ఒక వేసవి సాయంత్రం

Akkadi MeghamFeatured

ఉర్దు మూలం : సజ్జద్ జహీర్

తెలుగు సేత : జగద్ధాత్రి

 ఈ కథ ‘అంగారే’ అనే కథా సంకలనం లోనిది. ఇందులో ఎనిమిది కథలు ఒక నాటకం ఉన్నాయి. అరసం వ్యవస్థాపకులు డాక్టర్ రషీద్ జహాన్ , ఆమె భర్త డాక్టర్ సయ్యద్ జహీర్ కలిసి తీసుకొచ్చిన మొట్టమొదటి ఉర్దు కథా సంకలనం. ఈ పుస్తకాన్ని మతాచారాలకు వ్యతిరేకంగా ఉన్నదని అప్ప్తట్లో నిషేధించారు. రషీద్ జహాన్ పేరు ముందు అంగారే వాలీ అని ఆమె ధైర్యానికి గుర్తుగా వ్యవహరించేవారు. అభ్యుదయ రచయితల సంఘం సంస్థాపక సభ్యురాలు ఈమె. ఇటీవల ఈ కథలను అమెరికాలో ఒక ప్రొఫెసర్ స్నేహాల్ సింఘ్వీ ఆంగ్లీకరించారు. ఈ కథతో బాటుగా ఉన్న మిగిలిన కథలను కూడా అనువాదం చేస్తున్నాను. త్వరలో ఇవి ఒక పుస్తకంగా వస్తోంది. 

 

సాయంత్రం ప్రార్ధన ముగించుకుని, మున్షి బర్కత్ అలీ అలవాటు  ప్రకారం అమీనాబాద్ పార్క్ లోకి నడిచాడు. అదో వేసవి సాయంత్రం, గాలి స్తంభించిపోయింది. చల్లని షర్బత్లు  అమ్మే చిన్న దుకాణాల వద్ద నిల్చుని మనుషులు మాట్లాడుకుంటున్నారు. న్యూస్ పేపర్లు అమ్మే కుర్రాళ్ళు అరుస్తూ అమ్ముతున్నారు. మల్లెపూల దండలు అమ్మే ఒకతను కాస్త నదురుగా కనబడిన వారందరి వద్దకు పరుగున వెళుతున్నాడు. ఈ మధ్యలో గుర్రపు బగ్గీలు, బళ్ళు తోలే వాటి కలగలిసిన శబ్దం వినపడుతోంది.

“కూడలికి ! అక్కడివరకు బండి మీద ! సార్! తీసుకెళ్లమంటారా కూడలి దాకా?’

‘ హే మిస్టర్, సవారి కావాలా ?’

‘మల్లెపూల దండలోయ్! బంతి పూల మాలలూ !’

‘రుచికరమైన అయిస్క్రీం!’

మున్షి ఒక పూల దండ కొని, కాస్త షర్బత్ తాగి , పార్క్ లోకి వెళ్ళే ముందు కిల్లి వేసుకున్నాడు. కూర్చోవడానికి ఒక్క బెంచీ కూడా ఖాళీ లేనందువలన , కొంతమంది కింద గడ్డిలో చతికిలబడ్డారు. శృతి తెలియని పాటల పిచ్చాళ్లు కొందరు దగ్గరలో గోల గోల చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు మౌనంగా కూర్చుని, పంచెలు ఎగదోసి తొడలు, కాళ్ళు గోక్కోవవడం లో మునిగిపోయి ఉన్నారు. ఉండుండి దోమలను కూడా వేటాడుతున్నారు. మున్షి ఎప్పుడు పొడవాటి కాటన్ పంట్లాం వేసుకుంటాడు, కనుక ఈ మనుషుల సిగ్గులేని ప్రదర్శన అసహ్యం కలిగించింది అతనికి. తనలో తాను అనుకున్నాడు ,’ ఈ వెధవలకు సిగ్గు లేదు’, ఇంతలో ఎవరో అతన్ని ఒక బెంచీ దగ్గరనుండి పిలిచారు.

‘మున్షి బర్కత్ అలీ!’

మున్షి వెనుతిరిగి చూశాడు.

‘ఓహ్ మీరా , లాలాజీ సోదరా !బాగున్నారు కదా !’

మున్షి పని చేసే ఆఫీసులోనే  లాలాజి కూడా హెడ్ గుమాస్తా. మున్షిది అతని కింద ఉద్యోగం. లాలాజీ జోళ్లు తీసేసి హాయిగా తన శరీరమంతటితో బెంచీ మీద కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు. పొడుచుకొచ్చిన బొజ్జ మీద సన్నగా నిమురుకుంటూ తనకిరువైపులా కూర్చుని శ్రద్ధగా అలకిస్తున్న వారితో ఏవేవో చెప్తున్నాడు. మున్షి ని  గమనించి పిలవాలని నిర్ణయించుకున్నాడు. మున్షి వెళ్ళి లాలా సాహిబ్ ముందర నిల్చున్నాడు.

లాలాజీ నవ్వి అన్నాడు, ‘ఏమిటిది మున్షిజి? పూల మాల కొన్నారే ? రాత్రికి బాగా గడుపుదామన్న ప్లానా? అంటూనే పెద్ద పెట్టున నవ్వుతూ తనకు ఇరు వైపులా ఉన్న ఇద్దరి వైపు తన మాటకు అంగీకరిస్తున్నారా అన్నట్టు చూశాడు. వారిద్దరూ లాలాజీ కావాలని వేసిన జోక్ కి నవ్వడం మొదలు పెట్టేరు.

మున్షి కూడా తప్పని, నీరసమైన నవ్వొకటి నవ్వాడు. ‘ హాయిగా గడపడమా, మీకు తెలుసు నేనసలేబీద వాడిని. ఈ వేదిలో ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది. కొన్ని రాత్రులుగా నేను నిద్రే పోలేదు. ఈ పూల దండ కొన్నది కనీసం ఓ గంటో రెండు గంటలో నిద్ర పట్టేందుకు ఉపయోగపడుతుందని.’

లాలాజీ తన బట్ట తల నిమురుకుంటూ మళ్ళీ నవ్వాడు. ‘ నువ్వు అనుభవించేవాడివి మున్షి జి, ఎందుకు చెయ్యవు?’ అనేసి ,మళ్ళీ తన మిత్రులతో మాటాడటంలో మునిగిపోయాడు. ఇదే అదను అని చూసి మున్షి ‘సరే మరి లాలాజీ సెలవు తీసుకుంటాను ఇక మరి ! ఖుదాహఫీజ్ !’ అని నడవడం మొదలెట్టాడు. తనలో తాను అనుకున్నాడు ‘ ఈ వెధవ కళ్ళలో పడ్డానేంట్రా బాబు ఇవాళ. రోజంతా రుబ్బిన తర్వాత అడుగుతున్నాడు ‘హాయిగా గడపాలని ప్లానా ? అంటే , ఏమనుకుంటున్నాడు నన్ను ! పెద్ద భూస్వామిని, రోజూ ముజ్రాలు వింటూ, సానుల కొంపలకి తిరిగే వాడిననా ? జేబులో పావలా కంటే ఎక్కువ లేని వాడిని. భార్య, పిల్లలు, నెలకి అరవై రూపాయల జీతం- ఇంకేముంది బల్ల కింద నుండి వచ్చే డబ్బుల పై నమ్మకమే లేదు. ఒక్క రూపాయి ఈరోజు సంపాదించడానికి ఏమి జరిగిందో ఎవరికి తెలుసు. ఈ పల్లెటూరి వెధవలు మహా తెలివి మీరీ పోతున్నారు రోజురోజుకీ. గంటలు గంటలు పనికిరాని హాస్కు కొట్టాక , అప్పుడు నిన్నేదో వాళ్ల బానిసవన్నట్టు ఇన్ని కొంచం నాణేలు జేబులోంచి తీస్తారు. కనీసం మాటలు కూడా మర్యాదిచ్చి మాట్లాడరు. ఈ పల్లెటూరి దరిద్రులు పొగరుమోతులై పోతున్నారు ఈమధ్య. ఇక అన్నిటికంటే దరిద్రం ఈ మర్యాదకోశం పది చచ్చే మాలాంటి మధ్య తరగతి మనుషుల బతుకు. ఒకవైపూ ఈ పల్లెటూరి వెధవలతోనూ కలవలేము, మరొక వైపు పై తరగతి వారు, ప్రభుత్వమూ మరీ స్ట్రిక్ట్ ఐ పోతున్నాది. ఒక్క రెండు నెలల క్రితం , బనారస్ జిల్లాలో ఇద్దరు గుమస్తాలు లంచం తీసుకున్నందుకు  పట్టుబడి సస్పెండ్ చేయబడ్డారు. ఎప్పుడూ జరిగేది అదే. పేదవాళ్లకే శిక్ష. అదే ఒక సీనియర్ ఆఫీసర్ కి మహా అయితే ఒక పదవి నుండి మరో పదవికి బదిలీ అవుతుంది అంతే’.

మున్షి సాబ్ ! ఎవరో ఒక పక్క నుండి అరిచారు. అది జూమ్మన్ గొంతు, తాను ఆర్డర్లీ ( బ్రిటిష్ పెద్ద అధికారుల ఇంట్లో పని చేయడానికి ఉండే ఉద్యోగి).

‘అరె నువ్వా జూమ్మన్? అన్నాడు మున్షి

కానీ మున్షి ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. పార్క్ నుండి బయటకి నడిచి నజీరాబాద్ దగ్గరకి వచ్చాడు, జూమ్మన్ అతన్ని అనుసరిస్తూ వచ్చాడు. అదొక వింత దృశ్యం.  ముందర సన్నగా పీలగా పొట్టిగా ఉండే , పడవ ఆకారం ముఖ్మల్ టోపీతో , చేతిలో పూల దండతో నడుస్తూ మున్షి , అతనికి రెండడుగుల దూరం లో , తల పాగాతో, చేతుల్లేని పొట్టి ఓవర్ కోట్ తో, నిలువెత్తు ఆజాను బాహువు ఆర్డర్లీ జూమ్మన్.

మున్షి అనుకున్నాడు , ‘ ఇప్పుడిలా ఈ వేళప్పుడు జూమ్మన్ నా వెంట పడటం దేనికబ్బా?’

అతని వైపుకి తిరిగి , ‘అయితే జూమ్మన్ , ఎలా ఉన్నావు? ఇప్పుడే పార్క్ లో హెడ్ క్లేర్క్ గారిని కలిశాను, ఆయన కూడా వేడి ఎక్కువగా ఉందంటున్నాడు’

‘సరే , మున్షి జి , ఏమి చెప్పమంటారు. ఒక్క వేడి మాత్రమే నన్ను చంపుకుతినడం లేదు. నాలుగు నాలుగున్నరకి పనిలోంచి బయటపడ్డాను, మేనేజర్ గారింటికి తిన్నగా ఇంటి పనికి వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడే అక్కడ పని పూర్తి చేసుకుని ఇంటికి పోతున్నాను. రోజంతా ఎంత కష్టమో తెలుసా మీకు , ప్రతి రోజూ పొద్దున్న పది నుండి రాత్రి ఎనిమిది వరకు పనే. ఇంట్లో పని పూర్తి చేశానో లేదో మూడు సార్లు బజారుకి వెళ్ల వలసి వచ్చింది . ఐస్, కూరగాయలు, పళ్ళు – తీరా అన్నీ కొనుక్కుని వెళ్తానా తిరిగి అరుపులు చీవాట్లు ‘ఎందుకివాళ ఎక్కువ పెట్టి కొన్నావు? ఎందుకీ పళ్ళు కుళ్లి పోయాయి? మేనేజర్ గారి భార్యకి అసహ్యం వేసింది నేను ఈరోజు కొన్న మామిడి పళ్ళు చూసి. మళ్ళీ వాటిని తిరిగి ఇచ్చి రమ్మంది. ‘ఈ టైమ్ లో ఎలా తిరిగి ఇవ్వగలను అమ్మగారు ?’ అన్నాను  , ‘ నాకదంతా తెలీదు , నిన్ను పంపించింది ఈ చెత్తoతా కొనుక్కొస్తావని కాదు’. చూడండి బాబు గారు, ఒక రూపాయి మామిడి పళ్లను ఏమి చెయ్యాలో తెలియక ఉన్నాను. ఆ మామిడి పళ్ల వాడి దగ్గరకు పోయి వాడితో నానా తగాదా పడితే రూపాయికి పన్నెండణాలు మాత్రమే తిరిగి ఇచ్చాడు. నాలుగణాలు నష్టం నాకు. ఈ నెల జీతం ఖర్చు అయిపోయింది సార్ , ఒట్టు నిజంగా తినడానికి రొట్టె ముక్క కూడా మిగలలేదు. నాకేం చెయ్యాలో తెలీడం లేదు. నా భార్యకి మొహం ఎలా చూపించాలో అర్ధం కాకుండా ఉంది’.

జూమ్మన్ తనకీ కధ చెప్పడం లో ఆంతరార్ధమేమిటో మున్షి కి అర్ధం కాలేదు. ఎవరికి తెలియదు కనుక ఆకలితో మాడే పేదవాడి గురించి? అయితే ఇందులో మున్షి చేసిన తప్పేంటి? తాను మాత్రం ఏమన్నా భోగాలు అనుభవిస్తున్నాడా ఏమన్నానా ? అప్రయత్నంగా  మున్షి చెయ్యి జేబు లోకి పోయింది . పొద్దున్న సంపాదించిన రూపాయి జాగ్రత్తగానే ఉంది.

“నువ్వు చెప్పింది అక్షరాల నిజం జూమ్మన్. ఈ రోజుల్లో పేదవారు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరిని చూడు ఇవే కష్టాలు. ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. నిజంగా చెప్పాల్సి వస్తే ఈ సూచనలన్నీ ‘మహా తీర్పు’ వెలువడే  రోజు త్వరలో వస్తుందని తెలుపుతున్నాయి. ఈ ప్రపంచం నిండా మోసగాళ్ళున్నారు , వాళ్ళకి అన్నీ అనుభవించడానికి దొరుకుతాయి, అల్లాను నమ్ముకున్న పవిత్రమైన వారే ఇలాంటి అన్నీ బాధలూ, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది’.

జూమ్మన్ మౌనంగా మున్షి మాటలు వింటూ అతన్ని వెంబడించాడు. మున్షి బయటికి శాంతంగా మొహం పెట్టినా లోలోపల బాగా కంగారుగా ఉన్నాడు. తన మాటలు జూమ్మన్ మీద ఎలాంటి ప్రభావం  చూపాయో అర్ధం కాకుండా ఉంది అతనికి.

‘నిన్న, శుక్రవారం నమాజు తర్వాత , మౌలానా తీర్పు వచ్చే  రోజును గూర్చిన సూచనలు వివరించారు. జూమ్మన్ భాయి , నీకు నిజం చెప్తున్నా , విన్న వాళ్లందరి కళ్ళలోనూ కన్నీరే. సత్యానికి ఇవన్నీ మన పాపాల ఫలితాలే. దేవుడు ఇచ్చిన ఈ శిక్షలు చాలవు మనకు. మన ఒక్కొక్కరిలో లేని లోపాలంటూ లేవు. బెనే ఇస్రాయెల్ ను మన వాటి కంటే తక్కువైన అతని పాపాలకు దేవుడు ఎలా శిక్షించాడో తల్చుకుంటే నాకు రోమాలు నిక్క బొడుస్తున్నాయి.  అయినా ఇవన్నీ నీకు తెలిసే ఉంటాయి’.

‘నేను బీద వాడిని మున్షిజి, ఈ చదువుకున్న వారి విషయాలన్నీ నాకేలా తెలుస్తాయి.  తీర్పు రోజును గూర్చి విన్నాను  కానీ సార్, పాపమీ బన్నీ ఇజ్రీల్ ఎవరండీ?’

ఈ ప్రశ్న వినగానే మున్షికి కొంచెం హాయిగా అనిపించింది. విషయం ఆకలి , పేదరికం నుండి తీర్పు రోజు, బెన్ని ఇస్రాయెల్ వైపు మళ్లడం బాగుందని పించింది. మున్షి కి కూడా ఆ తెగల చరిత్ర అంతగా తెలీదు, కానీ దాని గురించి గంటలు గంటలు మాటాడ గలడు.’

‘ఏమంటున్నావు జూమ్మన్ ? ముసల్మాన్ వయీ ఉండీ బెనే ఇస్రాయెల్ ఎవరోతెలీదూ! అరె భాయి, ఖురాన్ మొత్తం అంతా బెనే ఇస్రాయెల్ కథలతోనే నిండి ఉంటుంది! ప్రవక్త మూసా ఖాలీం- ఉల్లా పేరైనా విన్నావా పోనీ?( ఖురాన్ లో ఉన్న మూస అనే పేరు బైబిల్ లో మోసేస్ పేరుతో  సమానమైనది. బెనే ఇస్రాయెల్ అంటే ఇస్రాయెలీయులు)

‘అదేంటి? కలీం- ఉల్లా?’

‘ ఓహ్ అలా కాదు ప్రవక్త మూసా …మూ…సా..’

‘అంటే ఆ పిడుగు పడి పోతాడు అతడిని గురించా మీరు చెప్పేది?’

మున్షి గట్టిగా నవ్వేశాడు. ఇప్పుడు పూర్తిగా హాయిగా అనిపించింది అతనికి. కాసేపట్లో ఖాసిర్ బాఘ్ దగ్గరకు చేరారు ఇద్దరూ. ఆకలి పీనుగ ఈ ఆర్డర్లీ ని వదిలించుకోవాలి ఎలాగైనా అనుకున్నాడు. ఆకలితో బీదరికంతో మగ్గుతున్న వాడిని కలుసుకోవడం ఏమీ ఆహ్లాదం కాదు అసలు, అందునా ఈ సాయంకాలం వేళ, అందులోనూ నువ్వు కడుపు నిండా ఆరగించి , నీ నమాజులు పూర్తి చేసుకున్న తర్వాత , అలా వ్యాహ్యాళికి మనసుని ఉల్లాస పరచడానికి అలా నడకకి పోయినప్పుడు. కానీ మున్షి ఏమి చెయ్యగలడు! కుక్కలాగా జుమ్మన్ నివిదిలించి పారేయడానికి అస్సలు కుదిరే పని కాదు, ఎందుకంటే రోజూ కచేరీలో అతనికి ఎదురు పడాల్సిందే, అదీగాక పేద వర్గానికి చెందినవాడవటం వలన కూడా. తాను గనుక అందరి ముందు మున్షిని అవమాన పరిచాడంటే ఇన్నాళ్లూ నిలబెట్టుకున్న పరువు కాస్తా పోతుంది. బహుశా ,ఈ మలుపులో ఇక దారులు మళ్లి విడిపోవడం మంచిది.

‘సరే అయితే ! నీకు బెనే ఇస్రాయెల్ గురించి మూసా గురించి మరోసారెప్పుడైనా చెప్తాను, కానీ ఇప్పుడు నాకు కొంచం అవసరమైన పని ఉంది…ఇక్కడ.. సలాం , జూమ్మన్.’ మాటలు పూర్తి చేసి ఖాసీ బాఘ్ సినిమా హాల్ వైపు తిరిగి పోయాడు మున్షి. మున్షి అంతా వేగంగా వెళ్లిపోవడం చూసి జూమ్మన్ కాసేపు అక్కడే నిలబడిపోయాడు. ఏమి చెయ్యాలో పాలుపోలేదు అతనికి. అతని నుదుటి మీద చెమట చుక్కలు మెరుస్తున్నాయి.అతని కళ్ళు దిగాలుగా యిటు అటు చూశాయి. పెద్ద వెలుగుతో ఎలెక్ట్రిక్ దీపాలు, నీళ్ళు చిమ్మే ఫౌంటెన్, సినిమా పోస్టర్లు, హోటళ్లు, దుకాణాలు, కార్లూ, బళ్లూ, బగ్గీలూ, అన్నిటికి మించి చిమ్మ చీకటి ఆకాశం , మెరిసే నక్షత్రాలూ. తక్కువలో చెప్పాలంటే దేవుడి సృష్టి అంతా.

అయితే వెనువెంటనే తెప్పరిల్లి జూమ్మన్ మున్షి వెనుక పరుగెట్టాడు, జూమ్మన్ వదిలించుకున్నాననే  ఆనందం లో సినిమా పోస్టరును పరికిస్తున్న మున్షి వద్దకి.

అతని దగ్గరికి వెళ్ళి “ మున్షిజీ !’ అని పిలిచాడు

మున్షి గుండె గుభెలుమంది.  మతపరమైన ఆ చర్చ అంతా , అంతిమ తీర్పు రోజును గురించిన మాటలన్నీ అంతా వృధా పోయింది. మున్షి జూమ్మన్ కి జవాబు చెప్పలేదు.

‘మున్షి జీ , ఈరోజు ఒక్క రూపాయి అప్పు ఇస్తే , మీకు జీవితాంతం…’

మున్షి ఇటు తిరిగేడు. ‘ భాయ్ జూమ్మన్ , నాకు తెలుసు నీవెంతో  ఇబ్బందికర పరిస్థితి  లో ఉన్నవాని, కానీ నా పరిస్థితి ఏంటో నీకు తెలియదు. ఒక్క రూపాయి గురించి వదిలేయ్, కనీసం ఒక్క పైసా కూడానేను నీకు అప్పివ్వలేను. నా దగ్గరుంటే దాచుకునేవాడినా చెప్పు? నువ్వు అడగల్సిన  పనే లేదు. మొదట్లోనే నా దగ్గరేముంటే అది నీకు ఇచ్చి ఉండేవాడిని”

ఐనా సరే , జూమ్మన్ బతిమిలాడ సాగేడు. ‘మున్షి జీ, ఒట్టు నా కూలిరాగానే మీకు వెంటనే తిరిగి తీర్చేస్తాను. నిజం చెప్తున్నాను అయ్యగారు. నాకు సహాయం చేయడానికి ఇంకేవ్వరూ లేరు….’

ఇలాంటి సంభాషణలేప్పుడు మున్షి ని ఇబ్బంది పెడతాయి. ఏదన్నా సరి అయిన కారణం ఉంటే ఎవరినైనా కాదనేయవచ్చును , కానీ అది బాగోదు మరి. అందుకే ముందు నుండి విషయం ఇంత వరకు రాకుండా చూస్తున్నాడు.

అదే సమయానికి సినిమా పూర్తయి జనం వీధుల్లోకి వచ్చారు ఒక్కసారిగా.

“ బర్కత్ భాయ్ ! ఇక్కడేం చేస్తున్నావు? ‘ ఎవరో దగ్గరనుండి అన్నారు. మున్షి జూమ్మన్ వైపు నుండి అన్నది ఎవరా అని అటు  వైపు తిరిగాడు. ఒక సంపన్నుడు , లావుగా గుండ్రంగా , బహుశా ముప్ఫయ్యో ముప్ఫయ్ ఐదో ఉండొచ్చు వయసు, పొడుగు కోటు  వేసుకున్నాడు,బొచ్చు టోపీ పెట్టుకుని కిల్లీ నములుతూ, సిగరెట్టు తాగుతున్నాడు. ‘ఓహ్ మీరా చాలా ఏళ్లైంది మిమ్మల్ని చూసి. లక్నో పూర్తిగా వదిలేశారే మీరు. అయినా  భాయ్ , సిటీ లోకి వచ్చినా మీకు మాలాంటి పేద వాళ్ళని చూడటానికి టైమ్ ఎక్కడిది లెండి.’. అతను మున్షి కాలేజ్ స్నేహితుడు , మంచి సంపన్నుడు.  ‘అదంతా సరేలే వదిలెయ్. కాస్త సరదాగా హాయిగా గడుపుదామని లక్నో లో కొన్ని రోజులు వచ్చాను. రేపు నాతో రా , నువ్వు  జన్మలో మరిచిపోలేనంత గొప్ప నాట్యకత్తే ఇంటికి  తీసుకెళతాను. నా కార్ ఇక్కడే ఉంది. ఎక్కువ ఆలోచించకూ దాన్ని గురించి , వచ్చేయ్ అంతే. నువ్వేప్పుడైనా నూర్జెహాన్ పాట విన్నావా ? ఓహ్ అద్భుతంగా పాడుతుంది, అందంగా సొగసైన భంగిమలతో నాట్యం చేస్తుంది. ఆ కొంటె చూపులు , ఆ వయారి వొంపులు తిరగడం , ఆ పెదవులు కదిలించే విధానం, ఆమె గజ్జెల శబ్దం. మా ఇంట్లోనే ఆరుబయట , తారల నీడ కింద , గానా బజానా ఉంది. పొద్దున్న మేల్కొలుపు రాగం వినే వరకు అదలా కొనసాగుతూనే ఉంటుంది. తప్పకుండా రా. రేపేలాగూ ఆదివారమేగా … మీ ఆవిడ చెప్పు తీస్తుందని భయమా ఏం? ఆడాళ్లకి బానిసలుగా పడి ఉండాలంటే , నీకు తెలుసు పెళ్లే చేసుకోనక్కర్లేదు , అవునా ? రా భాయ్ మరి తప్పకుండా , భలే మజాగా ఉంటుంది.అలిగిన భార్యని బుజ్జగించడం లో కూడా ఒక రకమైన ఆనందం ఉంటుందిలే …….’

పాట మిత్రుడు, కార్ ప్రయాణం, ఆట పాట,కైపెక్కించే  కను చూపుల వాగ్దానం , స్వర్గం లాంటి ప్రదేశం- మున్షి ఒక్క ఉదుటున కార్ లోకి దుమికి కూర్చున్నాడు కార్ లో .జూమ్మన్ గురించి మరో మాట ఆలోచించలేదు. కార్ సాగిపోతుంటే  జూమ్మన్ అక్కడే మౌనంగా నిలబడి ఉండటం కనిపించింది.

 

 

*

 

 

చెరగదు ఆ దస్తూరి!

Gutala (1)

 

-జగద్ధాత్రి

~

జనవరి 4 2004 మోజాయిక సాహితీ సంస్థ రిజిస్టర్ అయి స్థాపించబడిన రోజు. ఆరోజే రామతీర్థ తెలుగు లోకి అనువాదం చేసిన టి.ఎస్. ఇలియట్ ‘ద వేస్ట్ లాండ్’ ‘వృధాత్రి’ పేరిట ఆవిష్కరణ. ఆరోజు హోటల్ మేఘాలయ లో రోజంతా జరిగిన సాహిత్య సభలో ఎందరెందరో మహానుభావులు, సాహితీ మూర్తులు. ప్రఖ్యాత కవి కె. శివారెడ్డి , అద్దేపల్లి, ఆదేశ్వరరావు గారు, ఇంకా ఎందరో. సభకు ప్రత్యేక ఆకర్షణ లండన్ నుండి వచ్చిన గూటాల కృష్ణ మూర్తి గారు. ఆరోజు ఆయనని , అచ్యుతరామరాజు గారిని గులాబీ మాలలతో సత్కరించుకోవడం మా సాహిత్య సంస్థకు
శుభారంభంగా భావించాము.

అనువాదాల ఆవశ్యకతను గూర్చి కొన్ని మాటలు మాట్లాడేరు గూటాల. ఇక ఆరోజు సాయంత్రం మా సాహితీ మిత్రుడు ప్రముఖ కవి ఏవిఆర్ మూర్తి తీసుకువెళ్లగా గూటాల దంపతులను దర్శించుకున్నాం, నేను శివారెడ్డి గారు ఇంకా కొందరు సాహితీ మిత్రులు. ఎంతో ఉత్సాహం తో సిగరెట్టు తాగుతూ ఆయన చెప్పిన కబుర్లు ఇప్పటికీ గుర్తు న్నాయి. శ్రీశ్రీ లండన్ వచ్చినప్పుడు తాను వచ్చిన పనిని కొంత వెనుక బెట్టినట్టు ఒక నాడు జి.కె. కి అనిపించి ,  ఆమాటే అంటే ఆ తర్వాత తాను వచ్చిన పని పూర్తి చేసేవరకు శ్రీశ్రీ మందు సేవించలేదని, చివరికి తను ఉండలేక బీరు
తాగేవాడినని, కనీసం అది కూడా తాగ కుండ పని పూర్తి చేసి అప్పుడు తాగాడు శ్రీశ్రీ అని చెప్పారు. శ్రీశ్రీ కోసం ఒక గదిని ప్రత్యేకంగా పెట్టి
అందులో ఆయనకి కావల్సిన మదిరను ముందే ఏర్పాటు చేసానని నవ్వుతూ చెప్పేరు.
ఆయనతో ఉన్న ఆయన శ్రీమతి తో కూడా నేను కాసేపు ముచ్చటించాను. ఎందుకంటే అక్కడ ఉన్న వారందరిలోనూ మహిళను నేనొక్కతినే. ఆమె తో మాట్లాడుతూ ఉంటే ఎన్నో కబుర్లు. ప్రొఫెసర్ గా పని చేసిన ఆమె కూడా విద్యావేత్త, కావడం గొప్ప విషయం. అయితే ఆవిడ సైన్స్ ప్రొఫెసర్ . నాతో జి.కె. సాహిత్య పిచ్చి గురించి ఆవిడ కంప్లెయింట్లు ప్రేమగా చెపుతుంటే భలే మధుర స్మృతిగా మిగిలింది
ఆరోజు మా మదుల్లో ఇప్పటికీ.

‘ఫ్రాన్సిస్ థామ్సన్’ 1890 లలో పుట్టి 1907 లో మరణించిన గొప్ప ఇంగ్లీషు కవి. అతని గురించి పరిశోధన చేశారు జికె. అంతే కాదు ఫ్రాన్సిస్ థామ్సన్
సోసైటీ పెట్టి కొన్నాళ్లు ఒక పత్రిక కూడా నడిపారు. 1890 పొయెట్రీ సొసైటీనaపేరిట జికె చేసిన సాహిత్య పరిశోధన  అమోఘం. ఆంగ్లేయులకే వారెరుగని వారి కవులను పరిచయం చేసేరు గూటాల. ఇక తెలుగు తల్లికి ఆయన చేసిన సేవ విదేశాంధ్ర ప్రచురణలు స్థాపించి శ్రీశ్రీ మహాప్రస్థానం ని మహాకవి స్వదస్తూరిలో నమోదు చేయించి ఆ గీతాలను శ్రీశ్రీ స్వరం లో రికార్డ్ చేసి కేసెట్ను ఆ ఫాసిమైల్ ఎడిషన్ లోనే వెనుక ఒక చిన్న బాక్స్ లా పుస్తకం లోనే పెట్టి ప్రచురించారు. మేము వెళ్ళిన రోజు ఒక్క పుస్తకాన్ని శివారెడ్డి గారికి బహుకరించారు. తర్వాత పురిపండా వారి  పులి పంజా కూడా అలాగే తీసుకొచ్చారు.

శంకరంబాడి వారి ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ను తన గాన సుమస్వరం లో అజరామరంగా అందించిన టంగుటూరి సూర్యకుమారి గురించి చాలా ఖరీదైన పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం లో ఆమె జీవిత విశేషాలను తెలియజేసే ఫోటోలు అన్నీ ఒక ఆల్బమ్ లా పొందు పరిచి ప్రచురించారు. సాంకేతికత ఇంకా ఇంత అభివృద్ధి చెందని ఆరోజుల్లో ఒక మహాకవి స్వరాన్ని దస్తూరిని భావి తరాలకు మిగిల్చిన  గొప్ప సాహితీ ప్రేమికుడు గూటాల.మరొక విషయం ఈరోజు సీనియర్ కధకుడు జయంతి వెంకట రమణ ని కలవడం జరిగింది. జి.కె. వారికి మేన బావ అని
తెలిసింది. అయనను కన్న బాబు అని పిలిచేవారట . ఎప్పుడూ ఇంగ్లీష్ పుస్తకం చదువుతూ ఉండెవాడు. 1956 నుండి సాన్నిహిత్యం అని గుర్తు చేసుకున్నారు .
ఏదేశమేగినా ఎందు కాలిడినా ఎంత కీర్తి గడించినా తెలుగు తల్లి ముద్దు బిడ్డగానే మిగిలి, తిరిగి మాతృ దేశం లోనే అసువులు బాసిన మహనీయుడు జికె. ఆయనకి సాహితీ జగత్తు అక్షర  నివాళి సమర్పిస్తోంది.

*

మగవాడు – ఆడది

 

ఉర్దు మూలం: ‘మర్ద్ ఔర్ ఔరత్’  డాక్టర్ రషీద్ జహాన్ (1905-52)

ఆంగ్ల సేత : రక్షందా జలీల్

తెలుగు సేత : జగద్ధాత్రి

~

ఆడది: అరె నువ్వు మళ్ళీ వచ్చావా?

మగవాడు : అవును

ఆ: కానీ నిన్న నీ పెళ్లి కదా?

మ: అవును

ఆ: అయితే?

మ: అయితే ఏంటి ?

ఆ: అంటే పెళ్లికూతురు ఏదీ అని?

మ: నా జీవితం నాశనమవ్వాలని నువ్వు నిజంగా కోరుకుంటున్నావా.

ఆ: నేనలాంటి మాట ఎప్పుడు అన్నాను?

మ: అయితే నన్ను ఇంత కష్టపెట్టడం లో నీ ఉద్దేశం ఏమిటి?

ఆ: అంటే అర్ధం ?

మ: ఎందుకలా నటిస్తావు? నేనంటున్నదాని అర్ధం నీకు ఖచ్చితంగా తెలుసు

ఆ: అలాగా. కానీ నేను ఏడాది క్రితం నుండే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాదంటున్నది నువ్వే.

మ: ఓహ్! అంటే పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగానే ఉన్నవన్నమాట? అయితే మరి నీ ఉద్యోగం సంగతి?

ఆ: అదీ ఉంటుంది

మ: కానీ నా భార్య మరొకరి దగ్గర పని చేయడం నేను సహించలేను. ఇల్లు , పిల్లలు చూసుకోకుండా పొద్దున్నే ఇల్లొదిలి వెళ్ళడం నాకు నచ్చదు.

ఆ: నువ్వు మాత్రం పొద్దున్నే ఉద్యోగానికి వెళ్లవా? నేను మాత్రం ఇంట్లో కూర్చుని ఈగలు తోలాలా?

మ: ఇంట్లో చేయడానికి చాలా పనులుంటాయి, ఇల్లు చక్కపెట్టుకోవడం లాంటివి ఇంకా కూడా.

ఆ: సరే …. అయితే నువ్వు ఆఫీసుకి వెళ్ళిన సమయమంతా నేను ఇంటి మూలలన్నీ చూస్తూ ఉండాలన్నమాట.

మ: నేను అలా అనలేదు. కానీ ఇంట్లో చేయడానికి చాలా పని ఉంటుంది అన్నాను.

ఆ: అంటే ఎలాంటిది?

మ: ఇదిగో చూడు , ఇల్లు చక్కపెట్టుకోవడం … ఐనా మన అమ్మలందరూ చేసిందే కదా , ఏం చేయలేదా చెప్పు?

ఆ: ఓ అంటే నువ్వానేదాని అర్ధం ఇంట్లో పొయ్యి అరకూడదని అంతేనా?

మ: నేను ఆ మాట అనలేదు.

ఆ: అయితే మరి ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే అర్ధం ఏమిటి ?

మ:ఇదిగో చూడు , నాకు తెలీదు. నిన్ను కలవడానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి  నా మీద విసురువెయ్యడం నీకు బాగా అలవాటైపోయింది.

ఆ: సరే , నీకు నా గొంతు వినడం ఇష్టం లేకపోతే , నేను మౌనంగానే ఉంటాను… చెప్పు ఇంతకీ , నువ్వు నిజoగానే పెళ్లి చేసుకుంటున్నావా లేక నన్ను మెప్పించడానికి అంటున్నావా ?

మ: ఏదో ఒక రోజు పెళ్లి తప్పక చేసుకుని తీరతాను; అక్కడికి నువ్వొక్కర్తెవే ఈ ప్రపంచం లో ఆడదానివి కావు. ఐనా చెప్పు , నా గురించి నీకెందుకంత బాధ?

ఆ: ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను గనుక.

మ: భలే బాగా చెప్పావ్! నువ్వేగనుక నన్ను నిజంగా ప్రేమించి ఉంటే ఇంత మొండి పట్టుదలతో వాదించి ఉండేదానివా? …’నేను ఉద్యోగం వదలను’…. ఆఫ్టర్ ఆల్ ఏముంది ఆ ఉద్యోగం లో గొప్పతనం? అదేదో వెయ్యి రూపాయలు సంపాదిస్తోన్నట్టు .. ఇంతా జేసి సంపాయించేది వంద రూపాయలు అంతకంటే లేదు.

ఆ: అయితే అవ్వచ్చు , కానీ ఆ కొద్ది సంపాదనే నా స్వేచ్చకి తాళం చెవి లాంటివి.

మ: అంటే నీ అర్ధం నీ స్వేచ్చ అంతా ఒక వంద రూపాయల్లో ఉందనా ?

ఆ: వందా, రెండొందలా… అది కాదు ఇక్కడ విషయం. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగల శక్తి కలిగి ఉండటమే నీ స్వాతంత్ర్యానికి నిదర్శనం.

మ: నీకస్సలు నా మీద ఏమాత్రం నమ్మకం లేనట్టుందే. నీకు నేను డబ్బులు ఇవ్వనని అనుకుంటున్నావా?

ఆ: అది కానే కాదు , కానీ అది నా కష్టార్జితం అవ్వదుగా.

మ: ఎవరు సంపాదిస్తే ఏముంది… మగవాడో ఆడదో

ఆ: ఓహ్! అందులో  తప్పకుండా చాలా పెద్ద తేడా ఉంది. నువ్వు ఆ పాత పల్లెపదం వినే వుంటావుగా : మగపిచ్చుక ఒక బియ్యం గింజ తెచ్చింది, ఆడ పిచ్చుక ఒక పప్పు గింజ తెచ్చింది , రెండు కలిపి ఖిచిడి (పులగం) వండుకున్నారు అని.

Akkadi-MeghamFeatured-300x146

మ: నాకు నీ పప్పు బద్ద అక్కర్లేదు.

ఆ: నేను ఒట్టి అన్నం తినలేను.

మ: నిజమే నీకు పచ్చడి, అప్పడం, ఊరగాయాలూ కావాలి.

ఆ: నిజమే నాకు కావాలి

మ : ఎప్పుడు నిన్ను చూసినా నీ చుట్టూ నీ ఆరాధకులు మందలా చుట్టి ముట్టి ఉంటారు – దీపం చుట్టూ రెక్క పురుగుల్లాగా.

ఆ: నిజమే మరి , నువ్వు వాళ్ళని ఇంట్లోకి రానివ్వవుగా

మ: అస్సలు రానివ్వను

మ: కానీ వాళ్ళంతా నా స్నేహితులని నీకు తెలుసు

మ: అవును , మరే , చాలా దగ్గర స్నేహితులు

ఆ: అంటే దానర్ధం , వాళ్ళు వచ్చి నన్ను కలుసుకోవడానికి వీలు లేదనేగా?

మ: నాకు వాళ్ళంటే అసహ్యం

ఆ: ఎందుకో అడగవచ్చా?

మ: ప్రతి వారికి ఎవరి స్వభావం వారికి ఉంటుంది

ఆ: అయితే మరి నన్ను పర్దాలో కూర్చునేలా ఎందుకు చెయ్యవు?

మ: అలా చేయాలనే ఉంది నాకు , కానీ నువ్వు ఒప్పుకుంటావా?

ఆ: అంతేకాదు ఇంకా చాలా విషయాలున్నాయ్ నేను నీతో అంగీకరించనివి.

మ: ఏమైనా .. మిగిలినవి నువ్వు అంగీకరించినా అంగీకరించక పోయినా సరే , కానీ నీ మిత్ర మందని మాత్రం నేను భరించలేను.

ఆ: అయితే మరెవరు మన  ఇంటికి రావడానికి ఒప్పుకుంటావు?

మ: కేవలం మనిద్దరికి చెందిన మిత్రులు మాత్రమే.

ఆ: హ్మ్మ. మిస్టర్ అండ్ మిసెస్ సేథీ, మిస్టర్ సఫ్దర్.

మ: ఎందుకు? వాళ్లెందుకు రాకూడదు?

ఆ: కానీ నేను వాళ్ళని భరించలేనే

మ: కానీ ఎందుకని? ఎందుకు నీకు వాళ్ళంటే అయిష్టం?

ఆ: అదంతే.

మ: ఏదో కారణం ఉండాలి కదా

ఆ: ప్రతి ఒక్కరికీ వారివారి ఇష్టాలుంటాయి మరి

మ: మరీ చిన్న పిల్లలా మాటాడుతున్నావ్

ఆ: మరి నువ్వో?

మ: నేనెప్పుడూ సరయిన పద్ధతిలోనే సహేతుకంగానే మాటాడుతాను.

ఆ: అవును , నిజమే నువ్వాలాగే చేస్తావు. నీ వాదన ప్రకారం , నీకు నా స్నేహితులంటే ద్వేషం కాబట్టి వాళ్ళు మనింటికి రాకూడదు, కానీ నేను నీ స్నేహితుల్ని అసహ్యించుకుంటే …. ఏమి బాలేదిది! వాళ్ళు నిరభ్యంతరంగా వస్తో వెళ్తుండవచ్చును.

మ: సరే సరే బీబీ సహేబా, ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసి అలసి పోయి నేను ఇంటికి వస్తే , ఏదో ఒక క్షణం భార్య తో  ఆనందంగా గడపాలనుకుంటే , ఆవిడ తన ఫ్రెండ్స్ తో కలిసి ఇంటికి వస్తుంది. అయితే ఇదన్న మాట నీ మనసులో ఉన్న ఆలోచన  వైవాహిక జీవితమంటే?

ఆ: నీ మనసులో పెళ్ళైన తర్వాత జీవితం గురించి ఏమి ఆలోచన ఉందో నేను తెలుసుకోవచ్చా ? ఉదయాన్నే నువ్వు ఉద్యోగానికి వెళుతుంటే , భార్య మిమ్మల్ని చక్కగా ముస్తాబు చేసి పంపాలి …బొమ్మలా! ఆ తర్వాత తమరు వెళ్ళిన తర్వాత , ఇంట్లోనే ఉండి జపమాల తిప్పుకుంటూ తమరి జపమే చేస్తూ ఇంటి పనంతా చేసుకోవాలి. ఈ రకమైన బలవంతపు ఖైదుని ‘ఇల్లు చక్కదిద్దుకోవడం’ అంటారు. మీరు ఆఫీసునుండి అలసి సొలసి , చిరాకుతో రాగానే , మీ భార్య మిమ్మల్ని అలరించాలి , ఆ తర్వాత సఫ్దర్ సాహిబ్ కి , మిసెస్ సేథీకి కూడా మర్యాద చేయాలి.

మ: నేనలా ఏమీ అనలేదు

ఆ: అయితే ఏమిటి నువ్వన్నది?

మ: నేనన్నది అందరి ఆడవారి లాగే నువ్వు ఇంట్లో ఉంది ఇల్లు చూసుకోవాలి ……

ఆ: మళ్ళీ అదే మాట ‘ఇల్లు చూసుకోవడం’?

మ: అవును ఇల్లు కనిపెట్టుకుని ఉండటం

ఆ: నా ఉద్యోగాన్ని వదిలి నా స్వాతంత్ర్యాన్ని నేను అమ్ముకోలేను.

మ: నీ స్వాతంత్ర్యమా ?

ఆ: అవును , నా స్వేచ్ఛే

మ: అలా అయితే ! నువ్వు నీ స్వేచ్చని హాయిగా పెద్ద గుటకలు వేస్తూ అనుభవిస్తోంటే , నీ పిల్లల బాధ పడతారు.

ఆ: పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టెయ్యరు కదా

మ: ఏదో  ఒక రోజు పుడతారు కదా , దానికీ నీ అభ్యంతరం లేకపోతేనేగా

ఆ: లేదు నాకే అభ్యంతరం లేదు

మ: పోనీ పిల్లలు పుట్టాక ఐనా నీ ఉద్యోగాన్ని వదులుతావా?

ఆ: లేదు, అప్పుడు కూడా వదలను

మ: అయితే మరి ఒక్క విషయం అడగనా , పిల్లల్ని ఎవరు చూసుకుంటారు?

ఆ: నువ్వు , నేను కలిసి

మ: ఒక ఆడదాని మొదటి బాధ్యత పిల్లల్ని పెంచడం

ఆ: ఒక మగాడి మొదటి బాధ్యత పిల్లల్ని కనడానికి అర్హత కలిగి ఉండడం

మ: ఏమంటున్నావ్ నువ్వు ?

ఆ: నేననేది ఎప్పుడు ఆడదే పిల్లల్ని ఎందుకు పెంచాలని ఆజ్ఞాపిస్తారు , ఇంతకీ పిల్లలు ఎవరికి చెందుతారు ?

మ: తండ్రికి

ఆ: అయితే మరి నేను ఎందుకు పెంచాలి? ఎవరికి వాళ్ళు స్వంతమో వాళ్ళే పెంచాలి

మ: మరీ విడ్డూరమైన మాటలు చెప్తావు నువ్వు !

ఆ: ఇందులో విడ్డూరం ఏముంది ?

మ: ఇందులో వింత ఎందుకు లేదు? ఇప్పుడు నువ్వు పిల్లల్ని కూడా పెంచడానికి ఒప్పుకోవడం లేదు కదా

ఆ: నేను ఒప్పుకుంటానో ఒప్పుకోనో , కానీ నువ్వు మాత్రం ఒప్పుకోలేదుకదా

మ: నా పని పిల్లల్ని పెంచడం కాదు , డబ్బు సంపాదించడం

ఆ: నేనూ డబ్బు గడిస్తాను

మ: హ్మ్మ… ఒక్క వంద రూపాయలకేనా ఇంత మిడిసిపాటు! ఇంకొంచం ఎక్కువ సంపాదిస్తే ఇక ఎంత గోల చేసి ఉందువో  ఆ భగవంతుడికే తెలియాలి

ఆ: ఆల్రైట్ , పోనీ వాదన కోసమైనా ఒక సారి ఊహించు , నీ జీతం వంద రూపాయలయి, నా జీతం ఎనిమిది వందలుంటే, ఎవరు ఉద్యోగం వదిలేయలి, నువ్వా నేనా?

మ: నువ్వు

ఆ: ఎందుకని?

మ: ఎందుకంటే నేను మగాడిని కనుక

ఆ: అంటే ఏ సందర్భం లోనైనా నిన్ను నువ్వే అధికుడిని అనుకుంటావన్న మాట ?

మ: నేనొక్కడినే అలా అనుకోవడం లేదు ; ఈ విశ్వమే నన్ను అధికుడిగా సృష్టించింది

ఆ: నువ్వు నాకంటే ఏమీ గొప్ప అని నేను అనుకోవడం లేదు. నిన్ను రేయింబవళ్లూ పూజించే ఆడదాన్ని కట్టుకోవాలి నువ్వు

మ: అవును అలాగే చేసుకుంటాను. ప్రపంచం లోఉన్న ఆడదానివి నువ్వొక్కత్తెవే కాదు కదా

ఆ: అయితే వెళ్ళు , నీ దారిన నీవెళ్లు. రోజూ నా దగ్గరికి వచ్చి నన్నెందుకు విసిగిస్తావు?

మ: ( ఒక క్షణం మౌనం తర్వాత) ప్రేమంటే నువ్విచ్చే విలువ ఇదేనన్నమాట

ఆ: నువ్వూ అంతేగా

మ: (మరొక్క క్షణం మౌనం తర్వాత) అయితే చెప్పు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నన్ను?

ఆ: నువ్వెప్పుడంటే అప్పుడే , కానీ నా ఉద్యోగం మాత్రం వదులుకోను.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

తెలుగులో రాయడమే గొప్ప తృప్తి!

 

 

– జగద్ధాత్రి

~

 

తమిళం మాతృ భాష , మలయాళం విద్యాభ్యాసం చేసిన భాష , తెలుగు నేర్చుకుని పట్టు సాధించిన భాష . అందుకే నాకు ముగ్గురమ్మలు అని చెప్తారు స్వామి గారు. తెలుగు భామనే కాక తెలుగు భాషను కూడా స్వంతం చేసుకుని , అందులో మంచి రచనలు చేసి తనకంటూ ఒక ముద్ర వేసుకోగలిగిన వారు స్వామి గారు. అలాగే అనువాదకునిగా తెలుగు భాషలో సాహిత్య అకాడెమీ పురస్కారం సాధించడం  ఆనందదాయకం ఆశ్చర్యకరం కూడా. ఈ సందర్భంలో  రండి ఆయన మనసు విప్పి చెప్పే నాలుగు మాటలు విందాం. నిరంతర కృషీవలుడు , నిగర్వి ఎన్ని సాధించినా , ఎన్ని అవార్డులు వచ్చినా నిర్మమంగా తన పని చేసుకుంటూ పోయే స్వామి గారు మనందరికీ ఆదర్శంగా నిలుస్తారనడం లో అతిశయోక్తి లేదు. 2015 కు గాను “సూఫీ చెప్పిన కథ “ రామన్ ఉన్ని నవల తెలుగు అనువాదానికి సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని స్వామి గారికి ప్రకటించింది. ఇది మన తెలుగు వారికి అందరికీ గర్వ కారణం. నేనెప్పటికీ తెలుగు రచయితగానే ఉంటాను అని చెప్పే స్వామి గారి మనో భావాలు మనం కొన్ని ఇక్కడ తెలుసుకుందాం.

1 . కధకుడిగా మీ ప్రారంభాలు, అనువాదకుడిగా ప్రారంభాలు ఒకే సారి జరిగాయా ?

       లేదు. ఒకే సారి జరగలేదు. నా మాతృభాష కాని తెలుగులో సాహిత్య రచన చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు.   కధకుడిగా ఆరంగేట్రం చేసిన పది సంవత్సరాల తరువాతనే అనువాదకుడి పాత్ర ధరించాను. నిజం చెప్పాలంటే ఒక అనువాదాలు చేయటం మొదట్లో నాకు ఇష్టం లేని పని గానే వుండేది. విశాఖలో స్దిరపడ్డాక తెలుగు నేర్చుకుంటే నా మిత్రులతో,  సహోద్యోగులతో కలసి మెలసి తిరగటం సుళువుగా వుంటుందనుకొని  తెలుగు నేర్చుకున్నాను. భాషా పరిజ్ఞానంతో తెలుగు సాహిత్యం చదివి ఆనందించేవాడ్ని. దీనికి ఒక కారణం ఉంది. నేను పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టీ సమాజాన్ని బట్టి సాహిత్యం చదవటం బాగా అలవాటైంది. విశాఖలో ఆ రోజుల్లో మలయాళ పుస్తకాలు దొరికేవి కావు . నాకు ఆంగ్ల సాహిత్యం చదివే అలవాటు అప్పుడు –ఇప్పుడు కూడా లేదు –అందువల్ల తెలుగు సాహిత్యమే అందుబాటులో వుండేది. 1980 తరువాతనే తెలుగు బాగా చదవటం నేర్చుకున్నాను. అయినా కధలు వ్రాయాలని కానీ సాహిత్య రచన చేయాలని కానీ అనిపించలేదు.1988 ప్రారంభంలో ఒకానొక సందర్భమున  పోటీలో బహుమతి పొందిన ఒక కధ గురించి మా సహోద్యోగుల మధ్య జరిగిన వేడి వేడి చర్చ , తద్ఫలితంగా వాళ్ళు  విసిరిన సవాలు వల్ల తెలుగులో మొదటి కధ వ్రాసాను –నన్ను నా భాషా పరిజ్ఞానాన్ని రుజువు చేయటం కోసం –అదే నా మొదటి తెలుగు కధ –జవాబులేని ప్రశ్న –ఆ కధకి అలనాటి ఆంధ్రజ్యోతి వార పత్రిక నిర్వహించిన కధల పోటీలో బహుమతి వచ్చింది [1988 ]. ఆ హుషారులో ఎన్నో కధలు వ్రాసాను . అప్పుడే కొందరు పత్రికా సంపాదకులు మలయాళ కధలు తెలుగులోకి అనువాదం చేయమని నన్ను అడగటం జరిగింది. కాని ఒక సృజనాత్మక రచయితగా కొనసాగాలనుకునే నేను ఏ అనువాదమూ చేయలేదు. ఆ తరువాత 2000 ప్రాంతంలో కే. అయ్యప్పపనికర్ సంకలనం చేసిన మలయాళ జానపద గేయాలను తెలుగులోకి అనువదించమని   సాహిత్య అకాడెమి కోరటం వల్ల తప్పనిసరిగా ఒప్పుకున్నాను. ఆ పని పూర్తి అవగానే ప్రముఖ మలయాళ కవి కే. సచ్చిదానందన్ తన 96 కవితలను తెలుగులోకి అనువాదం చేయమని కోరారు [శరీరం ఒక నగరం]సమయాభావం వల్ల కొంత ఆలస్యం చేసినా మొత్తానికి అనువాదం పూర్తి చేసాను. నా అనువాదాలు బాగున్నాయనే పేరు రావటం వల్ల అనువాదాలు చేయమనే ఒత్తిడి పెరిగింది.మరో రెండేళ్ళు తరువాత పదవి విరమణ చేసాను కనుక ,సమయం అందుబాటులో వచ్చి,  వరసగా అనువాదాలు చేసి తెలుగులోకి 17 పుస్తకాలనూ మలయాళంలోకి 13 పుస్తకాలనూ అనువాదం చేసాను; ఇంకా చేస్తున్నాను.

swami 1

2 –    మలయాళ భాషలో మీరు రచనలు చేసారా ?మీ చిన్నతనం లో అటువంటి విశేషాలు వివరించండి

నేను విశాఖ రాక ముందు మలయాళంలో ఎన్నో రచనలు చేసాను. చిన్నప్పటినుంచి అంటే ఎనిమిదో తరగతి చదివే రోజుల్లోనుంచి మలయాళం లో కవిత్వం వ్రాసేవాడ్ని. కాని అచ్చైన మొదటి మలయాళ రచన నేను వ్రాసిన ఏకాంక నాటిక. ఈ నాటిక నేను పదో తరగతి చదివేటప్పుడు [1960] వ్రాసాను. ప్రముఖ మలయాళ వార పత్రిక వారు విద్యార్ధులకోసం [కాలేజీ స్కూల్ పిల్లలకోసం ] నిర్వహించిన ఏకాంక నాటక రచన పోటీలో మొదటి బహుమతి పొందింది ఈ నాటిక. 1960 నుంచి 1970 వరకు సుమారు 100 కవితలు వ్రాసి వుంటాను ,మలయాళంలో. కవితలు మాతృభూమి మలయాళ మనోరమ మొదలగు పత్రికల్లో వెలుబడ్డాయి. జాతీయ చంధసులో వ్రాయబడిన భావ కవితలే వాట్లో ఎక్కువ.

  1. మీరు ఎరిగిన, జీవించిన, మలయాళ సమాజంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వారి గురించి చెబుతారా ?

అలనాడు నేను జీవించిన మలయాళ సమాజం మొత్తం నన్ను ప్రభావితం చేసిందనే నేను అనుకుంటున్నాను. గుండెలో కవిత్వపు బీజం దాగివుంటే మొలకెత్తి చిగురించి విస్తరించడానికి అనువైన సామాజిక వాతావరణం సమాజంలో వుండేది. ప్రతి పల్లెలోని గ్రంధాలయం, అక్కడ చేరేవాళ్ళ చర్చలు, ఏదో ఒకటి వ్రాస్తే దాన్ని సరిదిద్ది ప్రోత్సాహించే పెద్దలు ,రచయితకి ఇచ్చే గౌరవం వగైరాలు చెప్పుకోదగ్గవి. అంతే కాదు మలయాళ భాషా భోదకులు [స్కూల్ లోనూ కాలేజీలో కూడా ] భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి పెరిగేలా పాఠాలు చెప్పేవారు . ఇక రచనల విషయానికి వస్తే నేను మౌలికంగా కవిని. కవి హృదయం కలిగినవాడని నేను భావిస్తున్నాను. మలయాళం లో కవిత్వమే వ్రాసే వాడ్ని.ఆధునిక మలయాళ సాహిత్యం  మహాకవి పి. కుంజీరామన్ నాయర్ నన్ను కొంతవరకు ప్రభావితం చేసాడనే చెప్పాలి , కవిత్వ రచనలో-

4 . తెలుగులో కధలు వ్రాసినప్పుడు, అనువాదకులుగా మీకొక  భవిష్యత్తు ఊహించారా ?

  కధకుడిగా కాని అనువాదకుడిగా కాని ఏదో ఒకటి సాధిద్దామనుకొని రచన కాని అనువాదం కాని చేయలేదు. ఎవరూ ఎవరినీ రచన చేయమని బలవంతం చేయరు ఇష్టమైతే చేస్తారు అంతే. Just for the pleasure చేస్తారు. అలాంటప్పుడు ఆశలు పెట్టుకోవటం అనవసరం.

SufiBookFrontCover

5 . మలయాళం లోని సూఫీ పరంజ కధ అనువాదానికి ఎంచుకున్నారు –ఈ నవల వివరాలు చెప్పండి

1993 లో వెలుబడిన సూఫీ చెప్పిన కధ అనే నవల మలయాళ సాహిత్యంలో గొప్ప సంచలనం రేపింది. వస్తు పరంగానూ భాషా పరంగానూ కొత్త పోకడలతో కూడిన ఈ నవల పాఠకుల హృదయాన్ని ఆకట్టుకుంది. 2010 వరకు పది ముద్రణలు పొందింది. అంతే కాదు ఆంగ్ల, ఫ్రెంచ్,  హింది తమిళ్ కన్నడ భాషల్లోకి అనువదింపబడి పాఠకుల మన్ననలు కూడా పొందింది. మానవ జాతికి ఉమ్మిడి పైతృకం ఉందనేది చక్కగా గుర్తు చేస్తుంది ఈ నవల. గతంలో రెండు సంస్కృతుల మధ్య నిలిచిన సమన్వయాన్ని కూడా గుర్తు చేస్తుంది గతం సలిపే గాయాల పుట్ట కాదు ఇక్కడ. దయార్ద్రమైన స్నేహ శిలలు –సంఘర్షణా భరితమైన ఈ కాలం లో అది ఒక ఔషదంగా పరిణమిస్తుంది. గుడి అయినా మసీదు అయినా మానవుని అధ్యాత్మిక అవసరాలను తీర్చే మార్గమేననే స్పృహ కలుగుతుంది. విగ్రహారాధనను గౌరవించని వారు కూడా విగ్రహారాధన పట్ల వున్న వైమనస్యపు పట్టు సడలిస్తున్నారు. తెలియని ఒక సత్యం గురించిన ఆలోచన మనసులో ఒక వెలుగు రేఖగా కదులుతుంది కత్తులు నూరి గొడవ పడటానికి సిద్ధంగా నిలిచిన రెండు మతాల మధ్య అతి ప్రాచీనమైన సహవర్తిత్వం ఉండేదని సూఫీ చెప్పినప్పుడు ఏవేవో అడ్డుగోడలు కూలిపోతున్నాయి . ఈ సూక్ష్మ స్వరాన్ని మనకు వినబడే విధంగా వినిపించ గలిగింది ఈ నవల. ఈ నవలను అనువాదం చేయాలనుకోవడానికి ఇదొక్క కారణమైతే, ఈ నవలలో కనబడే అతి సుందరమైన కావ్యాత్మకమైన భాష. ఈ పుస్తకాన్ని నేను అనువాదం చేసి ప్రచురణ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అనుకోకుండా కల్పనా రెంటాల గారు ఈ పుస్తకాన్ని పంపమని,  చదివి వెంటనే తమ సారంగా బుక్స్ వారే ఈ పుస్తకాన్ని ప్రచురిస్తామని మాట ఇచ్చారు. అంతే కాకుండా ఈ పుస్తకం ఇంత వేగం వెలుగు చూసేలా చేయడం, దానికి ఇలా అవార్డ్ రావడం రెండు నాకు చాలా ఆనందం కలిగించాయి. ఇందుకు కల్పన గారికి నా కృతజ్ఞతలు. తెలుగు లో కూడా ఈ పుస్తకం మంచి పేరు తీసుకొచ్చింది.

6 మలయాళం నుంచి తెలుగులోకి, తెలుగునుంచి మలయాళం లోకి ఎన్ని రచనలు వెలుబడ్డాయి ఏ ప్రముఖ రచయితలను అనువదించారు ?

మలయాళం నుంచి తెలుగులోకి 17 పుస్తకాలనూ తెలుగునుంచి మలయాళంలోకి 13 పుస్తకాలనూ అనువదించాను. నేను అనువదించిన రచయితలు ,మలయాళం నుంచి తెలుగులోకి  మహాకవి అక్కితం నంబూద్రి “ఇరవయ్యవ శతాబ్దం” [ ఒక దీర్ఘ కవిత ], ఆధునిక మలయాళ కవి సచ్చిదానందన్ [రెండు కవితా సంపుటాలు ], జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత ,కవి ,ఓ.ఎన్.వి . కురుప్ [ఒక కవితా సంపుటం ],  నారాయణన్ [ ఒక నవల .ఒక కధా సంపుటి ], సేతు [ మూడు నవలలు ,20 కధలు ], శ్రీనారాయణ గురు,  సి . రాధాకృష్ణన్ [నవల ],  జెక్కేరియా [97 కధలు ],  తకలి, బాషీర్, కారుర్, హరికుమార్, సంతోష్ ఎచ్చికాణం, వైశాఖన్, కె .ఆర్ . మీర, పొంకున్నం వర్కి మొదలైనవారి కధలు

తెలుగు నుంచి మలయాళం లోకి, ఇక తెలుగు నించి  గోపి ,శివారెడ్డి ,కేతు విశ్వనాధ రెడ్డి ,సలీం ,జయంతి పాపారావు గురజాడ వారి కధలు , దివాకర్ల వేంకటావధాని గారి ఆంధ్ర వాగ్మయ చరిత్ర ,శ్రీ శ్రీ మోనోగ్రాఫ్ ,చక్రపాణి మోనోగ్రాఫ్  చాగంటి సోమయాజులు వగైరా.

స్వామి గారితో జగద్ధాత్రి

స్వామి గారితో జగద్ధాత్రి

7 .కధకుడిగా ఒక కధ మీరు వ్రాసినప్పుడా మంచి కధను అనువాదం చేసినప్పుడా మీకు ఎక్కువ సంతృఫ్తీ కలిగింది ?

కచ్చితంగా మంచి కధ వ్రాసినప్పుడే నాకు సంతృప్తి కలుగుతుంది.

8 తెలుగు సాహిత్య అనువాద రంగపు అభివృద్ధికి మనం ఎటువంటి చర్యలు చేపెట్టాలని మీరు భావిస్తున్నారు ?

 పూర్వంకన్నా ఇప్పుడు తెలుగునుంచి ఇతర భాషల్లోకి ఇతర భాషల్లోనుంచి తెలుగులోకి చేసే అనువాదాల సంఖ్య పెరిగింది . ఎప్పుడైనా ఎన్ని అనువాదాలు చేసివున్నా ప్రతి సారి అనువాదం ఒక సవాలే, మూల లక్ష్య భాషల సంస్కృతుల పట్ల మంచి పట్టు లేనివాడు మంచి అనువాదం చేయలేరు. తెలుగు  మాతృభాష గలవాడు హింది నుంచి తెలుగులోకి అనువాదం చేసినప్పుడు మూల భాషా సమాజం గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల అనువాదం మూల కృతికి న్యాయం చేయకపోవచ్చు. అందువల్ల అనువాదాన్ని ఒక సాధనగా భావించి మూల లక్ష్య భాషల సమాజాల గురించీ వాళ్ళ సంస్కృతుల గురించి వాట్లో చోటు చేసుకునే పరిణామాల గురించి నిరంతరం అధ్యయనం చేస్తూ వుండాలి-దానికి తగిన వాతావరణం వుండాలి, లేకపోతే కల్పించాలి.

  1.  మలయాళ సాహిత్య రంగం, పాఠకుల అభిరుచి ఇటువంటి రంగాల్లో తెలుగు సంస్కృతిక సమాజం అలవర్చుకోవలసిన ముఖ్యమైనవేమన్నా గమనించారా ?

గమనించాను. మలయాళీలకు సాహిత్యం పుస్తక పఠనం జీవితంనుంచి విడదీయలేని ఒక భాగం. చిన్నప్పటినుంచి పిల్లలకు సాహిత్య పుస్తకాల పఠనం అలవాటు చేస్తారు.  మలయాళ రచనలు బాగా చదివించేవిగా  ఎక్కువగా ఆర్ద్రంగా వుంటాయి. 300 –400 వందల పేజీల నవలలు కూర్చుని ఏకదాటిగా చదివేస్తారు. అందుకే అలాంటి నవలలు లక్షల  కాపీలు అమ్మకమవుతున్నాయేమో !

10 . అనువాద రంగంలో ప్రస్తుతం మీరు చేస్తున్న, అకాడెమి అప్పగించిన కర్తవ్యాలు గురించి చెప్పండి

   2013 లో అకాడెమి అవార్డు పొందిన కే . సచ్చిదానందన్ గారి మలయాళ కవితా సంపుటి MARANNU VECHA VASTHUKKAL AND OTHER POEMS  అనే పుస్తకం తెలుగులోకి అనువాదం చేస్తున్నాను . అంతే కాక ఒక మలయాళం తెలుగు నిఘంటువు  కూడా తయారు చేస్తున్నాను

  1.  కధకుడిగా అనువాదకుడిగా మీ సాహిత్య జీవితం మీకు సంతృప్తి నిచ్చిందా ?

 కొంత వరకు…పూర్తిగా సంతృప్తి పొందినవాడు తరువాత పని చేయడు.  నేను ప్రస్తుతానికి సంతృప్తి పొందినా ఇంకా ఈ రంగంలో కృషి చేయాలననుకుంటున్నాను కనుక మానసికంగా పూర్తి సంతృప్తి పొందానని చెప్పలేను . ఇంత క్రితం పలు మార్లు చెప్పినట్లు నాకు ప్రత్యేకమైన టార్గెట్ లేదు సాహిత్యంలో. ఒక టార్గెటు అంటూ వుంటే అది అందగానే సంతృప్తి చెందుతారు. ఆ తరువాత కొందరు నిష్క్రమిస్తారు కూడా. నాది నిరంతర సాధన.

  1. సమాజం లో సాహిత్యం పాత్ర ఎంతవరకు ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు ?

 సాహిత్యం తాలూకు పాత్ర ఎంతో ఉంది –ముఖ్యంగా అనువాద సాహిత్య పాత్ర –ఎక్కువ భాషలు నేర్చుకోవటం వల్ల ఇతర భాషా సాహిత్యం చదవటం వల్ల,భిన్న సంస్కృతులు తెలుసుకోవటం వల్ల మనిషి మనోభావాలు వాడు ఎక్కడున్నా ఒకటేనని అర్ధం చేసుకోగలుగుతారు. మనిషి తన లోపల వున్న మనిషిని డిస్కవర్ చేస్తాడు. భాషా ,వేషం ఆహారం కళా రూపాలు బ్రతుకుతున్న వాతావరణాన్ని బట్టి వచ్చేవేనని అవి కేవలం బాహ్యమేనని తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్నప్పుడు ప్రాంతాల మధ్య మనుషుల మధ్య సఖ్యత పెరిగి మనుషులందరూ కలసి మెలసి బ్రతికే అవకాశం ఉంది.

peepal-leaves-2013

 

 

అక్షరమే అష్రఫ్ పోరాటం!

 

తెలుగు సేత : జగద్ధాత్రి

 

సమాన అవకాశాలు

ఒక కొడుకు , ఒక కూతురు

తల్లి కూతురికంటే కొడుకే కావాలని కోరుకుంది

జీవితపు ఒడిదుడుకులన్నింటా కొడుకు తల్లికి తోడుగా ఉంటాడు

కూతురు తనో కొడుకును కంటుంది తనకు దన్నుగా నిలబడేందుకు.

 

ఓ ప్రహేళిక

ప్రేమలో పడటం అంటే నువ్వు ప్రేమించిన ఒకడి చేతిలో పక్షిలా ఉండటం కాదు

పొదలో ఉన్న పది ఇంతకంటే పదిలం

పొదలో ఉన్న ఒక్క పక్షి, చేతిలో ఉన్న పది పక్షులకంటే మెరుగు

పక్షి దృష్టి కోణం నుండి

 

ముగింపులు

కొన్ని సార్లు ప్రేమ, ఉపవాసం ఉన్న వాడికి భోజనం లాంటిది

మరి కొన్ని మార్లు అంగవైకల్యం గల పిల్లవాడికి

సరి కొత్త జత బూట్స్ జత ఇవ్వడం లాంటిది

ప్రేమ, సాధారణంగా , పెద్ద మొత్తం లో

అన్ని వైపులా అందరికి నష్టం కలిగించే బేరం

 

తర్కం

ఆ పాత తలుపులు చప్పట్లు కొట్టాయి

చెట్లతో కలిసి గాలి ప్రదర్శించిన నృత్యానికి మెచ్చుకోలుగా

ఆ పాత తలుపులకి చేతులు లేవు

ఆ చెట్లు ఏ నర్తన శాలకూ వెళ్ళి ఉండలేదు

చెట్లతో కలిసి నృత్యం చేస్తున్నా సరే

అగుపించని జీవి గాలి

 

(అష్రఫ్ ఫయాధ్ సౌదీ అరేబియా లోని యువ కవి. మతానికి వ్యతిరేక కవిత్వం రాశాడన్న నేరం పై మరణ శిక్ష విధించబడిన వాడు. ఇప్పుడు మరణ శిక్షని తగ్గిస్తూ 8 సంవత్సరాలు జైలు శిక్ష , 800 కొరడా దెబ్బలు గా శిక్ష ఖరారు చేసేరు. మనం ఉన్నది మనుషుల లోకమేనా ఒక యువ మేధావికి, కవికి ఇలాంటి శిక్షా అని ప్రపంచం మొత్తం ఈ శిక్షని వ్యతిరేకిస్తోంది. )

నాలుగు చిన్న కవితలు అష్రఫ్ ఫయాధ్ వి: Equal opportunities , An aphorism, Conclusions, Logic   అరబిక్ నుండి ఆంగ్ల సేత జొనాథన్ రైట్

*

 

 

కథలకు ఒక ఇల్లూ ఒక కుటుంబం!

katha3

 

– జగద్ధాత్రి

~

 

కథానిలయం గురించి అన్నీ  అందమైన జ్ఞాపకాలే!

అసలు కమ్మని జ్ఞాపకాలు కాక కథానిలయం గురించి ఏముంటాయి చెప్పండి. ఇది తెలుగు రచయితలను పాఠకులను కథా నిలయం ఎరిగిన ప్రతి వారూ రాయగలరు, ఎన్నెన్నో చెప్పగలరు. పద్ధెనిమిది  సంవత్సరాలనుండి ఫిబ్రవరి రెండవ శని ఆదివారాలలో కథా నిలయం శ్రీకాకుళo వెళ్ళడం ఒక ఆనవాయితీగా తెలుగు సాహిత్య ప్రేమికులందరికీ అలవాటే. నాకున్న అనుభూతులను కొన్ని మీతో ముచ్చటించుకుంటాను.

కథానిలయం వార్షికోత్సవం అంతే అందరూ కలుసుకునే ఒక పెద్ద పండుగ. అసలీ జ్ఞాపకాలను ఎక్కడనుండి మొదలుపెట్టను? కథా నిలయానికి ఎప్పుడు వెళ్లినా కొంగు నిండా బోలెడు అందమైన జ్ఞాపకాలను కట్టి తెచ్చుకుంటూనే ఉంటాను.

 

ముందు కథా నిలయం వార్షికోత్సవాలా జ్ఞాపకాల పూలు కాసిన్ని మీకోసం….

విరసం రచయిత అర్నాద్ కి “రావిశాస్త్రి” పురస్కారం ఇవ్వడం, ఆ వేడుక లో రచయితను గూర్చి ప్రసంగించడానికి రామతీర్థని ఆహ్వానించారు. ఇది 2004 అనుకుంటాను. ముందు రోజు మధ్యాహ్నం నుండి వచ్చిన వారందరివీ పరస్పర పరిచయాలు, కొన్ని ప్రసంగాలు అన్నీ అవుతాయి అని అందరికీ తెలిసిందే కదా. అబ్బా అందరినీ కలుసుకోవడం ఎంత సరదా , మా నాయుడు బావులందరూ, మా ఉత్తరాంధ్ర ‘బుదడు’ ఛాయారాజ్, కవన శర్మగారు, ఇలా ఎంతమందినో పేరు పేరునా చెప్పలేను కానీ ఎన్నెన్ని హాస్యాలు కబుర్లు. మరుసటి రోజు కార్యక్రమం అయ్యాక భోజనం . నీళ్ళు పేకెట్లు ఇచ్చారు. అప్పుడే గౌరునాయుడు బావు ‘నదిని దానం చేశాక’ కవితా సంపుటి ప్రచురించాడు. ‘ఏటి బావు నదిని దానం సెసీసినావనేటి నీళ్ళ పేకెట్టిచ్చినావు’ అని నేను అల్లరిగా అంటే అవును తల్లే మరి నదిని దానం సెసీసినామ్ కావా అని నవ్వుతూ గౌరునాయుడు బావు సమాధానం చెప్పడం. ఛాయారాజ్ గారు తో కాస్త పొగ బండిని తగ్గించండి సారూ అని ఆప్యాయంగా మందలింపుగా అంటే ‘అదే మరి కొంచం కష్టం అవుతోంది’ అని ఆయన సమాధానం.

బావూ తెల్ల మిరియం బావు(అది రామతీర్థ తొలి కవితా సంపుటి) ఇరగదీసీసినావు అంటూ హాస్యవల్లరి వెదజల్లిన మా చింతా అప్పల్నాయుడు బావు.

మరో ఏడాది నేను , రామ తీర్థ, స్వామి గారు వెళ్ళాం. ముందు రోజు కారా దంపతులకు అభినందన సత్కారం మాస్టారికి ముందు చెప్పకుండా ఏర్పాటు చేసేరు. అప్పుడే ఆయనకేదో పురస్కారం వచ్చింది. బహుశా తెలుగు విశ్వవిద్యాలయం వారిది అనుకుంటాను. నేను రామినాయుడు కలిసి మాస్టారికి అమ్మ కి పూల దండ వేయడం ఒక అందమైన జ్ఞాపకం. తన సాహితీ జీవనం సాఫల్యంగా సాగడానికి కారణం సంసారానికి తాను కెప్టెన్ గా తన గృహిణి నడపడమే అని అర్ధాంగిని గూర్చి ఆర్ద్రంగా చెప్పేరు మాస్టారు. ఆయనకి తనకు సాధ్యమైన సహాయం చేయడమే ఆయనని రాసుకోనివ్వడమే తప్ప తాను చేసినదింకేమీ లేదని వినమ్రంగా చెప్పిన ఆ సాహితీ మూర్తి అర్ధాంగి సీత మహాలక్ష్మి వినయానికి మేమందరము ఆశ్చర్యానందం చెందేము.

అప్పుడే రచన శాయి గారిని, రఘోత్తమరెడ్డి గారిని చూడటం జరిగింది. అక్షర వాచస్పతులందరి హాస్యాల విరి జల్లుల్లో తడుస్తూ మురుస్తూ ఎన్నెన్ని మాటలో!

katha1

2013 కథానిలయం స్వీట్ సిక్స్టీన్  వార్షికోత్సవం లో సాహితి మిత్రురాలు డాక్టర్ అయ్యగారి సీతారత్నం పుస్తకం “కూరాకుల మడి” ని వోల్గా అరవయ్యవ జన్మదినోత్సవానికి కానుకగా ఆమెకు అంకితమిస్తూ మాస్టారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని కథా నిలయం లో ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది. కథానిలయం లో ప్రేక్షకురాలిగా కాక ప్రసంగం చేసే అవకాశం అంది పుచ్చీసుకున్నాను ఆ రోజు.

ఆ రోజే ఎప్పుడూ కథల పుస్తకాలు తప్ప ఆవిష్కరించని కథానిలయం లో మాష్టారి చేతుల మీదుగా కుమార వర్మ కవితా సంపుటి ‘రెప్పల వంతెన’ ఆవిష్కరణ కూడా జరిగింది. ఆ రోజే మాస్టారి తమ్ముడు కీ.శే. కృష్ణా రావు గారి కవితా సంపుటిని కూడా ఆవిష్కరించారు. తన తమ్ముడే గనుక కుటుంబ బాధ్యతను స్వీకరించి తనకు స్వేచ్ఛనివ్వక పోతే తాను ఇంత రచన చేయగలిగేవాడిని కాను అని మాస్టారు ఎంతో ప్రేమగా తన జ్ఞాపకాలను మాతో పంచుకున్నారు. ఆయన కళ్లలోని తడిని చూసి మా అందరి గుండెలూ చెమ్మగిల్లాయి.  మరుసటి రోజు సతీష్ చందర్ , నండూరి రాజగోపాల్ అతిథులుగా వార్షికోత్సవ ప్రసంగాలు సాగాయి. ఇవి కొన్ని వార్షికోత్సవ ముచ్చట్లైతే ఇక మామూలుగా ఎన్నో సార్లు కథా నిలయం కి వెళ్ళడం , ఎవరైనా ఆత్మీయ మిత్రులు వచ్చినప్పుడు తీసుకెళ్ళడం పరిపాటి.

అలా ఈ మధ్య వచ్చిన ఖమ్మం మిత్రులు , మువ్వా శ్రీనివాసరావు, సీతారాం,ఆనందాచారి , కపిల రామ్ కుమార్ , ప్రసాద మూర్తి, అందరం కలిసి మాస్టారిని చూడటానికి వెళ్ళడం ఒక మరుపు రాని అనుభూతి. అక్కడ మా అప్పల్నాయుడు బావు , రామారావు నాయుడు గారు , అందరం కలుసుకుని మాస్టారికి నేను , సీతారాం, మువ్వ శ్రీనివాసరావు మా పుస్తకాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాం. అందరం కలిసి ఆ మధుర క్షణాలని మా కెమెరాల్లో బంధించి తెచ్చుకుని అపురూపంగా దాచుకున్నాం.

మాస్టారు భలే మాటన్నారు ఆరోజు. చెప్తా వినండి. మాస్టారు తొంభయ్యవ పుట్టినరోజు నాడే చెప్పేరు నన్ను ఇంకెక్కడికీ పిలవకండి శరీరం సహకరించడం లేదు రాలేను అని. అయినా పిలిస్తే  నాకెంత కష్టమవుతుందో మీకు తెలీదు. ఈసారి నన్ను బలవంత పెట్టారా మీ అందరికీ పూర్ణాయుష్షు దీవించేయ్గలను అని బెదిరించారు. అదేంటి మాస్టారు అంటే పూర్ణాయుష్షు అంటే 120 సంవత్సరాలు వృద్ధాప్యం లో ఎక్కడికైనా వెళ్లాలంటే ఎంత కష్టమో మీకు తెలిసొస్తుంది అప్పుడు అన్నారు. హాయిగా నవ్వేశాం అందరం.

ఈ మధ్యనే సాహితీ స్రవంతి వారి కార్యక్రమంలో మాస్టారిని మళ్ళీ దర్శించుకున్నాం. ఆయన ఆనంద భాష్పాలను చూసాము. శివారెడ్డి గారు, తెలకపల్లి రవి గారు అందరూ వేదిక మీద ఉండటం ఆరోజు విశేషం.

ఇక అన్నిటికంటే అపురూపమైన జ్ఞాపకం మీతో చెప్తాను ఇప్పుడు ఇది అందుకే చివరికి పెట్టాను.

2013 ‘తొంభాయిల్లోకి మన కారా’ ఒక పెద్ద సాహిత్య కార్యక్రమం తలపెట్టింది విశాఖలో మోజాయిక్. నవంబర్ 9 న మాస్టారు జన్మ దినోత్సవం నాడు చాలా మంది రచయితలతో , చాగంటి తులసి గారు మాస్టారు, ఏం ఎల్ సి శర్మ గారు ఇంకా అందరం ఒక వందమందిమీ కలిసి మా అందరి నడుమ గులాబీ దండతో కూర్చున్నతొంభై యేళ్ళ నవ యవ్వనుడు మాస్టారితో గ్రూప్ ఫోటో తీయించుకున్నాం. అది మా అందరికీ ఒక మధురస్మృతి.

సరే ఇంతకీ నే చెప్పొచ్చేది ఇది కూడా కాదు ఇంకా ఆనందమైన విషయమేమిటంటే ఆ కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు నేను రామతీర్థ మాస్టారిని కలుసుకుని ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి తీసుకుని కథా నిలయానికి వెళ్ళాం. మన తెలుగు వారి అదృష్టం కొద్దీ అప్పుడు మన శ్రీరామచంద్ర మూర్తి గారు హెచ్ ఏం టీవి లో ఉన్నారు. వారు వారి కెమెరా బృందాన్ని ఆ ఇంటర్వ్యూ మొత్తం చిత్రీకరించమని పంపించారు. ఇక ఆ రోజు చూడాలి మా ఆనందం. వెళ్ళేసరికి పదకొండున్నరైంది. మాస్టారు, వారి అబ్బాయి సుబ్బారావుగారు, వివిన మూర్తి గారు కూడా ఉన్నారు. ఆరోజు నిజంగా మా జీవితాల్లోనే కాదు తెలుగు సాహితీ చరిత్రలోనే మధురాతి మధురమైన స్మృతులుగా రాబోవు తరాలకు శాశ్వతీకరించగలిగే అదృష్టం మాకు కలిగింది. దాదాపు మూడు గంటల పాటు మాస్టారు మాతో మటాడేరు, భోజనానికి కూడా వెళ్లలేదు. మొత్తం ఇంటర్వ్యూ పూర్తయ్యే వరకు కదలలేదు.  ఆయన జీవిత, సాహిత్య విషయాలు ఎన్నెన్నో మాకు చెప్పేరు. రామతీర్థ నేను వేసిన ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓపికగా హుషారుగా సమాధానాలు చెప్పేరు.

katha2మీ తొలి నాటి కథల్లో ‘రేవతి నుంచి’ అని ఉత్తరాల రూపం లో సీత అనే అమ్మాయికి రాసినట్టుగా కథలు ఉంటాయి కదా ఆ ఏడాదే మీ పెళ్లి సీతామహాలక్ష్మి గారితో అయింది కదా అయితే ఈ కథ అంతకు ముందే ప్రచురితమైంది అంటే మీకు అప్పటికే సీత గారు తెలుసా అన్న రామతీర్థ చిలిపి ప్రశ్నకు చూడాలి మాస్టారి మొహం లో నవ్వు. పేరు తెలుసు బాబు అప్పటికి అంటూ సమాధానం చెప్పేరు. రేవతి అన్నది తన జన్మ నక్షత్రమని ఆ పేరునే తన కలం పేరుగా వాడుదామా అని కూడా ఆలోచన ఉండేదని కూడా చెప్పేరు. ఈ ఇంటర్వ్యూని మొత్తం రామతీర్థ అక్షరీకరించి 2014 కారా తొంభయొకటవ జన్మదినాన సాక్షి లో ప్రచురించారు.   ఎప్పుడు సీతామహాలక్ష్మి గారి గురించి ప్రసక్తి వచ్చినా మా గృహిణి అనడమే తప్ప పేరు పెట్టి కూడా ప్రస్తావించని మహానుభావుడు.

తన జీవితం లోని చాలా ముఖ్యమైన సంగతులు , తన రచనా లోకం గురించి ఎన్నో మూచ్చట్లు చెప్పారు మాస్టారు. ఆ కార్యక్రమం నుండి కొంత ముఖ్యమైన భాగాన్ని “90 ఏళ్ల కుర్రాడు కారా’ పేరిట హెచ్ ఏం టి వి లో న్వంబర్ 9 నా కారా పుట్టినరోజు నాడు ప్రసారం చేసేరు. తాను రాసిన ఒక్కో కథకు గల నేపథ్యాన్ని రాయాలని ఉందని, దేహం సహకరించక రాయలేకపోతున్నాను అని చెప్పేరు. ఒక పెద్ద నవల రాయాలని ఉన్నదని కూడా చెప్పేరు. ఆత్మ కథ రాసే ఉద్దేశం ఉందా మాస్టారూ అని అడిగితే దానిలో ఏదైనా సమాజానికి ఉపయోగ పడేది ఉంటే తప్ప ఆత్మ కథ రాయాల్సిన అవసరం లేదు అన్నది తన నమ్మకం అని స్పష్టంగా చెప్పేరు. సాహిత్యం ముఖ్యంగా కథలు సమాజం లో చైతన్యాన్ని తీసుకొస్తాయని సంపూర్ణంగా నమ్ముతాను అని చెప్పేరు.  ప్రపంచం లో ఎక్కడా ఒక సాహిత్య ప్రక్రియ కు ఒక నిలయం అంటూ లేదు ఇప్పటివరకు అలాంటి గొప్పతనం మన కథా నిలయానికే ఉంది అనడానికి మన తెలుగు వారందరూ గర్వించాలి. తెలుగులో ప్రచురితమైన ప్రతి కథా కథానిలయం లో చోటు చేసుకుంటుంది.

తనకు నచ్చిన తాను గురువులుగా భావించే గురజాడ, కొడవటిగంటి కుటుంబరావు, రావి శాస్త్రి ల పెద్ద చిత్రపటాల సాక్షిగా కథానిలయం లో మాస్టారితో బాటు కూర్చుని ఆయన చెబుతున్న జీవిత సాహిత్య విశేషాలను తెలుసుకోవడం నా జీవితం లో సాటి లేని మధురానుభూతి. మన తెలుగు సాహిత్యం ఆంగ్లం లోకి తీసుకెళ్ళండి బాబు అందుకు కృషి చేయండి అని చెప్పేరు. తన రచనలను వ్యాసాలను ఏది సమాజానికి ఉపయోగిస్తుందో అవి అన్నీ అందరికీ ఇతర భాషల్లోకి, ముఖ్యంగా ఆంగ్లం లోకి వెళ్లాలని అది ఒక లక్ష్యంగా పెట్టుకుని మీరిద్దరు చేయాలని నాకు రామతీర్థ కి నవంబర్ 9, 2014 న చెప్పేరు. సాహిత్యమే లేకుంటే తన జీవితం శూన్యమని, ఎటువంటి కష్టాన్నైనా మరిపించగలది పుస్తకమేనని అందుకే ఒక కన్ను కనిపించక పోయినా ఇప్పటికీ రోజుకి ఐదారు గంటలు చదువుతానని చెప్పేరు కారా.

అంతటి సాహితీ మూర్తి తో శాశ్వతంగా ఒక చిత్రం లో ఉండగలగడం అదృష్టమన్న పదానికన్న మించినదేదో అయి ఉండాలి అన్నది నా భావన.

ఏదో అక్కడక్కడ దొరికినవి ఏరుకున్న నాలుగు పొగడ పూల లాంటి మాటలు చెప్పేనేమో ఇంకా చెప్పాలంటే బోలెడున్నాయి. ఎంత చెప్పినా తక్కువే. ఇలా నాకే కాదు అందరికీ ఉంటాయి అన్నది నిజం. ఇలా అందరం కలిసి రాసిన ఈ మధురానుభూతులన్నీ ఒక దరికి చేరిస్తే ఇదో పెద్ద పుస్తకమౌతుంది అనడం లో సందేహమే లేదు. కథా నిలయం వార్షికోత్సవం మళ్ళీ వచ్చింది పండుగ వచ్చిందోయ్ మాకు అన్నట్టు ఈ ఫిబ్రవరి లో కూడా ప్రతి ఏడు లాగే వార్షికోత్సవం జరుపుకుంటున్న కథా నిలయానికి , ఆ కథా నిలయ సంస్థాపకులు ఫీల్డ్ మార్షల్ కారా మాస్టారికి మనస్ఫూర్తిగా నమస్కారం!

*

 

 

“వెతికాను నిన్ను వెతలో /వెతుకుతాను వెతను నీలో!”

Mahadevi Varma Geethalu_18th Book_Title Text.p65

– జగద్ధాత్రి 

~

 

Jagathiబాధ నా సృజనకు మూలం అన్నాడు చలం. వేదన, విరహం , ఒంటరితనం , ధు:ఖం ఇవన్నీ బాధకి పర్యాయ పదాలే. ఈ బాధ ఆమె అక్షరాల్లో వేదనా గీతికలై అలపిస్తుంది మహా కవయిత్రి మహాదేవి వర్మ. ఇటీవల ఆమె గీతాలు  “మహాకవయిత్రీ మహాదేవి వర్మ గీతాలు” పేరిట తెలుగు లో కి అనువదించారు తెలుగు సుప్రసిద్ధ రచయిత్రి డాక్టర్ చాగంటి తులసి. ప్రఖ్యాత రచయిత చాసో కుమార్తె గానే కాక తనకంటూ ఒక విశిష్టమైన స్థానం తెలుగు సాహిత్యం లో తన కథలు, సాహిత్య విమర్శనా వ్యాసాలు, కవిత్వం తో సంపాదించుకున్నారు తులసి గారు. ప్రగతి శీలక ధృక్పధం తో సాగే ఈమె రచనల్లో అంతటా అభ్యుదయ భావాలు , ఆచరణీయ మార్గాలే అగుపిస్తాయి. ఆమెకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన కథలు “ఏష్ట్రే”, “ బామ్మ రూపాయి “ లాంటి కథల్లో తులసి వ్యక్తిత్వ గంభీరత మనకు అవగాహన అవుతుంది.

మహా కవయిత్రి మహాదేవి వర్మ గారి సాహిత్యం లో సౌందర్య భావన అనే అంశం మీద డాక్టర్ ఆదేశ్వర రావు గారి వద్ద తన పి హెచ్ డి చేశారు హింది లో తులసి. అభ్యుదయ భావాలు ఉన్న తులసి జీవితం లో ప్రగతి శీలక పాత్ర పోషించిన మహాదేవి వర్మ గురించి పరిశోధన చేయడం ముదావహం గానే అనిపిస్తుంది. అయితే వచన రచనలకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే తులసి , అందునా కథ పట్ల చాలా మక్కువ గల తులసి మహాదేవి వర్మ కవితాత్మక సౌందర్య భావన పై పరిశోధన చేయడానికి కారణం వారి గురువైన ఆచార్య ఆదేశ్వర రావు గారు కూడా కవి కావడమే అని ఇటీవలే ఈ పుస్తక ఆవిష్కరణ నందు తులసి పేర్కున్నారు. అక్టోబర్ 15 న ఆంధ్ర విశ్వవిద్యాలయం హింది విభాగం లో లోక్ నాయక్ ఫౌండేషన్ వారి నిర్వహణ లో ఈ పుస్తకాన్ని ఆచార్య ఆదేశ్వర రావు గారు ఆవిష్కరించారు. సాహితీ వేత్త యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ఈ సభకు అధ్యక్షత వహించారు. ఇటీవలే పరమపదించిన ఆచార్య బలశౌరి రెడ్డి గారు ఈ పుస్తకానికి అవతారిక నందించారు. ప్రముఖ సాహితీవేత్త కవి , చిత్రకారుడు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ముందుమాట రాసారు. తాను కవయిత్రి గా కాక కథయిత్రిగానే ఉండటానికి ఎక్కువ ఇష్టపడతానని , ఐనా మహాదేవి వర్మ గీతాల భావనాలోకం కూడా తన భావ జాలం కాదని ఐనప్పటికీ  , ఆనాటి రోజుల్లో అంత చదువుకున్న , అంత ప్రఖ్యాత స్థాయి కెదిగిన , ప్రతిభావంతురాలు మహదేవి వర్మ గనుక ఆమె గీతాలు నేటి తెలుగు పాఠకులకు అందించడం అవసరమని భావించి అనువాదం చేశానని తులసి చెప్పేరు సభలో. తెలుగులో తులసి గారు చేసిన అనువాద గీతాలను కొన్ని స్వీయ సంగీత నిర్వహణ లో శ్రీమతి శశిరాణి ఆలపించి అలరించారు. ఇవి సభా వివరాలు.

చాగంటి తులసి –మహాదేవి వర్మ :  రచయిత్రిగా తెలుగు పాఠకులకు చిర పరిచితమైన తులసి గారు , వ్యక్తిగత పరిచయం ఉన్నవారు మన అందరికీ. ఆమె స్వభావం బట్టీ ఆమె మాటల్లోనే చెప్పాలంటే ఏ రచనైనా తనని బాగా ఆకర్షిస్తేనే తప్ప , అందులో తాను  మమేకవగలిగితేనే తప్ప అనువాదం చెయ్యను అంటారు. మహాదేవి వర్మ గీతాలను ఆకళింపు చేసుకున్నాక వాటిని తెలుగు పాఠకులు , భవిష్యత్ తరాలు చదువుకోవాలి అని భావించి అదే ఆశయం తో వీటిని అనువదించారు. ఏ పని ఐనా మనస్ఫూర్తిగా చేసే తులసి ఈ అనువాదానికి పూనుకోవడం ముదావహం. ముప్పై మహాదేవి గీతాలను ఎంచుకుని వాటిని తెనిగించారు. వాస్తవానికి అనువాదం అనే కంటే అనుసృజన అనొచ్చు . ఎందుకంటే రాసినది మహా కవయిత్రి , మరొక భాష లో అందిస్తున్నది మరో రచయిత్రి కనుక అనువాదకురాలిగా కాక అనుసృజన కర్త గా తులసి ఈ గీతాలను ప్రతిభావంతంగానే కాదు హృద్యంగా అందించారు. ఎక్కడా మహాదేవి కవితాత్మ దెబ్బ తిన కుండా ఆమె రచించిన పద మాధుర్యాన్నీ, భావ మాధుర్యాన్నీ ఎక్కడా చెదర నివ్వకుండా అనువదించారు. మహాదేవి కేవలం కవయిత్రి మాత్రమే కాదు అద్భుతమైన చిత్రకారిణి కూడా. ఆమె చిత్రాలను కొన్నిటిని కూడా ఈ పుస్తకం లో తెలుగు పాఠకులకు అందించడం తులసి గారు  చేసిన మహత్కార్యం. అక్షరీకరించలేని భావనోద్విగ్నత కలిగినప్పుడు ఆ భావావేశం చిత్రంగా రూపు దిద్దుకునేది మహాదేవి చేతుల్లో. అలాంటి అపురూప చిత్రాలను ఈ పుస్తకం లో పొందు పరచడం లోని భావం మహాదేవి సమగ్రంగా అవగాహన పాఠకులకు కలగాలని అని తులసి చెప్పారు.

మహాదేవి వర్మ కవితా తత్వం: “ ప్రతి కవి రచన గతిశీలమైనది అవాలి. మరణించేది కాకూడదు. పాతబడిపోకూడదు. నదీ తీరాలు భిన్నమవ గలవు గాని నదిని గతిశీలమైన దానిగా చేయడానికి అన్ని  తీరాల దగ్గరా లోతు ఉంటుంది. అలా లేకపోతే అది నది కాలేదు.” అని చెప్పిన మహీయసి మహాదేవి వర్మ గారు కవిత్వం లో ఎంతో లోలోతుల స్థాయిలను చేరుకున్న రహస్య వాద (మార్మిక వాద) మహా కవయిత్రి.

“వెతికాను నిన్ను వెతలో /వెతుకుతాను వెతను నీలో!”

అని పాడే వెతల సామ్రాజ్ఞి మహాదేవి గారు అని తులసి గారు ముoదు మాటలోనే పరిచయం చేస్తారు. ఆమె కవిత్వమంతటా ఒక ఆర్తి తీరని వేదన పరుచుకునుంటుంది. వాస్తవానికి ఈ ఆవేదన ప్రతి సృజన కారునిలోనూ ఉంటుంది. ఈమె గీతాలలోని విషాదం , విరహం అమూర్తమైనవి. ఆమెను ఆధునిక మీరా అని పోల్చే వారట.  మీరా ఆరాధనకు కేంద్ర బిందువు సాక్షాత్ గోపాల మూర్తి . కానీ మహాదేవి ఆవేదన అమూర్తమైనది. నిజమే టాగోర్ గీతాంజలి  లో కనిపించే మధుర భక్తి , అదృశ్య అమూర్త ప్రేమమయుడైన ఆ ప్రియుడు దైవం , తాను ప్రేయసి అతని సహచరి , దాసి. ఇవి మనకి టాగోర్ భవాల్లో కనిపిస్తే , మహాదేవి లో అగుపించేది ఒక దివ్యానుభూతి. ఒక తాదాత్మ్యత , అపరిమితమైన ఆరాధనా, విరహం, అద్వైతం.

మహాదేవి భావ సౌందర్యానికి భాషా పటిమ తోడైన ఆమె గీతాలను తులసి గారు పుస్తకం లో ఒక పక్క హింది మూలం లోనూ , తెలుగు అనువాదాన్ని రెంటినీ ప్రచురించారు. ఇది చాలా మంచి విద్యాత్మకంగా ఉంది. ఎందుకంటే హిందీ సాహిత్య విద్యార్ధులకు, సాహిత్య పాఠకులకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆమె గీతాన్ని హిందీ లో ను తెలుగు లోనూ ఒకేసారి చదవడానికి అవకాశం కల్పించారు తులసి.

అనువాదం అంటే కేవలం ఒక భాష నుండి మరో భాష లోకి పదాలను మార్చడం కాదు. అనువాదం ఎప్పుడు సఫలీకృతమవుతుందంటే అది అనువాదం అని అనిపించక పోవడమే. దీనికి ఎంతో కృషి చేస్తారు అనువాదకులు. ఈ క్రమం లో ఒక్కో చోట అనువాదకురాలి ప్రతిభా, ఆమె స్వేచ్ఛ కూడా కనిపిస్తాయి. అయితే ఇవి ఎలా ఉండాలంటే అసలు మూలం లోని భావం దెబ్బ తినకుండా ఉండాలి అలాంటి ప్రతిభా స్వేచ్ఛ తులసి గారు ఈ అనుసృజన లో కనబరిచారు. అది ప్రశంసనీయంగా కూడా ఉంది అనడంలో సందేహం లేదు. ఉదాహరణకి :

పాథోయ్-హీన్ జబ్ ఛోడ్ గయే సబ్ సప్నే , ఆఖ్యాంశేష్ రెహ్ గయే అంక్ హీ అప్నే / తబ్ ఉస్ అంచల్ల్ నే దే సంకేత్ బులాయా (ఇది హిందీ మూలం )

దీనికి అనువాదం : దారి బత్తెం లేకుండా వదిలేసాయి అన్ని కలలు/ కంచికి వెళ్లకుండా నా ఒడి లోనే ఉండిపోయాయి అన్ని కథలు / అదిగో అప్పుడు సైగ తో పిలిచాయి ఆ చేలాంచలాలు.

ఇక్కడ ‘దారి బత్తెం’, ‘కంచికి’  అనే పదాలు అనువాదకురాలు నేటివిటీ కో సం స్వేచ్ఛగా వాడారు. ఆ నానుడి హింది భాష లో ఉండదు. అయినా తెలుగు పాఠకులకు కవి భావాన్ని సరిగ్గా అందిస్తాయి మన తెలుగు నుడికారపు ఈ మాటలు. రచయిత కు తాను రాసిన భాష పై పట్టు ఉంటే చాలు కానీ అనువాదకులు రెండు పడవల మీదా సరిగా సమతౌల్యం తో పయనించాలి. అలాంటి సమతౌల్యత తులసి అనువాదం లో మనం చాలా  చోట్ల ద్యోతకమౌతుంది. రెండు భాషల నుడి కారాన్ని పట్టుకోగలగటమే ఆమె సాధించిన విజయం.

“ఆత్మకు ఆత్మదీపం అనురాగం” అంటాడు రూమి. దీపాన్ని ప్రతీకగా ఎక్కువగా ఉపయోగిస్తారు మహాదేవి.

ఎందరో కవుల కవిత్వం లో అగుపించే దీపం ప్రతీక మహాదేవి లో మరింత విలక్షణంగా దర్శన మిస్తుంది మనకు.

దీపం ఆమె దృష్టిలో ఆత్మ సమర్పణకు, అద్వైత భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆత్మ సంవేదనకు రూపంగా కనిపిస్తుంది , నడిపిస్తుంది.

మహాదేవి వర్మ గీతాల్లో అత్యంత పేరు పొందిన గీతం : “ మై నీర్ భరీ ధుఖ్ కీ బద్లీ!” దీని అనువాదం తెలుగు లో “నీరు నిండిన ధు:ఖ నీరదాన్ని నేను!” అంటూ సాగుతుంది ఈ గీతం ఇందులో ఒక మేఘంగా తన ధు:ఖాన్ని వేదనని వర్షిస్తుంది కవయిత్రి. ఈ కవిత షెల్లీ “క్లౌడ్” కవితను తలపింప చేస్తుంది.

 

I am the daughter of the earth and the sky

And the nursling of the sky

I pass through the pours of the ocean and shores

I change but I cannot die

Like a child from the womb

Like a ghost from the tomb

I arise and unbuild it again (from the poem Cloud by Shelley)

“ఏనాడూ ఏ అంతర్దిశా విస్తృత గగనాన / నాదిగా అవక పోవడం / పరిచయం నాది మరి ఇంతే , చరిత్ర మరి నాది ఇదే / పొంగిపొరలి ముసురుకు వచ్చా గత దినాన / రాలి నశించి పోయా ఈ దినాన!” (మహాదేవి గీతానికి తెలుగు అనువాదం)

ఛాయావాదీ, కవిత్వం హిందీలో , భావ వాద కవిత్వం తెలుగు లో ఇలా అప్పటి ఆంగ్ల రొమాంటిసిసం అన్నీ భాషల కవిత్వాలలో మనకు ప్రతిబింబిస్తుంది. ఈ కవిత్వాన్ని కేవలం వైయక్తిక కవిత్వమని కూడా విమర్శకులు విమర్శించారు. కానీ భావ కవిత్వం మొట్ట మొదటి సారిగా మనిషిని కేంద్ర బిందువుగా చేసుకుని , సకల మానవ భావనలకు అక్షరాన్నిచ్చింది . ఇది ఒక వ్యక్తి వేదన కాదు , సర్వ మానవ వేదననూ ఒక వ్యక్తి స్వరం లో గళం లో వినిపించడంగా అనిపిస్తుంది నాకు.  ఇందులోని తాత్వికత సాహిత్య పరిధులు దాటి పోతుంది. కాల్పనిక సాహిత్యం కాదిది , అనూహ్యమైన అందమైన ప్రతీకలతో ఆ పరాత్పరునికి నివేదించే జీవుని అనంత ఆవేదన. అందుకే ఎన్ని అన్నా ఇప్పటికీ  భావ కవిత్వ మెరుగు మాసి పోదు. ఎవరు ఆ కవిత చదివినా అది తన వేదనే అని తాధాత్మ్యం చెందించేదే భావ కవిత్వం.

మహాదేవి కేవలం భావ కావయిత్రి మాత్రమే కాదు ఆమె స్వాతంత్ర్య పోరాటం లో భాగస్వామి, ఒక మహిళా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి , అన్నిటికీ మించి మంచి వక్త. ఆమె సాహిత్యోపన్యాసం వినడానికి జనం తండోపాతండాలుగా వచ్చేవారట. ఉన్నత విద్యావంతుల కుటుంబం లో జన్మించిన ఈమె పేరు ప్రఖ్యాతుల కోసం ఎప్పుడూ ఆలోచించని ఆచార పరాయణురాలు.  జ్ఞాన పీఠాన్ని ఆమె తిరస్కరిస్తే , అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆమెను పురస్కారాన్ని గ్రహించమని ఎంతో ప్రయాస తో ఒప్పించి ,ఆమెకు మార్గరేట్ థాచర్ చేత ఆ పురస్కారాన్ని ఇప్పించారు. ఇదీ ఆమె వ్యక్తిత్వ విశిష్టత.

సంపూర్ణ స్త్రీత్వం , భారతీయ సంస్కృతి నిండిన ఆమె కవిత్వం కేవలం స్త్రీని ఒక అబలగా నిస్సహాయురాలిగా చూపించదు. స్త్రీ వ్యక్తిత్వ విస్తృతిని  విశద పరుస్తుంది. ఆమె ఒక పరిశోధనాత్మక , పరిశీలనాత్మక , ఆత్మ గౌరవం నిండిన మహిళా మూర్తి. ఉత్కృష్టమైన తన సాధనతో ఇహ పరాలను శోధించిన తాత్విక మూర్తి.

“పునః వ్యాకులం నా ప్రాణం!/ బ్రద్దలు కొట్టు క్షితిజాన్ని అవలోకిస్తాను నేనూ అవతల వేపు ఏముందో!/ యుగాలు కల్పాలు నడిచి వెళ్ళే / ఆ శూన్యమార్గపు ఆఖరి హద్దు ఏమిటో ?” అంటుందీ ధీశాలి వనిత.

ఇటువంటి కవయిత్రీమణి కవిత్వాన్ని అచ్చంగా మన తెలుగు లో మనకు అందించిన తులసి గారికి సకల సాహితీ జగతి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతోంది మనసారా. ఈ కవిత్వ గీతాలు నేటి రేపటి తరాల చదువరులకు సాహిత్య ప్రియులకు అందించాలన్న  తులసి గారి సంకల్పం నెరవేరినట్టే అనడం లో సందేహించక్కర్లేదు.

“రూపు రేఖల కట్టడుల యందు , /కఠిన హద్దుల బంధనముల యందు/ నిర్దయ ఘడియలందు బంధించబడింది జగత్తు;/ ఓ కన్నీటి కోమలీ ఎచ్చటకు వచ్చావు నీవు ఓ పరదేశినీ !” (మేలుకో మేలుకో ఓ సుకేశినీ గీతం నుండి)

ఇలా మనందరి మనసులు రంజింప జేసేందుకు మనందరి ఆవేదనకు అక్షర అద్దం పట్టేందుకు హిందీ నుండి తెలుగు లోనికి విచ్చేసేలా చేసేరు తులసి. చిరస్మరణీయంగా తెలుగు సాహిత్యం లో మిగిలే అనువాద రచన ఇది. ఇలాగే తన అనుభవం తోనూ, ఆదర్శ భావ జాలం తో అభ్యుదయ పథాన మనకు దారి దీపమై తులసి లాంటి సాహితీ వేత్తలు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.

*

 

 

 

 

 

 

 

పదిహేడు మంది అమ్మల కథలు!

amma kathalu

 

అమ్మ ను గూర్చి కథలూ కవిత్వాలూ ఇవేవీ కొత్తవి కావు మన సాహిత్యానికి. కొన్ని సంకలనాలు కూడా వచ్చాయి. ఐనా ధైర్యం చేసి ” అమ్మ కథలు” అని పేరున సమ్మెట ఉమా దేవి గారు రాసిన కథల  పుస్తకం ఇటీవలే చదవడం జరిగింది. నిజానికి అమ్మ కథలంటే ఎప్పటిలానే ఉంటాయనుకుని చాలా యధాలాపంగా మొదలుపెట్టిన నేను మొత్తం కథలన్నీ ఆగ కుండా చదివేశాను. ఇది అతిశయోక్తి కాదు ఒక తీయని అనుభూతి.

 

ఒక్కొక్క కథ ఒకో విధంగా వైవిధ్యంగా ఉంది చాలా ఆసక్తిగా చదివించాయి. ఈ సంపుటిలోని 17 కథలు చాలా బాగున్నాయి అనేసి ఊరుకోలేము. ఎందుకు బాగున్నాయో కూడా ఒక రెండు మాటలు మీతో పంచుకుందామని నా తాపత్రయం.

అమ్మ అంటే సెంటిమెంట్ , అమ్మంటే ఒక త్యాగ శీలి , అమ్మంటే అన్నీ వరాలిచ్చేసే దేవత అలాంటిది సమ్మెట ఉమా దేవి అమ్మ మాత్రం నిజమైన సహజమైన రక్త మాంసాలున్న మనిషి. హృదయం , దేహం , ఆలోచన కలిగిన ఒక మేధావి , కరుణామృత మూర్తే కాదు కరుకు నిర్ణయాలను తీసుకుని సమాజాన్ని  ఎదిరించి నిలబడ గల ధీశాలి.

 

పదిహేడు కథల్లోనూ పదిహేడు అమ్మలు కనబడతారు. భర్త చనిపోయే ముందర ఎందుకు విడాకులు తీసుకుందా తల్లి అని పిల్లలందరూ సందేహ పడే ఒక కథ. అందరూ అమ్మని నానా మాటలూ అంటున్నా ఎందుకు భరించిందో ఆ అమ్మ మాటల్లోనే విని హతాశులైన పిల్లలు. త్యాగమంటే కేవలం ఉన్న సంపద ప్రేమ ఇవ్వడమే కాదు బాధ్యత ను నెరవేర్చడం కూడా . భర్త పైన మమకారం  లేక కాదు , కానీ పెళ్లి కావల్సిన ఆడ పిల్లలికి శోభాస్కరంగా పసుపూ కుంకుమలతో సాగనంపాలంటే తాను సుమంగళి గా ఉండాలి అన్న  ధృఢ నిశ్చయం తో అపవాదులకోర్చి ఆడపిల్లల క్షేమాన్ని ఆశించిన , నెరవేర్చిన తల్లిని దర్శింప చేసేరు ఉమా దేవి.

ఈ కథ ఎందుకో చాలా కదిలించింది నన్ను. ఇందులో చాలా విషయాలున్నాయి. ఆడపిల్లకి తల్లి అవసరం ఎంత ఉందో తెలుపుతూనే , ఇంకా మారని మన సమాజం లోని ఈ బోలు సాంప్రదాయాలను ప్రశ్నించే కథ ఇది .

 

అమ్మ కథల్లో కొన్ని కథలు హృదయాన్ని ద్రవింప జేసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా “సహాన” కథలో ఉమా దేవి గారు చూపించిన ప్రతీకాత్మకత పాఠకులను చాలా ఆకట్టుకుంటుంది. చిన్న పిల్లగా ఉన్న పాప అమ్మా వీధిలో కుక్కలే అంటూ ఝడిసి పరిగెత్తు కొస్తే , కంప్లెయింట్ ఇచ్చి ఆ కుక్కల బారినుండి తప్పించిన తల్లి , అమ్మాయి యుక్త వయస్కురాలైనాక ఎందరో మగ వాళ్ళు ఏదో ఒక సాకుతో ఆమెని తాకడానికి ప్రయత్నించడమూ , అది చెప్పుకోలేక ఆ పాప తల్లికి చెప్పినప్పుడు ఎలా తన బిడ్డని రక్షించుకోవలో తెలియని అయోమయ స్థితి లోని ఆ తల్లి మనసులోని వేదనని ఎంతో ఆర్ద్రంగా ఆవిష్కరించారు రచయిత్రి. ఒక్కసారిగా మన కళ్ల ముందు ఎన్నో ఘాతుకాలు ఆడపిల్లల పై జరుగుతున్నవి గుర్తొస్తాయి, తల్లి తండ్రులు ఎంత వరకు రక్షణ ఇవ్వగలరు? అన్నది మిల్లీయన్ డాలర్ ప్రశ్న . మొన్న బలై పోయిన నిర్భయ , నిన్నటి ఆయెషా ఇలా ఎందరో పసి మొగ్గలు తుంచబడి రాలిపోవడం గుర్తొస్తుంది.

1239667_473249809449813_888003086_n

 

అమ్మ కథల్లోని మరో ప్రత్యేకత ఏంటంటే అన్నీ అమ్మ ప్రేమనే కాక అమ్మ ప్రేమను ఆశించే పిల్లల మనస్సులు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి ఒక కథలో ఒక పాప తన అమ్మ తనతో ఉండాలనే ఆస కొద్దీ ఊరికే కడుపు నొప్పి అని ఏడుస్తూ గాబరా పెడుతుంది. డాక్టర్ ఈ పాప అల్లరి కనిపెట్టి ప్రశ్నించినప్పుడు నాకు బాలేక పోతే అమ్మ నన్నే అంటి పెట్టుకుని ఉంటుంది కదా అని ఇలా చెప్పేను అని చెప్పినప్పుడు , వాస్తవం లో ఎందరో ఉద్యోగస్తులైన తల్లులు, పనుల్లోకి వెళ్లాల్సిన తల్లులు పిల్లలల్ని విడిచి పెట్టి వెళ్లాల్సిన తల్లుల మనసులు కరిగి నీరౌతాయి. అంతే గాక పిల్లల మనసులను కూడా మనం తెలుసుకునే లా ఉంది ఈ కథ.

 

తాను ఎన్నో కథలు రాసినా అవి సంకలనంగా వెయ్యమని వాటిల్లో అమ్మ ప్రస్తావన ఎక్కువగా వచ్చినందున వాటికి “అమ్మ కథలు” అనే పేరు పెట్టమని సూచించిన మంచి రచయిత నవ్య సంపదకులు జగన్నాధ శర్మ కి ముందుగా కృతజ్ఞతలు చెప్పడం ఉమా దేవి గారి సంస్కారాన్ని తెలియజేస్తుంది.

 

కథ ఒక సహజ సిద్ధంగా చెప్పబడేది కనుక , అలానే ఆమె కథలు ఒక్కో జీవితాన్ని గూర్చి మనతో చెప్పినట్టుగానే సాగుతాయి. ఎక్కడా అసహజంగా , అతిశయోక్తిగా మాట్లాడే ఏ పాత్రా మనకి కనిపించదు. ఎందుకంటే ఇవేవీ పాత్రలు కావు వాస్తవ జీవితాలు . అందుకే అమ్మ కథలు చదివితే మనకి అమ్మ ప్రేమే కాదు చాలా  విషయాలు తెలుస్తాయి . మనసు , మెదడు కదిలించే కథలుగా ఈ మధ్య వచ్చిన కథలలో ఉమాదేవి  కథలు పది కాలాలు నిలబడాలని నిలబడతాయని ఆశిస్తున్నాను.

 

“అమ్మంటే” ఎన్నో రూపాలలో  చూపించారు రచయిత్రి. ప్రాణం రక్షించిన ప్రాణదాత , అమ్మంటే ధైర్యం , అమ్మంటే బహురూపాలలో తన సంతానాన్నే కాదు ఎందరికో సహాయం చేసే దేవత.

అందుకే అమ్మ కావడం గొప్ప విషయమే కానీ అమ్మతనం కలిగి ఉండటం మరింత గొప్ప విషయం. ఈ అమ్మతనాన్ని తన కథల్లోని అమ్మల్లో ఆవిష్కరించారు ఉమా దేవి.

 

కథలన్నిటిని వర్ణించి విసిగించడం నాకు ఇష్టం ఉండదు . ఆమె రాసిన కథల్లోని సారాన్ని చెప్పడం , మృదు మధురమైన సరళమైన ఆ శైలి ఎలాంటి వారినైనా ఆకట్టుకోగల ఆ చెప్పే నేర్పు. వెరసి అన్నీ కలిసి “అమ్మ కథలు” గా మనముందు అక్షరాల రూపం లో పొందు పరిచి అందించిన ఈ స్నేహ మయి కి కృతజ్ఞతలు . మంచి కథలు రావడం లేదు అనే సాహితీ ప్రియులకు ఉన్నాయమ్మా ఉన్నాయి మా మంచి కథలు సమ్మెట ఉమా దేవి గారి “అమ్మ కథలు ” అని చెప్పాలనిపించి ఈ రెండు మాటలూ .

మరిన్ని మంచి కథలు అమెనుండి ఆశిస్తూ ….ప్రేమతో

జగద్ధాత్రి

1231658_539630582777569_2120927918_n

పెద్దక్క మళ్ళీ పుట్టింది ఈ అక్షరాల్లో!

 

modified-coverpage3

ఈ ప్రపంచం లోకి మనం వచ్చేటప్పుడే మన ఎక్స్పైరీ డేట్ కూడా రాసి పెట్టి ఉంటుంది. ఐనా మనిషికి అన్నిటి కన్నా భయం మృత్యువంటే . నేను అన్నదే లేకుండా పోతే అన్న భయమే కొందరిని మంచిగా చేస్తుంది , మరి కొందరిని కలచి వేస్తుంది. ఎంత గొప్పగా వేదాంతం చెప్పే వారు కూడా మరణం పట్ల భయాన్ని కలిగి ఉంటారనడం లో సందేహం లేదు. జరా మరణాలు దైవాధీనాలు . దైవం అనే దాని పై మనకి నమ్మకం లేకున్నా మరణం మాత్రం ఎప్పుడూ ఎవరికి చెప్పి రాదు . ఎవరికి చెప్పి తీసుకుపోదు. అందుకేనేమో ఆ మృత్యువంటే  మనిషిలో అంత భయాందోళనలు.

మరణం ఒక కామా అంటాడో కవి , మరణం ఒక కామా  వాకాటి పాండురంగారావు గారి ప్రసిద్ధ పుస్తకం . నిజంగా మరణం ఒక కామా యేనా , మళ్ళీ మనం ఈ మానవ జన్మ ఎత్తుతామా ? ఏమో ఎవరికీ తెలియని ఈ వింత పట్లనే కదా మనిషికి ఇంత ఆకర్షణ వికర్షణలు. పాంచ భౌతిక  దేహం లో ప్రాణ స్పందన ఆగిపోయాక ఇక ఈ దేహం నశించవలసిందే. ఎవరూ తమ మరణాన్ని అనుభూతించి అక్షరీకరించలేరు. శంకరుడు అన్నట్టు మృత్యువు అది వచ్చే వేళకి నేను ఉండను , నేను ఉన్నన్నాళ్లూ అది రాదు, అని ఈ మరణాన్ని ఎదుర్కోవడానికి , మానసిక సంసిద్ధత పొందటానికి ఎన్నో నియమాలు , ప్రయోగాలు , అయినా నిరంతరం ఒక భయం తోనే బతికే మామూలు మనుషులం మనం అనుకుంటే . ఒక మామూలు మనిషి, కవి కాదు , తాత్వికురాలు కాదు , అయినా మరణాన్ని ఎంత ధీశాలి లాగా ఎదుర్కుంది.

ఎవరి గురించి చెప్తున్నానో అనుకుంటున్నారా ఇప్పుడే “పెద్దక్క ప్రయాణం” అని విజ్జి , చిన్నమ్మ , జాజి అనే ముగ్గురు చెల్లెళ్ళు  రాసిన ఒక హృదయ పూర్వకమైన నివాళి చదివాను. నలుగురు అక్క చెల్లెళ్లలో పెద్దది అయిన నాగవల్లి గారి స్మృతిలో వారు అక్షరీకరించిన ఈ నివాళి హృదయాన్ని ఆర్ద్రం చేసింది. జాజి డాక్టర్. కె.ఎన్ మల్లీశ్వరి , ప్రముఖ రచయిత్రి వాళ్ల మిగిలిన అక్కలతో కలిసి రాసిన “పెద్దక్క ప్రయాణం” గురించి ఓ రెండు మాటలు.

ఒక మనిషి చనిపోతే మనం చేసే ఎన్నో రకాల పనులతో వారికి నివాళి ఇవ్వాలనుకుంటాము. ఈ కర్మలన్నిటికీ మించినదే చేసేరు ఈ సోదరీమణులు. తమ పెద్దక్క స్మృతిలో అక్కను గూర్చిన జ్ఞాపకాలను అక్షరీకృతమ్ చేసి అక్కను అక్షరం లో బతికించి పెద్ద కూతురిని కోల్పోయిన  ఆ తల్లి తండ్రులకు అందించే ప్రయత్నం  చేసేరు. ఈ మధ్యన  ఇహ లోకాన్ని వదిలిన తమ సోదరి గురించి ఐదు రోజుల్లోగా ఒక పుస్తకాన్ని రాసి తీసుకొచ్చారు.

పెద్దక్క ను గురించి మిగిలిన ముగ్గురు చిన్నమ్మ , విజ్జి , జాజి కలిపి రాసిన స్మృతి మాత్రమే కాదు ఈ పుస్తకం. ఒక వ్యక్తి మరణం ఏమన్నా గొప్పదా ఎందరు పుట్టడం లేదు ఎందరు పోవడం లేదు , నిజమే కానీ మన అనుకున్న ఓ మనిషి ఈ మరణాన్ని ఎంత యధాతధంగా స్వీకరించిందో ఈ చిన్ని పుస్తకం చదివితే అర్ధం అవుతుంది.

తనకి  కేన్సర్ అని తెలిసినా ఏనాడూ ఊరికే  ఏడ్చి అందరినీ ఏడిపించి బాధించ లేదు నాగవల్లి. జీవితాన్ని ఎలా స్వీకరించిందో  అలాగే మరణాన్ని కూడా స్వీకరించింది. తాను బ్రతికుండగానే ఏయే పనులు చక్కపెట్టుకోవాలో ఆలోచించి చేసింది. కూతురిని మనుమరాలిని చిన్నమ్మ కి అప్ప చెప్పింది. చెల్లెళ్లకు ధైర్యం చెప్పింది . తాను లేని లోకం లో ఎలా బ్రతకాలో అని నిస్తేజులై  మిగిలిపోయిన అందరికీ ఒక ఆత్మీయ ఆదర్శంగా నిలిచింది.

కేవలం ఒక వ్యక్తి స్మృతిలో రాయబడినదే అయినా ఈ పుస్తకం లో జాజి తెలుసుకున్న కొన్ని జీవిత సత్యాలను చెప్పింది. ఒక కుటుంబం లో స్త్రీకి కనుక ఏదన్నా వ్యాధి వస్తే అది ఎలా మరి కొందరి కుటుంబాలను కూడా కదిలించేస్తుందో చెప్పింది. మరణం అన్నది తప్పదనీ తెలిసిన క్షణం నుండీ జీవితాన్ని ఎంత పరిపక్వతతో అక్క స్వీకరించి అలాంటి ఒక స్తిత ప్రజ్ఞతని తమకి ఒక పాఠంగా చెప్పి వెళ్ళిన వైనం జాజి మాటల్లో మనకు తెలుస్తుంది.

ఇక మీకు మేము ఏకలవ్య శిష్యులమ్ అన్న మాట చదవగానే నా గుండె చెమరించింది. ఎక్కడో దూర లోకాల్లో  ఉన్న అక్క కి ఇక్కడ చెల్లెళ్ళు ఏకలవ్య శిష్యులేగా మరి.

image

అమ్మను, ఆత్మీయతను , అక్షరాన్ని , అక్కను అజరామరం చేయగల ఒక  ప్రయత్నం  ఒక చిన్ని హృదయ నివాళి లో తెలియజేసేరు ఈ చెల్లెళ్ళు.

కరిగిపోతున్న క్షణాలలో తాను చదవగలనో లేనో అనుకుని ఎన్నో పుస్తకాలు చూసి విచారించిన అక్క ఆవేదన గూర్చి , తాను ఉండగానే ఇంటికి చెద మందు కొట్టించేయ్యలి లేకుంటే మీ బావ బాధ పడతారు ఆపైనా అని ఆలోచించే ఒక ఇల్లాలు , తల్లి , అమ్మమ్మ , కూతురు , అక్క ఇక ఒక స్మృతి మాత్రమే కదా. నిజానికి ఇంత ధు:ఖం లో కూడా ఈ చిన్ని పుస్తకాన్ని తీసుకొచ్చిన ఈ చెల్లెళ్ల ను తల్చుకుంటే నిజమే వీరు ఆ పెద్దక్క దగ్గర చాలా నెమ్మది ని నేర్చుకున్నారు అనిపిస్తుంది.

పెద్దక్క ప్రయాణం ఒక స్మృత్యంజలి కాదు ఒక మంచి మనసున్న అక్క చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక . మనసున్న వారు చదువుతారు , ప్రతిస్పందిస్తారు , అన్నిటికి మించి ఆ పెద్దక్క దగ్గర  మనం కూడా కొంత నేర్చుకుంటాము. జీవితాన్ని కాస్త దిద్ది తీర్చుకుంటాము . స్మృతి లో రాసిన పుస్తకాలు కవితలు మనలని మరింత బాధ కి గురి చేస్తాయి , లేదా నైరాశ్యం పాలు చేస్తాయి కానీ ఈ పుస్తకం ఒక ఆత్మీయ స్నేహితునిలా రాబోయే జీవితాన్ని గూర్చి , మరణం గూర్చి ఎంతో సంయమనం  పాటించే విధంగా మనకి మంచి పాఠాన్ని గరుపుతుంది. ఈ ముగ్గురికే కాదు ఈ పెద్దక్కను మనందరికీ ఒక ఆత్మీయురాలిని చేసేరు ఈ చెల్లెళ్ళు. మిత్రులారా చదవండి ఈ చెల్లెళ్ల ప్రేమను వారి ఆత్మీయ అక్షరాల్లో బంధించుకుని మనకి ఆవిష్కరించిన వారి పెద్దక్కను .

చిన్నమ్మ కు , విజ్జి కి ,జాజికి ప్రేమ పూర్వక అభినందనలు మీరు వేసినది పుస్తకం కాదు ఒక మంచి మనసును వ్యక్తిత్వాన్ని మాకు పరిచయం చేసేరు అందుకు మీకు కృతజ్ఞతలు . పెద్దక్కను చిరంజీవిని చేసిన మీ ప్రయత్నం సఫలమైంది .

జగద్ధాత్రి

381778_218808094872758_1009111763_n

మామూలుగా కనిపించే అమామూలు కథ!

images
చాసొ కథల్లో ఏది నచ్చిందీ అంటే కొంచం చెప్పడం కష్టమే . ఒక్క కథ గురించే మాత్రం మాట్లాడలేము. కానీ ఇక్కడ శీర్షిక నాకు నచ్చిన చాసో కథ అన్నారు కనుక నా మనసును బాగా  ఆకట్టుకున్న కదిలించిన కథ ” లేడీ కరుణాకరం”.
ఈ కథ నాకు ఎందుకు నచ్చిందీ అంటే చాలా కారణలున్నాయి :
ముందుగా ఈ కథలోని ఆర్ధిక కోణాన్ని రచయిత వివరించిన తీరు. మధ్య తరగతి జీవితాల్లో విద్య కూడా ఒక అందని ఫలమనిపిస్తుంది. దాని కోసం శారద తల్లి తండ్రి అవలంబించిన పద్ధతి మంచిదా కదా అన్న చర్చ లో నైతికత అనేదానికి తావు లేదు. రచయిత ఎక్కడా తన అభిప్రాయాన్ని కానీ ఏ సిద్ధాంతాన్ని కానీ చెప్పడు. సమస్యను కేవలం సమస్యగా దానికి ఆ దిగువ మధ్య తరగతి వారు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే చెప్తాడు. ఇలాంటి కథ ను నిర్మమంగా చెప్పడం చాలా కష్టం.
ఈ కథ గురించి చాలా విమర్శ ఉంది. కేవలం తన భర్త చదువు కోసం శారద వ్యభిచరించాలా , ఆ మార్గం పైగా తన తల్లి తండ్రులే సూచిస్తారు. ఇది ఎంతవరకు సమంజసం?
ఇక్కడ సమంజసమా కదా అన్నది ప్రశ్న కాదు. కానీ ఏ చదువూ లేని శారదకు వాళ్ళ తల్లి తండ్రులు సూచించిన పరిష్కారం ఇది.
అసలింతకీ ఈ కథ ఇతివృత్తం దేని గురించి?
ఈ కథ ఒక మనిషి జీవన పరిష్కారం కోసం ఏమి చేసిందనీ కాదు , ఈ కథ చదువు గురించి . ఈ కథ విద్యా గురించి అన్న ఆలోచనతో చూస్తే ఈ కథ వెనకాల రచయిత దృక్కోణం కనిపిస్తుంది. శారద ఎందుకు వ్యభిచరించింది ? తన భర్త చదువు కోసమే కదా. ఆ పైన అతనికి ఒక మంచి పదవి రావడం కోసం. పేదరికం చాలా మంది సమస్య కానీ ఇక్కడ ఈ సమస్యను శారద తన తల్లి తండ్రులు చెప్పిన పద్ధతి లో పరిష్కరించుకుంటుంది. పెళ్లి చేసుకుని హాయిగా భర్తతో కాపురం చెయ్యాలనుకునే ఏ ఆడ పిల్ల ఇలా చెయ్యాలనుకోదు. ఎవరూ కావాలని ఆ దారి తొక్కరు.
ఆమె భర్త కి కూడా శారద పట్ల ఆ కృతజ్ఞత ఉంటుంది. ఇదంతా నీవు పెట్టిన భీక్షే కదా శారద నీవు సరస్వతి వి అంటాడు. అతనికీ పిల్లలు తనకు పుట్టిన వారు కాదని తెలుసు , అతనిలోనూ బాధ ఉంటుంది , అసహనం ఉంటుంది కానీ కేవలం ఆమె చేస్తున్న పని వెనుక ఉన్న కారణాన్ని అర్ధం చేసుకుంటాడు కనుక గమ్మున ఉంటాడు.
చివరికి అతనికి సర్ బిరుదు వస్తుంది . అప్పుడు అంటుంది శారద అయితే నేనిప్పుడు “లేడీ కరుణాకరం ” అన్న మాట అని. అన్న తర్వాత ఒకే వాక్యంలో చాసో అంటాడు “శారద మహా పతివ్రత ” అని. భర్త నపుంసకుడైనప్పుడు అతను నియోగించిన వారితో రమించి తల్లి అయిన కుంతి మహా పతివ్రత అయితే మరి శారద ఎందుకు కాదు? భర్త చదువు కోసం శారద అదే పని చెయ్యాలా అని అడగచ్చు. అందరి సమస్యకి ఇదే పరిష్కారమా అని కూడా ప్రశ్నించవచ్చు . కానీ వారికి తోచిన పరిష్కారం వారు ఎన్నుకున్నారు అన్నదే ఇక్కడ రచయిత చెప్పే విషయం.
శత కోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు , అలాగే వారి దారిద్రానికి వారికి తోచిన పరిష్కారం అది. అనుకున్నది సాధించుకుంటారు కరుణాకరం దంపతులు.
ఈ కథ చదివి హృది చెమరించని వారుండరు. వ్యంగ్యాత్మకంగా చెప్పినా ఈ కథలోని విషాదం మనల్ని కదిలిస్తుంది. ఈ కథ ఖచ్చితంగా పాఠకుడి మనసులో నిలిచి పోతుంది. ఆలోచింపజేస్తుంది. ఆ నాడు చదువు కోసమే ఒక శారద ఈ పని చేస్తే. నేటి ఈ ప్రైవెటైజేషన్ కాలం లో పేదవారికి  అందక , ఎందరో   సమర్ధత ఉండీ కూడా చదువు కోలేకపోతున్నారు. అసలీ విద్యా రంగాన్ని ఎందుకు ప్రభుత్వం తీసుకోదు ? విద్యా వైద్య రంగాలను ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అతి సాధరణంగా కనిపించే ఈ కథలో ఎన్నో విషయాలున్నాయి  అందుకే ఈ కథ అంటే నాకు ఇష్టం .
                                     -జగద్ధాత్రి
1231658_539630582777569_2120927918_n

ప్రేమ కూడా ఒక సహజాతమే !

osho dont kill him

ప్రేమ రెండున్నరక్షరాల మాట మాత్రమేనా ? జీవితాల విలువ కాదా ?

“ఢాయి అక్ఖర్ ప్రేమ్ కే” అన్నాడు కబీర్ నిజమే ఈ రెండున్నర శబ్దాల పదాన్ని ఎలా అర్ధం చేసుకోవడం? దీన్ని ఎలా వివరించడం ?

ప్రేమ అనేదే లేదు అదంతా ఒక మానసిక రుగ్మత అని కొట్టి  పారేసే వారున్నారు. . కానీ ఒక నాటికి  ఎంతటి వారలు కూడా ఈ ప్రేమ అనే పదానికి దాసోహమనే అన్నారు అని చరిత్ర చెప్తోంది,జీవితంనేర్పించింది .  ప్రేమా పిచ్చీ ఒకటే నని పదేపదే వెక్కిరించినా నిజమే ప్రేమ పిచ్చే , అందుకే ఆ ప్రేమలోఏమన్నా చేస్తాడు మనిషి .దీనికి చాలా దాఖలాలు ఉన్నాయి మన చుట్టూ. ఈ లోకం లో ద్వేషమనేది లేనే లేదు కేవలం ఒక దాని పైన ఎక్కువ  ప్రేమ మాత్రమే మిగిలిన వాటి నుండి మనుషుల్ని దూరం చేస్తుంది అంటారు ఎడ్ డెల్ సాప్రియో దంపతులు  వారి పుస్తకం “Unconditional love” లో.
.

ప్రపంచంలోవికృతరూపాలుదాలుస్తోందన్నది కూడా ప్రేమే నని సమర్ధిస్తావా ? అడిగారు నన్ను కొందరు . లేదు నిజమైన ప్రేమే కనుక అయితే అది ఇలా విషపూరితమవ్వదు. ఈ ప్రేమ కి సరిహద్దులున్నాయా? దీనికి నిర్వచనం ఉందా? పెద్ద ప్రశ్నలు ?! ఇక మరో ముఖ్యమైన ప్రశ్న, ప్రేమ అంటే కేవలం ఇరువురు స్త్రీ పురుషుల నడుమ ఉండేదేనా ?

ప్రేమకి సరిహద్దులంటూ ఏమీ లేవు . నిర్వచనం  కూడా లేదు ఎవరి అనుభవం అనుభూతి ప్రకారం  వారు ఏర్పరుచుకునేదే తప్ప . కేవలం శారీరిక బంధం మాత్రమే ప్రేమ  కాదు . ఈ ప్రేమ ఎవరి పట్ల అయినా జనించవచ్చు . ఒకసారి కలిగాక పోవడమంటూ ఉండదు ప్రేమకి. నాకు ఆ మనిషి మీద ప్రేమ పోయింది అన్నవారిని చూస్తే ఆశ్చర్యం   కలుగుతుంది నాకు . ఈ ప్రేమను ఎందరో మహానుభావులు వారి అభివ్యక్తి లో చెప్పేరు ఈ విశ్వానికి . అలాంటి ఒక సంచలనాత్మక ప్రేమ గురువు ఆచార్య రజనీష్ . ఒక మామూలు మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన ఈ మనిషి , ఉన్నత విద్యను ,జీవితాన్ని చదువుకుని శోధించి సాధించి చివరికి భగవాన్ రజనీష్ గా మారి ఆ పైన ఓషో (సాగరమంత జ్ఞానం కలిగిన ) గా లోకానికి  చిరపరిచితుడు . మన తెలుగు రచయితల్లో చలానికి మల్లె అయితే ఇతనికి భక్తులు లేదా ద్వేషులు ఉన్నారు.

“సెక్స్ టు సూపర్ కాంషన్స్” (భోగం నుండి యోగం లోకి ) అనే పుస్తకాన్ని రచించి విపరీతమైన సంచలనాన్ని సృష్టించిన  ఈ ఓషో గురించిన ఒక నవ్య కధనం అతని అనుయాయురాలు , సెక్రెటరీ గా ఎన్నో ఏళ్ళు పనిచేసి అతని అనుగ్రహం లో మెలిగి , ఓషో ఆశ్రమ నిర్మాణానికి , ఓరెగాన్ లో అతని కోసం రజనీష్ పురం నిర్మించడం లో నాలుగు స్తంభాలూ తానే  అయి నిలిచి ఆపైన తన పదవిని త్యజించి వెళ్ళిపోయిన మా ఆనంద శీల రాసిన “డోంట్ కిల్ హిమ్” (అతన్ని చంపకండి) , అనే పుస్తకం లో భగవాన్ తో తన సామీప్యం , సాన్నిహిత్యం,జీవితం గూర్చి కొన్ని లోకమెరుగని సత్యాలను బయటపెట్టేరు. అయినా అది ఓషో మీద అభియోగంగా ఒక నింద నిష్టూరంగా కాక కేవలం జరిగిన విషయాలను యధాతధంగా మన ముందుంచారు.

ముందుగా ఈ పుస్తకం చదివిన నాకు కాసేపు మతి పోయినట్లనిపించింది. ఆశ్చర్యం కలిగింది. పుస్తకం పూర్తి చేసేసరికి మా ఆనంద శీల వ్యక్తిత్వం ప్రేమతత్వం పై అమితమైన గౌరవం కలిగింది. ఈ పుస్తకం గురించి కొన్నిసంగతులు మీతో పంచుకుందామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా .

చాలా చిన్న వయసులోనే తన తండ్రి వలన భగవాన్ (ఆమె పుస్తకం లో ప్రతి చోటా భగవాన్ అనే సంబోధిస్తుంది తప్ప వేరొక రకంగా చేయదు), ఆమె జీవితం లో పరిచయం కావడం, చూసిన మొదటి క్షణం లోనే నేను భగవాన్ ప్రేమలోపడిపోయాను అంటుందిషీలా. గుజరాత్ లోని ఒక   నగరం లో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి ఎలా ఓషో కి కుడి భుజమై చిన్న వయసులోనే అతని సెక్రెటరీ కాగలిగింది, అతని కోసం ఏమేం చేసింది , దాని ఫలితాన్ని ఎలా అనుభవించింది ఒక్కో సంఘటనా చదువుతుంటే ఆశ్చర్యం తోనూ ఆర్ద్రతతోనూ గుండెలు చెమరించాయి. భగవాన్ ని ఆమె ప్రేమించడం లో ఒక రాధా , ఒక మీరా , ఒక జయదేవుడు, ఒక తుకారాం ఇలా ఎందరెందరో భక్తుల అవ్యాజ్య ప్రేమ, భక్తి అడుగడుగునా అగుపిస్తాయి. చాలా విషయాలు లోకానికి తెలియనివి తెలుస్తాయి.

ఇందులో ముఖ్యంగా తెలిసిన మొదటి విషయం ఏమిటంటే ఇంతటి సర్వసంగ పరిత్యాగి అయిన గురువు కి కూడా కొన్ని అపరిమితమైన , విపరీతమైన కోరికలు ఉండటం. సరే అది లైంగిక మై౦ది ఒక్కటే కాదు , అది చాలా మందికి ఓషో విషయం లో విదితమే. లైంగిక స్వేచ్ఛను బోధించిన గురువుల్లో ఓషో చాలా మొదటి వారిలో ఒకరు. కానీ ఇక్కడ మనకి తెలిసే విషయం అది కాదు . ఈ భగవానునికి 99 ఉన్న సరే ఇంకా మరిన్ని రోల్స్ రాయీస్ కార్లు కావాలని , ప్రపంచం లో ఉన్న అందమైయన ఖరీదైన రిస్టు వాచీల మోజు . ఇవి ఎలాగైనా కొనాల్సిన బాధ్యత అతని శిష్యులదే .అలాంటి సమయం లో షీలా ప్రవేశం జరిగింది ఓషో ఆశ్రమం లోకి. అప్పటికి అతనికి లక్ష్మి అనే ఒక పెర్శనల్ సెక్రెటరే ఉంది . ఇతని  గొంతెమ్మ కోరికలు తీర్చలేక డబ్బులు తేలేక సతమత మౌతున్నది ఆమె.

ఇక్కడ మనకొక మరో విషయం అర్ధం అవుతుంది అదేమిటంటే , ఏ గురువూ తనంతట తను గా గొప్ప కాదు, అతనిని పిచ్చిగా ప్రేమించి అతని కోసం ఏదైనా చెయ్యగల శిష్య బృందం ఉంటే గానీ. అలాంటి శిష్యులను గుర్తించడం వారి శక్తి సామర్ధ్యాలను అంచనా వేసి తన కొలువులో చేర్చుకోవడం ఈ మహా గురువులు చేసే పని . ఇలాంటివి మరి ఏతంత్రం తో పట్టుబడతాయో వీరికి. సిద్ధ పురుషులు కదా బహుశా అందుకేనేమో , రజనీష్ సరిగ్గానే షీలా శక్తిని పసి గట్టి ఆమెను దగ్గరికి చేర్చుకున్నారు. ఇది శీలకి ఒక దివ్య వరం . ఎని జన్మల పుణ్యమో అనుకుంది ఆమె మొదట్లో. కానీ ఆ తర్వాత ఆ ఆశ్రమాన్ని ఒక కొలిక్కితీసుకురావడానికి , మళ్ళీ ఓరెగాన్ లో ఆశ్రమం ఏర్పరచడానికి షీలా కారణ భూతురాలౌతుందని ఆమె  అనుకోలేదు. ఇదంతా కూడా నేను భగవాన్ అనుగ్రహం తోనే చేశాననంటుంది షీలా ఈ పుస్తకం లో కూడా.

ప్రేమ నేది ఒకరు నేర్పితే వచ్చేది కాదు . నా వరకూ నాకైతే ప్రేమ కూడా ఒక సహజాతమే . అలాంటి ప్రేమలో మునిగిపోయింది షీలా . ఆశ్రమానికి నిధులు సమకూర్చడం లోనూ, పద్ధతిగా ఆశ్రమాన్ని నడపడం లోనూ నిష్ణాతురాలైంది. ఇప్పటికీ మా ఆనంద షీలా (ఈ పేరు భగవాన్ ఇచ్చిందే ఆమెకు ,రజనీషీ అయిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక పేరు తను స్వయంగా ఇవ్వడము, ఆ వ్యక్తి మెడలో ఓషో చిత్రమున్న ఐడెంటిటీ కార్డ్ ఉండటము అక్కడి ఆనవాయితీ), నిజాయితీ, క్రమ శిక్షణ రజనీష్ పురం గురించి ఆమె తీసుకున్న శ్రమ మరవని వారున్నారు .

ఆమె చెప్పిన కొన్ని విషయాలను మీ ముందు యధాతధంగా ఉంచుతున్నాను:

ఆశ్రమం లో చాలా దేశాలనుండి జోగినులు వచ్చి చేరేవారు శిష్యులుగా . వారిలో బాగా డబ్బున్న వారిని ఎక్కువగా ఆదరించేవారు ఓషో . వారి నుండి తనకు కావల్సిన డబ్బును రాబట్టుకోవడం ఆయనకి బాగా తెలుసు .

ఏదైనా కావాలంటే కొనాలంటే డబ్బు అవసరమైతే వారిని ప్రైవేటు గా వేరుగా కలిసి వారికి తన మీద ఉన్న భక్తిని ఫ్రేమను డబ్బు రూపం లోకి ఎలా మార్చుకోవాలో ఆయనకి బాగా తెలుసును.

ఆశ్రమ నిర్వహణ లో కొందరు డబ్బులున్నవారు ఉండేవారు.  వారు ఓషోకి డబ్బులిచ్చాం కనుక తాము అత్యంత సన్నిహితులమన్నట్టు ఆశ్రమ ధర్మాలను కూడా నిరసించి ప్రవర్తించేవారు. ఇక ఆశ్రమం లో ఉన్న కొందరు డబ్బు లేని వారు ఏయే సేవలు చేయ్యగలరో వారిని కూడా సరిగ్గానే గుర్తించి వారి చేత చేయించుకోవాల్సిన శ్రమ అంతా రాబట్టేవారు భగవాన్ .

ఎక్కడెక్కడినుండో వచ్చిన జోగినుల కు అన్ని సదుపాయాలు కల్పించడం ,ముఖ్యంగా విదేశీయుల , గొప్ప వారి మీద ఎక్కువగా శ్రద్ధ చూపమని ఓషో  షీలా  కి చెప్పేవారు. కొంచెం  సమయం లోనే షీలా చాలా సమర్ధవంతంగా భగవాన్ తనకి  అప్పగించిన పనులను చక్కగా చేసి చూపించేది. తద్వారా భగవాన్ ఇచ్చే ఒక చిన్ని మెప్పు కోసం పరితపించేది . తల్లి , తండ్రి, తమ్ముడు ఉన్న చిన్న కుటుంబాన్ని వదిలి షీలా పూర్తిగా ఆ భగవాన్ కే అంకితమై పోయింది .

ఆచర్య రజనీష్ ఒక విశ్వవిద్యాలయం లో తత్వ శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసేవారు . అతని విలక్షణ , విచిత్ర విపరీత బోధన చూసి విద్యాలయం  వారు ఇతనికి ఉద్వాసన పలికారు.

షీలా రజనీష్ వద్దకు వచ్చేటప్పటికి ఆయన గుజరాత్ లో ఒక మామూలు ఇంటిలో ఉండేవారు , ఆయన ప్రవచనాలు వినడానికి కొద్దో గొప్పో కొంతమంది ఉండేవారు. ఆ తర్వాత రజనీష్ తన స్థాయిని పెంచి ఆంగ్లం లోనే ఉపన్యసించి కొందరు అక్కడి స్థానీయుల అభిమానాన్ని కావాలనే దూరం చేసుకున్నారు. ఆ పైన ఇక రజనీష్ ఓషో గా మారిన వైనం ఎలాంటిదంటే :

అక్కడినుండి ముంబై ఒక ఫ్లాట్ లోనికి రజనీష్ ప్రవేశించారు. అక్కడ ఆర్ధికంగా కాస్త బలమున్న వారి ఆశ్రయం సంపాదించారు. అతనికి వ్యక్తిగతంగా ఉండే బలహీనతల మాట ఎలా ఉన్నా అతని ఉపన్యాసం విన్న వారు , అతని కన్నుల్లోకి చూసిన వారు అతనికి  అయిస్కాంతలా అతుక్కు పోతారు అంటారు షీలా .
ఎన్నో మతపరమైన నైతికమైన   ఛాందసాలను కాదని , స్త్రీ కి  కూడా లైంగికత ఉంటుందని , శీలం అనే మాట ఒక వ్యర్ధ పదమని బోధించే ఓషో బోధనలు ఆ సంప్రదాయపు కట్టలను తెంచుకుని పైకి రావాలనుకునేవారికి బాగా ఉపయుక్తంగా అనిపించాయి అనడం లో సందేహం లేదు. ఇలా 1929 లోనే ఒక తెలుగు ప్రాంతీయ రచయితగా మాట్లాడిన  వాడు మన చలం అయితే మళ్ళీ 1975 ప్రాంతాల్లో ఒక ప్రేమ గురువుగా ఇదే విషయాన్ని  ప్రస్తావించి  ప్రబోధించి ఆచరింపచేసిన వ్యక్తి ఓషో.  (ఓషో  “దబుక్ ఆఫ్ ఎ వుమన్ ” చలం “స్త్రీ” ని సరిపోలుస్తూ ఒక పరిశీలనా వ్యాసం రాయాలని ఎప్పటినుండో ఉంది నాకు ).

అతను బోధించే విషయాలలో ఎక్కడా తప్పు లేదు. సార్వజనీనమైన ప్రేమను బోధించారు అంటారు షీలా. అతని బోధల పట్ల ఆమెకు ఇసుమంత కూడా ఫిర్యాదు లేదు . ఆయన తో సాహచర్యం లో తాను ఏమేమి చేశారో ఎలా చేశారో అది కూడా భగవాన్ నేర్పిన ప్రేమ తత్వమనే చెప్తుంది నేటికీ షీలా . ఇది భగవాన్ మీద అభియోగం కోసం రాసింది కాదు . కానీ 39 నెలలు కారాగార శిక్ష  నిష్కారణంగా అనుభవించాల్సి రావడం అదీ ఒక పరాయి దేశం లో ఆమెను ఎలా ఒక వ్యక్తిగా నిలబెట్టాయో ఎలా శక్తిని పుంజుకుని పనిచేయగలిగిందో అంతా చెప్తుంది.

గురువుల గొప్పతనాన్ని ప్రచారం చేయడమే కాక వారి కోసం ఆర్ధికంగా నూ, హార్ధికంగానూ ఉపయోగపడే ప్రియ శిష్యులను గుర్తించే అనితర సాధ్య విద్యకలిగిన ఓషో  షీలాకు  ఆశ్రమ నిర్వహణ అనతి కాలం లోనే అప్ప చెప్పేరు. ఆమెను తన ప్రైవేట్ సెక్రెటరీ గా నియమించారు . ఇది ఆమె భుజాలపై చాలా  భారమైంది .
ఆశ్రమం లో అందరినీ ఒక తాటిన నడిపించాలని , ఒక క్రమశిక్షణ అమలు జరపాలని ఆమె తీసుకున్న శ్రమ చెప్పనలవి కానిది. పొద్దున్న వేకువఝాము నుండి రాత్రి పన్నెండు వరకు ఆమె ఒక యంత్రం లా పనిచేసేది . ఓషో హోం లో అన్నీ విషయాలలోనూ ఆమె నిర్ణయం తీసుకోగలిగేది. ఆమెకు మనసుకి నచ్చిన ఆమెతో పాటు చివరి వరకు  తోడున్న కొందరు వ్యక్తులు ఉండటం వలన ఆమె ఈ పనులు చేయగలిగాను అంటుంది.

రజనీష్ హోమ్ లో మేడిటేషన్ కాంప్ నిర్వహించేవారు . ఓషో ప్రవేశపెట్టిన మేడిటేషన్ విధానం చాలా కఠినమైనది . అందులో ఆరితేరితే ఇక ప్రపంచం లో అన్నీ చేయగలం అంటుంది షీలా. కానీ భగవాన్ అదుపులేని ఖర్చు లు కోరికలు ఆమెను ఆమె తో బాటు పని చేసే కొందరిని బాగా భయపెట్టేవి. అందరినీ తన రక్షణ లో ఒక తల్లి లాగా సాకేది షీలా. ఎన్నో కార్లుండగా మళ్ళీ మరొక కారు , మరికొన్ని వాచీలు , ఈ బలహీనతేమితో అస్సలు అర్ధం కాదు నాకిప్పటికీ  అంటుందీమే. పోనీ అన్నీ పెట్టుకోగలరా అంటే అన్నీ
కార్లలో  ఒకేసారి తిరగగలరా అంటే అసంభవం అని మనకు తెలుసు . అయినా ఈ పిచ్చి వెర్రి కోరికలేమిటో. వీటన్నిటిని సహనంతో భరిస్తూ ఆర్ధికంగా ఎలా నిధులు సమకూర్చాలన్న ధ్యాసతోనే రోజులు గడిచిపోయేవి ఆమెకు.

ఇక మరో సమస్య విదేశాలనుండి వచ్చే జోగినుల ప్రవర్తన . లైంగిక పరమైన స్వేచ్ఛ ఉండటం తో ఆశ్రమం లో నూ డబ్బుల కోసం బయటా కూడా వ్యభిచారానికి పాల్పడే వారు కొందరు. వారికి ఎటువంటి ఆరోగ్య  సమస్యలొచ్చినా (సుఖరోగాలు, గర్భాలు) ఇవన్నీ కూడా తానే పర్యవేక్షిస్తూ పరిష్కరించాల్సి  వచ్చేది . రజనీష్ కి తన ఆశ్రమం లో ఏ ఒక్కరికీ గర్భాలు రావడం ఇష్టం ఉండేది కాదు, ఒక వేళ వస్తే వెంటనే అబార్షన్ చేయించేసి వారిని స్టెరిలైజ్ చేయించేవారు, ఇక పిల్లలు ఉన్న వారు వస్తే వారికోసం వేరే ఏర్పాట్లు. ఈ  జోగినుల పిల్లల కోసం ఒక  నర్సరీ కూడా నడపాల్సి వచ్చేది  ఆశ్రమం  అవతల అంటారు షీలా. ఆసుపత్రి మందుల ఖర్చు గాక , ఓషో అనారోగ్యానికి మందులు (విదేశాలనుండి) , అలాగే కొన్ని మేడిటేషన్లలోకి వాడటానికి మాదక ద్రవ్యాలు (హెరాయిన్, బ్రౌన్ షుగర్) లాంటివి కొనడానికి చాలా ఖర్చు అయేది . అవన్నీ ఒక్క చేతి మీద , మధ్యలో రజనీష్ ఎవరికి చెప్పకుండా కొనుక్కోచ్చే కార్ల లోన్లు ఇవన్నీ వచ్చే ఆదాయానికి మించి పోయేవి. తలకు మించిన బాధ్యత చిన్న వయసులోనే తలపై పడిన షీలా ఆత్మ విశ్వాసం తో తిరుగు లేకుండా ఈ పనులన్నీ ఎలా గో చక్క బెట్టేది. ఏదైనా సమస్యను భగవాన్ కి చెప్తే ఆయన విసుక్కునేవారు.

అంచేత తాను తన బృందం రేయింబగళ్లు కష్టపడేవారు. నిధుల సేకరణకు తరచూ తాను విదేశాల్లో పర్యటించి పోగు చేసుకుని వచ్చేది షీలా. తీరా వచ్చేసరికి ఏదో ఒక అవాంతరమైన ఖర్చు ఎదురు చూస్తుండేది. తాను దాదాపు రోజూ అని విషయాలను భగవాన్  తో చర్చించేదాన్నని , చెప్పేదాన్నని అంటారు షీలా. అతని ఆజ్ఞమేరకు మళ్ళీ పని చేసుకు పోయేదాన్ని . భగవాన్ మాట కాదనే శక్తి మాత్రం ఎవరికి ఉండేది కాదు అంటారామే. ఆమె తొలి భర్త కూడా భగవాన్ శిష్యుడుగా మారి ఉండేవారు. అతనికి తమ పెళ్లి అయేనాటికే కాన్సర్ అని రెండు మూడేళ్లకన్న బ్రతకడని తెలిసినా వారు వివాహం చేసుకున్నారు. ఇది భగవాన్  కి తెలుసు . రాను రానూ  జనసందోహం ఎక్కువ అవ్వడం తో ఉండటానికి కూడా సరైన  స్థలం ఉండేది కాదని కొన్ని సార్లు షిఫ్ట్ ల పద్ధతి లో నిద్ర పోయేవారమని చెప్తారు.

ఇక కొందరు డబ్బున్న జోగినులు డబ్బులు ఇచ్చాము  గనుక మాకే రజనీష్ మరింత దగ్గర అన్నట్టు క్రమ శిక్షణ లేకుండా అసహ్యంగా  వర్తించేవారు మిగిలినివారితో. ఈ గొడవలు తగువులూ అన్నీ షీలా మాత్రమే చూడాల్సి వచ్చేది. సవితా అని ఒక మంచి అమ్మాయి తనకి సహాయం చేసేదని, అలాగే మునుపటి సెక్రెటరీ లక్ష్మి కూడా వారి సహాయం లేకుంటే తానేమీ చేయలేక పోయేడాన్ని అంటారు షీలా. ఇక మరో సమస్య హోమ్ లో ని డాక్టర్లు . కొందరు  రోగులను తమ  లైంగిక స్వార్ధం కోసం వాడుకునేవారనీ. అదేమంటే వ్యతిరేకించేవారనీ ఆ సమస్యలు కూడా తానే పరిష్కరించాల్సిన పని బడేది అని చెప్తుంది. రజనీష్ ఆశ్రమంలో ని వేసుకునే బట్టలు దగ్గరనుండి , అన్నీ విషయాలూ వివరిస్తుంది . ఒక పొడవాటి అంగీని వేసుకోవాలని అందరూ అది ఒక్కొక్కరికి ఆయన నచ్చి చెప్పే రంగులవి ధరించాలని. ఎక్కడా బిగుతూ లేని బట్టలు ధరిస్తే దేహామంతా ప్రాణవాయువు ప్రసరిస్తుందని ఓషో చెప్పేవారు.

ఇక మేడిటేషన్ సమయాల్లో  కొందరు విపరీతమైన  మానసిక ఒత్తిడి కి గురవుతున్నవారికి డ్రగ్స్ ఇచ్చేవారు. ఈ విషయం ఇటు ప్రభుత్వానికి , అటు ప్రజలకి తెలియకుండా కాపాడటం చాలా కష్టమయ్యేది . ఇన్ని చేసీ భగవాన్ కి ఎప్పుడూ ఆరోగ్య సమస్యలతో బాధ పడేవారు. ఆయనకి ఆస్త్మా ఎటాక్ వస్తే మెలికలు తిరిగి పోతున్న భగవాన్  ని చూస్తే ఏడుపొచ్చేదట.  డైబెటిస్ , ఆస్త్మా ,నడుం నొప్పి తో బాధలు పడేవారు భగవాన్. ఇక ఒకనాడు షీలా చెయ్యి దాటిపోయిన పరిస్థితులను చూసి తాను ఆశ్రమం నుండి వెళ్లిపోదల్చుకున్నానని ఒక లేఖ ఓషో కి పంపింది. వెళ్లడానికి వీల్లేదని కోపగించుకున్నారు భగవాన్ . అయినా ఇక తట్టుకునే ఓపిక లేక ఆమె రజ్నీష్ పురం నుండి వచ్చేసింది . ఇక్కడితో ఆమె జీవితం అయిపోలేదు . అసలు కష్టాలు ఇక్కడే ఆరంభమయ్యాయి .
ఆమె ఆశ్రమ నిధుల నుండి 55 వేల డాలర్ల సొమ్మును దొంగిలించి తీసుకుపోయిందని ఆమె పైన కేస్ పెట్టారు ఓషో. ఆమె తో బాటు ఆశ్రమం నుండి వచ్చేసిన వారు కూడా కొందరు ఉన్నారు . అయినా షీలా మీద కోపం తో కేస్ పెట్టేరు భాగ్వాన్. ఇక ఆమె తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి , కొన్ని నేరాలు ఆశ్రమం లో చేసినట్లు ఒప్పుకున్నప్పటికి , డబ్బులు తీసుకు రావడం మాత్రం అసత్యమని తెలిసేసరికి ఆమె ముప్పై తొమ్మిది నెలలు కారాగార వాసం అనుభవించింది. అమెరికా, స్వీడెన్, ఇలా దేశాలు తిప్పి ఆమెను కారా గరం లో ఉంచేవారు . అక్కడ కొన్ని  జైళ్లలో కొందరు మంచి వారు ఉండేవారని అదీ ప్రేమ గొప్పతనమే అంటుంది షీలా . ఎంతో కష్టపడిన షీలా కారాగార వాసం లో చెయ్యని నిందను భరిస్తూ ఎలా బ్రతికిందో అంతా వివరిస్తుంది . నా ఆత్మ స్థైర్యం నా ప్రేమ మాత్రమే నన్ను రక్షించింది అంటుంది . ఒక సారి జైల్లో ఒక పిచ్చి అమ్మాయి సెల్ లోనే తననూ పడేస్తే , కొద్ది రోజులకు ఆ అమ్మాయి లో మార్పు తీసుకోచ్చి అందరి మన్ననలు పొందుతుంది షీలా. అలాగే ఒక జైల్ లో అధికారిని మా ఆనంద షీలా అంటే ప్రాణం పెట్టి తనకి ఇష్టమైన వేడి నీళ్ళ స్నానం ఏర్పాటు చేస్తుందని. మరొక చోట ఫిలిప్పైన్స్ లో జైల్ నుండి వచ్చేసేక ఒక జపాన్ రచయిత్రి తో కలిసి ఒక రూమ్ లో కొన్నాళ్లు గడుపుతుంది . ఆ రచయిత్రికి కాన్సర్ , ఆమె ప్రశాంతంగా నవల రాసుకుందామని అక్కడికి వస్తుంది అటువంటి ఆమె షీలా ను తనతో ఉండటానికి ఇష్టపడుతుంది. ఆమెను ఆమె అద్వితీయ  పట్టుదలను ప్రేమను జీవితాంతం మరువలేనంటుంది షీలా.  షీలా కు సహాయం చేసిన లాయర్ ని వివాహం చేసుకోవాలనుకుంటుంది కానీ అతనికి వేరే భార్య పిల్లాడు ఉండటం తో కుదరదు. మరొక అతన్ని వివాహం చేసుకుంటుంది. జైల్ నుండి వచ్చాక తన కుటుంబం ఎప్పుడూ తనను అదరిస్తూనే వచ్చారని వారి ప్రోత్సాహం తోనే ఈ పుస్తకాన్ని రాస్తున్నానని చెప్తుంది .

తనిప్పుడు ఒక వృద్ధాశ్రమం నడుపుతున్నానని , అది వృద్ధుల ఇల్లు అంతే కానీ ఆశ్రమం అనను అంటుంది. వాళ్ళంతా ఒక కుటుంబంలా ఉంటారు. వారందరికి తానే తల్లి తండ్రి లా సాకుతుంది . ఇన్ని విషయాలను చెప్పిన ఆమె ఇప్పటికీ భాగ్వాన్ పైన అనురాగం పోలేదంటుంది. ఈ ప్రేమ శక్తి అంతా భగ్వాన్ ప్రసాదమే అని నమ్ముతుంది. ఈ విషయాలు ఎందుకు చెప్పేనంటే నేను ఏ దొంగతనమూ చేయకుండా భాగ్వాన్ కోపం తో నా మీద మోపిన అభియోగం గురించి వివరించడానికి. తను ఆశ్రమం నుండి వచ్చేసిన కొద్ది రోజులకే భాగ్వాన్ కూడా అరెస్ట్ అయ్యారు. తాను జైల్ నుండి వచ్చేసిన కొద్ది రోజులకే భగవాన్ ఇక భౌతికంగా లేరన్న  వాస్తవం కూడా తనకి  మీడియా ద్వారా తెలిసింది అంటుంది షీలా .

ఆయన కు వ్యక్తిగత బలహీనతులున్నాయేమో గానీ అతని బోధనలో శక్తి ఉందని నమ్ముతుంది షీలా. ముఖ్యంగా భాగ్వాన్ అమితమైన జ్ఞానానికి , అతని ప్రసంగానికి, అతని ప్రేమ తత్వానికి దాసోహమనక తప్పదు ఎటువంటి వారైనా. అందుకే అతన్ని కాదు అతని బోధనలను ప్రేమించండి. అవి లోకానికి ప్రేమ మార్గాన్ని చూపుతాయ్ అని చాటి చెప్తుంది ఈ నాటికి మా ఆనంద షీలా . ఒక చిత్రమైన  అనుభూతి కలిగించే పుస్తకం వీలైతే చదవండి . ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మిత్రులారా . భాగ్వాన్ పరిచయం తో తనలో నిండిన ప్రేమే తనని ఇంకా బ్రతికిస్తోందన్న మహా విశ్వాసం కలిగిన మా ఆనంద షీలాను చూస్తే ఆశ్చర్యం ఒక్కటే కాక ప్రేమ అనే రెండున్నరక్షరాలకు ఇంతటి శక్తి ఉందా అన్న ఆనందం కలుగుతుంది . భాగ్వాన్ తో ఆమె ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఇందులో ప్రచురించారు. ఫాక్ట్ ఈస్ స్ట్రేన్జర్ దాన్ ఫిక్షన్ అన్నది నిజమైతే ,ప్రేమ జీవితం కన్నా గొప్పనైనది అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే  ఓషో భక్తులకు కూడా అతని పట్ల ద్వేష భావం కలగదు పైగా అయ్యో అవునా అనిపిస్తుంది.

.

1231658_539630582777569_2120927918_n-జగద్ధాత్రి

 

నీ భాషను నాకు నేర్పు..

images

 టాగోర్ సెప్టెంబర్ 10, 1937 లో బాగా అనారోగ్యం తో మంచం పట్టారు . అయినా అతని కలం  కవిత్వం చిందించడం మానలేదు. మంచం మీద నుండి రాసిన కవితలే 11 సంపుటాలు వెలువడ్డాయి. అందులో ” ఆరోగ్య”. శేష్ లేఖ , జన్మదినే ఇలా . ఇవన్నీ శిశిర్ కుమార్ దాస్ సాహిత్య అకాడెమీ ప్రచురించిన రబీంద్రుని సమగ్ర సాహిత్యం లో వాల్యూమ్ త్రీ లో పొందు పరిచారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ “రవిరేఖలు” అని చెప్తున్నవి ఏ సంపుటి లోనూ పొందు పరిచినవి కావు . ఇవి కొందరి మిత్రుల అభ్యర్ధన మేరకు , వారికి అర్ధం కావడం కోసం, బెంగాలీ లో కవిత రాసి వెంటనే దాన్ని ఆంగ్లీకరించేవారు. 

ఇలా ఎన్నో సందర్భాలలో రాసిన వాటిలో కొన్ని ప్రసంగాలు, వ్యాసాలు , కవితలు ఇలా వేరు వేరుగా వాల్యూమ్ 4 లో పొందు పరిచారు సాహితి ఆకాడెమీ వారు. అందులోనుండి ఈ కవితలను ఇప్పుడు తెలుగు లో మీకు అందిస్తున్నాము. ఇవి అన్నీ కొన్ని ఆంగ్లం లోనూ, కొన్ని బెంగాలీ లోనూ రాసిన కవితలు. ఎక్కువగా బెంగాలీ లో రాసి వెనువెంటనే తానే స్వయంగా క్రమశిక్షణ తో ఆంగ్లం లోకి అనువదించేవారు టాగోర్. ఈ కవితలు ఏవీ ఇతరులు అనువాదం చేసినవి కావు .అనువాదం కూడా ఒక గంభీర మైన  సాహిత్య ప్రక్రియ గా టాగోర్ సాధన చేసిన సమయం లో రాసిన కవితలు ఇవి . 1940 26 సెప్టెంబర్ లో మరలా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు టాగోర్. 1941 లో పరమపదించారు. చివరి క్షణం వరకు రాస్తూనే ఉన్నారు. ఆయన ఆలోచనామృత బిందువులే ఈ కవితలు . టాగోర్ కలం నుండి వెలువడ్డ ఆఖరి కవిత్వ రచనలుగా చెప్పబడే “రవి రేఖలు” అన్నీ అముద్రితాలు . వంగ మూలం వెనువెంటనే ఆంగ్లానువాదం టాగోరే చెయ్యడం విశేషం.


తెలుగు సేత : జగద్ధాత్రి

 

1

నీ పిల్లల మొర ఆలకించు తండ్రీ!

వారితో మాట్లాడు .

 

వారి ఆందోళిత హృదయాలలో తీరని ఆశలని పెంచుకుంటున్నారు

 

వారి ఆశా పూరిత చేతుల్లో నలిగి పోయే వాటిని పట్టుకుంటున్నారు,

 

ఓదార్పన్నది ఎరుగరు వారు . మాటలాడు వారితో.

 

ఎడారి వ్యర్ధాలలో నీడలను వెంటాడుతారు ,

 

రోజు పూర్తవ్వగనే తమ రిక్త హస్తాలను పిండుకుంటారు ;

 

వారి ముందు చూస్తారు కానీ ఏమీ చూడలేరు .

 

సంభాషించు వారితో తండ్రీ !

 

2

నా హృదయ సాగర తీరాన నిల్చుని ఉన్నావు నీవు

అలలు నీ పాదాలను తాకాలని చెలరేగి పోతున్నాయి

 

వెళ్ళి పోవద్దు, ప్రియతమా, గాలి ఎగుస్తోంది

 

సంద్రం తన సరిహద్దులను తెంచుకునేదాకా వేచి ఉండు

 

కెరటాలు నీ పాదాలను స్పృశించాలని ఆరాట పడుతున్నాయి

 

3

ఆవలకి తొలగి ఉండు , ఆమెను నీ స్పర్శతో మైల పరచకు ! నీ వాంఛ ఊపిరి విషం

ధూళి లో పడవేస్తే పువ్వు విరియదని తెలుసుకో

 

జీవన మార్గము అంధకారమని , నీకు దారి చూపేందుకే తార ఉందని తెలుసుకో

 

ఆమెను ఆవల పెట్టి తలుపు మూయకు

 

అలసిన నీ శ్వాసను వెలిగే దీపం పై సోకనీకు . కాల్చి నీ ప్రేమను బూడిద చేసుకోకు .

 

1364025537_1368212746

4

ఓ మనసా! నేను గానం చెయ్యాలంటే , నీ భాషను నాకు నేర్పు

నా శ్వాస అంతా నిట్టూర్పులలో వ్యర్ధమైపోతోంది ,

నా సంగీతం నిశ్శబ్దమైంది

సాయం సంధ్యలో సూర్యుడు నీలి గగనం నుండి నీలి నీటిలోనికి జారుతాడు ,

నా పాడని పద్యాలన్నీ స్తంభించిన గాలిలో తేలుతూ ఉంటాయి

 

నా రహస్యాలు నాకు మాత్రమే చెందినవి

అన్నీ మబ్బులలోనూ కెరటాలలో నూ జల్లివేయబడతాయి

నా హృదయ మధుర గీతాలు సాగరం  , గగనం కన్నా పురాతనమైనవి

కేవలం నా గొంతు మాత్రమే మూగది

 

5

ముద్దులు , పెదాల చెవులలో అవి పెదవుల పదాలు

అది హృదయ ద్రాక్ష సారాయిని రెండు రోజా పూరేకుల గిన్నెలలో కలపడం

 

అది పలుకుల అంతానికి అనురాగపు తీర్ధ యాత్ర

 

దేహపు పరిమితులలో ఐక్యమయ్యే దాకా దారి తప్పి తిరుగాడే రెండు హృదయ వాంఛలు

 

ప్రేమ పెదవులనుండి పువ్వులను సేకరిస్తోంది తీరుబాటు సమయాల్లో మాలలు అల్లేందుకు

 

రెండు పెదాలు , రెండు యవ్వన చిరునగవులకు ఒక శోభనపు శయ్య కాగలవు

 

 చిత్రం: టాగోర్

అనువాదం : జగద్ధాత్రి