రెండు సంఘటనలూ రెండు పాత్రలూ వొక నిరసన : థూ

 

 

-ఎ.కె. ప్రభాకర్ 

~

 

‘అందరూ నిర్దోషులైతే మరి చుండూరు దళితుల్ని చంపిందెవరు?’

చుండూరు దళితులపై అగ్రవర్ణాల మారణకాండ జరిగిన (1991 ఆగస్ట్ 6) యిరవై మూడేళ్ళకి హైకోర్ట్ డివిజినల్ బెంచ్ ఆ కేసులో యిచ్చిన తీర్పు ( 2014 ఏప్రిల్ 22) ని ప్రశ్నిస్తూ దళిత – హక్కుల – ప్రజా సంఘాలు వేసిన పెను కేక యిది. ఈ ప్రశ్నకి యింకా సమాధానం లభించాల్సే వుంది కానీ ఆ తీర్పుపై బలమైన నిరసనగా వెలువడ్డ సంచలనాత్మక కథ

( విశాలాంధ్ర – ఆదివారం, జూన్ 15 , 2014). రచయితగా పి వి సునీల్ కుమార్ తక్షణ స్పందన సాహిత్య లోకంలో చిన్నపాటి దుమారం లేపింది. కథ లోపలి , బయటి విషయాల మీదా చర్చలు జరిగాయి. కథలో ప్రస్తావితమైన సామాజికాంశాల గురించి సంఘటన పూర్వ పరాల గురించి రచయిత దృక్పథం గురించి దాన్ని కథలోకి తీసుకురావడంలో సాఫల్య వైఫల్యాల గురించి కళావిలువల గురించి రచనా శిల్పం గురించి కథ చదివాకా చదువరుల్లో కలగాల్సిన క్రియాశీల స్పందన గురించి స్థూలంగా సాహిత్య ప్రయోజనం గురించి వొక్క ఫేస్ బుక్ లోనే దాదాపుగా పాతిక పేజీల వరకు చర్చ జరిగింది. కథ యెంత ఆలోచింపజేసిందో ఆ చర్చలు కూడా అంతే తీవ్రంగా బుర్రకి పనిబెట్టాయి.

రచయిత కథలో తన దృక్పథాన్ని ఆవిష్కరించడానికి భిన్న పద్ధతుల్ని పాటిస్తాడు. సర్వసాక్షి దృష్టి కోణంలో కథ నడిపిపేటప్పుడు  కథనంలోనో ముగింపులోనో రచయితే తన ఆలోచనల్ని స్వయంగా ప్రకటిస్తాడు. ఆ తరహా కథల్లో పాఠకులకి పెద్ద పనేం వుండదు.  సర్వసాక్షి కథనాన్ని రచయితా పాఠకుల మధ్య జరిగే సంభాషణ అనుకొంటే అటువంటి  కథలు యేకముఖ సంభాషణల్లాంటివి. అప్పుడు పాఠకుడు కేవలం శ్రోతగా మిగిలిపోయే ప్రమాదం వుంది. దాన్నుంచీ తప్పించుకొని పాఠకుల ఆలోచనకి చోటూ వెసులుబాటూ వ్యవధి యివ్వడానికి తన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి కథకుడు  అనుకూలమైన పాత్రల్ని – కంఠ స్వరాన్ని యెన్నుకొంటాడు. చాలా సార్లు సంభాషణల ద్వారా చెప్పిస్తాడు. లేదా పాత్రల బాహ్య అంతరంగ ప్రవృత్తుల ద్వారా  ఆవిష్కరిస్తాడు. అందుకు అనుగుణమైన సంఘటనల్ని సృష్టిస్తాడు. సంఘర్షణని చిత్రిస్తాడు. ఆ యా సందర్భాల్లో అవసరాన్నిబట్టీ ఆత్మాశ్రయ కథనాన్ని ఆశ్రయిస్తాడు. ప్రతీకలని నిర్మిస్తాడు. అన్యాపదేశాల్ని అడ్డం పెట్టుకుంటాడు. ఒక్కోసారి టెక్నిక్ పరంగా సరైన జాగరూకత లేకుంటే కథనంలో పాత్రల్లో రచయిత  చొరబాటు జరగొచ్చు. ప్రతిభా నైపుణ్యాలున్న రచయిత మాత్రమే స్వీకరించిన కథా వస్తువు డిమాండ్ చేసిన శిల్పంతో  పాఠకుడికి దగ్గరవుతాడు.

సునీల్ కుమార్ చుండూరు మారణకాండనీ దానిమీద పెద్ద  కోర్టులో వెలువడ్డ జడ్జిమెంట్ నీ కథలో ప్రధాన సంఘటనలుగా – కథాంశాలుగా తీసుకొన్నాడు. కులాలు కాలాలు మార్చలేదు గానీ స్థలాలు మార్చాడు. పాత్రల పేర్లు మార్చాడు. తణుకు ప్రాంతంలో జరిగినట్టు పేర్కొన్నాడు. స్థానికత కోసం  అయితంపూడి లాకులు దగ్గర శవాలు దొరికినట్టు వొకటి రెండు మార్పులు జోడించాడు. కామందు పేరుకి ప్రతీకాత్మకంగా రెడ్డీ నాయుడూ రెండూ తగిలించాడు. మిగిలిన కథంతా అదే.

దళిత కులానికి చెందిన జోసఫ్ కొడుకు సాల్మన్  రాజు అతన్తో పాటు తణుకు కాలేజీలో చదువుకొనే వూరి  ‘కామందుల ఆడపిల్లని యిష్టపడ్డాడు. ఆ పిల్లా ఆడ్ని ఇష్టపడింది… కామందులకి ఇది గిట్టలేదు.’ అది గొడవకి దారితీసింది. కామందుల కుర్రాళ్ళకి మండి ‘ఏరా మాలనాకొడకా’ అని కులం పేరుతో ఘర్షణకి దిగారు.

దీన్ని వూరి కామందు బసివిరెడ్డి నాయుడి మాటల్లో చూద్దాం:

‘మాటా మాటా పెరిగింది . అక్కడితో ఆగాలా ? ఆ రాజుగాడు ఆడికి తోడు మిగిలిన మాలమాదిగ కుర్రనాయాళ్ళు కలిసి కామందుల పిల్లల్ని, కనీసం పెద్ద ఇళ్ళ పిల్లలే అన్న ఇంగితం లేకుండా , పెద్దంతరం , చిన్నంతరం లేకుండా చేయ్యిచేసుకున్నారండి… ఎంత దారుణం.

రామరాజ్యం కోసం కలలు కన్న గాంధీగారు, ఇప్పుడు కలలు కంటున్న మోడీగారూ ఈ సంగత్తెలిస్తే ఎంత కుమిలిపోతారు?

ధర్మం ఇప్పటికే ఒంటికాలి మీద కుంటుతుంది. ఇలా వదిలేస్తే ఇంకేమీ మిగలదు కాబట్టి, ఈ కాస్త ధర్మాన్నన్నా నిలబెట్టడానికి ఈ కడజాతి కుక్కలకి బెత్తం దెబ్బ చూపిద్దాం అని పెద్దలంతా అనుకుని ఓ తీర్మానం చేసుకున్నామండి. అది కాస్త మోతాదు ఎక్కువైంది.’  

మోతాదు ఎంత యెక్కువైందో జోసఫ్ మాటల్లో చూద్దాం:

‘ ఆ రోజు రాత్రి చూడాలి బాబూ. రాములోరి రథ యాత్ర జరిగినట్టు మా మీద దండెత్తేరు. కత్తులు, కటార్లు, ఈటెలు, బళ్ళేలు పట్టుకుని వచ్చేరు… మా గుడిసెలకి నిప్పెట్టేరు. మా అమ్మల్ని మానాల మీద తన్నేరు. మా ఆడబిడ్డల్ని మళ్ళా పాడుచేసేరు. దొరికినోడ్ని దొరికినట్టు నరికేరు. ఎంటపడ్డారు. ఎగబడ్డారు. నరికేశారు. కిందేసి తొక్కేశారు. గోనెసంచుల్లో కుక్కేశారు. పంట కాలవలో పడేశారు.’

ఆ దాడిలో ఇరవై ఏళ్ళు అత్తారబత్తంగా పెంచుకున్న జోసఫ్ కొడుకు (రాజు)తో సహా మొత్తం పదిమందిని చంపేశారు. ఒక కుంటోడు జోసఫ్ కాలిరగ్గొట్టి అతన్ని కుంటి జోసఫ్ చేసాడు.

అదిగో … అప్పుడు … ఆ పాశవిక దాడిలోనే  ఇగిరిపోయింది జోసఫ్ నోట్లో తడి. అతనికి యెన్నోసార్లు  ‘ఉయ్యాలనుంది… దేవుళ్ళ మీదా … మమ్మల్ని మనుషులు కాదన్న వాళ్ళమీదా … కడజాతివాళ్ళని అన్నవాళ్ళమీదా …’ ఉయ్యాలన్నా ఉయ్యలేడు.

అలా ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. మధ్యలో కింది కోర్టులో దాడిచేసినవారికి శిక్షలు పడ్డాయి(చుండూరు కేసులో విచారణకి సంఘటనా స్థలిలోనే స్పెషల్ కోర్టు యేర్పాటైంది – దళితులపై దమనకాండని  విచారించడం కోసం వొక ప్రత్యేక కోర్టు యేర్పడడం దేశంలో అదే తొలిసారి. సంఘటన జరిగిన పదహారేళ్ళకి  2007 లో యాభై ఆరు మందిని దోషులుగా నిర్ధారించి ఆ కోర్టు శిక్ష విధించింది).

కానీ పై కోర్టులో రెడ్డి తోక తగిలించుకొన్న జడ్జి యిచ్చిన తీర్పు దేశంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొన్న వారికి అశనిపాత విస్మయం కల్గించింది.

న్యాయమూర్తి అందరూ నిర్దోషులే అని తీర్పు చెబుతూ ‘ఇంకా కులాలెక్కడున్నాయి?’  అన్నాడు.

‘దొంగ కేసు’ అని తేల్చేసాడు.

జోసఫ్ ‘నోట్లోంచి మాట రాలే … మాట బదులు ఉమ్మొచ్చింది…’

‘ముంతలో పడాల్సింది పొరపాట్న ఆయన మొగాన పడింది …

థూ …’

అదీ కథకి ముగింపు.

p v sunil kumar

కథలో వాస్తవానికి రెండు దాడులు జరిగాయి. మొదటిది దళితులపై భౌతికంగా జరిగిన దాడి. రెండోది – దాని వ్యవస్థీకృత రూపం.  కులమే  రెండుచోట్లా కారణం. బాధితుడి నోట్లో తడి ఆరిపోయి ఉమ్మి రాకుండా నోరెండిపోయి నెరళ్ళు విచ్చుకున్న బీడు పొలంలా తయారయ్యే పరిస్థితికి కారణమైన సంఘటన మొదటిది. అది తరాలుగా అమలౌతున్న సామాజిక క్రౌర్యాన్ని ఆవిష్కరించిన భయావహ సంఘటన. అది ఆంధ్రప్రదేశ్, తమిళ్నాడు , బీహార్ , మహారాష్ట్ర, రాజస్తాన్ – దేశంలో యే మూలైనా దాడి చేసేది రెడ్డినాయుళ్ళు, భూమిహారుల రణవీర్ సేన , కుంబీలు , జాట్ లు వంటి ‘కులీను’లైతే   వేటాడబడేది బలయ్యేది మాత్రం ‘కులహీను’లైన దళితులే. రాజ్యాంగ బద్ధమైన సామాజిక న్యాయం కోరడమే ఆత్మగౌరవంతో పీడన లేకుండా బతకాలనుకోవడమే  వేటకి కారణం. మూడేళ్ళ పసి బిడ్డా    డెబ్భై యేళ్ళ వృద్ధులా – ఆడా మగా అని చూడకుండా విచక్షణా రహితంగా చంపేసిన  కిలవేన్మణి (1968) మొదలుకొని – బథానీ టోలా (1996)లో రణవీర్ సేన సాగించిన మారణహోమం , ఖైర్లాంజీ దురాగతాల  మీదుగా నిన్న మొన్నటి లక్షింపేట , యివాల్టి వేముల రోహిత్  హత్యల వరకూ అన్ని దారుణాలలో నేరస్తులంతా శిక్షలు లేకుండానే బయటపడతారు. హతులు వుంటారు – హంతకులుండరు.  హంతకుల కులం పాలకుల కులం న్యాయమూర్తుల కులం వొకటే కావడం యెంత చక్కటి రాజకీయ నీతి?

ఈ వ్యవస్థీకృత దుర్నయం పట్ల తీవ్రమైన అసహ్యాన్ని వ్యక్తంచేయడానికి ఛీత్కారాన్ని ప్రకటించడానికి జోసఫ్ నోట్లో  వుమ్మడానికి మళ్ళీ నోట్లో నీరూరాయి. ‘థూ …’ ఆ విధంగా రచయిత ధర్మాగ్రహ ప్రకటన రాజకీయ – సామాజిక  నిరసన.

వాస్తవ సంఘటనలు వాటికవే కథలు కావని కొందరు , బసివిరెడ్డి నాయుడు కుంటి జోసఫ్ యీ రెండు పాత్రల్ని తీసేస్తే యిది కేవలం వొక వార్త మాత్రమేననీ మహా అయితే వార్తాకథనం కావొచ్చేమోనని కొందరూ, సంఘటనలు జరిగిన సందర్భాల్లో తత్క్షణ ప్రతిస్పందనలుగా వచ్చే యిటువంటి రాతలకు సాహిత్య విలువని ఆపాదించలేమని  మరికొందరూ, బసివిరెడ్డి నాయుడి పాత్ర చిత్రణలో శిల్ప విషయికంగా జరిగిన పొరపాటు వల్ల మంచికథ కాలేకపోయిందని , ఆ విధంగా రచయిత ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని యింకొందరూ విమర్శపెట్టారు. కథని బాధితుల పక్షం నుంచి చూడాలన్న వాదాన్ని కూడా యెద్దేవ చేసారు. జరిగిన ప్రతి సంఘటనా సాహిత్య వేషం ధరించి విసువు పుట్టిస్తుందని కొత్తదనం వుండడం లేదని అందువల్ల మూస కథలు మాత్రమే వస్తున్నాయని  కథా ప్రేమికులు బాధపడ్డారు. సున్నితమైన  సమకాలీన  సంఘటనల్ని వర్ణించినంత మాత్రాన కథని మెచ్చుకొని తీరాలా అని వాదించారు. శిల్పాన్ని ముందుకు తెచ్చి కథలో  స్వీకరించిన  వస్తువుపట్ల కూడా అసహనం వ్యక్తం చేసారు  (అట్రాసిటీ గురించి గాక అట్రాసిటీ చట్టాల దుర్వినియోగం గురించి కథ రాస్తే ఆహ్వానించడానికి వారికి అభ్యంతరం లేదు).

ముందుగా గుర్తించాల్సిన విషయం – సమకాలీన సామాజిక సంఘటనలు సాహిత్యంలోకి యెక్కకూడదని గిరిగీసుకోవాల్సిన అవసరం లేదు. అలా గీసుకొంటే చివరికి మనకి మిగిలేవి అలౌకికమైన దెయ్యాలు – భూతాల హారర్ కథలూ గ్రహాంతరవాసుల సూడో సైన్స్ ఫిక్షన్ కథలూ అభూతకల్పనా ప్రపంచపు కథలేనేమో!  [కిలవేన్మణి దళితుల వూచకోత – యథార్థ సంఘటన నేపథ్యం చేసుకొని  ఇందిరా పార్థసారథి రాసిన ‘కురుతిప్పునల్’ నవలకి ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు (1977) వచ్చింది. ఆ తర్వాత అది సినిమాగా కూడా గొప్ప ప్రశంసలు పొందింది – వాస్తవాలు కళలై చరిత్రలోకెక్కడానికి యిదొక ఉదాహరణ మాత్రమే]

వాస్తవాన్ని కళగా రూపొందించడంలో శిల్ప వస్తువుల ప్రాధాన్యతల గురించి మాట్లాడుకోవాల్సిన అనివార్యమైన అవసరాన్ని మరోసారి ‘థూ…’ కథ కల్పించింది అనడంలో యెటువంటి సందేహం లేదు. నిజమే కథ వుపన్యాసంలానో వ్యాసంలానో వుండకూడదు. వస్తువుని వున్నతీకరించడానికి అవసరమైన శిల్పాన్ని సమకూర్చుకోవాలి. అది రచయిత దృక్పథాన్ని ఆవిష్కరించడానికి దోహదం చెయ్యాలే గానీ ఆటంకంగా పరిణమించ కూడదు. కథకి ఆత్మ దృక్పథమే. అది యే మేరకు  పాఠకులకి చేరింది అన్నదాన్ని బట్టీ కథ మంచి చెడ్డలని నిర్ధారించాలి.

థూ… కథలో కథ చెప్పిన రెండు పాత్రలు – బసివిరెడ్డి నాయుడు , జోసఫ్  భౌతికంగానే కాదు  గ్రామంలో సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా కూడా   సంఘర్షించుకొనేపాత్రలు. ఒక సామాజిక భీభాత్సానికి భిన్న దృక్పథాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతిద్వంద్వి పాత్రలు. రెండు వైపుల అటు చివర యిటు చివర వైరి శిబిరాల్లో  నిలబడ్డ భిన్న పాత్రలు. వాటి గొంతు వేరు , భాష వేరు , జీవితానుభవాలు వేరు. వాటి సారం వేరు. వీటి మాధ్యమంగా కథ చెప్పదల్చుకొన్నప్పుడు సాంప్రదాయిక రచనా పద్ధతులననుసరించి  రచయిత యేదో ఒక వైపు వుండాలి ; ఒక నిర్దిష్ట కంఠ స్వరాన్ని  యెన్నుకోవాలి. కానీ ఈ కథలో రచయిత పాటించిన టెక్నిక్ ఇద్దరి ద్వారా కూడా తను చెప్పదల్చుకొన్న భావజాలాన్ని ప్రకటించడం. అదే విమర్శకి కారణమైంది. బసివిరెడ్డి నాయుడి సంభాషణలకి వ్యంగ్యాన్ని ఆశ్రయించడం  నప్పలేదనీ  , పాత్రౌచిత్యం దెబ్బతిందనీ  విమర్శకులు భావించారు.

అయితే యీ విమర్శలన్నిటికీ సమాధానమా అన్నట్టున్న రచయిత చెప్పిన మాటలు గమనార్హాలు :

‘బాణం గుండెలో దిగితే బాధలా ఉంటుంది. అదే బాణం గుండెలో దింపినవాడికి వినోదంలా ఉంటుంది. వస్తువు అదే, కానీ అది ఒకడికి సంతోషాన్ని, మరొకడికి చావుని ఇస్తోంది. వ్యవస్థ అయినా సంఘటన అయినా బలిసినవాడికి ఒకలా , బక్కోడికి మరోలా కనబడతాయి. వ్యవస్థలో ఏ ఒక్క సంఘటనా కారణం లేకుండా జరగదు. సామాన్యుడికి సత్యం తెలిస్తే వాడు వ్యవస్థని ఎలా సమ్మానిస్తాడో అదే … ఈ థూ…. ఇది కథ కాదు, వ్యవస్థ ఎక్స్ రే, సి.టి.స్కాన్ …’ (కథ 2014 , కథాసాహితి)

అవును కదా – ఎక్స్ రే, సి.టి.స్కాన్ పిల్మ్ లు కలర్ ఫొటోగ్రాఫ్ లంత అందంగా కనపడకపోతే టెక్నీషియన్ని తప్పుపట్టలేం.

నిజానికి సవర్ణులు మనసు లోపల అనుకొనే మాటల్నే రెడ్డినాయుడు బయటికి అన్నాడు. న్యాయాన్ని బలిమితో చెరబట్టినవాడు కోర్టు మెట్ల మీదే బసివిరెడ్డి నాయుడులా మాట్లాడగలడు. పాఠకులు ఆ మాటల వెనక వున్న అగ్రకుల అహంకారాన్నీ ఆధిపత్య స్వభావాన్నీ  రాజకీయ అధికారం ఇచ్చిన పొగరుమోతుతనాన్నీ చట్టాల్ని గుప్పిట్లో పెట్టుకోగలిగిన నిర్లక్ష్యాన్నీ  న్యాయవ్యవస్థ మొత్తం తమ కనుసన్నల్లోనే నడుస్తుందన్న  ధీమానీ స్పష్టంగా చూడగలరు. ఒకటి రెండు చోట్ల అవి అతిశయించిన దాఖలాలు యెత్తిచూపగలమేమో గానీ రెడ్డినాయుడి మాటలు అసహజాలు కావు ; ప్రస్తావితమైన అంశాలు అసత్యాలైతే అసలు కానే కావు.

ఇటీవల పాటియాలా కోర్టు ఆవరణలోనే కన్హయ్య మీద లాయర్లు దాడి చేయడం  , మళ్ళీ మళ్ళీ చేస్తామని ప్రకటించడం , అందుకు సన్మానాలు చేయించుకోవడం , జైలుకెళ్ళి అక్కడకూడా అతన్ని కొడతామనీ అంతుచూస్తామనీ బహిరంగంగా మీడియా ముందు హెచ్చరించడం , కన్హయ్య నాలుక కోసినవాడికి లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఫత్వాలు జారీ చేయడం యివన్నీ చూసినపుడు బసివిరెడ్డి నాయుడు మాటల్లో అహంకారం గానీ వ్యంగ్యంగానీ కృత్రిమంగానో అనుచితంగానో అనిపించవు. తన ఫ్యూడల్ ఆలోచనలకి ఆచరణకీ ప్రజాస్వామ్యం ముసుగు వేసుకోవాల్సిన అవసరం సందర్భం అతనికి కనిపించలేదు. సమాజంలో రెడ్డినాయుళ్ళు బోరవిరుచుకొని తిరుగుతూ సాహిత్యంలోకి జబర్దస్తీగా తోసుకురావడంలో వైపరీత్యం యేమీ లేదు.

అందుకే  వర్ణ ధర్మ పరిరక్షణ అవసరం గురించి రామరాజ్య స్థాపన గురించి అందుకు పాలక వర్గాలు పడుతున్న కష్టాల గురించి స్వాతంత్ర్యం తర్వాత కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయాధికార బాధ్యతలతో ప్రజా పాలన భారంతో పై కులాల ప్రభువులు చేస్తున్న త్యాగాల గురించి తాము దయతో జాలితో అమలు జేస్తున్న యస్సీ యస్టీ రిజర్వేషన్ల గురించి వోటేసి తమకు అధికారం కట్టబెట్టినందుకు ఔదార్యంతో తాము ప్రవేశపెట్టిన  మాల మాదిగల సంక్షేమ పథకాల గురించి    రెడ్డి నాయుడు తన దృష్టికోణం నుంచి చాలా విస్తృతంగానే యేకరువు పెట్టాడు. కథలో యివన్నీ యిమడతాయో లేదోనన్న ప్రశ్నని  కాసేపు పక్కనబెడితే బసివిరెడ్డినాయుడి ముఖత: వెలువడ్డ మాటల్ని  పదే పదే చదవగా అతడి portrait ని చిత్రించడం రచయిత వుద్దేశం కాదనీ –  అగ్రకుల పెత్తందారీ తనానినికి archetypical caricature గా అతణ్ణి బ్లాక్ అండ్ వైట్ లో గీయడమేననీ నాకు బోధపడింది. ఆ గీతల్ని పతంజలి వ్యంగ్యచిత్రాల్తో పోల్చడం సాహసమే గానీ , రాజు గారి బామ్మర్ది అయిన కారణంగా న్యాయస్థానంలో న్యాయాన్ని తిమ్మిని బమ్మి చేయడానికి పూనుకొన్న శూద్రకుడి శకారుడితో కొంతవరకు పోల్చవచ్చు.  అందువల్ల రెడ్డినాయుడి మాటల్లో ఆధునిక మనువాదం వికృతంగా వినిపించడం అసంగతమేం కాదు. శిల్పానికొచ్చిన లోటేం లేదు. ఆధునిక కథా నిర్మాణ సూత్రాలూ కొలతలూ పక్కనబెట్టి సంప్రదాయ దేశీయ కథా రీతుల వెలుగులో చూస్తే రచయితగా సునీల్ కుమార్ నడిచిన దారి తెల్లమౌతుంది.

చిందు కళాకారులు ప్రదర్శించే జాంబ పురాణం దాదాపు యీ టెక్నిక్ లోనే నడుస్తుంది. చిందు జాంబ పురాణం సంవాద రూపంలో వుంటుంది. రెండే పాత్రలు – వొకరు  బ్రాహ్మణుడు మరొకరు మాదిగ ఆదిజాంబవుడు. అందులో బ్రాహ్మణుడు వర్ణ దురహంకారానికీ  ఆది జాంబవుడు ఆత్మగౌరవానికీ ప్రతీకలు. అక్కడ కూడా బ్రాహ్మణుడు అచ్చు బసివిరెడ్డి నాయుడిలానే ప్రవర్తిస్తాడు. ఆది జాంబవుడు తార్కికంగా జవాబులు చెబుతాడు.  అయితే రెండు పాత్రలూ నటించేది చిందు మాదిగలే కాబట్టి బ్రాహ్మణుడి ఆలోచనల్లోకి సంభాషణల్లోకి అహంకార ప్రకటనల్లోకి ఆ కళాకారుడు తన జీవన నేపథ్యంతో సహా చొరబడతాడు. అప్పుడు అతని మాటల్లోకి వ్యంగ్యం హాస్యం అధిక్షేపం అసహనం అవహేళన  అన్నీ వచ్చి చేరతాయి. అవన్నీ ప్రదర్శన రక్తి కడటానికే దోహదం చేస్తాయి తప్ప ప్రేక్షకులకి యెబ్బెట్టుగా తోచవు. చిందు ప్రదర్శన జాంబవుడి విజయంతో అంతమైతే ‘థూ…’ కథ కుంటి జోసఫ్ నిరసనతో ముగుస్తుంది.

చిందు జాంబ పురాణంలో బ్రాహ్మణ జాంబవుల పాత్రలు రంగం మీదకి రావడానికి వొక ప్రవేశిక ( prologue ) వుంటుంది. దాన్ని సూత్రధారుడిలాంటి వారు నిర్వహిస్తారు. ‘థూ…’ కథ లో రచయిత పాత్ర కూడా రెడ్డి నాయున్ని , జోసఫ్ ని అలాగే ప్రవేశపెట్టి నిష్క్రమిస్తుంది. అయితే కథలో రచయిత – కథా రచయితా వొకరు కాదు. కథలో రచయిత వొక పాత్ర. అతడు కూడా  వొక వర్గానికి ప్రతినిధి. పేదల ఏడుపులూ పెడబొబ్బల కథలు అతనికి నచ్చవ్ , ప్రేమకతలు కావాలి. ఈ పాత్రని నెపం చేసుకొని సాహిత్యంలో పాతుకుపోయిన విలువల పైన నిలవ యీస్తటిక్స్ పైన కూడా సునీల్ కుమార్ వ్యంగ్యాన్ని గుప్పించాడు (కథలోని ఈ పొర కూడా కొందరికి వూపిరాడనివ్వలేదేమో!). తను ప్రతిపాదించే వస్తువు పట్లా వాడిన టెక్నిక్ పట్లా సాహిత్యకారుల ప్రతికూల స్పందనని అతను ముందుగానే వూహించినట్లున్నాడు.

తరతరాలుగా అనేక సామూహిక బృందాల గూడుకట్టుకొన్న దు:ఖానికీ ఆగ్రహానికీ అక్షరావిష్కరణ ‘థూ…’ . సంవత్సరాల తరబడి న్యాయం కోసం యెదురుచూసి భంగపడ్డ వారి క్రోధాక్రందన అది. ఏడుపు అందంగా లేదనో ఆలంకారికంగా లేదనో కళాత్మకంగా లేదనో యింకాస్త బాగా యేడవొచ్చుగదా అనో ఫిర్యాదు చేసేవాళ్ళకి యేదైనా అనుభవంలోకి వస్తేగానీ తత్త్వం బోధపడదు.

జోసఫ్ తాత మూతికి ముంత కట్టుకొని వుమ్మొస్తే నేల మీద వుయ్యకుండా ముంతలో వూసేవాడు. ముడ్డికి యేలాడే తాడూ దాని చివర తాటాకు – అతను నడిచించోట అది తుడిచేసేది. అంటరానివాడొత్తన్నాడు తొలగండని చేతిలో గంట వాయిస్తూ  బేపనవారికి హెచ్చరిక చేసేవాడు. జోసఫ్ కొడుకు తరానికి వచ్చేసరికి ఆ ‘మర్యాద’ నుంచీ బయటపడి ముడ్డి మీద మంచి గుడ్డ కట్టుకొని బడికెళ్ళి నాలుగక్షరాలు నేర్చుకొని మనిషిలా బతకాలని కోరుకోవడం  నేరమైంది. చావుకి కారణమైంది. దళితుల అటువంటి చావులు దేశంలో సగటున రోజుకి రెండు జరుగుతూ వుండగా అందుకు వ్యవస్థీకృతమైన మద్దతు ఆమోదం లభిస్తున్నప్పుడు ఆ సామాజిక విషాదాన్ని దురన్యాయాన్ని యిన్ సైడర్ గా వొక దళిత రచయిత మాత్రమే బలంగా ఆవిష్కరించగలడని చెప్పడానికి  ‘థూ …’ మంచి వుదాహరణ. సరైన సమయంలో అవసరమైన కథని యింత నిర్దిష్టంగా నిజాయితీగా  రాసినందుకు సునీల్ కుమార్ కి అభినందనలు.

తాజాకలం  : బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూనే పాలకులు ఆయన 125 సంవత్సరాల జయంతి వేడుకలు జరపడం గొప్ప ఐరనీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యత గురించి అంబేద్కర్ ఆలోచనల గురించి  కరీంనగర్ బార్  అసోసియేషన్  ఏర్పాటుచేసిన సభలో చుండూరు కేసులో తీర్పు యిచ్చిన జడ్జి వుపన్యాసాన్ని కొందరు న్యాయవాదులు అడ్డుకొన్నారు(చూ. http://indiatoday.intoday.in/story/ex-hc-judge-faces-lawyers-protest-over-dalit-murder-verdict/1/593897.html). మర్నాడు అందుకు బాధ్యులైన నలుగురు  లాయర్లని బార్ అసోసియేషన్  సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వార్తకీ ఈ కథకీ చుట్టరికం వుండడం వల్ల యిక్కడ నమోదు చేయడమైంది తప్ప యిప్పుడు మనం చేయవలసిన పని వొక్కటే అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం యెదురుచూడటం లేదా కుంటి జోసఫ్ లోని తడిని ఫీలై అతని చేతికర్రగా మారడం.

*

Sudden Fiction లో ముగింపు చదువరిదే: బి. పి. కరుణాకర్

nadustunna katha

మే నెల కథల్లో ఉత్తమ కథ ‘ఇరుకు పదును’ రచయిత శ్రీ బి పి కరుణాకర్ తో ఇంటర్వ్యూ

B P Karunakar

మీ గురించీ, మీ రచనా వ్యాసంగం గురించి చెప్పండి

పుట్టింది పెరిగింది గుంటూరులో. ఖమ్మం జిల్లాలో, పూణేలో పని చేసి 1983లో సికింద్రాబాద్ BHEL చేరి అక్కడే పదవీవిరమణ చేశాను. భార్య హేమలత ఇప్పుడు లేదు. కూతుళ్ళు ఒకరు అమెరికాలో, మరొకరు సంగారెడ్డి లో స్థిరపడ్డారు. నేను ఒంటరిగా ఈ ఇంట్లో వుంటాను. ప్రస్తుతం నా వయస్సు 71 సంవత్సరాలు.

1962 చిత్రగుప్తలో మొదటి కథ అచ్చైంది. 96 దాకా రచనలు చేశాను. ఆ తరువాత కుటుంబ బాధ్యతల వల్ల పదకొండేళ్ళ విరామం తీసుకోని 2007 నుంచి రెండో అంకం మొదలుపెట్టాను. “అంబాలీస్”, “నిర్నిమిత్తం”, “రాజితం” ఇప్పటివరకు ప్రచురింపబడ్డ నా కథాసంపుటాలు. నాలుగో కథల సంపుటి సిద్ధం అవుతోంది. ఇప్పటివరకూ నా కథల మీద నాలుగు పరిశోధనలు జరిగాయి.

మీరు రాసిన కథలు రెండు మూడు పేజీలు దాటవు. ఇలా రాయాలని మీరే ఎంచుకున్నారా?

ఇలా రాయలని అనుకోని రాయలేదు. చిన్నప్పటినుంచి చదవటం అలవాటు. గైడిమపాస, మామ్, మార్క్ ట్వైన్, ఎమిలీజోలా, ఓ హెన్రీ ఇలాంటి రచయితల కథలు అనువాదాలై విరివిగా వస్తుండేవి. వాటితో పాటు చలం, ధనికొండ హనుమంతరావు వంటి రచయితలనీ చదివాను. వీరిలో బహుశా సోమర్ సెట్ మామ్ ప్రభావం కొంత వుందేమో. కానీ నేను రాస్తున్న పద్దతిని Sudden Fiction అంటారని ఆ తరువాత ఎప్పటికో కానీ తెలియలేదు.

Sudden Fiction గురించి ఇంకా వివరంగా చెప్పండి

మామ్ కథలు చూడండి. పూర్తిగా చెప్పాల్సిన పనిలేదు. ముగింపు పాఠకుడికే వదిలివేయటం. కథలలో దృశ్యస్ఫురణ జరగాలి. పూర్తిగా చెప్పనప్పుడు క్లుప్తత వస్తుంది. ముగింపు పాఠకుడికే వదిలేస్తే ఆ గాఢత చాలా కాలం వెంటాడే లక్షణం వస్తుంది. గోప్యత వస్తుంది. అదే సడన్ ఫిక్షన్ – ఓపెన్ ఎండెడ్. నిడివి తక్కువగా రాయడం ఈ పద్ధతిలో ముఖ్య వుద్దేశ్యం. ఈ విషయం తెలియకుండానే చాలా కాలం క్రితమే ఈ రకంగా రాశాను. నా కథలలో తొంభై శాతం ఇదే పద్ధతిలో వుంటాయి. ఇరుకుపదును కథ కూడా సడన్ ఫిక్షన్ కథే.

“ఇరుకు పదును” అన్న పేరే చిత్రంగా వుంది. అలా ఎందుకు పెట్టారు?

కథకు శీర్షిక చాలా ముఖ్యమైనది. నేను రాసే ప్రక్రియ (Sudden Fiction)లో పాఠకుడికి ముగింపు పూర్తిగా తెలియకుండా వదిలిపెట్టాలి. అక్కడక్కడ కథలో కొన్ని సూచనలు వుంటాయి. కానీ కథ శీర్షిక కథాసారాన్ని చెప్పేయకూడదు. ఇది నా పద్ధతి. అండుకే నా కథలకు పెట్టే పేర్లు అర్థం కావటంలేదని అంటారు. “కోచెరగు”, “ముమ్మూర్తి”, “తూనికనీళ్ళు”, “నిర్నిమిత్తం”, “నీటిబీట” ఇవన్నీ అలాంటి పేర్లే. ఈ కథ విషయానికి వస్తే సరస్వతి పాత్ర నన్ను (కథలో కథకుణ్ణి) పదునైన ప్రశ్నలతో ఇరుకున పెడుతోంది. అందుకే “ఇరుకు పదును” అన్నాను.

ఈ కథా నేపధ్యం ఏమిటి?

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నిజంగా జరిగిన కథ ఇది. నేను నేనే ఈ కథలో. చాలా వరకు పాత్రల పేర్లతో సహా వాస్తవాలు. “నర్సింగరావు” నాకు మంచి స్నేహితుడు. ఎంత స్నేహితుడైనా ఇంటికి పిలిచేవాడు కాదు. ఉద్యోగరీత్యా కలుస్తుండేవాళ్ళం. ఇంట్లో నేను ఒక్కణ్ణే కాబట్టి తరచుగా వస్తుండేవాడు. సొంతింట్లో వున్నట్లే స్వతంత్రంగా వుండేవాడు. కానీ అతని ఇంటికి మాత్రం తీసుకెళ్ళేవాడు కాదు. అతను చనిపోయిన రోజునే నేను మొదటిసారి అతని భార్యని చూడటం. తరువాత ఆమె వుద్యోగంలో చేరటం, నన్ను కలవటం అన్నీ నిజంగానే జరిగాయి.

మేము ఈ కథలో చాలా కోణాలని చూసి మా వ్యాసంలో రాసాము. ఇవన్నీ ఓ సాధారణ పాఠకుడికి చేరుతాయని మీరు అనుకుంటున్నారా?

చేరకపోవచ్చు. అంతే కాదు ఇంకా కొన్ని వున్నాయి. అసలు సరస్వతి నర్సింగరావు తాలూకు గతం కూపీలాగటానికే ఉద్యోగంలో చేరింది. ఆమెకు భర్తమీద ముందు నుంచే అనుమానం వుంది. ఈ విషయం కథలో ఎక్కడా చెప్పలేదు. కానీ చేర్చేందుకు అవకాశం వుండింది. పాఠకులు కథ గురించి ఆలోచించి, కొత్త కోణాన్ని వెతుక్కోవటంలోనే కొత్త అనుభూతిని పొందుతారు. నా కథలలో మొదటి రెండు పేరాల వరకే నేను పాఠకుడి చెయ్యి పట్టుకోని తీసుకెళ్తాను. మూడో పేరా నుంచి పాఠకుడు కథలో లీనమైన తర్వాత నేను తప్పుకుంటాను. కథ పూర్తైన తరువాత పాఠకుడు ముగింపు అర్థం కాక నా కోసం చూస్తాడు, కానీ నేను కనిపించను. దాంతో పాఠకుడే సమాధానాలు వెతుక్కుంటాడు.

ఇది యధార్థంగా జరిగిన కథ అయినప్పుడు, చెప్పని వివరాలన్నీ చేర్చుకుంటూ పెద్ద కథ రాయచ్చు. ఉదాహరణకి సరస్వతికి మొదట్నుంచి అనుమానం వుంది అని ఇందాక చెప్పారు. ఈ కోణాన్ని కథలో ఎందుకు చెప్పలేదు?

ఎంతవరకు చెప్పాలి అన్నది తెలియాలి. ఇది చాలు అనుకుంటే అక్కడ ఆపేయచ్చు. నేను రాసిన కథలు చూడండి. ఒకే ఒక్క సంఘటనను తీసుకోని మొత్తం జీవితాన్ని చిత్రంచే ప్రయత్నం చేశాను- ఒక పెద్ద కాన్వాస్ తీసుకోని అందులో మూడు చుక్కలు పెట్టినట్టు. చెప్పవలసినదానికంటే ఎక్కువగా నేను చెప్పను. దానివల్ల ఏం ఉపయోగం వుండదు. ఇంకా నిర్మాణం దెబ్బతినే అవకాశం వుంది. కథలో కొన్ని విషయాలను దాచిపెడుతూ, కొద్దిగా చెబుతూ వస్తుంటే కథకి పరిపూర్ణత వస్తుందని నా అభిప్రాయం.

నిజంగా జరిగిన సంఘటనలను కథలుగా రాయడానికి ఊహని ఎంత పాళ్లలో కలుపుతారు?

నేను రాసిన కథలు దాదాపుగా అన్ని జరిగినవే. ఎక్కువశాతం నా అనుభవాలు. కథగా మార్చేటప్పుడు మూడొంతులు ఊహ కలపాల్సివస్తుంది. ఊహని జోడింఛకపోతే అది కథగా మారదు. కేవలం ఒక సంఘటనగానో, వార్తగానో మిగిలిపోతుంది.

ఇరుకు పదును గురించి పాఠకుల రెస్పాన్స్ ఎలా వుంది?

చాలా మంది అభినందించారు. రెండువందల యాభై దాకా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఓ డెబ్భై ఎనభై మెసేజులు వచ్చాయి. ఒక నలుగురు మాత్రం మాకు అర్థం కాలేదన్నారు. ఒకావిడ లోకల్ ఫోన్ నుంచి చేసింది. పేరు కళ అని చెప్పింది. నిజమో కాదో తెలియదు. ఈ కథలో మీరు ఫొటోలు ఎవరివో సరస్వతికి ఎందుకు చెప్పలేదు? అంటూ అడిగింది. దాని వల్ల సమస్యలు వస్తాయని చెప్పలేదు అన్నాను. మీకు కథలు రాయడం చాతకాదు అంది. వాదన తరువాత ఫోన్ పెట్టేసింది. బహుశా సరస్వతి వున్న స్థితిలోనే ఆమె కూడా వుందేమో అనుకున్నాను!

కథ బాగున్నది అన్నవాళ్ళందరికి కథ అర్థం అయ్యిందని అనుకోడానికి కూడా లేదు. వారిలో కొంతమందికి కథ పూర్తిగా అర్థం కాలేదు. అర్థం కానివాళ్ళు చాలా వరకు మెసేజిల ద్వారా అడిగారు. నేను వివరంగా చెప్తే ఇప్పుడు అర్థం అయ్యింది అన్నారు.

మీ కథలో చాలా పొరలూ, దానికి తోడు ఒక ఆకస్మిక (abrupt) ముగింపు ఉన్నాయి. ఇలాంటి కథని పాఠకుడు అర్థం చేసుకోలేకపోవచ్చు. లేని అర్థాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని కోణాలే తెలుసుకోని తృప్తిపడచ్చు. ఒక కథా రచయితగా ఈ ప్రక్రియలో ఉన్న లోపమేమో అనిపించడం లేదా?
లోపం అనుకోవడం లేదండీ. అయితే, అలా జరుగుతుందని ఒప్పుకుంటున్నాను. కానీ పాఠకుణ్ణి మన స్థాయికి తీసుకొచ్చే రచనలే చెయ్యాలి. మనం పాఠకుడి స్థాయికి వెళ్ళి రచనలు చెయ్యకూడదు. పాఠకుణ్ణి తయారు చేసుకోవాల్సిన బాధ్యత కూడా రచయితకు వుంది. పాఠకుణ్ణి పైకి లాగండి. ఇంకా చందమామ దగ్గరే వుంటే ఎట్లా?

ఇప్పటి కథలు, పాఠకుల గురింఛి మీ అభిప్రాయం ఏమిటి?

మునుపటి పాఠకులు వేరు. ఇప్పటి పాఠకులు వేరు. అప్పుడు వచ్చిన కథలు వేరు, ఇప్పుడు వస్తున్న కథలు వేరు. ఇప్పుడు వస్తున్న కథలు చాలా బాగుంటున్నాయి.

ఇప్పటి రచయితల గురించి –

ఒక సంవత్సరం పాటు అమెరికాలో వున్నాను. అక్కడ చాలా పుస్తకాలు చదివాను. ఇంగ్లీషుతో పాటు, చైనీస్, మెక్సికన్, ఇటాలియన్ ఇలా ఎన్నో భాషల కథలు చదివాను. చాలా సినిమాలు కూడా చూశాను. ఆ సంవత్సరం చాలా గొప్ప కథలు చదివాను. ఇప్పటికీ నేను మా అమ్మాయి దగ్గరకు వెళ్ళినప్పుడల్లా ఆమె లైబ్రరీ కార్డు వాడి డెభై అయిదు పుస్తకాలు తెచ్చుకుంటాను. అన్నీ కథల పుస్తకాలే. అవన్నీ చదవడం వల్ల ఆయా భాషల కథాసాహిత్యంలో వస్తున్న పోకడలు తెలుస్తాయి. ఇతర భాషల కథలను అర్థం చేసుకోగలిగితే రచయితలో పరిపక్వత వస్తుంది. ఇప్పుడు కొంత మంది రచయితలు పట్టుమని పది కథలు రాస్తే పట్టడానికి లేకుండా పోతున్నారు. ప్రపంచసాహిత్యాన్ని, మన పాతతరం సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. It is a must. ఇప్పుడు ఎవరైనా కుర్ర రచయితని “చాసో చదివావా” అంటే చాసో ఎవరు అంటున్నారు. బుచ్చిబాబు కథలు చదివావా? అంటే “ఆయన మైదానం చదివానండీ” అంటున్నారు. ఈ పద్దతి మారాలి. చదవాలి. చదివితే మనసు పదునెక్కుతుంది. రాయాలన్ని కుతూహలం కలుగుతుంది. మాలతీ చందూర్ ఏదో సందర్భంలో “వెయ్యి కథలు చదివినప్పుడు ఒక్క మంచి కథ రాయగలుగుతాను” అని చెప్పారు.

ప్రపంచకథలతో బేరీజు వేస్తే తెలుగు కథ ఎక్కడ వుందని మీకనిపిస్తోంది?

చాలా మంచి కథలు వస్తున్నాయి. కాకపోతే ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఇతర భాషల రచనలు అనువాదాలై అన్ని భాషల పాఠకుల దగ్గరకు చేరుతున్నాయి. తెలుగు కథలకు ఆ అవకాశం లేకుండాపోతోంది. అదే జరిగితే ఇప్పుడొస్తున్న తెలుగు కథలు ఏ ప్రపంచసాహిత్యానికి తీసిపోవు.
ధన్యవాదాలు, కరుణాకర్ గారూ! మీరు పరిపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని మంచి కథలు రాయాలని ‘సారంగ’ తరఫునా, మా పాఠకుల తరఫునా మీకు శుభాకాంక్షలు.

థాంక్ యూ..!

ఆమె అంతరంగం, అతని కథనం!

nadustunna katha

 మే నెల కథలు

మే నెలలో కథల సంఖ్య బాగా పెరిగింది.ఈ వ్యాసం రాస్తున్న ముగ్గురం కలిపి సుమారు 200 కథలు చదివాము. ఒక నెలలో ఇన్ని తెలుగు కథలు వస్తున్నాయా అన్న ఆశ్చర్యం, ఆనందం కథల నాణ్యత విషయంలో కలగటం లేదు. కొన్ని పత్రికలలో వార్తలు, వ్యాసాలు కథలుగా చలామణీ కాగలగడం సంపాదకుల అభిరుచిలేమిని సూచిస్తోందా లేక రచయితలలో అవగాహనాలేమిని సూచిస్తోందా అని బాధపడాల్సిన పరిస్థితి. మొత్తం మీద మొదటి వడపోతలో 26 కథలను ఎన్నుకోని, వాటి గురించి మేము ముగ్గురం కలిసి చర్చించాము. ఆ చర్చల పర్యవసానమే ఈ వ్యాసం. (మా దృష్టికి రాని మంచి కథ ఏదైనా వుంటే సూచించండి. ఈ నెల (జూన్) కథల గురించి మేము జరుపబోయే చర్చలో పాల్గొనాలనుకునేవారికి, సాదర ఆహ్వానం. ఫేస్ బుక్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి)

మే నెలలో కొన్ని చిత్రాలు జరిగాయి. కొంత మంది పురుష రచయితలు స్త్రీల సమస్యను కథాంశంగా ఎన్నుకోని కథలు రాశారు. కాండ్రేగుల శ్రీనివాసరావు “జీవన మాధుర్యం” అన్న కథలో వక్షోజాల కేన్సర్ గురించి రాస్తే, కె. వి. నరేందర్ “డబ్బుసంచీ” అన్న కథలో గర్భసంచి తొలగింపు గురించి రాశారు. “మరుగు” కథలో కూడా స్త్రీల సమస్యనే ప్రస్తావించారు వాణిశ్రీ. అలాగే డా. వి. ఆర్. రాసాని “తృతీయ వర్గం” గురించి కూడా రాయడం గమనింఛవచ్చు.

గత మాసం (ఏప్రిల్ 2014) ప్రముఖ రచయితలు పాత్రలుగా రెండు కథలు వచ్చిన సంగతి ప్రస్తావించాము. ఈ నెల కూడా అలాంటి కథ ఒకటి వచ్చింది. భగవంతం రాసిన “గోధుమరంగు ఆట” కథలో త్రిపుర ఒక కనిపించని పాత్రధారి.

ఇక ఈ నెల కథల్లోకి వెళ్దాం –

సాక్షి: శిరంశెట్టి కాంతారావు

టెక్నాలజీ పెరిగిపోతున్న కారణంగా, సాంప్రదాయక వృత్తుల వాళ్ళు పనులు కోల్పోవడం గత కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది. అలా వృత్తిని కోల్పోయి, అప్పులు మాత్రం మిగుల్చుకున్న ఓ కాటికాపరి కథ ఇది. ఇలాంటి కథాంశాలపైన గతంలో ఎన్నో కథలు వచ్చినా ఇంతకు ముందూ ఏ రచయితా ఎన్నుకోని కులవృత్తిని ఎన్నుకోవటం వల్ల ఈ కథ కొంతవరకు ప్రత్యేకంగా మారింది. మంచి కథనం, ఇతివృత్తానికి అనుగుణమైన మాండలికం మరింత బలాన్ని ఇచ్చింది. అయితే అవసరాన్ని మించి నిడివి వున్నట్లనిపించింది.

 

మరుగు: వాణిశ్రీ

బలాత్కారం నుంచి తప్పించుకుందో అమ్మాయి. ఆ విషయం పంచాయితీకి వచ్చినప్పుడు అవతలి పక్షం రాజీ కోరారు. దెబ్బతిన్న ఆత్మగౌరవానికి వ్యక్తిగత స్థాయిలో వెల కట్టడం ఎలా? ఈ కథలో సీతారత్నం పాత్ర అలా వ్యక్తిస్థాయిలో ఆలోచించలేదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఆ కారణాల్లోకి వెళ్ళింది. వెళ్ళి, అందరికీ పనికివచ్చే పరిష్కారాల అమలు తనకు చెల్లించాల్సిన మూల్యం అని స్పష్టం చేస్తుంది. వ్యక్తిగత స్థాయిలో జరిగిన అన్యాయానికి సామాజిక స్థాయిలో పరిష్కారాన్ని కోరడమనే కొత్త పరిహారాన్ని చూపించిన కారణంగా, ఇది నలుగురూ చదవాల్సిన కథ అయ్యింది. మంచి ఎత్తుగడ, ముగింపు, సామాజిక స్పృహ, ఇతివృత్తంలో సమకాలీనత, క్లుప్తత. చదివించే కథనం. అందరూ చదవదగ్గ కథ.

 

జీవన మాధుర్యం: కాండ్రేగుల శ్రీనివాసరావు

బ్రెస్ట్ కాన్సర్ కారణంగా ఒక వక్షోజాన్ని తొలగించడంతో వకుళలో అంతర్మథనం మొదలౌతుంది. ఈ అసమగ్ర రూపంలో భర్త తనను ఎలా చూస్తాడు అన్నది ఆమెని వేధించే ప్రశ్న. అయితే, భార్య పోగొట్టుకున్న భౌతికమైన విషయాన్ని లెక్కచేయనంత విశాలహృదయం భర్తకి ఉంది కాబట్టి కథ సుఖాంతంగా ముగుస్తుంది. దానిలో సంభావ్యతే ప్రశ్నార్ధకం. కథలో చూపించినది ఆదర్శవంతమైన పరిష్కారమే అయినా, అలా కాకపోతే ఎమౌతుందీ అన్న కోణం ఎవరికి వారు ఆలోచించుకోవచ్చు. ఒక వినూత్నమైన అంశాన్ని, ఇంకో సున్నితమైన అసంతృప్తి కోణంతో ముడిపెట్టి రాసిన మంచి కథ. వాస్తవికతని కొంచెం హద్దులు దాటించి శృంగారపరమైన అంశాలు స్పృశించడంతో వస్తువులో ఉన్న గాంభీర్యం కొంత చెదిరిపోవడం ఈ కథలో మనం గమనించవచ్చు.

 

సంస్కృతం మాష్టారు ఇస్మాయిల్: సాయి బ్రహ్మానందం గొర్తి

భాషకీ మతానికీ సంబంధం లేదని ఒక వైపు చెపుతూనే – మతం శాశ్వత అనుబంధాల ఏర్పాటుకు ఎలా ఆటంకమవుతుందో చెప్పటానికి ప్రయత్నించిన కథ. ఇస్మాయిల్ అనే ముస్లిం కుర్రవాడు తెలుగుకంటే సంస్కృతమే నయమని విశ్వం మాస్టారి దగ్గర చేరి సంస్కృతం భాషాజ్ఞానమే కాకుండా ఆయన ప్రేమాభిమానాలనీ సంపాదించి చివరకు సంస్కృతంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తాడు. విశ్వం మాస్టారికి ఇస్మాయిల్ అంటే ఎంత అభిమానం అంటే, చివరికి తన మనవడికి ‘ఇస్మాయిల్’ అనే పేరు పెడతారు. అయితే ఈ మనవడు, ఇస్మాయిల్ కూతుర్ని ప్రేమించడంతో మాస్టారు ‘నానా యాగీ’ చేసి శిష్యుణ్ణి దూరం పెడతారు. ఇరుమతాల మధ్యన ప్రేమ, అభిమానాలు ఉండగలిగిన అవకాశాలు ఉన్నా, మతం అనే సరిహద్దు దగ్గర అవన్నీ కనుమరుగైపోతాయన్న కుదుపు లాంటి వాస్తవికతని కథ పాఠకుడికి స్ఫురింపజేస్తుంది. ఈ వాస్తవికతని పట్టుకురావడమే కథలోని మంచి విషయం అనుకుంటూ ఉండగా, కథ ఒక ‘కొసమెరుపు’ లాంటి ఒక అందమైన విషయంతో ముగుస్తుంది. వాస్తవికత వేరు, ప్రేమాభిమానాలు వేరు అని పాఠకుణ్ణి రెండోసారి కుదుపుతుంది. మంచి కథాంశం, వాస్తవిక కథనం. మొదలు ముగింపులలో రచయిత చాకచక్యం గమనించతగ్గవి..

 

డబ్బు సంచీ: కె వి నరేందర్        

కడుపునొప్పికి పరిష్కారంగా గర్భసంచీని తొలగించాలని డాక్టర్లు మాధవికి చెప్పారు. మిత్రురాలి సలహా మీద ఓ ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదిస్తే, ముందు కొంత వైద్యం చేసి చూద్దాం అంటాడాయన. ఇలా వైద్యం చేద్దామన్న ధోరణి లేకపోగా, సమస్య ఉన్న ప్రతివాళ్ళకీ గర్భసంచీలు తొలగించడం వెనకాల కుట్ర ఏదైనా ఉందా? ఆరోగ్యశ్రీ పథకాలు ఇలా అమలవుతున్నాయా? మరికొంత సమాచారం తెలుసుకున్న మాధవి, దీన్ని రిపోర్ట్ చేసి దర్యాప్తు చేయించాలనుకుంటుంది. శరీరంలోని సమస్యలని వ్యవస్థలోని లొసుగులతో ముడిపెట్టి, సామాజికమైన పరిష్కారం వైపుగా మాధవి ఆలోచించడం బావుంది. కానీ, కథలో కొంత భాగం వ్యాస రూపం సంతరించుకుంది. ఒక వార్త ఆధారం చేసుకుని కొన్ని గణాంకాలను దృష్టిలో పెట్టుకుని రాయడం వల్ల ఈ కథ కొన్ని కథా లక్షణాలను కోల్పోనట్లైంది. ఆ గణాంకాలలో కూడా శస్త్రచికిత్సల సంఖ్యే చెప్పారు తప్ప అవసరం లేకుండా చేసినవెన్ని అనే ముఖ్యమైన విషయంపై దృష్టి పెట్టకపోవడం మరో లోపం.వస్తువు పరంగా ఆలోచింపజేసే కథ అయినా, రూపం విషయంలో మరింత శ్రద్ధ వహించి ఉంటే, కథ స్థాయి చాలా పెరిగి ఉండేది.

 

దో దివానే దో షెహర్ మే: పూర్ణిమ తమ్మిరెడ్డి

మధ్యతరగతి భారతీయుడి సొంతింటి కల! ఆ కల సాధారణ స్థాయిలో ఉన్నా, ఉన్నదానికీ కొనవలసినదానికీ ఉండే గాప్ ఉండనే ఉంటుంది. ఆ కల స్థాయి పెరిగే కొద్దీ ఈ గాప్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి ఓ పెద్ద కల కన్న నేటి తరం భార్యాభర్తలు, పెళ్లి అయ్యీ అవగానే, లోన్ వాయిదాలు కట్టడానికి మరింత సంపాదన కావాలి కాబట్టి అలా సంపాదించడం కోసం చెరో దేశంలో ఉంటారు. ప్రేమించి పెళ్ళిచేసుకున్న ఆ జంట మధ్య దూరం తెచ్చిన వ్యధ, కన్నీళ్ళు మిగతా కథ. కథనం చాలా గొప్పగా ఉన్నా, భార్యాభర్తలు స్కైప్ ద్వారా మాట్లాడుకుంటున్నట్లు సృష్టించడం వల్ల, కథంతా ఆ మూసలో ఒదిగే క్రమంలో క్లుప్తత లోపించినట్లుగా అనిపిస్తుంది. కథాంశంలో ఉన్న సంక్లిష్టత స్థాయికి తగ్గట్టుగా కథ నిడివి కూడా వుండి వుండుంటే బాగుండేది.

 

అమ్మ కడుపు చల్లగా: విజయ కర్రా

ఈ కథ గురించి మాట్లేడే ముందు, ఈ కథ వెనుక కథని కూడా తెలుసుకోవడం అవసరం. ఒక రచయిత ఇచ్చిన ఆలోచన ఆధారంగా మరో రచయిత సృష్టించిన కథ ఇది. ప్రక్రియపరంగా కొత్తగానూ, క్లిష్టంగానూ వున్నా విజయ కర్రా ఈ కథని సమర్థవంతంగా చెప్పడమే కాకుండా, మరో రచయిత ఇచ్చిన సమస్యకి ఆశావహమైన, సార్వజనీయమైన పరిష్కారాన్ని ఇవ్వగలిగారు. ఈ ప్రక్రియ ఫేస్ బుక్ లోని “కథ” గ్రూప్ లో జరిగింది.

 

ఓ చిన్న సమస్య మనసులో దూరి, మనసుని తొలుస్తూ మెలిపెడుతూ – మానవత్వపు ప్రాథమిక విలువలని గురించి ప్రశ్నిస్తూ వేధిస్తుంటే? ఓ తాతకి రెండు రూపాయలు దానం చేయలేని రాజుకి పట్టుకున్న సమస్య ఇది. సమస్య పెరిగి పెద్దదైపోయి పెనుభూతమైపోయి, జ్వరం తెచ్చుకొని కలవరించేదాకా వస్తుంది పరిస్థితి. ఈ సమస్య గురించి భార్య తెలుసుకొని, దానికి పరిష్కారం చూపించడం కథాంశం. ఇవ్వకపోవడానికి లక్ష కారణాలుండవచ్చు గానీ, ఇవ్వదలచుకుంటే ఇవ్వాలనే ఒక్క కారణం చాలు అన్న అంశాన్ని చాలా సున్నితంగా చెప్పిన కథ ఇది. కథకి మూల కారణం వృద్ధుడు – కానీ రచయిత్రి అతడి గతం గురించి ఒక్క పేరా మాత్రమే రాస్తుంది. కారణం కథకి వృద్ధుడి వర్తమానం ముఖ్యం. గతం కాదు. అది రచయిత్రి గ్రహించటం, అంతవరకే రాసి వదిలేయటం ఆ పాత్ర చిత్రీకరణంలో ఆమె చూపించిన జాగ్రత్తకి నిదర్శనం. అదే జాగ్రత్త – చంద్రంలో జాలిగుణం, అతడిలో సంఘర్షణ, దాని పట్ల భార్య సహానుభూతి – ఒక పద్ధతి ప్రకారం మోతాదు మించకుండా చిత్రించటంలో కనపడుతుంది. ‘అత్తత్తత్తా అని పగలంతా (చిన్నపిల్లవాడి) ఒకటే పాట, రాత్రేమో తాత.. తాత.. అని నీ కలవరింతలు’ లాంటి సందర్భోచితమైన వాక్యాల కథనం కథకి సరీగ్గా జతపడింది. కథలో చూపించిన పరిష్కారం, జీవితాల్లో చాలా విషయాలకి అన్వయించుకోదగ్గది కావడం వల్ల మంచి కథలని గుర్తుపెట్టుకొనే వాళ్ళ మనసుల్లో కొన్నాళ్ళపాటు ఈ కథ నిలిచి ఉంటుంది.

 

ఇరుకు పదును: బి పి కరుణాకర్

మరణించిన స్నేహితుడి భార్య అంటే రచయితకి ఒక సాఫ్ట్ కార్నర్. కానీ ఆమెకి తన భర్త మీద సదభిప్రాయం ఉండదు. భర్త ప్రవర్తన మీద రకరకాల అనుమానాలతో, కొన్ని ఆధారాలు తెచ్చి భర్త వ్యక్తిత్వం గురించి రచయిత దగ్గర కూపీలు లాగటానికి ప్రయత్నిస్తుంది. తమ స్నేహం కారణంగానో, లేక స్నేహితుడితో సంబంధం వున్న మరో మనిషి పక్కనే వుండటం వల్లో రచయిత ఆ విషయాలు చెప్పడు. కానీ కథ జరుగుతూ ఉండగా స్నేహితుడి భార్య పట్ల రచయిత అభిప్రాయం మారటం చూచాయగా పాఠకుడికి తెలుస్తుంది. ఇన్ని రకాల మానసిక కోణాలకి కథనం తావు ఇచ్చినా ఒక్క కోణం కూడా రచయిత నేరుగా పాఠకుడికి చెప్పకపోవటం కథలో ప్రత్యేకత.

 

చిన్న కథలో రచయిత ప్రతిభావంతంగా చొప్పించిన ప్రశ్నలను గమనించిండి.

 

అత్యంత విషాదకరమైన సన్నివేశంలో ఓ వ్యక్తిని చూసి, మనస్సులో ఎక్కడో ఏర్పరచుకున్న సానుభూతి – ఆ తరువాత ఎప్పుడో ఆ మనిషితో సంభాషించే క్రమంలో ఆవిరైపోతూ ఉండటం ఎలా ఉంటుంది? చనిపోయిన మనిషి గురించి సాక్షాత్తూ ఆ వ్యక్తి భార్యే నిందిస్తూ మాట్లాడుతూ ఉంటే దాన్ని స్వీకరించడం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తితో సంబంధం ఉన్న మరో మహిళ ఇవన్నీ అక్కడే కూచుని వినడం ఎలా ఉంటుంది? అసలు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ చనిపోయిన వ్యక్తి నిజంగా చేసిన తప్పులేవిటి? ఇప్పుడు అన్నీ అయిపోయాక, ఏది తప్పు, ఏది ఒప్పు? మనుషుల్ని మనం చూసే దృష్టికోణాలు రియల్ టైమ్ లో డైనమిక్ గా మారిపోవడం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకీ; ముగింపు వ్యూహాత్మకంగా, పాఠకుడికి ఊహాత్మకంగా వదిలివేసినందువల్ల ఉత్పన్నమయ్యే మరిన్ని ప్రశ్నలకి ఈ కథలో పాఠకుడే జవాబులు వెతుక్కోవాలి. అది రచయిత, పాఠకుడి తెలివితేటల మీద ఉంచిన నమ్మకం!

 

ఇవి కాక వస్తుపరంగానో, శైలి పరంగానో ప్రస్తావించదగ్గవిగా మేము భావించిన కథలు కొన్ని –

 

24.05.14 త్రిపుర వర్ధంతి సందర్భంగా భగవంతం రాసిన కథ “గోధుమరంగు ఆట”. రచయిత పేరు త్రిపుర పాత్రల్లో ఒకటి కావటం – రచయిత పై త్రిపుర ప్రభావం ఎంతగా ఉందో చెప్పకనే చెపుతుంది. అది అబద్ధం కాదన్నట్లు ఈ కథ పోకడ రుజువు చేస్తుంది. గొప్ప కథనం. అందుకనే కథలో ఇతివృత్తం ఏంటో (అసలు ఉందా?) కథనం తెలియనివ్వదు. ఇది కథకి బలమా?కాదా? అన్న మీమాంస వదిలేస్తే మంచి అనుభూతిని కలగచేసిన ప్రయత్నం. త్రిపుర కథల స్ఫూర్తితో, ‘భగవంతం కోసం‘ కథ ధోరణిలో రాయబడ్డ కథ. త్రిపుర స్మృతికి అంకితం చేయబడ్డ కథ. “ఆకాశంలో నక్షత్రపు జల్లు. భగవంతం రాడు. అట్నుంచి ఏడో నంబర్లోనూ రాడు, ఇట్నుంచి పదమూడో నంబర్లోనూ రాడు. నా పిచ్చి గాని.” అన్న నిరాశతో ముగిసిన ఆనాటి కథ, ఇవాళ రూపాంతరం చెంది “.. కానీ బయట ఆకాశం కింద ఒక అనంతమైన కాల్పనిక వేడుక నాకోసం ఎదురుచూస్తూ ఉంటే – మాటల్తో కాలాన్నెందుకు వృధా చేయడం అనుకుని – హోటల్లోంచి బయటకొచ్చేశాను” అనే నవీన స్ఫూర్తితో ముగియడం ఒక విశేషం!

 

ఈ నెలలోనే వచ్చిన మరో రెండు కథలను కథాప్రేమికులు పరిశీలించాలి. ఈ రెండు కథలు ప్రతీకాత్మకంగా రాసినవి కావటం మాత్రమే ఈ రెండింటి మధ్య వున్న సామీప్యం. వివిన మూర్తి రాసిన “జ్ఞానం కనిపించటం లేదు” కథ సామాజిక పరిస్థితుల మీద చేసిన వ్యాఖ్య అయితే, పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన “ఏనాడు విడిపోని ముడివేసెనే” కథ భార్యాభర్తల మధ్య పల్చబడే అనుబంధం గురించి వివరిస్తుంది.

 

ప్రతీకలతో కథ నడపడం కత్తి మీద సాములాంటిదని ఈ రెండు కథలు చెప్పకనే చెబుతున్నాయి. కత్తి మీద సాము ఎందుకంటే – జటిలంగా ఉన్న ప్రతీకలు సంక్లిష్టమైన పజిల్ లా తయారై, కథ పాఠకుడికి దూరం అవుతుంది. సులభంగా ఊహించగల ప్రతీకలు కథ మీద పాఠకుడికి ఉన్న ఉత్సాహాన్ని నీరుకారుస్తాయి. ప్రతి అంశానికీ ఒక ప్రతీక చొప్పున వాడుకుంటూ పోవడం వల్ల మొత్తం ప్రక్రియ పలుచబారే ప్రమాదం ఉంది. ప్రతీకలతో వున్న మరో సమస్య ఆ ప్రతీకలకు లేని అర్థాన్ని ఆపాదించే ప్రయత్నం. చిత్రకళ నుంచి సాహిత్యంలోకి వచ్చిన ఈ ప్రక్రియలో కొన్ని కొన్ని విషయాలకు ప్రతీకలు దాదాపు నిర్థారితంగా వున్నాయి. వాటిని వేరే అర్థంలో వాడటం వల్ల తెలివిడి కలిగిన పాఠకులకు కూడా కథ కొరుకుడు పడకపోయే సమస్య వుంటుంది. శిల్పంలో విభిన్నమైన ప్రక్రియగా వీటిని వాడటం ముదావహమే గానీ, కథలని ఇంత అస్పష్టంగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నది పెద్ద ప్రశ్న. (ఏది ఏమైనా ఈ కథలను పాఠకులు చదివి, వారికి స్ఫురించినంత మేర సారాన్ని గ్రహించే అవకాశం వుంది కాబట్టి ఈ కథలు చదివి/చదివిన వారు తమ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో చెప్పాలని మనవి)

 

ఈ నెల ఉత్తమ కథ

ఇద్దరి మనుషుల సంభాషణల్లో – వ్యక్తం అయ్యే అంశాలు, అవ్యక్తంగా ఉంచబడ్డ విషయాల మధ్య ఓ సున్నితమైన గాప్ వస్తుంది. ఈ గాప్ ఆ సన్నివేశంలో ఉన్న వ్యక్తులకి అవగాహనలోకి వస్తే, ఆ సంభాషణల్లో ఓ ఇబ్బంది వచ్చిచేరుతుంది. ఇదీ ఈ కథలోని ప్రాథమిక చిత్రం. ఆ సన్నివేశంలో ఇంకో వ్యక్తి కూడా ఉంటేనూ, మరో వ్యక్తి కనబడకుండా ఉంటేనూ ఆ ఇబ్బంది స్థాయి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ముఖ్యంగా – ఆ నలుగురు వ్యక్తుల మధ్యనా కొన్ని సంబంధాలో బాంధవ్యాలో మరోటో ఉన్నప్పుడు. ఇదొక సంక్లిష్టమైన చిత్రం. కథగా చెప్పడం కష్టం, చెప్పి ఒప్పించడం ఇంకా కష్టం. అలాంటి బాధ్యతని ప్రతిభావంతంగా నెరవేర్చారు బి పి కరుణాకర్ గారు ‘ఇరుకు పదును’ కథలో. ఎంతవరకూ చెప్పాలో దానికి కొంచెం తక్కువగానే చెప్పి, ఈ కథలో కరుణాకర్ గారు అటు క్లుప్తతనీ ఇటు అనుభూతి ఐక్యతనీ ఏకకాలంలో సాధించగలిగారు. అందువల్లా, పైన చెప్పిన ఇతర కారణాల వల్లా ఈ నెల వచ్చిన కథలలో “ఇరుకు పదును” ఉత్తమకథగా మేము భావించడం జరిగింది.

 

కథా రచయిత బి.పి. కరుణాకర్ గారికి అభినందనలు!! కరుణాకర్ గారితో “ఇరుకు పదును” గురించి సంభాషణ వచ్చేవారం.

 

ఈ వ్యాసంలో ప్రస్తావించిన కథలు:

సం. కథ రచయిత (త్రి) పత్రిక లింక్
1 అమ్మ కడుపు చల్లగా విజయ కర్రా ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 4 http://goo.gl/3oY7up
2 ఇరుకు పదును బి. పి. కరుణాకర్ ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 18 http://goo.gl/xxUKc5
3 ఏ నాడు విడిపోని ముడి వేసెనే పూర్ణిమ తమ్మిరెడ్డి ఈమాట – మే/జూన్ http://goo.gl/CPe5p6
4 గోధుమరంగు ఆట భగవంతం ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 25 http://goo.gl/Adb8oF
5 జీవన మాధుర్యం కాండ్రేగుల శ్రీనివాసరావు నవ్య, మే 14 http://goo.gl/ixJHPR
6 జ్ఞానం కనిపించటంలేదు వివినమూర్తి అరుణతార, మే
7 డబ్బు సంచి కె. వి. నరేందర్ నమస్తే తెలంగాణ, మే 4 http://goo.gl/nsCq6P
8 తృతీయ వర్గం డా. ఆర్. వి. రాసాని నవ్య, మే 21 http://goo.gl/ZZ2TfQ
9 దో దీవానే దో షహర్ మే పూర్ణిమ తమ్మిరెడ్డి కినిగే పత్రిక, మే http://goo.gl/XZ1EpG
10 మరుగు వాణిశ్రీ నవ్య, మే 7 http://goo.gl/LJHBxF
11 సంస్కృతం మాష్టారు ఇస్మాయిల్ సాయిబ్రహ్మానందం గొర్తి ఈమాట, మే/జూన్ http://goo.gl/E5AuQy
12 సాక్షి శిరంశెట్టి కాంతారావు కౌముది, మే http://goo.gl/xiLhrE

– అరిపిరాల సత్యప్రసాద్, ఎ.వి. రమణమూర్తి, టి. చంద్రశేఖర రెడ్డి

aripirala02. T Chandra Sekhara Reddy01. Ramana Murthy

మన కథలలో రాశి తప్ప వాసి ఎక్కడ?

 

nadustunna katha

నడుస్తున్న కథ ఏప్రిల్ కథలు:

ఏప్రిల్ నెల కథల సమీక్ష మీరు ఇప్పుడు చదవబోతున్నారు. ప్రతి నెలా కథలను చదివి ఆ పై నెలలో ఆ కథల సమీక్ష రాయాలని మా సంకల్పం. అయితే కథల సంఖ్య పెరగటం; వ్యక్తిగత, ఉద్యోగ కారణాలవల్ల మా ముగ్గురికి ఏప్రిల్ కథల గురించి చర్చించే అవకాశం కుదరలేదు. ఏ నెలకానెల పాఠకుల పఠనానుభూతి జ్ఞాపకంలో వుండగానే వాటి సమీక్ష చదివితే వారి అనుభవాలనీ, అనుభూతులనీ మా అభిప్రాయాలతో పోల్చుకునే అవకాశం ఈ సందర్భంగా కోల్పోతున్నందుకు మాకూ బాధగానే వుంది. అందుకు పాఠకులకు క్షమాపణలు చెప్పుకుంటూ, రాబోయే వ్యాసాలు సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని మనవి చేస్తున్నాము.

 

ఏప్రిల్ నెలలో వచ్చిన దాదాపు నూట డెబ్భై ఐదు కథలను పరిశీలిస్తే ఇప్పుడొస్తున్న తెలుగు కథలు రాశికే కానీ వాసి లెక్కకు రావన్న దిగులు మళ్ళీ కమ్ముకుంటోంది. నెల నెలా పది నుంచి పదిహేను కథలను మంచి కథలుగా పరిచయం చేస్తున్న మేము, ఈ నెల ఆ సంఖ్యను ఏడుకు మించి ఎంత ప్రయత్నించినా పెంచలేకపోవటం బాధాకరం. మా దృష్టిలోకి రాని మంచి కథలు ఒకటో రెండో వున్నా, మా అభిప్రాయాలతో విభేదించి మరో ఒకటి రెండు కథలను పాఠకులు సూచించినా, అవన్నీ కలుపుకుంటే కూడా మొత్తం కథలలో పది శాతం కూడా వుండదు కాబట్టి మేము పైన చెప్పిన వాక్యంలో ఏ మార్పు రాదు. ఇది తెలుగు కథకులు సమీక్షించుకోవాల్సిన విషయం.

 

ఈ నెల వచ్చిన కథలను పరిశీలించే ముందు ఏప్రిల్ నెలలో కొన్ని విశేషాలను గుర్తుచేసుకుందాం –

ఈ నెలలో గురజాడ ఒక పాత్రగా ఒక కథ (తనకు నచ్చిన కానుక: అనంత సురేష్, ఆదివారం ఆంధ్రజ్యోతి 4 ఏప్రిల్), శ్రీపాద ఒక పాత్రగా ఇంకో కథ (“మహావృక్షం”: సింహప్రసాద్, తెలుగువెలుగు) వచ్చాయి. అయితే, ఈ ప్రత్యేకత మినహా కథలు మాత్రం సాధారణంగానే వున్నాయి. అలాగే, ఒకే కథ ఇదే నెలలో రెండు ఇంటర్నెట్ పత్రికలలో రావటం కూడా గుర్తించవచ్చు.

 

ఇక మంచి కథల గురించి –

ఈ నెలలో వచ్చిన మంచి కథలలో వస్తుపరంగా వైవిధ్యం స్పష్టంగా కనపడుతోంది. “పరబ్రహ్మ”, “స్పార్క్” కథలు మంచి కథాంశాన్ని ఎన్నుకోని, ఆ నేపధ్యంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెబితే, “అస్తిత్వం”, “నేను నాన్న బిర్యాని”, “వెడ్డింగ్ ఇన్విటేషన్” వంటి కథలు అనుభూతి ప్రధానంగా నడిచాయి. ఈ కథలలో వున్న కథాంశం చాలా స్వల్పమైనదైనా కథని నడిపించిన విధానంలో ప్రతిభ వల్ల చదవతగ్గ కథలైనాయి. “పేరున్న రాజ్యం”, “తలుపులు” కథలువర్తమాన రాజకీయ పరిస్థితులమీద సంధించిన కథాస్త్రాలు. ఈ కథలన్నింటి గురించి స్థూలంగా పరిచయం చేసుకుందాం.

పరబ్రహ్మ: సింహప్రసాద్

గురువు నేర్పిన చదువుతో గురువునే మించి పోయాననుకునే శిష్యుడు మళ్ళీ గురువు గొప్పదనాన్ని తెలుసుకోవడం కథాంశం. స్వాతి కథల పోటీలో బహుమతి పొందిన ఈ కథని పరిశీలిస్తే కథాంశం పాతదైనా ఒక చెయ్యి తిరిగిన రచయిత చేతిలో ఎంత చక్కగా రూపుదిద్దుకోగలదో అర్థం అవుతుంది. ఇతివృత్తంలో నేటి గురువుల ట్రెండ్ ను ప్రస్తావించటం వల్ల సమకాలీన పరిస్థితులను సూచిస్తోంది. అయితే,కథ ప్రధమార్థంలో శిష్యుడికి గురువు లెక్కలు నేర్పే ప్రక్రియ అవసరాన్ని మించి జరిగిందేమో అనిపించింది.

 

అస్తిత్వం: శిరీష్ ఆదిత్య

ఢిల్లీ నగరంలో ఒంటరిగా వుంటున్న ఓ తెలుగు యువకుడు తెలుగు మాట్లాడే ఓ హోటల్ సర్వర్ తో పరిచయం పెంచుకుంటాడు. ఓనర్ కి తెలియకుండా అతనికి టిప్ ఇవ్వలేని చిన్న డైలమా. అది ఇవ్వకముందే సర్వర్ చనిపోవటం – ఇదీ కథాంశం. జీవితం తాలూకు అభద్రత, అజ్ఞానం, అనిశ్చితీ అసలే కుదిపేస్తున్న ఆ సమయంలో – వెంకటప్ప మరణం జీవితపు క్షణికత్వాన్ని కథకుడికి ఆవిష్కరింపజేసి, నాస్తికుడిగా ఉన్నవాడిని గుడి మెట్ల మీద నిలబెడుతుంది. ఈ కథ కూడా ముందే చెప్పినట్లు మంచి భాష, కథనం వల్ల చదివించేస్తుంది. చివర్లో యువకుడు వేసుకునే ప్రశ్నలు, మధ్యలో వెంకటప్ప వేసే ప్రశ్నలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. కథాంశంలో మరి కొంత కసరత్తు చేసివుంటే కథకు కండపుష్టి కలిగుండేది.

 

స్పార్క్ : విజయభాను కోటే

ఒక వైపు నుంచి చూస్తే బాల్యంలో లైంగిక దురాచారానికి బలైన అమ్మాయి ఆత్మస్థైర్యంతో నిలబడిన కథ. అలాంటి పరిస్థితులు ఆ అమ్మాయిల్లో ఎలాంటి నిర్వికారాన్నీ, వ్యధనీ కలగజేస్తాయో వాస్తవికంగా పట్టుకోవడానికి మంచి ప్రయత్నం చేసిన కథ. మరో వైపు నుంచి చూస్తే ఓ కుర్రాడి ఏక పక్ష ప్రేమ కథ. తాను ప్రేమించే అమ్మాయి తిరిగి ప్రేమించకపోతే కోపం తెచ్చుకోకుండా ఎందుకని ఆలోచించిన ప్రేమికుడి కథ. నిజమైన ప్రేమ అంటే అదే అని చాలామంది గ్రహించక పోయినా ఈ కథలో హీరో గ్రహించటం ఈ కథలో విశేషం. ముగింపును కూడా రచయిత్రి అటో ఇటో తొందరపడి తేల్చదు. ప్రయత్నం లేకుండా ఫలితం రాదు కదా అని ప్రశ్నార్ధకంతో వదిలేస్తాడు. అబ్రప్ట్ గా మొదలైన కథ ఇన్‌కంక్లూసివ్ గా ముగియటం కొంత వెలితి అనిపించినా – ‘సర్వ’పాత్ర మనస్తత్వం, జీవన నేపథ్యం దృష్టిలో పెట్టుకుంటే కథకు అంతకన్నా ఆచరణాత్మకమైన ముగింపు సాధ్యం కాదేమో అనిపిస్తుంది.

 

పేరున్న రాజ్యం: పాలపర్తి జ్యోతిష్మతి

సుస్థిర రాజ్యం ఏర్పరచుకున్న ప్రభువులు – అధికారమే పరమావధిగా ప్రజలని ఎలా మభ్యపెట్టి మోసం చేస్తూ ఉంటారనే విషయాన్ని ప్రతీకాత్మకంగా రాసిన కథ. చివరికి విసుగెత్తిన ప్రజలు ఏం చేస్తారన్నది ముగింపు. చాలా విచిత్రంగా, ఈ కథ వచ్చిన కొద్ది రోజులకే మన దేశపు రాజకీయాల్లో ఇలాంటి పరిణామం సంభవించడం కాకతాళీయమే అయినా, ఒక రచన చూడగల వాస్తవ దృష్టికోణాన్ని అది స్పష్టపరుస్తోంది. తను చెప్పదలుచుకున్నది సూచ్యంగా తప్ప వాచ్యంగా చెప్పకూడదనుకున్న రచయిత్రి తనమీద తాను విజయవంతంగా ప్రయోగించుకోగలిగిన నియతి. అంతర్లీనంగా దాగి ఉన్న దారపు పోగును పట్టుకోగలిగితేనే మంచికథ. లేకుంటే మామూలు కథగా అనిపించి బురిడీ కొట్టించగలిగిన కథ.

 

నేను, నాన్న, బిర్యానీ: ఇండ్ల చంద్ర శేఖర్

బిర్యానీ తినాలన్న బలమైన కోరికతో ఇస్మాయేల్ హోటల్ చేరిన ఓ మాష్టారుకి అక్కడ తండ్రి కనిపించడం, ఆయనకు ఆ రోజు ఉదయమే డబ్బులేదని చెప్పిన కారణంగా ఆయన్నుంచి తప్పించుకోవాల్సిన అవసరం. ఈ పరిస్థితిలో కొడుకు ఇంకా ఏమీ తినలేదని తెలుసుకున్న తండ్రి అతన్ని మరో హోటలుకి తీసుకెళ్ళి బిర్యానీ తినిపిస్తాడు. తండ్రి ప్రేమ కలిసిన ఈ బిర్యానీనే అద్భుతంగా అనిపిస్తుంది మేష్టారికి. ‘ఎదిగిన కొడుకు – నిర్లక్ష్యం చేయబడ్డ తండ్రి’ ఇతివృత్తంతో ఇపుడు తామర తంపరగా వస్తున్న కథల్లో ఒక కొత్త కోణం ఆవిష్కరించిన కథ. కొడుకు నిర్లక్ష్యం చేసినా తండ్రి ప్రేమ చెక్కు చెదరదని చెప్పిన కథ. క్లుప్తతతో కథకు ప్రాణం పోసిన రచయిత తాను చెప్పదలుచుకున్నదాన్ని సూచ్యంగా చెప్పటం కథలో విశేషం.

అయితే, మేష్టారు తన ఇన్నేళ్ళ జీవితంలో తండ్రి ప్రేమని ఎప్పుడూ తెలుసుకోలేదా? అలా స్వార్థపరుడిగా ఎందుకు ఉన్నాడు? లాంటి ప్రశ్నలకి ఎలాంటి కార్యకారణసంబంధమూ చూపించకుండా సన్నివేశాలని తనకు కన్వీనియెంట్ గా రచయిత మలచుకోవడం వల్ల కథ తాలూకు సంపూర్ణత్వం కొంత దెబ్బతింది. ఆ విషయాలనీ కథ పరిధిలోకి తీసుకొని వస్తే, అనుభూతిని ఇంకొంచెం ఎక్కువ పండించగలిగి ఉండేది.

 

వెడ్డింగ్ ఇన్విటేషన్: డా. వంశీధర్ రెడ్డి

కథకుడిలో కథని ప్రతిభావంతంగా చెప్పగలిగిన నేర్పు ఉంటే, దానికి ఎక్కడా తడుముకోవాల్సిన అవసరం లేని భాషమీద పట్టు తోడైతే సూది అంత ఇతివృత్తంతో గడ్డిమోపంత కథ ఎలా సృష్టించవచ్చు అనటానికి మంచి ఉదాహరణ. గొప్ప వైవిధ్యం ఉన్న వాతావారణం, దానికి అత్యంత సహజమైన కథన ధోరణీ, కథ చెప్పడంలో అనుసరించిన ఒక మోనోలాగ్ లాంటి ప్రక్రియా, అందులో చెణుకులూ మరికొన్ని మెరుపులూ – ఇవన్నీ కథని నిస్సందేహంగా ఒక గొప్ప కథగా మలిచాయి.

విమర్శకులలో, విశ్లేషకులలో తప్పకుండా చర్చ లేవనెత్తే కథ ఇది. కథలో సహజత్వాన్ని ఇంకొంచెం పొడిగించి వాడిన బూతులు కథకి అవసరమా కాదా అన్న అన్ని చర్చల్లోనూ ఈ కథని ఉదహరించుకుండా వుండలేము. సభ్యత ముసుగు వేసుకుని చూస్తే అభ్యంతరకరంగానూ, కథనంలో సహజత్వాన్ని కోరుకునే వారికి ఆశ్చర్యకరమైనంత సహజంగా కనిపించే కథ. డాక్టర్ వంశీధర్ రెడ్డిని కథారూపం పరంగా ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన కథ.

ఇన్ని విశేషణాలున్న ఈ కథ, ఒక విధివిలాసపు కథ కాకుండా, ఒక నిర్దుష్టమైన ప్రయోజనాన్ని, జీవితానికి సంబంధించిన ఏదైనా విశేషాన్ని అందించగలిగిన ఉద్దేశాన్నీ కూడా కలగలపుకొని ఉన్నట్టయితే, ఇంకొంత మంచి కథ కచ్చితంగా అయి ఉండేది.

 

తలుపులు: పెద్దింటి అశోక్ కుమార్

తెలంగాణ ఉద్యమం విజయవంతమైన తరువాత జరిగిన ఎన్నికల నేపధ్యంలో రాయబడిన కథ. కథకు సహజమైన తెలంగాణ మాండలికంలో రాయబడింది. పేదరికంతో పాటుతుఫాను చలిగాలి కూడా కమ్ముకున్న ఒక కుటుంబం గురించిన కథ. ఆ చలినుంచి చెల్లెల్ని కాపాడటం కోసం ఒక ఫ్లెక్సీని దొంగతనంగా తీసుకొచ్చి, తలుపుల్లేని ఆ ఇంటికి కొంత రక్షణ కల్పించాలి అనే ఆలోచనలో ఉన్న ఒక అన్న కథ. తీరా దాన్ని తెంపుకొని వచ్చాక, సదరు రాజకీయ పార్టీ కార్యకర్తలు నానా యాగీ చేసి ఆ కుర్రాణ్ణి కొట్టి ఫ్లెక్సీ లాక్కెళ్తారు. మంచి ఎత్తుగడ, పాఠకుడి దృష్టిని పక్కకు పోనివ్వని ముగింపు. ఇతివృత్తంలో సమకాలీనత. దానికి అనుగుణమైన భాష, కొరడా కొసలా చెళ్లుమనే ముగింపు. మంచి కథకి ఉండాల్సిన లక్షణాలు అన్నీ పుణికిపుచ్చుకున్న కథ.

 

ఇవీ ఏప్రిల్ లో వచ్చిన కొన్ని మంచి కథలు. ఈ కథలలో ఉత్తమమైన కథ కోసం పరిశీలించినప్పుడు, ఈ వ్యాసకర్తలు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న కథ తలుపులు”.అశోక్ కుమార్ గారి రచన ఆ ఉద్యమస్ఫూర్తిని సజీవంగానే వుంచుతూ, ఉద్యమానంతర పరిస్థితిని ఎంతో బాధ్యతతో గుర్తు చేస్తుంది.

ఈ కథలో ఆయివు పట్టు ఆ ఫ్లెక్సీ మీద వున్న బొమ్మ. ఏ పసిపిల్లాడు చెల్లెలిని చలినుంచి కాచడానికి ఫ్లెక్సీ దొంగతనం చేశాడో ఆ పిల్లాడి తండ్రి బొమ్మే ఆ ఫ్లెక్సీ మీద వుంటుంది. ఆ కుటుంబం తెలంగాణా పోరాటంలో అమరుడైన ఓ వీరుడిది. ఈ విషయం ఎంత బలమైనదంటే కథని ఈ వాక్యంతో ముగించి ఒక ఆశ్చర్యాన్ని, రాజకీయనాయకుల పైన కసిని పాఠకుల మదిలో రగిలించి ముగించవచ్చు.

కానీ, అశోక్ కుమార్ గారు కథని అలాంటి ఒక టెక్నిక్ తో ముగించడానికి ప్రయత్నించలేదు. అదీ ఈ కథలోని నిజాయితీ! గొడవ చేసిన రాజకీయ పార్టీల వాళ్ళు వెళ్ళిపోయాక, తల్లి కొడుకు తల నిమురుతూ, “వీడి పోరాటం ఇంకా మిగిలే ఉంది” అనడంతో కథ ముగుస్తుంది. పోరాటాల వల్ల సాధించాల్సింది సాధించినా, పోరాటాల అనంతరం అందుకోవాల్సిన ఎత్తులు ఇంకా మిగిలే ఉంటాయన్న అన్యాపదేశం ఈ కథ సారాంశం. తెలంగాణా సాధనతో ఆగకుండా రాష్ట్ర నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకీ సమాయత్తమవమని స్ఫూర్తిని రగిలిస్తుంది. అందుకే ఈ కథ తెలంగాణ నేపధ్యంలో రాయబడ్డ కథే అయినా అన్ని ప్రాంతాల వారికీ అన్వయం అవుతుంది. ఆ సార్వజనీతే ఈ కథని ఉత్తమ కథగా నిలబెట్టింది.

పెద్దింటి అశోక్ కుమార్ గారికి మరోసారి అభినందనలు!!

 

ఇక చివరిగా – ఈ వ్యాసంలో చర్చించిన కథల లిస్టూ,వీలైనచోట లింకులూ:

తలుపులు: పెద్దింటి అశోక్ కుమార్ (నమస్తే తెలంగాణ బతుకమ్మ, 27 ఏప్రిల్)http://goo.gl/WvdUpt

 

వెడ్డింగ్ ఇన్విటేషన్: వంశీధర్ రెడ్డి (కినిగే పత్రిక, ఏప్రిల్)http://goo.gl/Ud2D9g

 

నేను నాన్న బిర్యాని: చంద్రశేఖర్ ఇండ్ల (సాక్షి ఫన్ డే, 13 ఏప్రిల్)http://goo.gl/uhHZnC

 

పేరున్న రాజ్యం: పాలపర్తి జ్యోతిష్మతి (చినుకు, ఏప్రిల్)

 

స్పార్క్: విజయభాను కోటే(సాహితీ ప్రస్థానం, ఏప్రిల్)http://goo.gl/G69HD8

 

అస్థిత్వం: శిరీష్ ఆదిత్య (కినిగే పత్రిక, ఏప్రిల్)http://goo.gl/k9NkHD

 

పరబ్రహ్మ: సింహప్రసాద్ (స్వాతి వారపత్రిక, 11 ఏప్రిల్)

 

ఆలోచించేలా రాయగలిగితే చాలు : సోమశంకర్

2 (1)

మార్చి నెల వచ్చిన కథలని అన్ని రకాలుగా పరిశీలించిన తరువాత ప్రయోజనకరమైన కథాంశంతో, వస్తువు-శిల్పం-కథనాల మధ్య మంచి సమతుల్యతతో నడిచిన “ముసుగు వేయద్దు మనసు మీద” (కినిగె పత్రిక) కథను ఉత్తమ కథగా నిర్ణయించాము. ఆ కథారచయిత కొల్లూరి సోమశంకర్ గారితో ముఖాముఖీ ఈ వారం –

 

  • సోమశంకర్ గారూ! మార్చ్ నెలలో వచ్చిన అన్ని కథల పోటీనీ తట్టుకొని మీ కథ ‘ముసుగు వేయొద్దు మనసు మీద’ ఉత్తమ కథగా నిలబడ్డందుకు ముందుగా మా బృందం తరఫున అభినందనలు!

ధన్యవాదాలండీ.

  • మీ రచనా వ్యాసంగం గురించి కొంచెం వివరిస్తారా?

1998లో ఓ చిన్న వ్యాసాన్ని అనువదించడంతో ప్రారంభమైంది. కాకపోతే ఆ పత్రిక వారు అనువాదానికి అనుమతి నిరాకరిండంతో ఆ వ్యాసం తెలుగు వెర్షన్ వెలుగు చూడలేదు. చదివించేలా నేను రాయగలననే నమ్మకం కలిగించిందా అనువాదం.

ఆ తరువాత, “The Adventures of Pinocchio” అనే పిల్లల నవల చదవడం తటస్థించింది. ఆ ఇతివృత్తం, పాత్రల ప్రవర్తన ద్వారా పిల్లలకి మంచి చెప్పడానికి ప్రయత్నించడం నాకు బాగా నచ్చాయి. 1999 నాటికే ఆ పుస్తక అనువాదం పూర్తి చేసినా, 2012 జనవరికి కానీ ముద్రణకి నోచుకోలేదు. “కొంటెబొమ్మ సాహసాలు” పేరిట పీకాక్ క్లాసిక్స్ వారి అనుబంధ సంస్థ పీచిక్స్ ప్రచురించింది.

అనువాదాల కన్నా ముందుగా, Indian Express దిన పత్రిక లోని Career Express అనే పేజిలో “జనరల్ అవేర్‌నెస్” అనే శీర్షిక,ఆంధ్రజ్యోతి దిన పత్రిక యొక్క కెరీర్ గైడ్ పేజిలో “కరెంట్ అఫైర్స్” అనే శీర్షిక నిర్వహించాను. ఆంధ్రభూమి సాధన అనుబంధంలో “Arithmetic” అనే శీర్షికలో పోటీ పరీక్షల లెక్కలు సులువుగా ఎలా చేయవచ్చో తెలిపాను. తరువాత అదే అనుబంధంలో “అంతర్జాతీయ అంశాలు” అనే శీర్షిక నిర్వహించాను. ఇదే సమయంలో, బాలజ్యోతిలో పిల్లల కథలు రాసే అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో బాలజ్యోతికి 9, ఆంధ్రభూమి వారపత్రికకి 2 పిల్లల కథలు రాసాను.

బాలజ్యోతి సంపాదకుల సూచన మేరకు, వివిధ మాసపత్రిక/వారపత్రికలకు కథలు వ్రాయడం మొదలుపెట్టాను. ఆగష్టు 2001 ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురితమైన “రూపాయల పుస్తకం” అనేది నా మొదటి కథ. 9 నవంబర్ 2002 నాటి ఆంధ్రప్రభ వారపత్రికలో “విశ్వకదంబం” శీర్షికన నా మొదటి అనువాద కథ “బాకీ” ప్రచురితమైంది.

నేను రాసిన “అతడు-ఆమె-ఇంటర్‌నెట్” అనే కథని “లడ్‌కా-లడ్‌కీ-ఇంటర్‌నెట్” అనే పేరుతో నేనే హిందీలోకి అనువదించాను. అలాగే, నేను ఆంగ్లం నుంచి అనువదించిన “బొమ్మ” అనే కథని హిందీలో “టెడీబేర్” అనే పేరుతో అనువదించాను. శ్రీ కె.వి. నరేందర్ రాసిన “చీపురు” కథను “ఝాడూ” పేరిట;శ్రీ మాన్యం రమేష్‌కుమార్ రాసిన “శబ్దం” కథని “శబ్ద్” పేరిట హిందీలోకి అనువదించాను.

నేను రాసిన “పాపులర్ సుబ్బారావ్” అనే కథ అదే పేరుతో కన్నడంలోకి అనువాదమైంది. నేను అనువదించిన “బొమ్మ” కథని తెలుగు అనువాదం ఆధారంగా, కన్నడంలోకి అనువదించారు శ్రీ. కె. కృష్ణమూర్తి.

ఇక ఎమెస్కో బుక్స్ కోసం 5 పుస్తకాలను అనువదించగా, “ఆనందం మీ సొంతం” అనే పుస్తకం ప్రచురితమైంది. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి. ఇవి కాక, పూనెకి చెందిన డా. అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ “One Life to Ride” ను తెలుగులోకి అనువదించాను. ఇది ప్రస్తుతం ప్రీ-ప్రెస్ దశలో ఉంది. యు.కె.లో స్థిరపడిన వినయ్ జల్లా రాసిన ఆంగ్ల నవల “Warp and Weft” అనువాదం ఈ మధ్యే పూర్తి చేసాను.

ఇవి కాక పలు సంస్థల కోసం రకరకాల డాక్యుమెంట్లను తెలుగులోకి అనువదిస్తున్నాను.

SomaSankar2014

  • మీరు అభిమానించే తెలుగు రచయితలు..?

కొకు, కారా, రావి శాస్త్రి, అబ్బూరి ఛాయదేవి, డి. కామేశ్వరి, మల్లాది, యండమూరి, శ్రీ రమణ, సలీం, కె.వి. నరేందర్, వాలి హిరణ్మయి దేవి మొదలైన వారు.

  • ఇక “ముసుగు వేయద్దు మనసు మీద” కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ రాయడం వెనకాల ఉన్న నేపధ్యాన్ని వివరిస్తారా? ఈ కథాంశం ఆధారంగా మీకు కథ రాయాలనే ఊహ ఎలా వచ్చింది?

ఈ కథ చెప్పే కథకుడు నాకు పరిచయం. ఆయన నాకన్నా కనీసం ఏడెనిమిదేళ్ళు పెద్ద. ఓ కన్సల్టింగ్ సంస్థలో అడ్మిన్ అసిస్టెంట్/స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండేది. హైదరాబాద్‌తో పాటు కొన్ని ప్రముఖ నగరాలలో బ్రాంచి ఆఫీసులు ఉండేవి. కొంత కాలం తర్వాత అనుకున్న ఆదాయం రాకపోవడంతో ఆఫీసు ఖర్చులను తగ్గించుకునే నిమిత్తం, కొన్ని బ్రాంచిలను మూసేయ్యాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. దశలవారీగా బ్రాంచీలను తొలగిస్తూ వచ్చింది. హైదరాబాద్ బ్రాంచిని ఎప్పుడు మూసేస్తారో తెలియక, ఈయన చాలా కంగారు పడేవాడు. ఎప్పుడూ దిగులుగా, నిరుత్సాహంగా ఉండేవాడు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా, ఉన్నదాన్నే ఎలాగొలా నిలుపుకోవాలని చూసేవాడు. అతని వ్యక్తిగత సమస్యలు నాకు పూర్తిగా తెలియకపోయినా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నయని మాత్రం తెలుసు. అతని భయాలు, సందేహాలు, బెంగ చాలా కాలం పాటు నాకు బాగా గుర్తుండిపోయాయి. ఆ ఆఫీసు మూసేసారని తెలిసింది, ఆయన ఏమయ్యారో మాత్రం తెలియలేదు. ఉద్యోగ నిమిత్తం నేను కొన్నాళ్ళపాటు హైదరాబాదుకి దూరంగా ఉండడంతో నాకు ఆయన సమాచారం తెలియలేదు. తర్వాత ఈ మధ్య ఇవే లక్షణాలు మా మిత్రుడి అన్నయ్యలో చూసాను. ఆయనదీ స్థిరమైన ఉద్యోగం కాదు. సంసార బాధ్యతలు ఎక్కువ. చేసే ఉద్యోగం నచ్చదు, మనసు పెట్టి పనిచేయలేడు. సో, ఎప్పుడూ డల్‌గా, frustrated stateలో ఉంటూంటాడు.

ఇక కథలోని వీరేశం పాత్రధారిని నేను ఓ బర్త్‌డే పార్టీలో చూసాను. ఆయన ముసలాయనే, కానీ బాగానే ఎగిరాడు. నేను అతనికి లిఫ్ట్ ఇచ్చాను. కథలో జరిగినంత సంభాషణ మా మధ్య జరగలేదు కానీ, టూకీగా ఆయన స్వభావం అదేనని గ్రహించాను.

ఓ రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ దగ్గర ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను. అక్కడున్న బట్టల కొట్ల వద్ద సింహం డ్రెస్ వేసుకుని జనాలని పిలుస్తున్న ఓ వ్యక్తి, ఒక్కసారిగా తల మీద ముసుగు బయటకి తీసి ఆ వేషం వేసుకోవాల్సి వచ్చినందుకు తనని తాను తిట్టుకుంటూ, తన పేదరికాన్ని, కొట్టు యజమానుల్ని దూషించాడు. చాల స్వల్ప సమయంలో జరిగిన ఘటన, కానీ నా మనసులో ముద్ర పడిపోయింది.

మనలో చాలామంది ఆనందంగా ఉండాలనుకుంటాం, కానీ ఉండలేం. ఆనందం/సంతోషం ఎక్కడో బయటి నుంచి రావాలని అనుకుంటూ, ఎప్పుడో వస్తుందని ఊహిస్తూ, ప్రస్తుతం నిరాశలో నిస్పృహల్లో బతుకుతాం. కానీ ఈ మూడు ఘటనలని మేళవిస్తే, ఈ కథకి నేపథ్యం అయింది!

MVMM

  • కేవలం మీరు చూసిన ఒక ఘటన వల్లే కథ ఏర్పడిందా లేక ఇలాంటి వ్యక్తుల్ని మీరు కలిసి, వాళ్ళ వృత్తిపరమైన సాధకబాధకాలు తెలుసుకున్నారా?

ఒకాయన్ని కలిసాను. కాస్త సంభాషణ జరిగింది. ఆయన క్లుప్తంగా చెప్పిన కొన్ని వివరాలతో నేను వీరేశం పాత్రని సృష్టించుకున్నాను. అంతేకాని, కథ రాద్దామనే ఉద్దేశంతో ఆయనతో సంభాషించలేదు. ఆయనని కలిసినప్పుడు కథ రాయాలన్న ఉద్దేశమే లేదు. తర్వాత ఎప్పుడో తట్టిన ఆలోచన ఈ కథ.

ఆ పాత్రకి ఎదురైన కొన్ని సంఘటనలు మా ఆఫీసు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేసి తరచూ మానేసే వ్యక్తులకి ఎదురైనవే. ఇంకా కొందరు వ్యక్తులకి ఎదురైన చిన్న చిన్న ఘటనలను ఈ కథలో ఒకే పాత్రకి ఎదురైనట్లుగా చూపాను.

  • మీ కథలో ప్రస్పుటంగా కనిపించిన మంచి లక్షణం క్లుప్తత. ఇది అంత తేలికైన విషయం కాదు. ఇది రావాలంటే కథని చాలా సార్లు ఎడిట్ అయినా చేసుకోవాలి, లేదా కథని రాసే ముందే కథ తాలూకు సంపూర్ణ స్వరూపం రచయిత మనసులో రూపు దిద్దుకోవాలి. ఈ రెండు విధానాల్లో మీరు ఏది ఆచరిస్తారు?

సాధారణంగా, ఒక ఇతివృత్తం/ఘటనని ఆధారం చేసుకుని కథ రాయాలని అనుకున్నప్పుడు మొదట కథా స్వరూపం అంతా, సంభాషణలతో సహా, మనసులోనే రూపొందుతుంది. నేను రాద్దామనుకున్న అంశానికి ఓ రూపు వచ్చింది అనుకున్నాకనే, అది కంప్యూటర్ తెర మీదకి వస్తుంది. మొదటినుంచి నాది ఇదే పద్ధతి. కథని టైప్ చేసుకున్నాక, అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులూ చేసుకుంటాను.

  • ఈ కథ రాయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది?

నేను సొంత కథలు చాలా తక్కువగా రాస్తాను. అనువాదాలు చేసినంత వేగంగా సొంత కథలు రాయలేను.

అది నా బలహీనత. ఈ కథ మనసులోంచి కంప్యూటర్ స్క్రీన్ మీదకి రావడానికి సుమారు పది రోజులు పట్టింది. కానీ ఒకసారి టైప్ చేసాక, రెండే మార్పులు చేసాను.

  • కొంత అనిశ్చితితోనూ, దాన్నుంచి ఉద్భవించే అశాంతితోనూ జీవించే మనుషుల మనసులని మీ కథ తాకడం, ఒక కొత్త ఉత్తేజాన్ని వాళ్ళలో నింపడం అనే ప్రయోజనాన్ని మీ కథ సాధించినట్టు మా బృందం అనుకోవడం జరిగింది. కథ అనేది ఒక కొత్త ఆలోచననో, కొత్త ఉత్తేజాన్నో, కొత్త స్ఫూర్తినో ఇవ్వాలని మీరు భావిస్తారా? లేక, కేవలం ఒక తాత్కాలికమైన అనుభూతినో అనుభవాన్నో కలగజేసే కథలని కూడా మీరు సమర్ధిస్తారా?

ప్రతి కథకీ వ్యక్తంగానో, అవ్యక్తంగానో ఓ లక్ష్యం ఉంటుంది, ఉద్దేశిత పాఠకులు ఉంటారు. కొన్ని కథలు వినోదాన్ని, హాస్యాన్ని పంచితే, మరికొన్ని ఆలోచనల్ని రేకిత్తించి, ఉత్తేజితులని చేస్తాయి. కొన్ని కథలు గతంలో జరిగిన దారుణాలను గుర్తు చేస్తే, మరికొన్ని సమాజిక సమస్యలని ప్రస్తావిస్తాయి. మీరన్నట్లుగా కొన్ని కథలు అనుభూతిని, అనుభవాన్ని కలిగిస్తాయి. అవీ అవసరమే. కొన్ని కాలక్షేపం కథలుంటాయి. దేని ప్రయోజనం దానిదే. సాహిత్యం నుంచి ప్రేరణ, స్ఫూర్తి పొందడం ఆయా పాఠకుల అభీష్టం. పుస్తకంలోని పేజీలను గబగబా తిప్పేయచ్చు, లేదా జీర్ణం చేసుకుని, తమకు అన్వయించుకుని ఆచరించనూవచ్చు. సమస్యలకి పరిష్కారం చెప్పడం రచయితల పని కాదు, సమస్యలని ఎదుర్కోడానికి, ప్రేరణనిచ్చి, ఆలోచన రేకిత్తంచగలిగితే చాలు! ఎందుకంటే కథాపరంగా రచయిత సూచించే పరిష్కార మార్గాలు నిజజీవితంలో వర్తించకపోవచ్చు… కానీ సమస్యలో ఉన్నవారికి కొత్తగా ఆలోచించడానికి అవకాశం మాత్రం తప్పకుండా కల్పిస్తాయని నా నమ్మకం.

  • మీరు రాసిన ఏదైనా ఒక కథని,‘మంచి కథ’ అనుకోవడానికి మీరు ఏ ఏ ప్రమాణాలు అవసరం అనుకుంటారు? లేదూ,‘మంచి కథ’ అంటే మీ దృష్టిలో ఏది?

2014 మార్చి నెల కథలను సమీక్షించే సందర్భంలో మీరే అన్నారు, మంచి కథని నిర్వచించడం కష్టమని.   నా దృష్టిలో నేను రాసే ప్రతీ కథా మంచికథే. ఉద్దేశపూర్వకంగా సమాజానికి చెడు చేయని రచన ఏదైనా మంచిదే. రాసేటప్పుడు ప్రతీ కథ మంచి కథ అనుకునే రాస్తాను. కాకపోతే, ప్రెజంటేషన్‌లో, ట్రీట్‌మెంట్‌లోనూ తేడాలు వస్తే అది పాఠకులకు నచ్చకపోవచ్చు. పాఠకులకు నచ్చిన కథలు విమర్శకులకి నచ్చకపోవచ్చు. కాబట్టి వాదప్రతివాదాలకు దూరంగా, రాయాలనుకున్నది రాసుకోడమే నా పద్ధతి. నేను రాసినవి కొందరికైనా నచ్చుతాయని నా నమ్మకం. నా మటుకు నాకు కథా వస్తువు బాగుండాలి, సన్నివేశాల కల్పన బాగుండాలి, సంభాషణలు బాగుండాలి. ఇవన్నీ కలిస్తే, అది తప్పకుండా మంచి కథే అవుతుందని నా అభిప్రాయం. పాఠకులని చదింవించేలా, చదివిన తర్వాత ఆలోచించేలా కథ రాయగలిగితే అది మంచి కథే అవుతుందని ఓ రచయితగా నా అనుభవం.

* అనువాదాలు చేయడం ఒక రచయితగా మీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? ఒక రచయితగా మీరు స్వతంత్రంగా నిలబడడానికి ఈ అనువాదాల అనుభవం ప్రతిబంధకమయిందా, లేక సహాయపడిందా?

అనువాదాలు చేయడం, ఓ రచయితగా నా మీద తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. రచయితగా స్వతంత్ర్యంగా నిలబడానికి ఓ రకంగా ప్రతిబంధకమైంది, మరో రకంగా సాయపడింది. అనువాదాల కంటే సొంత కథ రాయడమే కష్టం నాకు. అనువాదాలలో ఇతివృత్తం, సన్నివేశాల కల్పన, సంభాషణలు ఇవన్నీ రెడీమేడ్‌గా ఉంటాయి. కథలోని మూడ్‌ని పట్టుకుని, కథకుడి టోన్‌ని పట్టుకుంటే చాలు. తెలుగులో చక్కని కథ సిద్ధమవుతుంది. భావం చెడగొట్టకుండా, కథని మన భాషలో చెబితే చాలు. ఆల్రెడీ, ఒక చోట ప్రూవ్ అయిన కథ కాబట్టి, ఇక్కడా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సొంత కథల విషయంలో సంభారాలేవీ సిద్ధంగా ఉండవు, అన్నీ మనమే సమకూర్చుకోవాలి. పూర్తయ్యకా గాని, ఎలా ఉంటుందో తెలియదు. మధ్య మధ్యలో రుచి చూస్తూ, సవరించుకోవచ్చుగానీ, ఆలస్యం అయిపోతుంది. ఈ కారణం వల్లే నేను రాసిన సొంత కథల సంఖ్య, చేసిన అనువాదాల సంఖ్యలో సగం కూడా లేదు.

ఇక అనువాదాలు చేయడం వల్ల కల్గిన ఉపయోగాలు: కథని క్రిస్ప్‌గా చెప్పగలగడం; సంభాషణలను, క్లుప్తంగా, ఎఫెక్టివ్‌గా రాయగలగడం; కథనాన్ని కొత్త రీతిలో నడపడం వంటివి. అయినా రచయితగా/అనువాదకుడిగా నాది ఇంకా ఇవాల్వింగ్ స్టేజే, కథారచనలో నాకు పూర్తి నైపుణ్యం రాలేదని నా భావన. రాస్తూ వుంటే మెరుగవుతాము.

  • ఇప్పటి వరకు ఎన్ని కథలు రాశారు మీరు? మీ కథాసంపుటిని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

ఇప్పటి వరకు 29 సొంత కథలు (పిల్లలు కథలు కాకుండా), 95 అనువాద కథలు రాసాను.

నా సొంత కథల సంకలనం “దేవుడికి సాయం” త్వరలోనే వెలువడుతుంది. ముందుగా ఈ-బుక్, వీలుని బట్టి ప్రింట్ బుక్!

నా అనువాద కథలతో 2006లో “మనీప్లాంట్” అనే పుస్తకాన్ని ప్రచురించాను. ఆ తర్వాత, “నాన్నా, తొందరగా వచ్చేయ్” అనే అనువాద కథల ఈ-బుక్‌ని, “వెదురు వంతెన” అనే అనువాద కథల మరో ఈ-బుక్‌ని ప్రచురించాను.

  • మరోసారి అభినందనలు అందజేస్తూ, మీరు ఇలాంటి మరిన్ని మంచి కథలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు, సోమశంకర్ గారూ!

నా కథను ఉత్తమ కథగా గుర్తించినందుకు, ఈ ఇంటర్వ్యూ రూపంలో, నా గురించి పాఠకులకు తెలుపుతున్నందుకు మీకు, సారంగ పత్రికకి మరో సారి ధన్యవాదాలు. నమస్కారం.

(కథ చిత్రం: గురుచైతన్య, కినిగె పత్రిక సౌజన్యం)

శిల్పం మీద మరీ ఎక్కువ ధ్యాస పెడ్తున్నామా?!

2 (1)

ముందుమాట

ముచ్చటగా మూడో నెలలోకి వచ్చాక ఇప్పుడు ముందుమాటేమిటని ఆశ్చర్యపోకండి. మంచో చెడో మూడు నెలలు గడిచాయి. చాలా వరకు మా శ్రమని గుర్తించి వచ్చిన అభినందనలు, అడపాదడపా కథల గురించి విమర్శలు వచ్చాయి. మమ్మల్ని తిట్టే వాళ్ళు ప్రైవేటుగా తిట్టారు. కారణాలు రెండు – ఒకటి మేము చేస్తున్నది గడ్డిమేటలో సూదిని వెతకడమనీ, రెండోది చివరికి ఇది గొంగలిలో అన్నం తింటూ వెంట్రుకలు వచ్చాయని తిట్టుకునే పరిస్థితికి దారి తీస్తుందని. తెలుగు కథలో మంచి కథలు గగన కుసుమాలని చాలా మంది అభిప్రాయం. మేము ఆ అభిప్రాయాన్ని సగౌరవంగా తిరస్కరిస్తున్నామని చెప్పడానికే ఈ ముందుమాట.

విషయానికి వద్దాం. ఈ మూడు నెలలలో మేము చేతనైనంత వరకు అన్ని కథలు చదవాలనే ప్రయత్నం చేశాము. బ్లాగులు, ఒక ప్రాంతంలో మాత్రమే దొరికే పత్రికలు మినహాయించి అందిన ప్రతి కథా చదివాము. వీటిని ఏ ప్రాతిపదికన విశ్లేషించి, మంచి ముత్యాలను వెలికి తీయాలని అన్న విషయంలో మాలో మాకు చాలా చర్చలు జరిగాయి. అవగాహన కుదిరాక, ప్రతి కథని విశ్లేషించేందుకు వీలైయ్యేట్లుగా ఒక మూల్యాంకనా విధానాన్ని తయారు చేసుకున్నాం. సబ్జెక్టివ్ గా ఉండగలిగిన విషయాలని చర్చకు పెట్టి, తద్వారా ఆ అంశ ప్రభావాన్ని చాలా వరకు నియంత్రించే ప్రయత్నం జరుగుతూ వస్తోంది. ఆ వివరాలన్నీ మరోసారి చెప్పుకుందాం. ఈ మూడు నెలలలో మేము గమనించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మననం చేసుకుందాం.

స్థూలంగా నూటాయాభై కథలు ప్రతి నెలా తెలుగుసాహిత్యంలో వచ్చి కలుస్తున్నాయి. ఏ రకంగా చూసినా ఇది చాలా ఆనందదాయకమైన సంఖ్య. అందులో పది మంచి కథలను వెతకటం మాకు ఏమంత కష్టం కూడా కావటంలేదు. ఇంకొంచెం ముందుకెళ్తే, మంచి కథలు కాకపోయినా మరో పది దాకా కథలలో ఏదో ఒక మంచి అంశం వుండటం వల్ల (వస్తువో, శిల్పమో మరొకటో) ఇక్కడ ప్రస్తావించగలిగినవిగా ఉంటున్నాయి. ఇక ఆ పైన ఇక మంచి కథ దొరకడం కష్టంగా వుంటోంది. మరో రకంగా చెప్పాలంటే నూటాయాభై కథలలో సుమారు పదిహేను నుంచి ఇరవై మంచి కథలు వస్తున్నాయి. (మంచి నిర్వచనం కాస్సేపు పక్కన పెడదాం). అయితే ఇవన్నీ అద్భుతమైన కథలేనా అంటే ఒప్పుకోవడం కష్టం. కొన్ని కథలు వస్తుపరంగా గొప్పవిగా వుండి శిల్పంలోనే, నిర్మాణంలోనో, సమకాలీనతలోనో కుదేలౌతున్నాయి.

మరి కొన్ని కథలు కేవలం పదాడంబరమూ, శైలీ, శిల్పాలమీద ఎక్కువగా ఆధారపడి, వస్తువును విస్మరిస్తున్నాయి. ఈ రెండవ రకం క్రమంగా పెరుగుతున్న ట్రెండ్ గా కనిపిస్తున్నప్పటికీ, ఇదో కొత్త మలుపుగా గుర్తించడానికి ఇంకొంచం సమయం పట్టవచ్చు. ఈ ట్రెండ్ మరీ ముఖ్యంగా వెబ్ పత్రికల్లో కనపడుతోంది. రైతులు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, లాంటి కథాంశాలు ఇప్పటికీ కథలలో సింహభాగాన్నిఆక్రమిస్తున్నాయి. కానీ, చాలా కోణాల్లోంచి ఇప్పటికే చర్చించబడ్డ ఆ వస్తువుల్లోంచి ఎలాంటి నవ్యతనైనా రాబట్టడంలో మాత్రం ఎక్కువ కథలు విఫలమవుతున్నాయి. వాటితో పాటుగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, గ్లోబలైజేషన్/కన్సూమరిజం, అస్తిత్వవాదం, ఉద్యోగాలలో స్త్రీలు, కార్పొరేట్ ప్రపంచంలోని నీలి నీడలు – ఇలాంటి వైవిధ్యమైన, సమకాలీనమైన కథలు కూడా వస్తున్నాయి! ఆయా వర్గాల గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి!

పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల వాళ్ళ వృద్ధాప్యంలో సంతానం చూపే నిర్లక్ష్య ధోరణి కథా వస్తువుగా ఎక్కువ మంది రచయితలు/రచయిత్రులు స్వీకరించడం కనిపిస్తోంది. ఇంక రసం ఏ మాత్రం మిగలని ఈ చెరుకుగడని వదిలేసి కొత్త సమస్యల వైపు తెలుగు కథ దృష్టి సారిస్తే కథలకి మరింత వైవిధ్యం సమకూరుతుందేమోనని మా అభిప్రాయం. అలాంటి కథలే రాయాలనుకున్నా – కనీసం “పరువు” (వాణిశ్రీ, ఆంధ్రభూమి మాసపత్రిక, మార్చ్ 2014) లాంటి కథల్లో ప్రయోగించిన నవ్యతనైనా ప్రదర్శించగలగాలి.

చాలా కథలు పూర్తిగా అపరిపక్వ స్థాయిలో కనిపిస్తున్నాయి. అసలు ఇవి కథలేనా అని శంకించాల్సిన పరిస్థితి! వాటిని చదివిన పాఠకులుగా మా అభిప్రాయం లేదా అనుమానం – కొంత మంది రచయితలు/రచయిత్రులు కథ రాసిన వెంటనే పత్రికలకి పంపిస్తున్నారేమోనని. మా దృష్టిలో ఏ కథకూ మొదటి సారి రాసిన వెంటనే సమగ్ర స్వరూపం సిద్ధించదు. రాసిన తర్వాత రాసిన వాళ్ళే ఒకటికి రెండు సార్లు తమ రచనని తామే పాఠకులుగా మారి చదివితే రచనలో లోపాలు వాళ్ళకే స్ఫురిస్తాయి. ఒక అనవసరమైన వర్ణన, ఇతివృత్తానికి అనవసరమైన ఒక సంఘటన, చెప్పదలుచుకున్నదంతా చెప్పిన తర్వాత ముగింపు దగ్గరకొచ్చేసరికి అనవసరం అనిపించే పొడిగింపు – ఇలాంటివి. అవి సరిచేసి ప్రచురణకి పంపటం వల్ల మంచికథ రాసిన తృప్తి రాసినవాళ్ళకీ, చదివిన తృప్తి పాఠకులకీ కనీసం కొన్ని కథల విషయంలోనైనా పాఠకులకి దొరుకుతుంది.

 

మార్చి కథలు

ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చ్ నెల కొంతవరకు సంతృప్తికరంగా ఉంది. అయితే, బాగున్న కథలు మాత్రం పరిమితంగానే ఉంటున్నాయి. ముందుగా – టాప్ పది కథలలోకి దాదాపు చేరబోయి అడుగు దూరంలో ఆగిపోయిన కొన్ని కథలను గురించి –

ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్ మీద (స్వాతికుమారి బండ్లమూడి, ఈమాట), అనగనగా ఒక రాత్రి (పూర్ణిమ తమ్మిరెడ్డి, ఈమాట), మనిషివిత్తనం (వి. ప్రతిమ, చినుకు), నడుస్తున్న చరిత్ర (ఆదెళ్ళ శివకుమార్, గో తెలుగు 23 మార్చ్), పౌరుషం (సతీష్ పోలిశెట్టి, కినిగె పత్రిక) – ఈ ఐదు కథలలోనూ శిల్పపరంగానో, వస్తుపరంగానో చెప్పుకోదగ్గ విషయాలు వున్నాయి. మొదటి నాలుగు కథలలో శిల్పం చాలా గొప్పగా వున్నప్పటికి ఇతర విషయాలలో నిరుత్సాహపరిచాయి.

“ఒక ఆదివారం..” కథలో రచయిత్రి స్వగతం ఒక ప్రవాహంలా సాగిపోయింది కానీ ఆగి చూస్తే అందులో కథ చాలా పల్చగా వున్నట్లు తోచింది. అలాగే “అనగనగా..” కథలో కూడా ఒక ఫోక్ లోర్ లాంటి కథను అన్వయం చేస్తూ ఓ స్త్రీ కథ చెప్పే ప్రయత్నంలో కొన్ని విషయాలు స్పష్టపరచకపోవడం వల్ల కథ అసమగ్రంగా వున్నట్లు అనిపిస్తుంది. “నడుస్తున్న చరిత్ర” కథ చదవడానికి బాగున్నా దానిని కథగా అంగీకరించవచ్చా అన్నదే పెద్ద ప్రశ్న (ఇలాంటిదే “గింజలు” – ఆరి సీతారామయ్య, సారంగ 13 మార్చ్ కూడా) . ఆ ప్రశ్నపక్కనపెట్టి పరిశీలిస్తే ఎన్నెన్నో సంబంధిత సంఘటనలను తెచ్చి ఒకే కథలో పెట్టాలనుకోవడమనేది కధకు ఉండాల్సిన క్లుప్తత అనే స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. “మనిషివిత్తనం” చాలా చర్చకు అవకాశం ఇచ్చే కథ. సంతానం కోరుకుంటున్న భర్త లోపాన్ని తెలుసుకోని, అందుకు అక్రమసంబంధం పెట్టుకోవడం కథాంశం. ఇందులో ఆ స్త్రీకి పరాయి వ్యక్తి పైన ప్రేమ వున్నట్లు చెప్పినా, ఒక సమస్యకి ఇలాంటి ఆమోదయోగ్యం కాని పరిష్కారం ఇవ్వడం సబబుకాదేమో ఆలోచించాల్సిన విషయం. ప్రేమ, నైతికానైతికాలు, జీవితం – ఇత్యాది విషయాలు కూడా కథలో సంతృప్తికరంగా చోటుచేసుకున్నట్లయితే, ఇది మంచి కథ అయి ఉండేది. అయితే ఈ కథను ద్వితీయ పురుషలో ప్రతిభావంతంగా రాయడం వల్ల పఠనానుభూతి బాగుంది. “పౌరుషం” కథ వస్తువు పరంగా బానేవున్నా, కొన్ని చోట్ల దారి తప్పటం, హడావిడి ముగింపు వల్ల అందుకోదగ్గ ఎత్తుకు ఎదగలేదు.

ఈ నెలలో వచ్చిన మంచి కథలు అన్నింటినీ కలిపి వ్యాఖ్యానం చేసే బదులు ఒక్కొక్క కథను విడిగా విశ్లేషించాలని అనుకున్నాము. విశ్లేషణ ఒక్కో కథకీ విడివిడిగా చేయడం వల్ల కథలు చదవదలచుకున్నవాళ్ళకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది అని కొంతమంది పాఠకులు చేసిన సూచన మేరకు ఈ పనిని కూడా చేపట్టాం. ఈ పని చేస్తున్న మేము ముగ్గురం మేధావులమనో, గొప్ప విశ్లేషకులమనో కాక కాస్త తెలివిడి ఉన్న పాఠకుల చర్చలోని సారాంశాన్ని పొందుపరుస్తున్నామని ఈ వ్యాసం చదువుతున్న రచయితలు, పాఠకులు గుర్తించగలరు!

తప్పు – పి. రామకృష్ణ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 2 మార్చ్):వివాహానికి ముందే శృంగారం వల్ల నెల తప్పిన ఒక స్త్రీ భావ సంచలనం. తప్పు జరిగింది. తప్పు ఏ పరిస్థితుల్లో జరిగిందో, అది జరిగాక అబ్బాయి ప్రవర్తనా, సంస్కారం ఏ పాటి ఉన్నాయో తనకి తెలుసు. ఈ ఆలోచనల్లోనే, ఆమెకు ఆ చిన్న ఇంట్లోనే రెండు ప్రపంచాలు ఉన్నట్టు అర్థమయ్యింది. “అడుసు తొక్కినప్పుడు కాళ్ళు కడుక్కోవాలిగానీ నరుక్కోకూడదు కదా!” అనే ఒక గొప్ప వాక్యంతో కథ ముగుస్తుంది. జ్యోతి పాత్ర అంతరంగ చిత్రణా, ‘ఆప్యాయతలు వెల్లివిరుస్తున్నాయి’ అనుకునే ఇంట్లో మనుషుల ఆలోచనల మధ్య వైరుధ్యాలూ ఇవన్నీ చాలా అద్భుతమైన స్థాయిలో చిత్రింపబడ్డ కథ. అయితే, ఇది ఎందుకో ఒక కథ రూపాన్ని సంతరించుకోలేకపోయింది. దీనికి కారణం – రచయిత ముగింపు వాక్యం మీదే ఆధారపడటం తప్పించి కథలోంచి ఏ విశేషమూ బయటపడకపోవడం కావచ్చు.

చెలికాడు – అలపర్తి రామకృష్ణ (స్వాతి వీక్లీ, 14 మార్చ్):ఉద్యోగం చేస్తున్న భార్య, ఉద్యోగం వదులుకున్న భర్త. ఈ పరిస్థితుల్లో భర్త చేసేవన్నీ పనికిమాలిన పనులలాగా, ఖర్చుదారీ వ్యవహారాల్లాగా, అతని ఆత్మవిశ్వాసం అనవసరమైన పొగరులాగా భార్యకి కనిపిస్తూ ఉంటాయి. కానీ అతను మాత్రం మారడు. అదే చిరునవ్వూ, అదే ప్రేమ, అదే నిజాయితీ, అదే కన్సర్న్. కథ చివర్లో అతనికి ఇంకొంచెం మంచి ఉద్యోగం రావడం అనేది కొంచెం నాటకీయమూ, కొంచెం యాదృచ్ఛికమూ అయినప్పటికీ – అతని పాత్రని చిత్రించిన తీరు మాత్రం ప్రశంసార్హం.

నమూనా బొమ్మ – బి. రమాసుందరి (తెలుగు వెలుగు, మార్చ్):“నీ మీద నేను జాలి పడగలిగిన పరిస్థితుల్లో నువ్వున్నంత కాలం నీ మీద నాకు అభిమానం ఉంటుంది. ఆ పరిస్థితుల్లోంచి నువ్వు ఏ మాత్రం ఎదిగినా నువ్వంటే ఏవగింపు కలుగుతుంది” – అన్న కోణాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించిన కథ. సునిశితమైన పరిశీలన, కథనం మీద నియంత్రణం ఉన్న రచన. పాత్రల ప్రవర్తనలో అంతరార్థాన్ని సూచనప్రాయంగా చెప్పడం, భావాల్ని వ్యక్తీకరించడానికి వాడుకున్న వినూత్న ప్రతీకలు రచయిత్రి నేర్పుని తెలియజేస్తాయి. అయితే, కథ ముగిసిన తరువాత కూడా మరి కొంచెం సాగడం వల్ల ముగింపు బలహీనపడింది.

రచ్చబండ తీర్పు – డా. జి.వి. కృష్ణయ్య (చతుర, మార్చ్):మంచి కథ. నిడివి కొంచెం ఎక్కువేమో అన్న సందేహం వచ్చినా, కథ నడిపిన తీరు దాన్నిమర్చిపోయేలా చేస్తుంది. అట్టడుగు వర్గం మహిళని బలాత్కారానికి గురైతే, ఆ విషయం రచ్చబండకి రావడం కథాంశం.అది కేవలం “పిల్లల తప్పు” కింద భావించిన పెద్దలు ఓ అయిదువేలు నష్టపరిహారం ఇచ్చిన తీర్పుని గర్హిస్తూ బాధితురాలి భర్త “ఆ డబ్బు తీసుకొని మా ఆడోళ్ళ మానానికి వెలకట్టలేం. రేపొకరోజునమదమెక్కిన మగోడల్లా వచ్చి మా ఆడోళ్ళ రేటడుగుతాడు. అదింకా సిగ్గుమాలినతనం” అన్న మాటలు అన్యాయపు తీర్పుల్నీ, ఆడవాళ్ళంటే గౌరవంలేని పెద్దల్నీ, అలాంటి పెద్దలు నిర్వహించే రచ్చబండల్నీ – అన్నింటినీ ప్రశ్నిస్తాయి. రచయిత కథ నిడివి పట్ల ఇంకొంచెం శ్రద్ధ వహించగలిగి ఉంటే బాగుండేది.

బల్లిఫలితం – వేమూరి వెంకటేశ్వరరావు (ఈ మాట, మార్చ్): తెలుగులో అరుదుగా వచ్చే వైజ్ఞానిక కాల్పనిక రచన. ఇలాంటి కథలను మిగతా కథలను కొలిచినట్లు కొలిచి చూడలేము. సమకాలీనత, సామాజికత వంటి అంశాలు వుండకపోవచ్చు. కేవలం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కానీ ఈ కథ అలా చూసినా నిలబడుతుంది. సైన్స్ వెర్సస్ నమ్మకాల విషయంలో కథ ఎలా రాయబడాలో అలానే రాయబడింది – మంచి ఎత్తుగడ. బిగువైన కథనం. ముగింపులో చమత్కారం! గోపాలకృష్ణ వంటి అనవసరపు పాత్రలు, వివరాలను ఇంకొంచెం తగ్గించి ఉంటే కథలో గందరగోళం కొంచెం తగ్గి, చదువుకోవడానికి మరికొంచెం బాగుండేది.

పెద్దరికం అంటే – గంటి భానుమతి (ఆంధ్రభూమి మాస పత్రిక, మార్చ్): ఉరుకులు పరుగుల మధ్య తల్లిదండ్రుల దగ్గర్నుంచి సరైన అటెన్షన్ దొరకక ఏకాంతాల్లోకి దిగజారుతున్న కూతురి కథ. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సరైన దృక్పథం, ఉత్తరోత్తరా తల్లిదండ్రుల పట్ల గౌరవం ఇవన్నీ తల్లిదండ్రుల పెంపకంలో నుంచే వస్తాయి. ఇది ప్రస్తుత సమాజానికి చెప్పాల్సిన కథ. సమస్య మూలాల్లోకి వెళ్ళిన కథనం, ఒక అంగీకారయోగ్యమైన పరిష్కారం దిశగా కథ మళ్లింపు ప్రతిభావంతంగా వున్నాయి. నిడివి, తల్లి పాత్ర చిత్రణలో నాటకీయత మినహాయిస్తే ఇది మంచి కథ.

విషయవలయాలు – జి. ఉమామహేశ్వర్ (సాహిత్య ప్రస్థానం, మార్చ్): అర్థరాత్రి న్యూస్ ఛానల్లో ప్రసారమయ్యే అశ్లీల కార్యక్రమాలను చాటుగా చూసే కొడుకుని చూసి బాధపడే తల్లి కథ. చాలా సున్నితమైన, సమకాలీనమైన సమస్య. టీవీ ఛానెల్ వాళ్ళని ప్రమీల కలవటం లాంటి అనవసర సన్నివేశాలు నిడివిని పెంచాయి. ఇలాంటి కథలకు ప్రత్యేకంగా ముగింపు అంటూ ఉండదు కాబట్టి, కథ ముగిసే సమయానికి పైన చెప్పిన క్లుప్తతా రాహిత్యం వల్ల బలహీనపడి, మంచి వస్తువు అయివుండీ పాఠకుల మనస్సులో బలంగా నాటుకోదు.

 గౌతమి – రాధా మండువ (ఈ మాట, మార్చ్):తెలిసీ తెలియని వయసులో ప్రేమ-ఒక అమ్మాయి వైవాహిక జీవితంపై దాని ప్రభావం. ఇదీ వస్తువు. పాత్ర చిత్రణలో కథనంలో భాషా పరంగా ప్రతి వాక్యంలో రచయిత్రి ప్రతిభ కనపడుతోంది. కాకపోతే కథానాయక పిచ్చిదానిలా నటించడం, భర్త మితిమీరిన మంచితనం కథని వాస్తవానికి దూరంగా తీసుకెళ్తుంది. కథా రచనలో గుర్తించదగిన ప్రావీణ్యం ప్రదర్శించిన రచయిత్రి ఇతివృత్తంలో ఈ loose ends వైపు దృష్టి పెట్టివుంటే బాగుండేది.

సందల్ ఖోడ్ – ఇబ్రహీం(ఆదివారం ఆంధ్రజ్యోతి, 23 మార్చ్): కనిపించని గంధపుచెక్కని వెతకడం కథాంశం. అంతేనా అంటే అంతమాత్రమే కాదు. కుటుంబం కోసం అహర్నిశలూ శ్రమించే తల్లి, గుర్తించని తండ్రి, ఈ రెండూ గుర్తించిన కొడుకు. హృద్యమైన కథ, అందమైన కథనం, అమ్మ గొప్పదనాన్ని చాలా లలితంగా మరోసారి చెప్పిన సందర్భం. కుటుంబ సభ్యులందరికీ అహర్నిశలూ సేవ చేస్తూ తాను గంధపు చెక్కలా కరిగిపోతూ తన వాళ్ళకి జీవన పరిమళాలని అద్దిన తల్లి. తాను పగలంతా వెతికినా దొరకని గంధపు చెక్కని తన తల్లిలో కొడుకు చూసుకోగలగటం కథ ముగింపు. అనుభూతి ప్రధానమైన కథ అన్నది మామూలు సందర్భాల్లో ప్రశంస గానూ, నాలుగు కథల మధ్యనుంచి దాన్ని ఎన్నుకోవడానికి పరిమితిగానూ పరిణమిస్తుంది. అలాంటి పరిమితులు నిజానికి తాత్కాలికమే – కొన్నేళ్ళ తర్వాతయినా ఎవరైనా అమ్మ మీద మంచి కథని ఒకటి చెప్పండీ అంటే, మనం అందరం “ఇబ్రహీంగారు రాసిన సందల్‌ఖోడ్ ఉందండోయ్!” అని మనస్ఫూర్తిగా చెప్పేయవచ్చు!

ముసుగు వేయొద్దు మనసుమీద – కొల్లూరి సోమశంకర్ (కినిగే పత్రిక, మార్చ్): అరిచి చెప్పినంతమాత్రాన బలంగా చెప్పినట్టు కాదు. కథల విషయంలో అయితే, ఎంత చెప్పీ చెప్పనట్టుగా చెబితే, ఆ విషయానికి అంత పదును. ఈ సూత్రాన్ని చాలా ఎఫెక్టివ్ గా తన కథలో వాడిన రచయిత కొల్లూరి సోమశంకర్. నిరంతరం మారిపోతూ ఉన్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో పాత తరానికి చెందిన కొందరు పరిగెత్తలేక, శక్తిసామర్ధ్యాలు లేక వెనకబడిపోవడం, ఉన్న ఉద్యోగం ఉంటుందా ఉండదా అన్న అనిశ్చితితో, అవమానంతో లోపల్లోపలే కుమిలి కమిలిపోవడం నేటి వాస్తవం. అలాంటి ఒక వర్గాన్ని పట్టుకోవడమే రచయిత వస్తువు పట్ల ప్రదర్శించిన ప్రతిభ. అంతే కాకుండా, ఆ వర్గ ప్రతినిధిని రోజువారీ కూలికి రకరకాల జంతువుల ముసుగులు వేసుకొని పిల్లలకి వినోదం కలిగించే వీరేశానికి పరిచయం చేసి, ఇద్దరి జీవితాల అనిశ్చితుల మధ్యా పోలిక తీసుకువచ్చి – జీవితం పట్ల ఉన్న ఆశ, పాజిటివ్ దృక్పథం జీవితాన్ని వెలిగించడానికి సరిపోతాయీ అన్న చిన్న సూచనతో కథ ముగించడం – చాలా బాగుంది. కథ చదివే పాఠకుడిలో సమస్య పట్ల సానుభూతి కలిగించే దిశగా ఎలాంటి వాక్యాలూ కనిపించవు. క్లుప్తత. ఒక్కరోజు సాయంత్రం జరిగే కథ. కథా ప్రారంభంలో అసంతృప్తితో పరిచయమయిన పాత్ర, “లైఫ్ అన్నాక ఫైట్ చేయాలి కదా” అని లైవ్లీగా మాట్లాడే వీరేశంల మధ్య భిన్నత్వం. పరిష్కారం దిశగా ఒక ఆశావహమైన ముగింపు. ఇవీ ఈ కథను నిలబెట్టిన అంశాలు.

ఈ మాసం ఉత్తమ కథగా ఎన్నుకోవడంలో “సందల్ ఖోడ్”, “ముసుగు వేయద్దు మనసు మీద” ఈ రెండింటినీ పరిశీలించాము. సమగ్రంగా జరిగిన చర్చలోని సారం స్థూలంగా చెప్పాలంటే – “సందల్ ఖోడ్” ఒక అనుభూతిని మాత్రమే ఇస్తే, “ముసుగు వేయద్దు..” ఒక ఆచరణీయమైన సందేశాన్ని ఇస్తోంది. అందువల్ల ప్రయోజనకరమైన కథాంశంతో, వస్తువు-శిల్పం-కథనాల మధ్య మంచి సమతుల్యతతో నడిచిన “ముసుగు వేయద్దు మనసు మీద” కథను ఈ మాసం ఉత్తమ కథగా నిర్ణయించాము.

 

ఉత్తమ కథ: ముసుగు వేయొద్దు మనసు మీద

రచయిత: కొల్లూరి సోమశంకర్

ప్రచురణ: కినిగే పత్రిక, మార్చ్-2014

 

సోమశంకర్ గారితో ఇంటర్వ్యూని తరువాతి భాగంలో ప్రచురిస్తాము!

 

కొసరు మెరుపు

పాతకథలని ప్రచురించే సంప్రదాయాన్ని తెలుగు వెలుగు, స్వాతి (మాస), గోతెలుగు.కామ్, విపుల వంటి పత్రికలు పాటిస్తున్నాయి. స్వాతి మాసపత్రికలో వచ్చిన “శత్రువు” (చలసాని ప్రసాదరావు),“గోతెలుగు.కామ్” 14.03.2014 సంచికలో వచ్చిన వెయిటింగ్ ఫర్ యాద్గిరి (భగవంతం) చదవదగ్గ కథలు. ఇవి కాక,మేఘాపహరణం (మాలతీచందూర్),మేలుమరువని కన్నీరు (కవికొండలవెంకటరావు),వారసత్వం (చొప్పదండి సుధాకర్),వెలుగు-నీడలు (ఇంద్రగంటిహనుమచ్ఛాస్త్రి),సుఖం (కె వి ఎస్ వర్మ) కథలు కూడా ప్రచురింపబడ్డాయి.

 

ఫిబ్రవరి: హాస్య కథల హవా!

 2 (1)

 

 

[ఫిబ్రవరి కథలలోకి వెళ్ళే ముందు ఓ చిన్నమాట. జనవరి నెల కథల పరిశీలనలో రెండు మంచి కథలు మా దృష్టిని దాటిపోయాయి. అవి – హిట్లర్ జ్ఞాపకాలు (డా. వి. చంద్రశేఖరరావు, పాలపిట్ట), చావుదేవర (రమాసుందరి, పాలపిట్ట). “హిట్లర్ జ్ఞాపకాలు” లేయర్డ్ గా సాగే కథనంతో కాలేజీ కేంపస్ లోని రాజకీయాలను పరిచయం చేస్తే, “చావుదేవర” సొగసైన ఒంగోలు మాండలికంలో సాగిన ఇద్దరాడవాళ్ళ కథ. రెండింటిలోనూ ప్రతీకాత్మకంగా రెండు జంతువులుండటం, రెండింటిలోనూ మిస్టిక్ లక్షణం వుండటం ఓ చిత్రమైన సామీప్యం. గత మాసంలో ప్రకటించిన జనవరి మంచి కథల జాబితాలో ఈ రెండు కథలూ తప్పకుండా చేర్చతగినవి. జరిగిన పొరపాటు సహృదయంతో అర్థం చేసుకోని క్షమించగలరని ఈ ఇద్దరు రచయితలను, పాఠకులను కోరుతున్నాము. మేము వీలైనంత సమగ్రంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాకున్న పరిమితుల వల్ల ఏవైనా కథలు/పత్రికలు మా దృష్టిని దాటిపోతే పాఠకులు సూచించడం ద్వారా ఈ కృషిని సమిష్టిగా, సమగ్రంగా చేయగలరని మళ్ళీ కోరుతున్నాము.]

 

ఇక ఫిబ్రవరి కథలలోకి వద్దాం –

ఫిబ్రవరి కథలలో రెండు ప్రత్యేకతలు వున్నాయి. మంచి కథల జాబితాలో చేర్చతగిన కథలలో చాలా వరకు హాస్యకథలు వున్నాయి. ఇది చాలా “ఆనందకరమైన” పరిణామం. రెండవది – చాలావరకు మంచి కథలు వెబ్ పత్రికలలో రావటం. సంఖ్యాపరంగా వెబ్ పత్రికలన్నీ కలిపితే కొన్ని కథలే వస్తున్నప్పటికీ వాటిలో మంచి కథల శాతం, ప్రింటు పత్రికలలో వస్తున్న మంచి కథల శాతం కన్నా ఎక్కువ వుండటం మరో పరిణామం. ఇది విస్తరిస్తున్న వెబ్ సాహిత్యానికి నిదర్శనమా లేక ప్రింటు పత్రికలలో క్షీణిస్తున్న ప్రమాణాలకు చిహ్నమా అన్నది మరింత లోతుగా పరిశీలించవలసి వున్నది. మరి కొన్ని నెలల పరిశీలన తరువాత ఈ విషయం గురించి మరింతగా మాట్లాడుకుందాం.

ఇందాక చెప్పినట్లు ఈ నెల హాస్య కథల హవా నడిచింది. ఓ అంతర్జాల పత్రిక హాస్య కథల పోటీ నిర్వహించి అందులో బహుమతి పొందిన కథలను ప్రకటించడం అందుకు ముఖ్యకారణం కావచ్చు. అయితే తెలుగు సాహిత్యంలో హాస్య కథల విషయంలో ఓ చిన్న చూపు వుంది. ప్రముఖ వార్షిక సంకలనాలలో హాస్యకథలు అరుదుగా చోటు చేసుకుంటాయి. ఎక్కడో సెటైర్ కథలలో తప్ప కథాంశంలో బలం వుండదనీ, పాఠకులను నవ్వించడమే తప్ప ఇలాంటి కథలతో సామాజిక ప్రయోజనం పెద్దగా వుండదనీ కారణం చెప్తారు. పాఠకులను నవ్వించడమే ఓ సామాజిక ప్రయోజనమనే వాదన కూడా వుంది. ఏది ఏమైనా హాస్య కథ రాయడం కష్టమైన పని. మంచి పరిశీలన (వస్తువు కోసం), మంచి వాక్య నిర్మాణం (శైలి) వుంటే తప్ప హాస్యకథలు పండవు. అందుచేత ఈ నెల హాస్య కథలను ప్రత్యేకంగా ప్రకటిస్తున్నాము. ఇవేవీ కాకపోయినా మిగిలిన (సో కాల్డ్ సీరియస్) కథలు ఇచ్చే నిరుత్సాహం నుంచి కాస్త తెరిపిగానైనా వీటిని చదువుకోవచ్చు.

ఇక మిగిలిన కథల గురించి –

గత మాసం చెప్పినట్లుగానే తెలుగు కథకులలో వస్తు వైవిధ్యం కోసం ప్రయత్నం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సమకాలీన అంశాలకు కథా రూపం ఇచ్చే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. రైతు కష్టాలు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు వంటి నిలవ కథాంశాలు అడపాదడపా కనపడుతున్నా వాటి సంఖ్య తగ్గుముఖం పట్టింది. వర్తమాన వస్తువులతో కథలు వస్తున్నా ఆ వస్తువు లోతుల్లోకి వెళ్ళే విషయంలో కొంత అలసత్వం కనిపిస్తోంది. వస్తు వైవిధ్యం ప్రోత్సహించవలసినదే కానీ, వస్తువు పట్ల మరికొంత గాఢమైన పరిశీలన లేకపోవడం లేదా అది కథలో ప్రతిఫలించలేకపోవడం మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ఓ గంభీరమైన విషయాన్ని కథలో ప్రవేశపెట్టినంత మాత్రాన అది గంభీరమైన కథ అయిపోదు. ఆ విషయం తాలూకు విభిన్న కోణాలు కథలో సూత్రామాత్రంగానైనా స్పృశించబడాలి.

ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గ కథలను చూద్దాం –

“సుపుత్రుడు” (బి. గీతిక, స్వాతి మాసపత్రిక) కథ రొటీన్ అనాధ వృద్ధుల కథ అయినప్పటికీ ఓ అనాథను తెచ్చి పెంచుకోవడంతో ముగిసే విభిన్నమైన ముగింపు ఉన్న కథ. “శివుడి పెళ్ళి” (జయంతి వెంకటరమణ, నవ్య వారపత్రిక) కథకు (పెళ్ళికి) ఆడపిల్లలు దొరకకపోవటం అన్న అంశం మీద ఆధారపడింది. ఇది సమకాలీనమే అయినా ఆ అంశం గురించి తక్కువ మాట్లాడటం వలనా, ఒక వ్యక్తి అనుభవంలా మాత్రమే మిగిలిపోవటం వలన చిక్కదనం కొరవడింది. “వెలుగు రేఖలు” (రాజేష్ యాళ్ళ, ఈనాడు ఆదివారం), “ఓటమి” (సనిహిత్, కౌముది) కథలు కార్పొరేట్ ప్రపంచంలోని ఉరుకులు పరుగుల గురింఛిన కథలు. రెండింటిలోనూ నాటకీయత ఎక్కువైనప్పటికి ఇప్పటి సందర్భానికి చెప్పవలసిన కథలు. “ఇదో రకం పోరాటం – ఈ నాటి పోరాటం” (గంటి భానుమతి, భూమిక) కథలో కూడా కార్పొరేట్ ప్రపంచం నేపధ్యం. అయితే అందులో స్త్రీ ప్రత్యేకమైన సమస్యలను ప్రతిపాదించారు. అలాగే “గడువు” (ప్రతాప వెంకట సుబ్బారాయుడు, స్వాతి వారపత్రిక) అదే ప్రపంచంలో నుంచి ఓ personality development కథను రాయగలిగారు. దొరికినదల్లా ’వాడుకునే’ లక్షణం గురించి “కొత్త పరుగు” (సి.యస్. రాంబాబు, సారంగ), అందినంతవరకు దోచుకునే లక్షణం గురించి “గుడి” (భువనచంద్ర, స్వాతి వారపత్రిక) ప్రస్తావించాయి. మనిషి యొక్క మౌలికమైన స్పందనలు – దయ, ఆశ, మోసం, మోహం వంటి గుణాలను విశ్లేషిస్తూ “వజ్రం” (జి. వెంకటకృష్ణ, ఆదివారం ఆంధ్రజ్యోతి), “కురిసిన మనసు” (జి. వెంకటకృష్ణ, నవ్య) కథలు కనిపిస్తాయి. చాలా పాత (సినిమా) కథాంశాన్ని కొత్తగా చెప్పిన “ముళ్ళగులాబి” (పులిగడ్డ విశ్వనాథరావు, తెలుగువెలుగు), కొంత అసహజంగా వున్నా ఆశావహంగా వున్న కథ “జనాగ్రహం” (డా. జి.వి. కృష్ణయ్య, స్వాతి వీక్లి) చెప్పుకోదగ్గవి.

వస్తుపరంగా చెప్పుకోదగ్గ ముఖ్యమైన కథ “టైలర్ శీను” (ప్రసాదమూర్తి, సారంగ). తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో రాసిన ఈ కథ వర్తమానంలోనే వుంది. అయితే వివిధ వృత్తుల గురించి వాటిని కోల్పోవడం గురించి మొదలైన ఈ కథ, క్రమంగా చెప్పదల్చుకున్న సమస్యలోకి వెళుతుంది. అందువల్ల చెప్పదల్చుకున్న సమస్య కొత్తగా వచ్చి చేరినట్లు, కథ దిశ మారినట్లు అనిపించే ప్రమాదం వుంది.

ఇక భాష, కథనపరంగా చెప్పుకోవాల్సిన కథలు కొన్ని వున్నాయి. పైన ప్రస్తావించిన “టైలర్ శీను” కథే కాకుండా, “తరళ మేఘచ్ఛాయ, తరువాతి ఎడారి” (వై. విశారద, కినిగె పత్రిక), “ఓ చిత్ర కథ” (పూర్ణిమ తమ్మిరెడ్డి, కినిగె పత్రిక) కథలు విశేషంగా చెప్పుకోదగినవి. కవితాత్మక ధోరణిలో సాగే వాక్యాలు “టైలర్ శీను” కథకు కొత్త అందాన్ని ఇచ్చాయి. “తరళ మేఘచ్చాయ..” చాలా పెద్ద కథ అయినప్పటికీ శైలి పరంగా చాలా మంచి అనుభూతి మిగిల్చింది. “ఓ చిత్ర కథ” ఓ చక్కని ఫోక్ లోర్ కథని అన్వయిస్తూ సాగింఛిన కథనం బాగుంది. అయితే “తరళ మేఘచ్ఛాయ, తరువాతి ఎడారి” కథలో వస్తు బలం లేకపోవటం; “టైలర్ శీను”, “ఓ చిత్ర కథ” కథలలో ఫోకస్ మారిపోవడం వంటి సమస్యలవల్ల కథ ప్రారంభంలో ఒక మంచి కథ చదవబోతున్నామన్న నమ్మకాన్ని కలిగించినా, కథ గడిచే కొద్దీ ఆ నమ్మకం పల్చబడినట్లు అనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే కథలన్నింటిలోనూ నాటకీయత ఎక్కువగా కనపడుతోంది. కథల్లో కనిపించే పాత్రలూ, జరిగే సంఘటనలూ మన చుట్టుపక్కల సాధారణంగా కనిపించేవీ, జరిగేవీ అయినప్పుడు మాత్రమే పాఠకులకి ఆ కథ నమ్మశక్యంగానూ, ఆలోచించదగినదిగానూ అనిపిస్తుంది తప్ప, కేవలం కథని నడపడం కోసమే పాత్రలనీ, సన్నివేశాలనీ సృష్టిస్తే అవి అసహజంగానూ, నాటకీయంగానూ కనిపిస్తాయి. పాఠకుడు అలాంటి కథని చదివిన వెంటనే మర్చిపోతాడు.

“శివుడి పెళ్ళి”, “సుపుత్రుడు”, “కురిసిన మనసు”, “గుడి” వంటికి కథలల్లో నాటకీయత పాళ్ళు కాస్త తూకం తప్పితే, “జనాగ్రహం”, “వెలుగురేఖలు”, “ఓటమి” వంటి కథల్లో దాదాపు అసహజత్వానికి దగ్గరగా వెళ్ళిపోయాయి. ఇది తెలుగు రచయితలు సమీక్షించుకోవాల్సిన అంశం. ఈ అసహజత్వానికి మరింత దోహదపడుతున్నవి సంభాషణలు. మామూలుగా మనం మాట్లాడుకునే విధానం కథలలో అరుదుగా కనపడుతోంది. చివర్లో ప్రసంగంలాంటి సంభాషణలు (ఇదో రకం పోరాటం…, వెలుగు రేఖలు మొదలైనవి), ఈ ప్రసంగం వల్ల ప్రధాన పాత్రలో తక్షణం మార్పు రావటం జరుగుతోంది. పాఠకుడికి కథా నేపథ్యం చెప్పడం కోసం పాత్రలు తమకు తెలిసిన విషయాలను vocalగా సంభాషించడం చాలా కథల్లో జరుగుతోంది. ఈ విషయం గురించి కూడా మరింతగా చర్చించాల్సిన అవసరం ఉన్నది.

వస్తుపరంగా బాగున్న కథలు కథనంలో వెనుకబడటం, కొన్ని కథలలో కథనం బాగున్నా వస్తు బలం లేకపోవటం, కథ తాలూకు లక్ష్యం స్థిరంగా లేకపోవటం, సహజత్వాన్ని దూరం చేసే నాటకీయత – ఈ నెల కథలలో ప్రధాన సమస్య. ఈ కారణంగా మొత్తం కథలలో ఉత్తమ కథ అంటూ ఏ ఒక్క కథ ఉండేందుకు ఆస్కారం లేదని మేము భావిస్తున్నాము.

 

ఫిబ్రవరి నెల హాస్యకథలు

వ్యాసం మొదట్లో ప్రస్తావించినట్టు, ఈ నెలలో కొన్ని మంచి హాస్యకథలు రావడం కొంత రిలీఫ్ కలగజేసింది. ఆ కారణం గానూ, రచయితల ప్రయత్నాన్ని అభినందించడానికి గానూ, ఒక్కో కథనీ పరిచయం చేస్తున్నాం!

ఆనందబాష్పాలు (గోతెలుగు, ఫిబ్రవరి) :: పి వి సాయిసోమయాజులు

మండుతున్న ఉల్లిపాయల ధరల గురించి. హాస్యకథ గా పర్వాలేదనిపించింది.

 

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (గోతెలుగు, ఫిబ్రవరి) :: అశోక్ పొడపాటి

సాఫ్ట్ వేర్ ఇంజనీరే తన అల్లుడు కావాలని పట్టుబట్టిన మామ కథ. కథనంలో మంచి హాస్యాన్ని అందించగలిగారు.

 

సుబ్బారావూ, బ్యాంకు అకౌంటూ (గోతెలుగు, ఫిబ్రవరి) :: రాజేష్ యాళ్ళ

ఇంటింటికీ తిరిగి ఎకౌంట్లు ఓపెన్ చేసే ఓ బాంకు పెట్టిన కష్టాల కథ. వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న మంచి హాస్యకథ.

 

 

ఫిబ్రవరి నెల కథలు

పైన వ్యాసంలో ప్రస్తావించిన ఫిబ్రవరి నెల కథలు ఇవి. చదివి, మీరూ వాటి మంచిచెడ్డల గురించి ఆలోచించదగ్గ కథలు.

కథ

రచయిత

పత్రిక

సంచిక

ఇదోరకం పోరాటం – ఈనాటి పోరాటం గంటి భానుమతి భూమిక ఫిబ్రవరి
ఓ చిత్ర కథ పూర్ణిమ తమ్మిరెడ్డి కినిగె పత్రిక ఫిబ్రవరి
ఓటమి సన్నిహిత్ కౌముది ఫిబ్రవరి
కురిసిన మనసు జి. వెంకటకృష్ణ నవ్య 19 ఫిబ్రవరి
కొత్తపరుగు సి. యస్. రాంబాబు సారంగ ఫిబ్రవరి
గడువు ప్రతాప వెంకట సుబ్బారాయుడు స్వాతి వారపత్రిక 7 ఫిబ్రవరి
గుడి భువనచంద్ర నది మాసపత్రిక ఫిబ్రవరి
జనాగ్రహం డా. జి.వి. కృష్ణయ్య స్వాతి వీక్లీ 14 ఫిబ్రవరి
టైలర్ శీను ప్రసాదమూర్తి సారంగ ఫిబ్రవరి
తరళ మేఘచ్చాయ, తరువాతి ఎడారి వై. విశారద కినిగె పత్రిక ఫిబ్రవరి
ముళ్ల గులాబి పులిగడ్డ విశ్వనాథరావు తెలుగు వెలుగు ఫిబ్రవరి
వజ్రం జి. వెంకటకృష్ణ ఆదివారం ఆంధ్రజ్యోతి 16 ఫిబ్రవరి
వెలుగు రేఖలు రాజేష్ యాళ్ళ ఈనాడు ఆదివారం 16 ఫిబ్రవరి
శివుడు పెళ్ళి జయంతి వెంకటరమణ నవ్య 26 ఫిబ్రవరి
సుపుత్రుడు బి. గీతిక స్వాతి  మాసపత్రిక ఫిబ్రవరి

(అకారాది క్రమంలో..)

—అరిపిరాల సత్యప్రసాద్, ఏ. వి. రమణమూర్తి, టి. చంద్రశేఖర్ రెడ్డి

02. T Chandra Sekhara Reddy

 01. Ramana Murthy03. Aripirala

రాయకుండా ఉండలేనితనం వచ్చేదాక రాయను: పెద్దింటి

ప్రతి నెల వచ్చిన కథలన్నీ చదివి, మేము నిర్ణయించుకున్న ప్రాతిపదికల ఆధారంగా మిగిలిన కథలకన్నా ఉత్తమంగా వున్న కథను ఎంపిక చేసి మీకు పరిచయం చేసే ప్రయత్నం ఇది. అంటే మేము ప్రకటించే కథ ఉత్తమకథా లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకుందని కాదు. కేవలం సాపేక్షంగా మిగిలిన కథల కన్నా బాగుందని మాత్రమే దాని అర్థం. ఇందులో మరో కోణం వుంది. మేము నిర్ణయించుకున్న ప్రాతిపదికలు కొంత మారిస్తే మరో కథ మంచి కథగా అనిపించే అవకాశం వుంది. అలాంటి ఇబ్బంది లేకుండా బాగున్నాయనిపించిన కథలను అన్నింటినీ ప్రకటిస్తున్నాము. అందువల్ల ఏ ప్రాతిపదికన చూసినా ఆ నెలకి ఉత్తమ కథ ఏదైనా ఈ లిస్టులో వుండే తీరుతుందని మా నమ్మిక. మా అభిప్రాయంతో విభేదించి, విశ్లేషణలతో మరో మంచి కథని పాఠకులు పరిచయం చేయగలిగితే మా ప్రయత్నం మరింత సఫలవంతమైందని మేము భావిస్తాము. అలాంటి చర్చకు తలుపులు తెరవడమే మా ముఖ్యోద్దేశ్యం.

img3

 

గతవారానికి కొనసాగింపుగా – జనవరి నెల కథగా ఎన్నికైన ‘ప్లాసెంటా’ (రచయిత: శ్రీ పెద్దింటి అశోక్ కుమార్)  గురించి చర్చిద్దాం.

ఉమ్మడి కుటుంబాలు అరుదైన నేపథ్యంలో – భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడం, తమ తమ ఉద్యోగం నిలబెట్టుకోవడానికి లేదా ఉద్యోగస్థాయి పెంచుకోవడటానికి వాళ్ళు పడే తాపత్రయం ఒక స్త్రీ జీవితంలో ఎలాంటి సమస్య సృష్టించింది ఆ సమస్యనుంచి బయటపడటానికి ఆమె ఏ మార్గాన్ని ఎన్నుకున్నది, దాన్ని ఎలా అమలు పరచిందీ అన్నది కథా వస్తువు. అంతేకాకుండా, వ్యక్తిగత స్థాయిలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలకి ఫేస్ బుక్ లాంటి వేదికలలో గుంపు మనస్తత్వాల ప్రోత్సాహం ఎలా ఉంటోందో చెప్పిన కథ కూడా. ఇతివృత్త పరంగా సమకాలీనత ఉన్న ప్రధాన సమస్యలని అనుసంధానించి నడిపిన కథ కనుక, ‘ప్లాసెంటా’ ఒక విభిన్నమైన కథగా అనిపించింది.

పరిష్కారం కచ్చితంగా చెప్పలేని కథలని నడపడం అంత తేలికైన పని కాదు. ఇలాంటి కథల్లో వస్తువు తాలూకు విభిన్న పార్శ్వాలని ప్రతిభావంతంగా చూపించి, పాఠకులు ఒక సమగ్ర అవగాహనకి రాగలిగిన పరిస్థితిని కలగజేయాలి. కానీ, కథ మళ్ళీ చర్చలాగానో, వ్యాసంలాగానో అనిపించకూడదు. వస్తువులోని గాంభీర్యతకీ, పఠనీయతలోని సౌకర్యానికీ మధ్య సరైన బ్రిడ్జ్ ఉంటేనే ఇలాంటి కథలు నప్పుతాయి. గుర్తుండిపోతాయి. మరి ఈ కథ ఎంతవరకూ ఈ విషయంలో సఫలమైంది?  చూద్దాం.

మంచి కథ ప్రారంభంలోనే కథ పట్ల ఉత్సుకతని కలిగించి పాఠకుడిని తనతో కథ చివరిదాకా ప్రయాణానికి మానసికంగా ఆయత్తం చేయగలగాలి. ప్లాసెంటా కథ ఎత్తుగడ, కొన్ని గందరగోళాల మధ్య దురదృష్టవశాత్తూ పాఠకుడికి ఈ సౌకర్యం కల్పించలేక పోయింది.

సమస్యని ఎదుర్కొనే వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి, ఆ వ్యక్తి జీవన పరిస్థితిని బట్టి ఎన్నుకొనే పరిష్కారాలు మారుతుంటాయి.  ‘ఈ పరిష్కారం ఆమోదయోగ్యం కాదు’, ‘ఫలానా పరిష్కారమే సరైనది’ అని కచ్చితంగా నిర్ణయించటం కష్టం. సుజన ఉద్యోగపరంగా విదేశాలకి పోవటం ఒక అరుదైన అవకాశంగా భావించింది. శైశవదశలో ఉన్న కన్నబిడ్డకి దగ్గరగా ఉండటంకన్నా అతడ్ని విడిచి వెళ్లటం వైపే ఆమె మనసు మొగ్గు చూపింది. కానీ బాబుని దూరం చేసుకోవటం కోసం ఆమె ఎన్నుకున్న మార్గం, అది అమలు పరచిన తీరు చాలా క్రూరంగా ఉంది.

కథనంలో ఎక్కడ కూడా సుజన బాబుని వదిలిపెట్టటానికి బాధ పడినట్లు మానసిక సంఘర్షణ అనుభవించినట్లు కనపడదు. వదిలించుకోవడానికి పడ్డ బాధే కనపడుతుంది. అవసరం బాధ్యతని ఎంత మర్చిపోయేలా చేసినా,  ఒక స్త్రీ తన మాతృత్వలక్షణాలని పూర్తిగా విస్మరించి ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యమా అన్నది ప్రక్కన పెడితే – అసహజంగా, నమ్మశక్యంగా అనిపించకపోవడం కథలో కొట్టొచ్చినట్లు కనపడే లోపం.  ఓ పాత్రని సహజత్వానికి దూరంగా కర్కశంగా చిత్రీకరించడం ద్వారా అనుకున్న ముగింపు వైపు కథని నడపడం అనేది రచయిత తనకి అనువుగా కథని డిజైన్ చేసుకోవడమే!

కథ చెప్పడంలో ఇలాంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ, పాఠకుడిలో ఆలోచన రేకెత్తించడంలోనూ, ఓ వర్తమాన సమస్యని చర్చకి తీసుకురావడంలోనూ ఈ కథ మిగిలిన (జనవరి) కథలకన్నా ముందు వుండటం వల్ల ఈ కథని ఉత్తమ కథగా నిర్ణయించడం జరిగింది. ఈ కథ విషయమై రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారితో సంభాషణ జరిపినప్పుడు ఆయన ప్రస్తావించిన అనేక కోణాలు ఇలాంటి చర్చకు సంబంధించినవే. అయితే – ఈ సంభాషణలో ఉన్నంత స్పష్టంగా ఆ అంశాలు కథలో ప్రతిఫలించి ఉన్నట్టయితే, ఈ కథ ఇంకొంత మంచి కథ అయివుండేది!

peddinti

ప్లాసెంటా కథా రచయిత శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారితో సంభాషణ:

ఈ కథా నేపధ్యం వివరించండి. ముఖ్యంగా ఈ ఆలోచన ఎలా వచ్చింది అది కథగా ఎలా రూపు దిద్దుకుంది?

 

ఇది ప్రస్తుతం అన్ని కుటుంబాల్లో ఉన్న సమస్య. ఏ ఇంటికి వెళ్ళినా ఎదురయ్యే సమస్య. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుని తీరిగ్గా ఉన్నారంటే వారింట్లో ఓ చిన్నపిల్ల తప్పకుండా ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఇది తప్పనిసరి. మెటర్నిటీ సెలవులు ఎక్కువగా ఉండవు. సెలవు పెట్టే వీలుండదు. ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. అందుకని ఈ పరిస్థితి.

 

నేను టీచర్ ను. మా కొలీగ్ ఒక అమ్మాయి మెటర్నిటీ లీవ్ నుంచి స్కూల్లో జాయిన్ అయింది. స్కూల్ కు బాబును తీసుకొచ్చింది. రెండు వారాల తరువాత బాబును తీసుకురాలేదు. ఎందుకని అడిగితే అమ్మ వద్దకు పంపానని చెప్పింది. కారణం అడిగితే DL కోసం ప్రిపేర్ కావాలంది. ఆ నేపధ్యంలోంచి ఈ కథ పుట్టుకొచ్చింది.

 

ఈ కథలో మీరు రాసిన సమస్య ఈ తరానికి చాలా అవసరమైనది, ప్రస్తుతాన్వయం (relevant) చేయతగినది కూడా .మీ కథా వస్తువులో సమకాలీనత వుండేలే మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు.

 

పరిశీలన చేస్తాను. అధ్యయనం చేస్తాను. వర్తమాన సమస్యలనే వస్తువుగా స్వీకరిస్తాను. సమస్య ఎక్కడుందో అక్కడ నిలబడి విశ్లేషణ చేస్తాను.

 

వస్తువు విషయంలో చాలా వర్తమానతని పాటించే మీరు, కథ నిర్మాణ వ్యవహారంలో తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? కథ డిజైన్ ని పూర్తిగా ముందే ప్లాన్ చేసుకుంటారా, లేక మనసుకి తోచింది రాసుకుంటూ పోతారా?

 

కథ మెదటి నుండి చివరి వరకు టైటిల్ తో సహా మనసులో అనుకున్నాకనే కథను రాస్తాను. అది కూడా అనుకోగానే కాదు. మనసులో ఉడికి ఉడికి కథను రాయకుండా ఉండలేనితనం వచ్చేదాక కథ గురించే ఆలోచిస్తుంటాను. రాసేప్పుడు కొత్త ఆలోచనలు వస్తే చిన్న చిన్న మార్పులు చేస్తాను. ఇంత ప్లాన్ వేసుకున్నా సింగిల్ సిటింగ్ లో ఎప్పుడూ కథను రాయలేదు. కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది.

 

ఇక కథలోకి వద్దాం –

సుజన మీద పాఠకులకి కొంత విముఖత ఏర్పడేటట్టుగా కథనాన్ని నడిపించారు. ఆమె వ్యవహరశైలి, ఆమెకు ఇతర మిత్రుల ప్రోత్సాహంఇదంతా ఒక కర్కశమైన లక్షణాలను ప్రదర్శించింది. ఇలా ఎందుకు చేశారు?

 

సబ్జెక్ట్ అలాంటిది. ఆమె కెరీర్ కోసం అమెరికా వెళ్లాలి. ఇంట్లో చిన్నబాబు ఉన్నాడు. అతనితో బాగా attachment ఉన్నది. ఇది నేటి ఆధునిక మహిళలకు జీవన్మరణ సమస్య. దేనిని ఎంచుకోవాలనే దాని మీద సంఘర్షణ. ఇది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన సమస్య. అయినా సామాజిక సమస్య. సుజనను వ్యతిరేకించిన తండ్రి ఉన్నాడు. అంటి ముట్టనట్టు ఉన్న భర్త ఉన్నాడు. ప్రోత్సహించిన మిత్రులు ఉన్నారు. ఎవరి ఆలోచనా పరిణితిలో వారి దీనిని విశ్లేషించారు. ఇదంతా కథా వస్తువులో ఒక భాగం.

 

సుజన తను చేసిన పనిని ఫేస్ బుక్ లో పెట్టినపుడు పలువురు లైక్ చేసినట్లు, అభినందించినట్లు రాశారు. సోషల్ నెట్ వర్కింగ్ ఆచారాలు అలవాటుగా, దురలవాటుగా, వ్యసనంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఒక “లైక్” వెనకాల నిజమైన స్ఫూర్తి, సమర్థన ఉందని మీరు అనుకుంటున్నారా

అనుకుంటున్నాను. కొంతయినా స్పూర్తి ఉంటుంది. వ్యసనంగా కాక అవసరంగా చూసేవాళ్ళు కూడా చాలా ఉంటున్నారు. సోషల్ నెట్ వర్క్ అలవాటుగా కాకుండా అవసరంగా మారింది ఈ రోజుల్లో. వంద లైక్ ల వెనకాల ఆకతాయితనం ఉన్నా సగమైనా నిజమైన స్పందన ఉందనుకుంటున్నాను. ఒక అభ్యర్థికి రక్తం కావాలని పోస్ట్ చేస్తే ఇవ్వడానికి వందల మంది ముందుకువచ్చారట. ఆర్థిక సహాయం కావాలని టీవీల్లో ప్రకటిస్తే వెల మంది స్పందించి విరాళాలు అందించిన సందర్భాలున్నాయి. చదువుకోలేని ఆర్థిక పరిస్థితి గురించి జిల్లా ఎడిషన్ పేపర్లో వచ్చినా విరాళాలు ఇస్తున్నారు. అందుకని ఒక లైక్ వెనక ఎంతో కొంత నిజమైన స్పందన ఉందనే అనుకుంటున్నాను.

 

స్త్రీలు కూడా సమానావకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ రోజుల్లో – వాళ్ళు కెరీర్ నీ, ఫామిలీ లైఫ్ నీ ఎలా బాలెన్స్ చేసుకోవాలి అని మీరు అభిప్రాయపడుతున్నారు. ఒకదానికోసం మరొకటి నిర్లక్ష్యం చేయాల్సిన పరిస్థితే వస్తే…?

స్త్రీ అప్పటికీ ఇప్పటికీ బాధితురాలే. సమాన అవకాశాలు అనేది వాస్తవం కాదు. ఈ రోజు అన్ని రంగాలో స్త్రీలు ప్రవేశిస్తున్నారని ఇదే సమాన అవకాశాలని మనం అనుకుంటున్నాం. కానీ అవకాశాల పేరున ఆమె మీద మరింత పీడనను పెంచుతున్నాం. ఇంట్లో నిశ్చింతగానో (పురుషుడు ఉన్నంతగా) ఇవతల భద్రంగానో ఆమె ఉంటుందని చెప్పగలమా? ఒక పురుషుడు జీవించినంత స్వేచ్ఛగా, రంధి లేకుండా స్త్రీ బతుకుతుందని చెప్పగలమా? అలాంటప్పుడు సమాన అవకాశమెలా అవుతుంది. అవకాశమంటే పొదటం ఒకటే కాదు. పొందినదాన్ని సమానస్థాయిలో అనుభవించడం కూడా.

 

వాళ్ళకూ కెరీర్ ముఖ్యమే. కానీ మాతృత్వమనే ఒక సమాజ నిర్మాణ బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇది చాలా సున్నితమైన సమస్య. చట్టాలో, నిర్బంధాలో ఈ సమస్యని పరిష్కరించలేవు. పురుష సమాజం అంతా ఆమెకు సహకరించాలి. బాధ్యత కొంతైనా పంచుకోవాలి. ఒకదాని కోసం ఒకటి అన్నప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న క్రమాన్ని సమస్యను బట్టి వారే నిర్ణయించుకోవాలి.

 

ప్రస్తుత యువతరం – వాళ్ళ బాధ్యతలని మర్చిపోయి కేవలం డబ్బు సంపాదన ధ్యేయాలతో తమ ఉనికిని కోల్పోతున్నారని మీరు అనుకుంటున్నారా?

లేదు. సమాజంలో మంచి – చెడు, బాధ్యత లేకుండా తిరగడం – బాధ్యతతో ఉండడం ఎప్పుడూ ఎక్కువనో తక్కువనో ఉన్నదే. కాకుంటే ఇప్పటి యువతరం కొంత ఎక్కువగానే బాధ్యతా రాహిత్యంగా డబ్బు మత్తులో ఉన్నారు. అందుకు కారణాలు అనేకం. వేగవంతమైన ప్రపంచం, అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం, డబ్బు అవసరం ఇలాంటివి. ముఖ్యంగా పిల్లలకు విలువలు నేర్పే ఇల్లు, పాఠశాలలు ఆరోగ్యంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ కథకు మూలం అదే.

 

పసి పిల్లల మనసు తెల్లకాగితం లాంటిదని శాస్త్రవేత్తలంటారు. పైగా శిశువు మూర్తిమత్వానికి పునాదులు తల్లి గర్భంలో ఉన్న ఆరు నెలలు, బయటకు వచ్చాక రెండేళ్ళ కాలమే ముఖ్యం. ఈ కాలంలో మెదడులో ఫీడయిన అంశాలతోనే శిశువు వ్యక్తిత్వ నిర్మాణం మొదలవుతుంది. ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ నిర్లక్ష్యంగా తల్లిదండ్రులూ, సమాజం వ్యవహరించి బాధ్యత గల యువతరం కోసం చూస్తే వేప చెట్టు నాటి మామిడి పండ్ల కోసం ఎదురు చూసినట్లే.

 

ఈ కథలో ప్రథాన సమస్యతో పాటు మీరు మరి కొన్ని ప్రస్తావించారు. పాల సీసాల కుట్ర, కులం-జండర్ వగైరాలు. ఇవి మీరు చెప్పదలచుకున్న విషయానికి అడ్డంకుల్లాగానీ, లేకపోతే బలవంతపు జస్టిఫికేషన్లు అని కానీ అనిపించలేదా?

లేదు. కథలో ఒక భాగమే. ముందే చెప్పుకున్నట్టు నవజాత శిశువు, శిశువు దశలోనే అనేక అంశాలు పిల్లల మెదట్లో స్ఠిరపడిపోతాయి. అవి పరిసరాల వల్ల, కుటుంబం, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి వల్ల జరిగే ప్రక్రియలు. మేం స్కూల్లల్లో మూడు నాలుగేళ్ళ పిల్లలను చూస్తాం. ఆ వయసులోనే ఆడపిల్లలు ఒదిగి ఉంటారు. మగపిల్లలు స్వేచ్ఛగా ఉంటారు. అలవాట్లలో కూడా తేడా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారు, ఏ కుటుంబాల నుంచి వచ్చారు అన్నది అద్దంలా కనిపిస్తుంది. అది వారికి ఎవరూ అంతవరకు బోధించలేదు. కానీ పరిసరాల నుంచి వారి మెదట్లో ఫీడయిన అంశలు అవి. భవిష్యత్ లో ఆ పిల్లలను నడిపించే అంశాలు అవి. తండ్రి కూతుళ్ళ మధ్య ఆలోచనా, పరివర్తనలో తేడాలను చూపిస్తున్నప్పుడు సమాజం, బహుళజాతి కంపెనీలు తల్లి బిడ్డలను ఎలా వేరు చేసి వ్యాపారం చేస్తున్నాయని చెప్పే క్రమంలో పాలసీసా అంశం వచ్చింది.

 

ఒక సరదా ప్రశ్న – ఇదే వస్తువుని, మనకన్నా ఓ రెండు మూడు తరాల ముందున్న రచయిత/త్రులలో (వారిప్పుడు మనమధ్యన లేకున్నా…) – ఎవరైతే బాగా రాయగలరని మీ ఉద్దేశం? అదే – వర్తమాన రచయిత/త్రులలో?

ఈ సమస్యను ఒక్క కోణంలో కాదు. అనేక కోణాల్లోంచి చూడవచ్చు. ఒకరు సెంటిమెంట్ గా చూడవచ్చు. ఒకరు స్త్రీ హింస కోణంలోంచి చూడవచ్చు. ఈ సమాజ నిర్మాణమనేది ఒక స్త్రీ మూర్తి ప్రసాదించిన భిక్షనే కాబట్టి ఒకరు త్యాగమే కోణం లోంచి, మరొకరు స్త్రీ చైతన్య కోణంలోంచి, ఇంకొకరు పురుషుడికి ఈ బాధ్యతలు ఏవీ లేవు కాబట్టి ఆ కోణంలోంచి, ఇంకో అడుగు ముందుకు వేసి తల్లి బిడ్డల మధ్య జరిగిన కుట్రల కోణంలోంచి మరొకరు ఇలా అనేక మంది గొప్పగా ఆవిష్కరించవచ్చు. కొత్తతరంలో అయితే గీతాంజలిగారు, కుప్పిలి పద్మగారు, ప్రతిమగారు ఇంకా చాలా మంది ఈ సున్నితమైన సమస్య గురించి అద్భుతంగా రాయగలరు.

 

ఇందులో చర్చించిన సమస్యని అధిగమించే దిశగా మనం ఏం చెయ్యాలి?

సమస్త మానవాళికి, సమాజ నిర్మాణానికి తొలి అడుగు తల్లి. అది ప్రకృతి సిద్ధం. చెట్టు మీద పువ్వు పూసి కాయ కాసినంత ప్రశాంతంగా తల్లిబిడ్డల మధ్య సంబంధం ఉండాలి. అందుకు తగిన విధంగా చట్టాలు, సమాజం రూపొందాలి. పురుషుడు మారాలి. నవజాత శిశుదశ శిశువు వ్యక్తిత్వ నిర్మాణంలో అత్యంత కోలకమైనది కాబట్టి ఈ వయసులో పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల భవిష్యత్ కోసమే కష్టపడి డబ్బు సంపాదిస్తున్నామన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ అనేది తమ పెంపకం వల్ల కూడా ఉంటుందన్న విషయం గుర్తించాలి.

మంచి కథల కోసం ఒక అన్వేషణ!

2 (1)

ఇది ప్రస్తుతం వస్తున్న కథల గురించి మాటా మంతీ. ఒక నెలలో వచ్చిన కథలన్నీ పరిశీలించి, అందులో కొన్ని ఉత్తమమైన కథలని ఎన్నుకోవడం, ఆ కథలను, కథకులను అభినందించుకోవడం ఈ శీర్షిక ప్రధాన ఉద్దేశ్యం.

ఈ పనిని మేము నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి.

వాటిల్లో ముఖ్యమైనదీ, మొట్టమొదటిదీ – ఇలాంటి ప్రయత్నం ఈ మధ్య ఏ పత్రికలోనూ జరగకపోవడం! ఏడాది తరువాత కొన్ని పత్రికలు ఒక సింహావలోకనాన్ని వెయ్యడం, కొన్ని సంవత్సర సంకలనాలలో సమీక్షా వ్యాసాలు రాయడం జరిగినప్పటికీ వాటికి ఎక్కువ కథలను స్పృశించే అవకాశం తక్కువ.

ప్రస్తుతం ఉన్న రకరకాల ప్రింట్ పత్రికల్లోనూ, ఆన్‌లైన్ పత్రికల్లోనూ కలిపి సగటున నెలకి దాదాపు నూట యాభై కథల దాకా వస్తున్నాయి. ఏ కథలో ఏముందో, ఏ కథ ఎవరు రాశారో, ఏ మంచి కథ ఎందులో వచ్చిందో, అసలు ఏ పత్రిక ఎప్పుడు వస్తోందో – ఈ విషయాలన్నీ పాఠకులకి ఓ పద్ధతి ప్రకారం చేరడం లేదని కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నాం. అసలు పత్రికలు దొరకబుచ్చుకోవటమే ఓ శ్రమగా మారిన తరుణంలో మంచి కథ వచ్చిందని తెలియడం, ఆ పత్రిక కోసం ప్రయత్నం చేసి చదవడం పాఠకుడు చేస్తాడని అనుకోవడం అత్యాశే అవుతుంది. అదీగాక, ఇన్ని వందల కథలని దాటుకునిగానీ ఒక మంచి కథని అందుకునే దాకా పాఠకుడికి ఓపిక ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. ఓ మంచి కథ పాఠకుడికి తెలియకుండానే మరుగున పడిపోవడం ఆ కథకీ, రచయితకే కాదు సాహిత్యానికీ సమాజానికి కూడా చెడు చేసినట్లే కదా? అలాంటి ఒక వెలితిని పూరించడం మా ప్రయత్నం తాలూకు మరో లక్ష్యం.

అంతే కాదు – కథల గురించిన మంచీ చెడ్డా మాట్లాడటం ఎవరో ఒకరు మొదలెడితే, అలాంటి సంప్రదాయాన్ని మిగతా పత్రికలు కూడా అనుసరిస్తే – ‘మంచి కథ’ గురించి ఆలోచనా, అవగాహనా, స్పృహా, అభిరుచీ అటు రచయితల్లోనూ, ఇటు పాఠకులలోనూ పెరిగి – మంచి కథలు మరిన్ని రావడానికి దోహదపడగలదన్న ఒక చిరు ఆశ కూడా మా ఈ ప్రయత్నానికి ఒక కారణం.

మంచి కథల వార్షిక సంకలనాలని ప్రచురిస్తున్నవారు, ఆన్‌లైన్ పత్రికల్లో వస్తున్న కథలని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాసిన కథకి డబ్బు రూపంలో ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ పత్రికలకి రాస్తున్న రచయిత/త్రులకి కనీసం గుర్తింపు రూపంలోనైనా సరైన న్యాయం జరగడం లేదన్న ఉద్దేశంతో, వాటిని కూడా మేము పరిశీలించాలీ అన్న సదుద్దేశంతో కూడా ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాం.

***

 

ఇలాంటి ప్రయత్నాన్ని ఏ ఒక్కరో చేస్తే, వ్యక్తిగతమైన మమకారావేశాల వల్ల నిర్ణయాల్లో కొన్ని లోటుపాట్లు జరిగే అవకాశం వుంటుంది. అలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం ముగ్గురం కలిసి కథలని విడివిడిగా చదివి; వస్తువు, కథానిర్మాణం, శైలి వగైరా అంశాల మీద మార్కులు వేసుకొని; తుది దశలో కథల బాగోగులు చర్చించుకొని మరీ మంచి కథలని నిర్ణయించడం జరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో – సబ్జెక్టివిటీ అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టేనని మేము భావిస్తున్నాం!

ఇంత చేసినా ఇది ముగ్గురి సమిష్టి అభిప్రాయమే తప్ప ఏ విధంగానూ యావత్ పాఠకలోకానికో, సాహితీ ప్రపంచానికో ప్రాతినిధ్యం వహించే నిర్ణయం కాకపోవచ్చు. అలాగే కొన్ని పరిమితుల కారణంగా ఏదైనా మంచి కథ/పత్రిక మా పరిశీలనలోకి రాకపోయే అవకాశం లేకపోలేదు. అంచేత మీ దృష్టిలోకి వచ్చిన మంచి కథ/పత్రికలను మాకు ప్రతిపాదించి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము.

 

***

జనవరి కథలు

జనవరి నెలకు గాను దాదాపు 140 కథలని పరిశీలించడం జరిగింది. ఈ క్రింది పత్రికల్లోని కథలని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది:

ఆదివారం అనుబంధాలు: ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సాక్షి, వార్త

 

వారపత్రికలు: జాగృతి, ఆంధ్రభూమి, స్వాతి, నవ్య

 

మాసపత్రికలు: రచన, నది, ఆంధ్రభూమి, చినుకు, తెలుగు వెలుగు, పాలపిట్ట, మిసిమి, స్వాతి, చిత్ర, విపుల, ప్రస్థానం, స్వప్న, ఆంధ్రప్రదేశ్

 

అంతర్జాల పత్రికలు: కౌముది, సారంగ, ఈమాట, వాకిలి, విహంగ, కినిగె, గోతెలుగు

 

కథలన్నీ చదివితే ముందు మన దృష్టిని ఆకర్షించేది – విభిన్నమైన వస్తువులని ఎంచుకోవడంలో రచయితలు చూపిస్తున్న ఆసక్తి. ఈ పరిణామం ముదావహం. సామాజిక నేపథ్యాలు నిరంతరం మారుతూ ఉండే పరిణామక్రమంలో తరచి చూస్తే, కొత్త కొత్త సామాజికాంశాలూ, వైరుధ్యాలూ, మానసిక కోణాలూ కనిపించక మానవు. అలాంటి వస్తువులని ఎన్నుకొని కథల చట్రంలో ప్రతిభావంతంగా బిగించగలిగిననాడు ‘కథ’ అనేది వర్తమానాన్ని అర్థవంతంగా విశ్లేషించుకోవడానికి ఉపయోగపడగల మాధ్యమం అవుతుంది. అలాగే వస్తువు పాతదైనా అందులో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా గుర్తించతగినదే.

చిత్రం: కృష్ణ అశోక్

చిత్రం: కృష్ణ అశోక్

ఇప్పుడున్న సంక్లిష్టమైన, సందిగ్ధమైన సామాజిక నేపధ్యం అలాంటి వస్తువులనే ఇస్తుంది. అందువల్ల అవి రచయిత అధ్యయనశీలతనీ, శిల్ప సామర్ధ్యాన్నీ పరీక్షకు పెడుతున్నాయి. అయితే, చాలా మంది రచయితలు కొత్త కథాంశాలను అందిపుచ్చుకుంటున్నా, పూర్తిస్థాయి అధ్యయనం లేకపోవడం వల్లో, అనివార్యమైన మమకారావేశాల వల్లనో ఆ కథాంశాలను చిక్కగా, సమగ్రంగా అందిచలేకపోతున్నట్లుగా తోస్తోంది.

 

ఈ నెల వచ్చిన కథలలో చెప్పుకోదగ్గ కథలను విశ్లేషిస్తే –

 

“ప్లాసెంటా” – పెద్దింటి అశోక్ కుమార్ (అమెరికా ఉద్యోగం కోసం చంటి బిడ్డను వదిలించుకోవాలని ప్రయత్నం చేసే తల్లి), “సహజాతాలు” – విహారి (చదువులు, దొరకని ఉద్యోగాలు వల్ల డిప్రెషన్ లు, కొన్ని తప్పని నిర్ణయాలు)  “డేగలు తిరిగే ఆకాశం” – అరిపిరాల సత్యప్రసాద్ (పీడోఫైల్ ప్రపంచంలో ఓ తండ్రి ఆవేదన), “ఇద్దరు బిడ్డల తల్లి” – వేంపల్లె షరీఫ్ (ప్రాంత, మత జనిత ఉచ్ఛారణా దోషాలు కూడా వివక్షకి కారణమే) ఇవన్నీ వస్తువైవిధ్యాలకి ఉదాహరణలుగా నిలిచే కొన్ని కథలు.

 

కథ ప్రయోజనాల అంశాలని కాసేపు పక్కన పెట్టగలిగితే, ప్రశంసార్హమైన కథనశైలితో కథను నడిపిన ఉదాహరణలు కూడా కొన్ని కనిపించాయి. “సాంత్వనములేక” – తాడికొండ కె శివకుమార్ శర్మ (ముక్తపదగ్రస్త అలంకారంలా దుమికే కథనం), “నిద్రకు మెలకువకూ మధ్య” – పలమనేరు బాలాజీ (మిస్టిక్), “అసమయాల అమావాస్య” – సాయిపద్మ (మాంత్రిక వాస్తవికత), “మంచు” – మూలా సుబ్రమణ్యం (మిస్టిక్ మనిషి ప్రధానపాత్రగా). ఈ కథలలో శైలిశిల్పాలు ఎంత బలంగా వుండి చదివించాయో కథాంశం కూడా అంతే బలంగా వుండుంటే అద్భుతమైన కథలుగా మారే అవకాశం వుండేది. శివకుమార్ శర్మ కథ గొప్ప కథకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఎంచుకున్న అంశాలను అన్నింటిని ముడి పెట్టడంలో కాస్త జారు ముడి పడిందని మా అభిప్రాయం.

 

కేవలం కథా కథనాలే కాకుండా సామాజిక/వ్యక్తిగత ప్రయోజనం రీత్యా ప్రస్తావించతగ్గ కథలు కొన్ని ఈ నెలలో కనిపించాయి. “ఆకలి” – పెద్దింటి అశోక్ కుమార్, “వారసులు” – జి. ఉమామహేశ్వర్, “ఇదేన్రీ హింగాయ్తూ” – ఓలేటి శ్రీనివాసభాను మెదలైనవి ఈ కోవకు చెందినవే. పాత కథా వస్తువు, సాధారణమైన కథనం ఉన్నప్పటికీ “సొంత సౌఖ్యము కొంత చూసుకు” – సింగరాజు రమాదేవి, (నవ్య, జనవరి 8), “పర్ణశాల” – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ (స్వప్న మాసపత్రిక)  వంటి కథలలో పరిష్కారాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

 

మొత్తం మీద చాలా కథలు ఆశావహ దృక్పధంతో ముగిసినట్లు, జనవరి కథలు ఆశావహంగానే అనిపించాయని చెప్పి ముగిస్తున్నాం.

 

జనవరి కథలని అనేక అంశాల ప్రాతిపదికన బేరీజు వేసుకుంటూ పోతే, ఈ కథ మా సమిష్టి అధ్యయనంలో జనవరి-2014 కథలలో ఉత్తమమైన కథగా నిలిచింది!

 

ప్లాసెంటా

తెలుగు వెలుగు

రచయిత: పెద్దింటి అశోక్ కుమార్

ఈ కథ గురించి మా విశ్లేషణ, రచయితతో ముఖాముఖి వచ్చే వారం…

 

మంచి ప్రయత్నం చేసిన ఇతర కథలు, పాఠకులు చదివి విశ్లేషించుకోగల వీలుగల మరికొన్ని కథలు:

  • సాంత్వనము లేక తాడికొండ కె. శివకుమార్ శర్మ (వాకిలి, జనవరి)
  • ఆకలి పెద్దింటి అశోక్ కుమార్ (నవ్య 22, జనవరి)
  • నిద్రకు మెలకువకూ మధ్య పలమనేరు బాలాజీ (నవ్య, 22 జనవరి)
  • డేగలు తిరిగే ఆకాశం అరిపిరాల సత్యప్రసాద్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 26 జనవరి)
  • అసమయాల అమావాస్య సాయిపద్మ (ఈమాట, జనవరి ఫిబ్రవరి సంచిక)
  • వారసులు జి. ఉమామహేశ్వర్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 19 జనవరి)
  • ఇద్దరు బిడ్డల తల్లి వేంపల్లె షరీఫ్ (నవ్య, 8 జనవరి)
  • ఇదేన్రీ హింగాయ్తూ ఓలేటి శ్రీనివాసభాను (నవ్య, 15 జనవరి)
  • సహజాతాలు విహారి (నవ్య, 1 జనవరి)
  • మంచు మూలా సుబ్రమణ్యం (ఈమాట, జనవరి-ఫిబ్రవరి)

– అరిపిరాల సత్య ప్రసాద్, ఎ.వి. రమణ మూర్తి, టి. చంద్ర శేఖర రెడ్డి.

   (లోగో :మహీ బెజవాడ)

02. T Chandra Sekhara Reddy03. Aripirala01. Ramana Murthy