అసమానతల్ని ఇంకా అర్థం చేసుకోవాలి:ఓల్గా

జనవరి 10 న అజో విభో వారి ప్రతిభా మూర్తి పురస్కారం అందుకుంటున్న సందర్భంగా..ఓల్గా తో ప్రత్యేక ముఖాముఖి

 వి. ప్రతిమ

~

 

స్త్రీవాద రాజకీయోద్యమాన్ని నిర్మించాలన్న ఆలోచనే ఆమె బలమూ బలహీనతా కూడ. రచయితగా, కార్యకర్తగా, నాయకురాలిగా, నిరంతర చలనశీలిగా ఆమెచేసిన అలుపెరగని పోరాటం తెలుగు  సాహిత్య ప్రపంచానికి చిరపరిచితం. స్పష్టమైన అవగాహనతో, నిశితమైన ప్రాపంచిక దృక్పథంతో, స్త్రీజన విముక్తి కోసం రచనను ఒక రాజకీయ చర్యగా, కార్యాచరణగా భావించి సుదీర్ఘమైన ప్రయాణం సాగించిన ఓల్గాకి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కార సత్కారం జరుగుతోన్న శుభ సందర్భంలో ఆమెతో ఒక సన్నిహిత సంభాషణ.

 

  1. ఓల్గా రష్యాలో ఒక నదిపేరు కదా? మీకా పేరెలా వచ్చింది?

జ. వ్యక్తిగతం రాజకీయం కలగలిసిన జీవితం నాది. నా కలం  పేరు ఓల్గా అవటానికి కూడా వ్యక్తిగత, రాజకీయ కారణాలున్నాయి. ఓల్గా మా అక్కయ్య అసలు  పేరు. నాకంటే నాలుగేళ్ళు పెద్దది. మా నాన్నగారు ఆమెకా పేరు పెట్టారు. కారణం మా నాన్న కమ్యూనిస్టు కావటం. మా అక్క పుట్టినపుడు రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ నెదిరించి సోవియట్‌ యూనియన్‌లో వీరోచిత పోరాటం జరిపిన ‘ఓల్గా’ అనే రెడ్‌గార్డ్‌ మరణించిందనే వార్త వార్తా పత్రికల్లో రావటంతో మా నాన్న ఆమె జ్ఞాపకంగా మా అక్కకు ఆ పేరు పెట్టారు. మా అక్క నా పదహారో ఏట మరణించింది. అది మా కుటుంబానికి కోలుకోలేని విషాదం. నేను అప్పుడప్పుడే కవితలు  రాస్తున్నాను. మా అక్కయ్య కూడా కవిత్వం రాసేది. ఇద్దరం ఆ కవితలు  చదువుకుని ఆనందపడేవాళ్ళం. బతికివుంటే మా అక్క మంచి రచయిత్రి అయ్యేది. ఆ అక్కను రచయిత్రిగా బతికించాలనే ఆశతో నేను ఆమె పేరును కలం  పేరుగా చేసుకున్నాను. మా నాన్న రాజకీయ కారణంతో పెట్టిన పేరు వ్యక్తిగత కారణం చేత నా కలం  పేరయింది. ‘‘వ్యక్తిగతం కూడా రాజకీయమే’’ అన్నమాట నా కలం  పేరులో కూడా నిజమయింది.

  1. మీ పుట్టుక, బాల్యం , మీ నాన్నగారి గురించి చెప్పండి… ఆనాటికే స్త్రీవిద్య ప్రాముఖ్యతని గుర్తించి మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారనీ, స్వేచ్ఛ నిచ్చారనీ విన్నాను…

జ. నేను 1950వ సంవత్సరంలో నవంబర్‌ 27న పుట్టాను. మాది గుంటూరు దగ్గర యడ్లపాడు గ్రామం.. నాకు ఊహ వచ్చినప్పటి నుండీ గుంటూరులో పెరిగాను.  St. Joseph’s School లో 12వ తరగతి వరకు చదివి ఎ.సి. కాలేజీలో బి.ఎ. చదివాను.  ఎం.ఎ. పిజీ. సెంటర్   గుంటూరులోనే చదివాను. 1972 లో ఎం.ఎ. పూర్తి అయింది. 1973లో తెనాలి వి.యస్‌.ఆర్‌ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరి 1985 వరకూ పనిచేశాను. మా నాన్నగారి గురించి ఎంత చెప్పినా నాకు తృప్తి కలగదు. అమ్మని గురించి కూడా. మా నాన్న  కమ్యూనిస్టుగా మంచి విలువలు  నేర్చు కున్నారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి దూరమైనా కూడా జీవితాంతం ఆ విలువలను  పాటించారు. ఆ విలువలను  సాహిత్యరూపంలో ఎక్కువగా ఆయన నేర్చుకున్నారు అనిపిస్తుంది. మాకు కూడా ఆ సాహిత్యాన్ని, ఆ విలువలను  అందించారు. మేం సాహిత్య ప్రేమికులమవుతుంటే మనసారా ఆనందించారు . పిల్లలందరికీ  మంచి చదువు అందించాలనే తాను యడ్లపాడులో కట్టించిన హైస్కూలు ను, అక్కడ సర్పంచ్‌గా పనిచేసి ప్రజలతో పెంచుకున్న అనుబంధాన్ని ఒదులుకుని గుంటూరు వచ్చి మంచి స్కూళ్ళలో చేర్పించారు. మా నాన్న మాకు నాన్నగా, స్నేహితుడిగా, గురువుగా జీవితం గురించి ఎన్నో కోణాలను అర్థం చేయించారు. ఎన్నడూ మందలింపులైనా ఉండేవి కావు. నీతి బోధలు  అసలే లేవు. ఆట పాటలు, సంగీత సాహిత్యాలు , సినిమాలు , విహార యాత్రలు  స్నేహ పరిమళాలు  ` వీటితో నా బాల్యాన్ని నింపింది మా అమ్మా నాన్నలే. నాకు చాలామందికి లాగా పల్లెటూరి బాల్యం  లేదు. పల్లెటూరి జీవితం పెద్దయ్యాక దూరం నుంచి తప్ప దగ్గరగా తెలియదు. అది ఒక రకంగా లోటయినా, నా ఎదుగుదలకు అది తోడ్పడింది. .

స్వేచ్ఛ ఇచ్చారనీ, విద్య ప్రాముఖ్యం గుర్తించారనీ నాకు మొదట్లో తెలియదు. పదో తరగతిలో అగ్ర వర్ణాలకు, అగ్ర వర్గాలకు చెందిన నా స్నేహితులు , నాతోపాటు చదువుకునే వాళ్ళు పెళ్ళి చేసుకుని చదువు మానేస్తుంటే నాకు భయం వేసి మా నాన్నతో చెబితే ఆయన స్త్రీలు  చదివి ఉద్యోగం చేస్తూ అప్పుడు మాత్రమే పెళ్ళాడాలని, మన పాత సంప్రదాయాలను ఒదిలేయాలని తనకు తోచినట్లు చెప్పి మంచి పుస్తకాలు  నా చేతికిచ్చేవాడు. మా నాన్న చదివింది పదో తరగతే` కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద డాక్టర్లు, ఉన్నతోద్యోగులు  కూడా పిల్లలకు  పదో తరగతిలో పన్నెండో తరగతిలో పెళ్ళి చేసేవారు. చదువు, డిగ్రీలు  వేరు, జ్ఞానం, చైతన్యం వేరు అని తెలిసి మా నాన్నను చూసి గర్వపడేదాన్ని. చదువు విషయమే కాదు. అప్పటికి గుంటూరులో దాదాపు మూడువేల మంది అమ్మాయిలు  కాలేజీ చదువులో ఉన్నారు. కానీ పట్టుమని పదిమందికి కూడా సమాజ పరిజ్ఞానం లేదు. రాజకీయ పరిజ్ఞానం లేదు. కాలేజీ పుస్తకాలు  తప్ప ఇతర పుస్తకాు చదివితే చెడిపోతారనే   కుటుంబ వాతావరణంలోనే ఉండేవారు. అలాంటి రోజుల్లో తన రాజకీయ నేపథ్యం వల్లనే  కావొచ్చు నా రాజకీయ ఆసక్తుల ను కూడా ప్రోత్సహించారు.

నేను విశాఖ ఉక్కు ఉద్యమం రోజు నుండీ వామపక్ష రాజకీయాల  పట్ల ఆసక్తిని పెంచుకున్నాను. స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో పనిచేయటం మొదలు పెట్టాను. అప్పటినుంచి ఫెమినిస్టు రాజకీయాల వరకు సాగిన నా రాజకీయ జీవితాన్ని మా నాన్న అర్థం చేసుకుని ప్రోత్సహించారు. నా ఫెమినిస్టు భావాల ప్రచారంతో ఆయన కూడా మారారు. డెబ్భై ఏళ్ళ వయసులో ఇంటి పనులలో తనవంతు పనులు  చేయటం మొదలుపెట్టారు. నిజంగా ప్రజాస్వామిక విలువలను  నమ్మిన మనిషి.

  1. మీ చదువు?…. చిన్నప్పుడే మీకు వామపక్ష భావాల పట్ల ఆసక్తి ఎలా ఏర్పడింది. అందుకు దోహదం చేసిన పరిస్థితులేమిటి?

జ. చిన్నప్పటి నుంచీ చదివిన సాహిత్యం ప్రధాన కారణం. పది పన్నెండేళ్ళ వయసులోనే రష్యా అనువాద సాహిత్యం చాలా చదివాను. శ్రీశ్రీ మహా ప్రస్థానం చదివాను. అదంతా అర్థం కాకపోయినా వామపక్ష భావాల పట్ల ఆసక్తి కలగటానికి కారణమయ్యాయి. నేను 12వ తరగతికి వచ్చేసరికి. S.F.I. చాలా చురుగ్గా పనిచేస్తోంది. ముఖ్యంగా గుంటూరులో చాలా మంచి విద్యార్థులుండేవారు. సమస్యలపై కదిలి సమ్మెలు, ప్రదర్శనలు చేసేవారు. ఆ విద్యార్థి నాయకులలో డా॥ చాగంటి భాస్కరరావు, డా॥ మల్లికార్జునుడు (శ్రీకాకుళ పోరాటంలో పాల్గొన్నారు. పోలీసులు  వారిని తూటాలతో కాల్చి చంపారు) వంటి వాళ్ళు వై.కె. వంటి నాయకులు  ఉండేవారు. అందరూ నక్జల్బార్  ప్రభావానికి లోనయ్యారు. అందరితోపాటు నేనూ ‘‘వసంతకాల మేఘ గర్జన’’ పిలుపుకు స్పందించాను. ఆనాటి రాజకీయ వాతావరణం అలాంటిది. సాహిత్యంలో కూడా దిగంబర కవుల ధిక్కార స్వరం అంతకు ముందటి కవుల కంటే భిన్నంగా వినిపించారు. గుంటూరులో నేనూ, దేవిప్రియ, సుగమ్‌ బాబు, కిరణ్‌బాబు, కమలాకాంత్‌ కలిసి పైగంబర కవులు  అనే పేరుతో కవిత్వం రాయటం మొదుపెట్టి రెండు సంకలనాలు  ప్రచురించాం. శ్రీశ్రీ షష్టిపూర్తి సభ విశాఖలో జరుగుతోందని తెలిసి నేనూ ప్రయాణ మయ్యాను. అక్కడి విద్యార్థుల కరపత్రాన్ని వేడి వేడిగా అందుకుని చదివాను. ఇంతలో విరసం ఏర్పడటం ` నిజంగా 67 నుంచి 70 వరకూ ఆ మూడు సంవత్సరాలు  చైతన్యంతో వెలిగిన సంవత్సరాలు.

  1. స్త్రీల జీవితాలలో తమకు తెలీకుండానే తమ మీద అమలవుతోన్న పెత్తనాలను మీరే క్రమంలో గుర్తించారు? ఉద్యమరూపంలో దాన్ని ఎదుర్కోవాలన్న చైతన్యం ఎలా కలిగింది?

జ. స్త్రీల మీద  పెత్తనం మనకు రోజు వారీ జీవితంలో అర్థమవుతూనే ఉంటుంది. మా ఇంట్లో వాతావరణంలో ఆ పెత్తనం లేదు గానీ నా చుట్టూ సమాజంలో అసమానత్వం ఎక్కడ చూస్తే అక్కడ కనపడుతూనే ఉండేది. దానిపట్ల నాకు కోపం వస్తూనే ఉండేది. దానికి తోడు చలం  రచనలు  స్త్రీల  అణచివేత ఎంత భయంకరంగా ఉందో చెబుతుండేవి. చలం , కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం, గురజాడ కన్యాశుల్కం  నాటకం వీటన్నిటి ప్రభావం వల్ల  స్త్రీల  అణచివేత మీద నాకొక స్పష్టమైన అవగాహన ఉంది. వామపక్ష ఉద్యమాల  ద్వారా స్త్రీ పురుష సమానత్వం సాధించవచ్చనుకున్నాను. కానీ ఉద్యమాలలో కూడా పురుషాధిక్యత ఉండటం గమనించి నిరాశ చెందాను.

  1. 1970లో విరసం ఏర్పడి తొలి మహా సభలు జరిగినప్పుడే మీరు హాజరయ్యారని విన్నాను. అప్పటి మీ అనుభవాలేమిటి? ఆ తర్వాత విరసానికి ఎందుకు దూరమయ్యారు? జనసాహితి లోనూ ఇమడలేక పోయారు మీ కభ్యంతరం లేకపోతే చెప్పండి?

జ. శ్రీశ్రీ షష్టిపూర్తి సభ నుంచీ ఏదో జరుగుతుందని నమ్మకం కలిగింది. విరసం ఏర్పడగానే చాలా సంతోషించాను. ఖమ్మంలో జరిగిన మొదటి మహా సభకు వెళ్ళి మహా మహులందరినీ కలిసి, వాళ్ళతో గొంతు కలిపి నినాదాలిచ్చి ఊరేగింపులో పాల్గొనటం మర్చిపోలేని అనుభవం. అప్పుడు అందరిలో ఒకే భావన. విప్లవం వర్థిల్లాలి. సభ్యురాలినవుతానని శ్రీశ్రీ గారికి ఉత్తరం రాస్తే ఆయనిచ్చిన జవాబు పదిలంగా  ఇప్పటికీ దాచుకున్నా. విరసం సభ్యురాలిగా పని చేశా. విరసంలోంచి బైటికి రావటానికి రాజకీయ కారణాలు  ముఖ్యంగా పనిచేశాయి. విప్లవ పార్టీలో ఏర్పడిన గ్రూపు ప్రజా సంఘాలను కూడా చీల్చాయి. చాలా అనవసరం ప్రజా సంఘా చీలికలు . ‘అది తర్వాత తర్వాత అర్థమయింది. అప్పుడు నేను నాగిరెడ్డి గారి నాయకత్వంలోని సిద్ధాంతాలతో ఏకీభవించి పనిచేసేదాన్ని. విరసం చారు మజుందార్‌, కొండపల్లి సీతారామయ్యగార్ల నాయకత్వంలోని సిద్ధాంతాల ప్రచారం చేస్తున్నట్లు మాకనిపించేది. వాటిమీద చర్చలు  జరిగేవి. నిజానికి రచయితల సంఘం ఒక పార్టీ సిద్ధాంతాకు కట్టుబడి పనిచేయటం కుదిరే పనికాదు. సృజనాత్మకతకు   ఏదో ఒక సంకెల  వేసినట్లే ఉంటుంది. కానీ విద్యార్థి సంఘాలు , రచయిత సంఘాలు , పౌరహక్కు సంఘాలు  అన్నీ గ్రూపుల  వారీగా చీలిపోయాయి. ఆ నేపథ్యంలో నేను జన సాహితిలో చేరాను. కానీ అక్కడ కూడ సాహిత్య విషయాలలో రాజకీయ జోక్యం తప్పలేదు. చలం  గారు మరణించినపుడు మేము రచయితలుగా చేసిన తీర్మానం పట్ల పార్టీ వాళ్ళకు అభ్యంతరాలు . విమర్శలు , చలం  సాహిత్య విషయంలో వాళ్ళ అభిప్రాయాలు  వేరు. అక్కడ మొదలై చాలా విషయాలలో విభేదాలొచ్చాయి. ఈ మొత్తం క్రమంతో పురుషాధిపత్యం కూడా నాకు అనుభవమయింది. అసలు  ‘‘పురుషాధిపత్యం’’ అనే మాటనే అప్పట్లో ఒప్పుకునేవారు. స్త్రీల  సమస్యలు అణచివేత వీటి గురించి మాట్లాడితే ఉద్యమాల ను పక్కదారి పట్టించటమనీ, విప్లవం విజయవంత మైతే స్త్రీ పురుష సమానత్వం వస్తుందని నమ్మ మనేవారు. అది నేను నమ్మలేకపోయిను. సోవియట్‌ యూనియన్‌, చైనాలో విప్లవం వచ్చి దశాబ్దాు గడిచినా స్త్రీ పురుష సమానత్వం రాలేదని తెలుస్తూనే  ఉంది. వీటి గురించి చర్చించు కోవచ్చు. అభిప్రాయ బేధాలతోనే పనిచేయవచ్చు. కానీ వామపక్ష పార్టీలలో సంఘాలలో ఉన్న ఒక ప్రత్యేక క్షణమేమిటంటే నాయకత్వం చెప్పిన మాటతో విబేధిస్తే ఇక వారిని చాలా పరాయి వాళ్ళుగా చూస్తారు. దాదాపు వెలివేస్తారు. సంఘాలకు బైట సంప్రదాయివాదులతోనైనా స్నేహంగా ఉంటారు గానీ వీళ్ళను శత్రువుల్లా చూస్తారు. వారి వెనుక గ్రూపు కడతారు. వ్యతిరేక ప్రచారాలు  నడుపుతారు. చివరికి వారు ఆ సంఘంలో ఉండలేని పరిస్థితి కల్పిస్తారు. వెళ్ళిపోతారనుకున్నపుడు బహిష్కరించా మంటారు. రాజీనామా చేశామని వీళ్ళు, బహిష్కరించామని వాళ్ళు. పులి మేక ఆటలా సాగుతుంది. ఇంతా చేసి అవి విప్లవాన్ని అడ్డుకునేంత పెద్ద విబేధాలు  కూడా అయి ఉండవు. ఒక ప్రజాస్వామిక వాతావరణం లేకపోవటమే అనేకమంది రచయితలు  ఆ సంఘాల లోంచి బైటికి రావటానికి కారణం.

  1. ఆ రాజకీయం, సాహిత్య ఉద్యమాలోంచి స్త్రీ రచయితగా పరిణామం చెందే క్రమంలో మీరు ఎదుర్కున్న సంఘర్షణ, బాధ, రాజకీయ ప్రశ్నలు చివరగా సంతృప్తి వీటి గురించి ఏదయినా చెప్పగలరా?

జ. స్త్రీల  అణచివేత గురించి అధ్యయనం చేసే క్రమంలో నాకు చాలా తృప్తి కలిగింది. ఆయా సంఘాల నుంచి బైటికి వచ్చినపుడు నేను ఒంటరిని. స్త్రీ వాదమంటూ ఒక సమూహం లేదు. ఒంటరిగానే బయలుదేరాను. ఆ ఒంటరితనంలో కొంతకాలం  బాధపడటం సహజమే. కానీ స్త్రీవాద రాజకీయ ఉద్యమాన్ని నిర్మించాలనే ధ్యేయం నాకు చాలా బలాన్నిచ్చింది. అధ్యయనం, రచన, ఉపన్యాసాలు  వీటిని  సాధనాలుగా చేసుకున్నాను. స్త్రీ శక్తి సంఘటన (హైదరాబాద్‌) వారితో పరిచయం నాకు మరింత బలాన్నిచ్చింది. ‘‘అతడు ` ఆమె ` మనం’’ రచనతో మొదలయింది ఆ దిశగా నా ప్రయాణం. అంత వరకూ నేను రచనను సీరియస్‌గా తీసుకోలేదు. నా ముందు తరం రచయితలు  రాస్తున్నారు గదా, నేను మిగిలిన పనులు చేద్దాం అని కార్యకర్తగానే పనిచేస్తూ వచ్చాను. స్త్రీవాద ఉద్యమం నిర్మించాలంటే రచనలు  చాలా అవసరం. నేనే రచయితను,  కార్యకర్తను, నాయకురాలిని కావలిసివచ్చింది ఆ రోజుల్లో.

1985 లో హైదరాబాద్‌ వచ్చాక ఆ పరిస్థితి పోయింది. వరసగా నా నవలలు, సాహిత్య విమర్శ, సిద్ధాంత వ్యాసాలు, అనువాదాలు  రావటంతో ఒక చర్చ మొదలవటం. నా భావాలతో ఏకీభవించే వారితో స్నేహం. అన్వేషి బృందంతో, H.B.T.తో కలిసి పనిచేయటం వీటన్నిటితో చాలా బలం  వచ్చింది. ఫెమినిస్టు స్టడీ సర్కిల్‌ మూడేళ్ళపాటు నడిపాము. ప్రతినెలా ఆ సమావేశం, స్త్రీవాదం గురించి ఉపన్యాసాలు . వాటిని పుస్తకాలు గా తేవటం ఈ పనులన్నీ చేయటానికి అంత శక్తి ఎలా వచ్చిందో ఇప్పుడు తలచుకుంటే  ఆశ్చర్యంగా ఉంటుంది. పైగా ప్రతివారం తెలంగాణాలో ఏదో ఒక పట్టణంలో స్త్రీవాదం గురించి ఉపన్యాసాలు  ఏర్పాటు చేసి నన్ను పిలిచేవారు. తెలంగాణా  అంతా తిరిగాను. స్త్రీవాదం పై ఉన్న భ్రమను, అపోహలను, అపార్థాలను తొగించి ఒక సగౌరవ స్థానాన్ని కల్పించటంలో నా వంతు కృషి నేను చేశాను.

  1. స్త్రీల శరీరాల చుట్టూ అల్లుకుపోయిన అనేకానేక భ్రమలనీ, పితృస్వామ్యాన్ని బట్టబయలు చేస్తూ మీరు రాసిన రాజకీయ కథలు  తెలుగు  సాహిత్యరంగంలో ఒక గొప్ప మలుపు …. ఆ నేపథ్యం చెప్పండి?

జ. రాజకీయ కథల నేపథ్యం ప్రత్యేకంగా ఏమీలేదు. స్త్రీల  శరీరాల గురించి ఎన్నో తరాలుగా  పోగుపడి వున్న మిత్‌ను బద్దలు  కొట్టి శరీర రాజకీయాలను అర్థం చేసుకునే క్రమంలో రాసినవి. ఆ కాలం లో (85 నుంచి  90) ఆ కథలు రాయటం నాకు కష్టమే అయింది. కానీ ఆ పనిలో విజయం సాధించాను.

  1. తెలుగు సాహిత్యంలో పూర్వ రచయితలంతా అప్పటిదాకా స్త్రీలంటే శరీరాలుగా మాత్రమే చూసినా లేని అభ్యంతరం తమ శరీరాల  గురించి, శరీర ధర్మాల  గురించీ స్త్రీలు  మాట్లాడ్డం మొదలు పెట్టాక వారి కవిత్వం, నీలి కవిత్వమంటూ తీవ్రమైన దాడి జరిగింది కదా? ఆ విమర్శల్ని స్త్రీవాదులెలా అధిగమించగలిగారు?

జ. ఔను ` స్త్రీల శరీరాలు  వర్ణనీయ వస్తువు కవులకు. వర్ణనీయ వస్తువే తిరగబడి తనను తానే కొత్తగా నిర్వచించుకుంటాననే సరికి భయపడ్డారు. అందులో కవయిత్రులు  ఎంతో పదునుగా కవిత్వం తొణికిస లాడేలా రాశారు. అప్పటిదాకా వచనరచనకే పరిమిత మయ్యారు, కవితా రంగమంతా తమదే అని ధీమాగా ఉన్న కవుల పీఠాలు  కదిలాయి. అభద్రతతో దాడికి దిగారు. ఆ సమయంలో ‘అస్మిత’ చొరవ తీసుకుని రచయిత్రుందరినీ 1992 అక్టోబర్‌ 2న హైదరాబాద్‌లో సమావేశ పరచి రెండు రోజుల  సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో స్త్రీలు  ఎన్నో విషయాలు  చర్చించుకున్నారు.  అదొక చరిత్రాత్మక సమావేశం. భాష, వస్తువు, స్త్రీ పురుష భావ వ్యక్తీకరణలో భిన్నత్వం, దానికి సామాజిక అంగీకారం సాధించడం ఇలా ఎన్నో విషయాలు  మాట్లాడుకున్నారు. మా చర్చ సారాంశాన్ని ప్రెస్‌మీట్‌ పెట్టి పత్రికల కు విడుదల  చేశాం. ఒక సంవత్సరంలో స్త్రీవాద కవిత్వం సంకలనంగా తేవానుకున్నాం. 1993 అక్టోబర్‌ 3న ‘‘నీలిమేఘాలు ’’ నా సంపాదకత్వంలో వెలువడింది.  రావు బాలసరస్వతి గారు ఆవిష్కరించారు. ఆ సంకలనం ఈ శతాబ్దంలో వచ్చిన రెండవ ఉత్తమ కవితా సంకలనమని చేకూరి రామారావు గారి లాంటి విమర్శకులు  గుర్తించారు. అదంతా తల్చుకుంటే ఇప్పుడు కూడా చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. ‘‘నీలిమేఘాలు ’’ కవితా సంకలనం తర్వాత స్త్రీ వాద కవిత్వానికి ఒక ఆమోదం దొరికింది సాహిత్య ప్రవచనంలోనూ, సమాజంలోను. ఆ కీలక పాత్రను ‘నీలిమేఘాలు ’ నిర్వహించింది.

9.‘స్వేచ్ఛ’ నవల వెలువడి  బహుమతి పొందినప్పు డయితే మీ మీద వ్యక్తిగతమైన దాడి జరిగింది… కొత్త తరం స్త్రీవాదులకీ, కొత్తతరం పాఠకులకీ విషయాలు  తెలిస్తే బావుంటుందనుకుంటే చెప్పండి?

జ.‘స్వేచ్ఛ’ నవల  స్త్రీల  పౌరసత్వాన్ని చర్చకు పెట్టిన మొదటి నవల . దాదాపు సంవత్సరం పాటు, ఇంకా ఎక్కువగానో రాష్ట్రంలో ప్రతి పట్టణంలో చర్చావేదికల్లో చర్చనీయాంశమైంది. అది చాలా మేలు  చేసింది. చర్చలో అనేక విషయాలు  స్పష్టమయ్యాయి. ఇక వ్యక్తిగతమైన దాడి అంటారా ` అసూయతో  ఒకరిద్దరు చేసిన చిల్లర పని. దానిని పట్టించుకోలేదు. దానివలన నా బలం  ఏమిటో, ధైర్య సాహసాలెలాంటివో నాకూ, నా చుట్టూ వారికి తెలిసి వచ్చింది. అలాగే నాకు చాలా మంచి మిత్రులు  దొరికారు. తప్ప, తాలు  లాంటి వాళ్ళు ఎగరిపోయి జీవితం ప్రశాంతమయింది. ఆ రోజుల్లో అదొక సంచలనం. రచయిత్రులు  లోక రీతికి భిన్నంగా జీవించినపుడు రాసినపుడు ఇలాంటివి తప్పవేమో. లలితాంబిక అంతర్జనం, రాజ్యలక్ష్మి వంటి మళయాళ రచయిత్రుల  జీవితాలు తెలుసుకున్నపుడు నే ఎదుర్కొన్న సంఘటన చాలా చిన్నదనిపించింది.

10.‘స్వేచ్ఛ అన్నది ఒక కఠోరమైన బాధ్యత’ అంటారు మీరు. ఆ బాధ్యత పట్ల స్త్రీలను చైతన్యవంతం  చేయడం కోసమే మీరు సాహిత్య రచన చేపట్టారు. మరి ఈ చిరంతన దీక్షలో, తపస్సులో మీరు కృతకృత్యులయ్యారనే అనుకుంటున్నారా?

జ.స్వేచ్ఛ గురించిన ఆలోచన, ఆచరణ సమాజంలో నిరంతరం సాగుతూనే ఉంటుంది. స్వేచ్ఛ తన సరిహద్దును విస్తరించుకుంటూ పోతూనే వుంటుంది. దానికి నిరంతర చైతన్య స్రవంతి వంటి సాహిత్యం అవసరం. దానిని ఏ కాలంలో ఆ కాలానికి తగినట్లు రాసే రచయితలు  వస్తూనే ఉంటారు. ఆ ప్రవాహంలో నేనూ ఒక బిందువును అంతే. కృతకృత్యు లవటం అనేది చిన్న చిన్న పనుల  గురించి చెప్పుకోవచ్చేమో గాని ‘స్వేచ్ఛ’ వంటి భావన కుదరదు. కొత్త అణచివేతను గుర్తిస్తూ దానినుంచి సేచ్ఛ పొందే మార్గాన్వేషణ నిరంతరం చేయాల్సిందే.  ఆ విషయాన్ని నేనా వ్యాసంలో చెప్పాను. ఆ తర్వాత 1992లో రచయితు స్త్రీ వాద కవిత్వం మీద దాడిచేసి ఆ కవయిత్రులను నియంత్రించాలని చూశారు. అప్పుడు అందరం కలిసి ఆ దాడిని ఎదుర్కొన్నాం. ఆ తర్వాత 1997 ` 98 నుంచి పదకొండు భారతీయ భాషలలో రచయిత్రులతో సమావేశాలు  ఏర్పాటు చేసి వారిపై అమయ్యే సామాజిక, కుటుంబ, స్వీయ నియంత్రణ గురించి వర్క్‌షాపులను నిర్వహించాం. ఎన్నో విషయాలు  ఆ రచయిత్రులు  మాతో పంచుకున్నారు. వాటి సారాంశాన్ని పుస్తకాలుగా ఆంగ్లంలో ప్రచురించాం. తెలుగు లో  ‘అక్షర యుద్ధాలు ’ అనే పేరుతో మంచి పుస్తకం అనువాదం చేశాను. అది పై వర్కుషాపు సారాంశమే. దీన్నుంచి రచయిత్రులు  నేర్చుకోడానికి ఎంతైనా వుంది. అనేక కంట్రోళ్ల నుంచి మనం రచయిత్రులం  స్వేచ్ఛ పొందాల్సి వుంది. ముఖ్యంగా మన సహ రచయితల  దాడునుంచి, గురుత్వాల  నుంచి! గురుత్వం అంటే మనల్ని ప్రోత్సహిస్తున్నట్లు, మన రచనలని సరిదిద్దుతున్నట్లు, మనల్ని మరింత మెరుగైన రచయిత్రులుగా తీర్చిదిద్దుతామంటూ వచ్చే వారినుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. వారి ప్రోత్సాహంతో ఒక కంట్రోలు  వుంటుంది. మనకి తెలిసే లోపలే మనం వారి ఆధిపత్యంలోకి వెళ్తాం. మనదైన స్వరం మనకి లేకుండా పోతుంది. దీని గురించి గుజరాతీ రచయిత్రి ‘సరూప్‌ధ్రువ్‌’ చెప్పిన విషయాలు  అందరూ తెలుసుకోవాల్సినవి. ఇలా రకరకాల  సెన్సార్‌ షిప్‌లకు మనం తెలిసీ తెలియక కూడా గురవుతూంటాం. అందుకే ఈ విషయం మీద శ్రద్ధపెట్టి దాదాపు అయిదేళ్ళు పనిచేశాను.

  1. స్త్రీల అస్తిత్వ మూలాలను వెతుక్కుంటూ చైతన్యవంతమై, శక్తివంతంగా నిటారుగా నడిచే క్రమంలో మార్కెట్టు సమాజాన్ని కబళించి, వారిని సరుకుగా మార్చివేసింది. డెబ్భయ్యయిదు శాతం నిచ్చెన ఎక్కాక  పాము నోట్లో పడ్డట్టయింది కదా… మరి ఈ సందర్భాన్ని ఎలా అధిగమించాలి. ?

జ. మార్కెట్‌ ఇవాళ వెయ్యితలల  రాక్షసిలా మారింది గానీ ఎప్పుడూ ఉంటూనే ఉంది. దాని గురించి సాహిత్యం కూడా వస్తూనే ఉంది. ‘సరుకు ఆరాధన’ మార్క్స్‌ మాటే` అది ప్రపంచీకరణ నేపథ్యంలో మరింత అమానుషమైంది. రచయితలుగా మనం ఆ అమానుషత్వాన్ని విప్పి చెబుతూ మానవీయ విలువలను  ప్రతిపాదిస్తూ రచనలను చేయటమే.

  1. పురాణాలను, ముఖ్యంగా రామాయణంలోని కొన్ని సందర్భాలను మన పూర్వ రచయితలు తిరగరాసి పాఠకులకో కొత్త దృష్టినిచ్చారు. మీరు యింకా ముందుకెళ్ళి అందులోని స్త్రీ పాత్రలను ఈ కాలపు సందర్భాలకు తగినట్లుగా మలచి ‘విముక్త’ని అందించారు కదా? అప్పటివరకూ ప్రజల జీవితా లలో కలగలిసి, జీర్ణించుకుపోయిన ఇతిహాసాల్లోన్ని వాదానికి ప్రతివాదం చేయాన్న ఆలోచన ఎలా కలిగింది? సాహసం కదా?

జ. పురాణాలను తిరగరాసే పని త్రిపురనేని రామస్వామి చౌదరి గారే మొదలు పెట్టారు. చలం , కొ.కు వంటి వారు ఆ దారిలో నడిచారు. సాహసం నాది కాదు, వాళ్ళది. ఐతే నా మార్గం భిన్నం. అందువల్లనే ఆ కథలకు ఎంతో ఆమోదం దొరికింది. నాకెంతో తృప్తి కలిగింది. స్త్రీల మధ్య పరస్పర సహకారం నాకు ప్రియమైన భావన. దానిని ‘విముక్త’ కథలో చాలా సమర్థవంతంగా నిర్వహించాననే అనుకుంటున్నా.  ‘పురాణాలోని పాత్రలను ఎగతాళి చేయటం, కించపరచటం కాకుండా వారి జీవితగమనంలోని ఆటుపోట్లని, పరస్పర మానవ సంబంధాలలోని ఆ కాలపు విలువలను  గమనంలో ఉంచుకుని రాయటం వల్ల  నేనాశించిన ప్రయోజనం నెర వేరింది.

  1. సహజంగానే పునరుత్పత్తి శక్తి కలిగిన స్త్రీ… సమాజాలు , జాతుల అభివృద్ధికి దోహదం చేస్తున్నది కదా? మరి స్త్రీల కు ఆ పునరుత్పత్తి హక్కు కూడా లేకుండా చేయడం, పుట్టిన బిడ్డలు తండ్రికి చెందడం, ఈ పునరుత్పత్తి విధులను చూపించి స్త్రీలను ఉత్పత్తి ప్రక్రియనుండి దూరం చేయడం వల్ల  ఏర్పడిన తారతమ్యాలు … వీటన్నిటి గురించి మీరు చాలా మాట్లాడారు. ఈ పాఠకులకు కూడా మీరు కొంత చెప్పండి….

జ. ఉత్పత్తి సమాజ మనుగడకు ఎంత ముఖ్యమో పునరుత్పత్తి అంత ముఖ్యం. దానిలో కీలక పాత్ర స్త్రీది. అక్కడ వారి శ్రమకు విలువ, , గుర్తింపు, గౌరవం దొరకాలి. ప్రస్తుతం అవి లేవు. మాతృమూర్తి, దేవత అని కితాబునిచ్చి ఊరుకుంటారు. ఉత్పత్తిలో రైతు ప్రస్తుత పరిస్థితి వంటిదే పునరుత్పత్తిలో స్త్రీ పరిస్థితి. దాని గురించి ఇంకా ఎంతో సాహిత్యం రావాలి.

  1. స్త్రీలు రాస్తున్నపుడు స్వయం నియంత్రణ, అంటే సెల్ఫ్‌ సెన్సార్‌షిప్‌ వుంటుంది… ఏది రాసినా వారి వ్యక్తిగత జీవితాలతో ముడిపెట్టి చర్చల్లోకి లాగుతారు. అదే పురుషుల విషయంలో అయితే వ్యక్తిగతాన్నే రాసినా రచనగా చెలామణి అయిపోతుంది… రచన అన్నది రచయిత్రులకి ప్రాణావసరం… దీనిమీద మీరు చాలాపని చేశారు. కొంచెం చెప్పండి…

జ. స్త్రీల  సాహిత్యం`సెన్సార్‌షిప్‌ గురించి నేను 1990 లోనే ఒక వ్యాసం రాశాను. భావ కవిత్వంలో రచయిత్రులు  కనిపించక పోవటానికి కారణం, సామాజిక, స్వీయ సెన్సార్‌ షిప్పే. ఆ విషయాన్ని నేనా వ్యాసంలో చెప్పాను. ఆ తర్వాత 1992లో రచయితులు  స్త్రీవాద కవిత్వం మీద దాడిచేసి ఆ కవయిత్రులను నియంత్రించాలని చూశారు.  అప్పుడు అందరం కలిసి ఆ దాడిని ఎదుర్కొన్నాం. ఆ తర్వాత 1997-98 నుంచి పదకొండు భారతీయ భాషలలో రచయిత్రులతో సమావేశాలు  ఏర్పాటుచేసి వారిపై అమలయ్యే సామాజిక, కుటుంబ, స్వీయ నియంత్రణ గురించి వర్క్‌షాపును నిర్వహించాం.

ఎన్నో విషయాలు  ఆ రచయిత్రులు   మాతో పంచుకున్నారు. వాటి సారాంశాన్ని పుస్తకాలుగా ఆంగ్లంలో ప్రచురించాం. తెలుగులో ‘అక్షర యుద్ధాలు ’ అనే పేరుతో మంచి పుస్తకం అనువాదం చేశాను. అది పై వర్కుషాపు సారాంశమే. దీన్నుంచి రచయిత్రులు  నేర్చుకోడానికి ఎంతైనా వుంది. స్వేచ్ఛ పొందాల్సి వుంది. ముఖ్యంగా మన సహ రచయితల  దాడుల  నుంచి, గురుత్వా నుంచి! గురుత్వం అంటే మనల్ని ప్రోత్సహిస్తున్నట్లు, మన రచనని సరిదిద్దు తున్నట్లు, మనల్ని మరింత మెరుగైన రచయిత్రుగా తీర్చిదిద్దుతామంటూ వచ్చేవారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. వారి ప్రోత్సహంలో ఒక కంట్రోలు  వుంటుంది. మనకి తెలిసే లోపలే మనం వారి ఆధిపత్యంలోకి వెళ్తాం. మనదైన స్వరం మనకి లేకుండా పోతుంది. దీని గురించి గుజరాతీ  రచయిత్రి ‘సరూప్‌ ధ్రువ్‌’ చెప్పినవి   అందరూ తెలుసుకోవాల్సినవి. ఇలా రకరకాల సెన్సార్‌షిప్‌కు మనం తెలిసీ తెలియక కూడా గురవుతూంటాం. అందుకే ఈ విషయం మీద శ్రద్ధ పెట్టి దాదాపు 5 సంవత్సరాలు  పని చేశాను.

  1. మీ నృత్యరూపకాల గురించి, స్త్రీవాద కోణంలో వాటినెలా రూపొందించారు?

జ. సంప్రదాయ సంగీత నృత్యాల ను ఆధునిక భావాలు  చెప్పటానికి ఉపయోగించాలనే ఆలోచన నాకు చాలా రోజు ల నుంచీ ఉంది. యక్షగానాలనూ, నృత్య రూపకాలనూ మనం నిర్లక్ష్యం చేయగూడదనీ, ఆ ప్రక్రియల్లో కేవలం  పురాణ కథలు  భక్తి గాథలే కాక వర్తమాన కథలు , సమస్యలూ  చిత్రించి ప్రజలకు రసానుభూతితోపాటు కొత్త ఆలోచనలను  కూడా అందించవచ్చని నా అభిప్రాయం. 2000 సం॥లో ‘‘యుద్ధము `శాంతి’’ అనే నృత్య రూపకం రాశాను. ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌  విమెన్స్‌ స్టడీస్‌. జాతీయ సదస్సు హైదరాబాదులో ఆ సంవత్సరం జరగటంతో ఆ సదస్సులో ప్రదర్శించాం. మంచి స్పందనే వచ్చింది. ఆ ప్రదర్శనకు ప్రముఖ నాట్య గురువు శ్రీమతి ఉమారామారావు గారు నృత్య దర్శకత్వం వహించారు. రెండేళ్ళు ఆ నృత్య రూపకం ఆంధ్రప్రదేశ్‌ లోని ముఖ్యపట్టణాల్లో, డిల్లీ , జయపూర్‌, త్రివేండ్రం వంటి భారతీయ నగరాల్లో ప్రదర్శించాం. ఆ తర్వాత ప్రసిద్ధ కూచిపూడి నృత్య విద్వాంసులు  శ్రీ భాగవతుల  సేతురాం గారు దర్శకత్వ బాధ్యతలు  తీసుకున్నారు! ఆ నృత్య రూపకం దాదాపు వంద ప్రదర్శనలు  ఇచ్చాం. అందులో సీత, శూర్పణఖ, ద్రౌపది, మాధవి వంటి పురాణ పాత్రలతో పాటు దేశ విభజన ఘట్టంలో  హింసకు గురైన స్త్రీల కథ ప్రముఖంగా ఉంటుంది. ఇతి హాసాలలో స్త్రీలు  నలుగురూ కలిసి ‘‘అనాదిగా స్త్రీ శరీరం పిత్రుస్వామ్య సంఘర్షణ రంగస్థలం , చరిత్రలో ప్రతి సమరం నారీ శరీరోపరిత నిర్మితమని తేల్చి చెప్పిన తర్వాత ఆధునిక కాలం  మనందరికీ తెలిసిన వాస్తవ సంఘటన దేశ విభజన ఘట్టాన్ని తీసుకున్నాను. ఆ సంఘటన అందరికీ.. తెలిసినదనుకుంటాం గానీ తెలియని విషయాలు  ఎన్నో ఉన్నాయి.

ప్రతి సమరం నారీ శరీరోపరిత నిర్మితమనీ’’ చెప్పిన తరువాత ఆధునిక కాలానికి వచ్చాను. మనదేశంలో దేశ విభజన సమయంలో, ఉత్తర భారతదేశంలో, సరిహద్దు రాష్ట్రాలో జరిగిన మతకల్లోలాలలో స్త్రీ జీవితాలు  నాశనమైన ఘట్టాన్ని తీసుకున్నాను. దేశ విభజన జరిగినపుడు హిందూ స్త్రీలను ముస్లిములు , ముస్లిం స్త్రీలను హిందువులూ ఎత్తుకెళ్ళారు. స్త్రీల  మీద అత్యాచారాలు  చేశారు. తమ స్త్రీలు  అత్యాచారాలకు గురవుతారనే భయంతో పురుషులు తమ భార్యలను, అక్కచెల్లెళ్ళను, తల్లులను  తామే చంపేశారు. స్త్రీల  శరీరాలు  అత్యాచారానికి గురైతే తమ వంశపు పరువు మర్యాదలు , పవిత్రత మట్టిలో కలుస్తాయనే భయంతో తమ స్త్రీల  ప్రాణాలే తీశారు వారు. అపహరణకు గురైన ఇరు దేశాల  స్త్రీలూ  దేశంకాని దేశంలో ఎన్ని అగచాట్లో పడ్డారు. తిండికీ బట్టకూ ముఖం వాచారు. జీవన పోరాటంలో అందిన ఆసరాతో నిలబడ్డారు. కొన్నిసార్లు తమని ఎత్తుకెళ్ళిన వాళ్ళతోనే జీవితం సాగించారు. ఆశ్రయ మిచ్చిన వారితోనే జీవితం పంచుకున్నారు. పెళ్ళి చేసుకున్నారు. పిల్లల్ని  కన్నారు. ఇంత జరిగాక, ఇంతకాలం  గడిచాక ప్రభుత్వాలు పౌరుషాలతో మేల్కొన్నాయి. తమ దేశాల  స్త్రీలను వెనక్కు పిలిపించు కునే పనిని చేపట్టాయి. కుదురు తెచ్చుకున్న జీవితాలను మళ్ళీ కూకటి వేళ్ళతో పెళ్ళగించ బూనుకున్నారు. స్త్రీలు  రామని మొత్తుకున్నా, ఎలాగోలా బతుకుతున్న తమని మరొకసారి పెళ్ళగించ వద్దని ప్రార్థించినా వినకుండా స్త్రీల  మార్పిడీ కార్యక్రమాన్ని అమలు  జరిపారు. స్త్రీలు  కన్న బిడ్డల్ని ఒదిలి, వివాహమాడిన వారిని ఒదలి, ఆ కుటుంబాల ను ఒదిలి వెళ్ళాల్సి వచ్చింది. తమను ఎత్తుకెళ్ళిన వారి మతాన్ని స్వీకరించాల్సి వచ్చిన ఆ స్త్రీలు , తిరిగి వెళ్ళాంటే తమది ఏమతం అనే ప్రశ్న, తమ పిల్లలది  ఏ జాతి అనే ప్రశ్న ఎదుర్కొన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం లేదు.

మాతృదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషిద్దా మంటే వారి కుటుంబాలు  వారిని స్వీకరించలేదు. ఇన్నేళ్ళు వేరే దేశంలో ఉండి, వేరే మతస్థుడిని వివాహమాడి, ఆ మతం స్వీకరించి, అక్కడే పిల్లల్ని  కని వచ్చిన స్త్రీలను  కుటుంబాలు  ఆదరిస్తాయా? ఆ స్త్రీలు  ఒంటరిగా ప్రభుత్వం ఏర్పరచిన శరణాలయాల్లో జీవితం వెళ్ళబుచ్చాల్సివచ్చింది. తమ కంటూ ఎవరూ లేని మోడు బతుకు బతకాల్సి వచ్చింది. వారిలో కొందరు ఇంకా బతికే ఉన్నారు. దేశ విభజన ఘట్టాన్ని వివరంగా చిత్రించిన తర్వాత, ప్రస్తుతం యుద్ధోన్మాదంలో కొట్టుకుపోతున్న ప్రపంచ దృశ్యాన్ని ‘స్థూలం’గా చూపి, శాంతి ఆవశ్యకతనును తెలిపే నృత్యాలతో ముగించాను.

ఈ రూపకంలో ‘రఘుపతి రాఘవ’ రెండవ నృత్య రూపకం లక్ష్మణరేఖ. కుటుంబ హింస గురించిన సారాంశంతో ఉంటుంది. అంబ పరాకుతో మొదవుతుంది కానీ అంబగా స్తుతించిన వాళ్ళందరూ భారతాంబకు కీర్తి తెచ్చిన పుత్రికలు  సావిత్రిబాయి ఫూలే, దుర్గాబాయి నుంచీ సువార్తమ్మ, అలీసమ్మ వరకూ అందరి స్తుతీ ఉంటుంది. తర్వాత గాంధారి, ఊర్మిళ, రేణుక మనసులు  చదివి ఆధునిక స్త్రీ కలలు, ఆశలు  – అవి విఫమయ్యే తీరు, పిత్రుస్వామ్య కుటుంబాధిపత్యం వీటన్నిటినీ చెప్పి ఇన్ని అవరోధాలున్నా స్త్రీలు  ముందడుగువేస్తున్న తీరుపై ఆశావహ దృక్పథం కల్పించి ముగింపు ఇచ్చాను. దశావతారం దరువులో స్త్రీలు  వివిధ రంగాలో రాణిస్తున్న తీరు చెప్పే ప్రయత్నం చేసి సఫలమైనందుకు గర్వపడ్డాను. ఈ రూపకం 2004 నుంచి ఇప్పటి వరకూ కొన్ని వంద ప్రదర్శనలు  జరుపుకుంది. దేశమంతటా, శ్రీలంకలో కూడా ప్రదర్శించాము.

16.మీ సినిమాలు , టి.వి.సీరియల్స్‌ ముఖ్యంగా ‘కన్నీటి కెరటాల  వెన్నెల ’లో ప్రపంచ ప్రసిద్ధ సినిమా నెన్నింటినో  పరిచయం చేసిన ఘనత మీది… ఆ నవలా నేపథ్యమేమిటి? సినిమాకి, సీరియల్స్‌కీ స్క్రిప్ట్‌, సంభాషణలు  రాయడం అంత అలవోకగా  ఎలా అలవాటయ్యింది?

జ.నేను 1986లో పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళి ఫిలిం అప్రిసియేషన్‌ కోర్స్‌ చేశాను. ఆ కోర్సులో భాగంగా ప్రపంచ ప్రసిద్ధ సినిమాలు , సినిమా చరిత్ర, అనేక సాంకేతిక విషయాల  గురించి నేర్చుకున్నాను. ప్రతిరోజూ రాత్రి ఆ రోజు నేను చూసిన, నేర్చుకున్న విషయాలన్నింటిని కుటుంబరావుకి ఉత్తరం రాసేదాన్ని. ఆ కోర్సు ముగించి వచ్చాక కుటుంబ రావు ఆ ఉత్తరాలన్నీ నా ముందు పెట్టి ‘‘నవలగా రాస్తే బాగుంటుందేమో. ఆలోచించ’’ మన్నాడు. నేను నా పద్ధతిలో దాన్నొక నవలగా రాశాను. ఆ తర్వాత కొద్ది నెలలకే ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’ కథా విభాగం నిర్వాహకురాలిగా చేరాను. దాదాపు 10 సం॥ ఆ సంస్థలో పనిచేశాను. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు వెళ్ళి మరిన్ని గొప్ప సినిమాలు  చూశాను. ఎన్నో స్క్రిప్టులు  చదవడం, రచయితలతో, దర్శకులతో చర్చించడం, మార్పు, చేర్పులు చెయ్యటం యివన్నీ నా ఉద్యోగంలో భాగం. ఇదంతా తర్వాతికాలం లో నేను సినిమా, టీవీ లకు రాసేటప్పుడు ఉపయోగ పడిరది. చాలా మెళకువలు  నేర్చుకున్నాను.

  1. ఆ నవలలో ‘ఇప్పటి మన సాహిత్యం మనరాష్ట్రంలో ఫాసిస్ట్‌ సమాజాన్ని యాంటిసిపేట్‌ చేసింది’ అన్పించారో పాత్రచేత… మరి ఇన్నేళ్ళ తరువాత భావస్వేచ్ఛని హరిస్తూ రచయిత మీద భౌతిక దాడులు ….. తినే తిండిమీద నిర్భంధం, అవార్డు తిరస్కరణ… వీటి గురించి మీరేమనుకుంటున్నారు?

జ. ఇప్పుడు దేశమంతా ఫాసిస్టు పాలనలో ఉందనిపిస్తోంది. ఈ అసహన పూరితమైన, ద్వేషాన్ని రగిలించే వాతావరణాన్ని బాగుచేసుకోవటానికి, శాంతి సామరస్యాలను జీవన విధానంలో భాగం చేసుకోవటానికి రచయితలు , మేధావులు  ఎవరికి తోచిన, ఇష్టమైన మార్గంలో, వారు పని చేయాల్సి ఉంది. భావ ప్రకటనా స్వేచ్ఛ రచయితకు ఊపిరి. దానిని ప్రభుత్వాలే కాదు, వీధి గుంపులు  కూడా హరిస్తున్నాయి. దీనిపట్ల అందరం అప్రమత్తంగా ఉండాలి.

  1. అస్మితతో మీ అనుబంధం గురించి చెప్తారా?

జ: అనుబంధం అనేది సరైనమాట కాదేమో. అస్మిత, నేను వేరు కాదు. గత పాతికేళ్ళుగా అస్మిత  వ్యవస్థాపక సభ్యురాలిని. అధ్యక్షురాలిని. అస్మిత కిప్పుడు పాతికేళ్ళ వయసు. పాతికేళ్ళ క్రితం వరకూ మేము అంటే నేను, వసంత్‌ కన్నబిరాన్‌, కల్పన  కన్నబిరాన్‌ తదితర మిత్రులం  అటానమస్‌ సంఘాలలో పనిచేస్తుండేవాళ్ళం. నేను 1987 నుంచి హైదరాబాదులో ఫెమినిస్టు స్టడీ సర్కిల్‌ నిర్వహించాను స్నేహితులతో కలిసి. డౌరీ డెత్‌ కమిటి ఉండేది. స్త్రీ శక్తి సంఘటన ఇంక చిన్న చిన్న సంఘాలుండేవి. మేమంతా వేరే వేరే ఉద్యోగాలు  జీవిక కోసం చేస్తూ, ఆ డబ్బు, ఆ ఉద్యోగాలకు పోగా మిగిలిన సమయం, శలవుదినాలు  మాత్రమే మాకు నిజమైన ఆసక్తి ఉన్న రంగంలో పనిచేయగలిగే వాళ్ళం. మాకు ఉన్న శక్తి అంతా స్త్రీ ఉద్యమానికి పెట్టాలని ఉన్నా కుదిరేది కాదు. ఏదైనా అత్యవసరమైన పని ఉన్నపుడే అందరం కలవగలిగేవాళ్ళం. నిజంగా సమస్య వచ్చినపుడు కొందరికి శలవు దొరక్క, డబ్బుకి ఇబ్బందై, చాలా కష్టాలు  పడేవాళ్ళం. కానీ చాలా ఇష్టంగా ఆ కష్టాలను స్వీకరించేవాళ్ళం. వాటిని చూసి నవ్వుకునే వాళ్ళం. అంతవరకూ బాగానే ఉంది గానీ మా తర్వాతి తరం ఇలా పనిచేసే వాతావరణం కనిపించటంలేదు. సమస్యులున్న స్త్రీలు  మా దగ్గరకు రావటానికి మాకు మా ఇల్లు  తప్ప వేరే చోటు, ఒక కార్యాయం అంటూ లేదు. వీటన్నిటితో ఒక  సంస్థను ఏర్పాటు చేసుకుని, దానికి నిధులు  సమకూర్చుకుని, మేము, ఇంకా ఆసక్తి ఉన్నవాళ్ళు పూర్తికాలం  ఆ సంస్థ ద్వారా మా ఆశయాల  కోసం పనిచేయవచ్చు గదా అనే ఆలోచనవచ్చింది. నిధులంటే ప్రభుత్వ, ప్రభుత్వేతర విదేశీ సంస్థల   నుంచి తీసుకోవాలి. దానిమీద చాలా చర్చ జరిగిన తర్వాత` మా ఆశయాలతో ఏకీభావం ఉండి మమ్మల్ని స్వతంత్రంగా పనిచేసుకోనిచ్చే సంస్థలు  ఏవైనా వాటినుండి ఆర్థిక సహాయం తీసుకుంటే దానివల్ల  హాని లేదనుకున్నాం. 1991లో అస్మిత ప్రారంభించాం. ఎన్జీవో గురించి సమాజంలో, ముఖ్యంగా వామపక్ష పార్టీలలో, విప్లవోద్యమంలో అంటరానితనం, వెలి వంటివి ఉన్నాయి. దానిని భరించటం, విదేశీ నిధులు , విలాస జీవితాలు  అని తెలియకుండా మాట్లాడే మాటలు , అనేక నిందలు  భరించాం. కానీ ఎంతపని చేయగలిగామో చూసుకుంటే అవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. మా ఆశయాలకొక చోటు, మా సృజనాత్మక  శక్తును వెలికి తీసుకురావటానికి కావసిన సమయం, పదిమంది కలిసి పనిచేయటం ఎలాగో నేర్చుకునే వీలు -ముఖ్యంగా ఆపదలో అపాయంలో ఉన్న స్త్రీలు  వెంటనే వచ్చి ఓదార్పునీ సహాయాన్ని పొందటానికి ఒకచోటు కల్పించగలగటం- ఇలా ఎన్నో ప్రయోజనాలి . అన్నిటికంటే గ్రామీణ స్త్రీలతో నేరుగా మాట్లాడి వాళ్ళకు వారి కుటుంబ సమస్యల  లోని రాజకీయాల నుండి, అంతర్జాతీయ రాజకీయాల  వరకూ అన్నీ తేలిక భాషలో అర్థమయ్యేలా చెప్పగలిగే అవకాశం అస్మిత వల్ల  కలిగింది. ‘జాతర’ అనే రూపంలో పాటు, స్ట్రీట్‌ ప్లేస్‌, స్త్రీలకు అవసర మయ్యే చట్టపరమైన, హక్కు, ఆరోగ్యపరమైన చిన్న పుస్తకాల  ద్వారా గ్రామాల కు వెళ్ళి వేలాది స్త్రీల ను కలిశాం.  గ్రామీణ మహిళా సంఘాల తో నెట్‌వర్కింగ్‌ చేసి అనేక విషయాలు  వాళ్ళకు బోధించాం. ‘దళిత మహిళా నాయకత్వానికి తోడ్పాటునందించాం. ఇక రచయిత్రుల తో కలిసి పనిచేశాం. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ‘‘సెన్సార్‌షిప్‌ ` విమెన్‌ రైటింగ్‌’’ గురించి పనిచేశాం. ‘‘మహిళావరణం’’ ` ఆంధ్రదేశ చరిత్రను నిర్మించిన స్త్రీల  గురించి పరిశోధించి గొప్ప పుస్తకం తెచ్చాం. కూచిపూడి భరతనాట్యం వంటి సంప్రదాయ రూపాల లో  ఆధునిక భావాలు చెబుతూ, స్త్రీల పై హింస గురించి మాట్లాడుతూ ఆ రూపాలు  నభిమానించే వారికి  కూడా ఆలోచించేందుకు మా భావాల  నందించాం. స్త్రీల  హక్కు గురించి మొదలైన అస్మిత   వికలాంగు ట్రాన్స్‌ జండర్‌ హక్కు గురించి పనిచేసే వరకూ విస్తరించింది. వసంత్‌ కన్నబిరాన్‌, నేను, కల్పనా  కన్నబిరాన్‌ ముగ్గురం కలిసి పాతి కేళ్ళు పనిచేయగలిగాం. ముగ్గురం స్నేహంగా ఒకరి బలాల  నుంచి ఒకరం నేర్చుకుంటూ, ఒకరి బలహీనత నొకరం అర్థం చేసుకుంటూ ఎదిగామనుకుంటున్నాను. మా ముగ్గురి స్నేహం మాకు ఎంతో అపురూపం. అమూల్యం .

  1. మీరు చాలా దేశాలు పర్యటించారని అనుకుంటాను.

జ: అన్నీ పనిలో భాగంగానే 1995లో బీజింగ్‌లో నాల్గవ  ప్రపంచ మహిళా సదస్సుకి ప్రతినిధిగా వెళ్ళాను. 2000 సం॥లో బీజింగ్‌ G 5 న్యూయార్క్‌లో యు.ఎన్‌. కార్యాయంలో జరిగింది. దానిలో ప్రతినిధిగా పాల్గొనటం మంచి అనుభవం. యు.ఎన్‌. తో కలిసి బీజింగ్‌ నిర్ణయాలను దక్షిణాసియా గ్రామీణ మహిళకు అందించే పనిలో దక్షిణ భారతదేశ బాధ్యతను తీసుకుని పనిచేశాను. ఆ పనిలో భాగంగా బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌లో జరిగిన యు.ఎన్‌. సమావేశాలకు హాజరయ్యాను. 1996లో న్యూజర్సీ రడ్గస్‌ యూనివర్సిటీలో  సదస్సుకి హాజరయ్యాను. మా బాల చిత్రం ‘‘పాత నగరంలో పసివాడు’’ కైరో ఫిలిం ఫెస్టివల్‌కు   ఎంపికైన సందర్భంలో ఈజిప్టు వెళ్ళాను.

ఈ దేశాలకు వెళ్ళటం కాదు. అక్కడి వారితో కలిసి పనిచేయగలగటం, పరస్పరం ఒకరి సమస్యలొకరు తెలుసుకోగలగటం చాలా బాగుంటుంది.

ముఖ్యంగా యు.ఎన్‌. మీటింగులో దక్షిణాసియా దేశాల ప్రతినిధుతో గడిపిన రోజులు చాలా విలువైనవి. ఎంతో మంచి స్నేహితులను సంపాదించుకోగలిగాను. వాళ్ళు ఇప్పటికీ ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే అది వారికి నాకూ కూడా ఎంతో ముఖ్యం అని అర్థం కదా!

  1. చివరగా, నిజానికి ముందుగా కుటుంబరావు గారితో మీ సాహచర్యాన్ని గురించి చెప్పండి… సహచరులు యిలా కూడా వుండొచ్చు అని మీరు నిరూపించిన వైనం, భార్యాత్వాన్ని శిరసావహిస్తూ, కుటుంబాలలో మగ్గిపోతోన్న స్త్రీలకి కొంత తెలియాలి కదా.

జ: కుటుంబరావు నేను మంచి స్నేహితులం. జీవన సహచరులం . భార్యా భర్తలం  కాదు. మా మధ్య ఆ రకమైన అధికార సంబంధం లేదు. కుటుంబంలో ప్రజాస్వామిక సంబంధాలుండాని నమ్మే వ్యక్తులం  కాబట్టి ఒకరి అభిప్రాయాల్ని ఒకరం గౌరవించు కుంటూ ఒకరి మార్గానికొకరు అడ్డుపడకుండా వీలైనంత సహకరిస్తూ జీవిస్తున్నాం. మా ఇద్దరి అభిరుచులు , అభిప్రాయాలు , భావాలు , ప్రాపంచిక దృక్పథాలు  ఒకటే అవటం వల న మా సాహచర్యం చాలా ఫలవంతంగా సాగుతోంది. ఇద్దరం మేమనుకున్న పనులు  చేయగుగున్నాం. ఇద్దరికీ  ఒకటే ఆలోచనలున్నాయని, మాకు అభిప్రాయ బేధాలే రావని అర్థం కాదు. ఇద్దరం వాదించు కుంటాం. విబేధాలు  విబేధాలుగానే మిగిలే సందర్భాలు  కూడా ఉంటాయి. అయితే అవి మా స్నేహానికి అడ్డం రావు. ఎలకను మింగే పిల్లిగా మా ఇద్దరిలో ఎవరమూ లేము. ఆధిపత్యం అనే మాట మా ఇద్దరికీ సరిపడదు. మా పిల్లలు  నలుగురూ కూడా మమ్మల్ని అర్ధం చేసుకున్నారు. మేము వాళ్లకిచ్చిన స్వేచ్ఛను ప్రజాస్వామిక వాతావరణాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

  1. జీవితమంతా యిన్నిన్ని ఆటుపోట్లను ఎదుర్కుంటూ కూడా ఎప్పుడూ యింత ప్రశాంతంగా ఎలా వుండ గలుగుతున్నారు? మీకెప్పుడూ అసహనం కలగదా?

జ: నా అసహనమంతా మనుషుల  జీవితాలను అస్త వ్యస్తం చేసి అశాంతిమయం చేసే పితృస్వామిక సమాజం మీద. ఆ అసహనాన్ని కోపాన్ని నా రచనలలో తీవ్రంగానే ప్రకటిస్తాను. ఈ సమాజం లోని అవకతవక వల్లనే  నా జీవితం లోని ఆటుపోట్లు కూడా. దానికి వ్యక్తుల  పట్ల అసహనం చూపించి ప్రయోజనం లేదు. ఇది తెలిశాక వ్యక్తుల  పట్ల అసహనం చాలా తక్కువసార్లు వస్తుంది.

  1. కొత్తగా రాస్తున్న స్త్రీల కు మీ సూచను?

జ: సమాజాన్ని, దానిలోని అసమానతను, అణిచి వేతను అర్థం చేసుకుని రాయమంటాను. సామాజికాధ్యయనం, నిరంతర సాహిత్య పఠనం, రచయిత్రులకు అవసరం.

  1. సాహిత్య విమర్శలో ‘రాజ్యాంగ నైతికత’ అనే భావనని మీరు కొత్తగా ప్రవేశపెట్టారు. దాని గురించి వివరించండి.

జ:‘రాజ్యాంగ నైతికత’ అనే భావనను అంబేద్కర్‌ అందించాడు. మన దేశానికి రాజ్యాంగ రచన జరిగాక ప్రజల  జీవితం, సామాజిక విధి విధానాలు  రాజ్యాంగం ప్రకారం నడవాలి. పాత ఆచార సంప్రదాయాలు  మరుగునపడి పోవాలి. స్త్రీ పురుష సమానత్వం ప్రాధమిక హక్కుల్లో చెప్పిన తర్వాత సంప్రదాయాల  ప్రకారం స్త్రీ మీద విధించే అసమానత్వపు ఆచారాల ను, పోకడను మనం పాటించకుండా ఉండే సంస్కారాన్ని అల వరచు కోవాలి. అలాగే కులం , అంటరానితనం విషయాల్లో కూడా రాజ్యాంగం చెప్పినట్లు నడుచుకోవాలి గానీ పురాణా సంప్రదాయాల  ప్రకారం పోతే శిక్షార్హు లవుతారు. పాత నీతుల  స్థానంలో మనకు రాజ్యాంగ బద్ధమైన నైతిక విలువలు  సమకూరాయి. మన స్వాతంత్య్రానంతర సాహిత్యంలో అనేకమంది  రచయితలు  ఈ నైతికతను ప్రజల కు అందించే రచనలను చేశారు. ఈ భావనతో, ఈ దృష్టితో సాహిత్య విమర్శ చేస్తే ప్రజకుల  ఆ నైతిక విలువ ప్రాధాన్యం మరింత వేగంగా వివరంగా అర్థమవుతుంది. ఆ ఆలోచనతో నేను ఆ సాహిత్య విమర్శనా రీతిని పరిచయం చేయాలనుకున్నాను. అక్కినేని కుటుంబ రావు నాలుగు నవలలను ఆ దృష్టితో విశ్లేషించాను. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. మిగిలిన రచయితల  రచనల ను ఈ దృష్టితో అంచనా వేయా లనిపించింది. సాహిత్య అకాడెమి సహకారంతో, అస్మితను సమన్వయ పరచి రెండు రోజు పాటు ‘‘రాజ్యాంగ నైతికత ` స్వాతంత్య్రానంతర తెలుగు  సాహిత్యం’’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించాను. దాదాపు ఇరవై మంది రచయితల  ముఖ్య రచనను ప్రసిద్ధ విమర్శకులు  ఈ దృష్టితో విశ్లేషించారు.   చాలా మంచి స్పందన వచ్చింది. సాహిత్య విమర్శనా పరికరాలను పెంచుకుంటూ విస్తరించుకుంటూ పోవాలి. అది నాకు చాలా ఇష్టమైన పని.

24.మీరు చాలా విస్తృతంగా రాసి సాహిత్యాన్ని, సాహిత్య రంగంలో స్త్రీవాద భూమికని వేగవంతం చేశారు… కథ, కవిత, నవల , వ్యాసం, నృత్యరూపకం,  నాటకం, సినిమా, అనువాదాలు … యిలా అన్ని ప్రక్రియల్లోనూ మీరు కలాన్ని కదిపారు. మరి మీ సాహిత్యం మీద జరగవలసినంత చర్చ జరిగిందనే మీరు అనుకుంటున్నారా?

జ.‘స్వేచ్ఛ’, ‘మానవి’, ‘రాజకీయ కథలు ’ వచ్చినప్పుడు వాటిమీద చాలా విస్తృతంగా చర్చ జరిగింది. నేను అనువాదం చేసిన ‘భూమిపుత్రిక’, ‘మూడు తరాలు ’, ‘పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం’ లాంటి నవలలు మీద కూడా చర్చ జరిగింది. తర్వాత ‘అయోని’, ‘భిన్న సందర్భాలు ’, ‘ప్రయోగం’, ‘కేసు’ యిలా ఒక్కొక్క కథ ఒక్కొక్క సంచలనమై వాటిచుట్టూ ఎన్నో వాద, వివాదాలు , చర్చలు  జరిగాయి. ఇదంతా 90వ దశాబ్దం వరకూ ఆ తర్వాత పత్రికలలో సాహిత్యా నికి, ముఖ్యంగా సాహిత్య విమర్శకు చోటు తగ్గిపోయింది. అయితే విడివిడిగా గ్రూపుగా చర్చలు  సాగిస్తూనే వున్నారు.

  1. భవిష్యత్తులో ‘ఆటోబయాగ్రఫీ’ రాయాన్న ఆలోచన ఏమయినా వుందా? మీ జీవితం, సాహిత్యం, ఉద్యమ పోరాటం… ఈ మొత్తం దాచేస్తే దాగని సత్యా లన్నింటినీ రికార్డ్‌ చేయాల్సిన అవసరం లేదా?

జ: ఆటో బయోగ్రఫీ గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదు.

*