చుక్కల వెలుగులో కాంతి బాట!

konni sephalikalu

దాదాపు పాతికేళ్ళు అయిందనుకుంటాను. అయినా ‘రష్యన్ గాల్యా’ మేజర్ మూర్తిని వదలనట్టే మేజర్ దక్షిణా మూర్తీ నన్ను  వదలలేదు.  ఈ పాతికేళ్ళుగా చాలా సందర్భాల్లో నా వెనకే ఉన్నాడు.  మనుషుల మితిమీరిన స్వార్ధాన్ని, లౌక్యాన్ని, దొంగ వేషాలని చూసి నేను క్రోధంతో ఊగి పోయినప్పుడు ‘గాల్యా’ తో పాటుగా నన్ను సాంత్వన పరచాడు.

అవును. సాహిత్యం, మనం దాన్ని నిజాయితీగా, శ్రద్ధగా తీసుకోవాలే గాని మనని ఎంతయినా మార్చగలదు.  స్థిమితపరచగలదు.  ఒక్క సాహిత్యమేనా ? ఏ కళారూపమయినా అది నిజమయిన కళారూపమయితే ఆ పని చెయ్యగలదు.  దాన్ని నిరూపించడానికే ఈ రష్యన్ అమ్మాయి గాల్యా కథతో ముడిపడిన మేజర్ మూర్తి కథను మళ్ళీ మళ్ళీ తల్చుకోవాలనుంది.

ఆర్టిలరీ రెజిమెంటు అంటే ఫిరంగి దళం. అక్కడ పెద్ద పెద్ద వృక్షాల మధ్య రాబర్ట్ క్లైవ్ కాలం నాటి సున్నపు స్తంభాలున్న భవనం ఆఫీసర్స్ మెస్.  రకరకాల ఉద్యోగుల రకరకాల హాబీల మధ్య తెల్లటి షర్టు మీద మట్టి మరకలతో ఉన్న మేజర్ మూర్తిని పరిచయం చేస్తాడు రచయిత.  మేజర్ మూర్తి మంచి ఆటగాడు.  మెస్ సెక్రటరీ, రెజిమెంటల్ ఫిల్మ్ క్లబ్ కు సెక్రటరీ, ఇంకా లైబ్రరీ పుస్తకాల పురుగుగా బుక్ వర్మ్.

ఒకనాటి డిన్నర్ తర్వాత జరిగిన ఫిల్మ్ షోలో సబ్ టైటిల్స్ ఉన్న రష్యన్ పిక్చర్ తెప్పించి వేయించాడు కెప్టన్ దేవగుణ్.  ఆర్ట్ ఫిల్మ్ అంటే మూర్తికీ ఇష్టమే.రష్యన్ ఫిల్మ్ అద్భుతంగా ఉంది.  వంద నిముషాల సినిమా.  ‘వేరా పనోవా’ కథ.  కథ, నటన, ఛాయా గ్రహణం అద్భుతం అన్నారందరూ.  అందులో మూర్తి తనను చూసుకున్నాడు.  సినిమాలో ప్రధాన పాత్ర గాల్యా ‘యువతి’ కాకపోతే కథలో చాలా ఘట్టాలు తనవే అనుకున్నాడు.

ఇది మునిపల్లె రాజుగారి ‘సవతి తమ్ముడు’ కథ. జీవితానుభవాల లోంచి తాత్వికపులోతులు చూసి ఆ సారాన్ని పెరుగు చిలికి వెన్న తీసి అందించినంత సులువుగా పాఠకులకు అందించిన కథ.

దక్షిణా మూర్తి కి రేజిమెంట్ లో కొన్ని ముద్దు పేర్లున్నాయి.  వాటికి తోడు మిలటరీ హాస్పిటల్ లో ఇంకో నిక్ నేమ్  ఉంది.  మిలటరీ డాక్టర్లు అతన్ని ‘బబుల్స్’ అని పిలుస్తారు.  అతనికి హిందీలో అన్ని ప్రాంతీయ నుడికారాలూ తెలియడం ఒక కారణమైతే, అలా పిలవడానికి మరో ప్రధాన కారణం అతని కుడి కణత మీద మిల్లీ మీటరు లోతున రెండుగాయాల మచ్చలు ఉండడం. అవి అతన్ని జీవితంలో ఎక్కడా ఓడిపోకుండా పోరాడుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేసిన మచ్చలు.

అతని సవతి తల్లి వంట చేస్తూ చేతిలో ఉన్న పట్టకారును బలంగా విసిరితే కుడి కణతకు తగిలి రక్తం కారింది. మూర్ఛ పోయేడు.  మూర్ఛ పోయేముందు ‘నాన్నా అన్నయ్య చచ్చి పోయాడు’ అన్న తమ్ముడి ఆర్తనాదమే జ్ఞాపకం.  తల్లి చనిపోగానే తండ్రి మళ్ళీ పెళ్లి , సవతి తల్లి పెట్టిన బాధలు.  ఆమెకు పుట్టిన కవలలు వెంటనే పోయిన ఆమె బాధ సవతి పిల్లాడి మీద ద్వేషంగా మారింది.

ఆమె పెట్టిన బాధలతో జీవిత యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. కణత మీద దెబ్బ, తరవాత పుట్టిన సవతి తమ్ముడి ఆర్తనాదం కలగాపులగంగా అతని అంతశ్చేతనలో ఉండిపోయి గెలుపుకోసం పోరాటం.

ఇల్లు వదిలి దేశ దిమ్మరి అయ్యాడు.  లెక్కల్లో ఎప్పుడూ ఫస్టే.  జీవితంలో ప్రతి మలుపులోనూ లెక్కల అవసరం తెలుసుకున్నాడు.  అంచెలంచెలు గా ప్రయాణం, ఎక్కడో ఎవరో దయాముర్తుల ఆదరణ.

నారాయణ్ దత్ జోషి ఎందుకు అభిమానించాడో తెలియదు.  చదువు తరవాత జోషి గారి స్నేహితుడి సహాయంతో కంటోన్మెంటు ఆఫీసరుగా ట్రైనింగ్ ఆర్డర్లు, శిక్షణ, ఆరితేరాడు.

“సాహిత్యంతో పరిచయం పెరిగింది.  ఇల్లు లేకపోయినా ఎల్.టి.సి., దేశంతో పరిచయం చేసింది.  కజిరంగా నుంచి కన్యాకుమారి వరకు ప్రకృతి సంపద, శిల్ప సంపద. ఈ భూమిని పురాతన కాలం నుంచీ ప్రభావితం చేసిన చరిత్రనంతా కళ్ళతో చూడడం సైన్యంలో ఉండడం వల్లనే సాధ్యమయింది.

105 ఎం.ఎం. గన్  గాని 130 ఎం.ఎం. భోఫోర్సు గానీ ‘మేజర్ మూర్తి, ఆర్టిలరీ, అతి విశిష్ట సేవా మెడల్ బోర్డు చూడగానే జోహార్లు చేయవలసిందే”  ఇవన్నీ రచయిత మాటలు.  తల్లికి – పద్మాసనంలో ఉండి ప్రాణం వదిలిన తల్లికి- శ్రాద్ధం పెట్టడం కోసం, ఆ అర్హత కోసం జోషీ గారి చేత ఉపనయనం చేయించు కున్నాడు.  అంతే. తండ్రి, సవతి తల్లి, తమ్ముడు ఇల్లూ ఏమీ లేవు.

అంత అందంగా లేని దస్తూరీతో తమ్ముడి నుంచి ఎన్నో ఏళ్ళకి ఉత్తరం.  నాన్న పోయాడని, పొలం వేలం వేసారని, అప్పులు తీరలేదని అమ్మ బాధ పడుతోంది, చెల్లి మళ్ళీ పరీక్ష తప్పిందని, అంతా రాసి తనను యునిఫాం డ్రెస్ లో చూడాలని ఉందని కోరుతూ రాసాడు.

ఆ ఉత్తరం మేజర్ మూర్తిలో ఏ వికారమూ కలిగించ లేదు.  మౌనంగా, ఉత్తరం ముక్క లేకుండా వెయ్యి రూపాయలు డ్రాఫ్ట్ పంపి ఊరుకున్నాడు.  పిన్ని, సవతి తమ్ముడు తను చూడని చెల్లీ ఎవరూ అతని జ్ఞాపంలో లేరు.

రష్యన్ సినిమాలో ‘గాల్యా’ కథ కుడా ఇదే.  సవతి తల్లి బాధల నుంచి స్కూల్ టీచర్ ‘ఎలిజబెత్ ఆండ్రి యేవనా’ అనే దీపం సహాయంతో మాస్కో నగరానికి వచ్చింది.  థియేటర్ స్కూల్ లో చేరి సహజమైన ప్రజ్ఞ, ఉపజ్ఞల సహాయంతో నటిగా ఎదిగింది.  ఉత్తమ పాత్రలు ధరించింది.  పెద్ద జీతం  తీసుకుంటోంది.  ఇష్టం లేకపోయినా వెండి తెరకు కుడా పరిచయమయింది.  స్టేజి ఉత్సవాలలో భాగంగా విదేశాలకు వెళ్లి మూడు నేలల తర్వాత తిరిగి వచ్చి మూడు నెలల క్రిందట  రాసిన చెల్లి ఉత్తరం చూసింది.

దక్షిణా మూర్తి కి అందిన ఉత్తరం లాంటిదే.

గాల్యాకు ఎర్రటి కళ్ళతో భయపెట్టే సవతి తల్లి గుర్తొచ్చింది. తండ్రి మరణం, చివరకు విమానంలో తన ఊరికి బయలుదేరింది.  సవతి తల్లికి, చెల్లెళ్ళకూ చిన్న చిన్న బహుమతులు, తనకు సహాయం చేసిన రిటైరయిన టీచరుకు, ప్రపంచాన్ని చూడడం నేర్పిన పుస్తకాలు అందించిన లైబ్రేరియన్ కు కూడా బహుమతులు తీసుకొంది.

గాల్యా తండ్రిసమాధి ముందు మోకరిల్లింది.  పాత టీచరు ఉంది గాని లైబ్రేరియన్ లేదు.  సవతి తల్లిలో మార్పు లేదు.  బహుమతుల మీదే ఆసక్తి చూపించింది.  చెల్లి తనలాగే అందమైంది.  ఇద్దరూ ఆ రాత్రంతా ఒకే మంచం మీద పడుకుని కబుర్లు చెప్పుకున్నారు. చెల్లి ఎన్నో సంగతులు చెప్పింది.  గాల్యాకు చెల్లెలితో మాటలతో పాత  ద్వేషమంతా కరిగిపోయింది.  కరుడు గట్టిన మొరటు భావాలతో ఉన్న ఈ ఇంట్లో ఆమెను ఉంచకుండా తనతో తీసుకుపోవాలి.  మాస్కోకు తీసుకుపోయి అక్కడే సారస్వతంలో పెద్ద చదువు చదివించి లెక్చరర్ ను చెయ్యాలి.   ఆమె ఇష్టం కుడా అదే కాబట్టి దాన్ని నెరవేర్చాలి.

సినిమా అయిపొయింది గాని మూర్తికి ఆగిపోయిన జీవితం మొదలయింది.  “ఈ రష్యన్ గాల్యా చాలా అసాధ్యురాలు, చాలా ఆలోచనల్ని రేగగొడుతోంది” అనుకున్నాడు.  అంత వరకు జీవితంలో దేశ దిమ్మరిగా మొదలుపెట్టి అనేక సామర్ధ్యాలు  సంపాదించుకుని ఒక ఎత్తైన పీఠం మీద కూర్చున్నాను అనుకున్న మూర్తి జీవితంలో ఓడిపోలేదన్న నినాదంతో ఆత్మవిశ్వాసాన్ని దాని పరిమితినీ, స్థాయినీ దాటి పెరగనిచ్చాడు.  అలాంటి మేజర్ మూర్తి గర్వాన్ని గాల్యా కడిగేసింది.

తన బాల్యాన్ని నలిపి, చిదిమి, చింపి పారేసిన వాళ్ళ మీద ఉన్నకక్ష ఆ ఇంట్లోనే ఉన్న పిల్లల మీద చూపితే ఎలా ?  వాళ్ళు తన చెల్లి, తమ్ముడే కదా అన్న నిష్కల్మష ప్రేమ అతని మనసులో ఉదయించడానికి ‘గాల్యా’ కారణమయింది.

మేజర్ దక్షిణామూర్తి కి ప్రమోషన్ ఆర్డర్స్ వచ్చాయి.  కానీ అతను చార్జి తీసుకోవడానికి హడావిడి పడలేదు.  సెలవు కావాలని ఎప్పుడూ సెలవడగని మనిషి అడిగేడు.  కల్నల్ జగన్నాధ్ విరగబడి నవ్వుతూ “ఇప్పుడెందుకయ్యా నీకు సెలవు” అన్నాడు – “సార్ మా తమ్ముడ్ని మంచి స్కూల్లో చేర్పించాలి, వాడు అక్కడుంటే చెడిపోతాడు” అన్నాడు మూర్తి.  ఆ చివరి వాక్యంతో కథ పుర్తయిపోతుంది.

ఎవరెవరి మీదో ఉన్న ఎప్పటెప్పటి కోపాలో అనివార్యంగా మోసుకుంటూ తిరుగుతాం.  ఎంతటి సంతోష సమయాల్లో కూడా తీసి పక్కన పెట్టలేం.  కానీ పక్కన పెట్టడం ఇంత సులువుగా చెయ్యవచ్చని ఈ కథ చదివితే నాకు అనిపించింది.  అనిపించడమే కాదు అలా చెయ్యడం ప్రాక్టీసు- సాధన అంటే మరీ పెద్ద మాట అవుతుందేమోనని ఈ ఆంగ్ల పదం వాడేను-  చేసేను.  చేస్తూ ఉన్నాను.  అలా ఈ కథ నా వెంట ప్రయాణిస్తో వస్తోంది.

మూర్తి ఇంకొక మాట అంటాడు.  ఆ మాటకి ముందు “యుద్దంలో పలాయనం చేసిన వాళ్ళున్నారు. ప్రేమలో పలాయనం చేసిన వాళ్ళు ఉండవచ్చు.  ఈ దురంత నిశిత స్మృతుల నించి పారిపోగల శక్తి ఎవరికీ ఉండదేమో అనుకుని లైబ్రరీలో స్విచ్ వేసి పుస్తకం తెచ్చుకున్నాడు.  అప్పుడు ఇలా అనుకున్నాడు.  “గోల్కొండలో ఉండగా కొన్ని తెలుగు పుస్తకాలు, ముద్దు కృష్ణ వైతాళికులు, దువ్వురి రామారెడ్డి మధుశాల, వేదుల వారి పద్యాలు, రాయప్రోలు వారివి కంఠతా కొన్ని, తడుముకొంటే కొన్ని, జాషువా సంగతి సరే సరి.  జయశంకర్ ప్రసాద్, మహా దేవి వర్మ, ద్వివేది, చతుర్వేది, ఎవ్వరూ తనని ఈ రాత్రి నిద్ర పోనిచ్చేటట్లు లేరు.  గతం ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తూఉందని  గుర్తించని వాడు సగం మనిషి అంటున్నారు వాళ్ళు” అంటాడు.

మునిపల్లె రాజు గారు మనిషిలోని సమస్త కల్మషాలూ మాలిన్యాలూ సాహిత్యం వల్ల ప్రక్షాళితం అవుతాయంటున్నారు.  సవతి తమ్ముడు కథలో దక్షిణా మూర్తి క్షమ చూస్తే, అంత కంటే ఎక్కువగా గాల్యా క్షమను చూస్తే మనకి కూడా ఎవరేనా సులువుగా క్షమించేయవచ్చని, అలా చెయ్యాలని అనిపిస్తుంది.  మేజర్ దక్షిణామూర్తి ఒక కథలో సాహిత్య రూపంలో పాత్రగా పాఠకుని అంతరంగాన్ని శుభ్ర పరుస్తాడు.

ఇందులో అంటే ఈ కథలో రాజుగారు చూపిన మరొక శిల్ప నైపుణ్యం ఏమిటంటే గొప్ప ఆర్ట్ సినిమా లాంటి కళా రూపం ద్వారా కూడా వ్యక్తిలో మార్పు వస్తుందని ఆయన ఒక కళా రూపం నుంచి మరో కళా రూపాన్ని చూపిస్తూ వాటి తాలూకు శక్తిని చెప్పకనే చెప్పడం అబ్బుర పరుస్తుంది.

మహాభారతం ఉద్యోగ పర్వంలో ధర్మరాజు కృష్ణుడంతటి వాడితో ఒక మాట చెప్తాడు.  “పగయే కలిగినేని పామున్న ఇంటిలో ఉన్నయట్లు కాక ఊరడిల్లి యుండ నెట్లు చిత్తమొక మాటు – కావున వలవధిక దీర్ఘ వైర వృత్తి” అని.  ఇక్కడ పగ అన్న మాటను కాస్త మార్చి ద్వేషం అన్న అర్ధంలో వాడదాం.  అది ఉంటె పామున్న ఇంట్లో ఉన్నట్టే మనస్సు అస్థిమితంగా ఉంటుంది కావున దీర్ఘ కాలం ఎవరితోనూ వైరం ఉండకూడదు.  ఇంకా ఇలా కూడా అంటాడు “పగ అడగించుట ఎంతయు శుభంబు, అది లెస్స” కానీ “అడంగునె పగన్ పగ “ అనీ అంటాడు.

పగను తీర్చుకోవడం మంచిదే కాని దానివల్ల పగ చల్లారుతుందా ? అన్న ప్రశ్నకు సమాధానం ఈ కథ.  జీవితంలో సౌఖ్యానికి స్థిమితం ఎంత ముఖ్యమో, దానికి దారి ఎటు వైపునుంచి ఉంటుందో చుక్కలవెలుగు లాంటి కాంతి  సహాయంతో ఈ అంధకారంలో దారి చూపించేలాంటి ఇలాంటి కథ ఎవరికైనా ఇష్టమవుతుంది.

*

స్వేచ్ఛకి లోపలి కోణం!

konni sephalikalu

లోగో: భవాని ఫణి

 

 

పదిహేను రోజులు క్రితం హైదరాబాద్ లో ‘రమణీ సె రమణాశ్రమ్ తక్’ అనే పేరుతో హిందీలో రాసిన చలం గారి సంపూర్ణ చరిత్ర 14 వందల పేజీల పుస్తకం తాలుకు ఆవిష్కరణ సభ జరిగింది.  ఆ సభలో మాట్లాడుతూ ఇంతకాలం చలం చెప్పిన బయటి  స్వేచ్ఛ గురించే మాట్లాడాం.  ఇక లోపలి స్వేచ్చ గురించి మాట్లాడాలి.  ఎందుకంటే లోపలి స్వేచ్ఛ లేని బయట స్వేచ్ఛ హాని చేస్తుంది అన్నాను.  సభ పూర్తయ్యాక నన్ను ముగ్గురు నలుగురు ఆ లోపలి స్వేచ్ఛ అంటే ఏమిటని అడిగారు.  వెంటనే నాకు చలంగారి ‘శశాంక’ నాటకం గుర్తొచ్చింది.  చాలా కాలం నన్ను ఆలోచింపజేసి ఇప్పటికీ నా వెంట ఉండి నడిపించే మార్గదర్శకాల లాంటి పాత్రలున్న నాటకం అంది.  ఆ కథ, దానిలో కలగలిసిన ఆలోచనల గురించి కాస్త చెప్పుకుందాం.

తారాశశాంకమనే పురాణ కథను పెద్దగా మార్చకుండా అసలు అలాంటి కథలో అంతరార్థమేమయి ఉంటుందో చెప్పడానికి చలంగారు చేసిన ప్రయత్నమే ఈ నాటకం, ఇది నిరుపమానం.  రచన అంతా కవితాత్మకంగా ఉంటూనే ఆలోచనాత్మకంగా కూడా ఉంటుంది.

బృహస్పతి దేవ గురువు.  అతని భార్య తార.  బృహస్పతి బుద్ధిశాలి, వివేకి.  తారలోని రసస్నిగ్దత అతనికి తెలుసు.  కానీ అది తనవల్ల స్పందన పొందడం లేదని, దానికి లోపం తనదేనని గ్రహించుకోగల వివేకి.  ఎవరిలోనూ లోపాన్ని ఎంచడానికి ఇష్టపడని వ్యక్తి. వారిద్దరూ కలిసి శశాంకుడనే కుర్రవాడిని పెంచారు.  శశాంకుడు ఇప్పుడు లేప్రాయపు యువకుడయినాడు.  అతని మిత్రురాలు అనూరాధ.  తార అనూరాధను నిందిస్తుంటే బృహస్పతి ఇలా అంటాడు “ఇతరులలో కనపడే మాలిన్యమెప్పుడు హృదయ దర్పణాల ప్రతిబింబితమయిన స్వకీయ కల్మషమే” అని అంటూ ఈర్ష్యాసూయలు వద్దు అంటాడు.  అప్పటికే తార శశాంకుడి పట్ల మోహంతో ఉంది అని ఆయన గుర్తించాడు.  తన ప్రేమకు ఆమె స్పందించకపోవడాన్ని కూడా గుర్తు చేస్తాడు.  దానికి ఆమె “తపసి ప్రపంచము వాంఛాతీతము కదా” అంటుంది.  ఇక్కడ బృహస్పతి నోటి వెంట చలంగారు ఒక గొప్ప మాట అనిపిస్తారు.  “ప్రపంచ రసాస్వాదనమే తపస్సు” అని, రసాస్వాదన చెయ్యగల హృదయ స్పందన కలిగి ఉండడమే, అటువంటి హృదయాన్ని సంపాదించు కోగలగడమే తపస్సు అని ఆయన ఉద్దేశం.  తారలో ఉన్న అపారమయిన ప్రణయ ప్రళయ పాతాళగంగను విజ్రుంబించ జేసి, సాఫల్య పరచుకునే శక్తి తనకు లేదని గ్రహించి ఆ లోపం తనదేనని అర్ధం చేసుకోగల ధీరుడు బృహస్పతి.  అతని ప్రేమకు తనను అర్హురాలిగా అతన్నే మార్చుకోమంటుంది తార.  కాని ‘ప్రేమ ఆత్మసమర్పణ మయినప్పుడే స్వీకరణార్హము’ అనే స్వేచ్చ వల్లనే అది సాధ్యపడాలి గాని ప్రయత్నం వల్ల సాధ్యం కాదంటాడు.  ఈ మాటలు జీర్ణం చేసుకోగలిగితే ఎంత స్థిమితం వస్తుంది మనకి.

ఇటువంటి వాతావరణంలో బృహస్పతి పట్ల స్పందించని ఆమె హృదయం శశాంకుడి పట్ల కదలడానికి, కరగడానికి కారణం తారలాగే శశాంకుడు రసోన్మత్తుడు కావడమే.

“నా కళ్ళలో జ్వలించే మహారతి దీప్తికి, నా మొహంలో నాట్యమాడే మోహాతురతను చూసి పార్వతమయినా నన్ను  వరించి ఉంటుందనే నా నమ్మకం” అనేటంత నమ్మకం అతని మీద అతనికి.  ఈ ప్రపంచం లోని స్త్రీత్వమంతా అతనికి దాసోహమవ్వాలన్నంత కాంక్ష అతనిది.

అలాంటి శశాంకుడి పట్ల తార స్పందిచండం గమనించిన బృహస్పతి ఆమెను హెచ్చరించాడు.  అతని హృదయాన్ని అతన్ని ప్రేమించే అనూరాధ వైపు తిప్పే ప్రయత్నం చెయ్యమన్నాడు.  కానీ అది తార వశంలో లేదు.  అది కుడా బృహస్పతి గ్రహించాడు.

gudipati_vekata_chalam

తారా శాశంకల సమాగమం జరిగితే దాన్ని ఎంతో సహజమయిన విషయంగా తీసుకోగల మానసిక శక్తి కోసం, తిరిగి తారను తనదానిగా అంగీకరించగల మానసిక నైర్మల్యం సంపాదించడం కోసం అతను మరింత తపశ్శక్తిని సంపాదించుకోవడానికి వెడతాడు.

సమాగమం జరిగి శశాంకుడు భీతితో ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు.  తార దిగులుతో ఉంది.  అది తన మనసుకు తగిలి తపస్సు మధ్యలోంచి లేచి వచ్చాడు బృహస్పతి.  ఏ సహాయం కోరి నన్ను తల్చుకున్నావని అడిగినప్పుడు శశాంకుడిని తీసుకురమ్మన్నది తార.  ఇక్కడ వారి సంభాషణ ఎంతో ఆలోచింపచేస్తుంది.  ఒక స్పష్టత కుడా ఇస్తుంది.

“నువ్వే అతని వద్దకు వెళ్ళు” అంటాడు.  “ఇల్లు వదిలి వెళ్లిపొమ్మంటున్నారా సాధారుణులవలె ? లోకమూర్ఖత్వాన్ని సహించగలనా ?” అంటుంది.

“నీ భీరుత్వానికి చౌర్యాన్ని జతచేసి నన్ను తెరగా నీతి వస్త్రం కప్పి నుంచోమంటున్నావు తెలుసా” అని ఆమెను ప్రశ్నిస్తాడు.

ప్రేమకోసం తార బృహస్పతిని ఆ త్యాగం చేయమంటుంది.  అతను ప్రేమ కోసం చేస్తానని చెప్పినా, తారకు హెచ్చరిక చేస్తాడు.  “ప్రజల తుచ్ఛ అభిప్రాయాలను లక్ష్య పెట్టే నడత సత్యచోదితం కాదు.  కాంతి నుంచి విముఖవు కావద్దు, హృదయ పరీక్ష తెచ్చే పర్యవసానాన్ని విశ్వసించి, అంగీకరించి, అనుష్టించే ధైర్యం విడనాడకు” అంటాడు.  నమ్మినదాన్ని ఆచరించడానికి కావలసిన నిర్భీతి గురించే ఇలా చెప్తారు చలం గారు.

బృహస్పతి వెళ్లి శశాంకుడిని తీసుకొచ్చి తారకు అప్పగించేడు.  తార అతడిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళింది.  కానీ ఈ విధమైన అనుభవం ఆమెను మాతృత్వ భావనలోకి తీసికెళ్ళింది.  శశాంకుడి వల్ల పూర్ణ స్త్రీగా మారిన ఆమె “ఏ దేశమో పోయి వచ్చిన కుమారుణ్ణి కౌగిలించుకున్నట్టుగా ఉంది ఈ రాత్రి నాకు అంటుంది.

ఈ సంఘటన తర్వాత ప్రపంచ సౌందర్యంలోకి దృష్టి వికసించడాన్ని గురించి చెప్తూ “ఇదంతా నాదే అన్న భావం నుంచి ఇదంతా నేనే” అన్న దానిలోకి మనసు ప్రయాణించాలంటారు చలం గారు.

శశాంకుడినీ, తారనూ అంగీకరించగల శక్తితో లోకపు మూర్ఖత్వాన్ని ఎదిరించగల ధీరుడుగా బృహస్పతి కనిపిస్తాడు.

అయితే శశాంకుడి మాటేమిటి? అందుకోసం చలంగారు ఈ ఆశ్రమంలోకి అహల్యను కూడా రప్పించారు. ‘అమితమైన స్త్రీ ప్రేమ కోసం, మోహం కోసం ఆరాటపడే శశాంకుడికి ఆమె ప్రేమ జీవనానికి కావలసిన ఏకాగ్రత గురించి చెప్తుంది.  చంచలత నుంచి నిశ్చలకు రావలసిన ఏకాగ్రత యొక్క అవసరం, ఆ దారీ వివరిస్తుంది.

కళాకారుడు, పిపాసీ అయిన అతని మోహకాంక్ష సంగీత, సాహిత్యం వంటి ఉపకరణాల ద్వారా శమింప జేసుకునే మార్గాన్ని, వాటినే తపస్సుగా మార్చుకునే ఏకాగ్రతా సిద్ధిని, మనో నిశ్చలతను పొందే దారిని సూచిస్తుంది.

తన కొద్దికాలపు సౌఖ్యానుభవం వల్ల కలిగిన లోకనింద భరించలేక, వేల ఏళ్ళు పాషాణంగా మారిపోవడం తన హృదయ స్థితినే సూచిస్తుందనీ, కానీ ఆ కొద్ది ఘడియల ప్రేమానుభవం వల్లనే మిగిలిన జీవితాన్ని జీవించగల శక్తి వచ్చిందని అహల్య అంటుంది.  అయితే ఏ పురుషుడితో ఆ అనుభవం కలిగిందో అతను భీరువు కావడం వల్లనే తనకలాంటి స్థితి వచ్చిందని, అతడు ధీరుడయితే తను లోకాన్ని జయించి ఉండేదాననని అంటుంది. చివరిగా ఒక మాట అంటుంది.  ఇది చలంగారి మాటే “మన హృదయంలోని సౌందర్యాశయం ఉందే! దాన్ని మన హృదయమే కవ్విస్తోంది.  అది దేనివల్లా సఫలం కాదు.  మన హృదయం వల్లనే తప్ప.  మనని  ప్రేమించిన వ్యక్తిలో మనం ఆ ఆదర్శాన్ని కల్పించుకుని సంతుష్టి పడాలి”  అంటుంది.  అంతే కాక అతని అహంకారాతిశయం చూసి, చెంపల నునుపు చూసి భ్రమసి మతిహీనులయ్యే క్షుద్రులనుకోకు – స్త్రీ జనమంతా” అని హెచ్చరిస్తుంది.  ఈ హెచ్చరిక చాలా మంది పురుషులకు కుడా చెంప దెబ్బే.

మోహ జీవనం నుంచి ప్రేమ జీవనం వైపు చేసే ప్రయాణంలోని కఠోరత అంతా ఈ కథలో ఉంది.  ఇంత కన్నా ముఖ్యమయినది మరోటి ఉంది.  అది ఇలాంటి జీవనంలో ఉన్నవారి గురించి మనం ఎలా ఆలోచించాలి,  అసలు లోకం పట్ల మన స్పందన ఎలా ఉండాలి, అన్నది.

విశ్వామిత్రుడితో కలిసి ఋషులు బృహస్పతి ఆశ్రమానికి వచ్చి ఈ అక్రమ సంబంధాన్ని గురించి నిలదీసినప్పుడు బృహస్పతి వారికి చెప్పిన సమాధానాలు, “నీతి, దుర్నీతుల విచక్షణ నీ జీవితాన్ని దిద్దుకునేందుకు ఉపయోగపడాలి తప్ప లోకాన్ని దిద్దేందుకు కాదు.  నీ ధర్మం తప్ప సామాన్యుడు గానీ, ఇంకెవరు గానీ ఇంకొకరి ధర్మం నీవు నిర్ణయించడం మూర్ఖం, సాహసం” ఇంకా గౌతమ మహర్షితో ఇలా అంటాడు.

new doc 10_1

“అజ్ఞానంతో, దుర్బలత్వంతో, మూర్ఖత్వంతో, సమస్త ఈతి బాధలకూ లోనయి కర్మవశాన జరామరణాదులనుంచి విముక్తి గానక అంధకారంలో మునిగే ఈ ప్రాణికోటికి ధర్మ బోధ చేస్తావా గౌతమా? వారికి ఆత్మాభివృద్ధి చెయ్యాలనే సంకల్పం నీకుందా ? ఉంటే ప్రేమించు, సమస్త జీవుల్నీ ప్రేమించు.  ఖండించకు, శిక్షించకు, నీకన్న, నీ తపస్సుకన్నా, నీ భర్య కన్నా, నీ ఈశ్వరుడి కన్నా అధికంగా దుర్గతిలో పెనుగులాడే ఈ లోకాన్నంతా ప్రేమించు.  కల్మషమంతటితోనూ నిండిన ఈ ప్రపంచాన్ని నీ హృదయానికి హత్తుకో” అంటాడు.

కర్మానుసారం మనుషులు నశిస్తారు.  మనమేం చెయ్యగలం -? ప్రేమించి ఎమిటి లాభం” అన్న గౌతముడి ప్రశ్నకు తిరిగి బృహస్పతి ఇచ్చిన జవాబు నన్ను కదిలించి నిరంతరమూ నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆ జవాబు “ప్రేమించడం వారి కోసం కాదు.  నీ ఆత్మ పారిశుధ్యం కోసమోయీ” అన్నది.  అనేకానేక ఉద్యమాలు నడిపే అనేకానేకులైన మహానుభావులు ఈ మాట గ్రహిస్తేచాలనిపిస్తుంది.  ఇంతకన్నా లోపలి స్వేచ్ఛ గురించి స్పష్టంగా ఎవరు చెప్పగలరు -???

ప్రకృతి అందాలకి పరవశిస్తూ అందులో లీనమావుతూ ఆ ఆనందాన్ని తన పాటలో పలికించుకునే మరో విశిష్ట పాత్ర అనూరాధ. “ఈ అడవి దాగి పోనా ! ఎటులయిన ఇచటనే ఆగిపోనా” అన్న కృష్ణ శాస్త్రి గారి మాటలో ‘ఎటులయినా’ అన్నమాట ఎంతగానో ఆలోచింపదగ్గది.  ప్రకృతి మనకి ఎంత ఇష్టమయినా జీవితపు మోహాలు అక్కడ ఆగనివ్వవు.  వెనక్కిలాగుతాయి.  కాబట్టి ఎలాగయినా సరే వాటినన్నిటినీ జయించి ఇక్కడే ఆగిపోతాను అని కవి ఆశయం.  అనూరాధ అలాంటి మోహాలు లేని ప్రేమ జీవి. ప్రశాంతంగా ఉంటూ, నిర్మలంగా శశాంకుడిని ప్రేమిస్తూ ఉంటుంది.  శశాంకుడి వంటి మోహోన్మత్తుడికి ఆమె మాత్రమే తరణోపాయం.  ఇది అహల్య మాటల ద్వారా శశాంకుడు గ్రహిస్తాడు గాని అతని జీవన మోహ జ్వరాలు ఎంతో సాధన వల్లగాని శమించవు అని మనం అలాంటి వ్యక్తుల్ని చుట్టూ ఉన్న ప్రపంచంలో చూస్తున్నప్పుడు తెలుస్తుంది.

ఈ నాటకం మొత్తం మీద చలంగారు సూచించిన మరొక ప్రధాన అంశం హృదయస్పందనే ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాలు ఏర్పడాలని.  అపుడే ఆ సంబంధం దివ్యం అవుతుంది.  ఇటువంటి హృదయ ప్రధానమయిన స్త్రీ పురుష సంబందాల పట్ల చుట్టూ ఉన్న ప్రపంచమూ, ఆయా సంబంధిత వ్యక్తులూ ఎంతో ఉదారంగా ఉండగలగాలి.  ఏ గొప్ప జ్ఞానమయినా అటువంటి దివ్యానుభవం వల్లనే ఆయా వ్యక్తులకు కలుగుతుంది.  కలగలేదు అంటే ఆ అనుభవంలోని దివ్యత్వంలో ఎక్కడో ఏదో లోపం ఉందని అర్ధం.  ఇటువంటి దివ్యానుభవం పొందిన వ్యక్తులకు  ఉదాహరణగా ఇందులో బృహస్పతి, తార, అహల్య పాత్రలను చూపించారు. ఇందుకోసం కాకుండా కేవల ఆకర్షణే ప్రధానంగా శరీర సంబంధాలు పెట్టుకోవడం పట్ల చలంగారికి పెద్ద ఆసక్తి లేదన్నది తెలుస్తోంది.

ఇదంతా ఆచరణకి ఎంతో దూరంగా ఉన్నా సరే పదే పదే ఆలోచింపజేసి, అనుభూతి ప్రధానంగా జీవించే మనుషులకు లోపలి వెలుగును ప్రసరింపజేస్తుందనీ నా నమ్మకం.

*

కవిత్వాన్ని జీవిస్తే, జీవితం తిరిగి కవిత్వమిస్తుంది:ఇస్మాయిల్

ismayil painting rainbow

ఈ వారం ప్రత్యేకం: ఇస్మాయిల్ గారి చివరి అముద్రిత ఇంటర్వ్యూ

కవి ఇస్మాయిల్ గారిలో ఒక గొప్ప సాహితీ విమర్శకుడు, నిరంతర అధ్యయన శీలి, దార్శనికుడు, తత్వవేత్త, మారుతున్న ప్రపంచాన్ని మౌనంగా గమనిస్తున్న అలుపెరుగని యాత్రికుడే కాక నిరాడంబర జీవనం గడిపే గొప్ప ప్రేమికుడూ ఉన్నారు. పదిహేనేళ్ళుగా ఆయనను విభిన్న సందర్భాలలో దగ్గరగా గమనించిన నాకు ఏ అంశాన్నయినా ఆయన తన జీవితంలో సాధ్యం చేసుకున్నాకనే కవిత్వంలో అలవోకగా పలికిస్తోన్నట్టు తెలుస్తూ వచ్చింది.  అందుకనే ఆ కవిత్వం అంత శుద్దంగా, గాఢంగా, అడవి పూల గాలి లాగ వ్యాపించి అందరినీ కదిపి ఆలోచింపచేస్తూ ఉంటుంది.

ఇస్మాయిల్ గారు ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి ఉన్నారు.  ఎన్నో అంశాలమీద సూక్ష్మమయిన నిశితమయిన విమర్శ చేసి ఉన్నారు.  కవిత్వ సృష్టికి, కవితాస్వాదనకి ప్రాణ భూతమయిన ఎన్నో అంశాలను ఎప్పటికప్పుడూ చెప్తూ వచ్చారు.

నిరంతరమూ స్పష్టమయిన అవగాహనతో ప్రపంచాన్ని అధ్యయనం చేస్తూ, ధ్యాన స్థితిలో కవితా సృష్టి  చేస్తున్న, గాఢమయిన అనుభూతి నెరిగిన వ్యక్తిగా, ఇప్పటికీ రాస్తున్నకవి గా, ఆయన కవిత్వం మీదా, కొన్ని సమకాలీన అంశాలమీదా  ఆయన అభిప్రాయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో చేసిన సంభాషణ ఇది.

1945 తర్వాత 15 సంవత్సరాలపాటు జీవితాన్ని గురించి తెలుకోవడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ గడిపానని అన్నారు మీరు.  ఆ తర్వాత 1960లో మీ నుంచి కొత్త కవిత్వం వచ్చిందని, దీనికి విమర్శకులు ‘అనుభూతి కవిత్వమని’ పేరు పెట్టేరని అన్నారు.  కవి కావలసిన ప్రతి వ్యక్తి కి  ఇంత సుదీర్ఘమయిన ప్రపంచ పరిశీలనా, ఆత్మానుశీలనా అవసరమా ? ఈ వేళ కొత్త తరం కవులకు ఇంత ఓపిక ఉందా ?

– నేను సహజంగా మొద్దు నవటం వల్ల కవిత్వం రాయటానికి  వచ్చేటప్పటికి అంత కాలం పట్టిందనుకుంటున్నాను.  కవి కాదలచుకున్న వాడికి ఏకకాలంలో ప్రపంచ పరిశీలనా, ఆత్మానుశీలనా చాలా అవసరమనేది నిస్సందేహం.

బహి:ప్రపంచమూ, అంతశ్చేతనా కలుసుకునే చోటు నుంచికవిత్వాన్ని ప్రత్యక్షం చేసుకోవలసిన అవసరం కవికి ఉందా ?అది  లేకుండా మంచి కవిత్వం కేవల ప్రతిభతో రాయలేడా ?

-బహి:ప్రపంచమూ, అంతశ్చేతనా తారసిల్లినప్పుడే కవిత్వపు రవ్వ పుడుతుంది.  ధన రుణ ధృవాల కలయిక వల్ల  విద్యుచ్చక్తి పుట్టినట్లు. ప్రతిభ అంటే అదే.  మిగతావన్నీ వ్యుత్పత్తికి సంబంధించినవి.

మిమ్మల్ని ప్రభావితం చేసిన కృష్ణ శాస్త్రి గారి నుంచి మీరు విడివడి స్వయం కవితా వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి మీ లోపలి సంఘర్షణా, అన్వేషణల  గురించి ఒకచోట చెప్పారు.  అలా చెయ్యడం వల్ల సాహిత్యం మీద మీరు వేసిన ప్రతేక ముద్ర ఏమిటి ?

– నాకు కృష్ణ శాస్త్రి గారంటే ఆరాధన.  ఐతే, కోతిలా కృష్ణ శాస్త్రి గారిని అనుకరిస్తే, ఇక నేనెందుకు ? నా కవిత్వమెందుకు ?  ఆయన్ని అనుకరించటం మా ఇద్దరికీ అన్యాయమే.  అందుకని, నా సొంత మార్గం వెతుక్కున్నాను.  ముందు నేనెవర్నో తెలుసుకోవటానికి ప్రయత్నించాను.  మరి ముద్ర సంగతా, అసలు ముద్ర పడిందో లేదో కాలం నిర్ణయించాలి.

1960 నుంచి ఈ నాటిదాకా శుద్దమయిన కవితాధార మీ నుంచి ఊటలూరుతూనే ఉంది. అమృతం లాంటి శుద్ధ కవిత్వ జలాల మూలాలు ఏమిటి ?

– కవిత్వానికి మూల మేమిటి ? జీవితమూ, అది జీవించిన తీరూ. కవిత్వాన్ని జీవిస్తే, జీవితం తిరిగి కవిత్వమిస్తుంది.

ismail

 కవిత్వంలో క్లుప్తత, సాంద్రత అన్న లక్షణాలు మీరెలా సాధించ గలిగారు ? అంత సంయమనం ఎలా ఒనగూడింది ?

-కవిత్వం తపస్సులాంటిది. తపస్వికి వాచాలత రాణిస్తుందా ? కనుక కవిత్వానికీ మౌనానికీ ఒక అంగుళం మేర తేడా మాత్రమే ఉండాలి.

చెట్టు ఆదర్శంగా మొదలయినా మీ కవిత్వం ధ్యాన (జెన్ మార్గపు హైకూ) స్థితికి చేరుకోగలగడంలోని క్రమ పరిణామపు అంతస్సూత్రం ఏమిటి ? (చెట్టు ఆదర్శంగా భావించడం నుంచి తానే చెట్టుగా తాదాత్మ్యం చెందడం దాకా)

– ఈ తాదాత్మ్యమన్నది జెన్ బౌద్దుల నించి కొత్తగా నేర్చుకున్నది కాదు.  కవిత్వమెప్పుడూ తాదాత్మ్యం నించే ఉద్బవిస్తుంది.  ప్రపంచంలోని వస్తువులతో తాదాత్మ్యం చెండలేనివాడు కవిత్వం రాయలేడు.  ‘చెట్టు నా ఆదర్శ’మనే కవితకు మూలం చెట్టుతో తాదాత్మ్యమే

ఈ వేళ సాహిత్యంలోకి కొత్తగా ప్రవేశ పెట్టబడిన పర్యావరణ స్పృహ వల్ల పర్యావరణానికి గాని, కవికిగాని వచ్చే ప్రయోజనం ఏదయినా ఉందా?

– పర్యావరణ కాలుష్యం వల్ల  జీవజాలం నశించిపోయే ప్రమాదం ఏర్పడిందివాళ. పర్యావరణ స్పృహ కవులకే కాదు, ప్రతి ఒక్కరికీ ఉండవలసిందే.

ఏడు దశాబ్దాలు దాటిన మీరు జీవితాన్ని కవిగా ఎలా అర్ధం చేసుకున్నారు ? మనిషిగా ఎలా అర్ధం చేసుకున్నారు ? రెండూ ఒకదానికి ఒకటి సహాయపడ్డాయా ?

– కవీ, మనిషీ వేరు వేరు కాదు.  రెండూ ఒకటే. కనుక, కవిగా ఒకలాగా, మనిషిగా మరోలాగా అర్ధం చేసుకోవటం ఉండదు.  కవీ, మనిషీ ద్వంద్వాలు కాదు.  ఇద్దరికీ ఒకటే వేరు – మానవత్వం.

 మానవ జీవితంలో చలం గారు చెప్పినట్టు మోహానుభవాలు, ప్రేమానుభవాల కంటే గొప్పవి ఏవీ లేవా ? లేకపోతే ప్రపంచం మరింతగా రోజు రోజుకీ భౌతిక విలువల పరుగుతో సర్వం ఎలా మరిచిపోగలుగుతుంది ? కవులు కుడా దీనికి మినహాయింపు కావట్లేదెందుకు ?

– మానవ జీవితంలో ప్రేమానుభవం కన్నా గొప్పదేదీ లేదు అన్నారు చలం గారు.  నేను దీన్ని కాస్త విశాలం చేసి ‘మానవ సంబంధాల కన్నా గోప్పవేవీ లేవు’ అంటాను.  సాటి మనుషులతో, స్నేహితులతో, భార్యతో, ప్రియులతో, పిల్లలతో, ప్రకృతితో మానవ ప్రేమానుబంధాల కన్నా నిజంగా జీవితంలో గొప్ప విషయాలేమున్నాయి ? వీటిని వదిలిపెట్టి భౌతిక, వ్యాపార విలువల కోసం పరుగు పెట్టేవారెవరూ సుఖపడగా నేను చూడలేదు.  అన్నీ ఉండి, మానవబంధం లేకపోతే ఎందుకా జీవితం ?

ప్రేమా, కరుణా – ఇటువంటి అనుభూతుల్లోంచి కవిత్వం పుడుతుంది.  ద్వేషంలోంచి కవిత్వం రావటం ఇంతవరకు నేనెక్కడా చూడలేదు.  ప్రపంచ కవిత్వ చరిత్రనంతా గాలించినా ద్వేష కావ్యం వంటిది మీకెక్కడా తగలదు.

ఐతే, ప్రస్తుతం మన కవులు రాస్తున్న రాతలు చాలా వరకు వర్గ ద్వేషాల మీద, కుల ద్వేషాల మీదా, లింగ ద్వేషాల మీద, ప్రాంతీయ ద్వేషాల మీద ఆధారపడ్డవే.  అందుకే, వాటిల్లో కవిత్వాంశ బాగా లోపిస్తుంది. ఇటువంటి సాహిత్య ఉద్యమాల వల్ల తట్టలకొద్దీ అకవిత్వం పుట్టుకొచ్చింది.

కవికీ, రచయితకీ అధ్యయన శీలత అవసరమా ? లేకపోవడం వల్ల  సాహిత్యానికి వచ్చే ప్రమాదం ఏదయినా ఉందా ?

-అధ్యయన శీలత ఒక్కటే కాదు. ఐదు అవసరమన్నారు మనవాళ్ళు.  అందులో వారంగనా సాహచర్యం ఒకటి ! ఆశ్చర్యం కాదూ!

దేశాటనం, పండిత మిత్రతా చ,

వారంగానా, రాజసభా ప్రవేశ:,

అనేక శాస్త్రాన్యవలోడనంచ

చాతుర్యమూలాని భవంతి పంచ.

తెలుగు సాహిత్యానికి మంచి విమర్శ లేదనే పాతబడిన విమర్శ ఒకటి ఉంది. ఉత్తరాధునిక విమర్శనా విధానం ద్వారా కొందరు చేస్తున్న సాహిత్య విమర్శ పట్ల మీ స్పందన ఏమిటి ?

-వెంకటేశానికి సెలవుల్లో చదవాల్సిన పుస్తకాలు లిస్టు చెబుతూ గిరీశం, చివర్న ‘కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫ్ఫికల్ట్’ కుడా రాసుకోమంటాడు.  ఇప్పుడింతమంది కుప్పుస్వామయ్యర్లు పుట్టుకురావటం ఆశ్చర్యంగా ఉంది.

ఉత్తరాధునికత తెలుగు కవిత్వంలోకి ప్రవేశించిందా ? ఆ అవసరమూ, వీలూ తెలుగు కవిత్వానికి ఉన్నాయా ?

– కవిత్వం నిష్క్రమించింది కనుక, ఉత్తరాధునికత ప్రవేశించిందనే అనుకోవాలి.

వాడుకలో భాష పాతబడి భావ స్ఫురణను కోల్పోతున్నప్పుడు కవి తిరిగి భాషను శుభ్రపరుస్తాడు ? మీరు తెలుగు పదాలను ఎలా శుభ్రపరచి మెరిపించగలుగుతున్నారు ? స్పటిక స్వచ్చంగా ఎలా చెయ్యగలుగుతున్నారు ?

– సామాన్యమైన అచ్చ తెలుగు మాటలు చలంగారి రాతల్లో ప్రాణం పోసుకుని కళ్ళు తెరవటం చూసాను. కృష్ణ శాస్త్రి గారి మాటల అందం వేరు. చలం వాడిన వాడుక భాషలో గొప్ప శక్తి ఉంది. అది నన్ను ఆకర్షించింది.  జీవంలేని కావ్య భాష మీద వెగటు కలిగించింది. ముక్కవాసన కొట్టేవీ, అరిగిపోయినవీ, పాత మాటల్ని సాగనంపి, జనం నాలికలమీద జీవ నృత్యం చేసే మామూలు మాటల్ని ఆహ్వానించాను.

 పద్య కవులు పద్యాన్ని బతికించాలని ఈ మధ్య అయిదారేళ్ళుగా చాలా  శ్రమపడుతున్నారు.  వీరి కృషి ఫలితాల మీద మీ అభిప్రాయం ? ఈ కాలానికి ఛందోబద్ద  పద్యాలు పనికొస్తాయా ?

-పద్య కవులు ఈ మధ్య మంచి పద్యాలే రాస్తున్నారు.  కాని, మంచి కవిత్వం సృష్టించలేక పోతున్నారు.  వాళ్ళ హేండీ కేప్స్ రెండు: గ్రాంధిక భాషా, ఛంద: కాఠిన్యమూ. ఇప్పటి ప్రపంచం చాలా మారింది.  ఈనాటి కొత్త ఆలోచనలూ, అనుభూతులూ, గ్రాంధిక భాషలో ఇమడవు. పద్యం ఎంత చక్కగా రాసినా, ఈ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

పోనీ భాష మార్చి వ్యవహరీకరిద్దామంటే, ఛందస్సు బిగబడుతుంది. ఈ ద్వైత సమస్యని (dilemma) పరిష్కరించుకునేవరకు వాళ్ళ కవితాభివ్యక్తి  సార్థకం కాదు.

భువన విజయాలు, అవధానాల వంటి పండిత (పామర) రంజన ప్రక్రియలు తిరిగి ఆంద్రదేశంలో రాజాదరణ (అధికారాదరణ) లోకి, ప్రాపకంలోకి పోతున్నాయి.  ఇవి సాహిత్యానికి మంచి రోజులా ? చెడ్డ రోజులా ?

– సర్కసులలో రెండు రకాలున్నాయి: శారీరక సర్కసూ, మేధా సర్కసూ. భువన విజయాలూ , అవధానాలూ రెండో జాతికి చెందినవి. సర్కసులంటే ఇష్టపడే జనం సమృద్దిగా ఉన్నారు.  వాళ్ళని మనం ఆపలేం. రెండిట్లో ఏదైతేనేం ? మనో రంజనం కోసమే కదా !

 ఈ వేళ వర్గం స్థానంలోకి కులం, లింగ విభజన, ప్రాంతీయత, మతం అన్నవి వచ్చి చేరి సాహిత్యాన్ని ఆక్రమించుకున్నాయి. దీని వల్ల సాహిత్యం నష్ట పోతుందా?

– చాలా నష్ట పోయింది. ఇంతకు మునుపు చెప్పానుగా, కవిత్వం ప్రేమ నించి పుడుతుంది గాని ద్వేషం నించి కాదనీ, ద్వేషం ప్రాతిపదికమీద ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా మంచి కవిత్వం పుట్టలేదనీ.  ఇటీవల తెలుగు వస్తున్న బండ్ల కొద్దీ ఆకవిత్వానికి కారణమిదే.

స్త్రీలు స్వంత వ్యక్తిత్వాల కోసం స్వంత గొంతులు విప్పడం జరిగింది కదా! వ్యక్తిత్వ సాధనలో ప్రేమించగల స్వభావం కోల్పోయే ప్రమాదం ఉందా ? లేదా, మరింత ఎక్కువ ప్రేమించ గలరా ?

-వ్యక్తిత్వ సాధనంటే తన శక్తుల్నీ, చైతన్యాన్నీ పరిపూర్ణంగా వికసింపజేసుకోవటం.  అంటే మానవత్వాన్ని పెంపొందించుకోవటం.  ఆత్మ జ్ఞానాన్ని సాధించటం.  అటువంటి వాళ్ళల్లో ప్రేమించ గల స్వభావం పెరుగుతుంది కాని తరగదు.

కుటుంబం స్త్రీలపై హింసకు కేంద్రమని స్త్రీవాదులు, కుటుంబం లేకపోతే స్త్రీలకు మనుగడే లేదని ఇతరులూ అభిప్రాయ పడుతున్నారు కదా! విస్తృతమైన మీ జీవితానుభవం నుంచి, చలం అభిమానిగా మీ ఉద్దేశ్యం, అవగాహన ఏమిటి ?

-వివాహబంధం స్త్రీకీ, పురుషుడికీ ఇద్దరికీ ఉరితాడు వంటిదని చలంగారు భావించారు. కుటుంబ వ్యవస్త పనికిరాదని ఆయన చెప్పలేదు. పెళ్లి తతంగం వద్దనుకున్నా ప్రేయసీ ప్రియులు కలిసి సంసారం చేసి పిల్లల్ని సాకాలి గదా. కనుక. కుటుంబ వ్యవస్థ తప్పదనుకుంటాను.

ప్రేమ సూత్రం గురించి పదే  పదే కవిత్వం ద్వారా చెప్పే మీరు, మూకల వల్ల కాక వ్యక్తుల వల్ల ప్రపంచం మారుతుందని  చెప్పే మీరు, మీ అనుభవంలో ఈ అంశాన్ని దర్శించారా ?

– గాంధీ గారినీ, చలంగారినీ, ఇంకా ఎంతో మంది మైనరు మహాత్ములని చూస్తున్నారు కదా!

విషాద కషాయంతో జీవిత జ్వరాన్ని నయంచేసుకోడానికి కవిత్వం సహాయపడుతుందా ?

-కవి కూడా మామూలు మనిషే, ఎటొచ్చీ తనకు ప్రత్యేకమైన చైతన్య దృష్టితో సగటు మనిషికన్నా కాస్త లోతుగా విశాలంగా చూడగలడు. కనుక, జీవితపు ప్రతిరోధాల్ని, నిర్భందాలనీ అధిగమించి, ప్రపంచంతో సమన్వయము సాధించ గలడు. బతుకులోని లోటుపాట్లని పూడ్చుకుని కొంత పరిపూర్ణత సాధించగలడు. కవి తాలూకు ఈ అనుభవం జీవితంతో అసంతృప్తి చెందిన సామాన్య పాఠకుడికి ఒక కొత్త వెలుతురునీ, ఒదార్పునీ, సంతృప్తినీ ప్రసాదించగలదు.  ఈ విధంగా కవిత్వ కషాయం జీవిత జ్వరాన్ని నయంచెయ్యటానికి పనికొస్తుంది.

 ఉగ్రవాదం పేరుతో, మతం పేరుతో కళ్ళ ముందు జరుగుతున్న మారణకాండపట్ల కవుల బాద్యత ఏమిటి ?

కవులుగా కవుల ప్రధాన బాద్యత ఏమిటంటే అకవిత్వం రాయకుండా జాగ్రత్త పడటం! ఉగ్రవాదం పేరా, మతం పేరా జరిగే దారుణకాండల్ని ఖండించవలసిందే.  దానికి అనేక మార్గాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది రాజకీయచర్య.  వాటికి కవిత్వాభివ్యక్తి ఇవ్వదలచుకున్నప్పుడు ఆ అనుభవాలు తన రక్తంలో జీర్ణమై, అనుభూతి లోనూ అస్తిత్వంలోనూ భాగమైనప్పుడే ఆ పనికి పూనుకోవాలి.

తన యెడల, తన పాఠకుల యెడల ఈ బాధ్యతని కవి మరిచిపోకూడదు.

న్యూయార్కు మీద బాంబులు పడగానే అమెరికానీ, బుష్ నీ తిడుతూ తట్టెడు కవితలు వచ్చాయి కాని, బిన్ లాడెన్ నీ, తాలిబాన్ లనీ, వాళ్ళ అమానుష పరిపాలననీ, మత మౌళిక వాదుల్నీ వాళ్ళ మౌడ్యాన్ని, స్త్రీల అణచివేతనూ ఖండిస్తూ ఒక్కటంటే ఒక్క పద్యం ఈ కవులెవరేనా రాశారా? వీళ్ళు మన కవులు!

గుజరాత్ లో అంత దారుణమైన మారణకాండ, మానవహోమం జరిగింది కదా. గ్లోబల్ ఖడ్గాలూ, అమెరికన్ పిల్లలూ అంటూ గెంతే ఈ కవులెంత మంది గుజరాత్ అమానుషత్వానికి స్పందించారు ? చాలా మంది కవుల హ్రుదయాల్నించి మానవత్వం కారిపోయి, ఆ చోటుని కమ్యునిస్టు, కుల, ప్రాంతీయ రాజకీయ విషాలు ఆక్రమించాయి.

ప్రపంచీకరణ, ప్రవేటీకరణ, మార్కెట్ ఎకానమీల పట్ల స్పందిస్తూ కవులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో విమర్శకులు ఆ కవిత్వాల బలహీనతలను ప్రశ్నించడం పట్ల మీ అభిప్రాయం ఏమిటి ?

-కవిత్వం బలహీనమైనపుడు ఆ విషయం నిష్పక్ష పాతంగా వెల్లడి చెయ్యటం విమర్శకుల బాధ్యత. విమర్శకులు తాక కూడనివని నిషేధించటానికి ప్రపంచీకరణ, ప్రవేటీకరణ, అమెరికా ద్వేషం వంటి వస్తువుల్లో పావనత్వమేమీ లేదు.  కవితలో కవిత్వాంశ ఎంత ఉందో బేరీజు వెయ్యటం విమర్శకుల పని.  ఉన్న మాట చెబితే ఉలుకెందుకు వీళ్ళకి!

ఈ వేళ సాహిత్య వాతావరణంలో ఒక స్తబ్దత ఏర్పడిందని పలువురు అంటున్నారు.  ఒక దశాబ్దాన్ని పాలించిన స్త్రీవాద, దళిత వాదాలు కొంత ఉపశమించి, ప్రపంచీకరణ అన్న పెను ముప్పువైపు ఏకోన్ముఖంగా దృష్తి సారించిన ఈ తరుణంలో స్తబ్దత నిజంగా ఉందా?

– రాజకీయ వాదాల వల్ల ఉద్యమాల వల్ల కవిత్వం పుట్టదు. కవిత్వాన్ని కవులు సృష్టిస్తారు. అది వైయక్తిక క్రియ. వ్యక్తి  తాలూకు హృదయ స్పందనకు సంబంధించింది.  వాదాలూ, సిద్దాంతాలూ ఉన్నా ఊడినా, ఉద్యమాలు లేచినా పడుకున్నా ఆర్ద్ర హ్రుదయుడైన కవి రచిస్తూనే ఉంటాడు.  స్తబ్దత అనేది వాదాలకూ ఉద్యమాలకే గాని కవులకు కాదు.

రాజకీయ లేదా ఉద్యమ కవులమని చెప్పుకునే వాళ్ళు ఉద్యమం మందగించగానే వాళ్ళు నీరసపడి పోతారు.  నిజానికి వాళ్ళు కవులూ కారు. వాళ్ళది కవిత్వమూ కాదు.

సాహిత్య వాతావరణంలో స్తబ్దత ఏర్పడిందనే సమస్యని ఐదేళ్ళకోమారు లేవనెత్తి, సాహిత్య పేజీలు  నింపుకోవటం పత్రికల వాళ్లకి అలవాటైనట్లు కనిపిస్తుంది.

 కవిత్వం, కథ ప్రాంతీయతల ఉబిలో చిక్కుకున్నాయా ?

-1972 లో నా ‘చెట్టు నా ఆదర్శం’ ప్రచురితమయాక మరుపూరి కోదండ రామారెడ్డి గారు ‘భారతి’ లో సమీక్ష రాశారు.  ‘ఈ కవి గోదావరి మండల మాండలికాన్ని చక్కగా వాడినారు’ అని.  మనమంతా వాడేది మండలికాల్నే. ఐతే చదువుకున్న వాళ్ళ భాషలో వారే ప్రాంతం వారైనా ఎక్కువ సామ్యం ఉంటుంది. ఒకర్నొకరు సులువుగా అర్థం చేసుకోగలరు. చదువు స్కేల్ లో కిందికి వెళ్ళే కొద్దీ ఒకరి మాండలికం మరొకరికి అర్ధమవటం కష్టమౌతుంది.

మాండలికాన్ని వెలుగులోకి తీసుకురావటం మంచిదే.  కొందరు మాండలిక రచయితల్ని చదువుతుంటే, మన భాషలో ఇంత శక్తీ సౌందర్యమూ ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది.  ఐతే ఏక కాలంలో, అన్ని మాండలికాలని సమన్వయించే ఏకీకరణ క్రియ కుడా భాషలో జరుగుతూనే ఉంది.  ఇలా ఏకకాలంలో విభజనా ఏకీకరణ భాషా క్షేత్రంలో జరుగుతుంటాయనుకుంటాను.

మైనారిటీ రచయితల కథల, కవిత్వాల మీద చెలరేగుతున్న వివాదాలు సాహిత్యానికి అవసరమా ?

మైనారిటీ రచయితలే కాదు, ఏ రచయితల గురించి కూడా మంచి సాహిత్య విమర్శా, విశ్లేషణా జరగటం లేదు.  జరుగుతున్నవి చాలావరకు మత కుల ప్రాంతీయ ప్రాతిపదికల మీద రాజకీయ వివాదాలు.

మీ 75 ఏళ్ల జీవితంలో భావ కవిత నుంచి హైకూ దాకా మీరు చేసిన (1942-2002) మీ అరవై ఏళ్ళ కవిత్వ ప్రయాణంలో జీవితం కవిగా మీకు ఏమిచ్చింది ?

– అనిర్వచనీయమైన ఆనందం.  ఆనందో బ్రహ్మ.

హైకూ పద్ధతి మన భాషకు తగదని కొందరు విమర్శకులు అంటున్నారు.  దీనికి హైకూ మార్గదర్శిగా మీ జవాబు ఏమిటి ?

-హైకూ అంటే స్వేచ్చా కవిత్వం.  ఆనందవర్ధన, అభినవగుప్తుల ధ్వని మార్గమే హైకూ మార్గం. ఇది మన భాషకు పనికిరాదన్న పెద్ద మునుషులెవరో కాస్త చెబుతారా ?

 ఇస్మాయిల్ గారి ఇల్లు ఆంద్ర దేశంలో చారిత్రిక స్థలం. అటువంటి స్థలాన్ని మరే దేశంలోనయినా అయితే ప్రభుత్వం మాన్యుమెంట్ గా కాపాడి ఉండేది – అని మీ అభిమానులకు కొండంత చింత.  అరవై ఏళ్ళుగా ఉన్న ఆ ఇల్లు విడిచిపెట్టి రావలసివచ్చినపుడు మీరు చాలా రోజులు ఎంతో సిక్ నెస్ అనుభవించారు.  ఇటువంటి సెన్సిబిలిటీ మనిషికి అవసరమా? కవికి అవసరమా? అది ఆ మనిషికి ఏం ఉపయోగం ?

-మనిషికి సెన్సిబిలిటీయే మానవత్వాన్ని ఇచ్చేది.  ఇది కవిలో మరీ నిశితంగా, సున్నితంగా ఉండాలి.  అంటే కవిలో మానవతా గుణం ఎక్కువ పాలులో ఉండాలన్న మాట. ఈ సుకుమార చేతనే కవిత్వానికి మూలం.

అప్పుడు శ్రీనాధుడు పాకనాటి వాడితే ఇప్పుడు నేను వలసపాక నాటి వాడను!

మీరు మీ పుస్తకాలను ఎందరో సాహిత్యేతర వ్యక్తులకు అంకితమిచ్చారు.  మీ స్నేహాలు కుడా ఎక్కువ అటువంటి వారితోనే (పదవులు, ధనం లేనివారే ఎక్కువ అందులో) దానికి కారణం ఏమిటి ? లోకానికి ఇంత వ్యతిరిక్తంగా ఎలా ఉండగలుగుతున్నారు ?

-నా అసలు జిహాద్ (ధర్మ యుద్ధం) కమ్యునిస్టులతో . ఇది నలభై ఏళ్ళుగా సాగుతోంది. వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సాహిత్యాన్ని హైజాక్ చెయ్యటానికి ప్రయత్నించి ఇంచుమించు కృతకృత్యులయారు. కవుల్నీ, రచయితల్నీ, కళాకారుల్నీ పార్టీ రాజకీయ ప్రచారం కోసం పార్టీకి అంగంగా ఉపయోగించుకోమని లెనిన్ తన భటులకు ఆదేశమిచ్చాడు.  అప్పటినించీ ప్రతి దేశంలోనూ అభ్యుదయం పేరనో, విప్లవం పేరనో రచయితల సంఘాలు ఏర్పరచి, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడని సాహిత్యం పనికి మాలినదని యువ రచయితలకు నూరి పోసి, వాళ్ళ చేత నినాద ప్రాయమైన శుష్క రచనలు రాయించి పార్టీ ప్రచారం చేయించుకుంటున్నారు. సాహిత్యంలో ఈ రాజకీయ కాలుష్యాన్ని నేను మొదట్నించీ ఎదిరిస్తూ వచ్చాను.  ఈ కమ్యునిస్టు ప్రభావం వల్ల ఎంతో మంది యువ రచయితలు జబ్బుపడి, సాహిత్య పరంగా శవ ప్రాయులయారు.  అకవిత్వ కల్మషం దేశమంతా అలుముకుంది.  ఈ వెల్లువ ఇంకా తగ్గినట్టు లేదు. దీనికి వ్యతిరిక్తంగా, అంటే సాహిత్యంలో స్వేచ్చ కోసమూ, రచయితల వ్యక్తిత్వ ప్రాధాన్యాన్ని ఉగ్గడిస్తూనూ, నలభై ఏళ్లబట్టి పోరు సాగిస్తున్నాను.  కమ్యునిస్టుల చేత చాలా రొస్టు  పడ్డాను.

తెలుగు కవిత్వానికి, ప్రోజ్ కి ఎక్కువగా అనువాదాలు ఎందువల్ల లేవు ? మీరు తెలుగులోకి చేసారు గాని, తెలుగు నించి ఎందువల్ల చెయ్యలేదు  ?

-ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, తెలుగు నించి ఇంగ్లీషుకు గాని, ఇతర భాషలకు గాని అనువాదం చెయ్య గలిగిన సమర్థులు తెలుగు దేశంలో చాలా అరుదు.  ఇతర భారతీయ భాషలనించి ఇంగ్లీషులోనికి అనువాదాలు వస్తున్నాయి.  కాని తెలుగు నించి బహు సక్రుత్తు . తెలుగు సాహిత్యం గురించి ఇతర దేశాల వాళ్లకు చాలా తక్కువ తెలుసు.

అనువాద గ్రందాల విస్తృత అద్యయనం వల్ల నేను గ్రహించిందేమిటంటే, అనువాదకుడి మాతృభాషలోకి అనువదింపబడే గ్రంధం మాత్రమే రాణిస్తుంది.  గ్రందానువాదం అనువాదకుడి మాతృభాష లోకి కాకపోతే, ఆ అనువాదం సమగ్రంగా ఉండదు. ఏదో లోటు కనిపించి తీరుతుంది.

అందుకని, నేను చేసిన అనువాదాలన్నీ తెలుగులోకే.

కవిగా ఎదగడంలోనూ, కేరీరిస్టుగా ఎదగడంలోనూ ఉన్న తేడాను పెద్ద సాహితీ వేత్తలు కూడా ఎందుకు గుర్తించడం లేదు ?

-కేరీరిస్టులుగా ఎదిగి, కవులుగా అణగారి పోయే వాళ్ళని చూస్తే జాలేస్తుంది.

ప్రపంచానికి దూరంగా (కాకినాడకు కాస్త దూరంగా) వలసపాకలలోకి వలస వెళ్ళిన మీరు హైకూతో ఎంత దూరం ప్రయాణించాలనుకుంటున్నారు ? మీ ప్రయాణం నుంచి ప్రపంచానికి మీరు చెప్పే కవితా సందేశం ఇంకా ఎన్ని కొత్త దారులలో ప్రకాశించబోతోంది ?

– రామగిర్యాశ్రమంలో ఉంటూ కాళిదాసకవి మేఘంతో ప్రేయసి జ్ఞాపకాల్లోకి ప్రయాణించినట్లు వలసపాకలలో ఉంటూ హైకూతో కవితా ప్రేయసి సంపూర్ణ సాక్షాత్కారం కలిగే వరకు ప్రయాణిద్దామనుకుంటున్నాను.

ఇస్మాయిల్ గారి 75వ పుట్టినరోజునాడు  జరిగిన సన్మాన సందర్భం ( 2002) లో

వాడ్రేవు వీరలక్ష్మీదేవి చేసిన సంభాషణం

veeralakshmi (2) 

వెలుగు రంగుల మంత్రగాడు చలం

veeralakshmi (2)

( నిద్రాణంగా గా ఉన్న తెలుగు సాహిత్యాన్ని తన రచనలతో మేల్కొల్పిన  గుడిపాటి వెంకటా చలం పుట్టిన రోజు  మే 19 సందర్భంగా….)

చాలా ఏళ్ళు గడిచాయి.  చాలా అంటే ముప్పై అయిదేళ్ళు.  అలా గడవక ముందు నా చేతుల్లోకి వచ్చిన చలంగారి రెండవ పుస్తకం ‘ప్రేమ లేఖలు’.  అప్పటికి అయిదారేళ్ళ క్రితం నేను ఆకస్మికంగా చదివిన చలం గారి మొదటి పుస్తకం ‘స్త్రీ’.  ఆకస్మికం అని ఎందుకన్నానో చెప్పాలి.  అది చదవక ముందు నాకు చలం గారి పేరు తెలియదు.  ఆయన గురించి ఎక్కడా వినలేదు.  మా పల్లెటూళ్ళో  పొరిగింట్లో అరుదయిన సాహితీ రసజ్నుడి చెక్క బీరువా నిండా ఉన్న పుస్తకాలే మా గ్రంధాలయం.  అందులోంచి పుస్తకాలు వెతుక్కుని తీసుకొనే స్వేచ్చ మాకు ఉండేది.  అలా వెతకడంలో ఈ పుస్తకం నా చేతికి తగిలింది.  నవలేమో అనుకుని తీసుకుని చదవడం మొదలు పెట్టాను.  తీరా నవల కాదు కాని పేజీలు కదులుతూఉంటే విస్పోటనమే.  నా లోపల తొక్కిపెట్టిన ఉక్రోషాలకు, కోపాలకు అసహాయతలకు- అవన్నీ అర్థవంత మైనవే అని చెప్పే- ఉరట.  అదీ చలంగారి మొదటి కరచాలనం.

చెప్పానుగా తర్వాత మళ్ళీ అయిదారేళ్ళకి పుస్తక ప్రదర్శనలో రచయిత పేరు, పుస్తకం పేరు, మోహావేశం కలిగించగా ఈ ప్రేమలేఖలు కొనుక్కున్నాను.  అప్పటికి పలువురు సాహితీ విమర్శకుల ద్వారా చలం గారి గురించి పలు విధాలుగా విన్నా నా హృదయం మాత్రం ఆయన వేపే మొగ్గుతూ ఉండేది.

‘ప్రేమ లేఖలు’ చదవడం ఎవరి జీవితంలో నయినా సరే ఒక అత్యంత ఆవశ్యకమయిన అవసరం.  అప్పటికే భావుకతా పక్షాలు ఏర్పడిన నా మనస్సులో  ఆ పుస్తకం నా రెక్కలకి బలాన్నిచ్చి ఎగిరేలా చేసింది.  నా రెక్కల్ని నెమలి కన్నులంత మృదువుగా సుందరంగా మార్చింది. చూడవలసిన లోకాలతో పాటు తీసుకెళ్ళి తిప్పవలసిన రెక్కలు కూడా అంత లలితంగా హృద్యంగా ఉండాలని తెలియ జెప్పింది.  నాకు ఉహామాత్రంగానే తెలిసిన లలిత శృంగార లోకాల వెలుగు రంగుల్ని అబ్బుర పరుస్తూ చూపించింది.

‘స్త్రీ’ పుస్తకం స్త్రీల తాలుకు పరమ కఠోరవాస్తవ స్థితిని వినిపిస్తే ‘ప్రేమ లేఖలు’  పుస్తకం’ అయినా సరే’ ఈ మట్టిలో ఈ నెలలోనే పూయించు కోవలసిన పూల గురించి చెప్పింది.

ఈ  రెండు పుస్తకాలూ  నా మీద తక్కువ ప్రభావం చూపలేదు. ఇప్పటికీ అప్పుడప్పుడు ‘స్త్రీ’ లోని ముందు మాటలు చదువు కుంటూ ఉంటాను.  దొంగ మాటలు, నంగిరి బుద్ధులు , టక్కరి పనులు, ఈర్ష్యా ద్వేషాలతో కుళ్ళి పోవడాలూ లేని స్వచ్చమైన, శాంతమైన జీవనం దొరికే మార్గం నాకు అందులో లభిస్తూ ఉంటుంది.  నా మాటలో, రాతలో, జీవన యాత్రలో అది ప్రతిఫలిస్తోందని ఎవరేనా, ఎప్పుడేనా చెప్పడం తటస్థిస్తూ ఉన్నపుడు అది చలంగారి ‘స్త్రీ’ పుస్తకం తాలుకు ఫలశ్రుతిగా (ఫల పఠనం అనాలేమో) భావిస్తుంటాను.

ప్రేమ లేఖలు చదివి చాలా కాలమయింది.  కానీ ఒకప్పుడు చాల ఏళ్ళ పాటు చదివాను. మళ్ళీ ఇప్పుడు తీసి అలవోకగా చదివితే నేను పరాకు పడ్డ సుందర లోకాలన్నీ కళ్ళ ముందుకు వచ్చాయి.  ఒక వ్యక్తి కోసం ప్రాణాలన్ని పెట్టి జీవితమంతా ఎదురు చూడడంతో మొదలయిన స్థితి నుంచి ఇతరులెవరి కోసమయినా మనని మనం మరచి సహాయం చెయ్యడానికి పరుగు పెట్టే లాంటి ప్రేమని ఆ లేఖలు మనసుకి అలవాటు చేస్తాయి.  అంటే  ఆ’ ప్రేమానుభూతి ‘ నిబద్దులయిన వారికి’ సహానుభూతిని’ నేర్పుతుంది.

ఇక ఆ తర్వాత చలంగారి పుస్తకాలన్నీ చదివాను.  ప్రసంగాలు చేసాను.  చలాన్ని ఇష్టపడే స్త్రీని, చలం మీద డాక్టరేట్ చేస్తాననే స్త్రీని, చేసిన స్త్రీని ఇప్పటికీ ‘అదోలా’ చూసే మనుషులున్నారు.  నాకు అలాంటి వాళ్ళ మీద జాలి కలుగుతూ ఉంటుంది.  వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎంత కోల్పోయేరో కూడా వాళ్లకి తెలీదని.చలం గారు చూపించిన సుందరలోకాలు వాళ్ళకి యెంత దూరమో అని.

ప్రణయ సంబంధాల్లో, ప్రేమ సంబందాల్లో  ఒకరికొకరు నిబద్దులయి ఉండే కొద్దీ ఆనందం పెరుగుతుంది.  నిబద్దత అందుకోసమే.  తమ మద్య కొంత కాలం పాటు ఉన్న ప్రణయం తాలుకు ఆనందాన్నిమనుషులు  అనిబద్దులు, అసత్య వాదులు కావటం వల్ల పోగొట్టుకుంటారు.  ఇష్టాలు పోతే విషయం వేరు.  ‘దైవ మిచ్చిన భార్య’ అన్న నవల అంతటా చలంగారు ఈ అంశాన్నే రాసుకొచ్చారు.

1994 లో చలం శత జయంతి సంవత్సరంలో చలం నవలా నాయికల స్వగతాలతో ‘వాళ్ళు ఆరుగురు’ అనే రూపకాన్ని ‘నూరేళ్ళ చలం’ సంఘ సభ్యులు ప్రదర్శించారు.  అప్పుడు దైవ మిచ్చిన భార్య నవలలోని పద్మావతి పాత్రను నేను  ఎంచుకుని ఆ ప్రదర్శనలో పద్మావతి పాత్రతో నా మనోభావాలు ప్రకటించాను.  ఆ రూపక ప్రదర్శన నాకు అంత మంచి అనుభవం కాదు కానీ పద్మావతిలోనీ  ఆమె ప్రేమికుడు రాధా కృష్ణ లోనీ  తరగని ప్రేమ, దాని పట్ల వారికున్న నిబద్దత నాకు ఆదర్శం.

ఈ మధ్య ఒక మిత్రుడు పేస్ బుక్ లో ఒక ఇంగ్లీషు కొటేషన్ రాసాడు.  ప్రేమ అగ్ని, అది తగిలితే మనలో ఉన్న చెడు కాలిపోయి మంచి వెలుగుతుంది అని.  ఇది చలంగారికి సరిపోయే మాట.  అదే కింద కామెంట్ గా రాసాను.

చలాన్ని చదివిన వాళ్ళందరికీ ఇది ఎంతో కొంత అనుభవంలో ఉండే ఉంటుంది.  చలాన్ని చదివిన వాళ్ళు చెడిపోయినట్లు కనిపించినా  వాళ్ళు ఎంతో మందిలాగ దొంగతనంగా చెడిపోవడం లేదని గుర్తుపెట్టు కోవాలి

అంతిమ నిర్ణయాలలో ఎవర ఎక్కడ మిగిలేరో చూసుకుంటే లెక్కలు బాగా కనిపిస్తాయి కాలకుండా వెలగకుండా కొరకంచు ల్లాగా మాత్రం ఉండరు .

చలంగారి పుట్టిన రోజు వస్తోంది.  ఆయన ఎంత ప్రేమ మూర్తి అంటే ఆయన కోసం పని చెయ్యడం మొదలెడితే మనకి ఎన్నో వేపుల నుంచి ఎంతో ప్రేమ అందుతూ ఉంటుంది.  చలం శత జయంతి సంవత్స

రం అంతా నేను ఆంధ్ర దేశంలో అన్ని ఊళ్ళలోనూ తిరిగాను.  ఎంత ప్రేమని స్నేహాన్ని సంపాదించు కున్నానో మరువలేను.  (ప్రేమ అన్న మాటని కాస్త విశాలార్థం లోనే చదువుకోవచ్చు) చలంగారి పేరు చెప్పగానే  కాస్త స్పందన ఉన్న మనుషులు కొంత కుతూహలంతో కొంత ఇష్టంతో, ఎంతో ఆరాధనతో తొణికి పోతారు.  వాళ్ళ ముఖాలు అప్పుడు మనకి ఎంత ప్రేమాస్పదంగా ఉంటాయో!

“ఏదో అసాధారణ మార్గాన మీరు రాస్తారనీ ,తెలియజేస్తారనీ, ఏదో విశ్వాసం” అంటాడు ప్రేమ లేఖల్లో ప్రియురాలితో చలం

ఈ మాట ఆయన సాహిత్య మంతటికీ సరిపోతుంది.  అసాధారణ మార్గాన రాస్తూ వాటి ద్వారా వచ్చి మన హృదయాలను దోచుకుంటూ ఉన్న ‘ ఈదొంగకు’ మనం పుట్టిన రోజు కాన్కగా ఇవ్వడానికి ఏం మిగిలింది ? ఆనందం తప్ప .

***