తెలిసిపోయింది. నేను ఎప్పుడూ వినివుండని ఆ ఊరు అతనకి చాలా ముఖ్యమైందని అర్థమయింది.

ఫుకొషిమాలో, పవర్ ప్లాంటుకు 35 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్లందరినీ వేరే చోట్లకు వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఒక పాల వ్యాపారి గురించి చెప్పాడు. ఆ వ్యాపారికి సోకిన రేడియేషన్ ను ట్రీట్ చెయ్యగలరు కానీ అతని ఆవులను రక్షించలేమని చెప్పారట. వాటికి రేడియేషన్ సోకడం వలన, అవి ఇచ్చే పాలు ఎవరూ తాగకూడదు. వాటి మాంసం కూడా ఎవరూ తినకూడదు. 75 ఆవులను చంపేసి, ఆ స్థలాన్ని వదిలి వెళ్లిపోవలసి వచ్చిందని చెప్పాడు. భోపాల్ దుర్ఘటను గుర్తు చేసి, కొన్ని వేల మంది మరణించినా, గాయాలపాలైనా సి.యి.వో వారెన్ ఆండెర్సన్ కు ఎలాంటి శిక్ష పడకుండా భారత, అమెరికా ప్రభుత్వాలు అడ్డుకున్నాయని, కొవ్వాడలో ప్రమాదం జరిగితే సామాన్య జనం తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందనే నమ్మకం పెట్టుకోకూడదని చెప్పాడు.

తరువాత ఉదయకుమార్ మాట్లాడాడు. తాము అభివృధికి ఆటంకం కాదని, ఏ విదేశీ సంస్థకు పని చెయ్యటం లేదని, శాంతియుతమార్గాల ద్వారానే పోరాటం చెయ్యాలనుకుంటున్నామని చెప్పాడు. కొవ్వాడ, చుట్టుపక్కల ఊర్లలోని ప్రజలు చేస్తున్న, చెయ్యబోయే పోరాటాలకు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని చెప్పాడు. టెస్టు చెయ్యని రియాక్టర్లను కొవ్వాడలో వాడబోతున్నారని, ప్రమాదం జరగడానికి చాల ఎక్కువ అవకాశం ఉందని చెప్పాడు. ఫుకోషిమా ప్రమాదం తరువాత ఎన్నో దేశాలు అణురియాక్టర్లు నిలిపివేయడమో, చాలావాటిని మూసివేయడమో చేశాయని, మరి భారత ప్రభుత్వం కొవ్వాడలో ఎందుకు కొత్తగా అణురియాక్టర్లను నిర్మించాలనుకుంటున్నాయో ప్రశ్నించాలని అన్నాడు. ప్రభుత్వాన్ని గాని, ఏ రాజకీయ పార్టీని గాని నమ్మకుండా ప్రజలు తమ పోరాటం తాము చెయ్యాల్సి ఉంటుందని చెప్పాడు.

పక్కన కొంతమంది విలేఖరులు కూడా ఉన్నారు. ఒకతను తను స్పెషల్ బ్రాంచ్ నుంచి అని అన్నాడు. ఉదయకుమార్ కొంచెం ఆశ్చర్యపోయాడు, “ఓ స్పెషల్ బ్రాంచి నుంచా?” అని చిర్నవ్వు నవ్వాడు. అతనూ నవ్వాడు.

వాళ్లు చెప్పినమాటలైతే ఇంగ్లీషులోంచి తెలుగులో చాలావరకు తర్జుమా చేస్తున్నాను. వాళ్లు చెప్పేవి జీర్ణించుకోలేకపోతున్నాను. ఆలోచనల్లో పడి, అన్ని విషయాలు తిరిగి చెప్పలేకపోతున్నాను. తెలుగు మిత్రులు అందుకుని తర్జుమా చేశారు. సమయం గడుస్తున్న కొద్దీ మా చుట్టూ ఉన్న జనం మారుతున్నారు. ముందు కూర్చున్న యువకులు మాత్రం కదలటం లేదు. శ్రద్ధగా వింటున్నారు. మధ్య మధ్యలో “మీరేం చేస్తారు?” అని ప్రశ్నిస్తే “ఈ ఊరు నుంచి వెళ్లం. ఇది మా ఊరు. కొట్లాడ్తాం” అని గట్టిగా చెప్తున్నారు.

ఇంతలో పక్కనుంచి ఒక యువకుడు అరిచాడు, “ఎవరెవరో వస్తారు, ఏదో చెప్పి పోతారు. మా నాయకులే ఇప్పుడు మాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకే పోరాడుతాం? మా భూమిని ఇచ్చెయ్యక ఏం చేస్తాం?” అతని మాటలను ఇంగ్లీషులోకి తర్జుమా చేశాను.

ఒక పెద్దాయన ప్లాస్టిక్ తాళ్లతో బుట్టల్లాంటివి చేస్తున్నాడు. పళ్లు, కూరగాయలు పెట్టుకోవడానికి అని చెప్పాడు. వలలు చెయ్యడం కాకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారని చెప్పారు గుంపులో ఒకరు. తిండికోసం ఏ తిప్పలైనా పడాలి కదా అని అన్నాడు ఆ పెద్దాయన.

“సరే పవర్ ప్లాంటు వస్తే, ఏదైనా ప్రమాదం జరిగితే మాకేం, రేపో మాపో పోయే ముసలోళ్లకు” అని అనేశాడు.

ఆయన పక్కన ఇంకో పెద్దాయన వళ్లో కూర్చున్న పసిపిల్లవాడు నావైపు అమాయకంగా చూస్తున్నాడు.

“మీ సంగతి సరే, మరి మీ పిల్లల సంగతి? వాళ్ల పిల్లల సంగతి మీకు అఖర్లేదా? ఆ పిల్లాడి సంగతి?” అని అడిగాను. ఆయన క్షణకాలం నా ముఖంలోకి చూశాడు.

ఇక ఒకరి మాటలను ఒకరు మింగేస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు ఊరి వాళ్లు. గొడవగా తయారయ్యింది అక్కడంతా. అంత గడబిడలోనూ ఎవరూ ఇదొక ఆట అన్నట్లో, కాలక్షేపం కోసం అన్నట్లో మాట్లాడటం లేదు. అయినా, ఇట్లా కాదు. ఎవరన్నా మధ్యవర్తిత్వం చేస్తే బాగుండుననిపించింది.

“ఊరి సర్పంచ్ తో మాట్లాడడం కుదరదా?” అని అక్కడున్నవాళ్లను అడిగాను.

“ఊర్లో లేడు. ఉన్నా ఏం లాభం. ఆయన ప్రభుత్వం వైపే ఉన్నాడు. వీళ్లు వస్తున్నారని తెలిసి పక్క ఊరికి వెళ్లిపోయాడు.” నాకు ఆశ్చర్యమేసింది. వీళ్లను చూడగానే తెలుగు కార్యకర్తల ముఖాలు వెలిగిపోవడం హఠాత్తుగా గుర్తొచ్చింది. వాళ్లవైపు చూశాను. ముఖంలో ఏ భావమూ లేకపోయినా ఈ విషయం పట్ల దృఢమైన నిబద్ధతో ఉన్నట్లు తెలిసిపోతోంది. ఈ తమిళులు సామాన్యులు కాదని ఒక్కసారిగా అనిపించింది.

“ఊర్లోకి వెళ్లొద్దాం పదండి” అన్నారెవరో.

బీచికి ఆనుకుని ఉన్న ఇంటివైపు వెళ్లాం. ఒకరిద్దరు ఆడవాళ్లు మాట్లాడారు. వాళ్లకు మావి కొత్తముఖాలే కానీ మాలాంటి వాళ్లను ఇంతకుముందు చూసి, ఆశపడి, నిరాశపడిన అనుభవాలున్నట్లున్నాయి. ఒకింత నిర్లక్ష్యం, ఒకింత ‘మీరేమైనా చెయ్యగలరా’ అనే మిణుకుమనే ఆశ వాళ్ల ముఖాల్లో. ఆ ఇంట్లోనే ఒకతను కొంచెం ఎక్కువ సమాచారం ఇచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు తెలుగుదేశం తమ పోరాటానికి మద్ధతునిచ్చిందని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తమకు వ్యతిరేకంగా, అణురియాక్టర్లను ఇంకా త్వరగా కట్టాలని ప్రయత్నిస్తోందని చెప్పాడు. అతనితో కాసేపు మాట్లాడి వచ్చేశాం. ఇంతవరకు ఒక యువకుడు, ఆ పెద్దాయన తప్ప అందరూ పోరాడుతామనే చెప్తున్నారు.

కొంతమంది విలేఖర్లు ఉదయకుమార్ ను వీడియో స్టేట్మెంట్ ఇవ్వమన్నారు. కొంచెం దూరంగా నిలబడ్డ నన్ను వీడియోలో వచ్చేట్లో ఉదయకుమార్ పక్కన నిలబడమని చెప్పారు. మధ్యలో నేనేందుకు అనుకుని ‘పర్వాలేదులెండి’ అంటూ దూరంగానే నిలబడ్డాను.

“డోంట్ బి అఫ్రైడ్ మమదా!” అని అన్నాడు ఉదయకుమార్. ఆ పిలుపుకి నాకు నవ్వొచ్చింది. “హౌ క్యూట్!” మనసులోనే అనుకున్నా.

అవునూ ఇంతకీ భయపడొద్దు అంటున్నారెందుకు? ఇక్కడ భయపడాల్సింది ఏముంది? న్యూస్ వీడియోలోకి రావాలంటే భయపడేదానిలా కనిపిస్తున్నానా?

వీళ్ల స్టేట్మేంట్లు తీసుకోవడం, వీళ్లు వస్తారని సర్పంచ్ ఊర్లో లేకపోవడం, ముగ్గురు నలుగురు విలేఖరులు వీళ్ల మాటలను శ్రద్ధగా నోట్ చేసుకోవడం చూస్తుంటే ఆషామాషీ వ్యవహారంలా కనిపించడం లేదు. ఇంతకీ భయపడొద్దని ఎందుకు అన్నాడు?

ఎప్పుడు వచ్చాడో అమర్తరాజన్ మా గుంపులో చేరాడు. ఇక అందరం బయల్దేరాం. చిన్న ఊర్లు దాటుకుని ఘాట్ రోడ్డు ఎక్కాం. అందరం అక్కడ టీ తాగి, శ్రీకాకుళం మిత్రుల దగ్గర సెలవు తీసుకుని విశాఖ బయల్దేరాం.

సముద్రం పక్కగా భీమునిపట్నం వైపు కారు పోనిచ్చాడు భాస్కర్.

వెనక కూర్చుని ముగ్గురూ మళ్లీ తమిళంలో మాటలు మొదలు పెట్టారు. పెద్దగా నవ్వులు కూడా.

భాస్కర్ తో ఊరికే మాటలు పెట్టుకోవాలనిపించలేదు. ఏదో ఒకలా వాళ్లనే మాట్లాడించాలనిపించింది.

కాసేపు లాటిన్ అమెరికన్ పోయెట్రీ గురించి, బొలీవియా గురించి మాట్లాడుకున్నాం. కొవ్వాడకు రావడం ఇది మూడోసారి అని చెప్పాడు అమర్తరాజ్. హ్మ్! ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తారాండీ?

మధ్యలో కూర్చున్న ఉదయకుమార్ ను అడిగాను, “మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూశాను. పోయిన ఏడాది డిసెంబర్లో హంపిలో జరిగిన రెవొల్యూషనరీ కల్చరల్ ఫారమ్ కి వచ్చారా? ప్రొఫెసర్ భగవన్ వచ్చారక్కడికి. మనసయ్య గారు కూడా ఉన్నారు. మిమ్మల్ని వాళ్ల పక్కన చూసినట్లు అనిపిస్తోంది.”

“కల్చరల్ ఫారమ్ దగ్గర ఉదయకుమారనా?” అని పెద్దగా నవ్వాడు అమర్తరాజ్. ఇతనికి నవ్వడం, నవ్వించడం, ఫోటోలు తియ్యడం మాత్రమే వచ్చినట్లుంది. ఇంతవరకు ఫోన్తోనే ఫోటోలు తియ్యడం చూశాను. ఆ పెద్ద కెమెరా బ్యాగ్ ఎందుకు మోస్తున్నట్లో.

“ప్రొఫెసర్ భగవన్ తో ఒకసారి స్టేజి షేర్ చేసుకున్నా కానీ హంపిలో కాదు.” వివరించాడు ఉదయకుమార్.

“హ్మ్. మరి ఎక్కడ చూసానో?”

“ఈయన చాలా ఫేమస్. ఈయన మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా?” అమర్తరాజ్ నవ్వుతూ అడిగాడు.

కేసులా? ఇంత ఫ్రీగా, హాయిగా తిరుగుతున్నారు ఈయన మీద కేసులా? టీజ్ చేస్తున్నాడు ఈ అమర్తరాజ్.

“30?” తోచిన నంబరు చెప్పాను.

“హా…” పెదవి విరిచాడు అమర్తరాజ్. ఉదయకుమార్ ఒకటే నవ్వు. (మల్లెపువ్వు నవ్వు. నిజ్జం. మల్లెపువ్వులే! అట్లాంటి నవ్వును ఇంతవరకు ఎవరి ముఖంలోనూ చూడలేదు… నా చిట్టితల్లి ముఖంలో తప్ప.)

మరీ పెద్ద నంబరు చెప్పానేమో? “3?”

“380!” అమర్తరాజ్ సీరియస్ గానే అన్నా అతని ముఖంలో దాగని నవ్వు. ఉదయకుమార్ మళ్లీ గట్టిగా నవ్వాడు.

“వాటిలో 20, సెడిషన్ కేసులు” అమర్తరాజ్ మళ్లీ అన్నాడు, “మాకేమో ఈయన అపర గాంధీ. పోలీసులేమో ఈయన వెనకాలే ఉంటారు.”

“ఈరోజు పోలీసులేం రాలేదు కదా?” వీళ్లు జోకులేస్తున్నారో సీరియస్ గా ఉన్నారో అర్థం కావట్లేదు.

“ఒకతను స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చానన్నాడు కదా?” ఆశ్చర్యంగా అన్నాడు అమర్తరాజ్, “అంటే పోలీసు డిపార్ట్మెంట్ అని తెలీదా?”

“ఓహ్. లేదు. భయపడొద్దని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమయింది. నేను డేంజరస్ మనుషుల్తో ఉన్నానన్నమాట.” నవ్వుతూ అన్నాను.

“ఓహ్ మేం చాలా డేంజరస్” ముగ్గురూ నవ్వారు.

మాటల మధ్యలో అమర్తరాజన్,”మేం మాట్లాడే ఇంగ్లీష్ తెలుగులోకి ఇంటర్ ప్రిట్ చెయ్యడానికి మిమ్మల్ని కృష్ణ అరేంజ్ చేశాడనకున్నాం” అని అన్నాడు.

ఒహ్హో, నేను కూడా వీళ్లకు సర్ప్రైజే అన్నమాట. ఉత్సాహంగా చెప్పాను,“లేదు, లేదు. విశాఖకు వేరే పని మీద వచ్చాను. కృష్ణ, న్యూక్లియర్ ప్లాంట్ గురించి చెప్పి, సుందర రాజన్ కొవ్వాడ వెళ్తున్నారని చెప్పారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. కొంచెం తెలుసుకుందామని మీతో వచ్చాను.”

“గుడ్” అంటూ చిర్నవ్వుతో తలపంకించాడు అమర్తరాజన్.

భీముని పట్టణం బీచి దగ్గర కాసేపు ఆగాం. మిరపకాయ బజ్జీలు అందరి కోసం కొన్నాడు సుందర రాజన్.

ఒక ఊర కుక్క అక్కడే తచ్చాడుతోంది. అందరూ దాన్ని అదిలిస్తూ ఉన్నారు. ఉదయకుమార్ తన వంతు బజ్జీలో కొంత పిండి భాగం మాత్రం చిన్ని చిన్ని ముక్కలు చేసి చిన్న పేపర్లో పెట్టి దాని ముందు పెట్టాడు, “సాపడీ, సాపడీ” అంటూ. ఏమనుకుందో, ఎంత ఆకలి మీద ఉందో ఒక్క క్షణంలో తినేసిందది.

అక్కడ్నుంచి రామకృష్ణ బీచికి బయల్దేరాం. రామకృష్ణ బీచి చూడాలన్నది హెచ్చార్కె(నాన్న) జ్ఞాపకాల్లోంచి జాలువారిన నా చిన్నినాటి కల. తీరా అక్కడికి వెళ్లాక ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. గుండె నిండా ఏదో వెళితి. హెచ్చార్కె చెప్పినట్లు లేదన్నది ఒకటైతే, గడిచిన ఆ మూడు గంటలు నన్ను నిలవనీయడం లేదు. నాకు నేను అందని దూరాలకు ఎక్కడికో కొట్టుకుపోయానని ఏదో కంగారు. ఇంటికి వెళ్దామని చెప్పాను. వాళ్లేం అనలేదు. వెంటనే బయల్దేరారు.

అప్పటికే కృష్ణ మాకోసం ఎదురు చూస్తున్నారు. కాసేపు కూర్చున్న తరువాత వేరే చోటికి వెళ్లడానికి వాళ్లదగ్గర సెలవు తీసుకున్నాను.

ఉదయకుమార్ అమెరికాలో చదువుకున్నారని, ప్రొఫెసర్ గా కూడా పని చేశారని మాటల మధ్య చెప్పడం గుర్తొచ్చింది.

“ఎప్పుడైనా న్యూ జెర్సీ వస్తే మా ఇంటికి రండి.” అని అన్నాను.

“ప్రభుత్వం తన పాస్ పోర్ట్ ను తిరిగి ఇచ్చినప్పుడు వస్తాడు.” అమర్త రాజన్ అన్నాడు.

“పీ ఎమ్ అయిపోండి, పాస్పోర్ట్ మాత్రమే ఎందుకు? వీసా ఇచ్చేస్తారు” అన్నాను. నవ్వులతోనే వీడ్కోల్లు చెప్పుకున్నాం.

వీడ్కోలైతే తీసుకున్నాను కానీ, మల్లెపువ్వుల వాన కురుస్తూనే ఉంది – వాళ్లెవరో సరిగ్గా తెలీకపోయిన ఆరోజు నించి, ఎంతో తెలుసుకున్న ఈరోజూ, ఇక ఎప్పటికీ.

mamata2

ఇంతకీ వాళ్లెవరు?

అమర్తరాజ్ స్టీఫెన్ – ఇండిపెండెంట్ ఫొటొగ్రాఫర్. ఫోటొగ్రఫీలో ఎన్నో అవార్డులు గెల్చుకున్నాడు. మచ్చుకి, కూడంకుళం పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తీసిన ఫోటోలకు క్యాచ్ లైట్స్ ఆక్టివిస్ట్ అవార్డ్ (Catchlight’s Activist Award(2014)) వచ్చింది. కూడంకుళంలో పోరాటంలో పాల్గొన్నాడు. సామాజిక కార్యకర్తగా తను రాసిన ఫోటో-వ్యాసాలు దేశ విదేశాల్లోని పత్రికలలో అచ్చవుతుంటాయి.

సుందర రాజన్ – ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ సంస్థ నుంచి. జపాన్ ఫుకొషిమా కి వెళ్లివచ్చినవారిలో ఇతనూ ఉన్నాడు. కూడంకుళంలో జరిగిన పోరాటంలో పాల్గొన్నాడు. న్యూక్లియర్ పవర్ కు వ్యతిరేకంగా పని చేస్తున్న కార్యకర్తల్లో మొదటిశ్రేణిలో ఉంటాడు.

ఎస్ పి ఉదయకుమార్ – 1980 ల్లోనే Group for Peaceful Indian Ocean అనే సంస్థను ప్రారంభించాడు. అమెరికాలో పొలిటికల్ సైన్స్ లో పి. హెచ్ డి చేసి, మాన్ మత్ యూనివర్సిటీలో(Monmouth university) ప్రొఫెసరుగా పని చేసి, 2001 లో భారత దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. South Asian Community Center for Education and Research (SACCER) అనే విద్యాసంస్థను, భార్య మీరాతో కలిసి  స్థాపించాడు. People’s Movement Against Nuclear Energy (PMNAE) అనే సంస్థకు కన్వీనర్. ఈ సంస్థ తరపున, కూడంకుళం లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించాడు. కూడంకుళం పోరాటం గురించి తమిళనాడు బయట ప్రపంచానికి తెలియజేయడమనే ముఖ్య ఉద్దేశంతో, 2014 లో పార్లమెంటరీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటీ చేశాడు. చివరికి ఆ పార్టీ కూడంకుళం పోరాటాన్ని పట్టించుకోకుండా మధ్యతరగతి ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి “పచ్చై తమిళగం” (పచ్చని తమిళనాడు) అనే పార్టీని స్థాపించాడు.  ఏ ఎన్నికలలోనూ గెలవకపోతేనేం – అసలుసిసలు ప్రజల మనిషి. కూడంకుళం పోరాటాన్ని నీరుగార్చేందుకు ఉదయకుమార్ ను ప్రభుత్వం ఎంతో వేధించింది. ఎన్నో కేసులు బనాయించింది. విదేశీ నిధులు ఉన్నాయనే నెపం మీద ఆయన ఇంటిమీద, విద్యాసంస్థ మీద రైడ్ చేసింది హోం మంత్రిత్వ శాఖ. ఆయన తన ఆస్థుల వివరాలన్నీ బయటపెట్టి, శాంతియుతంగా చేసే పోరాటాలకు, హంగర్ స్ట్రైకులు చెయ్యడానికి నిధులు అవసరం లేదని చెప్పాడు.

న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వల్ల జరిగే నష్టాలు ఫుకొషిమా దుర్ఘటన తరువాత ప్రపంచానికి తేటతెల్లమయ్యేనాటికే కూడంకుళంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొదలయ్యింది. దాన్ని ఆపటానికి చేసిన పోరాటం ఆలస్యంగా మొదలయ్యింది. పోరాటం అక్కడ ఇంకా కొనసాగుతున్నా, ఆ అనుభవాన్ని కొవ్వాడను, శ్రీకాకుళాన్ని కాపాడుకోవడానికి వినియోగించాలని కొవ్వాడకు వచ్చారు అలుపెరుగని యోధులు – మల్లెపువ్వుల నవ్వులు తోడుగా.

*

వీళ్లను కలిసేదాక కూడంకుళంలో జరిగిన పోరాటం గురించి ఏమాత్రం ఎరుక లేదు. మహా అయితే కొన్నాళ్ల తరువాత కొవ్వాడలో న్యూక్లియర్ పవర్ ప్లాంటును ఆడంబరంగా విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారని ఏ ఫేస్ బుక్కు ద్వారానో తెలిసేదేమో.

దళిత్ అంటే ఎవరని అమాయకంగా అడిగిన నా స్నేహితురాలికి నాకూ తేడా ఏమీ లేదు. ఇంటి దగ్గరి పోరాటాల గురించి మాకేం తెలీదు. మేం ఇంటినుంచి చాలా దూరం వెళ్లిపోయాం.

నాకు ఇంటికి వెళ్లాలనుంది…

(ఫోటోలు: అమర్తరాజ్ స్టీఫెన్)

*

ఎవర్ని ప్రశ్నించాలి?!

 

ప్రజలు అనేమాట నాకు చాలా ఇష్టమైన పదం ఎప్పటికీ.

స్వేచ్ఛ అనేమాట ఒకప్పుడు అంటే యవ్వనంలో నాకు చాలా ఇష్టంగా వుండేది. కానీ కాలం గడిచేకొద్దీ ఆపదం ప్రచారం కావడం వెనక వున్న విస్తృతి అర్ధం అయ్యేకొద్దీ, పరిణామాలు చూసేకొద్దీ ఆమాటపై మోజు తగ్గిపోసాగింది. సరే, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ తాలూకు పరిణామాలకి వారే బాధ్యులుగనక ఆవిషయం పక్కన పెడితే; సాహిత్యకారులు, రచయితలు మానవ సమాజాన్ని వ్యక్తీకరించడంలో, విశ్లేషించడంలో తమకున్న స్వేచ్ఛని జాగ్రత్తగా విశ్లేషించుకోవలసి అవసరం రాను రాను పెరిగిపోతున్న దశలో మనం ఉన్నామన్నది నా నిశ్చితమైన అభిప్రాయం.
లాజికల్ గా సరైనవి అనిపిస్తున్న విషయాలు అన్నీ సామాజికంగా సరైనవి అనడానికి లేదు.  ప్రతి అస్థిత్వ ఉద్యమమూ మనకి ఈవిషయాన్ని అనేక ప్రశ్నలతో, అనేక రుజువులతో బయటపెట్టాయి, నిరూపించాయి.  అయినాగానీ, సామాజిక పరిణామాలతో సంబంధం లేకుండా,  సామాజికాంశాలని లాజికల్ గా విశ్లేషించ బూనడం, వ్యాఖ్యానించడం కొందరు రచయితలు తరచూ  చేస్తుంటారు. వారు సమాజంలోని
అన్యాయాలకి, వ్యత్యాసాలకి, అపభ్రంశాలకీ  కారణాలను వ్యవస్థీకృతమైన చోట్ల కాకుండా అసంఘటితమైన, అమాయకమైన, అపరిపక్వమైన చోట్ల కారణాలను వెతుకుతుంటారు. అలాంటి వారు తమ వ్యాఖ్యానాలతో ప్రజలని తప్పుపట్టడం తరచూ చూస్తూ వుంటాం.  వారు అలా వ్యాఖ్యానించే స్వేచ్ఛని కాదనలేం గాని, అలాంటివారు విధిగా గ్రహించవలసిన విషయాలని తెలియ జెప్పడమే ఈ వ్యాసం యొక్క
సారాంశం.

*       *       *       *

ఇప్పటి సమాజం ఇలా వుండడానికి అంటే మనం తరచూ ఒక నిస్పృహతో భావిస్తున్నట్టు   కుళ్లిపోయినట్టు వుండటానికి ప్రభుత్వాలు, రాజకీయ
నాయకులే కారణమా? మనం (అంటే ప్రజలు) కారణం కాదా? అని తరచూ కొందరు ప్రశ్నించడాన్ని మనం చూస్తూవుంటాం.  కొందరినుండి వచ్చే ఇలాంటి ప్రశ్నలు లాజికల్ గా వినడానికి బాగుంటాయి గాని, అలాంటి ప్రశ్నలు సామాజిక బాధ్యతతో అడిగిన ప్రశ్నలు  ఎన్నటికీ కాలేవు.

ప్రజలు అనేపదం ఒక సమూహానికి పర్యాయంగా మనం వాడుతాము. ఆ సమూహంలో దొంగలు మొదలుకుని మేధావులు, సైంటిస్టులు, బాలురు, స్త్రీలు, వ్యాపారులు, ఉద్యోగులు, బిచ్చగాళ్ల వరకు… ఇలా అన్ని విభాగాలలోని వ్యక్తులందరినీ కలిపి ప్రజలు అని మనం పిలుచుకుంటాం.  ఈప్రజలని సాధారణంగా విడివిడిగా కొన్ని సాంప్రదాయ నియమాలతోబాటు వారి బుద్ది మరియు హృదయం నడిపిస్తు
ఉంటాయి.  ఇంకా వారి కుటుబ సభ్యులతో వున్న మానవ సంబంధాలు కూడా నడిపిస్తుంటాయి.  దైనందిన జీవితంలో వారి ప్రవర్తనలకి, ఎమోషన్లకి నియంత్రణ కలిగించే విషయాలు అనేకం వుంటాయి.  ఆర్ధిక స్థితి,  కులం, బంధుత్వాలు, సాంప్రదాయాలు వంటివి ఎన్నో విషయాలు  వారి ప్రవర్తనలని నిర్దేశిస్తుంటాయి. మీరు ఇలా ఇన్నిగంటలు ఈపని చెయ్యాలనే రూల్స్ ఏవీ ప్రజలపై వుండవు.

ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అనేది దానిని  సక్రమంగా నడపడానికి అవసరమైన ట్రైనింగ్ తీసుకుని, ఆపని చేస్తున్నందుకు జీతం పొందే వారితో ప్రభుత్వం నిర్వహించబడుతుంది.  ప్రతి అధికారికీ, ప్రభుత్వోద్యోగికీ జిల్లా కలెక్టర్ తో సహా తామెలా పనిచెయ్యాలో ఒక మాన్యువల్ వుంటుంది. అలా చేసినందుకు ప్రభుత్వం వారికి జీతంతోపాటు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అందులో గృహవసతి, ఆరోగ్య సౌకర్యం, ప్రయాణ సౌకర్యం, పెన్షను, లోన్లు వంటివి ఎన్నో కల్పించి వారికి ఒక భద్ర జీవితాన్ని, వారి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తునీ కల్పిస్తుంది ప్రభుత్వం.  వీరి పని ఏమంటే ప్రభుత్వం నిర్వహించే వ్యవస్థలు సక్రమంగా నడిచేలా బాధ్యతతో, నిజాయితీతో,  పైన చెప్పుకున్న ప్రజలకి ప్రజా సౌకర్యాలకీ మేలు కలిగించే పని చెయ్యడం.
ఇప్పుడు విషయానికి వద్దాం.  ఈ ప్రభుత్వోద్యోగులు ఒకసారి ఉద్యోగం వచ్చాక తమని 60 యేళ్లవరకు కదిలించే వాళ్లు లేరనే ధీమాతో ఉండడం జగమెరిగిన సత్యం. ఈ ధీమాతో ఒక నిర్లక్ష్యం, దానివెంట ఒక ఉదాశీనతా వచ్చి చేరుతాయి. వీటివెనక వున్న  కారణం  ఏమిటంటే వారివెనక ఉద్యోగ సంఘాలు, కోర్టులు వుండడమే! తిరిగి ఈఉద్యోగ సంఘాలు, కోర్టులు ప్రభుత్వం కనుసన్నలలో నడిచే వ్యవస్థలే.  ఉదాహరణకి ఒక ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఏనాడైనా తమబిడ్డలు కార్పొరేట్ స్కూళ్లలో చదవడానికి ఈపిల్లలే కారణం అని
ఆలోచించగలడా? అలా ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలలు ఈనాటి మూతబడవలసిన దుస్థితిలో వుంటాయా? ఇది ఒక్కటీచర్లపై  విమర్శ మాత్రమే కాదు. అన్ని ప్రభుత్వ వ్యస్థలలోని నిరాశాజనక స్థితికి ఉదాహరణ.  ఇలా కావడానికి వారే చెప్పే కారణం  ఉద్యోగుల ఉద్యోగం, వారి పిల్లల భవిష్యత్తు “ట్రాన్స్ఫర్స్” అనే పేరుతో రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడం.

ఇకపోతే ప్రభుత్వాలని ఏలే పార్టీలు, రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడుకుందాం. రాజ్యాంగం ప్రకారం చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులు అనేవాళ్లని ప్రజలు తమ సంక్షేమం కోసం ఎన్నుకుని అసెంబ్లీ, పార్లమెంట్స్ కి ఎన్నిక చేసి పంపుతారు. కానీ కరెప్ట్ అయిన అధికార వ్యవస్థలన్నీ కూడబలుక్కుని లేదా రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనై ఎన్నికల భారతం ఒక తంతుగా మారిపోయింది. ఈక్రమంలో ఎన్నికలప్పుడు కార్పొరేట్ సెక్టార్ తమకి 5 యేళ్లపాటు అనుకూలంగా వుండటానికి సమకూర్చిన  నిథులతో డబ్బు, మద్యం పంపిణీ
చేసి, మీడియాని కొని, కోట్ల రూపాయల పబ్లిసిటీల ఖర్చుతో నాయకులు పుట్టుకొస్తున్న కాలం ఇది.  ఎన్నికల్లో గెలిచాక మళ్లీ ఈ నాయకులు కూడా
భారీగానే చట్టబద్దంగా జీతాలు తీసుకుంటారు. ఇక పోతే గెలిచాక మన ప్రభుత్వాలు, వాటి నాయకులు ఏమేం చేస్తున్నారనేది ఏరోజు ఏపేపర్ చూసినా ఏదోరకంగా క్లూ దొరికిపోతుంది.

ఇక్కడ మళ్లీ కొందరు  లాజికల్ గా, అమాయకంగా ఒక ప్రశ్న వేస్తారు. “ఎన్నికల్లో డబ్బు తీసుకోవడం తప్పుగదా? డబ్బు తీసుకుని వాళ్లకి ఓట్లేసి
వాళ్లని గెలిపించేది మనమే ( అంటే ప్రజలే) కదా?” అని. ఇదెలా వుంటుందంటే, బస్సులోనో బజారు సెంటర్లోనో ప్రతి రోజూ ఒకమ్మాయి ఒళ్లంతా కామంతో చూసేవాడు; “నువ్వు చూడకపోతే నేను చూసినట్టు నీకెలా తెలుసు?” అని వాదించినట్టు వుంటుంది.

rafi1

ఎన్నికల్లో రాజకీయ నాయకులు డబ్బు పంచకుండా ఉండడానికి భారత దేశంలోని సకల అధికార యంత్రాంగాము ఉండికూడా దేశంలో వందల  కోట్లకొద్దీ డబ్బు పట్టుబడుతూనే వుంది. పట్టుబడ్డదే ఇంతింత వుంటే పంచుతున్నదెంత? ఎన్నికలంటే ఇన్ని దశాబ్దాలుగా నడుపుతున్న వారికెంత నిర్లక్ష్యమో అర్ధం అవుతుందిగదా!  పోనీ, ఎన్నికల సమయంలో  పదిమంది నాయకులు గుంపులు
గుంపులుగాగా ఇంటికొచ్చి నవ్వుతూ నమస్కారం పెట్టిపోయి, ఆరాత్రికి వాళ్ల అనుయూయులతో మనిషికి ఇంతని లెక్కవేసి రెండువేలో మూడువేలో కుటుంబపెద్ద  చేతిలో పెడితే తిరస్కరించ గలిగే ధైర్యం సగటు మనిషికి ఉంటుందా? ఈ విషయాలన్నీ  ఆలోచించకుండా “డబ్బు తీసుకుని ఓట్లేయడం తప్పుకదా?” అని ప్రశ్నించడం వాస్తవం పట్ల అవగాహన లేకపోవడమే అవుతుంది. రేపు ఆనాయకుడు గెలిస్తే మనకి ఏదైనా  పనిబడితే పొయ్యి పలకరించాల కదా? ఇక పోతే రెండవ విషయం సగటు ప్రజలు ఆర్ధిక దారిద్ర్యం వల్ల కూడా 500/1000 కాగితానికి
ప్రలోభ పడతారు. ఆ రంగురంగుల కాగితం అప్పుడు తప్ప చూడలేని వాళ్లు కోట్ల మంది.  నిజానికి నాయకుల  డబ్బు పంపకం కార్యక్రమం  అంతా  ఆర్ధికావసరాలు చుట్టు ముడుతున్న స్లంస్ మీదనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది.  ధనవంతుడు కట్టిన 33 అంకణాల్లో మూడో నాలుగో ఓట్లుంటే, అదే 33అంకణాల స్లం ఏరియాలో 30- 40 ఓట్లుంటాయి.

ఇప్పుడు ఈమూడు వర్గాల మధ్య వ్యత్యాసం గమనిస్తే…. ప్రజలేమీ నాయకులలాగా, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల మాదిరి జీతం తీసుకోరు.
రెండుపూటలు తింటారో, ఒక పూట తింటారో, తాగతారో, తలకి పోసుకుంటారో, వీథుల్లో తన్నుకుంటారో గాని  ప్రభుత్వం నడవడానికి మాత్రం పన్నులు కడతారు. అంతకు మించి వ్యవస్థని, ప్రభుత్వాన్నీ నడిపించడంలో వారి పాత్ర శూన్యం. “అది చేస్తాం, ఇది చేస్తాం అని నమ్మించి గద్దెనెక్కిన వారినీ, జాబ్ మేన్యువల్ ప్రకారం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాల్సిన ప్రభుత్వ అధికారులనీ వదిలేసి ”  ప్రజలని తప్పు పట్టడం  సామాజిక క్రమం అంతటిపట్లా అవగాహన ఉన్నవారు చెయ్యలేరు.

ప్రజలకి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికీ; వారికి విద్య, జ్ఞానం, వైద్యం, భృతి, ఇవ్వడానికే, మంచి పౌరులుగా ఆత్మాభిమానంతో బతకడానికీ, చైతన్యవంతంగా సమాజాన్ని బాగు చెయ్యడానికీ  (ఎన్నికల ముందు చెప్తారు) నాయకులు గెలిచి జీతం తీసుకుని పని చేస్తున్నారు.  అందుకనే నాయకులు మెరికల్లాంటి IAS అధికార్లని తమ పియ్యేలుగా నియమించుకుంటున్నారు.  కానీ నిజానికి చేస్తున్నదేమిటి? ఈదేశంలోని మానవ వనరులు, భౌగోళిక వనరులు చూపి లక్షల కోట్ల అప్పులు తెచ్చి, వాటిలో కమీషన్లు మింగి, అవి కట్టలేక అప్పిచ్చిన వాడు విధించిన షరతులతో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా తిరిగి పెరుక్కుంటున్నారు. మరి అలాంటప్పుడు  వీళ్ల అసమర్ధతకి, వీళ్ల
అవినీతి అక్రమాలకీ ప్రజలని ఎలా తప్పు పట్టగలం? ప్రజలు ఏం చేశారని తప్పు పట్టగలం?  అసలు నోరెలా వస్తుంది?  అందుకే పైన చెప్పిన మాటని మళ్లీ ఇక్కడ రాస్తాను.

రచయితలకి  సమాజం యొక్క వర్తమాన  పరిణామ క్రమాలపై అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. మనకి రాయడానికి, ప్రశ్నించడానికీ అందిన స్వేచ్ఛని  మనం కాస్త జాగ్రత్తగా విశ్లేషించుకుని, వ్యాఖ్యానిద్దాం. మనకున్న ప్రశ్నించే స్వేచ్చని రచయితలుగా మనం దుర్వినియోగ పరచకుండా జాగ్రత్త పడదాం! ప్రశ్నించ వలసిన వారినే ప్రశ్నిద్దాం!

ఇప్పుడిక నా వ్యాసాన్ని ప్రముఖ రచయిత చెప్పిన ఆణి ముత్యాల్లాంటి రెండు మాటలతో ముగిస్తాను.

“రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను” – రావిశాస్త్రి.

*       *       *       *

ఈ భరోసా…ఎంతవరకు?!

murugan

-దగ్గుమాటి పద్మాకర్

~

నేను నా వృత్తిరీత్యా ఇప్పటివరకు రకరకాల స్కూళ్లలో లక్షమంది పైగా విద్యార్థులతో వారి క్లాసుల్లో  10-15 నిముషాల సమయం గడుపుతూ ఉంటాను. వారంతా 2-7 తరగతుల మధ్య చదువుకునే పిల్లలు.  వారితో మాట్లాడే విషయాలు ముఖ్యంగా వాళ్లందరూ తమకి ఒక మెదడు ఉందని గుర్తించడం, అదే చాలావరకు తమని నడిపిస్తుందని పలు ఉదాహరణలతో గ్రహించేలా చెయ్యడం.  అలాగే ఆమెదడుని వారు తమ అదుపులో ఉంచుకోవాలని కూడా గ్రహించేలా చెయ్యడం, అందుకు కొన్ని ప్రాక్టికల్గా ఉదాహరణలు చూపించడం.  సందర్భాన్ని బట్టి వారెందుకు
చదువుకుంటున్నారో, అక్షరం విలువేమిటో కూడా వివరించడం చేస్తుంటాను.

ఈక్రమంలో ఒకసారి 4 వ తరగతి పిల్లలని క్లాసులో భాషకి, లిపికి తేడా చెప్పమన్నాను.  వారికి పెద్దగా అర్ధం కాలేదు.  సరే మాటకీ, అక్షరానికీ తేడ
తెలిస్తే చెప్పమన్నాను.  తెలిసిందేగదా, పిల్లలకి అవకాశం ఇవ్వంగాని ఇస్తే ఆలోచనలు మథిస్తారు!

ఒకమ్మాయి అంది, మూగవాళ్లు ఇతరులతో మాట్లాడాలంటే మాటలు రావుగాబట్టి అక్షరాల్లో రాసి చూపిస్తారు అనింది.  అందరితోపాటు నేనూ చప్పట్లు కొట్టాను.  నేను ఆతర్వాత చొరవ తీసుకుని భాషవల్ల  ఇంకో ముఖ్యమైన  ప్రయోజనం చెప్తానన్నాను.  “ఇప్పుడు ఇక్కడ అక్షరం వల్ల ప్రయోజనం గురించి  మనం మాట్లాడుకున్న విషయం మనం కొద్దిరోజులకి మర్చిపోతాం! ఇవన్నీ , ఇంకో వంద సంవత్సరాలకైనా ఇతరులు తెలుసుకోవాలంటే ఎలా? అక్షరమే గదా సాధనం” అన్నాను. ఈ అక్షరాల వల్లనే గదా మీరు టెక్స్టు పుస్తకాల ద్వారా ఎవరో ఎప్పుడో రాసిన
అనేక విషయాలు తెలుసుకో గలుగుతున్నారు అన్నాను.

2

సరే! ఇదంతా ఎందుకంటే కోర్టులు అక్షరం విలువని ఇన్నాళ్లకు గుర్తించాయి! జడ్జీలు వాయిదాలు, పాయింట్లు, తీర్పులు డిక్టేట్ చేస్తుంటే టైపిస్టులు అక్షరాలు సృష్టిస్తుంటారు గాబట్టి జడ్జీలనడిగితే అక్షరాలు సృష్టించే వాళ్లకంటే ఆలోచనలు సృష్టించే వాళ్లే గొప్పవాళ్లని తప్పకుండా
ఒప్పుకుంటారు.  ఇటీవల పెరుమాళ్ మురుగన్ కేసువిషయమై ఇచ్చిన తీర్పులో మద్రాసు హైకోర్టుకూడా ఒప్పుకుంది. కోర్టుల్లో ఇదొక గుణాత్మకమైన మార్పుగా గోచరిస్తుంది.  ఆలోచనలని ఔపోసనపట్టి అక్షరాలకు ఒక కళారూపాన్ని జతచేసి రచనలుచేసే వాళ్లని “మీరు రాయండి” అని; “ఒక కళారూపమైన సాహిత్యంలోని భావాలు నచ్చనివాళ్లు నచ్చకపోతే పుస్తకం మూసేసుకోవచ్చు” అనీ  కోర్టు ఒక రచయిత భుజం తట్టినట్టుగా మద్రాసు హైకోర్టు పెరుమాళ్ మురుగన్ కి భరోసా ఇవ్వడం నిజానికి హృదయాలు పులకించే విషయం.

కానీ ఏడాది కిందటి వరకూ “మిలార్డ్” అంటూ బ్రిటిష్ సాంప్రదాయాన్ని కొనసాగించిన కోర్టులనుంచి మనం ఇలాంటి భరోసాలు నిరంతరం ఆశించడం అత్యాశే కావచ్చు.

3

అయితే కనీసం పెరుమాళ్ మురుగన్ కారణంగా అయినా కళా సాహిత్య రంగాలకు మద్రాసు హైకోర్టు ఈ రకంగా అయినా వెన్నుదన్నుగా నిలవడం వెనుక కారణాలు అన్వేషిస్తే నావరకు అనిపిస్తున్నదొకటే.  వెల్లువెత్తుతున్న వర్చువల్ మీడియాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎలాంటి కత్తిరింపులు, ఎవరి అనుమతులు అవసరం లేకుండా దూసుకెళుతున్న కాలంలో మనం వుండడమే ఇందుకు కారణం.  కళాకారులపై రాజ్యాంగ
వ్యవస్థలో భాగమైన పోలీసులు ఫ్యూడల్ భావాజాలానికి కొమ్ముకాస్తూ నియంత్రించినప్పుడు వారి చర్యలు ప్రపంచమంతా క్షణాలలో ప్రచారం, ప్రసారం జరిగిపోతున్నాయి. ఈ పరిణామం కారణంగా అభివృద్ది చెందిన దేశాలు భారతదేశాన్ని అభివృద్ది చెందుతున్న దేశంగా కాక ఇంకా వెనకబడ్డ దేశంగానే గుర్తించడం జరుగుతుంది.  అలాంటప్పుడు భారత దేశంలో పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ కంట్రోల్లో లేదనే సంకేతాలు ప్రచారమవుతాయి.  బహుశా పెరుమాళ్ మురుగన్ కేసులో న్యాయ వ్యవస్థపై ఈరకమైన వత్తిడి కూడా పనిచేసి వుండే అవకాశం వుంది.

4

అయితే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇంకా మాట్లాడితే ఏరకమైన స్వేచ్ఛ గురించి అయినా ఇటీవలికాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవలసి వుంటుంది.

సమాజంలోని ప్రజలకు తగినంత మెచ్యూరిటీని, ప్రాపంచిక జ్ఞానాన్ని అందించే సామాజిక వ్యవస్థలని చిదిమేసి బట్టీ విద్యా విధానంతో జ్ఞానాని
తెల్లకాగితంగా మిగిల్చి వ్యవస్థ అందించే స్వేచ్ఛ చివరికి ఏ పరిణామాలకి దారితీస్తుందో ఇటీవలి సంఘటన ఒక ఉదాహరణ. వయోజనుడైన ఒక పాతికేళ్ల ఐటీ ఉద్యోగి కార్పొరేట్ హాస్పిటల్ ప్రకటనలని నమ్మి ఎత్తు పెరగడానికి కనీసం ఇంట్లోకూడా చెప్పకుండా తన రెండుకాళ్లను తెగ్గొట్టించు కోవడం  వ్యక్తిగత స్వేచ్ఛయొక్క దుష్పరిణామమని చెప్పుకోవాలి.  అంటే ఈదశలో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చివరికి వినియోగదారుడిగా మారే స్వేచ్ఛకి దారితీస్తుంది.

చెప్పుకోవాలంటే యువత ఎక్కువగా వున్న భారతదేశంలో రాబోయేకాలంలో ఇలాటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలెక్కువ. ఇప్పటికే మన సినిమాలలో చూపించి చూపిస్తున్నట్టు గుణగణాలతో సంబంధం లేకుండా ఆకర్షణే ఆధారంగా జరిగే ప్రేమపెళ్లిళ్లకి ఒకలెజిటమసీ వచ్చేసింది.  మన సినిమాలలో మొదట హీరో స్నేహితులు,  ఆతర్వాత కాలేజీ లెక్చరర్లు, ఆతర్వాత చివరికి తల్లిదండ్రులు అంతా హీరో ప్రేమని సఫలం చెయ్యడానికి ప్రయత్నించేవారే!   కారణాలేవైతేనేం 18 దాటిన వాళ్లకి మద్యం సేవించే స్వేచ్ఛ వచ్చేసింది.  మద్యం అమ్మకాలకి ప్రభుత్వమే టార్గెట్స్ పెట్టి  అమ్మిస్తూంది.  ఇండైరెక్టుగా మద్యం హాయిగా తాగొచ్చని సందేశాలు పంపుతూ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ చేత డ్రగ్స్ కి, గంజాయికీ వ్యతిరేక ప్రచారం చెయ్యిస్తుంది.  మీడియా అంతా పేజీలకింత అనేదశ దాటి టోకుగా కూడా అమ్ముడు పోతున్నాయి. ఈదశలో ఇప్పుడు రచయితలకి అందిన స్వేచ్ఛని కూడా మనం కాస్త జాగ్రత్తగా విశ్లేషించుకోవలసి వుంది.

5

సమాజంలో స్వేచ్ఛకి మితిమీరిన ప్రాచుర్యం లభించాక ఆ పదానికి ఒక ఆచరణీయత, అనుసరణీయత ప్రజల్లో లభిస్తుంది.  ఇప్పుడున్న వాతావరణంలో స్వేచ్ఛని ఎక్కువగా పైపై వర్గాలే వినియోగించుకుంటాయి.  అంటే  కార్మికులు యూనియన్లు పెట్టుకునే హక్కుని నిరాకరిస్తూ యజమానుల సంఘం మాత్రం క్రియాశీలంగా పనిచేసినట్టు అన్నమాట.  ఇలాంటి సంఘటనలు భారత దేశంలో కోకొల్లలు.
ప్రభుత్వాలు తమపార్టీలకు నిధులందించే ఇండస్ట్రియలిస్టుల కొమ్ముకాయడం , ఎన్నికల హామీలు గాలికి  వదిలి నియంతృత్వ పోకడలు పోతున్నప్పుడు క్రమేపీ ప్రజా సమూహాల గొంతెత్తే హక్కు, నిరసన తెలిపే హక్కు, అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు… ఇలాంటివన్నీ ప్రభుత్వాలు కాలరాస్తున్నప్పుడు దృతరాష్ట్ర న్యాయం ప్రదర్శించే కోర్టుల పట్ల పెరుమాళ్ మురుగన్ విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకింత సానుకూలత కలిగిస్తుందనేది రచయితలుగా మనం మరిచి పోకూడదు.

పెరుమాళ్ మురుగన్ కి ఇచ్చిన స్వేచ్ఛని అడ్డం పెట్టుకుని  కోర్టులు తాము మరింత ప్రజాస్వామికంగా వున్నట్టు మనని నమ్మిస్తాయి. నిజానికి హక్కులు, స్వేచ్ఛ కారణంగా వర్ధిల్లే బూతు సాహిత్యం ఎక్కువ!  కోర్టుల నిస్సహాయత బయట పడేది ఇక్కడే!

అసలు పెరుమాళ్ మురుగన్ భయానికిగురై రచయితగా తాను మరణించినట్టు ప్రకటించడానికి కారణమైన సంస్థలు, అధికార వ్యవస్థలను కూడా కోర్టులు ఏమీ చెయ్యలేవన్నది నిజం.  ఒకవేల అలాచేయాలని అనుకున్నా అది కత్తి పట్టుకుని పైపైకి వచ్చేవాడిని కళ్లురిమి అదుపు చేయాలనీ అనుకోవడం లాంటిదే! ఆపరిమితి కోర్టులకున్నది.  కోర్టుల నిస్సహాయత గురించి చెప్పుకోవలసి వస్తే మన రాజకీయాలు ఎంత దుర్మార్గమైనవి అంటే అవి ఒక సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ చేతకూడా పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టించ గలవని మనకి తెలిసిన విషయమే.

6

నాలుగు రోజుల కిందట  ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో ఒక కేసులో బెయిలుపై బయటికి రాగానే మరొక ధర్నా కేసంటూ వెంటనే అరెస్టు చేసి వెంటనే కోర్టుకి పెట్టారు. ఆయనేం మావోయిస్టు కూడా కాదు.  ప్రతిపక్ష ఎమ్మెల్యే.  సహజంగా పోలీసులకి వుండే పవర్ ఇది. ఈ పవర్ గురించే రావిశాస్త్రి తనకథల్లో పదేపదే చెప్పింది. కోర్టులు కూడా అధికార వ్యవస్థల్లో మరో వ్యవస్థ కాబట్టి సహజంగా తనకి కలిగిన “కళ్లురిమే” అదృష్టాన్ని అనవసరంగా  కాలదన్ను కోవడానికి సిద్ధపడవు.

కొన్నిసార్లు కోర్టులు పార్లమెంటుని సైతం ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తాయి గాని టెక్నికల్గా బాహాటంగా దొరికితే తప్ప అవి ప్రభుత్వాల పీక
పట్టుకోవన్నది నిజం.  ప్రభుత్వాలే మద్యం అమ్మకాలు చేయించడాన్ని, ప్రజాభిప్రాయాన్ని అవహేళన చేస్తూ ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి
మారడాన్ని, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు కొమ్ముకాసి దేశ సంపదని దోచి పెట్టడం గానీ ప్రశ్నిస్తూ కోర్టులు సుమోటోగా కేసులు పెట్టినప్పుడు
కోర్టుల్లో గుణాత్మక మైన మార్పులు వచ్చాయని మనం నమ్మొచ్చు.

అందాకా తప్పేమీ లేదు మిత్రమా!

ప్రపంచం అంతటా నీ అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని కొల్లగొట్టడానికి ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది.  ఈడ్రామాని నువ్వు జీవితం అనే మొత్తాన్ని ఖర్చుచేసి టిక్కెట్టు కొని చూస్తున్నావు.  నిజమా  కాదా అని అనుమానించడంలో తప్పేమీలేదు.  ప్రతి మార్పునీ, ప్రతి తీర్పునీ ఒక గీటురాయి మీద గీసి చూసుకో!

*     *      *      *

పెరుమాళ్ మురుగన్ కి అక్షరాలా పునర్జన్మ!

image of judgement

-రమా సుందరి 

~

“పెరుమాళ్ మురుగన్ మరణించాడు. అతను దేవుడు కాదు. మళ్ళీ అవతారమెత్తడు. అసలు అవతారాలను నమ్మడు. ఇప్పటి నుండి పెరుమాళ్ మురుగన్ ఒక టీచరుగానే బతుకుతాడు.”

పోయిన  జనవరి 12న పెరుమాళ్ మురగన్, తమిళ నవల మాదోరుబాగన్ రచయిత తీవ్ర మనో వత్తిడితో యిచ్చిన  ప్రకటన.

“తనలో దాగున్న అత్యంత ప్రతిభతో సహా రచయితకు పునర్జన్మ ఇద్దాము. పెరుమాళ్ మురగన్ నువ్విక రాయి.”

ఈ సంవత్సరం జులై 5న రచయిత పెరుమాళ్ మురగన్ కు మద్రాస్ హై కోర్టు జడ్జి సంజయ్ కిషన్ కౌల్ యిచ్చిన గొప్ప హామీ.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను  శక్తివంతమైన శబ్దార్ధంతో వ్యక్తీకరించిన తీర్పు యిది. న్యాయస్థానాల అర్ధం కానీ పరిభాషకు భిన్నంగా – హృదయానికి దగ్గరగా, కవితాత్మకమైన భాషలో వెలువడిన ఈ తీర్పు సంవత్సరన్నర కాలంగా రచయితలు, కళాకారులు పడుతున్న మనో వేదనపై చిరుజల్లులు కురిపించి ఊరట కలిగించింది. సాహిత్యాన్ని, చట్టాన్ని  సమతూకంలో తూచి జయహో అనిపించుకొన్నది. “పుస్తకం అరుదుగా గాయం చేస్తుంది. ఎందుకంటే దాన్ని మూసి వేయటం తేలిక” అన్న ఒక రచయిత సల్మాన్ రష్దీ లాగానే “చదవటం యిష్టం లేకపోతే, పుస్తకాన్ని విసిరి కొట్టు” అంటూ మద్రాస్ హైకోర్ట్ జడ్జిలు సంజయ్ కిషన్ కౌల్, పుష్ప సత్యన్నారాయణలు రచయితల పక్షం వహించారు.

సంజయ్ కిషన్ కౌల్ కళాకారుల పట్ల ప్రేమతో వ్యవహరించటం, కళాత్మక సృజనకు గౌరవం యివ్వటం ఈ రోజు కొత్త కాదు. 2008లో ప్రవాసంలోకి వెళ్ళి పోయిన ఎమ్మెఫ్ హుస్సైన్ కు దన్నుగా ఇదే జడ్జి నిలబడ్డారు. ఆ రోజు ఢిల్లీ హై కోర్టు జడ్జిగా ఉన్న సంజయ్ కౌల్  ప్రాచీన, నవీన కళలు నగ్నత్వాన్నిఎప్పుడూ ఉపయోగించుకొన్నాయని  ఆ నాటి తీర్పులో పేర్కొన్నారు. స్త్రీ పురుషుల మధ్య కలయిక, లైంగిక పూజ.. ఈ రెండిటినీ ప్రాచీన కళ ఎప్పుడు తోసి పారేయలేదని చెప్పారు. అదే వాక్యాన్ని ఈ రోజు పెరుమాళ్ మురుగన్ కేసులో సంజయ్ మళ్ళీ వాడారు. ఎమ్మెఫ్ హుస్సైన్ తీర్పులో ఆయన దేశం ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదం ఛాందసవాదం అని చెప్పారు. ఇప్పుడు పెరుమాళ్ మురుగన్ కేసులో ‘మన సహనపు హద్దులు కిందకు పడిపోతున్నాయి. నిజమో అబద్దమో, ఎవరైనా సామాజిక ఆచరణ గురించి రాస్తే అది మనకు ఎంత మాత్రము ప్రమాదకరం కాదు’ అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఆర్ధిక శాస్త్రంలో పట్టా పొంది,  కాంపస్ లా కాలేజ్ నుండి ఎల్ ఎల్ బీ డిగ్రీ పొందారు సంజయ్. మద్రాసు హైకోర్టుకు రాక ముందు ఆయన పంజాబ్, హర్యానా హై కోర్టులకు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు.

నువ్వొక పుస్తకం రాస్తావు. ఆ పుస్తకం 5000 కాపీల వరకు అమ్ముడు పోతుంది. దాని అనేక అవార్డులు వస్తాయి. ఒక నాలుగు సంవత్సరాలు గడిచాక అది ఇంగ్లీష్ లోకి అనువాదం అవుతుంది. హటాత్తుగా కొందరు వ్యక్తులు అది మత భావాలను అవమానిస్తుందని బయటకు వస్తారు. అందులో భాష అసభ్యంగా ఉందంటారు. అసభ్యమైన అంశాలు ఉన్నాయని, అవి స్త్రీలను అవమానిస్తున్నాయని మొదలు పెడతారు. కులాన్ని భ్రష్టు పట్టిస్తుందని అంటారు. నడిరోడ్డులో పుస్తకాన్ని తగలబెడతారు. బంద్ కు పిలుపు యిస్తారు. ఊర్లో షాపులు బలవంతంగా మూయిస్తారు. (వ్యాపారస్తులు చాలా మందికి సాహిత్యం అంటే ఏంటో కూడా తెలియదు) కొంతమంది స్త్రీలు కూడా ఈ ఆందోళనకారులతో ఉంటారు. జిల్లా పాలనా యంత్రాంగానికి అది శాంతిభద్రతల సమస్యగా కనిపిస్తుంది. కలక్టరు ఆఫీసులో కట్టా(ఖాప్) పంచాయితీ జరుగుతుంది. రచయిత మెడలు అధికారులు వంచుతారు. ఆయనకు ‘సమ్మన్స్” జారీ చేస్తారు.  జరిగిన విషయాలకు ‘తీవ్ర పశ్చాత్తాపం’ ప్రకటిస్తున్నానని రచయిత అంటే ఆ పదాన్ని ‘షరతులు లేని క్షమాపణ’గా మార్పిస్తారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న డొల్లతనాన్ని మద్రాసు హైకోర్టు తప్పు పట్టింది. ఒక నవల తన స్వభాషలో నాలుగు సంవత్సరాలు నానింది అంటే అది ప్రజల ఆమోదం  పొందినట్లే. ఇంగ్లీష్ అనువాదం తమిళ మాతృకకు ఆధునిక రూపం మాత్రమే. అందులో తమిళంలోని వాడుక పదాలు కానీ, నుడికారాలు కానీ, జనపదాలు వాడే మొరటు భాష కానీ ఉండవు. సొంత భాషలో లేని అసభ్యత ఇంగ్లీషులో ఎలా కనిపించింది? అని ప్రశ్నించింది. పాలనా యంత్రాంగానికి ఈ పుస్తకం పట్ల ఎలాంటి అభ్యంతరం లేకుండానే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. శాంతి భద్రతల పేరుతో అది ఇప్పుడు ఈ విషయంలో కలగచేసుకొన్నది. కళలు సంస్కృతులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ యంత్రాగం ప్రమేయం ఎంతవరకు ఉండాలి అని హైకోర్టు ప్రశ్నించింది. ఒక కళాకారుని వ్యక్తీకరణను చంపటానికి కేవలం ఒక గుంపు ఆవేశాన్ని ప్రాతిపాదికగా తీసుకోకూడదని చెప్పింది. పాలనా యంత్రాంగంతో కూడిన ఈ చట్టాతీత కోర్టులు తమ సొంత సిద్దాంతాల తోటి సామాజిక, నేర విషయాలను పరిష్కరించబూనుకోవటాన్ని తప్పు పట్టింది. మాట్లాడిన తరువాత స్వేచ్ఛ కాపాడక పోవటం అంటే ‘మాట్లాడటానికి స్వేచ్ఛ’  అనే మాటకు అర్ధం ఉండదని స్పష్టం చేసింది.

ఇంత వివాదానికి కారణమైన మదోరుబాగన్ లో ఉన్న కధాంశం కేవలం పిల్లలు లేని తల్లిదండ్రులకు సమాజం నుండి వచ్చే వత్తిడి గురించిన అంశం మాత్రమే. ఆ వత్తిడి స్త్రీ, పురుషులకు యిద్దరికీ ఉన్నప్పటికీ  స్త్రీల మీద పడే భారం చర్చించటమే ఈ కధలోని  అంశం. పెళ్లయ్యి పన్నెండు సంవత్సరాలు అయిన తరువాత కూడా సంతానం కలగక పోవటం కాళి(పురుషుడు), పొన్న(స్త్రీ)లకు పెద్ద సమస్యగా దాపురిస్తుంది. అలాంటి సందర్భంలో తిరుచెంగొడులో ఉన్నఅర్ధనారీశ్వర ఆలయానికి జరిగే తిరనాళ్ళలో పధ్నాలుగోనాడు జరిగే రధోత్సవ సమయంలో అపరిచితులైన మగవాళ్ళతో సంపర్కించి స్త్రీలు సంతానాన్ని పొందుతూ ఉంటారు. అలా పుట్టిన పిల్లలు దేవుడి పిల్లలుగా చలామణి అవుతుంటారు. ఈ కధలోని పొన్న కూడా అలా సంతానాన్ని పొందటానికి ప్రయత్నిస్తుంది.

Kishan-Kaul_YT

ఒక కధ సమాజం మీదా ఎలాంటి ప్రభావం కలుగచేస్తుందో తెలుసుకోవాలంటే  రచయిత చెప్పుల్లో కాళ్ళు పెట్టి చూడాలని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు వివిధ స్థాయిల, వయసుల పాఠకుల దృష్టి కోణం నుండి కూడా చూడాలని అభిప్రాయపడింది. హేతుబద్దత, బలమైన వ్యక్తిత్వం, దృఢమైన మనస్తత్వం కల వ్యక్తి దృష్టికోణాన్ని గీటురాయిగా తీసుకోవాలి కానీ, చిన్న చిన్న విషయాలను ప్రమాదకరంగా భావించే వారి దృష్టికోణాన్ని స్టాండర్డ్ గా తీసుకోకూడదని కోర్టు వ్యాఖ్యానించటం విశేషం. అలా చూస్తే ఈ కధలో తప్పు ఏమీ కనబడలేదని కూడా చెప్పింది. ఈ కధ నవలీకరణ చెందిన చరిత్ర కాదని, జనపదాల్లో ప్రచారంలో ఉన్న సంగతులనే రచయిత కాల్పనికం చేశాడని చెప్పింది. ఇది విజేతల చరిత్ర కాదనీ, సామాన్యప్రజలు రోజూవారి పడుతున్న కష్టాల కధ అని చెప్పింది. కోర్టు స్త్రీల వైపు నిలబడి..   స్త్రీలు పరపురుషుడితో, అందునా అపరిచిత పురుషునితో స్త్రీలు సంపర్కానికి యిష్టపడరనీ, పిల్లల కోసం సమాజం వాళ్ళను ఆ పని పురికొల్పి వుండే అవకాశం ఉందని అన్నది.

ఈ కేసు విచారణలో ఉన్నప్పుడు ప్రచురణకర్తల వైపు నుండి వాదించిన లాయర్ సురేశ్ కొన్ని ప్రాధాన్యత కలిగిన  సంగతులు ముందుకు తీసుకొని వచ్చారు. ‘రధోత్సవంనాడు పిల్లలు లేని స్త్రీలందరూ పురుషుల కోసం వీధుల్లో సంచరిస్తుంటారు’ అని పెరుమాళ్ రాయటం స్త్రీలకు అవమానకరం అని పెరుమాళ్ మీద దాఖలు చేసిన పిటీషన్ ను ఉద్దేశిస్తూ సురేశ్ వర్ధమాన కాలంలో స్కానింగ్ సెంటర్లను గురించి ప్రస్తావించారు. అక్కడ స్త్రీలు స్కానింగ్ తీయించుకోవటానికి గుంపులు గుంపులుగా పొద్దున తొమ్మిది నుండి మధ్యాహ్నం మూడు వరకు వేచి ఉండటం పెరుమాళ్ళు వర్ణించిన రధోత్సవం నాటి స్త్రీల గుంపులను గుర్తుకు తెస్తుందని అన్నారు. ఒక స్త్రీ స్కానింగ్ కోసం మంచం మీద బట్టలు తొలగించి పడుకొని ఉండగా, ఇంకొక స్త్రీకి అదే స్థితిలో స్కానింగ్ తీస్తూ ఉంటారని చెప్పారు. ఒక్కోసారి పురుషులు కూడా అక్కడికి డాక్టర్ తో మాట్లాడటానికి వస్తుంటారనీ, ఆ స్థితిలో ఉన్న స్త్రీలను వాళ్ళు కూడా చూస్తూ ఉంటారని చెప్పారు. ఆ అవమానాన్ని పిల్లల కోసం స్త్రీలు పడుతుంటారని అన్నారు. పురుషులలో వీర్యకణాలు తక్కువగా ఉంటే ఇతర పురుషుల వీర్య కణాలు కూడా స్వీకరించి స్త్రీలు గర్భవతులవుతున్నారనీ, అందుకు పురుషుల ఆమోదం కూడా ఉంటుందని అన్నారు. పెరుమాళ్ళు కధను తప్పు పడుతున్న నైతిక పోలీసులు ఈ విషయంలో ఏమి మాట్లాడతారని ప్రశ్నించారు. వంద సంవత్సరాల క్రితం అమలులో ఉందని చెబుతున్న ఒక ఆచారాన్నికధలో జొప్పిస్తే తప్పేమిటని ఆయన వాదిస్తూ ఈ నవల ఈ ఆచారాన్ని గ్లామరైజ్ చేసి వాడుకోలేదని చెప్పారు.

పెరుమాళ్ మీద పిటీషన్ వేసిన గోవిందరాసు(అరుల్మిగు అర్ధనారీశ్వర గిరివాల), కె. చిన్నుసామి (హిందూ మున్నని సంస్థ) మొదలైన వారు వాదిస్తున్నట్లుగా ఈ విషయం సెక్షన్ 292 కిందకు రాదని కోర్టు తేల్చి చెప్పింది. యాంత్రికంగా  సెక్షన్లు వల్లించటం, పదజాలాన్ని వాడటం మంచిది కాదనీ, సెక్షన్ 292 లో పేర్కొన్న అశ్లీలత ఈ కధలో లేదని చెప్పటం సరైన నిర్ధారణ. నవలలోని చిన్న చిన్న ముక్కలను తీసుకొని తప్పు పట్టటం కాకుండా, మొత్తంగా నవల ఏమి చెబుతుందో పరిశీలించాలని అన్నది. సమాజానికి ఎలాంటి చెడు చేసే ఉద్దేశం ఈ కధకు లేదనీ తీర్మానించింది. కామేచ్ఛ కలిగించేటట్లుగా ఈ కధలోని విషయాలు లేవనీ, కేవలం ఆలోచనలు రేకెత్తించే అంశాలే ఉన్నాయని స్పష్టం చేసింది.

 

సంజయ్ కిషన్ కౌల్ సాహిత్య కారుల పట్ల ప్రదర్శించిన ప్రేమ అభిమానం గొప్పవనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే నవలలోని కధను సమర్ధించటానికి ఆయన ప్రాచీన సాహిత్య ఔన్నత్యాన్ని అతిగా పొగిడినట్లు అనిపిస్తుంది. స్త్రీలకు సంబంధించి పురాతన సాహిత్యంలో అన్నీ మంచి విషయాలే ఉన్నాయన్నట్లు వ్యాఖ్యానించారు. అప్పుడు (పాత కాలంలో) శృంగారం గురించి యదేచ్ఛగా చర్చించేవారనీ, బ్రిటీష్ వాళ్ళు వచ్చి అంతా పాడు చేశారన్నట్లు మాట్లాడారు. ఒకానొక చోట దేవదాసీ పద్దతిని కూడా వెనకేసుకొచ్చినట్లు అనిపించింది. మహాభారతంలో అంబిక, అంబాలిక, కుంతి, మాద్రిలను  ప్రస్తావనలోనికి తీసుకొచ్చారు. భర్తలు లేకుండా వీళ్ళు పిల్లలను కనటం ఉదాహరణగా చూపించారు. ఈ రకమైన ఆచారాలు ప్రాచీన సమాజంలో ఉండేవి, వాటి అవశేషాలు వందేళ్ళ క్రితం సమాజంలో ఉండి ఉండవచ్చు అని చెప్పటంలో అర్ధం ఉంది కానీ, అవన్నీ మనం కోల్పోయామన్నట్లు వ్యాఖ్యానించటం ఆశ్చర్యంగా అనిపించింది. ప్రాచీన, మధ్య యుగాలలో ఉన్న  భూస్వామ్య సమాజంలో వ్యక్తిగత ఆస్తి విధానాన్ని కాపాడటానికి స్త్రీలను పరికరాలుగా వాడుకొన్నారనేది వాస్తవం. వాళ్ళ సెక్సువాలిటీ మీదా వారికే హక్కు లేని కాలంలో అది వారి శృంగార స్వేచ్ఛగా భావించటం సరైదేనా? దేవాలయాల మీద బూతు బొమ్మలను కూడా ప్రస్తావించారు. ఆ బొమ్మల్లో కూడా పితృస్వామ్య సమాజపు అసలు స్వరూపం నగ్నంగా కనిపిస్తుంది. మహాభారతాన్ని ఒక నాటి మన చరిత్రగా చెబుతూ దాన్ని కూడా నిషేదిద్దామా అని ప్రశ్నించారు.

‘మళ్ళీ లేచి నిల్చొంటానని’ పెరుమాళ్ళు మురుగన్ అనటం ఆనందకరం. కల్బుర్గీని, పన్సారేని కోల్పోయిన సాహిత్య లోకం గట్టిగా ఊపిరి పీల్చుకోంటోంది. వేల గొంతులతో, సంతోషం నిండిన హృదయాలతో ఈ తీర్పును ఆహ్వానిస్తోంది. అయితే సెక్షన్ 292 పాము పడగ కిందే యింకా సృజనకారులు ఉన్నారు. రచయిత హృదయం ఎరిగిన సంజయ్ కిషన్ లాంటి న్యాయాధీశులు మనకు ఎంత మంది ఉన్నారు? ఎమ్మెఫ్ హుస్సేన్ నుండి పెరుమాళ్ మురుగన్ వరకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను రక్షించడానికి అవిరామంగా కష్టపడిన  జడ్జీలు ఎందరు? తొంభై ఏళ్ల చిత్రకారుడు తన కాన్వాస్ దగ్గర బొమ్మలు వేసుకొంటూ తన యింట్లోనే ఉండాలని వాంఛించిన అత్యున్నత న్యాయ స్థానాలు మనకు ఎన్ని? చట్టాలను దాటి  రచయితల కోసం సౌందర్యాత్మకమైన ప్రతిపాదనలతో ముందుకొస్తున్న వారు ఎవరు? ‘కళ రెచ్చగొట్టేటట్లే ఉంటుంది. అది అందరి కోసం కాదు. అందరూ తనను వీక్షించాలని కూడా కోరుకోదు. చూసేవాళ్ళ అభిరుచి  మీద అది ఆధారపడి ఉంటుంది.’ అనగల దమ్మున్న జడ్జీలు సంజయ్ కాకుండా మనకెవరు ఉన్నారు?

*

 

 

 

అనువాదాల అవసరం

 

 

-వేలూరి వేంకటేశ్వర రావు

~

(జూలై 3 వతారీకున ఆటా సాహిత్యసదస్సులో ఇచ్చిన ఉపన్యాసం)

తెలుగు వాళ్ళు  అమెరికాలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున  సాంస్కృతిక సంబరాలు చేసుకోవటం 1977 లో మొదలయ్యింది. కొన్నేళ్ళపాటు రెండేళ్ళకోసారి ఈ పండుగ చేసుకొనేవారు.  మరి పండుగలు ప్రతిఏడూ జరుపుకోవాలిగదా! అందుకనో, మరెందుకనో, ప్రతిఏడూ ఈ సాంస్కృతిక సంబరాలు జరుపుకోవటం పాతికేళ్ళక్రితం మొదలయ్యింది. నా శ్రీమతి  ఇంగ్లీషు పుట్టింరోజు, తెలుగు పుట్టింరోజూ చేసుకుంటుంది; అంటే సంవత్సరంలో రెండు పుట్టింరోజులు!  అల్లాగే ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు ఈ సాంస్కృతిక సంబరాలు ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటున్నారు.

తెలుగు సినిమా మన సంస్కృతిలో ప్రథానమైనది.  అందుకని, సంస్కృతి పేరుతో తెలుగు సినిమాల వాళ్ళు ముమ్మరంగా వస్తారు, అమెరికాకి!  సంస్కృతి పేరుతో రాజకీయనాయకులు కూడా వస్తారు; సంస్కృతికి రాజకీయానికీ ఉన్న సంబంధం  నాకు ఇంతవరకూ అర్థం కాలేదు.  నాకు ఇకముందు అర్థం అవుతుందన్న ఆశకూడా లేదు.

ఈ సాంస్కృతిక సంబరాలలో సాహిత్యానికి ప్రత్యేకంగా ఒక చిన్ని పీట ఎప్పుడూ ఉంటుంది. ఒక్కక్కప్పుడు అది ముక్కాలిపీట అవుతుంది కూడా!  తెలుగు నాడు నుంచి, కవులు, కథకులు, నవలా రచయితలు. విమర్శకులు, పత్రికలవాళ్ళు వగైరా వగైరా ఆహ్వానితులుగా వస్తారు. వారికి తోడుగా చిన్న తమ్ముళ్ళుగా అమెరికా రచయితలు కూడా పిలిపించుకుంటారు, –“ డయాస్పోరా”  రచయితలం అనుకుంటూ!

(కథలో కథ చెప్పాలి, పిట్టకథలాగా! 1985 లో నారాయణరెడ్డి గారిని అడిగాను; మీకు ఇప్పటివరకూ వచ్చిన కీర్తి చాలదూ? ప్రతిఏడూఒక కవితా సంకలనం అచ్చువెయ్యాలా?  మా బ్రాహ్మలు సంవత్సరీకాలు పెట్టినట్టు, అన్నాను. ఆయన మృదువుగా తనశైలిలో చెప్పారు: అలా ప్రతిఏడూ ఒక సంకలనం అచ్చువెయ్యకపోతే జనం మనని  మరిచిపోతారు” అన్నారు.)

పోతే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది  ముక్తకంఠంతో మనభాష ఎంతగొప్పదో, మనసాహిత్యం ఎంతగొప్పదో, మన సంస్కృతి  ఎంత పురాతనమైనదో మనకి మరీమరీ నూరి పోస్తారు. ఇక్కడి వాళ్ళు—అంటే అమెరికా డయాస్పోరా రచయితలు  “ మమ మమ” అని అర్ఘ్యమ్  పుచ్చుకుంటారు.  పునః పునః.  ఏడాదికి రెండు సార్లు!

నిజమే! మనభాష, సాహిత్యం, సంస్కృతీ గొప్పవే! కాదనం.

అయితే ప్రపంచ సాహిత్యంలో మన సాహిత్యానికి  ఉన్న స్థానం ఏమిటి? మనని ఎవరు గుర్తిస్తున్నారు? మనం ఎంతవరకూ గుర్తింపబడ్డాం? పాశ్చాత్య సాహితీ వేత్తలు, పాఠకులు, అసలు ఎవరైనా  మనని గుర్తిస్తున్నారా? మన ఘోష వింటున్నారా?

సరేనయ్యా!  వాళ్ళు మనని గుర్తించవలసిన అవసరం ఏముంది? లేదా వాళ్ళు గుర్తించనంతమాత్రాన మన ఘనత తగ్గుతుందా? అని అనే వారితో నాకు పేచీ లేదు. వారితో నాకు వాదించే ఓపిక కూడాలేదు.  అంతర్జాతీయంగా తమతమ సాహిత్యాలు గుర్తించబడాలని ప్రతి భాషలో రచయితలు, సాహితీపరులూ కోరుకుంటారు.  వాళ్ళ ఆలోచనలు, అనుభవాలు  మనకి, మన ఆలోచనలు మన అనుభవాలు వాళ్ళకీ పరస్పరం తెలుపుకోవటం అవసరం అనుకునే వాళ్ళల్లో నేను ఒకణ్ణి. ఈ విషయమై నాతో ఏకీభవించేవాళ్ళు ఉన్నారని అనుకుంటాను.

మన సాహిత్యం గురించి ఇక్కడ అమెరికాలో గాని, యూరప్‌ లోగాని ఎంతమందికితెలుసు, అని మనని మనం ప్రశ్నించుకున్నప్పుడు, మన భవిష్యత్ కర్తవ్యం బోధపడుతుంది.

మనసాహిత్యం, — సంప్రదాయ సాహిత్యం, ఆథునిక సాహిత్యం ముందుగా ఇంగ్లీషులోకి తర్జుమా  చేసుకోవలసిన అవసరం ఉన్నది.  ఆ తరువాత ఇతర యూరోపియన్ భాషలలోకి అనువదించేచే ప్రయత్నాలు మనం చేసుకోవాలి.  ఇంగ్లీషులోకి అనువదించటం కేవలం వాళ్ళకోసం కాదు; నిజం చెప్పాలంటే మనకోసమే! మనపిల్లలకి తెలుగు చదవటం రాదు;  తరువాతి తరం వారికి  తెలుగు అంటే ఏమిటోకూడాతెలియని పరిస్థితి రాకూడదు. భాష రాకపోయినంతమాత్రాన, ఆ భాషలో సాహిత్యం, ఆ సాహిత్యానికున్నప్రత్యేకత, మన వారసులకి తెలియవలసిన అవసరం ఉన్నdi. ఇంగ్లీషులోకి అనువదించటం మూలంగా,  You kill two birds at one shot.

veluri

ఆటా సాహిత్య సదస్సులో…

ఒక ఉదాహరణ:  “#Zoque#” అనే భాష కేవలం 70,000 మంది మాత్రమే మాట్లాడుతారు.  ఆ భాషలో కవిత్వం ఇవాళ ఇంగ్లీషులోకి అనువదించబడుతున్నది.

తెలుగు ప్రాచీన సాహిత్యం, ఏవో ఒకటి రెండు ప్రబంధాలనో, కావ్యాలనో తీసివేస్తే నిజంగా అంతా అనువాద సాహిత్యమేకదా! ఇప్పటికే మనకి, ఇంగ్లీషునుంచి, ఫ్రెన్‌చ్‌ నుంచి, రష్యను నుంచి కొల్లలుకొల్లలుగా అనువాద సాహిత్యం వచ్చింది. ఇప్పటికీ, దక్షిణ అమెరికను సాహిత్యాన్ని, స్పానిష్ సాహిత్యాన్ని మన రచయితలు విరివిగా అనువదిస్తున్నారు. అది వద్దనను.  అయితే, అదే బిగిలో  మనసాహిత్యం వారిభాషల్లోకికూడా వెళ్ళేటట్టు చేయగలగాలి.

#Quid Pro Quo# అనండి.

మన దురదృష్టం ఏమిటంటే, మన భారతీయభాషల సాహిత్యమే ఒకభాషనుంచి మరొకభాషలోకి  ఎక్కువగా అనువదించబడలేదు. ఎక్కడో ఒకటో రెండో కవితలు, కొన్ని కథలూ అడపా తడపా ఒకటో అరో నవల ఇతరభాషలలోకి వెళ్ళాయి. అది చాలులే అని సమర్థించుకొని సంతృప్తి పడే మంచి లక్షణం నాకు లేదు.

అయితే ఈ పని ఎవరుచేస్తారు?  ఈ దేశంలోను, ఇతర యూరోపియన్‌ దేశాలలోనూ యూనివర్శిటీలు పురమాయించో, ప్రోత్సహించో ఈ పని చేస్తాయి. ఆంధ్రలో గాని, తెలంగాణాలో గాని ఉన్న విశ్వవిద్యాలయాలు ఇటువంటి పని ఇప్పట్లో చేస్తాయని నేను అనుకోను. అక్కడ వాళ్ళకున్న ఈతి బాధలు వాళ్ళవి. వాళ్ళ సాహిత్యరాజకీయాలు వాళ్ళవి.  మరి, ఇక్కడి సాంస్కృతిక సంస్థలు పూనుకోగలవా?  ఈ సంస్థలు తమంతతామే చేయలేకపోయినా,  ఊతం ఇవ్వగలvu.  అందుకు డయాస్పోరా కమ్యూనిటీ యే పూనుకొని, సంస్థలని ప్రోత్సహించాలి.

ఈ సందర్భంలో నారాయణరావుగురించి ప్రస్తావించాలి. అతను ఒక్కడూ, మరొకరిద్దరి   సహకారంతో, ఎన్నో సంప్రదాయసాహిత్యగ్రంధాలని ఇంగ్లీషులోకి అనువదించాడు. ఇంగ్లీషులో కవితా సంకలనాలు తెచ్చాడు. శ్రీనాథుడి సాహిత్యచరిత్ర (#Literary Biography#) రాసాడు. A first of its kind. ఆథునికుల కవితలు, కథలూ  కూడా అనువదించాడు.  వ్యాఖ్యానాలు రాసాడు. అవి ఓపికగా, జాగ్రత్తగా చదవకండా  తెలివితక్కువ విమర్శలు చేసే బదులు, అంతకన్నా మంచి అనువాదం తేవాలన్న అభిలాషతో, నిష్పాక్షికంగా పనిచేయాలి.  ఆ పని అసాధ్యం కాదనుకుంటున్నాను.

నాకు ఈ కోరిక 2002-2003 లో 20th Century Telugu Poetry, Hibiscus on the Lake, —  ఈ రెండుపుస్తకాలు వచ్చిన తరువాత కలిగింది. నా స్వంత అనుభవం: మా మేనకోడలికి ఇస్మాయిల్‌ కవితల అనువాదాలు చదివి వినిపించాను. ఆ పిల్ల అప్పట్లో ఇక్కడ కాలేజీలో పేపర్‌కి సబ్-ఎడిటర్‌. ఆ అనువాదాలు విని ఇవి, elijabeth barret browning పద్యాల్లా వినపడుతున్నాయి అన్నది.  ఆహా!  That’s it అనిపించింది.  అంటే ఇక్కడి పాఠకుల “ఇడియం “ పట్టుకొని అనువదించాలన్నమాట!

1960 లో #UNESCO# రెండు తెలుగు పుస్తకాలు ఫ్రెన్‌చ్‌ లోకి అనువదించమని  ఆంధ్రా యూనివర్సిటీకి ఒక “ఆల్బర్ట్” ని పంపింది. మొదటిది వేమన శతకం. అతను అనువదించాలి. అది జరిగిందోలేదో తెలియదు కాని, అతనితో స్నేహం పట్టిన మాకు వైన్‌ తాగటం మాత్రం అలవాటయ్యింది.  రెండో పుస్తకం కళాపూర్ణోదయం.  అది నారాయణరావు ఈ మధ్యనే అనువదించాడు, ఏ అంతర్జాతీయ సంస్థయొక్క ప్రమేయం లేకుండానే! అప్పుడప్పుడు UNESCO సాహిత్య అకాడమీ తో షరీకయి భారతీయ భాషల పుస్తకాలు అనువదింపజేస్తుంది. తెలుగు పుస్తకం ఒక్కటికూడా వాళ్ళ జాబితాలో లేదు.

ఇక్కడ పదవశతాబ్దపు లాక్షణికుడు  రాజశేఖరుడి శ్లోకం గుర్తుచెయ్యటం అవసరం.

ఏకస్య తిష్ఠతి కవేర్గృహ  ఏవ కావ్యమ్

అన్యస్య గచ్ఛతి సుహృద్భవనాని యావత్,

న్యస్యా విదగ్ధవదనేషు పదాని శశ్వత్

కస్యాపి ఞ్చరతి విశ్వకుతూహలీవ. –  రాజశేఖరుని కావ్య మీమాంసా, 4:10

 

ఒక కవిరచించిన కావ్యము అతని ఇంటిలోనే పడి ఉంటుంది. మరొకడురాసిన కావ్యము మిత్రుల ఇంటి వరకూ పోతుంది. ఒక్కొక్కని కవిత్వము, ప్రపంచయాత్ర చేయుటకు కుతూహలము చూపిస్తూ ఎల్లప్పుడూ సంచరించుతుంది. ( అంటే,  సామాన్య విద్యావంతులు కూడా చదువుతూ ప్రచారము చేస్తారు, అని భావం)

ఈ కాలంలో,  మనసాహిత్యం ప్రపంచయాత్ర చేయడానికి  మనప్రేరణ, ప్రయత్నం  ఉండాలి.

ఆఖరిగా ఈ మాట చెప్పాలి.

ఇజం నిజం కాదు; నిజం ఇజంలోకి పోదు.  ఇజాల గందరగోళంలో పడకుండా మనం ఉమ్మడిగాఏమిచేయగలం అన్న విషయంపై నాకుకొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవి మరొక వ్యాసంలో పొందు పరుస్తాను.

ఇప్పుడు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను.

శలవ్‌

 

ఆ జోలెలో మిగిలింది రక్తమేనా?!

 

– నిశీధి

~

నీ వారని పరాయని లేకుండా అందరి మాట  మన్నించే దేవ దేవా

ఇదుగో ఈ క్షణం గుమ్మంలో జోలె పట్టుకు నిలబడ్డాను

నీ వాకిలి ముందు నిలబడ్డ ప్రపంచానికి ఏమేమి దొరకలేదని ,

ఇహనిప్పుడు దురదృశ్టాలని అదృష్టంగా మార్చే వరకు

ఖాళీ చేతులతో వెనక్కి మరిలే పరిస్థితే లేదు , నా జోలె నింపి పంపు ప్రభూ

 

ప్రతి కవ్వాలిలో బహుశ  అమ్జాద్ ఫరీద్ సబ్రీ మనస్పూర్తిగా తలవంచి తను నమ్ముకున్న చిష్తి సూఫిజాన్ని గుండెలు  నింపుకొని  ఇదేగా పాడింది!! ఈతి బాధల నుండి రక్షించే మరణమే అల్టిమేట్ డెస్టినీ కాబట్టి సబ్రీ జోలె తాను కోరుకున్న కోరికలతో నిండిందని ఈ రోజు మనం అంతా  సంతోషించాలా  లేక తనకి అడ్డొచ్చే  ప్రతిప్రాణిని , తనని కాదన్న  ప్రతి ఆత్మని మూలంతో సహా నలిపేస్తూ రక్తాన్వేషిలా   ముందుకు వెళుతున్న మతమారణహోమాలని చూసి వణికిపోవాలా ?

జీవుల్లో అతి తెలివయిన జంతువుగా  మనిషి మారిపోయాక,  ఆ తెలివయిన  జంతువుకి ఒక  సంఘ జీవనం,  ఆ సంఘానికి ఒక కట్టుబాటు ఏర్పరచడానికి , ఒక ఆరోగ్యకరమయిన క్రమశిక్షణ అందించే క్రమంలో  మతం ఒక పదునయిన  ఆయుధంగా వాడబడటం , భూమి మీద హ్యూమన్  ఎవల్యూషన్ మొదలయిన ప్రతి చోట దాదాపు అలాంటివే ఒకేరకమయిన బీజాక్షరాలు,  మతం ఏదయినా  అయి ఉండొచ్చు  కాని అది మానవ మనుగడకి సపోర్టింగ్  సిస్టంగానే మొదలయింది అన్న  విషయాన్ని ఎవరం మర్చిపోలేం.  అలాగే ఎవల్యూషన్లో భాగంగా ఎదిగిపోయిన మనిషి మెదడులో మతాలూ సంఘాలు లాంటి ఎలాంటి నియంత్రణకి లోబడని క్రియేటివ్ ఆర్టిస్టిక్ భాగమూ అతి ముఖ్యమైనదేనని  బేసిక్ సైన్స్  చదువుకున్న అందరికి  తెలుసు. అయితే ఇపుడు ఇక్కడ సమస్య ఏమిటంటే కాలంతో పాటు ప్రాపంచిక విషయాలన్నింటినీ తనదిగా చేసుకుంటూ ఏక ఆధిపత్య ధృవంగా మారిపోతున్న మతం,  మతం తాలూకు  భయం , నెమ్మదిగా క్రియేటివిటీని కూడా మింగేస్తూ , తనని హైలైట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడే ఒక పక్క వాద్యంగా కళలనన్నింటిని వాడుకోవడమే  కాకుండా తనకి సపోర్ట్గా రాని ప్రతి కళని కళాకారులని మింగేస్తూ పోతుంటే చివరికి మిగిలే మరుభూమిలో సంఘాలు రాజ్యాలుగా , రాజ్యాలు  అధికారికంగానో అనధికారికంగానో మత రాజ్యాలుగా రూపాంతరీకరణ చెందుతున్న కాలంలో జనప్రియత కోరుకొనే కళ ఎక్కడ నిలబడాలి ? అటు కళ ఇటు మతం  రెండు మనసుని హాయిపరిచేందుకో లేక కొంత ఓదార్పుకోసమే అయితే రెండిటి అంతిమ లక్ష్యం  ఒకటే అయినపుడు ఒక వ్యవస్థ పూర్తిగా  ఇంకో వ్యవస్థని  తినేయడం  వలన జరిగే నష్టం నుండి మానవుడు   తేరుకోగలడా? లేదా ఇప్పటికే  తన నడవడి తో పాటు తన ఆలోచనలని నియంత్రిస్తున్న మతం  గుప్పిట్లో మరింతగా ఇరుక్కుపోయి ఇంకొంత  కుదించుకుపోతాడా ? కుదించుకుపోవడం అంటే తానూ మాత్రమే లేదు తానూ నమ్ముకున్న తనని కమ్ముకున్న మతం మాత్రమే  మిగలడం అంటే ఇహ సంఘ జీవనం కి , సహజీవనంకి అర్ధం ఏముంది ?

 

చరిత్ర సాక్ష్యం , పదకొండో  శతాబ్దం  అంతంలో బాగ్దాద్  మీద మంగోలియన్ దాడి జరిగినప్పుడు ముందు టైగ్రీస్ నది అక్కడి మనుష్యుల రక్తంతో ఎర్రబారింది ఆ తరువాత విలువైన అక్షరాల సిరానలుపు తో నల్లబడింది అని . మనుష్యులని మాత్రమే కాదు  సమూలంగా ఆ జాతి తెలివితేటలని  , భవిష్యత్తుని కూడా నాశనం  చేయడం మధ్య యుగంలో  యుద్ధాలకే కాదు ప్రస్తుతం సాగుతున్న  మత యుద్ధాలు , మతం పేరుతో మానవాళి పై ఏక జాతి చేయాలనుకొనే దాష్టికాలు ఇంకా  నడుస్తూనే  ఉన్నాయి అనిపిస్తుంది . ఒక జాతి లేదా  ఒక మత యుద్ధం మొదలయింది  అంటే ముందు స్త్రీలు పిల్లలు తరవాత ఆ జాతి రత్నాలయిన  కళాకారులు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతకాల్సిన  పరిస్థితులు రాతి యుగం నుండి ఈ కాలం వరకు సాగడం అసహ్యకరమయిన  తప్పని పరిస్తితిలా మారిపోయింది .

 

రాజ్యానికి మతానికి  అతీతంగా కళని ఆస్వాదించలేని  కుత్సితంలోకి  మనిషి , మనిషి పెంచుకున్న  వ్యవస్థలు లోబడిపోతున్నప్పుడు  సౌదీ  మరణ శిక్ష నుండి ఆఖరి నిముషంలో ప్రాణం నిలుపుకున్న  ఆశ్రాఫ్ ఫాయద్ లు , తమ నేలని  వదిలిపెట్టి పరాయి దేశాల్లో బ్రతకాల్సి వచ్చే తస్లీమా లు , సల్మాన్  రష్దీలు , MF హుస్సేన్లు ఒక పక్క ఆత్మని  అమ్ముకోకుండా  రాజ్యానికి మతానికి ఎదురునిలబడే క్రమంలో తమని తాముకోల్పోవడం చూస్తూ  ఉండగానే మరో పక్క  ఒక చార్లీ హెబ్డో , ఒక కల్బుర్గి , ఒక సబ్రీ , ఒక వాంగో ( 2004లో కాల్చి చంపబడిన  హలాండ్ ఫిలిం మేకర్ ),  ఒక Pippa Bacca ( 2008 లో చంపబడిన ఇటాలియన్  పర్ఫార్మెన్స్  ఆర్టిస్ట్ ) దాదాపు ప్రతి నేల మీద మత వ్యతిరేఖ ప్రతీకార చావులలో అస్థిత్వాన్నే  కోల్పోవడం సామాన్యంగా  మారిపోయింది  .

End of the day art is the only noblest form of human evolution అని నిజంగానే  మనం అందరం నమ్మినట్లయితే  ,ప్రపంచవ్యాప్తంగా సో కాల్డ్ ఒక మతపు జీహాదీలు , పేరు లేకుండా చాప కింద నీరులా కళలని కళాకారులని మట్టి చేస్తున్న ఇతరమతాల మూర్ఖత్వాలకి  వ్యతిరేఖంగా విశ్వవ్యాప్తంగా అందరు ఆర్టిస్ట్లు  ఆ కళలని  అభిమానిస్తున్న సామాన్య జనం మతరహిత మానవీయ దిశలో కళలనే కాదు  కళాకారులని  కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ప్రస్తుతం   కనిపిస్తుంది .

 

ముఖ్యంగా  చరిత్ర  మొదటి నుండి   ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు  ఎన్నిసార్లు రెక్కలు  తెంచినా   తిరిగిలేచే ఫీనిక్స్ పక్షిలా  కొత్త ఊపిర్లు పోసుకుంటున్న మితవాద సూఫీఇజం ఇప్పటికయిన కనిపించని దేవుడి ముందు జోలెలు పట్టుకు తిరిగే ఆశల్ని పక్కనపెట్టి కనిపిస్తున్న ఇస్లామిక్ టెర్రరిజపు మత మూర్ఖత్వాన్ని  ఇస్లాం నుండి పూర్తిగా  బహిష్కరించి ఒంటరిని చేసే దారులు ఆవిష్కరించడం తక్షణ కర్తవ్యం  . పై వాక్యం అన్ని మతాలకి ముఖ్యంగా  హైందవం భారత సంస్కృతని ఒకప్పుడు వైష్ణ శైవుల మధ్య పరస్పర హత్యలు . తరువాత కాలంలో చదువుకున్న , క్రియేటివిటీ  ఉన్నప్రతి దళితుడ్ని  ఎదో విధంగా అడ్డుకొని  ఇపుడు మళ్ళీ  మనదేశంలో    కొత్తగా  పేట్రేగుతున్న మతోద్దారుకులని వెనకేసుకొచ్చే  ఉదారవాద మత విశ్వాసులు కూడా అర్ధం చేసుకోవడం  ముందు ముందు  రాబోయే నష్టాన్ని అంచనా వేసుకొని గంజాయి మొక్కలు ఎదగక ముందే జాగ్రత్త పడటం చాలా అవసరం. లేదంటే  తొందరలో మనం కూడా మన తోటి దేశపు  మత విద్వేషపు విషాలలో మనదయిన హవిస్సులు నమామి  అనిపించడం  ఖాయం .

  • భర్ దో జోలీ యా  మొహమ్మద్ అంటూ సూఫీఇజపు తాత్విక పరిమళాలకి తనదయిన గంభీరత వదిలివెళ్ళిన అంజాద్ సబ్రీ పాటల  జ్ఞాపకంలో .

 

 

.

 

మన కవిత్వం ఇంకా సుఖ జీవన సౌ౦దర్యమేనా ?

 

-కొండేపూడి నిర్మల

~

 

నిర్మల

ఇటీవల ఉత్తర తెలుగు అమెరికా  అసోసియేషన్  తెలుగు కవిత నూతన దృక్కోణం అనే విషయం మీద సెమినార్ నిర్వహించింది. భిన్న అస్తిత్వాలు వస్తు రూపాలు అనే విషయం మీద నేను ప్రసంగించాల్సి వుంది. అఫ్సర్, నారాయణ స్వామి, విన్నకోట రవిశంకర్ , పాలపర్తి ఇంద్రాణి మిగిలిన వక్తలు. మొదటి ప్రసంగం చేసిన ఇంద్రాణి  “కవిత్వానికి ప్రేరణ” గురించి మాట్లాడింది. పనిలో పనిగా  అస్తిత్వవాదులకు కొన్ని చురకలు వెయ్యడానికి నిర్ణయించుకుంది. మెత్తని మృదువైన కవిత్వం రాస్తూ, అనుభూతి, ఆహ్లాదము  కవితా లక్ష్యం గా వున్న ఈ కవయిత్రి  శబ్దానుకరణ విద్యలో అల్లసాని పెద్దన వంటిదని ఆమె పుస్తకానికి ముందు మాటలో మరొక కవి కితాబు ఇచ్చారు.

అల్లసాని పెద్దన అనగానే మనకు గుర్తొచ్చే పద్యం “తూగుటుయాల, రమణి ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు విడేము, ఉహ తెలియంగల లేఖక పాటకోత్తములు -కవితా రచనకు కనీస అవసరాలు అని కదా. అంత కాకపోయినా ఈ ఆధునిక కవయిత్రికి కూడా  ప్రేరకాలుగా కొన్ని సదుపాయాలు౦డాలట,

“మ౦చి కవి మిత్రులు, సరళమైన జీవన విధానం, ప్రకృతితో మమేకం, ఈ అన్నిటితో కూడిన ఏకాంతం” ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ మాటకొస్తే కవిత్వం రాయడానికే కాదు బిడ్డకు పాలిచ్చే కూలి తల్లికి , మగ్గంమీద బట్ట నేస్తున్న ముసలి తాతకి కూడా ఏకాంతం అవసరమే..

అది కాక కవిత్వాన్ని ఆటంకపరుస్తూ, చికాకు పెట్టే విషయాల చిట్టా కూడా మన ముందు వుంచింది. అదేమిటంటే,

“కవి నిరంతర అధ్యయనపరుడు కావాలి కాని సదరు  పుస్తకాలు  ప్రసంగాలో, సిద్ధాంతాల పట్ల ఆకర్షణ పెంచేవో కాకూడదు. నేను ఫలానా బాధిత వర్గానికి చెందిన స్త్రీని , ఫలానా మతానికి, కులానికి ప్రతినిధిని అని కూడా భావించరాదు. అప్పుడు అది మీ పరిమితిని సూచిస్తుంది.. మార్పులు, వయసు  పెరగడం , అనుభవాలను సృష్టించుకోవడం (?) కూడా కాని పనులే, ఉద్యమకారులు ఉద్యమాలు చేసుకోవాలి కాని కవులవడానికి వీల్లేదు.”

ఇవి   కేవలం వ్యక్తిగత అభిప్రాయాల్లాగా చెబితే ఈ చర్చ  అవసరం లేదు, కాని ఆర్కిమెడిస్ సిద్దాంతంలాగా ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. కాబట్టి ఇటువంటి ప్రకటనల పట్లా, వాటి వెనక వున్న  భావజాలం పట్లా నాకున్న స౦దేహల్ని మీతో పంచుకొవాలను కుంటున్నాను.

ఇవికాక ప్రసంగం లో, తన వస్తు ప్రాధాన్యత  గురించి చెబుతూ,  గుడి దగ్గర పూలు అమ్ముకునే అమ్మాయి జ్వరంగా వుంటే తను జ్వరం గురించే రాస్తానని చెప్పింది, జ్వరం పక్కన పెట్టి పూలపుప్పొడి గురించి కూడా రాయచ్చు.

వస్తువు ఎంపికలో వ్యక్తీకరణలో కవికి స్వేచ్చవుంది. ఆ స్వేచ్చను ప్రశ్ని౦చే హక్కు ఎవరికి లేదు.

పూల మీద రాస్తావా? పూలపిల్ల జ్వరం మీదరాస్తావా ? జ్వరంలో వున్నా సరే  పూలు అమ్మక తప్పని గతి మిద రాస్తావా? పువ్వుల పంట చినుకు  లేక ఎండి పోవడాన్ని రాస్తావా? పంట భూములు పోగొట్టుకున్న నిర్వాసితులమీద రాస్తావా? దానికి కారణమవుతున్న సర్కారీ ధోరణి గురించి రాస్తావా? అది కవి తీసుకున్న కాన్వాసుని బట్టి వుంటుంది

ఏ వస్తువు ఎంతవరకు వ్యక్తి గత మవుతుంది, ఏ సరిహద్దు దగ్గర సామాజికమవుతుంది ? నిర్ణయించడం కష్టం.

వ్యక్తిగతమంతా రాజకీయమే అని రుజువైపోయిన చోట కవి కార్యకర్తగా ఎదగడం అనివార్యం కాదా. జీవితంలో అన్నివిధాలా స్థిరపడ్డ కవికి వున్న సుఖ జీవన సౌదర్యం కార్యకర్త కి వుండకపోవచ్చు.

కవులు సరస్వతీ పుత్రులు, సభలు  ఈశ్వర స్వరూపాలు అనుకున్నంత కాలమూ వారిని మోయడానికి నడుం కట్టిన బోయీలు కాని,  కట్టడాలకు రాళ్ళు మోసిన కూలీలు కాని  వస్తువులు కాలేవు.

ఒకవేళ పువ్వులు అమ్మే పిల్ల అక్షరాస్యురాలు అయితే ఆమె అనుభవమే ఒక రచన అవదా ?. అక్షరాస్యతతో సంబంధమే లేక౦డా  గుండె కరిగించే పాట అవదా ? దానికి కావ్య గౌరవం వుండదా?

రచనా ప్రేరకాలుగా ఆ పూలపిల్లకి “బయట వేడి గాలులు తరిమికొడుతూ వుంటే , ఇ౦ట్లో వేడి భోజనం “ అవసరం లేదు. ఆకలి చాలు, వేదన చాలు, వేదన ఒ౦టరిది కాదనే స్పృహ చాలు. అవే ఆమె వ్యక్తీకరణకు కారణాలు.

కవిత్వం బాధకు పర్యాయపదం అన్నాడు కదా శ్రీ శ్రీ .

శ్రీ శ్రీ కి ముందు వచ్చిన భావ కవిత్వాన్ని అంతకు ముందు వచ్చిన పద్య కవిత్వాన్ని కూడా హాయిగా చదువుకున్నాం.

“రాత్రి జిప్పును విప్పుతో కారు ప్రయాణం “అని రాసిన ఇస్మాయిల్ కవితలో సిమిలీలు  ఎవరం మర్చిపోలేం.

“పది రాత్రులు ప్రకృతితో గడిపినవాడేవ్వడు పరుల్ని ద్వేషించలేడు” చిన్నప్పుడెప్పుడో చదువుకున్న వాక్య౦ యిది.

కవి పేరు మర్చిపోవచ్చు కాని కవిత్వం మర్చిపోలేం. ఈ నేలమీద అన్ని ధోరణులు సమాంతరంగా ప్రవహిస్తూనే వుంటాయి. వాళ్ల మధ్య మీరు కుస్తీ పోటీలు కండక్ట్ చేయనక్కర్లేదు.

అస్తిత్వవాద కవులకి ఈస్తటిక్ సెన్స్ ఉండదనే ఒక తప్పుడు అభిప్రాయం ప్రచారంలో వుంది. ఏ కవి అయినా వాదాలకోసం పుట్టడు. వాద ప్రచారం కోసం రాయడు. జీవితాన్ని కవిత్వం చెయ్యడంలో విభిన్న వస్తువులు వచ్చి చేరాయి. అది చాలా అవసరం కూడా.

ఈ పుస్తకానికి రాసిన ముందు మాట చూడండి.

“స్త్రీలలో ఉద్వేగాలు జాస్తి. కవిత్వ మూలాలు అక్కడే వున్నా దానివల్ల కవితాభివ్యక్తికి కలిగే ప్రయోజనం నాస్తి, కారణం దానికి అవసరమయ్యేది రసదూరం పాటి౦చగల నిర్లిప్తదోరణి. స్త్రీలలో అది బహు సకృతు. కాబట్టే మాయో ఏ౦జిలో , ఎలిజిబెత్ బిషప్ లాంటి పేరొందిన కవయిత్రుల్లో కూడా శిల్ప దోషాలు కనిపిస్తాయి. ఇక తెలుగు లో రాస్తున్న కవయిత్రుల గురించి ఎంత తక్కువ  మాట్లాడుకుంటే అంత మ౦చిది. కవులు కూడా అదే బంతిలో కూచుని భోజనాలు కానిచ్చి చేతులు కడిగేసుకు౦టున్నవారే. నానా వాదాల చెత్తను మిగల్చకుండా ఊడ్చి, కొత్త కవిత్వానికి ఇంద్రాణి కనక నాంది పలికితే ఆంధ్ర సారస్వతానికి కావలాసి౦దేమీలేదు.” దీనిభావమేమి యదుకులేశా ?

ఉద్వేగాలు జాస్తి అనే మాట తప్ప ఇంకోటి అర్ధమయితే ఒట్టు. కవిత్వ మూలాలు అక్కడే వున్నా అంటే ఆమెలో, లేక ఆమె చుట్టూరా లేక ఆమెకు అoదే౦త దూరంలో అనేనా? మరి అంత సమీప వస్తువు గురించి ఆమె రాసినప్పుడు కవితాభివ్యక్తికి కలిగే ప్రయోజం నాస్తి ఎలా అవుతుంది? రసదూరం పాటించగల నిర్లిప్త ధోరణి ఆమెలో లేదా?

ఇది ఎవరికయినా అర్ధం అయితే నాకు చెప్పండి ప్లీజ్,

పదిమ౦దిని దూషిస్తే తప్ప పదకొండో వాడ్ని గౌరవించడం కష్టమనుకు౦టే అది వారి వ్యక్తిగత బాధ. సామాజికం కావాల్సిన కవిత్వాన్ని వ్యక్తిగతం అని నేర్పి, వ్యక్తిగత రాగద్వేషాలు సైద్ధాంతిక సత్యాల మాదిరి చెబుతుంటే అచ్చంగా చెవిలో పువ్వులు పెట్టినట్టే వుంది.

సహజ ప్రేరణకి అడ్డుపడుతూ, కవిత్వాన్ని కృత్తిమoగా మార్చడం ఎలా జరుగుతుందో  ఇ౦ద్రాణి చెప్పి౦ది. నేను తనతో  తప్పక ఏకీభవిస్తాను. అదేమిటంటే ,

“మొదట్లో మనకోసం రాసుకున్న కవిత్వాన్ని ఎవరికయినా చూపగానే , ముఖ్యంగా ఎప్పటి ను౦చొ రాస్తున్నకవులకి చూపగానే వాళ్ళు అనే మాటలు, అభిప్రాయాలు, గుర్తింపు, అహం , బ్రాండ్ ఇమేజ్ ని ఇస్తాయి.”

ఇప్పుడు ఒక మ౦చి కవి/కవయిత్రి అలాంటి ప్రమాదాన్ని౦చి బైటికి రావాల్సి వుంది.

 

రోహిత్ ఆత్మహత్య: ఒక సరికొత్త/పాత సందర్భం

 

 

-భాస్కరం కల్లూరి

~

 

హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అంతఃకరణను కలచి వేసే ఒక భావోద్వేగ సందర్భం. అదే సమయంలో లోతుగా తరచి చూసి అర్థం చేసుకోవలసిన ఒక సరికొత్త/పాత సందర్భం కూడా. ఒక తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక దళిత విద్యార్థి ఆత్మహత్య వార్త జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడం చూసి ఒకింత ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల వార్తలు మరీ ముఖ్యమూ, సంచలనాత్మకమూ అయితే తప్ప జాతీయ మీడియాలో ప్రముఖంగా రావు. ఆ పైన రోహిత్ ఆత్మహత్యపై దాదాపు అన్ని జాతీయవార్తా చానెళ్లూ చర్చ జరపడం ఆశ్చర్యాన్ని పెంచింది. ఆ చర్చ వరసగా కొన్ని రోజులపాటు జరగడం ఆశ్చర్యాన్ని రెట్టింపు చేసింది. దాంతోపాటు ఆలోచనలనూ రేకెత్తించింది.

దేశ వ్యాప్తంగా జరుగుతున్నట్టే, నిన్నటి అవిభక్త, నేటి విభక్త తెలుగు ప్రాంతాలలోనూ ఆత్మహత్యలు, దళితులపై హింస ఎంతోకాలంగా జరుగుతూనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ ఉద్యమసమయంలో జరిగిన ఆత్మాహుతులు తెలిసినవే. దళిత హింసకు వస్తే; కారంచేడు, చుండూరు, పదిరికుప్పం; మహారాష్ట్రలో ఖైర్లాంజీ లాంటి ఘటనలను ఎన్నైనా చెప్పుకోవచ్చు. స్థూలంగా చెప్పుకుంటే, ఆ క్రమంలో రోహిత్ ఆత్మహత్య, పునరావృతమైన ఒక పాత సందర్భమే అవుతుంది.  అయితే, రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయిలో చర్చనీయం అయినంతగా పైవేవీ కాలేదు. అప్పటికి మీడియా వ్యాప్తి ఇంత లేకపోవడం ఒక కారణం అనుకున్నా; ఇప్పటికీ జాతీయ మీడియా వింధ్య అవతలి ప్రాంతాలపై, ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలపై పెడుతున్నంత ఫోకస్; వింధ్య ఇవతలి ప్రాంతాలపై పెట్టడం లేదన్న వాస్తవాన్ని గుర్తిస్తే రోహిత్ ఆత్మహత్యపై దాని స్పందన విలక్షణంగానే కనిపిస్తుంది. ఆవిధంగా అదొక సరికొత్త సందర్భం. వెరసి అదొక సరికొత్త/పాత సందర్భం.

ఇలా రోహిత్ ఆత్మహత్యను కొత్త సందర్భంలోకి తీసుకొచ్చినది సాక్షాత్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని భావసారూప్య వర్గాలే. అందుకు కారణం, అవి అనుసరించే ఒక నిర్దిష్ట భావజాలం. కానీ విచిత్రమేమిటంటే, రోహిత్ ఆత్మహత్య పాత సందర్భానికి కొనసాగింపు మాత్రమే తప్ప కొత్త సందర్భం ఎంతమాత్రం కాదని అవి నొక్కి చెబుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో దళితుల ఆత్మహత్యలు లేవా అని ప్రశ్నిస్తున్నాయి. ఒక దళిత విద్యార్థి ఆత్మహత్యను జాతీయస్థాయికి పెంచి మీడియా రభస చేయడం వెనుక మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జరుగుతున్న మతపరమైన ఘటనలు, అసహనం పెరిగిపోవడం గురించిన ఆరోపణల విషయంలోనూ బీజేపీ, దాని మిత్రవర్గాలూ ఇదే ఆరోపణ చేస్తూ వచ్చాయి. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా వదలుకోదన్న కోణంలో చూస్తే ఇది నిజం కావచ్చు కూడా.  అయితే, బీజేపీ, దాని మిత్రవర్గాలు ప్రస్తుతం తామున్న ఒక విలక్షణ పరిస్థితిలో; జరుగుతున్నవన్నీ పాతసందర్భానికి కొనసాగింపులే తప్ప కొత్తవి కావని చెప్పడానికి కూడా దీనిని తెలివిగా వాడుకుంటున్నాయి.

అయితే, వాటి అసలు లక్ష్యం దేశాన్ని పాత సందర్భం నుంచి తప్పించి కొత్త సందర్భంలోకి తీసుకెళ్ళడం! ఎందుకంటే, వాటికి తమవైన నిర్దిష్ట భావజాలమూ, ఆచరణా ఉన్నాయి. ఆ భావజాల అవసరాల రీత్యా కుల(దళిత)-మత(ముస్లిం)పరమైన అస్తిత్వాలకు కొత్త నిర్వచనం ఇచ్చి, కొత్తసందర్భంలోకి తీసుకురావడమనే ఒక ముఖ్యమైన అజెండా వాటికి ఉంది.  దీనిని వారు కూడా కాదనరు. అధికారంలో ఉండడం ఆ అజెండా అమలుకు మంచి వెసులుబాటు. తమ భావజాల అజెండాను అమలు చేయలేనప్పుడు అధికారంలో ఉండడమే అర్థరహితం అవుతుంది. అయితే, విచిత్రంగా అవి చేస్తున్నదేమిటంటే;  దేశాన్నికొత్త సందర్భంలోకి తీసుకురావడమనే తమ అసలు లక్ష్యాన్ని తమే కప్పి పుచ్చుకుంటూ;  తమ అజెండా అమలును పాత సందర్భానికి పొడిగింపుగానే అవి చెబుతున్నాయి. చాలా విషయాలలో అవి చేసే వాదనలో ఇదే వైరుధ్యం కనిపిస్తుంది. ఆయా కుల, మత అంశాలను కొత్త సందర్భంలోకి తీసుకు రావడంలో తమకు దేశవ్యాప్తంగా ఏర్పడే ప్రతికూలవాతావరణంలో ఒకవైపు ఆత్మరక్షణలోకి జారిపోతూనే; ఇంకోవైపు కిందపడినా పై చేయి మాదే నని చెప్పుకోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తూనే, మరో ఎన్నికల తరుణంలో మళ్ళీ అదే అజెండాను పైకి తీస్తున్నాయి. అలాగే, అధికారపక్షంగా ఒకవైపు రాజ్యాంగ పరిధిలో పని చేయవలసి రావడం, ఇంకోవైపు కొత్త సందర్భంలోకి దేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ రాజ్యాంగ పరిధిని లేదా స్ఫూర్తిని తనే దాటడం అనే జోడుగుర్రాల స్వారీ చేస్తున్నాయి. ఇప్పుడున్న ఎన్నికల రాజకీయాల చట్రంలో అవి దళిత, ముస్లిం ఓటర్లను పూర్తిగా దూరం చేసుకోలేవు కనుక; ఒకవైపు కుల, మత పరమైన ఆ గుర్తింపులను దృష్టిలో ఉంచుకుంటూ తమ బ్రాండ్ ‘సంతుష్టీకరణ’ విధానాలను అనుసరించక తప్పదు. మరోవైపు, అలాంటి గుర్తింపులకు అతీతంగా ఒక ఏకశిలా జాతీయతను నిర్మించడమనే తమ భావజాల లక్ష్యం వైపు అడుగులు వేయకతప్పదు.

ఈవిధంగా వాటిది అనేక వైరుధ్యాలు నిండిన దాగుడుమూతలాట. మోదీ అధికారంలోకి వచ్చిన గత ఇరవై మాసాలుగా ఈ దాగుడుమూతల ఆట వివిధ రూపాలలో సాగుతూనే ఉంది. ఒక ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం పాత సందర్భానికి కొనసాగింపుగా కనబడడానికి ప్రయత్నిస్తుంది. కానీ పార్టీ, దాని భావజాలవర్గాలు దేశాన్ని కొత్తసందర్భంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇందుకు ప్రభుత్వం పైకి నిశ్శబ్ద ప్రేక్షకరూపంలోనూ; అది సరిపోనప్పుడు లోపాయికారీగా ఇతరేతర రూపాలలోనూ ప్రోత్సాహం అందిస్తూ ఉంటుంది. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల నేపథ్యం వాస్తవానికి గత ఇరవై మాసాలుగా సాగుతున్న ఈ దాగుడుమూతల ఆటకు కొనసాగింపే.

రోహిత్ అంబేడ్కర్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడు. ఆ యూనివర్సిటీలో అఖిలభారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) సహా మరికొన్ని విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. భావజాల విభేదాలు ఉన్న విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు జరుగుతుండడం, అవి ఒక్కోసారి హింసాత్మకం కావడం దాదాపు అన్నీ యూనివర్శిటీలలో మామూలే. వాటి పరిష్కారాలు, శిక్షలు యూనివర్సిటీ నాలుగు గోడల మధ్యా; ఇంకా అవసరమైతే శాంతి భద్రతల పరిధిలో జరిగిపోతూ ఉంటాయి. అలా చూసినప్పుడు ఇది పాత సందర్భం. కానీ బీజేపీతో భావజాల మైత్రి కలిగిన ఏబీవీపీ దానిని కొత్త సందర్భంలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. విద్యార్థిరంగంలో దళిత/దళితేతర కులాల గుర్తింపులకు అతీతంగా హిందూత్వ ప్రాతిపదికపై అన్ని కులాలను కూడగట్టడం; హిందూ యేతర మతాలను కట్టడి చేయడం దాని లక్ష్యం. పాత సందర్భానికి అదనంగా ఇప్పుడు ఏబీవీపీకి ప్రభుత్వం అనే కొత్త అండ ఉంది. దానిని వాడుకోడానికి ప్రయత్నించింది. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగానే ఉంది. దాని ఫలితమే ఏబీవీపీకి అనుకూలంగా  కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, మానవవనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీల జోక్యం. యూనివర్సిటీ పాలక వ్యవస్థ తన ప్రత్యేక ప్రతిపత్తిని పక్కన పెట్టి ఆ జోక్యానికి దారి ఇచ్చింది. రోహిత్ ఆత్మహత్యతో ఇవన్నీ బయటపడేటప్పటికి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఎప్పటిలా, ఇది పాత సందర్భానికి కొనసాగింపే తప్ప, కొత్తగా జరిగింది ఏమీలేదని తనను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. అది విఫల యత్నంగానే పరిణమించింది. ఇలా ఆత్మరక్షణలో పడిపోవడం-ఏదో విధంగా సమర్ధించుకోవడం గత ఇరవై మాసాలుగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక స్క్రీన్ ప్లే.  ఎన్నిసార్లైనా దీనిని పునరావృతం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్ప మడమ తిప్పే ఉద్దేశంలో లేదు. ఎందుకంటే, దాని అంతిమలక్ష్యం తన భావజాలాన్ని జనంలోకి తీసుకువెళ్లి, దేశాన్ని తను కోరుకునే కొత్త సందర్భంలోకి తీసుకువెళ్లడం.  లోక్ సభలో తిరుగులేని మెజారిటీ, మోదీ లాంటి వ్యక్తి నాయకత్వమూ అందుబాటులో ఉన్న ఈ తరుణంలో ఈ పని  చేయలేకపోతే ఇంకెప్పుడూ చేయలేమని అది భావించడంలో ఆశ్చర్యం లేదు. ఈవిధంగా దానిది విజయమో, వీరస్వర్గమో తేల్చుకోవలసిన పరిస్థితి.

ఈ పరిస్థితిలో ప్రభుత్వాన్ని రాజ్యాంగ నియమనిబంధనలు, ఔచిత్యాల వంటి రకరకాల హద్దులను దాటిస్తే తప్ప పనిజరగదు. ప్రభుత్వమూ, పార్టీ, దాని భావసారూప్య వర్గాలూ పూర్తి స్పృహతో, ఏకీభావంతో ఈ హద్దుల ఉల్లంఘనకు సిద్ధమయ్యాయి. ఎంతోకాలంగా సాగుతున్న ఆత్మహత్యలు, దళిత హింసకు భిన్నంగా, రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయిలో తీవ్ర చర్చనీయాంశం చేసింది ఇదే. నిజానికి కులవివక్షకు, దళిత హింసకు కాంగ్రెస్ తో సహా దాదాపు ప్రధానస్రవంతి పార్టీలు ఏవీ అతీతం కావు. వ్యవస్థాపరంగా చెబితే కులదాష్టీకాన్ని అణువణువునా జీర్ణించుకున్న భూస్వామ్యంతో స్వాతంత్ర్యం తర్వాత కూడా అన్ని ప్రధానపక్షాలూ మమేకమై దానిని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాయి. అయితే, సూత్రరీత్యానైనా కులమత వివక్షలేని లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగ ప్రక్రియకు గత ఆరుదశాబ్దాలుగా మనం అలవాటు పడ్డాం. భూస్వామ్య శక్తులు పూర్తి బలంతో తెరముందుకు రాకుండా ఈ ప్రక్రియ, మళ్ళీ సూత్రరీత్యానైనా వీలైనంతవరకు నిరోధిస్తూ వచ్చింది. ఇంతవరకు అధికారంలో ఉన్న సోకాల్డ్ లౌకిక పక్షాలు రాజకీయంగానూ, లోపాయికారీగానూ కులమత ఆధిపత్యశక్తులతో అంటకాగుతూనే, ప్రభుత్వస్థాయిలో తగుమేరకు తటస్థ పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. కోర్టులు, చట్టాలు, విద్యాసంస్థలు, ఇతర బహిరంగ వ్యవస్థలు పోషించవలసింది అటువంటి తటస్థపాత్రేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఇన్నేళ్లలో కుల, మత హింస చెలరేగినప్పుడల్లా ప్రభుత్వాన్ని కాక, తెరవెనుక శక్తులను దోషులుగా నిలబెట్టడం జరుగుతూవచ్చింది. ఆయా ప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యవస్థలు భిన్న, భిన్న; పరస్పర శత్రుత్వపూరిత భావజాలాల అభివ్యక్తికి స్వేచ్ఛ నిస్తూనే వాటిని రాజ్యాంగం, చట్టాల పరిధి దాటకుండానూ; శాంతి భద్రతల పరిధిలోనూ నియంత్రిస్తూ యధాశక్తి తటస్థ భూమిక పోషిస్తూ వస్తున్నాయి.

ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వమూ, దాని భావసారూప్య వర్గాలూ ఈ తటస్థత అనే పలచని పొరను కూడా తొలగిస్తున్నాయి. రోహిత్ ఉదంతంలో జరిగింది అదే. ఫలితంగా, ముక్కూ, మొహం లేని వ్యవస్థ స్థానంలో;  రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన, స్పష్టమైన రూపురేఖలు కలిగిన ఒక ప్రభుత్వం ఇందులో దోషిగా నిలబడింది.  రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయికి ఎక్కవలసిన తీవ్ర పరిణామం అయినది అందుకే.  అయినాసరే, ఎంత అప్రతిష్ట పడినా, ఎన్నికల ఓటమి రూపంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు ఆత్మరక్షణలో పడవలసివచ్చినా ఈ తటస్థత అనే పొరను ఎన్నిసార్లైనా ఉత్తరించడానికి బీజేపీ, దాని ప్రభుత్వమూ, దాని భావసారూప్య వర్గాలూ కంకణం కట్టుకున్నాయి. ఎలాగైనా సరే తమ భావజాలాన్ని నెగ్గించుకుని, దేశాన్ని ఎప్పటికైనా పూర్తిగా కొత్త సందర్భంలోకి తీసుకువెళ్ళే కృతనిశ్చయంతో ఉన్నాయి. తటస్థ ప్రదేశంలోకి ప్రభుత్వం చొచ్చుకు వెళ్లడానికి ప్రయత్నించిన ఉదాహరణలు ఈ ఇరవై మాసాలలో ఇంకా చాలా కనిపిస్తాయి. ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగం కల్పించిన తటస్థభూమిక ఎప్పుడైతే బలహీనపడిపోతుందో అప్పుడిక ఈ దేశంలో ఎంతో చరిత్ర కలిగిన రకరకాల శత్రు పక్షాలూ, భావజాలాలూ బలాబలాలు తేల్చుకోడానికి పూర్తి శక్తియుక్తులతో, అత్యంత నగ్నంగా యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టడం సహజ పరిణామం. వివిధ భావజాలాలను హద్దుల్లో ఉంచుతూ నియంత్రణ పాత్రను పోషించే ‘రిఫరీ’ అదృశ్యమైనప్పుడు అప్పుడిక NO HOLDS BARRED!

ఇప్పుడు అదే జరుగుతోంది. చూస్తున్నది, చూడబోతున్నది కచ్చితంగా వందలు, వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఒక సంకుల సమరం. అక్షరాలా భిన్న భావజాలాల మధ్య జరుగుతున్న కురుక్షేత్రం. పాత/కొత్త సందర్భాల మధ్య అమీ తుమీ తేల్చుకోడానికి పెద్ద ఎత్తున జరుగుతున్న, ఇంకా ముమ్మరం కాబోతున్న పెనుగులాట. ఈ క్షణాన ఢిల్లీలో జరుతున్నది దేశగమనాన్ని గత ఆరుదశాబ్దాల అనుభవానికి భిన్నమైన మలుపు తిప్పగల ఒక అతి పెద్ద రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రయోగం! ఇది ఎలా పరిణమిస్తుందన్నది కాలానికి విడిచిపెట్టవలసిన ప్రశ్న.

*

 

 

 

 

(అంబేద్క) ‘ రైటేనా ఐలయ్య ‘ ?

 

-పి. విక్టర్ విజయ్ కుమార్ 

~

 

ఐలయ్య అంటే ఒక ధిక్కార స్వరం.  ఐలయ్య అంటే హిందూ బ్రాహ్మణ వ్యతిరేక గర్జన. ఇదే భావన ఈ వ్యాస కర్తతో పాటు ఎందరో ప్రజాస్వామ్య కాముకులను ఆయన విషయం లో ఆకట్టుకుంంటుంది.    ఐలయ్య రాసిన  Why I am not a Hindu, Buffalo Nationalism: A Critique of Spiritual Fascism.    మొదలైన పుస్తకాలు బ్రాహ్మణ హిందూత్వాన్ని నిలువునా ప్రశ్నించాయి. ఈ మధ్య కాలం లో ఐలయ్య రాస్తున్న వ్యాసాల్లో ఎన్నో   contradictions   కనిపిస్తున్నాయి. నిజానికి  – ఇంకా నిశితంగా చెప్పాలంటే , తెలంగాణా ఉద్యమం ఊపందుకున్నప్పటి నుండి తనదైన ప్రగతి వాద శైలిలో కాకుండా , భిన్న స్వరం తో వ్యాసాలు రావడం మొదలు పెట్టాయి. ఆయనకున్న తెలంగాణా వ్యతిరేకతను అటు ఉంచితే, దళిత సంక్షేమ వాదనలో కూడా తేడాలు కొట్టొచ్చినట్టు అగుపిస్తున్నాయి.

ఈ మధ్య తెలంగాణా రాష్ట్ర వ్యవస్థను దుయ్యపడుతూ, విప్లవ వాదుల  ‘ వరంగల్ డిక్లరేషన్ ‘ ను తప్పు పడుతూ ఇలా రాస్తాడు –

” ఇక్కడే కమ్మ క్యాపిటలిజంపై కోపం వెలమ భూస్వామ్యంపై ప్రేమ మార్క్సిజంగా మారింది. “ “ కమ్మ పెట్టుబడిపై మావోయిజానికి అంత కోపమెందుకొచ్చిందీ, వేలాది మంది చనిపోయినంక వెలమ ఫ్యూడలిజంపై ప్రేమ ఎందుకు కలిగింది? ”

ఈ వాక్యాన్ని – దళిత దృక్పథం  తో గమనిస్తే – పెట్టుబడుల్లో కమ్మ పెట్టుబడి తీరు, రెడ్డి పెట్టుబడి తీరు  లేదా అగ్ర కులాల పెట్టుబడులలో ఒక్కో కులం యొక్క పెట్టుబడి తీరు కేవలం వేరు అని కాక గుణాత్మకంగానే వేరు గా   ఉంటుందని చెప్పడానికి సిద్ధమైనట్టు తెలియ జేస్తుంది. పెట్టుబడుల్లో  అందులో అగ్ర కులాల పెట్టుబడుల్లో – కొన్ని ‘ మంచి పెట్టుబడులు ‘ , కొన్ని ‘ చెడ్డ ‘ పెట్టుబడులు ఉంటాయా ? బ్రాహ్మణియ మనువాద శక్తులు – ఈ దేశ కేపీటలిస్ట్ వ్యవస్థను ముట్టడి చేసాక , మీడీయా, ఎంటర్ టెయిన్ మెంట్, ఇంఫ్రాస్ట్రక్చర్ , రిటెయిల్ అని రంగాలలో  అగ్ర కుల పెట్టుబడులు దేశ వనరులను కొల్ల గొడుతున్నాయి. మన దేశం  జీ డీ పీ అభివృద్ధి లో దళితుల షేర్ ఎంత అని ప్రశ్న వేసుకుని , అగ్ర కులాలు , దళితుల షేర్ లో గేప్ – కనీసం 4 శాతంగా గుర్తించినా , 18 సంవత్సరాలలో , దళిత అగ్ర కులాల మధ్య ఆర్థిక అంతరం ఇప్పుడున్న దాని కంటే రెట్టింపు అవుతుంది ( ఇది ఇకనామిక్స్ లో సింపుల్ మేథ్  మేటికల్ ఫార్ములా  ).  ఇందులో – ప్రజాస్వామిక అగ్ర కులాల పెట్టుబడి వలన పెరిగిన అంతరం ఎంత ? అప్రజాస్వామిక  అగ్ర కులాల వలన పెట్టుబడి వలన జరిగిన అంతరం ఎంత అని చూడ్డం – దళిత దృక్పథాన్నే మార్చి చూడ్డం కాదా ?

అంబేద్కర్ ఈ దేశం గర్వించ దగ్గ మొదటి ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన కేపిటలిజం ను ఆర్థిక దృక్పథం తో చూడ్డం మాత్రమే అన్నిటికీ సమాధానం అన్న పిడి వాదాన్ని నమ్మలేదు. అలాగని – కేపిటలిజం లో మంచి కేపిటలిజం చెడ్డ కేపిటలిజం అని ఉంటుందని చెప్పలేదు.   ” Caste is nothing but a class enclosue ”    అని చెప్పిన అంబేద్కర్ , కేపిటలిజం ను సాంఘిక కోణం నుండి విశ్లేషించిన మొదటి సోషలిస్ట్ ఆర్థిక వేత్త. ( అంబేద్కర్ కోరుకున్నది  ” సోషలిస్ట్ డెమోక్రసీ ” అన్నది ప్రస్తుతం సబ్జెక్ట్ కాదు ఇక్కడ ).

” ఇక్కడే కమ్మ క్యాపిటలిజంపై కోపం వెలమ భూస్వామ్యంపై ప్రేమ మార్క్సిజంగా మారింది. ” అని రాస్తే  ఇలాంటి  ప్రవచనాలు ఏం తెలియ జెప్పుతాయి ? బ్రాహ్మణీయత ను విడదీసి – అందులో ఒకె మెతుకు ఏది ఎక్కువ, ఏది తక్కువ అని చూడ్డం వలన ఎవరికి ఉపయోగపడుతుంది ఈ భావజాలం ? రేపు కమ్మ వాళ్ళందరూ చేరి ” చూసారా ! ఐలయ్య లాంటి గొప్పోడే మా కేపిటలిజం పై కోపం తప్ప విప్లవానికి వేరే వ్యతిరేకత లేదు అంటున్నాడు. మేమెలాగైనా మంచోళ్ళే. ” అంటే ఏం సమాధానం నా లాంటి దళిత పక్ష పాతులు ఇవ్వగలరు ?

అన్నిటికంటే బాధాకరమైన ప్రవచనం ఏంటంటే – ” భారత దేశంలో భూస్వామ్య వర్గానికి కుల అణిచివేత స్వభావం ఎక్కువ ఉంటుందా, లేక పెట్టుబడిదారీ వ్యవస్థలో పనిచేసేవారికి ఎక్కువ ఉంటుందా?  ”

ఏంటి ఈ పోలిక ? ఎక్కడికి దారి తీస్తుంది ? ‘ ఎక్కువ ‘ అంటే ఎంత ? అసలు అణచివేసే దుర్మార్గుల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏంటి ?

ఇలా కాక కొన్ని అసంబద్ధమైన విశ్లేషణలు కూడా విరివిగా కనిపిస్తాయి. ” హైదరాబాదులోని పెట్టుబడి కోస్తా జిల్లాల్లోని ఆగ్రో ఎకానమిలోని సర్ప్లస్ ఆగ్రో ఇండస్ట్రీస్ గా  మారి గ్లోబలైజేషన్లో భాగస్వామ్యంగా ఎదుగుతున్నది. ”

నిజమే ! కోస్తాలో ఆగ్రో ఎకానమీ పెద్ద స్థాయిలో ఉంది. మరి ‘ సర్ ప్లస్  ‘ ఆగ్రో ఇండస్ట్రీ   definition   ఏంటి ? అంబేద్కర్ ‘ సర్ ప్లస్ మేన్ ‘ ‘ సర్ ప్లస్ వుమన్ ‘ అని ‘ సర్ ప్లస్ ‘ ను వాడ్డం జరిగింది కాని – ఒక పరి శ్రమనే ‘ సర్ ప్లస్ ‘ అనడం ఏ సూత్రం ? ఏ దృక్పథం తో అలా అనాలి ?

” మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెంది లేదా విప్లవాత్మక మార్పుకు గురై ఫ్యూడల్ వ్యవస్థ దెబ్బతిని లేదా దెబ్బతీయబడి పెట్టుబడి వ్యవస్థ వైపు ఉత్పత్తి శక్తులు పయనించడం సరైంది. గతితార్కిక సిద్ధాంతం ప్రకారం మార్పు ప్రక్రియ దాన్నే కోరుకుంటుంది ” – అంటూ ఒక చోట మార్క్సిజం గురించి ప్రస్తావిస్తాడు.   ‘సరైంది ‘ అంటే – అలానే ఉండాలి అనా   ? అలా ఉంటుంది అది అంతే అనా ? గతి తార్కిక సిద్ధాంతం దేన్నీ కోరుకోదు. వివరిస్తుంది.  గతి తార్కిక సిద్ధాంతం కులం ఎలా ఉంటుందో అది ఎలా విశ్లేషించాలో ఒక సూత్రాన్ని మనకు చెప్పొచ్చేమో అంతే కాని ఇలా కన్ ఫ్యూజ్  చేయదు. ఇంత సీరియస్ సబ్జెక్ట్ రాస్తున్నప్పుడు పద ప్రయోగం లో  ఇలా ఐలయ్య ఎలా ఫెయిల్ అవ్వగలడొ తెలీదు.

అంబేద్కర్ ఏమన్నాడో చూడండి –  ” It ( Democracy) has left the economic structure to take the shape given to it by those who are in a position to mould it ”   అన్న దృక్పథం తో ఐలయ్య చెబుతున్న దృక్పథం  తో పోలిస్తే ఎక్కడ సమన్వయం కుదురుతుంది ?

bhim-rao-ambedkar

ఇవన్ని ఇలా ఉండగా ” ఫ్యూడలిజంలో ఉత్పత్తి కులాలు పెత్తనం చెయ్యలేనట్లే, పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా అవి పెత్తనం చేయలేవు. కనీసం ఈ చిన్న రాష్ట్రపు ఎన్నికల రంగాన్నైనా ఒక సోషల్ డెమొక్రాటిక్ ఎన్నికల రంగంగా మార్చి కనీసం ఒక దళితున్నో, బీసీనో (ఏదో ఒక సిద్ధాంత పట్టుతోనే) ముఖ్యమంత్రిని చేసి ………”  ఇలా ప్రతిపాదనలు కనిపిస్తాయి.  ఎన్నికల రంగాన్ని మాత్రమే సోషల్ డెమోక్రటిక్ రంగంగా మలచడం ఏంటి ? బ్రాహ్మణిజం ను ఎదుర్కోవడం ఒక రంగానికి మాత్రమే సంబంధించిన విషయమా ?  అంబేద్కర్ ఈ విషయం లో ఏమన్నాడో  చూడండి    ” … Constitutional Lawyers have been dominated by the antiquated conception that all that is necessary for perfect constitution for democracy was to frame a Constitutional Law. Consequently almost all Laws of Constitution, which relate to countries whic are called Democratic, stop with Adult Suffrage and Fundamental RIght. They have never advanced to the conception that Constitutional Law of Democracy must go beyond Adult Suffrage and Fundamental RIghts ”    ఇంత చక్కటి క్లారిటీ అంబేద్కర్ కుంది. ఆయన ఆలోచనా విధానాన్ని ఇలా అసౌష్టవంగా  చూపించడం దేనికి ?

ఐలయ్య గొప్ప దనం ఐలయ్య లో  కొంత ఉంది. అసలు గొప్ప దనం అతని వాదనకు ప్రత్యామ్నాయంగా నిలబడాల్సిన చిత్తశుద్ధి కలిగిన ఉద్యమాలలో అగ్ర స్థానం లో ఉండే విప్లవ సంస్థ ల్లో ఉండే బలహీనత వల్ల ఉంది.   వి ర సం లాంటి సంస్థలు – చలం, గురజాడ కు జరిపిన వేడుక సభలు – జాషువా , అంబేద్కర్ కు ఎన్ని జరిపారు ?  జాషువా గొప్ప ‘ ప్రతిభ ‘ కల్ల వాడు కాకపోవచ్చు వాళ్ల దృష్టిలో. కాని దళిత కుటుంబం నుండి వచ్చి – బ్రాహ్మణియ సాహితీ వ్యవస్థలో తిష్ట వేయడాన్నైనా అభినందించరా ? ఏదో ఒక సభలో కనీసం టేబుల్ మీద ఆయన ఫొటో పెట్టి నివాళులు అర్పించడానికి కూడా అంబేద్కర్ సరిపోడా వి ర సం దృష్టిలో ? ఐలయ్య మార్క్సిజం కు వ్యతిరేకంగా  మాట్లాడి ఉండవచ్చు కాని – ఆయనపై హిందూ మత తత్వ సంస్థలు పోలీసు కేసు పెట్టినప్పుడు  మద్దతు ప్రకటించిన విప్లవ సంస్థలు, విప్లవ సభ్యులు ఒక్కరన్నా ఉన్నారా ?  కాల్బర్గీ హత్య పై మాత్రం అంత స్పందన ఎలా సాధ్యం ? కర్నాటక లో ఉన్న కాలబర్గీ ఎవరో కూడా – ఈ విప్లవ సంస్థలకు తెలీదే ?  పక్కనే ఉన్న ఐలయ్యకు నామ మాత్రంగా అయినా మద్దతు తెలపడానికి ఏ ఇగో అడ్డొచ్చింది ? ఇలాంటి  behaviour  దళితుల్లో,  ముఖ్యంగా ఎడ్యుకేట్ అయిన దళితుల్లో   confidence  నింపలేకపోతుంది.

MRPS  జెండా పట్టి , కుమ్మక్కు రాజకీయాల్లో ఇమడ లేక వీధిన పడ్డ దళితులున్నారు.  చుండూరు ఉద్యమం లో అన్నీ వదిలేసి , దళితుల పై ప్రేమతో ఉద్యమ బాట పట్టి కెరీర్ లను , కుటుంబాలను నష్టం చేసుకున్న దళితులున్నారు. తెలుగు దేశం, ప్రజా రాజ్యం లాంటి అగ్ర కుల బ్రాహ్మణీక పార్టిలు ఈ ఉద్యమాలను వాడుకుని వదిలేస్తే , దిక్కు తోచక సరి అయిన సైద్ధాంతిక ఆచరణ ఏంటొ తెలియని పరిస్థితుల్లో దళితులు చేరి – ఎవడో ఒకడు మనోడు, ఎక్కడొ ఒక చోట, ఎలాగోలా ఉంటే పర్లేదులే అన్న ‘ రాజీ భావన ‘ కు వచ్చారు. చివరికి దళిత దృక్పథం సరి అయిన నాయకత్వం లేక ‘ రాజీ సిద్ధాంతాలతో ‘ బతుకుతుంది. ప్రతి ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని  paranoic (అంటే విషయాన్ని తెలీని అనుమానం తో చూడ్డం)  గా చూడ్డం మొదలయ్యింది. ఇదే ‘ రాడికల్ దళిత వాదంగా ‘ చలామణీ అవుతూ మధ్య తరగతి దళితుల మన్ననలు పొందుతుంది.    ఐలయ్యలా  అక్కడో ఇక్కడో – ఒకటి రెండు అగ్ర కులాలను తిడుతూ – ముఖ్యంగా వెలమ కులాన్ని, ఒకటి అర కులాల్ని ఇదే  paranoic  ధోరణి తో దుయ్య బడితే అది దళిత వాదం అయిపోదు. అంబేద్కర్ చెప్పిన బ్రాహ్మిణిజం ను  letter and spirit  లో అర్థం చేసుకున్న రోజు ఇలాంటి ప్రమాదాలు నివారించ వచ్చు.

ఐలయ్య దుర్మార్గుడు అని చెప్పడం కాదు ఇక్కడ. చారిత్రక నేపథ్యం లో అగ్ర కుల  రాజకీయాలు, దళిత రాజాకీయాలను ఎలా ధ్వంసం చేసాయో గమనించి, ముందుగానే    early symptoms    కోసం గమనించి    cautious   గా ఉండమని చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

*

కొత్త శాటర్న్ స్వపుత్ర భక్షణ

 

                                                           -సత్యమూర్తి

జరిగిన కథ:  దేవతల రాజైన శాటర్న్ తన తండ్రి కేలస్ ను గద్దె దింపి తను సింహాసనమెక్కుతాడు. శాటర్న్ ను కూడా అతని కొడుకుల్లో ఒకడు పదవీచ్యుతుణ్ని చేస్తాడని భవిష్యవాణి చెబుతుంది. దీన్ని అడ్డుకోవడానికి శాటర్న్ తన భార్య ఓపిస్ కు పిల్లలు పుట్టీపుట్టగానే వాళ్లను కొరికి చంపితినేస్తాడు. అలా ఐదుగురు పిల్లల్ని తినేస్తాడు. ఆరో కాన్పులో జూపిటర్ పుడతాడు. ఓపిస్ ఆ పిల్లాణ్ని క్రీట్ ద్వీపంలో దాచేసి, ఓ గుడ్డలో రాయిని పెట్టి అదే బిడ్డ అని శాటర్న్ కు ఇస్తుంది. శాటర్న్ నిజమనుకుని తినేస్తాడు. జూపిటర్ క్రీట్ ద్వీపంలో పెరిగి పెద్దయి తన తండ్రిమీద దండెత్తి తను రాజు అవుతాడు. అలా భవిష్యవాణి నిజమవుతుంది.. ఇక చదవండి..

పదవి కోల్పోయిన శాటర్న్ అధికారం కోసం అలమటిస్తూ కన్నుమూశాడు. దైవ నిర్ణయం ప్రకారం భూలోకంలోని ఒక రాజ్యంలో మానవుడిగా పుట్టాడు. ఆ రాజ్యం పేరుకే రాజ్యం కాని, రాజు లేడు. పెత్తనమంతా పక్క రాజ్యపు రాజుదే. మానవుడిగా అవతరించిన శాటర్న్ కు గత జన్మ వాసనలు ఇంకా పోలేదు. శక్తిసామర్థ్యాలు పిసరంత కూడా తగ్గలేదు. వాటికి వాచాలత కూడా తోడైంది. ఈ కొత్త శాటర్న్ కు  అధికార దాహం కూడా గత జన్మలోకంటే మరింత ఎక్కువైంది. అధికారం దక్కితే ఎలా కాపాడుకోవాలో కూడా ఆలోచించాడు.

గత జన్మలో కొడుకు వల్ల అధికారం పోయింది కనుక ఈ జన్మలో అసలు పిల్లల్నే కనొద్దని నిర్ణయించుకున్నాడు. అధికారం కోసం పావులు కదిపాడు. పక్క రాజు పెత్తనాన్ని సహించొద్దని తన రాజ్య జనానికి చెప్పి తిరుగుబాటు లేవదీశాడు. పక్క రాజు పెత్తనం పోతే జనంలోని అట్టడుగు వర్గపు ఒక మనిషిని రాజును చేస్తానని నమ్మబలికాడు. జనం నమ్మి పక్క రాజ్యపు రాజుపై తిరగబడి పెత్తనం వదిలించుకున్నారు. కొత్త శాటర్న్ తన హామీని తుంగలో తొక్కి తనే రాజయ్యాడు. తనే జనాన్ని పీడించడం మొదలెట్టాడు. రాజ్యం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడింది. జనం బాధలు ఎక్కువయ్యాయి. కొత్త శాటర్న్ అధికారం అనుభవిస్తూ మత్తుపానీయాలు గ్రోలుతూ సుఖించసాగాడు.

కొత్త రాజు పాలన గిట్టని జనం తిరుగుబాటు చేశారు. కొత్త శాటర్న్ సైన్యాన్ని వాళ్లపై ఉసిగొల్పాడు. ఆయుధ బలం చాలని తిరుగుబాటుదారులు అడవులకెళ్లి యుద్ధసన్నాహాలు ప్రారంభించారు.

కొత్త శాటర్న్ ఓ మిట్టమధ్యాహ్నం మద్యం మత్తులో జోగుతుండగా భవిష్యవాణి వినిపించింది. ‘గత జన్మలో మాదిరే ఈ జన్మలోనూ నువ్వు నీ పుత్రుల చేతిలోనే చస్తావు’ అని భవిష్యవాణి పలికింది. అసలు తనకు పిల్లలే లేరు కదా అని అడగబోతుండగా భవిష్యవాణి అంతర్ధానమైంది.

కొత్త శాటర్న్ తొలుత భయపడిపోయాడు. తనకు సంతానం లేదు కనుక భవిష్యవాణి నిజం కాబోదనుకుని కాస్త కుదుటపడ్డాడు. కానీ గత జన్మవాసనలు భయపెట్టాయి. పండితులను పిలిపించి విషయం చెప్పాడు. వాళ్లు బుర్రలు చించుకుని ఒక నిర్ధారణకు వచ్చారు. ‘ప్రభూ! మీకు పుత్రులు లేకపోవచ్చు కాని, జనమంతా మీ పుత్రసమానులే కదా. బహుశా వాళ్ల చేతుల్లో మీరు చస్తారు కాబోలు’ అని చెప్పారు. కొత్త శాటర్న్ కంగు తిన్నాడు. మామూలు జనంతో తనకు ప్రమాదం లేదని, ఉన్న ముప్పల్లా  తిరుగుబాటు చేసి అడవులకెళ్లిన జనంతోనే అని నిర్ధారించుకున్నాడు. సైన్యాన్ని రెట్టింపు చేసి.. తిరుగుబాటుదారులను చంపాలని అడవులకు పంపాడు. కానీ జంకు మాత్రం ఇంకా పోలేదు.

గత జన్మ వాసనలు వెంటాడుతూనే ఉన్నాయి మరి. ఈసారి ఎవరి చేతిలోనూ మోసపోకూడదనుకున్నాడు. తానే స్వయంగా అడవులకెళ్లాడు. సైన్యం సాయంతో అడవులను జల్లెడ పడుతూ తిరుగుబాటుదారులను పట్టుకున్నాడు. ఒక్కొక్కరిని మెడకొరికి, రక్తం జుర్రుకుని, భుజాలు కొరికి, మొండాలు కొరికి, కాళ్లు కొరికి.. సంపూర్ణంగా తినడం మొదలెట్టాడు. భవిష్యవాణి పుత్రుల చేతిలో చస్తావని చెప్పిందే తప్ప కచ్చితంగా ఎవరిచేతిలో, ఎన్నోవాడి చేతిలో చస్తావని చెప్పకపోవడంతో కొత్త శాటర్న్ తన రాజ్యంలోని అడవులన్నింటినీ గాలిస్తూ నరమాంసభక్షణ యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నాయి కాని, అడవులు తరగడం లేదు. తిరుగుబాటుదారులూ తరగడం లేదు.. (సశేషం)

(వరంగల్ జిల్లా మెట్లగూడెం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా. శాటర్న్ కథ రోమన్, గ్రీకు పురాణాల్లోనిది)

*

 

 

 

 

 ‘సంభాషణ’ అవసరాన్ని గుర్తిద్దామా?

 

-భాస్కరం కల్లూరి

కల్లూరి భాస్కరం

చావు అనేది అంతిమం.  ఆ తర్వాత ఏమీ ఉండదు. సహజీవనం, సామరస్యం, సంభాషణ లోపించినప్పుడు ఏర్పడే ఒక శూన్యంలో మనిషి సాటి మనిషి ప్రాణం తీయడం జరుగుతుంది. ఆ దశలో అతన్ని మనిషి అనడానికి వీల్లేదు. పశువు అని కూడా అనకూడదు. అంటే పశువును అవమానించడం అవుతుంది. ఎందుకంటే పశువుకు ఆలోచించే శక్తీ, సంభాషించే శక్తీ ఉండవు. ఆ రెండూ ఉన్న మనిషి ఇంకో మనిషిని చంపినప్పుడు అతనికి ఇంకో పేరు సృష్టించుకోవలసిందే.

కల్బుర్గి హత్యను ఖండించడం ‘మనిషి’ అనిపించుకోడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరి బాధ్యత. అందులో కల్బుర్గి సమర్థకులే కాదు, వ్యతిరేకులు కూడా వస్తారు. చావు ఇంకో చావును మాత్రమే పుట్టిస్తుంది. చావులోంచి బతుకు పుట్టదు. ఈరోజు కల్బుర్గి హత్య జరిగితే, రేపు కల్బుర్గి భావజాలాన్ని వ్యతిరేకించేవారి హత్య జరగచ్చు. ఈ హత్యల గొలుసుకట్టు ప్రయాణంలో మనిషి పూర్తిగా గల్లంతైపోతాడు. మనిషి అనిపించుకోవడానికి ఇంకో షరతు ఏమిటంటే, కల్బుర్గి హత్యను ఖండించినట్టే, రేపు కల్బుర్గి వ్యతిరేకుల హత్యను కూడా అంతే గట్టిగా ఖండించాలి.

ప్రకృతి ఏర్పాటుకు విడిగా ఒక మనిషిని సృష్టించే శక్తి మనిషికి ఎలా లేదో, ప్రకృతి ఏర్పాటుకు విడిగా ఒక మనిషిని చంపే శక్తి కూడా ఉండకూడదు. అన్ని మతాలూ అదే చెబుతాయి. కానీ మతం పేరుతోనే చంపడం– మనిషితనానికి మనిషి ఎంత దూరమయ్యాడో తెలిపే కొండగుర్తు(అనేకానేక సందర్భాలలో సామూహిక హత్యలు జరుగుతుంటాయి. వాటిలో కొన్నింటిపై ‘దేశభక్తి’ ముద్ర కూడా ఉంటూ ఉంటుంది. చంపడం అన్నప్పుడు నేను వీటన్నింటినీ ఉద్దేశించడం లేదు. ఈ  రకమైన సామూహిక హత్యాకాండ నుంచి  మానవాళి ఎప్పటికైనా బయటపడుతుందో లేదో తెలియదు. ఈ లోపల నివారించగలిగిన హత్యల గురించే నేను మాట్లాడుతున్నది).

కల్బుర్గి హత్యపై ఆయన సమర్థకులు, వ్యతిరేకుల స్పందనలు రెండింటిలోనూ ఒకే విధమైన ఆవేశం కనిపిస్తోంది. అది ఎంత సహజమే అయినా, ఇది ఆలోచనకు కూడా సందర్భం. కల్బుర్గి సమర్థకులకు, వ్యతిరేకులకూ కూడా! కల్బుర్గి దైవదూషణకు, విగ్రహాలపట్ల దారుణ అపచారభావనకు పాల్పడ్డారని, మా మనోభావాలు గాయపడ్డాయని ఆయన వ్యతిరేకుల ఆరోపణ. కల్బుర్గి హత్యను ఖండించడంలో ఆయన సమర్థకులు, ఆయన వ్యతిరేకుల మనోభావాలను మరింత గాయపరచడానికి పూనుకున్నారు. దాంతో కల్బుర్గి వ్యతిరేకులు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో కల్బుర్గి హత్యను సమర్థించేవరకూ వెళ్లారు. ఇద్దరూ చెరో చిటారు కొమ్మా ఎక్కి కూర్చున్నారు. చావు అనే అంతిమం చర్చనీయం కావాల్సింది పోయి, కల్బుర్గి చేసింది తప్పా ఒప్పా అన్నది చర్చనీయంగా మారింది. కారణం, రెండువైపులా ఆవేశం, ఆవేశం…ఆలోచన లోపించిన వీరావేశం!

అసలెందుకిలా జరుగుతోంది, ఎందుకిలా జరగాలి, దీని చరిత్ర ఏమిటి, ఈ చరిత్రను ఇప్పుడైనా మార్చలేమా అని రెండు వర్గాలూ ఆలోచించుకోవలసిన సందర్భం ఇది. అంటే రెండు వర్గాలలోనూ, వర్గాల మధ్యా అంతర్విమర్శా, సంభాషణా జరగాలన్నమాట.

రెండు శత్రుదేశాల సంబంధాలతో దీనిని పోల్చిచూసినప్పుడు మనకేమైనా మార్గం కనిపిస్తుందా?!

ఉదాహరణకు భారత, పాకిస్తాన్ లనే తీసుకుందాం. రెండింటి మధ్యా నిరంతర సమరవాతావరణం ఉంటూనే ఉంది. అదే సమయంలో శాంతి అవసరాన్నీ, అందుకు రెండు వైపులా జరగవలసిన కృషినీ నొక్కి చెప్పడమూ జరుగుతూనే ఉంది. ఒక్కోసారి రెంటి మధ్యా ఎలాంటి సంభాషణా జరగడానికి వీలులేదనే వైఖరిని తీసుకోవడం, ఒక్కోసారి దానిని పూర్తిగానో, పాక్షికంగానో సడలించి సంభాషణ జరగాలనే వైఖరి తీసుకోవడం చూస్తూ ఉంటాం. ఇందులో మళ్ళీ ఎన్నో తేడాలు. ఎలాంటి పరిస్థితులలో నైనా సంభాషణ ఆగకూడదనేవారూ, పాకిస్తాన్ పూర్తిగా దారికి వస్తే తప్ప సంభాషణ జరగడానికి వీల్లేదనేవారూ, పరిస్థితులు ఎలా ఉన్నాసరే, శత్రుత్వపు మంటను నిర్విరామంగా రాజేసేవారూ-రెండు వైపులా ఉన్నారు. ఇన్నేళ్లలో కాల్పుల విరమణ సంధి ఉల్లంఘనలు పదేపదే జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. అధికారంలో లేనప్పుడు పాకిస్తాన్ తో సంభాషణ జరగడానికి వీల్లేదని శాసిస్తూ వచ్చినవారే, అధికారంలోకి వచ్చాక సంభాషణ అవసరాన్ని నొక్కి చెబుతూ ఉంటారు. అంటే, అధికారంలో లేనప్పుడు గుర్తించని బాధ్యతను అధికారంలోకి వచ్చాక గుర్తిస్తున్నారన్నమాట. ఇక్కడ ‘బాధ్యత’ అనే మాటను దృష్టిలో ఉంచుకోవాలి.

దాంతోపాటు, భారత-పాకిస్తాన్ సంబంధాల సమరస్వభావం అలా ఉండగా, దండలో దారంలో ‘సంభాషణ’ కూడా చర్చలోకి వస్తుండడాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి.

ఇదే అంశం తీవ్రతా భేదంతో భారత-చైనా సంబంధాలకూ వర్తిస్తుంది. 1986 వరకూ చాలాకాలంపాటు రెండు దేశాల మధ్యా సంభాషణ కానీ, రాకపోకలు కానీ లేని పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత అసలు వివాదమైన సరిహద్దు వివాదాన్ని పక్కన ఉంచుతూ, సంభాషణకూ, రాకపోకలకూ తెరతీయడం; వాణిజ్యం తదితర రంగాలలో సంబంధాలను పునరుద్ధరించుకోవడం సంభవించింది.

కల్బుర్గి హత్య దగ్గరికి మళ్ళీ వద్దాం. రెండు దేశాల మధ్య ఘర్షణలానే, రెండు భావజాలాల మధ్య ఘర్షణను ఈ హత్య సంకేతిస్తోంది. పైగా భారత-పాకిస్తాన్, భారత-చైనాల శత్రుత్వం కన్నా ఇది అతి పురాతనం. ఎంత పురాతనమో స్థూలంగా చెప్పాలంటే, రామాయణమంత పురాతనం. అందులో రాముడు పరలోకాన్ని, విశ్వాసాన్ని నొక్కిచెప్పే ఋషుల భావజాలానికి ప్రతినిధి అయితే, జాబాలి దానికి భిన్నమైన భావజాలానికి ప్రతినిధి. వారిద్దరి మధ్యా ఒక సందర్భంలో వాదోపవాదాలు జరుగుతాయి. అలాగే మహాభారతంలో కురుక్షేత్రయుద్ధం జరిగిన తర్వాత ధర్మరాజు హస్తినాపురానికి వస్తుంటాడు. అప్పుడు చార్వాకుడు అతన్ని అడ్డుకుని ఇంతటి యుద్ధానికీ, రక్తపాతానికీ, విధ్వంసానికీ కారణం నువ్వే నంటూ తూలనాడతాడు. అప్పుడు ధర్మరాజు వెంట ఉన్న బ్రాహ్మణులు అతన్ని చంపేస్తారు. ఆ తర్వాత కూడా రెండు భావజాలాల మధ్య శత్రుత్వపు పాయ చరిత్రపొడవునా కొనసాగుతూనే ఉంది.  బుద్ధుడు, వేమన లాంటివారు ఈ ఘర్షణకు ప్రాతినిధ్యం వహిస్తూనేవచ్చారు. అంబేడ్కర్, కల్బుర్గి, పనాసే, ధబోల్కర్, యూ. ఆర్, అనంతమూర్తి లాంటివారు వీరికి ఆధునికమైన కొనసాగింపులు మాత్రమే.

రెండు దేశాల మధ్య శత్రుత్వంతో పైన చెప్పిన రెండు రకాల భావజాలాల మధ్య శతృత్వాన్ని పోల్చడంలో నాకైతే ఎలాంటి అనౌచిత్యం కనిపించడంలేదు. ఒకటి బాహ్యశక్తులతో ఘర్షణ. ఇంకొకటి అంతర్గత శక్తుల మధ్య ఘర్షణ. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, బాహ్యశక్తులతో ఘర్షణలో శాంతి, సామరస్యం, సంభాషణల అవసరాన్ని గుర్తించి నొక్కి చెబుతున్నప్పుడు; అంతర్గత శక్తుల మధ్య భావజాలాల ఘర్షణలో ఎందుకు నొక్కి చెప్పడం లేదు, ఎందుకు నొక్కి చెప్పకూడదు?! అంతర్గత శాంతి, సామరస్యాలు కూడా అంతే ముఖ్యం, బహుశా అంతకంటే ఎక్కువే ముఖ్యం కదా? బాహ్యశక్తులను కలసికట్టుగా ఎదుర్కోడానికైనా అది అవసరమే కదా?!

రెండు దేశాల మధ్య సమర వాతావరణం నిరంతరాయంగా కొనసాగడం మంచిది కాదు కనుక, శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి సంభాషణను ఆశ్రయించడంలో అధికారంలో ఉన్నవారు ‘బాధ్యతా’ స్పృహతో వ్యవహరిస్తున్నారన్నమాట. మరి రెండు అంతర్గత భావజాలాల ఘర్షణ ఇలా హింసకు, రక్తపాతానికి దారితీస్తున్నప్పుడు ఆ బాధ్యత ఏమైపోయింది; ఆ ఘర్షణను నివారించి శాంతి, సామరస్యాలకు కృషి చేయవలసిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? దానికి ‘పౌరసమాజం’ అన్నది ఒకానొక జవాబు అనుకుంటే, పౌరసమాజం తన బాధ్యతను విస్మరించిందనుకోవాలా?!

పైగా మనం భిన్న భావజాలల శాంతియుత, సామరస్యపూర్వక సహజీవనానికి అవకాశమిచ్చే ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అందుకు వీలైన రాజ్యాంగాన్ని 65 ఏళ్లుగా అమలుచేసుకుంటున్నాం. భారత రాజ్యాంగం దేశాన్ని ఒక నూతన సందర్భంలోకి తీసుకెళ్లింది. ఆ సందర్భాన్ని మనం గుర్తిస్తున్నామా? భిన్న భావజాలాల ఘర్షణలో ఏ వైఖరి తీసుకోవాలి, ఆ రెంటి మధ్యా ఎలాంటి సర్దుబాటు చేసుకోవాలనే విషయంలో రాజ్యాంగమే బ్లూ ప్రింటు ఇస్తోంది. ఏ చర్చకైనా రాజ్యాంగం ఉనికే ప్రాతిపదిక కావాలి.  స్వీయబాధ్యతను గుర్తించే ఏ పౌరసమాజమైనా రాజ్యాంగం ఉనికిని పదే పదే గుర్తుచేస్తూ భిన్న భావజాలాల శాంతియుత సహజీవనాన్ని నొక్కి చెబుతూనే ఉండాలి. రాజ్యాంగం నిర్వహించేది మధ్యవర్తి పాత్ర.

రెండు దేశాలు తమ ఇరుగు పొరుగును తమకు కావలసిన పద్ధతిలో సృష్టించుకోలేవనీ, సామరస్యంతో సహజీవనం చేయక తప్పదనీ మనకు తెలుసు. ఇదే సూత్రం అంతర్గత భావజాలాలకూ వర్తిస్తుంది. నాస్తికులూ-ఆస్తికులూ, హేతువాదులూ, విశ్వాసవాదులూ…ఇలా భిన్న భిన్న భావజాలాల వాళ్ళు సొంత ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా సహజీవనం చేయకతప్పదు. కనుక దేశాల మధ్య లానే వీళ్ళ మధ్య సంభాషణ, సర్దుబాటు ఉండాలి. ఆ అవగాహన సరళి రేఖామాత్రంగా ఇలా ఉండచ్చు :

  1. ఆస్తికత్వాన్నీ, విశ్వాసాన్నీ విమర్శించే, వ్యతిరేకించే ప్రజాస్వామిక హక్కు నాస్తికులకు, హేతువాదులకూ ఉంది. తమ భావజాలాన్ని ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంది. అలాగని ఆస్తికుల మనోభావాలను గాయపరచే హక్కు; ఆస్తికులు పూజించే దేవుళ్ళను దూషించే హక్కు వారికి లేదు. చట్టం, రాజ్యాంగం అనుమతించిన పరిమితుల్లో మతస్వేచ్ఛలానే; భావజాలస్వేచ్ఛను కూడా అన్ని పక్షాలూ గుర్తించాలి.
  2. తమ ఆస్తికత్వాన్నీ, విశ్వాసాన్నీ ఉద్ఘాటించుకుని ప్రచారం చేసుకునే హక్కు, నాస్తికత్వాన్నీ, హేతువాదాన్నీ విమర్శించే హక్కు ఆస్తికులకు ఉంది. అలాగని నాస్తికులను, హేతువాదులను దూషించి, దేశద్రోహులుగా చిత్రించే హక్కు; వారిపై భౌతిక దాడులకు దిగి హతమార్చే హక్కు వారికి లేదు. ఆస్తికులు అధికసంఖ్యాకులు కూడా కనుక ఈ విషయంలో వారిపై మరింత బాధ్యత ఉంటుంది. ఈ భౌతికసంఖ్యాధిక్యం నుంచి వారు అదనపు ప్రయోజనం పొందడానికి చూడకూడదు.
  3. నాస్తిక, ఆస్తిక ఉద్యమాలు రెండూ చిరకాలంగా పట్టువిడుపులు లేని ఆత్యంతిక వైఖరి(extreme)నే తీసుకుంటూ వచ్చాయి. పరస్పర శత్రుత్వానికి పదును పెడుతూనే వచ్చాయి. ఈ మార్గంలో ఏ ఉద్యమమూ ఫలితం సాధించలేకపోయింది. నాస్తికత్వం ఆస్తికత్వాన్నీ, ఆస్తికత్వం నాస్తికత్వాన్నీ కొంచెమైనా తుడిచిపెట్టలేకపోయాయి. ఈ వాస్తవాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాయో అప్పుడు చరిత్ర పొడవునా తమ మధ్య జరుగుతున్నది ఒక విఫలపోరాటమన్న సంగతి అర్థమవుతుంది. విఫల పోరాటాన్ని కొనసాగించడంలో అర్థం, ఔచిత్యం లేని సంగతి బోధపడుతుంది. ఆ గుర్తింపు సంభవించినప్పుడు రెండూ ఒక సరికొత్త ఉమ్మడి ప్రాతిపదికపై సహజీవనం చేయడానికి సాధ్యమవుతుంది. సరిహద్దు వివాదాన్ని పక్కన పెట్టి వాణిజ్యం తదితర ఉమ్మడి ప్రయోజనాలపై భారత-చైనాలు సంబంధాలను పునరుద్ధరించుకున్న ఉదాహరణను ఇక్కడ గుర్తుచేసుకోవచ్చు. అలాగే ఉమ్మడి కార్యక్రమం పై పార్టీలు ఏకమై సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న ఉదాహరణను కూడా.
  4. ఆస్తిక, నాస్తికవాదుల మధ్య సర్దుబాటు సరళి ఇలా ఉండచ్చు: అ)నాస్తికులు ఆస్తిక స్వేచ్ఛను అగౌరవపరచకూడదు. ఆస్తికుల మనోభావాలను నొప్పించకూడదు. అదే సమయంలో ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికపై దేశ ఇతరేతర ప్రయోజనాలకు వారిని కలసిరమ్మని ప్రతిపాదించవచ్చు. రాజ్యాంగం పేర్కొన్న సైంటిఫిక్ టెంపర్ ను అభివృద్ధి చేయడం వాటిలో ఒకటి. అలాగే కొన్ని విపరీత స్వభావం కలిగిన విశ్వాసాలకు అడ్డుకట్ట వేయమనీ, విశ్వాసరంగాన్ని తగిన మేరకు సంస్కరించవలసిందనీ కోరవచ్చు. విశ్వాసం ముసుగులో జరుగుతున్న రకరకాల వ్యాపారాలను, మోసాలను నియంత్రించమని అడగచ్చు. మతాన్ని, దేవుణ్ణి వీలైనంత వరకు ప్రైవేట్ కు పరిమితం చేసి పబ్లిక్ జాగాను సామాజిక కార్యకలాపాలకు, అవసరాలకు విడిచిపెట్టమని అడగవచ్చు. మతాన్నీ, విశ్వాసాన్నీ రాజకీయంగా వాడుకోజూసే శక్తులను దూరంగా ఉంచమని కోరవచ్చు. ఆ) ఆస్తిక, విశ్వాసరంగం చాలాకాలంగా అంతర్గత సంస్కరణలకు దూరంగా ఉందన్న సంగతిని ఆస్తికవాదులూ గుర్తించాలి. గతంలో వివిధ కాలాలలో ఈ రంగంలో జరుగుతూ వచ్చిన సంస్కరణలు ఇప్పుడు ఎందుకు లోపించాయో ఆస్తికవాదులూ, ఆధ్యాత్మికమతనాయకులూ, పౌరాణికులూ ప్రశ్నించుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. సమాజం పట్ల తమ బాధ్యతను వారు గుర్తించాలి. నాస్తికత్వం సహా భిన్న భిన్న భావజాలాలు వైవిధ్యవంతమైన, సృజన శీలి అయిన సామాజిక స్వభావానికి అద్దం పడతాయనీ, ప్రజాస్వామ్యం ఉనికిని చాటి చెబుతాయనీ గ్రహించాలి. అంతిమంగా నాస్తికులూ, ఆస్తికులూ కూడా అభిప్రాయభేదాలను నాగరిక పద్ధతుల్లో, ప్రజాస్వామిక పరిమితుల్లో వ్యక్తం చేసుకోవాలి.

అన్నింటి కన్నా ముందస్తు షరతు; భిన్న భావజాల శిబిరాల మధ్య ‘సంభాషణ’ అవసరాన్ని గుర్తించడం. దానికి తెర తీయడం. సంభాషణ అంటూ మొదలయ్యాక అది ఎలాంటి ఫలితాలవైపు పయనిస్తుందన్నది తర్వాతి ప్రశ్న.

ఈ వ్యాసంలోని అనేక అంశాలతో  ఏకీభావం ఉండచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడైనా వ్యక్తీకరణ లోపాలు ఉన్నా ఉండచ్చు. కానీ ఈ రెండు శత్రుశిబిరాల మధ్య సంభాషణ అవసరమన్న అభిప్రాయంతో బహుశా ఎవరూ విభేదించరు. ఆ అవసరాన్ని గుర్తించడమే కల్బుర్గి వంటివారికి తగిన నివాళి అవుతుంది.

*

 

 

 

రంగనాయకమ్మ లవ్స్ రంగనాయకమ్మ !!

 

పి.  విక్టర్ విజయ్ కుమార్ 

 

రాబర్ట్ నాగేంద్ర పొద్దున్నే దక్షిణ్ ఎక్స్ ప్రెస్ కు దిగాడు.

 

బలవంతంగా నిద్ర లేచి వాడిని పిక్ అప్ చేసుకుని బైక్ మీద రూం కు తీసుకొచ్చాను. దారిలో అడిగాను ” ఏంట్రా కబుర్లు ” అని. వాడు గడ్డం గీక్కోవడం నాకు బైకు అద్దం లో కనిపించింది. ” ఆ స్టుపిడ్ గడ్డం తీసేయొచ్చు కదా ? ” విసుక్కున్నాను. వాడు కిసుక్కుమని ” బిన్ లేడెన్ కు అసలు షేవ్ చేసుకుందామని జీవితం లో ఒక్క సారన్నా టెంప్ట్ అయి ఉంటాడంటావా ? ” అన్నాడు.  ” ఆ… టెంప్ట్ అయి ఉంటాడు ” ఒక క్షణం పాజ్ ఇచ్చి ” ఎప్పుడు అని మాత్రం నీవడగవని నాకు తెలుసు ” అన్నా.

” యు ఆర్ గ్రోయింగ్ అప్ మై బోయ్ ” అని భుజం తట్టాడు నాటకీయంగా.

రూం చేరుకునేంత వరకు ఇద్దరి మొహాల్లో నవ్వు బిగబట్టుకుని ఉన్నాము.

ఇంటికొచ్చి రిఫ్రెష్ అయిపోయి, టిఫిన్ పానాదులయ్యాక కాఫీ చేతులో పెట్టి మళ్ళీ అడిగా ” ఏంట్రా కబుర్లు ” అని. హైదరాబాదుకు ట్రెయిన్ పట్టుకునే ముందు ఆప్పుడెప్పుడో వాడితో మాట్లాడిన ” యూరిన్ పాలిటిక్స్ ” తర్వాత ఇదే మళ్ళీ వాడితో కన్ ఫ్రంటేషన్ కుదిరిన ఛాన్స్.

” చూడ్రా భై …మోడి దుబయ్ లో ‘ కేవలం మాటల ద్వారానే ఏ సమస్య అయినా సాధించుకోవచ్చు ‘ అని అంగానే అక్కడ పొట్టేగాండ్లు విజిల్స్ ఎందిరా నాయ్నా ! అదేమన్నా ఈయన పేటెంట్ పెట్టి కనుక్కున్న ఒక ఫార్ములా నా  లేపోతే అమితాబ్ బచ్చన్ షోలే డైలాగ్ ఆ ? ” అని సిగరెట్ వెలిగించాడు.

” భక్తులు రా…భక్తులు….అంతే ”

” అవున్ రా భై …వీళ్ళకన్నా రంగ నాయకమ్మ భక్తులే బెటర్ ”

వాడి సెటైర్ కు నవ్వేసాను కాని – ” ఒరేయ్ ! రంగనాయకమ్మ లో తప్పులుండొచ్చు కాని మరీ మోడీ తో కంపేర్ చేయడం బాలేదు రా ” నేను కూడా కొంచెం సెంటిమెంటల్ ఫీల్ అయ్యి నొచ్చుకున్నా.

” అబ్బో ! నీవు ఆమె పూజ ఎప్పుడు మొదలు పెట్టావురా బాబాయ్…” అని ట్రే కోసం సీరియస్ గా కలియ తిరిగి కూర్చున్న కుర్చీ పక్కనే యేష్ విదిలించాడు. ఆ చుట్టూ తిరిగి చూడ్డం కూడా ఓ బహానా వాడికి. అలా చూస్తే నేనే పరిగెత్తుకెళ్ళి ఎక్కడున్నా హడావిడిగా ట్రే పట్టుకొచ్చి వాడి పక్కన పెడ్తానని వాడి అంచనా .

మళ్ళీ దమ్ము తీసి అన్నాడు –

” విప్లవ రచయితల సంఘం, ఎలాంటి కుట్రలతో, ఎలాంటి అబద్దాలతో, ఎంత నిజాయితీ హీనంగా, ఎంత విప్లవ వ్యతిరేకంగా ఏర్పడిందో, ఆ పాత చరిత్రని ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవచ్చు. ఈ వాక్యాలు ఎక్కడన్నా విన్నట్టుందా ” అప్పజెప్పినట్టు చెప్పి అడిగాడు.

” ఐ నో యు ఆర్ రెఫెరింగ్ హర్ ఆర్టికల్ ఆన్ విరసం ”

” కదా ! కుట్ర కేసులు పెట్టించుకుని తిరుగుతున్న విరసాన్ని కుట్ర పూరితం అనేసింది. రంగనాయకమ్మను నేను ఆడ మోడీ అంటే నీకు వచ్చిందా ? ”

” వి ర సం పేద్ద ….. వీర సాహిత్య సంస్థా మరి ? ”

” అది వాళ్ళు సమాధానం ఇచ్చుకుంటారు వీరులైతే . మనకెందుకు కాని ” అని రావు గోపాల్ రావు స్టైల్ లో గొంతు మార్చి అన్నాడు ” మడ్డరు జేసినోడు దొంగ కొడుకు, ముడ్డి మీద ఏసుకునే డాయర్ ఎత్తుకెల్లినోడు దొంగ కొడుకైతే , ఈ పెపంచకం లో పెతోడు సమానంగా దొంగ కొడుకులే రా సెగట్రీ   ”

” ఐ అబ్జెక్ట్ మై డియర్ బట్ట తల బిన్ లేడెన్…..నీవు పాయింట్ డైవర్ట్ చేస్తున్నావు. ఆమెను మోదీ తోనూ , ఆమె పాఠకులను మూర్ఖ మోదీ భక్తులతోనూ పోల్చడం దారుణం ”

” ఒరేయ్ తప్పుల్లో డిగ్రీలు లేవనేది  ఆమె పాటించే సూత్రమే. అందుకే విరసానికి, వీ ఎచ్ పీ కీ తేడా లేకుండా తిడుతుంది ”

” మరి విరసం తప్పులు లేని సమాజం కోసం కృషి చేస్తున్నప్పుడు తప్పుడు దారులు ఎలా తొక్కుతుందిరా ? రంగ నాయకమ్మ తిట్టడం లో ఘాటు ఎక్కువయ్యింది కాని , సారాంశం లో తప్పు లేదు కదా ? ” కాఫీ సిప్ చేస్తూ అడిగాను.

” బామ్మర్దీ ! వాస్తవాలు , ప్రజలకు వీర రసం తాగించే విరసం చెప్పేంత వరకు ఆగు. అది ఆమె విరసం ను తిట్టడం అని నీవనుకుంటున్నావా ? నా బాబే ! అది జస్ట్ ‘ సెల్ఫ్ లవ్ ‘ ”

అనేసాడు వీడు. అనాల్సిన మాట గబుక్కున అనేసాడు.

* * *

వీడు చిన్నప్పట్నుండి అనాథ జీవితమే. ఆల్ మోస్ట్ మా ఇంట్లోనే పెరిగాడు. వాడికి మనుష్యులంటే ప్రేమ.

కాలేజిలో ఎంతో శ్రద్ధగా ” రామాయణ విషవృక్షం “ చదువుతుంటే వచ్చి అల్లరిగా లాగేసేవాడు. ఏమంటే ఇందులో ‘ మార్క్సిజం తక్కువ. మనాయకం ఎక్కువ అనే వాడు ‘. ఈ మధ్య ‘ తత్వ శాస్త్రం- ఒక చిన్న పరిచయం ‘  అనే బుక్కు కొన్నానని వాడికి ఢిల్లీకి ఫోన్ చేసి చెప్తే అడిగాడు ” ముందు మాటలో మొదటి వాక్యం చదువు అన్నాడు ”

” ‘ తత్వ శాస్త్రం పట్ల నాకెప్పుడూ ఆసక్తి రాలేదు ‘ అని ఉంది ఏం ? ” అడిగా.

అందుకు వాడన్నాడు ” పుస్తకం గురించి వ్రాయమంటే ఈమె మనసులో ఏమనుకుందో, ఆ మనసు లోపల  లోపల ఉన్న మనసులో ఇంకేమనుకుందో, ఆమెలో వస్తున్న ఎమోషనల్ చేంజ్ కు ఆ విక్రం గైడు లాంటి పుస్తకానికి ఏవన్నా సంబంధం ఉందిరా ?  చదువు…చదువురా…రేయ్ చదువు…..ముందు మాట తోటే నీకు దిమ్మ తిరిగిపోద్ది. అందులో ‘ నేను పెన్సిల్ తో రాసుకున్నాను, మళ్ళి రుద్ది చెరిపేసాను, మళ్ళి రాసాను, మళ్ళీ చెరిపేసాను ‘ లాంటి దిక్కుమాలిన  డీటైలింగ్ చూసాక భారతం లో భారతుడిలా పిచ్చోడైపోయి ఆమెనే అనుకుని ఆమె చెప్పులకు పూజ చేస్తావు ”

” భారతం కాదు …రామాయణం….” టక్కున అన్నా

” ఇదే మరి రంగ నాయకమ్మ భక్తి తెలివి అంటే. అంత ముఖ్యమైన విషయం వదిలేసి…ఎక్కడో దొర్లిన టైపో లాంటి తప్పును పట్టుకుని ఊగులాడ్డం ”

* * * *

వాడు తాగేసి కప్పు కింద పెడుతూ , కాఫీ అడుగున మిగిలిపోయిన చక్కర వేలుతో తీస్తూ నాకుతూ అన్నాడు ” ఆమె ఒకరిని తిట్టినా…ఆమె ఒకరిని పొగిడినా…అంటే ఆమె మార్క్సు, ఏంగెల్స్ &  కో ను తప్ప ఎవరినీ పొరపాట్న కూడా మెచ్చుకోదనుకో….వాటెవర్….అది ఆమె మీద ప్రేమను ఆమె అలా వ్యక్త పరుచుకుంటుంది అంతే –  I mean its pure platonic self-love  ”

నా మొహాన్ని చూసి చప్పరిస్తూ అన్నాడు ” నీ బోటి వాళ్ళు చూసి ‘ ఆహ ఏమి సద్విమర్శ , ఓహో ఏమి మొహమాటం లేని విమర్శ ‘ అంటారన్న మాట ”

నేను కుర్చీలో ఇబ్బందిగా సర్దుకున్నాను.

నాలో కనిపించని ఇబ్బందిని గమనించి దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేసి అన్నాడు.

” మచా ! నీకో పిట్ట కథ చెప్తాను ఉండు. జాగర్తగా విను. ఒక నిర్భాగ్యుడెవడో  కొండ మీద నుండి కాలు జారో, ఎవరో తోసేస్తేనో…పడిపోతున్నాడు…దొర్లుతూ…గిర గిరా తిరుగుతూ…. అప్పుడు రంగ నాయకమ్మ లాంటి వాళ్ళను ‘ విషయం కాస్తా చూడండి ‘ అని ఎవరో…ప్రభుత్వాధికారి అనే అనుకో…. పంపాడు . ఆమె హుటా హుటిన అక్కడికి చేరింది. కొండ మీద నుండి జారి పడే మనిషిని చూసింది…తీక్షణంగా గమనించింది..సెకన్ లలో సమస్యను సూక్ష్మంగా ఆకళింపు చేసుకుంది….ఆమె చాలా షార్ప్ కదా మరి…. వెంటనే అప్పటికప్పుడు ఒక మెయిల్ పంపింది…… ” అసలు ఈ కొండ ఇక్కడ భూ అంతర్భాగం లో జరిగిన మార్పుల వల్ల ఏర్పడి, ప్రమాదాలకు తావుగా నిలుస్తుంది. భూ అంతర్భాగం లో జరిగే మార్పులను పసిగట్టి మనం అరికడితేనే ఈ సమస్యకు మూలం దొరుకుతుంది. ఐతే ‘ కొండ ఎత్తుగా ఉంటుంది…కాలు పెట్టడంలో  జాగర్తగా ఉండాలి’ అని తెలుసుకోలేని అవివేకత్వం  ఈ సమాజం లో ఉన్నంత కాలం ఈ ప్రమాదాలు తప్పవు. ఇప్పుడు ఇక్కడ కింద పడిపోతున్న వ్యక్తి నిజానికి ఎన్నో రాళ్ళను , గడ్డి పీచులను ఆసరా తీసుకోవడం లో కనీస తెలివి కూడా చూపించ లేకపోవడం అన్నది మనమెవ్వరూ గమనించట్లేదు. నిజానికి మనం అవసరం ఏమీ లేకుండానే ఇతడు రక్షించుకునే పరిస్థితిని కూడా విస్మరించాడు. దీనికి ప్రధాన మూలం ఎక్కడుందంటే అతని బుర్ర లోనే ఉంది. అది పగిలే దాక ఆయన్ని రక్షించడం వృథా ! ”

నన్ను అనునయంగా నిమురుతూ అన్నాడు ” విమర్శించడం గొప్ప కదురా ! భూలోకం పైన కాళ్ళు వదిలేసి ….అందరు పరలోక రాజ్యం లో బతుకుతున్నట్టు…అప్పుడు ఎవడన్నా గట్టిగా దగ్గినా తుమ్మినా తప్పౌతుంది….అలా విమర్శిస్తే ఏమౌతుంది ?  That clearly explains one has blurred vision of priorities of society. ఇప్పుడు నాకు ఒక ఘోరమైన కేన్సర్ ఒకటి  వచ్చిందనుకో. హడవిడిగా ఒక టెబ్లెట్ వేసుకున్నాను. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలిసీ వేసుకున్నాను. లేపొతే నొప్పి భరించ లేకపోతున్నాననుకో.తర్వాత  వ్యాధి తగ్గించిన విషయం వదిలేసి – ఆ టెబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి విమర్శిస్తే ఎలా ఉంటుంది ?    ”

సిగరెట్ పీక ఆర్పి కిటికి లోంచి చాకచక్యంగా విసిరి, నా కుర్చీ హేండ్ రెస్ట్ మీద వాడు రెస్ట్ తీసుకుంటూ ”  This is nothing but perversion for idealistic attitude.  నేను నీతో బెట్ వేస్తా. ఇటువంటి  Attitude  ఉన్న వాళ్ళ మీద నా అంచనా. …. అఫ్ కోర్స్ ఆ బెట్ డబ్బులు నీ జేబులో నుండే నా దగ్గరకొచ్చి మళ్ళీ నీ జేబులోకి పోతాయనుకో . ఎవరన్నా ఒక్కరంటే ఒక్కరు ….. barring her husband  …..సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుండి ” నేను రంగ నాయకమ్మ ఫ్రెండ్ ” అని గర్వంగా ఒక్కరు డిక్లేర్ చేయ కలిగినా లేదా ఈమె తడపాయించే ఒక్క శ్రామికుడు లేదా ఒక్క దళితుడు….ఇదో గొడవ …దళితుడంటే ‘ ఎవరూ ‘ అని దీర్ఘం తీసేస్తుందిప్పుడు ‘ నోర్ముయ్ అందరూ పేదోళ్ళే అని అరిచేస్తుంది ‘….సరే ఏదైతేనేం…ఒక్కరన్నా …ఒక్కరంటే ఒక్కరు….వచ్చి ఈమె వలన సాంఘిక న్యాయం మాకు కలిగింది అంటే ……. again I am telling you , I will pay you one thousand rupees signed by Raghuram rajan and will shave my lovely beard off… ” అన్నాడు.

నేను ఒక్క ఉదుటున లేచి నవ్వుతా వాడిని  వంగో బెట్టి రెండు గుద్దులేస్తూ పక పకా మని నవ్వాను.

వాడి కాలర్ పట్టుకుని ” ఒరేయ్ ! నీకు మాత్రం సెల్ఫ్ లవ్ తక్కువా ” అన్నా.

” సరెలేరా …. పెతోడికి కొద్దో గొప్పో ఉంటుంది. చూశావా…రంగ నాయకమ్మ వాసనలు ఎలా తగిలాయో నీకు….ప్రతి మనిషికి అంతో ఇంతో ఉండే ఇసుమంత సెల్ఫ్ లవ్ ను…ఆమెకుండే  Obsessed self-love   ను ఒకటేలా చూస్తున్నావ్ !  ” అని మొహానికి చేయి అడ్డుగా పెట్టుకున్నాడు నే కొడతానేమో  అన్నట్టు.

కాలర్ వదిలేసి నేను గట్టిగా నవ్వుతూ ఎదురుగా ఉన్న దివాన్ మీద జారగిల పడ్డాను.

” ఓకే రా…. I agree with you for now  కాని ఆ ఇంకో పెద్దామె చటుక్కున ఈమెను పర్స్ నల్ అటాక్ చేస్తూ కవిత వ్రాయడం మాత్రం తప్పురా. ఈ విషయం లో నీవేం చెప్పినా నే తలూపను ” అనేసి గట్టిగా నా చెవుల చుట్టు చేతులు పెట్టి తల పట్టుకున్నాను.

వాడు నా చెవి దగ్గర గట్టిగా అరుస్తూ ”  Self-love never generates logical thinking in other person. In fact, it obstructs the logical thinking and diverts the targeted audience’  attention to the person talking about the subject but not on the subject, per se. And so Mrs. Ranganayakamma runs the risk of taking the brunt personally. ”  నా చెవులపై చేతులు  పక్కకు లాగి  ” And this goes on as long as Ranganayakamma loves Ranganayakamma but nothing else !!! ”  అని గట్టిగా గుయ్ మంటూ అరిచాడు వెధవ .

*

వివాద కవిత మీద వివాదం

ఎన్. వేణుగోపాల్ 

 

venuఅంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వం అన్నప్పుడు వివాదం కాని కవిత్వం ఉంటుందా అనుమానమే. నిజానికి కవిత్వమంతా యథాస్థితితో పేచీయే. ఒక అనుభూతిని, ఘటనను, పరిణామాన్ని, దృశ్యాన్ని మరొకరు చూసిన పద్ధతికి భిన్నంగా చూడడమే అనే అర్థం లోనూ కవిత్వమంతా వివాదమే అని చెప్పుకోవచ్చు. కాని కవిత్వంలో భాగమైన ఒక ప్రత్యేక ప్రక్రియగా కూడ వివాద కవిత (పాలిమికల్ పొయెమ్) ఉంది. ఒక కవితనో, రచననో చదివి, దాన్ని ఖండిస్తూ, భిన్న దృక్పథాన్ని ప్రకటిస్తూ కవిత్వం రాయడం వివాద కవిత. ‘వివాద కవిత అంటే ఒక నైతిక లేదా రాజకీయ సమస్య పట్ల ఏ నిర్దిష్ట వైఖరి తీసుకోవాలనే దిశగా పాఠకులను కదిలించే సాహిత్య పాఠపు ప్రక్రియ’ అని ఆఫ్రికన్ కవిత్వంలో వివాద కవిత్వం గురించి రాస్తూ హ్యూ వెబ్ అనే సాహిత్య విమర్శకుడు అన్నాడు.

పార్లమెంటరీ రాజకీయాలను తిరస్కరిస్తూ, సాయుధ పోరాట రాజకీయాలతో ప్రయాణం ప్రారంభించిన సత్యనారాయణ సింగ్ అనే నాయకుడు ఏప్రిల్ 1977లో ఎన్నికలలో పాల్గొనవచ్చుననే సిద్ధాంతాన్ని ప్రకటించినప్పుడు పంజాబీ కవి అమర్ జిత్ చందన్ ‘ఏప్రిల్ థీసిస్’ అని ఒక కవిత రాశాడు. బోల్షివిక్ విప్లవానికి దారి తీసిన లెనిన్ చరిత్రాత్మక ఏప్రిల్ థీసిస్ ను ప్రస్తావిస్తూ, సత్య నారాయణ సింగ్ ఏప్రిల్ ప్రకటనను వ్యంగ్యంగా ఎత్తిపొడిచిన కవిత అది. దాన్ని ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువదించడంతో వివాద కవిత్వంతో నా పరిచయం మొదలైంది. అంతకుముందే శ్రీశ్రీ – దాశరథి మధ్య సాగిన వివాద కవిత్వం పరిచయం ఉంది గాని ఆ వివాదం కొంత అనవసరమైన సంచలనాత్మకతకు, దూషణకు, నిందలకు కూడ జారిపోయిందనే అభిప్రాయం ఉన్నందువల్ల అమర్ జిత్ చందన్ కవిత మరింత నచ్చింది. ఆ తర్వాత నా ఓల్డ్ పిజి హాస్టల్ సహవాసి, అప్పటి మంచి కవి లక్నారెడ్డి రాసిన కవితకు ఆ కవితలోని పదబంధాలనే వాడుకుంటూ నేనూ ఒక వివాద కవిత రాశాను. అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీవాద, మైనారిటీ వాద, ప్రాంతీయవాద కవిత్వంలో ఎన్నో వివాద కవితలున్నాయి.

kannabiran1

స్త్రీవాద సిద్ధాంతకర్త, కార్యకర్త, రచయిత వసంత కన్నబిరాన్ ఈ వారం “ఆంధ్రజ్యోతి వివిధ”లో రాసిన కొత్త వివాద కవిత ప్రస్తుతం కొంత దుమారాన్ని రేపే అవకాశం ఉందని అనిపిస్తున్నది. ఆ కవిత వెలువడి ఇంకా పన్నెండు గంటలు నిండకుండానే అనుకూలంగానూ ప్రతికూలంగానూ ఎన్నో అభిప్రాయాలకు దారితీసింది. వసంత కన్నబిరాన్ గతంలో పెద్దగా కవిత్వం రాసినవారు కాదు. ఎప్పుడో వరవరరావు జైలులో ఉన్నప్పుడు ఆయన సహచరి హేమలత తో మాట్లాడి రాసిన నిరీక్షణ అనే కవితలో కూడ వివాద కవిత ఛాయలున్నాయి.

ప్రస్తుత కవిత వివాద కవిత అవునా, అసలు కవిత అవునా, బిలో ది బెల్ట్ (అన్యాయమైన) ప్రతిస్పందనా, తిట్లా అని చర్చ జరుగుతున్నది. ఒక పరిణామం మీద ఒక రచన వెలువడినప్పుడు ఆ రచనను, రచయితను, సందర్భాన్ని భిన్నమైన కోణంలో చూపించడమే వివాద కవిత లక్షణం అనుకుంటే ఇది కచ్చితంగా వివాద కవితే. పదప్రయోగాలు విమర్శకు లక్ష్యంగా ఉన్న కవిత/రచన నుంచి, రచయిత నుంచి ఉండడం, లేదా ఆ రచనను, రచయితను స్ఫురించేలా ఉండడం వంటి వివాద కవిత్వ ముఖ్య లక్షణాలు ఉన్నందువల్ల కూడ అది వివాద కవితే.

*

కలాం: హారతిలో ధూపం ఎక్కువ!

పి. విక్టర్ విజయ్ కుమార్ 
మన 11 వ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం మరణం తో సాధారణ మీడియా, సోషల్ మీడియా, ప్రభుత్వాలు, సంస్థలు శోక సంద్రం లో తేలాయి. ప్రతి చోటా, ప్రతి నోటా ఇంత వరకు ఏ రాష్ట్రపతికీ, ఇందిరా గాంధి తర్వాత కేంద్రం లో పరిపాలించినా ఈ ఒక్క నాయకుడికీ,  ఇంత స్థాయిలో Mourning  జరగలేదు. నిజానికి కలాం మన దేశం లో ‘ గాంధీ ‘ లా విమర్శకు అతీతమైన ఒక ‘ సెంటిమెంట్ ‘ లా రూపాంతరం చెందాడు. 
 
అబ్దుల్ కలాం వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులతో నడిచింది. పేద తమిళ ముస్లిం కుటుంబం లో పుట్టి ‘ రాకెట్ సైంటిస్ట్ ‘ గా ఎదిగి భారత్ దేశానికి 11 వ రాష్ట్రపతిగా నియమితుడయ్యాడు. కలాం భారత ప్రభుత్వానికి సైంటిఫిక్ అడ్వైజర్ గా , పోఖ్రాన్ – 2 కు ప్రధాన పాత్ర ధారి గా బాధ్యతలు నిర్వర్తించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లో ఇంత ప్రశస్తమైన పాత్ర పోషించిన వ్యక్తులు దేశం లో అరుదే. విక్రం సారాభాయ్, సతీష్ ధావన్ లు ఈ సైంటిఫిక్ రంగం లో ప్రముఖులుగా చెప్పుకోవచ్చు. అయితే కలాం గొప్ప తనం ఏమంటే – రాజకీయాల్లో ప్రవేశించి రాష్ట్ర పతిగా కూడా  2002-2007 మధ్య కాలం లో బాధ్యతలు నిర్వర్తించడం. రాష్ట్రపతిగా పదవి విరమించాక అధ్యాపకుడిగా ఎన్నో ప్రసిద్ధ కళాశాలల్లో కాలం గడిపాడు. కలాం నిజాయితీ గా ఎదిగిన ప్రొఫెషనల్ కు తార్కాణంగా , మధ్య తరగతి ప్రజల కలల ఆదర్శంగా నిలిచాడు. ( రాజకీయ పూరితమైన భారత రత్న, పద్మ విభూషణ్ లాంటి బిరుదులు అసలు గొప్ప తనంగా మాట్లాడ్డం గురించి వదిలి వేయద్డం ఉద్దేశ్య పూర్వకమే. దీనికి సంబంధించి వివేచన గురించి పాఠకులే ఆలోచించుకోవాలి )  
 
ఈ చిన్న ఉపోద్ఘాతం ను ఇక్కడ వదిలేద్దాం. కలాం కెరీర్ , నిజాయితీ , అధ్యాపకుడి పాత్ర – ఇవన్నీ చూసి , అతని మరణానికి ఈ ప్రభుత్వం , ఈ మీడియా, ప్రభుత్వ సంస్థలు ఇస్తున్న గొప్ప నివాళులను  Objective  గా గమినించకుండా వదిలేయడం సమయోచితమైన ప్రతిస్పందన అవ్వదు.
 
కలాం సైంటిస్ట్ గా తన కెరీర్ ను మలుచుకున్నాడు. ఒక ప్రొఫెషనల్ సైంటిస్ట్ గా మాత్రమే తన విధిని నిర్వర్తించి నిజాయితీగా పని చేసాడు. 2002 లో నారాయణన్ రాష్ట్రపతిగా రెండో సారి ఎన్నిక కావాల్సిన సందర్భం ఉండింది. ( 1997 జూలైలో గుజ్రాల్ నేతృత్వంలో ఉన్నా మైనారిటీ ప్రభుత్వం అధికారం లో ఉండగా నియమితుడయ్యాడు. తర్వాత వాజపేయి కాలం లో కొన సాగాడు ). ఇక్కడ నారాయణన్ గురించి కొద్దిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.  నారాయణన్, భారత దేశ రాష్ట్రపతులలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుని ఉన్నాడు. పేద దళిత కుటుంబం లో పెరిగి, జర్నలిస్టుగా, ఎకానమిస్టుగా, భారత దేశ దౌత్య వేత్తగా, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి గా, ఉపరాష్ట్రపతిగా ఆపై రాష్ట్రపతిగా ఎదిగాడు. నారాయణన్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక అసంబద్ధ ప్రభుత్వ విధానాలను ఎన్నిటినో వ్యతిరేకించాడు.  ఆ స్థాయిలో వ్యతిరేకించిన రాష్ట్రపతికి మనకు లేడంటే అతిశయోక్తి కాదు.
డిసెంబర్ 1992 (ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ) బాబ్రి మసీదు అల్లర్లపై నీళ్ళు నమలకుండా ‘ గాంధి హత్య తర్వాత దేశం చవి చూసిన ఘోరమైన ఉదంతం ‘ గా వర్ణిచాడు. గుజ్రాల్ ప్రభుత్వం సంకీర్ణ రాజకీయాలకు తలొగ్గి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల దోసి ప్రెసిడెంట్ రూల్ ను విధించాలనే నిర్ణయాన్ని, వాజ పేయి ప్రభుత్వం బీహార్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసి ఎమర్జన్సీని విధించాలనే నిర్ణయాన్ని చాలా ఎత్తుగడ తో సుప్రీం కోర్ట్ తీర్పును అడ్డుపెట్టుకుని వ్యతిరేకించాడు. ఒక రాష్ట్రపతిగా తాను రబ్బర్ స్టాంప్ కాదు, ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాలకు తాను మడుగులొత్తననే  విషయాన్ని బహుశా నారాయణన్ తప్ప ఇంకెవరూ ప్రయత్నించలేదు. 2002 గూజరాత్ ఊచకోత  విషయం లో కూడా తానో మౌన పాత్రను ఎన్నుకోలేదు. క్రియాశీలంగా వాజ్ పేయి ప్రభుత్వానికి ‘ గుజరాత్ అల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది ‘ అని నిర్మొహమాటంగా లేఖ  వ్రాసాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే – 2002 – 2007 మధ్యలో రాష్ట్రపతి ( అబ్దుల కలాం ) పక్కా రబ్బర్ స్టంపు గా పనిచేసాడే కాని – ప్రభుత్వానికి కించిత్తు ఇబ్బంది కలిగే అంశాలను తడుముకోలేదు. పైగా, ఉరిశిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడే మనవతా వాది అబ్దుల్ కలాం తన వద్దకు వచ్చిన మెర్సీ పిటిషన్ ల విషయం లో ఏ మాత్రం వైవిధ్యంగా ప్రవర్తిచలేదు.
కలాం 2003 లో ‘ యూనిఫాం సివిల్ కోడ్ ‘ కు మద్దతు పలకడం చూస్తే అతని రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతాయి. ప్రధానంగా 2005 లొ  బీహర్ ప్రభుత్వం పై ప్రెసిడెంట్ రూల్ విధించడం లో తన సంతకం వేయడానికి  ఏ మాత్రం వెనుకాడ లేదు. నిజానికి నారాయణన్ రాజకీయ వ్యక్తిత్వం ముందు కలాం రాజకీయ జీవితం వెల వెల బోతుంది.
 
( కలాం గుండె జబ్బుల విషయం లో ఖర్చు తక్కువగా ఉండేట్టు హైదరాబాదు లోని పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ సంస్థతో కలిసి ఒక ‘ స్టెంటు ‘ ను తయారు చేయడం లో పోషించిన పాత్ర – సైంటిఫిక్ రీసర్చ్ కు మానవత్వాన్ని కలగలిపిన ఒకే ఒక్క ఉదాహరణ – తప్పకుండా మెచ్చుకోదగ్గది ( అయితే ఇది ఎంత ప్రాచుర్యం లోకి వచ్చింది, ఎంత సఫలం అయ్యింది అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు ) . అంతే కాక తనకున్న ఉన్నత స్థాయిని ఉపయోగించుకుని సైన్స్ ను , మానవత్వం తో ప్రజా సంక్షేమం తో కలిపి కృషి చేసిన సందర్భాలు దాదాపు సున్న. 
 
బీ సీ , దళిత రాజకీయ పార్టీల మద్దతు కూడాగట్టుకున్న నారాయణన్  అప్పటికే ‘ తిరస్కార నిర్ణయాలకు ‘ నెలవుగా నిలిచి ఉండడం తో , 2007 లో మత వాద  NDA  రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయం కోసం వెదుకులాట మొదలు పెట్టాయి. అప్పుడు దొరికిన రాజకీయ అనుకూల ఆణిముత్యమే ‘ అబ్దుల్ కలాం ‘ !!   ఒక దళితున్ని దించి బ్రాహ్మణ అగ్రవర్ణాలను ప్రెసిడెంట్ ( కృష్ణకాంత్ , పీ సీ అలెగ్జాండర్ ) చేసి వ్యతిరేకతను కొని తెచ్చుకోవడం కన్నా , ‘ వెజిటేరియనిజం ‘ ను నమ్ముకుని బ్రాహ్మణ వాద పార్టిలకు అనుకూలంగా ఉన్న మేధావి అందునా ముస్లిం కావడం  NDA  ప్రభుత్వానికి లడ్డు దొరికినట్టయ్యింది. ఒక ముస్లిం కేండిడేట్ ను , దళిత కేండిడేట్ కు వ్యతిరేకంగా  నిల్చోబెట్టడం – మనువాద రాజకీయ పార్టీ అయిన ‘ సంఘ్ పరివార్ ‘ ఎత్తుగడలకే చెల్లింది.
kalam2
 
ఏ వ్యక్తినైనా మహానుభావుడిగా వర్ణించే మన దేశ ప్రజల సంస్కృతిలో మనువాదం బలపడిపోయింది. మన ప్రమాణాలు అతి తక్కువ స్థాయికి దిగ జారి కేవలం – నిజాయితీగా ఇబ్బంది కలగ కుండా తమ విధిని నిర్వర్తించడం కూడా ఒక మానవాతీత గుణం అయిపోయింది. ఇదే అబ్దుల్ కలాం ‘ కుడంకులం న్యూక్లియార్ ప్రాజెక్టును ‘ క్లియర్ చేస్తున్నప్పుడు , అక్కడి లోకల్ ప్రజలు, ఆందోళన కారులను కనీసంగా కూడా సంప్రదించకుండా పని చేయడం , ఆయనలో ఉన్న ‘ బూటక తటస్థ ‘ విధానానికి చిహ్నం.
 
కలాం కు నిజానికి గొప్ప గొప్ప ఆదర్శాలు లేవు. ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తికి ఉండే అభిలాష , ఒక లిబరల్ వాదిగా ఉండాలనే ఒక ఆదర్శ భావన తప్ప. అంత గొప్ప సైంటిస్ట్ గా ఉండి – దేశ ప్రజల్లోని ‘ స్పిరిచువాలిటీ ‘ పేరుతో ఉన్న మూఢ నమ్మకాల గురించి, బాబాల గురించి నోరు ఎత్తింది సున్న. ఆయన జీవిత కాలం మొత్తం లో ఒక్క వాక్యం దీనిపై వ్రాసి ఉన్న సందర్భం లేదు. పైగా కలాం ప్రతి బాబా , స్వాములను వారి ‘ స్పిరిచువాలిటీ ‘ ని కళ్ళ కద్దుకోవడం లో ఏ మాత్రం వెనుకాడే వాడు కాడు.
 
నిజానికి కలాం ను కేవలం శాస్త్రవేత్తగా మాత్రమే చూస్తే – మన దేశం సీ వీ రామన్, చంద్ర శేఖర్, రామానుజం (మేథ్స్), విక్రం సారాభాయి లాంటి ఎంతో గొప్ప శాస్త్రవేత్తలను మన కిచ్చింది ( వీళ్ళెవరూ రాజకీయ ప్రధాన పాత్రలు ఆశించలేదు ) .   
 
 కలాం జీవన విధానాన్ని ‘ ఓవర్ రొమాంటిసైజ్ ‘ చేస్తున్న విధానం – మోడల్ ప్రజా జీవితం గురించి కొన్ని అంశాలను ముందుకు తెస్తుంది. కెరీర్ మీద బుద్ధిగా శ్రద్ధగా లగ్నం చేయడం, ఎవరికీ నొప్పించని విధంగా అంటే ప్రధానంగా బ్రాహ్మిణిక రాజ్యానికి వ్యతిరేకంగా ఎటువటి దృక్పథం పెట్టుకోకుండా లిబరల్ వాదం తో లోతుల్లోకి వెళ్ళకుండా సాధారణ అంశంగా పేదరికం గురించి బాధ పడ్డం, విశ్లేషించకుండా ప్రజల మధ్య సామరస్యాన్ని బోధించడం తదితర క్వాలిటీస్ కలిగి ఉండే వ్యక్తి మన దేశానికి ఎంతో అవసరం అన్నట్టు తెలుపుతుంది.
 
నిజానికి ఒక సైంటిస్ట్ గా – మత వాదాన్ని బలంగా ఎంతో చాక చక్యంగా ఎదురించాల్సిన కలాం అందులోనే ఇరుక్కు పోవడం బాధాకరం. కొశాంబి లాంటి చరిత్ర కారులు – ప్రజలకు ఉపయోగ కరమైన చరిత్రను వినిపించారు  గాని , కెరీర్ మీద మాత్రమే దృష్టి పెట్ట లేదు.
 
ఒక ‘ కెరీరిస్ట్ లిబరల్ ‘ ను ‘ ప్రజల మనిషి ‘ అనడం మాత్రం హత్యా పాతకం !!
*

మేథో అవినీతి…మన శత్రువు!

( మే 2015 లో ‘ విడుతలై చిరుతైగల్ కచ్చి ‘  Liberation Panthers  అనే ద్రవిడ పార్టి, బుకర్ ప్రైజ్ గ్రహీత అయిన అరుంధతి రాయ్ కు, అంబేద్కర్ ఆలోచనా విధానం విస్తృత ప్రచారానికి చేసిన కృషికి గుర్తింపుగా  ‘ అంబేద్కర్ సుదర్ ‘ అవార్డ్ ను ప్రధానం చేసింది. ఆ సందర్భంగా జరిగిన పబ్లిక్ మీటింగ్ లో అరుంధతి రాయ్ ఇచ్చిన ఉపన్యాసం. తెలుగు అనువాదానికి అనుమతించిన అరుంధతి రాయ్ కు కృతఙతలు తెలియ జేస్తూ – అనువాదకుడు )  

 

అంబేద్కర్ అవార్ద్ ఇచ్చి సత్కరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను. ఇది సంఘటించడానికి ఒక ప్రతీక. ఉధృతమౌతున్న ఫాసిజం కు వ్యతిరేకంగా రాజకీయ కూటములనేర్పరిచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నా సమయం లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను.

ఈ దేశాన్ని హిందూ జాతీయ వాద దేశం గా నిస్సిగ్గుగా మలచాలనే  అధికారం మన దేశ అగ్ర స్థానాన్ని ఆక్రమించుకుంది. అటు వేపే చక్రాలు పరిగెడుతున్నాయి ఇప్పుడు. పాఠ్యాంశాలు మారుతున్నాయి, భోధనా పద్ధతులు మారుతున్నాయి, హిందూత్వ వాదులను న్యాయవ్యవస్థ లోనే కాదు, పోలీసు, ఇంటెలిజెన్స్ మరియు సైనిక వ్యవస్థల్లో చేర్చుకుంటున్నారు.

నేను ఈ రోజు వీ హెచ్ పీ భజరంగ్ దళ్ చేపట్టిన వికారమైన వికృతమైన ‘ ఘర్ వాప్సీ కార్యక్రమం గురించి మాట్లాడ దల్చుకున్నాను. అపవిత్రతను పవిత్ర పరిచి తిరిగి హిందూత్వం లోకి అహ్వానించే ఈ కార్యక్రమం ‘ శుద్ధి ఉద్యమం ‘  గా పిలవబడేది. ఈ ఉద్యమం 150 సంవత్సరాల క్రితం మొదలయ్యింది. ఇది ఏ మతం తో నిమిత్తం లేకుండా తమ సంఖ్యను విస్తరించుకుంటూ ‘ హిందూ సంస్థానం ‘ ను ఏర్పాటు చేయాలనే కృషి చేస్తుంది. మనం ఈ రోజు దీనినే ‘ వోటు బేంక్ ‘ ఆంటున్నాము.

అసలు ‘ హిందువుల గుంపు ‘  అంటూ ఏదీ లేదు. ఇది నిజానికి కొత్తగా పుట్టుకొచ్చిన అంశం. బాబా సాహెబ్ అంబేద్కర్ ను ప్రస్తావిస్తే ” మొట్ట మొదటగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే హిందూ సమాజం అన్నదే మిథ్య. మహమ్మదీయులు ఇక్కడ సింధు ప్రాంతానికి తూర్పు దిక్కున ఉన్న వాస్తవ్యులను వేరుగా గుర్తించడానికి ఇచ్చిన పేరు అది.  ”

‘ ఓటు బేంకు ‘ లను పెంపొందించే విధానం సుమారు 100 సంవత్సరాల క్రితం, రాజ్యాలు జాతీయ రాష్ట్రాలుగా , రాచరికం ప్రాతినిధ్య రాజకీయాలతో మార్పు చెందాక  మొదలయ్యింది ప్రాతినిధ్య రాజకీయాలు, సంఖ్యా బలం గురించి ఒక ఆరాటాన్ని ( anxiety ) కలుగ జేయడం తో  హిందువులుగా పిల్చుకునే వర్గాలైన అగ్ర కులాలు తామ అధికారం నిలుపుకోడానికి మెజారిటీగా ఉన్నామని చిత్రీకరించుకోవాలని నిస్పృహతో పని చేయడం  మొదలు పెట్టాయి. అంతకు మునుపు వరకు వీళ్ళందరూ వాళ్ళ కులాల పేరుతోనే గుర్తింపబడే వాళ్ళు. సంఖ్యా బలం గురించి ఆరాటం మొదలు కానప్పుడు అప్పట్లో  నిమ్న కులాలు కులం పాశం నుండి తప్పించుకోడానికి ఏ మతం పుచ్చుకున్నా వాళ్ళకు తేడా అనిపించలేదు.

ఎప్పుడైతే  సంఖ్యా బలం ప్రాముఖ్యత పెరిగిందో –  ఎవరిని తాకడాన్ని కూడా హేయంగా చూసారో, ఎవరిని ఇన్నాళ్ళు బహిష్కృతులుగా చేసారో, ఎవరి ఇళ్ళకు వెళ్ళడం నిషిద్ధం అనుకున్నారో – అప్పుడు వీరందరినీ హిందువులుగా పరిగణించాలని నిశ్చయించుకున్నారు. కుల వ్యవస్థకు , దాని నిచ్చెన మెట్ల హక్కుల సాంప్రదా యానికి వ్యతిరేకంగా  కాక ,అస్పృశ్యతకు వ్యతిరేకంగా , కేవలం ‘ అస్పృశ్యులను ‘ హిందువుల గుంపులో ఉంచుకోవడానికి బ్రహ్మాండమైన ప్రచారం జరపడం మొదలు పెట్టారు.  అదే సమయం లో ‘ ఆర్య సమాజం ‘ ఈ ‘ శుద్ధి ఉద్యమం ‘ ను చేపట్టింది. దానినే ఈ కాలం లో పెద్ద ఎత్తున తిరిగి చేపడుతున్నారు.

సవర్ణుల సమస్య ఏంటంటే అవర్ణులను బం గ్లా లోకి అహ్వానించి వాళ్ళని వేరుగా ‘ సర్వెంట్ క్వార్టర్స్ ‘ లో ఎలా ఉంచాలా అన్నదే ! ఒక పక్క కులం పవిత్రత ను కాపాడుతూ హిందూ మెజారిటీని ఎలా సృష్టించాలి అన్నదే సమస్య. ఒక పక్క అస్పృశ్యత గురించి మాట్లాడుతూ, మరో పక్క, సాంఘిక కుల ఆచారాన్ని ఎత్తి పట్టడం వాళ్ళు కార్చే మొసలి కన్నీళ్ళు తప్ప ఏమీ కాదు.

నాకు తెలిసి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆధునిక రాజకీయ నాయకుల్లో ఒక అద్భుతమైన వ్యక్తి. ఈ పద్ధతిని ఎప్పుడో గ్రహించి ఉగ్ర గొంతుకతో ద్వేషించాడు.  ఇవన్నీ ఆయనెప్పుడో తన రచనల్లో సమగ్రంగా వివరించాడు.

అయినప్పటికీ బీ జే పీ రాజకీయ నాయకులు సిగ్గు లేకుండా అంబేద్కర్ మీద ప్రేమ ప్రకటిస్తూ ప్రతి రోజు ఆయన విగ్రహాలను ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ‘ ఆర్గనైజర్ ‘ అనే ఆర్ ఎస్ ఎస్ మేగజైన్ కు  అంబేద్కర్ బొమ్మను కవర్ పేజీ లా పెట్టుకున్నారు. వాళ్ళు ఆయన్ను అభిమానిస్తున్నట్టు నటిస్తూ , ఆయన భోధించిన రాజకీయాలను అడుగంటేలా  చేసి , అంబేద్కర్ ను హిందూత్వ చిహ్నం గా మార్చాలని చూస్తున్నారు.

చర్చ్ ల మీద వారి గూండాలు దాడులు చేయడం ద్వారా, నన్స్ పై అత్యాచారం చేయడం ద్వారా అంబేద్కర్ ఆశించిన తీరులో హిందూ మతాన్ని వదిలించుకుని,  క్రిస్టియన్ మతం స్వీకరించిన దళితులను  కాంధమాల్, బస్తర్ లాంటి ప్రాంతాల్లో నిత్యం భయభ్రాంతులతో జీవించేలా చేస్తున్నారు.

ఈ రోజు అతి కౄరంగా , అంబేద్కర్ పోరాటం చేసి సాదించిన రిజర్వేషన్లనే ఎర చూపించి హిందువుల గుంపులోకి రమ్మని ఆశ చూపుతున్నారు. అంటే అంబేద్కర్ వాడిన కత్తినే తిప్పి తిరిగి ఆయన సిద్ధాంతాలకే తూట్లు పొడుస్తున్నారు. ఆయన ప్రజల పేదరికం , దౌర్భల్యత ను – వారికే వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు.

మన దేశాన్ని ‘ సూపర్ పవర్ ‘ గా మన నాయకులు వర్ణిస్తారు. ఆ ‘ సూపర్ పవర్ ‘ దేశం లో 80 కోట్ల మంది దినానికి 20 రుపాయల కంటే తక్కువ ఆదాయం మీద బతుకుతున్నారు. అంత తక్కువ మొత్తం లో హుందాకరమైన జీవితం గడపడం సాధ్యమా ? చాలా మంది ఆఫ్రికా దేశాలు బీద దేశాలు గాను ఇండియాను ధనవంతమైన దేశం గాను ఊహించుకుంటారు. నిజానికి ఆఫ్రికా దేశాల కన్న మన దేశం లో పేదవాళ్ళు అధికంగా ఉన్నారు. మన దేశం అత్యాధిక సంఖ్యలో పోషకాహరం లేని పిల్లలకు నిలయమై ఉంది. పిడికెడు మంది కోటిశ్వరులు మన దేశం లో ఉన్న కోట్ల పేద ప్రజలకు మించిన ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు. మనం అవమాన కరమైన అసమానతల సమాజం లో జీవిస్తున్నాం.

మిగతా దేశాల్లో లా కాక , మన దేశం లో కుల వ్యవస్థ ఆశీర్వాదాలతో అసమానత వ్యవస్థీకృతమై ఉంది.

20 రుపాయలకన్నా తక్కువ భృతితో జీవితం సాగిస్తున్న ఆ 80 కోట్ల మంది ప్రజలలో అధికులు ప్రాజెక్టుల వలన భూమి కోల్పోయిన వాళ్ళు, పౌష్టికాహారం లేని పిల్లలు, భూమి ఇల్లు లేని నిరుపేదలు, నగరాల్లో మురికి వాడల్లో నివసించే వాళ్ళు, జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు. ఇందులో దళితులు, ఆది వాసీలు  ముస్లిం లు అధికంగా ఉన్నారు. ఈ హింసాత్మక దేశం లో జరిగే మారణ కాండల్లో , హత్యాచారాల్లో అధికంగా బలి అయ్యేది కూడా వీళ్ళే.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం, ప్రతి 16 నిమిషాలకు దళితుల పట్ల దళితులు కాని కులాల వాళ్ళు నేరానికి పాల్పడుతున్నారు; రోజుకు నలుగురు ‘అస్పృశ్య మహిళలు ‘ స్పృశ్య ‘ కులాల వలన అత్యాచారానికి గురౌతున్నారు;  ప్రతి వారం 13 మంది దళితులు హత్య చేయబడ్డమే కాక 6 మంది దళితులు కిడ్నాప్ కు గురి కాబడుతున్నారు.

ఒక్క 2012 లోనే , ఢిల్లీ గేంగ్ రేప్ జరిగిన సంవత్సరం లో, 1574 దళిత మహిళలు రేప్ చేయబడ్డారు, 651 మంది చంపబడ్డారు ( ఒక అనుభవ సూత్రం ఏమంటే దళితుల పట్ల జరిగిన నేరాలలో 10 శాతం మాత్రమే రిపోర్ట్ చేయబడుతున్నాయి ). ఇది కేవలం రేప్, హత్యల గురించి మాత్రమే అందిన సమాచారం. ఇవి మాత్రమే కాక వలువలూడ దీయడం, బలవంతంగా మలాన్ని తినిపించడం( అక్షరాలా !! ), భూములు లాక్కోవడం, సాఘిక బహిష్కరణ, తాగు నీటిని తిరస్కరించడం లాంటివి వేరుగా ఉన్నాయి.

బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు ” హిందూత్వం భీతావహానికి కొలువు ”

హింస కేవలం అల్లరి మూకలకు , సాయుధ దుండగులకు సంబంధించినది మాత్రమే కాదు. అది భారత దేశ రాజ్య స్వభావం లోనే ఉంది.

ముందు నెలలో , ఏప్రిల్ 7 న, ఆంధ్ర ప్రదేశ్ లో 20 మందిని  STF  కాల్చి చంపారు. ఇంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. 42 మంది ముస్లిం లను  PAC  కిరాతకంగా చంపిన హషింపుర కేసులో లానే, కీళవేన్మని సంఘటనలానే, ఇంచుమించు దళితులపై జరిగే ప్రతి దాడి లానే , ఈ  STF  వాళ్ళకు ఏమీ కాదు. అదే రోజు తెలంగాణాలోవరంగల్ నుండి హైదరాబాదుకు సంకెళ్ళు వేసి తీసుకెల్తున్న  5 మంది ముస్లిం ఖైదీలను పోలీసులు కాల్చి చంపారు. 67 సంవత్సరాలలో ఇండియాకు సార్వభౌమత్యం లభించాక , దేశం లో ఉన్న రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి సైన్యాన్ని ఉపయోగించని సంవత్సరం ఒక్కటి కూడా లేదు.  సైన్యం కాశ్మీర్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, గోవా, తెలంగాణా, అస్సాం, పంజాబ్, వెస్ట్ బెంగాల్ లలో ప్రతి చోటా ఉంది. దానిని ఇప్పుడు ఆదివాసీలు నివసించే మధ్య భారత దేశం లో, అక్కడి భూమిని మైనింగ్ మరియు ఇంఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కు ఉపయోగించడం కోసం,  వాడడానికి సిద్ధమౌతున్నారు.  వేలల్లో ప్రజలను బంధిస్తున్నారు, చిత్ర హింసలు పెడుతున్నారు. ఎవరీ రాజ్య శతృవులు ? ఆలోచించండి….వాళ్ళు ముస్లిం లు, క్రిస్టియన్ లు, ఆది వాసీలు, సిక్కులు, దళితులు.

మనం సవర్ణ దేశం లో ఉన్నాం. అది నిరంతరం అవర్ణులపై , మైనారిటీలపై దాడి చేస్తూనే ఉంటుంది !!

మనది మైనారిటిల దేశం. మరి ఈ ఉన్నత వర్గానికి చెందిన మైనారిటీ సమూహం ( బ్రాహ్మణులు , బనియాలు 6 శతం కన్నా తక్కువ )  అధికారాన్ని , హక్కులను ఏ విధంగా పొందగలుగుతుంది ? ప్రజలను ఒకరి మీదకు ఒకరిని ఉసిగొప్లడం ద్వారా ! నాగాలను కాశ్మీరీల మీదకు, కాశ్మీరీలను చత్తీస్ గడ్ ప్రజల మీదకు, తమిళులను అస్సామీయుల మీదకు, వెనుకబడిన కులాలను దళితుల మీదకు, దళితులను ముస్లిం ల మీదకు ఉసిగొల్పడం చేస్తుంది.

1960, 1970 లలో ప్రతిఘటన ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందులో మీ పార్టీకి పూర్వ గాముకులైన దళిత్ పేంథర్స్ , నక్సలైట్లు న్యాయం గురించి , విప్లవం గురించి ఎలుగెత్తారు. భూ సంస్కరణల గురించి నినదించారు. ‘ దున్నే వాడిదే భూమి ‘ అనే నినాదం వారిది.

రోజు మన మెదళ్ళ నుండిన్యాయంఅనే అంశానికి బదులుగా  ‘ మానవ హక్కులుఅనబడే ఒక సంకుచిత అంశం వచ్చింది.

అంతో ఇంతో జరిగిన భూ సంస్కరణలు కూడా వెనక్కు మళ్ళబడ్డాయి. ఎంతో ఉధృతమైన మావోయిస్ట్ ఉద్యమాలు కూడా ఆది వాసీల భూములను ప్రైవేటు వ్యాపార సంస్థల పరం కాకుండా ఉండడానికి మాత్రమే పోరాటం చేసే స్థాయికి తగ్గి పోయాయి. ఈ రోజు 70 శాతం పైగా దళితులు భూమి లేని వాళ్ళు. పంజాబ్, బీహార్, హర్యానా, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఈ సంఖ్య 90 శాతం పైనే ఉంటుంది. ఇన్ని కోట్ల మంది ఈ చర్చలో భాగం కూడా కాదు.

ఎవరు మన దేశాన్ని స్వంతం చేసుకున్న ఈ వ్యాపార సంస్థలను నడుపుతున్నారు ? – భూమి ఒక్కటే కాదు, ఆడవులు, నదులు, నీళ్ళు, విద్యుత్తు . పోర్టులు, సెల్ ఫోన్ నెట్వర్క్, టీ వీ చానల్స్, ఫిల్మ్ ప్రాడక్షన్, స్పెషల్ ఎకనమిక్ జోన్ లు  అన్ని బ్రాహ్మణులు లేదా బనియాలకు సంబంధించిన  అదాని, అంబాని, మిట్టల్, సంఘ్వి, బిర్లా, జిందాల్ లాంటి వాళ్ళే .

అత్యంత అలజడి సృష్టించిన ఫ్రెంచ్ రైటర్ ప్రొఫెసర్ థామస్ పికెటీ వ్రాసిన కొత్త పుస్తకం  Capital in the 21st century  లో మనమిప్పుడు ప్రపంచం లో చూస్తున్న ఆర్థిక అసమాటితలు పురాతన యుగం తో సమానంగా చేసి చూస్తాడు. అందుకు మహత్తరమైన గణణాంకాలతో – ఈ రోజుల్లో యూరోప్, అమెరికాలలో అసమానతలను పెంపొందించే పెద్ద పెద్ద బేంకులు , సంస్థలు ఎలా ఐశ్వర్యాన్ని తర తరాలుగా సంక్రమించుకుని వాళ్ళ వంశాలకు ఎలా సంప్రాప్తించేలా చేస్తాయో చెప్తాడు. మన దేశం లో తరాలుగా సంప్రాప్తిస్తున్న ఐశ్వర్యం, ఙానం, భోగాలు ఇవన్నీ దైవాంశ సంభూతం గా కొలవబడుతున్న హిందూ కుల వ్యవస్థ వలనే జరుగుతున్నాయి.

కేపిటలిజం కు కుల వ్యవస్థ తల్లి లాంటిది.

మనం తిరిగి మైనారిటీ సమూహాలైన బ్రాహ్మణ మరియు బనియాలు ఎలా సౌభాగ్యంగా  మనగలుగుతున్నారు అనే ప్రశ్న దగ్గరకొస్తే – కిరాతకైన భౌతిక బలం ఊయోగించడం వారి టెక్నిక్.

ప్రధానంగా ఇదే బనియా సంస్థలే మీడియాను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళే ఏ విషయం ప్రచార అర్హత కలిగుందో నిర్ణయిస్తారు.  మీడియా ను నియత్రించడం ద్వారా దేశం  తలంపులను ఆలోచనలను నియంత్రిస్తారు. 4 ప్రధాన జాతీయ వార్తా పత్రికల్లో , 3 వైశ్యులు నడుపుతుండగా 1 బ్రాహ్మణులు నడుపుతునారు.

టైంస్ చానల్ నడుపుతున్నది జైన్ ( బనియా) , హిందుస్తాన్ టైంస్ నడుపుతున్నది బర్తియా ( మార్వాడి బనియా ), ఇండియన్ ఎక్స్ప్రెస్ నడుపుతున్నది గోయంకా ( మార్వాడి బనియా ) , ది హిందూ నడుపుతున్నది బ్రాహ్మణ కుటుంబం, దైనిక్ జాగరణ్ నడుపుతున్నది గుప్తా కుటుంబం, దైనిక్ భాస్కర్ నడుపుతున్నది అగర్వాల్ కుటుంబం. గుజరాత్ బనియా అంబాని నడుపుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కు 27 ప్రధాన జాతీయ , ప్రాంతీయ చానల్స్ లో షేర్స్ ఉన్నాయి. అతి పెద్ద జాతీయ చానల్ జీ నెట్ వర్క్ కూడా బనియానే నడుపుతున్నది.

గణాంకాలు చెప్తున్నదేమంటే సంస్థలు తీసుకునే జర్నలిస్టులు కూడా ప్రధానంగా బ్రాహ్మణ, బనియా మరియు అగ్ర కులాల వారే. ముస్లిం జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారో చేతి వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. దళితులు, ఆది వాసీల ఐతే అసలు కనబడరు.

రిజర్వేషన్ పాలసీ ని ఉద్దేశ్యపూర్వకంగా కూలదోస్తూఇదే పరిస్థితి న్యాయ వ్యవస్థలో, బ్యూరాక్రసి లో, విద్యా వ్యవస్థలో ఉంది. దళితులు అధికంగా కనిపించే స్థానాలు ఏవంటే – 90 శాతం ప్రభుత్వ మునిసిపాలిటీ లో పరిశుభ్ర కార్మికులు ! గొప్ప రాజ్యం లో 13 లక్షల స్త్రీలు ఇంకా తమ నెత్తి మీద మలం బుట్ట పెట్టుకు తిరిగి జీవనం వెళ్ళ బోస్తున్నారు.

ప్రజాస్వామ్యం  స్వేచ్చా మార్కెట్ విధానం కులవ్యవస్థను ఆధునీకరించి పఠిష్టం చేస్తున్నాయి. అయినా సరే , పేరెన్నిక గన్న భారత మేధావులు, చరిత్ర కారులు, ఆర్థికవేత్తలు, రచయితలు, కుల సమస్యను అల్పంగా చూపడం కాని లేదా మొత్తానికి విస్మరించడం కాని చేస్తున్నారు. ఇది కంటికి కనిపించని గొప్ప పథకం. ఈ తెర లేవదీసి , ఈ ప్రపంచానికి మన గొప్ప ప్రజాస్వామ్యం లో ఏం జరుగుతుందొ చూపించడం మన విధి.

ఎలక్షన్ ల సమయం లో అన్ని రాజకీయ పార్టీలు , సవర్ణ రాజకీయ నాయకులు ‘ దళిత వెనుక బడిన కులాల ‘ ఓట్ల కోసం కొట్లాడుకుంటున్నప్పుడు మాత్రం  అడుగున కప్పేసి ఉన్న కులం ఉక్కు చట్రాన్ని బయటకు తీసి పెద్ద గొంతుకతో వికృతంగా అరవడం చేస్తారు. ఒక్క సారి ఎలక్షన్ లు అయిపోయాక తమకు తెలిసిన మేథో మూర్ఖత్వం తో ఆ సమస్యను పూడ్చి పెడతారు. ఒక ప్రధాన టీ వీ యాంకర్ ఎంతో సీరియస్ గా అంబేద్కర్ కుల వ్యవస్థకు వ్యతిరేకి కాబట్టి రిజర్వేషన్ పాలసీని వ్యతిరేకించాలి అని వాదించడం చూసాను.

ఈ రోజుల్లో ఆర్థిక అవినీతి గురించి మాట్లాడ్డం ఒక ఫేషన్ గా కనిపిస్తుంది. కాని అందులో చాలా తక్కువ మంది మాత్రమే ‘ మేథో అవినీతి ‘ గురించి మాట్లాడుతున్నారు. మేథో అవినీతి దేశం లో పాటించే ఒక ఊహకందని నైతిక లంచగొండితనం

ఈ సమాజ తీరు తెన్నులు, న్యాయం గురించి పుంఖానుపుంఖాలుగా సైద్ధాంతిక వ్యాసాలు రాస్తూ అసలు కులాన్ని మొత్తంగా పక్కకు నెట్టేసే కొంత మంది పేరెన్నిక గన్న చరిత్ర కారులు, మేధావులు ఈ అవినీతిలో కూరుకుపోయారు. ఇది ఈ సమాజం కనుగొన్న అతి కౄరమైన అణచివేత విధానం.

చరిత్రలో అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఇదే ‘ మేధో అవినీతి ‘ –  కుల వ్యవస్థను నమ్మిన, శ్రామికులను , స్త్రీలను , నల్ల జాతీయులను కించ పరిచిన మోహన్ దాస్ గాంధీని ప్రపంచంలో గొప్ప సాధువుగా , పేదల మితృడిగా , నల్ల అమెరికన్ ల హీరోగా, నెల్సన్ మండేలా లా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లా చివరికి ఈ దేశానికి జాతిపిత గా ఎత్తిపట్టడం. ఈ దేశ పునాదులను అటువంటి అసత్యాల మీద నిలబడ్డాన్ని మనం సహించరాదు.  ప్రతి స్కూల్ రూం లో తప్పనిసరిగా చేయాల్సిన అంబేద్కర్గాంధి డిబేట్  విషయాన్ని చాలా చాతుర్యంగా చీకట్లో నెట్టేసి , ఇప్పుడు లిబరల్ మేధావులు మరియు చరిత్ర కారులు వారిద్దరిని మంచి సహ ప్రయాణికుల్లా ఉన్నట్టు , ఏదో వారి మధ్య చిన్న కలహాలు ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ మొత్తం అబద్ధాలే చెప్తున్నారు.

మనం అత్యవసర బాధ్యతగా పెట్టుకుని అంబేద్కర్ వారసత్వాన్ని అసత్యాలతో మార్చడాన్ని అడ్డుకోవాలి.

ఉపన్యాసం ముగించేలోపు నేను చెప్పదల్చుకున్నదేమంటే కుల వ్యవస్థను రూపు మాపడానికి మనం బ్రాహ్మినిజం, కేపిటలిజం, సామ్రాజ్య వాదం మధ్య సంబంధాన్ని గుట్టు విప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా మనం ఒక రాజకీయ సంఘటన కట్టాలి. దక్షిణ ఆఫ్రికాలో జాతి వివక్ష ఎలా నిర్మూలింపబడింది అనుకుంటున్నారు ? మొత్తం ప్రపంచం దుర్మార్గమైన వివక్షను హేయపూర్వకంగా చూడాలి. ఇండియా బయట ఉన్న వాళ్ళకు కుల వ్యవస్థ ఏంటో తెలీట్లేదు. వాళ్ళకు ఇదేదో హిందూయిజం,  శాఖాహారి ఫేషన్ సంస్కృతి, యోగా మరియు గాంధియిజం   ఫేషన్  తో కలిసిపోయిన బ్రహ్మ పదార్థం లా ఉంది.

మన లో ప్రతి ఒక్కరు మన ప్రజ్ఞా   సామర్థ్యాలు ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఉపయోగించాలి.

మన ముందు ఉన్న ప్రధానమైన సవాలు ఏంటంటే – మన రాజకీయ ఐక్యతను నిరోధించే ఈ కుల విభజనను మన ఏమరుపాటుతో బలోపేతం చేయకుండా, మనం కులాన్ని ఎదుర్కోవడం. ఇది చాలా సంక్లిష్ట పోరాటం. ఎందుకంటే మన ఐక్యతను దెబ్బ తీసే రాడికల్ నినాదాలు, ప్రత్యేక వాదాలు మీరు చూస్తారు. నాకంటే మీకు బాగా తెలుసు  – శతృవర్గం లో మీ మితృవులకు ఈ విషయం చెప్పడం చాలా కష్టం. అయినా సరే తప్పదు. చెప్పాలి. అంబేద్కర్ కున్న గొప్ప ప్రజ్ఞా పాటవాల్లో ఇదొకటి.

మన లో ప్రతి ఒక్కరు మన ప్రఙ  సామర్థ్యాలు ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఉపయోగించాలి.

మనం పొలాల నుండి మొదలుకుని, ఫేక్టరీలు, మురికి వాడలు, గుడిసెలు, తరగతి గదులు, యూనివర్సిటీలు, సినిమా, సాహిత్యం అన్నిటినీ కలుపుతూ ఒక సుధీర్ఘమైన దుర్భేధ్యమైన జాగృతి, అవగాహన, అవిరామ ఆచరణ అనే గొలుసును తయారు చేయాలి !!!

అనువాదం: పి. విక్టర్ విజయ కుమార్ 

 

 

 

 

 

 

 

 

యూరిన్ పోలిటిక్స్

పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

vijaykumar viktar” యూరిన్ కాషాయం రంగులో ఉందిరా ఇప్పుడు “

 ఇండియా గేట్ ను ఎగా దిగా చూస్తూ నాలుక కొస నుండి సిగరెట్ పొగ వదుల్తూ అన్నాడు మా వాడు. వాడి పేరు రాబర్ట్ నాగేంద్ర. వాళ్ళ తాతకు బ్రిటీష్ టైం లో రాబర్ట్ అనే దొర హెల్ప్ చేసాడని వీడి పేరుకు ఆ తల అతికించాట్ట.  సన్నగా జొన్న మొక్క బెండులా ఉంటాడు. దానికి తోడు నాగజెముడు పొదల్లా గడ్డం. పైన బట్ట తల. కేప్ పేట్టి ఒసామా బిన్ లేడెన్ అంటే నమ్మేయొచ్చు.

” టెస్ట్ చేయించుకో…..అబ్బ….బాబూ ! ఆ సిగరెట్ ఆపరా… ఆ కంపు భరించలేను నేను ” అన్నా. ” పబ్లిక్ లో తాగుతూ చట్టాన్ని కూడా అతిక్రమిస్తున్నావు. పోలీసోడు చూస్తే ఫైన్ వేస్తాడు ”

వాడు ఫక్కున నవ్వాడు. ” అరేయ్ బాబాయ్ ! నీవు ఫ్రాంక్ గా ఒక మాట చెప్పరా. సిగరెట్ పబ్లిక్ గా తాగితే  Cigarette and Other Tobacco Products Act  కింద రెండొందలు లేదా ఐదొందలు జరిమానా వేస్తారేమో. ఇంట్లో మొక్కల చుట్టూ రోజూ యూరిన్ పోస్తే పక్కింటొడికి వచ్చే కంపుకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 268 కింద పబ్లిక్ న్యూసెన్స్….అదెంత పెద్ద అఫెన్స్ తెల్సా ? బొక్కలోకి తొయ్యొచ్చు ”

” వెళ్ళి గడ్కారికి చెప్పు ” నేను పార్కులో మొక్క కున్న పువ్వు తెంపి ముక్కు వద్ద పెట్టుకుని పీల్చాను.

నా మొహం మీద పొగ ఊదాడు. వాడికి నేనంటే చిన్నప్పటుండీ ఒక ఎగతాళి. కలిసే పెరిగాం కదా అందునా బాల్య స్నేహం …భరించాలి !

” గడ్కారి ఇంట్లో మొక్కలకు యూరిన్ పోస్తానంటే పక్కింటోళ్ళకు న్యూసెన్స్ . అది అఫెన్స్ అనే విషయం వదిలేసి యూరిన్ లో గొప్ప తనాలు వెతుకుతారేంద్ర భయి ?! ”

” యూరిన్ లో లీటర్ కు పది గ్రాముల దాకా యూరియా ఉంటుంది. నీవు నెల రోజులు ఒక మొక్క చుట్టూ పోస్తూ ఉంటే కనీసం పావు కేజీ యూరిన్ దానికందుతుంది. అదే క్వాంటిటీ యూరియా ఫర్టిలైజర్ కొనాలంటే కేజీ సుమారు ఐదు, ఆరు రుపాయలౌతది. సేవింగ్ ఏ కదమ్మా ఇదంతా ? ”

వాడు గడ్డం వాడే లాక్కుని అన్నాడు ” ఈ లెక్కన టాయిలెట్స్ రావడం వల్ల మన దేశ సంస్కృతి కూడా దెబ్బ తింటుంది అన్న మాట ” ఏదో అనలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.

” తెలుసు….పబ్లిక్ గా పిస్ కొట్టడమే కదా ?”

‘ ధభా ‘ అని వీపు చప్పరించి ఫక్కున నవ్వాడు ” వెరీ షార్ప్ ”

” సోచ్ హోతో శౌచాలయ్ హై…రాంగ్….సోచ్ హో తో శౌచాలయ్ నహీ కరెక్ట్. చాలా విచిత్రంగా మోదీ ఒకటి కష్టపడి చెప్తాడా ? ఆయన వెనకాలే వీళ్ళందరూ ఇంకోటి చెప్తారేంద్ర భయ్ ” వేసాడు ఇంకోటి వీపు మీద.

ఒక ఫేమిలీ దూరంగా పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు. చిన్నపిల్లోడు చల్లటి సాయంత్రం లో పచ్చటి గడ్డి బయల్ల మీద బాల్ తో ఆడుకుంటున్నాడు. అక్కడ ఇంకా కొన్ని ఫేమిలీస్ కలిసి సమయం గడుపుతున్నారు.  సాయంకాలం ఇండియా గేట్ దిట్టంగా కనిపిస్తుంది.  మధ్యలో ద్వార ప్రవేశం ‘ కొండంత అండగా ఉంటాను నీవిటొచ్చేయ్ ‘ అన్నట్టు ఉంటుంది.

BottledUrine

” మన హైదరాబాద్ రింగ్ రోడ్డులో చెట్లు నాటుతున్నారు. ఒక్కో చెట్టుకు ఒక్కో కవర్ కట్టి ”  Please piss here. We shall be glad  ‘ అని పెట్టాలి ” అన్నాడు.

” యా….అసలు పెద్ద పనికే ఒక ప్రొవిజన్ పెడ్తే ఇంకా బాగుంటుంది.  you get lot of organic fertiliser   ”

” రోడ్డు మీద ట్రావెల్ చేసే వాళ్ళకు  ” Please carefully drive…organic fertilisation in process   ‘ అని పెట్టాలి ”

ఇంకో సిగరెట్టు తీసాడు. ” ఒరేయ్…ప్లీజ్…దూరంగా వెళ్ళి తాగురా…” అన్నా.

వాడో అనాథ. చిన్నప్పుడు బీడీలు తాగేవాడు. చదువు లో మాత్రం ఫస్ట్ ఎప్పుడూ. నేనే లాస్ట్. వాడికి ఉద్యోగం చేయడమంటేనే అలర్జీ . నే ఉద్యోగం చేస్తూ పది సంవత్సరాలు గడిపినా వాడు మాత్రం ఇంకా హైదరాబాదులో నిరుద్యోగిగా పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు.

” ఏదో రోజు ….ఇదే కంపును ఆనందంగా అహ్వానించే రోజు రాక మానదు లే నీకు. కంపుగున్నవి , కంటగింపుగా ఉన్నవి ఇంపుగా, ఇల సొంపుగా అవుతాయి.  వెయిట్ అండ్ సీ ….శివుడు హాలాహలం కంఠం లో దాచుకున్నందుకు ఆ వేడిని తట్టుకోడానికి ఏం తాగాడో తెలుసా ? ఇదే పొగనిచ్చే గంజాయిని…..ఈ పొగ కూడా డివినిటీ తీసుకుంటుంది త్వరలో….ఇదే పొగను రిఫైన్ చేసి ఆహా ఒహో అంటూ వాడుకునే  రోజులొస్తాయ్ ఇక……” అని ఆ చివరి సిగరెట్టును జాగర్తగా జెబులో కూర్చోబెట్టాడు.

” మరేం   !…….కౌ యూరిన్ రిఫైనరీ రాజస్థాన్ లో పెట్టారు. డివినిటీ నో గాడిద గుడ్డో…ఐడియా జీవితాన్ని మార్చేసింది కదా ?! ”

” హలో….చెన్నై లో సిటీ మధ్యలో పొంగిపొర్లే  డ్రైనేజ్ గంగ పక్కనే 2000 సంవత్సరం లో ప్లాంట్ పెట్టి ఇప్పటి వరకు …అందులో డ్రైనేజి వాటర్ నుండి మినరల్ వాటర్ కన్నా మంచి నీళ్ళు తయారు చేస్తున్నారు. లీటర్ కు ఐదు పైసల కన్నా తక్కువ ఖర్చులో. నీటి బెడద ఉన్న  ప్రాంతాల్లో ఫేక్టరీకి కావాల్సిన నీళ్ళు అవే వాడుకుంటున్నారు.  ఇంతకన్నా మంచి ఆయిడియా ఉందా , యాక్చువలీ ?  ”

” ఓహో ! నీటి కొరత ఉండే చెన్నై లో ….అంత మంచి నీళ్ళు మరి జనాలకు సప్లై చేయొచ్చు కదా ? ”

” మన దేశ సంస్కృతి గో మూత్రం తాగడం పర్మిట్ చేస్తుంది. మనుష్యులది కాదు ”

నేను వాడి భుజం మీద ఆప్యాయంగా చేయేసాను. వీడికి మనుష్యులంటే మాత్రం ఎందుకంత మక్కువో ?!  చూడ్డానికి వాడు సమాజం లో చితికి పోయిన  నిరుద్యోగి లా ఉంటాడు కానీ , ఒక స్ట్రక్చర్ లో పని చేయాలంటే చిరాకు వాడికి. అందుకే మార్కెటింగ్, సాఫ్ట్ వేర్, పబ్లిక్ రిలేషన్స్ లలో వాడికో మూడు , నాలుగు ఉద్యోగాలొచ్చినా ఎక్స్ పెరిమెంట్ చేసి, పడక వచ్చేసాడు.

కలిసి నడుస్తున్నాము.

మబ్బులు కమ్ముకున్నాయి కదా…..ఇండియా గేట్ మీద మేఘాలు అందంగా అటూ ఇటూ తచ్చాడ్డం బాగుంది.

వాడు గడ్డం గోక్కుంటూ కంటిన్యూ చేసాడు.

” బయో డైజెషన్ ప్రాసెస్ తెల్సు కదా ? గో మూత్రమే కాదు …ఏ మూత్రమైనా….ప్రాసెస్ చేస్తే మీథేన్ వస్తుంది…అదే మన అంబాని అందరికీ టొపీ పెట్టిన సహజ వాయువు….వీళ్ళ బొంద…..గో మూత్రం కెమికల్ కంపోజిషన్ గమనిస్తే , గొర్రె మూత్రం చూసినా, ఒంటె మూత్రం చూసినా కొంత తేడా ఉంటుంది కాని ఆర్గానిక్ ప్రాపర్టీస్, మెటీరియల్ గా ఏవీ తేడా ఉండదు. ”

‘ వీడిప్పుడు టెక్నాలజీ మూడ్ లోకి వెళ్ళాడు ‘ అనుకున్నాను. ”  Urine is Urine. Its excreta of living beings containing several biological waste elements   ” అని పక్కనుండి పాస్ అయిన పటియాలా డ్రస్ పంజాబీ అమ్మాయిని సాలోచనగా చూస్తూ అన్నాడు.

వాడి గడ్డం లాగి నా వేపుకు తిప్పుకుని, వాడు వదిలేసిన పాయింటు దగ్గర కంటిన్యూ చేసాను.  ” మొరార్జీ దేశాయ్ గొప్పోడురా…అప్పట్లోనే …మూత్రం తాగేసాడు మొహమాటం లేకుండా. … జనాలే అపహాస్యం చేసారు. కానీ …ఇంట్రెస్టింగ్ ఏంటంటే…మొరార్జీ సిండ్రోం  కళ్ళ ముందు ఉండగా, జంకకుండా, గడ్కారీ ఇలా ఓపెన్ గా చెప్పుకోడానికి భలే తెగింపులే  ? ”

State of waters - boy and frog

” ఎంత ధైర్యమైనా వస్తుందిరా. ఇంతకు మునుపెప్పుడన్నా దేశ ప్రతిష్ట గంగలో కలిసి పోతుంది అనే కాన్సెప్ట్ తో చట్టం పని చేయడం చూసావా ? ”

” లే ”

” దేశ జనాభా , కుటుంబ నియంత్రణ అని స్మరించే మనము – పందుల్లా పదేసి మందిని కనడం మన కర్తవ్యం, గురుతర బాధ్యత అని ధైర్యం చేసి ఎవడన్నా అంటాడు అని ఊహించావా ? ”

” లే ”

” ఇదీ అంతే ….. సౌదీలో ఇస్లామిక్ ఆర్థిక శాస్త్రం ఉంటుంది. ఇక్కడ కూడా అదే తరహాలో మత ఆర్థిక శాస్త్రం …. ”

నేను వెంటనే అన్నాను ” వెస్ట్రన్ ఎకానమిస్ట్స్ ఇస్లామిక్ ఆర్థిక శాస్త్రాన్ని ఆకాశానికెత్తినప్పుడు దీన్ని ఎందుకు తలకెత్తుకోరు ?! ”

” వెస్ట్రన్ నాయాళ్ళు. స్పైన్ లేని నాయాళ్ళు. వాళ్ళ మాట చెప్పక ”

వాడు – మేము కాలేజీలో ఉన్నప్పుడు నేను రంగ నాయకమ్మ పుస్తకాలు చదివితే ఇరిటేట్ అయ్యి లాక్కుని ” సెల్ఫ్ లవ్ ‘ స్టోరీలు చదవక ” అని విసిరికొట్టి చేతిలో ” చీకటి రోజులు ” ” చిత్ర హింసల కొలిమిలోంచి ” లాంటి నావల్స్ పెట్టేవోడు. ఏమిరా అంటే ” లోయలో పడే మనుష్యులను రక్షించాలనుకునే రచయితలు లోయలో పడే మనుష్యుల వ్యథను  వివరిస్తారు…వర్ణిస్తారు….కాని లోయల నైసర్గిక పరిణామాలను, జారి పడే మనుష్యుల అవలక్షణాలను  విశ్లేసిస్తూ తమ ఐ క్యూ ను, ఏప్టిట్యూడ్ ను చాటిచెప్పుకుంటూ ‘ సెల్ఫ్ లవ్ ‘ డిస్ప్లే చేయరు ” అనే వాడు.

వాడికి సిగరెట్ తాగాలనే అర్జ్ పెరిగినట్టుంది. అందునా ఒకటే సిగరెట్ మిగిలి ఉంది వాడి దగ్గర. ఊరికే చేతులు జేబు మీద పెట్టి తడుముతున్నాడు.

” లుక్…మన దేశ సంస్కృతిని మనం ఎత్తి పట్టాలి ”

” అందుకేగా టాయిలెట్స్ తీసేయాలి అనేది. అదే భారతీయ సంస్కృతి కూడా !”

పిల్లోడు ఆడుకుంటున్న బాలు ‘ టపీ ‘ మని రాబర్ట్ గాడి యెదపై వచ్చి కొట్టుకుంది. పిల్లోడు బాలు పట్టుకుని వెనక్కి చూడకుండా పరిగెత్తుకెళ్ళాడు…పొరపాట్న ఎక్కడ ఆపేస్తాడో అన్నట్టు.

రాబర్ట్, బంతి దెబ్బకు జేబులో నలిగి పోయిన సిగరెట్టును వేళ్ళ మధ్య అటూ ఇటూ తిప్పుతూ చూస్తూ ఉన్నాడు.

” మన సంస్కృతికి , రాజకీయాలు ముడేస్తే ఏమౌతుంది ? ”

” ఉ____   రాజకీయాలు పుడ్తాయ్ !! ”

వాడికి బాగా కాలినట్టుంది …………… …………..!!!!

మాటల రంగు వేరు…చేతల రంగు వేరు..!

డా .నీరజ అమరవాది

      neeraja  నీలాకాశంలో నల్లటి మబ్బుల మధ్య నిండు చందమామని చూపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే , నలుపూ , తెలుపుల కలనేత ఎంత బాగుందో అనిపించింది .

          పంతులుగారు నల్లబల్లమీద ముత్యాలలాంటి అక్షరాలతో బోధిస్తుంటే అజ్ఞాన తిమిరాలు తొలగి , విజ్ఞాన కిరణాలు సోకినట్లనిపించింది .

        తెల్లటి కాగితం పై నల్లటి అక్షరాలతో పరీక్ష రాస్తున్నప్పుడు నలుపంటే  విజయం అనుకున్నాను .

గురజాడని చదువుకున్న తర్వాత   మంచి చెడులు రెండె జాతులు ఎంచి చూడగ అని తెలుసుకున్నాను .

     21 వ శతాబ్దంలో నాయకుల అభిలాషలు సాకారం అయి కులాతీత , మతాతీత , వర్ణరహిత అంతర్జాతీయ సమాజంలో నివసిస్తున్నందుకు గర్వపడ్డాను .

        జాతివివక్షలు ఆనాడే తొలగిపోయాయి . నల్లజాతీయులు , తెల్లజాతీయులతో సోదరులలాగా కలసిమెలసి జీవిస్తున్నారని శ్వేతసౌధం సాక్షిగా నమ్మాను . మానవత్వమే నిజమైన జాతి అనుకున్నాను .

        ఐక్యరాజ్యసమితి సైతం అక్షరాస్యత , పేదరిక నిర్మూలనతో పాటు జాతి వివక్ష , జాత్యహంకార భావజాలాన్ని తుదముట్టించేందుకు నడుం బిగించి ఎజెండాలు తయారుచేసింది .

            నిరాడంబరమైన జీవితం , ఉన్నతమైన ఆలోచనలే మనిషిని మనీషి గా చేసే లక్షణం అంటూ జాతిపితలు సెలవిచ్చారు . వారి అడుగుజాడలే శిరోధార్యంగా , గాంధీ జయంతులను జరుపుకుంటూ , అహింసా సిద్ధాంతాలను మననం చేసుకుంటూ , గాంధీ టోపీలను పెట్టుకుంటూ , గాంధీ జోడును , కర్రను  స్వచ్ఛతకు , స్వేచ్ఛకు చిహ్నాలుగా అంతర్జాతీయ సమాజం భావిస్తూ , గౌరవిస్తోంది .

            ఇన్ని భావనల మధ్య పెద్దన్న సమక్షంలో  ఒక నల్ల జాతీయుడిని , శ్వేతజాతి పోలీసులు కేవలం కళ్లల్లో కళ్లు పెట్టి చూసినందుకు , అమానుషంగా , సంకెళ్లు బిగించి రఫ్ రైడ్ లతో పాశవికంగా ఈడ్చుకెళ్లి , వెన్ను విరగ్గొట్టి , ప్రాణాలను హరించి , మృగరాజులా మీసం దువ్వుకున్నారు . అధికారులు వంతపాడారు .

     రక్షకభటుల దుస్తులతో పాటు అంతరంగం కూడా నల్లనిదే అని శ్వేతజాతి పోలీసులు తమ చర్యలతో చెప్పకనే చెప్పినట్లు చూపారు .

        చర్మపు రంగు ఆధారంగా , సాటి సోదరుని పై జాత్యహంకార బలుపును  ప్రదర్శించిన భక్షక భటులను అందరూ ఉలిక్కిపడి చూస్తున్నారు . తమ అస్తిత్వాన్ని ప్రశ్నించుకుంటున్నారు .

            మనిషి ప్రవర్తన , ఆలోచనా విధానం చర్మపురంగుతో ముడిపడి ఉంటుందేమో అని పరిశోధనలు చేయాల్సిన సమయం వచ్చింది .

             మాటలలో ఒక రంగును , చేతలలో మరొక రంగును చూపే నాయకులారా ! ఇది రంగుల ప్రపంచం అని మళ్లీ మళ్లీ నిరూపించబడింది .

                                      *

 

 

వార్తకి అటూఇటూ…. 

వై.వి. రమణ 

 

రమణఉదయం పదిగంటలు. అప్పుడే కాఫీ తాగి పేపర్ చదవడం మొదలెట్టాను. శేషాచలం అడవుల్లో కూలీల ఎన్‌కౌంటర్ గూర్చి వార్తా విశ్లేషణ చదువుతున్నాను. ఇంతలో నా చిన్ననాటి స్నేహితుడు సుబ్బు హడావుడిగా వచ్చాడు. 

“హలో మిత్రమా! ఒక కప్పు కాఫీ! అర్జంట్!” వస్తూనే అన్నాడు సుబ్బు. 

“కూర్చో సుబ్బూ! బహుకాల దర్శనం, బాగున్నావా?” పలకరించాను. 

“నేను బాగానే వున్నాన్లే! అంత సీరియస్‌గా పేపర్ చదువుతున్నావ్! ఏంటి కబుర్లు?”

“పాపం! శేషాచలం అడవుల్లో ఇరవైమంది చనిపోయ్యారు సుబ్బూ! ఘోరం కదూ?” దిగాలుగా అన్నాను.

“ప్రస్తుతం మన్దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. కావున – మనుషులిలా చావడం సహజం. నువ్విలాంటి సాధారణ వార్తలకి దిగులు చెందరాదు!” నవ్వుతూ అన్నాడు సుబ్బు.

ఆ నవ్వుకి వొళ్ళు మండిపొయ్యింది నాకు.

“మనుషుల ప్రాణాలంటే నీకంత చులకనగా వుందా సుబ్బూ?” మొహం చిట్లించి అన్నాను.

నా ప్రశ్నకి ఒక క్షణం ఆలోచించాడు సుబ్బు.

“నువ్వు అర్ధం చేసుకోవాల్సింది – మన దేశ ఆర్ధిక ముఖచిత్రం మారుతుంది. ఇప్పుడిక్కడ కావల్సింది ‘అభివృద్ధి’ తప్పించి మనుషుల ప్రాణాలకి రక్షణ కాదు. ఈ నేపధ్యం అర్ధం చేసుకున్నాను కాబట్టే మనుషులు చావడం, చంపబడటం ఒక సహజ పరిణామంగా నేను ఫీలవుతున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే – ‘అభివృద్ధి’ అనే ఫేక్టరీకి ఈ చావులు కాలుష్యం వంటివి. కాలుష్యం లేకుండా ఫేక్టరీ నడవదు, లాభాలు రావు. లాటిన్ అమెరికా దేశాల్లో కూడా జరుగుతుందిదే.” అన్నాడు సుబ్బు.

ఇంతలో ఫిల్టర్ కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది.

“సుబ్బూ! కొంచెం అర్ధం అయ్యేట్లు తెలుగులో చెప్పవా?” విసుగ్గా అన్నాను.

“సమాజం ఏకోన్ముఖంగా వుండదు. అడవిలో జంతువుల్లాగే అనేక రకాల వ్యక్తుల సమాహారమే సమాజం. కాకపోతే మనుషులు ఒకే రకమైన శరీర నిర్మాణం కలిగుంటారు. అందుకే ఈ శేషాచలం చావుల్ని కూడా ఎవరి తోచినట్లు వారు అర్ధం చేసుకుంటారు.” అన్నాడు సుబ్బు.

“అదెలా?” ఆసక్తిగా అడిగాను.

“నీకు పెద్దమనుషుల భాషలో చెబుతాను. ఈ భాషని ‘కన్యాశుల్కం’లో సౌజన్యారావు పంతులుతో మాట్లాడిస్తాడు గురజాడ. ఈ భాష గంభీరంగా వుంటుంది, అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం!” అన్నాడు సుబ్బు.

“ఏవిఁటో ఆ భాష?” అన్నాను.

“శాంతిభద్రతల్ని కాపాడ్డం, నేరాల్ని అరికట్టడం అనేది రాజ్యం యొక్క పవిత్రమైన బాధ్యత. ఎవరైతే నేరం చేసినట్లు రాజ్యం భావిస్తుందో, వారిపై నేరారోపణ చేస్తూ, సాక్ష్యాధారాల్తో కోర్టుకి అప్పగించడం రాజ్యం యొక్క విధి. ఇందుకు రాజ్యానికి పోలీసు వ్యవస్థ సహకరిస్తుంది. అట్లా కోర్టుకి అప్పగించిన వారిని ‘నిందితులు’ అంటారు. ఇక్కడి నుండి న్యాయవ్యవస్థ పని మొదలవుతుంది. నిందితుడికి వ్యతిరేకమైన సాక్ష్యాధారాల్ని కూలంకుషంగా విచారించి ఆ నిందితుడు నేరం చేసిందీ లేనిదీ కోర్టులు తేలుస్తాయి. నేరం చేసినట్లు ఋజువైతేనే నిందితుడు, ఆ క్షణం నుండి ‘నేరస్తుడు’ అవుతాడు.” అన్నాడు సుబ్బు.

“ఇదంతా నాకు తెలుసు.” అసహనంగా అన్నాను.

“ఈ పెద్దమనుషుల భాష ప్రకారం – మొన్నట్నుండీ సత్యం రామలింగరాజు ‘నేరస్తుడు’గా అయిపోయ్యాడు. గాలి జనార్ధనరెడ్డి ఇవ్వాళ్టిక్కూడా ‘నిందితుడు’ మాత్రమే.” అన్నాడు సుబ్బు.

“నాకు ఇదీ తెలుసు.” చికాగ్గా అన్నాను.

“మిత్రమా! ‘జీవించడం’ అనేది ఒక ప్రాధమిక హక్కు. ఈ హక్కుని పరిరక్షించడం రాజ్యం యొక్క ముఖ్యమైన బాధ్యత. చట్టం ముందు అందరూ సమానులే. నీకు లేని హక్కు ఇంకెవరికీ లేదు. ఇంకెవరికీ లేని హక్కు నీకు లేదు.” అన్నాడు సుబ్బు.

“ఏవిఁటి సుబ్బూ! మరీ చిన్నపిల్లాడికి చెప్పినట్లు.. ”

సుబ్బు నామాట వినిపించుకోలేదు.

“న్యాయ సూత్రాలని పాటిస్తూ పాలించడాన్ని ‘చట్టబద్ద పాలన’ అంటారు. దీని గూర్చి బాలగోపాల్ వందల పేజీలు రాశాడు, వందల గంటలు ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ చట్టబద్ద పాలన దేవతా వస్త్రాల్లాంటిది. ఇది అందరికీ కనపడదు. నిందితుడు, నేరస్తుడు అనే పదాల లక్జరీ కొన్ని వర్గాలకి మాత్రమే పరిమితం.” అన్నాడు సుబ్బు.

“ఎందుకని?” అడిగాను.

“సమాజం రైల్వే బోగీల్లాగా కంపార్టమెంటలైజ్ అయిపొయుంది. ఏసీ బోగీవాడికున్న ప్రివిలేజెస్ జెనరల్ బోగీవాడికి వుండవు. ఇది ఎవరూ ఒప్పుకోని ఒక అప్రకటిత సూత్రం. శేషాచలం అడవుల్లో చెట్లు నరికినవాళ్ళు జెనరల్ బోగీవాళ్ళు. వాళ్ళు సమాజ సంపదకి కలిగించిన నష్టం గాలి జనార్ధనరెడ్డి కలిగించిన నష్టం కన్నా తక్కువ. కానీ – మనకి ‘నేరస్తులైన’ కూలీల మీదే క్రోధం, అసహ్యం.” అన్నాడు సుబ్బు.

“ఎందుకు?” అడిగాను.

“ఇది స్పష్టమైన క్లాస్ బయాస్. పేపర్లు చదివేది, అభిప్రాయాలు వ్యక్తీకరించేదీ మధ్యతరగతి మేధావులు. వీళ్ళు జేబులు కొట్టేసే వాణ్ని కరెంటు స్తంభానికి కట్టేసి చావగొడితేనే గానీ దొంగలకి బుద్ధి రాదనీ వాదిస్తారు. వంద కోట్లు అవినీతి చేసిన వైట్ కాలర్ నిందితుణ్ని మాత్రం ‘చట్టబద్దంగా విచారించాలి’ అంటారు.” అన్నాడు సుబ్బు.

“నిజమే సుబ్బూ!” అన్నాను.

“ఇక్కడంతా ఆటవిక నీతి. అడవిలో పులులు జింకల్ని వేటాడేప్పుడు జింకలకి నొప్పి కలుగుతుందేమోనని ఆలోచించవు. ఆ పక్కనే వున్న పులి స్నేహితుడైన నక్క – వేటాడే పులిలో రౌద్రాన్ని కీర్తిస్తూ కవిత్వం రాస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. అలాగే – మధ్యతరగతి మేధావులు తక్కువ స్థాయి మనుషులు చంపబడితే – ‘ధర్మసంస్థాపనార్ధం అది చాలా అవసరం’ అని నమ్ముతారు. అంటే – మనం మనుషుల్ని మనుషులుగా చూడ్డం మనేశాం. వర్గాలుగానే చూస్తున్నాం. పాలక వర్గాలక్కూడా కావల్సిందిదే!” అన్నాడు సుబ్బు.

“నువ్వు చెబుతున్నది నిజమేననిపిస్తుంది సుబ్బూ!” అన్నాను.

“నీకు తెలుసుగా? సిగ్మండ్ ఫ్రాయిడ్ ‘ఐడెంటిఫికేషన్’ అని ఒక డిఫెన్స్ మెకానిజం గూర్చి చెప్పాడు. ఒక వ్యక్తి తన వర్గానికి తెలీకుండానే మానసికంగా కనెక్ట్ అయిపోతాడు. అందుకే – ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి మంచినీళ్ళ కోసం పంపు దగ్గర బిందెలతో తోసుకునే ఆడవారిలో అలగాతనం చూస్తాడే గానీ – నీటికొరత ఎంత దుర్భరంగా వుందో ఆలోచించడు.”

“అంటే – తెలుగు వార్తా పత్రికలది కూడా ‘ఫ్రాయిడియన్ ఐడెంటిఫికేషన్’ అంటావా?”

“కొంత వరకు. పత్రికలకి వ్యాపార అవసరాలే ప్రధానం. వాళ్ళ పత్రికకి చందాదారులుగా కూలీల కన్నా మధ్యతరగతి వారే ఎక్కువమంది వుంటారు. పత్రికలు ఎవరికి వార్తలు అమ్ముతారో వారి ఆలోచనలకి తగ్గట్టుగానే రాస్తాయి. ఇవే తెలుగు పత్రికలు చెన్నై ఎడిషన్లో కూలీలకి అనుకూల విధానం తీసుకుని రాసుండొచ్చు, నాకు తెలీదు.” అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

“నిజమే! చెన్నై ఎడిషన్ వార్తలు వేరుగానే వున్నాయి.”

“ఏ వార్తైనా అనేక ముఖాలు కలిగుంటుంది. ఉదాహరణగా ఒక వార్తని పరిశీలిద్దాం. పులి ఆహారం కోసం మనిషిని వేటాడి ఆడవిలోకి లాక్కెళ్ళిపోయింది. అడవిలో పులులన్నీ కలిసి ఆ వేటని సుష్టుగా భోంచేశాయి. మనుషుల పత్రిక ‘ఒక క్రూర దుర్మార్గ దుష్ట పులి హత్యాకాండ’ అంటూ హెడ్‌లైన్స్‌తో విమర్శిస్తుంది. అదే వార్తని పులుల పత్రిక ‘దుర్భర క్షుద్బాధతో అలమటిస్తున్న సాటి జీవుల ఆకలి తీర్చిన సాహస పులికి జేజేలు’ అని హంతక పులి వీరత్వాన్ని కీర్తిస్తుంది.” అన్నాడు సుబ్బు.

“వాటేన్ ఐరనీ సుబ్బూ! ఒక పక్క గుండెల్ని మార్చడం కోసం సిటీ ట్రాఫిక్కుల్ని ఆపేస్తున్నాం. ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మనిషి ప్రాణం ఎంతో విలువైనదని ప్రవచిస్తున్నాం. ఇంకోపక్క – ప్రాణాలు పోయినందుకు ఆనందిస్తున్నాం.” దిగులుగా అన్నాను.

“మిత్రమా! మరీ అంతగా కలత చెందకు. రాబోయే కాలం కోసం నీ దుఃఖాన్ని కొద్దిగా దాచుకో” అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.

*

yaramana.blogspot.in.

పెరియార్ నడిచిన నేల మీద పెరుమాళ్ వేదన!

మనుషులు చచ్చిపోతారా? అర్ధం లేని ప్రశ్న. పోనీ బ్రతికుండగానే చచ్చిపోతారా? అని అడిగితే .. కొంచం అర్ధవంతమే అవుతుందా? అవుతుందనుకొంటాను. పుట్టి ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా ఇంకా ‘మనుషులు’ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ సంగతేమో గాని మనుషులుగా ఎదిగిన వాళ్ళు, కాలం గడిచే కొద్దీ మరింతగా మనుషులయ్యే లక్షణమున్నవాళ్ళు .. చనిపోతే అది అది విషాదమే. ఆ మనుషులు కళాకారులో, రచయితలో, శాస్త్రవేత్తలో, సమాజాన్ని కదిలించే .. సరైన వైపుకు నడిపించే చోదక శక్తులో అయినప్పుడు .. ఆ విషాదం మరింత పెద్దదైపోతుంది. సమాజ గతిక్రమానికి తీరని నష్టమవుతుంది. అయినా కళాకారులు, రచయితలు, శాస్త్ర వేత్తలు చనిపోతారా అసలు? చచ్చిపోయినా బతికుండగానే చచ్చిపోతారా? శుభ్రంగా చచ్చిపోతారు. అయితే ఎలా చచ్చిపోతారు?

కొందరేమో కొన్ని నాడీకేంద్రాలను మర్చిపోయి, కొన్ని స్పందనలను కోల్పోయి, తమకు తామే పరాయి వాళ్ళయిపోయి .. గడ్డకట్టి, ఘనీభవించి .. తమకు తామే ఒక ఇరుకైన కరుకైన, కానీ భద్రమైన గూడు కట్టుకొని .. ఆత్మహత్య చేసేసుకొంటారు. కొందరు అమాయకులు, పెద్దవాళ్ళవుతున్న తమలో ఉన్న పసివాడ్ని పోగొట్టుకోని వాళ్ళు, ఘనీభవించని హృదయాన్ని, అందులో ఉన్న చైతన్యాన్ని నిలిపి వుంచుకున్నవాళ్ళు .. పాపం! ఊహానీ, ఊహించే స్వేచ్చని, స్వేచ్చ నిండిన వ్యక్తీకరణనీ వదలని వాళ్ళు, పెరుమాళ్ మురుగన్ లాంటి పిచ్చి పంతుళ్ళు – ఆత్మహత్య చేసుకోలేరు. హత్య చేయబడతారు. “మేము చచ్చిపోయాం” అని బ్రతికుండగానే ప్రకటిస్తారు. మనలో తీరని గుబులు పుట్టిస్తారు. గుండెలింకా మిగిలే ఉన్న వాళ్ళకు కునుకును దూరం చేస్తారు. చూసే కళ్ళు ఉన్నవాళ్ళకు కన్నీళ్ళను తెప్పిస్తారు. చేతులున్నవాళ్లకు, ఆ చేతులకు వేళ్ళు ఉన్న వాళ్ళకు పిడికిళ్ళను మొలిపిస్తారు.

images

కొన్ని రోజులుగా తెల్ల గడ్డం పెంచుకొని తలవేలాడేసుకొన్న పెరుమాళ్ మురగన్ ముఖం దినపత్రికల్లో, జాలా పత్రికల్లో, బ్లాగుల్లో విరివిగా కనిపిస్తుంది. ఆ ముఖం రచనా వ్యాసంగం ఇష్టంగా, ఆహ్లాదంగా, తమలో రగులుతున్న భావోద్వేగాల ఆవిరులు బయటికి పోయే మార్గంగా, మనసులో సహజంగా వచ్చే ఊహలను అల్లుకుంటూ పోయే మానవ ప్రవృత్తిగా, ఆ ఊహలను కాగితం మీద చిత్రించి దర్శించుకోవాలనే కోరిక తీరే దారిగా భావించే వారందరిని వ్యాకుల పరిచింది. ఆ ముఖం దేశం నుండి వెళ్ళగొట్టబడిన హుస్సేన్ తొంభై ఏళ్ళ మైనారిటీ అభద్రతను గుర్తుకు తెస్తుంది. బహిరంగ వేదిక మీదకు ముస్లిం ఛాందసవాదులు మొహంపై రాళ్ళు రువ్వితే అదోలా చూసిన (క్షమించండి. ఆ  భావాన్ని నేను పదాలతో వర్ణించలేను) తస్లీమాకు ఆశ్రయం ఇవ్వలేని ఈ దేశ ఓట్ల రాజకీయం గుర్తుకు వస్తుంది. ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలియదు కానీ “మూలింటామె” రాసిన తరువాత నామిని పడిన ఆందోళనా, “ఎవరు ఏమనుకొన్నా ఈ కధ రాసి చచ్చిపోదామనుకొన్నాను” అన్న ప్రకటన కూడా గుర్తుకు వచ్చాయి. అన్నట్లు నామినీ కూడా ఆ నవలను ఒక కులాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాడు కదా.

సమాజంపై ధిక్కారంతో రాసిన రాత, గీసిన గీత, పాడే గొంతు నిషేదాలకు గురి అవటం ఇక్కడ కొత్త కాదు. అయితే దానికి సమాంతరంగా భావవ్యక్తీకరణ స్వేచ్చను చేతులు అడ్డం పెట్టి కాచుకొన్న ప్రజాస్వామిక హృదయాలకు కొదవ లేదు ఇక్కడ. అయితే ఈ సంఘటన మాత్రం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నాగరిక ప్రపంచంలో జీవిస్తూ ఒక రచన చేసిన పాపానికి గడగడలాడుతూ ఘోరావ్ లకు, ధర్నాలకు, పుస్తకాల కాల్చివేతకు గురి అయ్యి .. జిల్లా యంత్రాంగం ముందు చేతులు కట్టుకొని నిలబడిన దీన స్థితి ఒక రచయితకు, అందునా పెరియార్ రామస్వామి నడయాడిన భూభాగంపై నివశించే వ్యక్తికి ఎలా దాపురించింది?

మతాన్ని, దేవుడిని, ఆర్య సంస్కృతిని ద్వేషించి, జీవిత కాలమంతా దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి గొప్ప ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమానికి పునాది వేసిన పెరియార్ రామస్వామి నడిచిన నేల మీద ఒక రచయిత చేతులు కట్టుకొని కుల శక్తుల ముందు, మత శక్తుల ముందు తలవొగ్గడం ఎంత విచారకరం! సాంస్కృతిక ఉద్యమం పాదుగా చేసుకొని ఎదిగిన ఇప్పుడున్నఅక్కడి  రాజకీయవ్యవస్థ ఈ సంగతిపై స్పందించక పోవటం (చివర్లో స్టాలిన్ కంటితుడుపు వ్యాఖ్యలు తప్ప) ఇంకో  గొప్ప విషాదం. పెరియార్ ఆలోచనలు జీర్ణించుకొని పరిపుష్ట అయిన మద్రాసీ సమాజం ఈ విషయం పై ప్రదర్శించిన నిర్లిప్తత, నిరాసక్తత … ఆ సమాజం, అది అందించిన సాహిత్యం, కళలు, దృక్కోణాల పట్ల ఆశలు కలిగిన వారికి పెనుఘాతం. రష్యన్ సామ్యవాదం కూలినప్పటి దుఃఖం మళ్ళీ అనుభవమవుతుంది.

ఇంత గొడవకూ, గందరగోళానికి తెర తీసిన ఈ మదో రుబాగన్ నవలలో (One part woman) ఏమి ఉంది? పెళ్ళయి పన్నెండు సంవత్సరాలు దాటిన పొన్న, కాళీ దంపతులకు పిల్లలు ఉండరు. అన్ని విధాలుగా సంతృప్తికరమైన సంసార జీవితాన్ని గడుపుతున్న ఈ దంపతులు ఈ కధా కాలానికి  (వంద సంవత్సరాల క్రిందటి) భూస్వామ్య సమాజపు వత్తిడులకు గురి అవుతారు. పిల్లలు పుట్టనందుకు స్త్రీగా పొన్న ఎన్ని అవమానాలు పొందుతుందో, పురుషుడుగా కాళీ కూడా అంతే అవమానాల పాలు అవుతాడు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమాభిమానాలు ఇంకో పెళ్ళికి ప్రేరేపించవు. కాళీ రెండో పెళ్ళి చేసుకొన్నా కూడా పొన్నను ఇంట్లో ఉంచుకొంటే చాలు అనే అంగీకారానికి పొన్న తల్లిదండ్రులు కూడా వస్తారు. అయితే కాళీ వివేకంతో వ్యవహరించి పొన్న పట్ల తన ప్రేమను ప్రదర్శించుకొంటాడు. పిల్లలు లేరనే సమాజపు సతాయింపులకు దూరంగా ఇద్దరు ఇంటికి పరిమితమై అన్యోన్యంగా బతుకుతుంటారు. అయినా ఆ సెగ వాళ్ళకు తగులుతూనే ఉంటుంది.

ఒక రోజు కాళీ తల్లి, పొన్న తల్లి సంప్రదించుకొని ఒక ప్రతిపాదనతో కాళీ తల్లి కొడుకు దగ్గరకు వస్తుంది. పొన్న పుట్టింటికి దగ్గరలో ఉన్న తిరుచెంగొడే పట్టణంలో ‘పర్వత’ అనే (అర్ధనారీశ్వర రూపం) దేవుడుకి ఏటా తిరునాళ్ళు జరుగుతాయి. పధ్నాలుగు రోజులు జరిగే ఈ తిరునాళ్ళలో నాలుగవ రోజు దేవుళ్ళు కొండ మీద నుండి కిందకు వచ్చి పధ్నాలుగవ రోజు మళ్ళీ పైకి వెళతారని నమ్మకం ప్రజలలో ఉంటుంది. ఆ పధ్నాలుగవ రోజు దగ్గర ప్రాంతాల నుండి పురుషులు అక్కడ రాత్రి సంచరిస్తారు. వాళ్ళను ‘దేవుళ్ళు’ అని అంటారు. ఆ రాత్రి స్త్రీలు ఆ అపరిచిత పురుషులతో సంభోగించవచ్చు. వాళ్ళను దేవుళ్ళగానే చూస్తారు. ఆ నాటి సమాజం దాన్ని తప్పు పట్టదు. దేవుడితో సంభోగించినట్లే భావిస్తుంది. ఎక్కువగా పిల్లలు లేని స్త్రీలు ఈ తంతులో పాల్గొంటారు. పురుషులు ఈ అవకాశాన్ని వినియోగించుకొంటారు. పెళ్ళి కానీ అబ్బాయిలు ఒక అనుభవం కోసం ఇక్కడకు వస్తారు. ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలతో నయినా ఆ రాత్రి గడపవచ్చు. అలాగే స్త్రీలు కూడా.  ఆ ఒక్క రాత్రి అక్కడ ఉన్న దేవదాసీలను ఎవరూ పట్టించుకోరు.

‘ఈ రాత్రి అందరూ దేవదాసీలే’ అని వాళ్ళు నవ్వుకొంటారు. నిజానికి కాళీకి కూడా ఆ అనుభవాలు ఉన్నాయి. పొన్నతో ఆయన బంధం గట్టి పడ్డాక ఆ వ్యవహారాలన్నీ మానుకొన్నాడు. ఆ పధ్నాలుగవ రోజు పొన్నను అక్కడికి పంపితే దేవుళ్ళ వలన గర్భం వస్తుందని తల్లి తెచ్చిన ఆ ప్రతిపాదన అతనిని బాధిస్తుంది. భార్యను వేరే పురుషునితో ఊహించుకోలేకపోతాడు. తల్లిని కూడా అసహ్యించుకొంటాడు. అసలు  ఆ సంవత్సరం భార్యను తిరునాళ్ళకు పంపడు. పొన్నకు ఈ ప్రతిపాదన గురించి  చెప్పడు కూడా. ఈ  సంవత్సరం తరువాత ఒక రాత్రి ఆమెకు ఈ విషయం చెప్పి “వెళతావా?” అని అడుగుతాడు.

‘మావా, నీకు బిడ్డ కావాలంటే వెళతాను.’ అని అమాయకంగా చెబుతుంది పొన్న. కాళీ షాక్ తింటాడు. ఆ సమాధానాన్ని ఊహించలేదు అతను. పొన్న అతని ముఖాకవళికల నుండి తను తప్పు చేశాను అని గ్రహిస్తుంది.  అతన్ని ఆలింగనం చేసుకొని తన ప్రేమను, విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. కాని కాళి ఆమెను ఇదివరకటి లాగా చూడలేక పోతాడు. తనకు తెలియకుండానే ఆమెను హింస పెడతాడు. ఒక సందర్భంలో పొన్న దండం పెట్టి ఇంతకంటే నన్ను చావబాదమని అడుగుతుంది. చివరకు పొన్న అక్కడకు వెళుతుందా, లేదా అనే విషయం అప్రస్తుతం. ఈ మొత్తం వ్యవహారంలో కాళి లోని అంతర్మధనం, అతను పడిన మానసిక సంఘర్షణ , పొన్న పడిన హింస ఈ కధలో ప్రధాన వస్తువు. పురుషాధిక్య సమాజం వలన పురుషుడు కూడా వెంపర్లకు గురి అవుతాడనేది ఈ కధాంశం.

ఆదిమ కమ్యూనిష్టు సమాజం నుండి స్త్రీ పురుషుల మధ్య నున్న సంబంధాలు రకరకాలుగా అభివృద్ధి  చెందాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు అనే  దంపతీ వివాహం అన్నిటికన్నా అభివృద్ధి కరమైనది అనుకొన్న తరువాత కూడా గత సమాజపు బహు సంబంధాలను పురుషుడు ఈ నాటికీ అనుభవిస్తున్నాడు. స్త్రీలకు ప్రాతివత్య ధర్మాలను నిర్దేశించినా అక్కడక్కడా కొంత వెసులుబాటు అరుదుగా కనిపిస్తుంది. అదీ ఈ కధా కాలం వంద సంవత్సరాల క్రితం అయినందున ఈ ఆచారం అసహజంగా అనిపించదు. గుంపు వివాహాల అవశేషాలు ఈ ఆచారాలలో కనిపిస్తాయి. మహాభారతంలాంటి  ఇతిహాసాలలో ఇలాంటి ప్రాచీన కాలం నాటి అవశేషాలు కనిపిస్తాయి.

700x380xImage.jpg.pagespeed.ic._Vue3PwAdP

తమిళనాడు ప్రాంతంలోని కొంగునాడులో ఎక్కువ జీవించే కమ్యూనిటీ కొంగు వెళ్ళాళ గౌండర్లు. ఇది ఒక వ్యవసాయ కులం. పెరియార్ రామస్వామి ఈ కొంగు వెళ్ళాళ గౌండర్లు, వన్నియార్లు, దళితుల సాంస్కృతిక జీవితాలకు పెద్ద పీట వేసి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. బ్రాహ్మణ ఆధిపత్యానికి బ్రాహ్మణిజానికి తేడా చెప్పాడు. ‘నేను బ్రాహ్మడిగా పుట్టినందుకు ఎవరినీ ద్వేషించను.’ అని స్పష్టంగా అన్నాడు పెరియారు.

అక్కడి ప్రజలు ఈ సాంస్కృతోద్యమాన్ని ఎంత ఆదరించారంటే ఈ నాటికీ కమ్యూనిష్టులు అక్కడ నిలదొక్కుకోలేక పోయారు. కొంగు వెళ్ళాళ గౌండర్లు స్త్రీలకు ఆస్తి హక్కు వద్దంటే, అటు దక్షిణ ప్రాంతంలో వున్న వన్నియార్లు దళితుల పట్ల తీవ్రమైన అణచివేత ప్రదర్శించారు. ఈ వ్యవసాయ కులాలు  ఎదిగి దళితులకు, స్త్రీలకు వ్యతిరేకంగా తయారు కావడానికి కారణాలు వెదకటం సామాజిక శాస్త్రవేత్తల పని. ద్రవిడిజం అంటే దళితిజమే. మూల వాసుల సాంస్కృతిక పరిరక్షణకు పెద్ద ఉద్యమాలే జరిగాయి. బాలచందర్ మనకు గొప్ప డైరెక్టర్ గా కనిపిస్తాడు. కానీ తమిలియన్స్ కి భారతీ రాజా గొప్ప డైరెక్టర్. బాలచందర్ సినిమాలో లీలగా కనిపించే సాంప్రదాయవాదాన్ని కూడా వాళ్ళు సహించలేరు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. తమిళ సాహిత్యం, కళలు నిరలంకారంగా ఎలాంటి రంగులు అంటుకోకుండా తమ ప్రత్యేకతలో వదిగి ఉంటాయి. అలాంటి చోట వస్తున్నఈ  మార్పులు గర్హనీయం.

ఈ మార్పులు ఎప్పుడు, ఎలా ప్రారంభం అయ్యాయి అంటే ‘ధ్వజస్తంభం, ఉరితాడు’ ఒకటైన చోట అంటాడు తెరేష్ బాబు. అంటే మతం, రాజ్యం ఒకటైతేనే ఈ మార్పులు నిర్ధిష్ట రూపాన్ని పొందుతాయి. తమిళనాడులో  హిందుమున్నని ఈ విషయంతో మాకు సంబందం లేదని ప్రకటించింది. కానీ ఇక్కడి హిందూ పక్షపాత పత్రికలు పెరుమాళ్ బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలని అంటున్నాయి. ఆయన రాసిన విషయాలు రుజువు చేయాలని కూడా అంటున్నాయి.  అయితే అందరు అంటున్న మతమౌఢ్యం ఎక్కడ ఉంది? అది ఈ సమస్యను శాంతిభద్రతల సమస్యగా మాత్రమే తీసుకొని పెరుమాళ్ ను బోనులో నిలబెట్టిన రాజ్య యంత్రంలో ఉంది. ఆయన చేత బలవంతపు క్షమాపణలు చెప్పించి, ఆయన పుస్తకాలను వెనక్కు తీసుకోమని హెచ్చరించిన  జిల్లా యంత్రాంగం మెదళ్ళలో ఉంది.

కులమౌడ్యానికి,  మతదురహంకారం తోడై నపుడు ప్రమాదకర శక్తులు పుడతాయి. వాటికి రాజ్యం చేయి అందిస్తే వందలమంది   పెరుమాళ్ళ కలాలు ఎండిపోవాల్సిందే. ఇక్కడే ప్రమాద ఘంటికలు మోగాయి. సృజనకారులు ఉలిక్కి పడ్డారు. పెరుమాళ్ కు మద్దతుగా గొంతు విప్పారు. నిజానికి ఈ గొంతుకలు తమ కోసం తాము అరుచుకొన్నవి. భావజాలాలు ఎలా ఉన్న సృజనకారుల ఊహాజనిత శక్తిని నియత్రించే ప్రయత్నాలు దుర్మార్గమైనవి అనే వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తున్నారు.

ఇక ఈ కధలోని  అంశాలను రుజువు చేయాలి అనే వాదనలకొద్దాము. చరిత్రను సాహిత్యంలో..  అదీ కాల్పనిక సాహిత్యంలో వెదకటం తెలివి కల పని కాదని.,  దానికంటే చరిత్ర ప్రతిఫలనాలను సాహిత్యం ఏ మేరకు ప్రతిబింబించిందో చూడాలనీ అట్టాడ అప్పలనాయుడుగారు అన్నారు. ఇలా జరిగిందా లేదా అనే విషయాన్ని సాహిత్యకారులే రుజువు చేయాలనే షరతు ఉంటే భారతీయ సాహిత్యం, ఇంకా ప్రపంచ సాహిత్యం ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు. ఈ ఆంక్ష మనిషిలోని సృజనాత్మకతకు గొడ్డలి పెట్టు. మానవ నాగరికత ఊహతోనే అభివృద్ధి చెందింది.

ఇక స్త్రీలను అవమానించారు అనే వాదన. నామిని మూలింటామె వచ్చినపుడు కూడా ఇలా రెచ్చగొట్టే ప్రయత్నాలు కొన్ని వర్గాలు చేశాయి. కొన్ని సామాజిక, చారిత్రిక పరిస్థితుల్లో స్త్రీలు ఎలా ప్రవర్తించారో, ప్రవర్తించాల్సి వచ్చిందో దాచిపెట్టి స్త్రీని వారిచ్చిన నమూనాలో మాత్రమే సాహిత్యంలో కాని, చిత్రంలో కాని చూపించాలనే వాదన వాస్తవికతను తిరస్కరించటమే. ఇక్కడ అమానవీయమైన వ్యభిచారం ఉంది. స్త్రీలను పల్లెల్లో చెడ్డ మాటలతో పిలుస్తారు. వాటిని ఉన్నది ఉన్నట్లు చిత్రీకరించిన రచయిత స్త్రీ వ్యతిరేకి అవుతాడా? ఆ రచయిత ఎటు ఉన్నాడో, అతని ఆత్మ ఎటు వైపు మొగ్గుతుందో వివేకవంతుడైన పాఠకుడు, పాఠకురాలు  గ్రహించగలరు. స్త్రీలను వారనుకొన్న నమూనాలో బంధించి, దానికి భిన్నంగా రాసిన రాతలను అవాస్తవాలని అనటం ఒక స్వీయాత్మక ధోరణి మాత్రమే అవుతుంది.

నిజానికి ఈ కధలో కూడా దేవుళ్ళుగా భావించే పురుషులతో సంగమించడం ఆ నాటి సమాజ ఆచారమైనప్పటికీ పురుషుడిలో ఉండే పొసిసివ్ నెస్స్ దానికి అనుమతి ఇవ్వదు. ఆచారాలకు, నమూనాలకు, భౌతిక వాస్తవాలకు వున్న ఘర్షణ ఇది. ఈ ఘర్షణలో ఇక స్త్రీలు నిర్ణయించుకొంటారు., తామెటు ఉండాలో. నిజాయితీపరుడైన సాహితీవేత్తతోనా, గుప్పిట్లోకి తీసుకోవాలనుకొనే మాయల పకీరుతోనా అనేది.

సాహితీకారులు ఒంటరిగా లేరని రుజువయ్యింది. రచయిత ఏమి చెప్పదలుచుకొన్నాడో స్పష్టంగా చెప్పే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. యిచ్చిన మాట రాజ్యాంగం తప్పినా నాగరిక సమాజం భిన్నాభిప్రాయాన్ని గౌరవించింది. ఇక్కడ హైకోర్టు కూడా పెరుమాళ్ పక్షానే నిలిచినట్లు కనిపిస్తుంది. జిల్లా యంత్రాంగాన్ని మొట్టాల్సింది మొట్టింది. రచయితను కోర్టుకు ఆహ్వానించింది.

కలం పై దాడి అంటే అక్షరం పై దాడి, అంతిమంగా నాగరిక ప్రపంచం పై దాడి. అక్షర సైనికులుగా మనమే మారదాం. అందరం పెరుమాళ్ళ మవుదాం.

  -రమాసుందరి

ramasundari