భయంలేని స్వరం – శీతల్ సాథే

 

vinodగత శనివారం హైదరాబాద్ లమాకాన్ లో ఒక మరాఠీ ప్రజాగాయకురాలి ప్రోగ్రాము జరిగినది. ఆవిడ పేరు “శీతల్ సాథే”. చాలా రోజుల క్రితం ఆవిడ పాడిన మరాఠీ పాటలు కొన్ని నేను ఇంటర్నెట్ లో విన్నాను. భయం లేని ఆవిడ స్వరం, నిజాయితీ నిండిన ఆవిడ పాటలు నాకు చాలా కాలం వరకు గుర్తున్నాయి. ఇప్పుడు స్వయంగా చూసే అవకాశం దొరికింది. అదే ప్రోగ్రాముకి ప్రముఖ డాక్యుమెంటరీ దర్శకులు ఆనంద్ పట్వర్ధన్ కూడా వచ్చారు.

లమాకాన్ లో జరిగిన ఆ ప్రోగ్రాము లో జరిగిన విశేషాలని ఇక్కడ రాస్తున్నాను.

శీతల్ సాథే గురించి:

మహారాష్ట్ర లో పేద దళితులపై జరుగుతున్న అత్యాచారాలకి వ్యతిరేకంగా పోరాడుతున్న “కబీర్ కాలా మంచ్” అనే కళాకారుల బృందంలో శీతల్ ఎన్నో సంవత్సరాలు పని చేసారు. ఆ బృందాన్ని మతతత్వ సంఘాలూ, పోలీసులూ కలిసి చిన్నాభిన్నం చేసారు. నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని తప్పుడు కేసులు పెట్టి వేధించారు.

2013 ఏప్రిల్ లో శీతల్, ఆవిడ భర్త, కవి, సచిన్ మాలీ కలిసి మహారాష్ట్ర అసెంబ్లీ ముందు పాటలు పాడుతూ సత్యాగ్రహం చేసారు. పోలీసులు వారినీ, బృందంలోని ఇతర కళాకారులతో సహా అరెస్టు చేసారు. అప్పటికే గర్భవతిగా ఉన్న శీతల్ కి మూడు నెలల తర్వాత ముంబాయి హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇది జరిగి ఇప్పటికి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. సచిన్ మాలీతో సహా మిగిలిన వారందరూ ఇంకా జైలులోనే ఉన్నారు. ఇంతవరకూ విచారణ కూడా మొదలవ్వలేదు. రెండు సార్లు బెయిల్ నిరాకరించబడింది. ఇప్పుడు సుప్రీం కోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేస్తున్నారు. శీతల్ కి ఇప్పుడు రెండేళ్ల బాబు ఉన్నాడు.

ప్రస్తుతం శీతల్ కొంత మంది కళాకారులని కలుపుకుని సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకుని మహారాష్ట్ర మొత్తం తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తున్నారు. జైలులో సచిన్ మాలీ రాసిన పాటలని కూడా శీతల్ పాడుతూ ఉంటారు.

ఎన్నో వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన వర్గాల ప్రజలని represent చేస్తూ, ఒక సెక్యులర్, డెమోక్రాటిక్ సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని చాటి చెప్తూ, చాలా సూటిగా ఆత్మని తాకేలా ఉంటాయి శీతల్ పాటలు.

గత కొంత కాలంగా, శీతల్ ప్రదర్శన ఇచ్చిన ప్రతి చోటా ABVP గ్రూపులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ దళిత కళాకారులని “దేశద్రుహులు” అని వాళ్ళనడం యాదృచ్చికం కాదు.

 

ప్రదర్శన గురించి:

శీతల్ ముఖ్యంగా మరాఠీ గాయకురాలు. ఆవిడ తన పాటలని మరాఠీలోనే పాడుతూ, ప్రతి వాక్యానికీ తనకి వచ్చిన హిందీలో explain చేస్తూ పాడారు. భాష వేరయినా పాటలలోని భావం ప్రేక్షకులని ఖచ్చితంగా చేరుతుంది. ఆ పాటలలోని నిజాయితీ, ప్రశ్నించే తత్వం నాకు బాగా నచ్చాయి. ఆవిడ చెప్పిన కొన్ని మాటలు ఆలోచింపజేసేవి గా ఉన్నాయి.

పాటలు ఎందుకు పాడాలి అని చెప్పే పాట ఒకటి పాడుతూ “పాటలు మనిషిలో ఉన్న అమానవవత్వాన్ని పోగొట్టడానికి పాడాలి. ఇంకా ఉన్నతమయిన మనిషిగా చెయ్యడం కోసం పాడాలి.” అన్నారు.

ఆవిడ భర్త సచిన్ మాలీ రాసిన ఒక హిందీ పాట ఇలా సాగింది.

“इनसान को अछूत और गुलाम किया है

कैसा ये करम है

कैसा ये धरम है”

తెలుగులో

“మనిషిని అంటరాని బానిసని చేసింది

ఇదేమి కర్మం. ఇదేమి ధర్మం”

మొత్తం పాటని ఈ కింద వీడియోలో వినండి.

ఆ బృందం తమ పాటలతో కబీర్ ని, తుకారాం ని తలుచుకున్నారు. అంబేద్కర్ ని, భగత్ సింగ్ ని గుర్తుచేసుకున్నారు. కుల వ్యవస్థని ప్రశ్నించారు, మతతత్వాన్ని విమర్శించారు. మొత్తం ప్రదర్శనని ఈ కింద వీడియోలో చూడవచ్చు.

 

పాటల కార్యక్రమం ముగిశాక ఆనంద్ పట్వర్ధన్, శీతల్ గార్లతో కొద్దిసేపు చర్చ జరిగింది. ప్రేక్షకులలో కొద్దిమంది అడిగిన ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు ఇచ్చారు.

ఆనంద్ పట్వర్ధన్ మాట్లాడుతూ ఇలా అన్నారు. “దేశానికి సంబంధించిన విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఎవరు Nationalistలు ఎవరు anti-nationalist లు.. మీలాంటి, నా లాంటి, శీతల్, రోహిత్ వేముల లాంటి వాళ్ళని, దేశ ప్రజల్లో చాలా మందిని anti-nationals అంటున్నారు. ఇలా అంటున్న వారు ఎవరో కాదు. దాదాపు వంద సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఒక Religious country గా మార్చాలని ప్రయత్నం చేస్తున్న వారు. దాదాపు వంద సంవత్సరాల పాటు ఈ దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని వారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం నడుస్తున్నప్పుడు ముస్లిం లీగ్ తో చేతులు కలిపి బ్రిటీష్ ప్రభుత్వాన్ని సమర్థించిన వారు. మన జాతీయ పతాకాన్ని వాళ్ళెప్పుడూ ఆమోదించలేదు. కాషాయ జెండానే కావాలన్నారు. భారత రాజ్యాంగాన్ని వద్దని మనుస్మృతి నే రాజ్యాంగంగా కావాలన్నారు. అలాంటి వాళ్ళు ఇవ్వాళ మనల్ని anti-nationals అంటున్నారు. దీన్ని మనం ప్రశ్నించాలి.”

 

ప్రశ్న: “కబీర్ కాలా మంచ్” తో మీ ప్రయాణం ఎలా మొదలయ్యింది?

ఆనంద్: “1997 వ సంవత్సరంలో ముంబైలోని రమాబాయి కాలనీలో కొందరు అంబేద్కర్ విగ్రాహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచారు. దానికి నిరసన తెలుపుతూ రోడ్డు మీదకి వచ్చిన నిరాయుధులు అయిన ఆ జనం మీద పోలీసులు  కాల్పులు జరిపి పది మంది ప్రాణాలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ చనిపోయిన వాళ్లకి న్యాయం జరగాలని మహారాష్ట్ర ప్రజలు కోరుతూనే ఉన్నారు. ఆ సంఘటన జరిగిన పది సంవత్సరాల తర్వాత 2007లో నేను రమాబాయి కాలనీలో శీతల్ ప్రదర్శన చూశాను. అప్పటి నుంచి వాళ్ళు నాకు తెలుసు.

2011 లో పోలీసులు వీళ్ళ మీద కేసులు పెట్టి, వీళ్ళలో ఒకరిని అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టారు. అప్పుడు కొన్నిరోజులు వీళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఈ సమయంలో నేను రమాబాయి కాలనీ లో జరిగిన సంఘటనల ఆధారంగా దళితుల మీద జరుగుతున్న అత్యాచారాల మీద “జై భీమ కామ్రేడ్” అనే సినిమా పూర్తి చేసాను. అందులో కబీర్ కాలా మంచ్ గురించి కూడా చూపించడం జరిగింది. ఆ సినిమా ద్వారా ప్రజలకి వీళ్ళ గురించి తెలిసింది. Civil Society నుంచి మద్దతు దొరుకుతుండటంతో వీళ్ళు అజ్ఞాతం నుంచి బయటికి వచ్చి స్వచ్చందంగా లొంగిపోయారు. మేము మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము. ఒకటి రెండు నెలల్లో జైల్లోంచి బయటపడి మిగతా కళాకారుల్లాగే ప్రదర్శనలు ఇచ్చుకోవచ్చు అనుకున్నాము. కానీ ఇప్పటికీ వీళ్ళలో ముగ్గురు జైల్లోనే ఉన్నారు.

ఎవరైతే రోహిత్ వేములని దేశద్రోహి అన్నారో వాళ్ళే ఇప్పటికీ శీతల్ ని కూడా దేశద్రోహి అంటున్నారు. తను ఇచ్చే ప్రదర్శనలని అడ్డుకుంటూనే ఉన్నారు.”

ప్రశ్న: నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది హిందుత్వవాదులు, మనువాదులు ఉన్నారు. వాళ్ళు రకరకాల వాదనలు చేస్తారు. వాటిని ఎలా counter చెయ్యాలి?

ఆనంద్: “వాళ్ళ వాదనలకి వ్యక్తిగతంగా సమాధానాలు చెప్పడం అన్నది అంత ఉపయోగకరం కాదు. ఎందుకంటే 5, 6 ఏళ్ల వయసు నుంచి చెడ్డీలు వేసుకుని శాఖలలో పెరిగిన వాళ్లకి ఆ భావజాలం మెదడులో నిండిపోయి ఉంటుంది. అటువంటి వాళ్ళ మెదడులోకి కొత్త ఆలోచనలు ఎక్కించడం అనేది దాదాపు అసాధ్యం. దానికి బదులు మనం తటస్థంగా ఉన్న మామూలు జనంతో మాట్లాడితే మంచిది. మామూలు జనం దేశానికి ఏదో ఆర్థికంగా మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో వాళ్ళని సమర్థిస్తున్నారే తప్ప వాళ్ళ మతతత్వ భావజాలాన్ని సమర్థించి కాదు. ఇప్పటికీ తటస్థంగా ఉన్న జనమే ఎక్కువ. వాళ్ళతో మాట్లాడి విషయాలు విడమర్చి చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.”

శీతల్: “కొంచం తేలిక భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. Ideology ని Ideology తోనే ఎదుర్కోగలం. ఎందుకంటే అన్నిటికీ మూలం Ideology లోనే ఉంటుంది. మనల్ని అణిచివేసే వాళ్ళకి కూడా ఒక Ideology ఉంటుంది. వాళ్ళు వాళ్ళ Ideology ని ముందుకు తీసుకువస్తుంటే, దానిని ఎదుర్కోగల ఒక counter Ideology ని నిలబెట్టడం మనం చెయ్యాల్సిన పని. వాళ్ళ Ideology చెప్పే ప్రతి విషయాన్ని తిప్పికొట్టగల సత్తా ఉన్న Ideology లు మనకు తయారుగానే ఉన్నాయి. వాటిని బాగా అధ్యయనం చేసి, బలపరిచి, ప్రచారం చెయ్యడం ద్వారానే వాళ్ళ Ideology ని అడ్డుకోగలము.”

ఆనంద్: “అంతే కాకుండా, మన దేశంలో చాలా అద్భుతమయిన Rationalist Tradition ఉంది. ఉదాహరణకి బుద్ధుడు, చార్వాకుడు తో మొదలు పెట్టొచ్చు. దానిని మనకి స్కూళ్ళలో కాలేజీలలో నేర్పించడం లేదు అంతే. నేడు చరిత్రని తిరగరాసే ప్రయత్నాలని మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మనం ఒక విచిత్రమయిన సందర్భంలో ఉన్నాము. దేశంలో మధ్య యుగాల భావజాలం, so called Free market economy రెండూ ఒకే సారి నడుస్తున్నాయి.”

ప్రశ్న: ప్రగతిశీల (Progressive) వాదులని అందరినీ Anti-Nationalist లు అని ముద్ర వేసి Corner చేస్తున్నారు. దీనిని ఎలా ఎదుర్కోవాలి?

ఆనంద్: ఇది చాలా విస్తృతమయిన కుట్రలో భాగంగా జరుగుతోంది. మామూలు జనానికి రచయితలు, కవులు, కళాకారులు, విద్యార్థుల పట్ల అవిశ్వాసాన్ని కలుగజేసి తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం ఇది. ఎవరు ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నారో ప్రజలకి అర్థమయ్యేట్టు చెప్పడం ద్వారానే దీన్ని అడ్డుకోగలం.

శీతల్: ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. “ఎవరైతే దేశాన్ని కులాల వారీగా, మతాల వారీగా, జాతుల వారీగా విభజించాలి అనుకుంటున్నారో వాళ్ళు తమని తాము దేశభక్తులమని చెప్పుకుంటున్నారు. ఎవరైతే కులాలు పోయి, మత భేదాలు పోయి, జాతి వివక్ష పోవాలి అంటున్నారో వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు.” ఈ తేడా మనం బాగా అర్థం చేసుకోవాలి.

ముగింపుగా ఆనంద్ పట్వర్ధన్ ఇలా అన్నారు. “మన దేశం ఫాసిస్టు దేశం అని నేను అనను. కాని ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీనిని మనం ఆపాలంటే మనం చాలా విస్తృతంగా Alliances చేసుకోవాలి. సంకుచితమయిన భావజాలాలో ఇరుక్కుని దీన్ని సాధించలేము. అంబేద్కర్ వాదులు, మార్క్స్ వాదులు, గాంధీ వాదులు ఎవరైనా సెక్యులర్ భావాలు ఉన్నవాళ్ళు, మానవ విలువలని సమర్ధించేవారంతా ఒక్కటవ్వాలి.”

శీతల్ మాట్లాడుతూ.. “నేను నా పాటల్లో కుల వ్యవస్థని అర్థం చేసుకోవాలనీ, కుల వినాశనం జరగాలనీ విరివిగా చెప్తుంటాను. తుపాకి ద్వారా వ్యవస్థని మార్చవచ్చు అని Dogmatic communist లు, నక్సలైట్లు అనుకుంటారు. కాని హింసకి సమాధానం హింసతో ఇవ్వలేము. ఒక మనిషిని చంపడం ఏ సమస్యకి పరిష్కారం కాదు. రాజ్య హింస, నక్సలైట్ హింస, ఫాసిస్టు హింస.. ఏ హింసయినా ఒక్కటే. దానిని మనం వ్యతిరేకించాల్సిందే.”

ఈ మొత్తం చర్చని ఈ కింద విడియోలో చూడవచ్చు.

 

కొసమెరుపు:

లమాకాన్ నిర్వాహకులు మాట్లాడుతూ ఇలా అన్నారు. “నిన్న నన్ను పోలీస్ స్టేషన్ కి రమ్మన్నారు. మీ దగ్గర మావోయిస్టుల ప్రోగ్రాము ఏదో జరుగుతోందట కదా అని C.I. నన్ను అడిగారు. వాళ్ళు ప్రజల గీతాలు పాడతారు అని చెప్పాను. “వాళ్ళు కబీర్ పాటలు పడతారు కదా? వాళ్ళు ముస్లిములు కదా? అసలు ఇలాంటి లెఫ్టిస్టుల ప్రోగ్రాములు మీరు ఎందుకు పెడతారు లమాకాన్ లో?” అని అడిగారు. నేను కూడా లెఫ్టిస్టునే అని చెప్పాను. వాళ్లకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్ లో ఉన్న భగత్ సింగ్ ఫోటో చూపించి ఆయన కూడా లెఫ్టిస్టే అని చెప్పాను. ఇదిగోండి ఇప్పుడు కూడా పోలీసులు బయటే ఉన్నారు. లోపలికొచ్చి టీ తాగుతూ పాటలు వినమని చెప్పాను. రాలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.. We are actually under a fair amount of attack. It’s coming from everywhere, not just from a couple of parties we are talking about.”

శీతల్ పాడే పాటల లోని గంభీరత్వం వేదిక అంతా ఆవరించి ఉండగా, శీతల్ గారి అబ్బాయి – రెండేళ్ల బుడత – స్టేజీ మీద ఆడుకుంటూ, అటూ ఇటూ తిరుగుతూ, అమాయకంగా నవ్వుతూ ఉంటే… రాబోయేది పసి పిల్లల ప్రపంచమే అనే ఆశ కలిగింది.

*

 

 

Lamakaan Website – www.lamakaan.com

Anand Patwardhan website – www.patwardhan.com

Sheetal Saathe Wikipedia page – https://en.wikipedia.org/wiki/Sheetal_Sathe

 

 

మతం ఎప్పటికైనా ఒక అవశేషమే – 5

 

 

[పోయిన వ్యాసానికి కొనసాగింపు]

 

పురాణ ఇతిహాసాలు పుట్టడానికీ, అవి లిపిబద్ధం అవ్వడానికి (రాయబడటానికి) మధ్య సులభంగా కొన్ని వందల సంవత్సరాల దూరం ఉంది. లిపి బాగా వృద్ధి చెందాక నాగరికయుగం దిగువ దశలో ఎప్పుడో వాటిని లిపిబద్ధం చెయ్యడం ప్రారంభమయ్యింది. అప్పటిదాకా కొన్ని వర్గాల ప్రజలు వాటిని కంఠతా పట్టి ప్రచారం చేస్తూ చాలా తరాల పాటు కాపాడుకుంటూ వచ్చారు. ఇన్ని వందల సంవత్సరాల పాటు జనాల నోట్లో నానుతూ ఈ పురాణాలు సజీవంగా ఉన్నాయి. కాకపోతే ఈ క్రమంలో వాటిలో ఉన్న అసలు కథలు చాలా వరకు మారిపోయాయి. ఎన్నో పిట్ట కథలు, కట్టు కథలు వచ్చి చేరాయి. ఆ పురాణ కథలని లిపిబద్ధం చేసిన కవులు తాము రాస్తున్న కాలం లో ప్రచారంలో ఉన్న కథనే రాయడం జరిగింది.

మతం ఘనీభవించడంలో లిపి పాత్ర చాలా ముఖ్యమయినది. జనాల నోట్లో నానే కథలు మారినంత తేలికగా రాయబడి ఉన్న కథలు మారవు. వాటిని ఎవరైనా పనిగట్టుకుని మార్చినా అది బయటికి సులభంగా తెలిసిపోతుంది. ఒకసారి రాతప్రతులు తయారయ్యాక ఆ కథలని విస్తృతంగా ప్రచారం చెయ్యడం సాధ్యపడింది. మత ఆచారాలు, నియమాలు ఇంకా బలంగా ప్రజలలో అమలయ్యేలా చెయ్యడం సాధ్యపడింది. ఆ తరవాత వచ్చిన ఎన్నో తరాలకి ఈ కావ్యపుస్తకాలే ఒక reference లాగా ఉపయోగపడ్డాయి. ఏ మతపరమయిన విషయానికైనా ఈ పురాణ, ఇతిహాస, శాస్త్రాలనే refer చేస్తారు. ఆ కాలం నాటి మత అచారాలే అసలైన మత ఆచారాలుగా, అప్పటి “దేవుని రూపమే” అసలైన దేవుని రూపం అని నమ్ముతారు. అందుకనే ఇప్పటికీ కిరీటాలు, కత్తులు పట్టుకున్న దేవుళ్లే ప్రచారంలో ఉన్నారు. అలాంటి బొమ్మలూ, విగ్రహాలే మనకి కనిపిస్తాయి.

మతానికి ఉన్న ఇంకొక ప్రత్యేకమయిన లక్షణం “మౌఢ్యం”. అది మనుషులకి ప్రకృతి మీద ఉన్న అజ్ఞానం లోంచి పుట్టినది. మతం చెప్పే విషయాలకి “గుడ్డి విశ్వాసం” తప్ప ఇంకొక రుజువు ఉండదు. మనుషులు ఒకవైపు తమ స్వీయ అనుభవంతో ఎన్నో శాస్త్రాలు (Science) అభివృద్ధి చేసుకుని, ప్రకృతి విషయాలకి రుజువులు సాధించినప్పటికీ కూడా మతం వాటిని ఒప్పుకోదు.  ఆ అజ్ఞానం, ఈ గుడ్డి విశ్వాసం కలిసి మౌఢ్యంగా తయారవుతుంది.

ఉదాహరణకి, హిందూ మతవాదులు “మను ధర్మ శాస్త్రాన్ని” అసలైన ధర్మ శాస్త్రం అని అంటారు. తమ మతానికి అది ప్రామాణికం అనీ, అందులో ఉన్న ధర్మాలే ఎల్ల కాలాలపాటు అనుసరించాలి అని అంటారు. వారు గమనించని విషయం ఏమిటంటే ఆ మను ధర్మ శాస్త్రం కూడా మిగతా అన్ని పురాణాల లాగే ఎప్పుడో ఎక్కడో పుట్టి కాలంతో పాటు మారుతూ వచ్చి ఎవరిచేతనో ఒకానొక కాలంలో రాయబడింది. అది రాయబడే కాలం నాటికి రాచరిక వ్యవస్థ నడుస్తోంది. అందులో ఉన్న ధర్మాలు అన్నీ ఆ వ్యవస్థని ఉద్దేశించి రాసినవే. రాజులు ఎలా పరిపాలించాలి, ఏ తప్పుకు రాజు ఏ శిక్ష వెయ్యాలి. వర్ణ సంకరం జరగకుండా ఎలా చూసుకోవాలి. ఏ పనికి ఎన్ని బంగారు నాణేలు పన్నులు వెయ్యాలి – ఇలాంటి ధర్మాలు చాలానే ఉన్నాయి అందులో. మరి అవి నేటి ప్రజాస్వామిక వ్యవస్థకి ఎలా apply అవుతాయి? అసలు విషయం ఏమిటంటే, ఆ మను ధర్మ శాస్త్రం పుట్టిన కాలం నుంచి సమాజం చాలా దూరం ముందుకి వచ్చేసింది. ఎంతో ఎదిగింది కూడా. ఈ సమాజానికి అది ఏ రకంగానూ ఉపయోగకరం కాదు. కాస్త logical గా ఆలోచిస్తే ఆ విషయం ఎవరికయినా అర్థమవుతుంది. కాని మతంతో పాటే వచ్చే మౌఢ్యం మతవాదులని ఆలోచించనివ్వదు.

ఇక మన ప్రశ్నలోని రెండో భాగం “ఏ దేవుని బొమ్మ, కథ కూడా దేవుడు గన్ను, బాంబులు పట్టుకున్నట్టు చూపించదు ఎందుకని?” ఇప్పటిదాకా చర్చించుకున్న సమాజ పరిణామ క్రమం అర్థమయితే పాఠకులకి ఈ ప్రశ్నకి సమాధానం సులభంగా అర్థమవుతుంది.

గన్నులు కత్తులకన్నా చాలా అభివృద్ధి చెందిన ఆయుధాలు. మందుగుండు తయారు చెయ్యడానికి రసాయన శాస్త్రం మీద మంచి అవగాహన అవసరం. సల్ఫర్, పొటాషియం నైట్రేట్ లని తయారు చెయ్యాలి, సరైన పాళ్ళలో కలపాలి. ఈ పరిజ్ఞానం నాగరిక యుగం ఎగువ దశలో అభివృద్ధి చెందింది. గన్నులు తయారయ్యేదాకా (క్రీ.శ. 1600 దాకా) ప్రపంచమంతా కత్తులే రాజ్యం చేశాయి. క్రీ.శ. 18, 19 వ శతాబ్దాలు వచ్చేసరికి ఆయుధాలతో పాటు అనేక శాస్త్రాలలో మానవులు అద్వితీయమైన పురోగతి సాధించారు. ప్రకృతి శాస్త్రాలు (Biology, Environmental science etc.) వైద్య శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు అన్నిట్లో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు జరిగాయి.

Science అభివృద్ధి మనుషులలో క్రమంగా ప్రకృతి మీద, సమాజం మీద ఉన్న అపోహలని పోగొట్టడం మొదలుపెట్టింది. ఈ అపోహల మీదే పునాదులు వేసుకున్న “మతం” క్రమంగా తన పట్టు కోల్పోవడం మొదలయ్యింది. ప్రజల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగే కొద్దీ వారికి ఏవో “కట్టు కథలు” చెప్పి మభ్యపెట్టడం సాధ్యం కాకుండా పోతుంది. “పోసేడాన్ అనే దేవుడు సముద్రం లోపల కూచుని తన త్రిశూలం తిప్పి సముద్రంలో సుడిగుండాలు సృష్టిస్తాడు” అని గ్రీకులు ఒకప్పుడు నమ్మేవారు. ఇవ్వాళ ఆ విషయాన్ని గ్రీకు ప్రజలు కూడా నమ్మరు ! అలాగని త్రిశూలం తీసేసి గన్నులు పెట్టినా నమ్మరు ! ఎందుకంటే గన్నులు అనేవి దైవదత్తమైన వస్తువులు కావనీ, మనుషులు తమ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న వస్తువులు అనీ ఈనాటి మానవులకి తెలుసు. అందువల్ల ఇప్పుడు కొత్త దేవుళ్ళని సృష్టించడం గానీ, పాత దేవుళ్ళ చేతుల్లో కొత్త ఆయుధాలు పెట్టడం గానీ అంత సులభం కాదు.!

ఈ అనివార్య పరిస్థితులలో మతం తన పునాదులని ప్రజల ఆర్ధిక అవసరాల/ఇబ్బందుల మీదకి మరల్చుకోవడం మొదలు పెట్టింది. నేటి మతంలో భక్తులకి ఆధ్యాత్మిక చింతన కంటే వారి ఆర్ధిక ప్రయోజనాలే ఎక్కువ ముఖ్యం. మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు కూడా ఈ ఆర్ధిక అవసరాలనే target చేసుకుంటున్నారు. ఈ క్రమం సుమారు రెండు శతాబ్దాల క్రితం మొదలయ్యి ఇంకా కొనసాగుతోంది. ఇది అనివార్యంగా జరుగుతున్న మార్పు.

ఆటవిక యుగం మధ్య దశలో మనుషులకి ప్రకృతి శక్తుల మీద ఉన్న అవగాహనా లేమి లోంచి మతం పుట్టింది. “లక్ష” సంవత్సరాల పాటు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ, బలపడుతూ నాగరిక యుగ మధ్య దశకి వచ్చేసరికి మానవ సామాజిక జీవితంలో అత్యంత ముఖ్యమయిన అంశంగా అవతరించింది. కుటుంబ వ్యవస్థలు, పాలనా వ్యవస్థలు అన్ని మతం కనుసన్నల్లో నడిచే అంత స్థాయికి బలపడింది. నాగరిక యుగం ఎగువ దశలో సాంకేతిక, సామాజిక శాస్త్రాల అభివృద్ధి తరవాత “మతం” యొక్క పరిణామ క్రమంలో బలహీన పడే దశ మొదలయ్యింది. ఇంకొన్ని అభివృద్ధి దశలు గడిచేసరికి మతం సమాజంలో ఒక అవశేషంగా మిగిలిపోతుంది. మతంతో పాటే దేవుడు కూడా !

***

మనుషులు చేసిన దేవుళ్ళారా!

 

[పోయిన వ్యాసానికి కొనసాగింపు]

 దేవుడు అనే భావన అలౌకికమైనది. కానీ మతం భౌతికమైనది (Religion is a physically existing thing). ప్రతి భౌతిక పదార్థం తన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే తిరిగి ఆ భౌతిక పరిస్థితుల ప్రభావానికి లోనవుతుంది. అనగా మానవ సమాజంలో వచ్చే మార్పుల ప్రభావం మతం మీద పడుతుంది, అలాగే మతంలో వచ్చే మార్పుల ప్రభావం మానవ సమాజం మీద పడుతుంది. భౌతిక పదార్థాలన్నీ నిరంతరం మార్పుకు లోనయ్యేవే. ఏది ఎల్లకాలలపాటు ఒకేలా ఉండదు. ఇది మనం బాగా అర్థం చేస్కోవాల్సిన విషయం.

మతం ప్రధానంగా వాస్తవ ప్రపంచంలో కనపడని శక్తులు/ఆత్మలు/లోకాలు వగైరాల చుట్టూ తిరిగుతుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు, ఇటువంటి అలౌకిక భావనలు ప్రచారం జరగాలంటే భాష తగినంత అభివృద్ధి చెంది ఉండాలి. ఇంకా కళలు కూడా తగినంత అభివృద్ధి జరిగి వుండాలి .

ఉదాహరణకి “ఆత్మ” అనే భావనని భాష లేకుండా ఇంకొకరికి అర్థమయ్యేలా చెప్పడం ఎంత కష్టతరమైన విషయం? అలాగే బయట ప్రపంచంలో లేని ఊహాతీత శక్తులకి ఏదో ఒక రూపం కల్పించక పోతే, దాన్ని ఇతరులకి వ్యక్తపరచడం చాలా కష్టమవుతుంది.

మతం ఒక సామూహిక ఊహ. వ్యక్తిగతంగా ఎవరో ఒకరి మెదడులో పుట్టిన ఊహ సమూహంలోని అందరికీ అర్థమయితేనే అది ఒక సామూహిక ఊహగా మారుతుంది. ఇది భాషగానీ, చిత్రకళ గానీ, శిల్పకళ గానీ లేకుండా సాధ్యపడదు. ప్రారంభ దశలలో మతం యొక్క అభివృద్ధి భాష, కళ ఆటంకాలు. వాటి అభివృద్ధి మీదనే మతం అభివృద్ధి ఆధారపడి ఉంది.

ఈ క్రమాన్ని ఒక infographic తో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది.

vinod1

కొండ గుర్తు ౩:

మనుషులకి ప్రకృతి మీద అవగాహన పెరుగుతున్నా కొద్దీ కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ఇవి మానవ జీవన విధానంలో మార్పులు తీసుకువస్తాయి. మనుషుల జీవన విధానం మారడం అంటే సమాజం మొత్తం మార్పుకి లోనవుతున్నట్టు. ఈ మార్పు తిరిగి భాష, కళ, మతాలలో మార్పులు తీసుకువస్తుంది.

పై infographని గమనించినట్టు అయితే, లోహాన్ని కనుగొన్న తరవాత కళల రంగంలో, ఆయుధాల తయారీలో ఒకే మాదిరి అభివృద్ధి మనం గమనించవచ్చు. 5000 సం|| పూర్వం రాగి, కాంస్యం ఆయుధాలు తయారయ్యాయి. అదే సమయంలో రాగి, కాంస్యం శిల్పాలు తయారుచెయ్యడం మొదలయ్యింది. రెండిటి పునాది ఒక్కటే. లోహాన్ని కరిగించి మలుచుకోవడం నేర్చుకున్న మనుషులు దాన్ని ఆయుధాలు తయారు చెయ్యడంతో పాటు, శిల్పాలు చెక్కడం లో కూడా ఉపయోగించారు. అంతకు ముందు దాకా కేవలం రాతితో శిల్పాలు చెక్కడం జరిగేది. లోహం వచ్చాక లోహపు శిల్పాల ప్రాబల్యం పెరిగింది.

మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, “దేవుడు” అనే భావనని మనుషులు కల్పించుకున్నారు. ఆ దేవునికి రూపాన్ని కూడా మనుషులే కల్పిస్తారు. ఆ కల్పన చేసే మనుషులు ఏ కాలంలో బతుకుతున్నారు అనే దాన్ని బట్టి ఆ దేవుని రూపం ఆధారపడి ఉంటుంది. లోహమే తెలియని మనుషులు తమ దేవునికి బంగారు కిరీటాన్ని పెట్టడం అనేది అసంభవం. దీనిని తిరగేసి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఏదైనా ఒక పురాణంలో “దేవుడు ఫలానా కత్తిని వాడాడు” అని ఉందనుకుందాం. దీని అర్థం ఆ పురాణం తయారు చేసిన కవులు ఉన్న సమాజంలో అప్పటికే లోహపు కత్తులు వాడుతున్నారని అర్థం. వారు తాము చూస్తున్న సమాజంలోని విషయాలనే కల్పనలు జోడించి రాయగలరు. ఎలాగయితే ఆటవిక మానవులు కత్తులు, రథాలు ఉన్న దేవుడిని ఊహించలేరో, అలాగే ఈ పురాణాలు తయారు చేసిన కవులు  గన్నులు, బాంబులు ఉన్న దేవుడిని ఊహించలేరు.

అలాగే హిందూ మతంలో బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు అనీ, చిత్రగుప్తుడు పాపాల చిట్టా రాస్తాడు అనీ కొన్ని కథలు ఉన్నాయి. ఇటువంటి కథలు అన్నీ “లిపి” అనేది పుట్టాక మాత్రమే తయారవ్వగలవు. ఎందుకంటే “రాయడం” అనేది తెలియని మనుషులు తాము తయారు చేసుకున్న కథల్లో “రాయడం” గురించి ప్రస్తావించడం జరగదు.

vinod2

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నేడు ప్రపంచంలో సనాతన/పురాతన మతాలుగా చెప్పబడుతున్న మతాలన్నీ అనాగరిక యుగం ఎగువ దశలో రూపు సంతరించుకున్నవే. హిందూ, గ్రీకు, రోమను పురాణ కథలు, ఇతిహాసాలన్నీ ఈ దశలో పుట్టినవే. దీనికి సాక్ష్యం ఆ పురాణ కథల్లోనే దొరుకుతుంది.

“గ్రీకు సముద్ర దేవుడు పోసేడాన్ త్రిశూలాన్ని ఆయుధంగా వాడాడు” అని గ్రీకు పురాణాలు చెప్తున్నాయి. అలాగే “ హిందూ దేవుడు విష్ణుమూర్తి కౌమోదకి గదని ఆయుధంగా ధరించాడు.” అని హిందూ పురాణాలు చెప్తున్నాయి. అంటే ఈ పురాణ కథలు పుట్టే కాలానికే ఆయా సమాజాలలో లోహపు త్రిశూలాలు, గదలు వాడుకలో ఉన్నాయి అన్నమాట. ఇటువంటి పురాణాలు లోహాన్ని కరిగించి ఆయుధంగా మలిచే పరిజ్ఞానం సంపాదించిన సమాజాల్లోనే పుట్టగలవు. రాళ్లు తప్ప లోహం తెలియని ఆటవిక మానవులు ఇలాంటి దేవుళ్ళని, కథలని ఊహించడం అసాధ్యం. అలాగే “రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు” అని ఒక పురాణం చెప్తుంది. అంటే ఈ పురాణ కథ తయారయ్యే సమయానికే రాజ్యాలు, రాచరిక వ్యవస్థ ఏర్పడిపోయాయి అన్నమాట. అడవులలో గుంపులుగా తిరిగే ఆటవిక మానవులకి, నదుల వెంట వలసలు పోయే అనాగరిక మానవులకి “రాజ్యం” అనే వ్యవస్థని ఊహించడం అసాధ్యం.

ఈ పురాణ కథలు ఎవరు తయారు చేసారు అనేది అప్రస్తుతం. ఆ కవులు ఎవరైనా సరే, వారు అనాగరిక యుగం ఎగువ దశలో ఉన్న సమాజానికి చెందినావారే. వారు తాము చూస్తున్న సమాజాన్ని (కొంత కల్పనలని జోడించి) తమ కథల్లో ప్రతిబింబించారు. వారు చూస్తున్న సమాజంలోని రథాలు, గిన్నెలు, ఆభరణాలు, కుర్చీలు, కిరీటాలు, కోటలు, భవంతులు, నగరాలు, కాలిజోళ్ళు, పట్టువస్త్రాలు వంటివన్నీ వారి కావ్యాల్లోకి దిగుమతి అయిపోయాయి. ఇవన్నీ భౌతికమయిన వస్తువులు. ఎవరో ఒకరు తయారు చేస్తే గానీ తయారు కాని వస్తువులు. దానికి వాటిని తయారు చేసే పరిజ్ఞానం కావాలి. ఈ పరిజ్ఞానం కాలంతో పాటు ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతూ వస్తుంది తప్ప మంత్రంతోనో, తంత్రంతోనో గాలిలోంచి ఊడిపడదు.

ఆ కథల్లో ఏ “దేవుని రూపం” అయితే వర్ణించబడిందో దాన్నే చిత్రకారులు, శిల్పులు తమ బొమ్మల్లో చిత్రిస్తారు. గుళ్ళలోను, ఇళ్ళలోనూ అదే రూపంతో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు పెట్టబడతాయి. ఆ దేవుని చేతిలో సహజంగానే అప్పుడు వాడబడుతున్న లోహపు ఆయుధాలే ఉంటాయి.

హాస్యాస్పదం అయిన విషయం ఏమిటంటే, మనుషులు అభివృద్ధి సాధిస్తున్న కొద్దీ దేవుని రూపంలో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయి. కానీ ఏ కాలంలోని మనుషులు ఆ కాలం లో చెలామణీ లో ఉన్న దేవుని రూపమే అసలైన దేవుని రూపం అనీ, అది సృష్టి మొదటి నుంచీ అలాగే ఉందనీ, రాబోయే ఎల్లకాలాల పాటు అలాగే ఉంటుందనీ విశ్వసిస్తారు. మతంలో ఉన్న ప్రత్యేకత ఇదే.

[వచ్చే వారం]

 

అప్పటి దేవుడి రూపం!

 vinod

3

 

గత  వారం రెండవ భాగం 

 

మానవ సమాజానికి సంబంధించిన ఏ ప్రశ్నకయినా సమాధానం తెలుసుకోవడం కోసం సమాజ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడం అవసరం. ఏది ఎప్పుడు ఎందుకు పుట్టిందో, ఎలా మారుతూ వస్తోందో అర్థం చేసుకోవాలి. సమాజంలో వస్తున్న మార్పులని వీలైనంత కచ్చితత్వంతో అర్థం చేసుకోలేక పొతే మనకి సమస్యలూ అర్థం కావు, వాటికి పరిష్కారాలూ బోధపడవు.

గత వారం మనం మానవ సమాజంఅభివృద్ధి క్రమాన్ని ఉదాహరణలతో, కొండ గుర్తులతో చూసాము. ఆ మొత్తం క్రమం లో మతం ఎప్పుడు పుట్టింది? మనుషుల సమాజం మారుతూ ఉంటే మతం లో ఎలాంటి మార్పులు వచ్చాయి? మనకి తెలిసిన మతాల కంటే పూర్వం ఎలాంటి మతాలు ఉండేవి? వాటి స్వరూపం ఎలా ఉండేది? వాటిలో దేవుడి రూపం ఎలా ఉండేది?

“మతము”, “దేవుడు” అనే భావన మనిషికి ఎప్పుడు కలిగింది? మతం పుట్టుక ఆటవిక యుగం మధ్య దశ లోనే (సు. 1,20,000 – 60,000 సం|| పూర్వం) జరిగి ఉంటుంది అని అంచనా వెయ్యవచ్చు. మతం యొక్క పుట్టుకకి ఆధారాలేమిటి? చనిపోయిన వారిని ఉద్దేశపూర్వకంగా భూమిలో సమాధి చెయ్యడం, ఆ చనిపోయిన వ్యక్తితో పాటు అతని వస్తువులని సమాధిలో ఉంచడాన్ని మత ఆచారంగా గుర్తించవచ్చు. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ప్రాచీన సమాధులలో అత్యంత పురాతనమయినది Israel లోని Qafzeh గుహలలో దొరికింది. అది సుమారు లక్ష సంవత్సరాల క్రితంది. (లక్ష సంవత్సరాలు – Imagine that figure !!). అందులోని ఎముకలకి ఎరుపు రంగు పూసి ఉంది. ఆ అస్థిపంజరం చేతిలో అడివి పంది దవడ ఎముక పెట్టి ఉంది. ఆ ప్రదేశంలో దొరికిన సమాధులు అన్నిటిలో ఇలాగే ఉంది. ఇది యాదృచ్చికంగా జరిగే విషయం కాదు. ఇలా చెయ్యడం ఆ కాలం నాటి ఆచారాలలో ఒకటి అయ్యి ఉండాలి. చనిపోయిన వ్యక్తుల శరీరాలకి ఒక క్రమ పద్ధతిలో అంత్యక్రియలు చెయ్యడం ఈనాటికీ ముఖ్యమయిన మత ఆచారం. దాని బీజాలు ఆటవిక యుగం మధ్య దశలోనే ఉన్నాయి అన్నమాట.

ఆ నాటి మతాలు చాలా అస్పష్టమయినవి. ఆ మతాలలో ఒక నిర్దిష్టమయిన దేవుడు ఉండే అవకాశం లేదు. ఆహారం కోసం, రక్షణ కోసం, ఉనికి కోసం ప్రకృతి మీద ఆధారపడిన ఆటవిక మానవులకి ఆ ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడం అవసరం. అందుకోసం ప్రకృతి శక్తులకి పూజలు చేసారు. జంతువులని, చెట్లని ఆరాధించారు. తాము పూజిస్తున్న ప్రకృతి శక్తులకి ఒక మానవ రూపాన్ని ఆపాదించడం ఆనాటి మానవుల ఊహకి అందని విషయం.

ఇలా జంతువులకి, వస్తువులకి, దేవతలకి (మనుషులు కాని వాటికి) మనుషుల గుణాల్ని ఆపాదించడాన్ని “Anthropomorphism” అంటారు. ఉదాహరణకి “రాజుగారి ఏడుగురు కొడుకుల” కథలో చీమ మాట్లాడుతుంది. మాట్లాడటం అనేది మనుషుల లక్షణం. దానిని చీమకి ఆపాదించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గుండ్రంగా ఉండే సూర్యుడికి మనిషి ఆకారాన్ని ఇచ్చి, ఏడు గుర్రాల రధాన్ని ఆపాదించడం ఇంకొక ఉదాహరణ. కేవలం రూపాన్ని మాత్రమే కాదు. మానవ సహజమైన ఉద్వేగాలని కూడా దేవతలకి ఆపాదించడం జరుగుతుంది. “శివుడు ముక్కోపి”. కోపం మానవ లక్షణం. దాన్ని శివుడు అనే దేవునికి ఆపాదించారు. వస్తువులకి, జంతువులకి, ప్రకృతి శక్తులకి కూడా తమకి ఉన్నట్టుగానే భావోద్వేగాలు ఉంటాయనే భ్రమ చాలా సహజంగా కలుగుతుంది. కానీ అవే వస్తువులకి, జంతువులకి, ప్రకృతి శక్తులకి వాటి సహజ రూపాన్ని కాక మానవరూపాన్ని ఇవ్వడానికి కొంత ఊహాశక్తి అవసరం. ఆ ఊహ ఎవరైనా చెయ్యగలిగినా, దాన్ని వర్ణించి చెప్పాలంటే తగినంత భాష కావాలి, బొమ్మ గీసి చూపించడానికి చిత్ర కళ కావాలి, శిల్పం చెక్కి చూపించడానికి శిల్పకళ (చెక్కడానికి కావలిసిన పనిముట్లు కూడా) కావాలి. ఇవన్నీ అప్పటికి ఇంకా శైశవ దశలోనే (initial stages) ఉన్నాయి.

ఆటవిక మతాల స్వరూపం

లక్ష సంవత్సరాల క్రితం ఉన్న మతాలు కచ్చితంగా ఇవ్వాళ మనం చూస్తున్న మతాల లాగా ఉండి ఉండవు. వాటి స్వరూపం, స్వభావం చాలా వేరుగా ఉండి ఉండాలి. ఆనాటికి మనిషి దేవుడు అనే భావనని కల్పించుకోగలిగాడా? ఒకవేళ కల్పించుకుని ఉంటే ఆ దేవుని రూపం ఎలా ఉండేది?

ఆటవిక యుగం మధ్య దశలో మానవులు ఇంకా అరణ్యాలలో, కొండ గుహలలో నివసిస్తున్న వారే. ఇళ్ళు కట్టుకోవడం అప్పటికి ఇంకా వారికి తెలియదు. వారిది గుంపు జీవితం. పదుల సంఖ్యలో జనాభా ఉండే చిన్న చిన్న గుంపులుగా (Bands) జీవించేవారు. ఏ గుంపు ఆచారాలు దానివే. ఏ గుంపు నమ్మకాలు దానివే. ఈ ఆచారాలు, నమ్మకాలు అన్నిటిని కలిపి ఆ గుంపు యొక్క మతం అనవచ్చు. భౌగోళికంగా (Geographically) దగ్గరి ప్రదేశాలలో ఉండే గుంపుల మతాలలో కొన్ని సారూప్యతలు (similarities) ఉండవచ్చు.

vinod1

ఆటవిక యుగం ఎగువ దశ నాటి మానవులు – ఊహా చిత్రం

ఇలా ఏ గుంపు మతం ఆ గుంపులోనే ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందివ్వబడుతూ సజీవంగా ఉంటుంది. భౌతిక పరిస్థితులలో (Physical conditions) చెప్పుకోదగిన మార్పులు రానంతవరకూ ఎన్ని వేల సంవత్సరాలయినా ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక case study కావాలి.

 Andamanese Case Study

 తూర్పు బంగాళాఖాతంలోని అండమాన్ దీవులలో ఉండే “అండమానీస్” ఆటవిక జాతులు మన అధ్యయనానికి చాలా చక్కటి Case Study. వాళ్ళు ఇంకా ఆటవిక యుగంలోనే ఉన్నారు.

కొన్ని వేల సంవత్సరాల పాటు బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండటం వలన వారు ఇప్పటికీ సహజమయిన పరిణామ క్రమంలో, తమ స్వంత అనుభవాలతో, చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ వస్తున్నారు.

vinod3

 

1789లో మొదటి సారి అండమాన్ లో బ్రిటీష్ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు, అండమాన్ దీవులలో మొత్తం నాలుగు ఆటవిక జాతులు ఉన్నాయి. ఉత్తరం వైపు ఉన్న 200 పైగా దీవులలో “గ్రేట్ అండమానీస్”, మధ్య భాగంలో “జరవ”, దక్షిణాన ఉన్న ద్వీపంలో “ఒంగీ”, పశ్చిమాన దూరంగా ఉన్న ద్వీపంలో “సెంటినిలీస్” ఉన్నారు.

ఈ నాలుగు జాతుల వారూ ఆటవిక యుగం ఎగువ దశలో ఉన్నారు. వేటాడి ఆహారాన్ని సంపాదిస్తారు. విల్లు, బాణాలని వాడతారు. ఆకులని, పీచుని గోచీలుగా కట్టుకుంటారు. ఆకులని నేల మీద పరుచుకుని నిద్రపోతారు. మొక్కలు పెంచడం తెలియదు. మట్టితో పాత్రలు చెయ్యడం తెలియదు. ఎర్రమట్టితో శరీరం మీద రంగు పూసుకోవడం మాత్రమే వారికి తెలిసిన కళ. పాటలు పాడగలరు, కథలు చెప్పగలరు. వాళ్ళలో కొన్ని గుంపులకి నిప్పు యొక్క ఉపయోగాలు తెలుసు కానీ నిప్పుని తయారు చెయ్యడం తెలియదు. పిడుగుల వల్ల తగలబడిన చెట్ల యొక్క బొగ్గుని నిప్పు ఆరకుండా చెట్టు తొర్రల్లో పెట్టి జాగ్రత్తగా కాపాడుకుంటారు. వీటిని బట్టి అభివృద్ధి క్రమంలో మిగతా ప్రపంచం కంటే వారు ఎంత వెనకపడి ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు.

జరవ ఆటవిక జాతి ప్రజలు

అండమాన్ జాతుల మతాల గురించి కొంత చెప్పుకోవాలి. వాళ్ళ నమ్మకం ప్రకారం మనుషులు, ఆత్మలు (Spirits) కలిసి జీవిస్తారు. ఆత్మలు మనుషులతో సంబంధాలు కలిగి ఉంటాయి. చనిపోయిన వారికి రెండు దఫాలుగా అంత్యక్రియలు ఒక పధ్ధతి ప్రకారం జరగాలి. అలా జరిగితే అవి మంచి ఆత్మలయ్యి సహాయం చేస్తాయి. అలా జరగకపోతే చెడ్డ ఆత్మలయ్యి హాని చేస్తాయి. మనుషులకి వచ్చే రోగాలు ఆత్మల వల్ల వస్తాయి. చెట్లకి, జంతువులకి అన్నిటికీ ఆత్మలుంటాయి అని నమ్ముతారు.

ప్రతి గుంపులో ఒక మంత్రగాడు ఉంటాడు. అతనికి ప్రత్యేకంగా ఆత్మలతో సంభాషించే శక్తి ఉందని నమ్ముతారు. ఏదైనా అవసరం, ఆపద వచ్చినప్పుడు ఇతను ఆత్మలనీ, చనిపోయిన వ్యక్తులని ఆవాహన చేసి వారితో మాట్లాడతాడు. సాధారణంగా నిప్పుని ఆరిపోకుండా చూసే బాధ్యతా, మూలికలతో వైద్యం చేసే బాధ్యతా ఈ మంత్రగాడే నిర్వహిస్తాడు. సాధారణంగా గుంపు కి ఒకడే మంత్రగాడు ఉంటాడు. వాళ్ళ దేవుని గురించి కథలు, పాటలు, ఆచార పద్ధతులు ఈ మంత్రగాడే బట్టీ పడతాడు. అతని తరవాత మంత్రగాడయ్యే వ్యక్తికి ఇవన్నీ నేర్పిస్తాడు. ఇలా మంత్రగాడు కేంద్రంగా నడిచే మత పద్ధతిని “Shamanism” అంటారు. మతం యొక్క ప్రాచీన రూపాలలో ఇది ఒకటి. దాదాపు అన్ని ఆటవిక జాతులలో దీని ఛాయలు మనం చూడవచ్చు.

vinod2

గ్రేట్ అండమానీస్ జాతిలోనే ఒక గుంపు నమ్మకం ప్రకారం – “శాడిల్” కొండ మీద “పులుగా” అనే దేవుడు ఉంటాడు. “భూమ్మీద” జరిగేవన్నీ ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి. పులుగా కి ఆగ్రహం వచ్చే పని ఏదీ చెయ్యకూడదు. పులుగాకి ఒక కొడుకు, అనేక మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఆగ్రహమొస్తే తన కూతుర్లైన అడవి, సముద్రాలకి చెప్పి హాని చేయిస్తాడు. సూర్యుడు చంద్రుడికి భార్య. నక్షత్రాలు వాళ్ళ పిల్లలు. అండమానీస్ మతంలో వేరే “లోకం” అంటూ ఏమీ లేదు. వారి ఊహ ఇంకా అంత ఎదగలేదు.

వాళ్ళ నమ్మకాలు వాళ్ళ జీవితంలో ఎంతలా మమేకమయిపోయాయంటే వాళ్ళు తమ మతానికి ఒక పేరు కూడా పెట్టుకోలేదు. వాళ్లకి “మతం” అనే పదానికి అర్థం కూడా తెలియదు. వాళ్ళు నమ్ముతున్నవన్నీ నిజాలే అని అనుకుంటారు. వాళ్ళ నమ్మకాలకీ వాస్తవ ప్రపంచానికీ ఉన్న తేడా వాళ్లింకా గుర్తించలేదు.

ఒక బయట వ్యక్తిగా గమనిస్తే మనకి ఆ ఆటవికుల అమాయకత్వం (అజ్ఞానం) చాలా సులభంగా అర్థమవుతుంది. ప్రకృతిని అర్థం చేసుకునే క్రమంలో వారికి ఏర్పడిన భ్రమలని నిజం అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ నమ్మకాల్లోనే వాళ్ళు అడవి, సముద్రాల నుంచి ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది. అందుకని పులుగా కి కోపం తెప్పించకుండా ఉంటారు. “పులుగా ఆజ్ఞ ప్రకారమే భూమ్మీద అన్నీ జరుగుతాయి” అని నమ్ముతారు. వారికి తెలిసిన భూమి ఎంత? ఆ నాలుగు ద్వీపాలు, సముద్రమే వాళ్లకి తెలిసిన భూమి!! ఆటవికులుగా వారి అజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

ఇంకోవైపు అభివృద్ధి క్రమంలో అండమాన్ ఆటవికుల కంటే మిగతా ప్రపంచం దాదాపు 60,000 సంవత్సరాల ఎగువన ఉంది. ఇన్ని వేల సంవత్సరాల అభివృద్ధి తరవాత కూడా నేటి మతాలు ప్రచారం చేసేవి ఇలాంటి నమ్మకాలనే ! “దేవుడు ఫలానా కొండ మీద ఉంటాడు”, “ఫలానా దేవుడి ఆజ్ఞ ప్రకారం భూమ్మీద అన్నీ జరుగుతాయి”, “ఆత్మలు, శక్తులు, వగైరాలు”, “దేవుడికి ఆగ్రహం తెప్పిస్తే కీడు జరుగుతుంది” ఇలాంటి నమ్మకాలు ఈనాటికీ ప్రజల్లో బలంగా ఉన్నాయి. మతపరంగా మానవ జాతి ఆటవికుల స్థాయి కంటే ఏం ఎదిగినట్టు? ఇది ఇంకా లోతుగా అధ్యయనం చెయ్యాల్సిన విషయం.

అండమాన్ లోని నాలుగు జాతుల వారికీ నాలుగు విభిన్నమయిన భాషలున్నాయి. ఏ జాతి వారికీ ఇంకొక జాతి వారి భాష తెలియదు. “సెంటినిలీస్” గురించి సామాచారం లేదు కానీ మిగతా మూడు జాతులకీ వారి వారి సొంత ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి.

ఆ దీవులకి మానవులు షుమారు 70,000 సంవత్సరాల క్రితం చేరుకున్నారు అని అంచనా. మొదట్లో ఈ నాలుగు జాతులూ ఒకే మూల జాతి నుంచి వేరుపడి వేరు వేరు ప్రదేశాలలో స్థిరపడి ఉండవచ్చు. కాల క్రమేణా ఇతర జాతులతో సంబంధాలు తెగిపోయి దేనికవే ఒక కొత్త జాతి లాగా రూపు తీసుకుని ఉంటాయి. ప్రతి జాతికీ దాని స్వంత భాషలు అభివృద్ధి చెందాయి. అన్ని వేల సంవత్సరాలుగా దగ్గరి దగ్గరి ద్వీపాలలో ఉంటున్నా ఆ జాతుల మధ్య మళ్ళీ కనీస సంబంధాలు కూడా ఏర్పడలేదు. కారణం?

ఆటవికులకు వేటే జీవనాధారం. వాళ్లకి ఆహారాన్ని భద్రపరుచుకునే పద్ధతులు తెలియవు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు వేటాడి తెచ్చుకోవాల్సిందే. వాళ్లకి నివసించడానికి ఇళ్ళు కూడా ఉండవు, వేటలో జరిగే జన నష్టం, ఎండలు, వానలు, రోగాల వల్ల కలిగే ప్రాణ నష్టాలని తట్టుకుంటూ జనాభాని కాపాడుకోవడానికి నిరంతరం ప్రకృతితో పోరాడాల్సి వస్తుంది.

మనుషులు ఆహారం కోసం వేట మీద ఆధారపడకుండా స్వంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుని (వ్యవసాయం ద్వారా, జంతువులని మచ్చిక చేసుకోవడం ద్వారా), దాన్ని నిలవ చేసుకునే పరిజ్ఞానం సంపాదించుకున్నాక పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆహారం పుష్కలంగా దొరుకుతుంటే జనాభా వృద్ధి అవుతుంది, పెరుగుతున్న జనాభా కోసం ఎక్కువ ప్రదేశం కావాలి. బయటి ప్రదేశాలకి విస్తరించాల్సిన అవసరం వస్తుంది. ఈ విస్తరణ క్రమంలో కొత్త జాతులతో సంబంధాలు ఏర్పడతాయి.

vinod4

జరవ ఆటవిక జాతి ప్రజలు

అండమాన్ దీవులలో దట్టమయిన అడవులు ఉన్నాయి. అక్కడ మచ్చిక చేసుకోగల జంతువులు పెద్దగా లేవు. పంటలు పండించేందుకు అనువైన భూమి కూడా పెద్దగా లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే అభివృద్ధికి అవసరమయిన భౌతిక పరిస్థితులు (physical conditions) అక్కడ లేవు. ఇన్ని ప్రతిబంధకాల వల్ల ఆ జాతుల వాళ్ళు ఇంకా ప్రకృతితో పోరాడుతూ ఆటవిక యుగంలోనే ఉండిపోయారు. వారి జనాభా కూడా ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉండింది. కాబట్టి అక్కడి జాతులకి వాళ్ళ ప్రాంతాలు దాటి బయట ప్రదేశాలకి విస్తరించాల్సిన అవకాశం కలగలేదు అని చెప్పవచ్చు. అందువల్ల ఆ నాలుగు జాతులు ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండానే జీవిస్తున్నాయి.

ఏవైనా తాత్కాలిక అవసరాల కోసం సంబంధాలు ఏర్పడినా భాషలు వేరు వేరుగా ఉండటం వలన అవి ఎక్కువ కాలం నిలబడవు. భాష ఇంకొక ప్రధాన ప్రతిబంధకం. సంబంధాలు ఏర్పడలేదు కాబట్టి ఒక జాతి యొక్క మతం ఇంకొక జాతిలోకి ప్రవేశించే అవకాశం లేదు. ఇలా కొన్ని వేల సంవత్సరాల పాటు ఏ జాతి మతం ఆ జాతికే పరిమితమయిపోయింది. అలాగే ఉండనిస్తే ఇంకా అనేక వేల సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది.

అండమాన్ దీవులలోనే “జంగిల్” అనే జాతి ఆటవికులు కూడా ఉండేవారు. వారికి కూడా ప్రత్యేకమయిన భాష, మతము, దైవం ఉండేవి. 1920 నాటికి జంగిల్ జాతి పూర్తిగా అంతరించిపోయింది. వారితో పాటే వాళ్ళ మతం, వాళ్ళ దేవుడు కూడా అంతరించిపోయాడు.

Andamanese Case study ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. మతం, దేవుడు అనే భావనలు మనుషులు ప్రకృతి ని అర్థం చేసుకునే క్రమంలో మనుషులు కల్పించుకున్న భావనలు. వాటి పెరుగుదల, తరుగుదల, వాటిలో వస్తున్న మార్పులూ, అన్నీ మాన సమాజంలోని భౌతిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి.

వచ్చే వారం వ్యాసంలో మతము, దేవుడు అనే భావనల అభివృద్ధి మీద ఎలాంటి భౌతిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది, వాటి ప్రభావం వల్ల మతం లో వచ్చే మార్పులు ఏమిటి అనేవి చర్చిద్దాం.

*

నాగరికతకి వెనకడుగు లేదు!

 

 

vinod anantojuపోయిన వ్యాసంలో మానవ సమాజం  అభివృద్ధి క్రమాన్ని పైపైన చూసాము. మీరు మళ్ళీ ఒకసారి ఆ వ్యాసంలోని Table ని చూడమని నా మనవి. వీలయితే Browser లో పక్క Tab లో open చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ Table గుర్తుంటేనే ఈ వ్యాసం అర్థమవుతుంది. ఈ వ్యాసంలో వీలయినన్ని ఉదాహరణలతో ఆ క్రమాన్ని మానవ ప్రపంచానికి అన్వయించి చూద్దాం.

ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు. అసలు మనం సమాధానం వెతుకుతున్న “దేవుని ఆయుధాల” ప్రశ్నకీ ఈ “మానవ సమాజ అభివృద్ధి క్రమానికీ” సంబంధం ఏమిటి?
నా ప్రశ్నని ఇద్దరు ముగ్గురిని అడిగాను. వాళ్ళ సమాధానాలు ఇలా ఉన్నాయి.
నేను: “దేవుళ్ల బొమ్మల చేతుల్లో కత్తులు, బాణాలు లాంటివి మాత్రమే ఉన్నాయి ఎందుకు? గన్నులు కనపడవు ఎందుకు?”
అతను: “ఎందుకంటే దేవుళ్ళు ఆ కాలం లోనే ఉన్నారు కాబట్టి. ఈ కాలం లో లేరు కాబట్టి. ఆ కాలంలో అలాంటి weapons ఏ వాడేవారు కాబట్టి.”
నేను: “దేవుళ్ళు ఆ కాలంలోనే ఎందుకు ఉన్నారు? ఈ కాలంలో ఎందుకు లేరు?”
అతను: “ఎందుకు లేరు అంటే.. అది మనం ఎలా చెప్పగలం.. దేవుడు ఎప్పుడు అవతారం ఎత్తుతాడో మనం చెప్పలేము కదా..”
నేను: “ పోనీ… దేవుళ్ళు కత్తులు, బాణాలు వాడే కాలం లో ఉన్నారు అని అన్నావు కదా.. అంటే దేవుళ్ళు Iron age లో ఉండేవారు అన్నమాట. మరి అంతకు ముందు Stone ageలో దేవుళ్ళు ఉండేవాళ్లు కాదా? ఒక వేళ ఉంటే ఎలా ఉండేవాళ్లు? రాతి ఆయుధాలు పట్టుకునేవారా? వాళ్ళ బొమ్మలు మనకి కనిపించడం లేదు ఎందుకు?
అతను: ఏం మాట్లాడుతున్నావు??

బహుశా అతనికి Iron age, Stone age ల గురించి తెలిసి ఉండకపోవచ్చు. వాటి గురించి తెలుసుకోకుండా సరైన సమాధానం దొరకదు. మనకు కలిగిన ప్రశ్నకి ఎక్కడా రాజీ పడకుండా సమాధానం తెలుసుకోవడం కోసం కాలంలో చాలా వెనక్కి వెళ్లి Stone age దగ్గర మొదలు పెట్టి అధ్యయనం చెయ్యాలి.

మన ప్రశ్న “మతము – ఆయుధాలు – కళ” ఈ మూడు విషయాల చుట్టూ తిరుగుతుంది. ఈ మూడు విషయాలూ మానవ సమాజంతో పెనవేసుకుని ఉన్న విషయాలు. మానవ జీవన పరిస్థితులలో మార్పులు వచ్చిన ప్రతి సారీ ఈ మూడు విషయాలు కూడా మార్పులకి లోనవుతూనే ఉన్నాయి. కాలంతో పాటు ఆయుధాలలో ఈ మార్పు మనం చాలా చక్కగా గమనించవచ్చు. కళలలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. మతంలో మార్పులు అంత బాహాటంగా కనిపించవు. ఈ మార్పులని అర్థం చేసుకోవడానికి మానవ సమాజంలో వచ్చే మార్పులని మనం లోతుగా చూడాలి.

కొండ గుర్తు 1 : యుగాల మధ్య ఖచ్చితమైన విభజన రేఖ ఉండదు.

సమాజ పరిణామ క్రమంలో యుగాల మధ్య ఖచ్చితమైన విభజనరేఖ ఉండదు. మానవ మేధస్సు వికసిస్తున్నా కొద్దీ, ప్రకృతి మీద అవగాహన పెరుగుతున్నా కొద్దీ ఒక యుగంలోంచి ఇంకొక యుగం క్రమక్రమంగా పుట్టుకొస్తుంది. అంటే “ఫలానా రోజున అనాగరిక యుగం అంతమయ్యి నాగరిక యుగం మొదలయ్యింది” అన్నట్టు జరగదు. ఒక యుగం క్రమంగా బలహీనపడుతూ ఉంటే, అందులోనే పురుడు పోసుకున్న ఇంకొక ఉన్నతమైన యుగం క్రమంగా బలపడుతూ ఉంటుంది. ఈ పరివర్తనా కాలం పూర్తవ్వడానికి వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల దాకా పడుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి కొంచం కష్టమయిన విషయమే. ఒక ఉదాహరణతో చూస్తే తేలిక అవవచ్చు.

ఉదాహరణకి భాషలకి లిపి వాడుకలోకి వచ్చిన తరవాత కాలాన్ని నాగరిక యుగం అనీ, అంతకు ముందు కాలాన్ని అనాగరిక యుగం అనీ అంటున్నాము (Table చూడండి). ఏ భాషకయినా లిపి ఒక రోజులో తయారవ్వదు. ముందు చిన్న చిన్న గుర్తులు/బొమ్మలు మాటలకి సంకేతాలుగా ఉపయోగంలోకి వస్తాయి. ప్రజలు ఈ గుర్తులకి బాగా అలవాటయ్యే క్రమంలో ఇంకొన్ని సంకేతాలు పుడతాయి. ఇవే కాల క్రమంలో అక్షరాలుగా మారి ఒక సంపూర్ణమయిన లిపి తయారవుతుంది. ఇది ఒక క్రమం. ఇలా లిపి తయారవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు సులభంగా పడుతుంది. ఈ కాలం అంతా ఆ రెండు యుగాల మధ్య పరివర్తనా కాలం అన్నమాట.

ఈ కింది బొమ్మ కాలక్రమం లో వస్తువుల గుర్తుల నుంచి చైనీస్ అక్షరాలు ఎలా పుట్టాయో చూపిస్తుంది. చైనీస్ లిపి ఇప్పుడు ఉన్న రూపానికి రావడానికి 6000 సంవత్సరాలు పట్టిందని ఒక అంచనా.

vinod1

ఇంకో విధంగా చెప్పాలంటే, లిపి అనేది నాగరిక యుగ లక్షణం. గుర్తులని, బొమ్మలని మాటలకి సంకేతాలుగా వాడటం అనేది లిపి యొక్క ప్రాధమిక రూపం (బీజ రూపం – Seed). ఇది అనాగరిక యుగం మధ్య దశలోనే మొదలయ్యింది (Table చూడండి). అంటే నాగరిక యుగపు బీజాలు అనాగరిక యుగంలోనే పుట్టాయి అన్నమాట. ఇది అన్ని యుగాలకీ, అన్ని దశలకీ వర్తిస్తుంది. ప్రతి దశ యొక్క బీజాలు అంతకు ముందు దశలోనే పుట్టి ఉంటాయి.

ఈ కింది బొమ్మ అనాగరిక యుగం మధ్య దశ – ఎగువ దశల మధ్య పరివర్తనా కాలాన్ని చూపిస్తుంది. మనుషులు ఇనుముని అదుపులోకి తెచ్చుకున్న తరవాత కాలాన్ని “అనాగరిక యుగం ఎగువ-దశ” అని అంటున్నాము. అంతకు ముందు కాలాన్ని మధ్య-దశ అంటున్నాము. అంటే రాతి పనిముట్లు (Stone Tools) మధ్య-దశ లక్షణం, లోహపు పనిముట్లు (Metallic Tools) ఎగువ-దశ లక్షణం అన్నమాట.

vinod2

నిజానికి లోహాన్ని అనాగరిక యుగం మధ్య-దశలోనే మనిషి కనుగొన్నాడు. ఇది ఎగువ-దశ యొక్క బీజం. కానీ ఇనుము వంటి లోహాన్ని తనకి కావలసినట్టు కరిగించి మలచుకునే పరిజ్ఞానం సంపాదించడానికి మనిషికి అనేక వందల సంవత్సరాలు పట్టింది. ఈ కాలం అంతా ఆ రెండు దశల మధ్య పరివర్తనా కాలం అన్నమాట. లోహపు పనిముట్లు (కొడవళ్ళు, గొడ్డళ్ళు, కత్తులు వంటివి) రంగంలోకి రాకముందు మనుషులు రాతి పనిముట్లనే వాడేవారు. లోహపు పనిముట్లు రాతి పనిముట్ల కంటే ఉన్నతమైనవి (Better Technology). లోహపు పనిముట్లు రంగంలోకి వచ్చాక సహజంగానే రాతి పనిముట్ల వాడకం తగ్గుముఖం పడుతుంది. ఇది రాను రాను బాగా తగ్గిపోయి, కొన్ని పరిమితమయిన అవసరాలకి తప్ప మిగతా అన్నిటికీ లోహాన్నే వాడటం జరుగుతుంది. ఇలా మిగిలిపోవడాన్ని “అవశేషాలు” అంటాము. ఈ బొమ్మని జాగ్రత్తగా గమనించండి. మన “దేవుని లోహపు ఆయుధాల” ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

కొండ గుర్తు 2: అభివృద్ధి క్రమం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్ళదు.

మానవుడికి అనుభవం పెరుగుతున్నా కొద్దీ కొత్త కొత్త ఆవిష్కరణలు, కల్పనలు చేస్తూ ఉంటాడు. పాత ఆవిష్కరణల నుంచి నేర్చుకున్న అనుభవంతో ఇంకొక ఉన్నతమైన ఆవిష్కరణ చేస్తాడు. ఈ క్రమం ఎప్పుడూ అభివృద్ధి వైపు ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్ళదు. ఉదాహరణకి క్రీ.పూ. 3500 లో బండి చక్రం కనిపెట్టారు. అంతకు ముందు కాలం అంతా చక్రాల వాహనాలు లేకుండానే గడిచిపోయింది. ఒకసారి చక్రాన్ని కనుగొని దాని ఉపయోగాలు అర్థమయ్యిన తర్వాత తిరిగి బండి చక్రం లేని సమాజంలోకి వెళ్ళడం అనేది ఏ పరిస్థితుల్లోనూ జరగదు. అలాగే నాగరికులుగా ఎదిగిన మనుషులు తిరిగి ఆటవికులుగా అవ్వడం అనేది జరగదు.

ఈ రెండు కొండ గుర్తులు బాగా గుర్తు పెట్టుకోండి. ఇవి మనకు తర్వాత బాగా ఉపయోగపడతాయి.

ఒక్కొక్క యుగానికి ఆ యుగంలోని మానవ జీవన పద్ధతులకు అవసరమైన, అనుగుణమైన ఆలోచనలు, ఆచారాలు, కుటుంబ వ్యవస్థలు, పాలనా వ్యవస్థలు తయారవుతాయి. యుగాలు పరివర్తన చెందుతున్నా కొద్దీ, మానవ అనుభవం పెరుగుతున్నా కొద్దీ ఈ ఆచారాలు, వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందుతూ వస్తాయి. పాత ఆచారాలు, వ్యవస్థలు బలహీనపడుతూ కొత్తవి బలపడుతూ వస్తాయి. అంతిమంగా మునుపటి యుగం నాటి అనేక విషయాలు సమాజంలో అవశేషాలుగా మిగిలిపోతాయి. కొంతకాలానికి పూర్తిగా అంతరించి పోతాయి. ఇదే సూత్రం ఈ మూడు యుగాలలోని అంతర్దశలకి కూడా వర్తిస్తుంది. ఒక ఉదాహరణతో చూస్తే బాగా అర్థమవుతుంది.

అనాగరిక యుగం ఎగువ-దశలో రాచరిక వ్యవస్థ (Feudal వ్యవస్థ) ఉద్భవించి, నాగరిక యుగం మధ్య-దశకి వచ్చేసరికి బాగా బలపడి ఉచ్ఛస్థితికి చేరింది (Table చూడండి). ఆ దశలలో ప్రజా పాలన అంతా రాజు కనుసన్నల్లో జరిగేది. ఆ రాచరిక వ్యవస్థకి ఉపయోగపడే చట్టాలు, ధర్మాలు అమలులో ఉండేవి. ఆ కాలంలో ఉన్న అన్ని కళలలో, కావ్యాలలో, ఆచారాలలో దాని ప్రభావం కనపడుతుంది. పురాణ ఇతిహాసాలు, జానపద కథలు అన్నీ సాధారణంగా రాజుల కథలే అయి ఉంటాయి. సరిగా గమనిస్తే, ఈ కథలు ప్రచారం చేసే ధర్మాలూ, విలువలూ అన్నీ రాచరిక వ్యవస్థని బలపరిచేవే. నాగరిక యుగం ఎగువ దశలో రాచరికాన్ని, దాని అరాచకాలని ఎదిరించి మానవ జాతి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలని నిర్మించుకున్నారు. నేడు రాచరిక వ్యవస్థ చాలా బలహీన పడింది. కానీ దాని అవశేషాలు ఇంకా సమాజంలో అంతరించలేదు. ఈనాటికీ అనేక దేశాలలో ఇంకా రాజులు పాలించడం గమనించవచ్చు. ప్రజాస్వామ్యం నిర్మించుకున్న మనలాంటి దేశాలలో కుడా కళలలోను, కథలలోనూ, ఇతిహాసాలలోను రాజుల గురించి, రాజ్యాల గురించి గొప్పగా చదువుకుంటూనే ఉన్నారు. ఇవి మధ్య-దశ యొక్క అవశేషాలు. ఇంకొంత కాలానికి ఈ అవశేషాలు కూడా అంతరిస్తాయి.

మానవ సమాజంలో వచ్చిన / వస్తున్న మార్పులన్నీ ఇలా క్రమానుగతంగా నెమ్మదిగా వచ్చిన మార్పులే. అన్ని మార్పుల వెనకా బలమయిన భౌతిక పరిస్థితుల పాత్ర మనకి కనపడుతుంది. ఏ మార్పూ గాలిలోంచి ఊడిపడదు. ఈ విషయాన్ని ముందు ముందు మరికొన్ని ఉదాహరణలతో చూస్తాము.

ఈ మొత్తం క్రమం లో మతం ఎప్పుడు పుట్టింది? మనుషుల సమాజం మారుతూ ఉంటే మతం లో ఎలాంటి మార్పులు వచ్చాయి? మనకి తెలిసిన మతాల కంటే పూర్వం ఎలాంటి మతాలు ఉండేవి? వాటి స్వరూపం ఎలా ఉండేది? వాటిలో దేవుడి రూపం ఎలా ఉండేది? ఈ ప్రశ్నలకి సమాధానాలు వచ్చే వారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

*

దేవుని చేతిలో గన్నులు ఎందుకు లేవు-1

 

-వినోద్ అనంతోజు

~

vinodముందు మాట:

ప్రశ్న ఒక Chain Reaction. ఏ ప్రశ్నకి అయినా సమాధానం వెతికే క్రమంలో ఎన్నో ఇతర ప్రశ్నలు పుడతాయి. వాటికి సమాధానం వెతికేటప్పుడు ఇంకొన్ని ప్రశ్నలు పుడతాయి. ఇలా అంతు లేకుండా ఒక Chain Reaction లా సాగిపోతుంది. ప్రశ్న ఏదయినా దానికి ఒక సమాధానం ఉండి తీరుతుంది. ఒక్క చిన్న ప్రశ్నతో మొత్తం విశ్వంలోని అన్ని విషయాలనీ అన్వేషించవచ్చు. మనకి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలే గానీ “ఆకలి ఎందుకు వేస్తుంది?” అనే చిన్ని ప్రశ్న నుంచి అటు బయాలజీని, ఇటు సోషియాలజీని అంతుల దాకా అన్వేషించవచ్చు. ఈ శీర్షికలోని వ్యాసాలు ఇలాంటి ఆసక్తి ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయి. చిన్న ప్రశ్నతో మొదలుపెట్టి నేను Anthropology, History, Metallurgy, Religion, Arts, ఇలా ఎన్నో సబ్జెక్టుల్లోకి వెళ్లాను. కొన్ని సార్లు అసలు ప్రశ్నని వదిలేసి మిగతా ప్రశ్నలకి సమాధానం వెతికే పనిలో పడ్డాను. ఈ వ్యాసాలని బాగా అర్థం చేసుకోవడానికి మీరు కూడా కొంత శ్రమ చెయ్యక తప్పదు. నాతో కలిసి మీరు కూడా ప్రశ్నలకి సమాధానాలు వెతకాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీకు కూడా ఆ సబ్జెక్టుల్లో ఆసక్తి ఉండాలి.

***

ప్రపంచంలో దాదాపు 4,500 మతాలు ఉన్నాయి. ఒక్కో మతానికి ఒక్కో దేవుడు ఉన్నాడు. కొన్ని మతాలలో అయితే లెక్కలేనంత మంది దేవుళ్ళు ఉన్నారు. అతి పురాతన మతాల నుంచి అత్యాధునిక మతాల దాకా, అన్నిటిలో కొన్ని అంశాలు ఒకేలా ఉంటాయి. అనేక సందర్భాలలో వేరు వేరు మతాల దేవుళ్ళ మధ్య కూడా చాలా సారూప్యతలు కనిపిస్తాయి.
ఈ మధ్య ఒక మిత్రుడి ఇంటిలో ఒక అద్భుతమైన తైలవర్ణ చిత్రపటం (oil painting) చూసాను. విశ్వరూపంలో ఉన్న విష్ణుమూర్తి painting అది. చిత్రకారుడి పనితనంతో పాటు విష్ణుమూర్తి చేతిలో ఉన్న గద, గొడ్డలి, విల్లు, బాణాలు, ఖడ్గం వగైరాలు నా దృష్టిని ఆకర్షించాయి. ఇవన్నీ మానవులు ఒకానొక కాలంలో వాడిన రకరకాల “ఆయుధాలు” కదా. అంతకు ముందు కాలంలో రాతి ఆయుధాలు వాడారు. ఆ తరవాత గన్నులు, బాంబులు వాడుతున్నారు. మరి దేవుళ్ల బొమ్మలు కేవలం ఆ particular కాలంలో మానవులు వాడిన ఆయుధాలు మాత్రమే ధరించినట్టు కనపడుతున్నాయి ఎందుకు? ఏ ఒక్క దేవుని బొమ్మ అటు రాతి ఆయుధాలు గానీ, ఇటు గన్నులు గానీ పట్టుకుని కనిపించడం లేదు ఎందుకని? కేవలం హిందూ దేవుళ్ళు మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక మతాలలో ఇదే కనిపిస్తోంది. గ్రీకు, రోమను, ఈజిప్షియన్ దేవుళ్ళు కుడా త్రిశూలాలు, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. దీనికి కారణం ఏమయి ఉంటుంది?

vinod1

మామూలుగా చూస్తే ఇది చాలా సిల్లీ ప్రశ్న లాగా కనిపిస్తుంది కానీ ఈ ప్రశ్నకి ఎక్కడా రాజీ పడకుండా సరైన సమాధానం తెలుసుకోవడం కోసం కొంత అధ్యయనం చెయ్యక తప్పలేదు. ఈ ప్రశ్న “మతం – ఆయుధాలు – కళ”లతో సంబంధం కలిగి ఉంది.
“మతం”, “దేవుడు” అనే భావనలు అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. మనం చూస్తున్న దేవుని బొమ్మల యొక్క రూపం కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం కల్పించబడినది. ఆ ఆయుధాలు కూడా అప్పటివే.
మరి మొదటి నుంచీ దేవుళ్ల రూపాలు ఇలా ఉండేవి కావా? ఒకవేళ ఇలా కాకపొతే, అంతకు ముందు కాలంలో దేవుళ్ల రూపాలు ఎలా ఉండేవి? వాళ్ళు ఏ ఆయుధాలు పట్టుకునేవారు? అసలు దేవుళ్ళకి ఈ రూపాలు ఎవరు కల్పించారు? ఏ కాలంలో కల్పించారు? మన అసలు ప్రశ్నతో పాటు ఇలాంటి ప్రశ్నలు అనేకం పుడతాయి. ప్రశ్న ఏదైనా సమాధానం తెలుసుకోవాల్సిందే. ఇందుకోసం మనకు కింద చెప్పిన నాలుగు విషయాలు కొంతయినా తెలిసి ఉండాలి.
1. మానవ సమాజం అభివృద్ధి క్రమం
2. మతం – దాని పుట్టుక, అభివృద్ధి క్రమం
3. ఆయుధాలు – కాలంతో పాటు వాటిలో వస్తున్న మార్పులు
4. కళల  అభివృద్ధి క్రమం

 

మానవ సమాజం అభివృద్ధి క్రమం

మతము, ఆయుధాలు, కళలు – ఈ మూడూ కూడా మానవ సమాజంలోని భాగాలే. వాటి అభివృద్ధీ, వాటిలో వచ్చే మార్పులూ మానవ సమాజంలో వచ్చే మార్పులతో చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. వాటన్నిటి మధ్య connection అర్థం చేసుకోవాలంటే మనకి మానవ సమాజం యొక్క అభివృద్ధి క్రమం తెలిసి ఉండాలి.
ఇవ్వాళ ఉన్న మానవ సమాజం అన్ని రంగాలలోనూ చాలా అభివృద్ధి చెందినది. ఇది ఒక్క రోజులో ఆవిర్భవించింది కాదు. ఒకప్పుడు మనుషులు జంతువుల స్థాయి నుంచి మొదలుపెట్టిన వారే. మనం తయారు చేసుకున్న ప్రతి వస్తువు వెనక, ఏర్పరుచుకున్న ప్రతి వ్యవస్థ వెనుక ఎన్నో వేల సంవత్సరాల మానవానుభవం ఉంది.

మానవానుభావం అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక సహస్రాబ్ది (1000 సంవత్సరాల) క్రితం ప్రపంచంలో అత్యధిక భాగంలో రాచరిక వ్యవస్థే నడుస్తోంది. అప్పటి మానవులకి ఇంకా “ప్రజాస్వామ్యం” అంటే ఏమిటో తెలియదు. ఇంకో విధంగా చెప్పాలంటే, “ప్రజాస్వామ్యం” లాంటి వ్యవస్థ సమాజంలో పుట్టి, నిలదొక్కుకోవడానికి కావలసిన అనుభవం ఆయా సమాజాలు అప్పటికి ఇంకా సంపాదించుకోలేదు అన్నమాట. కొన్ని శతాబ్దాల పాటు రాచరిక వ్యవస్థని అనుభవించిన తరవాత మాత్రమే, సమాజం ఆ వ్యవస్థ యొక్క లోపాలని గుర్తించగలిగింది. అంతకంటే ఉత్తమమయిన వ్యవస్థ యొక్క అవసరాన్ని గుర్తించగలిగింది. రాచరిక వ్యవస్థ నడిచిన కాలంలో నేర్చుకున్న అనుభవాలు, గుణపాఠాలు తరవాతి కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్మించుకోవడంలో ఉపయోగపడ్డాయి. ఇది ఒక అభివృద్ధి క్రమం.

vinod2

మనం నేడు చూస్తున్న సమాజంలోని ప్రతి అంశమూ ఇలా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చినదే. జంతువుతో సామానమయిన స్థాయి నుంచి మొదలయిన మానవ ప్రస్థానం నేడు ప్రకృతిని తన వశంలోకి తెచ్చుకునే స్థాయికి చేరింది. ఇది సమాజం యొక్క పరిణామ క్రమం. ఈ క్రమం మొదలయ్యి లక్షన్నర సంవత్సరాలు పైనే అయ్యింది. ఈ మొత్తం అభివృద్ధి జరిగిన క్రమాన్ని/కాలాన్ని మన అధ్యయనం కోసం మూడు యుగాలు గా విభజించవచ్చు.

1. ఆటవిక యుగం – మానవ జాతి ఆవిర్భవించిన కాలం నుంచి మనుషులు కుండలు వంటి మట్టి పాత్రలు తయారు చెయ్యడంలో నైపుణ్యం సంపాదించిన కాలం వరకు ఆటవిక యుగంగా చెప్పవచ్చు. ఈ యుగం సుమారు 1,60,000 సంవత్సరాలు నడిచింది. ఈ యుగంలోనే మానవులు రాళ్ళని పనిముట్లుగా మలచుకునే నైపుణ్యం సంపాదించారు. నిప్పుని కనుగొన్నారు, చేపలు తినడం అలవాటు చేసుకున్నారు, విల్లు, రాతి గొడ్డళ్ళు వంటి ఆదిమ ఆయుధాలు తయారు చేసుకున్నారు. అప్పటికి లోహం (metal) ఒకటి ఉంటుందని మానవులకి తెలియదు.

2. అనాగరిక యుగం – కుండలు తయారు చేసే పరిజ్ఞానం సంపాదించిన కాలం దగ్గర్నుంచి నుంచి భాషలకి లిపి తయారు చేసుకునే కాలం వరకు అనాగరిక యుగం అనవచ్చు. అనాగరిక యుగం సుమారు 35,000 సంవత్సరాలు నడిచింది. అంటే మట్టితో కుండలు చేసే స్థాయి నుంచి మాటలని అక్షరాలుగా రాసే తెలివితేటలు సంపాదించుకోవడానికి మనుషులకి 35,000 సంవత్సరాల పైనే పట్టింది అన్నమాట. అనాగరిక యుగంలోనే మనుషులు పశుపాలన, వ్యవసాయం, ఇటుకలతో ఇల్లు కట్టుకోవడం, రాగి, కాంస్యం, ఇనుములని కరిగించి వస్తువులు తయారుచెయ్యడం నేర్చుకున్నారు. భాషలని అభివృద్ధి చేసుకున్నారు.

3. నాగరిక యుగం – భాషలకి లిపి తయారు చేసుకున్న కాలం నుంచి నేటి వరకు సుమారు 5000 సంవత్సరాల కాలం ఇది. మనకు తెలిసిన రాజులు, రాజ్యాలు, కళలు, అన్ని ఆధునిక పరికరాలు, శాస్త్రాలు, రాతపూర్వక కావ్యాలు, ప్రజాస్వామ్యం ఈ యుగంలోనే మానవులు తయారు చేసుకున్నారు.

గమనిక: ఇవన్నీ పురావస్తు పరిశోధనలని (Archeological studies) ఆధారం చేసుకుని వేసిన లెక్కలు. ఈ యుగాలకీ హిందూ పురాణాలలోని యుగాలకీ (కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం..) ఎటువంటి సంబంధమూ లేదు.
ఈ విభజన కోసం “లూయిస్ హెన్రీ మోర్గాన్” తన జీవిత కాలం వెచ్చించి పరిశోధించి రాసిన “పురాతన సమాజం” పుస్తకం మీద ఆధార పడ్డాను. ఆయన ఆ పుస్తకం రాసే కాలంలో (1870’s) లభ్యంగా ఉన్న ఆధారాల ప్రకారం ఒక విభజన చేసారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన అనేక ఆధారాలను పరిగణలోకి తీసుకుని నేను ఈ విభజనలో కొన్ని మార్పులు చేర్పులు చేసాను. మన అధ్యయనం కోసం ఈ మూడు యుగాలని ఒక్కొక్క దాన్ని మూడు అంతర్దశలుగా విభజించవచ్చు.
ఈ విభజనని సంవత్సరాల వారీగా ఒక పట్టికలో (Table) చేర్చాను. ఈ పట్టికని పై నుంచి కిందకి చదివితే తేలిగ్గా అర్థమవుతుంది. అంటే ఆటవిక యుగం దిగువ దశ నుంచి మొదలుపెట్టి కిందకి చదువుతూ వెళ్ళాలి అన్నమాట. ప్రతి యుగంలోనూ మూడు అంతర్దశలు ఉంటాయి (దిగువ-మధ్య-ఎగువ). పట్టికలో ప్రతి దశలోనూ ఆ దశలో జరిగిన ముఖ్యమయిన విషయాలు, మానవులు సాధించిన ముఖ్యమైన అభివృద్ధి చూడవచ్చు.

ఈ వ్యాసంలోని అనేక విషయాలని అర్థం చేసుకోవడానికి ఈ పట్టిక మీకు ఉపయోగపడుతుంది. ముందు ముందు చదవబోయే వాటిలో ఎక్కడ confusion వచ్చినా ఈ పట్టికని చూడండి.
ఈ పట్టికలో సంవత్సరాల లెక్కలు చూపించడం జరిగింది. దాని అర్థం మొత్తం ప్రపంచంలోని అన్ని సమాజాలలో ఆ సంవత్సరాల లోనే ఆ మార్పులు వచ్చాయని కాదు. ఈ పరిణామం ప్రపంచంలోని అన్ని సమాజాలలో ఒకే సమయంలో జరగలేదు. భౌతిక పరిస్థితులని (Physical Conditions) బట్టి కొన్ని సమాజాలు వేగంగా అభివృద్ధి చెందాయి. కొన్ని వెనకబడ్డాయి. ఈనాటి నాగరిక ప్రపంచంలో కూడా అక్కడక్కడా అనేక ఆటవిక, అనాగరిక జాతులు కనపడతాయి. అంటే ఆ జాతుల అభివృద్ధి క్రమం చాలా నెమ్మదిగా నడుస్తోంది అన్నమాట. మిగతా ప్రపంచం అంతా నాగరిక యుగంలోకి ప్రవేశించింది. కానీ ఆ జాతులు మాత్రం ఆటవిక, అనాగరిక యుగాలలో ఉన్నాయి. అభివృద్ధి చెందే వేగంలో హెచ్చుతగ్గులున్నా, అభివృద్ధి చెందే క్రమం మాత్రం ఇలాగే ఉంటుంది. రాబోయే వ్యాసంలో దీనిని ఇంకొంచం వివరంగా చూస్తాము. పై పట్టికలో చూపించిన సంవత్సరాలు ప్రపంచంలో వివిధ సమాజాలలో వచ్చిన అభివృద్ధి కాలాలను average చేసి, సుమారుగా రాయబడినవి.
సాధారణంగా ఎవరైనా “ప్రాచీన కాలం” అని అంటే మనం మూడు వేలో, నాలుగు వేలో సంవత్సరాల పూర్వం అని అనుకుంటాం. మనం మాట్లాడుకునే “చరిత్ర” కూడా ఈ కాలం నుంచే మొదలవుతుంది. కానీ అంతకు ఒకటిన్నర లక్షల సంవత్సరాల ముందు నుంచే మానవులు ఉన్నారు. జంతువు నుంచి ఆటవికులుగా, ఆటవికుల నుంచి అనాగరికులుగా, అనాగరికుల నుంచి నాగరికులుగా ఎదగడంలో వారు వెచ్చించిన శక్తి, శ్రమ, బుద్ధి అసామాన్యమయినవి. నిరంతరం ప్రకృతితో పోరాడుతూ, ఎదురు దెబ్బలు తింటూ, స్వంత అనుభవంతో చిన్న చిన్న విజయాలు సాధించుకుంటూ ఇంత దూరం వచ్చారు. ప్రకృతిలో ఏ ఇతర ప్రాణీ సాధించలేని అభివృద్ధి మానవులు సాధించారు. “మన పూర్వీకులు” అనగానే కిరీటాలు పెట్టుకున్న రాజులో, వేదాలు చదివే మునులో మనకి గుర్తు వస్తారు. ఇది కొంతవరకే నిజం. మన పూర్వీకులు ఆటవికులుగా దిగంబరంగా అడవులలో తిరిగిన వారే. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదు. వారు లక్ష సంవత్సరాలు పాటు కష్టపడి సాధించిన అభివృద్ధి శిఖరాగ్రాన (Peak Point మీద) నిలబడి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది మనం మర్చిపోకూడదు.
రాబోయే వ్యాసాలలో మానవ సమాజంలో ఏ కారణాల చేత మార్పులు వస్తాయో, వాటి వల్ల మనుషుల జీవన విధానంలో, మతంలో, ఆచారాలలో మార్పులు ఎలా వస్తాయో చర్చిద్దాం.

(వచ్చే  వారం )
*

“చింటూ.. అమ్మెక్కడ?”

వినోద్ అనంతోజు 

 

Vinod Anantojuఇల్లు దగ్గరపడుతున్నా కొద్దీ సౌజన్య గుండె వేగంగా కొట్టుకోసాగింది. కారు వాళ్ళింటి మట్టిరోడ్డులోకి ప్రవేశించింది. రోడ్డు మీది గతుకులకి కారులోని సామానంతా కదిలిపోతోంది. వాటిలో సగానికి పైగా చింటూగాడి కోసం తెచ్చిన బొమ్మలే. వాడికిప్పుడు రెండు నెలలు తక్కువ రెండేళ్ళు.

ఆ రోజు Airport లో వాడి ఏడుపు ఆపడం దాదాపు అసాధ్యమయ్యింది. ఆకలేస్తోందేమో అని సౌజన్య పాలు కూడా పట్టింది. శ్రీధర్ వాణ్ని ఎత్తుకుని అటూ ఇటూ ఒక అరగంట నడిచాడు. ఇమ్మిగ్రేషన్ అనౌన్సుమెంటు వస్తోంది. వాడింకా ఏడుపు ఆపలేదు. చేసేది లేక ఏడుస్తున్న వాడినే అమ్మ చేతికి అప్పగించి ట్రాలీ నెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరూ. అప్పుడే సంవత్సరం గడిచిపోయింది.  ఇప్పుడు వాడు నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, బోలెడు మాటలు చెపుతున్నాడు.

గేటు తెరుచుకున్న చప్పుడు అవ్వగానే ఇంట్లోంచి హైమావతి గబగబా బయటికొచ్చింది. తడి చేతులు కొంగుతో తుడుచుకుంటూ కూతురిని కౌగిలించుకుంది. శ్రీనివాసరావు అల్లుడికి సామాను దించడంలో సాయం పట్టడానికి కారు దగ్గరికి వెళ్ళాడు. సంవత్సరం తరవాత వచ్చారు కూతురు అల్లుడు. హైమావతి కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని కూతురుని తేరిపార చూస్తోంది. ఆవిడ సంతోషానికి అవధుల్లేవు. సౌజన్య కళ్ళు మాత్రం చింటూ గాడి కోసం వెతుకుతున్నాయి.

“ఏడి వాడు? నిద్రపోతున్నాడా?” అడిగింది సౌజన్య.

“లేదమ్మా.. లేచే ఉన్నాడే.. దొడ్లో ఆడుకుంటున్నాడు అనుకుంటా. చింటూ…!!” కేకేసింది హైమావతి.

దొడ్డి గుమ్మంలోంచి కర్రపుల్ల ఒకటి పట్టుకుని ఊపుతూ వచ్చాడు చింటూ. తనని చూడగానే “అమ్మా” అని ఎగిరి గంతేసి వాటేసుకుంటాడు అనుకుంది సౌజన్య. కాని వాడి కళ్ళలో ఎవరో కొత్త మనుషులని చుసిన బెరుకు కనపడింది. దగ్గరికి రాకుండా అమ్మమ్మ కాళ్ళ వెనకాలే దాక్కున్నాడు. సౌజన్య గుండె కలుక్కుమంది.

“ఛీ.. ఎంత సినిమాటిక్ గా ఉహించుకున్నాను.” అని తనలో తాను సిగ్గుపడింది.

వాణ్ని దగ్గరికి తీసుకుని “నేను చింటూ… అమ్మని” అని పరిచయం చేసుకునేటప్పుడు ఎందుకో ఆమె గొంతు వణికింది. శ్రీధర్ కూడా దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించాడు. చింటూ ఇబ్బందిగా మూలుగుతూ వాళ్ళ చేతులు విడిపించుకుని అమ్మమ్మ వెనక పరిగెత్తాడు.

“అమ్మా నాన్నా వచ్చారమ్మా.. దగ్గరికెళ్ళూ..” హైమావతి అల్లుడికి కుర్చీ వెయ్యాలి, ఫ్యాన్ స్విచ్ వెయ్యాలి, మంచి నీళ్ళివ్వాలి అనే హడావిడిలో ఉంది. చింటూ దూరంగా నిలబడి పుల్ల నోట్లో పెట్టుకుని బెరుకుగా చూస్తున్నాడు.

“ఏమయ్యింది వీడికి? రోజు Skype లో బాగానే మాట్లాడుతాడు కదా!” సౌజన్యకి దుఃఖం కలుగుతోంది.

chinnakatha

నడవడం కూడా రాని బిడ్డని వదిలి అమెరికా వెళ్ళడం సౌజన్యకి అంతగా ఇష్టంలేదు. కానీ తప్పలేదు. శ్రీధర్, సౌజన్య ఇద్దరూ ఒకే సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఒకేసారి Onsite కి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. ఎంత అదృష్టం ! ఈ అవకాశాన్ని వదులుకోవడం శ్రీధర్ కి ఎంతమాత్రం ఇష్టం లేదు. “ఒక్క సంవత్సరం ఓపిక పడితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఎంత కాదనుకున్నా ఇద్దరి మీదా కలిపి యాభై లక్షలు అయినా మిగుల్చుకుని రావొచ్చు.” అన్నాడు శ్రీధర్. సౌజన్యకి కూడా అమెరికా వెళ్లాలని డ్రీమ్. కాకపొతే బాబు గురించి ఆలోచిస్తోంది.

“బాబుని ఇక్కడే ఉంచుదాం. అక్కడ మనిద్దరం ఆఫీసు కి వెళితే బాబు నెవరు చూసుకుంటారు?” అన్నాడు శ్రీధర్.

“మంచి Babysitter ని పెడదాం. ఏమంటావ్?” అడిగింది సౌజన్య.

“వద్దు టీవీల్లో చూస్తున్నాం కదా. Babysitter లు పసి పిల్లల మీద ఎలాంటి అకృత్యాలు చేస్తారో. అయినా మన బిడ్డని పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టడం ఎందుకు? మీ అమ్మా నాన్నా ఉన్నారు కదా !”

“ఉన్నారులే కానీ….”

“ఒక్క సంవత్సరమేగా… కావాలంటే నేను అడుగుతాను మీ అమ్మానాన్నలని“

అమ్మానాన్నా చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇంట్లోకి ఒక కంప్యూటర్ పెట్టించి, నాన్నకి Skype Call ఎలా మాట్లాడాలో నేర్పించింది సౌజన్య.

అమెరికాలో ఎంత ఉరుకులు పరుగులు ఉద్యోగమయినా కనీసం రెండు మూడు రోజులకి ఒకసారయినా Skype Call మాట్లాడేది సౌజన్య. మొదట్లో అమ్మానాన్న మాత్రమే మాట్లాడేవారు.

“ఈరోజు చింటూ నన్ను ‘అమ్మా’ అన్నాడమ్మా!”, “లేచి కాళ్ళమీద నిలబడ్డాడమ్మా”, “పడిపోకుండా అంత దూరం నడిచేశాడమ్మా!”, “వాళ్ళ తాతయ్య చెప్పులేసుకుని డింగ్ డింగ్ అని పరిగెత్తాడమ్మా!” అని హైమావతి చెపుతుంటే సౌజన్యకి ఆనందంతో కళ్ళు చెమర్చేవి. అదే సమయంలో ఇవన్నీ చూడటానికి తను చింటూ దగ్గర లేనే అని బాధ కలిగేది. తన ప్రమేయం లేకుండానే తన బిడ్డ పెరిగిపోతున్నాడనే భావన ఆమెని చాలా కాలం వెంటాడింది.

రాను రాను Call లో అమ్మానాన్నల మాటలు తగ్గిపోయి చింటూ గాడి కిలకిలలు పెరిగిపోయాయి. ఎన్ని కబుర్లు చెప్తున్నాడో వాడు! Skype Call లో సౌజన్య తో మాట్లాడకపోతే అన్నం తినేవాడు కాదు. అందుకని సౌజన్య ప్రతిరోజూ తప్పకుండా Call మాట్లాడేది.

ఇండియా కి వచ్చెయ్యడానికి ఇంకా నెల ఉండగానే సౌజన్యలో చింటూ గాడిని కలవబోతున్నాననే ఆత్రుత మొదలయ్యింది. ఎన్నెన్నో ఉహించుకుంది. ఎన్నో రకాల ఖరీదైన బొమ్మలు, చాక్లెట్లు కొనింది. వాటన్నిటినీ వాడికిచ్చి సంవత్సర కాలంగా పెరిగిన దూరాన్ని ఒక్క క్షణంలో చెరిపెయ్యాలనుకుంది.

ఆరోజు సాయంత్రానికి గానీ చింటూ దగ్గరికి రాలేదు. నలుగురూ చెప్పగా సౌజన్యని అమ్మా అని పిలిచాడు. బొమ్మలు, చాక్లెట్లు అన్నీ ఇచ్చి నవ్వించారు. వాడి నవ్వు సౌజన్యకి వర్షంలో తడిసిన అనుభూతినిచ్చింది. వాణ్ని గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టుకుంది.

“చింటూ.. ఆం తిందూరామ్మా!” హైమావతి పిలిచింది.

చింటూ పరిగెత్తుకుంటూ వెళ్లి కంప్యూటర్ ముందు కూచున్నాడు.

“ఏంటి నాన్నా అక్కడ కూచున్నావు… ఇక్కడికి రా”

చింటూ కంప్యూటర్ మౌస్ ని ఆడిస్తూ “అమ్మని చూపిచ్చూ…” అన్నాడు.

సౌజన్యకి ఏమి అర్థం కాలేదు. చింటూని ఎత్తుకుంది. హైమావతి దగ్గరికొచ్చి వాడి బుగ్గ పట్టుకుని “అమ్మని చూపించేదేంట్రా వెర్రి నాగన్నా ! ఇదిగో అమ్మా!”

“ఉహు.. ఈ అమ్మ కాదు కంప్యూటర్ లో అమ్మ చూపిచ్చూ!” అన్నాడు సౌజన్య చేతుల్లోంచి విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ.

“నేనే నాన్నా ఆ అమ్మని… ఇటూ చూడు…” అంటూ సౌజన్య చింటూని వదలకుండా వాడి తల తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది.

“ఉహు.. ఊహు… ఊ…..హు…” చింటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు.

ఆ తల్లి మౌనంగా ఉండిపోయింది.

 

****

“ఓకే బంగారం” Casual Sex నే ప్రచారం చేస్తోందా?

వినోద్ అనంతోజు 

 

vinod  పోయిన వారం సారంగలో నేను రాసిన “ఇది బంగారం కాదు కాకి బంగారం” వ్యాసం వచ్చింది. ఓకే బంగారం సినిమా ప్రచారం చేసే హానికరమైన భావజాలాన్ని విమర్శిస్తూ రాసిన వ్యాసం అది. దానికి స్పందనగా పాఠకులు కొంతమంది సమర్థిస్తూ రాశారు. కొందరు విమర్శిస్తూ రాశారు. విమర్శలలో కొన్ని ముఖ్యమైన వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

 

వ్యక్తిగత అభిప్రాయాలు ఎక్కడిదాకా?

(Q1) “ఒకే బంగారం” సినిమా ద్వారా మణిరత్నం ఆయన అభిప్రాయాలని పంచుకున్నాడు. ఆయనేమి సమాజాన్ని ఉద్ధరించడానికి సినిమా తీయలేదు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని విమర్శించే హక్కు మీకు ఎక్కడ ఉంది?

(జ) ఏ మనిషికైనా తనకు పరిచయం ఉన్న ప్రతి విషయం మీద ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. తన వ్యక్తిగత జీవితం గురించీ, సామాజికమైన విషయాల గురించీ ఏవో అభిప్రాయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సుబ్బారావు కి బాగా డబ్బులున్నాయి అనుకుందాం. ఆయన లంచం ఇస్తే పనులు త్వరగా జరుగుతాయి. సుబ్బారావుకి లంచగొండితనం ఉండటం చాలా సుఖంగా, సౌకర్యవంతంగా అనిపించవచ్చు. అది అతని వ్యక్తిగత అభిప్రాయం. అలాగని అతను లంచగొండితనం మంచిదనీ, పెరగాలనీ సినిమాల ద్వారానూ, నాటకాల ద్వారానూ ప్రచారం చేస్తానంటే కుదురుతుందా? వ్యక్తిగత స్థాయిలో అభిప్రాయాలు ఎలా ఉన్నా పెద్ద పట్టింపు ఉండదు. సామాజికమైన విషయాల గురించి తప్పుడు అభిప్రాయాలు ప్రచారం చెయ్యాలనుకుంటే విమర్శలు తప్పకుండా ఎదురవుతాయి.

 

(Q2) ఇది మంచి ఇది చెడు అని ఎలా generalize చేస్తారు? ఒక్కొక్కరికీ ఒక్కో విషయం మంచిగా అనిపించవచ్చు. ఇంకొకళ్ళకి అదే విషయం చెడుగా అనిపించవచ్చు. మీకు సినిమా చెడుగా అనిపించినంత మాత్రాన అది చెడ్డదైపోతుందా? మీ అభిప్రాయాలు పక్కవారి మీద రుద్దకూడదు.

(జ) ఇది కూడా పై ప్రశ్నలాంటిదే. వ్యక్తులకి మంచి “అనిపించడం” – “అనిపించకపోవడం” మీద సామాజిక విషయాలు ఆధారపడవు. అప్పారావుకి ఈవ్ టీజింగ్ సరదాగా, ఆనందంగా, మంచిగా “అనిపించవచ్చు”. కానీ అది అవతలి అమ్మాయి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఆమె హక్కుల్ని ఒక రకంగా హరించివేస్తుంది. కాబట్టి ఈవ్ టీజింగ్ చెడు. మంచి “అనిపించడం” – “అనిపించకపోవడం” అనే లెక్క వ్యక్తిగత విషయాలలో పనికివస్తుందేమో గానీ సామాజిక విషయాలలో కాదు. సామాజిక విషయాలలో మంచి చెడులు నిర్ణయించడానికి వేరే సూత్రం కావాలి.

“ప్రతి మనిషికీ సమానమైన హక్కులు – సమానమైన బాధ్యతలు.” ఈ సూత్రం అందరు మనుషులకు అన్ని కోణాల్లోనూ సమానత్వాన్ని ఇస్తుంది. సమాజం ఆ “సమానత్వ” స్థితికి చేరినప్పుడు అందులో ఆర్ధిక అసమానతలు ఉండవు, స్త్రీ పురుష సంబంధాల్లో అసమానతలు ఉండవు, జాతి కుల మత వివక్షలు లాంటి ఏ ఇతర అసమానతలు ఉండవు. సమాజాన్ని అటువంటి స్థితి వైపుకి నడిపించే ఏ మార్పు అయినా, ఏ భావజాలం అయినా అది మంచే ! అసమానతలని పెంపొందించేది ఏదయినా అది చెడే ! ఈ సినిమా ప్రచారం చేసిన Casual Sex Relationships / Free Love concepts స్త్రీ పురుష సంబంధాల్లో అసమానతల్ని పెంచుతాయి. అందువల్ల అది చెడు.

“మానవులందరూ సమానంగా ఉండాలి” (సర్వ మానవ సమానత్వం) అనే దాన్ని మీరు ఒప్పుకోకపోతే ఈ వ్యాసం చదవడం ఇక్కడితో ఆపేయండి. ముందు ముందు చెప్పబోయేవి మీకు ఉపయోగపడవు.

bangar2

 

(Q) ఏ స్త్రీ పురుషులు సంబంధంలో ఉండాలో అది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛ. దానికి ఎవరూ పరిమితులు విధించడానికి వీలు లేదు.

(జ) ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి సంబంధంలో ఉంటారు అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ. నిజమే. ఇది స్త్రీ పురుషులకి మాత్రమే కాదు. Trans genders, Lesbians, Gays, Bisexuals (LGBT) అందరికీ ఉన్న స్వేచ్ఛ. కానీ ఆ స్వేచ్ఛకి కొన్ని పరిమితులు ఉంటాయి. స్త్రీ పురుష సంబంధాల్లో వారి స్వేచ్ఛ ఎక్కడి దాకా అంటే సామాజిక సమస్యలు సృష్టించనంత దాకా.

ఉదాహరణకి: స్త్రీ కి తన శరీరం మీద పూర్తి స్వేచ్ఛ ఉంది. తను గర్భం ధరించాలో లేదో నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఉంది. ఇష్టంలేకపోతే గర్భాన్ని అబార్షన్ చేయించుకునే హక్కు కూడా స్త్రీకి ఉంది. అలాగని కడుపులో ఉన్నది ఆడబిడ్డో, మగబిడ్డో తెలుసుకుని, ఆడబిడ్డ కాబట్టి అబార్షన్ చేయించుకునే హక్కు ఎవరికీ లేదు. చాలా సందర్భాలలో భ్రూణహత్యలు చేయించుకునే కుటుంబాలలో ఆడవాళ్లే భ్రూణహత్యలని సమర్థిస్తూ మాట్లాడుతుంటారు. ఇక్కడ కూడా ఇలాంటి వాదన చెయ్యవచ్చు “నాకు ఆడపిల్లని కనాలో మగపిల్లాడిని కనాలో నిర్ణయించుకునే హక్కు లేదా? నా శరీరం మీద వేరొకరు పరిమితులు విధించడం ఏమిటి?”

ఆ వాదన ఇక్కడ చెల్లదు. ఎందుకంటే ఆ హక్కు ఉంటే పోను పోను జనాభాలో ఆడపిల్లల సంఖ్య తక్కువ అయ్యి అదొక సామాజిక సమస్య అయ్యి కూచుంటుంది.

కాబట్టి వ్యక్తిగత స్వేచ్ఛలకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు కూడా పాత సామాజిక సమస్యలు పోవడానికి, కొత్తవీ పుట్టుకురాకుండా ఉండటానికి ఉంటాయి. స్త్రీ పురుష సంబంధాలలో పరిమితులు లేని స్వేచ్ఛ కలిగించే సామజిక సమస్యలేంటో తరవాత చూస్తాం.

స్త్రీ పురుష సంబంధాలు సామాజిక విషయాలా?

(ప్ర) స్త్రీ పురుష సంబంధాలు సామాజిక విషయాలు అంటారేంటి? నేను, నా భార్య. మా ఇద్దరి మధ్య సంబంధం మా వ్యక్తిగతం కాదా?

(జ) బయట “కుటుంబం అనేది వ్యక్తుల వ్యక్తిగత విషయం” అని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవానికి స్త్రీ పురుష సంబంధాల్లో జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఒక్కటి తప్ప మిగతావి అన్నీ సామాజికమైన విషయాలే. శారీరక సంబంధాన్ని మాత్రమే స్త్రీ పురుష సంబంధంగా అర్థం చేసుకోవడం వల్ల ఈ గందరగోళం వస్తుంది. స్త్రీ పురుష సంబంధాల్లో శారీరక సంబంధంతో పాటు ఇంకా అనేక ముఖ్యమైన విషయాలున్నాయి.

          మీ భార్య ఇంటిపట్టునే ఉంటూ మీకు, మీ పిల్లలకూ సపర్యలు చేస్తూ, మీరు బయట ఉద్యోగాలు చేసుకోవడానికి తోడ్పడుతున్నారు అనుకుంటే, ఆవిడ చేసే శ్రమ అంతా సామాజికమైనదే. ఒక వ్యక్తి తన భార్యని తిట్టినా, కొట్టినా, వరకట్నం పేరుతో హింసించినా అవన్నీ సామాజికమైన విషయాలే. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి చేసే పునరుత్పత్తి (Reproduction), పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ ఇవన్నీ సామాజిక విషయాలే.

 

(ప్ర) ప్రస్తుత పెళ్లి వ్యవస్థలో బోలెడు లోపాలున్నాయి. ఆస్తులు, భూములు, బంగారం పేరుతో జంటలకి బలవంతంగా పెళ్ళిళ్ళు చెయ్యట్లేదా? అక్కడ మాత్రం ముందు శోభనం జరిగి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదా?

(జ) ఈ లోపాలన్నిటి గురించి నేను నా వ్యాసంలో చాలా స్పష్టంగా రాసాను. “ప్రస్తుతం అమలు లో ఉన్న “పెళ్లి” వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. అది ఆడా మగల మధ్య అసమానతలు పెంచేదిగా ఉంది. పైగా వ్యక్తుల ఇష్టాయిష్టాల కంటే డబ్బు, ఆస్తి, కులం, మతాలే “పెళ్లి”లో ఎక్కువ పాత్ర పోషిస్తున్నాయి. నిజమే. ఈ కారణాల చేత పెళ్లిని వ్యతిరేకించవచ్చు.” అని రాసాను. దీని అర్థం ఏమిటి?

అంతే కాకుండా “ఒక ఆడ మగా ఎటువంటి ప్రలొభాలూ (ఆస్తి, కులం, మతం…) లేకుండా, పూర్తి వివేచనతో, ఇష్టపూర్వకంగా ఒకరినొకరు జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం, వారితోనే కలిసి ఉండటం సరైన సంబంధం అవుతుంది.” అని రాసాను. దాని అర్థం ప్రస్తుతం ఉన్న “పెళ్లి” సంబంధాలు సరైనవిగా లేవని చాలా స్పష్టంగా చెప్పినట్టు కాదా? పైగా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి పెళ్లి అనే కార్యక్రమం అవసరమే లేదన్నాను.

          ఇంత సూటిగా రాసిన తరవాత కూడా “పెళ్ళిలో లోపాలున్నాయి కదా?” అని నన్ను ప్రశ్నిస్తారు ఏమిటి? ఇప్పుడున్న పెళ్లి వ్యవస్థే సర్వ శ్రేష్టమైనది అని డబ్బా కొట్టేవాళ్ళని ఎవరినైనా అడగండి ఈ ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళని ఏమనాలి? వీళ్ళకి తెలుగు చదవడం రాదా? లేక కింద పేరా చదివేటప్పుడు పైన పేరా లో చదివింది మర్చిపోతారా??

ఒకే బంగారం Casual Sex నే ప్రచారం చేస్తోందా?

(ప్ర) ఎంతసేపూ సెక్స్.. సెక్స్.. అంటారేమిటి? మణిరత్నం చూపించింది Unconditional Love. మీకు అందులో ప్రేమ కనపడకపోవడం మీ తప్పు.

(జ) సినిమా కథని ఒకసారి క్లుప్తంగా చూడండి. ఆది తారాలు పరిచయమైన నాలుగు రోజులకో శారీరికంగా కలిసారు. “ఆరు నెలల తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. ఈ ఆరు నెలలు కలిసుందాం. ఆ తరవాత ఎవరి లైఫ్ వాళ్లది” అని ఒప్పందం చేసుకుని కలిసుండటం మొదలు పెట్టారు. [అంటే ఆ 6 నెలల వరకే ఒకరితో ఒకరికి సంబంధం. ఆ తరవాత ఆది ఇంకొక అమ్మాయితో ఇలాంటి relationship మొదలుపెట్టినా తారాకి ఏమీ సంబంధం ఉండదు. అలాగే తారా చేసినా ఆదికి సంబంధం ఉండదు. ఇది Casual Sex / Free Love స్వభావం. ఇందులో ప్రేమ ఉండదు. ఆకర్షణ మాత్రమే ఉంటుంది.] ఈ ఆరు నెలలలో ఒకరికొకరు మానసికంగా దగ్గరయ్యారు. గణపతి తన భార్య మీద చూపించే ప్రేమ చూసి పరివర్తన చెంది పెళ్లి చేసుకున్నారు. ఇది కథ.

          ఈ సినిమాలో అధిక భాగం ప్రేమ అనే ముసుగులో Casual Sex / Free Love ని ప్రమోట్ చెయ్యడం జరిగింది. అలా చెయ్యలేదు అని మీకు అనిపిస్తే, పోనీ Casual Sex ని సినిమాలో వ్యతిరేకించిన సన్నివేశాలు ఏమున్నాయి? చివరలో పెళ్లి తప్ప ఒక్క సన్నివేశం కూడా లేదు. ఆ పెళ్లి కూడా వ్యతిరేకించడం కాదు. ఎందుకంటే, వ్యతిరేకించాల్సిన భావాలు ఉన్న ఆది, తారాలను సినిమా అంతా హైలైట్ చేసుకుంటూ వచ్చి, చివరికి వాళ్ళిద్దరి కథకు పెళ్లి పేరుతో సుఖాంతం చెయ్యడం వ్యతిరేకించడం అవ్వదు సమర్థించడం అవుతుంది.

నేను ఇంతకు ముందు వ్యాసంలో రాసినట్టు ఈ సినిమా “ప్రేమకీ మోహానికి మధ్య తేడా లేకుండా చేస్తోంది. చూసేవాళ్ళ మెదళ్లని గందరగోళ పరుస్తోంది. ఇప్పటికీ మీకు సినిమాలో “Casual Sex” అసలు కనపడకుండా మొత్తం ప్రేమే కనపడుతూంటే మీరు కూడా ఆ గందరగోళంలో ఉన్నట్టే.

 

(ప్ర) మణిరత్నం యువతని బాగు చెయ్యడానికి సినిమా తీయలేదు. ప్రస్తుతం ఉన్న యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేసారు అని ఎందుకు అనుకోకూడదు?

(జ) ప్రతి దర్శకుడు తన సినిమా ద్వారా ఏవో కొన్ని అభిప్రాయాలు సమాజంతో పంచుకోవాలి అనుకుంటాడు. కొన్ని సార్లు పంచుకోవాలి అని ఉద్దేశం లేకపోయినా తనకి తెలియకుండానే ఏవో కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తాడు.

మొన్నామధ్య చూసిన ఒక తెలుగు సినిమాలో హీరో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసే మగవాళ్ళని అందరినీ వరసగా పెట్రోల్ పోసి తగలపెడుతూ ఉంటాడు. దర్శకుడు హీరో ద్వారా ఆడవాళ్ళని Sex Objects లాగా చూడటం తప్పు అని సందేశం కూడా ఇప్పించాడు. కానీ అదే సినిమాలో హీరోయిన్లతో విపరీతమైన exposing చేయించాడు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? కథ చెప్పడంలో దర్శకుడి ఉద్దేశం మంచిదే అయిఉండవచ్చు. కాని అతనికి తెలియకుండానే అతని అభిప్రాయాలు సినిమాలో కనపడిపోయాయి. లేదా తెలిసే సినిమా commercial benefits కోసం అలా చేసి ఉండొచ్చు.

మణిరత్నం ఉద్దేశం నిజంగా ప్రస్తుత యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో చూపించడం మాత్రమే అయి ఉండవచ్చు. కాని ఆయనకి తెలియకుండానే Casual Sex లాంటి దాన్ని సమర్థించాడు. లేదా తెలిసే అది పెద్ద వ్యతిరేకించాల్సిన విషయం కాదని అనుకుని వదిలేసి ఉండవచ్చు.

 

Casual Sex అంటే ఏమిటి?

(ప్ర) మీ ఫేస్బుక్ పోస్ట్ కింద కామెంట్స్ అన్నీ చదివాను. Casual Sex గురించి ఎక్కువ వాదన జరుగుతోంది. అసలు Casual Sex అంటే ఏమిటి?

(జ) పెద్దగా పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ఎటువంటి కమిట్‌మెంట్లు లేకుండా, సెక్స్ కోరికలు తీర్చుకోవడాన్ని Casual Sex అంటారు. దీనికే Free Love అనీ, Open Relationships, Hookup culture అనీ రకరకాల పేర్లున్నాయి. చిట్టిపొట్టి తేడాలతో అన్నీ ఒకటే. దీంట్లో ప్రేమ లాంటిది ఏది ఉండదు. కలిసి ఉండాలి, బాధ్యతలు పంచుకోవాలి లాంటి కమిట్‌మెంట్లు ఉండవు. ఆకర్షణ, మోజు ఉన్నంత కాలం కలిసి ఉంటారు. మోజు తీరిపోగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ కలిసి ఉండటం ఒక రోజు కావొచ్చు, ఒక నెల కావొచ్చు, ఆరు నెలలు కావొచ్చు, ఒక్క రాత్రే కూడా కావొచ్చు. ఇలా ఎంత మందితో అయినా Casualగా Sex చేసుకోవచ్చు. ఈ రకం స్త్రీ పురుష సంబంధాలు అమెరికా లాంటి దేశాలలో 1960లలో బాగా ప్రచారంలోకి వచ్చి ఇప్పుడు అక్కడ బాగా స్థిరపడిపోయాయి. అక్కడి ఆడా మగా ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా, ఇష్టపూర్వకంగా దీన్ని అందిపుచ్చుకున్నారు. ఈ Free Love Culture ని సమర్థించే వారు ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానమైన స్వేచ్ఛ ఇస్తుందనీ, ఎవరి ఇష్టప్రకారం వారు ఉండవచ్చనీ, పెళ్లి పేరుతో ఒకరు ఇంకొకరికి దాస్యం చెయ్యాల్సిన అన్యాయం ఈ పద్ధతిలో ఉండదనీ చెప్తారు. మన దేశంలోకి ఇప్పుడిప్పుడే సినిమాల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, ప్రింట్ మీడియా ద్వార దిగుమతి అవుతోంది.

 

Casual Sex / Free Love Culture కి స్త్రీ పురుష అసమానతలకి సంబంధం ఏమిటి?

 

ఇంతకు ముందు చెప్పినట్టు స్త్రీ పురుష సంబంధాలు అనగానే శారీరక సంబంధం మాత్రమే కాదు. శారీరక సంబంధంతో పాటు ఇంట్లో శ్రమ విభజన, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ ఇవన్నీ కూడా స్త్రీ పురుష సంబంధాలలో భాగాలే. కాకపొతే మిగతా విషయాలన్నీ ఒక రకం, శారీరక సంబంధం (పునరుత్పత్తి, Reproduction) ఒక రకం. పునరుత్పత్తి కార్యక్రమం వల్ల ఒక కొత్త ప్రాణి భూమి మీదకి వస్తుంది. పుట్టే ప్రతి బిడ్డకు కొన్ని హక్కులు ఉంటాయి. అది మనం ఎప్పుడూ మరవకూడని విషయం.

          పునరుత్పత్తి కార్యక్రమం వ్యక్తుల వ్యక్తిగత విషయంగా కనిపిస్తున్నప్పటికీ, మనుషుల పునరుత్పత్తి సంబంధాలు (Sexual Relationships) ఎలా ఉన్నాయి అనేది సామాజికమైన విషయం. దీని ప్రభావం అనేక ఇతర సామాజిక విషయాల మీద ప్రత్యక్షంగా పడుతుంది. జనాభా పెరుగుదల –తరుగుదల, Women Literacy, Women employment, లైంగిక వ్యాధులు (Sexually Transmitted Diseases), స్త్రీలు ఏ వయసులో గర్భవతులు అవుతున్నారు, పుట్టే పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం వంటి అంశాలన్నిటి మీదా ఇది ప్రభావం చూపిస్తుంది. సమాజంలోని పేదరికం, Crime Rate వంటి వాటి మీద పరోక్ష ప్రభావం ఉంటుంది.

          పిల్లల్ని కనే సామర్ధ్యం ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. అది ప్రకృతి సహజమైన లక్షణం. జంతువులలో పిల్లల్ని కన్న తరవాత తల్లే తన పిల్లలని సంరక్షించి పెంచుతుంది. జంతు సమాజాలలో Biological Father ఉంటాడేమో గానీ, పిల్లల వైపు నుంచి “తండ్రి” అనే సంబంధం ఉండదు. మానవ సమాజంలో అలా కాదు. పిల్లల్ని తల్లి తండ్రులు ఇద్దరూ కలిసి పెంచుతారు. “తండ్రి” అనే సంబంధం మానవ సమాజపు ప్రత్యేక లక్షణం. 

మానవ సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పిల్లల్ని సంరక్షిస్తూ పెంచుతారు, ఆ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఆ తల్లిదండ్రులని వృద్ధాప్యంలో సంరక్షిస్తారు. “వృద్ధుల సంరక్షణ” కూడా మానవ సమాజపు ప్రత్యేక లక్షణం. జంతువులలో ఇది ఉండదు.

పైన చెప్పిన రెండు లక్షణాలని వదిలెయ్యడం అంటే దాని అర్థం మానవత్వం నుంచి తిరిగి జంతుత్వం వైపుకి ప్రయాణం చెయ్యడమే.

 

Casual Sex / Free Love లో ఏం జరుగుతుంది? ఆడ మగా ఇద్దరూ సెక్స్ వాంఛలు తీర్చుకోవడానికి తాత్కాలికంగా సంబంధాలు పెట్టుకుంటారు. ఒక స్త్రీ వైపు నుంచి చూస్తే, ఆవిడ ఇవ్వాళ ఒకడితో సంబంధంలో ఉంటే, రేపు ఇంకొకడితో, ఎల్లుండి ఇంకొకడితో సంబంధంలో ఉండవచ్చు. కొన్ని నెలల తరవాత ఆవిడ గర్భవతి అయితే, ఆ గర్భం ఎవరివల్ల వచ్చిందో తను అయినా గుర్తించే స్థితిలో ఉంటుందా? ఉండదు. ఒకవేళ గుర్తించినా ఆ ఫలానా మగవాడు ఆ పుట్టబోయే బిడ్డ తండ్రిగా ఉండటానికి ఒప్పుకుంటాడా? సాధారణంగా ఒప్పుకోడు.  “నేనే తండ్రిని అని గ్యారంటీ ఏంటి?” అని అడుగుతాడు. ఏ DNA పరీక్షలో చేయించి నిరూపించినా “హేయ్… అప్పుడేదో ఇద్దరికీ నచ్చి Casual గా సెక్స్ చేసుకున్నాం. Pills సరిగా వాడకపోవడం నీ తప్పు. Abortion చేయించుకోకపోవడం నీ తప్పు.” అని తప్పించుకునే ఆస్కారం మగవాడికి ఎప్పుడూ ఉంటుంది. అంతిమంగా ఆ బిడ్డ బాధ్యత అంతా ఆ బిడ్డ కన్న తల్లిది “మాత్రమే” అవుతుంది.

          ఈ Casual Sex / Free Love బాగా వ్యాప్తి చెందడం అంతే మగవాడికి భూమ్మీద “స్వర్గం” తయారయినట్టే. ఇప్పుడయితే ఆడవాళ్ళు కమిట్‌మెంట్ లేకుండా శారీరక సంబంధానికి ఒప్పుకోరు. సెక్స్ కోసం వాళ్లకి మాయమాటలు చెప్పి మోసగాడు అని చెడ్డపేరు మొయ్యాలి. లేదా వేశ్యల దగ్గరికి వెళ్లి తిరుగుబోతు అనిపించుకోవాలి. [ఇందులో వేశ్యల తప్పు ఏమీ లేదు. అది పూర్తిగా మగవాడి తప్పు]. Free Love culture మగవాడికి ఈ “ఇబ్బందులు” లేకుండా స్త్రీలే తమంతట తాముగా “ఇష్టపూర్వకంగా” మగవాళ్ళకి లొంగిపోయేలా చేస్తుంది. మగవాళ్ళు కావలసినంత మంది స్త్రీలతో సెక్స్ పొందవచ్చు. ఒక్క స్త్రీ కూడా పెళ్లి చేసుకోమని అడగదు. గర్భం వస్తే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా మగవాడికి ఉండదు. అవన్నీ స్త్రీల తలనొప్పులు! చివరికి ఇది ఎటు దారి తీస్తుంది అంటే సెక్స్ కోరికలు తీర్చుకునే “హక్కు” ఇద్దరిదీ. దాని వల్ల వచ్చే పిల్లల బాధ్యత మాత్రం స్త్రీలది. అంటే ఈ రకం సంబంధాలు స్త్రీల మీద ఇంతకు ముందు కంటే ఎక్కువ భారాన్ని పెంచి పురుషులకి ఇంతకు ముందుకన్నా స్వేచ్ఛని పెంచుతాయి.

          స్త్రీ పురుష సంబంధాలు సరైనవి అవ్వాలంటే ఆ సంబంధాలో ఉన్న ఆడ మగా ఇద్దరికీ “సమానమైన హక్కులు, సమానమైన బాధ్యతలు” ఉండాలి. అప్పుడే అది ఇరుపక్షాలకీ న్యాయమైన సంబంధం అవుతుంది. ఈ సూత్రం ప్రకారం లేని ఏ సంబంధం అయినా అది అసమానతలని (inequalities)ని సృష్టిస్తుంది. అసమానతలని సృష్టించేది ఏదయినా సమాజానికి హానికరమైనదే.

ప్రస్తుతం అమలులో ఉన్న పెళ్లి/కుటుంబ వ్యవస్థలో స్త్రీ కంటే పురుషుడికే ఎక్కువ స్వేచ్ఛ ఉన్నప్పటికీ, బాధ్యతల విషయంలో పురుషుడు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. డబ్బు సంపాదన, పిల్లల సంరక్షణ, పెంపకం లాంటివి. ఈ Free Love/ Casual Sex తండ్రికి ఉండాల్సిన బాధ్యతలని లాగేసి తల్లి మీద పడేస్తుంది. ఆ తల్లి ఇక పిల్లల ఆలనాపాలనా, పోషణ, చదివించడం లాంటివి చేస్తూనే ఇంకోవైపు ఉద్యోగాలు చేస్తూ అన్ని బాధ్యతలు ఒంటరిగా మొయ్యాలి. అదే టీనేజ్ లో తల్లులైన ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణం. తల్లి ఇలా కష్టపడుతుంటే ఆ “తండ్రి” ఏం చేస్తుంటాడు? ఇంకో అమ్మాయిలతో Casual Sex చేస్తుంటాడు!!

ఇవన్నీ ఊహాగానాలు కాదు. ఇది ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది గానీ USAలో 1960లలోనే బాగా వ్యాపించింది. అక్కడ దీని ప్రభావం ఎలా ఉందో ఆ దేశం విడుదల చేసే పలు రిపోర్టులు చూస్తే మనకి తెలుస్తుంది.

2014లో U.S. Census Bureau విడుదల చేసిన సర్వే వివరాలు ప్రకారం

  • ప్రస్తుతం అమెరికాలో ఉన్న మొత్తం కుటుంబాలలో 25% పైగా కుటుంబాలు Single Mother Families. అంటే ఆ కుటుంబాలలో తల్లి పిల్లలు మాత్రమే ఉంటారు. [ఆ పిల్లల తండ్రులు అంతా ఏమయ్యారు? 25% కుటుంబాలు అంటే మొత్తం సమాజంలో నాలుగో వంతు కుటుంబాలు తండ్రి లేని కుటుంబాలే!]
  • ఈ సంఖ్య 1960 నుంచి 2014 నాటికి మూడింతలు (3 times) పెరిగింది. [Casual Sex బాగానే పెరిగిందన్నమాట.]
  • మొత్తం దేశంలోని పిల్లల్లో 1/3rd మంది తండ్రి లేకుండానే పెరుగుతున్నారు.
  • ఈ Single Mother Families లో 77% కుటుంబాలు పేదరికంలో బతుకుతున్నాయి. [కారణం? తల్లి ఒక్కదాని సంపాదన మీదే అందరూ బతకాలి కాబట్టి!]
  • ప్రపంచంలోనే Highest Crime Rate ఉన్న అమెరికాలో నమోదయ్యే జువెనైల్ కేసుల్లో 90. 5% మంది పిల్లలు Single Parent Families నుంచి వచ్చినవారే. [ తల్లులు పాపం రోజువారీ సంపాదన కోసం ఉద్యోగాల వెంట తిరుగుతూ పిల్లల మీద సరైన శ్రద్ధ పెట్టలేరు. పెరిగే వయసులో సరైన సంరక్షణ లేకుండా పెరిగే పిల్లలు ఎలా తయారవుతారు మరి? వీరిలో అత్యధిక శాతం మంది డ్రగ్స్ కి అలవాటు పడినవాళ్ళు ఉన్నారు.]

 

ఇవన్నీ వ్యక్తిగత విషయాలా? సామాజిక విషయాలా? Casual Sex వల్ల అందరికంటే ఎక్కువ నష్టపోయేది teenage ఆడపిల్లలు. సెక్స్ అనేది చాలా “Casual” విషయం అనీ, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందే హక్కు అందరికీ ఉందనీ, ఆడా మగా సెక్స్ చేసుకోవడం అంటే కలిసి క్యారం బోర్డు ఆడుకోవడం అంత సింపుల్ విషయమనీ TVలు, సినిమాలు, పాటలు తెగ ప్రచారం చేస్తుంటాయి. అప్పుడప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తూ, శరీరంలో వస్తున్న మార్పులనీ, కొత్త లైంగిక వాంఛలనీ అర్థం చేసుకునే వయసు రాకముందే వీటి ప్రభావానికి లోనవుతారు. ఫలితంగా గర్భం ధరించడానికి కావాల్సిన శారీరక పరిపక్వత పూర్తిగా రాకముందే గర్భవతులు అవుతున్నారు.

ఇది ఒకళ్ళిద్దరు అమ్మాయిల పరిస్థితి కాదు. ఆ దేశంలో ఈ విచ్చలవిడితనం ఎంత బలంగా నాటుకుపోయిందంటే ఆ దేశంలో తల్లులైన ఆడవాళ్ళలో 15% మంది 19 సం|| లోపు అమ్మాయిలే! వీరిలో అత్యధిక శాతం మంది 15 సం|| లోపు వాళ్ళు. అంటే పదో తరగతి చదివే వయసున్న చిన్నపిల్లలు తల్లులై ఇంకొంత మంది పిల్లల్ని కని పెంచుతారు అన్నమాట. వాళ్ళ పోషణ కోసం చదువులని మధ్యలోనే ఆపేసి చిట్టిపొట్టి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారన్నమాట.

అదే రిపోర్టు బయటపెట్టిన ఇంకొన్ని విషయాలు చూడండి.

  • టీనేజ్ తల్లుల్లో కేవలం 1/3rd మంది మాత్రమే తమ High School చదువు పూర్తి చెయ్యగలుగుతున్నారు. [ఇది Women Literacy మీద తీవ్రమైన దెబ్బ. సరిగా చదువు కూడా పూర్తి చెయ్యలేని ఆడవాళ్ళు స్త్రీ పురుష సమానత్వం ఎలా సాధిస్తారు?]
  • టీనేజ్ గర్భాలలో 82% గర్భాల Unplanned గా సంభవిస్తున్నాయి.
  • 10 లో 8 మంది టీనేజ్ తండ్రులు తమ పిల్లల తల్లితో కలిసి ఉండటం లేదు. [అవును మరి, వాళ్లకి ఆ అవసరం లేదు కదా.]

దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఈ Casual Sex సిద్ధాంతం అమ్మాయిల మీద అనంతమైన భారాన్ని మోపి, అబ్బాయిలని పూర్తి స్వేచ్ఛా జీవులని చేస్తుంది. దీన్ని ప్రచారం చేసేవారు “వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం” లాంటి పదాలు వాడి ప్రజలను తప్పు దోవ పట్టిస్తారు. నిజానికి ఇది స్త్రీలకి ద్రోహం చేస్తుంది.

ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. “అసలు పిల్లల్ని కంటే కదా ఈ సమస్యలన్నీ. ఎన్నో సురక్షితమైన Contraceptive పద్ధతులున్నాయి కదా? ఎన్నో అత్యాధునిక అబార్షన్ పద్ధతులున్నాయి కదా? అవన్నీ వాడుకుని Safe గా Casual Sex చేసుకోవచ్చు కదా?”

ఈ ప్రశ్నకి సమాధానం పాఠకులకే వదిలేస్తున్నాను. అమెరికాలో ఈ “Super Safe Contraceptives” సులభంగానే దొరుకుతున్నాయి కదా. అక్కడి జనాలకి Sexual awareness బాగానే ఉంది కదా. అయినా ఆ దేశంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి.? ఆలోచించండి. హేతుబద్ధంగా (Rational) ఆలోచిస్తే అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి.

ఈ సిద్ధాంతానికి ఇంకో వికృతమైన రూపం కూడా ఉంది. Sexually Transmitted Diseases (STDs) – సుఖరోగాలు! ఈ పద్ధతిలో సుఖరోగాలని అదుపు చెయ్యడం అత్యంత కష్టసాధ్యమవుతుంది. అమెరికా ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారు విడుదల చేసిన రిపోర్టులో దీనికి సంబంధించిన వివరాలున్నాయి.

  • S. లో నమోదయిన STD కేసులలో సగంపైన 15-24 సం|| లోపు వాళ్ళే.
  • HIV కేసులలో మగవారిలో 2/3rd మంది 13-19 సం|| వాళ్ళే. [అంత చిన్న వయసులో సుఖరోగాలు!!]

 

అమెరికన్ మీడియా Free Love/Casual Sex ని భుజాల మీదకి ఎత్తుకుని ప్రచారం చేసింది. అక్కడి సినిమాలలో నూటికి 90 శాతం సినిమాల దీన్ని ఎంతో ఆకర్షణీయంగా, సాధారణమైన విషయంగా చూపిస్తాయి. దీన్ని ప్రచారం చేసేవాళ్ళు దీని దుష్పరిణామాలలో ఒక్కదానిని కూడా ముట్టుకోరు. ఎంతసేపూ సమానత్వం, సమాన హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ లాంటి పదాలు వాడుతూ అదేదో గొప్ప విప్లవకరమైన విషయంగా ప్రచారం చేస్తారు. అసమానతలతో నిండిన కుటుంబ వ్యవస్థకి ఇదొక గొప్ప alternative గా చూపిస్తారు. పైపైన చూస్తే నిజమే కాబోలు అనిపించేలా ఉంటుంది వీరి వాదన.

ఇది సమానత్వాన్ని సాధించడానికి ఏ రకంగానూ పనికి రాదు. స్త్రీలు ఎంతో కష్టపడి సాధించుకున్న కాసిన్ని హక్కులని కూడా ఇది హరించి వేస్తుంది. స్త్రీల మెదళ్ళని తప్పుడు భావజాలంతో నింపి తమ నాశనాన్ని తామే తెచ్చుకునేలా చేస్తుంది. కుటుంబ వ్యవస్థలో ఉన్న లోపాలని తీసివేయ్యడం ఎలాగో ఆలోచించాలి గానీ, దానికి alternative పేరుతో మళ్ళీ అసమానతలు సృష్టించుకోవడం తెలివిమాలిన పని.

నేను సాంప్రదాయవాదినా?

           పాఠకులు కొంతమంది నేను పచ్చి సాంప్రదాయవాదాన్నే వినిపించాననీ, నేను సాంప్రదాయవాదిననీ అన్నారు. సరిగ్గా గమనిస్తే పోయిన వ్యాసంలోగానీ ఈ వ్యాసంలో గానీ నేను సాంప్రదాయాల గురించీ గానీ, భారతీయ సంస్కృతి గురించీ గానీ, ఆచారాల గురించీ గానీ ఎక్కడా మాట్లాడలేదు. కేవలం “హేతుబద్ధత” ని ఆధారంగా చేసుకుని ఈ వివరణలు చేసాను. మీకు ఇందులో లోపాలు ఏమైనా కనిపిస్తే సహేతుకంగా ఎత్తి చూపించండి. అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. నా మీద సాంప్రదాయ వాద ముద్ర వేసి Casual Sex లాంటిదాన్ని సమర్ధించుకోవడం కుదరదు.

 

 

ఇది బంగారం కాదు, కాకి బంగారం!

వినోద్ అనంతోజు 

 

       vinod anantoju   ఒక ఫిల్మ్ మేకర్ గా నాకు మణిరత్నం మీద ఆయన సినిమాల మీద ఎంతో గౌరవం ఉంది. “నాయకుడు”, “రోజా”, “బొంబాయి” లాంటి సినిమాలు లెక్క లేనన్ని సార్లు చూసి, వాటిలోని ప్రతి చిన్న అంశాన్ని స్టడీ చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఆయనవి ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులని నిరాశ పరిచినప్పటికీ, నాకు మాత్రం అవన్నీ గొప్పగానే అనిపించాయి. చాలా కాలం తరవాత ఒక “ప్రేమకథా” చిత్రం (ఓకే బంగారం) తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ సినిమా మంచి ఆదరణ పొందడం, అందరూ “Maniratnam is Back” అని అంటూ ఉండడం చూసి చాలా సంతోషం కలిగింది. తీరా సినిమా చూశాక ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది. మణిరత్నం కి ఏమయ్యింది అసలూ?

సినిమా గురించి మాట్లాడుకునేముందు దాని కథ క్లుప్తంగా చూద్దాం. ఆది, తారా వయసులో ఉన్నారు. ఇద్దరికీ పెళ్లి మీద నమ్మకం లేదు. ఒకసారి ఒక రైల్వే స్టేషన్ లో ఒకరినొకరు యాదృచ్చికంగా చూస్తారు. అదే మొదటి సారి చూడటం. ఆది గణపతి వాళ్లింట్లో పేయింగ్ గెస్ట్ గా దిగుతాడు. గణపతి భార్యకి ఆల్జీమర్స్ వ్యాధి ఉంటుంది. గణపతి ఆవిడని చాలా ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటూ ఉంటాడు. కొన్నాళ్ళకి ఆది వాళ్ళ స్నేహితురాలి పెళ్లిలో తారా తారసపడుతుంది. పేర్లు తెలుసుకుంటారు, ఫోన్ నంబర్లు మార్చుకుంటారు. రెండు రోజుల తర్వాత ఇద్దరు కలిసి డేట్ కి వెళ్తారు. మూడో రోజు తారా ఏదో పని మీద అహ్మదాబాద్ వెళ్తుంటే ఆది కూడా వెళ్తాడు. నాలుగోరోజు రాత్రి ట్రైన్ మిస్ అవ్వడంతో ఒక రాత్రి ఒకే గదిలో ఇద్దరూ ఉండాల్సి వస్తుంది. తమని తాము నిగ్రహించుకోగలమో లేదో అని ఇద్దరికీ అనుమానమే. ఎలాగో ఆ రాత్రి ఒక పాట, పాట మధ్యలో కొన్ని కౌగిలింతలు, కొన్ని ముద్దులతో సరిపెడతారు.

తరవాత ఒకరోజుకో రెండ్రోజులకో ఆది “దుశ్శాసనుడిలా మారి తారా బట్టలు చింపేస్తా” అనడం, దానికి ఆ పిల్ల మురిసిపోవడం, తారా హాస్టల్ లోనే వాళ్ళిద్దరూ శారీరిక సంబంధం పెట్టుకోవడం జరిగిపోతాయి. అప్పటికి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు, కలిసి జీవించాలని కోరిక కూడా లేదు. కామ వాంఛ తప్ప. 6 నెలల తరవాత ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వేరే వేరే దేశాలు వెళ్లిపోవాలి. ఈ 6 నెలలు కలిసి గడుపుదాం (live–in) అని ఒప్పందానికి వస్తారు. ఓనర్ (గణపతి) ని ఒప్పించి ఆది ఉండే ఇంట్లోనే ఇద్దరూ ఉండటం మొదలు పెడతారు

ఇక ఇక్కడి నుంచి ఒక ఆరు నెలల పాటు వాళ్ళ “శారీరిక సహజీవనం” సుఖంగానే సాగుతుంది. విడిపోవడానికి ఇంకా పదిరోజులే ఉందనగా బాధలాంటిదేదో కలుగుతుంది. దాన్ని అధిగమించడానికి ఇంకా బలంగా “ఎంజాయ్” చేద్దాం అని డిసైడ్ అవుతారు. కాని ఆ పదిరోజులు చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతుంటారు. గణపతి జబ్బుతో ఉన్న తన భార్య పట్ల చూపించే ప్రేమని ఆది తారాలు గమనిస్తూ ఉంటారు. చివరికి ఒక రోజు గణపతి భార్య కనపడకుండా పోతుంది. ఆవిడని వెతికే సమయంలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అని గ్రహిస్తారు. ఆది తారాని పెళ్లి చేసుకుందాం అని అడుగుతాడు. తారా ఒప్పుకుంటుంది. పెళ్లి చేసుకుంటారు. ఇదీ కథ.

ఈ సినిమా చూసిన చాలా మంది అద్భుతం, మహాద్భుతం అని పొగడడం, కొత్త తరం ప్రేమలను/పెళ్లి సంబంధాలను మణిరత్నం redefine చేశాడని జేజేలు కొట్టడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. బహుశా చూసిన వాళ్ళు సంగీతానికి, సినిమాటోగ్రఫి ప్రతిభకి, నటీనటుల అందానికి ముగ్ధులయ్యుంటారు. ఇలాంటి ఎన్ని హంగులున్నా కథలోని లోపాలు ఎక్కడికి పోతాయి.

అసలు “ప్రేమ కథ” అని ఏ సినిమాని పిలుస్తారు? సినిమాలో ఎక్కడో ఒక చోట “I Love You” అనే పదం ఉంటే అది ప్రేమ కథ అయిపోతుందా? వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయిల కథ అయితే అది ప్రేమ కథ అయిపోతుందా? ఈ సినిమాలో రెండు ముఖ్య పాత్రల్లో ప్రేమ కంటే సెక్సు సంబంధం పెట్టుకోవాలనే వెంపర్లాటే ఎక్కువ కనపడుతుంది.

ఎన్ని అదనపు విషయాలున్నా ఈ సినిమా అంతా పెళ్లి అనే సంబంధం గురించీ, ఆడామగా కలిసుండాలంటే పెళ్లి అవసరమా అనే ప్రశ్న గురించీ ఎక్కువ చర్చిస్తుంది.

సినిమా మొదట్లోనే ఆది, తారాలు ఇద్దరూ పెళ్లి మీద అపనమ్మకం వ్యక్తం చేస్తారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, సినిమాలో ఏ పాత్రమయినా దర్శకుడి ఆలోచనలకి అనుగుణంగా, అతను నిరూపించదలుచుకున్న విషయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బలపరిచే విధంగానే ప్రవర్తిస్తాయి. ఆది, తారాలు పెళ్లిని వ్యతిరేకించడం కూడా అందుకే. దర్శకుడు పెళ్లి అవసరం లేదని నిరూపించడానికి వాళ్ళ చేత అలా చెప్పించి ఉండొచ్చు. లేదా వాళ్ళిద్దరి ఆలోచనలు తప్పు అని కథలో నిరూపించి పెళ్లిని బలపరచవచ్చు. ఏ పాత్ర ఏ రకం భావాలని వ్యక్తం చేసినా దర్శకుడు వాటిలో ఏ భావాలని సమర్థించాడు అనేదే ముఖ్యం.

పెళ్లిని వ్యతిరేకించిన ముఖ్య పాత్రలు, పెళ్ళి విధానానికి alternative గా ఏ విధానాన్ని ప్రతిపాదిస్తున్నాయి? కంటికి అందంగా కనిపించిన అమ్మాయిలతో అబ్బాయిలు, అబ్బాయిలతో అమ్మాయిలూ “ఇష్టపూర్వకంగా” తాత్కాలిక సెక్సు సంబంధాలు పెట్టుకోవడమే వీళ్ళ ప్రతిపాదన. ఇది సహజీవనం కాదు. ఇందులో ఎదుటి వ్యక్తి భావాలతో, అభిప్రాయాలతో, వ్యక్తిత్వంతో సంబంధం లేదు. కేవలం శరీరంతోనే సంబంధం. ప్రేమకసలు స్థానమే లేదు. ఆకర్షణ ఉంటే చాలు. ఎవరు ఎవరితోనైనా ఆకర్షణ ఉన్నన్ని రోజులో, లేక వేరే ఊర్లో పని పడేదాకో కలిసి పడుకోవచ్చు. ఆ తరవాత వేరే ఊరు వెళ్ళాక అక్కడ ఇంకొకరితోనో లేక అనేకమందితోనో సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇదే మనకి వాళ్ళు ప్రతిపాదిస్తున్న “శారీరిక సహజీవనాల” పధ్ధతి. దీనినే చాలా మంది ప్రేక్షకులు, విశ్లేషకులు “New-Age Relationships” కి ఈ సినిమా పునాది వేస్తోంది అని, పాత సంప్రదాయాలని బద్దలు కొడుతోందనీ అంటున్నారు.

                మొదట ఆలోచించవలసిన విషయం – పెళ్లి ఎందుకు? పెళ్ళిలో జరిగేది ఏమిటి? ఒకటి – అప్పటి దాక విడి విడి గా జీవిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ క్షణం నుంచి కలిసి ఒక కుటుంబంగా జీవించడం మొదలవుతుంది. రెండు – వాళ్ళిద్దరూ ఒక కుటుంబంగా అయ్యారు అని చేసే సాంఘిక ప్రకటన. పెళ్లి ఐదు రోజులు జరిగినా, ఒక గంటే జరిగినా దాని సారాంశంలో ఏ తేడా ఉండదు. అది ఏ మత ఆచారం ప్రకారం జరిగినదీ, లేక ఏ ఆచారమూ లేకుండా జరిగినదా అనేది అప్రధానం. ఆ ఇద్దరూ వ్యక్తులూ ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా ఎంచుకుని కలిసి ఉండడమే ప్రధానమైన విషయం. వాళ్ళిద్దరూ పెళ్లి అనే కార్యక్రమం లేకపోయినా, కలిసి జీవిస్తూ, కష్టసుఖాల్లో బాధ్యతల్లో భాగం పంచుకుంటూ ఉంటే అది పెళ్ళే. పెళ్లి అనే పదం “కలిసి ఉండటం అనే సాంఘిక సంబంధం” మొత్తాన్నీ వివరిస్తుంది. ప్రస్తుతం అమలు లో ఉన్న “పెళ్లి” వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. అది ఆడా మగల మధ్య అసమానతలు పెంచేదిగా ఉంది. పైగా వ్యక్తుల ఇష్టాయిష్టాల కంటే డబ్బు, ఆస్తి, కులం, మతాలే “పెళ్లి”లో ఎక్కువ పాత్ర పోషిస్తున్నాయి. నిజమే. ఈ కారణాల చేత పెళ్లిని వ్యతిరేకించవచ్చు. కాని ఆ వాదం ఈ సినిమాకి పొసగదు. ఎందుకంటే ఈ సినిమాలో ఆ లోపాలలో ఒక్కదాన్ని కూడా ముట్టుకోవడం జరగలేదు.

పైన చెప్పిన దాంట్లో, పెళ్లి అనే కార్యక్రమం లేకుండా కలిసి ఉండటం అంటే ఓకే బంగారం సినిమాలో చెప్పిన “శారీరిక సహజీవనం” అని అనుకోకూడదు. ఒక ఆడ మగా ఎటువంటి ప్రలొభాలూ (ఆస్తి, కులం, మతం…) లేకుండా, పూర్తి వివేచనతో, ఇష్టపూర్వకంగా ఒకరినొకరు జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం, వారితోనే కలిసి ఉండటం సరైన సంబంధం అవుతుంది. ఒకసారి ఎంచుకున్నాక కొంతకాలానికి ఎదుటి వ్యక్తి కలిసి ఉండటానికి వీలుపడనంతలా మారిపోతే, ఇబ్బంది కలిగిస్తుంటే ఆ వ్యక్తి నుంచి విడిపోయే హక్కు మొదటి వ్యక్తి కి ఎప్పుడూ ఉంటుంది. అంటే దీని అర్థం, తరవాత విడిపోయే స్వేచ్ఛ ఉంది కదా అని ఇప్పుడు ఏమీ ఆలోచించకుండా సంబంధం పెట్టుకోవడం కాదు. అది తిరుగుబోతుతనం అవుతుంది. ఓకే బంగారంలో ఆది తారాలు సరిగ్గా ఇదే రకానికి చెందుతారు.

ఇందులో వాళ్ళిద్దరూ ఆరు నెలలలో వేరే దేశాలకు వెళ్లిపోతారని తెలిసే ఈ ఆరు నెలలు తాత్కాలికంగా ఒకరితో ఒకరు పడుకుని సహజీవనం చేద్దాం అని నిర్ణయించుకుంటారు. మణిరత్నం మీద ఎంత మంచి దృష్టితో చూసినా ఈ సహజీవనంలో ప్రేమ ఎలా కనపడుతుంది?

bangar1

అసలు ఇంతకీ మణిరత్నం దేన్ని సమర్థించాడు.? కొందరు మణిరత్నం పెళ్లిని వ్యతిరేకించాడు అనీ, కొందరు పెళ్లినే సమర్థించాడు అనీ, ఇంకొందరు ‘సమర్థించలేదు వ్యతిరేకించలేదు. కేవలం ప్రస్తుత యువత పరిస్థితి ని ఉన్నది ఉన్నట్టు చూపించాడని’ అర్థాలు చెప్తున్నారు.

కేవలం ఉన్నది ఉన్నట్టు చూపించాడు అనేది అవాస్తవం. సినిమా నిడివిలో నూటికి ఎనభై శాతం ఆ ఇద్దరి కామ కలాపాలనీ, చిలిపి సంభాషణలనీ అందమైన కెమెరా యాంగిల్స్ తో, ఆకర్షణీయమైన సంగీతంతో ఆకాశానికి ఎత్తి చూపించాడు. ఆది తారాల మీద ప్రేక్షకులకి సదభిప్రాయం కలిగించే ప్రయత్నమే ఇది. ఇది సమర్థించడమే.

విచ్చలవిడి ప్రేమలని వ్యతిరేకించాడు, పెళ్లినే సమర్థించాడు అనడం కూడా సరైనది కాదు. ఎందుకంటే డైరెక్టర్ ఖచ్చితంగా ఆది, తారాల పక్షమే నిలబడ్డాడు కాబట్టి. వాళ్ళిద్దరి మధ్య జరిగే రొమాన్స్ ని చూపించడం లో ప్రదర్శించిన ఉత్సాహం వాళ్ళ ఆలోచనలని తప్పైనవి గా చూపించడం లో ప్రదర్శించలేదు. పైగా ఆది తారాలకి ఇబ్బంది కలిగే ఒక్క సన్నివేశం కూడా కథలో రాకుండా జాగ్రత్త పడ్డాడు.

“మేమిద్దరం మీ ఇంట్లో ఒకే గదిలో ఉంటాం” అని ఆది ఇంటి ఓనర్ గణపతి ని అడుగుతాడు. “పెళ్లి చేసుకున్నారా?” అని అడుగుతాడు గణపతి. “లేదంకుల్. మాకు పెళ్లి మీద నమ్మకం లేదు. కొన్ని నెలల్లో ఆది అమెరికా వెళ్ళిపోతాడు, నేను పారిస్ వెళ్ళిపోతాను. అంతవరకూ కలిసి ఉందాం అనుకుంటున్నాం.” అని చెప్తుంది తారా. గణపతి ససేమిరా కుదరదంటాడు. కొన్ని మంచి ప్రశ్నలు వేస్తాడు. వాటిలో వేటికీ సమాధానం చెప్పకుండా “అంకుల్ ఒకసారి బయటికి రండి, convince చేస్తాను” అని చెప్పి ఆది గణపతిని బయటికి తీసుకెళతాడు. ఇంతలో తారా మంచి పాట ఒకటి పాడటం, దానికి గణపతి ముగ్ధుడైపోవడం, వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోవడం జరుగుతాయి. గణపతి వేసిన ఏ ప్రశ్నకీ ఎవరూ సూటిగా సమాధానం చెప్పరు. అలా చెప్పించాల్సి వస్తే ఆది తారా పాత్రల పట్ల ప్రేక్షకులకి కలగాల్సిన ఇష్టం తగ్గుతుందని దర్శకుడు సీన్ ని సంగీతం వైపుకి divert చేసాడు. పైగా గణపతి మీద “Old Fashioned” అని ఒక సెటైర్ కూడా వేయించాడు దర్శకుడు.

ఇలాంటిదే ఇంకో సందర్భం. ఆది తారాలు ఒకే గదిలో ఉంటున్న సంగతి ఆది వాళ్ళ వదిన కనిపెట్టేస్తుంది. “ఇదేం పద్దతిగా లేదు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంటే చెప్పండి. నేను ముందుండి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను.” అని చెప్తుంది. దానికి తారా “పెళ్లి అనే సర్టిఫికేట్ ఉంటే ఇదంతా రైట్ అయిపోతుందా?” అని ఎదురు ప్రశ్న వేస్తుంది గానీ సరైన సమాధానం చెప్పదు. అప్పుడు వదిన “పోనీ మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా?” అని అడిగితే సమాధానం ఏం చెప్తుంది? “కలిసి ఉండటానికి ప్రేమ అవసరమా? సెక్స్ కావాలనే కోరిక సరిపోదా?” అని ఎదురు ప్రశ్న వేస్తుందా? ఎందుకంటే వాళ్ళిద్దరికీ మధ్య అప్పటికి ప్రేమ లేదు కదా. శారీరిక ఆకర్షణ తప్ప. ఆరు నేలలయ్యాక విడిపోవడానికే సిద్ధంగా ఉన్నారు కదా. తారాని ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో యిరికించకుండా సీన్ అక్కడితో కట్ చేసేశాడు దర్శకుడు.

ఇలాంటి సందర్భాలు అనేకం. నిజంగా విచ్చలవిడి సంబంధాలని మణిరత్నం వ్యతిరేకించాలి అనుకుని ఉంటే, ఆ సంబంధాల వల్ల కలిగే నష్టాలని కొన్నిటినైనా చూపించేవాడు. సినిమా మధ్యలో తారా ఆదిని గర్భనిర్ధారణ పరీక్ష కోసం అని అబద్దం చెప్పి ఒక గైనకాలజీ హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఆదిగాడు తెగ టెన్షన్ పడతాడు. అవును మరి, వాడు “తండ్రి” అనే బాధ్యతని స్వీకరించడానికి సిద్ధపడే ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడా? టెన్షన్ పడటం సహజమే మరి! దర్శకుడు దాన్ని ఒక హాస్య సన్నివేశం గా చూపించాడు. వ్యతిరేకించే ఉద్దేశం ఉంటే అక్కడ నిజంగానే ఆ అమ్మాయికి గర్భం వచ్చినట్టు చూపించి, అది తెలుసుకున్న ఆది గాడు చడీచప్పుడూ లేకుండా ఉడాయించినట్టు చూపించవచ్చు. అప్పుడు తారా అవతలి మనిషి వ్యక్తిత్వం తెలుసుకోకుండా, ప్రేమ కలగకుండా సెక్సు సంబంధం పెట్టుకుని తప్పు చేశాను అని పశ్చాత్తాప పడటం చూపించాలి. ఇలా కాకపొతే ఇంకోలాగా, ఇక్కడ కాకపొతే ఇంకో చోట, ఎక్కడో ఒక చోట వాళ్ళ ఆలోచనల లోని తప్పుని చూపించాలి. సినిమా మొత్తంలో ఒక్క చోట కూడా ఇలాంటి సందర్భం కనపడదు. దర్శకుడు కావాలని ఆది తారాలను రక్షిస్తూ వచ్చాడు.

“మరి చివరలో పెళ్లి చేసుకున్నట్టు చూపించాడు కదా?” అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడే దర్శకుడు తన కథ ని తనే అపహాస్యం చేసుకున్నాడు అనిపిస్తుంది. కథలో గణపతి జబ్బుతో ఉన్న తన భార్య ని ఎంతో ప్రేమతో బాధ్యతతో చూసుకుంటూ ఉంటాడు. పెళ్లి చేసుకున్న భార్యలని భర్తలందరూ అలాగే చూసుకుంటారు అని చెప్పడానికి లేదు. కానీ స్త్రీని ప్రేమించే మగవాడు అయితే ఖచ్చితంగా అంతే ఆప్యాయతతో చూసుకుంటాడు. కాబట్టి గణపతి చూపించే ఆ ఆదరణకి కారణం ఖచ్చితంగా ప్రేమే కానీ పెళ్లి అనే సంబంధం మాత్రమే కాదు. పెళ్లిని వ్యతిరేకించిన హీరో హీరోయిన్లు, గణపతి తన భార్య పట్ల చూపించే ప్రేమని చూసి పరివర్తన చెందడాన్ని చూపించాలి అనుకున్నాడు దర్శకుడు. ఆ పరివర్తన అవతలి వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించడం దిశగా సాగాలి గానీ, పెళ్లి వైపు కి కాదు. వాళ్ళు అప్పటిదాకా చెప్పిన సిద్ధాంతం ప్రకారమే కలిసి ఉండటానికి పెళ్లి అవసరం లేదు, ప్రేమ చాలు. ఆ ప్రేమ ఎలాగూ వాళ్ళిద్దరి మధ్య “సినిమా చివర”లో కలిగింది కాబట్టి ఇక పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వేరే దేశాలు వెళ్లి అక్కడ పని పూర్తి చేసుకుని, తిరిగి ఒకే దగ్గర కలిసి ఉండొచ్చు కదా, పెళ్లి లేకుండా? ఈ ప్రశ్నకి సినిమాలో ఎక్కడా సమాధానం లేదు. దర్శకుడికి ఈ ఆలోచన రాక వదిలేసి ఉండాలి. లేదా వచ్చినా సమాధానం చెప్పడం ఇష్టం లేక వదిలేసి ఉండాలి.

నాకు మాత్రం అది ఇలా అర్థమయ్యింది. క్లైమాక్స్ లో “నువ్ పారిస్ పో, ఎక్కడికైనా పో. నన్ను పెళ్లి చేసుకుని పో!” అని ఆది తారాని అడగుతాడు. నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి ఉంటే అలా అడగాల్సిన అవసరం ఉండదు. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా జీవితం నీతోనే పంచుకోవాలి అనుకుంటున్నాను. నువ్ పారిస్ నుంచి తిరిగి వచ్చేదాకా ఎదురు చూస్తాను. వెళ్లి చక్కగా చదువుకుని రా” అని కూడా చెప్పొచ్చు. కాని పెళ్లి చేసుకోమని అడగడం లో తమ ప్రేమ మీద అపనమ్మకమే కనపడింది నాకు. తారా పారిస్ లో ఉన్నన్ని రొజులూ, ఇక్కడ ఆదితో చేసినట్టే, అక్కడ తాత్కాలికంగా ఇంకొకడితో సహజీవనం చేస్తుందేమో అనే భయంతోనే ఆది అలా అడిగి ఉంటాడు అనిపించింది. ఇంత వికారంగా రాస్తున్నందుకు పాఠకులు నన్ను క్షమించాలి. ఆది తారాల పాత్రలని అంతే వికారంగా, ఆలోచనా రహితంగా, అత్మగౌరవం లేకుండా తయారు చేశాడు దర్శకుడు మరి.

ఇక్కడ నిరసించాల్సిన అసలు విషయం ఏమిటంటే, దర్శకుడు ఈ “శారీరిక సహజీవనాలని” ఎక్కడా విమర్శించలేదు సరికదా వీలైనప్పుడల్లా ప్రోత్సహించాడు. “ముందు అభిప్రాయాలతో, భావాలతో, వ్యక్తిత్వాలతో, ప్రేమతో సంబంధం లేకుండా ఎవరితో పడితే వారితో సంబంధం పెట్టుకోవడం. తరవాత అది ప్రేమగా టర్న్ అయితే పెళ్లి చేసుకోవడం…” ఇలా ఉంది దర్శకుల వారి తీరు. ఒకవేళ ఒక ఆరు నెలలు సహజీవనం నెరిపిన తరవాత ప్రేమ కలగకపోతే? “పోయేదేముంది. కావలిసినంత ఎంజాయ్మెంట్ దొరికిందిగా, ఇంకొకరిని వెతుక్కుంటాం” అని చెప్తారా? ఒకవేళ గర్భాలు వస్తే? “ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయ్యింది. అబార్షన్ చేయించుకుంటాం. సింపుల్ !” అని చెప్తారా? ఇంత దిక్కుమాలిన ఆలోచనలు మణిరత్నం నుంచి వస్తాయని ఎప్పుడూ ఉహించలేదు.

ఈ సినిమా ప్రేమకీ, సెక్స్ కోరికకీ తేడా మసకబరిచేది గా ఉంది. యుక్తవయసులో ఉండి ఏది ప్రేమో, ఏది మోహమో గ్రహించలేని స్థితిలో ఉన్న యువతీయువకుల మీద ఈ సినిమా చాలా చెడ్డ ప్రభావం చూపిస్తుంది. దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకడిగా చెప్పుకోబడే ఒక దర్శకుడికి తన కథ పట్ల, ప్రేక్షకుల పట్ల ఇంత కంటే చాలా నిబద్ధత అవసరం.

*

మై ఛాయిస్ – ఎందుకోసం?

 వినోద్ అనంతోజు

 

vinodదీపికా పదుకునే నటించిన ఒక వీడియో మీద గత కొన్ని రోజులుగా చాలా చర్చ జరుగుతోంది. “My Choice – Deepika on Women Empowerment” అనే పేరు ఉన్న ఆ వీడియో లో దీపికా చెప్పిన అభిప్రాయాలకి చాలా గట్టి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లింక్ లో ఆ వీడియో చూడొచ్చు.

https://youtu.be/KtPv7IEhWRA

ఇది విడుదలైన వెంటనే అన్ని వైపుల నుంచీ దాడి మొదలయ్యింది. రెండో రోజుకల్లా దానికి సమాధానంగా “Male Versions of My Choice” వీడియోలు తయారు చేసి అప్ లోడ్ చేసారు. సాధారణ జనం దీన్ని మగవాళ్ళని కించపరిచినట్టుగా అర్థం చేసుకుని వెంటనే ఎదురు దాడి చేస్తున్నారు. ఇది కేవలం ఆడా, మగ లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.

ఇక్కడ ఒక విషయం లోతుగా ఆలోచించాలి. Vogue లాంటి ఒక మల్టీ నేషనల్, ఫాషన్ బ్రాండ్ ఈ వీడియోని ఎందుకు నిర్మించింది? ఏ లాభం లేకుండా Women Empowerment కోసమే చేసారు అనే భ్రమలు ఉంటే వదిలించుకోవాలి. దీని వెనుక ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది వ్యాపార లాభం.

vogue3

ఉదాహరణ కి, ఇండియాలో సెక్స్ గురించి లేదా స్త్రీల ఋతుస్రావం గురించి మాములు స్థాయి గొంతుతో మాట్లాడడానికి కూడా జనం ఆలోచిస్తారు. అలాంటి ఒక rigid culture ఉన్న దేశంలో Sanitary Napkins లాభసాటిగా ఎలా అమ్మాలి? ముందు ఇక్కడి కల్చర్ లో ఆ విషయం పట్ల “అది ఒక సాధారణమైన విషయమే” అనే అభిప్రాయ మార్పు తీసుకురావాలి. ఈ ప్రచారం కోసం T.V. రేడియో, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు లాంటి వాటిని ఉపయోగించుకుంటారు. ఈ మధ్య T.V. లో ప్రసారమయ్యే advertisements లో చాలా ఎక్కువ మోతాదులో Whisper, Carefree యాడ్స్ ప్రసారం అవుతుండడం మనం గమనించవచ్చు. రోడ్ల పక్కన అంతంత పెద్ద హోర్డింగుల మీద ఇంతింత చిన్న చెడ్డీలు వేసుకుని అమ్మాయిలూ, అబ్బాయిలు “Jockey or Nothing” అని చెప్పే పోస్టర్లు కనపడతాయి. అది కూడా ఇందుకే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యాడ్స్ లక్ష్యం ఒక్కటే. జనం ఆ Napkins / Underwears  గురించి మాట్లాడుకొనేటప్పుడు ఉండే ఇబ్బందికరమైన భావం పోవాలి. ఇది వాళ్ళ సేల్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది.

అలాగే Vogue Magazine సేల్స్ ఇండియాలో పెరగాలంటే దానికి అనుగుణమైన Fashions, Lifestyle నీ ఇక్కడి వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా ప్రచారం జరగాలి. ఈ వీడియో మహిళా సాధికారికత అనే ముసుగులో చాలా బలంగా వాటినే ప్రచారం చేస్తోంది.

ఇందులో పొట్ట నింపుకోవడం కోసం వ్యభిచారం చెయ్యాల్సిన దౌర్భాగ్యంలో ఉన్న మహిళల గురించి లేదు, ఒక వైపు సైన్సు పరుగులు పెడుతున్నా సతీసహగమనాల వల్ల ఆహుతైపోతున్న మహిళల గురించి లేదు. చదువుకీ, ఉద్యోగాలకీ దూరంగా వంటిళ్ళలో ఉడుకుతున్న ఆడవాళ్ళ గురించి లేదు. మగవాళ్ళతో సమానంగా పని చేస్తూ కూడా పేదరికంతో అల్లాడుతున్న స్త్రీల గురించిలేదు, అత్యాచారాల గురించి లేదు, వివక్ష గురించి లేదు. మరి ఏముంది ఈ వీడియోలో?

Vogue1

స్త్రీల Sexuality గురించీ, వాళ్ళు వేసుకునే బట్టల విషయంలో వారి కుండే స్వేచ్ఛ గురించీ తప్ప ఏమీ లేదు. ఈ రెండేనా మహిళా సాధికారికత – Women Empowerment – అంటే? కాదు. మరి ఈ విషయం ఆ వీడియో నిర్మించిన వాళ్లకి తెలియదంటారా? తెలియదనుకోవడం అమాయకత్వమే! తెలిసే చేసారు. ఎందుకంటే Vogue ఆ రెండు విషయాలకే సంబంధించిన మ్యాగజైన్ కనుక ! అలాంటి మ్యాగజైనులు కొని చదివే వర్గాలకి (విలాసాల కోసం డబ్బు ఖర్చు చెయ్యగలిగే వాళ్లకి) ఇలాంటి మహిళా సాధికారికతే వినడానికి రుచికరంగా ఉంటుంది కనుక !

మరి మిగతా వాళ్ళు? (చదువురాని వారు / పేదలు)

మిగతావాళ్ళు గంగలో కలిసిపోయినా మాకనవసరం !

దీనినే “బూర్జువా ఫెమినిజం” అంటారని ఈ మధ్యే తెలిసింది.

అసలు ఈ “Fashion & Lifestyle” Magazines లో ఏముంటుందో అని నాలుగైదు మ్యాగాజైనులు తిరగేశాను – Vogue, Femina, GQ, Elle, Cosmopolitan – లాంటివి. Sex, Fashion, Food, Beauty తప్ప ఇంకో ముక్క ఉంటే ఒట్టు. వాటిలో ఉన్న శీర్షికలు చాలా వరకు ఇలా ఉన్నాయి…

“అందమైన ఆకారం కోసం ఏం తినాలి?” (ఆరోగ్యం కోసం కాదు తినడం!!)

పార్టీలో “హాట్” గా కనపడాలంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలి? (ఎందుకు కనపడాలి హాట్ గా?)

“మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం క్రీం పూసుకోవాలి?

“సన్నగా ఉండడం వల్ల సెక్స్ సుఖాలు !!”

ఇవి కేవలం కవర్ పేజీలు మాత్రమే. లోపలున్న దుర్మార్గాలన్నీ చెప్పడం కష్టం. ఆడవాళ్ళని వాళ్ళ కొలతలని బట్టి, వాళ్ళ శరీర ఛాయ ని బట్టి కొలతలు వేసే ఈ Vogue మ్యాగజైన్ Women Empowerment గురించి మాట్లాడుతోంది !! ఈ సదరు బూర్జువా ఫెమినిస్టులు మగవాడు ఆడవాళ్ళని Objectify చేసి చూడడాన్ని వ్యతిరేకిస్తూ, ఆడవాళ్ళు తమని తాము  “అందమైన” objects గా ప్రదర్శించుకోవడాన్ని ప్రోత్సహిస్తారు. దీపిక పదుకొనే నటించిన ఈ వీడియో నే ఇందుకు ఉదాహరణ. ఈ వీడియోలో సన్నగా తెల్లగా Well-Polished గా ఉన్న ఆడవాళ్ళనే చూపించడం గమనించవచ్చు. ఒకరిద్దరు మామూలు స్త్రీలని చూపించినప్పటికీ అది తప్పక తీసుకొచ్చి అతికించినట్టు తెలిసిపోతోంది. వీరికి ఆ కొలతలు పాటించని మామూలు స్త్రీలు, ఫాషన్ లకి దూరం గా బతికే స్త్రీలు స్త్రీలుగా కనపడరు.

maxresdefault (1)

దీపిక “Its My Choice”  అని చెప్తూ బ్రా హుక్ తీయడాన్ని చూస్తే మహిళా సాధికారికత కంటే, మహిళా సాధికారికత పేరుతో చేస్తున్న మోసం ఎక్కువ కనిపించింది.

ఈ Fashion / Cosmetic కంపెనీల వ్యాపారాలన్నీ మనుషులకు “అందం” అనే దాని మీద ఉన్న భ్రమల చుట్టూనే జరుగుతాయి. “అందం” మీద భ్రమలన్నీ వదిలిపోయి మహిళలు నిజం గా సాధికారికత వైపు నడిస్తే, అది వీళ్ళ లాభాలకి దెబ్బ. అలాగని పెరిగిపోతున్న మహిళా చైతన్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం కుదరదు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి కార్పొరేట్ కంపెనీ లు కనిపెట్టిన మార్గం – అసలైన ఫెమినిజాన్ని హైజాక్ చేసి పక్కదారి పట్టించడం. “అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని” హైజాక్ చేసి “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” గా మార్చేసారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆ రోజున ఫాషన్ షో లు జరుగుతున్నాయి. రాను రాను “మహిళా సాధికారికత” అనే పదానికి అర్థం “చదువుకున్న మహిళల సాధికారికత” గా మార్చేశారు.

vogue5

ఈ సందర్భంగా నాకు బొలివియా దేశపు గని కార్మికురాలు దొమితిలా చుంగారా మెక్సికో అంతర్జాతీయ మహిళా సభలో చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.

ఆ సభలలో ఎక్కువ భాగం ఉపన్యాసాలు ఇలా సాగాయి “మగవాళ్ళకి/మొగుళ్ళకి ఉండే సౌకర్యాలన్నీ ఆడవాళ్ళకీ ఉండాలి. మగవాళ్లు తిరుగుతారు, తాగుతారు. మనమూ తాగాలి, తిరగాలి. వాళ్ళు ఎంతమంది ప్రియురాళ్ళతో సంబంధం పెట్టుకుంటారో మనకీ అంతమందితో సంబంధం పెట్టుకునే హక్కు కావాలి….”

ఇవన్నీ వింటున్న దొమితిలా ఇలా చెప్పబోయింది. “మా పోరాటం మా భర్తల మీద మాత్రమే కాదు. మిమ్మల్ని పేదలు గా చేసిన ప్రభుత్వం మీద, పోలీసుల మీద, వ్యవస్థ మీద.”

Vogue2అక్కడ ఉన్నవాళ్లు “ఈ సభలో కేవలం ఆడవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడాలి. పోలీసులు, పేదరికం లాంటివి కాదు!!” అని అడ్డు తగిలారు.

అప్పుడు దొమితిలా అక్కడకి వక్తలు గా విచ్చేసిన ధనవంతులైన మహిళామణులని ఉద్దేశించి ఈ విధంగా చెప్పింది. “సరే ఆడవాళ్ళ గురించి మాత్రమే చెబుతాను. నాకూ నా పిల్లలకూ ఒంటి నిండా బట్టలు కూడా ఉండవు. మీరు తళ తళ మెరిసే బట్టలతో, నగలతో ఉన్నారు. మా కుటుంబమంతా ఒక చిన్న అద్దె గదిలో ఉంటాము. మీ ఇళ్ళలో పది గదులు ఉంటాయి. రోజుకి 16 గంటలు పని చేస్తాము. మాకు కడుపు నిండా తిండి లేదు. నీళ్ళు లేవు. స్నానాల గదులు లేవు. మా పిల్లలకు చదువులు లేవు. మీరు కార్ల లో తిరుగుతారు. ఏ పని కైనా నౌకర్లు, డ్రైవర్లు ఉంటారు. మనిద్దరం ఆడవాళ్లమే మరి మీకూ మాకూ సమానత్వం ఎక్కడుంది? మా సమస్యలు మీకు ఎక్కడున్నాయి? మా భర్తలు కూడా పెత్తనం చేస్తారు. మేమూ పోట్లాడతాము. అయినా దానికంటే కూడా మా పేదరికమే మా అసలైన సమస్య. మీరూ మేమూ ఆడవాళ్లమే. కానీ అందరు ఆడవాళ్ళు ఒక్కటి కాదు.”

మహిళలలోనే ఉన్న భిన్న వర్గాలనీ, వాటి మధ్య ఉన్న  అంతరాలనీ, వైరుధ్యాలనీ విస్మరించి, అందరు మహిళలని ఒకే గాటన కట్టి చూసే ఫెమినిజం పెద్ద బూటకం.

ఈ వీడియో తీసినందుకు కేవలం దీపికాను తిట్టినంత మాత్రాన, ఆడవాళ్ళనీ, ఫెమినిజాన్నీ విమర్శించినంత మాత్రాన ఏ ఉపయోగమూ ఉండదు. ఇలాంటి వీడియోలు, పుస్తకాలు, అభిప్రాయాలు ఇంకా చాలానే వస్తాయి. వీటన్నిటి వెనక ఉన్న మోసాన్ని గ్రహించకపోతే మహిళా సాధికారిక ఉద్యమం చాలా నష్టపోవాల్సి ఉంటుంది.

 ~

Interstellar: మనిషికీ సైన్సుకీ మధ్య…

imagesODLF8DC7

Interstellar సినిమా రెండో సారి చూశాను మొదటిసారి చూసినప్పుడు అర్థం కాని విషయాలు రెండోసారికైనా అర్థమవుతాయని ఆశతో వెళ్లాను. కొంత నయం. ఇంకో రెండు సార్లు చూస్తే అర్థమయిపోతుంది. చాలా రోజుల తర్వాత నాలో సైన్స్ జిజ్ఞాస మళ్ళీ ఊపిరి పోసుకుంది. ఈ వ్యాసంలో ఆ సినిమాలోని సైన్స్ ని నేను వివరించబోవడంలేదు. కాని కొన్ని ముఖ్యమయిన విషయాలు చర్చించుకోవడానికి ఆ సినిమా గొప్ప ఉదాహరణ.

క్లుప్తంగా Interstellar కథ ఇది:

కొన్ని దశాబ్దాల తర్వాత భూమి ఇక మనిషిని తట్టుకోలేని రోజులవి. మానవ జాతి అంతరించిపోవస్తున్న కాలం అది. ఇసుక తుఫానుల వల్ల, పంటలు పండకపోవడం వల్ల, ఆహార కొరత వల్ల జనాభా క్షీణిoచిపోతూ ఉంటుంది. కూపర్ అనే రైతు (ex-NASA Aircraft Pilot), అతని కూతురు కొన్ని విచిత్ర సంఘటనల ద్వారా, అప్పటికే మూతపడిపోయింది అనుకున్న NASA రీసెర్చ్ సెంటర్ ఒకదాని లోకి వచ్చి పడతారు. అక్కడి ముసలి ప్రొఫెసర్ కూపర్ కి మానవ జాతి అంతరించిపోబోతోంది అని వివరించి, అంతరిక్షంలో సుదూరాన ఉన్న కొన్ని గ్రహాల మీదకి వెళ్లి, వాటిలో ఏది మానవుల మనుగడకి అనువైనదో కనుక్కుని రావడానికి ఒప్పిస్తాడు. కూపర్ ఇంకో ముగ్గురు మనుషులూ, ఒక రోబోట్ తో కలిసి ఈ అన్వేషణ కి బయల్దేరతాడు. మనకి తెలిసిన సైన్స్ కి అవతలి చివర ఉన్న ఎన్నో వింతలూ, సమస్యలూ దారిలో ఎదుర్కొంటూ చివరికి ఎం చేశాడా అన్నదే సినిమా.

ఇదేదో మాములు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకోవద్దు. ఇందులో మానవ సంబంధాలని అత్యద్భుతంగా చిత్రించాడు నోలాన్. Warm Holes, Black Holes, Time Dilation లాంటి ఎన్నో క్లిష్టమైన అంశాలు ఇందులో ఉన్నప్పటికీ హ్యూమన్ ఎలిమెంట్ ని ఎక్కడ వదలకుండా చాలా చక్కగా తీశాడు. అన్నింటికంటే మించి మానవ జాతి భౌతిక శాస్త్రం(Physics) లో ఇప్పటి వరకూ సాధించిన అభివృద్ధికి ఈ సినిమా దృశ్య రూపం. అంతేకాక మనం ఇంకా ఏమేమి తెలుసుకోవాలి అనుకుంటున్నామో అవి కూడా ఊహామాత్రంగా చూపిస్తుంది. శాస్త్ర అభివృద్ధి లో, లేదా ఇంకా విస్తృత స్థాయిలో చెప్పాలంటే, మానవాభివృద్ధి లో కళ పాత్ర ఏమిటి అనే చర్చ మన ముందుకు పెడుతుంది ఈ సినిమా.

మనిషి ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. ప్రతి భౌతిక సంఘటన, ప్రతి భౌతిక వస్తువూ మనిషి మెదడులో ఏదో ఒక చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ చైతన్యం ఆధారంగానే మనిషి ప్రకృతిని, సమాజాన్ని అర్థం చేసుకుంటాడు. మనిషి ప్రపంచాన్ని ఆకళింపు చేసుకునే ఈ క్రమంలో అనేక చైతన్య రూపాలు పుడతాయి. వాటిలో కళ ఒకటి. ఉదాహరణకి వేట ఒక శాస్త్రం. ఆదిమ మానవుడు వేటలో ప్రావీణ్యం తెచ్చుకోడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. వేటలోని మెళకువలను, సూత్రాలను అనుభవాల ద్వారానే అతను నేర్చుకున్నాడు. నిజానికి ఏ శాస్త్రానికైనా పునాది మానవానుభావమే. అలాంటి అనుభవాలు, అనుభూతులు, ఆవేశాలు, భావాలు మొదలైనవి గుంపులోని మిగతా సభ్యులతో సంజ్ఞల ద్వారా, భాష ద్వారా, గోడల మీద బొమ్మల వెయ్యటం ద్వారా పంచుకున్నాడు. కాలక్రమేణా ఇవి కొన్ని నిర్దిష్ట రూపాలు తీసుకున్నాయి. అలా పుట్టినవే నేడు మనం చూస్తున్న అనేక కళారూపాలు.

సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికీ ప్రత్యేకమైన అనుభవాలు కొన్ని ఉంటాయి, వాటి వల్ల కలిగిన ప్రత్యేకమైన చైతన్యం కూడా కొంత ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక చైతన్యాల నుంచే సమాజ చైతన్యం (Social Consciousness) పుడుతుంది. ఇక్కడ సమాజ చైతన్యం అంటే ఆ సమాజం తనని తానూ, తన చుట్టూ ఉన్న ప్రకృతినీ అర్థం చేసుకునే క్రమమే. ఇది ఎప్పుడూ ఆ సమాజంలో చలామణి అవుతున్న భౌతిక పరిస్థితులు, ఉత్పత్తి సంబంధాలు, మానవ సంబంధాలకి లోబడి ఉంటుంది. ఒక తరం తన అనుభవాల ద్వారా పొందిన చైతన్యాన్ని తన తరువాతి తరానికి సమగ్రంగా అందించినప్పుడే రెండవ తరం చైతన్య స్థాయి మొదటి దానికంటే ఉన్నతంగా ఉంటుంది, పురోగతి సాధ్యపడుతుంది. ఈ అవసరాన్ని కళలు చాలా సమర్ధవంతంగా తీరుస్తాయి. సులువుగా చెప్పాలంటే సమాజంలో అంతర్భాగమైన రకరకాల మనుషుల యొక్క ప్రత్యేక చైతన్యాలని తీసుకుని సమాజం మొత్తానికి సమానంగా పంచిపెట్టి, ఒక నిర్దిష్టమైన సమాజ చైతన్యం రూపొందేలా చెయ్యడం కళ పని. మనిషి ప్రపంచాన్ని అవగతం చేసుకోవడానికి కళ ఒక సాధనం.

our-legend-of-cinema-christopher-nolan-1007037965

నిప్పు కనిపెట్టడం ప్రకృతి పై మానవుడు సాధించిన మొదటి విజయం. బండి చక్రమొక విప్లవం. భాషలకి లిపి తయారు చేసుకోవడం ఒక విప్లవం (చిత్ర కళ లిపికి మూలం అయ్యింది). ఇవన్నీ చాలా శాస్త్రీయమైన, సైన్సుతో ముడిపడి ఉన్న విప్లవాలే. భూమి నుంచి ప్రసవ రహస్యాన్ని కనిపెట్టి అడివి మనిషి వ్యవసాయదారుడిగా మారడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. కొన్ని వందల తరాలు మారాయి. ఆ చైతన్యం (సైన్స్) ఇన్ని తరాల పాటు, ఇన్ని ప్రాంతాలలో విస్తరిస్తూ రావడంలో కళ పాత్ర అత్యంత కీలకం. అసలు కళ పుట్టుకే ఒక విప్లవం.

నిజానికి కళ, సైన్స్ రెండింటి జన్మస్థానం ఒక్కటే – మానవ జీవితానుభవం.

ఆ రెండింటి లక్ష్యం కూడా ఒక్కటే – సర్వ మానవ శ్రేయస్సు.

కళ, సైన్స్ ఒక దానిని ఒకటి సంపూర్ణం చేసుకుంటూ ముందుకు సాగుతాయి. ఆ రెండిటినీ విడగొట్టడం అనేది కుట్ర. కళని సైన్స్ ని దూరం చేసి, ఆ రెండూ రెండు వేరు వేరు రంగాలుగా తయారు చెయ్యడం కుట్ర. సైన్స్ కళ నుండి విడివడినప్పుడు మానవ జాతి పురోగతి మందగిస్తుంది. సమాజ చైతన్యం సమాజం మొత్తానికి చెందకుండా కొంత మందికి మాత్రమే పరిమితమై పోతుంది. శాస్త్రాలు మొత్తం సమాజం అభివృద్ధికి ఉపయోగపడకుండా, “టెక్నాలజీ” అనే పేరుతో కొంత మంది అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడతాయి. ఒక వైపు మనం అంగారకుడిని అందుకుంటుంటే ఇంకోవైపు దొంగ బాబాలు దేశం లో స్వైరవిహారం చేస్తుండటం ఇందుకు ఒక ఉదాహరణ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సైన్స్ అంటే స్పేస్ సైన్స్ (Space Science) మాత్రమే కాదు. ఇంకా ఎన్నో శాస్త్రాలు – ముఖ్యంగా సామాజిక శాస్త్రాలు – మానవులకు తక్షణ అవసరాలుగా ఉన్నాయి. వాటన్నిటి మీదా సినిమాలూ, కథలూ, కవితలూ, నాటకాలూ మొదలైనవి రావాలి. ప్రచారం జరగాలి. సమాజ చైతన్యం పై ప్రతి మానవుడికీ సమానమైన హక్కు ఉంది.

ఈ నేపధ్యంలో ఈ సినిమా ఒక చిన్న విజయాన్ని నమోదు చేసింది అని చెప్పొచ్చు. భౌతిక శాస్త్రాన్ని చాలా చక్కటి కథతో హృద్యంగా చిత్రీకరించారు. అలాగని ఈ చిత్రం లో వ్యాపార కోణం లేదు అని నేను అనడం లేదు. వెయ్యి కోట్ల బడ్జెట్ తో వ్యాపారం కోసమే ఈ సినిమా తీశారు. అందులో సందేహం లేదు. ఈ చిత్రంలో చూపించినది అంతా శాస్త్రీయమైనది అని కూడా నేను అనడం లేదు. ఏ కళలోనైనా స్వాభావికంగానే వాస్తవికతతో పాటు కొంత ఊహ, కొంత అధివాస్తవికత ఉంటాయి. ఆ ఊహలు భవిష్యత్తులో మానవ జాతి ఛేదించాల్సిన ఎన్నో ప్రశ్నల వైపు, సాధించాల్సిన ఎన్నో విజయాల వైపు నడిచే ఉత్సాహాన్నిస్తాయి.

 -వినోద్ అనంతోజు

vinod anantoju

 

డైరీలో ఒక పేజీ

 

వినోద్ అనంతోజు

వినోద్ అనంతోజు

 

 

 

 

 

 

 

అనుషాని పిక్ చెస్కోడానికి బెంగళూరు రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. సరిగ్గా సంవత్సరం క్రితం చూశాను తనని.

ఎన్నో రోజుల తరవాత కలుస్తున్నాను. ఏదో ఆత్రుత, ట్రైన్ టైమ్ కి గంట ముందే వచ్చేశాను స్టేషన్ కి. స్టేషన్ బయట ఒక ౩౦ ఏళ్ల ఆవిడ నీరసంగా, చిన్న చిన్న దెబ్బలతో పడి ఉంది. చిరిగిపోయిన బట్టలతో, వొళ్ళంతా దుమ్ముతొ. ఆమె పక్కన ఆమె తాగుబోతు మొగుడు నలుగురితో గోడవపడుతున్నాడు. వాళ్ళ సంభాషణ అంతా కన్నడ లో జరుగుతోంది. నాకు అర్థమైనదాన్ని బట్టి వాడు ఆమెని కొడుతుంటే అటుగా వెళ్తున్న కొంతమంది అతన్ని ఆపి వాదులాటకి దిగారు. 

“నా భార్య నా ఇష్టం” అన్నాడు వాడు. ఆది విని కొంత మంది వెళ్ళిపోయారు అదేంటో..!! ఇద్దరు మాత్రం అతన్ని రెండు దెబ్బలు వేసి తరీమేశారు. వాళ్ళు కుడా వెళ్ళిపోయారు. ఆమె అక్కడే పడుంది. బలహీనంగా మూలుగుతోంది. జనం వస్తున్నారు, పోతున్నారు. కొందరు ఆమెని సరిగా గమనించకుండానే, అడుక్కునే ఆవిడ అనుకుని చిల్లర వేసిపోతున్నారు. నేను ఆ పక్కనే నిలబడి చూస్తున్నాను. ఇంతలో ఆ మొగుడు ఎక్కడినుంచో వచ్చి ఆవిడ ముఖం మీద బలంగా గుడ్డాడు. ఆవిడ గట్టిగా రోదించడం మొదలుపెట్టింది. అటు ఇటు పొర్లుతోంది. తాగుబోతు ఏదో గట్టి గట్టి గా అరుస్తూ అటు ఇటు తులుతూ తిరుగుతున్నాడు. జనం ఆవిడని దాటుకుని, తప్పుకుని వెళ్ళిపోతున్నారు. 25 ఏళ్లు ఉండే ఒకావిడ ఆమె భర్తతో అటుగా వెళ్తూ ఆగి ఆవిడతో మాట్లాడాలని ప్రయత్నించింది. మంచి నీళ్ళు తాగించింది. ఏదో జరుగుతోందని జనం గుమిగూడి చూస్తున్నారు. ఆవిడ కన్నడలొ ఏవో ప్రశ్నలడిగింది. ఆమె రోదిస్తూ సమాధానం చెప్తోంది. ఇంతలో అందరు తాగుబోతు మొగుడిని తిట్టడం మొదలుపెట్టారు. పోలీసాయన్ని పిలిచి అతని గురించి చెప్పారు. వాడు పోలీసు ని చూడగానే పారిపోయాడు. పోలీసాయన వెనకే పరిగెత్తాడు. ఆవిడని ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండానే వెల్లిపొయాడాయన. నేను ఆ 25 ఏళ్ల ఆవిడని అడిగాను.

“డూ యూ నో కన్నడ? ”

“యస్”

“వాట్ ఇస్ షీ సేయింగ్?”

“ఈ డిడ్ నాట్ గెట్ హర్. షీ ఇస్ క్రైయింగ్ ఏ లాట్.”

ఆవిడ భర్త వచ్చెయ్యమని ఇందాకటి నుంచి లాగుతున్నాడు. కొద్దిసేపు నిలబడింది. ఎం చెయ్యాలో తోచక తన వాటర్ బాటల్ ఆమెకిచ్చేసి వెళ్లిపోయింది. జనం మళ్లీ ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. అప్పటిదాకా అక్కడ నిల్చున్న ఒకతన్ని ఏమైందని అడిగాను.

“వదిలెయ్యండి సార్… మనమేం చెయ్యలేము.. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు !! ” అన్నాడు.

నేనిక చూడలేక పోయాను. వెళ్ళి ఆమెని అడిగాను.

“అమ్మా తెలుగొచ్చా?” వచ్చు అని చెప్పింది.

ఆవిడది మదనపల్లి అంట. మొగుడు పిల్లలు అక్కడే ఉన్నట్టున్నారు. ఈ తాగుబోతు ఈమెని ఇక్కడికి తీస్కొచ్చాడట. అక్కడే స్టేషన్ దగ్గరే అడుక్కుంటూ ఉంటారట. రోజూ తాగొచ్చి తంతూ ఉంటాడట. ఈ రోజు ఎందుకో నువ్వు ఛస్తే డబ్బులొస్తాయి అని ఛంపుతానని కొడుతున్నాడట. నేను ఆమెతో మాట్లాడుతుంటే ఏదో జరుగుతోందని జనం గుమిగూడారు.

చాలా నీరసంగా ఉంది ఆమె. చేతులు కదిలించడం కూడా కష్టంగా ఉంది ఆమెకి. మాటలు కూడా స్పష్టం గా అర్థం కావడంలేదు. ఆమె ముఖం మీద దెబ్బల నుంచి బాగా రక్తం కారుతోంది. రైల్వే స్టేషన్ లో క్లినిక్ ఏదైనా ఉందేమో అని ఒకతన్ని అడిగాను.

ఫర్స్ట్ ప్ల్యాట్‌ఫార్మ్ మీద ఉంది కానీ ఎలా తీస్కెళ్తాము అన్నాడు. స్ట్రెచర్ ఏమైనా ఉంటుందేమో చూద్దాము అన్నాను. వీల్ ఛైర్ ఒకటుంది. దాన్నే తీస్కొచ్చాం. ఆవిడని ఎత్తి దాంట్లో కుచోబెట్టాలి. ఆడమనిషిని ముట్టుకోవడం సరికాదన్నాడు ఒకడు. నాకు ఆవిడ ఒక దీనురాలు అంతే. ఆడా మగా సమస్య కాదు. ఆమె చేతులు పెట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నించాను. అందరు నిలబడి నిశ్చేష్ఠులై చూస్తున్నారు కానీ ఎవరూ ఆమెని ముట్టుకోడానికి ముందుకి రాలేదు.

పక్కనే ఒక కార్పెట్ ఉంటే తీస్కొచ్చి పరిచాను. ఇద్దరు ముగ్గురు సాయం పట్టారు. ఆమెని కార్పెట్ లో పడుకోబెట్టి, ఎత్తి ఛైర్ లో కూచోపెట్తి తీస్కెళ్తున్నాం. ఆ తాగుబోతు భర్త మళ్లీ వచ్చాడు. తాను కూడా క్లినిక్ కి వస్తా అన్నాడు. ఛైర్ నెడుతున్నాడు. ఆవిడ వాడిని చూడగానే భయపడి ఏడుస్తోంది. వద్దని చెప్తోంది. నేను అతనిని తెలుగులో వెళ్ళిపొమ్మని చెప్పాను. వాడికి అర్థం కాలేదు. పక్కన ఉన్న ఒకాయనకి చెప్పాను అతనిని పంపించెయ్యమని.

“ఎంతైనా మొగుడు కదా.. రావోద్దని ఎలా చెప్తాం” అన్నాడు.ఆ మాట విని నాకు ఒక్క క్షణం మతిపోయింది. మొగుడు ఎంత నీచుడైనా భార్య మీద అన్ని అధికారాలు ఉంటాయి అని నమ్మడం, హు.. మధ్యయూగాల వాసన ఇంకా అలానే ఉంది. ఇంతలో ఆ పోలిసాయన అటుగా వచ్చాడు. ఆ తాగుబోతు పారిపోయాడు అక్కడ్నుంచి.

 

ఒక ఐదుగురం కలిసి ఆవిడని వీల్ ఛైర్ మీద క్లినిక్ కి తీస్కెళ్తున్నాం. జరుగుతున్నదంతా గమనించి ఒక 20 ఏళ్ల కన్నడ యువతి కూడా మాతో జాయిన్ అయ్యింది. ఏం జరిగింది అని నన్ను అడిగింది. జరిగిందంతా ఇంగ్లీష్ లో చెప్పాను. ఆ అమ్మాయి ఆవిడతో కన్నడలొ ప్రేమగా మాట్లాడి ధైర్యం చెప్పింది. నీకేం కాదు, మేమంతా ఉన్నాం అని చెప్పింది నాకు ఆ అమ్మాయి మీద గౌరవం కలిగింది.

 R_Tagore_Veiled_Woman

క్లినిక్ లో 25 ఏళ్ల కుర్ర డాక్టర్ ఉన్నాడు. లోపలికి తీస్కెళ్లగానే ఆవిడని చూసి కొంచం ఆశ్చర్యపొయినప్పటికీ, ఎటువంటి ఏవగింపు లేకుండా ఆ దెబ్బలకి మందు పూయడం మొదలుపెట్టాడు. “ఈమె ఫుల్ గా తాగి ఉంది” అని చెప్పాడు.

“ఏమ్మా ఫుల్ గా తాగావా?” అడిగాడు.

ఆవిడ సత్య ప్రమాణంగా తాగలేదని చెప్పింది. అతను వెటకారంగా నవ్వి “ఇది మాములే సార్.. ప్ల్యాట్‌ఫార్మ్ మీద అడుక్కోవడం, రాత్రికి తాగి తన్నుకోవడం. మీరంతా ఎందుకు సార్ అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకున్నారు.” అన్నాడు.

అక్కడున్న వారంతా ఈ మాట విని ఏదో పెద్ద సానుభూతి భారం గుండెల మీద నుంచి దిగిపోయినట్టు రిలీఫ్ గా ఫీల్ అయ్యారు.

నేనేం మాట్లాడలేదు. ఆ కన్నడ యువతి ఇంగ్లీష్ లో అంది “వీళ్ళకి తినడానికి డబ్బులుండవు గాని .. తాగడానికి మాత్రం ఉంటాయి.”

 

ట్రీట్‌మెంట్ అయిపోయింది. డాక్టర్ దెబ్బలకి కట్టు కట్టాడు. ఇప్పుడామెని ఎం చెయ్యాలి అనేది ప్రశ్న.

బయట వదిలేస్తే మళ్లీ ఆ తాగుబోతు మొగుడు వస్తాడు. క్లినిక్ లోపల ఉంచడానికి కుదరదు.

ఆవిడని అడిగాను. “అమ్మా.. ఎక్కడికెళ్తావు?” అని.

సగం మూసుకుపోతున్న కళ్ళతో, నీరసంగా ఏమో అన్నట్టు చెయ్యి ఉపింది. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

నా మనసులో కలుగుతున్న భావాన్ని జాలి అనాలో, సానుభూతి అనాలో, వ్యవస్థ మీద కోపం అనాలో అర్థం కావట్లేదు.

“మదనపల్లి వెళ్తావా” అని అడిగాను. డబ్బుల్లెవు అంది. తమిళాయాన భోజనం పార్సల్ తీస్కొచ్చాడు. ఆవిడని ప్ల్యాట్‌ఫార్మ్ మీదనే ఒక చోట కూచొపెట్టి ఎవరికి తోచినంత వాళ్ళిచ్చారు. ఆ కన్నడ యువతి ట్రైన్ టైమ్ అవుతోందని చెప్పి వెళ్లిపోయింది.

ఆవిడకి చెప్పాను ” అమ్మా ఈ డబ్బులు జాగ్రత్త. ఆ తాగుబోతు వాడికి చూపించొద్దు. ముందు భోజనం చేసి కొంచం శక్తి వచ్చాక మదనపల్లి ట్రైన్ ఎక్కెయ్యండి.” ఆవిడకి నేను చెప్పింది ఎంతవరకూ బుర్రకెక్కిండో తెలియదు. ఏడుస్తూ దండం పెట్టి కాళ్ళు పెట్టుకొబోయింది. ఆపి, వద్దని చెప్పి, జాగ్రత్త అని చెప్పి లేచాను.

మొదట్నుంచి మాతోపాటు ఉన్న ఒక తెలుగాయన వాష్ బేసిన్ చూపిస్తూ “చేతులు శుభ్రంగా కడుక్కోండి సార్” అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు.

“ఆహా… అదంతా పట్టుకున్నారు కదా… చేతులు కడుక్కోండి.” అన్నాడు. సరే అన్నట్టు తల ఊపాను.

అనూష వచ్చే ట్రేన్ అనౌన్స్మెంట్ వచ్చింది. వెనక్కి తిరిగి ఆవిడని చూస్తూనే ముందుకి నడిచాను. ఎన్నో సమాధానం చిక్కని ప్రశ్నలు మనసుని ముసురుతూండగానే అనుషాని రిసీవ్ చేస్కున్నాను. తను ఏదో మాట్లాడుతోంది గాని, నా మనసు అక్కడ లేదు. తిరిగి ప్ల్యాట్‌ఫార్మ్ 1 మీదుగా వస్తూ ఆవిడ కోసం వెతికాను. కనిపించలేదు.

 

ఒక్క గంటలో ఎన్ని రకాల మనుషులని, ఎన్ని రకాల మనస్తత్వాలని చూసాను.

ఆ దీనురాలి సమస్య కి పరిష్కారం ఏమిటి? దాన్ని పరిష్కారం చేసేవారెవరు?

ఆ సమస్యని నెత్తికెత్తుకుని ఆమె జీవితాన్ని చక్కదిద్దే స్థోమత, శక్తి నాకున్నాయా?

ఆవిడని అలా ప్ల్యాట్‌ఫార్మ్ మీద వదిలేసి రావడం సరైన పనేనా? నాతో పాటు ఉన్నవాళ్ల ప్రవర్తన సమంజసమేనా?

ఆవిడ తాగి ఉంది అనగానే ఆమె పట్ల, ఆమె పరిస్థితి పట్ల చులకన భావం ఎందుకు కలిగింది?

ఆమె సంస్కారహీనతని లోపం గా చూపి, తమ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం కాదా ఆది?

చిన్నప్పటి నుండీ రోజూ కడుపునిండా తిండితో, తీరైన పోషణతో, ఉన్నతమైన చదువులు చదువుతూ పెరుగుతాం మనం. మనకి మంచేదో చెడేదో ముందుగానే ప్రిడిఫైన్ చెయ్యబడి ఉంటాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, గౌరవం ఎలా ఇవ్వాలి, మర్యాద ఎలా సంపాదించుకోవాలో పెంపకంతోపాటే నేర్చుకునే మనకు ఒక సంస్కార స్థాయి ఉంటుంది.

రోడ్ల మీద పుట్టి, రోడ్ల మీద పెరిగినవాళ్ళు, ఏరోజుకారోజు ఉనికి సమస్యనెదుర్కునేవాళ్ళు, జీవితంలోని అన్ని రకాల దౌర్భాగ్యాలని, దుర్మార్గాలని ఎదుర్కుంటూ పెరిగినవాళ్ళు, ఎక్కడికెళ్లినా అవమానాలు, ఛీత్కారాలు, రుచిచుసే వాళ్ళు, మాంచేదో చెడేదో చెప్పే దిక్కులేనివాళ్ళు అలా కాక ఇంకెలా ఉంటారు? వాళ్ళకి కూడా మనకున్న సంస్కార స్థాయి ఉండాలనుకోవడం తప్పు. ఆ మాటకొస్తే.. పదిమందిలో ధైర్యంగా, బాధ్యతగా నిలబడి ఒక దీనురాలికి సహాయం చేస్తున్న భార్యని వెనక్కి లాగిన భర్తదేమి సంస్కారం?

రోడ్డు మీద ఒక మనిషి వేదనలో ఉంటే ఆడమనిషి కాబట్టి ముట్టుకోను అనడం ఏం సంస్కారం? అడుక్కునే ఆవిడ అయినంతమాత్రాన ముట్టుకున్నాక చేతులు కడుక్కోమని సలహా ఇచ్చిన పెద్దమనిషిది ఏం సంస్కారం?

ఒక మనిషి సమస్య మనం అర్థం చెస్కోవాలంటే ఆ సమస్య  సామాజిక మూలం గ్రహించగలగాలి. ఆది గ్రహించలేకపోతే ఆ మనిషి బ్రతుకు మనకి అర్థం కానట్టే. ఆ దీనురాలి పరిస్థితి ని అర్థం చెస్కోవాలంటే ఆమె స్థానంలో, ఆమె స్థాయిలో నిలబడి ఆలోచించాలి. ఆమె అనుభవిస్తున్న వేదన మనమూ అనుభవించాలి, ఆమె మోస్తున్న సామాజిక భారాన్ని మనమూ మొయ్యాలి, ఆమె అవివేకాన్ని మనమూ పంచుకోవాలి. దీన్నే సానుభూతి (సః అనుభూతి) అంటారు అనుకుంటాను.

నాలో ఆ సానుభూతే కలిగింది. అంతకంటే ఎక్కువగా కోపం కలుగుతోంది. వ్యవస్త మీద. జరిగిన దాంట్లో నాకు మొత్తం హింసే కనపడుతోంది. భార్య మీద భర్త చేసిన హింస కాదు. వాళ్ళిద్దరి జీవితాల మీద సమాజం చేస్తున్న హింస. వాళ్ళ ఈ పరిస్థితికి కారణం ఆ హింసే కదా. సమాజం లో అడుగడుగునా వేళ్ళూనుకుపోయిన హింసాస్వభావమే కాదా.

 

“ఏంటి అలా ఉన్నావ్?” అమాయకంగా అడిగింది అనూష. నా మనసు తన మీద లేదని గమనించింది కాబోలు. ఏమని చెప్పను తనకి. నాలో కలుగుతున్న ఆగ్రహం తనకి అర్థమౌతుందా. నా మూడ్ బాలేదు అనుకుంటుంది. నిజానికి నా మూడ్ ఇప్పుడే బాగుంది. ఏదో ఒక పనికొచ్చే ఆలోచన వైపు పరుగులు తీస్తోంది.

“ఏం లేదే… బానే ఉన్నా…!! నువ్వే జిడ్డు మొహం వేస్కుని ఉన్నావ్..!” :P

“20 గంటలు జర్నీ బాబూ..”

– వినోద్ అనంతోజు

 

 

కథ అయినా, కళ అయినా…ఒక సహప్రయాణం!

Vinod AnantojuWorkingstill1 (1) అసలు కథ చెప్పాల్సిన అవసరం ఎందుకొస్తుంది ?

కథే కాదు.. మనిషికి కళ అవసరం ఎప్పుడొస్తుంది?

ఒక విషయాన్ని అవతలి వ్యక్తికి ఎన్నో విధాలుగా తెలియజెయ్యొచ్చు. మాటల ద్వారా, రాతల ద్వారా, బొమ్మల ద్వారా ఎలగైనా తెలియజెయ్యొచ్చు. ఆ విషయం తెలుసుకున్నాక ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడు అనేది మాత్రం ఆ విషయం ఎంత కళాత్మకంగా చెప్పబడింది అనేదాని మీద ఆధారపడుతుంది. అనుభూతులను, భావాలను పంచుకునే సాధనం కళ. మంచిగా మట్లాడటం కళ, బాగా రాయడం కళ, నృత్యం చేసి ఆనందపడటం, ఆనందాన్ని పంచడం కళ. మనసులో ఏదైనా సరే ఒక స్పందన కలగజేసే కథ రాయడం, సినిమా తీయడం కళ.

‘ శూన్యం’ రాయడం మొదలుపెట్టినప్పుడు చాలా ప్రశ్నలు, సందేహాలు నన్ను వేధించాయి. నేను చూస్తూ పెరిగిన సినిమాల ప్రభావం కావొచ్చు, కొన్ని రకాల కథలకే పరిమితమవ్వాలేమో అనే అలోచన ఉండేది. కాని నేను సినిమాని చూస్తున్న కోణం వేరు. సినిమా ఒక కళ. కళ కేవలం వినోదం కోసమే కాదు. దాని లక్ష్యాలు అనేకం. దాని అవసరం వేరు. మానవాభివృద్ధిలో దాని పాత్ర విడదీయరానిది. పుస్తకాలకి సినిమాకన్నా శక్తి ఎక్కువ ఉన్నప్పటికీ ప్రపంచీకరణ పుణ్యమా అని పుస్తకాలు చదివేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపొతోంది.. నాటకం, తోలుబొమ్మలు లాంటి కళలు అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం సినిమా అన్ని కళల్లోకల్లా ఆదరణ ఎక్కువ పొందుతోంది. కాని ఇప్పుడున్న సినిమా రంగం పరిస్థితి చాలా నిరాశాజనకంగా, భయంకరంగా ఉంది. ఇక్కడ మార్పు అవసరం. సినిమాని సరైన దారిలో పెట్టాలి, సమాజంలో దానికున్న పురోగామి పాత్రని దానికి గుర్తుచెయ్యాలి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే ‘శూన్యం’ రాయడం మొదలుపెట్టాను.

“కథ”కీ “సినిమాకథ”కీ చాలా తేడా ఉంది. ఆధునిక కథ వర్తమాన జీవనశైలికీ, జీవిత సంక్లిష్టతకీ తగ్గట్టు చాలా మార్పులకి లోనయ్యింది. చాలా అభివృద్ధి చెందింది. కానీ తెలుగు సినిమాకథ ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. ఇంకా పాతకాలపు “ఎత్తుగడ-సమస్య-పరిష్కారం-శుభం” పద్ధతినే అనుసరిస్తున్నారు. ఆధునిక కథ ఈ నిర్మాణాన్ని దాటి ఎప్పుడో ముందుకెళ్ళిపోయింది. కథ చదువుతున్న పాఠకుడు కథతో పాటు ప్రయాణం  చెయ్యగలిగితే చాలు. కథను ఉద్దేశపూర్వకంగా ముగించాల్సిన అవసరం లేదని నా నమ్మకం. ఎందుకంటే అంతిమంగా కథ చదవడం వల్ల కలిగిన అనుభూతే అన్నిటికన్నా ముఖ్యం. మరి ఈ విషయాలన్నీ ప్రేక్షకుడితో ఎలా చర్చించాలి? నేను రాసే కథలో ప్రేక్షకుడు నాతో పాటు కథ రాయడంలో ఉండే అన్ని అవస్థల గుండా ప్రయాణించాలి. నా అభిప్రాయాల్ని, భావాలని ప్రేక్షకుడితో పంచుకుంటూ, అతని అభిప్రాయాలకి తావు ఇస్తూ, ప్రేక్షకుడిని నా తోటి ప్రయాణికుణ్ణి చేసుకోడానికి ప్రయత్నించాను.

Workingstill1 (2)

లఘుచిత్రాలకి అనేకానేక పరిమితులు ఉంటాయి. శూన్యం సినిమాలో చెప్పినట్టు “కథ రాసేస్తే సరిపోదూ..!!” నాకున్న పరిమితులని అర్థంచేస్కుని అధిగమించాలి. నేను ఎదుర్కొన్న ముఖ్యమైన సమస్య నటులకి కథ మీద నమ్మకం కలిగించడం. కొంతమంది అయితే ఇది కథే కాదు అన్నారు. ఒక కళాకారుడిగా నేను చేస్తున్న ప్రయోగం మీద నాకు నిర్దిష్టమైన అవగాహన, నమ్మకం ఉన్నాయి. ఆ నమ్మకంతోనే నా స్నేహితులని ఒప్పించి షూటింగుకి పూనుకున్నాము. కథలో లొకేషన్స్ చాలా వరకు లైవ్ లొకేషన్స్ కావడంతో న్యాచురాలిటీ కోసం గెరిల్లా షూటింగ్ స్టైల్ ని అనుసరించాము. ఇది కొంచం రిస్కీ అయినా సినిమాకి చాలా ఉపయోగపడింది.

ఒకడు సినిమా తీస్తే, దాని ప్రభావం ప్రేక్షకుల మీద ఎంత ఉంటుందో దాన్ని తీసినవాడి మీద కుడా అంతే ఉంటుంది. శూన్యం విడుదలయ్యాక వచ్చిన స్పందనలు, అభినందనలు, విమర్శలు అప్పటిదాకా నాలో ఏ మూలో సినిమా కళ పట్ల ఉన్న అలసత్వాన్ని పూర్తిగా పోగొట్టాయి. సినిమాకి ఉన్న శక్తి సామర్ధ్యాలు తెలిసొచ్చాయి. కళ పట్ల నాకున్న బాధ్యత అర్థమైంది. ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్లో, కళాకారుల్లో “సినిమా” మీద ఉన్న అవగాహనలో మార్పు తీస్కురావాలి. అలా పుట్టిన అలోచనే “వర్ణం”. మిత్రుడు స్మిజో దీన్ని ప్రతిపాదించాడు. సినిమాల పట్ల ఇలాంటి అలోచనా సరళిని వ్యాప్తి చెయ్యాలన్నా, ఇలాంటీ సినిమాలు విరివిగా తీయాలన్నా సిమిలర్ మెంటాలిటి ఉన్న టీం కావాలి. అలా “వర్ణం” అనే పేరుతో ఒక టీం తయారు చేస్తున్నాం. ఆ టీం మొదటి ప్రయత్నం “ఒక మరణం” షార్ట్ ఫిల్మ్.

కళ ఏదైనా అది జీవితంలోంచి పుట్టాలి. సామాజిక మూలాలని అన్వేషించాలి, జీవితపు సంక్లిష్టతని సులభతరం చెయ్యాలి. వ్యాపారం కోసం పుట్టేది కళ కాదు. నేను రాసే కథలు, తీసే సినిమాలు అంతిమంగా ప్రేక్షకుడి వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించేవిగా ఉండాలని అనుకుంటాను.