‘చో’ ఆగిపోయింది!

cho-ramaswamy

1976లో ‘బంగారు పతకం’ అనే సినిమా చూశాను. అది తమిళం నుంచి తెలుగుకు డబ్ చేసిన సినిమా. శివాజీ గణేశన్, కె. ఆర్ . విజయ హీరో, హీరోయిన్లు. చాలా సీరియస్ సినిమా. అయినా ఆ సినిమాను మూడుసార్లు చూశాను. కారణం, అందులో చో రామస్వామి సెటైర్లు. ఆ సెటైర్లు కానీ, అందులో ఆయన పాత్రకానీ ఇప్పుడు గుర్తు లేవు. ఆ సినిమా కోసం నెట్ లో చూస్తే దొరకలేదు. అదే సినిమాను 1981లో ‘కొండవీటి సింహం’పేరుతో ఎన్టీఆర్, శ్రీదేవిలతో తెలుగులో రీమేక్ చేసినట్టు మాత్రం చూశాను. ఆ సినిమా నేను చూడలేదు.

‘బంగారు పతకం’ లో చో రామస్వామి పోలీస్ కానిస్టేబుల్ గా నటించినట్టు లీలగా జ్ఞాపకం. అతనికి ఒక కొడుకు. తండ్రి-కొడుకుల సంభాషణలో గొప్ప రాజకీయ వ్యంగ్యోక్తులు పేలుతూ హాలంతా నవ్వులు పండిస్తాయి. లీలగానే  గుర్తున్న ఒక సెటైర్ ప్రకారం, కొడుకు చదువురాని బడుద్ధాయి. “అయితే ఇంకేం! రాజకీయనాయకుడి వవుతావు” అని తండ్రి ఊరడింపు.

మనిషికి పుట్టుకతో కొన్ని ఆనువంశిక లక్షణాలు సంక్రమించవచ్చు. కానీ ఐడియాలజీతో సహా అతని ఆలోచనాసరళిని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది అతను పుట్టి పెరిగిన భౌతికవాతావరణమే. అంటే ఆలోచనారీతి, వాటిని వ్యక్తీకరించే పద్ధతితో సహా అన్నీ కండిషండే తప్ప సర్వస్వతంత్రాలు కావు. చో రామస్వామి ఒక ఉదాహరణ.

దక్షిణాదిన ఇంగ్లీష్ వారు తమ స్థావరంగా మార్చుకుని అభివృద్ధి చేసిన తొలి నగరం మద్రాసు కావడం, ఆ విధంగా ఇంగ్లీష్ ప్రభావాలకు బ్రిటిష్ పాలన తొలిరోజుల్లోనే అది లోను కావడం, ఆ ప్రభావాలను సామాజికంగా, సాంస్కృతికంగా అగ్రస్థానంలో ఉన్న బ్రాహ్మణులు వెంటనే అంది పుచ్చుకోవడం, మద్రాసు తనదైన విలక్షణమైన సంకీర్ణ నాగరికతను తెచ్చుకోవడం, ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో భాగంగా అక్కడి స్థానిక, బ్రాహ్మణేతర వర్గాలు క్రమంగా జాగృతమై బ్రాహ్మణీయతను సవాలు చేస్తూ భిన్నశక్తిగా మారడం, అది బ్రాహ్మణవ్యతిరేక ద్రవిడ ఉద్యమంగా బలపడడం, దానికి ప్రతిక్రియగా బ్రాహ్మణీయ శక్తులు పోలరైజై  ఉనికి పోరాటానికి దిగడం…

ఇంతటి ‘నలుగు’ పిండినుంచి వినాయకుడిలా రూపం దిద్దుకున్నవాడే చో రామస్వామి! ఈ నేపథ్యం లేకపోతే మనకు తెలిసిన ఇప్పటి రూపంలో చో ఉండడు!

తెలుగు ప్రాంతాలలోని బుద్ధిజీవుల్లోంచి  చో రామస్వామి లాంటి ఓ కేరక్టర్ ఎందుకు పుట్టలేదన్న కుతూహలకరమైన ప్రశ్ననుంచి ఈ నేపథ్యాన్ని తడమాల్సివచ్చింది. తెలుగు ప్రాంతాలలో ఆంధ్ర,రాయలసీమలకు వస్తే ఇక్కడి వాళ్ళకు తమిళులకు ఉన్నట్టు మద్రాసు లాంటి ఒక స్వతంత్ర రాజధాని నగరం లేదు. రాంభట్లగారి సూత్రీకరణనే పరిగణనలోకి తీసుకుంటే, సొంత నగరం లేని జనాలకు గుర్తించదగిన సొంత నాగరికత ముద్ర ఉండదు. అలాగే మద్రాసీలకు ఉన్నంత ఇంగ్లీష్ ప్రభావమూ వీళ్ళ మీద లేదు. తెలంగాణకు హైదరాబాద్ లాంటి నగరం ఉన్నా దాని స్వభావం వేరు. తెలంగాణలో, ఆ సంబంధంతో కొంతవరకు ఆంధ్రలో వామపక్ష ఉద్యమాల ప్రభావం ఉంది. అదంతా చాలా సీరియస్ వ్యవహారం. అక్కడ వ్యంగ్యానికి, హాస్యానికి చోటు తక్కువ. తమిళనాడు కొస్తే అక్కడ బ్రాహ్మణీయ వ్యతిరేక ద్రావిడ ఉద్యమం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభావాలే తప్ప వామపక్షఉద్యమ ప్రభావాలు చాలా తక్కువ.

వ్యంగ్యం, హాస్యం, ఝటితి చమత్కారం(రిపార్టీ) చోకు ఆనువంశికంగానో, వ్యక్తిగతంగానో సంక్రమించి ఉండచ్చు. కానీ వాటిని తారస్థాయికి పెంచి రాజకీయవస్తువుకు వాటిని మేళవించి జనరంజకం చేయడానికి చో కు నిస్సందేహంగా తను పుట్టిన పెరిగిన భౌతికవాతావరణమే తోడ్పడింది. మద్రాసు ముందే నగరం కావడంవల్ల అక్కడ విద్యావంత మధ్యతరగతి పెద్ద సంఖ్యలో ఏర్పడింది. వారిలోంచి ఆవురావురుమనే పాఠకులు పెరిగారు, పత్రికలు పెరిగాయి. సినిమాతో సమానంగా థియేటర్ నూ కాపాడుకుంటూనే వచ్చారు. ఆ విధంగా చో  రంగప్రవేశం చేసి విజృంభించడానికి అవసరమైన పూర్వరంగమూ, ఆయన బహుముఖీన ప్రతిభావ్యుత్పత్తులకు స్పందించి ఆస్వాదించగలిగిన పాఠకులు, ప్రేక్షకులు ముందే ఏర్పడ్డారు. ఇక జరిగింది… చరిత్ర.

చో బహుముఖీనత తెలుగు ప్రమాణాలతో చూస్తే విస్మయం కలిగిస్తుంది. ఆయన లా చదువుకున్నాడు. ఓ పెద్ద కంపెనీకి లీగల్ అడ్వైజర్ గా ఉన్నాడు. ఇంకోవైపు తుగ్లక్ పత్రిక ద్వారా జర్నలిస్టుగా అవతారమెత్తాడు. ఆపైన నాటకాలు రాశాడు, వేశాడు. 200 కు పైగా సినిమాల్లో నటించాడు. అది కూడా ఎమ్జీఆర్, శివాజీ గణేశన్, జయలలిత, ఎం ఆర్ రాధా, జయలలిత, నగేష్, రజనీకాంత్, కమల్ హాసన్, మనోరమ, సచ్చు లాంటి హేమాహేమీలతో. మొదట్లో తన రాజకీయ వ్యంగ్యాస్త్రాలను ద్రవిడపార్టీమీదా, వామపక్ష భావజాలం మీదా ఎక్కుపెట్టాడు. అవి ముఖ్యంగా ద్రవిడ నేతలకు తగలవలసిన చోటే తగిలి తహ తహ పుట్టించడం ప్రారంభించాయి. ఆయనపై రకరకాల రూపాల్లో ప్రతి దాడికీ సిద్ధమయ్యారు. డెబ్బై దశకంలో ఆయన తీసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమా ఆడే థియేటర్లపై కూడా దాడులు జరిగాయి. అయినా నిర్భీతికి చిరునామాగా చో నిలబడ్డాడు. కారణం మరేం లేదు. బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమాన్ని  ప్రతిఘటించడం ద్వారా రాటుదేలిన బ్రాహ్మణీయవర్గాల మద్దతు ఆయనకు ఉంది. తన పత్రికకు, తన రాతలకు, నాటకాలకు ఆ వర్గాల వెన్ను దన్ను, ప్రోత్సాహం ఆయనకు ఉన్నాయి. అదీగాక నిన్నమొన్నటి వరకు మధ్యతరగతి విద్యావంతవర్గానికి సొంత రాజకీయ అభివ్యక్తికి బలమైన వాహకం లేదు. దాంతో అది యాంటీ-ఎస్టాబ్లిష్మెంట్ ధోరణిని జీర్ణించుకుంది. ఇది కూడా చో కు కలసివచ్చి ఆయన రాజకీయవ్యంగ్యానికి మరింత పదును పెట్టింది. తుగ్లక్ లాంటి పత్రికకు 90 వేలకు పైగా సర్క్యులేషన్ ఉండేదంటే చో కు లభించిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు.

ఎమర్జెన్సీ దరిమిలా ఆయన గురి కాంగ్రెస్ వైపు తిరిగింది. తుగ్లక్ పత్రిక ద్వారా ఆయన సాగించిన ఎమర్జెన్సీ వ్యతిరేకపోరాటం మరో అధ్యాయం. ఎల్టీటీయీ తీవ్రవాదాన్ని వ్యతిరేకించడంలోనూ అంతటి నిర్భీతినే ఆయన చాటుకున్నాడు. అధికారబలం, అంగబలం, రాజకీయబలం లేకపోయినప్పటికీ అవన్నీ ఉన్న ఉద్దండ శక్తులకు ఎదురు నిలిచి నిలదొక్కుకోవడంలో చో తో పోల్చదగిన వ్యక్తి సుబ్రమణ్యంస్వామి. వీరు తమిళనాడులోని ప్రత్యేక పరిస్థితులనుంచి ప్రాణం పోసుకున్న వ్యక్తులు.

వ్యక్తిగా కొంతవరకు చో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించినట్టే కనిపిస్తాడు. మంచి ఎక్కడున్నా ఎంచి చూపడంలో, చెడును నిర్దాక్షిణ్యంగా ఖండించడంలో ఆయనకు స్వ, పర భేదాలు లేవని పేరు. జయలలిత కుటుంబంతో ఆయనకు ముందునుంచీ పరిచయం. ఆయన నాటకాలలో జయలలిత నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా కలసి నటించారు. అయినా జయలలిత పాలన అవినీతి భూయిష్టంగా కనిపించినప్పుడు ఆమెను బహిరంగంగా వ్యతిరేకించడమే కాదు; ఆమెకు వ్యతిరేకంగా తన బద్ధ విరోధి అయిన కరుణానిధి, తమిళ మానిల కాంగ్రెస్ ల మధ్య సయోధ్యకు కృషి చేశాడు. వ్యక్తిగతమైన ఈ నిష్పాక్షిక వైఖరే ఆయనను అన్ని పార్టీలవారికి దగ్గర చేసినట్టు కనిపిస్తుంది. జయలలితే కాదు; ఎమ్జీఆర్, శివాజీ గణేశన్ సహా ఎందరో ఆయన సలహాను ఆపేక్షించేవారని అంటారు. ఆయనను రాజగురువుగా ప్రధాని మోడీ చేసిన అభివర్ణనను పూర్తిగా అతిశయోక్తి అనలేం.

చో ఆర్ ఎస్ ఎస్ వైపు, హిందుత్వ భావజాలం వైపు ఒరగడం, వాజ్ పేయి హయాంలో రాజ్యసభ సభ్యత్వం పొందడం వగైరాలను ఆయన పుట్టి పెరిగిన తమిళనాడు పరిస్థితుల నేపథ్యం నుంచి వేరు చేసి చూడలేం. మొత్తం మీద చెప్పాలంటే ఆయన జీవితం, ఆయన పత్రిక, నాటకాలు యాభై ఏళ్ళకు పైబడిన మన ప్రజాస్వామిక రాజకీయ వైఖరులకు నిలువెత్తు ప్రతిఫలనాలు.

                                                                                                           -భాస్కరం కల్లూరి

 ‘సంభాషణ’ అవసరాన్ని గుర్తిద్దామా?

 

-భాస్కరం కల్లూరి

కల్లూరి భాస్కరం

చావు అనేది అంతిమం.  ఆ తర్వాత ఏమీ ఉండదు. సహజీవనం, సామరస్యం, సంభాషణ లోపించినప్పుడు ఏర్పడే ఒక శూన్యంలో మనిషి సాటి మనిషి ప్రాణం తీయడం జరుగుతుంది. ఆ దశలో అతన్ని మనిషి అనడానికి వీల్లేదు. పశువు అని కూడా అనకూడదు. అంటే పశువును అవమానించడం అవుతుంది. ఎందుకంటే పశువుకు ఆలోచించే శక్తీ, సంభాషించే శక్తీ ఉండవు. ఆ రెండూ ఉన్న మనిషి ఇంకో మనిషిని చంపినప్పుడు అతనికి ఇంకో పేరు సృష్టించుకోవలసిందే.

కల్బుర్గి హత్యను ఖండించడం ‘మనిషి’ అనిపించుకోడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరి బాధ్యత. అందులో కల్బుర్గి సమర్థకులే కాదు, వ్యతిరేకులు కూడా వస్తారు. చావు ఇంకో చావును మాత్రమే పుట్టిస్తుంది. చావులోంచి బతుకు పుట్టదు. ఈరోజు కల్బుర్గి హత్య జరిగితే, రేపు కల్బుర్గి భావజాలాన్ని వ్యతిరేకించేవారి హత్య జరగచ్చు. ఈ హత్యల గొలుసుకట్టు ప్రయాణంలో మనిషి పూర్తిగా గల్లంతైపోతాడు. మనిషి అనిపించుకోవడానికి ఇంకో షరతు ఏమిటంటే, కల్బుర్గి హత్యను ఖండించినట్టే, రేపు కల్బుర్గి వ్యతిరేకుల హత్యను కూడా అంతే గట్టిగా ఖండించాలి.

ప్రకృతి ఏర్పాటుకు విడిగా ఒక మనిషిని సృష్టించే శక్తి మనిషికి ఎలా లేదో, ప్రకృతి ఏర్పాటుకు విడిగా ఒక మనిషిని చంపే శక్తి కూడా ఉండకూడదు. అన్ని మతాలూ అదే చెబుతాయి. కానీ మతం పేరుతోనే చంపడం– మనిషితనానికి మనిషి ఎంత దూరమయ్యాడో తెలిపే కొండగుర్తు(అనేకానేక సందర్భాలలో సామూహిక హత్యలు జరుగుతుంటాయి. వాటిలో కొన్నింటిపై ‘దేశభక్తి’ ముద్ర కూడా ఉంటూ ఉంటుంది. చంపడం అన్నప్పుడు నేను వీటన్నింటినీ ఉద్దేశించడం లేదు. ఈ  రకమైన సామూహిక హత్యాకాండ నుంచి  మానవాళి ఎప్పటికైనా బయటపడుతుందో లేదో తెలియదు. ఈ లోపల నివారించగలిగిన హత్యల గురించే నేను మాట్లాడుతున్నది).

కల్బుర్గి హత్యపై ఆయన సమర్థకులు, వ్యతిరేకుల స్పందనలు రెండింటిలోనూ ఒకే విధమైన ఆవేశం కనిపిస్తోంది. అది ఎంత సహజమే అయినా, ఇది ఆలోచనకు కూడా సందర్భం. కల్బుర్గి సమర్థకులకు, వ్యతిరేకులకూ కూడా! కల్బుర్గి దైవదూషణకు, విగ్రహాలపట్ల దారుణ అపచారభావనకు పాల్పడ్డారని, మా మనోభావాలు గాయపడ్డాయని ఆయన వ్యతిరేకుల ఆరోపణ. కల్బుర్గి హత్యను ఖండించడంలో ఆయన సమర్థకులు, ఆయన వ్యతిరేకుల మనోభావాలను మరింత గాయపరచడానికి పూనుకున్నారు. దాంతో కల్బుర్గి వ్యతిరేకులు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో కల్బుర్గి హత్యను సమర్థించేవరకూ వెళ్లారు. ఇద్దరూ చెరో చిటారు కొమ్మా ఎక్కి కూర్చున్నారు. చావు అనే అంతిమం చర్చనీయం కావాల్సింది పోయి, కల్బుర్గి చేసింది తప్పా ఒప్పా అన్నది చర్చనీయంగా మారింది. కారణం, రెండువైపులా ఆవేశం, ఆవేశం…ఆలోచన లోపించిన వీరావేశం!

అసలెందుకిలా జరుగుతోంది, ఎందుకిలా జరగాలి, దీని చరిత్ర ఏమిటి, ఈ చరిత్రను ఇప్పుడైనా మార్చలేమా అని రెండు వర్గాలూ ఆలోచించుకోవలసిన సందర్భం ఇది. అంటే రెండు వర్గాలలోనూ, వర్గాల మధ్యా అంతర్విమర్శా, సంభాషణా జరగాలన్నమాట.

రెండు శత్రుదేశాల సంబంధాలతో దీనిని పోల్చిచూసినప్పుడు మనకేమైనా మార్గం కనిపిస్తుందా?!

ఉదాహరణకు భారత, పాకిస్తాన్ లనే తీసుకుందాం. రెండింటి మధ్యా నిరంతర సమరవాతావరణం ఉంటూనే ఉంది. అదే సమయంలో శాంతి అవసరాన్నీ, అందుకు రెండు వైపులా జరగవలసిన కృషినీ నొక్కి చెప్పడమూ జరుగుతూనే ఉంది. ఒక్కోసారి రెంటి మధ్యా ఎలాంటి సంభాషణా జరగడానికి వీలులేదనే వైఖరిని తీసుకోవడం, ఒక్కోసారి దానిని పూర్తిగానో, పాక్షికంగానో సడలించి సంభాషణ జరగాలనే వైఖరి తీసుకోవడం చూస్తూ ఉంటాం. ఇందులో మళ్ళీ ఎన్నో తేడాలు. ఎలాంటి పరిస్థితులలో నైనా సంభాషణ ఆగకూడదనేవారూ, పాకిస్తాన్ పూర్తిగా దారికి వస్తే తప్ప సంభాషణ జరగడానికి వీల్లేదనేవారూ, పరిస్థితులు ఎలా ఉన్నాసరే, శత్రుత్వపు మంటను నిర్విరామంగా రాజేసేవారూ-రెండు వైపులా ఉన్నారు. ఇన్నేళ్లలో కాల్పుల విరమణ సంధి ఉల్లంఘనలు పదేపదే జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. అధికారంలో లేనప్పుడు పాకిస్తాన్ తో సంభాషణ జరగడానికి వీల్లేదని శాసిస్తూ వచ్చినవారే, అధికారంలోకి వచ్చాక సంభాషణ అవసరాన్ని నొక్కి చెబుతూ ఉంటారు. అంటే, అధికారంలో లేనప్పుడు గుర్తించని బాధ్యతను అధికారంలోకి వచ్చాక గుర్తిస్తున్నారన్నమాట. ఇక్కడ ‘బాధ్యత’ అనే మాటను దృష్టిలో ఉంచుకోవాలి.

దాంతోపాటు, భారత-పాకిస్తాన్ సంబంధాల సమరస్వభావం అలా ఉండగా, దండలో దారంలో ‘సంభాషణ’ కూడా చర్చలోకి వస్తుండడాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి.

ఇదే అంశం తీవ్రతా భేదంతో భారత-చైనా సంబంధాలకూ వర్తిస్తుంది. 1986 వరకూ చాలాకాలంపాటు రెండు దేశాల మధ్యా సంభాషణ కానీ, రాకపోకలు కానీ లేని పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత అసలు వివాదమైన సరిహద్దు వివాదాన్ని పక్కన ఉంచుతూ, సంభాషణకూ, రాకపోకలకూ తెరతీయడం; వాణిజ్యం తదితర రంగాలలో సంబంధాలను పునరుద్ధరించుకోవడం సంభవించింది.

కల్బుర్గి హత్య దగ్గరికి మళ్ళీ వద్దాం. రెండు దేశాల మధ్య ఘర్షణలానే, రెండు భావజాలాల మధ్య ఘర్షణను ఈ హత్య సంకేతిస్తోంది. పైగా భారత-పాకిస్తాన్, భారత-చైనాల శత్రుత్వం కన్నా ఇది అతి పురాతనం. ఎంత పురాతనమో స్థూలంగా చెప్పాలంటే, రామాయణమంత పురాతనం. అందులో రాముడు పరలోకాన్ని, విశ్వాసాన్ని నొక్కిచెప్పే ఋషుల భావజాలానికి ప్రతినిధి అయితే, జాబాలి దానికి భిన్నమైన భావజాలానికి ప్రతినిధి. వారిద్దరి మధ్యా ఒక సందర్భంలో వాదోపవాదాలు జరుగుతాయి. అలాగే మహాభారతంలో కురుక్షేత్రయుద్ధం జరిగిన తర్వాత ధర్మరాజు హస్తినాపురానికి వస్తుంటాడు. అప్పుడు చార్వాకుడు అతన్ని అడ్డుకుని ఇంతటి యుద్ధానికీ, రక్తపాతానికీ, విధ్వంసానికీ కారణం నువ్వే నంటూ తూలనాడతాడు. అప్పుడు ధర్మరాజు వెంట ఉన్న బ్రాహ్మణులు అతన్ని చంపేస్తారు. ఆ తర్వాత కూడా రెండు భావజాలాల మధ్య శత్రుత్వపు పాయ చరిత్రపొడవునా కొనసాగుతూనే ఉంది.  బుద్ధుడు, వేమన లాంటివారు ఈ ఘర్షణకు ప్రాతినిధ్యం వహిస్తూనేవచ్చారు. అంబేడ్కర్, కల్బుర్గి, పనాసే, ధబోల్కర్, యూ. ఆర్, అనంతమూర్తి లాంటివారు వీరికి ఆధునికమైన కొనసాగింపులు మాత్రమే.

రెండు దేశాల మధ్య శత్రుత్వంతో పైన చెప్పిన రెండు రకాల భావజాలాల మధ్య శతృత్వాన్ని పోల్చడంలో నాకైతే ఎలాంటి అనౌచిత్యం కనిపించడంలేదు. ఒకటి బాహ్యశక్తులతో ఘర్షణ. ఇంకొకటి అంతర్గత శక్తుల మధ్య ఘర్షణ. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, బాహ్యశక్తులతో ఘర్షణలో శాంతి, సామరస్యం, సంభాషణల అవసరాన్ని గుర్తించి నొక్కి చెబుతున్నప్పుడు; అంతర్గత శక్తుల మధ్య భావజాలాల ఘర్షణలో ఎందుకు నొక్కి చెప్పడం లేదు, ఎందుకు నొక్కి చెప్పకూడదు?! అంతర్గత శాంతి, సామరస్యాలు కూడా అంతే ముఖ్యం, బహుశా అంతకంటే ఎక్కువే ముఖ్యం కదా? బాహ్యశక్తులను కలసికట్టుగా ఎదుర్కోడానికైనా అది అవసరమే కదా?!

రెండు దేశాల మధ్య సమర వాతావరణం నిరంతరాయంగా కొనసాగడం మంచిది కాదు కనుక, శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి సంభాషణను ఆశ్రయించడంలో అధికారంలో ఉన్నవారు ‘బాధ్యతా’ స్పృహతో వ్యవహరిస్తున్నారన్నమాట. మరి రెండు అంతర్గత భావజాలాల ఘర్షణ ఇలా హింసకు, రక్తపాతానికి దారితీస్తున్నప్పుడు ఆ బాధ్యత ఏమైపోయింది; ఆ ఘర్షణను నివారించి శాంతి, సామరస్యాలకు కృషి చేయవలసిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? దానికి ‘పౌరసమాజం’ అన్నది ఒకానొక జవాబు అనుకుంటే, పౌరసమాజం తన బాధ్యతను విస్మరించిందనుకోవాలా?!

పైగా మనం భిన్న భావజాలల శాంతియుత, సామరస్యపూర్వక సహజీవనానికి అవకాశమిచ్చే ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అందుకు వీలైన రాజ్యాంగాన్ని 65 ఏళ్లుగా అమలుచేసుకుంటున్నాం. భారత రాజ్యాంగం దేశాన్ని ఒక నూతన సందర్భంలోకి తీసుకెళ్లింది. ఆ సందర్భాన్ని మనం గుర్తిస్తున్నామా? భిన్న భావజాలాల ఘర్షణలో ఏ వైఖరి తీసుకోవాలి, ఆ రెంటి మధ్యా ఎలాంటి సర్దుబాటు చేసుకోవాలనే విషయంలో రాజ్యాంగమే బ్లూ ప్రింటు ఇస్తోంది. ఏ చర్చకైనా రాజ్యాంగం ఉనికే ప్రాతిపదిక కావాలి.  స్వీయబాధ్యతను గుర్తించే ఏ పౌరసమాజమైనా రాజ్యాంగం ఉనికిని పదే పదే గుర్తుచేస్తూ భిన్న భావజాలాల శాంతియుత సహజీవనాన్ని నొక్కి చెబుతూనే ఉండాలి. రాజ్యాంగం నిర్వహించేది మధ్యవర్తి పాత్ర.

రెండు దేశాలు తమ ఇరుగు పొరుగును తమకు కావలసిన పద్ధతిలో సృష్టించుకోలేవనీ, సామరస్యంతో సహజీవనం చేయక తప్పదనీ మనకు తెలుసు. ఇదే సూత్రం అంతర్గత భావజాలాలకూ వర్తిస్తుంది. నాస్తికులూ-ఆస్తికులూ, హేతువాదులూ, విశ్వాసవాదులూ…ఇలా భిన్న భిన్న భావజాలాల వాళ్ళు సొంత ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా సహజీవనం చేయకతప్పదు. కనుక దేశాల మధ్య లానే వీళ్ళ మధ్య సంభాషణ, సర్దుబాటు ఉండాలి. ఆ అవగాహన సరళి రేఖామాత్రంగా ఇలా ఉండచ్చు :

  1. ఆస్తికత్వాన్నీ, విశ్వాసాన్నీ విమర్శించే, వ్యతిరేకించే ప్రజాస్వామిక హక్కు నాస్తికులకు, హేతువాదులకూ ఉంది. తమ భావజాలాన్ని ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంది. అలాగని ఆస్తికుల మనోభావాలను గాయపరచే హక్కు; ఆస్తికులు పూజించే దేవుళ్ళను దూషించే హక్కు వారికి లేదు. చట్టం, రాజ్యాంగం అనుమతించిన పరిమితుల్లో మతస్వేచ్ఛలానే; భావజాలస్వేచ్ఛను కూడా అన్ని పక్షాలూ గుర్తించాలి.
  2. తమ ఆస్తికత్వాన్నీ, విశ్వాసాన్నీ ఉద్ఘాటించుకుని ప్రచారం చేసుకునే హక్కు, నాస్తికత్వాన్నీ, హేతువాదాన్నీ విమర్శించే హక్కు ఆస్తికులకు ఉంది. అలాగని నాస్తికులను, హేతువాదులను దూషించి, దేశద్రోహులుగా చిత్రించే హక్కు; వారిపై భౌతిక దాడులకు దిగి హతమార్చే హక్కు వారికి లేదు. ఆస్తికులు అధికసంఖ్యాకులు కూడా కనుక ఈ విషయంలో వారిపై మరింత బాధ్యత ఉంటుంది. ఈ భౌతికసంఖ్యాధిక్యం నుంచి వారు అదనపు ప్రయోజనం పొందడానికి చూడకూడదు.
  3. నాస్తిక, ఆస్తిక ఉద్యమాలు రెండూ చిరకాలంగా పట్టువిడుపులు లేని ఆత్యంతిక వైఖరి(extreme)నే తీసుకుంటూ వచ్చాయి. పరస్పర శత్రుత్వానికి పదును పెడుతూనే వచ్చాయి. ఈ మార్గంలో ఏ ఉద్యమమూ ఫలితం సాధించలేకపోయింది. నాస్తికత్వం ఆస్తికత్వాన్నీ, ఆస్తికత్వం నాస్తికత్వాన్నీ కొంచెమైనా తుడిచిపెట్టలేకపోయాయి. ఈ వాస్తవాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాయో అప్పుడు చరిత్ర పొడవునా తమ మధ్య జరుగుతున్నది ఒక విఫలపోరాటమన్న సంగతి అర్థమవుతుంది. విఫల పోరాటాన్ని కొనసాగించడంలో అర్థం, ఔచిత్యం లేని సంగతి బోధపడుతుంది. ఆ గుర్తింపు సంభవించినప్పుడు రెండూ ఒక సరికొత్త ఉమ్మడి ప్రాతిపదికపై సహజీవనం చేయడానికి సాధ్యమవుతుంది. సరిహద్దు వివాదాన్ని పక్కన పెట్టి వాణిజ్యం తదితర ఉమ్మడి ప్రయోజనాలపై భారత-చైనాలు సంబంధాలను పునరుద్ధరించుకున్న ఉదాహరణను ఇక్కడ గుర్తుచేసుకోవచ్చు. అలాగే ఉమ్మడి కార్యక్రమం పై పార్టీలు ఏకమై సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న ఉదాహరణను కూడా.
  4. ఆస్తిక, నాస్తికవాదుల మధ్య సర్దుబాటు సరళి ఇలా ఉండచ్చు: అ)నాస్తికులు ఆస్తిక స్వేచ్ఛను అగౌరవపరచకూడదు. ఆస్తికుల మనోభావాలను నొప్పించకూడదు. అదే సమయంలో ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికపై దేశ ఇతరేతర ప్రయోజనాలకు వారిని కలసిరమ్మని ప్రతిపాదించవచ్చు. రాజ్యాంగం పేర్కొన్న సైంటిఫిక్ టెంపర్ ను అభివృద్ధి చేయడం వాటిలో ఒకటి. అలాగే కొన్ని విపరీత స్వభావం కలిగిన విశ్వాసాలకు అడ్డుకట్ట వేయమనీ, విశ్వాసరంగాన్ని తగిన మేరకు సంస్కరించవలసిందనీ కోరవచ్చు. విశ్వాసం ముసుగులో జరుగుతున్న రకరకాల వ్యాపారాలను, మోసాలను నియంత్రించమని అడగచ్చు. మతాన్ని, దేవుణ్ణి వీలైనంత వరకు ప్రైవేట్ కు పరిమితం చేసి పబ్లిక్ జాగాను సామాజిక కార్యకలాపాలకు, అవసరాలకు విడిచిపెట్టమని అడగవచ్చు. మతాన్నీ, విశ్వాసాన్నీ రాజకీయంగా వాడుకోజూసే శక్తులను దూరంగా ఉంచమని కోరవచ్చు. ఆ) ఆస్తిక, విశ్వాసరంగం చాలాకాలంగా అంతర్గత సంస్కరణలకు దూరంగా ఉందన్న సంగతిని ఆస్తికవాదులూ గుర్తించాలి. గతంలో వివిధ కాలాలలో ఈ రంగంలో జరుగుతూ వచ్చిన సంస్కరణలు ఇప్పుడు ఎందుకు లోపించాయో ఆస్తికవాదులూ, ఆధ్యాత్మికమతనాయకులూ, పౌరాణికులూ ప్రశ్నించుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. సమాజం పట్ల తమ బాధ్యతను వారు గుర్తించాలి. నాస్తికత్వం సహా భిన్న భిన్న భావజాలాలు వైవిధ్యవంతమైన, సృజన శీలి అయిన సామాజిక స్వభావానికి అద్దం పడతాయనీ, ప్రజాస్వామ్యం ఉనికిని చాటి చెబుతాయనీ గ్రహించాలి. అంతిమంగా నాస్తికులూ, ఆస్తికులూ కూడా అభిప్రాయభేదాలను నాగరిక పద్ధతుల్లో, ప్రజాస్వామిక పరిమితుల్లో వ్యక్తం చేసుకోవాలి.

అన్నింటి కన్నా ముందస్తు షరతు; భిన్న భావజాల శిబిరాల మధ్య ‘సంభాషణ’ అవసరాన్ని గుర్తించడం. దానికి తెర తీయడం. సంభాషణ అంటూ మొదలయ్యాక అది ఎలాంటి ఫలితాలవైపు పయనిస్తుందన్నది తర్వాతి ప్రశ్న.

ఈ వ్యాసంలోని అనేక అంశాలతో  ఏకీభావం ఉండచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడైనా వ్యక్తీకరణ లోపాలు ఉన్నా ఉండచ్చు. కానీ ఈ రెండు శత్రుశిబిరాల మధ్య సంభాషణ అవసరమన్న అభిప్రాయంతో బహుశా ఎవరూ విభేదించరు. ఆ అవసరాన్ని గుర్తించడమే కల్బుర్గి వంటివారికి తగిన నివాళి అవుతుంది.

*

 

 

 

ఎవరీ ‘సామాన్యుడు’? ఎప్పటి వాడు?!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?

సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసమెట్టిది?

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీ లెవ్వరు?

                                                          -శ్రీశ్రీ

                                (మహాప్రస్థానం, దేశచరిత్రలు)

ఇవి ప్రసిద్ధ పంక్తులే కానీ, ఇందులో చెప్పిన ‘సామాన్యుడు’ ఎప్పుడు, ఎందుకు, ఎలా అవతరించాడో ఎప్పుడైనా గమనించారా?

మనిషికి ‘నరుడు’ అనే పర్యాయపదం ఉంది. పురాణ, ఇతిహాసాలు దేవ, దానవ, సిద్ధ, సాధ్య, యక్ష, రాక్షస, వానరాల మధ్య నరుని ఇరికించి చెప్పాయి. నేటి అవగాహనతో దేవ దానవాదులను కూడా నరులుగానే గుర్తిస్తే, లేదా ఆ మాటలు నరుని గుణ, స్వభావాలను; లేదా తెగ నామాలను తెలిపేవి అనుకుంటే ఆ జాబితాలో చెప్పిన ‘నరుడు’ ఎవరనే ప్రశ్న వస్తుంది. ఇంకో విచిత్రం చూడండి: మహాభారతం అర్జునుని నరునిగా పేర్కొంటూనే, అతనిని నరుడనే ముని అవతారంగా చెప్పి మహాత్ముణ్ణి చేసింది. నరుని… అంటే మామూలు మనిషిని గుర్తించడంలో మహాభారతానికి ఏదో ఇబ్బంది ఉంది. మహాభారతానికే కాదు, ప్రపంచ పురాణ కథలన్నిటికీ ఆ ఇబ్బంది ఉంది.

కీచకుడు తన వెంటపడి వేధిస్తున్నప్పుడు ద్రౌపది ఏకాంతంగా భీముని కలిసి తన దుఃఖాన్ని వెళ్లబోసుకుంటుంది. ఆవేశం పట్టలేక, ఆ జూదరి వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నామని ధర్మరాజును తూలనాడుతుంది. అప్పుడు భీముడు ఆమెను మందలించగా తప్పు దిద్దుకుంటూ ధర్మరాజు గొప్పతనాన్ని కీర్తిస్తుంది. ఆ సందర్భంలో “…కేవల మర్త్యుడే ధర్మసుతుడు?”  అంటుంది. ధర్మరాజు మామూలు మనిషి కాదు, మహాత్ముడని చెప్పడం అందులో ఉద్దేశం. ఇలా మహాత్ముడు-మర్త్యుడు అనే విభజన మహాభారతంలో ఇంకా చాలా చోట్ల వస్తుంది.  అజ్ఞాతవాసం గడపడానికి విరాటనగరానికి వెళ్లబోయేముందు, ‘ఇంతటివాడు ఒక మర్త్యుని ఎలా సేవించుకుంటాడు’ అంటూ ధర్మరాజును తలచుకుని అర్జునుడు బాధపడతాడు. ఇంద్రునితో అర్థసింహాసనం అధిష్టించిన అర్జునుడు ఒక మర్త్యుని కొలువు ఎలా చేస్తాడని ధర్మరాజు విచారిస్తాడు. మామూలు మనుషులను సూచిస్తూ మహాభారతం ప్రయోగించిన మరో మాట: ప్రకృతిజనులు. “పుడుతూనే కవచ, కుండలాలతో పుట్టిన కర్ణుడు ఒక ప్రకృతి కాంతకు పుట్టడం ఎలా సాధ్యం?” అని దుర్యోధనుడు ప్రశ్నిస్తాడు. సారాంశం ఏమిటంటే, మహాభారత కాలానికి మనుషుల్లో సామాన్యులు-అసామాన్యులన్న తేడా వచ్చేసింది.

అటువంటి మహాభారత సమయానికీ, “నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవన మెట్టిది?” అని ఆధునిక మహాకవి ప్రశ్నించే నాటికీ మధ్య చాలా కాలం ప్రవహించింది. చాలా చరిత్ర గడచింది. విచిత్రం ఏమిటంటే, ప్రజాస్వామ్య రాజకీయాలు తనకు సరికొత్త అసామాన్యతను కల్పించి అందల మెక్కించి ఊరేగిస్తున్నా ‘సామాన్యుడు’ ఇప్పటికీ సామాన్యుడి గానే ఉన్నాడు. వాస్తవంగా అసామాన్యతను చలాయిస్తున్న నాయకుల నోట మంత్రంగా మారాడు. అదలా ఉంచితే, మనదేశంలో ‘సామాన్యుడు’ తన ఉనికిని చాటుకోవడం ఎప్పటినుంచి ప్రారంభమైందో తెలిపే చారిత్రక అంచనాలను ఎవరైనా నమోదు చేశారో లేదో ఇప్పటికిప్పుడు చెప్పలేను కానీ; యూరప్ లో ఆ పరిణామం ఎప్పుడు, ఏ ఘట్టంలో జరిగిందో చరిత్రకారుడు హెచ్.జి. వెల్స్ షార్ట్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్  లో రాశాడు.

A_Short_History_of_the_World_(H.G._Wells)

పదకొండవ శతాబ్ది చివరిలో టర్కులు జెరూసలెంను ఆక్రమించుకుని, క్రైస్తవులందరూ పవిత్రయాత్రాస్థలిగా భావించే  హోలీ సెపుల్చర్ చర్చిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. దాంతో టర్కులపై మతయుద్ధానికి  సిద్ధపడవలసిందిగా అప్పటి పోప్ అర్బన్-II పాశ్చాత్య క్రైస్తవ ప్రపంచానికి పిలుపు నిచ్చాడు. ఆ యుద్ధాలే క్రూసేడ్ లుగా, శిలువకోసం జరిగిన యుద్ధాలుగా ప్రసిద్ధికెక్కాయి. అప్పుడు పీటర్ అనే ఒక చింకి పాతల సన్యాసి పెద్ద శిలువను మోస్తూ చెప్పులు లేని కాళ్లతో గాడిద మీద జర్మనీ, ఫ్రాన్స్ వీధుల్లో తిరుగుతూ క్రూసేడ్లకు అనుకూలంగా ప్రజలను ఉద్బోధించాడు. అప్పటికి శతాబ్దాలుగా క్రైస్తవ బోధలకు ప్రభావితమవుతున్న యూరప్, క్రూసేడ్ల పిలుపుకు ఎంతో ఉద్విగ్నపూరితంగా స్పందించింది.  క్రైస్తవజనసామాన్యం ఒక ప్రజాశక్తిగా అవతరించి తన ఉనికిని చాటుకోవడం ప్రారంభించారు. ఒక పిలుపును అందుకుని సామాన్యప్రజానీకం అలా ఉవ్వెత్తున విరుచుకుపడడం మానవాళి చరిత్రలోనే కొత్త పరిణామమనీ;  వెనకటి రోమన్ సామ్రాజ్య, భారత, చైనా చరిత్రలలో దీనితో పోల్చదగిన దేదీ కనిపించదనీ వెల్స్ అంటాడు. ఆధునిక ప్రజాస్వామ్య ఆవిర్భావానికి ఇది నాంది అని పూర్తిగా అనలేకపోయినా, ఇందులో కచ్చితంగా ఆధునిక ప్రజాస్వామ్య ఉత్ప్రేరకాలు ఉన్నాయని ఆయన అంటాడు.

అంతకుముందు మనిషి చరిత్రలో వేల సంవత్సరాలు కొనసాగిన గణవ్యవస్థకు వెడితే, అందులో సామాన్యుడు, అసామాన్యుడన్న విభజనే లేదు. గణంలోని ప్రతి సభ్యుడూ సామాన్యుడే, లేదా అసామాన్యుడే. గణసభ్యులు కలసికట్టుగా ప్రకృతితో సంఘర్షించినంత కాలం వారిలో తారతమ్యాలు లేవు. మనిషి సాటి మనిషితో సంఘర్షించడం ప్రారంభమయ్యాకే తారతమ్యాలు వచ్చాయి. సామాన్యులు, అసామాన్యులనే విభజన వచ్చింది. గణవ్యవస్థలో  ప్రతి మనిషీ ముఖ్యుడే. ఏ ఒక్కరూ అనామకులు కారు. ప్రతి ఒక్కరి ఉనికీ చరిత్రలో నమోదు అయింది. కుంటా కింటే తన మూలాలనుంచి వేరుపడి తనది కాని నేలపై, తనది కాని భాష మధ్య అనామకంగా బానిస జీవితం గడిపినా; తను పుట్టిన గడ్డపై అతను అనామకుడు కాడు. అతని స్మృతిని  అది తరం నుంచి తరానికి భద్రంగా అందిస్తూనే వచ్చింది. విచిత్రాన్ని మించి,  విషాదం ఏమిటంటే; లిఖితచరిత్ర లేని కాలంలో కూడా ప్రతి మనిషి ఉనికీ నమోదయింది, లిఖితచరిత్ర వచ్చాక మనిషి చరిత్రహీనుడయ్యాడు.  గణంనుంచి జనానికి మారగానే సామాన్యుడి పేరుతో అనామక సముద్రంలో అజ్ఞాతంగా కలసిపోయాడు. తాత ముత్తాత పేరు కూడా తెలియని చారిత్రక అజ్ఞానిగా మిగిలిపోయాడు.

***

తమ పూర్వీకుడు కుంటా కింటేను బానిసగా పట్టుకుని ఓడలో ‘నేప్లిస్’ అనే చోటికి తీసుకొచ్చారని చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పగా హేలీ విన్నాడు. మేరీల్యాండ్ లో ఉన్న అన్నాపోలిస్ కు భ్రష్టరూపమే నేప్లిస్. గాంబియానది నుంచి బానిసలతో ఏయే ఓడలు అన్నాపొలిస్ కు ప్రయాణించాయో లండన్ వెళ్ళి శోధించడం ప్రారంభించాడు. “రాజుగారి సైనికులు వచ్చిన సమయంలో కుంటా కింటే అదృశ్యమయ్యా”డని జఫూరు గాథికుడు ఇచ్చిన సూచనే అతనికి చుక్కాని.  ‘రాజుగారి సైనికులు’ మరెవరో కాదు, 1760లో జేమ్స్ ఐలండ్ లోని బానిస దుర్గానికి రక్షణగా కల్నల్ ఒహేర్స్ నాయకత్వంలో వచ్చినవారేనని తేలింది. ఆ సమాచారంతో హేలీ లండన్ లోని లాయిడ్స్ కు వెళ్ళి, ఇంగ్లీష్ సముద్రయాన పత్రాలను గాలించడం ప్రారంభించాడు. ఆరువారాలు గడిచాయి. ఏడో వారంలో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక వెడల్పాటి పత్రం కనిపించింది. 1766-1767 మధ్యకాలంలో గాంబియా నది నుంచి ప్రయాణించిన 30 ఓడల వివరాలను అది నమోదు చేసింది. అతని చూపు ఓడ నెం. 18 దగ్గర ఆగింది.

1767లో… అంటే ‘రాజుగారి సైనికులు వచ్చిన’ ఏడాది… జూలై 5న లార్డ్ లిగొనీర్ అనే ఆ ఓడ గాంబియా నదిలో బయలుదేరింది. దాని గమ్యస్థానం అన్నాపొలిస్!  కెప్టెన్ పేరు థామస్ ఈ. డేవిస్…

ఎందుకో తెలియదు కానీ, ఆ వివరాలకు తను స్పందించడంలో ఆలస్యం జరిగిందనీ, యాంత్రికంగా ఆ సమాచారాన్ని రాసుకుని, పత్రాలను మూసేసి బయటకు నడిచాననీ హేలీ అంటాడు. వీధి మలుపులో ఉన్న చిన్న టీ షాప్ కు వెళ్ళి టీ తెప్పించుకున్నాడు. టీ చప్పరిస్తుండగా, కుంటా కింటేను తీసుకొచ్చిన ఓడ అదే కావచ్చని అతనికి మెరుపులా స్ఫురించింది. ఆ టీ ఇచ్చిన ఆమెకు ఎంతో రుణపడ్డాననుకున్న హేలీ అప్పటికప్పుడు బయలుదేరి న్యూయార్క్ వెళ్లడానికి నిర్ణయించుకుని, సీటుకోసం పాన్ అమెరికన్ ను సంప్రదించాడు. చివరి సీటు ఉందని అది జవాబిచ్చింది. తను దిగిన హోటల్ కు వెళ్లడానికి కూడా సమయం లేదు. ట్యాక్సీ చేసుకుని నేరుగా హిత్రో ఎయిర్ పోర్ట్ కు వెళ్లిపోయాడు. విమానంలో ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. వాషింగ్టన్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో తను చూసిన పుస్తకమే అతని కళ్ళముందు కదులుతోంది. అది గోధుమరంగు అట్టతో ఉంది. దానిమీద Shipping in the port of Annapolis అనే నల్లని అక్షరాలు ఉన్నాయి. రచయిత వాఘన్ డబ్ల్యు బ్రౌన్.

న్యూయార్క్ లో దిగీ దిగగానే మరో విమానంలో వాషింగ్టన్ వెళ్లిపోయాడు. ట్యాక్సీ చేసుకుని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కు వెళ్ళాడు. పుస్తకం తెప్పించుకున్నాడు. ఆతృతగా పుటలు తిరగేస్తూపోయాడు. తను వెతుకుతున్నది కనిపించింది! లార్డ్ లిగొనీర్  అన్నాపొలిస్ లో 1767,సెప్టెంబర్ 29న కస్టమ్స్ క్లియరెన్స్ పొందింది…హేలీ అక్కడినుంచి బయలుదేరి కారు అద్దెకు తీసుకుని అన్నాపొలిస్ కు వెళ్ళాడు. నేరుగా మేరీల్యాండ్ హాల్ ఆఫ్ రికార్డ్స్ కు దారితీశాడు. 1767 అక్టోబర్ మొదటివారంలో ప్రచురితమైన స్థానిక వార్తాపత్రికల సంచికలు కావాలని అడిగాడు. సిబ్బంది మేరీల్యాండ్ గెజిట్  సంచికలున్న మైక్రో ఫిల్మ్ చుట్టలు తీసుకొచ్చి అతని ముందు ఉంచారు. వాటిని మిషన్ లో ఉంచి తిప్పుతుండగా  అక్టోబర్ 1 సంచికలో ఒక ప్రకటన కనిపించింది…

హేలీ అన్వేషణలో చివరి అంకం, తర్వాత…

 

-భాస్కరం కల్లూరి

 

 

 

అగ్నిని జయించిన….వాళ్లు!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

చతురంబోధిపరీత భూవలయమున్ సద్వీప సారణ్య స

క్షితిభృత్కం బగుదాని భూరిభుజశక్తిం జేసి పాలించుచున్

గ్రతువుల్ నూరొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్ నిర్జితా

హితుడై యా నహుషుండు దా బడసె దేవేంద్రత్వముం బేర్మితోన్

                                                            -నన్నయ

                (శ్రీమదాంధ్రమహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం) 

( నాలుగు సముద్రాలూ చుట్టుకున్న భూమండలాన్ని ద్వీప, అరణ్య, భూభాగాలతో సహా తన గొప్పదైన భుజశక్తితో పాలిస్తూ నూరు యాగాలు చేసి, తన కీర్తి దిగంతాలకు వ్యాపించగా శత్రువులందరినీ జయించిన ఆ నహుషుడు ఇంద్రపదవిని పొందాడు)

 అక్కథకుడు శౌనకాది మహామునులకు చెప్పాడు…అటువంటి నహుషునికి ప్రియంవద అనే ఆమె వల్ల యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువులనే ఆరుగురు కొడుకులు కలిగారు. వారిలో యయాతి రాజై అనేక యాగాలు చేశాడు. శుక్రుని పుత్రిక అయిన దేవయాని వల్ల అతనికి యదు, తుర్వసులనే ఇద్దరు కొడుకులు; వృషపర్వుని పుత్రిక అయిన శర్మిష్ట వల్ల దృహ్యుడు, అనుడు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. శుక్రుని శాపంతో వృద్ధాప్యభారం మీదపడగా కొడుకుల నందరినీ పిలిచి అన్నాడు…

***

“—and so-and-so took as a wife so-and-so, and begat…and begat…and  begat…”

ఆ వృద్ధ గాథికుని కథనం వింటున్న హెలీకి బైబిల్ శైలి గుర్తొచ్చింది. కుంటా కింటే ముస్లిం మతస్థుడు. అతని నుంచి ఏడో తరానికి చెందిన హేలీ దగ్గరికి వచ్చేసరికి  ఒంటి రంగు, కారు నలుపు నుంచి గోధుమవర్ణానికి మారిపోవడమే కాదు, మతమూ మారిపోయింది. హెలీకి బైబిల్ ఒక్కటే తెలుసు. మహాభారతంతో అతనికి పరిచయం ఉండుంటే  గాథికుని కథనం మహాభారత శైలిలా ఉందని కూడా అనుకుని ఉండేవాడు. అంతేకాదు, మౌఖిక సంప్రదాయానికి చెందిన ప్రపంచ పురాణ కథకులందరూ తమ వీరపురుషుల గాథలనూ, వంశచరిత్రలనూ, కుల పురాణాలనూ ఈ శైలిలోనే చెప్పుకుని ఉండచ్చన్న సంగతి అతనికి స్ఫురించి ఉండేది.

గాథికుడు కింటే వంశ వివరాలు చెప్పుకుంటూ వెడుతున్నాడు. నాటి ముఖ్యమైన కొన్ని ఘటనల ద్వారా సంవత్సరాలను, తేదీలను సూచిస్తున్నాడు. ఉదాహరణకు, అప్పుడు “భారీగా వరదలు వచ్చాయి”… “అతను ఓ దున్నపోతును వధించాడు”…

గాథికుడు చెప్పిన కింటే వంశ వివరాలను సంగ్రహీకరిస్తే…

కింటే వంశం ఓల్డ్ మాలి అనే దేశంలో మొదలైంది. వారు వృత్తిరీత్యా కమ్మరులు. “అగ్నిని జయించినవాళ్లు”. కింటే తెగలోని ఆడవాళ్లు కుమ్మరిపనీ, నేతపనీ చేసేవారు. కింటే వంశంలోని ఒక శాఖ మారెటేనియా అనే మరో దేశానికి తరలిపోయింది. అక్కడినుంచి ఆ వంశస్థులలో ఒకడైన కైరాబా కుంటా కింటే అనే ముస్లిం గాంబియాకు వలసపోయాడు. మొదట పకాలి ఎన్డిగ్ అనే గ్రామంలో కొద్ది కాలం ఉండి  ఆ తర్వాత జఫరాంగ్ అనే ఊరికి, అక్కడినుంచి జఫూరుకు మారాడు. అక్కడ సిరేంగ్ అనే మాండింకా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి జానే, సలౌమ్ అనే ఇద్దరు కొడుకులు కలిగారు. ఆ తర్వాత అయిసా అనే అమ్మాయిని రెండో భార్యగా స్వీకరించాడు. ఆమెకు ఒమొరో అనే కొడుకు పుట్టాడు.

తర్వాత కొంత కాలానికి కైరాబా పెద్ద కొడుకులిద్దరూ ‘కింటా కుండా జానేయా’ అనే కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడికి  వెళ్ళిపోయారు. ఒమొరో జఫూరులోనే ఉండిపోయాడు. తనకు “ముప్పై వర్షాలు” వచ్చిన తర్వాత బిట్టా కెబ్బా అనే మాండింకా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కెబ్బా వల్ల అతనికి ఉజ్జాయింపుగా 1750-1760 మధ్య కాలంలో నలుగురు కొడుకులు పుట్టారు: కుంటా, లామిన్, సువాడు, మాది…

అప్పటికి వృద్ధ గాథికుడు తన కథనం మొదలుపెట్టి రెండుగంటలయింది. తను పేర్కొన్న వ్యక్తుల గురించి మధ్య మధ్య వివరాలు అందిస్తూ కథనం కొనసాగిస్తున్నాడు. అలాగే, ఒమొరో నలుగురు కొడుకుల గురించిన వివరాలను చెప్పడం ప్రారంభించాడు. దుబాషీ వాటిని అనువదిస్తున్నాడు-

“రాజుగారి సైనికులు వచ్చిన సమయంలో”… “ఆ నలుగురు కొడుకుల్లోనూ పెద్దకొడుకు కుంటా కలప నరికి తెచ్చుకోడానికి ఊళ్ళోంచి అడవికి వెళ్ళాడు…అతను మళ్ళీ కనిపించలేదు…” గాథికుడు చెప్పుకుంటూ పోతున్నాడు.

తను చెక్కిన శిలలా కూర్చుండిపోయాననీ, తనలో రక్తం గడ్డకట్టుకుపోయినట్టు అనిపించిందనీ హేలీ అంటాడు. తన జీవితమంతా ఈ మారుమూల ఆఫ్రికన్ గ్రామంలో గడిపిన ఈ పెద్దమనిషి; టెన్నెస్సీ లోని తమ హెన్నింగ్ ఇంటి వసారాలో తను అమ్మమ్మ నోట చిన్నప్పుడు విన్న సంగతులే చెబుతున్నాడు! ఆ అప్రతిభస్థితిలోనే ఎలాగో బ్యాగు లోంచి ఒక నోటుబుక్కు తీశాడు. దాని మొదటి పేజీలలో అమ్మమ్మ చెప్పిన కథ ఉంది. దానిని ఒక దుబాషీకి చూపించాడు. ఆశ్చర్యచకితుడైన ఆ దుబాషీ వెంటనే గాథికుని దగ్గరకు వెళ్ళి ఆ నోటుబుక్కులోని పేజీలను చూపిస్తూ గబగబా ఏదో చెప్పాడు. గాథికుడు ఆందోళన చెందాడు. వెంటనే లేచి నిలబడి దుబాషీ చేతిలోని నోటుబుక్కు చూపిస్తూ జనానికి ఏదో వివరించాడు. దాంతో వాళ్ళు కూడా ఆందోళన చెందారు. ఎవరూ ఎలాంటి ఆదేశామూ ఇవ్వకుండానే అంతా తక్షణమే హేలీ చుట్టూ మానవవలయంలా ఏర్పడ్డారు. వ్యతిరేక దిశలో కదులుతూ; ఒకసారి మంద్రస్వరంలో, ఇంకోసారి ఉచ్చస్వరంలో ఏదో వల్లిస్తూ; మధ్య మధ్య మోకాళ్ళను పైకెత్తుతూ; ఎర్రని ధూళి పైకిలేచేలా ఒత్తి ఒత్తి అడుగులేస్తూ ప్రదక్షిణం చేయసాగారు…

అంతలో ఒక మహిళ ఆ వలయంలోంచి బయటకు వచ్చి, నగ్న పాదాలతో నేలను తన్నుకుంటూ హెలీవైపు బాణంలా దూసుకువెళ్లింది. తన వీపున వేలాడదీసుకున్న జోలెలోంచి పసిబిడ్డను తీసి దాదాపు మొరటుగా అతని చేతుల్లో ఉంచి “తీసుకో” అన్నట్టు చూసింది. హేలీ ఆ బిడ్డను హత్తుకున్నాడు. ఆ తర్వాత ఆమె బిడ్డను తీసేసుకుంది. మ్రాన్పడి చూస్తున్న హేలీ చేతుల్లో అలా ఓ డజను మంది మహిళలు తమ పసిబిడ్డల్ని ఉంచారు. వాళ్లందరినీ అతడు హత్తుకున్నాడు. వారు అలా ఎందుకు చేశారో అతనికి ఒక ఏడాది తర్వాత కానీ తెలియలేదు. అటువంటి విషయాలలో నిపుణుడైన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జెరోమ్ బ్రూనర్ తో మాట్లాడినప్పుడు, “నీకు తెలియకుండానే మానవాళికి చెందిన అతి పురాతనమైన ఒక తంతులో నువ్వు పాల్గొన్నావు. దానిని ‘చేతులు వేయడం’ అంటారు.  “ఈ మా శరీరం ద్వారా మేము నువ్వే, నువ్వు మేమే” నని వారు నీకు చెబుతున్నారు” అని ఆయన  హెలీతో అన్నాడు.

తర్వాత మగవాళ్ళు హేలీని వెదురు కర్రలతో, పూరితో నిర్మించిన మసీదులోకి తీసుకెళ్లారు. అతనిని మధ్యలో ఉంచుకుని అరబిక్ లో నమాజు చేశారు. వాళ్లతోపాటు మోకాళ్ళ మీద కూర్చుని నమాజులో పాల్గొన్న హేలీ, తన మూలాలు ఏమిటో తెలిసినా, వాళ్ళు మాట్లాడేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదనుకున్నాడు. వారి ప్రార్థన సారాంశాన్ని ఆ తర్వాత దుబాషీ అనువదించి చెప్పాడు: ఎప్పుడో తాము పోగొట్టుకున్న వ్యక్తిని తిరిగి తమకు అప్పగించినందుకు అల్లాకు వారు కృతజ్ఞతలు ప్రకటించుకున్నారు.

kinta

తిరుగు ప్రయాణమైన హేలీ ఈసారి రోడ్డు మార్గంలో బయలుదేరాడు. జఫూరు కంటె పెద్దదైన ఓ గ్రామానికి చేరుకునేసరికి ఆ ఊళ్ళో జనం, ఆడా మగా, చిన్నా పెద్దతో సహా అంతా రోడ్డు మీదికి చేరుకుంటూ కనిపించారు. తను అక్కడికి రావడానికి ముందే జఫూరులో ఏం జరిగిందో వారికి తెలిసిపోయింది. వారు అతన్ని చూసి చేతులు ఊపుతున్నారు. “మీస్టర్ కింటే! మీస్టర్ కింటే!” అంటూ ఒక్క గొంతుతో కేకలు పెడుతున్నారు. వారి ముఖాలు సంతోషంతో వెలిగి పోతున్నాయి. ఆ సమయంలో నా చీలమండల దగ్గరినుంచి దుఃఖం అలలు అలలుగా ప్రారంభమై క్రమంగా పైకి తన్నుకుంటూ వచ్చిందనీ, చేతులతో ముఖం కప్పుకుని బాల్యం తర్వాత మొదటిసారిగా భోరున ఏడవడం ప్రారంభించాననీ హేలీ అంటాడు.

హేలీ న్యూయార్క్ చేరుకునేసరికి కొన్ని టెలిఫోన్ వర్తమానాలు అతనికోసం ఎదురుచూస్తున్నాయి. వాటిలో ఒకటి కన్సాస్ సిటీ నుంచి వచ్చింది. ఎనభై మూడేళ్ళ కజిన్ జార్జియా కన్నుమూసినట్టు అది చెబుతోంది. హేలీ టైమ్ జోన్ సవరించుకుని చూసుకుంటే సరిగ్గా తను జఫూరులో అడుగుపెట్టిన క్షణాలలోనే ఆమె చనిపోయినట్టు అర్థమైంది. అమ్మమ్మతో తమ ఇంటి వసారాలో ముచ్చట్లు పంచుకున్న చివరి మనిషిగా ఆమె, తనను ఆఫ్రికాకు పంపించే బాధ్యత నెరవేర్చి, ‘పైనుంచి చల్లగా చూసే’ పెద్దలలో కలసిపోయిందని హేలీ అనుకున్నాడు.

***

హేలీకి మహాభారతంతో పరిచయం ఉండుంటే, జఫూరు గాథికుని కథనం బైబిల్ శైలినే కాక మహాభారత శైలిని కూడా గుర్తుచేసేదని పైన చెప్పుకున్నాం. అంతేకాదు, మన ఇతిహాస, పురాణ కథలు అతనికి తెలిసుంటే, శైలినే కాక ఒకేవిధమైన అభివ్యక్తిని, పదాలను, పదచిత్రాలను కూడా ఒకనాటి ప్రపంచ గాథికులు పంచుకున్నారని అతడు గ్రహించి ఉండేవాడు. కుంటా కింటే తండ్రి ఒమొరో తనకు ముప్పై ‘వర్షాలు’ (హేలీ  thirty rains అన్నాడు) వచ్చాక పెళ్లిచేసుకున్నాడు. మనం కూడా సంవత్సరాలను ‘వర్షాలు’ అంటాం. వసంతాలతో సంవత్సరాలను చెప్పుకున్నట్టే వర్షాలతో చెప్పుకోవడం వ్యవసాయ సంస్కృతి ప్రపంచానికి అందించిన వారసత్వం.  అలాగే, కింటే వంశీకులు ‘అగ్నిని జయించారు’ అని వినగానే మన పురాణ కథనాల తీరు ఒక్కసారిగా  తళుక్కుమంటుంది. అరణి మథించి నిప్పు చేయడంలో నేర్పరులైన అంగిరులను కూడా మన పురాణాలు అగ్నిని జయించిన వారుగానే పేర్కొంటాయి. మన అగస్త్యుడు ‘సముద్ర జలాలను తాగేస్తాడు’. పై పద్యంలోని నహుషుడు క్షత్రియవీరుడు కనుక నిర్జితాహితుడు- అంటే శత్రువులను జయించినవాడు. కింటే వంశీకులు కమ్మరులు కనుక ‘అగ్నిని జయించిన’వాళ్ళు!

హేలీ అన్వేషణ అంతటితో పూర్తి కాలేదు. అనంతర కథ తర్వాత…

 

 

అవన్నీ ‘చెప్పినవే’ తప్ప ‘రాసినవి’ కాదు!

 Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)పాదబద్ధోzక్షరసమః తంత్రీలయసమన్వితః

శోకార్తస్య ప్రవృత్తోమే శ్లోకో భవతు నాన్యథా

శిష్యుడు భరద్వాజుడితో కలసి వాల్మీకి తమసానదికి స్నానానికి వెళ్ళాడు. అంతకుముందే ఆయన నారదుని నోట  సంక్షిప్తంగా రామాయణ కథ విన్నాడు. దానినే భావన చేస్తున్నాడు. స్నానానికి దిగబోతుండగా క్రౌంచ పక్షి జంట కనిపించింది. మగపక్షి కామపరవశస్థితిలో ఉంది. అంతలో ఒక కిరాతకుడు బాణం వేసి దానిని నేలకూల్చాడు. ఆడపక్షి శోకించసాగింది. వాల్మీకిలోనూ కరుణశోకాలు ఉబికివచ్చాయి. అప్రయత్నంగా ఆయన నోట కొన్ని మాటలు వెలువడ్డాయి:

మా నిషాద ప్రతిష్ఠామ్ త్వ మగమ శ్శాశ్స్వతీస్సమాః

యత్ క్రౌంచ మిథునా దేకమ్ అవధీః కామమోహితమ్

(ఓ కిరాతుడా! క్రౌంచ మిథునంలో కామపరవశంగా ఉన్న ఒక పక్షిని చంపావు. అందువల్ల నువ్వు ఎక్కువ కాలం జీవించవు [శాశ్వతంగా అపకీర్తిని మూటగట్టుకుంటావు])

ఆశ్చర్యపోయిన శిష్యుడు అప్పటికప్పుడు ఆ మాటల్ని కంఠస్థం చేశాడు. స్వయంగా వాల్మీకికీ ఆ మాటలు విస్మయం కలిగించాయి. నేను ఏం పలికానన్న ఆలోచనలో పడ్డాడు. ” చూశావా, నేను పలికిన ఈ మాటలు సమాక్షరాలతో పాదబద్ధంగా ఉన్నాయి. వాద్యయుక్తంగా, లయబద్ధంగా పాడుకోడానికి వీలుగానూ ఉన్నాయి. శోకార్తితో నేను అన్న ఈ మాటలు శ్లోకమే తప్ప మరొకటి కావు” అని శిష్యుడితో అన్నాడు.

ఆశ్రమానికి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా వాల్మీకి దాని గురించే ఆలోచిస్తున్నాడు. శిష్యుడు తను కంఠస్థం చేసిన మాటల్ని సహాధ్యాయులతో పంచుకున్నాడు. వారు కూడా ఆశ్చర్యానందాలలో తలమునకలవుతూ వాటిని కంఠస్థం చేశారు. అంతలో బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి అతిథి సేవలు అందించి ఆయనతో మాట్లాడుతున్నాడే కానీ మనసంతా తన నోట వెలువడిన మాటల మీదే ఉంది. బ్రహ్మ ఆయన పరధ్యానాన్ని గమనించి చిరునవ్వు నవ్వాడు. “నీ నోట వెలువడింది శ్లోకమే. ఈ ఛందస్సులోనే నువ్వు రామాయణం చెప్పు” అన్నాడు. వాల్మీకి రామాయణం చెప్పాలని సంకల్పించుకున్నాడు. అయితే, ఇంకొక చింత ఆయనను వేధించడం ప్రారంభించింది. దీనిని కంఠస్థం చేసి ఎవరు మధురంగా గానం చేస్తారనుకున్నాడు. అంతలో ఆశ్రమంలోనే ఉంటున్న కుశలవులు ఆయనను దర్శించుకున్నారు. వారిని చూడగానే వాల్మీకి చింత తీరింది. వీరే తన రామాయణ గానానికి అర్హులనుకున్నాడు. కుశలవులు రామాయణం నేర్చుకున్నారు. వీధులలో, రాజమార్గాలలో తిరుగుతూ దానిని గానం చేయడం ప్రారంభించారు.

కవిత్వం పుట్టుక గురించీ, అది కలిగించే సంభ్రమాశ్చర్యాల గురించీ చెప్పే ఈ ఘట్టంలో చెప్పుకోవలసిన విశేషాలు అనేకం ఉన్నాయి. మరో సందర్భానికి వాటిని వాయిదా వేసి ప్రస్తుతానికి వద్దాం. వాల్మీకి రామాయణం ‘రాశా’డన్న మాట మూలంలో ఎక్కడా లేదు. ఆయన రామాయణం ‘చెప్పాడు’, లేదా ‘చేశాడు’. శిష్యులు ఆయన చెప్పిన శ్లోకాన్ని రాసుకోలేదు, కంఠస్థం చేశారు. రామాయణం చెప్పడం పూర్తి అయిన తర్వాత దీనిని ఎవరు ‘కంఠస్థం చేసి గానం చేస్తా’రనే వాల్మీకి అనుకున్నాడు. కుశలవులు దానిని కంఠస్థం చేసి గానం చేయడం ప్రారంభించారు. విచిత్రం ఏమిటంటే, నేను చూసిన రామాయణ ప్రతిలో తెలుగు తాత్పర్యం కూర్చిన పండితుడు, వాల్మీకి రామాయణం చెప్పాడు, చేశాడు అని ఉన్న ప్రతిచోటా ‘రచించాడు’ అనే మాట ఉపయోగించారు!

కాలం మన ఆలోచనలను, అలవాట్లను ఎలా నియంత్రిస్తుందో గ్రహించడానికి ఇదొక ఉదాహరణ. అంతేకాదు, మన చరిత్రశూన్యతకూ నిదర్శనం. లిఖితసంప్రదాయం చివరికి సంప్రదాయ పండితులలో కూడా ఎంత అలవాటుగా  జీర్ణించుకుపోయిందంటే, ఒకప్పుడు మౌఖిక సంప్రదాయం ఉండేదనీ; వ్యాసవాల్మీకులు మౌఖిక సంప్రదాయానికి చెందినవారనే స్ఫురణ వారికీ లేదు.

భారతీయులు, గ్రీకులు, ఆఫ్రికన్లు అనే తేడా లేకుండా ప్రాచీన కవి, కథకులందరూ కవిత్వం లేదా కథ చెప్పారు, రాయలేదు. తమ కవిత్వం తంత్రీలయబద్ధంగా ఉండాలనుకున్నారు. తాము చెప్పే కథలకు, వీరగాథలకు, వంశచరిత్రలకు తంత్రీలయ నేపథ్యం ఉండేలా చూసుకున్నారు.  ఇంతకీ విషయమేమిటంటే, కుంటా కింటే వంశచరిత్రను చెప్పే గాథికుని గుర్తించి హేలీకి తెలియజేసిన గాంబియా మిత్రులు ఒక హెచ్చరిక కూడా చేశారు: సంగీత నేపథ్యం లేకుండా గాథికులు నోరు విప్పరట! దాంతో హేలీ ఆ ఆఫ్రికన్ వాల్మీకిని కలుసుకోడానికి ముగ్గురు దుబాషీలు, నలుగురు సంగీతకారులతో సహా పద్నాలుగు మందిని వెంటబెట్టుకుని వెళ్ళాడు.

గాంబియాకు వెళ్ళేముందు కన్సాస్ సిటీకి వెళ్ళి కజిన్ జార్జియాను ఓసారి చూసిరమ్మని ఎందుకో అతని మనసు చెప్పింది. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. తను అంతవరకు తెలుసుకున్నవీ, ఇకముందు తెలుసుకోబోయేవీ చెప్పగానే ఆమె సంభ్రమం పట్టలేకపోయింది.  మరోసారి దీవెనలు అందించింది.  గాంబియా చేరుకున్న హేలీ, “గాథికుడు ఏడీ, ఎక్కడ” అని ఆతృతగా మిత్రులను అడిగాడు. వాళ్ళు అతని వైపు వింతగా చూసి, “గాథికుడు ఇక్కడెందుకుంటాడు? ఊళ్ళో ఉంటా”డని చెప్పారు.  హేలీ ఆ ఊరికి ప్రయాణమయ్యాడు.  తను గాంబియా నది మీదుగా వెళ్లాలని నిర్ణయించుకుని ఒక లాంచీని అద్దెకు తీసుకున్నాడు. చుట్టుదారిలో సరకులు చేరవేయడానికి ఒక లారీని, ఒక ల్యాండ్ రోవర్ ను కుదుర్చుకున్నాడు. దుబాషీలు, సంగీతకారులతో సహా పద్నాలుగుమందిని వెంటబెట్టుకున్నాడు. మార్గమధ్యంలో జేమ్స్ ఐలండ్ లో ఆగాడు. అక్కడినుంచే బానిసల ఎగుమతి జరుగుతూ ఉండేది. దానిపై ఆధిపత్యం కోసం ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు రెండువందల ఏళ్లపాటు ఘర్షణపడ్డాయి. అక్కడి శిథిలాల మధ్య కాసేపు తచ్చాడాడు. ఆనాడు బానిసలను బంధించడానికి ఉపయోగించిన పురాతనమైన గొలుసు అవశేషం లాంటివి  ఏవైనా దొరుకుతాయేమోనని ఆశగా వెతికాడు. ఏదీ దొరకలేదు. చిన్న గచ్చుముక్కను, ఇటుక ముక్కను తీసుకున్నాడు. తిరిగి లాంచీ ఎక్కబోయేముందు, ఎక్కడో అట్లాంటిక్ ఆవల వర్జీనియాలో ఉన్న తన పూర్వీకుడు కుంటా కింటే తన కూతురుకు ‘కాంబీ బొలోంగో’ పేరుతో పరిచయం చేసిన ఆ నదిని ఒకసారి తేరిపార చూశాడు. అక్కడినుంచి అల్ బ్రెడా అనే ఓ చిన్న ఊరికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాలినడకన అంతకంటే చిన్నదైన మరో ఊరు చేరాడు. ఆ ఊరు పేరు జఫూరు. గమనించారో లేదో, జఫూరు అనే మాటలో ‘ఊరు’ ఉంది, అచ్చంగా మన తెలుగు ‘ఊరే’. ఆఫ్రికాలోనే కాక, పశ్చిమాసియాలో కూడా ఊళ్ళ పేర్లలో తెలుగు ‘ఊరు’ కనిపిస్తుంది. దీని గురించి మరోసారి చెప్పుకుందాం.

valmiki

జీవితంలో మరే దశలోనూ అందుకోలేని ‘భావోద్వేగపు పరాకాష్ట’స్థితిని పశ్చిమాఫ్రికాలోని ఆ మారుమూల పల్లెలో తను గడిపిన తొలిరోజున అందుకున్నానని హేలీ అంటాడు.

జఫూరుకు వాళ్ళు కనుచూపు మేరలో ఉండగానే బయట ఆడుకుంటున్న పిల్లలు చూసి  పెద్దవాళ్ళకు చెప్పారు. అంతా బిలబిల్లాడుతూ పూరి గుడిసెల్లోంచి బయటకు వచ్చారు. ఆ ఊరి జనాభా 70 మందిని మించి ఉండదు. ఎన్నో మారుమూల గ్రామాల్లానే ఈ ఊరు కూడా రెండు శతాబ్దాల క్రితం ఎలా ఉందో అలాగే ఉంది. అన్నీ మట్టితో నిర్మించిన గుండ్రటి పూరిళ్ళు. కప్పులు గోపురాకారంలో ఉన్నాయి.  జనం అంతా ఒక వృద్ధుని చుట్టూ చేరడం ప్రారంభించారు. ఆ వృద్ధుడిది చిన్నపాటి ఆకారం. తెల్లని అంగరఖా వేసుకున్నాడు. నెత్తిన ఒక పెట్టె లాంటి టోపీ పెట్టుకున్నాడు. చూడగానే ‘ఒక ముఖ్యమైన వ్యక్తి’ అనే భావన కలిగించేలా ఉన్నాడు.

తను ఎవరిని కలసుకోడానికీ, ఎవరిని వినడానికీ ఆ ఊరు వచ్చాడో ఆయనే ఈయన అని హేలీకి దుబాషీలు చెప్పారు. ఆయనే గాథికుడు కెబ్బా కంజీ పొఫానా!

దుబాషీలు ఆయనతో మాట్లాడుతుండగా, జనం గుర్రపు నాడా ఆకారంలో హేలీకి దగ్గరగా నిలబడి ఆసక్తిగా అతనినే గుచ్చి గుచ్చి చూస్తున్నారు. ఒక అమెరికన్ నల్లజాతీయుని చూడడం వారికి ఇదే మొదటిసారి. ఆ కారు నలుపు మనుషుల మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే తన గోధుమవర్ణాన్ని తలచుకుని హేలీ సిగ్గుపడ్డాడు. కాసేపటి తర్వాత జనాన్ని దాటుకుంటూ ఆ వృద్ధుడు హేలీని సమీపించాడు. అతని ముఖంలోకి నిశితంగా చూశాడు. నా మాండింకా భాష నీకు అర్థమవుతుందా అన్న ప్రశ్న ఆ చూపుల్లో కనిపించింది. తర్వాత అతనికి ఎదురుగా కూర్చున్నాడు.

శతాబ్దాలుగా, తాతముత్తాతల కాలం నుంచీ మౌఖికంగా జాలువారుతున్న కింటే వంశ చరిత్రను చెప్పడం ప్రారంభించాడు. అది కేవలం సంభాషణ రూపంలో లేదు. తాళపత్రాలను చదువుతున్నట్టు ఉంది. జనం నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. గాథికుడు మధ్య మధ్య ఛాతీనుంచి ముందుకు వంగుతున్నాడు. మిగతా దేహం స్థాణువులా ఉండిపోయింది. కంఠనాళాలు ఉబ్బి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు వాక్యాల తర్వాత దుబాషీలకు అవకాశమిస్తూ వెనక్కి వాలుతున్నాడు. ఆయన మాటలు దాదాపు భౌతిక వస్తువులను రూపుకడుతున్నాయి. సంక్లిష్టమైన కింటే వంశచరిత్ర ఆయన నోటినుంచి అలవోకగా ప్రవహిస్తోంది. ఎవరు ఎవరిని పెళ్లాడారు, వారి పిల్లలు ఎవరు, వారు ఎవరిని పెళ్లాడారు, వారి పిల్లలు ఎవరు…

తన చెవులను తనే నమ్మలేనట్టుగా హేలీ అప్రతిభుడవుతున్నాడు. గాథికుని నోట దొర్లే విస్తారమైన వివరాలే కాదు, ఆయన శైలి కూడా బైబిల్ శైలిని తలపిస్తోంది.

మిగతా కథ తర్వాత…

 

 

అమ్మమ్మలు బతికించిన చరిత్ర

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నలుగురు కూచుని నవ్వే వేళల, నా పేరొకపరి తలవండి’ 

గుర్తొచ్చిన ప్రతిసారీ ఈ పంక్తి మాటల కందని మహా విషాదాన్ని మోస్తున్నట్టు, ఆ విషాదాన్ని చుక్క చుక్కలుగా మన గుండెల్లోకి జార్చుతున్నట్టు అనిపిస్తుంది. లోపల ఎక్కడో కలుక్కుమంటుంది. గురజాడవారి పూర్ణమ్మ కథలోని పంక్తి ఇది. తనను ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నందుకు మనస్తాపం చెందిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. దుర్గగుడికి వెళ్ళే నెపంతో బయలుదేరుతూ తోబుట్టువులను చుట్టూ కూర్చోబెట్టుకుని అప్పగింతలు చెబుతుంది. ఆ సందర్భంలో పై మాట అంటుంది.

ఏళ్ల తరబడి మన మధ్య గడిపిన రక్తబంధువులు హఠాత్తుగా తిరిగిరాని లోకాలకు తరలిపోయి కనుమరుగు కావడం ఆదిమదశనుంచీ మనిషిలో విషాదాన్ని గిలకొట్టుతూనే వచ్చింది. వారి స్మృతిని సజీవం, చిరంజీవం చేసే ఆలోచనలు అప్పుడే పుట్టాయి. అందులో భాగంగానే పితృదేవతలు అనే భావనా, పితృకర్మలూ విశ్వాసంలో భాగమయ్యాయి. ప్రపంచ పురాణగాథల కెక్కాయి. రక్తబంధువులందరూ ఏకశరీరంగా జీవించిన గణసమాజంలో ఈ విషాదవిశ్వాసాలు మరింత బలీయంగా ఉంటాయి. లిపి ఏర్పడని, లేదా లిఖిత సంప్రదాయం వేళ్లూనుకోని కాలంలో గణబంధువుల జ్ఞాపకాలను, చరిత్రను తరం నుంచి తరానికి అందించే బాధ్యతను మనిషి గళమే నిర్వహించింది. అలా అందించడం ఒక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. ఇది ఏ ఒక్కచోటో కాదు, ప్రపంచమంతటా జరిగింది.

పైన పేర్కొన్న గురజాడ పంక్తిలోని విషాదం గణహృదయపు లోతుల్లోంచి పలుకుతున్న విషాదంలా నాకు అనిపిస్తూ ఉంటుంది. గణసమాజపు నుడికారం గురజాడ రచనల్లో ఎక్కువగా కనిపిస్తుందని  రాంభట్ల కృష్ణమూర్తి అనేవారు. కన్యాశుల్కం నుంచి అనేక ఉదాహరణలు ఎత్తి చూపేవారు.

అదలా ఉంచి ప్రస్తుతానికి వస్తే, నలుగురూ కూర్చుని తమ పూర్వీకులను స్మరించుకునే గణ సంప్రదాయం రూట్స్ రచనలో రెండువందల ఏళ్ల క్రితం నాటి వంశ మూలాలను, మూలస్థానాన్ని కనిపెట్టే ఉత్కంఠభరిత ప్రయత్నానికి దారితీయించింది. స్థూలంగా కథ ఇదీ:  కుంటా కింటే అనే నల్లజాతి యువకుడు పశ్చిమ ఆఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందినవాడు.  అతడు ఓ రోజున గిటార్ లాంటి వాయిద్యాన్ని తయారుచేసుకోడానికి కలప కోసం అడవికి వెళ్ళాడు. హఠాత్తుగా కొంతమంది అతనిపై దాడి చేసి వలేసి పట్టుకుని గొలుసులతో బంధించి ఓడలో అట్లాంటిక్ మీదుగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి తీసుకుపోయారు. అక్కడ మాసా జాన్ వేలర్ అనే తోటల యజమానికి బానిసగా  అమ్మేశారు. అతను కుంటా కింటేకు టోబీ అని పేరుపెట్టాడు. కుంటా కింటే తప్పించుకుని పారిపోవడానికి నాలుగుసార్లు విఫల యత్నం చేశాడు. అతనింక ఆ ప్రయత్నం చేయకుండా ఒక పాదాన్ని నరికేసారు. వైద్యవృత్తిలో ఉన్న వేలర్ సోదరుడు విలియం వేలర్ కొంత మానవత్వం ఉన్నవాడు. అతడు సోదరుడి చర్యను గర్హిస్తూ కుంటా కింటేకు వైద్యం చేసి అతడి ప్రాణాలు కాపాడాడు. సోదరునినుంచి తనే అతణ్ణి కొనుక్కుని గుర్రపు బండి నడపడానికి నియోగించాడు. తను ఏ విధంగానూ తన జన్మస్థానానికి వెళ్లలేనని గ్రహించిన కింటే పరాయి నేలలో ప్రవాసజీవితంతో క్రమంగా రాజీపడ్డాడు.

విలియం ఇంట్లో వంటమనిషిగా ఉన్న మరో బానిస బెల్ ను అతను పెళ్లి చేసుకున్నాడు. వారికి కూతురు పుట్టింది. ఆమెకు కిజ్జీ అని పేరుపెట్టారు. ఆమెకు వయసు వచ్చాక  మాసా లీ అనే మరో బానిస యజమానికి విలియం అమ్మేశాడు. మాసా లీ బలాత్కారంగా తనను అనుభవించడంతో కిజ్జీ గర్భవతి అయింది. ఆమెకు కొడుకు పుట్టాడు. అతని పేరు చికెన్ జార్జి. అతను పెరిగి పెద్దయ్యాక మటిల్డా అనే మరో బానిసను పెళ్లిచేసుకున్నాడు. అతని మూడో కొడుకు టామ్. అతనికి ఇరేన్ అనే అమ్మాయితో పెళ్లయింది. వారి కుమార్తెలలో ఒకరైన సింథియాకు విల్ పామర్ అనే అతనితో  వివాహం జరిగింది. వారి కూతురు బెర్తా, సైమన్ అలెగ్జాండర్ హేలీ అనే అతన్ని పెళ్లిచేసుకుంది. వారి కొడుకే రూట్స్ రచయిత ఎలెక్స్ హేలీ. కుంటా కింటేనుంచి అతనిది ఏడో తరం.

ఏడువందల పుటల ఉద్గ్రంథంలోని కథను పది పదిహేను వాక్యాలలో సంక్షేపించడం నిజానికి ఆ రచనకు తీరని అన్యాయం చేయడమే. సొంత మూలాలనుంచి వేరుపడి ఒక మహా సముద్రానికి ఆవల తమది కాని నేలపై తమది కాని భాషా సంస్కృతుల మధ్య బానిసజీవితం గడిపిన ఒక జాతి దుఃఖ విషాదాలకు అద్దంపట్టే రూట్స్ కు ఒక ఇతిహాసానికి ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి. రెండువందల ఏళ్ళకు విస్తరించిన ఆ కథాగమనంలో అనేక మలుపులున్నాయి, మెరుపులున్నాయి. కరుణ భీభత్స భయానకాది రసాలను ఆవిష్కరించే ఘట్టాలు ఉన్నాయి.  సొంత అస్తిత్వాన్ని కోల్పోయి పరాయి అస్తిత్వంలో అనామకంగా కలిసిపోయిన ఒక జాతి పరిణామచరిత్ర ఉంది. మనిషిని పశువుగా, ఆస్తిగా పరిగణించి అతని పేగు బంధాన్ని నిర్దాక్షిణ్యంగా తెంచేసి ఇంకొకరికి అమ్మేసే బానిసవ్యవస్థలో చివరికి యజమానికీ బానిసకూ ఉన్న రక్తసంబంధాన్ని కూడా కాలరాసే కర్కశత్వం ఎంతగా రూపుకట్టిందో రూట్స్ చెబుతుంది. విచిత్రమేమిటంటే, దీని సామ్యాలు బానిసత్వం లేదా అర్థ బానిసత్వం కొనసాగిన మనదేశంతో సహా అనేక దేశాల బానిసవ్యవస్థలలో ఉన్నాయి. ఆసక్తికరమైన ఆ చర్చను మరో సందర్భానికి వాయిదా వేసి ప్రస్తుతానికి వద్దాం.

యజమాని పెట్టిన పెట్టుడు పేరును నిరాకరించిన కుంటా కింటే తన ఆఫ్రికన్ వారసత్వాన్ని కూతురు కిజ్జీకి అందించడానికి ప్రయత్నిస్తాడు. తన పేరుతోపాటు కొన్ని ఆఫ్రికన్ పదాలను ఆమెకు నేర్పుతాడు. ఉదాహరణకు, వర్జీనియాలో ప్రవహించే మట్టపోని అనే నదిని చూపించి ‘కాంబీ బొలోంగో’ అంటాడు. గిటార్ లాంటి ఒక వాయిద్యాన్ని చూపించి ‘కో’ అంటాడు. ఆ మాటలు రెండువందల ఏళ్లపాటు తరం నుంచి తరానికి అందుతూ ఉంటాయి. కిజ్జీ తన కొడుకు చికెన్ జార్జికి తాత, అమ్మమ్మల పేర్లు; తండ్రి తనకు చెప్పిన ఆఫ్రికన్ పదాలు అందిస్తుంది. తమ కుటుంబంలో బిడ్డ పుట్టిన ప్రతిసారీ కుటుంబ సభ్యులందరూ కూర్చుని కుంటా కింటేను, ఆ వంశం లోని మిగిలినవారిని తలచుకోవడం;  కుంటా కింటే అందించిన ఆఫ్రికన్ పదాలను గుర్తుచేసుకోవడం ఒక ఆనవాయితీగా మారుతుంది. ఇవే పేర్లు, పదాలు ఏడో తరానికి చెందిన రచయిత హేలీకి కూడా అందుతాయి. చిన్నప్పుడు టెన్నేస్సీ రాష్ట్రంలోని హెమ్మింగ్ పట్టణంలో తమ ఇంటి వసారాలో కూర్చుని అమ్మమ్మ సింథియా, మరికొందరు స్త్రీలు చెప్పుకునే  ముచ్చట్లనుంచి ప్రవహించిన ఆ పదాలు అతడు పెద్దయిన తర్వాత కూడా గుర్తుండిపోయాయి.

roots-vol-i-DVDcover

హేలీ తన పదిహేడో ఏట, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యు.ఎస్. తీర రక్షక దళంలో వంటశాలలో సహాయకుడిగా  నియమితుడయ్యాడు. ఓడలో ప్రయాణించేటప్పుడు తీరిక సమయంలో రచనాభ్యాసం చేస్తూ క్రమంగా రచయితగా మారాడు. ఇరవయ్యేళ్ల తర్వాత ఉద్యోగం మానేసి రచననే పూర్తికాలవృత్తిగా చేసుకున్నాడు. రీడర్స్ డైజెస్ట్ లాంటి మ్యాగజైన్లు అతనికి రాత పనులు అప్పగించాయి. అలాంటి సందర్భంలోనే అతనొకసారి లండన్ వెళ్ళాడు. అక్కడ ప్రతిచోటా కనిపించే చారిత్రక సంపద చూసి ముగ్ధుడయ్యాడు. ఒక రోజు బ్రిటిష్ మ్యూజియంకు వెళ్ళి అక్కడ ‘రొసెట్టా శిల’ ను చూశాడు. ఎందుకో అది నా కళ్లను కట్టి పడేసిందని అతను అంటాడు. అప్పటికప్పుడు మ్యూజియం లైబ్రరీలో దాని గురించి రాసిన పుస్తకం సంపాదించి చదివేశాడు.

ఈజిప్టులో నైలు నదీతీరంలో దొరికిన ఆ శిలపై మూడు వేర్వేరు లిపుల్లో చెక్కిన అక్షరాలు ఉన్నాయి. మొదటివి తెలిసిన గ్రీకు అక్షరాలు . రెండోవి ఒక అజ్ఞాతలిపిలో ఉన్నాయి. మూడోవి ప్రాచీన చిత్రలిపిలో ఉన్నాయి. జీన్ చంపోలియన్  అనే ఒక ఫ్రెంచి పండితుడు తెలిసిన గ్రీకు అక్షరాలతో మిగతా రెండు లిపుల్లోని ఒక్కొక్క అక్షరాన్నే పోల్చి చూసి ఆ మూడు  రకాల అక్షరాలూ ఒకే విషయం చెబుతున్నాయని తేల్చాడు. ఆవిధంగా మానవాళి పురాతన చరిత్రను నమోదు చేసిన చిత్రలిపిని అతను ఛేదించగలిగాడు.

అలా గతం తలుపులు తెరచిన ఆ తాళంచెవి తనను మంత్రముగ్ధం చేసిందనీ, దాంతో తనకు ప్రత్యేక వ్యక్తిగత సంబంధం ఏదో ఉన్నట్టు అనిపించిందనీ, అయితే ఆక్షణంలో అది ఎలాంటిదో పోల్చుకోలేకపోయాననీ హేలీ  అంటాడు. న్యూయార్క్ కు తిరిగివెడుతూ విమానంలో కూర్చుని ఉండగా అతనికి ఒక ఊహ తట్టింది. ఆ ఫ్రెంచి పండితుడు, తెలిసిన గ్రీకు అక్షరాల సాయంతో ఛేదించిన ఆ అజ్ఞాత లిపులకూ; తన చిన్నప్పుడు హెన్నింగ్ లో తమ ఇంటి వసారాలో కూర్చుని అమ్మమ్మ సింథియా, మిగతా ఆడవాళ్ళు చెప్పుకున్న మౌఖికచరిత్రనుంచి దొర్లిన విచిత్ర, అజ్ఞాత ఆఫ్రికన్ పదాలకూ చూచాయగా ఏదో పోలిక కుదిరిందనిపించింది. వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. విమానం న్యూయార్క్ లో దిగబోతూ గాలిలో చక్కర్లు కొడుతున్న సమయానికి ఆ ఆలోచనలకు ఒక స్పష్టత వచ్చింది.   ఆ పదాలు నిర్దిష్టంగా ఏ ఆఫ్రికన్ భాషకు చెందినవి, ఆ భాషను కనిపెట్టగలమా అన్న ప్రశ్నలు అతని ముందు వేళ్లాడసాగాయి.

అక్కడినుంచి హేలీ చేసిన ప్రయత్నాలు అడుగడుగునా ఆసక్తిరేపే అపరాధపరిశోధక నవలను తలపిస్తాయి. చివరికి తన పూర్వీకుడు కుంటా కింటే జన్మస్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, రెండువందల ఏళ్లక్రితం ఆగిపోయిన అతని పూర్వచరిత్రను ఒక గాథికుని నోట ప్రత్యక్షంగా వినడం ఈ ఉత్కంఠభరిత గాథలో పతాక సన్నివేశం. దాని గురించి తర్వాత.

–కల్లూరి భాస్కరం

 

 

 

తాత ముత్తాత పేరేమిటి?!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

తాత ముత్తాత పేరేమిటి?!

మీ తాత ముత్తాత పేరేమిటి?!

మీ వంశవృక్షం గురించి మీకు ఎంత తెలుసో పరీక్షించడం కోసం ఈ ప్రశ్న వేశానని దయచేసి అపార్థం చేసుకోకండి. మా తాత ముత్తాత(అంటే మా తాతగారి ముత్తాత అన్నమాట) పేరు నాకు తెలియదని చెప్పడానికే ఇలా ప్రారంభించాను. నాలానే ఈ దేశంలో చాలామందికి తాత ముత్తాత పేరు తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. తన పుట్టినతేదీ ఏమిటో చెప్పలేని వాళ్ళు కూడా ఈ దేశంలో చాలామందే ఉన్నారు. బహుశా మీకు కూడా అలాంటివారు తారసపడే ఉంటారు.

మా తాత ముత్తాత పేరు నాకు తెలియదన్న వాస్తవం గుర్తొస్తే  సిగ్గుతో చితికి పోతూ ఉంటాను.  ఈ దేశం వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం ఉన్న ఒక గొప్ప దేశమనీ; ఈ సంపదకు నేను వారసుడిననే భావన  ఆ క్షణాలలో ఒక పెద్ద మిథ్యగా నాకు అనిపిస్తుంది. ఈ దేశం నాకు ఏదీ కానట్టు, వేళ్ళు తెగిపోయిన ఒక చెట్టులా నేను శూన్యంలో వేలాడుతున్నట్టు అనిపిస్తుంది. తాత ముత్తాత పేరు (అంటే కనీసం అయిదు తరాలు) కూడా తెలియని వాళ్ళం  ఈ దేశం నాదని ఎలా గర్విస్తామో, వేల సంవత్సరాల ఈ దేశ గతంపై హక్కు ఎలా చాటుకుంటామో నాకు అర్థం కాదు.

ఈ నేల అనే చెట్టుతో మన బతుకులనే తీగలు గాఢంగా అల్లుకున్నాయనడానికి తాత ముత్తాత పేరు తెలియడం ఒక సాక్ష్యం అని నేను భావిస్తాను.

అదృష్టం కొద్దీ మనకు మన తాత పేరు, ముత్తాత పేరు తల్లిదండ్రుల ద్వారా తెలుస్తాయి. ఆపైన తద్దినం తంతు వారి పేర్లను విధిగా గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అయితే, మన తాత ముత్తాత ఎవరో అదీ చెప్పదు. తద్దినంలో మనం ముగ్గురికే పిండప్రదానం చేస్తాం. తండ్రి-తాత-ముత్తాత. అలాగే, తల్లి-నాయనమ్మ-ముత్త నాయనమ్మ. తండ్రిని వసురూపంలో, తాతను రుద్ర రూపంలో, ముత్తాతను ఆదిత్యరూపంలో తద్దినం మంత్రాలు పేర్కొంటాయి. పద్ధతిగా తద్దినాలు పెట్టని  కులాలలో, కుటుంబాలలో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటే తప్ప తాత ముత్తాతల పేర్లు కూడా గుర్తుండే అవకాశం లేదు.

మా తాతగారి గురించి నాకు కొంత తెలుసు. అది కూడా స్పష్టాస్పష్టంగా. ఆయన మంచి రంగులో ఉండేవాడట. మేము వైదికులమైనా మాకు కరణీకం ఉండేది. మా తాతగారు హాస్యప్రియుడు. కొంటె కోణంగి అనేవారు. ఇంటిముందు ప్రత్యేకంగా నిర్మించిన కచేరీ సావిట్లో కూర్చుని వీధిలో వచ్చి పోయేవారిని ఆట పట్టిస్తూ, వాళ్ళకీ వీళ్ళకీ ముడులు పెడుతూ ఉండేవాడట. ఆయన రసికత గురించి కూడా చాలా కథలున్నాయి. ఆయన చనిపోయేనాటికి మా నాన్నగారి వయసు పన్నెండేళ్లే.  ఎప్పుడైనా వాళ్ళ నాన్న గురించి ఆయన గొప్పగా చెప్పడం ప్రారంభిస్తే మా అమ్మ అడ్డు తగిలి ఆయన రసికపురాణం గుంభనంగా విప్పుతూ ఉండేది. ఆయన  వడ్డిగూడెం ‘పరిచయాలు’ ప్రస్తావనకు వస్తుండేవి. మా తాతగారు మా పక్క ఊళ్ళో ఒకామెచేత  ‘సంతానవ్రతం’ చేయిస్తే ఆమెకు సంతానం కలిగిన సంగతిని నర్మగర్భంగా చెప్పి మా అమ్మ ఆట పట్టిస్తూ ఉండేది. నాన్నగారు ముసి ముసి నవ్వులతోనే చికాకు ప్రదర్శిస్తూ సంభాషణకు తెరదించేవారు.

విశేషమేమిటంటే, చిన్నప్పుడు ఏమీ అర్థంకాని వయసునుంఛీ అమ్మ నోట వింటూ వచ్చిన ఆ పేరుగల మనిషిని పెద్దయ్యాక నేను చూసే అవకాశం కలగడం! ఏదో పని మీద ఆ ఊరికి వెళ్లినప్పుడు ఆ ఇంటికి వెళ్ళాను. తొంభై ఏళ్ళు దాటిన వయసులో ఆమె మంచం మీద ఉంది. నేను ఫలానా అని చెప్పేసరికి ఆమె కళ్ళల్లో ఏదో వెలుగు  తళుక్కుమంది. నా చెయ్యి అందుకుని మంచం మీద తన పక్కన కూర్చొబెట్టుకుంది. కన్నీళ్ళు పెట్టుకుంటూ మా నాన్న గురింఛీ, బాబయ్యల గురించీ పేరు పేరునా అడిగింది. ఏ నాటి జ్ఞాపకాలు కన్నీళ్ళ రూపంలో అలా ఉబికి వచ్చాయోనని ఆ దృశ్యం గుర్తొచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది.

భమిడిపాటి కామేశ్వర రావు గారు

భమిడిపాటి కామేశ్వర రావు గారు

మా తాతగారికి  హాస్యప్రవృత్తి  ఎవరి నుంచి సంక్రమించిందో, దాని వెనుక నున్న జన్యుచరిత్ర  ఏమిటో నాకు తెలియదు. ఆ జన్యు లక్షణమే హాస్యబ్రహ్మ బిరుదుతో భమిడిపాటి కామేశ్వరరావు అనే రచయితను సృష్టించిందని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. భమిడిపాటి కామేశ్వరరావుగారి తల్లి మన ఇంటి ఆడబడుచు అని నాన్నగారు చెబుతుండేవారు. నా చిన్నప్పుడు భమిడిపాటి కామేశ్వరరావుగారి భార్యకూ మా నాన్నగారికి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవని జ్ఞాపకం. మా నాన్నగారు ఆకివీడు(పశ్చిమ గోదావరి జిల్లా)వెళ్లినప్పుడు ఆమెను చూసి వస్తూ ఉండేవారు. కామేశ్వరరావు గారి కొడుకు, ప్రసిద్ధ నాటక, సినీ రచయిత రాధాకృష్ణ.  మా నాన్న, బాబయ్య ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెడితే నెత్తిన పెట్టుకునేవాడు. ఆయనకు జ్యోతిష్యంలో ప్రవేశం ఉండేది. జాతకచక్రాలు వేసి ఇచ్చేవాడు. ఆయనకు మా కుటుంబంతో వియ్యమందాలని ఉండేది. కానీ ఎందుకో అది సాధ్యపడలేదు.

మళ్ళీ రాధాకృష్ణగారికీ హాస్యవారసత్వం ఉంది. ఆయన రాసిన ‘కీర్తిశేషులు’ నాటకంలో కవిగారి అన్న, తాగుబోతు అయిన మురారికీ; గంప శంకరయ్య అనే పాత్రకూ మధ్య జరిగిన ఒక సంభాషణ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే హాస్యగుళిక. గంప శంకరయ్య కవికి సన్మానం చేస్తానంటూ వస్తాడు. మక్కికి మక్కి కాకపోయినా ఆ సంభాషణ మొత్తంమీద ఇలా సాగుతుంది:

మురారి: ఓహో, అలాగా! అయితే, మీది సన్మానాల వ్యాపారం అన్నమాట?

గంప శంకరయ్య: భలేవారండీ. నాకు పొలం పుట్రా గొడ్డు గోదే ఉన్నాయండీ!

మురారి: అయితే ఇంకేం, బాగా లాభాలు గడించారన్నమాట!

ఇక మా ముత్తాతగారి గురించి ఒకే ఒక్క విషయం తప్ప ఇంకేమీ తెలియదు. మా అమ్మగారి తండ్రి కూడా మా ఇంటి మరో ఆడబడుచు కొడుకు. వారిది నిడదవోలు దగ్గర పురుషోత్తపల్లి. ఇంటిపేరు ఈమనివారు. మా అమ్మ తండ్రి కడుపులో ఉన్నప్పుడు మా ముత్తాతగారు పురిటిమంచం నెత్తిన పెట్టుకుని పొద్దుటే చీకటితోనే మా ఊరు ప్రక్కిలంకలో బయలుదేరి గోదావరి గట్టు వెంబడే కొవ్వూరు, వాడపల్లి, మద్దూరు మీదుగా మధ్యాహ్నానికి పురుషోత్తపల్లి చేరుకున్నారట. దాదాపు నలభై కిలోమీటర్ల దూరం.  ఆయన మోసుకెళ్లింది నిజానికి పురిటి మంచం కాదు, దాదాపు ప్రపంచవ్యాప్తంగా వేల సంవత్సరాలు కొనసాగిన గణవ్యవస్థా వారసత్వం. గణవ్యవస్థలో  స్త్రీ పోషణ, బాగోగుల బాధ్యత భర్తది కాదు; పుట్టింటిది, అంటే అన్నదమ్ములది.

బహుశా తన నాయనమ్మ నుంచి మా అమ్మకీ హాస్యజన్యువు సంక్రమించినట్టుంది. ఆమెలోనూ హాస్యధోరణి ఉండేది. మొత్తంమీద మా ఇంట్లో ఆడా, మగా అందరికీ హాస్యం జీవలక్షణంగా మారింది.

మా ముత్తాతనుంచి ఇంకా వెనక్కి వెడితే అంతా శూన్యం. ఎవరి గురించీ ఏమీ తెలియదు. ఎంత చరిత్ర, ఎన్ని విశేషాలు, ఎన్ని ఆకర్షణీయ వ్యక్తిత్వాలు కాలగర్భంలో సమాధి అయిపోయాయో తెలియదు. తాత, ముత్తాతల గురించి తెలిసింది కూడా అంతంత మాత్రమే. ఇలా నా వంశ చరిత్రాశూన్యత నిలువునా వెక్కిరిస్తూ నాలో ఒక శూన్యాన్ని నింపిన ఘడియల్లో ఈ దేశం గురించీ, ఈ దేశ వారసత్వం గురించీ చెప్పే గొప్ప గొప్ప మాటలన్నీ నాకు అబద్ధాలుగా ధ్వనిస్తాయి. అఘాయిత్యాలుగా తోస్తాయి.

రెండు తరాల చరిత్ర కూడా తెలియని మన చారిత్రకదారిద్ర్యం అలా ఉండగా, ఒక ఆఫ్రో-అమెరికన్ రచయిత కొన్ని ప్రత్యేకపరిస్థితులలో తన వంశమూలాలు వెతుక్కుంటూ వెళ్ళి ఒక అత్యద్భుత గ్రంథాన్ని రచించాడు. అతని పేరు ఎలెక్స్ హేలీ. ఆ పుస్తకం పేరు ‘రూట్స్’. తెలుగులో సహవాసి అనువాదంతో ‘ఏడు తరాలు’ పేరుతో వెలువడిన ఆ రచన పాఠకులకు సుపరిచితమే. తెలిసిన రచనే అయినా దాని గురించి నేను ప్రస్తావించడానికి నా అధ్యయన సంబంధమైన ప్రత్యేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత.

 – కల్లూరి భాస్కరం