ఒకే ఒక బలమైన ఆయుధం- ” అంబేద్కర్ “!

పి.విక్టర్ విజయ్ కుమార్

దళితులు , గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు , ప్రజాస్వామిక వాదులు – మదిలో  కొవ్వొత్తులు వెలిగించి మరో జీవన వైవిధ్యాన్ని , జీవన శైలిని నేర్పించిన మహానుభావునికి మదిలో వెల్లువెత్తిన కృతజ్ఞతతో  ఆయన జన్మ దినాన్ని స్మరించుకున్నారు…ఎప్పటిలానే.
అంబేద్కర్ ఒక వర్గానికి కులానికి సంబంధించిన మేధావి కాదు. ఆయన 1990 లలో ఒక  Parallel Thinker . ఒక సాంప్రదాయక ఆలోచనా విధానాన్ని బద్దలు కొట్టి ” సాంఘిక చైతన్యం ” అనే అంశాన్ని ప్రతి మేధావి ఆలోచనలో భాగం చేయాల్సిన పరిస్థితిని కల్పించిన మొదతి భారతీయ తాత్విక వేత్త. 1920 ల నుండి గాంధీ తో సహా ప్రతి నాయకుడికీ –  ఏ రాజకీయ వేదిక అయినా సరే – కొరకరాని కొయ్యగా నిలబడ్డాడు. ఆయన ఆర్థిక శాస్త్రం లో కొలంబియా యూనివర్సిటీ నుండి  MA, PhD,    London School of Economics  నుండి  D Sc  పట్టభద్రుడయ్యాడు. లండన్ నుండి బారిష్టర్ డిగ్రీ పొంది అకడమిక్ గా సాధించిన అద్భుత విజయాన్ని ఆ రోజుల్లో తన కుల వ్యతిరేక తపనను తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు.  ఆయన ఈ దేశం సంపాయించిన మొట్ట మొదటి ఆర్థిక వేత్త అనే విషయం మనం ఇక్కడ గుర్తించాలి. ఇదే విషయాన్ని అమర్త్య సేన్ స్వయానా అభిమానంగా చెప్పుకుంటాడు.
అంబేద్కర్ , గాంధి,  కాంగ్రెస్ గురించి ప్రస్తావిస్తూ ఇలా అంటాడు  ” కాంగ్రెస్ హిందూ పెట్టుబడిదారులు చేరవేసిన మధ్య తరగతి హిందువుల సంస్థ. వీరి ఉద్దేశ్యం భారతీయులను స్వతంత్రులను చేయడం కాదు. బ్రిటీష్ వారి నుండి విముక్తి పరచడమే. బ్రిటీష్ వారి ఆధిక్య స్థానాన్ని వీరు ఆక్రమించుకోవడం. ఇదే స్వాతంత్ర్యం ఐతే హిందువులు తర తరాలుగా అస్పృశ్యులను ఎలా పరిగణిస్తూ వచ్చారో అదే కొనసాగుతుంది “
అంబేద్కర్ ఈ దేశం లో దళితులకే కాదు , ప్రతి మేధావికి నేర్పించింది ” వ్యక్తిత్వం ” ” స్వతంత్రత ” (  Individuality and independent thinking  )  . చెప్పదల్చుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తీకరించడం , మెజారిటీ అభిప్రాయాన్ని కాలదన్ని స్వంతంత్ర ఉద్దేశ్యాన్ని ప్రకటించడం లో అంబేద్కర్ ప్రతి మేధావికి మార్గ దర్శకుడు.
1918 లో మాంటేగ్ – ఛేంస్ఫర్డ్ సంస్కరణల ప్రక్రియలో భాగంగా ఇండియాలో ఎలక్షన్ విధానాన్ని పునర్నిర్వచించే ఉద్దేశ్యం తో  ‘ సౌత్ బరో కమిటీ ‘ ని నిర్మించారు.  అంబేద్కర్ యొక్క విద్యా ప్రఙలు  తెలుసుకున్న ప్రబుత్వం , అంబేద్కర్  యొక్క అభిప్రాయాలు తెలపమని ఆహ్వానించింది. అప్పుడు అంబేద్కర్ కు 28 సంవత్సరాలు. స్వాతంత్ర్య ఉద్యమం ఇవ్వలేని గుర్తింపు  బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చిందంటే – మన దేశం లో స్వాతంత్ర్య ఉద్యమ పోరాటం లో పాతుకు పోయిన కుల పిచ్చి తీవ్రత ఏంటో మనకు తెలుస్తుంది. ఈ రోజు ” భారత్ మాతా కీ జై ” ” వందే మాతరం ” లాంటి స్వాతంత్ర్యా పోరాట నినాదాల్ని వల్లించే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ నినాదాల్లో కుల వ్యవస్థ ఎలా గంగ వెర్రులెత్తిందా అని.
కానీ అంబేద్కర్ 1930 లో అఖిల భారత నిమ్న వర్గాల కాంగ్రె సభలో తన ఉపన్యాసంలో ఇలా అంటాడు ” మన దేశం లో మన దురదృష్ట పరిస్థితులను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నట్టు బ్రిటిష్ చెప్పుకుంటుంది.  అది కేవలం ఈ దేశ రాజకీయ పురోగతిని అడ్డుకోవడం కోసమే అలా చేస్తుంది “
అదే ఉపన్యాసం లో ఇలా అంటాడు –
” మన దేశానికి స్వయంప్రతిపత్తి ఇవ్వడం నేను వ్యతిరేకించలేను. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం మన సమస్యను ఎప్పటికీ తీర్చలేదు. ఐతే కాంగ్రెస్ తో కలవడం వలన మనం సమస్యను ఎలా పరిష్కరించుకోగలమో నాకు అర్థం కాదు. …”
ఈ ఉపన్యాసం తర్వాత ” యూ టూ బ్రూట్ ! ”  ( You too Brutus ! )  పేరుతో తిలక్ తన ” కేసరి ‘ పత్రికలో అంబేద్కర్ ను ” దేశ ద్రోహి ” గా ” బ్రిటిష్ ఏజంట్ ” గా అభివర్ణించాడు.
అంబేద్కర్ కు ఉన్న స్పష్టత , వ్యక్తిత్వం అబ్బురమైనవి.  కులం లాంటి నికృష్ట సాఘిక సమస్య పై అవగాహన లేకున్నా  కేవలం స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందు ఉండి నడిపిస్తుందనే ఒక్క కారణం వల్ల కాంగ్రెస్ గొప్పదైపోదు అని అంబేద్కర్ అభ్రిప్రాయ పడ్డాడు.
ఇలా చూస్తే విప్లవ ఉద్యమాలు కూడా కేవలం కుల సమస్యను దాని లోతుల్లో పరిశిలించడం లో ఫెయిల్ అయ్యినప్పుడు ( తర్వాత దిద్దుబాటు కనిపించినా ) ఇదే వాదనలు వినబడ్డాయి. దళిత వాదులకు వచ్చిన ‘ కాన్ ఫిడెన్స్ ‘ ఇక్కడి నుండే. మీరు విప్లవ ఉద్యమం నడుపుతున్నారనే ఒకే కారణం వలన మేము మీతో ఉండలేము అని ఎదురు వినిపించారు. ( ఐతే ఆ దళిత వాణిలో పదును ఎక్కువ రోజులు నిల్వలేదు. అది తర్వాత చూద్దాం )
అంబేద్కర్ 1930 లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి , కాంగ్రెస్ బహిష్కరించినా, తను  హాజరౌతాడు. ( రెండొ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ అలక తీరి హాజరుతుంది ).  అంబేద్కర్ తనకు కావల్సిన విషయాన్ని సాధించడనికి  Diplomatic tactics  చాలా వాడాడు. తప్పని తెలిసిన చాలా విషయాలను ఎత్తుగడల కింద మలిచాడు.  Absolute sense of facts  ను  relative sense of facts  ను జాగర్తగా అంచనా కట్టాడు.  అలా కాక అంబేద్కర్ సాయుధ విప్లవ కారుడై ఉండి ఉంటే ఒక అద్భుతమైన అమరుడై మన పుస్తకాలలో వెలిగే వాడు కాని అదెలా ఉంటుందంటే – మృత శిశువుకు జన్మనిచ్చి చనిపోయిన తల్లిలాంటి స్థానం. ఇన్ని సంవత్సరాల సాయుధ పోరాటం ఎన్ని ఒడిదుడుకులకు లోనైందో ఊహించలేము. ఐతే అదే దళిత పక్ష పాత దృష్టితో చూస్తే – చివరకు దళితులకు ఏమి మిగిలి ఉండేది – అమరుడైన అంబేద్కర్  అద్భుతమైన చారిత్రక  గుర్తులా ?  అసలు ‘ మతమంటేనే మత్తు మందు ‘ అనే ఒక  absolute fact  ను పట్టుకుని వేలాడుతూ ఉండి ఉంటే దళితులకు ఎటువంటి మత ప్రత్యామ్నాయం చూపించకుండా ఉండి ఉంటే హిందూత్వాన్ని వెల వెల బోయేట్టు చేయగలిగే వాడు కాదు. ఈ విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోకుండా అంబేద్కర్ మతాన్ని ప్రోత్సాహించాడు అని కొంతమంది ప్రగతిశిల వాదులు అనుకోవడం అవివేకం.  
అంబేద్కర్ వికృత బ్రాహ్మణ ఛాందస శక్తుల మధ్య ఒక్కడే ఒక్కడై హిందువులను ద్వేషించి , సిగ్గు పడేట్టు చేసి – ఆర్ ఎస్ ఎస్ బలమైన స్థావరమైన నాగ్ పూర్ లో బుద్ధిజం స్వీకరించాడు. అంబేద్కర్ తెగువకు తార్కాణాలెన్నో !
అంబేద్కర్ కమ్యూనల్ అవార్డ్ విషయంలో దళితులకు ” ప్రత్యేక ఓటు పద్ధతి ” ని బలంగా ముందు తీసుకువచ్చాడు. అదే జరిగి ఉంటే ఈ రోజు దళితులు అనూహ్యంగా ఒక సమాంతర రాజ్యాన్ని సాధించగలిగే వాళ్ళు. వాళ్ళ వోటుతో వారి అభ్యర్థులను ఎన్నుకునే పద్ధతి ఒక రాజకీయ ఎత్తుగడతో కూడిన ప్రణాళిక. బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకున్నా, గాంధి హిందు వ్యవస్థ యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒప్పుకోక పోవడం వలన జరిగిన ” పూన ఒడంబడిక ” లో ” రిజర్వ్డ్ ఓటింగ్ సిస్టం ” వచ్చింది.
చరిత్ర చదివితే మనకర్థమయ్యేది – హిందూ వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వకుండా హిందూ వ్యవస్థ ప్రతిపాదించిన రాజీ ఫార్ములానే రిజర్వేషన్ లు !
అంబేద్కర్ సాంఘిక మార్పు కోరుకున్న ఒక బూర్జువా ఆలోచన కలిగిన మేధావిగా ఇప్పటికీ ఎంతో మంది విప్లవ మేధావుల్లో ఉంది. రంగనాయకమ్మ లాంటి మేధావులు – ఒక 500 పేజీల పుస్తకం కూడా విడుదల చేసారు – అంబేద్కర్ లోని తప్పులు ఎత్తి చూపిస్తూ.
అంబేద్కర్ కు సాంఘిక మార్పు ఒక దీర్ఘ కాలిక ప్రక్రియ అనే విషయం తెలీదు అనడానికి ఏ విధమైన ఆధారాలు లేవు. అలాగే తాను ప్రతిపాదించిన పద్ధతుల వల్ల విప్లవాత్మక మార్పు వస్తుందనే నమ్మకాన్ని వెలువరించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అంబేద్కర్ దీర్ఘ కాలిక పోరాటం మృత శిశువుగా మిగలనీయ కూడదనే ప్రయత్నం లో – దళితుల చైతన్యాన్ని నిశితంగా అంచనా వేసుకుని  existing institutions  ను తన మనుష్యుల కొరకు వాడుకున్నాడు. ప్రతి ప్రజాస్వామిక మేధావిని విప్లవ కారుడుగా ఉండాల్సింది అని కోరుకునే ఒక వెర్రి అంచనా అంబేద్కర్ ను తక్కువ చేస్తుంది. రంగ నాయకమ్మ చేసిన పెద్ద పొరపాటుఇదే ! ఆమె అంబేద్కర్ తప్పులు విజయవంతంగా ఎత్తి చూపింది కాని – అంబేద్కర్ లేని దళితుల జీవితం ఎలా ఉండేదో ఒకే ఒక్క క్షణం ఊహించి ఉండి ఉంటే – ఈ కుల వ్యవస్థ ఉన్నంత కాలం అంబేద్కర్ లో తప్పులు ఎన్నడం ప్రధానం కాదు, ఆయన కృషిని , ఆయన సిద్ధాంతాలను కులవ్యవస్థలో మగ్గిపోయిన అణగారిన వర్గాలకు ప్రేరేపితంగా ఎలా ప్రెజెంట్ చేసి ఉండల్సిందో ఆలోచించడం ప్రధానమై ఉండేది. ఇంతా చేసి ” మృత శిశువు ” లాంటి ఆదర్శ రాజకీయ సొల్యూషన్ తో ముగించింది తప్ప – కాంక్రీట్ గా ఈ కుల వ్యవస్థ ఎలా నిర్మూలింపబడి ఉండొచ్చో తెలియ జేయడం చాత అవ్వలేదు.  రంగ నాయకమ్మ లాంటి మేధావులకు  ” self-goal ”  కొట్టుకోవడం లో ఉన్న ఆనందం , కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాజీ లేకుండా ఆలోచించే ఉద్దేశ్యం లో లేదు.  
అకడమిక్  మార్క్సిస్ట్ ల పరిస్థితి ఇలా ఉంటే –  Dalit fundamentalism  ఒక దృక్పథంగా ఒక మార్గంగా ముందుకొచ్చి – 1980-90 లలో వచ్చిన దళిత చైతన్యాన్ని సరిగ్గా గైడ్ చేయడం లో విఫలం అయ్యింది. ” కుల నిర్మూలన ” కు ముందు మాటగా ” డాక్టర్ అండ్ సెయింట్ ” అనే ఒక అద్భుతమైన విశ్లేషణ అరుంధతి రాయ్ వ్రాయగలిగింది కాని మన దేశం లో దళిత వాణిని ఎత్తి పట్టిన దళిత వాదులు కాదు. అంబేద్కర్ వీళ్ళకు నేర్పించిన ” ధిక్కార స్వరం ” ధిక్కారం దగ్గర , ” ఆత్మ గౌరవాన్ని ” ఆంజనేయ దండకంగా చదవడం లోనే మిగిలిపోయింది. దళిత వాదులు రాజకీయ కెరీరిస్టులుగా, ఆచరణ లేమి కలిగిన వ్యక్తులుగా మిగిలి ఒక  Group force  గా ముందుకు రాలేకపోయారు. ఆచరణ అవలంబనం లేని ధిక్కారం ఛాందస వాదంగా మిగిలిపోతుంది తప్ప బలమైన రాజకీయ వాదంగా నిలబడలేదు. దళిత వాదం స్త్రీ వాదం లాగే  Urban middle class  కు పరిమతమై సహజ మరణానికి దగ్గరగా ఉంది. ధిక్కార స్వరం వినిపించిన దళిత వాణికి ఆధిపత్య సంక్షోభం తో కొట్టుమిట్టాడుతుంది. ఏ ఒక్క నాయకత్వము కూడా దళిత వాదులను ఎక్కువ కాలం ఒకే గాటికి కట్టలేక పోవడానికి ప్రధాన కారణం ఈ  Dalit fundamentalism  ప్రధాన కారణం.
ఇక అంబేద్కర్ ను ఇప్పటి పరిస్థితుల్లో చూడాలంటే – రోజు రోజుకు ఆయన ప్రాధాన్యత పెరుగుతుందే తప్ప తరగడం ఉండడం లేదు. గుజరాత్ గొడవల వెనుక ఉన్నదెవరో బీ జే పీ కి ఓటేసిన ప్రతి హిందువుకూ తెలుసు. అయినా సరే దళిత, గిరిజన, మైనారిటీల సంక్షేమానికి వ్యతిరేకంగా పని చేసే రాజకీయ నాయకున్ని ప్రధానిగా ఎన్నుకోవడం ఈ దేశం లో పాతుకుపోయిన హిందూ ఛాందస వాదానికి ప్రతీక. ఈ హిందూ ఛాందస వాదానికి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ యొక్క ఆలోచనా విఢానాన్ని బలంగా తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. ” మైనారిటీ  ఒక పేలుడు పదార్థం లాంటిది. అది పేలిందంటే రాజ్యం యొక్క మనుగడ ఛిన్నాభిన్నం అవుతుంది ” ” హిందుత్వం ఒక మతం కాదు. ఒక వ్యాధి ” ” ఈ దేశం లో హిందువులు వ్యాధి గ్రస్థులు. వారి వ్యాధి ఈ దేశ ఆరోగ్యానికి , ఆనందానికి హాని కలిగిస్తుందనే విషయం తెలియ జేసేట్టు చేస్తే నాకు సంతృప్తి కలుగుతుంది ”  ” హిందువులకు నేను తోటలో పాము లాంటి వాడిని ” ‘ హిందువులు అత్యంతగా ద్వేషించే వ్యక్తి ఈ దేశం లో నేనే ” అని ఎంతో ధైర్యంగా చాతీ విరిచి హిందూ ఛాందస సమాజాన్ని ఎదుర్కున్న అంబేద్కర్ మన సమకాలీన పరిస్థితులకు ఎంతో అవసరం. ఈ విషయం గ్రహించిన కాషాయ సంస్థలు ముందుగానే అంబేద్కర్ ను తమ వాడిగా సృష్టించే ప్రయత్నం చేయడం కాకతాళీయం కాదు. హిందూ ఛాందస వాదం క్రిస్మస్ ను మిగేస్తుంది. ఈస్టర్ ను మింగేస్తుంది. మన జీవితం లో అనుభవించే ప్రతి చిన్న హక్కును చిదిమేస్తుంది. ఇదే ఫాసిజం గా రూపాంతరం చెందుతుంది. దానిని ఎదుర్కోగలిగిన ఒకే ఒక బలమైన ఆయుధం ” అంబేద్కర్ ” ఒకటే !!!
వినిపించని ఓ కేకలా
వినిపించినా క్షణ కాలమే కొట్టూ మిట్టాడిన ఓ ఆర్తనాదం లా
అతని భాష మిగలాలని కోరుకోలేదు
ఒక దృఢ నిశ్చయం తో బండ రాళ్ళను ఛేదించి
మేరువులా ఒక నిట్ట నిశీధిన  ఆయన వచ్చాడు
పగిలిన పిగిలిన గొంతులకొక భాష
ధారపోస్తున్నప్పుడు
ఆయన ఊహించాడు
ఒకే భాష – ఒకే మాటగా ఒక పునాదిని మిగిలిద్దామనుకుంటే
తన భాషకో ఆయుష్షు కావాలనుకున్నాడు
అర్థమయ్యే భాషను సిద్ధం చేయడానికి
తనకో ప్రాణం కావాలనుకున్నాడు
అంతే తప్ప
పిడికిలితో మెరుపులు రాజేస్తున్నప్పుడు
అగ్ని స్నానం చేస్తాడు
నిజానికి లావా ఉప్పెనల్లో  ఎన్నో సార్లు మరణించి తిరిగి లేచాడు
ఆయన ఎంచుకున్నది మృత శిశువుకు జన్మనిచ్చి
తనువు చాలించిన తల్లి పాత్ర కాదు
అమరత్వానికి వ్యర్థార్థాలు వెదికే సమయం కాదప్పుడు
ఆయన భాష నేర్చిన స్వర పేటికలు నెత్తుటి గడ్డలు
కక్కినా మరణాన్ని కాంభోజ రాగం లో ఆలాపిస్తాయి
మొదట ఒక భాష కావాలి
ఆ భాష కోసం
మృత్యు ధారియై ఆయన నిలవాలి
ఆయన నమ్మిందంతే  !
*

మీ మాటలు

  1. Nisheedhi says:

    Need of the time . one of those must read articles by you . kudos

  2. vijay kumar says:

    Ambedkar did not get the attention as much as it is required both by the Govt. and progressive forces. At this time of raising fundamentalism , noone has a better weapon available than Ambedkar. Thanq for ur patient reading and appreciation, madam.

  3. buchireddy gangula says:

    ఎవరు ఎంతగా విమర్శించినా —అతడు ఒక బలమయిన ఆయుధం — నూరు పాళ్ళు నిజం
    ఫ్యూచర్ లో గాంధీజీ కన్నా అంబేద్కర్ గారు —జనం లో (most..popular.figure-) నిలిచి
    పోతాడని —నా నమ్మకం
    కుమార్ గారు — బాగా చెప్పారు సర్
    ————————————————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  4. N.Ravi Kumar says:

    Manchi vyasam

  5. Gudelli kiritibabu says:

    Good article sir

మీ మాటలు

*