విజయవాడలో కర్నాటక సంగీత కచేరీ అంటే గాంధీనగరం హనుమంతరాయ గ్రంధాలయంలో జరుగుతుండేవి సర్వ సాధారణంగా. ఆ నెల కచేరీ టిక్కెట్లు ఇవ్వడానికి వచ్చిన సభ గుమాస్తా చాలా గొప్పగా చెప్పాడు అమ్మతో, “ఈ సారి కచేరీ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో నండీ. ఫోగ్రాము మా గొప్పగా ఉంటది అన్నారు మా అయ్యగారు.” వరండాలో కూర్చుని ఏదో ఇంగ్లీషు డిటెక్టివు నవల చాలా శ్రద్ధగా చదువుకుంటున్న నా చెవిలో ఈ మాటలు పడి కొంత కుతూహలం కలిగించాయన్నది నిజం. కళాక్షేత్రంలో కచేరీ అంటే మాటలు కాదు. అప్పటికి నాకు తెలిసి అలాంటి కచేరీ జరిగింది సుబ్బలక్ష్మి వచ్చి పాడినప్పుడూ, మళ్ళీ బాలమురళీకి విజయవాడ పౌరసన్మానం జరిగినప్పుడూనూ.
కచేరిలో చెవుల తుప్పొదిలిపోయింది. అసలు అంతకు మునుపు ఎప్పుడూ విని ఎరుగని ధ్వని. విచిత్రంగా ఉన్నది. అటుపైన, ఆ రాగాలాపనల నొక్కులేవిటి, ఆ స్వరప్రస్తారాల మెరుపులేమిటి .. ఇంతా చేసి అంత పెద్ద స్టేజీ మీద ఒక నలుసంత పిల్లగాడు. అటూ ఇటూ పక్క వాద్య విద్వాంసులు సూర్య చంద్రుల్లాగా ఉన్నా ఆకాశంలో కదలని స్థానం నాదేసుమా అని ధీమాగా మెరుస్తున్న ధృవ నక్షత్రం లాగా ఆ చిన్న పిల్లాడు, చేతిలో .. ఒక ఆటవస్తువు లాంటి వాయిద్యం .. దాని పేరు మేండొలిన్-ట! కేవలం కొత్త వాయిద్యం కొత్త రకం నాదం అన్న వైవిధ్యం ఒక్కటే కాదు .. ఆ విద్వత్తు, విద్వత్తుని వెలువరించిన తీరు .. విభ్రాంతి కలిగించాయి అనడం అతిశయోక్తి కాదు. అసలే ఆ రోజుల్లో నాకు ఎవరూ ఒక పట్టాన నచ్చే వాళ్ళు కాదు. కానీ కరిగి ముద్దైపోయాను.
కచేరీ పూర్తయ్యాక, చివరి బస్సు పట్టుకోవాలి అని ఎప్పుడూ ఆరాట పడే అమ్మ, ఆ మాటే ఎత్తకుండా స్టేజివేపుకి దారి తీసి, ఆ పిల్లాడి బుగ్గలు పుణికి పర్సులోంచి ఓ పది రూపాయల కాయితం ఆ అబ్బాయి చేతిలో పెట్టి వచ్చింది. ఎవరో శ్రీనివాసుట .. తెలుగు పిల్లాడేట .. మహా ఐతే పన్నెండేళ్ళుంటాయేమో .. అబ్బ, నిజంగా ఆ మేండలిన్తో బిల్లంగోడు ఆడుకున్నట్టు ఆడుకున్నాడు.
మరోసారి శ్రీనివాస్ విజయవాడలో కచేరి చెయ్యడానికి వచ్చే సరికి మా అమ్మ బుగ్గలు పుణికే స్థాయి దాటి పోయి చాలా ఎత్తుకి ఎదిగి పోయాడు. చూస్తుండగానే సంగీతం షాపుల్లో కొల్లలుగా కేసెట్లు .. ఎక్కడెక్కడివో రాగాలు .. ఏవేవో పోకడలు .. అడిబుడి రాగాలలో పెద్ద పెద్ద రాగం-తానం పల్లవులు. బాగా తెలిసిన నను పాలింప, నగుమోములకి సరికొత్త రంగులద్దకాలు. ఆ ఉప్పెనలో చెన్నై మునిగిపోయింది. ఒక చెన్నై ఏవిటి, ప్రపంచం మొత్తంలో కర్నాటక సంగీతం వినే వారెవరూ ఆ మంత్రజాలంతో ముగ్ధులు కాకుండా ఉండలేదు.
నేను అమెరికా వచ్చాక కూడా ఐదారు సార్లు నేరు కచేరీలు విన్నా. ఇన్ని కర్నాటక కచేరీలలోనూ ఒక పరమాద్భుతమైన అనుభవం డెట్రాయిట్ సింఫొనీ హాలులో జాన్ మెక్లాలిన్ శక్తి బేండుతో కలిసి శ్రీనివాసుని వినడం. నయాగరా జలపాతంలో పడితే అది మహా అయితే ఓ మూణ్ణిమిషాల అనుభవం కావచ్చు. సుమారు గంతన్నరసేపు నయాగరా కింద నిలబడితే ఎలా ఉంటుందో .. ఎదురు పడినా ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఒక మందహాసం. వేదిక మీదినించి మాట్లాడినా . మంద్రస్థాయిలో మృదువుగా, పాటని ఎనౌన్స్ చేసేంత వరకే. ఎప్పుడూ ఏ కాంట్రవర్సీలలోకీ పోలేదు. ఒక సారి అతని అమెరికా టూరుగురించి ఏదో అసంతృప్తి చెందిన కొందరు పెద్ద తలకాయలు కొంత అలజడి సృష్టించినా ఇతను సంయమనం కోల్పోలేదు.
తనివి తీరలేదే .. మా మనసు నిండలేదే .. ఎన్ని రికార్డింగులున్నా .. నేరుగా నీ చిరునవ్వుని చూసిన అనుభవం రాదుగా! అప్పుడే వెళ్ళిపోవాలా శ్రీనివాస్?
తాజా కామెంట్లు