తెలుగు హాస్యానికి కొత్త లెవెలు!

?

?

 -కొల్లూరి సోమశంకర్ 

~

 

తెలుగులో వ్యంగ్య రచనల ప్రాభవం కాస్త తగ్గుతోందని అనిపిస్తున్న సమయంలోనే ప్రసన్నకుమార్ సర్రాజు గారి కథల సంకలనం వెలువడి ఆ లోటుని కాస్త అయినా తీర్చింది.

ప్రస్తుత కాలంలో వ్యంగ్యం తగ్గడానికి కారణమేమిటో ముందుమాట వ్రాసిన ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణగారు వెల్లడించారు. “వ్యంగ్యం అంటే సత్యానికి ఆమడ దూరంలో ఉండి నవ్వు పుట్టించేది. ఇప్పుడు అంత దూరాన్ని సృష్టించడం కష్టమై వ్యంగ్యం తేలిపోతోంది” అన్నారాయాన.

మరో ముందుమాట వ్రాసిన ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ గారు ఈ పుస్తకం గురించి చెబుతూ, “తెలుగు సినిమా లాంటి వల్గారిటీకీ, మీలో (పాఠకులలో) చక్కని సంస్కారానికి అప్పీల్ చేసే హాస్యానికీ తేడా ఉంటుంది. ప్రసన్న కథలీ పని చేస్తాయి” అన్నారు.

ప్రతీ మాటలో, పనిలో, జీవితాల వివిధ కోణాల్లో, ఏది తాకితే నవ్వొస్తుందో కొంతమందికే తెలుసు” అంటూ ఆ కొద్దిమందిలో సర్రాజు ఒకరు అంటారు డా. మాచిరాజు రామచంద్రరావు.

వీరి మాటలు, ఈ అభిప్రాయాలు చదివితే, ఓ మంచి పుస్తకం చదవబోతున్న నమ్మకం కలుగుతుంది. నిజమే… ఆ నమ్మకం వమ్ము కాదు.

ఈ పుస్తకంలో పన్నెండు కథలున్నాయి. అన్ని కథల్లోనూ హాస్యమూ, వ్యంగ్యమూ బాగా పండాయి. రాజకీయాలు, సినిమా, కార్పోరేట్ విద్య, పత్రికలు, టీవీ తదితర రంగాల తీరుతెన్నులపై పంచ్‌లు వేసిన కథలివి.

అనైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా” కథ దేశంలోని రాజకీయాలపై గొప్ప సెటైర్. ఒకప్పటి రాష్ట్రాలన్నీ చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోతే ఎలా ఉంటుందో ఈ కథలో హాస్యంగా వివరించారు. విజయవాడ నగరమే ఈ కథలో అనేక చిన్న రాష్ట్రాలుగా విడిపోయింది. కాలువల జలాల పంపకాలపై విబేధాలు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళడానికి వీసాలు, బోలెడుమంది గవర్నర్లు, వాళ్ళ పిఎలు, ప్రతిపక్ష నేతలు… కథ రంజుగా ఉంటుంది. ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వెళ్ళి వైద్యం చేయించుకుంటాడు. “ఆపరేషన్‌కి పక్క రాష్ట్రానికెళ్ళడం మన రాష్ట్ర వైద్యులను అవమానించడమే. విరాష్ట్రీ మారక ద్రవ్యాన్ని వృధా చేసే హక్కు మీకెవరిచ్చారు?” అంటూ ప్రతిపక్ష నాయకుడు గొడవ చేస్తాడు. ఇలా పదే పదే ఏదో కారణం మీద గొడవలు చేసి, అరెస్టయి, బెయిల్ పై విడుదలయితే గానీ తోచదట ఆయనకి. పైగా ఇదొక యోగాట. పేరు ధర్నాయోగ లేదా యాగీయోగ. దాంతో ఆయనకున్న షుగరు, కీళ్ళవాతాలు అన్నీ పోయి చక్కగా రక్తప్రసరణ అయి, పదికాలాల పాటు అరెస్టయి బ్రతకొచ్చట!! చదువుతున్నంత సేపూ నవ్వుతూనే ఉంటాం.

రాజకీయాలపైనే మరో వ్యంగ్య కథ “ఇండిపెండెంట్స్ డే“. స్వతంత్ర్య అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడం ఎంత అపరాధమో చెబుతుందీ కథ. ఓ ఇండిపెండెంట్‌ని తమ పార్టీల్లోకి లాగేసుకోడానికి జాతీయపార్టీలు ప్రయత్నిస్తాయి. హై కమాండ్‌తో ఇక్కడి ఛోటా మోటా నాయకులు తెలుగు హిందీ కలగలసిన భాషలో మాట్లాడడం నవ్విస్తుంది. ‘పాత సూట్‍కేస్‌లకు కొత్త సూట్‌కేసులిస్తాం’ అంటూ ఇండిపెండెంట్ ఇంటిముందు తచ్చట్లాడిన రాజకీయ బ్రోకర్ “ఏ సూట్‌కేసులో ఎంతుందో ఎవరు చెప్పగలరు?” అని అనడం; లాబీలో మాట్లాడితే లాబీయింగ్ అనడం సరదాగా ఉన్నాయి.

దేవదాసు వెడ్స్ పార్వతి” కథ సినీరంగంపై చక్కని వ్యంగ్యాత్మక విమర్శ. మనవాళ్ళు తీసిన కథలనే అటూ ఇటూ మార్చి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీస్తుంటారో చెప్తారు రచయిత. “మన జనాలకి చెప్పిందే చెప్పడం, చేసిందే చెయ్యడం, చూసిందే చూడడం అలవాటయ్యా. అవి జీవితాలు గానీ, రాజకీయాలు గాణీ, సినిమాలు గానీ… కథలు కొత్తగా చెప్పాలి గాని కొత్తవి చెప్పకూడదు. ఓ పట్టాన అరిగించుకోలేరు” అంటాడో నిర్మాత కథా రచయితతో. దేవదాసు పార్వతి కథనే మళ్ళీ తీస్తూ, దానికి బీభత్సమైన పబ్లిసిటీ ఎలా ఇవ్వాలో చెబుతుంటే నవ్వూ వస్తూందీ, నిజంగానే కొంతమంది నిర్మాతలు ఇలా ప్రయత్నిస్తున్నారు కదా అని గుర్తొచ్చి కించిత్ బాధా కలుగుతుంది. ఈ కథలో హాస్యం కన్నా వ్యంగ్యం పాలే ఎక్కువ.

సొంత పేరుతో సినిమాలు తీస్తే అచ్చిరావడం లేదని, బెంగాలీ డైరక్టర్ సత్యజిత్‌‌రాయిలా గంభీరంగా ఉండాలనుకొని, ‘విశ్వజిత్ రప్పా’గా పేరు మార్చుకుంటాడు ఓ నిర్మాత. సినీ నిర్మాణానికి డాన్‌లే తెరవెనుకగా నిధులందిస్తున్నారని నమ్మి, తన సినిమాకి నిధులు అందించవలసిందిగా డాన్‍లకు బహిరంగ ప్రకటన జారీ చేస్తాడు “డాన్‌ల భూగర్భ శత్రుత్వం” కథలో. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. అండర్‌గ్రౌండ్ డాన్‌లు తమ వ్యవహారాలను భూగర్భంలో జరుపుతారని చెబుతూ, డాన్‍ డెన్‌లో ప్రవేశించడానికి వాడే కోడ్ సాంగ్ ఏమిటో చెప్పినప్పుడు నవ్వకుండా ఉండలేం.

తన కొడుకుని హీరోని చేయాలనుకుంటాడు ఓ నిర్మాత. “అదేంటి బావా, మనోడికి ఏవీ రావు కదా?” అంటాడు అతని బావమరిది. బావమరిది లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకి జవాబిచ్చి అతని నోరు మూయిస్తాడు. అంతే… తెలుగు సినీ కళామాతల్లికి మరో నట వారసుడి సేవలు మొదలవుతాయి. ఇదే నిర్మాత ఓ డబ్బింగ్ సినిమా తీయాలని చెన్నై బయల్దేరుతాడు. బొంబాయి ముంబయిగా, మద్రాసు చెన్నై గారి మారకా, హైదరబాద్‌కు కూడా పేరు మారిస్తే, ఏం పేరు పెట్టాలో ఈ నిర్మాత సూచిస్తాడు. నవ్వాగదు ఆ పేరు వింటే. డబ్బింగ్ చిత్రాల ప్రహసనాన్ని చదివి నవ్వుకుంటాం “ఏకె97” అనే ఈ కథలో.

సినిమారంగాన్ని పరిశ్రమగా గుర్తించమని సినీరంగం పెద్దలు ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీని ఆమోదించి సినిమా రంగాన్ని పరిశ్రమగా గుర్తిస్తుంది ప్రభుత్వం “ఏ టేల్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ” అనే కథలో. పరిశ్రమ కాబట్టి ఫ్యాక్టరీ గొట్టం ఉండాలని ఓ స్టూడియోలో భారీ పొగ గొట్టాన్ని ఏర్పాటు చేస్తారు. సినిమా బడ్జెట్ పై ఆంక్షలు విధిస్తుంది ప్రభుత్వం. చేసే ప్రతీ ఖర్చుకి ఆడిట్ ఉండాలంటుంది. సినిమా నిర్మాణానికి జాతీయ బ్యాంకులు లోన్‌లు ఇస్తాయి. లోన్ శాంక్షన్ అవ్వాలంటే ఏమేం చెయ్యాలో ఓ బ్యాంక్ మేనేజర్ చెబుతాడు. సినిమా తీయడం అంటే ఓ డ్యూటీగా మారిపోయిన ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం అయిదు వరకు ఏదో ఆఫీసుకెళ్ళొచ్చినట్లుగా సినిమా తీయడం తన వల్ల కాదని సినిమా నిర్మాణాన్ని విరమించుకుంటాడో నిర్మాత.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకి ఆధార్ కార్డుని తప్పనిసరి చేయడం జనాల కొంప ఎలా ముంచుతోందో హాస్యంగా చెబుతారు రచయిత. ఉరి తీయబోతున్న ఓ ఖైదీకి ఆఖరి క్షణంలో మరణశిక్ష వాయిదా పడుతుంది.. ఏ రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం వల్లో కాదట. ఉరితీసే ఖైదీలకి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఉండాలనే నిబంధన కొద్ది సేపటి క్రితమే అమల్లోకి రావడం వల్లట. ఆధార్ కార్డ్ లేనందువల్ల ఆ ఖైదీ ఉరి నుంచి తప్పించుకున్నాడట. ఓ పెళ్ళిలో పిలిచిన అతిథులకంటే రెండు రెట్ల కన్నా ఎక్కువమంది వచ్చి విందు తిని పోయారట. ముష్టోళ్ళు కూడా కాస్త మంచి బట్టలేసుకొచ్చి తినేసి వెళ్ళారని ఆ కుటుంబం అనుమానపడింది. అందుకని ఆ కుటుంబంలో జరుగుతున్న తర్వాతి వివాహానికి శుభలేఖ పంపుతూ… ‘ప్రవేశం ఆధార్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే’ అని వ్రాయిస్తారు దాని మీద. సబలాదేవి అనే ఉద్యోగినిని ఎత్తుకెళ్ళి అత్యాచారానికి ప్రయత్నిస్తారు నలుగురు దుండగులు. “మీరు మగాళ్ళయితే మీ ఆధార్ కార్డులు చూపించండి” అంతే…. ఆ నలుగురు తమ ప్రయత్నాన్ని విరమించుకుని సబలాదేవిని సగౌరవంగా – అటుగా వచ్చిన బస్‌లో ఎక్కిస్తారు. హస్యం, వ్యంగ్యం కలగలసిన కథ “నీవే నా మదిలో…“.

ఇప్పుడంటే ‘సెల్ఫీ’ల కాలం కాని, ఒకప్పుడు ‘సెల్ఫ్’ల కాలం! తమకి విపరీతమైన పలుకుబడి ఉందని, ఫలానావాడికి నేనెంత చెబితే అంతేనని తమ గురించి ఘనంగా – ఎదుటివారికి అనుమానమే కలగకుండా సొంతడబ్బా కొట్టుకునే డబ్బారాయుళ్ళు అప్పుడూ ఉండేవారూ, ఇప్పుడూ ఉన్నారు. అలాంటివారి కథే “వెంకీ! ఎక్కడున్నావ్‌రా ఇంతకాలం?“.

విద్య వ్యాపారం అయిపోయాకా, విద్యార్థులు ప్రాడక్ట్స్ అయిపోయారు. విద్యార్థుల కలల్ని తాము అమ్ముకొంటున్న కొన్ని కార్పోరేట్ కాలేజీల పైత్యాన్ని చెబుతుంది “డ్రీమ్ మర్చంట్స్“. హాస్యంగా చెప్పినా, ఈ కథలో ప్రస్తావించిన విద్యార్థుల సమస్యలు, ఒత్తిడి నిజంగానే ఉన్నాయని అర్థమవుతుంది, బాధ కలుగుతుంది.

టీవీ చూడడం ఓ నిత్యావసరంగా మారిపోయిన ఓ ఇంట్లో, ఇంటాయన టీవీ ముందు కూర్చుంటాడు “స్త్రీ ఛానల్” కథలో. పెద్ద టీవీ ‘నిమిత్తమాత్రురాలిగా’ ఆయన్ను చూస్తుంది. ఈయన మాత్రం ఏదో మైకంలో ఉన్నవాడిలా ‘నిమత్తు మాత్రుడిగా’ ఆన్ చేస్తాడు. ఒక్కో ఛానెల్ మార్చుకుంటూ పోతూంటాడు. ఉన్నట్లుండి ఓ కొత్త ఛానల్ కనబడుతుంది. ఆ ప్రోగ్రామ్‌ చేస్తున్న యాంకర్‌కీ కొత్తేమో –  మాట తడబడి – ‘అంతరంగిక మధనం’ అనే పదాన్ని తప్పుగా పలికిన వైనం నవ్వు తెప్పిస్తుంది. ఇంటాయన చాలాసేపు ఈ ఛానల్ కార్యక్రమాలు చూస్తూంటాడు. చివరికి ఇంత కలుపుగోలు ఛానల్‌ని చూడడం ఇదే మొదటిసారి అనుకుంటూ టీవీ కట్టేసి పడుకుంటాడు. బాగా నవ్విస్తుందీ కథ.

పాఠకుల కాలక్షేపం కోసం ఓ రచయిత ఒక కథ రాస్తే, ఆ కథ చదివిన పాఠకులు పత్రికకి ఉత్తరాలు వ్రాస్తారు. ఆ కథ వల్ల ఫైనాన్స్ సమస్యలు చెలరేగి, జెండర్ రాజకీయాలు పెట్రేగి విదేశీ సమస్యలు పెచ్చరిల్లే పరిస్థితి వస్తుందని రచయిత భయపడేలా చేస్తారు “పాఠకుల తోకకు నిప్పు” కథలో.

ప్రైవేటు ఎయిర్‌లైన్స్ విపరీతంగా పెరిగాకా, అవి అందిసున్న సేవల తీరుతెన్నులను హాస్యంగా చెప్పిన కథ “విమాన సంచరరే…“.

అన్ని కథలలో ఆరోగ్యకరమైన హాస్యం ఉంది, సున్నితమైన వ్యంగ్యం ఉంది. ఈ కథలలో “గొప్ప సందేశాలు లేవుగానీ, హాయిగా చదివిస్తాయి” అనే శ్రీరమణ గారి అభిప్రాయంతో నిరభ్యంతరంగా ఏకీభవించవచ్చు.

మిహిర పబ్లికేషన్స్ వారు జనవరి 2016లో ప్రచురించిన ఈ 137 పేజీల పుస్తకం వెల రూ.100/-. విదేశాలలో ఉండే తెలుగువారికి $10. నవోదయా బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్ వారు సోల్ డిస్ట్రిబ్యూటర్స్.

~ కొల్లూరి సోమ శంకర్

 

సామాన్యుల గొంతుని వినిపించే ‘గడీలో దొరల పాలన’

 

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

డా. నారాయణ భట్టు మొగసాలె గారు కన్నడ భాషలో రచించిన “ఉల్లంఘన” నవల బంట్ కుటుంబంలోని ఐదు తరాల గాథ. బంట్ సముదాయం ఒకనాటి క్షత్రియులు. ప్రస్తుత కర్నాటకలోని ఉడుపి, దక్షిణ కన్నడ, కేరళ లోని కసర్‌గోడ్ జిల్లాల మధ్యలో వ్యాపించి ఉండిన “తుళునాడు”కు చెందిన భూస్వాములు బంట్ వంశీకులు. ఇటువంటి భూస్వాములు, వారి ఆస్థానాలు, పాలనా పద్ధతులు, పాలితులు, ఆచారవ్యవహారాలను నమోదు చేసిన విశిష్ట రచన ‘ఉల్లంఘన’.

తుళునాడులోని ప్రజల భాష తుళు. ఈ భాషకి లిపి లేదు. వ్రాయడానికి కన్నడ లిపినే ఉపయోగిస్తారు. తుళునాడు జనాలది విశిష్టమైన సంస్కృతి. 19వ, 20వ శతాబ్దాలలో ఈ సంస్కృతిలో వచ్చిన మార్పులు, ఈ ప్రాంతపు చరిత్రలో సంభవించిన ఘటనలను వివరిస్తుంది ఈ నవల. అటువంటి ప్రశస్తమైన నవలను “గడీలో దొరల పాలన” పేరిట తెలుగులోకి అనువదించారు శ్రీ శాఖమూరు రామగోపాల్. మూల రచన ‘ఉల్లంఘన’ ఇప్పటికే హింది, ఇంగ్లీషు, మరాఠి, మళయాళం, తమిళ భాషలలోకి అనువాదమైంది. 2008లో ప్రచురితమైన ఈ మూలకృతి కన్నడంలో ఎం.ఎ. విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా ప్రవేశపెట్టబడింది. మూల రచయిత డా. నారాయణ భట్టు మొగసాలె వృత్తిపరంగా వైద్యులైనా, ప్రవృత్తిపరంగా గొప్ప సాహితీవేత్త.

సుమారు నూటయాభై సంవత్సరాల కాలంలో తుళునాడునీ, దానిలోని గడీలను ప్రభావితం చేసిన సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను కళ్ళకి కట్టినట్లుగా వివరిస్తుందీ పుస్తకం. రాచరిక/భూస్వామ్య వ్యవస్థకి ప్రతిరూపాలైన బంట్లు కూడా గడీలను అధికార కేంద్రంగా చేసుకుని తమ అజమాయిషీ కొనసాగించారు. ఆస్థానం, సంస్థానం, కోట.. వంటి పదాలను గడీ అనే పదానికి సమానార్థాలుగా భావించవచ్చు. గడీల చరిత్ర పాలకులు – పాలితుల మధ్య ఉండే సంబంధాన్ని వ్యక్తం చేస్తుంది. భూస్వాములు, రైతు కూలీలు, కౌలుదార్ల సామాజిక జీవనంలోని భిన్నకోణాలను ప్రతిబింబించింది ఈ నవల.

తుళునాడులో మాతృస్వామ్య వ్యవస్థ ప్రధానంగా ఉంది. కుటుంబపు ఆస్తి వారసత్వంగా స్త్రీలకు దక్కుతుంది. పుట్టిన పిల్లలకు భార్య ఇంటిపేరునే పెట్టుకుంటారు. కుటుంబంలోని మగవాళ్ళు ఆస్తిపాస్తుల వ్యవహారాలను మేనేజర్లుగా నిర్వహిస్తుంటారు. ఇటువంటి గడీలలోని ఒకటైన సాంతేరుగడీ చరిత్ర ఇతివృత్తమే ఈ నవల కథాంశం. గడీ ఆధీనంలోని భూమిలో కొంతభాగాన్ని కౌలుదారులు సేద్యం చేస్తుండగా, మిగతా భూమిని వెట్టి కూలీలతో భూస్వాములే సాగు చేస్తారు. ఇటువంటి ఫ్యూడల్‌సమాజంలో కౌలుదారులకు, వెట్టి కూలీలకు; దొరసానికి (బళ్ళాల్ది), దొరకి (ఉళ్ళాయి) మధ్య ఉండే సంబంధాన్ని ఈ నవలలో దర్శించవచ్చు. వెంకప్ప, శీనప్ప, సంకప్ప, సుందర, ప్రశాంత్‌హెగ్డె గార్ల జీవితాలు; అలాగే తుంగక్క, శాంతక్క, అంబక్క, శారదక్క, ప్రజ్ఞల జీవితాలు ఈ నవలలో విస్తృతమైన కాన్వాస్‌పై అద్భుతంగా గోచరిస్తాయి

భుజించి దర్బారులోకి వచ్చి కూర్చున్న దొరవారితో, దోస్తుగా ఉన్న పావూరు గడీకి చెందిన పూంజగారు ‘సాంతేరుగడీలో అష్టమినాడు ఎందుకు చేసారు ఈ కోలాహలం విందును?’ అని ప్రశ్నించారు కుతూహలంగా. అందుకు దొరవారు ‘అష్టమి అముఖ్యం కాదు మాకు. మేము వ్యవాసాయం చేసేవాళ్ళం. అందుకే మాకు మేము పండించిన కొత్త బియ్యం వండి పండుగ లాగ తినేది ముఖ్యం అనేది గడీలో సాంప్రదాయంగా వృద్ధి చెంది వచ్చింది. గోకులాష్టమి, వినాయక చవితి, అమావాస్యలోని దీపావళి మొదలైన రోజుల కట్టుబాట్లలోని ఆచరణాలన్నీ గడీ భవంతిలో ఉన్నవి. అవన్నీ అక్కరలేదా మన సమాజంకు?’ అన్నారు.

పూంజగారికి సంతృప్తి అయ్యింది దొరవారి రైతు జ్ఞానం నుంచి. వారు, ‘ఔను, మన జాతులలో ప్రాదేశిక వ్యత్యాసాలకు అనుగుణంగా పండుగ పబ్బాలలో వివాహ, దినకర్మకాండలలో వ్యత్యాసం ఉండేది సహజమే’ అని ఒప్పుకున్నారు.

బ్రిటీషు వారి రాకతో దేశంలోని అన్ని ప్రాంతాలలో లాగానే తుళునాడులోనూ దొరల అధికారాలు క్షీణించి, పరిస్థితులు మారడాన్ని ఈ నవల చక్కగా వర్ణిస్తుంది. ఆంగ్ల పాలకులు చేసిన కొత్త చట్టాల వల్ల భూస్వాములు, కౌలుదార్లు, వెట్టికూలీల సంబంధాలలో వచ్చిన మార్పులనూ, మనుషులలో కలిగిన కొత్త ఆలోచనలను ఈ నవల ప్రతిబింబిస్తుంది.

స్వాంతంత్ర్యం కోసం జరిపిన పోరాటంలో ఈ ప్రాంతపు యువకులు పాల్గొన్న వైనాన్ని, గాంధీ గారి అనుచరులుగా మారిన జైళ్ళకు వెళ్ళిన వైనాన్ని తెలుపుతుంది ఈ నవల.

“ఆ రోజు గడీ భవంతి వర్ణించలేనట్లుగా సంబురపడింది. ఆ సంబురం ఒంబత్తుకెరె గ్రామంలోని కౌలుదార్ల నుంచి మొదలై కూలినాలి చేసి జీవించేవాళ్ళ ఇళ్ళ వరకూ వ్యాపించింది. యువకులు, వృద్ధులు అనకనే ఆబాలగోపాలం గడీ ప్రాంగణంకు ఒకరి వెనుక ఇంకొకరుగా వచ్చారు. సంకప్పకు వారందర్నీ చూసి ఎంతో సిగ్గైంది. ‘నేనేమి యుద్ధం గెల్చి వచ్చానేమి! ఉత్తిగనే ఎందుకు నన్ను చూసేందుకు వచ్చారు?’ అని అనాలని అన్పించింది అతనికి. ప్రతి యొకరు వచ్చి ‘ఎలాగున్నారు చిన్నపటేలా?’ అంటూ అడిగారు. జనం నొచ్చుకోవచ్చని అతను ప్రాంగణంలో కుర్చీ వేయించుకుని కూర్చున్నాడు. వచ్చినోళ్ళందరితోనూ సంకప్ప ‘నేనేమి ఘనంగా దేశమాత సేవ చేయలేదు. గాంధీజీతో పాటు నేను ఉండివచ్చాను వివిధ చోట్ల అంతే మరి.’ అన్నాడు.

AuthorSakhamuru

స్వతంత్ర్యం వచ్చాకా ఎదురైన పరిస్థితులు ఏలాంటివి? గ్రామం తన స్వయంప్రతిపత్తిని పోగొట్టుకుని, పట్టణాల మీద ఎందుకు ఆధారపడింది? మాతృస్వామ్య వ్యవస్థ తన ప్రాభవాన్ని ఎలా కోల్పోయిందో ఈ నవల వెల్లడిస్తుంది. కొత్త వ్యవస్థలో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చలాయించారు? ఆ యా మార్పులు ఎవరెవరిని ప్రభావితం చేసాయి? ఈ వివరాలన్నింటినీ తెలుసుకోవాలంటే ఈ నవల చదవాలి.

సంకప్ప హెగ్డె గంభీరులయ్యారు. వారు ‘మన కర్నాటకలోని ఈ భూపరిమితి చట్టం లాంటి ప్రగతిపర మరియు విప్లవాత్మక … భూసంస్కరణల చట్టం… ఈ భరతభూమిలో మరే యితర రాష్ట్రంలో జారీ అయ్యింది లేదనేది నాకు గుర్తే! దాన్ని నేను వేరే వేరే మూలాల నుంచి చదివి తెల్సుకున్నాను. నిజంగా ఇది మంచి చట్టమే. అందులోనూ తీరప్రాంత జిల్లాల్లో, ముఖ్యంగా మన దక్షిణ కన్నడ జిల్లాలో ఇది అమలౌతున్న పద్ధతిలో, ఎన్నో అవాంతరాలు ఎదురౌతున్నవి. మనలో తండ్రి నుంచి సంతానంకు భూమి హక్కు వచ్చి కలిగే సంప్రదాయం ఎంతో తక్కువ. తల్లి నుంచి సంతానంకు హక్కు వచ్చే సాంప్రదాయమే ఎక్కువగా ఉంది. అయితే మారుతున్న వాతావరణంలో ప్రతీ కుటుంబం ఈ పురాతన పరంపరను ఇప్పుడు తోసి వేస్తోంది. కానూను ప్రకారం మాతృప్రధాన వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు! అందుచేత మన కర్నాటకలో ఈ భూపరిమితి చట్టం ఇక్కడ ఈ జిల్లాలో అమలు చేసేడప్పుడు ఎన్నెన్నో కుటుంబాలలో ఘర్షణలు ప్రారంభమైనవి. మనుష్య సంబంధాలన్నీ నాశనమైపోయే స్థితి వచ్చింది’ అని చెబుతూ ఒక నిమిషం మౌనం దాల్చారు.

ఉడుపి ప్రాంతంలోని కన్నడిగులు హోటల్ యజమానులుగా ఎలా ఎదిగారో, తమవారిని ఎలా వృద్ధిలోకి తెచ్చారో ఈ నవల రేఖామాత్రంగా తెలియజేస్తుంది.

ఎవరికి కావాలి ఈ పొలాలు, మడులు? కాడి నాగలి మోసుకుంటూ వాన ఎండా అది ఇదీ అని మూడొందల అరవై ఐదు రోజులూ మడిగట్టు మీద గోచి బిగించి చెమట్లు కురిపించుతూ శ్రమించేదానికన్నా ‘చుయ్’ అని రెండు మసాలా దోసెలు వేసి, ఒక ముక్కుళ్ళి (గుటక పరిమాణం) కాఫీనో చాయ్‍నో టేబుల్ మీద పెట్టి ‘రండి రండి గిరాకీదారులారా’ అంటే చాలు, నోట్ల కట్టే తలొంచి క్యాష్ బాక్స్ లోపలికి వచ్చి బుద్ధిగా కూర్చుంటందంటే అదెంత కుశాలో అని అంబక్కకి అప్పుడు నవ్వు వచ్చింది. అందుకే ఇంత జనం, ఉన్న ఊరు వద్దు అంటూ పట్టణాలకు వలస వెళ్తున్నారని చెప్పారు సంకప్పణ్ణ.

వ్యవసాయాధారితమైన కుటుంబాలు క్రమంగా వ్యాపారాలవైపు మొగ్గు చూపడాన్ని ఈ నవల చిత్రిస్తుంది.

ఆదంకుట్టి క్తెతే ఆకాశంలో ఉన్న స్వర్గమే చేతికి అంది వచ్చినట్లుగా అయ్యింది. అతను తన అంగడికి వచ్చి వెళ్ళే గిరాకీదారులందరికీ కలల బీజాల్ని విత్తసాగాడు. అటువంటోళ్ళంతా తమ ఇళ్ళలోనూ ఇటువంటి బంగారు కలల విత్తనాల్ని విత్తసాగారు. జాతీయ రహదారిని ప్రారంభించే కేంద్ర మరియు రాష్ట్ర రవాణాశాఖా సచివ మహోదయులు ఆ తర్వాత తమ వాహనాలలో కాసరగోడు దాకా పయనించేదాన్ని చూసేందుకు వేలసంఖ్యలో జనం ఉదయం నుంచే జాతీయ రహదారి అంచుకు చేరారు. అక్కడక్కడ లేచి నిలబడి నిరీక్షించసాగారు.

సంస్థానాలను కేవలం చారిత్రక దృక్పథంతో మాత్రమే పరిశీలించి వ్రాసే పుస్తకాలలో కథ ఉండదు. ప్రజల వ్యథ ఉండదు. సామాజిక చిత్రణ ఉండదు. సామాన్యుల ఘోష వినిపించదు. పాలకుల శౌర్యం, మగతనానికి ప్రతీకలుగా మాత్రమే నిలిచే చరిత్ర పుస్తకాలకు భిన్నంగా, ఉల్లంఘన నవలలో సామాన్యుల గొంతు ప్రబలంగా వినిపిస్తుంది.

తెలుగు అనువాదం బావుంది. అయితే అనువాదకులు ఉపయోగించిన తెలుగు కన్నడం కలగలసిపోయిన యాస – పాఠకులకు కాస్త ఇబ్బందిగా తోచవచ్చు. ఏదేమైనా శ్రీ శాఖమూరు రామగోపాల్‌ ఒక మంచి కన్నడ నవలను తెలుగువారికి అందించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పుస్తకం చివర్లో “కర్నాటకలో నా తిరుగాట” అనే పేరుతో వ్రాసిన వ్యాసంలో సుప్రసిద్ధ కన్నడ రచయిత శ్రీ తమ్మాజీరావుతో కలసి తాను చేసిన సాహితీయాత్రలను పాఠకులకు కుతూహలం కలిగించేలా వివరిస్తారు శ్రీ రామగోపాల్. ఆయా అనుభవాలు చదువుతుంటే, మనం కూడా ఆయనతో ప్రయాణించినట్లు, ఆయా ప్రదేశాలు స్వయంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది.

అభిజాత తెలుగు – కన్నడ భాషా అనువాద (సంశోధన) కేంద్రం వారు ప్రచురించిన ఈ పుస్తకం విశాలాంధ్ర వారి అన్ని శాఖలలోనూ లభిస్తుంది. 650 పేజీల పుస్తకం వెల రూ.600/-. ఈబుక్ కినిగెలో లభిస్తుంది.

 

రచయిత, ప్రచురణకర్త చిరునామా: Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in

ఉత్కంఠగా చదివించే “భైరవ వాక”

?

-కొల్లూరి సోమశంకర్ 

 

~

కొల్లూరి సోమశంకర్

ఓ సుప్రసిద్ధ ఆలయం, దాని చరిత్ర, అక్కడి ఆచార సంప్రదాయాలను కథలో భాగంగా చెబుతూ ఆ ఆలయాన్ని దోచుకోవాలనుకునే ముఠా ప్రయత్నాలను, తమని తాము పేల్చేసుకుని భయంకరమైన ఉత్పాతం సృష్టించాలన్న తీవ్రవాద శక్తుల కుట్రలనూ వెల్లడిస్తూ, పాఠకులను అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే నవల “భైరవ వాక“.

ప్రసిద్ధ రచయిత ఇందూ రమణ వ్రాసిన ఈ నవల తొలుత 16 వారాల సీరియల్ పోటీలో బహుమతి పొంది స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది.

ఆరుగురు సభ్యులున్న ఓ ముఠా ముంబయిలో సమావేశమై పథక రచన చేస్తుండగా కథ ప్రారంభమవుతుంది. తమ రహస్యం వినిందనే అనుమానంతో పనిమనిషిని అత్యంత దారుణంగా హత్య చేయడంతో ముఠా సభ్యులు ఎంత క్రూరులో పాఠకులకు అర్థమవుతుంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ముఠా సభ్యులు తమకి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడానికి విడిపోతారు. కథ ఆంధ్ర రాష్ట్రానికి మారుతుంది.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన చందనపురి, భైరవ వాక క్షేత్రాలను దర్శించడానికి పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా ఎందరో భక్తులు వస్తూంటారు. పాత్రో అనే మధ్యతరగతి కుటుంబీకుడు తన ముసలి తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, పనిమనిషితోనూ చందనపురికి రైల్లో బయల్దేరుతాడు. ఓ తెలుగు మిత్రుడి సలహాతో విశాఖపట్నం వరకు వెళ్ళకుండా చందనపురి స్టేషన్‍లో దిగుతాడు. ఉత్సవదినాలు కావడంతో ఆ ప్రదేశమంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతూంటూంది. ఏం చేయాలో తోచదు పాత్రోకి.

ఆ సమయంలో పాత్రోని ఒరియాలో పలకరిస్తాడు పాండే అనే వ్యక్తి. పరాయి ప్రాంతంలో సొంత భాషలో మాట్లాడిన పాండేని చూడడంతో కాస్త ధైర్యం వస్తుంది పాత్రోకి.  తానొక గైడ్‌నని, క్షేత్ర దర్శనం చేయిస్తానని, వాళ్ళకి తోచినంత డబ్బు ఇవ్వమని బ్రతిమాలుకుంటాడు పాండే. అయిష్టంగానే అంగీకరిస్తాడు పాత్రో.

ఇక్కడ ప్రముఖ క్షేత్రాలలో యాత్రికులు పడే అవస్థలను ప్రస్తావిస్తారు రచయిత. బస్ టికెట్ల నుంచి, బస, ఆహారం, స్నానాలు, పూజలు, అమ్మకాలు, పూజాదికాలు వరకూ… దివ్యక్షేత్రాలలో అడుగడుగునా జరిగే మోసాలు, దోపీడీల గురించి కథాక్రమంలో వివరిస్తారు.

పాండే కన్ను ఈ కుటుంబంలోని ఆడవాళ్ళపై పడుతుంది. పాత్రో భార్య శశికళని, పనిమనిషి అరుంధతిని ఏకకాలంలో కామిస్తాడు. అరుంధతి కూడా పాండే పట్ల ఆకర్షితురాలవుతుంది. అతడిని రెచ్చగొడుతుంది. చందనపురి చేరాకా అక్కడి వ్యాపారులు, అధికారుల వల్ల అడుగడుగునా ఇబ్బందులని ఎదుర్కుంటుంది పాండే కుటుంబం.

కర్రపుల్లలు, బియ్యం, కూరలు కొనుక్కొచ్చి, నానా తంటాలు పడి అన్నం వండుకుంటారు పాత్రో వాళ్ళు. ఆకుల్లో వడ్డించుకుని తినబోతున్న సమయానికి ఓ పిచ్చిది వచ్చి అన్నాన్ని చెల్లాచెదురు చేసేసి వాళ్ళ ఆకుల్లోంచి గబగబా నాలుగు ముద్దలు తినేసి పారిపోతుంది. ఆ కుటుంబం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. కాసేపటికి తేరుకున్న పాత్రో తన వాళ్ళందరిని దగ్గరలోని హోటల్‍కి తీసుకువెడతాడు. పాచిపోయిన అన్నం పెట్టి, ప్లేటుకి యాభై రూపాయలు వసూలు చేస్తాడా హోటల్ యజమాని. ఇదేమని ప్రశ్నిస్తే పాత్రోని అవహేళన చేస్తాడు.

పిచ్చి యువతి పాండేకి ఎదురుపడడంతో కథలో మరో ఘట్టానికి నాందీ ప్రస్తావన జరుగుతుంది. ఆ యువతి నిజానికి పిచ్చిది కాదనీ, అలా నటిస్తోందని, ఆమె పేరు మోనిషా అని తెలుస్తుంది. పాండే కూడా గైడ్ కాదని, మోనిషాతో కలసి ఆ క్షేత్రంలో తిష్ట వేసి చోరికి మార్గం సుగమం చేయడమే అతని పనని తెలుస్తుంది. ఈ క్రమంలో అరుంధతితో మరింత సన్నిహితమవుతాడు పాండే. పాత్రో కుటుంబం నుంచి ఆమెని దూరం చేయాలని ఆలోచిస్తాడు.

మందిరం దోచుకోవాలనుకునే సమయం ఆసన్నమవుతూంటుంది. ముఠాలోని మిగతా సభ్యులంతా చందనపురి, భైరవ వాక చేరుకుంటారు. భక్తుల్లా నటిస్తూ ముందుగా అనుకున్న ప్రకారంగా ఆలయంలోకి ప్రవేశించాలనేది వారి పథకం.

?

ఇదే సమయంలో పాత్రో కుటుంబం కూడా భైరవ వాక చేరుతుంది. తాను లోపలికి రాకూడదని చెప్పి అరుంధతి ఆలయం బయటే ఆగిపోతుంది. అది చూసి ఆమెకి తోడుగా పాండే కూడా బయటే ఆగిపోతాడు. గుడిలోకి వెళ్ళాకా పాత్రో అక్కడ జరుగుతున్న అక్రమాలను చూసి నివ్వెరపోతాడు. నిర్వాహకులను ఏమీ అనలేక, నిస్సహాయంగా ఉండిపోతాడు. అరుంధతితో పాటు గుబురుగా ఉన్న పొదల చాటుకి చేరుతాడు పాండే. తమ కోరిక తీర్చుకోబోతుండగా వినబడిన మాటలు, కనబడిన దృశ్యం పాండేని నివ్వెరపరుస్తాయి. ఇద్దరు తీవ్రవాదులు పొదలమాటున నక్కి తమ రూపాలు మార్చుకుని నడుములకి బెల్ట్ బాంబులు ధరించి భక్తుల వేషాలలో మందిరం వైపు కదులుతారు. ఒకడు భైరవ వాక ఆలయం వైపు వెడితే, రెండో వాడు చందనపురిలో విధ్వంసం సృష్టించడానికి బయల్దేరుతాడు.

విపరీతమైన రద్దీగా ఉన్న ఆ ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగితే ప్రాణనష్టం అధికంగా ఉంటుందనీ, దాంతో పోలీసులు, అధికారుల బెడద తీవ్రమవుతుందని భావించిన పాండే ఆ తీవ్రవాదిని పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. అది గమనించిన తీవ్రవాది కొంచెం దూరం పరిగెట్టి తనని తాను పేల్చేసుకుంటాడు. ఆ ప్రాంతమంతా రణభూమిగా మారిపోతుంది. తీవ్రవాది చేతిలో ఉన్న సంచీని చేజిక్కించుకుని అరుంధతితో సహా పారిపోతాడు పాండే. ఆ సంచీని తెలివిగా పోలీసులకు అందేలా చేస్తాడు.

ఈ లోపు మరో తీవ్రవాది చందనపురి చేసి దర్శనం క్యూలో కలసిపోతాడు. పాత్రో కుటుంబం, అరుంధతి, పాండే, మోనీషా, ముఠాలోని ఇతర సభ్యులు అందరూ దర్శనం క్యూలో చేరతారు. జనాలు విపరీతంగా ఉండండంతో క్యూ అసలు కదలదు. లభించిన ఆధారాలతో చురుకుగా వ్యవహరించిన పోలీసులు రెండో తీవ్రవాది క్యూలోనే ఉన్నాడని తెలుసుకుంటారు. అతడిని పట్టుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఓ దశలో భక్తులందరికీ మత్తు కలిపిన ప్రసాదం పంచాలని ఆలోచిస్తారు. ఈలోపు పాండే ఓ ఉపాయం పన్ని తీవ్రవాది దొరికిపోయేలా చేస్తాడు. పాత్రో కుటుంబం, ముఠా సభ్యులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. పాత్రో కుటుంబం బయటకి వస్తుంది గాని ముఠా సభ్యులు ఆలయం ప్రాంగణం లోపలే దాగి ఉంటారు.

చీకటి పడి ఆలయం మూసేసి పూజారులు అధికారులు వెళ్ళిపోయాకా, చోరికి పాల్పడతారు. ఆఖరినగ తీసుకోబోతుంటే అలారం మ్రోగుతుంది. పోలీసులు చుట్టుముట్టే లోపు దొంగలందరూ తప్పించుకుంటారు.

ఇంటికి వెడదామని బయల్దేరిన పాత్రో తన సూట్ కేసులు, ఇతర వస్తువులని పోగొట్టుకుంటాడు. చేతిలో పైసా కూడా లేకుండా తమ ఊరు వెళ్ళడం కోసం చందాలు అడుగుతూ పాండేకి కనబడతాడు. తన దగ్గర ఉన్న దేవుడి నగలలోంచి ఓ నగని ఇచ్చి అది అమ్ముకుని వచ్చిన డబ్బుతో ఊరు వెళ్ళమంటాడు. కాని ఆ నగని అమ్మే ప్రయత్నంలో పోలీసులు పాత్రోని అనుమానించి, దోపిడీలో అతనికి భాగం ఉందని అరెస్టు చేస్తారు. విశాఖపట్నంలో అరుంధతితో లాడ్జిలో ఉన్న పాండే టీవీ ద్వారా ఈ విషయం తెలుసుకుంటాడు. తనని ఎంతగానో ఆదరించిన పాత్రో కుటుంబానికి ఇలా జరిగినందుకు ఎంతగానో బాధపడుతుంది అరుంధతి. తన వల్ల ఓ కుటుంబం అపాయంలో చిక్కుకోడం భరించలేకపోతాడు పాండే.

నిజమైన ప్రేమ పాషాణ హృదయాన్ని సైతం కరిగిస్తుందనే నానుడిని నిజం చేస్తూ, పాండేలో పరివర్తన కలుగుతుంది. అప్రూవర్‌గా మారి, పోలీసులకు సహకరించి ముఠాని, సొత్తుని పట్టిస్తాడు. పాత్రో కుటుంబాన్ని రక్షిస్తాడు.

నవలలోని ప్రథాన సంఘటన పాఠకులకి ముందుగానే తెలిసిపోయినా, కథని చివరిదాకా చదివించడంలో కృతకృత్యులయ్యారు రచయిత. ఓ క్రైమ్, సస్పెన్స్ నవలలో ఉండాల్సిన బిగి, ఒడుపు అన్నీ ఈ నవలలో పుష్కలంగా ఉన్నాయి. పాఠకులను ఏకబిగిన చదివించి, వారి మనసులను రంజింపజేస్తుందీ నవల. ఉత్కంఠగా చదివించే ఈ నవలని 2012లో “శ్రీ లోగిశ ప్రచురణలు” వారు ప్రచురించారు. 224 పేజీలున్న ఈ నవల వెల రూ.150/- (ప్రస్తుతం ధర మారి ఉండచ్చు). ప్రచురణకర్తల వద్ద, విశాలాంధ్ర వారి అన్ని కేంద్రాలలోనూ ప్రింట్ బుక్ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.


 

ప్రచురణకర్తల చిరునామా:

శ్రీ లోగిశ ప్రచురణలు, డోర్ నెంబరు 7-50, శ్రీ సాయి నిలయం, బంగారమ్మ గుడి దగ్గర, సింహాచలం, విశాఖపట్నం 530028

 

గిలిగింతలు పెట్టి నవ్వులు పూయించే నవల “ప్రేమలేఖ”

 

 

SomaSankar2014

కొల్లూరి సోమశంకర్

ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన తొలి నవల “ప్రేమలేఖ”. ఎందరో రచయిత్రులు తమ రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసినా, పొత్తూరి విజయలక్ష్మి గారి ప్రభావం విలక్షణమైనది. సాంఘిక ఇతివృత్తాలతో కొన్ని రచనలు చేసినా, హాస్యకథలు ఆవిడ ప్రత్యేకత. సున్నితమైన హాస్యంతో, కథన నైపుణ్యంతో రచనలు చేయడం పొత్తూరి విజయలక్ష్మి గారి శైలి. తొలుతగా 1982 అక్టోబర్ నెల చతుర మాసపత్రికలో ప్రచురితమైన ఈ నవల “శ్రీవారికి ప్రేమలేఖ” సినిమాకి మూలం.

***

కథానాయకుడు ఆనందరావు అమాయకుడు, అందగాడు. బి.ఇ. పాసయి తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాదులో ఏదో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూంటాడు. ఆనందరావుకి తండ్రి పరంధామయ్య పెళ్ళి సంబంధాలు చూస్తూంటాడు. త్వరగా పెళ్ళి చేసుకోమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేస్తు ఉంటాడు. పరంధామయ్యది అదో రకం స్వభావం. తాటాకుమంటల్లా ఎప్పుడూ చిటపటలాడిపోతుంటాడు. తండ్రి అంటే మా చెడ్డ భయం ఆనందరావుకి. ఒక్క ఆనందరావుకేం ఖర్మ, అతని అన్నయ్య భాస్కరరావుకి, అక్క కామేశ్వరికి, వదిన అన్నపూర్ణకి, బావ సూర్యానికి, అమ్మ మాణిక్యంబకీ కూడా భయమే.

ఈ నేపథ్యంలో ఓ నడి వేసవి రోజున మిట్టమధ్యాహ్నం లంచ్ చేయడానికి తన కాబిన్‍లోంచి బయటకి వస్తాడు ఆనందరావు. అతని సెక్రటరి మార్గరెట్ అతనికొచ్చిన పర్సనల్ లెటర్స్ అందిస్తుంది. ఏసి హోటల్లో కూర్చుని ఒక్కో ఉత్తరం చదువుతూంటాడు. మొదట తండ్రి ఉత్తరం, తరువాత అక్క ఉత్తరం చదువుతాడు. మూడోదే.. అసలైనది… “ప్రియా” అనే సంబోధనతో మొదలవుతుంది. ఉలిక్కిపడతాడు. తనకేనా సంశయపడతాడు. ఆ ప్రేమలేఖ చదివి తన్మయుడవుతాడు. పరవశుడవుతాడు. ఇక అక్కడ్నించి, ఆ ఉత్తరం వ్రాసిన సోనీ ఎవరో తెలుసుకోడానికి నానా పాట్లు పడతూంటాడు.

ఇక కథానాయకి స్వర్ణలతకి పెద్దగా చదువబ్బదు. తండ్రి బలవంతంమీద ఏదో చదువుతున్నానని అనిపించుకుంటుంది. తనకి పెళ్ళీడు వచ్చేసిందని, తండ్రి గ్రహించకుండా ఇంకా చదువు చదువు అని పోరుతున్నాడని ఆమె అభిప్రాయం. ఆమె తండ్రి తిలక్‌కి కూతుర్లిద్దరినీ బాగా చదివించాలని ఆశ. పెద్ద కూతురు హేమలత బిఎ పూర్తి చేయగానే మధుసూదనం ఆమెని ఇష్టపడి పెళ్ళిచేసుకుంటాడు.  సరే పెద్ద కూతురు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందికదా, చిన్న కూతురినైనా గొప్ప విద్యావంతురాలిని చేయాలని ఆయన తపన. కానీ స్వర్ణ కేమో చదువుకన్నా పెళ్ళి మీదే ధ్యాస ఎక్కువవుతుంది. చివరికి అనుకున్నదే అవుతుంది. బిఎస్సీ తప్పుతుంది, ఇక స్వర్ణకి పెళ్ళి చేసేయడమే మంచిదనే నిర్ణయానికొస్తాడు తండ్రి.

Premalekha back cover

సోనీని మనసులో ఉంచుకుని ఆనందరావు, ఆడపిల్లలు మగపిల్లలకి ఏ మాత్రం తీసిపోరనే భావంతో స్వర్ణలత తమకొచ్చిన సంబంధాలను తిరగగొడుతుంటారు. చివరికి ఆనందరావుకి పిచ్చి అని, స్వర్ణకి పొగరు అని ముద్ర పడిపోతుంది. ఆనందరావుకి వచ్చే సంబంధాల క్వాలిటీ ఏ 1 నుంచి సి 3కి పడిపోతుంది. స్వర్ణ గురించి పుకార్లు వ్యాపించిపోతాయి.

అదృష్టవశాత్తు, రెండు కుటుంబాల పెళ్ళిళ్ళ పేరయ్యలు బంధువులు కావడంతో, ఆనందరావు కుటుంబానికి, స్వర్ణలత కుటుంబం గురించి చెప్పి పెళ్ళి చూపులకి వప్పిస్తారు.

ఇక ఇక్కడ్నించి కథ వేగం పుంజుకుంటుంది. అపార్థాలు, అలకలు, అనుమానాలు, సందేహా నివృత్తులు… అన్నీ జరిగిపోయి కథ సుఖాంతం అవుతుంది.

 

***

కథ చాలా వరకు సంభాషణల రూపంలో నడవడం వల్ల హాస్యం జొప్పించడం తేలికైంది. కథనంలో సన్నివేశాన్ని హాస్యభరితంగా సృజించడం కన్నా, పాత్రల మధ్య సంభాషణలని హాస్యంతో నింపితే ఆ సంఘటన పాఠకుల మనస్సులను సులువుగా తాకుతుంది. నవలలోని ఒక్కో పాత్రకి ఒక్కో లక్షణం. వాటన్నింటిని మేళవిస్తూ, కుటుంబ సభ్యుల్లో అంతర్లీనంగా ఉండే ఆపేక్షలు, అనుబంధాలను వెల్లడిస్తుందీ నవల.

సినిమాగా వచ్చిన నవల కాబట్టి నవలనీ, సినిమాని పోల్చుకోకుండా ఉండలేరు. సినిమాలో “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..” పాటకి ఏ మాత్రం తీసిపోదు నవలలోని ప్రేమలేఖ.  ఆ పాట విని పెళ్ళి కాని వారు ఊహాలోకాల్లోకి వెళ్ళిపోతారు. నవలలోని ప్రేమలేఖని చదివినా కూడా అదే ఎఫెక్ట్. పెళ్ళయిన వాళ్ళు తమ తొలినాళ్ళని గుర్తు చేసుకుంటారు.

సినిమాలోని సంభాషణలు, సన్నివేశాలు కూడా చాలా వరకు నవలలోవే కావడం వల్ల దర్శకుని సృష్టిగా భావించినవి.. నిజానికి మూల రచయిత్రి సృజన అని తెలుసుకుని విస్తుపోతారు పాఠకులు.

***

హాయిగా నవ్విస్తూ, చివరిదాకా ఆసక్తిగా చదివించే నవల “ప్రేమలేఖ”. 142 పేజీల ఈ నవలని శ్రీ రిషిక పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. రూ. 80/- వెల గల ఈ పుస్తకం సోల్ డిస్ట్రిబ్యూటర్స్ నవోదయ పబ్లిషర్స్, కాచీగుడా, హైదరాబాద్. ఈ-బుక్ కినిగెలో లభ్యం.

*

 

అస్తవ్యస్త వ్యవస్థపై రెండు బాణాలు!

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

 

సాహిత్యానికున్న ప్రధాన ప్రయోజనం మార్పుకి బీజం వేయడం. కథ, కవిత, నవల, నాటకం – సాహితీరూపం ఏదైనా, దాని పరమార్థం హితం చేకూర్చడమే.

గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ సమాజాన్ని… ముఖ్యంగా తెలుగువారిని పట్టి పీడిస్తున్న సామాజిక జాడ్యాలు – స్వార్థం, అవినీతి, జవాబుదారిలేనితనం, వస్తు వ్యామోహం, పర్యావరణ విధ్వంసం, మానవ సంబంధాల విచ్ఛిన్నం వంటి అంశాలను స్పృశిస్తూ ఎన్నో రచనలు వచ్చాయి.

ఒకప్పుడు ఉజ్జ్వలంగా వెలిగిన భారతదేశం, ఇప్పుడిలా ఎందుకు మారిపోయిందని విచారణ చేస్తూ, భారతీయ వ్యవస్థలు అస్తవ్యస్తం కావడానికి బాధ్యులెవరు? పరిస్థితులను చక్కదిద్దాలంటే ఏం చేయాలి? ఎవరు నడుం కట్టాలి?… లాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులిస్తాయి రామా చంద్రమౌళి గారి నవలికలు – “పరంపర”, “ఎటు.?”

***

వ్యక్తి ముఖ్యమా, సమాజం ముఖ్యమా అనే ప్రశ్న చాలా కాలం నుంచి ఉంది. వ్యక్తులు తమ దారి తాము చూసుకుంటూ తమ చర్యలతో సమాజానికి సంబంధం లేదని, అవి తమ వ్యక్తిగతమని భావిస్తారు. తాత్కాలికంగా ఓ చర్య వ్యక్తిగతమనిపించినా… దీర్ఘకాలంలో అది సామాజికం అవుతుంది. వ్యక్తి సమాజానికి బాధ్యత వహించపోయినా, సమాజం వ్యక్తులను దూరం చేసుకోదు, కలుపుకుపోవాలనే చూస్తుంది. కొంతమంది అపరిమితమైన వ్యక్తిగత స్వేచ్ఛ లభించినప్పుడు దానిని తమ స్వార్థం కోసమే ఉపయోగించుకుని, మేధావి అని గుర్తింపు పొంది కెరీర్‌లో అత్యున్నత స్థానాలకు చేరినా, కుటుంబం పరంగా, సమాజం పరంగా ఏమీ విలువ పొందలేక ఆత్మీయులకు దూరమైపోతారు. మరికొందరు వ్యక్తిగత స్వేచ్ఛని, మేధస్సుని సమాజం కోసం ఉపయోగిస్తారు. ఎవరికోసమో అన్నీ వదులుకుంటున్నట్లు కనబడినా, నిజానికి ఎన్నో పొందుతారు, ఎందరినో తమవారిని చేసుకుంటారు. అటువంటి వ్యక్తుల కథ “పరంపర“.

చైతన్య అనే యువ ఏరోస్పేస్ ఇంజనీరు అమెరికా నుంచి ఇండియాకి విమానంలో బయల్దేరడంతో నవలిక ప్రారంభం అవుతుంది. పైన విశాలమైన ఆకాశాన్నీ, క్రింద అనంతమైన జలరాశిని చూస్తూన్న చైతన్యలో ఎన్నో ఆలోచనలు.. అతని అంతరంగంలో ఎంతో అలజడి. ఎన్నో ప్రశ్నల నడుమ తాతయ్య రామాన్ని గుర్తు చేసుకుంటాడు.

అయితే అతనిలో తాతయ్యని చూడబోతున్నాననే ఆనందం లేదు. తాతయ్య పార్థివ దేహాన్ని మాత్రమే చూడగలుగుతాననే దిగులు. తన జీవితానికి దిశానిర్దేశనం చేసిన తాతయ్య ఇకలేడని తెలిసాక… వెల్లువలా పొంగుతున్న దుఃఖాన్ని అణుచుకుంటూ ప్రయాణం… అతని ఆలోచనల్లో గతం.

ParamparaYetu Cover

రామం, రాజ్యలక్ష్మి భార్యాభర్తలు. రామం నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో ఇంజనీరు. వాళ్ళది హెవీ మెషనరీ వర్క్‌షాప్‌ ప్రక్కన ఉన్న సి-216 నంబర్‌ క్వార్టర్‌. చైతన్య బాల్యం, చదువు అక్కడే గడిచాయి. చైతన్య లోని ప్రతిభని  తాతయ్య గుర్తించి, సానబెట్టింది అక్కడే. తాతయ్యంటే ఒక ఆదర్శప్రాయుడు. చైతన్యకి అమ్మా నాన్నా లేరా అంటే ఉన్నారు. దూరంగా, రమ్మన్నపుడు రాలేనిచోట ఉన్నారు. తమ ఉద్యోగ బాధ్యతలే తమకు ముఖ్యమనుకునే కెరీరిస్టులు!

అమ్మ పేరు చైత్ర… పెద్ద చదువులు చదివి.. తల్లినీ తండ్రినీ వదిలి ఉద్యోగరీత్యా దేశదేశాలు తిరుగుతూంటుంది. బహ్రేన్‌లోని ఉద్యోగం చేస్తుండగా.. అక్కడ ఓ ప్రముఖ భారతీయ దినపత్రికకు ఈస్ట్‌ ఏసియన్‌ బ్యూరో చీఫ్‌గా పని చేస్తున్న రాజేంద్రకుమార్‌ బన్సల్‌ను పెళ్ళి చేసుకుంటుంది. కొన్నాళ్ళకి చైతన్య పుడతాడు. మూడు నెలల శిశువుగా ఉన్నప్పుడే కొడుకుని తన తల్లిదండ్రుల దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది చైత్ర. దాంతో చైతన్యని అమ్మమ్మ తాతయ్యలే తల్లీ తండ్రీ అయి పెంచుతారు.

ఒక ఇంజనీర్‌గా ఎన్నో ప్రమాదకర సందర్భాలలో రామం చేసిన సాహసోపేత సేవల గురించి ఆయన రిటైర్‌మెంట్ సభలో వక్తలు చెబుతూంటే, చైతన్యలో గర్వం, సంతోషం.. పులకింత, ప్రేరణ! భాషకందని ఏదో తృప్తిని అనుభవిస్తాడు చైతన్య.  ఆ క్షణాన్నే ఒక నిర్ణయం తీసుకుంటాడు.. ఏదో ఒక విలక్షణమైన పనిని తను చేసి ఒక అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోవాలని. ఫలితమే తాతయ్యకి దూరంగా రెసిడెన్షియల్ కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలలో చదువు, పరిశోధనా- ఆపై నాసాలో ఉద్యోగం!

రిటైరయ్యాక.. సొంత ఊరిపై మమకారంతో ‘కాకతి’కి వచ్చి స్థిరపడతారు రామం, రాజ్యలక్ష్మి దంపతులు. అస్తవ్యస్తంగా ఉన్న ఆ ఊరిని సంస్కరించడానికి సిద్ధమవుతారు రామం. అందరినీ కలుపుకుని, వాళ్ళల్లో చైతన్యం కలిగిస్తారు. బాగుపడదాం అన్న ఆశావహమైన కోరికని కలిగిస్తారు. ఊరి వారందరినీ కలుపుకుని, నమ్మశక్యంకాని విధంగా.. యిరవై ఏళ్లలో ‘కాకతి’ గ్రామాన్ని తీర్చిదిద్దుతారు రామం. గ్రామస్తులలో స్వార్థరాహిత్యాన్ని, అభ్యుదయ దృక్పథాన్ని, సహనశీలతను అలవర్చి కలను నిజం చేసి చూపిస్తారు.

రామం శవయాత్ర ప్రారంభమయ్యే సమయానికి చైత్ర, రాజేంద్రకుమార్, చైతన్య కాకతి చేరుతారు. అక్కడి అభివృద్ధి చూసి విస్తుపోతారు. రామంగారి కోరిక మేరకు శవాన్ని వైద్యకళాశాలకి అందజేశాక, రాజేంద్రకుమార్ బన్సల్ వెళ్ళిపోతాడు. చైత్ర, చైతన్య ఇంటి కొస్తారు. రామం జ్ఞాపకాలను స్మరిస్తూ తల్లీ కొడుకులు చెరో గదిలో అంతర్ముఖులవుతారు. ఇద్దరూ తమ జీవితంలోకెల్లా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాకతిలోనే ఉండిపోడానికి నిశ్చయించుకుంటారు. తాతయ్య లక్ష్యాలను కొనసాగించడం కోసం, ఊరిలో మహత్తర అభ్యుదయ కార్యాలు చేపట్టడం కోసం చైతన్య కార్యోన్ముఖ్తుడు కావడంతో నవలిక ముగుస్తుంది.

***

ఎటు.?” నవలిక తన జీవితం తనకి నచ్చడం లేదని హిమ అనే ఇరవై మూడేళ్ళ అమ్మాయి తన తల్లికి ఉత్తరం రాస్తూండడంతో ప్రారంభమవుతుంది. జీవితం తనకెందుకు నచ్చడంలో చెబుతుంది హిమ. ఆమె తల్లి ఐ.ఎ. ఎస్, తండ్రి ఐ.పి.ఎస్ ఆఫీసర్లు. విపరీతంగా కరప్టడ్. ఒక అతి సామాన్యమైన నిరక్షరాస్యుడు చేసే తప్పుతో పోలిస్తే, ఉన్నతమైన చదువులు చదివిన తన తల్లిదండ్రులు చేస్తున్న దోపిడి కోటిరెట్లు పెద్దది, ఎక్కువ తీవ్రమైనదని హిమకి తెలుసు.

తల్లిదండ్రుల విపరీత ధోరణిని భరించలేని హిమ వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళలో మార్పు రాదు. నిరాశ చెందిన హిమ హాస్టల్ ఏడో అంతస్తులోని తన గది కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆఖరి క్షణంలో ఆమెలో ఆలోచన! తను చనిపోయినంత మాత్రాన వాళ్ళిద్దరూ మారుతారన్న ఆశేమీ లేదని గ్రహిస్తుంది. అలాంటప్పుడు చచ్చి సాధించేదుముందని తనని తాను ప్రశ్నించుకుంటుంది.

రమణ అనే ఇంజనీరు మరో ముఖ్యమైన పాత్ర ఈ నవలికలో. తెలుగు రాష్ట్రాలలో విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కాలేజిలు ఏర్పడడం, ప్రమాణాలు, అర్హతలు లేకుండా…. ప్రతి సంవత్సరం మూడు లక్షలకి పైగా  – ఉద్యోగాలకు పనికిరాని మానవచెత్తను తయారు చేస్తూ దేశం మీదకి వదలడం గురించి దుఃఖించే వ్యక్తి.

ప్రభుత్వం వారి వీధి బడిలో అక్షరాభ్యాసం చేసుకుని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, కార్పోరేట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నత చదువులు చదివి తనని తాను తీర్చిదిద్దుకున్న మరో పాత్ర జయ. ఎమ్మెస్సీ పూర్తయి, డాక్టరేట్ అయిపోవస్తుండగా… తల్లితండ్రుల ఒత్తిడి మీద పెళ్ళి చేసుకుంటుంది. అంతే, ఆ వివాహంతో – నిప్పులాంటి తెలివైన పిల్ల ఒక భల్లూకపు గుహలోకి ప్రవేశించినట్లయింది. భర్త తనని శారీరకంగా, మానసికంగా ఎంతలా హింసిస్తున్నా భరిస్తుంది, సహిస్తుంది…

కాని ఎంత కాలం? ఈ ముగ్గురు తమ తమ అసంతృప్తుల నుంచి బయట పడాలనుకుంటారు. తమకు వీలైనంతలో సమాజానికి ఉపయోగపడాలనుకుంటారు. జీవితంలో ఎటు వెళ్ళాలో తెలుసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. తోటి వారికి మార్గదర్శకులవుతారు.

శీర్షికలోనే ప్రశ్న ఉన్న ఈ నవలికలో ఎన్నెన్నో ప్రశ్నలు… సమాధానాలు లేని ప్రశ్నల్లా అనిపించినా… నిజాయితీగా ఆత్మశోధన చేసుకుంటే జవాబులు దొరకగలిగే ప్రశ్నలు.

***

Prof.RaamaaChandramouliమనిషి మనుగడకు మూలమైన, మౌలికమైన సకల సూత్రాలన్నీ భారతీయ చింతనలో నిక్షిప్తమై ఉన్నాయని ఈ రెండు నవలికలూ స్పష్టం చేస్తాయి.  వీటిల్లో లోతైన తాత్త్వికత ఉంది. పద గాంభీర్యమే గాని పదాడంబరం లేదు. “మనిషి బుద్ధికి మాత్రమే విద్యనిచ్చి, నైతిక విలువల గురించి ఏమీ నేర్పకపోయినట్లయితేఅతను సమాజానికి చీడ పురుగులా తయారౌతాడ”ని థియోడర్ రూజ్‌వెల్ట్ చెప్పిన సత్యాన్ని రమణ పరంగా చెప్పడం బావుంది. మొదటి నవలికలో చైతన్యకి మార్గదర్శనం చేసినది తాతయ్య రామం అయితే, రెండో నవలికలో రమణకి దిశానిర్దేశనం చేసింది రాములు సార్. పేర్లలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ సారూప్యత ఉన్న మహోన్నతులు వాళ్ళిద్దరు. అటువంటి వారు ఊరికొకరు ఉన్నా, మన వ్యవస్థల్లోని అస్తవ్యస్తతలని సరిదిద్దుకోగలుగుతామేమో.

ఈ రెండు నవలికలలో ఎన్నో మౌలికమైన అంశాలను తేలికైన పదాలతో పాఠకులు సులభంగా గ్రహించేలా వ్యాఖ్యానిస్తారు రచయిత. ప్రపంచీకరణకి విరుగుడు స్థానికీకరణ అని, ఆ చింతనని ఒక ఉద్యమంలా అభివృద్ధి చేస్తే జన జీవనంలోని అశాంతి క్షీణించి భారతదేశం పురోగమిస్తుందని రచయిత సూచిస్తారు.

“పరంపర” చిత్ర మాసపత్రిక మార్చి 2013 సంచికలో అనుబంధ నవలికగా ప్రచురితం కాగా, “ఎటు.?” చిత్ర మాసపత్రికలో 2014 జూన్ నుంచి నవంబర్ దాకా ధారావాహికంగా ప్రచురితం. ఈ రెండు నవలికలను ఒకే సంపుటంగా సృజనలోకం, వరంగల్లు వారు ప్రచురించారు. 142 పేజీలున్న ఈ పుస్తకం వెల 150 రూపాయలు. నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ వారి వద్ద, రచయిత వద్ద పుస్తకం దొరుకుతుంది. ఈ-బుక్ కినిగెలో లభ్యం.

*

ప్రభాతమైనా…. ప్రదోషమైనా…. ప్రశాంతమే!

నేటి ఆధునిక జీవితం మనుషుల్ని ఎన్ని ఒత్తిడులకు గురి చేస్తోందో అందరికి తెలిసిందే. పగలూ, రాత్రి, ఆఫీసూ.. ఇల్లూ… తేడా లేకుండా యంత్రాల వలె పనిచేస్తూ ఉరుకులు పరుగుల మీద ఉంటున్నారు జనం. డైలీ టార్గెట్లు… వీక్లీ టార్గెట్లు… మంత్లీ టార్గెట్లు… ఇలా పనిచేసే సమయమంతా టార్గెట్లని వెంటాడుతూ ప్రశాంతత కోల్పోతున్నారు. విశ్రాంతి కరువై శారీరకంగానూ, మానసికంగాను అలసిపోతున్నారు. మరి ఈ వలయం నుంచి బయటపడడం ఎలా? పూర్తిగా బయటపడలేకపోయినా, కాస్త విరామం తీసుకుని, కొత్త ఉత్తేజం పుంజుకుని మళ్ళీ పరుగుపందెంలో పాల్గొంటే ఉత్సాహంగా ఉంటుంది.

మరి కొత్త ఉత్తేజం పొందడం ఎలా? కొందరికి పుస్తకాలు, కొందరికి సినిమాలు, కొందరికి ఆటలు, కొందరికి యాత్రలు… ఉత్సాహాన్నిస్తాయి.

యాత్రలలో మళ్ళీ పలురకాలు.. వినోద యాత్రలు.. విజ్ఞాన యాత్రలు.. ఆధ్యాత్మిక యాత్రలు….

ఆధ్యాత్మిక యాత్రలంటే ఎక్కడో దూరంగా ఉన్న కేదారనాథ్, బదరీనాథ్ యాత్రలే కానవసరం లేదు. మనకి దగ్గరలో ఉన్న ఆలయాలని దర్శించడం కూడా ఆధ్యాత్మిక యాత్రే అవుతుంది. “ఈ వయసులో గుళ్ళూ, గోపురాలు ఏంటి బాస్” అని కొందరు, “ఆఁ, గుళ్ళలో మాత్రం ప్రశాంతత ఎక్కడుంది? భక్తులను తరిమే సిబ్బంది, బిచ్చగాళ్ళు… వ్యాపారులూ… అంతా కమర్షియల్ కదా…” అని మరి కొందరు అంటారు. నిజమే. అన్ని ఆలయాలలోను ప్రశాంతత దొరుకుతుందని కచ్చితంగా చెప్పలేం కాని.. సంవత్సర కాలంలో కొద్ది రోజులు తప్ప మిగతా కాలమంతా అత్యంత ప్రశాంతంగా ఉండే గుడి ఒకటుంది. అదే కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం.

ఈ ఆలయం గురించి వెళ్ళేవరకూ కూడా నాకు పెద్దగా ఏమీ తెలియదు. కాని అక్కడికి వెళ్ళి ఆ ప్రశాంతతని అనుభూతి చెందాకా, ఆ అనుభవాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాను. అందుకే ఈ వ్యాసం.

∗ ∗ ∗

KSSinDoubleDeccarTrainది 15 ఆగస్టు 2014 నాడు నేనూ, మా బాబాయి కొల్లూరి గణేశ్ కలిసి ఉదయం 5 గంటల 45 నిముషాలకి మల్కాజ్‌గిరి స్టేషన్‍లో కాచీగుడా – గుంటూరు డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్కాం. రైలు ఓ పది నిముషాలు ఆలస్యంగా వచ్చింది. 5.45 కే బండి అని తెల్లారకట్టే లేచాను. 4.45కి తాగిన టీ తప్ప కడుపులో ఏం లేదు. రైల్లో ఇంకో కప్పు టీ తాగచ్చులే అనుకున్నాం కానీ, కాటరింగ్ వాళ్ళెవరు రాలేదు. నల్గొండ స్టేషన్‌లో కేటరింగ్ వాళ్ళొచ్చినా, టిఫిన్లే తెచ్చారు… టీ లేదు. చేసేదేముందని కాసేపు కునుకు తీసాం. మిర్యాలగుడా, నడికుడి స్టేషన్లు ఎప్పుడు దాటిపోయాయో గమనించలేదు. ఇంకో పది నిముషాల్లో పిడుగురాళ్ళ వస్తుందనగా మెలకువ వచ్చింది. పిడుగురాళ్ళలో 9.10కి దిగాం. సూపర్‌ఫాస్ట్ ట్రైన్ అన్నారు కానీ 205 km దూరానికి సుమారు మూడు గంటల సమయం తీసుకుంది.

పిడుగురాళ్ళ స్టేషన్ నుంచి బయటకొచ్చి నర్సరావుపేట వెళ్ళేందుకు బస్ స్టాండ్‌కి షేర్ ఆటోలో వెళ్ళాం. పిడుగురాళ్ళ నుంచి నర్సరావుపేటకి గంటంపావు పట్టింది ఆర్డినరీ బస్‌లో. మా బాబాయి కోటప్పకొండ గుడికి తరచూ వెడతాడు కాబట్టి, నర్సరావుపేటలో కొంతమంది మిత్రులయ్యారు. ఒక ఆటో డ్రైవర్‍తో కూడా టచ్‌లో ఉంటాడు. నర్సరావుపేటలో దిగగానే ఓ మిత్రుడిని కలిసాం. పలకరింపులయ్యాక, టీ తాగి, ఆటోలో కోటప్పకొండకి బయల్దేరాం. నర్సరావుపేట బస్‌స్టాండు నుంచి కోటప్పకొండ ఆలయానికి సుమారు 16కిమీ దూరం ఉంటుంది. ఘాట్ రోడ్ మీదుగా ఆలయానికి చేరాము. ఆఖరి అభిషేకానికి సమయం అవుతుండడంతో, కాళ్ళూ చేతులు కడుక్కుని, మా లగేజ్ అంతా ఆలయ సిబ్బంది వద్ద ఉంచి దర్శనానికి వెళ్ళాం. శ్రావణ శుక్రవారం, సెలవు రోజు కావడంతో కాస్త రద్దీగానే ఉంది గుడి. అభిషేకమూ, అర్చన చూసుకుని బయటకు వచ్చాం. ఆలయ సిబ్బందిలో మా బాబయికి తెల్సినవాళ్ళు ఉండడంతో, మాకు భోజనం ఏర్పాటు చేసారు. వారితో పాటే వారి గదిలోనే అన్నం తిని, ఆలయంకి దిగువన ఉన్న దేవాలయం వారి గది ఒకటి అద్దెకు తీసుకుని, కాసేపు విశ్రాంతి తీసుకున్నాం.

 

∗ ∗ ∗

TempleView

ఆలయ సిబ్బంది నుంచి ఓ బ్రోచర్ సంపాదించి, అక్కడున్న ఓ స్టాల్‌లో డా. పోలేపెద్ది వేంకట హనుమచ్ఛాస్తి రచించిన “కోటప్పకొండ చరిత్ర – క్షేత్ర వైభవం” పుస్తకం కొనుక్కుని అలయ చరిత్ర, స్థల పురాణం తెలుసుకున్నాను. కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయం ప్రాచీనమైనది. చారిత్రాక శాసనాల ప్రకారం క్రీ.శ. ఒకటవ శతాబ్దం నాటికే ఈ దేవాలయం ఉన్నట్లు చెబుతారు. వివిధ మహారాజుల ఏలుబడిలో గత పదిహేడు వందల సంవత్సరాలుగా పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతోంది. నరసరావుపేట మండలంలోని ఎల్లమంద, కొండకావూరు అనే గ్రామాల మధ్య ఉన్న పర్వతరాజం త్రికూటాచలం. దీన్నే కోటప్పకొండ అని కూడా పిలుస్తారు. సుమారు 1600 అడుగుల ఎత్తు, ఎనిమిది మైళ్ళ చుట్టుకొలత ఈ పర్వతాన్ని ఏవైపు నుంచి చూసినా మూడు కూటాలుగా (శిఖరాలు) కనిపిస్తాయి. సృష్టి, స్థితి, లయలకు రూపాలుగా బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల పేరిట మూడు శిఖరాలున్నాయి.

దక్ష యజ్ఞ విధ్వంసం చేసిన తరువాత లయకారుడైన మహాశివుడు శాంతివహించి బాల వటువులా శ్రీ దక్షిణామూర్తి స్వరూపంలో మధ్య శిఖరమైన రుద్రశిఖరంపై ఉన్న మారేడువనంలో ధ్యానమగ్నుడయ్యాడట. ఈ శిఖరం మీదే బ్రహ్మకు, విష్ణువుకు, సకలదేవతలకు, సనకసనందనాది మునులకు, నారదుడికి, ఎందరెందరో సిద్ధులకు, వశిష్టాది ఋషులకు జ్ఞానబోధ చేసాడట. సమస్తదేవతలు సేవించి తరింప, శివుడు దక్షిణామూర్తి రూపంలో చిన్ముద్రధారుడై దర్శనమిచ్చాడని భక్తుల విశ్వాసం. ఇదే పాత కోటప్ప గుడి. ఇక్కడే ప్రాచీన కోటేశ్వర లింగం ఉంది. శ్రీ దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వులు. “ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే | నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||” అని ఆది శంకరులు ప్రార్థించి తరించారు.

రుద్ర శిఖరానికి ఈశాన్య భాగాన మరో శిఖరం ఉంది. అదే విష్ణు శిఖరం. దక్షయజ్ఞం సందర్భంగా శివుడు లేకుండానే హవిర్భాగం స్వీకరించినందుకు దోష నివారణ కోసం, విష్ణువు ఇంద్రుడు ఇతర దేవతలతోకలసి ఇక్కడ తపస్సు చేసాడట. ఈశ్వరుడు కరుణించి ప్రత్యక్షం కాగా, తాము ఎల్లవేళలా అర్చించుకోడానికి లింగరూపంలో ఆ శిఖరంపై నిలచి దర్శనమీయమని దేవతలు కోరగా, తన త్రిశూలంతో రాతిపై పొడిచి జలం ఉద్భవించజేసి, ‘ఈ జలమందు స్నానమాచరించి నన్ను పూజించిన మీ పాపములు నశించునని’ చెప్పి అక్కడ లింగరూపంలో వెలిసాడట. దేవతలు అక్కడ స్నానమాచరించి, తమ పాపాలను పోగొట్టుకున్నారట. పాప వినాశన క్షేత్రమిది.

రుద్రశిఖరానికి నైరుతి దిశలో బ్రహ్మ శిఖరం ఉంది. రుద్ర, విష్ణు శిఖరాలలో పూజనీయ లింగాలు ఉండి తన శిఖరంలో లింగం లేకపోవడంతో బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా, శివుడు అక్కడ కూడా లింగ రూపంలో వెలిసాడు. నేడు అర్చనలు అందుకుంటున్న మహిమాన్విత దివ్యరూప శిఖరం బ్రహ్మశిఖరం. లింగరూపధారుడైన నూతన కోటేశ్వరుడు నేటికినీ ఈ శిఖరం మీదే అశేషభక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ మూడు శిఖరాలలోనూ జ్యోతిర్మయ లింగాలు ఉన్నాయనీ, మానవులకు అగోచరమగుటచే శిలాలింగములు నేడు విశిష్ట పూజలందుకుంటున్నాయని పండితులు చెబుతారు.

∗ ∗ ∗

 

TrekkingPathవిశ్రాంతి అనంతరం, సాయంత్రం నాలుగున్నరకి స్నానం చేసి, రుద్రశిఖరంపై ఉన్న పాత కోటప్ప లింగాన్ని దర్శించాలని బయల్దేరాం. ప్రస్తుతం ఉన్న గుడి నుంచి పైకి సుమారు ఒకటిన్నర – రెండు కిలోమీటర్ల దూరంలో పాత కోటప్పగుడి ఉంది. ప్రస్తుతం ఇక్కడ పూజలేం జరగడం లేదు. రోజూ పొద్దున్న సాయంత్రం ఓ సాధువు కొండెక్కి, అర్చన, దీపారాధన చేసి వస్తాడట. ఓపిక ఉత్సాహం ఉన్నవాళ్ళు ఆ కొండెక్కి అక్కడి లింగానికి స్వయంగా పూజలు చేసుకోవచ్చు. పూజాసామాగ్రి తీసుకుని కొండెక్కుదామని బయల్దేరి, కొంత దూరం ఎక్కామో లేదో పెద్దగా వాన! ముందుకు వెళ్ళాలో వద్దో తేల్చుకోలేకపోయాం. చీకటి పడేలోగా కొండ దిగి వచ్చేయాలని మా ఉద్దేశం. ఈ వానకి జడిసి, వెనక్కి వచ్చేద్దామా అని అనుకున్నాం. కాని ఉదృతి ఆగి, తుంపరగా మారడంతో ముందుకే సాగాం. “పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు” అనే వేమన పద్యాన్ని గుర్తు చేసుకుని ఎక్కడం కొనసాగించాం. కొండపైకి ఎక్కుతున్న కొద్దీ నాకు అలసట, ఆయాసం వచ్చాయి. గత మూడేళ్ళుగా శబరిమలకి కూడా వెళ్ళకపోవడంతో, నాకు ఈ కొండ ఎక్కడం కష్టమనిపించింది. మా బాబయి సులువుగానే ఎక్కేస్తున్నాడు, నేనేమో పది అడుగులు వేయడం ఆగిపోవడం! పనివేళలు పట్టించుకోకుండా, ఏం తింటున్నామో చూసుకోకుండా, సరైన నిద్ర లేకుండా ఉంటుండడంతో బరువు పెరిగిపోయి శరీరం స్థూలకాయమవుతూ ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోంది. అప్పుడే స్ఫురించింది శరీరానికి కనీస వ్యాయామం ఎంత అవసరమో. ఆ క్షణంలో ఆ కొండ (ప్రకృతి) మౌనంగా బోధించేది అదేనని అర్థమైంది.

కొండలెక్కడం గురించి ఎప్పుడో చదివిన కొన్ని వాక్యాలు గుర్తొచ్చాయి. “At bottom, mountains, like all wildernesses, challenge our complacent conviction – so easy to lapse into – that the world has been made for humans by humans. Most of us exist for most of the time in worlds which are humanly arranged, themed and controlled. One forgets that there are environments which do not respond to the flick of a switch or the twist of a dial, and which have their own rhythms and orders of existence. Mountains correct this amnesia. By speaking of greater forces than we can possibly invoke, and by confronting us with greater spans of time than we can possibly envisage, mountains refute our excessive trust in the man-made. They pose profound questions about our durability and the importance of our schemes. They induce, I suppose, a modesty in us.” – అని “Mountains of the Mind: Adventures in Reaching the Summit” అనే పుస్తకంలో అంటాడు రచయిత Robert Macfarlane.

PataKotappaGudi

DarkCloudమొత్తానికి తడుస్తూనే, రాళ్లూ రప్పలను దాటుకుంటూ శిఖరాగ్రానికి చేరాము. అనుకున్నట్లే అక్కడ ఎవరూ లేరు. నేను, మా బాబాయి తప్ప మరో మనిషి లేడు. వర్షంతో తడిసిన బట్టలను అక్కడ చెట్ల మీద ఆరేసుకుని, నా బ్యాగ్ లో పట్టుకెళ్ళిన పంచలు ధరించి అక్కడి లింగానికి పూజ చేసుకున్నాం. ఆ శిఖరం నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది. అత్యంత ప్రశాంతంగా ఉన్న ఆ చోటు వదిలి రా బుద్ధి కాలేదు. కానీ చీకటి పడేలోగా క్రిందకి దిగాలి కాబట్టి, దిగసాగం. దిగేడప్పుడు అంత కష్టమనిపించలేదు. మళ్ళీ జోరున వాన. ఓ చెట్టు చాటున ఆగాం. జీవితంలో ఏదైనా సాధించడమనేది శిఖరాగ్రాన్ని చేరడం లాంటిదని, అక్కడికి చేరాక, ఇంక సాధించడానికి ఏమీ ఉండదని, మళ్ళీ క్రిందకి దిగి రావల్సిందేనని అనిపించింది. ఎక్కేడప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కామో, దిగేడప్పుడు అంతే జాగ్రత్తగా దిగాము. ఏమరుపాటుగా ఉంటే కాలు జారి పడడం ఖాయం. విజయం తరువాత గర్వం తలకెక్కితే పతనం తప్పదని ప్రకృతి ఈ రకంగా చెబుతోందని అనిపించింది. గదికొచ్చి, తడిసిన బట్టలు ఆరేసుకుని, పొడి బట్టలు ధరించి భోజనం చేసి విశ్రమించాం.

∗ ∗ ∗

కొండ ఎక్కడానికి నానా అవస్థలు పడ్డ నన్ను చూసి మా బాబాయి ఓ కథ చెప్పాడు. ఓ మహిళ కొన్ని సంవత్సరాల పాటు రోజూ ఈ కొండెక్కి ఆ లింగాన్ని పూజించేదని చెప్పాడు. ఆ కథేంటంటే… కొండకావురు గ్రామంలో సునందుడు, కుందరి అనే యాదవ దంపతులకు ఆనందవల్లి అనే కూతురు ఉందేది. పుట్టుకతోనే శివభక్తిని అలవడిన ఆమెకి వయసుతో పాటు ఆ భక్తి పెరిగింది. రోజూ రుద్రశిఖరమెక్కి అక్కడ జంగమరూపంలో ఉన్న శివునికి త్రికరణ శుద్ధిగా పూజచేసి, పాప వినాశన క్షేత్రం నుంచి తీసుకువెళ్ళిన జలంతో అక్కడి లింగానికి అభిషేకం చేసి, తాను తీసుకువెళ్ళిన ఆవుపాలను నైవేద్యంగా పెట్టేది. ఎండనకా, వాననకా ఎంతో శ్రమల కోర్చి కొండ ఎక్కి స్వామిని అర్చించి దిగి వచ్చేది. ఆమె వివాహం ప్రస్తావన లేకుండా నిరంతరం శివుని ధ్యానంలోనే ఉండిపోయేది. ఏళ్ళు గడుస్తున్నా ఆమె భక్తి పెరుగుతోందే తప్ప, తరగడం లేదు. భౌతిక ప్రపంచ విషయాలను పట్టించుకోకుండా, స్వామి తలంపులలోనే గడుపుతూ, ఆధ్యాత్మికానందం పొందుతూండేదట. ఆమెని పరీక్షించాలని స్వామి ఆమెకు మాయాగర్భాన్ని కల్పిస్తాడట. నెలలు నిండినా కూడా కొండ ఎక్కడం ఆపక, నిత్యం కొండెక్కి పూజలు కావించి మళ్ళీ దిగేదట. ఆమె బాధ చూడలేని స్వామి వారు, ఓ రోజు “అమ్మా, నువ్వు ఇలా రోజూ రావద్దు. నేనే నీతో పాటు వస్తాను… నువ్వు కిందకి దిగుతూ ఉండు. నీ వెనుకే నేను వస్తాను. ఎలాంటి చప్పుడైనా వెనుదిరిగి చూడకు. ముందుకు సాగుతునే ఉండు…” అని అన్నారట. ఆమె తలూపి దిగడం ప్రారంభించిదట. ప్రస్తుత ఆలయం ఉన్న చోటుకి రాగానే భయంకరమైన శబ్దమై, భయపడి ఆమె తల తిప్పి వెనక్కి చూసిందట. అంతే స్వామి అదృశ్యుడై అక్కడే లింగంగా వెలిసాడట. ఆ క్షణంలోనే ఆమె ప్రసవం అవడం, మగబిడ్డ పుట్టడం జరుగుతుంది. స్వామి వారు అదృశ్యమైనందుకు చింతించిన ఆమె అక్కడే ప్రాయోపవేశం చేయాలని తలచగా, ఆ నవజాత శిశువు మాయమై శివుడు దర్శనమిస్తాడు. ఆమెకి ముక్తిని ప్రసాదించాడు. నూతన కోటేశ్వరస్వామి వారి ఆలయానికి దిగువనే ఆనందవల్లికి గుడి ఉంది. దీనిని గొల్లభామ గుడి అంటారు. ఈమె గురించి మరో విశేషం ఉంది. శివుడికి అభిషేకం నిమిత్తం సేకరించిన జలాన్ని ఓ బిందెలో ఉంచి, పూల కోసం వెళ్ళినప్పుడు ఓ కాకి వచ్చి ఆ బిందెలోని నీటిని నేలపాలు చేసిందట. కోపించిన గొల్లభామ “ఇక్కడ కాకులుండ కూడదు గాక!” అని శాపమిచ్చిందట. అందుకే కోటప్పకొండ క్షేత్రంలో ఇప్పటికీ కాకులు కనబడవు.

రాత్రి 8 గంటల తర్వాత గుడి ఖాళీ. ఒకరిద్దరు సిబ్బంది తప్ప జనాలే లేరు. గుడి ప్రాంగణంలో ఉన్న ఓ సిమెంట్ దిమ్మ మీద కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తుంటే ఏదో ఆనందం. తృప్తి. నిత్యం రణగొణధ్వనులతో నిండిన నగర జీవితం నుంచి ఒక్కరోజయినా దూరంగా ఉండి ప్రశాంతమైన స్థలంలో ఉండడం వల్ల కలిగిన మానసికానందం అదని గ్రహించడానికి ఎక్కువ సేపు పట్టలేదు. ఈ గుడి కొండ మీద ఊరికి దూరంగా ఉండడం; ఏం కావాలన్నా, కొండ దిగి కనీసం పది కిలోమీటర్లైనా వెళ్ళాల్సిరావడం వల్ల సాయంత్రమయ్యే సరికి ఇక్కడ జనాలు ఉండరు. ప్రధాన రహదారికి, రైలు మార్గానికి దూరంగా ఉండడం వల్ల వాహనాల రాకపోకల శబ్దాలు, రైలు కూతలు వంటివి లేవు. మైకులూ, లౌడ్ స్పీకర్లు లేవు. పొద్దుగుంకాక, పక్షుల కువకువలు, కోతుల కిచకిచలు తప్ప మరేమీ వినపడదు. చాలా సేపు గుడి ప్రాంగణంలోనే కూర్చుని, నిద్రపోకతప్పదు కాబట్టి గదికి వచ్చి – ఆ పూట పొందిన అనుభవాలను నెమరు వేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. – It was a real bliss!

∗ ∗ ∗

 

DakshinamurthyTemple16 ఆగస్టు 2014 శనివారం పొద్దున్నే లేచి స్నానాదులు గావించి, త్రికోటేశ్వర స్వామి వారి ఆలయానికి దిగువన ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళాం. మళ్ళీ మేమిద్దరమే. పూజారి తప్ప మరెవరూ లేరు. మన గుళ్ళలో చాలా అరుదుగా దొరికే భాగ్యం ఇది. ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోగలగడం! ఆ మూర్తిని చూస్తుంటేనే ఏదో పరవశం. ఇక్కడ పూజాదులు కానించి, త్రికోటేశ్వర స్వామి వారి అభిషేకానికి వెళ్ళాము. దర్శనమయ్యాక, తీర్థ ప్రసాదాలు స్వీకరించి బసకి వచ్చాం. చిత్తచాంచల్యాన్ని దూరం చేసి మానసిక స్వస్థత కలిగించే ఆలయమిదని ప్రధానార్చకులు చెప్పారు. మేం దిగిన గది ఖాళీ చేసి, అక్కడున్న కాంటిన్‍లో టిఫిన్ తిని బయటకు వచ్చేసరికి మా ఆటో అతను వచ్చేసాడు.

DakshinaMurthyIdolఇక్కడ ప్రధానంగా ఉన్న రెండు ఇబ్బందుల గురించి ప్రస్తావించక తప్పదు. కొండ మీద ఉన్నది ఒకే ఒక కాంటిన్. ఏ వస్తువైనా మాములు ధరకన్నా కనీసం రెండు రెట్లు ఎక్కువకి అమ్ముతున్నారు. గ్లాస్ మినరల్ వాటర్ రెండు రూపాయాలు. టీ కాఫీలు పది రూపాయలు. ప్లేట్ ఇడ్లీ (చిన్న సైజువి మూడు) రేటు వింటే ఠారెత్తిపోయింది… గత్యంతరం లేదు కాబట్టి తినక తప్పలేదు. ఇక రెండో ఇబ్బంది కోతులు. గుంపులు గుంపులుగా ఉంటాయి. భక్తుల సంఖ్య కన్నా వీటి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. చేతిలోని వస్తువులను బలవంతంగా గుంజుకుపోతాయి. త్రికోటేశ్వరస్వామి వారిది బ్రహ్మచారి రూపం కాబట్టి ఇక్కడ పార్వతి దేవి ఉండదు. కాబట్టి కళ్యాణోత్సవాలు ఉండవు. సాధారణంగా ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుందీ ఆలయం. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలోనూ, ధనుర్మాసంలో వచ్చే ఆర్ద్రోత్సవానికి మాత్రం భక్తులతో కిటకిటలాడిపోతుంది. పునర్దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థిస్తూ, కొండ దిగడం ప్రారంభించాము.

మెట్ల మార్గంలోనూ, కొండకి దిగువన మరిన్ని ఆలయాలు ఉన్నాయి. భక్తులు ఆరాధించిన విగ్రహాలు ఉన్నాయి. ఘాట్ రోడ్ మీద నుంచి దిగుతూ, రోడ్‌కి అటూ ఇటూ ఉన్న పెద్ద పెద్ద బొమ్మలను ఫోటోలు తీసుకున్నాను. దారిలో పిల్లల కోసం అటవీశాఖ నిర్వహిస్తున్న పార్కు ఉంది.

Ganesha GollabhamaTemple PanchamukhaSivalingam KalindiMadugu Shiva Vishnu Brahmaనరసరావుపేట బస్టాండ్‍కి వచ్చి టీ తాగి గుంటూరు వెళ్ళే నాన్-స్టాప్ బస్ ఎక్కాం. మధ్యాహ్నం ఒకటి నలభై కల్లా గుంటూరు చేరి, రైల్వే స్టేషన్ సమీపంలో ఓ హోటల్‍లో భోజనం చేసి, గుంటూరు – సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురు చూడసాగం. గంట ఆలస్యంగా వచ్చిన రైలు గుంటూరు నుంచి బయల్దేరేసరికి మరో అరగంట పట్టింది. మొత్తానికి రాత్రి పదకొండు గంటలకి సికింద్రాబాద్ చేరాము. ఇంటికి చేరే సరికి పదకొండున్నర. ఏదో రెండు ముద్దలు తిని, పక్కమీదకి చేరి.. “కోటి వేల్పుల అండ కోటప్ప కొండ” యాత్రానుభవాలను స్మరించుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

∗ ∗ ∗

హైదరాబాదు నుంచి పిడుగురాళ్ళకి ఇప్పుడు చక్కని రోడ్ మార్గం కూడా ఉంది. సొంత వాహనం ఉంటే పొద్దున్నే బయల్దేరితే, దర్శానాదులు కావించుకుని రాత్రికి తిరిగి హైదరాబాదు చేరుకోవచ్చు. లేదూ వారాంతాలు ప్రశాంతంగా గడపదలచుకుంటే శనివారం పొద్దున్నే ప్రయాణమైనా, మధ్యాహ్నానికి గుడికి చేరుతాం. అక్కడ గది తీసుకుని శనివారం సాయంత్రం, రాత్రి ప్రశాంతతని అనుభవించి, ఆదివారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమైనా శరీరం, మనసు రీచార్జి అవుతాయి. మరి ఆలస్యమెందుకు, వెడతారుగా…?

కొల్లూరి సోమ శంకర్

మా అమ్మమ్మ కథని ప్రపంచానికి చెప్పడం అంతే!

brightfuture009-VJ

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ ప్రశంస పొందిన అనువాద నవల “నారాయణీయం” మూల రచయిత వినయ్ జల్లాతో – అనువాదకుడు కొల్లూరి సోమ శంకర్ జరిపిన ఈమెయిల్ ఇంటర్వ్యూ…

***

హాయ్ వినయ్ గారు,

మీ మొట్టమొదటి నవల “Warp and Weft“ని తెలుగులో ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకులకు అందుబాటులోకి తెచ్చినందుకు ముందుగా అభినందనలు. ఈ పుస్తకాన్ని అనువదించే అవకాశం నాకు కల్పించినందుకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఇప్పుడు కాసేపు మీ రచనల గురించి, కెరీర్ గురించి, వ్యక్తిగత, వృత్తిపరమైన సంగతులు మాట్లాడుకుందాం.

ప్ర: మీ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి కాస్త చెబుతారా?

జ: గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగుళూరు నగరంలో నేను పుట్టి పెరిగాను. నాకు మూడేళ్ళ వయసులోనే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచే బహుశా నాకు ఏకాంతమంటే ఇష్టం పెరిగిందేమో. నాదైన లోకంలో ఉండడం – జీవితం గురించి, ఇతర విషయాల గురించి ఆలోచించడానికి మార్గం చూపిందేమో.

నాకు చిన్నప్పటి నుంచీ కూడా చదువంటే పెద్దగా ఆసక్తి లేదు. పరీక్షలు పాసవడం కోసమే తప్ప చదువుని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. బడికెళ్ళే పిల్లాడిగా, నాకు చదువు తప్ప, మిగతావన్నీ ఎంతో కుతూహలాన్ని కలిగించేవి. నేను బాగా చదువుకుని పైకి రావాలనేది మా నాన్న కోరిక. ఆయన కోరిక (నాది కాదండోయ్) తీర్చేలా బిజినెస్ మానేజ్‌మెంట్‍లో డిగ్రీ పూర్తి చేయగలిగాను.

 

ప్ర: రచయితగా ప్రయత్నించాలన్న ఆలోచన మీకు ఏ వయసులో కలిగింది?

జ: ఇంటర్మీడియట్ పరీక్షలలో ఫెయిల్ అయ్యాక, నాకు బోలెడు సమయం దొరికింది. రకరకాల పనులు చేయడానికి ప్రయత్నించాను. ఓ రోజంతా సేల్స్‌మాన్‌గా పనిచేసాను, కొన్ని నెలలపాటు కంప్యూటర్ ప్ర్రోగ్రామింగ్ నేర్చుకున్నాను… అంతే కాదు, మా కుటుంబం నడిపే ‘పట్టు వస్త్రాల వ్యాపారం’లోకి ప్రవేశిద్దామని ఆలోచించాను. అయితే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక నిర్వహించిన కాప్షన్ రైటింగ్ పోటీలో గెలవడంలో, నాలో ఓ రచయిత ఉన్నట్లు నాకు తెలిసింది. అప్పుడు నా వయసు సుమారుగా 18 ఏళ్ళు ఉండచ్చు.

ప్ర: “Warp and Weftకన్నా ముందు ఏవైనా రాసారా?

జ: డిగ్రీ చదువుతున్నప్పుడు, వ్యాసాలు, చిన్న కథలు (పిల్లలకీ, పెద్దలకీ) వ్రాయడం ప్రారంభించాను. నా కథలు దేశవ్యాప్తంగా ప్రచురితమయ్యే దినపత్రికలు (డెక్కన్ హెరాల్డ్, ఏసియన్ ఏజ్, టైమ్స్ ఆఫ్ ఇండియా), పత్రికలలోనూ (ఎలైవ్, పిసిఎం.. మొదలైనవి) ప్రచురితమయ్యాయి.

Cover5.5X8.5Size

ప్ర: “Warp and Weft” (నారాయణీయం) నవల ఇతివృత్తం ఎంచుకోడానికి మీకు ప్రేరణ కలిగించినదెవరు?

జ: ధర్మవరం గ్రామంలో మా అమ్మమ్మ గడిపిన జీవితంలోని ముచ్చట్లు వింటుంటే నాకెంతో ఆసక్తిగా ఉండేది. ఆ ఘటలనకు కథా రూపం కల్పించాను, కాస్త పరిశోధనతోనూ, తగినంత కల్పన జోడించి ఈ నవల రాసాను.

ప్ర: మీపై అత్యంత ప్రభావం చూపిన రచయిత ఎవరైనా ఉన్నారా?

జ: శ్రీ ఆర్. కె. నారాయణ్, ఆయన మాల్గుడి కథలు! ఆయన నిరాడంబరత్వం నిజంగా అద్భుతం. నా నవలను చదివితే, అది చాలా చోట్ల ఆయన రచనలను ప్రతిబింబిస్తుందని గ్రహిస్తారు.

ప్ర: ఎన్నేళ్ళ నుంచీ రచనలు కొనసాగిస్తున్నారు?

జ: గత 18ఏళ్ళకు పైగా..

ప్ర: మీరు ఏ తరహా రచనలు చేస్తారు?

జ: బ్లాగులు, కమ్యూనిటీల కోసం నాన్ ఫిక్షన్ ఆర్టికల్స్ రాస్తాను. పిల్లల కథలు రాస్తాను. త్వరలోనే నా రెండో నవల మొదలుపెట్టబోతున్నాను.

ప్ర: మీ రచనలలో ఎటువంటి సాంస్కృతిక విలువలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు?

జ: కంటికి కనబడే జీవితాన్ని ప్రతిబింబిస్తాయి నా రచనలు. సాధారణంగా, రచనలు చేయడం కథన పద్ధతిని మెరుగుపరుస్తుంది.

ప్ర: మీ రచనా వ్యాసంగం పట్ల మీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటుంటారు?

జ: మొదట్లో అయితే, ఏదో ఒక రోజు నేను రచయతనవుతానని- వారు కలలో కూడా ఊహించలేదు. 1996లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ప్రచురితమైన నా ఆర్టికల్ చదివాక, నన్ను బాగా ప్రోత్సహించారు.

ప్ర: ఈ నవల రాయడంలో మీకున్న లక్ష్యాలు, ఉద్దేశాలు ఏమిటి? అవి నెరవేరాయని భావిస్తున్నారా?

జ: 2001లో ఈ నవల రాయడం మొదలు పెట్టినప్పుడు, నాకు ప్రత్యేకమైన లక్ష్యం అంటూ ఏదీ లేదు. నా ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది – మా అమ్మమ్మ కథని ప్రపంచానికి చెప్పడం అంతే. నా నవలకి ప్రపంచ వ్యాప్తంగా… ముఖ్యంగా.. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇండియాల లోని పాఠకుల నుంచి చక్కని ప్రతిస్పందన వచ్చింది. తొలి నవలా రచయితగా, దక్షిణ భారత దేశంతో నా అనుభవాలు అనే అంశాలపై బిబిసి రేడియో నన్ను రెండు సార్లు ఇంటర్వ్యూ చేసింది. ఈ నవల ఇంగ్లాండ్‌లో.. “Waterstone’s, WH Smith, Amazon, Blackwell” వంటి అన్ని ప్రముఖ పుస్తక సంస్థలలోనూ, ఇంకా అంతర్జాతీయంగా ఉన్న 70కి పైగా ఆన్‌లైన్ రిటైలర్ల వద్ద లభిస్తోంది.

warp-and-weft-full-cover

 

ప్ర: ఈ నవల కోసం పరిశోధన చేస్తున్నప్పుడు మీకు తారసపడ్డ వ్యక్తుల గురించి కాస్త చెబుతారా?

జ: ఈ నవలలోని పాత్రధారులను సృష్టించడం కోసం నేనెంతో మంది ఆసక్తికరమైన వ్యక్తులను కలిసాను. ముఖ్యంగా, ఈ నవలలోని ఇద్దరు ప్రధాన పాత్రలను పోలిన వ్యక్తులు ఉన్నారు. రామదాసు పాత్ర దాదాపుగా మా నాన్నగారిలానే ఆలోచిస్తుంది. శ్రీరాములు పాత్ర మా దూరపు బంధువుకి ప్రతిరూపం.. కాస్త నత్తితో సహా.

ప్ర: ఈ నవలలో ఏ భాగం రాయడం మీకు కష్టమనిపించింది?

జ: నా నవల చీరలు నేయడం గురించి, నేతగాళ్ళ జీవితాలను స్పృశిస్తూ సాగుతుంది.. సరైన సాంకేతిక పదాలను ఉపయోగించాల్సి రావడం ఒక్కోసారి ఇబ్బందిని కలిగించింది.

ప్ర: ఈ పుస్తకంలోని ఏ భాగం మీకు బాగా నచ్చింది?

జ: 1950లలో తిరుమల ఎలా ఉండేదో రాసిన అధ్యాయం, అప్పటి భక్తిప్రపత్తుల ప్రస్తావన గురించి రాయడాన్ని నేను బాగా ఆస్వాదించాను.

ప్ర: జీవితం ఇప్పుడున్న స్థాయికి ఎలా చేరారు?

జ: నా జీవితంలోని ప్రతీ దశలోనూ.. స్వర్గస్తురాలైన మా అమ్మ ఆశీర్వాదం ఉందని నేను నమ్ముతాను. అదే నాకు జీవితంలోని ప్రతీ దశలోనూ.. నాకో ఆశ్చర్యకరమైన, ఘనమైన విశేషాన్ని అందిస్తోందని భావిస్తాను.

ప్ర: ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి మీరేం చేసారు? ఏ పద్ధతి పాటించారు?

జ: అనుకున్నంత తేలికగా ఈ నవల ప్రచురితమవలేదు. 2001లో ఈ నవలని వన్-సైడెడ్ పేపర్ల మీద రాసాను. అప్పట్లో కంప్యూటర్ కొనుక్కునే స్థోమత నాకు లేదు. ఓ డోలాయమానమైన నిర్ణయం తీసుకుని, విలేఖరిగా బెంగుళూరులోని నా ఉద్యోగాన్ని వదిలేసాను. ఏడు నెలల వ్యవధిలో 2,50,000 పదాలు రాసాను.

ఈ పుస్తకాన్ని ప్రచురించడం కోసం 2001నాటి శీతాకాలంలో ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టాను. నా నవల చాలా నిరాదరణకి గురైంది. ప్రచురణకర్తలు ఉపేక్షించారు. ఎందరో పబ్లిషర్ల చుట్టూ తిరిగాను, ఏజంట్లను మార్చాను. అయినా ఫలితం లభించలేదు. చివరకి సెల్ఫ్-పబ్లిష్ చేసుకునేందుకు అమేజాన్ వాళ్ళని సంప్రదించాను. మొత్తానికి నా నవల వెలుగుచూసింది. భారతదేశంలో అంతగా పేరు పొందని ప్రాంతం గురించి అందరికీ చెప్పగలిగాను.
ప్ర: మీకూ మిగతా రచయితలకూ తేడా ఏమిటి? మీ విలక్షణత ఏమిటి?

జ: బిబిసి రేడియో వాళ్ళు కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగారు. నా నవల చీరలు నేయడం గురించి, నేతగాళ్ళ జీవితం గురించి లోతుగా ప్రస్తావిస్తుంది. ముఖ్యంగా, తెలుగేతర ప్రాంతాలకి చెందినవారికి, తెలుగు వారసత్వం, సంస్కృతి గురించి చాల తక్కువ విషయాలు తెలుస్తాయి. ఈ నవలలో అవి చాలా స్పష్టంగా వ్యక్తమవుతాయి.

ప్ర: మీ మొదటి నవలని పబ్లిష్ చేసుకోడంలో మీరు ఎదురైన సవాళ్ళు ఏవి?

జ: నవల రాయడం ఒక ఎత్తైతే, దాన్ని ప్రచురింప జేసుకోగలడం మరొక ఎత్తు. నా కథని విశ్వసించే లిటరరీ ఏజంట్‌ని పట్టుకోగలగడం నాకు నిజంగానే సవాలైంది.

ప్ర: ఒక్కసారి వెనక్కిమళ్ళి, ఈ పుస్తకాన్ని మొదటి నుంచి రాయాల్సివస్తే, ఈ నవలలోని ఏ భాగాన్నైనా మారుస్తారా?

జ: నవలలోని ప్రధాన భాగాలు వేటినీ మార్చను… కానీ ముగింపుని మరికాస్త వాస్తవికంగా ఉండేట్లు రాస్తాను.

ప్ర: ఓ రచయితగా మీకు ఎదురైన తీవ్ర విమర్శ ఏది? అలాగే ఉత్తమ ప్రశంస ఏది?

జ: నిర్మాణాత్మక విమర్శలు చాలా వచ్చాయి. నేను వాటి నుంచి నేర్చుకుంటున్నాను. పోతే, నాకు లభించిన ఉత్తమ ప్రశంస శ్రీ ఆర్. కె. నారాయణ్ నుంచి. రాయడం మానద్దని ఆయన ప్రోత్సహించారు.

 

ప్ర: చివరగా, సారంగ పాఠకులకు ఏమైనా చెబుతారా?

జ: ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు, నా నవలను చదివి వారి స్పందనని నాకు తెలియజేయమని అడగడం తప్ప. నా వెబ్‌సైట్ www.vinayjalla.co.ukద్వారా నన్ను సంప్రదించవచ్చు.

ప్ర: ఈ ఇంటర్య్వూకి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు వినయ్ గారు. మీరు మరిన్ని రచనలు చేసి రచయితగా రాణించాలని కోరుకుంటున్నాను.

జ: థ్యాంక్యూ, సోమ శంకర్ గారు. నా ఈ ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చిన సారంగ వెబ్ పత్రిక ఎడిటర్లకి నా ధన్యవాదాలు. నమస్కారం.

 ముఖాముఖి: కొల్లూరి సోమశంకర్

 

ఆప్తవాక్యం

 

yandmuriఎవరైనాఒకరచయితతనపుస్తకానికిముందుమాటవ్రాయమంటే, కొంచెంకష్టంగానేఉంటుంది. వ్రాయటానికికాదు. ఆపుస్తకంమొత్తంచదవాలికదా. అందుకు (కొందరైతేచదవకుండానేవ్రాస్తారు. అదిమంచిపద్దతికాదు).

రచయితలబ్దప్రతిష్టుడైతేపర్వాలేదు. కొత్తవాడైతేమరీకష్టం. అందులోనూఅదిఅనువాదంఅయితేచదవటంమరింతరిస్కుతోకూడినవ్యవహారం.

ఇన్నిఅనుమానాలతోఈపుస్తకంచదవటంమొదలుపెట్టాను. మొదటిపేజీచదవగానేసందేహాలన్నీపటాపంచలైపోయినయ్. మొదటివాక్యమేఆకట్టుకుంది. ఇకఅక్కడినుంచీఆగలేదు.

ఆంగ్లరచయితతాలుకుఇదిమొదటిరచనోకాదోనాకుతెలీదు. సబ్జెక్టుమీదఎంతోగ్రిప్ఉంటేతప్పఈరచనసాధ్యంకాదు. కేవలంకథాంశమేకాదు. పాత్రపోషణ, నాటకీయత, క్లైమాక్స్అన్నీబాగాకుదిరాయి.

అనువాదకుడిగురిచిచెప్పకుండాముగిస్తేఅదిఅతడికిఅన్యాయంచెయ్యటమేఅవుతుంది. ఒక్కమాటలోచెప్పాలంటే: చెప్తేతప్పఇదిఅనువాదంఅనితెలీదు. అంతబాగావ్రాసాడు.

ఇద్దరికీఅభినందనలు.

యండమూరి వీరేంద్రనాథ్.

21-6-14

 

పైసా వసూల్ పుస్తకం – “రామ్@శృతి.కామ్.”

Ram@Shuruthi.comCoverPage(1)

 

కాల్పనిక సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గి కాల్పనికేతర సాహిత్యానికి ప్రాముఖ్యత పెరుగుతున్న కాలంలో ఓ వర్థమాన రచయిత తన తొలి నవలనే ‘బెస్ట్ సెల్లర్’గా మార్చుకోగలడం అరుదు, అందునా తెలుగులో మరీ అరుదు!

ఆ నవల రామ్@శృతి.కామ్. రచయిత అద్దంకి అనంతరామ్. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన రామ్ తనకు తెలిసిన నేపధ్యానికి, ప్రేమ కథని జోడించి యువ పాఠకులకు చేరువయ్యే ప్రయత్నంలో విజయవంతమయ్యారనే చెప్పాలి.

ఒకే కంపెనీలో పనిచేసే యువతీయువకుల మధ్య ప్రేమ జనించడం అనే సింగిల్ పాయింట్ థీమ్‌తో నవల రాయడం అంటే చాలా కష్టం. అయితే ఆ వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడానికి దారి తీసే సంఘటనల చుట్టూ అల్లిన సన్నివేశాలు, కథని ముందుకు తీసుకువెడతాయి. సన్నివేశాలను ఒకదానికొకటి జోడించి కథని ముగింపుకి తేవడం చాలా బాగా కుదిరింది. చక్కని స్క్రీన్‌ప్లే ఉన్న సినిమాని చూస్తున్నట్లుంది ఈ పుస్తకం చదువుతుంటే. విద్యార్థి దశలో చదువుని తేలికగా తీసుకుని సరదాగా కాలం గడిపే వారు, బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టాక ఎదుర్కునే సమస్యలను హాస్య ధోరణిలోనే ప్రస్తావించినా, అందులో అంతర్లీనంగా ఓ హెచ్చరిక కూడా ఉంది.

ఈ నవలని కథానాయకుడు రామ్ ప్రథమ పురుషలో చెబుతాడు. బిటెక్ పాసయి హైదరాబాద్‌లో ఉద్యోగానికి వచ్చి, ఇక్కడో అమ్మాయి ప్రేమలో పడి, కెరీర్ ముఖ్యమో, ప్రేమ ముఖ్యమో తేల్చుకోడంలో ఇబ్బంది పడతాడు.  ఒక దశలో అసలు తనది ప్రేమా, ఇష్టమా అని తికమకకి గురి అవుతాడు. చివరికి కెరీర్ వైపే మొగ్గు చూపి, తన జీవితాశయమైన అమెరికా ప్రయాణాన్ని సాధిస్తాడు. వృత్తిలో విజయం సాధించాక, జీవితంలోకి వెనక్కి తిరిగి చూస్తే ఏదో వెలితి. ఆ వెలితి పేరే శృతి.

శృతి కూడా తను ఎంతో ఇష్టపడి, ప్రేమించిన రామ్‌ని తన ఆశయం కోసం వద్దనుకుంటుంది. ప్రేమికుల మధ్య అపోహలు, అలకలు సహజమే అయినా, స్వాభిమానం ఎక్కువగా ఉన్న వీరిద్దరూ, తమ తమ లక్ష్యాలను సాధించుకునేందుకు తన ప్రేమని పణంగా పెడతారు. దాదాపుగా రెండేళ్ళ తర్వాత పెళ్ళి చూపులలో తారసపడతారు మళ్ళీ. కానీ అప్పుడు కూడా ఒకరినొకరు వద్దనుకుంటారు. కాని చివరకు ఒక్కటవుతారు. అందుకు దారితీసిన సంఘటనలేవి, కారకులెవరు… వంటివి ఆసక్తిగా ఉంటాయి.

ఈ నవల ఆన్‌లైన్ పాఠకులలో అత్యంత ఆదరణ పొందడానికి గల కారణాలలో మొదటిది, ఐటి రంగంలోని యువత ఈ పాత్రలతో తమని తాము ఐడెంటిఫై చేసుకోడం; రెండు రచయిత హాస్య చతురత. ప్రతీ సంభాషణలోనూ చదువరుల పెదాలపై చిరునవ్వులు పూయించడంలో రచయిత సఫలీకృతుడయ్యారు. బయట ప్రపంచంలో సాధారణ యువతీ యువకులు మాట్లాడుకునే మాటలని పాత్రలతో పలికించడం వల్ల తమ కథ చదువుతున్న అనుభూతి కలుగుతుంది చాలా మందికి. రచయిత టార్గెటెడ్ రీడర్స్ యూతే కాబట్టి సన్నివేశాలు సరదాగాను, సంభాషణలు కొండొకచో చిలిపిగాను ఉండి నవలని హాయిగా చదివింపజేస్తాయి. అలా అని ఈ నవల మిగతా వాళ్ళకి నచ్చదు అని అనడానికి లేదు. హాస్యం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, సరళ వచనాన్ని ఇష్టపడే వాళ్ళు, జీవితాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలనుకునేవాళ్ళు, నిజమైన ప్రేమంటే తెలుసుకోవాలనుకునేవాళ్ళు…. ఇలా ఎవరైనా ఈ పుస్తకాన్ని ఇష్టపడతారు.

ఏదో లొల్లాయి పదాలు రాసేసి పేరు తెచ్చేసుకుందామని రచయిత భావించలేదు. సందర్భాన్ని బట్టి భావుకత్వాన్ని, భావ శబలతని నవలలో వ్యక్తం చేసారు. శృతి అందాన్ని వర్ణించడానికి సరదా సంభాషణలు రాసినా, కని పెంచిన తల్లిదండ్రుల ప్రేమ ముందు తను ప్రేమ అనుకుంటున్నది ప్రేమేనా అని రామ్ సంశయానికి గురయ్యే సందర్భంలో రచయిత వ్రాసిన సంభాషణలు ఆయా సన్నివేశాలకి జీవం పోసాయి. అలాగే కష్టాలని ఎదుర్కొనలేక, ఆత్మహత్యకు పాల్పడిన ఓ మిత్రుడిని తలచుకుంటూ రామ్ పడిన బాధలో జీవితానికి అసలైన అర్థం చెప్పే ప్రయత్నం చేసారు రచయిత.

ఈ నవలలో స్పష్టంగా విదితమయ్యేది రచయిత నిజాయితీ. తనకు తెలిసిన ప్రపంచాన్ని తనదైన భావాలతో తన సొంత పదాలతో పాఠకులకు అందించారు. భావాడంబరం, పదాడంబరం లేకుండా హాయిగా, సరళంగా సాగిపోయే వచనం అద్దంకి రామ్‌ది. బహుశా తొలి రచన కావడం వలననేమో, నేల విడిచి సాము చేయకుండా, ఓ చక్కని కథని, ఆసక్తికరమైన కథనంతో పాఠకుల ముందుంచారు అద్దంకి రామ్. నవల చదవడం పూర్తి చేసాక, ఓ ప్రామిసింగ్ రైటర్‌ అనిపిస్తారు అద్దంకి అనంతరామ్. మరింత కృషి చేసి తన సృజనాత్మకతకి మెరుగులు దిద్దుకుంటే మంచి రచయితగా రాణించే అవకాశం ఉంది.

134 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ. 80/-. పాఠకుల డబ్బు, సమయం ఏ మాత్రం వృధా కాని పుస్తకం రామ్@శృతి.కామ్. అని చెప్పవచ్చు. డిజిటల్ రూపంలో కినిగెలో లభ్యమవుతుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ బుక్‌ని తగ్గింపు ధరకి పొందవచ్చు. ఇంకా అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభ్యమవుతుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

 

<a href= “http://kinige.com/kbook.php?id=1671&name=Ram+at+Shruthi+Dot+com” > రామ్@శృతి.కామ్ On Kinige <br /> <img border=0 src= “http://images.kinige.com/thumb/Ram@Shruthi.com.jpg” ></a>

– కొల్లూరి సోమ శంకర్

“ఒక మనిషి డైరీ” అంటే బాగుండేది!

మంచి రచన ప్రథాన లక్షణం హాయిగా చదివించగలగడం; ఆ పై ఆలోచింపజేయడం. కాలానికి తట్టుకుని నిలిచేది ఉత్తమ రచన అని కొంతమంది అంటూంటారు. కాలంతో పాటు సాగుతూ, గడచిన కాలాన్ని రికార్డు చేయడం, ఆయా అనుభూతులను, అనుభవాలను, స్మృతులను, ఆనందాల్ని, బాధల్ని అక్షరబద్ధం చేయడాన్ని డైరీఅనవచ్చు. మరి డైరీలూ, ఉత్తమ రచనలేనా అని కొందరు ప్రశ్నించవచ్చు. అన్ని డైరీలు కాకపోయినా, ప్రపంచవ్యాప్తంగా కొందరు ప్రముఖుల డైరీలు సాహిత్యాన్ని, సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసాయని చెప్పక తప్పదు. పూడూరి రాజిరెడ్డి పలక పెన్సిల్అనే పుస్తకం ఉప శీర్షిక ఒక మగవాడి డైరీమనకి ఇదే చెబుతుంది.
మనిషి జీవితంలోని ఒక్కోదశలో అతని ప్రవర్తన, భావాలూ, ఆలోచనలు, జ్ఞాపకాలు, సంశయాలు, సందిగ్ధాలు, సమస్యలు, విజయాల గురించి చెప్పింది. పుస్తకంలోని ఆర్టికల్స్ (ఇవన్నీ గతంలో సాక్షి ఫండేలోనూ, ఈనాడు ఆదివారం అనుబంధంలోనూ ప్రచురితమైనవే) మనిషి జీవితంలో ఒక క్రమంలో ఎదగడాన్ని సూచిస్తాయి. రచయిత ఉద్దేశానికి తగినట్టే ముఖచిత్రం మీద అన్వర్ వేసిన బొమ్మలు వ్యక్తి జీవితంలోని శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం, ముదిమిలను ప్రతిబింబిస్తున్నాయి. పుస్తకంలోని ఆర్టికల్స్‌ని బలపం, పెన్సిల్, పెన్ను విభాగాలుగా విభజించడం బాల్యం, కౌమారం, యవ్వనాలకు ప్రతీకగా పరిగణించవచ్చు. సాధారణంగా డైరీ అంటే ఎవరిదైనా వ్యక్తిగత సమాచారం అని భావిస్తాం. కానీ ఈ డైరీ వ్యక్తిగతం కాదు, ఓ వ్యక్తి గతాన్ని, వర్తమానాన్ని మిళితం చేస్తూ, ఆ వ్యక్తిలాంటి ఎందరో వ్యక్తుల అనుభవాలు, అనుభూతులను, భావాలను వెల్లడించింది. శిశువుగా ఓ కుటుంబంలో జన్మించి, ఎదుగుతూ బంధాలను కలుపుకుంటాడు మనిషి. యవ్వనంలోకి వచ్చేసరికి కుటుంబం పరిధి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతూంది కూడా. కొత్తబంధాలు ఏర్పడుతాయి. అయితే చాలామంది చేసే పొరపాటు పాతవాటిని వదిలేసుకోడం అని అవ్యక్తంగా చెబుతారు రచయిత. తన ఊరు, పొలం జ్ఞాపకాలు, తమ్ముడి స్మృతులు, తను చూసిన సినిమాలు, తన చదువు ముచ్చట్లు – “బలపంవిభాగంలోని ఆర్టికల్స్ చెబుతాయి. ఈ విభాగంలోని ఆర్టికల్స్ చదువుతుంటే ఎప్పుడో బాపుగారి దర్శకత్వంలో వచ్చిన స్నేహంసినిమాలోని ఓ పాట ఎగరేసిన గాలిపటాలు….” పాటలోని కొన్ని వాక్యాలు …. “చిన్ననాటి ఆనవాళ్ళుస్నేహంలో మైలురాళ్ళుచిన్నప్పటి ఆనందాలు చిగురించిన మందారాలు….” మనసు పొరల్లో దోబూచులాడాయి. పెన్సిల్ విభాగం కౌమారంతో ప్రారంభం అవుతుంది. కలం స్నేహం చేయాలనే అభిలాషతో గోవాలోని ఓ అమ్మాయికి మొదటి లేఖలోనే…. తన గురించిమొత్తం చెప్పేయడం…. కానీ ఆ లేఖకి జవాబు రాకపోవడం…. తను చేసిన తప్పేంటో తర్వాతర్వాత తెలుసుకుంటారు రాజిరెడ్డి.

చిన్నచిన్న పదాలతో కోనసీమ కొబ్బరిచెట్లని మనోజ్ఞంగా వర్ణించారు రచయిత. అదే భావ శబలతతో తన సొంతూరుని వర్ణించిన తీరు, ఎవరికైనా తమ స్వంత ఊరుని గుర్తు చేయకమానదు.

మనిషికి తోడు ఎందుకు కావాలో తెలుసా? అందరూ తమ దుఃఖాన్ని పంచుకోడానికి మరొకరు కావాలనుకుంటారు. కాని రాజిరెడ్డికి మాత్రం అలా అనిపించదు. హృదయంలో పొంగి పొరలుతున్న సంతోషాన్ని ఒక్కడే అనుభవించక, తోడు కావాలని కోరుకుంటారతను. అంతలోనే బంధం ఎన్నాళ్ళని ప్రశ్నిస్తూ, తనే సమాధనం చెబుతారు జీవితకాలం అని. “రూపం లేని, ఇదీ అని చెప్పలేని ప్రేమకి రూపం వస్తేఅదిగోఅది మీ ఇంట్లో ఉండే మీ మనిషిగా ఉంటుంది…” అంటూ జీవితభాగస్వామి గురించి అద్భుతంగా చెప్పారు.

PalakaPencilFrontCover

భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలు, అభిప్రాయబేధాల గురించి ఇలా అంటారు – “నేను కాదంటాను. నువ్వు చేసే రాచకార్యమేమిటి? అని హోమ్ పాయింట్ ఎదురవుతుంది. నేను చెప్పబోయేవేవీ వాదనకు నిలబడవని నాకు తెలుసు. అందులో కొన్నింటిని చెప్పుకోలేమనీ తెలుసు. అందుకని అసహనాన్ని ఆశ్రయిస్తాను. వాళ్ళు నిరసనని ఆయుధంగా చేసుకుంటారు. ఆ నిరసనని నిరసిస్తూ నేను మౌనం పాటిస్తాను. ఆ మౌనాన్ని ఛేదించడానికి మాటల ఈటెలు విసరబడతాయి. వంద విసుగులు, వెయ్యి నిట్టూర్పులు శవాలుగా నేల కూలుతాయి. చేస్తున్నది ధర్మయుద్ధం కాబట్టి, చీకటి పడగానే దాన్ని అలా అక్కడికి ఆపేస్తాం“. ఈ వాక్యాలు చదివాక, ఇది తమకి సంబంధించినది కాదని పాఠకులు అనుకోగలరా? తమ గురించే రచయిత రాసేసినట్లు భావించరూ?

పిల్లల్ని ఎలా పెంచాలో మరో చోట చెబుతూ.. “బతకడం ఎలాగో మనమే నేర్చుకుంటున్నప్పుడు, పిల్లలకు జీవితం అంటే ఏం చెప్పగలం?” అని ప్రశ్నిస్తారు. బహుశా, ఇది ప్రతీ తల్లీ తండ్రీ తమకి తాము వేసుకోవాల్సిన ప్రశ్నేమో

“మనకి మనమే ఎందుకు ఇంతగా నచ్చకుండా పోతాం? మన అలవాట్లను ఎందుకు ఇంత తీవ్రంగా నిరసిస్తున్నాం? మనం ఉన్న స్థితే కరెక్టు అని తెలియాలంటే, దీనికంటే భిన్నస్థితిలోకి ఒకసారి వెళ్ళిరావాలి…” అంటారు. వ్యక్తిత్వ వికాస రచయితలు పెద్ద పెద్ద పదాలతో చెప్పే విషయాన్ని సూక్ష్మంగా, సునిశితంగా చెప్పేసారు రాజిరెడ్డి.

భోగిమంటల్లో ఏమేమి వెయ్యాలో హృద్యంగా చెప్పారు ఈ పుస్తకంలో. మోసం, కపటం, అసూయ, అపరాధ భావన, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్వీటిని భోగిమంటల్లో వేసి తగలబెట్టాలట. “రక్తప్రసరణ పెంచుకుని, జుట్టుని రాల్చుకుని, ముఖాన్ని మాడ్చుకుని…. వాటిల్లో మనం దహించుకుపోడమా, వాటినే మనం దగ్ధం చేయడమా?” అని అడగడంలో ఆనందంగా జీవించడమెలా అనే కళని చెప్పకనే చెప్పారు రచయిత.

ఎవరినో ఎందుకు మార్చాలి? ఇతరులలో తప్పులెందుకు పట్టాలి? జీవితాంతం జీవించడం నేర్చుకుంటూనే ఉండాలనే సెనెకా మాటలని ఉదహరిస్తూ ఈ ప్రపంచం పర్ఫెక్ట్ కాదంటారు. “నేనేమిటోఅన్న వ్యాసం పూర్తిగా రచయితకి సంబంధించినదే అయినా, ఇందులోని చాలా పాయింట్లతో చదువరులు తమని తాము ఐడింటిఫై చేసుకుంటారు.

పెన్ను విభాగంలోని రచనలు క్లుప్తంగా ఉన్నా, వాటిలో విస్తృతమైన, విశాలమైన భావాలున్నాయి. తాత్త్వికత జోడించిన అంశాలివి. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం పిల్లలకి మాత్రమే ఎందుకు సాధ్యమవుతుందో, ఆటతో పోలుస్తూ చెప్పడం బాగుంది. ప్రేమ, బాధ, ఆప్యాయత, అసూయ…. ఏ గుంపుకైనా సహజ లక్షణాలు అనుకున్నప్పుడు సంసారానికి, సన్యాసానికి పెద్దగా తేడా ఉండదంటారు రాజిరెడ్డి. “చెట్టు కదలకుండానే పెరుగుతుంది చూడు; మనిషి కూడా అలా లోలోపల పెరగలేడంటావా?” అని అడిగిన మల్లయ్య ప్రశ్న మనల్నీ ఆలోచనల్లో పడేస్తుంది.

ఇదే పుస్తకంలో మరోచోట అంటారు – “ఆడవాళ్ళతో సమస్యలుంటాయేమో గాని అమ్మతో పేచీ ఎప్పుడూ ఉండదుఅని. అమ్మల గురించి చెప్పినా, అందం అంటే ఏమిటో వివరించినా, స్త్రీలు అంటే ఎవరో నిర్వచించినా కుటుంబాన్ని, సమాజాన్ని దగ్గర్నించి చూసి, గ్రహించి, నిర్వచించినట్లు తెలుస్తుంది ఆయా వాక్యాలు చదువుతూంటే.

పుస్తకం కవర్ పేజి మీద ఉన్న పలక బొమ్మ మీద రాసిన అక్షరాలు – “: అతడు; : ఆమెమనకెన్నో సంగతులు చెబుతాయి. మనం మన గురించి కాక, ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. వాళ్ళిలా…. వీళ్ళిలా అంటూ వేరేవారి అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఆపాదిస్తాం. కాని అసలు మనకి కావల్సింది ఎవరిని వారు తెలుసుకోడం అంటారు రాజిరెడ్డి.

ఈ పుస్తకం ఒక నాస్టాల్జియా! గతాన్ని నెమరువేసుకునే జ్ఞాపకం!! భవిష్యత్తులోకి భవ్యంగా నడిపే మార్గదర్శి!!! చదవడం పూర్తయ్యాక, ఈ పుస్తకం ఉపశీర్షిక ఒక మగవాడి డైరీఅనికాకుండా, “ఒక మనిషి డైరీఅని ఉండుంటే సరీగ్గా ఉండేదని అనిపిస్తుంది.

ఈ పుస్తకం గురించి అఫ్సర్ గారు తన ముందుమాటలో చెప్పిన వాక్యాలతో వ్యాసం ముగిస్తాను. “జీవితం ఒక వొత్తిడి. మనసుకీ, చేతకీ మధ్య, ఆలోచనకీ, సిరాకీ మధ్య – మనసు తీసే కూని రాగాలన్నీ వరుసబెట్టి కాయితమ్మీద తుమ్మెద బారులాగా చూసుకుంటే… అదిగో… అలాంటి పని రాజిరెడ్డి “పెన్ను” చేసింది. అనేక రకాల వొత్తిళ్ళ మధ్య మాట క్లుప్తం అవుతుంది. కానీ, మాటకి వొక పొందిక వస్తుంది. వొక జెన్ యోగి నిశ్శబ్దంలోంచి రాలిన హైకూలాంటి అరుదైన ఆకులాంటి భాష.”

సరళ వచనం, నమ్మశక్యంగాని సులభమైన శైలి ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివేలా చేస్తాయి. సారంగ బుక్స్ ప్రచురించి 113 పేజీల ఈ పుస్తకం వెల రూ. 75/- నవోదయ బుక్ హౌస్‌లో లభిస్తుంది. భారతదేశం బయట తెలుగువారికి అమెజాన్, సారంగ బుక్స్, ఎవికెఎఫ్ లోనూ లభిస్తుంది.

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

ఇదిగిదిగో లోపలి మనిషి చిరునామా!

KuberanatharaoIyalaCover

కన్నడ భాషా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలని తపించే శ్రీ శాఖమూరు రామగోపాల్ వెలువరించిన ఎనిమిదవ పుస్తకం “డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావ్ మరియు ఇయాళ”.

ఈ అనువాద కథాసంకలనంలో మొదటి అయిదు పూర్ణచంద్ర తేజస్వి గారి కథలు కాగా మిగతా పది కథలు వివిధ రచయిత(త్రు)లు రాసినవి.

పూర్ణచంద్ర తేజస్వి గారు రచించిన “కుబి మత్తు ఇయాళ”, “అవనతి”, “అబచూరిన పోస్టాఫీసు”, “తుక్కోజి”, “డేర్‌డెవిల్ ముస్తఫా” అనే ఈ అయిదు కథలు కన్నడ కథామాలలో మణిపూసలనడం అతిశయోక్తి కాదు. ఈ అయిదు కథల తెలుగు అనువాదాలను ఈ వ్యాసంలో పరిచయం చేసుకుందాం.

***

ఆస్పత్రి లోపల్నుంచి ఫినాయిల్, స్పిరిట్, డెట్టాల్‌ల విశిష్టమైన వాసన ఒకటి గుప్పంటూ బయటకు వస్సుంది. బెంచీల మీద ఎంతో మంది రోగులు కూర్చుని ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఖళ్ ఖళ్‌నే దగ్గుతున్నారు. కొంత మంది తమ రోగంలోని కారణాల్ని దాని గుణ లక్షణాల్ని ఇతరులకు వివరిస్తున్నారు. జ్వరపీడితడైన ముసలోడొకడు అస్ ఉస్ అని వదుల్తూ పీలుస్తూ అప్పుడప్పుడు సంకటం సంకటం అని గొణుగుతున్నాడు. వారి మనమడొకడు వారి ఊతకర్రను తీసుకొని అరచేతి మీద నిలువుగా నిల్పే సర్కస్ చేస్తున్నాడు. ప్రతిసారి ఓడిపోయి ఊతకర్ర క్రిందపడినప్పుడు ‘’మరోమారు చూడు తాతా’’ అంటూ తన సర్కస్‌ను పునరారంభిస్తున్నాడు.

గ్రామీణులు దేన్నైనా ఒక సారి నమ్మితే, వారి విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో “డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావ్ మరియు ఇయాళ” కథ చెబుతుంది. సైన్యంలో డాక్టరుగా చేరి, అక్కడ తను చేసేది పెద్దగా ఏముండదని గ్రహించిన డా. కుబేరనాథరావ్ భైరవపురంలోని ధర్మాసుపత్రిలో వైద్యుడిగా చేరుతారు. ఆయన హేతువాది. వైద్యంతో పాటుగా గ్రామంలోని ప్రజలను చైతన్యవంతులని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయన ఆ ఊర్లో సాక్షాత్ దైవం వంటి వారు. ఎటువంటి రోగాన్నైనా చిటికెలో నయం చేయగలరని ప్రఖ్యాతి పొందారు. ఆయన హస్తవాసి మంచిదనే నమ్మకం ప్రజలలో పాతుకుపోయింది. ఇయాళ అనే బాలికకి కడుపు నొప్పి వస్తే, వాళ్ళ అమ్మ బాయమ్మ డాక్టర్ గారికి అన్ని రోగ లక్షణాలు వివరించి, మందు రాయించుకుంటుంది. వాళ్ళ నాన్న హసన్‌లో మా మందు సీసా కొనుక్కొని వస్తాడు. ఆ మందు సీసాను ఆయన ముట్టుకుని, మూత తీసి పెట్టి ఇస్తే రోగం ఇట్టే తగ్గిపోతుందని చెప్పి, ఇయాళను డాక్టరు గారి దగ్గరికి పంపుతుంది బాయమ్మ. డాక్టరు గారు అందులోని అసంబద్ధతని చెప్పి, ఇయాళని వెనక్కి పంపబోతారు. చిన్నబోయిన ఇయాళ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అది చూసి కాంపౌండర్ రామారావ్ – ఆ సీసాని ముట్టుకుని ఆ పిల్లకిస్తే తప్పేంటి అని అడుగుతాడు. బదులుగా అశాస్త్రీయంగా మాట్లాడవద్దని, తాము జీతభత్యాలు పుచ్చుకునేది మూఢనమ్మకాలను వ్యాప్తి చేసేందుకు కాదని అంటారు డాక్టరు. కానీ రామారావు వాదనలోని తర్కాన్ని కాదనలేక చివరికి ఇయాళని పిలిచి, ఆ మందు సీసా తీసుకుని, మూత విప్పి, మళ్ళీ పెట్టి ఇస్తారు. ఇయాళ సంతోషంతో ఇంటికి బయల్దేరుతుంది. అయితే, ఆమె ఇంటికి చేరదు. ఎవరో ఆమెని కర్పూర వృక్షం దగ్గర ఓ పెద్ద బండ దగ్గర హత్య చేసి పడేసారు. ఆ హత్య చేసింది ఎవరో తెలియదు. రాజకీయాలు తెలెత్తుతాయి. చనిపోయిన ఆ పిల్లను ఉపయోగించుకుని ఎవరి ప్రయోజనాలను వారు సాధించాలని ప్రయత్నిస్తూంటారు. హత్యకి కారణం తెలియదు. పోలీసులు చేతులెస్తేస్తారు. చివరికి అనుకోకుండా, డాక్టరు కుబేరనాథరావ్ ఆ కారణాన్ని తెలుసుకుంటారు. హంతకుడెవరో వెల్లడి చేస్తారు. తన వృత్తి ధర్మం పరిధి నుంచి బయటపడి, మానవత్వం ఉన్న మనిషిగా ప్రవర్తించినందుకు డాక్టరుగారికి సంతోషమవుతుంది. కానీ జనాలు మాత్రం కుబేరనాథరావ్ ప్రేతాత్మలను లొంగదీసి, నిజాలు వెల్లడి చేయించాడని నమ్మసాగారు. ఆయన ఏ విధానాన్ని నమ్మక తిరస్కరిస్తూ వచ్చారో, అదే సిద్ధాంతాన్ని జనాలు రహస్యంగా ప్రతిపాదించడం కాలపురుషుడిలోని అపహాస్యమేనంటారు రచయిత. ధర్మాసుపత్రి వర్ణన, వైద్యం కోసం అక్కడ ఎదురుచూస్తున్న వ్యక్తుల హావభావాలు, ప్రవర్తన కళ్ళకు కట్టినట్టు చిత్రించారీ 31 పేజీల ఈ పెద్ద కథలో.

ఆ పల్లెలలోని జనమంతా ఒక రకమైన విచిత్రంగా ఉండే వ్యవహరాలలో మునిగి తేలుతుండేవారు. ఉత్తిగనే కాలాన్ని గడుపుకొనే వ్యవహరాలులాగ ఉంటుండేవి వారి పనులు. వెళ్ళేది, వచ్చేది, కూలబడేది నిలుచుండేది… ఈ తరహలో ఉండే ఈ పల్లెజనంకు… ఎలెక్షన్ల కాలంలో వీళ్ళకు ఏమి ప్రలోభాల్ని చూపించి, వీళ్ళనుంచి ఓట్లు గుంజుకొనేది ఎలాగబ్బా అనేది ఒక సమస్యగా ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులకు అంతుచిక్కని సవాల్ అన్నట్టుగా ఉంటుండేది.

అవనతి కథ ఇస్లాపుర, ఇత్తావర, నస్లాపుర, సంగాపుర, మల్లినమడుగు అనే అయిదు గ్రామాల వర్ణనతో మొదలవుతుంది. ఈ అయిదు పల్లెలు విశిష్టమైనవి. అక్కడ మిగతా గ్రామాల్లో ఉండే కక్ష్యలూ, కార్పణ్యాలు లేవు. మత కలహాలు లేవు.. పేద గొప్ప తేడాల్లేవు. ప్రస్తుత ద్వేషమయ రాజకీయ దొమ్మరాటలకు ఈ పల్లెలు పెను సవాలుగా ఉన్నాయి అంటారు రచయిత. ఈ పల్లెల్లో ఉన్న ఇద్దరు గొప్ప వ్యక్తులలో ఒకరైన సూరాచారి, ఈరేగౌడతో కలిసి ఇస్లాపుర నుంచి ఇత్తావరకు వెడుతుండంతో కథ ప్రారంభం అవుతుంది. సూరాచారి నిజానికో శిల్పి. దేవాలయం నిర్మాణానికి ఇస్లాపుర వచ్చిన సూరాచారి అనుకోని పరిస్థితులలో ఇక్కడే ఇల్లరికం ఉండిపోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళు దేవుడి విగ్రహాలు, మందిరాలు తయారు చేసి ఇచ్చినా, సూరాచారికి పెద్దగా పని ఉండేది కాదు. కొన్నాళ్ళకి రుబ్బురాళ్ళు, తిరగళ్ళకి గాట్లు పెట్టే పని తప్ప మరొకటి దొరకదు. ఏం చేయాలో తోచదు. చివరికి జనాల కోరిక మీద టేకు చెక్కల నుంచి గ్రామ దేవత బొమ్మలను తయారు చేయడం మొదలుపెడతాడు. కానీ జనాలకి ఆ బొమ్మలు నచ్చేవి కావు. ఆ బొమ్మలలో వాళ్ళకి దెయ్యం కనపడేది గాదు. ఆ బొమ్మలని అంత అందంగా ఎందుకు చేస్తారని ఆక్షేపించేవారు. అనాకారితనం కొట్టొచ్చినట్లు కనపడే బొమ్మలి తయారుచేస్తే వాళ్లెంతో సంతోషిస్తారు. ఈ పనులు చాలవన్నట్లు… మంత్ర తంత్రాలతో తాయెత్తులను ఇవ్వడం, మందుమాకు ఇవ్వడం, విభూది పెట్టడం వంటి ఇతర పనులు చేపట్టాడు. కాలం గడపడం కోసం ఇంకా అనేకానేక పనులు చేసేవాడు. బాకీవసూళ్ళు, ఎడ్ల అమ్మకంలో మధ్యవర్తిగా ఉండడం, పెళ్ళిళ్ళు కుదర్చడం ఇలాంటివన్న మాట. ఉబుసుపోని జనాల మధ్య ఓ పనిలేని తెలివైన వ్యక్తి కూడా ఎలా పతనమవుతాడో చెబుతుందీ కథ. ముప్ఫై నలభై సంవత్సరాల క్రితం గ్రామీణ భారతంలోని జీవనాన్ని అత్యంత సుందరంగా చిత్రించిన కథల్లో ఇది ఒకటి.

పోస్టాఫీసు ఆత్మకూరులో కొత్తగా తెరవబడినప్పుడు బొబణ్ణ ఉదయంలో ఒక గంట, సాయంకాలంలో ఒక గంట టెంపరరీగా పోష్ట్‌మాష్టర్ డ్యూటి చేసేందుకు ఒప్పుకొన్నాడు. బోబణ్ణ ఒప్పకొన్న మీదట అతనుండే ఇల్లరికం ఇల్లే టెంపరరీ పోస్టాఫీసుగా రూపాంతరం చెందింది. అందరూ బోబణ్ణను పోస్టమాష్టరుగారు అని గౌరవంగా సంభోధిస్తుండేవారు. బోబణ్ణలో తానొకడే ఢిల్లి సర్కారు (కేంద్రప్రభుత్వం)తో సంపర్కాన్ని పొందిన ఇండియన్ అనే గర్వం తొణకిసలాడుతుండేది.

ఓ బలహీనమైన క్షణంలో చేసిన తప్పు ఎలా వెంటాడి వేధిస్తుందో, “ఆత్మకూరులోని పోస్టాఫీసు” కథ చెబుతుంది. కొత్తగా పెట్టిన పోస్టాఫీసుకి, ఆత్మకూరులో ఎస్. ఎస్. ఎల్. సి. దాకా చదువుకున్న బోబణ్ణని పోస్ట్ మాస్టర్‌గా నియమిస్తుంది ప్రభుత్వం. ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలలో చాలామంది నిరక్షరాస్యులు కావడంతో, వారికొచ్చిన ఉత్తరాలను చదివి పెట్టడం, వారు రాయాల్సిన ఉత్తరాలను రాసిపెట్టడం వంటి పనులు చేస్తూంటాడు బోబణ్ణ. ఊర్లో పోస్ట్‌మాన్ సౌకర్యం లేకపోవడం వల్ల వచ్చిన ఉత్తరాలన్నీ జాయికాయ పెట్టెలో పడేస్తుండేవాడు. జనాలు వచ్చి ఆ పెట్టెలో వెతుక్కుని తమ ఉత్తరాలు తీసుకువెళ్ళేవారు. అదే సమయంలో ఇతరుల ఉత్తరాలు కూడా చదివేస్తూండేవారు. ప్రస్తుతం బోబణ్ణ ఎంతో దిగులుగా ఉన్నాడు. ఆ దిగులుకి కారణం అతను చేసిన ఓ దొంగతనం. ఆ ఊర్లో ఓ కుర్రాడికి వచ్చిన ఓ కవర్‌ని ప్రేమలేఖగా భావించి దొంగతనంగా చించి తెరుస్తాడు. కానీ అందులో ఓ అర్థనగ్న సుందరి బొమ్మ ఉంటుంది. ఆ క్షణం నుంచి అతనిలో మనో వికారం మొదలవుతుంది. అప్పట్నించి అతను ఆ ఊరికొచ్చే ప్రతీ కవర్‌నీ తెరచి చూసి, వాటిల్లో సుందరాంగుల బొమ్మలేమయినా ఉన్నాయేమోనని వెతికేవాడు. పనిపాట లేని జనాలు పోస్టాఫీసు దగ్గర చేరి ఆయా ఉత్తరాల్లోని విషయాల్ని చర్చించుకుంటూంటారు. ఈ ప్రక్రియలో ఎన్నో పుకార్లు రేగుతాయి. జనాలు బోబణ్ణని కొట్టడానికి వస్తారు. అంతా గందరగోళమై పోతుంది. చివరికి పోస్టాఫీసు, ఇల్లు వదిలి పారిపోతాడు బోబణ్ణ. ప్రతీ వ్యక్తిలోనూ ఉండే చీకటి కోణాలని బహిర్గతం చేస్తూందీ కథ. ఈ కథ చలనచిత్రంగా నిర్మించబడి, జాతీయ స్థాయిలో “ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా” బహుమతి పొందింది.

అతను మరియు అతని భార్యైన సరోజ…ఆ ఇద్దరే కూర్చుని ఎంత పనినైనా చేస్తుండేవారు. భార్యకు మొట్టమొదలు కాజాల్ని కుట్టేది , గుండీల్ని కుట్టేది మొదలైన చిల్లర పనుల్ని ఇస్తుండేవాడు. సరోజకు కొద్దికొద్దగా బట్టల్ని కుట్టే పనితనం పరిచయం అవుతూ రాసాగగా ఇక ఇప్పుడు బట్టల్ని కత్తిరించే పనిని ఇస్తుండేవాడు. ఇతను రంగు సబ్బుముక్క(బిళ్ళ) నుంచి బట్టమీద కొలతల గీట్లును గీసి ఇస్తుండేవాడు. ఆ గీతలకు అనుగుణంగా సరోజ ఆ బట్టల ముక్కల్ని కత్తిరించి ఇస్తుండేది.

ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్ళిచేసుకున్న వాళ్ళు తమ మధ్య ప్రేమని చివరి దాక ఒకేలా ఎందుకుంచుకోవాలో చెబుతుంది “టైలర్ తుక్కోజీరావ్” కథ. తుక్కోజీరావ్ వంశమే బట్టలకు ప్రసిద్ధి. అతని తండ్రి హసన్ పట్టణంలో పేరుమోసిన కట్ పీసెస్ వ్యాపారి. అయితే తుక్కోజీ సామ్యవాద భావాలవైపు మొగ్గుచూపి, తండ్రి అభిమతానికి విరుద్ధంగా ఓ పేద విధవరాలి కూతురు సరోజని పెళ్ళి చేసుకుంటాడు. తండ్రి ఆస్తిలోంచి ఒక చిల్లిగవ్వ కూడా ఆశించకుండా, తన చేతి విద్యని నమ్ముకుని అప్పుడే పెరుగుతున్న గురుగళ్ళికి మకాం మారుస్తాడు. బట్టలు కుట్టడంలో తుక్కోజీకి అద్భుతమైన నైపుణ్యం ఉంది. ఎవరినైనా ఒకసారి తేరిపార చూస్తే వారి శరీరపు కొలతలు అతని మనసుకో ముద్రితమైపోతాయి. అప్పటి దాక రెడీమేడ్ దుస్తులు ధరించే గురుగళ్ళి జనాలు తుక్కోజీ నైపుణ్యం పుణ్యమా అని కట్ పీసెస్ కొనుక్కుని తమ శరీరాకృతికి తగ్గట్టుగా చక్కని దుస్తులు కుట్టించుకుని తిరుగుతున్నారు. భర్తకి సహాయంగా సరోజ మొదట కాజాలు గుండీలు కుట్టడం ప్రారంభించి, క్రమంగా తను బట్టలు కుట్టగలిగే స్థితికి వస్తుంది. కొన్నాళ్ళకి వారికి ఓ కొడుకు పుడతాడు. కృష్ణోజీ అని పేరు పెట్టి కిట్టూ అని పిలుస్తూంటారు. కిట్టూ పుట్టిన తర్వాత సరోజ భర్తకి సాయం చేయడం తగ్గుతుంది. పిల్లవాడు నడక నేర్చే సమయానికి తుక్కోజికి పని ఒత్తిడి బాగా ఎక్కువవుతుంది. సరోజకి బిడ్డతో తీరిక దొరకదు. ఫలితంగా బట్టలు కుట్టడంలో తేడాలొస్తాయి. ఖాతాదారులు గొడవ చేయడం మొదలుపెడతారు. మొదట్లో అన్యోన్యంగా ఉన్న భార్యభర్తల మధ్య తగువులు మొదలవుతాయి. తనని అర్థం చేసుకోవడం లేదని ఇద్దరూ అనుకుంటూంటారు. కొన్నాళ్ళకి బేరాలు తగ్గుతాయి. ఇంట్లో చిరాకులు పరాకులు పెరుగుతాయి. కిట్టు అల్లరి పెరిగిపోతుంటూంది. ఆ ఊర్లో రైలు వంతెన నిర్మాణం కోసం ఓ క్రాలర్ వస్తుంది. కిట్టూ ఆ క్రాలర్‌కి అడ్డంగా వెళ్ళి, దాని అద్దం పగలగొడతాడు. క్రాలర్ డ్రైవర్ వచ్చి తుక్కోజీని మందలిస్తాడు. ఇంకా అల్లరి మానకపోతే, కిట్టూని తాను తీసుకెళ్ళిపోతానని అంటాడా డ్రైవర్. ఒకరి మీద మరొకరు విసిగిపోయి ఉన్న అ భార్యాభర్తలు, “తీసుకుపొండి.. మాకు హాయిగా ఉంటుంది” అని అంటారు. నిజంగానే ఆ డ్రైవర్ పిల్లాడిని ఎత్తుకుని క్రాలర్‌లో కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతాడు. అరగంట అవుతుంది, గంట అవుతుంది, క్రాలర్ జాడ లేదు. భార్యాభర్తలలో అలజడి మొదలవుతుంది. కిట్టూని అడ్డం పెట్టుకుని ఒకరి మీద మరొకరు ప్రతీకారం తీర్చుకోవాలని చూసిన తీరు గుర్తొచ్చి ఇద్దరూ పశ్చాతాప్తం చెందుతారు. క్రాలర్ డ్రైవర్ గురించి ఫిర్యాదు చేద్దామని బయల్దేరుతుండగా డ్రైవర్ తిరిగొచ్చి కిట్టూని అప్పగించడంతో కథ ముగుస్తుంది. ఒక టైలర్ దుకాణం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్లు చూపిన కథ ఇది.

 ఇక ఇప్పడు ముస్తాఫాలోని టోపి మా క్లాసులో కష్టాల్ని కలిగించసాగింది. ‘టోపి గీపి తీసేదిలేదు. నన్ను కోరేది మానండి. నేను డేర్ డెవిల్ మనుషిని’ అంటూ ముస్తాఫా మొండికేసి కూర్చున్నాడు. ఏమేమి చెప్పినా వినలేదు. మేము సైతం అతను టోపి తీయాల్సిందేనని పట్టుపట్టాము.మొత్తం మా క్లాసులో ముస్తాఫా పరంగా మాట్లాడేందుకు ఏ విద్యార్థి సిద్దమైలేడు. అయినా ముస్తాఫా మాత్రం, ‘’నన్ను వదిలేయండి; నేను డేర్ డెవిల్ లాంటోడ్ని’’ అని అంటూ ఎవరి మాటకు విలువ ఇవ్వకనే కూర్చున్నాడు స్థిరంగా.

హిందూమతానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్న ఓ జూనియర్ కాలేజిలో “జమాల్ అబ్దుల్ ముస్తఫా హుసేన్” అనే కుర్రవాడు చేరతాడు. అయితే ఏ రోజూ కాలేజీకి రాడు. లెక్చరర్ హాజరు పిలిచినప్పుడల్లా మిగతా విద్యార్థులు ఆ కుర్రాడు ఎవరో చూడాలని ఎదురుచూస్తారు. కానీ వాళ్ళకి ముస్తఫా కనబడడు. ప్రతీ రోజూ లెక్చర్ హాజరు పిలవడం, ముస్తఫా పేరు పలికినప్పుడు ఎవరూ జవాబు చెప్పకపోవడంతో మిగతా విద్యార్థులకు చాలా కుతూహలంగా ఉంటుంది. ఎవరితను, ఎందుకు కాలేజీకి రావడం లేదు? అని అనుకుంటూ వాళ్ళ మనసుకి తోచిన కారణాలు ఊహించుకుంటూండేవారు. ఒక రోజు హఠాత్తుగా, ముస్తఫా తరగతికి హాజరవుతాడు. అతన్ని చూసిన విద్యార్థులు విస్తుపోతారు. భిన్న మతాలలోని ఆచార వ్యవహారాలు మనుషుల మధ్య విభేదాలు సృష్టించినట్లే, విద్యార్థుల మధ్య కూడా సృష్టిస్తాయి. మొదట్లో అతన్ని ఆటలలో చేర్చుకోరు. దూరంగా ఉంచుతారు. అయితే వినాయక చవితి సందర్భంగా ముస్తఫా చేసిన మేలు అతడిని మిగతా పిల్లలు ఆమోదించేలా చేస్తుంది. ముస్తఫాలో తుంటరితనం ఉన్నా, అంతకు మించిన సంస్కారం ఉందని, అతను బాగా చదువుకుని భారత ప్రభుత్వం వారి రక్షణ పరిశోధనా విభాగంలో ఉన్నత పదవి సాధిస్తాడు. ముస్తఫా డేర్ డెవిల్ ఎలా అయ్యాడో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

సాహిత్య స్వరూపం ఏదైనా, అది రాణించాలంటే రచయితకి రచనావస్తువు పట్ల నిబద్ధత అవసరం. కథా వస్తువుని తన నిజ జీవితంలోంచి తీసుకున్నా, సమాజం నుంచి గ్రహించినా, ఆయా వ్యక్తులను అత్యంత సన్నిహితంగా గమనిస్తే తప్పితే రచనను అత్యద్భుతంగా తీర్చిదిద్దలేరు. పూర్ణచంద్రతేజస్వి గారు ఆయన అన్ని రచనలలోనూ ఇదే పని చేసారు. తన చుట్టూ ఉండే వ్యక్తులను అత్యంత సమీపం నుంచి గమనించి, వారి స్వభావాలను, నైజాన్ని అక్షరబద్ధం చేసారు. కథలో తారసపడే ప్రదేశమైనా, సంఘటన అయినా చదువుతుంటే కళ్ళకు కట్టినట్లుంది. తోటివారితోనూ, పరిసరాలతోనూ ఎంతో సాన్నిహిత్యం ఉంటేగాని ఇదంతా సాధ్యం కాదు. ఒకప్పటి గ్రామీణులలోని అమాయకత్వం, సంస్కారం, సానుభూతి, కుళ్ళు, కుత్రలు, కుతంత్రాలు…. ఇలా మంచీ చెడూ అన్నింటిని ఆయా పాత్రల ద్వారా సమగ్రంగా వ్యక్తీకరించారు రచయిత. మనుషుల మనస్తత్వాలు, ద్వంద్వప్రవృత్తులు, మూఢ విశ్వాసాలు వారి జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథలలో చూడచ్చు.

పూర్ణచంద్ర తేజస్వి గారి ఈ అయిదు కథలు మన లోపలి వ్యక్తులను మనకి పరిచయం చేస్తాయనడంలో అనుమానం లేదు.

***

మొత్తంగా తరచి చూస్తే, చక్కని కన్నడ కథలని తెలుగు పాఠకులకు అందించే మరో ప్రయత్నం ఈ సంకలనం అని చెప్పవచ్చు. మంచి కన్నడ కథలని శ్రమకోర్చి తెలుగు పాఠకులకు అందించిన రామగోపాల్ గారు అభినందనీయులు. ఈ పుస్తకంలోని మిగతా కథలని గురించి మరోసారి ముచ్చటించుకుందాం.

 

“డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావు మరియు ఇయాళ”పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. 198 పేజీల ఈ పుస్తకం వెల రూ.200/- (విదేశాలలోని తెలుగువారికి $10.). ప్రతులకు రచయితనూ సంప్రదించవచ్చు.
చిరునామా: Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in
kolluri–కొల్లూరి సోమ శంకర్

స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013

స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013)

“750 పదాల” స్మార్ట్ స్టోరీ రాయండి

రూ. 10,000/- విలువైన బహుమతులు గెలుచుకోండి

మిత్రులారా…

మీరు 28 సంవత్సరాల లోపు వారా? అయితే, మీ సృజనాత్మకతని వెల్లువెత్తించండి, మీ కీబోర్డులకి పనిచెప్పండి…. రూ.10,000/– వరకూ గెలుచుకునే చక్కని అవకాశాన్ని అందిపుచ్చుకోండి!

మీరు చేయాల్సిందల్లా.. కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013)కి 750 పదాల లోపు, ఒక స్మార్ట్ స్టోరీ రాసి submit@kinige.com కి పంపిస్తే చాలు! మీ కథ బహుమతి గెలుచుకునే అవకాశం. వివరాలు దిగువ …

ప్రథమ బహుమతి:

మీ కథ… కినిగె ప్రథమ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే…

మీకు రూ.4000/- విలువగల బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

ద్వితీయ బహుమతి

మీ కథ… కినిగె ద్వితీయ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే…

మీకు రూ.2000/- విలువగల బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

తృతీయ బహుమతి

మీ కథ… కినిగె తృతీయ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే…

మీకు రూ.1000/- విలువగల బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

ప్రోత్సాహక బహుమతులు (6 కథలకు)

మీ కథ… కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్‌లో కన్సోలేషన్ ప్రైజ్‌కి ఎంపికైతే… మీకు రూ.500/- విలువగల ప్రోత్సాహక బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

మీరు చేయదగినవి!

1. మీకు నచ్చిన ఇతివృత్తాన్ని ఎంచుకోవచ్చు

2. కావాలనుకుంటే కలం పేరు వాడవచ్చు (*కానీ, కినిగె అడిగినప్పుడు, మీ అసలు పేరు, గుర్తింపులను ఋజువులతో సహా చూపవలసి ఉంటుంది)

3. మీరు టెక్స్ట్ పాడ్, నోట్ పాడ్, లేదా ఎం. ఎస్. వర్డ్ డాక్యుమెంట్ లేదా తత్సమాన డాక్యుమెంట్ ఏదైనా ఉపయోగించవచ్చు. తెలుగు అక్షరాలను స్పష్టంగా చూపే ఏ అప్లికేషన్ని అయినా వాడేందుకు సంకోచించనవసరం లేదు.

4. మీ కినిగె స్మార్ట్ స్టోరీకి వన్నె తెచ్చే యోగ్యమైన బొమ్మలను జోడించండి (*కాపీరైట్‌ని గౌరవించడం మరచిపోవద్దు)

మీరు చేయాల్సినవి!

1. మీరు మీ రచనని కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) కోసమే రాయాలి

2. మీ కినిగె స్మార్ట్ స్టోరీని యూనికోడ్‌లో మాత్రమే* టైప్ చేయాలి

3. టైపింగ్ దోషాలు, అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు ఉండకూడదు.

4. సబ్జెక్ట్ లైన్‍లో “కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) కోసం” అని రాయాలి. మీ స్మార్ట్ స్టోరీ (2013) పేరు ప్రస్తావించాలి.

5. మీ పూర్తి పేరు, పోస్టల్ అడ్రస్ (పిన్‌కోడ్‌తో సహా) పంపాలి.

6. మీ కథలను 20 సెప్టెంబర్ 2013లోగా కినిగెకి అందేలా పంపాలి

7. మీ రచనలను submit@kinige.com కి పంపాలి

8. మీ వయసు డిసెంబరు 2013 నాటికి 28 సంవత్సరాల లోపు ఉండాలి.

మీరు చేయకూడనివి!

1. గతంలో ప్రచురితమైన కథలు పంపకూడదు.

2. ఇతర పోటీలలోగాని లేదా ఇతర ప్రచురణకర్తలు లేదా ఇతర ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ప్రచురణల వద్ద పరిశీలనలో ఉన్న కథలను పంపకూడదు.

3. అనువాద కథలు పంపకూడదు.

4. ఒక వేళ మీ కథకు బహుమతి లభిస్తే, ఆ కథని మీరు ఏ బ్లాగులో గానీ, వెబ్‌జైన్‌లో గాని, ఇతర సోషల్ మీడియా సైట్లలో గాని లేదా ఇతర ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ప్రచురణలలో కనీసం ఒక ఏడాది వరకు ప్రచురించరాదు.

5. ఈ నిబంధనలలో దేనినైనా, అన్నింటినీ లేదా కొన్నింటిని మీ కథ ఉల్లంఘిస్తే, మీరు పోటీకి అనర్హులవుతారు.

6. వెరసి, మీరు కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) కోసం సరికొత్త కథ, కినిగెకి మాత్రమే రాయల్సి ఉంటుంది.

మీకు సహాయపడే వనరులు:

మీ రచనలను యూనికోడ్‌లో టైప్ చేసేందుకు

1. lekhini.org

2. సురవర తెలుగు కీబోర్డు suravara.com

3. యూనికోడ్‌లో టైప్ చేసేందుకు మరింత సాయం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

గమనిక:

పోటీ ఫలితాల విషయంలో కినిగెదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు. ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే, పోటీకి అనర్హులవుతారు.

*ఒకవేళ మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే support@kinige.com కి ఈమెయిల్ చేయాలి

మీ రచనలు కినిగెకి పంపడానికి తుది గడువు 20 సెప్టెంబర్ 2013!

తెలుగులో కన్నడ కథల పరిమళాలు

matateeru

కన్నడనాట ఉత్తమ రచయితల్లో ఒకరైన శ్రీ పూర్ణచంద్ర తేజస్వి రచించిన కథలకు తెలుగు అనువాదం “మాటతీరు”. తెలుగు సేత  శాఖమూరు రామగోపాల్.

ఈ అనువాద కథాసంకలనంలో ఎనిమిది పూర్ణచంద్ర తేజస్వి గారి కథలు మాత్రమే కాకుండా, వర్తమాన కన్నడ సాహిత్యంలో విశేష కృషి సలుపుతున్న శ్రీ ఎస్. తమ్మాజీరావ్ నంగ్లీ గారి కథలు రెండు, బి. ఎల్. వేణుగోపాల్ గారి కథలు రెండు, కె. సత్యనారాయణ గారి ఒక కథ ఉన్నాయి. అదనంగా, అనువాదకులు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలలో తన పర్యటన వివరాలను ఆసక్తికరంగా అందించారు. పూర్ణచంద్ర తేజస్వి గారి కథల్లో ఎక్కువగా గ్రామీణ భారతం నిండి ఉంటుంది. ప్రకృతి వర్ణన కళ్ళకి కట్టినట్లుగా ఉంటుంది. ఆయా వర్ణనలను తెలుగులో కూడా సమర్థవంతంగా వ్యక్తీకరించారు శాఖమూరు రామగోపాల్ గారు. ఈ పుస్తకంలోని కథలను పరిచయం చేసుకుందాం.

సహ్యాద్రి పర్వత శిఖరాల మీద గంభీరమైన చీకటి అదేదే గొంగడ్ని కప్పుకొన్నట్లు ముసుగేసి కప్పుకుని ఉంది.

బాల్యం అంటే కుతూహలం, బాల్యం అంటే భయం, బాల్యం అంటే ప్రశ్నలు, బాల్యం అంటే భరోసా! చదువుకుంటున్న పదేళ్ళ శివ తన తండ్రి మంజప్ప గౌడ పిలవడంతో చదువాపి వరండాలోకి వస్తాడు. బయట వాన కుండపోతగా కురుస్తూంటుంది. కొత్తనీరులోని రుచి కోసం పంటకాలువలో ఎదురీది వచ్చే బురదమట్టల్ని, కొర్రమీనల్ని పట్టుకోడానికి మంజప్ప గౌడ, పనివాడు లింగడితో కలిసి ఆ రాత్రి వేళ బయల్దేరుతూంటాడు. జాగ్రత్తగా తలుపు వేసుకోమని చెప్పి, వాళ్ళిద్దరూ బయల్దేరుతారు. శివ సగం తలుపు తీసి ఉంచి, బయటి వానని; తండ్రి, లింగడు ముందుకు సాగడాన్ని చూస్తూంటాడు. జోరుగాలికి తలుపులు కొట్టుకోవడంతో లోపలిగదిలో ఉయ్యాలలో నిద్రపోతున్న శివ తమ్ముడు సదానంద ఏడుపు మొదలుపెడతాడు. వాడిని ఊరడించమని తల్లి లోపలినుంచి కేక పెడుతుంది. వాన ఆగదు. ఆ రాత్రి గడిచిపోతుంది. మళ్ళీ చీకటి పడుతుంది.

తండ్రీ, లింగడూ రారు. శివ చెల్లెలు ఓ వసపిట్ట. ఆమెకి ఎన్నో సందేహాలు… వాటన్నింటిని శివ ముందుంచుతుంది. శివ వాటికి జవాబులు చెప్పలేడు. చివరికి అలా ప్రశ్నలు వేయకూడదంటూ…. తనకు లింగడు చెప్పిన కథ చెబుతాడు. ఆ కథ విని చెల్లి బాగా భయపడిపోతుంది. తాను లింగడి నుంచి కథ విన్నప్పుడు భయపడినదానికంటే, చెల్లి ఎక్కువగా జడుసుకున్నందుకు శివకి కాస్త ఆనందం కలుగుతుంది. వాన కురుస్తునే ఉంటుంది. ఊగుతున్న గుడ్డి దీపం వెలుగులో తమ్ముడి ఉయ్యాల నీడ గోడమీద పడి నాట్యం చేస్తుంది. మెల్లగా శివకి తన కథపై తనకే భయం కలుగుతుంది. బెదిరిపోతాడు. ఇంతలో తలుపు చప్పుడై, తండ్రి, లింగడు లోపలికి రావడంతో కథ ముగుస్తుంది. బాల్యంలోని అమాయకత్వాన్ని, కథలలోని కల్పనలని తెలుసుకోలేని ఉద్విగ్నతనీ అద్భుతంగా చిత్రిస్తుంది “లింగడొచ్చిండు” కథ.

తన కాళ్ళ అడుగుభాగాన జరుగుతున్న ఈ దుర్బల మానవుల నడవడిక మరియు తన తల మీద నడుస్తున్న మేఘమాలికల సయ్యాట…. ఈ సర్వవ్యాపారానికీ సాక్షిభూతంగా ఆ పర్వత శిఖరం గాంభీర్యంగా నిల్చి ఉంది!

లక్కడు, సోముడు అనే ఇద్దరు నిష్ప్రయోజకులూ, స్వార్థపరుల కథ “ఉరుము చెప్పిందేంటి?”. పని చేయడాన్ని ప్రాణసంకటంగా భావించే వీరిద్దరూ తమ ముసలి అవ్వని రోడ్డు మీద వచ్చే వాహనానికి అడ్డంగా పడేసి, ఆమె మరణించాక, రాబట్టుకునే నష్టపరిహారంతో మజా చేసుకోవాలనుకుంటారు. వేరే ఊర్లో పని వెతుక్కోడానికి వెడుతున్నట్లుగా ప్రయాణమై, అనుకున్నట్లుగానే దారిలో ముసలామెను ఓ వాహనానికి అడ్డంగా తోసేస్తారు, ఆమె మరణిస్తుంది. ఆ కారు యజమాని దగ్గర వందరూపాయలు (కథాకాలం 1957 వ సంవత్సరం, ఆ కాలంలో వంద రూపాయాలు చాలా పెద్ద మొత్తం) తీసుకోబోతుంటే ఓ తమాషా జరుగుతుంది. ఆ వాహనం యజమాని వంద రూపాయలు ఇవ్వకుండానే చిన్నగా మందహాసం చేస్తాడు. మనిషిలోని కుత్సిత స్వభావానికి అద్దం పడుతుందీ కథ.

హులియూరు అనే ఊరిలో నివసించే రంగప్ప గౌడకీ, అతని కొడుకు సోమూకి ఒక్క క్షణం కూడా పడదు. తండ్రి ప్రతీ దాంట్లోను కొడుకును నియంత్రించాలనుకుంటాడు, కొడుకేమో స్వతంత్రంగా ఉండాలని తండ్రి అదుపాజ్ఞలకి దూరంగా పోవాలని ప్రయత్నిస్తూంటాడు. సీత అనే అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని రంగప్ప గౌడ పంతం. ఆ సంబంధం కాకుండా తను ప్రేమించిన నళినాక్షిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. వీరి ప్రాంతంలో గద్దలెక్కువ. కోడిపిల్లలు ఏమరుపాటుగా ఉన్నప్పుడు చటుక్కున క్రిందకి దిగి నోట కరుచుకుపోతుంటాయి. రంగప్ప గౌడ గద్దల్ని చంపాలనంటాడు. సోమూ దానికి నిరాకరిస్తాడు. కారణం, మల్లినమడుగు గ్రామంలోని పూజారి చేసిన బోధ. గద్దలు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడి ప్రతిరూపమని, దానిని చంపిన వారు తిన్నగా నరకానికి పోతారని పూజారి చెబుతాడు. ఆ మాటలను బలంగా విశ్వసిస్తాడు సోమూ. ఒక గద్ద వీళ్ళింట్లో కోడి పిల్లలని ఎత్తుకుపోడానికి దిగుతుంది, వీళ్ళ పెంపుడుకుక్క ఆ గద్ద నోట కరుచుకుంటుంది, కుక్క నుంచి గద్దని కాపాడేందుకు సోమూ ప్రయత్నిస్తే, అది భీతిల్లి తన వాడైన గోళ్ళతో సోమూ చేతులను గీరి అతని ముంజేతిని పట్టుకొంటుంది. పైకి ఎగరలేక, గోళ్ళను సోమూ ముంజేతిలోకి బలంగా తెంచుతూంటూంది. పని వాడి అరుపులకి తండ్రి బయటకి వస్తే గద్దని తప్పించేందుకు, ఒక కత్తి తెమ్మని అరుస్తాడు సోమూ. కత్తి తేవడం ఆలస్యం అయితే, చివరికి దాని మెడ కొరికి చంపుతాడు సోమూ. “నువ్వూ నరకానికి పోతావా?” అని పనివాడు అడిగితే, “స్వర్గం నరకం అనేవి లేని లేవు, అంతా పూజారుల ఒత్తి మాటలు” అంటూ కసితీరా ఉమ్ముతాడు. ఇదొక ప్రతీకాత్మక కథ.

సోమూ సుభద్రని ప్రేమిస్తూంటాడు లేదా ప్రేమిస్తున్నానని అనుకుంటూంటాడు. ఓ మైదానంలో కూర్చుని పల్లీలు తింటూంటాడు. అతని పక్కనే ఓ నల్లకుక్క నిల్చుని పల్లీల కేసి ఆశగా చూస్తూంటుంది. ఒక్కో పల్లీగింజ నోట్లో వేసుకుంటూ, నెల రోజుల క్రితం జరిగిన సంఘటనని గుర్తుచేసుకుంటాడు సోము. ఆ రోజు – చీకటి పడుతోంది, వెళ్ళాలంటూ సుభద్ర తొందరపెడుతుంది. ఇంకాసేపు ఉండమంటాడు. ఆమె వినకుండా ఏదో చీటీ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఆమె మీది కోపంతో అందులో ఏం రాసుందో కూడా చదవడు. ఆ కాగితాన్ని జేబులో కుక్కేసుకుంటాడు. – ఈ నెల రోజులలో ఆమె మళ్ళీ కనబడదు. సగం నమిలిన పల్లీగింజ గొంతుకు అడ్డం పడడంతో వర్తమానంలోకి వస్తాడు. దాన్ని బయటకు రప్పించడానికి రకరకాల విన్యాసాలు చేస్తూండగా, పక్కనే ఉన్న ఆ నల్లకుక్క చటుక్కున అతని కాలు కొరికి పారిపోతుంది. అది పిచ్చికుక్కేమో ననే సందేహం కలుగుతుంది. అక్కడ్నించి మొదలవుతుంది అతని కష్టకాలం. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు పొడిపించుకోవాల్సివస్తుంది, ఆ కుక్క పిచ్చిదో కాదో తెలుసుకోవాలి. ఈ హడావుడిలో ప్రియురాలి సంగతి, ఆమె రాసిన చీటి సంగతి మరిచిపోయి, ఆ కుక్క క్షేమ సమాచారం కోసం తెగ తిరుగుతాడు. ఈ క్రమంలో అతను చిత్రభ్రమకి గురవుతాడు. తనని తాను పురూరవుడిగా భావించుకుని, తన ప్రేయని “ఊర్వశి”గా ఊహించుకుంటాడు. మనుష్యుల లోని చంచల స్వభావాన్ని, భావసంచలనాన్ని చిత్రించిన కథ “ఊర్వశి”.

జోరు వానకు తడి ముద్దై నానిన కొండ శిఖరమొకటి విరిగిపడి కడలి తీరంలో కల్సే ఒక నదీ ప్రవాహంలో మేట వేసి, లంకలా మారినట్లుగా….

మోహన్‌దాస్ కె.జి. (మోని) అనే పేరున్న ఓ బాలుడి కథ “గాంధీజీ దశ నుంచి”. తండ్రికి అనారోగ్యం కలిగితే, మందు తేవడానికి మోని బయల్దేరుతాడు. గాంధీజీ కథ చదువుకుంటూంటాడు మోని. తల్లి అకారణంగా తిట్టి, తండ్రికి మందులు తెమ్మని పంపిస్తుంది. తండ్రికి ఉన్న అనారోగ్యాల పేర్లు రాసుకునేందుకు చెల్లిని పెన్సిల్ అడుగుతాడు మోని. ‘నీ పెన్సిల్ ఏది?’ అని తల్లి అడిగితే, క్లాసులో ఎవరో దొంగిలించారని చెప్పి, మరిన్ని తిట్లు తింటాడు. తండ్రి జబ్బుల జాబితాని తల్లి రాసిస్తుంది. దిగులుగా బయల్దేరుతాడు మోని. వైద్యుదు ఉండే ఊరు నాలుగు మైళ్ళ దూరం. ఏవో ఆలోచనల్లో పడి తల్లి రాసిచ్చిన కాగితాన్ని ఎక్కడో పోగొట్టుకుంటాడు. చివరకి, జబ్బుల పేర్లు గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తూ, తను చేసిన తప్పులని తండ్రికి ఉత్తరంగా రాస్తాడు గాంధీగారిలా. తర్వాత ఏమవుతుందనేది ఆసక్తిగా ఉంటుంది. పిల్లలు గాంధీగారిలా నిజాలను నిర్భయంగా రాయాలనుకున్నా, గాంధీజీ తండ్రిలా వాటిని ఆమోదించలేని తండ్రులెందరో. 1960లలో రాయబడిన ఈ కథ నేటికీ వర్తిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

గంభీరమైన కథల మధ్య హాస్యం చిలకరించే కథ “పంజ్రోళ్ళి పిశాచి”. హాస్టల్‌లో ఉండే కుర్రాళ్ళు ఇంట్లోంచి పాత్రలు తీసుకొచ్చి చక్కని ఫిల్టర్ కాఫీ తాగాలనుకుంటారు. అర్థరాత్రి తమలో ఒకడైన మిత్రుడింటికి వెళ్ళి పాత్రలు, డికాక్షన్ తెచ్చుకుని, కాఫీ తాగి ఆనందిస్తారు. అయితే తెల్లారాక వారికో నిజం తెలుస్తుంది. గిలగిలాడిపోతారు.

ఆకాశమంతా మేఘాలు కమ్ముకొని, రోడ్లన్నీ బురదమయమై దూరానున్న రమణీయ దృశ్యాలన్నీ తొలగిపోయి స్తబ్దుగా నిలబడియుంది వాతావరణం.

ఈ పుస్తకానికి మకుట కథ “మాటతీరు”. ఓ రచయిత అంతర్మథనాన్ని అందంగా చిత్రిస్తుందీ కథ. వేదాంత సత్యాలను మిళితం చేస్తూ, గ్రామీణుల భోళాతనాన్ని, తుంటరి పిల్లల అల్లరి చేష్టలని చక్కగా చూపిస్తుందీ కథ. ఇరుకిరుకైన బతుకుని మాటల తీరుతో మళ్ళీ మళ్ళీ చికాకు పెడుతున్న జగత్తు మీద, జనం మీద అసహనం వ్యక్తం చేస్తుందీ కథ.

కొత్త మన్నుతో కరిగి కలగలసిన ఆ నీళ్ళు కుంకుమరంగుతో ఉన్నట్లుగా కనపడుతుంది. అటు ఇటు ఉన్న దట్టడవి వాగులోని ప్రవాహం మ్రోతకు ప్రతిధ్వనించి ఒకటి రెండు ఎక్కువైనట్లు మ్రోత పెట్తుంది. తేలుతూ కొట్టుకొచ్చిన గడ్డిగాసం మొదలైనవన్నీ ఆ ఎర్రనీళ్ళ ప్రవాహం మధ్యన తలెత్తి నిలబడ్డ వృక్షాల తలలలో ఇరుక్కుపోయి, ఇక ఆ చెట్లు తలపాగాలు చుట్టుకొన్నట్లుగా నిలబడియున్నవి.

“నిగూఢ మనుషులు” ఈ సంకలనంలో కెల్లా పెద్ద కథ. దాదాపు 56 పేజీల కథ ఇది. మనుషుల నిజస్వరూపాలను, జాతిబేధాలను, అసూయా ద్వేషాలను, అహంకారాలను, కృత్రిమత్వాన్ని ఈ కథ ప్రదర్శిస్తుంది. ప్రకృతి ప్రకోపాన్ని, వరద విలయాన్ని, భూపంకం వల్ల కొండ చరియలు విరిగి పడి గ్రామాలకు గ్రామలు నాశనమవడాన్ని ఈ కథ చెబుతుంది. బీభత్సకరమైన ఘటనలున్నా, భయోత్పాతాన్ని కల్పించదీ కథ. దీన్ని చదువుతుంటే ఒక ప్రాంతపు చరిత్ర చదివినట్లుంటుంది.

తనను లైంగికంగా వేధించిన ఆఫీసర్‌ని శిక్షించమని ఉన్నతాధికారులను వేడుకొన్న ఓ యువతి వినతి మేరకు ఆ అధికారిని వేరే ప్రాంతానికి బదిలీ చేస్తారు. అయితే అనూహ్యంగా బాధితురాలు ఉన్నతాధికారిపై తిరగబడుతుంది. తాను అడిగింది ఏమిటి? వాళ్ళు చేసింది ఏమిటి? అని వాపోతుంది. కారణం తెలుసుకోవాలంటే, ఆలోజింపజేసే కథ “చిట్టితల్లి” చదవాల్సిందే.

“కాళ్ళు లేని కవిత”లో అవార్డుల కోసం, బిరుదుల కోసం తాపత్రయపడే సాహితీవేత్తలపై చురకలు వేస్తారు రచయిత. “ముందుగా బతుకును అనుభవించు. అనుభవం అర్థవంతంగా మారి నీ కవిత్వంలోకి వస్తది. అర్థమైన దాన్ని అక్షరాల్లోకి దించు. అలాగున రాస్తుంటే నీ సాహిత్యం అనుభావమౌతుంది” అంటాడో సీనియర్ కవి, తన జూనియర్ కవికి జ్జాన బోధ చేస్తూ. తర్వాత ఏమవుతుంది? కథ పూర్తయ్యాక చదువరుల పెదాలపై నిట్టూర్పు వెలుస్తుంది.

మూడు వందల కోట్ల రూపాయాలకు వారసురాలయ్యే అవకాశం ఉన్న ఓ మహిళ తన కుటుంబీకులు పెడుతున్న బాధలనుంచి తప్పించుకోడానికి రైలెక్కి వేరే ఊరికి బయల్దేరిపోతుంది. విధి ఆడే వింత నాటకం వల్ల చివరికి ఆ డబ్బు ఆమె ఆశ్రయం పొందిన అనాధాశ్రమానికే అందుతుంది. మనుషుల జీవితంలో సంపద సృష్టించే దురాశని, దాని వల్ల మనుషుల మనస్తత్వాలలో వచ్చే మార్పులని “వారసుదార్లు” కథ చక్కగా చెబుతుంది.

జీవించి ఉన్నప్పుడు ఎవరికీ ఒక్క రూపాయి కూడా దానం చేసి ఎరుగని ఓ వృద్ధురాలు తన మరణానంతరం ఆస్తినంతా ఓ అనాధ శరణాలయానికి ఎందుకు రాసేసిందో తెలుసుకోవాలంటే “సొత్తు” కథ చదవాలి. దొంగ బాబాల మీద, అవినీతిపరులైన రాజకీయవేత్తల పైన సంధించిన అస్త్రం “మఠాదిపతి మరియు మెడికల్ కాలేజి” కథ. నేటి వ్యవస్థలోని లోపాలను వ్యంగ్యంగా ఎత్తి చూపిన కథ ఇది.

చివరగా తన యాత్రానుభవాలు వివరిస్తారు రామగోపాల్ గారు. ఆయా అనుభవాలు చదువుతుంటే, మనం కూడా ఆయనతో ప్రయాణించినట్లు, ఆయా ప్రదేశాలు స్వయంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది. కేరళలోని మున్నార్ పర్యటన సందర్భంగా కాలడి వెళ్ళి, ఆదిశంకరుల జన్మస్థలాన్ని, కీర్తిమందిరాన్ని దర్శించారు అనువాదకులు. శంకరుడి జన్మస్థలం దర్శనం కోసం ఆ రోజున వచ్చింది కేవలం పది మందేనని తెలిసి ఎంతో బాధ పడతారు రామగోపాల్ గారు. సినిమా హీరోల ఇళ్ళముందు వందలాది మంది ఎదురుచూస్తుంటే, అఖండ భారతావనిని దర్శించి, నాలుగు దిక్కులా మఠాలు నెలకొల్పి వేదాల ఔన్నత్యాన్ని చాటి చెప్పిన శంకరుని గృహం వద్ద యాత్రికులు లేకపోడాన్ని సంస్కృతి క్షీణించడంగా భావించారట ఆ రోజు వీరితో పాటు ఆ గృహాన్ని దర్శించిన ఓ మహారాష్ట్రకు చెందిన యాత్రిక కుటుంబం. ఓ కఠోర వాస్తవం!

మొత్తంగా తరచి చూస్తే, చక్కని కన్నడ కథలని తెలుగు పాఠకులకు అందించే ప్రయత్నం ఈ సంకలనం అని చెప్పవచ్చు. అయితే అనువాదకులు ఉపయోగించిన భాష – మహబూబ్‌నగర్ జిల్లా, కర్నాటక సరిహద్దుల ప్రాంతంలోని తెలుగు కన్నడం కలగలసిపోయిన యాస – పాఠకులకు కాస్త ఇబ్బందిగా తోచవచ్చు. కొంచెం ఓపిక చేసుకుని చదివితే కన్నడ కస్తూరి పరిమళాలను అస్వాదించవచ్చు. మంచి కన్నడ కథలని శ్రమకోర్చి తెలుగు పాఠకులకు అందించిన రామగోపాల్ గారు అభినందనీయులు.

kolluri

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్

“మాటతీరు”పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. 230 పేజీల ఈ పుస్తకం వెల రూ.200/- (విదేశాలలోని తెలుగువారికి $10.). ప్రతులకు రచయితనూ సంప్రదించవచ్చు.
చిరునామా: Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in

ఆశ ఉందిగా…

kolluri“ఇంకో 48 గంటలకి మించి ఆవిడ బతకదు” అని చెప్పేసి, మా ప్రశ్నల కోసం ఆగకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు డాక్టర్ గులాటి.

ఐ.సి.యులో నాలుగో నెంబరు బెడ్ మీద ఉన్న 70 ఏళ్ళ ముసలావిడ ఆయనకి ఓ పేషంట్ మాత్రమే. కానీ నాకు, ఆమె నా జీవితం… మా అమ్మ!

నా శరీరంలోని అణువణువు వేదనతో కేకపెట్టినయ్యింది. నలభై ఎనిమిది గంటలు. కేవలం 48 గంటలు! ఈ ప్రపంచంలో మా అమ్మ ఉండేది ఇంక 48 గంటలే. ఆ తరువాత? తరువాత ఇంకేముంటుంది? నా ప్రపంచమంతా శూన్యం, నాకో పెద్ద వెలితి.

దాదాపు పదేళ్ళపాటు నేను అమ్మతో ఒక్కసారి కూడా మంచిగా మాట్లాడలేదు. నా కష్టనష్టాలన్నింటికీ అమ్మనే నిందించాను. నాకు ఉద్యోగం లేదు, దానికి అమ్మనే నిందించాను. చదువులో గొప్ప గొప్ప ఘనతలేం సాధించలేదు, దీనికి అమ్మనే తప్పుబట్టాను. నేను ఆత్మన్యూనతా భావంతో బాధపడ్డాను, దానికి కూడా కారణం అమ్మేననుకున్నాను. నింద…నింద…నింద. ఈ పదేళ్ళలో నేను ప్రతీ దానికీ అమ్మని నిందిస్తునే ఉన్నాను.

“ఈ భూమి మీదకి రావడం నా తప్పు కాదు” అని ఒకసారి అమ్మతో అన్నాను, నా అభిమాన నటుడిని అనుకరిస్తూ. అదే డైలాగ్‌ని అతను ఏదో సినిమాలో చెప్పినట్లు గుర్తు. కానీ వెంటనే నాలిక కరుచుకున్నాను. కానీ ఒక్కసారి నోరు జారామా, మాటల్ని వెనక్కి తీసుకోలేం.

అయినా, హృదయాంతరాళాలలో ఎక్కడో నేను అమ్మని ప్రేమించాను. అత్యంత గాఢంగా ప్రేమించాను. కానీ ఎన్నడూ వ్యక్తం చేయలేకపోయాను. పాపం, ఆ నిస్సహాయురాలు మాత్రం ఏం చేస్తుంది? నేను ఇంటర్ చదువుతూండగానే నాన్న చనిపోయాడు. తన ముద్దుల కొడుకు మానసిక వైకల్యం బారిన పడడం తట్టుకోలేక, కుమిలిపోయాడు. అవును, మా అన్నయ్య…. మేమందరం మా కుటుంబపు ఐన్‌స్టీన్ అని పిలుచుకునే అన్నయ్య….. దేశంలోని ఓ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో బి.టెక్ చదువుతున్న అన్నయ్య… ఉన్నట్లుండి మానసిక వ్యాధికి గురయ్యాడు.

చిన్నతనంలో అమ్మ కోసం ఎర్ర కారు కొంటానని చెప్పిన అబ్బాయే, మానసిక ఆరోగ్యం సరిగా లేక ఉన్మాద స్థితిలో అమ్మపై చేయి చేసుకునేవాడు. అతను జబ్బు పడ్డాడు. తీవ్రంగా జబ్బు పడ్డాడు. నాన్న అది భరించలేకపోయారు. ఆయన హృదయం తట్టుకోలేకపోయింది. గుండె ఆగిపోయింది. వెర్రి మేధావితో సహా, అయిదుగురు పిల్లల్ని సాకాల్సిన బాధ్యత అమ్మకి వదిలి నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.

మేమంతా అప్పటికింకా చిన్నపిల్లలమే. మా కాళ్ళ మీద మేము నిలబడి, అమ్మకి ఆసరా ఇవ్వలేకపోయాం. డబ్బుకి ఎప్పుడూ కొరతే. అమ్మ ఎంతో ఓపికగా భరించింది. ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో అమ్మ గుమాస్తాగా పనిచేసింది. వచ్చే కొద్దిపాటి జీతంతోనే మమ్మల్నందరిని పెంచి పెద్దచేసింది.

మరి కొత్త బట్టలు ఎక్కడ్నించి వస్తాయి? నాకు కొత్త బూట్లు ఎలా కొనివ్వగలుగుతుంది? అయితే ఈ చిన్నచిన్న విషయాలు నా బుర్రలో నాటుకుపోయాయి. నన్ను సరిగా పెంచలేదనే భావం నాలో కలిగింది. ఏ మాత్రం సణుక్కోకుండా అమ్మ ఆ నిందల్ని భరించింది.

ఇప్పుడు, ఐ.సి.యులో నాలుగో నెంబరు బెడ్ మీద, సగం అపస్మారక స్థితిలో పడి ఉంది. ఇక బతికేది 48 గంటలే. నేను ఆమెని ఎంతగానో బాధపెట్టినందుకు క్షమాపణ కోరనూ లేను. “అమ్మా, ఐ లవ్ యు” అని గట్టిగా అరవాలనుకున్నాను.

“అమ్మా, నేను నిన్ను నిజంగా బాధపెట్టాలనుకోలేదు. నిన్ను ఎంతగానో ప్రేమించాను. నిజం. ఇప్పటికీ ప్రేమిస్తునే ఉన్నాను…” అని చెప్పాలనుకున్నాను. కానీ అమ్మకి వినబడుతుందా? నా నోట్లోంచి వచ్చే పదాలను అమ్మ గ్రహించగలుగుతుందా? సందేహమే! ఆలస్యం అయిపోయింది…… ఓ జీవిత కాలం ఆలస్యమై పోయింది!

నా జీవితంలో తుఫాను చెలరేగింది. ఇటువంటిది మునుపెన్నడూ నేను అనుభవించలేదు. నాలోని అణువణువు నా నుంచి వేరుపడి స్వేచ్ఛ పొందాలనుకుంటున్నాయి. నేను కూడా చచ్చిపోతే  బావుండనిపించింది. అమ్మ లేకుండా నేను బతకలేను. నా అంతర్మధనం, ఆలోచనల్లో పడి బయట ఏం జరుగుతుందో అసలు పట్టించుకోలేదు.

***

ఆసుపత్రి బయట కూడా తుఫాన్ చెలరేగింది. నగరం అల్లకల్లోలంగా ఉంది. ఒక వర్గం వారికి చెందిన ప్రార్థనా స్థలాన్ని ఎవరో అపవిత్రం చేసారటచేశారట.  ఇళ్ళు తగలబెట్టారు, బడులు దోచుకోబడ్డాయి, ఆడవాళ్ళు మానభంగాలకి గురయ్యారు, జనాలు చంపబడ్డారు. కత్తులు చేతబట్తిన ముష్కరమూకలు నగరమంతా సంచరిస్తున్నాయి. బాగా డబ్బున్న వాళ్ళు చేతుల్లో రివాల్వర్లు ఉంచుకుంటున్నారు.

నాకు హఠాత్తుగా “మియా” గుర్తొచ్చాడు. ఎప్పటి మాట? దాదాపు నలభై ఏళ్ళ క్రితం సంగతి.

నేను స్కూలుకి వెళ్ళే రోజుల్లో అతను మా ఇంటికి రావడం నాకు గుర్తుంది. ఓ బుట్టనిండా చేపలు తీసుకొచ్చి మా గుమ్మం ముందు పోసేవాడు. “మియా, నా దగ్గర డబ్బులు లేవు, చేపలు తీసుకు పో” అనేది అమ్మ. కాని మియా అదేమీ పట్టించుకునేవాడు కాదు. మా బెంగాలీలం రోజూ జలపుష్పాలను ఆహారంలో తీసుకోవాల్సిందే. డబ్బుదేముంది? ఉన్నప్పుడే ఇవ్వండి అన్నట్లుగా డబ్బు ఎప్పుడిస్తామో అని అడగనైనా అడగకుండా, అతను ఈల వేసుకుంటూ నడిచి వెళ్ళిపోయేవాడు.

మియా ఓ చిన్నపాటి జాలరి. అతనికి పడవా లేదు, వలా లేదు. ఉన్నదల్లా, శిధిలమైన గాలపు చువ్వ మాత్రమే. దానికే ఎరని కట్టి రోజంతా కష్టపడితేగానీ పూటగడవదతనికి. ఆ చేపలని వేరే ఎక్కడైనా అమ్ముకుంటే అతనికి చాలా డబ్బు వచ్చి ఉండేది. అయినా…..! ఆ చేపలు మా ముందే ఉండేవి, అతను మాయమైపోయేవాడు. తన పిల్లలకి ఆ పూట భోజనం పెట్టడానికి మియా దగ్గర తగినంత డబ్బు ఉందో లేదో మాకెప్పుడూ తెలియలేదు. ఎన్నో చేపలని మాకొదిలేసేవాడు, వాటిల్లోంచి ఒక్కటి కూడా తన ఇంటికి తీసుకువెళ్ళడం నేనెప్పుడూ చూడలేదు.

మర్చిపోయిన ఇంకో వ్యక్తి… రాజు. నిజానికి అతను రజాక్.. లేదా అలాంటిదే ఏదో అతని పేరు. కాని అతను రాజు ఎలా అయ్యాడో మాకెవరికీ తెలియదు. మా పిల్లలందరం రాజు అంటే ఎంతో భయపడేవాళ్ళం. ఆ మనిషంటే భయం కాదు, కానీ అతని చేతిలో కత్తెర, దువ్వెన చూస్తే మాత్రం భయం…!

అవును. రాజు మంగలి. పొడుగ్గా ఉండేవాడు, సైకిల్ తొక్కుతూ వచ్చేవాడు. అతన్ని చూడగానే మేము జారుకోడానికి ప్రయత్నించేవాళ్లం. అప్పట్లో బాలీవుడ్‍లో హీరోలంతా భుజాల దాక జుట్టు పెంచేవారు. మేము కూడా మా హెయిర్ స్టైల్ అలాగే ఉండాలని అనుకునేవాళ్లం. అయితే ఎవరో ఒకరు బలైపోయేవాళ్ళు, తమ చిన్న కాళ్ళతో ఎక్కువ దూరం పారిపోలేక పోయే వాళ్ళు. వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న కుర్రాడ్ని వాళ్ల నాన్న చెవులు మెలేసి తీసుకొచ్చి, బలిపీఠం లాంటి కుర్చీలో కూర్చోబెట్టేవాడు. దూరం నుండి నాన్న చూస్తుండంగా,అస్పష్టమైన ఉల్లాసంతో రాజు కుర్రాడికి అంటకత్తెర వేసేసేవాడు.

మంచి క్షురకులకు ఉండే ఓ విశిష్టమైన గుణం రాజుక్కూడా ఉంది. అదే ముచ్చట్లు చెప్పడం. అతనికి ఎన్నో కథలు తెలుసు. కుర్చీలో ఏడుస్తూ కూర్చున్న కుర్రాడు తొందర్లోనే ఏడుపు ఆపేసి, నవ్వులు చిందిస్తూ, రాజు చెప్పే కథలు వింటూ ఆనందించేవాడు. అతని సంతోషం చూసి, మేము కూడా చాలా మంది రాజుకి దగ్గరగా వెళ్ళేవాళ్లం. అంతే, మేమూ దొరికిపోయేవాళ్లం. రాజు కులాసాగా కబుర్లు చెబుతూ, తన పని కానిచ్చేసేవాడు.

ఆసుపత్రి బయట రెండు వర్గాల వాళ్ళు గొడవపడుతున్నారు.

ఐ.సి.యు.లో ఐదో నెంబరు బెడ్ ఖాళీగా ఉంది. ఎంతో సేపు కాదు. మా అమ్మ వయసే ఉండే ఓ ఆవిడని వీల్ చైర్ లో తీసుకువస్తున్నారు. పొడుగాటి గడ్డం ఉన్న ఓ బలిష్టమైన వ్యక్తి, బహుశా నా ఈడు వాడేనేమో, ఆమె వెనుకే వస్తున్నాడు.

దాడికి పాల్పడిన వాళ్ళు అతని మెడ నరకాలనే అనుకున్నారట. కానీ ఈ ముసలావిడ అడ్డం వచ్చిందట. అయితే విసిరిన కత్తి వెనక్కి రాదుగా, ఆమె చేతిని ముక్కలు చేసేసింది. దాడి చేసిన వ్యక్తి, అతని సహాయకుడు అక్కడ్నించి పారిపోయారట. తమ చర్యకు సిగ్గుపడి పారిపోయారో లేక మరేదైనా కారణమో ఎవరూ చెప్పలేకపోయారు.

ఆవిడ పెదాలపై చిరునవ్వు తొణికిసలాడుతోంది. తన కొడుకు ప్రాణాలని కాపాడుకుందావిడ. తెగిపోయిన ఆమె చెయ్యి, వేలాడుతోంది. ఆమెని వెంటనే ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్ళి సర్జరీ చేసారు. తెగిపోయిన చెయ్యిని బాగుచేయడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్య అది. దుండగులు జరిపిన దాడిలో చేతి నరాలు, స్నాయువు పూర్తిగా దెబ్బతిన్నాయట. అవి లేకుండా చెయ్యి ఉండడం అలంకార ప్రాయమే. ఎవరైనా దాత స్నాయువు, పట్టా దానం చేస్తే ఆవిడ చెయ్యి మాములుగా అవుతుందని డాక్టర్ చెప్పారు.

నేను వార్డులోకి వచ్చేసరికి అమ్మ కళ్ళు తెరిచింది. స్పృహలో ఉంది. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. “అమ్మా” అన్నాను. దాదాపు పదేళ్ల తర్వాత “అమ్మా” అని పిలిచాను. “బాధగా ఉందా?” అడిగాను. తల అడ్డంగా ఊపింది. నా మాటలు అమ్మకి వినబడుతున్నాయి. నేనేం చెబుతున్నానో అమ్మకి అర్ధం అవుతోంది.

అమ్మ తల నిమిరి, “పడుకో అమ్మా” అన్నాను. చిన్నపిల్లలా నవ్వుతూ, నా ఆజ్ఞ పాటించింది.  అమ్మ మంచం పక్కనే ఒంగి కూర్చుని, అమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. “నువ్వు అందరికంటే మంచి అమ్మవి” అన్నాను. నాకు మనశ్శాంతి లభించింది. ఇంతలో మా సోదరి రావడంతో, నేను అక్కడ్నించి బయటకి వచ్చేసాను. పేషంట్ దగ్గర ఒకరినే ఉండనిస్తారు.

సుమారుగా అరగంట తర్వాత, మా సోదరి వెక్కివెక్కి ఏడుస్తూ బయటకి వచ్చింది. “అమ్మ….” అంటూ ఇంకేం చెప్పలేకపోయింది. అమ్మ మరణాన్ని నేనే వేగవంతం చేసానేమో. తన కొడుకు తనని ఎప్పుడూ ప్రేమిస్తునే ఉన్నాడన్న గ్రహింపుతోనే ఆవిడ చనిపోయింది. ఈ గ్రహింపు ఆమెలో రక్తప్రసరణా వేగాన్ని పెంచినట్లుంది. బలహీనమైన గుండె దాన్ని తట్టుకోలేకపోయింది. ఈ ఆసుపత్రిలో చేరడానికి ఎన్నో కారణాలున్నాయి. రక్తప్రసరణహీనత వల్ల వచ్చే గుండెపోటు అందులో ఒకటి మాత్రమే.

నా ప్రపంచం స్థంభించిపోయింది. డాక్టర్‍కి నేనేం చెప్పానో నాకే అర్థం కాలేదు. నా మనసు, నా శరీరం ఒకదానికొకటి  మైళ్ల దూరంలో ఉన్నాయి. ఏవో కాగితాల మీద ఆయన నా సంతకాలు తీసుకున్నాడు. మా అమ్మ చేతి నరాలు, స్నాయువు బెడ్ నెంబరు అయిదు మీదున్న ముసలావిడకి దానం చేయమని కోరాను. లాంఛనాలు పూర్తయ్యాయి. సంప్రదాయల ప్రకారం అంతిమ సంస్కారాల కోసం అమ్మని ఇంటికి తీసుకువెళ్లాం.

***

పదేళ్ళు గడిచిపోయాయి. నేను నిత్యజీవితపు గాడిలో పడ్డాను. రోజూవారీ అవసరమయ్యే సామాన్లను ఓ పెద్ద బరువైన సంచీలో పెట్టుకుని ఇల్లిల్లూ తిరుగుతూ అమ్ముకుంటూ జీవితం గడుపుతున్నాను. ఓ రోజు ఓ ఇంటి తలుపు కొట్టాను. పొడుగాటి గడ్డం ఉన్న బలిష్టమైన వ్యక్తి తలుపు తీసాడు. గడ్డం తెల్లబడింది. “మాకేం అక్కర్లేదు, వెళ్ళిపో” అంటూ తలుపేసుకోబోయాడు. ఉన్నట్లుండి నన్ను గుర్తుపట్టినట్లున్నాడు.

లోపలికి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు. వాళ్లమ్మ, ఇప్పుడు 80 ఏళ్ళు ఉంటాయోమో, తన గదిలోంచి బయటకు వచ్చింది. కానీ నన్ను గుర్తు పట్టలేదు. ఆవిడ ఆసుపత్రిలో ఉన్నప్పుడు నొప్పి తెలియకుండా ఉండేందుకు ఆవిడకి మత్తుమందు ఎక్కువగా ఇచ్చారు. అప్పట్లో తనని చూడడానికి వచ్చిన వారిని గుర్తుంచుకోడం ఆమెకి కష్టం.

కొడుకు ఆమెకి వివరించాడు. ఆవిడని ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు ఆమె మొహంలో కనపడిన బలహీనమైన నవ్వు మళ్ళీ ఇప్పుడు ఆవిడ పెదాలపై ప్రత్యక్షమైంది. బయట ఎంతో ప్రశాంతంగా ఉంది. పదేళ్ళ క్రితం జరిగిన రక్తపాతాన్ని గుర్తు చేసే ఒక్క మూలుగు కూడా లేదు.

అయినప్పటికీ, ఆవిడని అడిగాను – “ఏమైనా ఆశ ఉందా?” అని.

ఆవిడ తన కుడి చేతిని…. మా అమ్మ చేతిని… పైకెత్తి నా తల మీద ఉంచి, “అవును నాయనా, ఆశ ఉంది” అంది.

ఆంగ్లం: ప్రణబ్ మజుందార్
తెలుగు: కొల్లూరి సోమ శంకర్

(ప్రణబ్ మజుందార్ పూనెకి చెందిన జర్నలిస్ట్. జాతీయ వార్త సంస్థ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (UNI)లో పదిహేడు సంవత్సరాలు పనిచేసారు. న్యూస్ ఎడిటర్‌గా యు.ఎన్.ఐ నుంచి విరమించుకున్నారు. అంతకుముందు ఫ్రీ ప్రెస్ జర్నల్ గ్రూప్ వారి పక్షపత్రిక “ఆన్‌లుకర్”లోనూ, “ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్” అహ్మదాబాద్ ఎడిషన్ లోనూ, పూనెకి చెందిన “సకల్ టైమ్స్” లోనూ పనిచేసారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వ్యవహరిస్తున్నారు.)

 Front Image: Mahy Bezawada 

సచిన్ లా ఆడలేకపోవచ్చు… అతని లా ఉండొచ్చు

kolluriసచిన్ టెండూల్కర్… పరిచయం అక్కర్లేని పేరు.  పసిపిల్లల నుంచీ పండుముదుసలుల వరకూ అందరికీ తెలిసిన పేరు. క్రీడకన్నా క్రీడాకారుడు ఎక్కువ అభిమానం సంపాదించుకున్న దృష్టాంతం సచిన్ టెండూల్కర్.

క్రికెట్లో ప్రవేశించిన రోజు నుంచీ నేటి దాక ఎందరినో తన ఆటతీరుతోనూ, వ్యక్తిత్వంతోను ఆకట్టుకున్న వ్యక్తి టెండూల్కర్. మన దేశంలో సచిన్‌ని వేలంవెర్రిగా అభిమానించేవారున్నారు, ఆరాధించేవారున్నారు. సచిన్ ఒక ఐకాన్.

సచిన్ టెండూల్కర్ రికార్డులు, ఆటతీరు గురించి ఎన్నైనా పుస్తకాలు వచ్చివుండచ్చు, కానీ సచిన్ అంతటి గొప్పతనం ఎలా సాధించాడో, పొందిన ఔన్నత్యాన్ని ఎలా నిలుపుకున్నాడో చెప్పే పుస్తకాలు తక్కువ. అటువంటి పుస్తకమే “దేవుడిని మర్చిపోదామిక”. సచిన్ ఆట కన్నా అతని వ్యక్తిత్వమే అతనికి ప్రపంచవ్యాప్తంగా మన్ననలను అందిస్తోందని రచయిత రేగళ్ళ సంతోష్ కుమార్ అంటారు. టెండూల్కర్‌లా అయిపోవాలనుకునేవాళ్ళేమీ తక్కువ లేరు మన దేశంలో. “మనకన్నా చిన్నవాళ్ళు మంజ్రేకర్‌ టెండూల్కర్ లూ లేరా మనకెగ్జాంపులు…..” అనుకుని ముందుకు దూకేవాళ్ళుంటే, “బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తు ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు ” అని ప్రోత్సాహించేవాళ్ళూన్నారు.

అయితే టెండూల్కర్ ఆటలో అంత నిలకడగా రాణించడానికి రహస్యం టాలెంట్‍తో పాటుగా, సాధన, ఆట పట్ల మమకారం, వివాదరహితమైన వ్యక్తిత్వమే కారణాలు. టెండూల్కర్‌తో పాటు జట్టులోకి వచ్చి, ఒక వెలుగు వెలిగి ఆరిపోయిన ఆటగాళ్ళెందరో ఉన్నారు. వారికి, టెండూల్కర్‌కీ ఉన్నతేడా ఏమిటో ఈ పుస్తకం చెబుతుంది. మనలో చాలామంది చేసే పొరపాటుని ఈ పుస్తకం సున్నితంగా ఎత్తి చూపుతుంది. మనం గొప్ప వ్యక్తులను ఆరాధిస్తాం, వారిలా ఆ ఘనతని సాధించాలనుకుంటాం. వారి సుగుణాలను అలవర్చుకోకుండా, వ్యక్తి ఆరాధనకి, అనుకరణకి పూనుకుంటాం. సినిమా హీరోల నుంచి ఆటగాళ్ళ వరకూ చాలా మంది విషయంలో జరిగేది ఇదే.  ఈ తప్పునే చేయద్దంటున్నారు రచయిత.

టెండూల్కర్‌ని వ్యక్తిగా ఆరాధించద్దు, అతని సుగుణాలను గ్రహించి వాటిని మన జీవితాల్లోకి ఆహ్వానించాలని సూచిస్తున్నారు. స్వామి వివేకానంద కూడా  “Learn Everything that is Good from Others, but bring it in, and in your own way absorb it; do not become others.” అంటూ ఇదే విషయాన్ని చెప్పారెప్పుడో.

సచిన్‌లో బాల్యంలో ఉన్న నెగెటివ్ లక్షణాలను కుటుంబం పాజిటివ్ లక్షణాలుగా మార్చిన విధానాన్ని మనం గ్రహించాలి. మనలో బోలెడన్ని నెగటివ్ లక్షణాలుంటాయి. కానీ వాటిని నెగటివ్ గానే ఉంచుతున్నామా… పాజిటివ్‌గా మలచుకుంటున్నామా? బలహీనతగా నిలిచిపోతున్నామా? బలంగా మలచుకుంటున్నామా అనేది కీలకం అని అంటారు రచయిత.

తన అభిమాన హీరో జాన్ మెకన్రోలోని దూకుడుని ఇష్టపడ్డ సచిన్, దాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టలేదు, మెకన్రో తీరుని ఆస్వాదించిన సచిన్ దాన్ని ఉన్నదున్నట్లుగా అనుకరించలేదు. తన హీరోలా ఆవేశాన్ని హావభావాల్లో కాకుండా… తన ఆటలో చూపించాడు. అభివృద్ధికి అనుకరణ తొలిమెట్టవ్వాలే కానీ, రెండో మెట్టూ… చివరి మెట్టూ కూడా కాకుడదూ అని అంటారు రచయిత.

“ఉన్నచోటనే ఉండాలంటే శాయశక్తులా పరిగెత్తాలి, మరింత ముందుకు వెళ్ళాలంటే…. రెట్టింపు వేగంతో పరుగెత్తాలి!” అనే లూయిస్ కరోల్ వాక్యాల్ని ఉటంకిస్తూ… “అలా రెట్టింపు వేగంతో పరిగెట్టిన వారే ఛాంపియన్లవుతారు! చదువులోనైనా…. ఆటల్లోనైనా… ఉద్యోగంలోనైనా… జీవితంలోనైనా!” అని చెబుతారు రచయిత. అది సచినైనా, మీరైనా, నేనైనా…ఎవరైనా అంటూ హామీ ఇస్తారు.

“చెడిపోయే వాతావరణంలో ఉంటూ కూడా… చెడిపోకుండా ఉండగలిగేవాడే గొప్పవాడు” అంటూ బాహ్య ప్రపంచపు ప్రభావాలకు బానిసవకుండా నిలబడేవాడే సచిన్‌లా నిలుస్తాడు అంటారు రచయిత. ఒత్తిడిని జయించేందుకు సచిన్‌ని ఉదాహరణగా చూపుతారు రచయిత. లక్షల మంది మధ్యలో ఉన్నా…. తానొక్కడే ఉన్నట్లు…. తాను ప్రపంచ ప్రభావంలో పడకుండా…. ప్రపంచాన్ని తన తన్మయత్వంలో మునిగేలా చేయలాంటే…. నా కోసం నేనాడుకుంటున్నానన్నట్లు ఆడాలి. ఉదాహరణలను, పోలికలను పట్టించుకోకుండా, మీ పని మీరు చేసుకుపోవాలి, పట్టుదలతో చేసుకుపోవాలి. ఎదుగుదలకి మొదటి పాఠం నిరంతరం సాన… అనుక్షణం పోటీ… పోటీ ఎవరితోనో కాదు… తనతో తనకే పోటీ. మొన్నటికీ నిన్నటికీ తేడా ఏమైనా ఉందా అని పోటీ…! నిన్నటికీ, నేటికీ ఏమైనా మెరుగయ్యానా అని పోటీ…. ఎందుకంటే మొన్న ఏం ఘనత సాధించామో నిన్నకి అక్కర్లేదు. నిన్న ఏం కీర్తి గడించామో నేడీ లోకం పట్టించుకోదు. నేడు ఏం చేస్తున్నామనేదే ముఖ్యం.

పుస్తకం చివర్లో సచిన్‍తో రచయిత జరిపిన ఇంటర్వ్యూ ఉంది. అందులో ఒక ప్రశ్నకి సమాధానంగా “అంకితభావం, ఆత్మగౌరవం, విజయేచ్ఛ” – విజేతల లక్షణాలని సచిన్ చెబుతాడు. ఏ రంగంలోనైనా రాణించాలనుకునేవారికి ఇవి థంబ్ రూల్స్ లాంటివి.

క్రికెట్ దేవుడిగా కంటే మాములు మనిషిగా సాధించిన ఘనతలెన్నో సచిన్ జీవితంలో ఉన్నాయి.  మనం అతనిలా ఆడలేకపోవచ్చు…. కానీ అతనిలా ఉండొచ్చు…. అతనిలా పరుగులు తీయలేకపోవచ్చు…. కానీ అతనిలాగానే పడకుండా నిలబడొచ్చు…! అతనిలా రికార్డులకెక్కలేకపోవచ్చు…. కానీ అతనిలా పైకెదగొచ్చు…..! అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.

ప్రచురణకర్తల వివరాలు:

ప్రచురణ: సహృదయ సంతోషం ఫౌండేషన్

ప్లాట్ నెం. 68, లయన్స్ టౌన్ కాలనీ, హస్మత్ పేట, ఓల్డ్ బోయినపల్లి,

సికిందరాబాదు- 500009

sahrudayasanthosham@gmail.com

ఏకబిగిన చదివించే “దేవుణ్ని మర్చిపోదామిక, సచిన్‌ని గుర్తుంచుకుందాం” అనే ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ  చూడండి.