19 నవంబర్, 1977 రాత్రి అనేకానేక నగ్న సత్యాల్ని వెలుగులోకి తీసుకొస్తూ వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశంలో పేదల బతుకులెంత నిస్సహాయమో, అభద్రమో నిరూపిస్తూ వేలాదిమంది మూకుమ్మడిగా, ఘోరాతి ఘోరంగా చనిపోయారు. ఆ రాత్రి తీరమ్మీది బెస్త పల్లెలనే కాదు, సముద్రం వెంబడి వందల మైళ్ళ పొడుగునా జన జీవితాన్ని దివిసీమ తుఫాను కాల రాసేసింది. తనతో రొట్టె ముక్కల్ని పంచుకున్న ద్రోహులెవరో జీసస్ కి తెలుసేమో కానీ తమని అర్ధరాత్రి సముద్ర విలయానికి ఎరగా వేసిన పాలకుల ద్రోహమేంటో బలహీన దేహాలు ఊడిపోయిన చితికిన కంకాళాలకి తెలియదు. పాలకులదేముంది? నెపాన్ని సముద్రం మీదకి, ప్రకృతి మీదకి తోసేసారు. సముద్రం మానవాళి మీద పగబట్టిందనే ప్రచారం చేసుకున్నారు.
****
ఒక్కడు మాత్రం తన గదిలో ఆ ద్రోహాన్ని పసిగట్టాడు.
“జీవితం మిధ్య అనడం అబద్ధం
మనిషి శతాబ్దాలు గడిచే కొద్దీ నాగరీకుడవుతాడనడం అబద్ధం
దరిద్రం చిమ్మే చీకటి నిజం
సమస్త లోకాన్ని బతికించే సంపద సృష్ఠించేవాడి రక్తం
విలువలేని ఖనిజం
మానవ దౌష్ట్యానికీ ప్రకృతి ప్రళయానికీ
విరిగిపోయేవి దరిద్రుల ఎముకలే
చివరికి మిగిలేవి గుడిశెల మృతకళేబరాలే”
అంటూ విరుచుకుపడ్డాడు. అతను సముద్రాన్ని తన కాళ్ళు నాకిన బొచ్చుకుక్కపిల్లని ముద్దుచేసినట్లు తల నిమిరిన వాడు. సముద్రాన్ని పెంచుకుందామనుకున్న వాడు. అందుకే ద్రోహాన్ని ఎండగట్టాడు. ప్రభుత్వం జఘనాశ్వం కాదు, అది ఒక అడుగు కూడా ముందుకు వేయలేని కొయ్యగుర్రమని హూంకరించాడు. అతను జీసస్ లా పాపుల్ని క్షమించదల్చుకో లేదు. నాగలి మోసే రైతులో శిలువ మోస్తున్న క్రీస్తుని చూసిన అతగాడు శిలువధారులైన అభద్ర జీవుల మీద ప్రేమతో విద్రోహ ప్రభుత్వాల మీద కలం దూసాడు. వ్యవస్థ కొయ్యగుర్రాన్ని మనకు నగ్నంగా చూపించాడు.
****
అతడే నగ్నముని. 19, నవంబర్ 1977 రాత్రి జరిగిన నరమేధం మీద కొద్ది రోజుల్లోనే చేకూరి రామారావు గారన్నట్లు “కొయ్యగుర్రం” అనే ఆధునిక మహాకావ్యాన్ని వెలువరించిన కవి నగ్నముని. నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ప్రభుత్వం ఇంకా కొయ్యబారే వున్నది. అందుకే ఆ మహాకావ్యం ఇప్పటికీ అత్యావశ్యకమే. అందుకే ఆయన అభిమానులు “కొయ్యగుర్రం” దీర్ఘ కవితకి విజువల్ డాక్యుమెంటేషన్ రూపం ఇవ్వాలనుకున్నారు. సుమారు ఒక గంటసేపు సాగే డాక్యుమెంటరీ సినిమాగా “కొయ్యగుర్రం” రూపుదిద్దుకోబోతున్నది. నిర్దేశక బాధ్యతని ప్రముఖ ఆర్ట్ ఫిలిం మేకర్ నటరాజ్ మహర్షి స్వీకరించారు. ఈ ప్రాజెక్ట్ కి కోర్డినేటర్ గా అడ్వొకేటు వేణుగోపాల్ రెడ్డి (9441927880) వ్యవహరిస్తారు. ఈ అంతర్జాతీయ స్థాయి డాక్యుమెంటరీ సినిమా కార్యక్రమం ఈ సెప్టెంబర్ 22 ఉదయం ప్రారంభమౌతున్నది. ఇందుకోసం నగ్నముని అభిమానుల్ని, సాహిత్య ప్రియుల్ని సహకారం, తోడ్పాటు అందించాల్సిందిగా కోరుతున్నారు.
తాజా కామెంట్లు