ఒక గుండెతడి మనిషి

 

పి.మోహన్

P Mohan‘‘మీ రాయలసీమ వాళ్లు మీరూ, గారూ అని పిలవరు కదా. మరి నువ్వేమిటోయ్ నన్ను మీరూ, గీరూ అంటావు? చక్కగా మీ కడపోళ్ల మాదిరి నువ్వు అనో, లేకపోతే అందర్లా సీపీ అనో ఏకవచనంలో పిలవబ్బాయ్!’’

చలసాని ప్రసాద్ పదేళ్ల కిందట వాళ్లింట్లో నాతో అన్నమాటలివి. అప్పటికి ఆయన వయసు 73, నా వయసు 26. చలసాని స్నేహం, ప్రేమానురాగాలు ఎంత కమ్మనివో ఈ ఒక్క ఉదాహరణ చాలనకుంటా. అలాంటి చలసాని శాశ్వతంగా దూరం కావడం తెలుగు సాహిత్య ప్రేమికులకు, వ్యవస్థలో మార్పు కోరేవాళ్లకు తీరని లోటు. అదృష్టంపై నాకు నమ్మకం లేదు కాని, ఆయన ప్రేమానురాగాలు పంచుకున్న వాళ్లంత అదృష్టవంతులు ఈ లోకంలో ఉండరు. ఆ అదృష్టం నాకు కాసింతే దక్కింది.

కాలేజీ రోజుల్లో శ్రీశ్రీ సాహిత్య సర్వస్వ సంపుటాలపై చలసాని, కృష్ణాబాయిల పేర్లు చూసి వాళ్లను కలవాలని ఆరాటపడేవాడిని. వాళ్లు విరసం సభల్లో పరిచయమైన కొత్తలో నాకు మామూలుగానే తొలుత వయోవృద్ధుల్లా కనిపించారు. అందుకే గౌరవంతోనే కాకుండా కాస్త భయంతోనూ ఉండేవాడిని. తర్వాత అర్థమైందేమంటే వాళ్లు కల్మశం లేని చిన్నపిల్లలని, మా తరానికంటే ఆధునికులనీ. అప్పట్లో కృష్ణక్కకు రాసే ఉత్తరాల్లో కృష్ణాబాయి గారూ అని రాసేవాడిని. ఆమె ‘‘నాపేరు ‘కృష్ణాబాయి గారూ’ కాదు కృష్ణాబాయి మాత్రమే. అలాగే రాయి’’ అని రాసింది. చలసానికి కూడా ఉత్తరాలు రాసేవాడిని కానీ చాలా తక్కువ. ఆయన ఉత్తరాలు బ్రహ్మరాతలో ఉండేవి. అందుకే అవసరమైతే ఫోన్లో మాట్లాడేవాడిని.

2004లో పుస్తకాల పనిపై విజయవాడ వెళ్లినప్పుడు ఆయన కూడా అక్కడికి వచ్చాడు. ఎవరిదో స్కూటర్ పై వాళ్లింటికీ వీళ్లింటికీ తిప్పాడు. 2006లో విరసంపై నిషేధం ఎత్తేశాక విజయవాడలో సర్వసభ్య సమావేశం జరిగింది. నిర్బంధపు పచ్చి గాయాలు, హాస్టల్ తిండి తెచ్చిన అల్సర్ తో వెళ్లాను. సమావేశం తర్వాత మిత్రుల సలహాపై చికిత్స కోసం విశాఖ వెళ్లాను. చలసాని ఇంట్లో వారం రోజులున్నాను. చలసాని నన్ను స్కూటర్ పై మూడు, నాలుగు రోజులు వరుసగా కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లకు, తెలిసినవాళ్లకు ఫోన్లు చేశాడు. ఆస్పత్రిలో వార్డువార్డూ తిప్పి ఎండోస్కోపీ, రక్తపరీక్షలు వగైరా చేయించాడు. ఓ పక్క పరీక్షలు.. మరోపక్క  వెయింటింగ్ బల్లపై కూచుని ఏవోవో ఎర్ర పాటలు పాడుతూ ఆయన. మధ్యలో మందులు తీసుకొస్తూ, మా వాణ్ని జాగ్రత్తగా చూడాలని డాక్టర్లతో చెప్పిందే చెబుతూ. నాకు కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆయన నాకు పెద్ద రచయితలా, నాయకుడిలా కాకుండా మనసెరిగి మసలుకునే బాల్యమిత్రుడిలా కనిపించాడు. అప్పట్లో నేను కావాలని దూరం చేసుకున్న నాన్న, అన్నయ్యలు ఆయన రూపెత్తినట్లు అనిపించింది.

చలసాని ఇంట్లో ఉన్నవారం రోజులూ ఆయన తెచ్చిపెట్టే టిఫిన్లు, ఇంటి భోజనంతోపాటు  ఆయనింట్లోని పుస్తకాలతో విందుభోజనం చేశాను. ఇళ్లంతా ఎక్కడ చూసినా పుస్తకాలే. మేడ అయితే లైబ్రరీనే. వేలాది ఇంగ్లిష్, తెలుగు పుస్తకాలు. ఆర్ట్ అంటే పిచ్చి కనుక ఆ పుస్తకాల కోసం అరలన్నీ గాలించి 15 ఆర్ట్ పుస్తకాలు, 10 చరిత్ర, రాజకీయాల పుస్తకాలు ఏరుకున్నాను. ఒక అరలో కొక్కోకం వంటి పుస్తకాలు కనిపించాయి. ‘ఇవేంటి, ఇక్కడా?’ అని ఆశ్చర్యంగా అడిగితే, ‘ఏం, వాటిలో జ్ఞానం లేదా?’ అంటూ నవ్వాడాయన. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాక మేడపైకెళ్లి లైబ్రరీని గాలించేవాడిని. నేను అక్కడ ఉన్నప్పుడు చలసాని అక్కగారు వచ్చారు. ఆమెతో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ముచ్చట్లు చెప్పించుకోవడం మరో ముచ్చట.

తిండిలో, బట్టల్లో చలసాని నిరాడంబరత గురించి అప్పటికే కొంత విన్న నేను ఆ వారం రోజులూ ప్రత్యక్షంగా చూశాను. రచయితలంటే మడత నలగని ఖద్దరు బట్టలు వేసుకునేవాళ్లని అనంతపురంలో ఓ వెటకారం ఉండేది. ఇప్పుడూ ఉందేమో. ఇస్త్రీ చేయని బట్టల చలసానిని చూస్తూ ఉంటే ఆ రచయితలు కళ్లముందు కదిలేవారు. వస్త్రధారణ వ్యక్తిగతం కావొచ్చు కానీ, వ్యక్తిగతానికి, రాజకీయాలకు అణువంత తేడా చూపని చలసాని నిబద్ధత గురించి చెప్పడానికే ఈ పోలిక.

ఆస్పత్రిలో చూపించుకున్న తర్వాత తిరిగి అనంతపురం బయల్దేరాను. దాదాపు 30 పుస్తకాలను కర్రల సంచిలో సర్దుకున్నాను. పుస్తకాల విషయంలో చలసాని గట్టి లెక్కల మనిషి. ‘పుస్తకాలతో పనైపోయాక తిరిగి పంపిస్తేనే తీసుకెళ్లు. ముందు ఆ పుస్తకాల పేర్లు, రచయితల పేర్లు ఓ కాగితంలో రాసివ్వు’ అని అడిగాడు. సరేనని రాసిచ్చాను. మందులు కొనిచ్చి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి, చేతిలో ఐదొందలు డబ్బు పెట్టాడు. తర్వాత స్కూటర్ పై ఎక్కించుకుని రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి, తనే టికెట్ కొని, రైల్లో కూర్చోబెట్టాడు. రైలు కదులుతుండగా టాటా చెప్పాడు. నేనూ టాటా చెప్పాను. ఆయన ఫ్లాట్ ఫామ్ పై కనుమరుగు అవుతూ ఉంటే అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న కన్నీళ్లు మౌనంగా గట్లు తెంచుకున్నాయి.

తర్వాత ఆయనను హైదరాబాద్ సభల్లో చూశాను కానీ మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం లేకపోయింది. తన పుస్తకాలు తనకివ్వలేదని అలిగాడు కూడా. అలక తీర్చడానికి ఆ పుస్తకాలను సీతమ్మధార ఇంటి అడ్రసు పంపించాను. నేను గతంలో ఇస్తానని చెప్పిన నా సినిమా ఎన్సైక్లోపిడియా పుస్తకాలను ఇవ్వలేదని చాలాసార్లు నిష్టూరమాడాడు. సెట్టి లక్ష్మీనరసింహం ‘రవివర్మ చిత్రమాలికలు’ పుస్తకం జిరాక్సు కాపీని ఆయనకు గత ఏడాది పంపించాను. దాన్ని పునర్ముద్రిస్తే ఎలా ఉంటుందని, మీరు టీకా టిప్పణీ రాస్తారా అని అడిగాను. ముందు పుస్తకం చూద్దామని, సెట్టి వారసులు విశాఖలో ఉన్నారని, వారి సాయం తీసుకుందామని అన్నాడు. నెలకిందట ఆ పుస్తకం గురించే ఆయన కృష్ణక్కతో మాట్లాడాడట. కృష్ణక్క ఫోన్ చేసి.. ‘నువ్వు చలసానితో ఏదో పుస్తకం గురించి చెప్పావుట. ఏంటా పుస్తకం? తనకు గుర్తుకురావడం లేదు’ అని చెప్పింది.

ప్రేమానురాగాలకు కొనసాగింపు ఇవ్వని పరమయాంత్రికతలో కొట్టుకుపోవడం వల్ల చలసానితో కలిసి తిరిగే భాగ్యం దక్కలేదు. కృష్ణక్క పుస్తకావిష్కరణ సభలో ఆయనను చివరిసారిగా చూసి, నా ‘డావిన్సీ’ పుస్తకం ఇచ్చాను. జాగ్రత్తగా సంచిలో వేసుకున్నాడు, భిక్ష అందుకునే బౌద్ధసన్యాసిలా.

బతుకు తెరువు సుడిలో కొట్టుపోతూ ఆయనను కడసారి చూసుకునే భాగ్యానికి కూడా నోచుకోలేకపోయాను. వీలైతే ఇప్పుడే ఆయన మరీమరీ కోరిన సినిమా ఎన్సైక్లోపిడియా పుస్తకాలను విశాఖ తీసుకెళ్లి ఆయన చెంత ఉంచాలనిపిస్తోంది. దేని విలువైనా అది ఉన్నప్పటికంటే లేనప్పుడే బాగా తెలుస్తుంది. చలసాని కూడా అంతే. ఆయన విలువేమిటో విరసానికి, తెలుగు సాహిత్యలోకానికి, సమాజానికి ఇకపై మరింత బాగా తెలుస్తుంది. చలసాని పేరుప్రతిష్టల కోసం పాకులాడలేదు. శ్రీశ్రీ, కొ.కొ. సాహిత్యసర్వస్వాల కోసం తన రచనావ్యాసంగాన్ని త్యాగం చేసి, విరసం, ప్రజాపోరాటాల కోసం తన జీవితాన్ని కొవ్వొత్తిగా కరిగించుకున్నాడు. ఆ పని చేస్తే నాకేంటి లాభం? అని ఆలోచించే వర్తమానంలో చలసాని లాంటి వ్యక్తులు అరుదు. చలసాని విరసం నాయకుడు, కార్యకర్త, దాహం తీరని సాహిత్యపిసాసి. ఇంకా ఏమిటేమిటో కావచ్చు. కానీ తొలుత ఆయన సాటిమనిషిని ప్రేమగా దగ్గరికి తీసుకునే గుండెతడి మనిషి. ఇప్పుడు ఆయన లేరు. కానీ ఆయన నన్ను వెంటేసుకుని తిరిగిన కేజీహెచ్ ఆస్పత్రి జ్ఞాపకాలు మాత్రం నిత్యనూతనంగా ఉన్నాయి.

*

కుంచెకి ఆయుధ భాష నేర్పినవాడు!

పి. మోహన్

 

P Mohanచిత్తప్రసాద్ స్నేహశీలి. దేశంలోనే కాదు నానా దేశాల్లో బోలెడు మంది మిత్రులు. డెన్మార్క్ వామపక్ష కవి ఎరిక్ స్టీనస్, చెకొస్లవేకియా ఇంజినీరు ఇంగ్ ఫ్రాంటిసెక్ సలబా, ప్రాగ్ లోని ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మిలోస్లావ్ క్రాసా, సీపీఐ కార్యకర్త తారా యాజ్ఞిక్, ఆమె భర్త, పిల్లలు, పీసీ జోషి సహచరి కల్పనా దత్తా, బెంగాల్ కరువును, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కెమెరాలో బంధించిన సునీల్ జనా, లక్నో ‘బ్రదర్’ మురళీ గుప్తా, ఎంఎఫ్ హుస్సేన్.. ఇలాంటి కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్తలతో చిత్త కలసి తిరిగేవాడు. వీళ్లలో చాలామంది కలిగినవాళ్లు. చిత్త నోరు తెరిచి అడగాలేకానీ వేలు గుమ్మరించగలవాళ్లు. కానీ చిత్త ఎన్నడూ అలా గుమ్మరించుకోలేదు. చిత్తకు కొండంత అత్మాభిమానమని, డబ్బు సాయం చేస్తామంటే చిన్నబుచ్చుకునేవాడని, జాలిపడితే కోపగించుకునేవాడని మిత్రులంటారు.

‘నేను తొలిసారి చిత్త లినోకట్లు చూడగానే ముగ్ధుడిని అయిపోయాను. వాటిలో మతగాథల బొమ్మలు కాకుండా సాదాసీదా బతుకు, పేదల బాధలు ఉన్నాయి. ఇక అప్పట్నుంచి ఏ వారాంతమూ నేను అతన్ని విడిచి ఉండలేదు. అతని గదికి వెళ్లేవాడిని, లేకపోతే మా ఇంటికి పిలిచేవాడిని. కానీ అతడు దుర్భర పేదరికంతో బాధపడుతున్నాడని, పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడని చాలా నెలల తర్వాత తెలిసింది. ఆత్మాభిమానంతో అతడు ఆ సంగతిని బయటపడనివ్వలేదు. తన బొమ్మలను నాకు అమ్మడానికీ ప్రయత్నించలేదు. నేనే అతని పరిస్థితి అర్థం చేసుకుని కొన్ని బొమ్మలను కొనడానికి ప్రయత్నించేవాడిని. కానీ అతడు మొండివాడు. బొమ్మల ఖరీదు చెప్పకపోవడంతో పెద్ద చిక్కొచ్చేది. అందుకే నాకు తోచినంత చ్చేవాడిని. అతని జేబులో కాసిని డబ్బులు కుక్కడానికి నానా యాతనా పడేవాడిని.. కొన్నిసార్లు తలప్రాణం తోకకొచ్చేది. డబ్బుసాయంతో మన స్నేహాన్ని కించపరుస్తావా అని కేకేలేసేవాడు..’ అని చెప్పాడు మిత్రుడు సలబా.

‘డబ్బు సంపాదించడానికే బాంబేకి వచ్చి ఉంటే ఎప్పుడో సంపాదించి ఉండేవాడినమ్మా. మార్కెట్ ప్రకారం నడిచే ఉద్యోగాలు నాకు సరిపడవు కనుకే ఉద్యోగం చేయలేదు… చాలామంది కేవలం పెయింటింగులు వేసే మద్రాస్, ఢిల్లీ, కలకత్తా, బాంబేల్లో ఇళ్లు, కార్లు కొనిపడేస్తున్నారు. దీని వెనక ఉన్న మతలబు ఏంటంటే, ధనికులకు తగ్గట్టు మారిపోవడం, ఆత్మగౌరవాన్ని మంటగలుపుకోవడం, కళాసృజనలో దగా చేసుకోవడం. నాకు ఆ దారి తొక్కాల్సిన అగత్యం లేదు..’ అని తల్లికి రాశాడు చిత్త. అతని మదినిండా బొమ్మలు.. బొమ్మలు.. అవికూడా బాధల పాటల పల్లవిని వినిపించే గాఢమైన నలుపుతెలుపు బొమ్మలు..  ఆ బొమ్మలతోనే తను బతకాలి. బొమ్మల్లో రాజీపడకూడదు. కానీ వాటితోనే బతకాలి. ఎంతొస్తే అంత. చేతికష్టంతో నిజాయితీగా బతకాలి. ముంబై పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ కు, బెంగాల్, డెన్మార్క్, చెకొస్లవేకియాల్లోని పబ్లిషింగ్ కంపెనీలకు బొమ్మలు వేశాడు. బాంబేలోని లిటిల్ బ్యాలే ట్రూప్ కు స్క్రీన్లు, క్యాస్ట్యూములూ అందించాడు. బిమల్ రాయ్ కళాఖండం ‘దో బీగా జమీన్’ సినిమాకు లోగో వేశాడు. 1958లో ఎవరో అడిగితే పాల్ రాబ్సన్ జయంతికి నిలువెత్తు పెయింటింగ్ వేశాడు. ఏది వేసినా తనకిష్టమైందే వేశాడు.

struggle

చిత్త వర్ణచిత్రాలు కూడా అతని లినోకట్లంత శక్తిమంతంగా ఉంటాయి. 1938నాటి స్వీయచిత్రంలో ఆలోచనామగ్నుడై కనిపిస్తాడు(ఈ చిత్రం ఈ వ్యాసం తొలిభాగంలో ఉంది). పార్టీ పరిచయాల్లోకి వస్తున్న ఆ యువకుడి ముఖంలో, నేపథ్యంలో అరుణకాంతి అలుముకుపోయింది. వర్ణచిత్రాల్లోనూ అతడు శ్రమైక జీవన సౌందర్యానికే పట్టంగట్టాడు. పోరాటాలనే కాకుండా సంతాల్, కాశ్మీరీ అతివల నృత్యాలను, బాంబే రేవు పడవలను, నగర శివార్లలోని పచ్చిక బయళ్లనూ పరిచయం చేశాడు. చిత్త రంగుల ఆడాళ్ల బొమ్మలు క్యూబిజం, ఫావిజం ప్రభావాలతో పికాసో, మతీస్ లను గుర్తుకుతెస్తాయి. కానీ ఆ మనుషుల హావభావాల్లో అసలుసిసలు భారతీయ ఉట్టిపడుతుంటుంది. చిత్త పంటపొలాలు, పూలగుత్తుల బొమ్మలు అతనివని తెలుసుకోకుండా చూస్తే వ్యాన్గో వేసిన చిత్రాలేమో అనిపిస్తుంది. కానీ చిత్తకు తాను వ్యాన్గోను కానని తెలుసు. ‘నా గురించి నేను ఎక్కువ ఊహించుకుంటున్నానని నువ్వు పొరపడొద్దు మిత్రమా! నేనందుకు పూర్తి భిన్నం. నేను వ్యాన్గో అంత ప్రతిభావంతుడిని కానన్న సంగతి అందరికంటే నాకే బాగా తెలుసు. కాను కనుకే నా జీవితం, మనసూ ఈ దేశ విప్లవపోరాటాల్లో నిమగ్నమైపోయాయి..’ అంటూ మురళికి తనను ఆవిష్కరించుకున్నాడు.

1950 దశకం మధ్యలో చిత్త పపెట్ షోలపై మళ్లాడు. వ్యాపారంపై బాంబేకి వచ్చిన చెక్ మిత్రుడు సలబా పపెట్ షోలు వేస్తుండేవాడు. చిత్తకూ నేర్పాడు. తన దేశానికి వెళ్లిపోతూ పపెట్ సామగ్రినంతా చిత్తకు ఇచ్చేశాడు. చిత్త కూడా కొబ్బరి చిప్పలు, గుడ్డపేలికలు వంటి వాటితో కీలుబొమ్మలు(పపెట్స్) సొంతంగా తయారు చేసుకున్నాడు. తన ట్రూప్ కు ‘ఖేలాఘర్’ అని పేరుపెట్టుకున్నాడు. షోల కోసం కథలూ, పాటలూ రాసుకున్నాడు. ఈ బొమ్మలాట కోసం చుట్టుపక్కలున్న మురికివాడల పిల్లలు చిత్త చుట్టూ మూగేవాళ్లు. చిత్త వాళ్లకు కూడా బొమ్మలాడించడం నేర్పాడు. వాళ్లకు కథలు వినిపిస్తూ ఆ బొమ్మలు ఆడించి, నవ్వుల్లో తేలించేవాడు. వచ్చే కాస్త డబ్బునూ ఈ షోలకు ఖర్చుపెట్టేసి ఉత్త చేతులతో మిగిలిపోయేవాడు. ‘నా దగ్గర ఓ మంచి టేప్ రికార్డర్ ఉండుంటే ఈ షోలలో నాకింక అడ్డేముంది’ అని అన్నాడు చిత్త. అతడు తన బొమ్మలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడని అంటాడు సునీల్ జనా. చిత్త ఫొటోలు కూడా తీసేవాడు. మిత్రులతో కలసి చుట్టుపక్కల ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లేవాడు. కొండకోనల్లో మిత్రులను నుంచోబెట్టి ఫొటోలు తీసేవాడు.

puppets

చిత్త భారతదేశ చరిత్రలో కీలక ఘట్టాలను చూపుతూ బొమ్మలతో పుస్తకం తేవాలనుకున్నాడు. చాలా చిత్రాలు వేశాడు. పబ్లిషర్లు ముందుకురావడం, ముందుకొచ్చిన వాళ్లు డబ్బులివ్వకపోవడంతో ఆ పని ఆగిపోయింది. సలబా సాయం చేస్తానన్నాడు. అయితే వరదల్లో ఆ బొమ్మలు కొట్టుకుపోవడంతో చరిత్ర బొమ్మలు కాలగర్భంలో కలిసిపోయాయి. రామాయణాన్ని బొమ్మలకెత్తే పనికూడా డబ్బు కష్టాలతో ఆగిపోయింది. రామాయణాన్ని ఒక కథలాగే చూసిన చిత్త ఆ బొమ్మలను చాలా సరళంగా, జానపద చిత్రాల శైలిలో వేశాడు. ఇన్ని కష్టాల నడుమ.. తను ఆరాధించే నందలాల్ బోస్ తన లినోకట్లను చూసి మెచ్చుకోవడం, మురికివాడల పిల్లలకు చిట్టిపొట్టి కథలు చెప్పించి నవ్వించడం, ఆడించడం వంటి అల్పసంతోషాలూ ఉన్నాయి.

పార్టీకి దూరమై ఇలాంటి ఎన్ని కళావ్యాసంగాల్లో మునిగినా రాజకీయాలు ఎప్పటికప్పుడు విశ్వరూపంలా ముందుకొచ్చి నిలిచేవి. ఇక మళ్లీ బొమ్మల్లో కార్మికకర్షకులు, రిక్షావాలాలు, విప్లవకారులు ప్రత్యక్షమయ్యేవాళ్లు.

‘జీవితాన్నిపూర్తిగా కళకు అంకింతం చేసి, రాజకీయాలను పక్కకు నెట్టాలని ఎంత బలంగా ప్రయత్నిస్తున్నానో అంత బలంగా ఈ దేశప్రజల రాజకీయాలు తిరిగి నన్ను పట్టుకుంటున్నాయి. అదంతే. కళాకారుడు మనిషి. అంతకు మించి మరేమీ కాదు. తను పుట్టినగడ్డకు అతడు బద్ధుడు. ఈ సంగతి అతనికి తెలిసినా, తెలియకపోయినా అతడు ఈ దేశజనుల జీవితంలో భాగం.. ప్రతి కళాకారుడూ త్వరగానో, ఆలస్యంగానో, తెలిసో  తెలియకుండానో తన నైతిక, రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేసి తీరతాడు. నైతికవాదుల, రాజకీయ సంస్కర్తల సంప్రదాయాన్ని నేను నా కళలో ఆచరించి చూపాను. ప్రజలకు అండగా నిలబడ్డమంటే కళకూ అండగా నిలబడ్డమే. కళావ్యాసంగం అంటే మత్యువును బలంకొద్దీ తిరస్కరించమే… రెండో ప్రపంచ యుద్ధం నన్ను సంప్రదాయకళల ప్రభావం నుంచి బయటికి రప్పించింది. నా కుంచెను పదునైన ఆయుధంలా తయారు చేసుకునేలా మార్చింది. నా కళా ఆశయాలు సమకాలీన ప్రపంచంతో సంలీనమయ్యాయి. కళ అనేది నా ఒక్కడి ఆయుధం, కళాకారుడి స్వీయ అభివ్యక్తి ప్రకటన సాధనం మాత్రమే కాదని, అతడు జీవిస్తున్న సంఘపు ఆయుధం కూడా అని అర్థం చేసుకున్నాను. ఆ సంఘంలో అతనితోపాటు, తోటి మనుషుల స్వీయ అభివ్యక్తులు కూడా ఉంటాయి’ అంటాడు చిత్త.

తలకిందుల వ్యవస్థపై అతని ధిక్కారం కేవలం బొమ్మలకే పరిమితం కాలేదు. ఓసారి శివసేన కార్యకర్తలు బాంబేలో బందు చేసి, అంగళ్లను మూయించడానికి చిత్త ఉంటున్న వీధికి వచ్చారు. అతడు కోపంతో వాళ్లముందుకు దూసుకెళ్లాడు. ‘ఏమిటీ దౌర్జన్యం? బందులతో జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ముందు ఇక్కన్నుంచి వెళ్లిపోండి’ అని కేకేలేశాడు. వాళ్లు నోరుమూసుకుని వెళ్లిపోయారు. మరో ముచ్చట చిత్త మాటల్లోనే వినండి. 1959లో ‘‘రక్షణమంత్రి మీనన్ ఎన్నికల ప్రచారం కోసం మా వీధికి వచ్చాడు. దేశం కోసం పనిచేయాలంటూ జనానికి అర్థం కాని ఇంగ్లిష్ లో ఊదరగొట్టాడు. ‘అయ్యా, మీరు చెప్పేది బాగానే ఉంది కానీ, ఈ గడ్డు పరిస్థితుల్లో మేమెలా పనిచెయ్యాలో చెప్పండి’ అని అడిగాను. ‘నీతో తర్వాత మాట్లాడతా’ అని చెప్పి మళ్లీ ఉపన్యాసం దంచేశాడు. తర్వాత ఓ పోలీసు ‘అతడు కమ్యూనిస్టు సర్’ అని మీనన్ కు బిగ్గరగా చెప్పాడు. మీనన్ ముఖంలో భయపు ఛాయలు. ఉపన్యాసం అయిపోయాక కారులో తుర్రుమన్నాడు..’

girl

చిత్తప్రసాద్ అంటే సంతోషంగా ఉండేవాడని అర్థం. ఈ చిత్తప్రసాద్ సార్థకనామధేయుడు కాదు. తన సంతోషాన్ని తృణప్రాయంగా ఎంచి సామాన్యుల ఈతిబాధలను బొమ్మకట్టడానికి తన బతుకును కొవ్వొత్తిలా కరిగించుకుని అసమాన కళాకాంతులు వెదజల్లాడు. మనిషి మనిషిగా బతకాలని సమసమాజ స్వప్నాల్లో పలవరింతలు పోయి తన బాగోగులను మరచిపోయాడు. ‘ప్రకృతి కోతిని మనిషిగా మారుస్తూ.. మానవజాతిని నిరంతరం పునర్నవం చేస్తోంది. అయితే మానవజాతి ఇప్పటికీ కోతిలా వ్యర్థవ్యాపకాలనే ఇష్టపడుతోంది. ఒక పనిచేసే ముందు కాస్త ఆగి, ఆలోచించే ఓపిక లేదు దానికి. దానికి అది కావాలి, ఇది కావాలి, ప్రతిదీ కావాలి.. తనకు దక్కిన దానితో అది తృప్తిడడం లేదు. ప్రతిదాన్నీ కొరికి అవతల పడేస్తోంది. గబగబా మింగింది అరగడం లేదు, అయినా నిరంతరం ఆకలే దానికి. మనిషి మనసులో అసంతృప్తి అనే అజీర్తి ఉంది. స్వార్థపరుడికి రెండే రోగాలు.. దురాశ, అసంతృప్తి.. ’ అని తల్లితో వాపోయాడు చిత్త.

నిత్యదరిద్రం, నిర్నిద్ర రాత్రులు, అనారోగ్యం, ప్రతిదానికి కలతపడిపోవడం, ఇల్లు ఖాళీ చేయాలంటూ యజమాని హెచ్చరికలు.. అన్నీకలసి చిత్తను శారీరకంగా కుంగదీశాయి. అసలు వయసుకంటే పది, పదిహేనేళ్లు పెద్దగా కనిపించేవాడు. 70వ దశకంలో తిండికి చాలా ఇబ్బందిపడ్డాడు. అదివరకు బొమ్మలకొచ్చిన డబ్బుల్లో పదోపరకో తల్లికి పంపుతుండేవాడు. ఇప్పుడు తనకే కష్టంగా ఉంది. ఆదుకునేవాళ్లున్నారు కానీ ఏనుగంత ఆత్మాభిమానం కనుక ఆకలికేకలు రూబీ టెర్రేస్ గది నుంచి బయటికి వినిపించేవి కావు. అరకొరా పనులతోనే కాలం వెళ్లబుచ్చేవాడు. డబ్బు విషయంలో చిత్త ఎంత ‘మొండివాడో’ చూడండి..

chittaprosadఓసారి ప్రముఖ కళావిమర్శకుడు, రచయిత ముల్క్ రాజ్ ఆనంద్.. చిత్త బొమ్మలను అతనికి తెలియకుండా  ఏదో విదేశీ పత్రికకు పంపాడు. అవి అచ్చయ్యాయి. చిత్తకు సంగతి తెలిసి కడిగేశాడు. ఆ పత్రిక పేరున్న పత్రిక కనుక అడిగి డబ్బులిప్పించమన్నాడు. ముల్క్ రాజ్ ‘వాళ్లివ్వరుగాని నా జేబులోంచి ఈ వంద ఇస్తున్నా, తీసుకో’ అని మనియార్డర్ పంపాడు. చిత్త తిప్పికొట్టాడు. తనకు రావాల్సింది ఐదొందలని, కక్కి తీరాల్సిందేనని పట్టుపట్టాడు. ఇదే చిత్త చెకొస్లవేకియా పబ్లిషింగ్ కంపెనీకి మరోరకంగా షాకిచ్చాడు. ఆ కంపెనీ చిత్తతో కవర్ పేజీలు, ఇలస్ట్రేషన్లు వేయించుకుని చెక్కు పంపింది. చిత్త ఆ మొత్తాన్ని చూసి నిప్పులు తొక్కి వెనక్కి తిప్పిపంపాడు. తనకు రావాల్సినదానికంటే పదింతలు ఎక్కువిచ్చారని, తను తీసుకోనని రాసి పంపాడు. కంపెనీ తలపట్టుకుంది. తమ దేశంలోని మార్కెట్ ప్రకారమే డబ్బు ఇచ్చామని, అంతకంటే తక్కువిస్తే మోసం చేశారంటూ అధికారులు తమను ఇబ్బందిపెడతారని రాసింది. చిత్త వెనక్కి తగ్గలేదు. చివరికి అతడు బొమ్మలను వాపసు తీసుకుంటాడనే భయంతో కంపెనీ ఏవో తంటాలు పడి చిత్త అడిగిన తక్కువ డబ్బు ఇచ్చేసింది. ఇంత అమాయకుడు ఇప్పుడు తన బొమ్మలకు లక్షలు విలువకడుతున్న నేటి ఆర్ట్ మార్కెట్ ను చూసుంటే గుండెపగిలి చచ్చుండేవాడు.

చిత్త చిత్రాలను మనవాళ్లకన్నా విదేశీయులే ఎక్కువ కొన్నారు. చిత్త ఊరికే డబ్బిస్తే తీసుకోడు కనుక కొందరు బొమ్మలను వేరేవాళ్లకు అమ్మిపెడతామని చెప్పి తామే ఉంచుకుని డబ్బులిచ్చారు. అతని చిత్రాలు మన దేశంలోకంటే విదేశాల్లోనే ఎక్కువ ఉన్నాయని ఒక అంచనా. అతడు బతికుండగా జరిగిన రెండే రెండు సోలో ఎగ్జిబిషన్లలో మొదటిది 1956లో చెకొస్లవేకియా రాజధాని ప్రాగ్ లోనే జరిగింది, నాటి మన తోలుమందం పాలకుల పరువు తీస్తూ. రెండోది 1964లో కలకత్తాలో జరిగింది. 1972లో చిత్త జీవితం, కళపై చెక్ దేశీయుడు పావెల్ హాబుల్ ‘కన్ఫెషన్స్’ పేరుతో 15 నిమిషాల డాక్యుమెంటరీ తీశాడు. అందులో చిత్త తన కళ, రాజకీయాలు, సమాజం గురించి మాట్లాడుతూ కనిపిస్తాడు. శాంతి ఉద్యమానికి ఇది దోహదమంటూ డాక్యుమెంటరీకి వరల్డ్ పీస్ కౌన్సిల్ అవార్డు కూడా వచ్చిది.

చెకొస్లవేకియా వాసులు చిత్తను తమవాడే అన్నంతగా అభిమానించారు. చేవచచ్చిన స్వతంత్ర భారతావనిలో అతని కళకు గౌరవం దక్కకున్నా, నిత్యం పోరాటాలతో వెల్లువెత్తిన తూర్పు యూరప్ దేశాల్లో అతని బొమ్మలకు జనం గుండెల్లో దాచుకున్నారు. అతని బొమ్మలను పత్రికల్లో అచ్చేసుకున్నారు. తమ పుస్తకాలకు ఎక్కడో దేశాల అవతల ఉన్న అతన్ని వెతికిపట్టుకుని బొమ్మలు వేయించుకున్నారు. అతని కవితలను అనువదించుకుని మురిసిపోయారు. అతన్ని ఎలాగైనా తమ దేశానికి తీసుకెళ్లాలని సలబా విశ్వప్రయత్నాలు చేశాడు. చిత్తతో పపెట్ షో ఇప్పించేందుకు ప్రయత్నించాడు. క్రాసా డబ్బు సర్దాడు. అన్నీ సిద్ధమయ్యాయి. కానీ చిత్తకు చెక్ లో ఏదైనా జరగరానిది జరిగితే ఖర్చులు పెట్టడానికి హామీదారు కావాల్సి వచ్చింది. సలబా బాంబేలో తనకు తెలిసిన ఒకతన్ని హామీదారుగా ఉండమన్నాడు. అతడు సరేనన్నాడు.

 

డాక్యుమెంట్లపై సంతకాల కోసం చిత్తను అతని దగ్గరికి పంపాడు సలబా. ఆ హామీదారు మాటల మధ్యలో ‘నా దయవల్లే నువ్వుపోతున్నావు..’ ధోరణిలో కించపరచేలా మాట్లాడ్డంతో చిత్త సర్రున అక్కన్నుంచి వచ్చేశాడు. ప్రయాణం ఆగిపోయింది. మరోసారి 1965లో చెక్ పపెట్రీ గ్రూప్ ‘రోదోస్త్’ కళాకారిణి ఇవా వోడికోవా ద్వారా ప్రయత్నించాడు సలబా. ఆమె భారత్ కు వచ్చినప్పుడు చిత్తను కలసి ప్రయాణానికి ఏర్పాట్లు, అనుమతులు అన్నీ సిద్ధం చేసింది. ఆమె ఏదో పనిపై ఇండోనేసియా వెళ్లి విమానంలో తిరిగొస్తూ కైరోలో విమానం కూలడంతో చనిపోయింది. తను చెక్ ను చూసే భాగ్యానికి నోచుకోలేదంటూ సలబాకు లేఖ రాశాడు చిత్త. సలబా చివరి ప్రయత్నం కూడా ఫలించలేదు. ప్రయాణానికి అన్నీ సిద్ధమయ్యాక ప్రయాణించాల్సినవాడు లోకంలో లేకుండా పోయాడు.

1976 ప్రాంతంలో చిత్తకు బ్రాంకైటిస్ సోకింది. దాదాపు 32 ఏళ్లపాటు బాంబేలో బతికి, అక్కడి మనుషుల సుఖదుఃఖాలు పంచుకుని, వాటిని బొమ్మల్లోకి తర్జుమా చేసిన ఆ అపురూప కళావేత్తను పట్టించుకునే నాథుడే లేకపోయాడు ఆ మహానగరంలో. చెల్లి గౌరి బాంబే వచ్చి అన్నను కలకత్తా తీసుకెళ్లింది. తన దేశప్రజల ఆరాటపోరాటాలను నాలుగు దశాబ్దాలపాటు అవిశ్రాంతంగా చిత్రికపట్టి, కన్నీటి వరదలు పారించి, గుండెనెత్తురులు ఉప్పొంగించి.. ప్రజాకళకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన వన్ అండ్ ఓన్లీ చిత్త 1978 నవంబర్ 13న కలకత్తాలోని శరత్ బోస్ రోడ్డులో ఉన్న రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్టాన్ జనరల్ హాస్పిటల్లో 63వ ఏట పరమ అనామకంగా కన్నుమూశాడు.

1979లో ప్రాగ్ లో, కలకత్తాలో అతన్ని స్మరించుకుంటూ ఎగ్జిబిషన్లు పెట్టారు. తర్వాత ప్రాగ్, ఢిల్లీ, హైదరాబాద్ లలో అతని బొమ్మలు ప్రదర్శించారు. 2011లో ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ అతని చాలా బొమ్మలను సేకరించి ఢిల్లీ, ముంబై, కలకత్తాల్లో ఎగ్జిబిషన్లు పెట్టింది.

చిత్త దేశానికి ఇచ్చినదానితో పోలిస్తే దేశం అతనికిచ్చింది శూన్యం. ‘నా పెయింటింగులను ఇంట్లో ఉంచుకోవడం నీకు కష్టమవుతుందమ్మా. వాటిని గంగానదిలో వదిలెయ్’ అని చిత్త తన చెల్లితో అన్నాడంటే ఈ దేశం అతని కళను అతడు బతికి ఉన్నప్పుడు ఎంత గొప్పగా గౌరవించిందో అర్థం చేసుకోవచ్చు. బెంగాల్ కరువుకు బలైన మిడ్నపూర్ లోని స్వాతంత్ర్య వీరులను తలచుకుంటూ చిత్త తన ‘ హంగ్రీ బెంగాల్’లో.. ‘నిన్న మన స్వాతంత్ర్యం కోసం తెగించి పోరాడిన దేహాలను ఇప్పుడు కుక్కలు, రాబందులు పీక్కుతుంటున్నాయి. ఒక దేశం తన యోధులకు అర్పించే నివాళి ఇదేనా?’ అని ఆక్రోశించాడు.

చిత్త చరిత్రను, అని ప్రజాకళాసంపదను కన్నెత్తి చూడదల్చుకోని నేటి మన పేరుగొప్ప ప్రజాస్వామ్య పాలకులు అతనికి అర్పిస్తున్న నివాళి అంతకంటే ఘనంగా ఉందా? రవీంద్రనాథ్ టాగూరు వందో జయంతినే కాకుండా 150వ జయంతినీ కోట్లు ఖర్చుపెట్టి జరుపుకుని, అతని ‘వెర్రిమొర్రి’ బొమ్మలను దేశమంతటా తిప్పారు మూడేళ్లకిందట యూపీఏ పాలకులు. దేశజనుల బాహ్యాంతరంగాలను, దారిద్ర్యాన్ని, మౌనవేదనను ఉట్టిపడే భారతీయతతో అనితరసాధ్యంగా వర్ణమయం చేసిన అమృతమూర్తి అమృతా షేర్గిల్ శత జయంతి పండుగను అతిజాగ్రత్తగా మరచిపోయారు. అమృత బొమ్మలకంటే ప్రమాదరకమైన బొమ్మలు సంధించిన చిత్త వందో జయంతిని అతడు నరనరానా ద్వేషించిన నాగపూర్ నాజీ పాలకులు పట్టించుకుంటారనుకోవడం భ్రమ.

blue flowers

చిత్త పేరుప్రతిష్టల కోసం పాకులాడలేదు. బడుగుజీవుల సుఖసంతోషాల కోసం తపనపడ్డాడు. తన కళతో వాళ్ల కన్నీరు తుడిచి, వాళ్లతో జెండాలు, బందూకులు పట్టించి దోపిడీపీడకుల గుండెలపైన కదం తొక్కించాడు. చిత్త ఆదర్శాలు, విలువలు ఏమాత్రం ‘గిట్టుబాటు’ కాని వ్యవహారాలు కనుక అతనికి వారసులు లేరు. ‘భారత్ లో గ్రాఫిక్ కళలు, ఇప్పటికీ నిరాశాపూరితంగా, బలహీనంగా ఉన్నాయి. ప్రచారం, ఆదర్శాల వంటివాటిపై కళాకారులు మొగ్గుచూపకపోవడం కారణం కావచ్చు’ అని చిత్త 1958లో అన్నాడు. నేటికి తేడా ఏమైనా ఉందా? చిత్త రాజకీయ విశ్వాసాలు, వాటిపట్ల అతని నిబద్ధత వల్లే అతనికి బతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా ‘మెయిన్ స్ట్రీమ్ ఆర్ట్’ లో ఎన్నడూ చోటు దక్కలేదు.

చిత్త కలలు ఇంకా ఫలించలేదు. ఆన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం, కరువంటూ కాటకమంటూ కనుపించని కాలాలు చాలా చాలా దూరంలో ఉన్నాయి. లినోలపై, కేన్వాసులపై చిత్త గొంతుచించుకుని శఠించిన దుర్మార్గాలు, దోపిడీపీడనలు ప్రజాస్వామ్యం, దేశభక్తి ముసుగుల కింద కోట్లరెట్లు పెచ్చరిల్లి జనాన్ని కాల్చుకుతింటున్నాయి. ఆనాడు ఒక్క బెంగాల్లోనే కరువైతే, నేడు దేశమంతా తిండిగుడ్డనీడల కరువులు. ‘96 కోట్ల సెల్ ఫోన్లు’,   అధికారిక దొంగలెక్కల ప్రకారమే 40 కోట్ల మంది నిత్యదరిద్రులు ఉన్న ఘన భారతావనిలో ఈ కరువులతో నల్ల, తెల్ల కుబేరులను బలుపెక్కిస్తూ మన జీడీపీ, తలసరి ఆదాయం తెగ వాచిపోతున్నాయి. చిత్త తుపాకులు, గొడ్డళ్లు ఎక్కుపెట్టిన విదేశీగద్దలు నల్లదొరల ఆహ్వానాలతో మందలుమందలుగా ఎగిరొచ్చి మాయారూపాల్లో ఈ గడ్డ సరిసంపదలను తన్నుకుపోతున్నాయి.

అతడు తిరుగాడి బొమ్మలు వేసిన బెజవాడ నేలతల్లిని ‘రాజధాని’ మంత్రగాడు చెరపట్టాడు. చిత్తను రగిలించి, మురిపించిన సాయుధపోరుసీమలో నయా నిజాంలు తుపాకుల అండతో కొత్త గడీలు కడుతున్నారు. నైజాము సర్కరోన్ని గోల్కండా ఖిల్లా కింద గోరీ కడతామని యుద్ధగీతికలతో గర్జించిన ప్రజాకవుల, కళాకారుల వారసులు పెరుగన్నం కోసం కొత్త నిజాం పంచన చేరి అతన్ని స్తోత్రపాఠాలతో ముంచెత్తుతూ మహోన్నత పోరాట వారసత్వాన్ని పెంటకుప్పలో బొందపెడుతున్నారు. చిత్త ద్వేషించిన నిరంకుశ, స్వార్థకపటాల క్రీనీడలు మరింత ముదిరి మదరిండియా అంతటా గాఢాంధకారం అలుముకుంది.

మరి ఈ చీకటి తొలగిపోదా? అడుగు కదిపితే చాలు కత్తులు దూసి నెత్తురోడిస్తున్న ఈ తిమిరానికి అంతం లేదా? చిత్త తన నిశాగంధి(‘నైట్-కాక్టస్) కవితలో ఏమంటున్నాడో వినండి..

‘ఈ కటికచీకటి రాత్రి కదలబారుతుంది

అంతవరకు నేనిక్కడ చేయాల్సిందొకటే

ఈ తిమిరాన్ని వెలిగించి

పరిమళాలతో ముంచెత్తడం..

*

 

 

ఆ చిత్రాల ముందు తుపాకులు కొయ్య బొమ్మలే!

పి. మోహన్ 

P Mohanకరువు బొమ్మల తర్వాత చిత్తప్రసాద్ కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో మునిగి తేలాడు. ఢంకను వాయిస్తున్న మనిషి బొమ్మతో ‘ఇప్టా’కు లోగో వేశాడు. 1943లో లెనిన్ జయంతి సందర్భంగా కమ్యూనిస్టు విద్యార్థి సంఘం తరఫున 43 మంది దేశవిదేశ కమ్యూనిస్టు యోధుల చిత్రాలతో ఓ ఆల్బమ్ తయారు చేసి పార్టీకి అందించాడు. ఇందులో మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, మావో మొదలుకొని, పుచ్చలపల్లి సుందరయ్య వరకు ఉన్నారు.

1944 మార్చి 12, 13న విజయవాడలో జరిగిన అఖిల భారత రైతు మహాసభకు చిత్త హాజరయ్యాడు. ఎన్నో చిత్రాలు గీశాడు. ఎర్రజెండాలు కడుతున్నవాళ్లను, వంటలు వండుతు వాళ్లను, లంబాడాల నాట్యాలను.. ప్రతి సందర్భాన్నీ చిత్రిక పట్టాడు. తెలుగు రైతుల హావభావాలను, ఆశనిరాశలను తెలుగువాడే వేశాడని భ్రమపడేలా పరిచయం చేశాడు. సభలను విహంగవీక్షణంలో చూపుతూ గీసిన స్కెచ్చులో ఓ బ్యానర్ పై ‘కయ్యూరు కామ్రేడ్స్ గేట్’ అని తెలుగులో రాశాడు. కయ్యూరు అమరవీరులపై చిత్త అంతకుముందే ఓ బొమ్మ వేశాడు. కేరళలోని కయ్యూరు గ్రామంలో 1942లో భూస్వాములపై కమ్యూనిస్టుల నాయకత్వలో రైతాంగం తిరగబడింది. ఓ పోలీసు చనిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటును అణచేసింది. నలుగురు యువ రైతునాయకులను ఉరితీసింది. చిత్త ఆ నలుగురిని ఉరితీస్తున్న దృశ్యాన్ని ఒకపక్క.. నేలకొరిగిన వీరుడి చేతిలోని జెండాను చేతికి తీసుకుని సమున్నతంగా పట్టుకున్న మహిళను మరోపక్క చిత్రించాడు. చిత్రం మధ్యలో ఆ వీరుడికి కమలంతో నివాళి అర్పిస్తూ, అతని పోరు వారసత్వాన్ని ఆవాహన చేసుకుంటున్న బాలుడిని నుంచోబెట్టాడు.

R0189P049-011-2318KB

R0189P049-011-2318KB

భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి(1946 -51) చిత్త చిత్ర హారతులు పట్టాడు. యావద్దేశానికి ఆశాకిరణంలా జ్వలించిన ఈ పోరాటంపై వేసిన బొమ్మల్లో వర్గకసి నిప్పులను కురిపించాడు. కాయకష్టంతో చేవదేరిన తెలంగాణ రైతు ధిక్కారాన్ని, త్యాగాన్ని నలుపు తెలుపుల్లోనే ఎర్రజెండాల్లా రెపరెపలాడించాడు. బ్రిటిష్ పాలకులు, వాళ్ల కీలుబొమ్మ నిజాం, అతగాడి రజాకార్ ముష్కరులు, యూనియన్ సైన్యం కలసికట్టుగా సాగించిన దారుణమారణకాండలో నెత్తురోడిన తెలంగాణను గుండెల్లోకి పొదువుకుని దాని వేదనను, ఆక్రోశాన్ని రికార్డు చేశాడు. సంకెళ్లు తెంచుకుంటున్న రైతులను, శత్రువు గుండెకు గురిపెడుతున్న గెరిల్లాలను, సుత్తీకొడవలి గురుతుగ ఉన్న జెండాలతో సాగిసోతున్న ఆబాలగోపాలాన్ని, రజకార్ల, యూనియన్ సైనికుల అకృత్యాలకు, అత్యాచారాలకు బలైన పల్లెజనాన్ని.. పోరాటంలోని ప్రతి సందర్భాన్నీ చిత్త ఒక నవలాకారుడిలా రూపబద్ధం చేశాడు.

ఒక చిత్రకారుడు సాయుధ గెరిల్లాలతో కలసి తిరిగి బొమ్మలేయడం మన దేశ కళాచరిత్రలో అపూర్వఘట్టం. నాటి తెలుగు ప్రజాచిత్రకారులకు చిత్త ఒక ఆదర్శం. మాగోఖలే, గిడుతూరి సూర్యం తదితరులు వేసిన తెలంగాణ సాయుధరైతు పోరాట చిత్రాలకు, కార్టూన్లకు చిత్త బొమ్మలే స్ఫూర్తి. ఈ పోరాటాన్ని గానం చేసిన గంగినేని వెంకటేశ్వరావు ‘ఉదయిని’కి చిత్త ఆరు చిత్తరువులు అందించాడు. చిత్తకు శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ తెలియకున్నాఅందులోని చాలా కవితలకు అతడు చిత్రానువాదం చేశాడు! చిత్త బొమ్మలు నాటి ‘అభ్యుదయ’, ‘నవయుగ’ వంటి తెలుగు పత్రికల్లోనూ వచ్చాయి.

abyudaya

అభ్యుదయ పత్రిక 1948 ఆగస్టు సంచిక చిత్త వేసిన శ్రామికజంట ముఖచిత్రంలో వెలువడింది. అందులో ఆ బొమ్మ గురించి, చిత్త కళాసారాంశం గురించి ఇలా రాశారు.. ‘స్త్రీ పురుషుల సమిష్టి కృషి ఫలితంగా మానవ జీవితం సుఖవంతమూ, శోభావంతమూ ఔతుంది. పరిశ్రమలో, ఫలానుభవంలో సమాన భాగస్వాములైన స్త్రీపురుషులు ఒకవంక ప్రకృతి సంపదను స్వాధీనం చేసుకుంటారు. గనులు త్రవ్వుతారు. పంటలు పండిస్తారు. తాము శాస్త్రజగత్తును శోధించి సృష్టించిన యంత్రాల సహాయంతో తమ శ్రమశక్తిని సద్వినియోగం చేస్తారు. తమ హృదయాన్ని, మేధస్సును విశ్వంలోని గుప్తరహస్యాలను గ్రహించటానికి ప్రయోగిస్తారు. జంతువైన నరుడు, జగత్తునిండా వ్యాపించి, మానవుడుగా దివ్యమూర్తిగా వికసించటానికి చేసే సమిష్టి కృషికి, ప్రపంచాభ్యుదయానికి చిహ్నంగా ప్రఖ్యాత చిత్రకారుడు చిత్తప్రసాద్ ఈ చిత్రాన్ని రచించాడు.’

చిత్తకు తెలుగువాళ్లతో 1950ల తర్వాత కూడా అనుబంధం కొనసాగింది. 1959లో ముత్యం రాజు, సంజురాజే అనే ఇద్దరు తెలుగు గిరిజనుల బొమ్మలను చిత్త స్పాట్ లో గీశాడు. ఆ బొమ్మలున్న కాగితంపై వాళ్లు తెలుగుప్రాంత గిరిజన వైద్యులు, వేటగాళ్లు అని, గోండులు కావచ్చని రాసుకున్నాడు.

joy

చిత్త 1946 నుంచి బాంబేలో స్థిరపడ్డాడు. పరాయి పాలకులను గడగడలాడించిన 1946 నాటి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటును, దాన్ని ఉక్కుపాదంతో అణచేసిన వైనాన్ని బొమ్మకట్టాడు. సమ్మెకు కమ్యూనిస్టు పార్టీ మాత్రమే మద్దతిచ్చినా, ఇది దేశ సమస్య కాబట్టి కాంగ్రెస్, ముస్లిం లీగులు కూడా కలసి రావాలని ఆ చిత్రాల్లో సుత్తీ కొడవలి జెండాల పక్కన వాటి జెండాలనూ అమర్చాడు. వీటిలోనే కాదు చాలా సమ్మెల చిత్రాల్లో చిత్త ఈ మూడు పార్టీల ఐక్యత అవసరాన్ని గొంతు చించుకుని చెప్పాడు. గాంధీ రాజకీయపరంగా బద్ధశత్రువైనా అతని జనాకర్షణ శక్తి చిత్తనూ లాక్కుంది. గాంధీ నిరాయుధ మార్చింగ్  దృశ్యాలను, అతని ధ్యానదృశ్యాలను చిత్త రాజకీయ శత్రుత్వం, వ్యంగ్యం, వెటకారం గట్రా ఏవీ లేకుండా అత్యంత మానవీయంగా చూపాడు. అతి సమీపం నుంచి చూసిన నేవీ తిరుగుబాటు అతన్ని చాలా ఏళ్లు వెంటాడింది. 1962లో దీనిపై ఓ పెద్ద వర్ణచిత్రం వేశాడు. హార్బర్లో నేలకొరిగిన వీరులు, పోలీసుల దమనకాండ, మౌనంగా చూస్తున్న సామాన్య జనంతో ఆ చిత్రం నాటి పోరాటాన్ని మాటలు అక్కర్లేకుండా వివరిస్తుంది.

1946 నాటి చరిత్రాత్మక పోస్టల్ సమ్మె, 1975 నాటి రైల్వే సమ్మె, 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటం.. ఇలా ప్రతి చారిత్రక జనోద్యమాన్నీ చిత్ర బొమ్మల్లోకి అనువాదం చేశాడు. హోంరూల్, జలియన్ వాలాబాగ్, క్విట్ ఇండియా వంటి భారత స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను ‘పీపుల్స్ ఏజ్’ పత్రికలో ‘ఇండియా ఇన్ రివోల్ట్’ బొమ్మల్లో చూపాడు. చేయిపట్టుకుని కవాతు చేయించే ఈ బొమ్మలతోపాటు శత్రుమూకలను తుపాకులకంటే ఎక్కువ జడిపించే కార్టూన్లనూ వందలకొద్దీ గీశాడు. శ్రమజీవుల కష్టఫలాన్ని తన్నుకుపోయే దేశవిదేశాల గద్దలు, వాటికి కాపలాకాసే పోలీసు జాగిలాలు, గాంధీ టోపీల కుర్చీ తోడేళ్లు, నల్లబజారు పందికొక్కులు.. నానా పీడకజాతులను బట్టలను విప్పదీసి నడిరోడ్డుపైన నిలబెట్టాడు. దామీ, డేవిడ్ లో, థామస్ నాస్త్, జార్జ్ గ్రాజ్ వంటి విశ్వవిఖ్యాత కార్టూనిస్టుల, కేరికేచరిస్టుల ప్రభావం చిత్త కార్టూన్లలో మనవైన భావభౌతిక దరిద్రాలను, దాస్యాలను అద్దుకుని వెక్కిరిస్తుంది.

chitta

1947లో దేశం పెనంలోంచి పొయ్యిలో పడింది. స్వాతంత్ర్యం మామిడిపళ్లు పెదబాబుల ఇళ్లకే చేరాయి. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు చేవచచ్చి, శాంతియుత పరివర్తన అగడ్తలోకి జారిపోయాయి. చాలామంది కమ్యూనిస్టులు రంగులమారి నెవురయ్య సోషలిజం మాయలో పడిపోయారు. చిత్త తెగ ఆరాధించిన పీసీ జోషి కూడా మెత్తబడ్డాడు. 1948లో కలకత్తాలో జరిగిన పార్టీ మహాసభల్లో రణదివే వర్గం జోషిని పక్కన పెట్టేసి సాయుధ పోరాటమే తమ మార్గమంది. ఈ వ్యవహారం కుట్రపూరితంగా, కక్షగట్టినట్టు సాగడంతో చిత్త చలించిపోయాడు. రణదివేను కూడా తర్వాత అతివాద దుస్సాహసికుడంటూ పార్టీ నాయకత్వం నుంచి తప్పించారు. పార్టీలో ఇలాంటి తడబాట్లు, ఆధిపత్య రాజకీయాలు, అభ్యుదయ కళాకారుల సంఘాల్లోకి పిలక బ్రాహ్మణుల, స్వార్థపరుల చేరికలు, సినిమాల్లోకి అభ్యుదయ కవిగాయకనటకుల వలసలు, దేశవిభజన నెత్తుటేర్లు, మతకలహాలు.. చిత్త సున్నిత హృదయాన్ని కోతపెట్టాయి. పార్టీతో అనుబంధం తగ్గించుకున్నాడు.

కానీ పార్టీ రాజకీయాలపై విశ్వాసం రవంత కూడా సడల్లేదు. స్వాతంత్ర్యం తర్వాత కూడా అదివరకటికంటే జోరుగా సాగుతున్న దోపిడీపీడనలపై మరింత కసి రేగింది. ‘యే ఆజాదీ జూటా హై’ అన్న నమ్మకం బలపడిపోయింది. ‘బాబ్బాబూ, మా గడ్డకు స్వాతంత్ర్యం ఇవ్వండయ్యా అని కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వాడిని దేబిరించిన కాలం ఎంత పాడుకాలం! దీనికి బదులు స్వాతంత్ర్యాన్ని ఎదురుబొదురుగా కొట్లాడి, చచ్చి తెచ్చుకుని ఉండుంటే అదేమంత పెద్ద పొరపాటు, అమానవీయం అయ్యేదా?’ అని తల్లికి రాసిన లేఖలో ఆక్రోశించాడు. ‘రెండు నాలుకల నాయకులు రాజ్యమేలుతున్నారు. ఈ దేశానికి చరిత్రపై ఇంకెంతమాత్రం ఆసక్తి లేదు, ఒట్టి గాసిప్ లపై తప్ప. అబ్బాస్ ఏదో సినిమా కథను కాపీ కొట్టాడని మొన్న వార్తలొచ్చాయి. గాసిప్ చాలు. ఇక ఉంటాను’ అని లక్నోలోని ఆప్తమిత్రుడు మురళీ గుప్తాకు రాసిన లేఖలో చీదరించుకున్నాడు.

రెండో ప్రపంచ యుద్ధంతో గుణపాఠం నేర్చుకున్న ప్రపంచం తర్వాత శాంతిమంత్రం పఠించింది. అయితే అన్నిరోగాలకూ అదే మందని ప్రచారం చేశారు. వర్గపోరాటాన్ని చాపచుట్టేశారు. 1952లో కలకత్తాలో ఇండియన్ పీస్ కాంగ్రెస్ జరిగింది. చిత్త ఆ ఉద్యమంలోని రాజకీయాలకు కాకుండా సందేశానికే ఆకర్షితుడయ్యాడు. లోకమంతా శాంతిసౌభాగ్యాలు విలసిల్లాలని బోలెడు బొమ్మలు గీశాడు. 1950 దశకం నాటి అతని చాలా చిత్రాల్లో వీరోచిత పోరాటాలు కాస్త పక్కకు తప్పుకున్నాయి. వాటికి బదులు రెక్కలు విప్పిన శాంతి పావురాలు, మతసామరస్య సందేశాలు, పిల్లాపెద్దల ఆటపాటలు, ఆలుమగల కౌగిళ్లు, తల్లీపిల్లల ముద్దుమురిపాలు, పాడిపంటలు, పశుపక్ష్యాదులు చేరి చూపరుల మనసు వీణలను కమ్మగా మీటాయి. ఆ కల్మషం లేని మనుషులు ఇంతలేసి కళ్లతో మనవంక చూస్తూ మీరూ మాలాగే పచ్చగా బతకండర్రా బాబూ అని చెబుతుంటారు.

 

‘లవర్స్’ పేరుతో చిత్త చెక్కిన ప్రణయ గాథలు అపురూపం. స్త్రీపురుష సంగమాన్ని ప్రింట్లలోనే కాదు, పెయింటింగుల్లోనూ అంతనంత ప్రేమావేశంతో చిత్రించిన భారతీయ చిత్రకారులు అరుదు. ఆ లినోకట్లలోని వలపులు ఒట్టి దైహిక కలయికలు కావు, రెండు మనసుల గాఢ సంగమాలు. ఒకచోట తెలినలుపుల గదిలో ఊపిరాడని కౌగిలింతల్లో, ముద్దుల్లో లోకం మరచిపోయిన జంట కనిపిస్తుంది. మరోచోట పచ్చికబయళ్లలో పడుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ కనిపిస్తుంది. మరోచోట.. కడుపుతో ఉన్న సహచరిని దగ్గరికి తీసుకుంటున్న మనిషి కనిపిస్తాడు. మరోచోట కడుపుపంటను తనివితీరా చూసుకుంటూ మురిసిపోతున్న జంట తారసపడుతుంది. సిగ్గులేని శృంగారం, ఆత్మాభివ్యక్తి పేర్లతో నేటి కళాకారులు కుబేరులకు వేలం వేసి అమ్ముకుంటున్నమర్మాంగాల బొమ్మలను చూసి తలదించుకునేవాళ్లు.. చిత్త ప్రణయచిత్రాలను తల ఎత్తుకుని సగర్వంగా చూడగలరు. చిత్త కల్మషం లేని కళాభివ్యక్తికి ఇది నిదర్శనం. తన చిత్రసుందరులను కూళలకిచ్చి అప్పుడప్పుడు  కూడు తినని కమ్యూనిస్టు పోతన.. చిత్త.

cartoon

చిత్త వలపు చిత్రాల్లో చాలా వాటిలో అతని పోలికలున్న పురుషుడు కనిపిస్తాడు. పెద్ద నుదరు, పొడవాటి ముక్కు, విల్లుల్లాంటి కనుబొమలు, అనురాగ దరహాసాలు.. అన్నీ చిత్తపోలికలే. అతడు చిత్త అయితే మరి అతని ప్రేయసి ఎవరు? ప్రేమాస్పదుడైన చిత్తను ఇష్టపడని ఆడమనిషి ఉండదని అతని మిత్రులు గుంభనంగా చెబుతారు. అతడు ఒకామెను గాఢంగా ప్రేమించాడని, అయితే ఆమె పెళ్లి చేసుకుని యూరప్ వెళ్లిపోయిందని అంటారు. పెళ్లి చేసుకోని చిత్త కూడా ఏమంటున్నాడో మురళికి రాసిన ఉత్తరంలోంచి వినండి.. ‘నేను సునీల్, దేవీ(మిత్రులు) వంటి వాడిని కానని నాకు తెలుసు. తండ్రి ఆస్తిపై బతికే పరాన్నభుక్కూనూ కాను. దుఃఖమన్న సౌఖ్యానికి కూడా నోచుకోలేదు నేను. ఓ గ్లాసు మందుతోనో, తాత్కాలిక ప్రేయసితోనే వెచ్చపడే సుఖమూ లేదు. అయితే నేను సన్యాసిని కూడా కాను. నాకు మా అమ్మంటే, మానవత అంటే, ఈ దేశమంటే తగని ప్రేమ. నేను ఈ దేశపు స్త్రీని ప్రేమిస్తాను. నా దేశంలోని ఎంతోమంది స్నేహితులను గాఢంగా ప్రేమిస్తాను. పెయింటింగ్ వేయడాన్ని, పెయింటింగులను చూడడాన్ని ప్రేమిస్తాను..’

అతనికి పిల్లలంటే పంచప్రాణాలు. వాళ్ల కోసం చిట్టిపొట్టి కథలు రాసి బొమ్మలేశాడు. ‘రసగుల్లా కింగ్ డమ్’ పేరుతో బడాబాబులకు చురుక్కుమనిపించే కథలు రాశాడు. కొన్ని బెంగాలీ కథలను  తిరగరాసి, బొమ్మలేశాడు. కల్లాకపటం తెలియని పిల్లల ఆటపాటలపై చిత్రాలతో పద్యాలు అల్లాడు. ఆ బుజ్జికన్నలను కాగితప్పడవలతో, సంతలో కొన్న ఏనుగు బొమ్మలతో, లక్కపిడతలతో ఆడించాడు. ఆవుపైకెక్కించి పిప్పిప్పీలను ఊదించాడు. పావురాలతో, చేపలతో ఆడించాడు. వాళ్లతో లేగదూడలకు ముద్దుముద్దుగా గడ్డిపరకలు తినిపించి కేరింతలు కొట్టాడు. వీళ్లంతా కష్టాల కొలిమి సెగ సోకని పిల్లలు. ఆ సెగలో మాడిమసైపోయే పిల్లలూ చిత్త లోగిళ్లలో కన్నీటి వరదలై కనిపిస్తారు. తిండిలేక బక్కచిక్కిన పిల్లలను, ఆకలి కోపంతో పిచ్చెత్తి రాయి గురిపెట్టిన చిన్నారిని, బూటుపాలిష్ తో కనలిపోయే చిట్టిచేతులను, చిరుదొంగతనాలతో జైలుకెళ్తున్న బాల‘నేరస్తుల’ను, తల్లిదండ్రులు పనికెళ్లగా, పసికందులను చూసుకుంటూ వంటావార్పుల్లో మునిపోయిన ‘పెద్ద’లను, ఇళ్లులేక ఫుట్ పాత్ లపై పడుకున్న చిన్నారులను, మశూచితో అల్లాడుతున్న పసిదేహాలను.. కళ్లు తడయ్యేలా చూపాడు. అంతేనా.. గోడలపై క్విట్ ఇండియా నినాదాలు రాసి, తెల్లోడి పోలీసులను హడలగొట్టే చిచ్చుబుడ్లను, తల్లిదండ్రుల వెంట సుత్తీకొడవళ్లు, ఎర్రజెండాలు పట్టుకుని కదిలే బాలయోధులను కూడా బొమ్మకట్టాడు.

beedi

చిత్త బాలకార్మికుల చిత్రాలు ప్రపంచ ప్రసిద్ధం.  ‘చిల్ర్డన్ వితౌట్ ఫెయిరీ టేల్స్’ పేరుతో చేసిన ఈ లినోకట్లు పిల్లల ప్రపంచాన్ని పెద్దలు ఎంత కర్కశంగా కాలరాస్తున్నారో చెబుతాయి. అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు బీడీలు చుట్టడం, తల్లిఒడిలో నిదురపోవాల్సిన పిలగాడు బూట్ పాలిష్ తో అలసి రోడ్డుపైనే పడుకోవడం, బొమ్మలతో ఆడుకోవాల్సిన పిల్లలు విదూషకులై పొట్టకూటికి కోతిని ఆడించడం, సాముగరిడీలు చేయడం.. చందమామ కథలకెక్కని ఇలాంటి మరెన్నో వ్యథాగాథలకు చిత్త రూపమిచ్చి ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ ఢిఫెన్స్ ఆఫ్ చిల్డ్రన్స్’ కు అంకితం చేశాడు. వీటిని యూనిసెఫ్ డెన్మార్క్ కమిటీ 1969లో పుస్తకంగా తీసుకొచ్చింది. డెన్మార్క్, చెకొస్లవేకియా, టర్కీ.. మరెన్నో దేశాల రచయుతలు భారత్ పై రాసిన పుస్తకాలకు కవర్ పేజీ బొమ్మలు అందించాడు.

చిత్తకు మూగజీవులన్నా ప్రాణం. పిల్లులను, కుక్కలను పెంచుకునేవాడు. అవీ మనలాంటివేనని ముద్దు చేసేవాడు. ‘నికార్సైన బాధ, సంతోషం, శాంతి మనిషికి మాత్రమే ప్రత్యేకమైనవి కాదు. ఆకలిదప్పికలు, రాగద్వేషాలు జీవరాసులన్నింటికి  ప్రకృతి సహజమైనవి. అందుకే మనం జంతువుల సుఖదుఃఖాలను, మొక్కల దాహార్తిని, పూల ఉల్లాసాన్ని సహానుభూతితో గ్రహించగలం.. అవి కూడా మనలాగే జీవితంలో ఒక క్షణకాలాన్ని కోల్పోయినా భోరున విలపిస్తాయి.. వాటిలో ఏదీ ఈ అందమైన లోకం నుంచి వెళ్లాలని అనుకోదు..’ అని తల్లికి రాశాడు చిత్త.

bezwada sabha

పార్టీ పనులు లేకపోవడంతో చిత్త కు అనేక వ్యాపకాలు మొదలయ్యాయి. అంధేరీ మురికివాడలోని రూబీ టెర్రేస్ లో అంధేరా ఒంటరి గది చిత్త ఆవాసం. అందులోనే వేలాది లినోకట్లు, పేస్టల్స్, పెయింటింగులూ వేశాడు. కవితలు, కథలు, నాటకాలు రాశాడు. కిటికీ ముందు రెండుమూడు పూలకుండీలు, కిటికీ పక్కన చెక్కపై పుస్తకాలు, దానికింది చెక్కపై కీలుబొమ్మలు, భయపెట్టే ఇండోనేసియా డ్యాన్స్ మాస్కులు, ఓ మూల మంచం, వంటసమయంలో మంచం కింది నుంచి బయటి, వంటయిపోయాక మంచం కిందికి వెళ్లే  వంటసామాన్లు, చిత్రాలు, ఓ పిల్లి, పంచలో రెండు కుక్కలు, పక్కిళ్ల వాళ్లతో కలసి వాడుకునే బాత్రూమ్, ఇంకాస్త బయట కాస్త పసిరిక.. చుట్టుపక్కల అతిసామాన్య మానవులు.. ఇవీ చిత్త బతికిన పరిసరాలు.

telengana

తెలంగాణా

రేషన్ షాపులో గోధుమపిండి, కిరసనాయిల్, చిరిగిన బనీను, లుంగీ, రెండు జతల బట్టలు, వారానికో అప్పు, అప్పుడప్పుడు ఎండుచేపలు, ఉర్లగడ్డల కూర, కాస్త డబ్బుంటే గ్లాసెడు మందుచుక్క, డబ్బుల్లేనప్పుడు పస్తులు, ఎప్పుడుపడితే అప్పుడు బొమ్మలు, పుస్తకపఠనం, మిత్రులతో కబుర్లు, వాళ్లతో కలసి ‘బ్రిడ్జ్ ఆఫ్ రివర్ క్వాయ్’, ‘పథేర్ పాంచాలి’ లాంటి సినిమాలకు వెళ్లడం, తల్లికి, చెల్లికి రాజకీయాలు, సాహిత్యం రంగరించి రాసే మమతల లేఖలు, సోమరి ఉదయాల్లో పోస్టమేన్ కోసం ఎదురుచూపులు.. చిత్త జీవితం కడవరకూ సాగిపోయిందిలా.

– ముగింపు వచ్చేవారం

అతని కారునల్లని సంతకం!

పి. మోహన్ 

 

P Mohanకళాకారులందరి లక్ష్యం జనాన్ని చేరుకోవడం. చిత్త లక్ష్యం వారిని చేరుకోవడమే కాకుండా చైతన్యవంతం చేయడం కూడా. కనుక అతని మార్గం భిన్నం. పునజ్జీవనం పేరుతో పాత కథలకు కొత్త మెరుగులద్ది తృప్తిపడిపోయే నాటి బెంగాల్ కళాశైలి అతనికి నచ్చలేదు. జనానికి అర్థం కాని సొంతగొడవల, డబ్బాశల పాశ్చాత్య వాసనల బాంబే, కలకత్తా శైలులు అసలే నచ్చలేదు. తన బొమ్మలు జనబాహుళ్యానికి అర్థం కావాలి, తను చెప్పేదేమిటో వాళ్ల మనసుల్లోకి నేరుగా వెళ్లాలన్నదే అతని సంకల్పం. ‘ఒక చిత్రం గురించి నువ్వూ నేనూ ఏమనుకుంటున్నాం అనేదానికి కాకుండా, ఎక్కువమంది ఏమనుకుంటున్నారనే దానికి ప్రాధాన్యమివ్వడమే అభ్యుదయ మార్గం’ అన్న లెనిన్ మాట దివిటీ అయ్యింది. అందుకే జనానికి కొరుకుపడని పిచ్చిప్రయోగాలవైపు, గ్యాలరీలకు పరిమితమయ్యే ఆయిల్స్, వాటర్ కలర్స్, వాష్ వంటివాటివైపు కాకుండా జనంలోకి ఉప్పెనలా చొచ్చుకెళ్లే ప్రింట్లకు మళ్లాడు.

ప్రజాకళాకారులకు ప్రింట్లకు మించిన ఆయుధాల్లేవు. ఆయిల్ పెయింటింగ్ వేస్తే, అది కళాఖండమైతే ఒక ఇంటికో, గ్యాలరీకో పరిమితం. ప్రింట్లు అలా కాదు. కొద్దిపాటు ఖర్చుతో ఇంటింటికి, ప్రతి ఊరికి, లోకానికంతటికీ పంచి, జనాన్ని కదం తొక్కించొచ్చు. ఒక్కోటీ ఒక్కో కళాఖండం. అందుకే అవి రష్యా, చైనా, మెక్సికన్ విప్లవాలకు పదునైన ఆయుధాలు అయ్యాయి. జర్మనీలో కేథే కోల్విజ్, హంగరీలో గ్యూలా దెర్కోవిట్స్, మెక్సికోలో సికీరో, ఒరోజ్కో, లేపోల్దో మెందెజ్,  చైనాలో లీ కున్, అమెరికాలో చార్లెస్ వైట్.. అనేక దేశాల్లో అనేకమంది జనచిత్రకారులు ప్రింట్లతో సమరశంఖాలు పూరించారు. వాళ్లకు ముందు స్పెయిన్లో గోయా యుద్ధబీభత్సాలపై, మతపిచ్చి వెధవలపై లితోగ్రాఫులతో ఖాండ్రించి ఉమ్మేశాడు. ఎడ్వర్డ్ మంక్, పికాసో, మతీస్.. ప్రింట్లతో చెలరేగిపోయారు. వీళ్లందరికంటే ముందు యూరప్ లో ద్యూరర్, బ్రూగెల్, రెంబ్రాంత్ లు ప్రింట్లలో కావ్యాలు చెక్కితే.. హొకుసాయ్, హిరోషిగే వంటి అమరకళావేత్తలు రంగుల ప్రింట్లతో తూర్పుకళ సత్తా చాటారు. చిత్తపై వీళ్లందరి ప్రభావం ఎంతో కొంత కనిపిస్తుంది. కానీ అతని కళ భారతీయతకు ఎన్నడూ దూరం కాలేదు. కాళీఘాట్ వంటి బెంగాలీ జానపద కళాశైలులు, మొగల్ సూక్ష్మచిత్రాలు, ప్రాచీన భారత కుడ్యచిత్రాల్లోని, శిల్పాల్లోని సరళత, స్పష్టత అతని చిత్రాల్లో కొత్త సొగసులు అద్దుకున్నాయి.

chitta1

ప్రింట్ల శక్తి, సౌలభ్యాలన్నింటిని చిత్త పూర్తిగా వాడుకున్నాడు. తర్వాత వాటిని అంత బలంగా వాడుకున్నవాడు చిత్తకంటే ఆరేళ్లు చిన్నవాడైన హరేన్ దాస్ ఒకడేనేమో. కరువుకాటకాలు, విప్లవం, శాంతి, ప్రణయం, ప్రసవం, పసితనం.. ప్రతి బతికిన క్షణాన్నీ చిత్త తన ప్రింట్లలో నిండైన భావసాంద్రతతో బొమ్మకట్టాడు. కరువుపై అతని ప్రింట్ల పుస్తకాలను బ్రిటిష్ వాళ్లు తగలబెట్టారంటే అతని కళాశక్తి ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.

చిత్త అనగానే తొలుత ఎవరికైనా గుర్తుకొచ్చేది అతని పోరాట చిత్రాలు, బెంగాల్ కరువు చిత్రాలే. కరువు పీడితులను అతనంత బలంగా ప్రపంచంలో మరే కళాకారుడూ చూపలేదు. అతని కరువు చిత్తరువులు ఆకలి పేగుల ఆర్తనాదాలు, ఆరిపోయిన కన్నీటి చారికలు.

 

1943-44 నాటి బెంగాల్ కరువు 30 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రకృతి విపత్తు, మనిషి స్వార్థం కలగలసి కరాళనత్యం చేశాయి. 1942లో వచ్చిన తుపానులో పంటలు దెబ్బతిన్నాయి. రోగాలు పెచ్చరిల్లాయి. మరోపక్క.. రెండో ప్రపంచ యుద్ధంలో బర్మాపై దాడి చేసి బెంగాల్ సీమలోకి చొచ్చుకొస్తున్న జపాన్ ఫాసిస్టులపై పోరాడుతున్న సైనికులకు బళ్లకొద్దీ తిండిగింజలు తరలించారు. బర్మా నుంచి బియ్యం సరఫరా ఆగిపోయింది. దేశభక్తులు కొందరు తమ పంటను బ్రిటిష్ వాడికి అమ్మకుండా నదుల్లో పడేశారు, కాల్చేశారు. కొందరు దేశీవ్యాపారులకు అమ్మేశారు. నల్లబజారు జడలు విప్పింది. పోలీసులు, అధికారులు కొమ్ముకాశారు. జనం పిడికెడు తిండిగింజల కోసం పొలాలు, బొచ్చెలు బోలెలు అమ్ముకున్నారు. అడుక్కుతిన్నారు, వలస పోయారు. ఏదీ చేతకాకపోతే దొంగతనాలకు, కరువు దాడులకు పాల్పడ్డారు. అవి చేతగాని ఆడకూతుళ్లు ఒళ్లు అమ్ముకున్నారు. లక్షల మంది మంచినీళ్లు దొరక్క మలేరియాతో చచ్చిపోయారు. ఒకప్పుడు పాడిపంటలతో కళకళలాడిన వంగదేశపు పల్లెసీమల్లో ఎక్కడ చూసినా పీనుగులు, ఆకలి కేకల సజీవ కంకాళాలే కనిపించాయి. కరువును దగ్గరగా చూసి రిపోర్ట్ చేయాలని పార్టీ చిత్తను నవంబర్ లో మిడ్నపూర్ కు పంపింది. చిత్త ఆ శవాల మధ్య, ఆకలి జీవుల మధ్య తిరుగాడి మానవ మహావిషాదాన్ని నిరసనాత్మక నలుపు రూపాల్లోకి తర్జుమా చేశాడు.

2 (5)

సంచిలో కాసిన్ని అటుకులు, స్కెచ్ ప్యాడు, పెన్నుతో కాలినడకన క్షామధాత్రిలో తిరిగాడు. కనిపించిన ప్రతి ఆకలిజీవినల్లా పలకరించి, బొమ్మ గీసుకున్నాడు. కూలిన గుడిసెలను, నిర్మానుష్య పల్లెలనూ గీసుకున్నాడు. ‘ఈ బొమ్మలతో వాళ్లను నేనేమాత్రం ఆదుకోలేనని తెలుసు. కానీ, అవి కళ అంటే విలాసమని భావించేవాళ్లకు ఒక పచ్చినిజాన్ని చాటి చెబుతాయి’ అన్నాడు. చిత్త అలా తిరుగుతున్నప్పుడే అతని తండ్రి కరువు సహాయక కార్యక్రమాల్లో ఉన్నాడు. ఎక్కడెక్కడినుంచో దాతలు పంపిన తిండిగింజలు దారిలోనే మాయమైపోతున్నాయని, బాధితులకు దొరుకుతున్నది పిడికెడేనని కొడుక్కి చెప్పాడు. చిత్త ఆ కరువు సీమలో ఎలా తిరిగాడో అతని చెల్లి ‘ఒంటరి పరివ్రాజకుడు’ వ్యాసంలో రాసింది. ‘అన్నయ్య ఊర్లు తిరిగి చింపిరి జుట్టుతో, మాసిన బట్టలతో, చెప్పులతో ఇంటికి వచ్చేవాడు. బోలెడన్ని బొమ్మలు గీసుకుని తెచ్చేవాడు. అమ్మ గదిలో కూర్చుని తను చూసిన ఆకలి జనం బాధలను రుద్ధకంఠంతో గంటలకొద్దీ వివరించేవాడు.’

chitta2

చిత్త కరువు నీడలను చిత్రించడంతోపాటు తన పర్యటన అనుభవాలను వివరిస్తూ ‘పీపుల్స్ మార్చ్’ ప్రతికలో సచిత్ర వ్యాసాలూ రాశాడు. కరువులో కాంగ్రెస్, హిందూమహాసభల కుళ్లు రాజకీయాలను ఎండగట్టాడు. ఆ రుద్రభూమిలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆస్తులు పోగేసి కొత్త మేడ కడుతున్న వైనాన్ని, ఆ కామందును తిడుతూ ఊరివాళ్లు కట్టిన పాటనూ పరిచయం చేశాడు ‘అభివృద్ధి’ పేరుతో ఈ నేలమీది సమస్త వనరులనూ దేశవిదేశీ పెట్టుబడి దెయ్యాలకు కట్టబెడుతూ, ‘సొంత అభివృద్ధి’ చూసుకుంటున్న నేటి జనసంఘీయులను చిత్త చూసి ఉంటే బొమ్మలతో చావచితగ్గొట్టి ఉండేవాడు.

మిడ్నపూర్ పర్యటన అనుభవాలతో, బొమ్మలతో చిత్త 1943లో ‘హంగ్రీ బెంగాల్’ పేరుతో ఓ చిన్న పుస్తకం అచ్చేశాడు. ఆకలి వ్యథలను కేవలం సాక్షిలా కాకుండా ఆర్తితో, ఆక్రోశంతో వినిపించాడు. ఓపిక ఉంటే, వినండి అతడు బొమ్మచెక్కిన ఆ అభాగ్యుల దీనాలాపనలను…

‘‘ఓ రోజు దారి పక్కన ఇద్దరు ముసలి ఆడవాళ్లు, ముగ్గురు నడీడు వితంతువులు, ఒక యువతి కనిపించారు. ఎక్కడినుంచో తెచ్చుకున్న కాసిని తిండిగింజలను మామిడి చెట్టుకింద పొయ్యి వెలిగించి వండుకుంటున్నారు. వితంతువుల్లో ఒకామె చేతిలో 11 రోజుల పసికందు ఉంది. మరొకామె గర్భిణి. వాళ్లకు తిరిగి తమ ఊళ్లకు వెళ్లాలని ఉంది. దగ్గర్లో ఓ కామందు వస్త్రదానం చేస్తున్నాడని, అందుకోసం ఆగిపోయామని చెప్పారు. ‘రేపు మా అన్నయ్య ఎడ్లబండిలో వస్తాడు, ఊరికి వెళ్తాను’ అని బాలింత చెప్పింది.. పక్షం రోజు తర్వాత అదే దారిలో రిక్షాలో వెళ్లాను. ఓ పోలీసు ఇద్దరు చింపిరి యువకులతో, ఇదివరకు నేను మాట్లాడిన యువతితో గొడవ పడుతున్నాడు. రిక్షావాలా చెప్పాడు.. ‘ఈ ఆడాళ్లు ఒళ్లు అమ్ముకోవడం మొదలుపెట్టారు. పాపం ఇంకేం చెయ్యగలరు? రోజుల తరబడి, వారాల తరబడి తిండి లేకపోతే మానం మర్యాదలకు విలువేముంటుంది బాబూ?’..

chitta3‘‘కరువుపై సభ పెట్టడానికి ప్రభుత్వం అనుమతివ్వడం లేదని పార్టీ కామ్రేడ్లు చెప్పారు. పార్టీ పోస్టర్లను ఓ సీఐడీ చింపేసి జనాన్ని భయపెట్టాడు. ఈ ప్రాంతంలో మళ్లీ పోస్టర్లు కనిపిస్తే చావగొడతామని బెదిరించాడు.. ఇంతకూ ఆ పోస్టర్లో ఏముంది? కరువును ఎదుర్కోడానికి అందరూ ఏకం కావాలన్న పిలుపు, దేశనాయకులను విడుదల చేయాలన్న డిమాండ్, మా భూమిని మేం కాపాడుకుంటామన్న ప్రకటన..

‘‘కుదుపుల బస్సులో ఇబ్బంది పడుతూ మధ్యాహ్నానికి కాంతాయ్ చేరుకున్నాం. రాత్రుళ్లు నిద్రలేకపోవడంతో ఒంట్లో నలతగా ఉంది. కాంతాయ్ లో ఆ రోజు సంత. బియ్యం ఎక్కడా కనిపించలేదు. పప్పు దినుసుల అంగళ్ల వద్ద జనం మూగి ఉన్నారు. అయితే స్వర్ణకారుడి వద్ద, పాత్రల అంగళ్ల వద్ద అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కో అంగడి వద్ద పది, పదిహేను మంది రైతులు తమ వంటసామాన్లను అమ్మడానికి వరుసగా నిల్చుని ఉన్నారు.  ఇత్తడి కంచాలు, గిన్నెలే కాదు దీపపు కుందీలు, దేవుడి గంటలు, హారతి పళ్లేలు వంటి పూజాసామగ్రినీ అమ్మడానికి తెచ్చారు. ఒకచోట బెనారస్ లో తయారైన శ్రీకృష్ణుడి కంచుబొమ్మ కూడా కనిపించింది. అది రెండు రూపాయల 12 అణాల ధర పలికింది. ఈ దేవుళ్లు తమ పేదభక్తులను వదలి బానపొట్టల హిందూవ్యాపారుల చెంతకు చేకుంటున్నారు…  మధ్యాహ్నం రెండుకల్లా అంగళ్ల నుంచి జనం వెళ్లిపోయారు. అదే రోజు ఓ ఓడ సంతలో అమ్మిన వంటసామాన్లతో కోలాఘాట్ కు బయల్తేరింది. రెండు పడవల్లో కూడా పాత్రలు తీసుకెళ్లారు. నెల రోజుల నుంచి ఇదే తంతట.. రైతులు ఒక్క పాత్రకూడా ఉంచుకోకుండా అన్నింటినీ తెగనమ్మడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది..

3 (4)

‘‘ఓ రోజు పల్లె పొలిమేరలో నడుస్తున్నాం. ‘అదిగో, అటు చూడు, వరిపొలంలో ఏదో కదులుతోంది!’ అన్నాడు తారాపాద. ఓ ఆరేళ్ల పిల్లాడు పండిన పొలం మధ్య మౌనంగా కూర్చుని ఉన్నాడు. ఏపుగా పెరిగిన పొలం నీడలో ఆ పిల్లాడి తెల్లకళ్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. మాటలకందని దృశ్యం అది. ఆ పిల్లాడు మేం పిలవగానే వచ్చాడు. ఎముకలతో తయారైన చిన్ననల్లబొమ్మలా ఉన్నాడు. అతని చిట్టికథ తెలుసుకున్నాం. అతని తండ్రి జ్వరంతో, తల్లి మలేరియాతో చనిపోయారు. పెద్దన్న చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. పదేళ్లున్న మరో అన్న.. జనం వదిలిపోయిన ఆ గ్రామంలోని ఓ బ్రాహ్మడి ఇంట్లో పాలేరు. ఆ ఇంటివాళ్లు పెట్టే తిండిని అన్నదమ్ములు పంచుకుని తినేవాళ్లు. అయితే కొన్ని రోజులుగా ఇతనికి తిండిపెట్టడం లేదు. అన్నం కావాలని ఏడిస్తే కొట్టారు. ఇప్పటికీ చెయ్యి నొప్పెడుతోంది. చివరికి ఇతన్ని ఇంట్లోంచి గెంటేశారు.. మళ్లీ మీ అన్నదగ్గరికి వెళ్తావా అని అడిగాడు తారాపాద. అతడు తలను గట్టిగా అటూ ఇటూ ఊపి, పోను అన్నాడు. గంజిపోసి, బట్టలిచ్చే అనాథాశ్రమం దగ్గర్లో ఉందని అతనికి అర్థమయ్యేలా చెప్పి, వెళ్తావా అని అడిగాం. సరేన్ననాడు. అతని పేరు అనంత. నిన్ను ఎత్తుకుని నడుస్తాం అని చెప్పాం. అతడు టక్కున ఉహూ అన్నాడు..

‘‘సాయంత్రం అయిదవుతుండగా జనుబాషన్ గ్రామానికి వెళ్లాం. ఐదు గుడిసెలే ఉన్నాయి.. ఊరి ఆనవాళ్లే లేవు. చిన్నసంచి, రెండుమూడు మట్టికుండలతో ఎక్కడికో వలసపోతున్న భార్యాభర్తలు కనిపించారు. ఆడమనిషి కొత్త ముతక చీరకట్టుకుని ఉంది. దాన్ని దగ్గర్లోని గంజికేంద్రంలో ఇచ్చారట. భర్త తుండుగుడ్డకంటే కాస్త పెద్దగా ఉన్న ధోవతీ కట్టుకుని ఉన్నాడు. వాళ్ల దీనగాథ అడిగాం. ఆ పల్లెలో మూడువందల మంది ఉండేవాళ్లట. తుపానులో వందమంది, మలేరియా, ఆకలితో మరికొందరు పోయారట. బతికినోళ్లు పట్నానికి వెళ్లగా, వీళ్లిద్దరే మిగిలిపోయారట. ఇప్పుడు వీళ్లూ వెళ్తున్నారు. ‘సరేగాని, ఈ మునిమాపున ఎందుకు వెళ్తున్నారు?’ అని అడిగాం. దొంగల భయం వల్ల అని చెప్పారు. పది రోజుల కిందట ఓ రాత్రి వీళ్లు అడుక్కుని తెచ్చుకున్న బియ్యం వండుకుంటుండగా 40 మంది బందిపోట్లు వచ్చిపడ్డారట. ఇద్దరినీ తీవ్రంగా కొట్టారట. భర్త రెండు రోజులపాటు పైకి లేవలేదట. దొంగలు సగం ఉడికిన అన్నంతోపాటు, వీళ్ల దగ్గర మిగిలున్న రెండు ఇత్తడిపాత్రలను, చివరికి మురికి గుడ్డలను కూడా దోచుకెళ్లారట. ఈమెకు ఒంటిపై కప్పుకోవడానికి రెండు రోజులపాటు గుడ్డకూడా లేదట..

chitta6

‘‘గోపాల్ పూర్ లో రోడ్డు పక్కన ఓ వితంతువు శ్యామా గడ్డి విత్తనాలు సేకరిస్తోంది. మూడు గంటలు కష్టపడితే పిడికెడు గింజలు దక్కాయి. ఆమెకు ఆ పూటకు అవే భోజనం..

‘‘అతని పేరు క్షేత్రమోహన్ నాయక్, అందరి మాదిరే రైతు. భార్యాబిడ్డలు ఆకలి, మలేరియాలతో చనిపోయారు. వాళ్ల అంత్యక్రియలు పూర్తికాకముందే అతనికీ మలేరియా సోకింది. మేం అతన్ని చూసేసరికి అతని కళేబరం కోసం కుక్కలు, రాబందులు కాట్లాడుకుంటున్నాయి. దహనం కోసం ఆ శవాన్ని నిన్న రాత్రి శ్మశానానికి తీసుకొచ్చారు. చితి వెలిగించేలోపు అక్కడున్నవారికీ జ్వరం కమ్మేసింది. శవాన్ని అలాగే వదిలేసి ఇళ్లకు పరిగెత్తారు. ఇప్పుడు వాళ్ల  శవాలను మోసుకెళ్లడానికి ఎవరైనా మిగిలి ఉంటారా?.. క్షేత్రమోహన్ కు పట్టిన దుర్గతి బెంగాల్ జిల్లాల్లో అసాధారణమైందేమీ కాదు. కానీ.. క్షేత్రమోహన్ నోటికాడి కూడు లాక్కుని, బోలెడు లాభాలు కూడబెడుతున్నవాళ్లను మనమింకా క్షమించడమే కాదు ప్రోత్సహిస్తున్నాం కూడా..’’

ఇలాంటి మరెన్నో మింగుడుపడని నిజాల ‘హంగ్రీ బెంగాల్’ పుస్తకం సంగతి తెల్లదొరలకు తెలిసింది. అచ్చేసిన ఐదువేల కాపీలనూ తగలబెట్టారు. చిత్త తన తల్లికి పంపిన ఒక పుస్తకం మాత్రం భద్రంగా మిలిగింది. పార్టీ పత్రికలకు చిత్త వేసిన బొమ్మల బ్లాకులు కూడా పోయాయి. అతన్ని పోలీసులు పట్టుకుపోతారనే భయంతో పత్రికల నిర్వాహకులే వాటిని నాశనం చేశారు.

మిడ్నపూర్ కరువు ప్రాంతాల పర్యటన తర్వాత చిత్త 1944లో జూన్-ఆగస్టు మధ్య మరో కరువు సీమకు వెళ్లాడు. బిక్రమ్ పూర్, కాక్స్ బజార్, మున్షీగంజ్, చిట్టగాంగ్ లలో కరువు దెబ్బకు సర్వం కోల్పోయిన జనం బొమ్మలు గీశాడు. వాటి వెనక వాళ్ల పేర్లు, ఊళ్లు, వాళ్ల కష్టాలను నమోదు చేశారు. జాలరి అబ్బుల్ సత్తార్, రైతు అలీ అక్బర్, నేతగాడు గనీ, రోగిష్టి హలీషహర్, వేశ్యగా మారిన చిట్టగాంగ్ బట్టల వ్యాపారి భార్య అలోకా డే, ఆస్పత్రితో అస్థిపంజరంలా పడున్న ముసలి మెహర్జెన్, ఒంటికింత బట్టలేక తనకు వీపులు తిప్పి ఇంట్లోకి వెళ్లిపోయిన బాగ్దీ కుటుంబం.. అన్నింటిని గుండెబరువులో ఆవిష్కరించాడు. ‘ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపా’న్నీ జడుసుకునేలా చూపాడు. ఆకలి తాళలేక పిచ్చెక్కి రాయి గురిపెట్టిన బాలుడి బొమ్మచూస్తే కన్నీళ్లూ, క్రోధమూ వెల్లువెత్తిపోతాయి.

బెంగాల్ కరువును చిత్త మిత్రులైన సోమనాథ్ హోరే, జైనుల్ అబెదిన్ లతోపాటు గోపాల్ ఘోష్, గోవర్ధన్ యాష్ వంటి ఇతర బెంగాల్ చిత్రకారులు కూడా వేశారు. అయితే వాళ్ల బొమ్మలు చిత్త బొమ్మలంత శక్తిమంతంగా కనిపించవు. నందలాల్ బోస్, గోపాల్ గోష్ వంటి బెంగాల్ స్కూల్ వాళ్లకు ఆ కరువు కలిపురుషుడి బీభత్సమైతే, చిత్తకు అది మనిషి స్వార్థం సృష్టించిన మృత్యుకాండ. అందుకే అతని చిత్రాల్లో అంత మానవతా, భావగాఢతా, కన్నీరూ. ‘మనిషి తన మానవతకు పట్టే నీరాజనమే కళ’ అని అంటాడు ప్రముఖ కళావిమర్శకుడు హెర్బర్ట్ రీడ్. ఆధునిక భారతంలో ఆ నీరాజనం పట్టిన పిడికెడు మందిలో చిత్త ఒకడు.

                                   నాలుగు భాగాల్లో ఇది రెండో భాగం. మూడో భాగం వచ్చేవారం..

 

కళాయోధుడికి వందేళ్లు -1

పి.మోహన్ 

 

P Mohanచిత్తప్రసాద్ కు జాతకాలపై నమ్మకం లేదు. తను బతికి ఉండగా పట్టని అదృష్టం చచ్చాక పడుతుందన్న భ్రమ అసలే లేదు. దున్నపోతులు పాలించే ఈ దేశం తన పిచ్చి బొమ్మలను గుర్తించుకుని, తన వందేళ్ల బర్త్ డే జరుపుకుని, నివాళి అర్పిస్తుందన్న వెర్రి ఆశ అసలే లేదు. అయినా చిత్తప్రసాద్ ఇప్పుడు ఎవడిక్కావాలి? మదరిండియాను ‘మేకిన్ ఇండియా’ కంతల గుడిసెలో ఎఫ్డీఐల కాషాయ పడకపై అంకుల్ శామ్, చైనా డ్రాగన్, యూరప్ గద్దలకు ఏకకాలంలో తార్చేస్తున్న స్వదేశీ జాగరణ మహావానరాలకు ఆ ఆ కల్తీలేని ఎర్ర దేశభక్తుడి పుట్టిన రోజుతో ఏం పని? కళ్లే కాదు సర్వాంగాలూ లొట్ట పోయిన గోతికాడి నకిలీ ఎర్రమనుషులకు ఆ ఒకనాటి తమ సహచరుడి సమరస్వప్నాలు ఏ జూదానికి పనికొస్తాయి? నిమిషానికి కాదు క్షణానికో రంగు మార్చే ఊసరవెల్లులు అతగాడి బ్లాక్ అండ్ వైట్ నిప్పుల జెండాలను ఏం చేసుకుంటాయి?

కానీ, చిత్తప్రసాద్ మహామోహంతో, నరనరానా ప్రేమించిన ఈ లోకంలో దున్నపోతులు, మహావానరాలు, నక్కలు, ఊసరవెల్లులే కాదు.. మనుషులు కూడా ఉన్నారు. అతని మాదిరే సాటి మనిషి కష్టానికి కన్నీరుమున్నీరయ్యేవాళ్లు, కళ మార్కెట్ కోసం కాదని, మనిషిని మనిషిగా నిలబెట్టేందుకని నమ్మేవాళ్లు, నమ్మకం కోసం నునువెచ్చని నెత్తుటిని ధారపోస్తున్నవాళ్లూ ఉన్నారు. చిత్తప్రసాద్ వాళ్లకు అవసరం! చెప్పలేనంత అవసరం. శత్రువు గుండెను గెరిల్లా బాంబులా పేల్చే అతని బొమ్మలు వాళ్లకు కావాలి. కలలను, కన్నీళ్లను, అక్కసును, ఆక్రోశాన్ని, కసిని, క్రోధాన్ని మహోగ్రంగా వెళ్లగక్కే ఆ నిప్పుకణికలు వాళ్లకు కావాలి. వాటి కథలూ, గాథలూ వాళ్లకు కావాలి. చిత్తను తెలుసుకోవడమంటే మన గుండెతడిని మనం పరీక్షించుకోవడం. మన భయాన్ని, పిరికితనాన్ని, నంగితనాన్ని వదలించుకుని మన పిడికిళ్లను మరింతగా బిగించడం. వందేళ్ల చిత్త బతుకు చిత్రాల గ్యాలరీని నేటి మన చివికిన బతుకు కళ్లతో చూద్దాం రండి!

1 (3)

చిత్త ఆధునిక భారతీయ కళాసరోవరంలో పూచిన ఒకే ఒక ఎర్రకలువ. దాని రేకులు ఎంత మెత్తనో అంత పదును. ఒక్కో రేకుది ఒక్కో పరిమళం. ఒకటి బొమ్మలు వేస్తుంది, ఒకటి పాడుతుంది. ఒకటి కవితలు, కథలు రాస్తుంది. అది జనం పువ్వు. కష్టజీవుల కళల పంట. అది వాళ్లు నవ్వితే నవ్వుతుంది, దుఃఖపడితే కలతపడుతుంది. ఆగ్రహిస్తే కత్తుల పువ్వయిపోయి వాళ్ల చేతుల్లో ఆయుధంలా మారిపోతుంది. అందుకే బడాబాబులకు అదంటే గుండెదడ. బడుగుజీవులకు గోర్వెచ్చని గుండెపాట.

కళను అర్థం చేసుకోకూడదని, అనుభవించాలని అంటారు మహానుభావులు. చిత్త విషయంలో ఈ మాటకు అర్థం లేదు. అతని చిత్రాలు అర్థం, అనుభవాల మేలుకలయిక.

‘..నేను చెప్పేది నీకర్థం కావడం లేదని అనుకుంటున్నానమ్మా! అయినా, మాటలు ప్రతిభావాన్నీ చేరవేస్తాయా? ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, మిత్రుడు ఎరిక్ మాట్లాడే డేనిష్.. అందరినీ అడిగి చూశాను.. మనుషుల ప్రగాఢమైన సుఖదుఃఖాలను, తృప్తి, అసంతృప్తులను, శాంతిని, క్రోధాన్ని సరిగ్గా చేరవేయగల మార్గాలను ఇంతవరకూ ఏ భాషా కనుక్కోలేదు’ అని అమ్మకు రాసిన లేఖలో అంటాడు చిత్త. భాషలు చెయ్యలేని ఆ పనిని అతని చిత్రాలు చేశాయి. 

చిత్తప్రసాద్ 1915 జూన్ 21న పశ్చిమ బెంగాల్ లోని 24 ఉత్తర పరగణాల జిల్లాలో నైహాతిలో పుట్టాడు. తల్లిదండ్రులు ఇందుమతీ దేవి, చారుచంద్ర భట్టాచార్య. చారుచంద్ర ప్రభుత్వోద్యోగి. పియానో వాయించేవాడు. ఇందుమతి కవిత్వం రాసేది, పాటలూ పాడేది. పుస్తకాలంటే పిచ్చిప్రేమ. ఈ పిచ్చి కొడుక్కీ సోకింది. పుస్తక సేకరణ సామ్రాజ్య నిర్మాణం వంటిదంటాడు చిత్త. అతనికి తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా అంతకుమించిన సాహితీసంస్కారాన్ని, బీదలపట్ల సానుభూతిని, నమ్మిన విలువల కోసం రాజీలేనితనాన్ని అందించారు. చిత్తకు ఒక చెల్లెలు. పేరు గౌరి. ‘దాదామోషి’ ఆ పిల్లను చెల్లి అని కాకుండా ముద్దుగా అక్కాయ్ అని పిలిచేవాడు. చారుచంద్ర ఉద్యోగరీత్యా మిడ్నపూర్, చిట్టగాంగ్ లలో కాపురమున్నాడు. చిత్త ఇంటర్, డిగ్రీ చిట్టగాంగ్ ఆ ఊళ్లలోనే పూర్తి చేశాడు.

 

బెంగాల్ విద్యావేత్త  ప్రొఫెసర్ జోగేశ్ చంద్ర రాయ్(1859-1952) లైబ్రరీ చిత్తకు చిత్రలోకాన్ని పరిచయం చేసింది. కుర్రాడు సాయంత్రం పూట జోగేశ్ పుస్తకాలను తుడిచి, సర్దిపెట్టేవాడు. అందుకు ప్రతిఫలంగా ఆ పెద్దాయన ‘ప్రభాషి’, ‘భరతబర్ష’ వంటి పత్రికల్లో వచ్చే బొమ్మలను ఇచ్చేవాడు. ఓ రోజు వాటర్ కలర్స్ బాక్సు కానుకగా ఇచ్చాడు. చిత్త బొమ్మల్లో మునిగి తేలాడు. జోగేశ్ తనను సొంత మనవడిలా చూసుకున్నాడని అంటాడు చిత్త.

3 (4)

1930వ దశకంలో బెంగాల్ విప్లవాగ్నులతో కుతుకుత ఉడుకుతుండేది. చిట్టగాంగ్ ఆయుధాగారంపై సమర్ సేన్ దండు ముట్టడి, తర్వాత విప్లవకారులను బ్రిటిష్ వాళ్లు వేటాడి చంపడం.. బ్రిటిష్ తొత్తుల ఇళ్లపై అనుశీన్ సమితి దాడులు… ఇవన్నీ చిత్త చుట్టుపక్కలే జరిగాయి. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఫాసిస్టులు బెంగాల్ పొరుగున ఉన్న బర్మాను ఆక్రమించారు. చిట్టగాంగ్, కలకత్తాలపై బాంబులు వేశారు. చిత్త రాజకీయాల్లోకి రాక తప్పలేదు. రహస్య కమ్యూనిస్టు రైతు సంఘాలతో పరిచయమైంది. జపాన్ దాడిని వ్యతిరేకిస్తూ చిత్త వేసిన పోస్టర్లను గ్రామం పక్కన పొలంలో కర్రలు పాతి, తడికలకు అతికించి ప్రదర్శించారు. అక్షరమ్ముక్క తెలియని జనం కూడా వాటిని చూసి మెచ్చుకున్నారు. అది అతని తొలి ఎగ్జిబిషన్. కొండంత స్ఫూర్తని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన వేడుక.

చిత్త నిజానికి శిల్పికావాలనుకున్నాడు. కానీ ఆ కళాశిక్షణా గట్రా ఖరీదు వ్యవహారం కావడంతో చిత్రకళతో సరిపెట్టుకున్నాడు. బొమ్మల పిచ్చితో కలకత్తా వెళ్లాడు. గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ప్రిన్సిపాల్ ఇంటర్వ్యూ చేశాడు. రాజకీయాల్లో తలదూర్చనని హామీ ఇస్తేనే సీటిస్తానన్నాడు. చిత్త నిరాకరించి బయటికొచ్చేశాడు. తన ఆరాధ్యుడైన నందలాల్ బోస్ కళాపాఠాలు బోధిస్తున్న శాంతినికేతన్ కు వెళ్లాడు. రవీంద్రనాథ్ టాగూర్ ముందు కూర్చుని అతని బొమ్మను చకచకా గీసిచ్చాడు. టాగూరు, నందలాల్ ఇద్దరూ భేష్ అన్నారు. ‘నీకు మేం నేర్పేదేమీ లేదు, కాలం వృథా చెయ్యకుండా వెళ్లిపో, మమ్మల్ని మించిపోతావు!’ అని భుజం తట్టారు. చిత్త స్వయంకృషితో కళాసాధన చేశాడు. ఉడ్ కట్లు, లినోకట్లు, ఆయిల్స్, వాటర్ కలర్స్.. ఏది పట్టుకున్నా కళ్లు చెదిరే బొమ్మ తయారై బోలెడు ముచ్చట్లు చెప్పేది. చిత్త 1938లో రంగుల్లో వేసుకున్న స్వీయచిత్రంలో అతని నవకాశల యువపేశల స్వప్నకాంతులను చూడొచ్చు.

2 (4)

చిత్త 1937-38 లో కమ్యూనిస్టులకు మరింత దగ్గరయ్యాడు. బ్రాహ్మణ్నని గుర్తుచేసే భట్టాచార్య తోకను కత్తిరించుకున్నాడు. జంధ్యప్సోసను తెంచేశాడు. అవసరమున్నప్పుడు జంధ్యప్సోసను, నగానట్ర, పట్టుచీరలను బహు అందంగా తగిలించుకుని, అవసరం లేనప్పుడు బీరువాల్లో అతి జాగ్రత్తగా దాచుకుంటూ, తోకలను, కొమ్ములను భద్రంగా మోసుకు తిరిగే నేటి ‘వీరవిప్లవ కమ్యూనిస్టులు’ చిత్తను చూసి నేర్చుకోవాల్సిందేమీ లేదా ?

40వ దశకంలో దేశం విప్లవ, ప్రజాస్వామిక ఉద్యమాలతో కోట్ల వాల్టుల ఎర్రలైటులా ప్రకాశించింది. ఒక పక్క క్విట్ ఇండియా రణన్నినాదాలు.. మరోపక్క తెభాగా, పునప్రా వాయలార్, తెలంగాణా సాయుధ పోరాటాలు బ్రిటిష్ వాళ్లకు, వాళ్ల తొత్తు కుక్కలకు చుక్కలు చూపించాయి. సాంస్కృతిక కళారంగాల్లోనూ కొత్త విలువలు, ఆదర్శాలు పురివిప్పి నాట్యమాడాయి. ఫాసిస్టు వ్యతిరేక రచయితల, కళాకారుల సంఘం(ఏఎఫ్ డబ్ల్యూఏ), అభ్యుదయ రచయితల సంఘం(పీడబ్ల్యూఏ), భారత ప్రజానాట్యమండలి(ఇప్టా) అన్నీ నూతన మానవుడిని కలగంటూ పలవరింతలు పోయాయి. చిత్త కూడా రూపారూపాల్లో కలలుగన్నాడు. కమ్యూనిస్టుల దళపతి పీసీ జోషి చిత్తలోని కార్యకర్తనే కాక కళాకారుడినీ గుర్తించాడు.  పూర్తికాలం కార్యకర్తగా బాంబేకి పంపాడు.

కమ్యూనిస్టు పార్టీ పత్రికలైన ‘పీపుల్స్ వార్’, ‘జనయుద్ధ’లకు, బులెటిన్లకు ఇలస్ట్రేషన్లు, కార్టూన్లు వేయడం, రైతు, కార్మిక సంఘాలకు పోస్టర్లు రూపొందించడం చిత్త పని. ‘ప్రచార కళే’ అయినా కళావిలువల్లో ఎక్కడా రాజీపడకపోవడం చిత్త సాధించిన అరుదైన విజయం. ‘ప్రచార కళ’ అనేది మోటుగా చెప్పాలంటే తప్పుడుమాట. ఎందుకంటే కళను ప్రచారం కోసమే సృజిస్తారు కాబట్టి. ప్రచార కళా, మామూలు కళా అని రెండు రకాలు ఉండవు. కళకు కళాసౌందర్యవిలువలే ప్రమాణం. కళ ఎక్కడున్నా కళే. ‘ప్రచారం’లో ఉన్నంత మాత్రాన కళ కళ కాకుండా పోదు. మనిషి కళను ఎరిగింది మొదలు దాని లక్ష్యమంతా ప్రచారమే. ఆదిమానవులు గుహల్లో గీసిన బొమ్మలు, అధునిక మానవులు గుళ్లలో వేసిన బొమ్మలు, నవాధునిక మానవులు ఎక్కడెక్కడో వేస్తున్న బొమ్మలు.. వీటన్నింటి ఉద్దేశం తమ భావాలను ఎదుటి మనిషికి చెప్పుకోవడం. కాఫ్కాలు, వైల్డులు, డాలీలు, పొలాక్ లు తమ రచనలను, చిత్రాలను సృజించిది నేలమాళిగల్లో, భోషాణాల్లో ఎవరికంటా పడకుండా దాచిపెట్టుకోవడానికి కాదు. చిత్త బొమ్మలు బండగా, అందవికారంగా ఉంటాయని పైకి చెప్పకున్నా కొంతమంది కళాభిమానుల లోపలి అభిప్రాయం. ‘కళలో గుణం(కేరక్టర్) లేకపోవడం ఉంటుంది కానీ అందవికారమనేది అసలుండదు’ అని అంటాడు ఫ్రెంచి మహాశిల్పి అగస్త్ రోదా.

                     మిగతా వచ్చేవారం.

 

 

 

 

సముద్ర తీరంలో..

 పి.మోహన్ 

P Mohan

 

 

 

 

 

సముద్రం నిన్ను అడిగింది

ఒడ్డున నన్నొక్కన్నే చూడ్డం బాగోలేదట

పిచ్చి అలలు ఘోష పెడుతున్నాయి

కన్నీటితో మరింత ఉప్పు చేయొద్దని!

 

సూర్యపుష్పమింకా వికసించలేదు

అంతా మసకమసక.. అర్థం కాని నీ చూపుల్లా

తెల్లారగట్ట తీరాన ఈ వెర్రి నడక

సౌందర్యారాధనా కాదూ, కాలక్షేపమూ కాదు

నిర్నిద్ర రాత్రిని ఇలాగైనా తప్పించుకుందామని

 

కాళ్లకు శంఖస్పర్శలు.. నీ మునివేళ్ల చిలిపి చేష్టల్లా

ఆనాడు ఇక్కడే కదా సరిగంగ స్నానాలూ, తనువుల తాడనాలూ

ఇసుక తడిలో, అలల నురగలో ఒదిగిన జ్ఞాపకాలూ..

వెర్రి సముద్రం.. అవన్నీ ఇప్పుడూ కావాలట!

 

అనాటిలా ఇసుక గూడెలా కట్టను

చేతుల్లో రవంతైనా నీ ప్రేమతడి లేదే!

మెత్తని తీరాన మన పేర్లెలా రాయను

చేతిలో ఒక్క ప్రణయాక్షరమూ లేదే!

 

మంచుతెరల్లో ఒక్కన్నీ కదలిపోవడం

తీరాన్ని ఈడ్చుకుపోతున్నంత బరువుగా ఉంది

 

లోకసాక్షి తూరుపు తలుపు నెడుతున్నాడు

బెస్తపల్లెలు నిద్రలేస్తున్నాయి

పీతలు బొరియల్లోకి వెళుతున్నాయి

 

ఒంటరి ప్రయాణం ఎక్కడో ఒకచోట ఆగాల్సిందే

ఆనాడు మనం కూర్చున్న నల్లపడవ పక్కన

ఇప్పుడిలా దిష్టిబొమ్మలా నిల్చున్నాక

వెనకేముందో తెలియదు

ముందు మాత్రం కళ్లు చెదిరే ప్రభాత బింబం

సూర్యుడి ముద్దుతో ఎర్రబారిన కడలి చెంప

అనంత జలరేఖపై పూచే తెరచాపలు

తీరం, కెరటాల కౌగిళ్లతో పోటెత్తిన సౌందర్యం

దిష్టి తగలొద్దు

ఇలాంటి చోట ఒకడు తోడు లేకుండా తిరిగాడని

ఎవరికీ తెలియొద్దు

తడి ఇసుకపై ఒంటరి పాదముద్రలు చెరిగిపోవాలి!

 

*

 

 

అట్టలూ పోయాయి!

పి.మోహన్

 

P Mohanపదేళ్లకు మించిన అపురూప బంధం.. ఎన్నెన్ని సంభాషణలు, ఎన్నెన్ని స్పర్శలు! అసలు వియోగమనేది ఎప్పుడుందని? కడుపులోని బిడ్డకు తల్లి పేగులోంచి జీవాధారాలు అందినట్లు నిరంతరం నా బుర్రకు జ్ఞానధారను అందించిన నేస్తం. ఒక ఊరి నుంచి ఒక ఊరికి, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడల్లా బస్సుల్లో, లారీల్లో పసికూనలా తీసుకొచ్చి దాచుకోవడం.. ఏ నిధీ లేకున్నా అదే తరగని నిధి అని గర్వపడడం.. నిధి చాల సుఖమా, జ్ఞాననిధి చాల సుఖమా అని పాడుకోవడం.. అంతా ఒక వెర్రి ఆనందం!

ఇంటి నిర్మాణంలో ఒక భాగంగా అమరినట్లుండే నా ప్రియ నేస్తం శాశ్వతంగా దూరమైంది. నా ‘ఫంక్ అండ్ వాగ్నల్స్’ ఎన్ సైక్లోపీడియా ఇక కనిపించదు! మబ్బులు పట్టిన వేళ మిలమిల మెరిసే గిల్ట్ అక్షరాలతో ఇంటినీ, కళ్లనూ వెలిగించిన ఆ అనురాగ బంధం తెగిపోయింది. గత నెల నేను ఇంట్లో లేని ఒక శుభముహూర్తంలో మా ఆవిడ దాన్ని పాతపుస్తకాల వాడి తక్కెడతో పుటుక్కున తెంచేయించింది. వాడు కేజీల్లెక్కన  కొనేసి ఓ వంద మా ఆవిడ చేతుల్లో పెట్టిపోయాడు. పోతూపోతూ జ్ఞాపకంగా దాచుకొమ్మనేనేమో అట్టలను మాత్రం వదిలేసి వెళ్లాడు. అవి అమ్ముడుబోవట. ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక.. చాలా సేపటి తర్వాత.. ఏదో పోగొట్టుకున్నట్లు అనిపించి, అదెక్కడా అని నేను కోపాన్ని అణచుకుంటూ శాంతంగా అడిగితే మా ఆవిడ సర్రున కోపం, చిరాకు, అక్కసు, వెటకారం, ఎత్తిపొడుపు వంటి సవాలక్ష రసాలతో ఇచ్చిన సమాధానం..

‘అమ్మి పారేసిన! కొంప ముందుగానే ఇరుకు. బోకులుబొచ్చెలకే గూళ్లు సరిపోవడం లేదు. ఇంక బుక్కులేడ పెట్టేది? చెమ్మకు రెండు పుస్తకాలకు చెదలు పట్టినాయి. అన్నిదాన్లకూ ఎక్కుతున్నాయి. అయినా నువ్విప్పుడు దాన్లను సదువుతున్నావా అంట! సదవనప్పుడు ఇంట్లో ఎందుకూ దండగ.. ! అందుకే అమ్మేసిన.. ఆ అటకబండపైన ఉన్న పుస్తకాలు కూడా ఎప్పుడో ఒకతూరి నీ నెత్తిపైనే పడతాయి.. దాన్లను కూడా ఎప్పుడో ఒకతూరి నువ్వు ఇంట్లో లేనప్పుడు అమ్మిపారెక్కుతా. అంతగా అయితే నువ్వు సొంత ఇండ్లు కట్టినాక కొనుక్కో ఆ బండపుస్తకాలను..’

తిరిగిరాని దాని కోసం కోపాలు, సంజాయిషీలు ఎందుకు. పైగా ఉన్నవాటినైనా కాపాడుకోవాలి కదా. అయినా అందులో ఆమె తప్పేముంది? పీత కష్టాలు పీతవి. ఇంటి సర్దుడులో ఆమెకవి శనిగ్రహాల్లా కనిపించి బెదరగొట్టేవి. అప్పటికి చాలాసార్లు విసుగుతో బెదిరించింది. ‘కోపమొస్తే దీన్లను ఎప్పుడో ఒకతూరి అమ్మిపారెక్కుతా’ అని. ‘చస్తా, చస్తా అన్న సవతే కానీ చచ్చిన నా సవితి లేద’న్న సామెతను గుడ్డిగా నమ్మి పట్టించుకోలేదు. అయినా ప్రియమైన వాటిని పోగొట్టుకోవడం కొత్త కనుకనా. అందుకే సోనియా గాంధీ ముందు మన్మోహన్ సింగు, మోడీ ముందు అద్వానీ దాల్చే మౌనముని అవతారం దాల్చేశా. బంధం తెగిపోతే పోయిందిలే, దాని ఆనవాళ్లుగా అట్టలయినా మిగిలాయిలే అనుకుని పిచ్చిగా సంతోషపడ్డాను.

3. maa avida mechin kalakhandalu

కానీ ఆ ఆనవాళ్లనూ మా ఆవిడ మొన్న పిచ్చి ఐదు రూపాయల బిళ్లకు అమ్మేసింది. ఈ సారి కొన్నవాడు మరీ పాతపాత పుస్తకాలవాడు అయ్యుంటాడు. అయినా ఇప్పుడు వగచి ఏం లాభం! అట్టలలైనా అలా పడుండనివ్వవే అని చెప్పకపోవడం నా తప్పే కదా ! జీవితంలో వస్తున్న అవాంఛనీయ, అనివార్య మార్పుల్లో భాగంగా గత నెల అప్పు చేసి ఓ కెమెరా ఫోన్ కొనుక్కున్నా. దాంతో నా ఎన్ సైక్లోపీడియాను ఫొటో తీసుకుని ఉంటే ఎంత బావుండేది! పోనీ, ఆ పుస్తకాలు అమ్మేసిన తర్వాత మిగిలిన అట్టలలైనా ఫొటో తీసుకునే ఉంటే ఆ జ్ఞాపకం నిలిచిపోయేది కదా. ఆ తెలివి లేకపోయింది నాకు(నాకు అసలు తెలివనేది ఉందా అని మా ఆవిడకు నిత్య అనుమానం. తెలివిగల వాళ్లు పుస్తకాలు చదవరని, వ్యాపారాలు చేసి బాగా సంపాదిస్తూ ఇళ్లు, కార్లు, బంగారం, చాటడంత సెల్ ఫోన్లు, పెళ్లాలకు పట్టుచీరలు కొంటుంటారని.. ఊటీ, కాశ్మీర్లకు తీసుకెళ్తుంటారని ఆమె ప్రగాఢ విశ్వాసం).

కెమెరా ఫోన్ అంటే నా తొలి కెమెరా ఫోన్ గుర్తుకొస్తోంది. నేను పుట్టిన కడప జిల్లా ప్రొద్దుటూరిలోని హోమస్ పేటలో ఉన్న ‘మా’ ఇంటి ఫోటోను పదేళ్ల కిందట డొక్కు కెమెరా ఫోన్ తో ఫొటో తీసుకున్నాను. ఐదారు కుటుంబాలు కాపురం చేసేంత పెద్ద ఇల్లు అది. 1980లలో దాన్ని మా పెదనాన్న తన తండ్రి, తమ్ముళ్లపై సామదానభేదదండోపాయాలు ప్రయోగించి తన పేర రాయించుకుని కొన్నాళ్ల తర్వాత లక్షలకు అమ్మేశాడు. కనీసం జ్ఞాపకంగానైనా ఉంటుంది కదా అని ఆ ఇంటి ముందు భాగాన్ని ఫొటో తీసుకున్నాను. 1950లలో కట్టిన ఆ ఇంటి వసారాలో రెండు పెద్ద బర్మాటేకు స్తంభాలుండేవి. వాటికి మా నాయనమ్మ నారమ్మ ఊయల కట్టి, అందులో నన్ను పడుకోబెట్టి ఊపుతూ  ‘రార.. రార సన్నోడా..’ అని పాడుతుండేదట. దూలాల్లాంటి ఇంటి అరుగుపైన మా తాత నాకు బిస్కెట్లు, తాటిముంజెలు, మెత్తని మాంసం ముక్కలూ తినిపిస్తుండేవాడట.

నేను తీసిన ఫొటోలో ఆ స్తంభాలు, అరుగులు కూడా పడ్డాయి. ఆ ఇల్లు మాకు దూరమైనట్టే ఆ ఇంటి ఫొటో ఉన్న కెమెరా కూడా దూరమైపోయింది. దాన్ని 2008లో హైదరాబాద్ సిటీ బస్సులో దొంగ ఎవడో కొట్టేశాడు. ఆ ఇంటిని కొన్నవాళ్లు దాన్ని కూల్చేసి, పెద్ద భవనం, కాంప్లెక్సు కట్టారని ఇటీవల తెలిసింది. దోగాడి, పాకి, పసుపుకొమ్ముల్లాంటి మా అమ్మ చేతులు, నల్లరేగు పళ్లలాంటి మా మేనత్త చేతులు పట్టుకుని ఆడుకున్న ఆ కడప బండరాళ్ల ఇంటి జ్ఞాపకం అట్లా శిథిలమైపోయింది.

2. atakekkin art pustakaalu

అలాంటి ప్రేమాస్పద దృశ్య జ్ఞాపకాలెన్నో తడిచూపుల మధ్య చెరిగిపోయాయి. బతుకు పోరాటంలో మా అమ్మ కోల్పోయిన చిన్నపాటి నగలు, కోపతాపాలతో ఇంట్లో వాళ్లూ, బంధువులూ పోటీలు పడి కాల్చేసుకున్న ఆత్మీయుల వస్తువులూ, అపురూపమైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలూ, పదో తరగతిలో సంస్కృతంలో స్కూలు ఫస్ట్ వచ్చినందుకు ఓ కోమటాయన బహుమానంగా ఇచ్చిన ఐదొందలను బట్టలు కొనుక్కోకుండా ఇంటర్ పుస్తకాల కోసం ఖర్చుపెట్టిన దయనీయ సాయంత్రమూ.. ఇంకా ఇంటర్ గట్టెక్కలేక అవమానాలు భరించలేక ఉరేసుకున్న కుంటి మిత్రుడు రామ్మోహనూ, ఇంటి గొడవలతో 22 దాటకుండానే పురుగుమందు తాగిన ఆప్తమిత్రుడు నాగేశుతో దిగిన ఫొటోలూ.. చచ్చిపోయిన పెంపుడు కుక్కలూ, నల్లపిల్లులూ, తాబేళ్లూ, చిలుకలూ..

అయినా  కోల్పోయింది కేవలం దృశ్యాత్మక జ్ఞాపకాలనేనా? ఉద్యమోత్సాహంలో పచ్చగా కళకళలాడే అడవుల్లో, సెలయేళ్ల మధ్య అనుభూతించిన ఆత్మీయ ఆలింగనాలు, వెచ్చని బలమైన కరచాలనాలు, గుప్పుమని వీచే అడవి మల్లెల పరిమళాల వేళ కన్నీళ్లు లేని లోకం కలగంటూ రేయింబవళ్లు ఎడతెగకుండా జరిపిన ఎర్రెర్రని చర్చలు, మళ్లీ కలుసుకోలేమోనన్న భయంతో చివరిసారి అన్నట్లు మహాప్రేమతో కళ్లారా చూసుకుంటూ లాల్ సలామ్ అంటూ ఇచ్చిపుచ్చుకున్న తడిచూపుల వీడ్కోళ్లు..

ఇప్పుడవన్నీ ఎండమావులు. గతమంతా మసకమసక పగుళ్లు. యాదృచ్ఛికంగా తారసపడినా అంతా భ్రాంతియేనా అన్న భావన. గుర్తుకు వచ్చీ రాని పేర్లు, ముఖాలు, ఊళ్లు, బాటలు, ఎన్ కౌంటరయిపోయి నెత్తురు మడుగు కట్టిన స్మృతుల పరంపర. కాలం పాతగాయాలనే కాదు, అజాగ్రత్తగా ఉంటే మరపురాని జ్ఞాపకాలనూ మానుపుతుందేమో!

ఎన్ సైక్లోపీడియా నుంచి దారి తప్పి ఎక్కడికో వచ్చాను. ఇలా శాఖాచంక్రమణాలు చేయొద్దని ఎన్నిసార్లో అనుకుంటాను కానీ సాధ్యం కాదు. పన్నెండేళ్ల కిందట.. అప్పటికింకా ఇంటర్నెట్ ఇళ్లలోకి, ఫోన్లలోకి అంతగా చొచ్చుకురాని కాలం. ఏదైనా అవసరమొస్తే ఇంటర్నెట్ సెంటర్ కో, పబ్లిక్, యూనివర్సిటీల లైబ్రరీలకో వెళ్లి తెలుసుకునే కాలం. 2004లో పనిపై హైదరాబాద్ లో కొన్ని నెలలు ఉన్నప్పుడు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా అబిడ్స్ కు వెళ్తుండేవాడిని. చాలా వరకు ఆర్ట్ పుస్తకాలనే కొనేవాడిని. ఒకసారి ఫంక్ అండ్ వాగ్నల్స్ న్యూ ఎన్ సైక్లో పీడియా 1991 ఎడిషన్ 29 వ్యాల్యూములూ దొరికాయి. బతిమాలి, బామాలి 1,600 రూపాయలకు కొన్నట్లు గుర్తు. వాటిని పెద్ద అట్టపెట్టెలో ఆటోలో రూమ్ కు తీసుకొచ్చాను. కొన్నాళ్లు ప్రతి వ్యాల్యూమునూ తడిమితడిమి చూసుకుంటూ ఉబ్బుతబ్బిబ్బయ్యాను. ఏ టు జెడ్ జ్ఞానం కదా.

ముఖ్యంగా ఆర్టిస్టుల బయాగ్రఫీలు, పెయింటింగులు చూస్తూ, చదువుతూ నిద్రాహారాలు మరచిపోయేవాడిని. అలా కొన్నాళ్లు గడిపాక, ఒక అనివార్యత వల్ల రూమ్ ఖాళీ చేసి, అనంతపురంలోని అక్కలాంటి, అమ్మలాంటి శశికళ ఇంటికి పంపాను, మా ఇంటికి పంపలేక.  కొన్నాళ్ల తర్వాత తిరిగి అనంతపురం వెళ్లాక వాటితో కుస్తీ పడుతూ గడిపాను. రాసుకున్న కవితలకు, ‘అడవి చిట్టీల’కు, ఉత్తరాలకు, పదీపరకా డబ్బులకు ఆ పుస్తకాలు భద్రస్థలాలు. డోంట్ కేర్ గా బతికిన కాలమది. కానీ కాలం లెక్కలు కాలానికుంటాయి. మనం లెక్కచేయకున్నా మనల్ని లెక్కచేసే దొంగనాయాళ్లు వేయికళ్లతో, లాఠీలు, తుపాకులతో కాచుకుని ఉంటారు. వాళ్ల బారిన పడి మనోదేహాలు ఛిద్రమయ్యాక అనంతపురాన్ని వీడి ఇంటికెళ్లాను, ఎన్ సైక్లోపీడియాను వెంటబెట్టుకుని.

బతుకులో అటూ ఇటో తేల్చుకోవాల్సిన కాలమది. కమ్చీ దెబ్బలు తిన్నవాడికి, తినని వాడికి చాలా తేడా ఉంటుంది. పైగా దెబ్బమీద దెబ్బ తినగలిగేవాళ్లు అతికొద్దిమందే ఉంటారు. నేను ఆ కొందరి కోవకు చెందని వాడిని కనుక మిత్రులు దెప్పుతున్నట్లు ‘సేఫ్’ సైడ్ ను ఎంచుకున్నాను. సామాన్యులకు సేఫ్ అనేది ఎప్పుడూ సాపేక్షికం, ఎన్ సైక్లోపీడియాలో ఎన్నిసార్లు చదివినా అర్థం కాని సాపేక్ష సిద్ధాంతంలా! కష్టం తప్ప ఏ సిద్ధాంతమూ కూడు పెట్టదని జ్ఞానోదయమయ్యాక పొట్ట చేతపట్టుకుని తిరిగి భాగ్యనగరానికి వచ్చాను. కాస్త సాపేక్షికంగా నా కాళ్లపై నేను నిలబడి, పెళ్లి చేసుకున్నాక నా ఎన్ సైక్లోపీడియాను తిరిగి తెచ్చుకున్నాను. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నా ఊరకే దాన్ని అప్పుడప్పుడూ తిప్పుతుండడం అలవాటుగా ఉండేది. ఇటీవల కొన్నాళ్లుగా అది తప్పింది. అందుకే ఒక గూటిలో సర్దుకుపోకుండా మరో గూటిని ఆక్రమించే ఆ పుస్తక సంచయం మా ఆవిడకు అక్కర్లేని పెను భూతమైపోయింది. అట్లా హైదరాబాద్ లో కొనుక్కున్న నా జ్ఞానభాండం ఎంతో భద్రంగా ఊళ్లు తిరిగి తిరిగి చివరికి ‘విధిరాత’లా మళ్లీ హైదరాబాద్ చేరి, అట్టలు వొలిపించుకుని బద్దలైపోయింది.

అరచేతిలో ఇంటర్నెట్ ఒదిగిన ఈ కాలంలో బోడి పాతికేళ్ల కిందట అచ్చయిన, డొక్కు, ఔట్ డేటెడ్, దండగమారి, అక్కర్లేని, చదలు పట్టిన ఎన్ సైక్లోపీడియా కోసం అంతగా వగస్తావెందుకు అంటున్నారు మిత్రులు. అన్నీ ఇంటర్నెట్ లో దొరుకుతాయని వాళ్ల భ్రాంతి(పోనీ నా భ్రాంతి కూడా అనుకోండి!) అక్కర సాపేక్షికం. పనికిరావని పారేసుకున్న వాటి అసలు విలువ ఏమిటో తెలిసినప్పుడు గుండె పట్టేస్తుంది. కళ్లు సజలమవుతాయి. దుఃఖపు ఉప్పెన జపాన్ అమర కళావేత్త హొకుసాయ్ వేసిన ‘కనాగవా మహాకెరటం’ చిత్రంలా వేయి పడగలతో విరుచుకుపడుతుంది. అల విరగిపడ్డాక బోల్తాపడిన శూన్యపు పడవల్లా మిగిలిపోతాయి కళ్లు.

1. funk and wagnalls

ఇప్పటికి మూడొందలకు పైగా పుస్తకాలు కొనుంటాను. అడుక్కున్నవీ, మళ్లీ ఇస్తానని తెచ్చుకుని ఇవ్వనివీ మరో రెండు వందలుంటాయి. నేను నా మిత్రులకిచ్చినవీ, వాళ్లు నా దగ్గర పుచ్చుకుని తిరిగివ్వనివీ అంతే సంఖ్యలో ఉంటాయి. స్థలం చాలక చాలా వాటిని మూటలు కట్టిపెట్టాను. తరచూ అవసరయ్యేవాటిని అటకెక్కించాను. ఈ అటక విద్య నాకంటే మా ఆవిడకు మరింత బాగా తెలుసు. ఇల్లు ఇరుకని గోలచేసే ఆమె తను మహా కళాఖండాలుగా భావించే బాతు, కుక్క, కొంగ, కోడి బొమ్మలను మాత్రం షోకేస్ లో చక్కగా విశాలంగా సర్దుతుంది. వారానికోసారి జాగ్రత్తగా తుడుస్తుంది. సంక్రాంతికి సంక్రాంతికి సబ్బెట్టి తోమితోమి స్నానాలు కూడా చేయిస్తుంది. నా పుస్తకాలను మాత్రం పనికిరాని చెండ్లలా అటకపైకి విసిరిపారేస్తుంది. ఎదుటివాళ్ల అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్యం. ఈ వింత ప్రజాస్వామ్యంలో నాకు ఏదైనా పుస్తకం అవసరమైతే మంచాలూ, కుర్చీలూ ఎక్కి ఆ అటకపైని పద్మవ్యూహంలోకి చొరబడి వెతుక్కోవడం. చాలాసార్లు అభిమన్యుడి చావులే.

కొన్నిసార్లు కొన్నిపుస్తకాలు కనిపించవు. ఆవిడకేసి చూస్తాను. ఆమె మౌనయోగినిలా చూసి పక్కగదిలోకి వెళ్లిపోతుంది. ఆ చూపులకు సవాలక్ష అర్థాలు! కనిపించని పుస్తకాలు ఒక్కోసారి విఠలాచార్య సినిమాల్లో దెయ్యాల మాదిరి అటకెక్కిన పాత కుక్కర్లో, పాతచీరల మధ్యలో, పాతసామాన్ల మూటల్లో, ఇంకా ఊహించశక్యం కాని నానాస్థలాల్లో దర్శనమిస్తాయి. అసలు కనిపించకుండా పోవడం కంటే ఎక్కడో ఒక చోట పడుంటే మేలు కదా. ఇంట్లో ఎన్ని పుస్తకాలున్నా ఎన్ సైక్లోపీడియానే చుక్కల్లో చందమామలా కొట్టొచ్చినట్టు కనపడేది 1,2,3…. 29 నంబర్లతో వరుసగా ఎర్రని అట్టలపై బంగారువన్నె అక్షరాలతో, యూనిఫామ్ లో వరుసగా నిల్చున్న బడిపిల్లల్లా.

ప్రతి ఇష్టానికీ కారణం లేకపోవచ్చు కాని, ప్రతి వియోగానికీ ఒక కారణముంటుంది. సామాన్యులకు ఎదురయ్యే వియోగాల కారణాల్లో చాలా తక్కువ మాత్రమే స్వయంకృతాలు, మిగతాన్నీ అన్యకృతాలు. బోడి పుస్తకాల కోసం ఇంత వలపోత ఎందుకని పాఠకులకు అనిపిస్తుండొచ్చు. ఒక నిర్దిష్ట కాలపు వ్యక్తుల సామూహిక  ఈతిబాధలు సహజంగానే చరిత్రలో భాగం అవుతాయని అంటారు కదా, అందుకని. అలాగని నా గోస చరిత్రకెక్కాలన్న తపనేం నాకు లేదు కానీ, రాసుకోకుంటే చాలా జ్ఞాపకాలను మరచిపోతాం కనుక ఇలా రాతకెక్కించడం.

గూళ్లు లేని ఇరుకు ఇల్లు, చదలు పట్టడం, కొన్నాళ్లుగా ముట్టకపోవడం వగైరాలు.. ఎన్ సైక్లోపీడియాతో నా అనుబంధం తెగడానికి కారణాలని మరోసారి సరిపెట్టుకుంటాను. ఇప్పుడు హైదరాబాద్ పాత పుస్తకాల షాపుల్లో ఫంక్ అండ్ వాగ్నల్స్ ను మించిన బ్రిటానికా, మ్యాక్ మిలన్ వంటి ఎన్ సైక్లోపీడియాలు పది, పదిహేను వేలకు వస్తాయి. బేరమాడితే ఇంకా తక్కువకు. కానీ.. కలం, కాగితం అక్కర్లేకుండా తయారైన ఈ వ్యాసాన్ని జీమెయిల్ లో ‘సారంగ’కు పంపుతున్న నాలో.. గూళ్లకు సరిపడే ఆ జ్ఞానభాండాగారాలను కొనాలన్న అభిలాష ఇంకా మిగిలి ఉందా అని?

*

 

 

  పబ్బులో శ్రీకృష్ణుడు

పి. మోహన్

 

P Mohanస్నానమాడుతున్న అమ్మాయిల బట్టలను దొంగిలించిన వాడు దేవుడయ్యాడు. ఆ దృశ్యాన్ని రంగుల్లో చిత్రించి, రాళ్లపై చెక్కినవాళ్లు మహాకళాకారులయ్యారు. గోపికా వస్త్రాపహరణంలో ఒక పరమార్థముందని కవులు గానం చేశారు. ఇదంతా చరిత్ర. ఇంత ఘన చరిత్రకు వారసులమని  బోరవిడుచుకుని చెప్పుకుంటున్నవాళ్లు ఇప్పుడు ఆ వారసత్వాన్నికాలదన్నడమే విషాదం.

 మొన్న గౌహతిలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శనలోంచి రెండు బొమ్మలను తీసేశారు. ఒక దాంట్లో శ్రీ కృష్ణుడు బికినీలు వేసుకున్న యువతులతో బార్లో ఉన్నాడు. మరోదాంట్లో జాతీయ పతాకంపై మద్యం బాటిళ్లు వంటివి ఉన్నాయి. కృష్ణుడిని అవమానించారని కాషాయ సంస్థలు, దేశ పతాకాన్ని అవమానించారని దేశభక్తులు మండిపడ్డంతో వాటిని తీసేశారు. వాటిని వేసింది అక్రమ్ హుసేన్ అనే ముస్లిం. అతనిపై ఎఫ్ఐఆర్ పెట్టారు. ప్రస్తుతం అతడు అజ్ఞాతంలో ఉన్నాడు. హిందూ దేవుళ్లను అశ్లీలంగా చిత్రించి అవమానించాడని ఎంఎఫ్ హుసేన్ బొమ్మలను చించేసి, దేశం నుంచి వెళ్లగొట్టిన కళాస్వాదకుల దేశం కదా మనది. ఇప్పుడు ఈ అస్సామీ హుసేన్ కూడా ఆ బాటలోనే ఉన్నాడేమో. అక్రమ్ ముస్లిం కాకుండా హిందువో, సిక్కో అయ్యుంటే ఇంత గొడవ జరిగేదా? కృష్ణుడిని అక్రమ్ కంటే ‘అశ్లీలంగా’ చిత్రించిన బోలెడు మంది హిందూ చిత్రకారులను పద్మ అవార్డులతో గౌరవించిన దేశం కదా మనది!

relief-at-gopuram-base-krishna-stealing-gopis-clothes-nambiraja-temple-tirukkurunkudi-india-d

దేశమంటే మనిషి కాదోయ్, మట్టోయ్..! అంటూ మనిషిని మట్టి నుంచి దూరం చేస్తున్న వర్తమానంలో కనీసం జాతిపతాకంపైనైనా పట్టుదలగా ఉన్నందుకు దేశభక్తులకు శతకోటి వందనాలు. ప్రభుత్వాలు తద్దినాల్లో వాడి పారేసిన జాతీయ జెండాలను చలితో పోరాడ్డానికి తమ మురికి దేహాలకు చుట్టుకుని నిద్రిస్తూ అవమానిస్తున్న, అగౌరవిస్తున్న పేవ్మెంట్ అలగా జనంపై కేసులు పెట్టని వారి క్షమాగుణానికి జేజేలు. కృష్ణుడికి జరిగిన అవమానం ముందు ఇవన్నీ చాలా చిన్న సమస్యలు కనుక వదిలేద్దాం. జాతి మనుగడకు పెను సవాల్ విసురుతున్న ఆ బికినీభామల పరివేష్టిత గోపాలుడి చిత్రం గురించే వాదులాడుకుందాం.

Krishna Gopis Mattancherry

నగరాల్లో పబ్, డ్రగ్ సంస్కృతి పెరుగుతోంది. రాత్రి పదిగంటలకు పచారీ కొట్లను మూసేయించే పోలీసులు పబ్బులను తెల్లారేవరకూ నడిపిస్తున్నారు. సంపన్నకుటుంబాల యువతీయువకులు ఖరీదైన కార్లలో దూసుకొచ్చి, మందుకొట్టి, చిందేసి తెల్లారేటప్పుడు తూలుతూ, చెత్త ఊడ్చేవాళ్లను కార్లతో గుద్దుతూ వెళ్లిపోతుంటారు. అక్రమ్ హుసేన్ ఈ పబ్ కల్చర్ సంగతేంటో జనానికి చూపాలనుకున్నాడు. ఆర్ట్ స్టూడెంట్ కనుక స్వేచ్ఛ తీసుకున్నాడు. పబ్లో కృష్ణుడిని ప్రవేశపెట్టాడు. నీలి వ్యవహారాలు నడిచేచోటు కనుక నీలవర్ణుడిని, గ్రంథసాంగుడిని పట్టుకొచ్చాడు. మధురానగరి రాసలీలలను తను బతుకుతున్న స్థలకాలాల్లో ఆవిష్కరించాడు. అక్రమ్ కాస్త జాగ్రత్తపడినట్లే ఉంది. అదే రాముడి జోలికి పోయింటే ఆ బొమ్మ గ్యాలరీ గడప తొక్కేదే కాదేమో.

akramhussain_1428766784

ఈ చిత్రంలో అక్రమ్ కృష్ణుడినేమీ అశ్లీలంగా చిత్రించలేదు. ఓ అమ్మాయి అతని నిమిత్తం లేకుండా అతన్నికౌగిలించుకుంది. అతన్నిరేపల్లె కన్నెపిల్లల మానసచోరుడని కీర్తించేవాళ్లకు, నగ్నగోపికల, నల్లనయ్య రాసలీలల చిత్రాలను పటాలు కట్టించుకుని పూజించేవాళ్లకు, గోపీలోలుని నఖదంతక్షతాల అష్టపదులను ఉషోదయాన మైమరచి వినేవాళ్లకు ఇందులో అభ్యంతర పెట్టాల్సిందేముంది? ఆ చిత్రాల్లోని యువతులకంటే ఈ బికినీ అమ్మాయిలే కాస్త ‘శ్లీలంగా’ ఉన్నారు కదా? మరి దేవుడిని బార్లో ఉంచాడని అభ్యంతరమా? మరి వేదాల్లోని, హిందూ పురాణాల్లోని సురాపానాల సంగతి? మద్యంపై కోట్ల ఆదాయం కోసం వెంపర్లాడుతూ, కోట్ల సంసారాలను బుగ్గి చేస్తున్న ప్రభుత్వాల సంగతి? మద్యానికి మగువకూ లింకుపెట్టి తాగుడును పబ్లిగ్గా ప్రోత్సహిస్తున్నవ్యాపార ప్రకటనల సంగతి? ఇవన్నీలౌకిక ప్రశ్నలు కదా, పసలేనివి. పారలౌకికమైతే పసందుగా ఉంటాయి.

నగ్నగోపికలు కృష్ణుడిని వేడుకుంటున్నచిత్రాలను హిందూ కళాకారులు వందల సంవత్సరాలుగా వేస్తున్నారు. మొగలాయిల కాలంలో ముస్లిం చిత్రకారులు కూడా వాటిని రసభరితంగా చూపారు. కేరళలోని మట్టంచేరి ప్యాలెస్ లో ఉన్న పదిహేడో శతాబ్దినాటి కుడ్యచిత్రం కృష్ణుడి రాసలీలలను కనువిందుగా చూపుతుంది. పడచుపిల్లలు పార్కుల్లో ముచ్చట్లు చెప్పుకున్న పాపానికి గుంజీలు తీయించే నైతిక పోలీసులకు ఈ బొమ్మ హిందూజాతి గర్వించదగ్గ కళాఖండంగా కనిపిస్తుంది. అక్రమ్ బొమ్మ మాత్రం హిందూ సంస్కృతిపై దాడిలా కనిపిస్తుంది. మన ప్రాచీన కళాకారులు సౌందర్యపిసాసులు. అక్రం మాత్రం కళావిధ్వంసకుడు. వాళ్లది శృంగారం, అతనిది…!  సినిమా పాటల్లో హీరో హీరోయిన్ను తాకరానిచోట తాకితే కళ్లప్పగించి చూసే మన ఘన మర్యాదకు.. చలనంలేని బొమ్మకు గుడ్డకరవైతే మాత్రం భంగం కలుగుతుంది.

P35-Gita-Govinda 1775

కళ విషయాల్లో నైతిక పోలీసుల అజ్ఞానం, అక్కసు గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. భారతీయ కళ దేవాలయాలను అంటిపెట్టుకుని బతికింది. దేవాలయాలపైని శృంగార శిల్పాల ఉద్దేశం సౌందర్యారాధనే కాదు, కామజ్ఞాన ప్రచారం కూడా. వాత్స్యాయన కామసూత్రాలకు చిత్రశిల్పరూపాలు ఇవ్వడం ఇందులో ఒక భాగం. అవి రాజుల భోగలాలసతను కూడా చూపుతుండొచ్చు. కానీ అవి తొలుత కళకారుడి ప్రతిమలు. నైతికతతో కలుషితం కాని సృజన. గర్భగుడిలోని దేవుడి బొమ్మను చెక్కిన శిల్పులే ఈ బొమ్మలనూ చెక్కారు. దేవుడిని ఎంత శ్రద్ధగా తీర్చిదిద్దారో వీటినీ అంతే శ్రద్ధగా తయారు చేశారు. ప్రాచీన పంచలోహ విగ్రహాలను బట్టల్లేకుండా చూస్తే ప్రాచీన కళాకారులకు మానవసౌందర్య సృజనలో ఎంత అభినివేశం, కళాత్మక దృష్టీ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కానీ మన వేడుకలు, నైతికత ఆ సౌంద్యర్యాన్ని ఉత్సవ పట్టుబట్టలతో జాగ్రత్తగా కప్పెడతాయి. అందుకే మనకు మన ప్రాచీనులు దర్శించిన అసలు సౌందర్య దర్శన భాగ్యం లేదు. అరకొరగా మిగిలిన సౌందర్యానికి మన కుహనా నైతికత సున్నం, రంగులూ కొడుతోంది. కళాస్వేచ్ఛకు మన మర్యాద ఇనుప కచ్చడాలు తొడుగుతోంది.

krishna_stealing_clothes_hc92

కళాస్వేచ్ఛ అంటే ఇతర మతాలను అవమానించడమా? అని అడుగుతున్నారు. అవమానించడానికి, కించపరచడానికి వేసింది కళ కాదు. కళ అని ప్రచారం చేసినా దానికి మనుగడ ఉండదు. ముస్లిం, క్రైస్తవ కళాకారులు హిందూ దేవుళ్లను కించపరచేందుకు,

హిందూ కళాకారులు ఏసుక్రీస్తును, మహమ్మద్ ప్రవక్తను కించపరచేందుకు బొమ్మలు వేస్తే అవి కించపరచే బొమ్మలే అవుతాయి కానీ కళ కావు. ఆయా దేవుళ్లను కళాత్మకంగా, స్వేచ్ఛాభావాలతో, చివరకు వాళ్లంటే ఆగ్రహంతో అయినా వేస్తేనే కళ అవుతుంది. పాశ్చాత్య కళలో దీనికి బోలెడు రుజువులున్నాయి. వాళ్లు ఏసుక్రీస్తు శిలువ ధ్వంసం చేస్తున్నట్లు, మేరీమాత ప్రసవిస్తున్నట్లు చిత్రాలు వేశారు. మనగడ్డపైనా దీనికి ఉదాహరణలున్నాయి. అజంతా చిత్రాల్లో, ఖజురహో శిల్పాల్లో, మారుమూల గుళ్లలో మానవదేహాన్ని అపురూపంగా సృజించారు. ఎక్కడా వ్యతిరేకత రాలేదు. బూతు చూసే చూపులో ఉంది. శిశువుకు పాలిస్తున్న తల్లిరొమ్ము వేరు, శ్రీకృష్ణుడు మర్దిస్తున్న గోపిక రొమ్ము వేరు.

            *                                                               

 

Obscenity is a function of culture – a function in the mathematical sense, I mean, its value changing with that of the variables on which it depends.  – A. P. Sabine.

Obscenity is a moral concept in the verbal arsenal of the  Establishment, which abuses the term by applying it, not to expressions of its own morality, but to those of another.    -Herbert Marcuse

Obscenity is whatever happens to shock some elderly and ignorant magistrate.    -Bertrand Russell

రంగుల భోజనం…గొంతులో వీణలు!

సేకరణ, పరిచయం: పి.మోహన్

 

P Mohanచెన్నపట్టణం రైల్వే స్టేషన్.. 1898 తొలకరిలో ఓ రోజు. విశాఖపట్టణం నుంచి వచ్చిన రైల్లో నూనూగు మీసాల యువకుడొకడు దిగాడు. బస వాకబు చేస్తూ తంబుచెట్టి వీధి బాటపట్టాడు. ఓ పుస్తకాల కొట్టుముందు జనం బిలబిల మూగి ఉన్నారు. యువకుడు కూడా ఆసక్తితో వాళ్లలో కలసిపోయాడు. అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు. కొట్టు గుమస్తా అప్పుడే బొంబాయి మెయిల్లోంచి వచ్చిన పెట్టె విప్పి ఒక్కో పోస్టర్ ను టేబుల్ పైన పరుస్తున్నాడు. జనం కళ్లార్పకుండా చూస్తున్నారు. మూరెడుకుపైగా పొడవున్న రంగురంగుల రవివర్మ చిత్రాల పోస్టర్లు ఇంధ్రధనుస్సులా పరచుకున్నాయి. మెరుస్తున్న రంగుల వాసన ముక్కుపుటాలకు మైకంలా సోకుతోంది.  

‘ఎంత బావున్నాయ్! అన్నీ కొత్తవే. నాకు ఆ మేనకావిశ్వామిత్రుల బొమ్మ ఇవ్వండి’

‘నాకు లక్ష్మీసరస్వతులు కావాలి. పటం కట్టించుకుంటా’

‘నాకు మాత్రం అదిగో ఆ పైటజారిన రంభ బొమ్మ కావాలి’

‘నాకు ఆ మలయాళ కన్నెపిల్ల బొమ్మ’

జనం ఎగబడ్డారు. గుమస్తా అణాలు, బేడలు పుచ్చుకుని బొమ్మలు ఇచ్చాడు. కాసేపటికి సందడి తగ్గింది. విశాఖ యువకుడు బొమ్మలను కళ్లార్పకుండా చూస్తూ ఉన్నాడు.

‘ఏమి తంబి, అట్లా సూస్తా ఉండావు, నీకు ఏమి కావాలి?’ గుమస్తా యువకుడిని అడిగాడు.

యువకుడు తేరుకున్నాడు.

‘అన్నీ.. ఇవన్నీ కావాలి..’

గుమాస్తా తుళ్లిపడ్డాడు. ఎగాదిగా చూశాడు.

‘ఇవన్నీ కావాలి. ఖరీదు పుచ్చుకుని చిల్లర ఇవ్వండి’ యువకుడు మూడు రూపాయల బిళ్లలను బల్లపైన ఉంచాడు.

గుమాస్తా ముప్పై బొమ్మలను చుట్టచుట్టి యువకుడికి అందించాడు.

యువకుడు బలిజ సంఘం సత్రంలో గది తీసుకున్నాడు. రంగుల భోజనంలో పడిపోయి అసలు భోజనం సంగతి మరచిపోయాడు. బొమ్మలన్నింటిని నేలపై పరచి గంటలతరబడి అలాగే చూస్తుండిపోయాడు. గొంతులో వీణలు మోగాయి. రాగాలు రేగాయి. పద్యాలు పలికాయి.

***

2 (2)

3 (2)యువకుడి పేరు సెట్టి లక్ష్మీనరసింహం(1879-1938). మనకు అపరిచితుడిలా అనిపిస్తాడు కానీ అతని సమకాలికులకు మాత్రం సుపరిచితుడే. కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు రాశాడు. నాటకాల్లో వేషాలు కట్టాడు. యవ్వనంలో గిడుగు, గురజాడల బాటలో నడిచాడు. గ్రాంధికవాదులతో తలపడ్డాడు. వయసుపైబడ్డాక మాత్రం ప్లేటు ఫిరాయించి గ్రాంధికంలో పడ్డాడు. అతడానాడు ఏం చేసినా ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు, రవివర్మ బొమ్మలపై ‘చిత్రమాలికలు’ పేరుతో రాసిన పద్యాలు తప్ప. ఇవి తొలుత ’కృష్ణా’ దినపత్రికలో వచ్చాయి. తర్వాత సెట్టి మరికొన్ని రాసి మొత్తం 54 మాలికలతో 1935లో పుస్తక రూపంలో తెచ్చి, తన ప్రభువైన జయపురం మహారాజుకు అంకితమిచ్చాడు. ఆ మాలికల్లోకి వెళ్లబోయే ముందు సెట్టి గురించి కాసిని ముచ్చట్లు. సెట్టి చిత్రమాలికల ముందుమాట, అతని ఇతర పుస్తకాలు, ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం’, తెలుగు సాహిత్య కోశం వంటి పుస్తకాలు, పత్రికల్లోంచి ఈ వివరాలు..

సెట్టి విశాఖపట్నంలో పుట్టాడు. తల్లిదండ్రులు వెంకయ్యమ్మ, అప్పలస్వామి. సెట్టి మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఆరు నెలలు కొక్కొండ వెంకటరత్నానికి, ఆరు నెలలు కందుకూరి వీరేశలింగానికి శిష్యుడు. 1900లో బీ.ఏ. పాసై విశాఖ వచ్చి మిసెస్ ఏవీఎన్ కాలేజీ అనుబంధ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. మహాకవి శ్రీశ్రీ తండ్రి వెంకట రమణయ్య, సెట్టి సహోద్యోగులు. సెట్టిని ‘సెట్టి మాస్టార’ని, రమణయ్యను ‘రమణయ్య మాస్టార’ని పిలిచేవాళ్లు. శ్రీశ్రీకి సెట్టి వద్ద తండ్రివద్ద ఉన్నంత చనువు ఉండేది. ఆ వివరాల్లోకి తర్వాత.

సెట్టి దాదాపు ఇరవయ్యేళ్లు(1901-19) ఏవీఎన్ పాఠశాల, కళాశాలల్లో పనిచేశాడు. హెడ్మాస్టర్ గా, కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు. వ్యావహారికభాషావాదులైన కాలేజీ ప్రిన్సిపాల్ పీటీ శ్రీనివాస అయ్యంగారు ప్రోత్సాహంతో ఆంగ్లంలోంచి ‘గ్రీకుపురాణ కథల’ను అనువదించాడు. ‘సంధులు మొత్తంగా విసర్జించిన శైలి’లో రాసిన ఈ పుస్తకం పాఠ్యపుస్తకమైంది. దీని గురించి గురజాడ తన డైరీలో, ‘కథలలో గొప్ప లక్షణాలు, సాహిత్య మెలకువలు ఉన్నాయి. తెలుగు సారస్వతంలో నూతన పోకడలను ఇవి ప్రవేశపెడుతున్నాయి.. ఈయన అనువాదం చక్కగా ఉంది. సంధిని పరిత్యజించడంలో ఒక నిమయాన్ననుసరించారు. ఇది గ్రాంథికంలో వ్రాసిన గ్రంథమే’ అని రాసుకున్నాడు. అయినా ఈ  పుస్తకంపై గ్రాంథిక భాషావాదులు మండిపడ్డారు. సెట్టి కూడా తగ్గలేదు. తాపీ ధర్మరావు ఓ చంపకమాలలో గ్రాంధికాన్ని సమర్థించగా, సెట్టి దానికి బదులుగా 116 పాదాల శార్దూలం రాసి దానికి ‘నూటాపదహార్లు’ అని పేరుపెట్టాడు.

కవిభూషణ బిరుదాంకితుడైన సెట్టి కొన్ని కొక్కిరాయి పనులూ చేశాడు. ‘రసికాభిలాషం’ రాసి, దాన్ని శ్రీనాథుడికి ఆపాదిస్తూ ప్రకటించాడు. అది కవిసార్వభౌముడిది కాదని చిలకమర్తి లక్ష్మీనరసింహం తేల్చాడు. దాన్ని సెట్టి తనముందే రాశాడని విశాఖ వాసి బొడ్డు రామయ్య చిలకమర్తికి చెప్పాడు. సెట్టి ‘మరీచీ పరిణయం’ రాసి దాన్ని శ్రీ కృష్ణదేవరాయల కూతురు మోహనాంగికి అంటగట్టాడు. సెట్టి చనిపోయాక చాలా ఏళ్లకు అది అచ్చయింది. అది మోహనాంగిది కాదని ఆరుద్ర తేల్చడం మరో ముచ్చట.

సెట్టి విరివిగా రాసేవాడు. ప్రభాసశాపవిమోచనం(కావ్యం), శ్రీకృష్ణరాయబారం, లుబ్ధాగ్రేసర చక్రవర్తి(మోలియర్ రాసిన మైజర్ నాటకానికి అనువాదం), మాలినీ విజయం, చిత్రహరిశ్చంద్రీయం(నాటకం), అహల్య(నాటకం), వసంతసేన(నవల, గురజాడకు అంకితం), పన్నా, బప్పడు(రాజస్థానీ కథాకావ్యాలు), గంగికథ(నవల), దొంగ(కథ), కొన్నిశతకాలు, ఆంధ్రపత్రిక, భారతి వంటి పత్రికల్లో ఉగాది పద్యాలు, బైరన్, షెల్లీ, వర్డ్స్ వర్త్ ల పద్యాలకు అనువాదాలు.. ఇవన్నీ అతని సాహిత్య కృషి.

సెట్టి అక్కయ్య సీరం సుభద్రమ్మ(1876-47) కూడా కవయిత్రి, నవలా రచయిత్రి. రెండువేల పద్యాల్లో ‘సుభద్రాపరిణయం’ రాసింది. కానన్ డయల్ రాసిన షెర్లాక్ హోమ్స్ అపరాధ పరిశోధక నవలావళిలోని ‘ద హౌండ్ ఆఫ్ ద బాస్కర్విలీస్’ను తెలుగులో ‘జాగిలం’ పేరుతో చక్కగా అనువదించింది. ఇది మద్రాస్ వర్సిటీ పాఠ్యపుస్తకమైంది.

సెట్టి స్కూలుకు రాజీనామా చేశాక లా చదివి ఫస్ట్ గ్రేడ్లో పాసయ్యాడు. జయపురం మహారాజు, రచయిత, దాత విక్రమదేవవర్మ(1869-51)కు 1930లో ఆంతరంగిక కార్యదర్శిగా చేరాడు. జయపురం(ఒడిశా) ఆస్థానప్రభావంతో గ్రాంధికంలోకి మళ్లాడు. ‘చిత్రమాలికల’తోపాటు చాలా కావ్యాలను రాజుకే అంకితమిచ్చాడు. వర్మ ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ఏటా లక్ష చొప్పున ఇరవయ్యేళ్లు విరాళాలు ఇచ్చాడు. శతాధిక గ్రంథకర్త, శతాధిక కృతిభర్త. గిడుగు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి ప్రసిద్ధ రచయితలు తమ రచనలను వర్మకు అంకితమిచ్చారు. తెలుగులో తొలి కార్టూనిస్టు, చిత్రకారుడు, కళావిమర్శకుడు తలిసెట్టి రామారావు వర్మకు దివాన్ గా పనిచేశాడు.

1 (1)

సెట్టితో శ్రీశ్రీ అనుంబంధం గురించి. వయసులో ముప్పయ్యేళ్ల తేడా ఉన్నఈ ఇద్దరూ కవితాసమితి సభ్యులు. సెట్టి చాలావరకు ఏది ఎత్తుకున్నామాలికల్లోనే ఎత్తుకునేవాడు. శ్రీశ్రీ తొలి పద్యరచన ‘విశ్వరూప సందర్శనం’ కూడా మాలికే, సెట్టి ప్రభావమే. ‘మనుచరిత్రకన్నా వసుచరిత్ర గొప్పదని బహుశా సెట్టి మాస్టారు శ్రీశ్రీకి చెప్పారు’(ఆరుద్ర). జగన్మిత్ర నాటక సమాజంలో సెట్టి శ్రీశ్రీతో కుశుడు వంటి బాల పాత్రలనేకం వేయించేవాడు. అవధాని చెళ్లపిళ్ల వెంకట శాస్త్రికి సెట్టి వీరాభిమాని. ఓ సారి చెళ్లపిళ్ల విశాఖకు వచ్చి తన శిష్యుడు పింగళి లక్ష్మీకాంతం ఇంట్లో ఉన్నప్పుడు, జయపురంలో అవధానానికి రావాలని విక్రమదేవవర్మ తరపున ఆహ్వానించడానికి వెళ్లాడు సెట్టి, కూడా శ్రీశ్రీని వెంటబెట్టుకుని. శ్రీశ్రీకి చెళ్లపిళ్లను చూడ్డం అదే తొలిసారి. సెట్టి మాత్రాఛందస్సులో గురజాడను గుర్తుకు తెచ్చేలా రాసిన ‘బప్పడు’ లోని కొన్ని పద్యాల ప్రభావం శ్రీశ్రీ ‘శైశవగీతి’ లో కనిపిస్తుంది. బప్పడులోని పిల్లల ఆటపాటల వర్ణన ఇలా సాగుతుంది..

‘పది పండ్రెండేడుల ఈడును గల

సిగ్గును తెలియని చిన్న బాలికలు…

కన్నుల నిండా కాటుక రేఖలు..

చిన్ని చప్పట్లు చెరచేవారూ

గడ్డిపువ్వులను కోసేవారూ..

ఎచ్చటను చూచినా తామే ఐ

వచ్చిన చోటికె వచ్చుచు తిరిగీ

పోయిన చోటికే పోవుచు మరియూ..’

 

శ్రీశ్రీ ‘శైవశగీతి’ ఇలా సాగుతుంది…

‘అయిదారేడుల పాపల్లారా..

అచ్చటికిచ్చటి కనుకోకుండా

ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే..’

 

తాపీ ధర్మారావు గ్రాంధిక చంపకమాలకు ప్రతిగా సెట్టి రాసిన శార్దూల మాలికలోంచి

శ్రీశ్రీ కొన్ని పాదాలను ఉటంకించేవాడని అంటాడు ఆరుద్ర.

ఆ పాదాలు..

‘…కేవాస్తే ఇస్తరఫ్, ఇస్లియే, మగరుమా ఫక్ భేష్ చమక్కంచు హిం

దుస్తానీ పదసంచయంబె కృతులన్ దూరుస్తురో లేక నో

యెస్తేంక్స్, మిస్టరు, మైడియర్, మొదలుగా ఇంగ్లీషు శబ్దాలనే

వేస్తారో తమ చిత్తమండి.. బస్తీమే సవాల్..’

 

శ్రీశ్రీ తొలినాళ్ల పద్యాలపై సెట్టి ప్రభావం గురించి ఎవరూ విశ్లేషించినట్లు లేదు. ఆ పనిచేస్తే తొలినాళ్ల శ్రీశ్రీని మరింత బాగా అంచనా వేయొచ్చేమో!

ఇక ‘చిత్రమాలికల’ సంగతి. దీనికో ప్రత్యేకత ఉంది. భారతీయ భాషల్లోనే కాదు, బహుశా ప్రపంచంలోని ఏ భాషలోనూ ఇలాంటి పుస్తకం లేదనొచ్చు. వర్ణచిత్రాలపై కవితలు ఆంగ్లం, ఫ్రెంచి తదితర భాషల్లో మధ్యయుగాలనుంచే నుంచే ఉన్నాయి. జపాన్ చిత్రకారులైతే చిత్రాల పక్కనే పద్యాలు రాసేవాళ్లు. లియోనార్డో డావిన్సీ వేసిన మిలాన్ రాజు ప్రేయసి ‘చిచీలియా గల్లెరని’ చిత్రంపైన డావిన్సీ మిత్రుడు బెర్నార్దో బెలీంచియోని శృంగారభరిత పద్యాలు రాశాడు. ‘మోనాలిసా’ చిత్రంపై తెలుగులో చాలా కవితలు వచ్చాయి. అయితే ఒక చిత్రకారుడు వేసిన చిత్రాలపై పనిగట్టుకుని యాబైకిపైగా పద్యాలు రాసింది, అచ్చేసింది మాత్రం సెట్టినే. ఇది సాముగరిడీలా ఉన్నా వ్యర్థవిన్యాసంగా మాత్రం మారిపోలేదు. సెట్టివి పద్యాలే అయినా నారికేళపాకాలు కావు. తెలుగు పలుకుబళ్లతో, సహజ సంభాషణలతో, సరళంగా, ప్రవాహసదృశంగా సాగుతాయి. చిత్రంలోని సారాంశాన్ని కవిచూపుతో కొత్తగా పరిచయం చేస్తాయి. చిత్రమాలికలు ‘కృష్ణా’ పత్రికలో వస్తున్నప్పుడు అన్నీకాకపోయినా కొన్నయినా పాఠకులను ఆకట్టుకున్నాయి. ‘గంగావతరణం’, ‘హంస దమయంతి’, ‘బాలకృష్ణుడు’ వంటివి సెట్టి కవితాప్రతిభకు అద్దంపడతాయి.

సెట్టికి రవివర్మ చిత్రాలు తొలుత విశాఖలో లితోగ్రాఫుల రూపంలో పరిచయం. చిత్రమాలికల ముందుమాటలో తాను చెన్నపట్టణంలో ఇరవై, ముప్పై రవివర్మ చిత్రాలను కొన్నానని సెట్టి రాసుకుంది లితోగ్రాఫుల గురించే. తొలి యవ్వనంలో పరిచయమైన ఆ చిత్రాలు సెట్టిని తుదకంటా వెంటాడాయి. ఆ సంగతులన్నీ చిత్రమాలికల ముందుమాటలో ఉన్నాయి. సెట్టికి కేరళ రంగరి బొమ్మలపై ఎంత ప్రేమంటే, సందర్భశుద్ధి లేకపోయినా పొడిగేంత. ‘ఆంధ్రపత్రిక’ 1930 ఉగాది సంచికలో సెట్టి ‘ఉగాది కానుకలు’ కథ ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కనకగిరి రాకుమార్తె అన్నపూర్ణాదేవిని పెళ్లాడ్డం, అన్నపూర్ణ తన తండ్రి కుట్రబారి నుంచి భర్తను కాపాడుకోవడం ఇందులోని విషయం. ఇక్కడ రవివర్మ చిత్రాల ప్రసక్తి శుద్ధ అనవసరం. అయినా సెట్టి వదల్లేదు. అన్నపూర్ణాదేవి అందాన్ని వర్ణించడానికి రవివర్మ చిత్రాలను అరువు తెచ్చుకున్నాడు. ఆ వర్ణన.. ‘రవివర్మ చిత్రపటములు సుప్రసిద్ధములు. ఆ చిత్తరువులందలి నాయికలందఱు నొక్కవిధమైన యాకారము గలవారు. భేదములు వయస్సులనుబట్టి, వ్యవస్థలను బట్టి, వలువలను బట్టి వచ్చినవి. ఇంచుక పొడుగుపాటి శరీరములు, కొంచెము కోలవాటు ముఖములు, వంగిన కనుబొమ్మలు నిడుదఱెప్పలతోడి వెడఁద కన్నులు, రవంత సూదిగానున్న ముక్కులు, నిండైన క్రిందిపెదవులు, ఉగ్గులుదేఱి నిగ్గులు వాఱిన పెన్నెఱులు: ఇవి యా యాకారమునకు లక్షణములు. స్త్రీసౌందర్యము పరిపూర్ణత్వమున నట్లుండునని యారాజ చిత్రకారుఁడూహించి యుండనోపును. అతని మేనక మేనిసొంపు, మోహిని ముఖకళ, రాధరామణీయకత, కలిసి యన్నపూర్ణాంబ రూపము తేలును…’

రవివర్మ బొమ్మలను ఇంతలోతుల్లోకి వెళ్లి చూసిన సెట్టి ఆ చిత్రకారుడు వేసిన అసలు తైలవర్ణ చిత్రాలను కొన్నింటినైనా చూసే ఉంటాడు. మద్రాస్, విశాఖ, రాజమండ్రి, కాకినాడ ధనికులు, జమీందార్లు రవివర్మతో బొమ్మలు వేయించుకున్నారు. సెట్టికి వాళ్లలో కొందరితోనైనా పరిచయాలు ఉండుంటాయి.

6

సెట్టి చిత్రమాలికలకు ప్రేరణ అతని సహాధ్యాయి మారేపల్లి రామచంద్రశాస్త్రి(1873-1943). ఆ వివరాలు సెట్టి ముందుమాటలో ఉన్నాయి కనుక ప్రస్తావించడం లేదు. సెట్టి చిత్రమాలికలను రవివర్మ చిత్రాలతో సచిత్రంగా ముద్రించాలనుకున్నాడు. అయితే ఆనాడు చిత్రాల ముద్రణ వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం కనుక సాధ్యం కాలేదు. చివరకు బొమ్మల్లేకుండానే అచ్చువేశాడు.

చిత్రమాలికలను పాఠకులు చదవబోతున్నారు కనుక వాటి గుణగణాల్లోకి పూర్తిగా వెళ్లడం లేదు. మచ్చుకు సెట్టి విసిరిన చమక్కులు కొన్ని..

విష్ణువు శ్రీదేవి, భూదేవిలను గద్దపై ఎక్కించుకుని వలపు పారవశ్యంలో

‘ఆ కలుకుల్ పరాకుమెయి నచ్చట నుండక జాఱిపోదురే, మో కద యంచు వారి నడుముల్ తన చేతుల బిగ్గఁ బట్టి.. మేన్ పులకితంబగుచుండగఁ…’ వెళ్తున్నాడని వర్ణిస్తాడు సెట్టి మాస్టారు ‘శ్రీమహావిష్ణువు’ మాలికలో.

‘గంగావతరణం’ మాలికలో ఆ నది దివి నుంచి భువికి..

‘రంగత్తుంగతరంగసంఘములు తోరంబై చెలంగం గడుబొంగం బాఱుచు, జాఱుచున్, దొరలుచుం, బొర్లాడుచున్, వేనవేల్ పంగల్ పెంచుచున్, జెంగలించుచును, బైపై లేచుచుం, దేఱుకొంచుం.. భ్రమించుచున్.. నురుఁగుతోఁ జూపట్టుచున్.. హోరుమంచుం..’ దూకిందంటాడు.

దమయంతి వనవిహారంలో ఉండగా, ‘గుప్పగఁ బడ్డ దూది తెఱఁగుం గల హంసము కానిపించె’ నంటాడు ఓ మాలికలో. మరో మాలికలో.. కారడవిలో తన చీరను చించుకుని నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్లిన భర్తను తలచుకుంటున్నదమయంతితో ఇలా అనిపిస్తాడు.. ‘నీదు హక్కౌటచే, మేనఁ జీరను జించుకొంచరిగితే? మేనో, శిరస్సో తెగంగా నీ చేతను ద్రుంచిపోవునెడ, నిక్కష్టంబు లేకుండు?’

వనంలో వయ్యారంగా మేనువాల్చి దుష్యంతునికి తామరాకుపై లేఖరాస్తూ, వలపు తలపుల్లో మునిగిపోయి ‘లేఖలో బంతులు నొండు రెండయిన బాలిక వ్రాయఁగ నేర,దంతయున్ సాంతము చేసి సంతకము సల్పుటకెంతటి సేపు పట్టునో?’ అని సంశయిస్తాడు ‘శకుంతలాపత్రలేఖనం’లో.

‘బాలకృష్ణుఁడు’ మాలికలో.. వెన్నెల వెదజల్లే నవ్వుతో కళ్లను చల్లగ చేసే తన బిడ్డను చూసి యశోద, ‘నా ముల్లె, మదీయ గర్భలత పూచిన మల్లె’ అని మురిసిపోతుంది. దాపున కూర్చున్న రాధతో  ‘నోసి రాధ, మేనల్లుని సంబరంపడుచు నారయుటే యనుకొంటివేమొ? నేఁడెల్లి కొమార్త నోర్తు కని యీ వలెన్ సుమీ ’ అని మేలమాడుతుంది. అందుకు రాధ, ‘యేమిరా యల్లుఁడ!  ‘యత్త, యత్త,’ యని యందువు నత్తిగ: నిందుకోసమా?’ అంటూ చిట్టి మేనల్లుని పాదము ముడుతుంది నవ్వుతూ.

‘మృద్భక్షణము’ మాలికలో.. మన్నుతిన్న కృష్ణుడిని తల్లి మందలిస్తూ ‘చిన్నతనంబునన్ విషము చేరిచి పూతన నీదు నోటికిం, జన్నొసఁగంగఁ గ్రుక్కుకొని చప్పునఁ జప్పునఁ జప్పరించినా,వన్నియు నిట్టి పాడు రుచులబ్బినవేమిర?’ అని అంటుంది.

‘నికుంజరాధ’, ‘మాలినీ కీచకులు’, ‘ఉషానిరుద్ధులు’ వంటి మాలికలూ భావయుక్తంగా సాగుతాయి. ‘చిత్రమాలికలు’ ఒకరకంగా చిత్రాలకు అనువాదం లాంటివి. ఓపక్క రవివర్మ రంగరించిన సౌందర్యాన్ని అక్షరాల్లోకి తోడాలి. మరోపక్క మక్కికి మక్కీ చెప్పినట్లు కాకుండా, భావశబలతతో తెలుగు సొబగులు చెడకుండా చిత్రికపట్టాలి. సెట్టి ఈ పని బాగానే చేశాడు. చేయలేదని అనడానికి వేరొకరు ఆ పని చేసి ఉంటే కదా!

***

 

4

శ్రీ చిత్రమాలికలు

పీఠిక

నా యీ చిత్రమాలికల రచనకుఁ ప్రారంభము 1897 సంవత్సరమున: అప్పటికి నాకుఁ బదునెనిమిది యేఁడుల యీడు;  విశాఖపట్టణమున ఎఫ్.ఏ. తరగతిలోఁ జదువుచుంటిని. ఇటీవలఁ గవిగారని సార్థకనామము గాంచిన బ్రహ్మశ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు నా సహపాఠి. తత్పూర్వమే యాయన రవివర్మ చిత్రించిన మేనకావిశ్వామిత్రచిత్రముఁ గూర్చి యొక మాలిక రచించియుండెను. అది వినుట వలనఁ గలిగిన కుతూహలము, తరువాతి కథను దెలుపు శకుంతలాజననచిత్రముఁ గూర్చి యొక మాలిక వ్రాయ నన్ను బురికొల్పినది. రామచంద్రశాస్త్రిగారు హూణవిద్య చాలించుటయు, మఱొక యేఁడాదికి బి.ఏ. చదువు నిమిత్తము నేను చెన్నపట్టణము వెళ్లుటయు, మా చిత్రమాలికా రచనము మూలఁబడుటకు హేతువులైనవి. నాఁటికిని నేఁటికిని వారు వ్రాసిన చిత్రమాలిక యది యొక్కటియే. అది వారు కేవలము మఱచియే పోయిరి. నాకు ముఖస్థమై యుండెను. శృంగారకంఠాభరణమునకుఁ బంపితిని. అందలి కాలవలాహకాంతరేతి పద్యమదియే.

చెన్నపట్టణమునకు నేను వెళ్లిన సరికి రవివర్మ చిత్రములమీఁద జనాదరము ముమ్మరమై యుండెను: అవి యమ్మకమునకుఁ జూపని యంగడి లేదు; అలంకరింపని గృహము లేదు; యభినందింపని జనులు లేరు. ఇరువది ముప్పది చిత్రములు నేనును గొంటిని. అందలి రంభాశుక, మదాలసాఋతుధ్వజు, చిత్రములు రెండింటిని మాత్రమే వర్ణించి మాలికలు వ్రాసితిని. అప్పటికింకను జిత్రమాలికలను విశేషముగా వ్రాయవలయునన్న సంకల్పము నామనసున నంకురింప లేదనుట నిశ్చయము.

1900 సంll రము జనవరిలో నేను బి. ఏ. పరీక్షయందుఁ దేలితిని. పిమ్మట బహుకాలము గడచినది. విశాఖపట్టణమున మిస్సెస్. ఏ. వీ. ఎన్. కాలేజీలో నేనుపాధ్యాయుఁడనుగా నుంటిని. 1915వ సంవత్సర ప్రాంతమని జ్ఞాపకము: బ్రహ్మపురనివాసులును, మ. రా. రా. దేవళరాజు వేంకటసుబ్బరావుపంతులుగారు నాయొద్దఁ గల మూడు మాలికలు విని, తమ వేగుఁజుక్క కథావళియందుఁ సచిత్రముగాఁ బ్రకటించు నభిలాషమును దెలిపిరి. శకుంతలాజననమాలికలోఁ దత్పూర్వమున్న స్త్రీజనసామాన్యవర్ణనము బాలెంతరాలి వర్ణనముగా మార్చి ఇచ్చితిని; వారు ప్రకటించిరి. తూఁగక వేగుఁజుక్క కథావళి వారాఁప వలసి వచ్చినది. ఒక్క దానితో నా మాలికలు నాఁగ వలసి వచ్చినవి.

మఱికొంత కాలమునకుఁ, దత్పద్యమునే కృష్ణాపత్రికకుఁ బంపితిని. అది 1916వ సంll రము అక్టోబరు 21 వ తేదీ పత్రికలోఁ బ్రకటితమైనది. నాఁటి నుండి వారము వారము నేనొక మాలిక పంపుటయు, అది ప్రకటితమగుటయు, 1918 వ సంll రము ఏప్రిలు 13 వ తేదీ వరకు జరిగినది. అలాగున నేను బంపినవి 33 మాలికలు. నేను వ్రాసిన మాలికల వరుసను విషయసూచికయందలి కుడి ప్రక్కను గల యంకెలు తెలుపఁ గలవు. అమూల్యమైన తమ పత్రికలో నా మాలికలకుఁ దావిచ్చి, తద్రచనకుఁ బ్రోత్సాహము కలిగించిన కృష్ణాపత్రికాధిపతులకు నేను గృతజ్ఞుఁడను.

కారణాంతరమున హఠాత్తుగా నిలిచిన మాలికలు 1922 వ సంll రము తుదిని మరలఁ బ్రారంభమైనవి: ఈ మాఱు, పునరుద్ధారణము గన్న వేగుఁజుక్క కథావళియందు. అట్లు ప్రకటితమైనవి యాఱు మాత్రమే. గత సంవత్సరమున ‘అహల్య’ యను నాటకము రచించి, దానికొఱకు రెండు మాలికలు వ్రాసితిని; శృంగారకంఠాభరణము కొఱకు నికుంజరాధ, యమునాతటరాధ, యని మఱి రెండు. అక్కడకు మొత్తము నలుబదిమూడు.

మొదటి మాలికలు 22 పంక్తులును, దురువాతివి కొన్ని 23 పంక్తులును, గలవిగా వ్రాసినను ఇప్పుడన్నియు 24 పంక్తుల వానిఁగా జేసితిని. వాడిన ప్రాసము మరల వాడలేదు. త్రివర్ణచిత్రములను జూచి మొదటిలో మాలికలు వ్రాసితిని గాని, యిటీవల మాత్రము చిత్రశాలాముద్రాక్షరశాలవారు పుస్తకరూపముగా వెలువరించిన చిత్రములను జూచియే వ్రాసితిని. అస్పష్టమైన ముద్రణమగుటచేత, స్థితులతో నేనెచ్చట నైనను బొరపడి యుండ వచ్చును. మన్నింపఁ బ్రార్థన.

మనోరమ మనుచరిత్రలోని స్వరోచి భార్యగా నేను వర్ణించితిని. తత్కథ యాంధ్రకవితాపితామహుని నేర్పు కతముఁ దెలుగు దేశమున సుప్రసిద్ధము. అది మార్కండేయపురాణమందలి కథయే యైనను, రవివర్మ యది యుద్దేశించెనా యన్నది సందేహకరము.

సచిత్రముగా మాలికలను ముద్రింపుమని పలువురు మిత్రులు నాతోఁ బలుసారులు చెప్పుచు వచ్చిరి. 64 మాలికలైనను గాకుండ ముద్రించు నుద్దేశము నాకు లేకుండెను. 1932 వ సంవత్సరముఁ గల్యాణీశృంగారగ్రంథమాలాధిపతులు బ్రహ్మశ్రీ గంటిసూర్యనారాయణశాస్త్రిగారు నన్నందు విషయమై తొందరపెట్టిరి. అందుచేతఁ దొందరతొందరగా మఱి పదునొకండు పద్యములు వ్రాసి ముగించితిని. దీని యచ్చు బాధ్యతను బూనుకొని, శాస్త్రిగారు చిరకాలము గ్రంథముంచుకొని, తిరిగి పంపిరి. చిత్రములను గూర్చిన ప్రయత్నములన్నియు విఫలములయినందున సచిత్రముగాఁ బ్రకటింప లేకుంటిని.

అడిగినంతనే యంకితమొందుటకనుగ్రహబుద్ధితో నంగీకరించిన మత్ర్పభువర్యులు, శ్రీజయపురరాజ్యధుర్యులు, శ్రీశ్రీశ్రీ శ్రీవిక్రమదేవవర్మమహారాజు గారికి నేనీవిధముగానేయన్న మాట యేమి, యన్ని విధములను గృతజ్ఞుఁడను: వారు నాకన్ని విధములను వంద్యులు.

 

విశాఖపట్టణము

1-10-1935                                                                                                                                                                                                  సెట్టి లక్ష్మీనరసింహము

 

 

అంకితము.

శ్రీకరముగా సలకసృష్టిచిత్రముల వి-

చిత్రలీలఁ జిత్రించి, తచ్చిత్రసముద-

యావలోకనమునఁ బలుభావములొద-

వించి, చిత్రకారులకుఁ గవిప్రతతికి

హేతువౌ భగవంతుండు కృష్ణచంద్ర-

దేవపుత్రు, శ్రీవిక్రమదేవవర్మ-

ధారుణీకళత్రు, మహితోదారు,  జ్ఞాన-

సారు, సుగుణనిస్తంద్రు, శ్రీజయపురనృప-

చంద్రు, నాయురారోగ్య విస్తారసౌఖ్య-

యుతునిగాఁ జేసి, రక్షించుచుండు గాక!

ఆ మహారాజు మామక స్వామి యనుచుఁ,

గవివతంసంబంనుచుఁ, బండితవరుఁడనుచుఁ,

సారము గ్రహింపఁ జాలు రసజ్ఞుఁడనుచుఁ,

దప్పులొప్పులఁ జేయు నుదారుఁడనుచు,

ఆంధ్రవిశ్వవిద్యాలయంబధికవృద్ధి

నొంద వత్సరలక్షల నొసఁగిన నెఱ

దాత యనుచు, జ్ఞాని యనుచు, ధర్మమూర్తి

యంచు, నర్హుండనుచు, నే రచించినట్టి

చిత్రమాలికాకృతిని దచ్చిత్తవృత్తి

యెఱిఁగి, తదనుజ్ఞఁ బడసి, ప్రహృష్టుఁడనయి,

ప్రభువరునకు నభ్యుదయపరంపరాభి-

వృద్ధి, వంశవృద్ధియుఁ గార్యసిద్ధియుఁ నిర-

తమును గల్గింప దేవు ప్రార్థనమొనర్చి,

యంకితంబిచ్చువాఁడఁ బ్రియముతోడ.

_

 

కవి విషయము.

ప్రచురయశుండు తత్ర్పభుని ప్రాపును గాంచిన చిత్రమాలికల్

రచనమొనర్చినట్టి కవి, ప్రాజ్ఞులకెల్లను గేలుదోయి మో-

డ్చి చెలఁగు సెట్టిలక్ష్మినరసింహము: సెట్టి కులాంబురాశిలో-

ని చలువఱేఁడనన్ ధర జనించిన యప్పలసామినాయుఁడున్

సుచరిత వేంకయాంబయు మనోరథసిద్ధిగఁ గన్న పుత్రుఁ; డా-

స చెడక స్వీయమౌ బలిజె జాతి కనుంగొన, వాసి గన్న వాఁ-

డు; చదువునన్ గురుల్ తనుఁ గడుం గరుణింప బి.యే. పరీక్ష బు-

ద్ధిచతురతన్ సమున్నతిగఁ దేలి, విశాఖపురంబునందు లో-

క చరిత మిస్సె. సే.వి.యెను కాలేజిలోపలి బోధనంబు చే-

యుచు, మఱి యెల్.టి.యై, యచట నొజ్జగ నిర్వదియేఁడులుండి, శి-

ష్యచయము సెట్టి మాస్టరన సన్నుతి గన్న యతండు; ఫస్టు గ్రే-

డు చదివి, ఫస్టెయై, తగునటుల్ పది యేఁడులు న్యాయవాదిగా

నచటనె యున్నవాఁడు; తెనుఁగందొక యించుక పూర్వవాసనన్

రుచి గని, పూర్వసత్కవులు త్రొక్కిన త్రోవఁ గవిత్వఫక్కి నే-

రుచుకొని, తప్పులున్న చదురుల్ సరిదిద్దుదురంచుఁ బద్దెముల్

వచనములున్న గ్రంథములు వ్రాసి, సుధీతతి వల్ల మెప్పు నొం-

దుచుఁ గవిభూషణాఖ్యఁ గృపతో నృపుఁడీయఁగఁ గన్న వాఁడు; మం-

చి చనవు గల్గునట్టులుగ శ్రీయుతవిక్రమదేవవర్మరాట్

శచిపతి యంతరంగము నొసంగుచుఁ దద్విధకార్యదర్శిగా,

సచివునిగాఁగఁ బెట్టుకొన, స్వామి హితంబునె కోరి యున్న వాఁ;

డచలపతిత్వమున్ను హరియందు, మహేశ్వరునందు, భక్తిఁ దా-

ల్చుచుఁ దమితో నిజప్రథమసూనుని వేంకటశబ్ధమాది ని-

ల్పుచు రమణుండటంచుఁ, బెఱ పుత్రుని దా శివరావటంచుఁ బి-

ల్చుచు, నిటులిష్టదైవముల సూక్ష్మముగాఁగను గొల్చునాతఁడున్.

_

 

 

కృతజ్ఞత.

ఆదికావ్యమగు రామాణయంబు రచించి-

నట్టి వాల్మీకిం, బురాణభార-

తగ్రంథకర్త వేదవ్యాసు, నాటక-

కావ్యముల్ వ్రాసిన కవులఁ గాళి-

దాసు, శ్రీహర్షు, శూద్రకు, భవభూతిని,

నుతియించి కొల్చి, సంస్కృతమునందు

నవ్వారు రచించినట్టి పురాణేతి-

హాస కావ్యాదుల నాంధ్రభాష

విరచించినట్టి కవిత్రయంబునకుఁ బో-

తనకు, భాస్కరునకుఁ దక్కినట్టి

వారికిన్ మ్రొక్కి, గీర్వాణపురాణాదు-

లందున్న కథల రమ్యమగు భంగి

వర్ణించి, చిత్రించి, వానిని గన్నుల

యెదుటికిం గొనితెచ్చి, హృదయములను

నవరసంబులు సముద్భవమొందఁ జేసిన

చిత్రకారవరుండు, క్షత్రియుఁడయి

రాజవంశంబునం బ్రభవించియును శ్రద్ధ

కలిగి విద్యను సమగ్రముగ నేర్చు-

కొని ప్రసిద్ధుండైన ఘనుఁడు, భారతదేశ

మునఁ జిత్రకళ కలదనుచు నితర

ఖండములను వాసి కలుగఁ జేసిన మేటి,

గృహవితతి నలంకరించిన హితుఁ,-

డని కృతజ్ఞబుద్ధి నౌచు రాజారవి

వర్మకేనొనర్తు వందనములు.

_

 

శ్రీమహావిష్ణువు.

శ్రీకలశాబ్ధిపుత్రియు, ధరిత్రియు భూషితగాత్రులై పవి-

త్రాకృతులొప్పఁ బార్శ్వములయందు వసించుచు, మేను మేనులన్

సోఁక గగుర్చుచున్, సొలపుఁజూపుటళుల్ తన మోముతామరం

బైకొన నిర్నమేషలయి బాళిని జూచుచుఁ జామరంబులం

జేకొనియుం గదల్చుటకుఁ జేతులు రాని యవస్థ నుంటచే,

ఆ కలుకుల్ పరాకుమెయి నచ్చట నుండక జాఱిపోదురే-

మో కద యంచు వారి నడుముల్ తన చేతుల బిగ్గఁ బట్టి, యా

తాఁకుడుచేత మేన్ పులకితంబగుచుండఁగ, నేత్రముల్ సుఖో-

ద్రేకముఁ దెల్పుచుండ, నునుతేటనిగారపు నవ్వు మోవిపైఁ

బ్రాఁకుచునుండ, మూర్ధమున రత్నకిరీటమునున్ ధరించి, లే-

దో కలదో యనం దిలకమూర్ధ్వముగా నొసటన్ ఘటించి, వ్రేఁ-

గై కదలాడు కుండలములందపు వీనులఁ బూని, సుప్రభా-

శ్రీకరవైన కౌస్తుభము సిస్తు దలిర్ప నుంబు మీఁద శో-

భాకమనీయహారముల ప్రాపునఁ దాలిచి, వైజయంతిఁ దా-

నా కెలనన్ గదించి, యదిరా! మది రాగమటన్నదెన్నఁడున్

లేక చరించు యోగులఁ జలింపఁగఁ జేసెడి మోహనాకృతిం

గైకొని, -గోళ్లతోడ గజకచ్ఛపభారము మోసినట్టి య-

స్తోకబలాఢ్యుఁడౌ గరుడు తోరపు వీఁపునఁ గూరుచుండి, తన్

నాకనివాసులెల్లరు ననాకులభక్తి మెయిన్ భజింపఁగా,

ఆకసముందు మెల్లగ విహారమొనర్చుచు, మింటినుండి భూ-

లోకము వారి మీఁద నెదలోఁ గల దివ్యదయామృతంబు నా-

లోకనజాలమార్గమున లోపము చేయక క్రుమ్మరించు ప్రే-

మైకవరస్వభావుని, ధృతాఖిలజీవుని, విష్ణుదేవునిన్,

నా కరముల్ మొగిడ్చి వృజినంబులు పో భజనంబొనర్చెదన్.

_

 

 

శ్రీమహాలక్ష్మి.

తామరసంబుఁ దా మృదుపదంబుల మెట్టుట, కిట్టకుంటనో?

ధామమటంచునో? పువుల దండను దాలిచినట్టి తొండమున్

సామజమెత్తు, టర్చననొనర్చుటొ? మరాళతతుల్ తన పజ్జ నుంట, య-

త్తామరసోద్భవుం గనిన తల్లి యటంచునొ? యానవైఖరిం

దాము సమభ్యసించెడి విధంబొ? యన గల యట్టి సంశయ-

స్తోమము నంతరంగములఁ జూపఱకుం గలిగించుచున్, సర-

స్సీమ సరోజమధ్యమునఁ జేతులఁ దమ్ములఁ బూని, హస్తికిన్

సామమెలర్పఁగా నభయసంజ్ఞను జేతను జేసి, యంచలం

బ్రేమను జేతితోఁ బలుకరించి, కరంబులు నాలుగున్ శ్రిత-

క్షేమనిమిత్తమే యనుచుఁ జెప్పక చెప్పెడి యీమె లక్ష్మియే!

సోముని చెల్లెలీమె యనుచుం బలుకం దగినట్టి మోముతోఁ,

గాముని కన్నతల్లి యనఁగాఁ దగు మిక్కుటమైన గోముతో,

శ్రీమహిళామతల్లి యని చెప్పెడి మైసిరితోడ, ముద్దు నె-

మ్మోమొక యద్దమై యచటఁ బూసిన పాదరసంబుఁ బోలె ని-

ద్దామెఱుఁగున్ ఘటించెడి మితమ్మయినట్టి స్మితమ్ముతోడఁ, బ్రే-

మామృతముబ్బి వెల్లువగునట్లు వెలార్చెడి కన్నుదోయితో,

లేమల లోన నీమె యెన లేని విలాసిని యయ్యెఁ; గాననే

యా మరునయ్య తా మరులు నందుచుఁ; బాల్కడలిన్ జనించు రం-

భాముఖులైన  యచ్చరలపై మనసుంచక, యొక్క యీమెకే

కాముకుఁడయ్యె: లోకపితకామిని కావున, లోకమాతయై

యీమె తనర్చె; శ్రీ గనుక, నిచ్చు సిరుల్ శరణన్న వారికిం;

గామితకల్పవల్లియు, జగంబుల తల్లియుఁ, గాన వేమఱున్

నా మనమందుఁ గొల్తుఁ గరుణారసమందిర యైన యిందిరన్.

_

 

పరిచయం అక్కర్లేని వర్ణసంరంభం

 పి.మోహన్

రాజారవివర్మ.. పరిచయం అక్కర్లేని వర్ణసంరంభం. రాజులకు, జమీందార్లకే పరిమితమైన తన వర్ణచిత్రాలను లితోగ్రాఫులతో జనసామాన్యానికి చేరువ చేసిన అతనంటే మన తెలుగువాళ్లకు విపరీతమైన అభిమానం. అందుకు నూటాపదేళ్ల కిందట వచ్చిన ఈ వ్యాసం ఉదాహరణ. బాలాంత్రఫు నీలాచలం రాసిన ఈ వ్యాసం 1906 అక్టోబర్లో.. అంటే రవివర్మ చనిపోయిన మాసంలోనే ‘సువర్ణలేఖ’ పత్రికలో వచ్చింది. 1910-40లమధ్య తెలుగువాళ్లకు బాగా తెలిసి, ఇప్పుడు తెలియకుండా పోయిన మరో  తెలుగు కవికి కూడా రవివర్మ అంటే విపరీతమైన అభిమానం. రవివర్మ వేసిన ఒక్కో చిత్రంపై పాతికలైన్ల పద్యాలు రాసి, వాటిని పుస్తకంగా అచ్చేసేంత ప్రేమ.  సారంగ పాఠకుల కోసం ఆ పద్యాలను రవివర్మ చిత్రాలతో జతచేసి వచ్చేవారం నుంచి అందిస్తున్నాం.. ఇక నీలాచలం వ్యాసంలోకి వెళ్లండి

         

రాజారవివర్మ

ప్రసిద్ధికెక్కిన చిత్రలేఖరియగు రవివర్మ తిరువాన్కూరు రాజవంశముతో సమీపబంధుత్వము కలిగియున్న క్షత్రియవంశములోనివాడు. తిరివెందరమున కుత్తరముగా నిరువదినాలుగు మైళ్లదూరములోనున్న కలిమనూరు గ్రామమందు 1848 సంవత్సరము, ఏప్రియలు నెల ది 29 తేదీ నాతఁడు జననమందెను. ఒకప్పుడు తిరువాన్కూరు ప్రభువులను శత్రువులనుంచి కాపాడినందుకుగాను రవివర్మయొక్క పూర్వులకీ కలిమనగరము జాగీరుగా నీయఁబడెను. రాజారవివర్మయొక్క తల్లి ‘‘ఉమాంబాయి’’. ఈమె పండితురాలు. సృష్టియందలి వైచిత్రములను బరికించి యానందించు కుశాగ్రబుద్ధికలది. తన గానవిద్యాకౌశలమునకునఁదోడు సహజమాధుర్యమగు కంఠస్వరముకలది. ఈమె ‘‘పార్వతీపరిణయమ’’ను గ్రంథమును తన దేశభాషలో రచియించి కవిత్వమందసమానురాలని యాదేశజనులచేఁ గొనియాడఁబడెను. ఇట్టి విదుషీమణి గర్భమును ఫలింపఁజేసిన రవివర్మ సామాన్యుఁడగునా? ఈతనికిఁ  జిన్నతనమున రాజవంశములోని పద్ధతిప్రకార మింటియొద్దనేయొక సంస్కృతపండితుని గురువుగా నియమించి చదువు నేర్పించుచుండిరి. రవివర్మ తన పాఠములను వల్లించుటకు వినియోగించుకాలముకంటె నెక్కుడు కాలము గోడలమీఁదను, దలుపులమీఁదను, మసిబొగ్గుతోనూ, సీమసుద్దతోనూ బొమ్మలువేయుటయందు వినియోగించెడువాడు.

  రాజారవివర్మ

రాజారవివర్మ

స్వభావముగా జనియించు నాచిన్నతనపుచేష్టలను గూర్చి యప్పుడప్పుడు పెద్దవారిచేనతఁడు మందలింపఁబడుచుండెను. కాని యతని మేనమామయును, మాతయును, నీబాలుని బుద్ధిసూక్ష్మతనుబట్టి, భవిష్యచ్ఛిత్రకారచిహ్నము లీతనియందుఁగనిపెట్టి, బొమ్మలువేయుటలో నుత్సాహపఱచుచుండిరి. రవివర్మ మేనమామ రాజా రాజవర్మ. అతఁడు చిత్రలేఖనమందు మంచి సమర్థుడు. ఆ కాలమున బొమ్మలు వ్రాయుపని గొప్పకుటుంబమువారిచే నిరసనగాఁజూడఁబడుచుండుటచే, ఆయన విలాసార్థమే చిత్తరువులను వ్రాయుచుండెడివాఁడు. చిత్రలేఖనముయొక్క ప్రధాననోద్దేశము గ్రహించక దేవతావిగ్రహలు వ్రాయుటయందే తమకాలము వెచ్చపెట్టెడు సామాన్య చిత్రలేఖరులవలెఁగాక, రాజవర్మ స్వభావమును జక్కగాఁగ్రహించి యట్టియందములొప్పునట్లుగాఁ జిత్రపటములను వ్రాయుచుండెను. ఆయనచే వ్రాయఁబడిన చిత్తరువులు జీవకళయుట్టిపడునట్లగపడుచుండెను. మేనల్లుడగు రవివర్మయెడల నాయనకుఁ బ్రేమమెండు. రవివర్మ యెప్పుడును తన మేనమామ చిత్తరవు వ్రాయుచుండ విరామములేకుండఁ జూచుచుండెడివాడు. ఒకనాఁడతని మేనమామ యొక చిత్తరువును సగము వ్రాసి యెచ్చటికో యేగెను. అతఁడింటలేనితఱిఁజూచి రవివర్మ యాచిత్తరవుపై నొకపక్షిని వ్రాసి యెప్పటియట్లయుంచెను. దానినాతఁడు మరల వచ్చిచూచి యానేరస్థునిబట్టుకొనఁ బ్రయత్నింపఁగా రవివర్మయొక్క దొంగతనము బయలుపడెను. ఏమిచేసిపోవునోయని భయపడుచున్న యాచిన్నవానికిఁ దాననుకొనినయట్లు తనమేనమామచేఁ జీవాట్లకు మారుగఁ జక్కని బహుమానమొకటి లభించెను. ఆనాటినుండి యాతఁడు మేనమామకుఁ బ్రియశిష్యుఁడై యాతనియొద్ద చిత్తరవుపని నేర్చుకొనుచుండెను.

రవివర్మ చిత్తరవులు వ్రాయుటయందును నీటితోఁ గలిపిన  రంగులు వేయుటయందును శీఘ్రకాలములోనె విశేషాభివృద్ధినిగాంచెను. రాజవర్మ మేనల్లుని దిరువనంతపురము తీసుకొనివెళ్లి మహారాజునకుఁగనపఱచి యాతనిచే వ్రాయఁబడిన చిత్తరవులను గూడఁ జూపెను. అప్పటికి రవివర్మకుఁ బదునాలుగు సంవత్సరముల ప్రాయము. మహారాజును నింతటి చిఱుతప్రాయమునఁ జిత్రలేఖనముందు విశేషబుద్ధిచాతుర్యమును గనపఱచిన రవివర్మనుజూచి పరమానందభరితుఁడై వాని తెలివితేటలభివృద్ధినొందుటకనేక విధములఁబ్రోత్సాహము గావించెను. రవివర్మ పదునేఁడేఁడులవాడఁగునప్పటికి తిరువాన్కూరు రాణీగారి సోదరీమణిని 1866 సంవత్సరనఁ బరిణయముగావించిరి.

తిరువాన్కూరు రాజకుటుంబములో మనకు వింతగానగపడు నాచారాములు కొన్నిగలవు.  అవి చదువరుల మనంబులనాకర్షింపకపోవను నభిప్రాయమున నిక్కడఁ గొంతవఱకు వ్రాయుచున్నాఁడను. ఆ రాజ్యమునకు స్త్రీలే వారసులు. వారికి సంతతి లేనిచో స్త్రీలనేపెంచుకొందురు. ఆయాచారముచొప్పునఁ దిరువాన్కూరు రాజకుటుంబముచేఁ బ్రకృతమునఁ బెంచుకొనఁబడుచుండిన చిన్నరాణులు రవివర్మ కూఁతురు బిడ్డలు.

రెండు సంవత్సరములకుఁ దరువాత జరిగిన, రవివర్మ యొక్క భావికాలపుసుప్రసిద్ధికి హేతుభూతంబగు నొక విషయమును గూర్చి ముచ్చటించవలసియున్నది. 1868 సంవత్సరమున చిత్రలేఖనమునందు విశేషబుద్ధిచాతుర్యమును సామర్థ్యమునుగల ‘‘త్యోడరుజాన్ సన్’’ అను నాంగ్లేయుఁడు తిరువాన్కూరు సంస్థానమునకు విచ్చేసి మహారాజుయొక్కయుఁ దక్కినవారియొక్కయుఁ జిత్తరవులను నూనెతోఁ గలిపిన రంగులతో నేర్పరితనము మెఱయ వ్రాసెను. మహారాజుగారి యనుజ్ఞచొప్పున నాయాంగ్లేయచిత్రలేఖరి రవివర్మను దగ్గరనుంచుకొనియే పటములనుజిత్రించెను. నూనెరంగులతోఁ బటములను వ్రాయుట కదివఱకలవాటులేని రవివర్మ యాయాంగ్లేయలేఖరియొక్క పనితనమున కాశ్చర్యమునొంది తానను రంగులు వేయవలసివచ్చినప్పుడు నూనెతోఁగలిపిన రంగులే వాడుకచేయుటకు నిశ్చయించుకొనెను. కాని వానినుపయోగించువిధమును రవివర్మ తెలిసికొనుటకు పూర్వమె ‘‘జాన్ సన్’’ తిరువాన్కూరునుండి వెళ్లుట తటస్థించినది.

నూనెరంగులెట్లుపయోగించ వలయునో నేర్చుకొనని మన రవివర్మ కొద్దికాలములోనే తన బుద్ధిసూక్ష్మతచేతను బ్రయత్నములచేతను నట్టిరంగులు వేయుటయందుఁగూడ విజయమునుబొందెను. అతఁడిటీవల వ్రాసిన తిరువాన్కూరు మహారాజుయొక్క రాణీయొక్కయుఁ జిత్తరవులు నానాటికభివృద్ధిఁజెందుచున్నయాతని యోచనాశక్తిని బుద్ధికౌశలమును వెల్లడించకమానవు. చూపఱుల మనంబులు వ్యామోహజలధి మునుంగునట్లుగ నసమానసౌందర్యవిలాసతంగ్రాలు నాయరు స్త్రీలపటములీ రవివర్మచేఁ జిత్రింబఁడెను. మొదటినుండియునితఁడు స్త్రీవిగ్రహములు వ్రాయుటలోఁ దన నేర్పరితనమును వెల్లడించుచుండెను.

1873 సంవత్సరము చెన్నపురిలో జరుపఁబడిన శిల్పశాస్త్రవస్తుప్రదర్శనము(Fine Arts Exhibition)లో మల్లెపూవులదఁడను సిగయందలంకరించుకొనిన యొక యువతీమణిరూపమును వ్రాసిన పటమువలన రవివర్మ యొక బంగారుపతకమును గవర్నరుగారిచే బహుమానముగాబడసెను. ఆ పటమునందని చిత్రమును గూర్చి మిగుల సంతసించి గవర్నరుగారు రవివర్మను మిగులనభినందించిరి. అమఱుచటి సంవత్సరము తిరుగఁ చెన్నపురిలో జరుపఁబడిన ప్రదర్శనములో నొక ద్రావిడస్త్రీపటమును వ్రాసి మఱియొక బంగారుపతకమునుబడసెను. 1875 సంవత్సరమున మన యెడ్వర్డు చక్రవర్తిగారు హిందూదేశమును సందర్శించుటకు వచ్చినప్పుడు తిరువాన్కూరు మహారాజుగారాయనకీ ద్రావిడస్త్రీపటమును మఱికొన్ని పటములతోఁగానుకనొసంగిరి. పశ్చిమదేశచిత్రకారులయొద్ద నభ్యసింపకయె మిగుల ప్రావీణ్యముతో వ్రాసిన రవివర్మ నేర్పరితనమునుగాంచి చక్రవర్తిగారద్భుత ప్రమోదములనొందిరి.

3nayaru pilla pushpalankarana

నాయరుపిల్ల పుష్పాలంకరణ

 

1876 సంవత్సరము మూడవసారి చెన్నపురిలో జరుపఁబడిన ప్రదర్శనములో ‘‘శకుంతలపత్రలేఖనము’’ అను పటమునకు రవివర్మయప్పటి గవర్నరుగారగు ‘‘బకింగుహామ్’’  ప్రభువుగారివలన నొకబంగారుపతకమునుబడసెను. స్వభావానుగుణముగ జీవకళయుట్టిపడ వ్రాసిన యాచిత్తరవునుదిలకించి గవర్నరుగారానందాబుంధిమగ్నులయి వెంటనే యాపటమును క్రయమునకుఁదీసికొనిరి.  తరువాత రెండు సంవత్సరములకు ‘‘బకింగుహామ్’’  ప్రభువు జ్ఞాపకార్థమై యాయనవిగ్రహమును దొరతనమువారి మందిరమననుంచుటకు మహాజనులచే నిశ్చయింబడెను. ఆప్రకారమాప్రభువువారి రూపమును రవివర్మచే వ్రాయఁబడియెను. తరువాత ‘‘బకింగుహామ్’’  ప్రభువువారు రూపవతులైన తనయిరువురి కుమార్తెల రూపములను రవివర్మచే వ్రాయించుకొనెను.

మదరాసునుండి రవివర్మ తిరువాన్కూరు చేరుసరికాయన కిదివఱకుఁ జేయూతగానుండి తగిన ప్రోత్సాహమును కలిగించుచుండిన తిరువాన్కూరు మహారాజు పరలోకగతుఁడగుట తటస్థించెను. తరువాత వచ్చిన మహారాజును నీతనియెడ మిక్కిలి ప్రియమునే కనపఱచుచుండెను. ఈ మహారాజు మిక్కిలి విద్యావంతుఁడు. శిల్పము, చిత్రలేఖనము, మొదలగు విద్యలందిష్టము కలవాఁడు. ఈ మహారాజు ప్రోత్సాహము చేతనే రవివర్మ ‘‘సీత అఘోరప్రమాణము’’ అను చిత్రపటమును లిఖియించెను. ఈ చిత్తరవు వ్రాయుట బహుదుర్లభము. ‘‘సీతయొక్క పాతివ్రత్యమును గూర్చి రాముఁడనుమానించినపుడు సీత వేడుకొనఁగా భూదేవి యామెనుతనలోనికిఁ దీసికొనుపోవుట’’ అను విషయమును జిత్తరవునందు కనపఱచుటకెట్టి బుద్ధిసూక్ష్మతయు నేర్పరితనముండవలయునో చదువరులే యూహించుకొందురుగాక. ఈ చిత్తరవును బరోడా రాజ్యమునకప్పటికి దివానుగారగు సర్. టి. మాధవరావుగారు తమ యజమానియగు మహారాజుగారి కొఱకు వెలయిచ్చిపుచ్చుకొనిరి.

ఆమహారాజీపటమునుజూచి యానందించి రవివర్మను తనయాస్థానమునకుఁ బిలిపించుకొని తమ కుటుంబమును వ్రాయించుకొనెను. ఆసంవత్సరమే పూనానగరమున జరుపఁబడిన ప్రదర్శనములో నాయరు కన్యకరూపమును వ్రాయఁబడిన పటమువలన రవివర్మ బరోడా మహారాజుగారిచే బంగారుపతకమును బహుమానముగాఁ బడసెను. ఆపటమును సర్. టి. మాధవరావుగారు వెలయిచ్చికొనిరి. అప్పటి బొంబాయి గవర్నరుగారగు ‘‘ఫెర్గూసన్’’ దొరవారాపటముయొక్క ప్రతిమను దమనిమిత్తమై తిరుగవ్రాయించుకొనిరి. ఈప్రకారమాప్రతిమకనేక ప్రతిమలు తీయఁబడి విక్రయింపఁబడెను. ఈచిత్తరవు రవివర్మచే వ్రాయఁబడిన యందమగు చిత్తరవులలోనొకటి.

రవివర్మ బరోడా సంస్థానమునఁ దానుండిన నాలుగు మాసములలో మహారాజుయొక్కయు, రాణీయొక్కయు, సర్. టి. మాధవరావుగారియొక్కయు, రెసిడెంటుగారియొక్కయు చిత్తరవులను వ్రాసెను. అక్కడినుండి భువనగిరి వెళ్లి యారాజుగారి కోరిక ప్రకారము వారికొరకనేక చిత్రములను వ్రాసెను. 1885 సంవత్సరము రాజధానికళాశాల ప్రధానోపాధ్యాయుఁ(Principal)డగు ‘‘ధామ్ సన్’’ దొరవారియొక్కయు వెనుకటి మైసూరు మహారాజుగారి కార్యదర్శులగు ‘‘పోర్టరు’’ దొరివారియొక్కయు చిత్రములను వ్రాసెను. ‘‘పోర్టరు’’ దొరివారి కాలమున మైసూరు మహారాజుగారి స్నేహమునుగాంచి మైసూరు నగరమునకువెళ్లి యచ్చట మహారాజుగారి నిమిత్తము రవివర్మయనేక చిత్రములను వ్రాసెను.

4sakuntala patralekhanam

శకుంతల పత్రలేఖనం

 

‘‘గ్రాంటుడఫ్’’ దొరవారు పుదుక్కోట సంస్థానమును సందర్శించు సమయమున రవివర్మ యచ్చటికేగి దర్బారుపటమును చిత్రించెను. తరువాత నాతడిఁలు చేరినపిమ్మట నాతనిమాతయగు ‘‘నుమాంబాబాయి’’ స్వర్గస్థురాలై యాతనికిఁ దీరనిదుఃఖమును గలుగఁజేసెను. 1888 సంవత్సరమీచిత్రకారుఁడు తన తమ్ముఁడైన రాజా రాజవర్మతోఁ గలసి యుదకమండలమునకేగినప్పుడు బరోడా మహారాజువారు తాము నూతనముగాఁ గట్టించిన రాజమందిరముకొఱకు జనసామాన్యముచేఁగొనియాడఁబడు పురాణకథపట్లను చిత్రపటములుగ వ్రాసి యూయవలసినదని జాబు వ్రాసెను. ఆ యుత్తరమునుగ్రహించి ఆయాకథలు జరిగిన స్థలములకేగి యందలివిశేషములను దెలిసికొనుచు స్థలములయాకారములను గుఱ్తించుకొనుచు నుత్తరయిండియాయంతయునుఁ దమ్ముడితో రవివర్మ తిరిగెను.

సోదరులిరువును నింటికిఁజేరిన పిమ్మట రెండు సంవత్సరములకాపనినంతనుఁ బూర్తిచేసికొని పదునాలుగుపటములను వ్రాసి బరోడాకేగి మహారాజునకు వానినర్పించిరి. బొంబాయి రాజధాని నలువంకల నుంచి బరోడా మహారాజుగారి నూతనమందిరమునలంకరించిన చిత్రపటములను గన్నులారఁగాంచి యానందించుటకు వేలకొలది పురుషులును స్త్రీలును బిడ్డలును విచ్చేసి పట్టణమెల్లెడ సందడిగావించిరి. ఆపటములనుండి తీయఁబడిన ఫొటోగ్రాఫులు వేలకొలది విక్రయింపఁబడెను. అందువలన నాసేతుహిమాచలము పర్యంతము రవివర్మయొక్క కీర్తి ప్రకాశించెను.

రవివర్మ తాను వ్రాసిన చిత్రపటములనుండి ప్రతులనుదీయుటకుగాను రాతియచ్చుసంబంధమైన యొక ముద్రాయంత్రశాలను బొంబాయియందు స్థాపించెను. దీని సహాయముచే మనదేశమునందలి పూర్వపు చిత్రలేఖనము పునర్జీవమువడసెను. కొంచెము విద్యనేర్చిన ప్రతివారి గృహమందును రవివర్మచే వ్రాయఁబడిన చిత్తరవులు కనఁబడుచుండెను. ఉత్తరదక్షణ హిందూస్థానములలోని మహాపురుషుల యిండ్లు రవివర్మయొక్క అసలు పటములచేతనేయలంకరింపఁబడియుండెను. ఆచిత్రలేఖరిచే వ్రాయఁబడిన చిత్రములచే హిందూదేశమంతయు  నలంకరింపఁబడియుండెను. తుదకు వీథులలోని జనులుకూడ రవివర్మయొక్క చిత్తరవులనుగాంచి యానందించు భాగ్యమునుపొందుచుండిరి. 1904 సంవత్సరమున హిందూదేశపు శిల్పిచిత్రలేఖనము మొదలగు మహాశాస్త్రములయందు రవివర్మకనపఱచిన బుద్ధిసూక్ష్మమునకు మొచ్చుకొనుచు నొక బంగారుపతక మాయనకొసంగఁబడెను.

6ravivarma rangullo atani kooturu mahaprapha

రవివర్మ రంగుల్లో అతని కూతురు మహాప్రభ

 

రవివర్మ మనహిందూదేశమునందు బహూకరింపఁబడుటయేగాక, వియానా, లండను, చికాగో మొదలగు నితరదేశముఖ్యపట్టణములలో జరుపఁబడిన ప్రదర్శనములందుఁగూడ మేలుచేయియై బంగారుపతకములను సన్నదులనుబడసెను. వంశపారంపర్య వచ్చెడి పిత్రార్జితమగు నీజ్ఞానధనమును రవివర్మతోఁబాటు, సోదరుడు, రాజారాజవర్మయు, సోదరి మంగళాబాయియు, సమానముగాఁబంచుకొనిరి. రాజవర్మ ఎలయరాజాగారితోఁగూడ నాంగ్లేయభాష నేర్చుకొనెను.

ఆతఁడు విద్యాభ్యాసము చాలించినపిమ్మట చిత్తరవులు వ్రాయుచు నాయాపట్టణములలోఁ బ్రదర్శింపఁబడిన ప్రదర్శనములకుఁ దనచిత్తరవులనుగూడఁ బంపుచు బహుమతులువడసెను. రవివర్మయు సోదరునితోఁగూడ నాంగ్లేయచిత్రలేఖరి యబ్రూగ్సదొరవారు ఇండియాకు వచ్చినపుడు వారి సాంగత్యము చేసి కొన్ని నూతన సంగతులను గ్రహించెను.

రవివర్మ అమ్మ ఉమా అంబాబాయి

రవివర్మ అమ్మ ఉమా అంబాబాయి

ప్రదర్శనమునకుఁ బంపవలసివచ్చినపుడుదక్కఁ దక్కిన కాలములయందు సోదరులిరువురు కలసియే చిత్తరువులను వ్రాయుచు వచ్చరి. అట్టి భ్రాతృవాత్సల్యమునుగలిగియున్న రవివర్మను దుఃఖసముద్రమునముంచి రాజవర్మ నిరుటి సంవత్సరమునఁ గాలధర్మమునొందెను. అతఁడింకను గొంతకాలముజీవించియుండినచోఁ బ్రపంచములో స్వభావమువ్రాయు చిత్రకారులలో మేటియనిపించుకొనియుండును. రవివర్మయొక్క సోదరియగు మంగళాబాయి విశేషగానవిద్యాసంపన్నురాలు. ఆమెయుజిత్రలేఖనమందు మిక్కిలి నేర్పరురాలు. రవివర్మ మిగులదయాంతఃకరణముగలవాడు. ఔదార్యసౌశీల్యాదిసద్గుణసంపన్నుడు.

ఓ చదువరులారా!

ఇంతవఱకు మీయుల్లమును బల్లవింపఁజేయు సచ్చారిత్రమునుడివితిని. సోదరవాత్సల్యముచే నామహానుభావుని చరిత్రమును వినుచు నానందవార్ధినోలలాడు మిమ్ములను పిడుగులతోనిండిన తుపానువంటిదుఃఖవార్తచే నొక్కసారి దుఃఖసముద్రనముంచి వేయుచున్నందులకు నన్నుమన్నింపఁబ్రార్థిలు. ఏమహామహుఁడుత్తమవంశసంజాతుండై చిఱుతప్రాయముననే తనబుద్ధికౌశలమునుజూపి తల్లిదండ్రులకు సంతోషదాయకుఁడయ్యెనో, ఏమహానుభావుఁడు చిఱుతప్రాయముననే తనమేనమామయొక్క యసంపూర్తి చిత్తరవును బూర్తిచేసి యాయనచేబహుమానమువడసెనో, ఏధీవిశాలుండు పిన్నవయసుననే చిత్తరవులచే రాజాధిరాజులమెప్పువడసెనో, ఏచిత్రకారోత్తముఁడు, ఆసేతుహిమాచలపర్యంతమునుగల గృహములను తన పటములచేనలంకరించి దిగంతవిశ్రాంతకీర్తిమంతుండయ్యెనో ఏమహాత్ముఁడు నిర్జీవములైపడియున్న హిందూదేశశిల్పాదిశాస్త్రకాంతలకు జీవాధారుఁడై ప్రకాశించెనో ఏవిద్యానిధి సమస్తదేశవస్తుప్రదర్శన సభలో మేలుచేయివడసి బంగారుపతకములను బహుమానముగానందెనో అట్టి ‘‘రాజారవివర్మ’’ 2 అక్టోబరు 1906న కీర్తిశేషుఁడయ్యెనని చెప్పుటకునోరాడకున్నది. ఆహా ! ! వ్రాయుటకుఁగలమాడకున్నది.

-బాలాంత్రపు నీలాచలము

 

 

మన ‘చిలాన్ బందీ’కి 120 ఏళ్లు

1 chilan by Delacroix1834కొన్ని పరిచయాలు చాలా చిత్రంగా మొదలవుతాయి. అవసరగత ప్రాణులం కనుక స్పష్టంగా నాకిది కావాలి అనుకుని వెతుకుతూ ఉంటాం. కావాలనుకున్నది అంత సులభంగా దొరకదు. కానీ మనం కోరుకునేదానికి దగ్గరగా ఉండే మరొకటి తారసపడుతుంది. అది మనకు కావలసినది కాదు కదా అని ముందుకు సాగిపోతాం. కానీ అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. మనం కోరుకునే దానికి దగ్గరున్నవి మన అవసరాలు కొంతైనా తీరుస్తాయి కదా.

తెలుగు ‘చిలాన్ బందీ’ని పరిచయం చేయడానికి ఈ ఉపోద్ఘాతం అక్కర్లేదు కానీ అతడు నాకు తారసపడిన వైనాన్ని చెప్పుకోవాలన్న ఉత్సాహాన్ని ఉగ్గబట్టుకోలేకే ఇదంతా.

మాటలకు అపారమైన స్వేచ్ఛాసౌందర్యాలను అద్ది రంగురంగుల పక్షుల్లా ఎగరేసిన ప్రఖ్యాత ఆంగ్ల రొమాంటిసిస్ట్ కవి లార్డ్ బైరన్ 1816లో ‘The Prisoner of Chillon’ ఖండకావ్యం రాశాడు. 392 లైన్ల ఈ పద్యంలో విశ్వజనీనమైన స్వేచ్ఛాభిలాషను ఎలుగెత్తి గానం చేశాడు. ఎగిరే రెక్కలను గొలుసులతో విరిచికట్టి, చీకటి గుయ్యారాల్లో పడదోసి, అడుగు కదపనీయని దుర్మార్గపు ఖైదును శఠించాడు. రాత్రీపవళ్ల, వసంతగ్రీష్మాల తేడా లేకుండా రోజూ ఒకేలా వెళ్లమారిపోయే దిక్కుమాలిన రోజుల లెక్క తెలియని ఆ నిర్బంధంలో చితికిన ఓ స్వేచ్ఛాపిపాసి అంతరంగాన్ని గుండె కరిగి కన్నీరయ్యేలా, కన్నీరైన గుండె.. ఆ బాధాతప్తుడి హృదయ ఘోషను తట్టుకోలేక మళ్లీ గడ్డకట్టిపోయేలా ఆవిష్కరించాడు. ఆ సంవేదన సర్వమానవాళి ఘోష కనుక ఖండాలు, సముద్రాలు దాటింది. నిర్బంధంలో కొట్టుమిట్టాడుతున్న మరో నేలపైన ప్రతిధ్వనించింది. బైరన్(1788-1824) జీవించిన శతాబ్దిలోనే 1894లో తెలుగులో ప్రతిధ్వనించిన ఈ భువన ఘోషే ‘చిలాన్ బందీ’. దానికి ఈస్ట్ ఆఫ్ ది ఇటాలియన్ గొంతుకను వ్రిచ్చిమోసినవాడు శ్రిష్టు జగన్నాథశాస్త్రి.

జగన్నాథం అనుసృజించిన చిలాన్ బందీని తెలుసుకోవడానికి ముందు బైరన్ కావ్యం గురించి కొంత. బైరన్ 1816లో తన మిత్రుడైన కవనపు హల్లీసకాల షెల్లీతో కలసి స్విట్జర్లాండ్ లోని జెనీవా సరస్సులో విహరించాడు. ఆ కొలనులోకి చొచ్చుకెళ్లిన మధ్యయుగాల చిలాన్ కోటను చూశాడు. అక్కడి కారాగారంలోకి అడుగుపెట్టాడు. అది పదహారో శతాబ్ది ప్రొటెస్టెంట్ క్రైస్తవ ఉద్యమకారుడు ఫ్రాంకోయిస్ బోనివార్డ్(1493-1570)ను ఆరేళ్లపాటు ఖైదుచేసిన చెరసాల. సవాయ్ పాలకుడు మూడో చార్లెస్ పాలనకు వ్యతిరేకంగా జెనీవావాసులను తిరగబడమన్నందుకు బోనివార్డ్ ను జైల్లో వేశారు. విడుదలైన తర్వాత కూడా అతడు చార్లెస్ కు వ్యతిరేకంగా పోరాడాడు. బైరన్ ఆ చారిత్రక వ్యక్తి వివరాల్లోకి పూర్తిగా వెళ్లకుండా అతని దుర్భర ఖైదును మాత్రమే తన కావ్యానికి ముడిసరుకుగా తీసుకున్నాడు. అందుకే తనది ‘ఫేబుల్’ అని అన్నాడు.

బైరన్ కవిత అంతా ఆ ఖైదీ స్వగతమే. అతని యవ్వనమంతా బందిఖానాలో ఆవిరైంది. అతని తండ్రిని అతని మతవిశ్వాసాలు నచ్చని పాలకులు(జగన్నాథం అనువాదంలో ‘క్రొత్తసిద్ధాంతములకతికోపఘూర్ణమానమానసులైన దుర్మార్గజనులు) సజీవదహనం చేశారు. అతని రక్తమేకాకుండా ఆశయాలనూ పంచుకున్నఆరుగురు కొడుకులపైనా కత్తిగట్టారు. వాళ్లలో ముగ్గురు ఆ జైలు బయట ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని బతికుండగానే తగలబెట్టారు. ఇద్దరిని యుద్ధంలో చంపేశారు. మిగిలిన ముగ్గురిని చిలాన్ దుర్గంలోని చీకటికొట్టులో పడేసి, విడివిడిగా మూడు పెద్దస్తంభాలకు గొలుసులతో కట్టేశారు, ఒకరికొకరు దూరంగా ఉండేలా. కథ చెబుతున్న ఖైదీ ఆ ముగ్గురిలో పెద్దవాడు. పెద్దవాడు కనుక తమ్ముళ్లకు అభయమివ్వాలి, ఓదార్చాలి. పెద్దతమ్ముడికి స్వేచ్ఛే ప్రాణం. కొండల్లో జింకలను, తోడేళ్లను వేటాడిన ఆ యువకుడికి ఈ బందీ బతుకంటే అసహ్యం పుట్టింది. అన్నపానీయాలు నిరాకరించి ఆయువు తీసుకున్నాడు. అందరికీ ప్రాణమైన ముద్దుల చిన్నతమ్ముడు మనోవ్యథతో కృశించి ‘ఎండు సస్యమై’ ప్రాణం విడిచాడు. ఇక మిగిలింది కథకుడు. అతని ఆశలు ఉడిగాయి. ప్రాణావశిష్టుడైపోయాడు. అయితే ఓ రోజు కిటీకీ చెంత కనిపించిన అద్భుతమైన పక్షి పాడిన పాట విని ప్రాణాలు తేరుకున్నాయి. బతుకుపై ఆశపుట్టింది. తర్వాత ఎన్నేళ్లకో అతన్ని జాలి తలచి విడుదల చేశారు. కానీ ఏళ్ల తరబడి ఖైదు తర్వాత, నా అన్నవాళ్లందరూ గతించిపోయాక, హఠాత్తుగా దక్కిన స్వేచ్ఛను ఏం చేసుకోవాలో అతనికి తెలియకపోయింది. సంకెళ్లే నేస్తాలైపోయిన ఆ దుఃఖితాత్ముని మోముపై ఒక నిట్టూర్పు వెలువడింది.

మనసును మెలిపెట్టే ఈ కథాకావ్యంపై రాజమండ్రి ఫస్ట్ గ్రేడ్ ప్లీడర్ జగన్నాథం మనసు పారేసుకున్నాడు. దీన్ని ‘చిలాన్ బందీ అను భ్రాతృసౌహృదము’ పేరుతో తెలుగు చేశాడు. 1894లో ఏలూరులోని ధర్మరాజు శివరామయ్యకు చెందిన శ్రీత్రిపుర సుందరీ ప్రెస్సులో అచ్చేయించాడు. బైరన్ కృతిని అనువదించడం అంత సులభం కాకపోయినా సొబగు చెడకుండా తెలుగు పాఠకులకు అందించడానికి శాయశక్తులా ప్రయత్నించానని, దీని బాగోగులపై ఎవరు సలహాలిచ్చినా స్వీకరిస్తానని వినయంగా చెప్పుకున్నాడు ముందుమాటలో. మన యథాలాప జీవితాల్లో అంతగా గుర్తుకు రాని స్వేచ్ఛను హృదయంతోపాటు రక్తమజ్జాస్థిగతాలూ పలవరించేలా చేసే ఖైదు అనుభవం కొంత నాకు కూడా ఉండడంతో ‘చిలాన్ బందీ’పై నేనూ మనసు పారేసుకున్నాను.

జగన్నాథం అనువాదంపై ఇదివరకు తెలుగులో ఎవరైనా రాశారో లేదో నాకు తెలియదు. అతని జీవిత విశేషాలూ తెలియవు. తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అన్నీ ఇంటర్నెట్లో దొరకవని తెలిసినా ఆశతో తొలుత అక్కడే వెతికాను. “Cultural Production Under Colonial Rule: A Study of the Development Of Painting in Modern Andhra: 1900 To 1947” పేరుతో బి. సుధారెడ్డి గారు హైదరాబాద్ యూనివర్సిటీకి సమర్పించిన పరిశోధన పత్రం కంటబడింది. అందులో శిష్టు జగన్నాథం రిఫరెన్స్ ఉంది. జగన్నాథం చిలాన్ బందీతోపాటు థామస్ గ్రే రాసిన ప్రఖ్యాత ఎలిజీని కూడా అనువదించారని సుధారెడ్డి రాశారు.

ఈ ఎలిజీ ప్రస్తావన జగన్నాథం చిలాన్ బందీ ముందుమాటలో ఉంది. బైరన్ కృతి.. గ్రే ఎలిజీలాగే ప్రసిద్ధమని జగన్నాథం చెప్పాడే కానీ దాన్ని తాను అనువదించినట్లు అందులో లేదు. విలియం కూపర్ రాసిన ‘On the receipt of my mother’s picture’ను రాజమండ్రికే చెందిన ఆంగ్లోపాధ్యాయుడు వావిలాల వాసుదేవశాస్త్రి.. ‘మాతృస్వరూప స్మృతి ’ పేరుతో, టెన్నిసన్ రాసిన ‘Locksley Hall’, ‘Lotus Eater’ కవితలను మద్రాస్ కు చెందిన దాసు నారాయణరావు ‘కాముక చింతనము’, ‘విస్మృతి వృక్షప్రభావము’లుగా అనువదించినట్లు ఉంది. బైరన్ ఖైదీ తెలుగులోకి రావడానికి ముందు ఇలాంటి అనువాదాల నేపథ్యముందని, వీటికి ఆంగ్లవిద్యాభ్యాసం వంటివి కారణమని తెలుసుకోవడానికే ఈ వివరాలు. ఇంచుమించు ఇవి వెలువడిన కాలంలోనే వెలుగు చూసిన కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్రకు మూలం ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘Vicar of the Wakefiled’ అన్న విషయం అందరికీ తెలిసిందే.

‘చిలాన్ బందీ’పై ఇంకొంత సమాచారాన్ని ‘తెలుగు రచయితలు రచనలు’ సాయంతో కనుక్కున్నాను. ‘చింతామణి’ మాసపత్రికలో చిలాన్ బందీ ప్రస్తావన ఉన్నట్లు ఆ పుస్తకంలో ఉంది. జగన్నాథం ఊరినుంచే వెలువడిన చింతామణి 1894 సెప్టెంబర్ సంచికలో చిలాన్ బందీపై ‘కృతివిమర్శనము’ శీర్షిక కింద చిన్న సమీక్ష వచ్చింది. జగన్నాథం కాళికావిలాసం వంటి గ్రంథాలు రాసినట్లు సమీక్షకుడు ఏ.ఎస్(ఏ.సుందరరామయ్య) చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే.. ‘హూణభాషాకావ్యము నాంధ్రీకరించుట మిక్కిలి కష్టతరమైన పని.. అయినను శాస్త్రులవారు వారి శక్తి సామర్థ్యాదుల ననుసరించి చక్కగానే వ్రాసియున్నారు. శైలి మృదువై సులభగ్రాహ్యమై యున్నది. హూణులకును, ఆంధ్రులకును అభిప్రాయభేదము మెండుగావున హూణకవీంద్రుల యభిప్రాయములను తద్భాషాపరిచితేతరులకు దేటపడునట్లు మార్చుట సులభసాధ్యము కాకపోయినను గ్రంథకర్తగారు చేసిన భాషాంతరీకరణము కొంతవరకు దృప్తికరముగానే యున్నదనుట కెంతమాత్రమును సందియముండకూడదు..’ అంటూ అనువాదంలో తనకు నచ్చిన ఆరు పద్యాలను ఉదహరించారు.

2chianbandi cover
1890ల నాటి సాహిత్య పత్రికలను జల్లెడ పడుతుండగా.. మరో మాసపత్రిక ‘వైజయంతి’ 1894 నవంబర్ సంచికలో చిలాన్ బందీపై ఎన్.రామకృష్ణయ్య రాసిన పరిచయం దొరికింది. ‘పశ్చిమఖండకావ్యముల నాంధ్రీకరించుట కష్టసాధ్యమని యెల్లవారు నెఱింగిన విషయమే. అయినను శాస్త్రిగారు కూడినంతవఱకు శ్రమపడి మొత్తముమీఁదఁ దృప్తికరముగానే తెనిఁగించియున్నారు.. ఇది తిన్నగా సవరింపఁబడకపోవుటచే ముద్రాయంత్రస్ఖాలిత్యముల నేకము లగుపడుచున్నవి. .. గ్రంథకర్తగారి దోషములుగూడ నొకటిరెండు గానవచ్చుచున్నవి. గీ. లేదుకీడు విచారించి చూడఁజూడ. గీ. ముగ్ధతనుదాల్చి నిశ్చలతను వహించి. ఇత్యాది స్థలముల యతి భంగపెట్టిరి.. ముద్రాయంత్ర స్ఖాలిత్యమున నిట్లయ్యెనేమో..’ అంటూ పరిచయకర్త ‘ఛందోదోషాలు’ పట్టుకుని మూడు పద్యాలు పొందుపరిచారు. పోల్చడం అసంగతమైతే కావచ్చు కానీ, నామటుకు నాకు విశ్వనాథ సత్యనారాయణ ‘రామాయణ కల్పవృక్షం’ నారికేళ పద్యాలకంటే, అంతగా కొరుకుడుపడని కొన్ని జాషువా పద్యాలకంటే ‘చిలాన్ బందీ’ పద్యాలు వందలరెట్లు సరళంగానే కాకుండా హృద్యంగానూ అనిపించాయి.

జగన్నాథం అనువాదం ముఖపత్రం, ముందుమాట, తప్పొప్పుల పట్టికలను వదిలేస్తే 24 పేజీల కావ్యం. మక్కికిమక్కి అనువాదంలా కాకుండా మూలంలోని సారాంశాన్ని ప్రాణవాయువులా శ్వాసిస్తూ, సమగ్రంగా సాగుతుంది. జగన్నాథం తొలుత బైరన్ ను ప్రశంసించి, మూలంలోని స్వేచ్ఛావర్ణన అందుకుంటాడు. అనువాదంలో నాకు నచ్చిన భాగాలను, వాటి మాతృకలను అందిస్తూ పరిచయం చేస్తాను. సౌలభ్యం కోసం అనువాదంలోని పదాల మధ్య విరామం ఉంచాను. ఛందస్సు వగైరాల వివరాల జోలికి పోలేదు.

మూలంలోని బైరన్ నాందీప్రస్తావన.
Eternal spirit of the chainless Mind!
Brightest in dungeons, Liberty! thou art:
For there thy habitation is the heart—
The heart which love of thee alone can bind;
And when thy sons to fetters are consigned—
To fetters, and the damp vault’s dayless gloom,
Their country conquers with their martyrdom,
And Freedom’s fame finds wings on every wind.
Chillon! thy prison is a holy place,
And thy sad floor an altar—for ’twas trod,
Until his very steps have left a trace
Worn, as if thy cold pavement were a sod,
By Bonnivard!—May none those marks efface!
For they appeal from tyranny to God.

బంధానీకము గట్టజాలని మనోభ్రాజిష్ఠనిత్యాత్మ! ని
ర్బంధంబేమియులేక క్రాలెడు ‘‘స్వతంత్రేచ్ఛ’’! కారానివే
శాంధబందుఁ బ్రకాశంబందెదవు నీయావాసమచ్చోఁ గనన్!
బంధాతీత హృదంతరంబగుటనిన్బంధంపవీబంధవుల్!

అట్టిదానిని బంధింపనలవియైన
దేమికలదు విచారింపనిలఁ ద్వదీయ
గాఢనిశ్చలబద్ధరాగంబొకండు
దక్క స్వేచ్ఛానుగామి స్వాతంత్ర మహిమ! !

భవదాత్మ ప్రభువుల్ స్వతంత్ర గరిమా! బద్ధాంఘ్రులై యార్దమై
పవలుగానని మిద్దెలో మెలగుచో బందీగృహాంధబునన్
భవదర్థంబగు హింసయే జయముగా భావంబునన్లోక మెం
చవియద్దేశమునింపెరవాయురయ పక్షశ్రేణినీకీర్తితోన్

పావనాలయమనీబందిగంబుచిలాన బలిపీఠమా నీదుపాడునేల
బావివర్డనునొక్క పావనపురుషుండు బహువత్సరములందు బాధఁబడియె
నడుగుల రాపిడినరుగునంఘ్రల చిహ్నమశ్మమయీస్థలినసటఁబోలి
దిగియంటునందాక తిరిగెనాతండట నుసురెల్లనచ్చటనుడిపి కొనుచు! !

అట్టి పదపద్మచిహ్నములణగి చెరగి
పోకనిలుచుండు గాతనే ప్రెద్దునచటఁ
గ్రుద్ధదుష్టాధిపాలక క్రూరకర్మ
నీశునకుఁ జూపియవి మొరలిడుచునుంట! !

.. బైరన్ భావతీవ్రతను జగన్నాథం ఛందోబంధనాల్లోనే ఎంత అలవోకగా పట్టుకున్నాడో చూడండి. Holy placeను పావనాలయమని, sad floorను పాడునేల అని సహజంగా మార్చేశాడు. Libertyని ‘‘స్వతంత్రేచ్ఛ’’ అని చెప్పడమే కాకుండా కోట్స్ లో పెట్టాడు. ఇది అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న భారతావని స్వేచ్ఛాభిలాషకు నిగూఢ నిదర్శనమా?

There are seven pillars of Gothic mould,
In Chillon’s dungeons deep and old,
There are seven columns, massy and grey,
Dim with a dull imprison’d ray,
A sunbeam which hath lost its way,
And through the crevice and the cleft
Of the thick wall is fallen and left;
Creeping o’er the floor so damp,
Like a marsh’s meteor lamp:

ప్రాచీనోన్నతకుడ్యసంవృత గుహాభ్రాంతిప్రభూతాఢ్యమై
యాచిల్లాన్ జెరసాల గ్రాలునటమధ్యన్ గొప్పనై తెల్లనై
తోచున్ స్తంభములేడు కోణములతోఁదోరంబులై చూడ్కికిం
దోచుంభానుకరంబొకండ సదుమైధూమక్రియంబదినాన్

మందమైనట్టికుడ్యంబుమధ్యమందు
బీటువారిన రంధ్రంబువెంటదూరి
మార్గమేదినకరంబు మసకకాంతి
చేతఁగను వెలుగొందెనాచెరగృహంబు

మిగులఁదేమగల్గు మేదినిపై ప్రాకు
లాడు తరణికిరణమచటనమరెం
బర్రభూమిమీదంబైనుండిపడియటఁ
గ్రాలురిక్కవెలుఁగు కరణిందోప

.. అంధకార బంధురమైన ఆ గుయ్యారంలోకి బీటువారిన గోడ రంధ్రంలోంచి ఓ సూర్యకిరణం దారితప్పి వచ్చింది. ఆ మసకకాంతిలోనే చెరగృహం వెలిగిపోయింది.

… Painful to these eyes
Which have not seen the sun so rise
For years—I cannot count them o’er,
I lost their long and heavy score
When my last brother droop’d and died,
And I lay living by his side.

భారంబులయ్యెఁ బ్రొద్దుపొడువన్ బహువత్సరముల్ గనుంగొనన్
దూరములైనపాడుకనుదోయికి నీదినముల్ గణింపగా
నేరను వత్సరంబులవి నేటికినిన్నిగతించెనందు నే
నారసిచెప్ప దీర్ఘగణనావళివిస్మృతి నొందిపోయినన్

లెక్కమరచితి నాతమ్ముండొక్కఁడుండి
కుందిమృతినొంది ధారుణిఁ కూలినపుడు
బ్రతికి జీవచ్ఛవంబనవానిప్రక్క
కదలనేరకపడియున్నకాలమందు

We could not move a single pace,
We could not see each other’s face,
But with that pale and livid light
That made us strangers in our sight:
And thus together—yet apart,
Fetter’d in hand, but join’d in heart,
’Twas still some solace in the dearth
Of the pure elements of earth,
To hearken to each other’s speech,
And each turn comforter to each
With some new hope, or legend old,
Or song heroically bold;

ఒక్కయడుగైనఁ గదలంగనోపలేము
కడగియన్యోన్యవదనముల్ గానలేము
మమ్ముగ్రొత్తఁగఁజూపు నామసకకాంతి
యచటలేకున్న వైవర్ణ్యమందియయిన

ఇట్లు కలిసియు మరియు ప్రత్యేకముగను
హస్తములఁగట్టుపడి హృదయములఁగలసి
యేకమైయటమెలగెడు నేముపుడమిఁ
బంచభూతాప్తికిని బేదపడితిమకట

ఆ దశనైననొండోరుల యార్తనినాదములాలకించి యా
శాదరవాక్కులాడి యితిహాసముఁ జూపి పురాణవీర గా
నోదయముల్ ఘటించి మరియొండొరుచిత్తములుల్లసిల్లఁ గా
నాదరఁమొప్పఁజేతు మదియాత్మవిషాదము కొంతవాపఁగన్

.. అన్నదమ్ములను ఒక్కో స్తంభానికి కట్టేశారు. స్తంభాలకు ఇనుపకడియాలు ఉన్నాయి. కడియాలకు గొలుసులు, వాటికి మనుషులు. అడుగు కదపలేరు. ఒకరిదగ్గరికొకరు వెళ్లి ఆప్యాయంగా చూసుకోలేరు. అయినా హృదయాలు మాత్రం కలసే ఉన్నాయి. ఒకరి ఆర్తనాదాలొకరు విని శాంతధైర్యవచనాలు చెప్పుకుంటున్నారు.

We heard it ripple night and day;
Sounding o’er our heads it knock’d;
And I have felt the winter’s spray
Wash through the bars when winds were high
And wanton in the happy sky;
And then the very rock hath rock’d,
And I have felt it shake, unshock’d,
Because I could have smiled to see
The death that would have set me free.

అనిల వేగోపహతినిర్మలాంబరమున
హిమతుషారంబుల చలివేళనెగసియాడఁ
గలుఁగు గొనగొనరొద రేపవలుచెలంగి
తలలపై మ్రోగనెడలేని యులివు వింటి

మీదఁబడఁగంటిఁ గడ్డీలమించివచ్చి
యపుడు చెరసాల యశ్మమెయల్లలాడె
నూపుదగిలియుఁ జలియింపకుంటిని మదిని
శ్రమవిమోచకమృతి సంతసంబునీదె

.. ఆ చెరసాల గోడలనంటి లెమాన్ అనే రమ్యసరోవరముంది. గోడపక్కనుంచి తరంగాలు బందీఖానాను చోద్యంగా పలకరిస్తుంటాయి. పెనుగాలి వీచినప్పుడు నీటితుంపర్లు జైల్లో విసురుగా పడుతుంటాయి. ఆ తాకిళ్లకు జైల్లోపలి గోడరాళ్లు అల్లాడతాయి. వాటి తాకిడి తగిలినా చలింపడు. వేదనను తీసేసే చావు సంబరమే కదా.

The flat and turfless earth above
The being we so much did love;
His empty chain above it leant,
Such Murder’s fitting monument!

వాని విడఁగొట్టు శృంఖలవ్రాతమరయఁ
బాతిపెట్టిన శవముపైఁ బడియటుండె
నరయనది దానిపై గోరియనఁబరగె
ఘోరహత్యార్హమైనట్టి గురుతనంగ

.. పెద్దతమ్ముడు చనిపోయాడు. అతన్ని బందిఖానాలో కాకుండా సూర్యరశ్మి తగిలే చోట ఖననం చేయాలని కథకుడు ప్రాధేయపడ్డాడు. వాళ్లు పరిహసించారు. తమ్ముడి గోరీపై అతని సంకెల ఆ దారుణానికి గుర్తుగా మిగిలింది. ఇక రెండో తమ్ముడి సంగతి..

With all the while a cheek whose bloom
Was as a mockery of the tomb
Whose tints as gently sunk away
As a departing rainbow’s ray;
An eye of most transparent light,
That almost made the dungeon bright;
And not a word of murmur—not
A groan o’er his untimely lot,—
A little talk of better days,
A little hope my own to raise,
For I was sunk in silence—lost
In this last loss, of all the most;
And then the sighs he would suppress
Of fainting Nature’s feebleness,
More slowly drawn, grew less and less:
I listen’d, but I could not hear;
I call’d, for I was wild with fear;
I knew ’twas hopeless, but my dread
Would not be thus admonishèd;
I call’d, and thought I heard a sound—
I burst my chain with one strong bound,
And rushed to him:—I found him not,
I only stirred in this black spot,
I only lived, I only drew
The accursed breath of dungeon-dew;

ఇట్టి దుర్దశనున్ననెవ్వాని చెక్కిళ్ళకెంజాయ గోరీకిఁ గేలియయ్యె
నిద్దంపు చెక్కిలి నిగనిగల్నిరసించెనింద్రాయుధస్ఫూర్తి యేపు తరిగి
మెల్లమెల్లఁబోవు మెలపునఁదళతళ మించుల కనుకాంతిమించి తొడరి
వెలిగించెఁ జెరసాల విస్మయంబుఁగనట్టి మానిసిసణుగుల మాటయొక్క
టైనబలుకఁడు నిట్టూరుపనైననిడడు
కనియునిట్టియకాలసంఘటన తనకుఁ
గలిగినను నూత్నవిశ్వాసబలముచేత
సహనముననోర్చె నెట్టికష్టములనైన

మంచిదినములుకలవన్నమాట కొంత
యడఁగు నాయాస నిలిపెడునాసకొంత
పలుకునాతఁడు గొణిగెడు పలుకుతోఁడ
మౌనమగ్నుఁడనై నేను మ్రానుపడఁగ

.. నిగనిగల బుగ్గల తమ్ముడు మనోవ్యథతో చిక్కిపోయాడు. అంత్యకాలం. నిట్టూర్పు సన్నమైంది. పిలిచినా పలకలేదు. అయినా భ్రాంతిపాశము వదల్లేదు.

I burst my chain with one strong bound,
And rushed to him:—I found him not,
I only stirred in this black spot,
I only lived, I only drew
The accursed breath of dungeon-dew;

గొప్పలంఘనమున నాదు గొలుసుఁ ద్రెంచి
కొనిరయోద్ధతిఁజనితినాతనిసమీప
మునకునైనను ఫలమేమి మున్నె కాలుఁ
డసవుఁగొనిపోయెనిఁకనటనాతఁడేడి

అక్కటా! వానిఁగనుఁగొననైతినెచట
నేనొకఁడనుంటిఁ జీకటినెలవునందు
నేనొకఁడనఁబ్రతికినేనొకండఁ
బాడుచెరతడిశ్వసనంబుఁ బడయుచుంటి

What next befell me then and there
I know not well—I never knew—
First came the loss of light, and air,
And then of darkness too:
I had no thought, no feeling—none—
Among the stones I stood a stone,
And was, scarce conscious what I wist,
As shrubless crags within the mist;
For all was blank, and bleak, and grey;
It was not night—it was not day;
It was not even the dungeon-light,
So hateful to my heavy sight,
But vacancy absorbing space,
And fixedness—without a place;
There were no stars, no earth, no time,
No check, no change, no good, no crime
But silence, and a stirless breath
Which neither was of life nor death;
A sea of stagnant idleness,
Blind, boundless, mute, and motionless!

చిత్తవృత్తి నశించెను జేష్టదక్కె
నింద్రియజ్ఞానమంతయునిమ్ముదప్పె
శూన్యమయ్యెను సర్వంబుఁజూడనచటి
రాలలోపల నేనొక్క రాయినైతి

మంచుముంచిన పొదలేనిమలలమాడ్కి
జ్ఞానమజ్ఞానమును రెండుగానకుంటి
సర్వమత్తరిశూన్యమై శైత్యమయ్యె
మరి వివర్ణముఁగాఁదోచె మానసమున

కనుఁగొననదినిశ కాదదిపవలును గాదు భారములైన కన్నులకును
భారమైతోచెడు కారాలయములోని కనుమాపుచూపు గాదు చూ
డ! నావరణము మ్రింగునాకాశశూన్యంబు స్థానంబునెరుగని స్థావ
రంబు లేవునక్షత్రముల్ లేదుధారుణితరి లేదువర్ణంబులు లేవులేవు

లేదు పరివర్తనము లేదులేదుమేలు
లేదు కీడు విచారించి చూడఁజూడ
మౌనమును మృతిజీవానుమానకుంభ
కంబునిశ్చల భావంబుఁగలియుండె

గాఢనిశ్చలజాడ్యసాగరమునందు
రూపమడఁగియపారమైనచూపుమాసి
ముగ్దతను దాల్చినిశ్చిలతనువహించి
యున్నట్లయ్యె నేనప్పుడున్నరీతి

.. తోడబుట్టినవాడొకడైనా మిగిలాడులే అన్నఆశతో జీవించాడు. అదీ పోయింది. మనిషి ఉన్నట్లుండి జడమైపోయాడు. చిత్తము చెదరింది. సర్వం శూన్యమైంది. రాత్రీపవళ్లకు తేడా తెలియకపోయింది. మౌనం కమ్ముకుంది.

A light broke in upon my brain,—
It was the carol of a bird;
It ceased, and then it came again,
The sweetest song ear ever heard,
And mine was thankful till my eyes
Ran over with the glad surprise,
And they that moment could not see
I was the mate of misery;
But then by dull degrees came back
My senses to their wonted track;

కలకలరవములఁబలుకులు
చిలుకుచు వ్యధఁజెందునాదు చిత్తంబునకున్
వెలుఁగిడువిధమునఁ దెలివిడు
పులుగొక్కటి వచ్చె గానములు విలసిల్లన్

గానమప్పుడు విరమించెఁ గ్రాలెమరల
వీనులెన్నడునటువంటి వింతమధుర
గానమాలించి యెరుగవు గానఁగనులు
హర్షవిస్మయములఁగృతజ్ఞాంచితముగ

And song that said a thousand things,
And seemed to say them all for me!
I never saw its like before,
I ne’er shall see its likeness more:
It seem’d like me to want a mate,
But was not half so desolate,
And it was come to love me when
None lived to love me so again,
And cheering from my dungeon’s brink,
Had brought me back to feel and think.
I know not if it late were free,
Or broke its cage to perch on mine,
But knowing well captivity,
Sweet bird! I could not wish for thine!

ఆసంగీతము వీనుదోయికొసగెన్ హర్షంబు వేసుద్దులన్
భాసిల్లంబ్రకటించెనాకొరక చెప్పందల్చెనోయేమొకో
యీసాదృశ్యముగల్గు పక్షినిలమున్వీంక్షింపఁగాలేదికే
వాసంబందునఁగాననంచుమదిలోఁ బల్మారునేఁదల్చితిన్

అదియు నావలె సహవాసినాత్మఁగోరి
వెతకుచున్నట్లుతోచె నామతికిగాని
నేనుబడ్డట్టికష్టార్ధమైనఁగాని
పొందకుండటనిక్కమాపులుగురేడు

ననునిలపైఁబ్రేమించెడు
జనులెవ్వరులేరటన్నసౌహృదభావం
బునను బ్రేమించుటకై
చనుదెంచెంబోలుఁ బక్షిచంద్రంబటకున్..

.. ఆ పిట్ట చెరచివర కూర్చుని పాటలుపాడింది. ఖైదీకి ఉత్సాహమొచ్చింది.

I know not if it late were free,
Or broke its cage to perch on mine,
But knowing well captivity,
Sweet bird! I could not wish for thine!

…. దానిని విడిచిరో తప్పించుకొని పంజరమునుండి నా పంజరమునవ్రాల
వచ్చెనోగాని యెరుగనువాస్తవంబు
చెరవిధంబెల్లబాగుగఁజిత్తమునకుఁ
దెలసియుండుట నీకదివలదటంచు
బుద్ధింగోరెదనించుల పులుగురేడ

Or if it were, in wingèd guise,
A visitant from Paradise;
For—Heaven forgive that thought! the while
Which made me both to weep and smile—
I sometimes deem’d that it might be
My brother’s soul come down to me;
But then at last away it flew,
And then ’twas mortal well I knew,
For he would never thus have flown—
And left me twice so doubly lone,—
Lone as the corse within its shroud,
Lone as a solitary cloud,
A single cloud on a sunny day,
While all the rest of heaven is clear,
A frown upon the atmosphere,
That hath no business to appear
When skies are blue, and earth is gay.

అదిచూడ దివినుండి యాకాశపధమునఁ బక్షివేషముదాల్చివచ్చినట్టి
అలపరామర్శికుఁడని మదిభావింతుఁ గడచన్నమద్భ్రాత గరుణ న
న్నుచూడంగ దిగివచ్చినాడేమొయని కొన్నిమారులు దలచితిని మన
మునందు, దుఃఖంబుహర్షంబుఁ దోచునుఁదోడుగ నామాటమదికె
కిక్కినప్పుడెల్ల! !

దేవ క్షమియింపుమామాట తెలియకంటి
బారిపోయెనుఁదుదకు నాపక్షియప్డు
మర్త్యఖగమని దృఢముఁగ మదికిఁదట్టె,
కాదో విడనాడి చనునెయాకరణి మరల

నన్నురెండవపరియిట్లు ఖిన్నుఁజేసి
మరలనొంటరిగాఁజేసి మరలఁడఁతడు
పాడెపైబెట్టినట్టి శవంబనంగ
నొక్కఁడనయుంటి నక్కడనుక్కుదక్కి..

.. కొన్నాళ్లకు బందీ అవస్థ చెరపాలకుల్లో మార్పుతెచ్చింది. సంకెలను విడగొట్టారు. ఖైదీ అటూ టూ తిరిగాడు..

Returning where my walk begun,
Avoiding only, as I trod,
My brothers’ graves without a sod;
For if I thought with heedless tread
My step profaned their lowly bed,
My breath came gaspingly and thick,
And my crush’d heart felt blind and sick.

మరియుఁదిరుగుచు ననుజసమాధియుగము
మట్టిచెక్కైన లేకుండవట్టిగుంట
దానిపై కాలుబడనీక తడవితడవి
కడగి తప్పించితిరిగితిఁ గతమువినుడు

కడుఁబరాకున నాకాలువడనపూత
మౌనుగద వారి భూశయ్యలనుతలంపు
లపుడు గలిగించునెగరోజునవిళరముగ
నంధమయమయిభ్రమనొందు నాత్మవిరిగి

.. తొట్రుపడుతూ తమ్ముళ్ల సమాధుల వద్దకు వెళ్లాడు. పల్లంగా ఉన్నాయి. పరాకున వాటిపై కాలుపడితే అపవిత్రమవుతాయని జాగ్రత్తగా అడుగులు వేశాడు. దుఃఖంతో ఆత్మ విరిగిపోయింది.

My very chains and I grew friends,
So much a long communion tends
To make us what we are:—even I
Regain’d my freedom with a sigh.

కాళ్ళబిగఁగొట్టినట్టి శృంఖలము నేను
సహచరత్వముంబుఁ గంటిమి సాహచర్య
దైర్ఘ్యముననుంటనిట్టి తాత్పర్యమబ్బె
విడుదలైనను నిట్టూర్పు విడచికొంటి

.. మనోదేహాలు ఛిద్రమైపోయాక దక్కిన స్వేచ్ఛ ఇది. ఇది ఒక్క చిలాన్ బందీ వేదనేకాదు, లోకపుటన్యాయాలను ప్రశ్నించి చెరసాలల పాలైన ప్రతి ఒక్కరిదీ. తళతళమెరిసే తమ కళ్లలోని స్వేచ్ఛాకాంతితో చీకటిజైళ్లను వెలిగించి, జైలుబయట ఉషస్సులను, వసంతాలను నింపిన వాళ్లందరిదీ.

–పి.మోహన్

P Mohan

(చిలాన్ బందీ తెలుగు అనువాదాన్ని ఈ లింకులో చూడొచ్చు. http://archive.org/search.php?query=chilabandi%20anubhraatrxsauhrxdamu)

రవివర్మ తమ్ముడికి అందిన అందాలు

రవి వర్మ వేసిన రాజా వర్మ చిత్రం

రవి వర్మ వేసిన రాజా వర్మ చిత్రం

చూపుడువేలు, చిటికెన వేలు.. కొండ, లోయ.. పువ్వు, మొగ్గ.. అన్న, తమ్ముడు.. ఇలాంటి అసమానతలు తొలగేవి కావు. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా.. రోజులను అణగదొక్కుతూ కర్ణకఠోరంగా వెళ్లిపోయే కాలమనే రోడ్డు రోలరు పక్కన మౌనంగా నుంచుని అందమైన తేడాలు తప్ప అన్ని తేడాలూ సమసిపోవాలని కోరడం మినహా మరేమీ చెయ్యలేం. అందమైన తేడాలు నిజంగానే అంత బావుంటాయా?

రాజా రాజవర్మ.. అవును రాజా రాజవర్మనే! రాజా రవివర్మ కాదు. రవివర్మ తమ్ముడు. అన్న అనే చిక్కని నీడ కింద పూర్తిగా వికసించకుండానే నేలరాలిన మొగ్గ. అన్నను జీవితాంతం అంటిపెట్టుకుని అతని కంటికి రెప్పలా, చేతికి ఊతకర్రలా బతికిన మనిషి. సోదరుడు పురుడుపోసిన హిందూ దేవతలకు బట్టలు సర్దిన మొనగాడు. అన్న బొమ్మకట్టిన నానా రాజుల, తెల్లదొరల ముఖాల వెనక కంటికింపైన తెరలను వేలాడదీసిన సేవకుడు. రవికి బంటురీతిగా మెలగి, అతని వెంట ఆసేతుహిమాచలం తిరిగి, ఏవేవో పిచ్చికలలు కని, అవి తీరకుండానే అర్ధంతరంగా వెళ్లిపోయిన ఒక మసక రంగుల జ్ఞాపకం.

మనకు రవివర్మ గురించి తెలుసు. జనం అతని దేవతల బొమ్మలను పటాలు కట్టుకుని పూజించడమూ తెలుసు. అతని నున్నటి వక్షస్థలాల మలబారు, నాయరు అందగత్తెల చూపులకు మన చూపులు చిక్కుకోవడమూ తెలుసు. అతని చిత్రాలు యూరోపియన్ కళకు నాసిరకం నకళ్లని, వాటిలో కవిత్వం, సహజత్వం లేదని, అతనిదంతా క్యాలండర్ ఆర్ట్ అని.. కారణంగానో, అకారణంగానో చెలరేగే విమర్శకుల గురించీ కొంత తెలుసు. ఆ తెలిసిన దాంట్లోంచి అరకొరగా, అస్పష్టంగా కనిపించే అతని తమ్ముడి కథేంటో తెలుసుకుందాం.

ఇద్దరు వర్మలు

ఇద్దరు వర్మలు

రాజవర్మ రవివర్మకంటే పన్నెండేళ్లు చిన్న. 1860 మార్చి 3న కిలిమనూర్ ప్యాలెస్ లో పుట్టాడు. నాటి త్రివేండ్రమైన నేటి తిరువనంతపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది కిలిమనూర్. తండ్రి ఎళుమావిల్ నీలకంఠన్ భట్టాద్రిపాద్. బ్రాహ్మణుడు, సంస్కృతంలో పండితుడు. తల్లి ఉమా అంబాబాయి క్షత్రియ. కవయిత్రి, గాయని. వీరికి నలుగురు పిల్లలు, రవివర్మ, గొడవర్మ, రాజవర్మ, మంగళాబాయి. మాతృస్వామ్య వ్యవస్థ కనుక ఉమ పుట్టింట్లోనే ఉండేది. ఆమె సోదరుడి పేరు కూడా రాజా రాజవర్మే. చిత్రకారుడు. ఇంట్లో కథాకళి నాట్యాలు, సంస్కృత నాటకాలు, కచేరీలు సాగేవి. రవివర్మ మేనమామ వద్ద తొలి కళాపాఠాలు నేర్చుకుని పద్నాలుగేళ్లప్పుడు త్రివేండ్రానికెళ్లాడు. రాజాస్థాన చిత్రకారుల వద్ద, అతిథులుగా వచ్చిన పాశ్చాత్య చిత్రకారుల వద్ద నానా తంటాలుపడి తైలవర్ణ చిత్రాలు నేర్చుకున్నాడు. రవివర్మ పెద్ద తమ్ముడు గొడవర్మ సంగీతంలో దిట్ట. చెల్లెలు కూడా బొమ్మలు వేసేది. చిన్నతమ్ముడు రాజవర్మ త్రివేండ్రమ్ లో ఇంగ్లిష్ చదువులు చదువుకున్నాడు. షేక్ స్పియర్, ఆలివర్ గోల్డ్ స్మిత్, బాల్జాక్ రచనలంటే ఇష్టం.

రవివర్మ పేరు దేశమంతటా మారుమోగింది. దేశంలో ఇన్నాళ్లకు పాశ్చాత్యులకు సరితూగే కళాకారుడు పుట్టాడని దేశీ కళాపిసాసులు ముచ్చటపడ్డారు. బొమ్మలు వేయించుకోవడానికి రాజులు, తెల్లదొరలు బారులు తీరారు. చేతినిండా పని. లావాదేవీలు, ఉత్తరప్రత్యుత్తరాలు నడపడానికి మనిషి కావాలి. ఇంగ్లిష్, దొరల మర్యాదలూ గట్రా తెలిసినవాడు కావాలి. తమ్ముడు నేనున్నానని ముందుకొచ్చాడు. సెక్రటరీ మొదలుకొని నౌకరీ వరకు అన్ని పనులూ చేసిపెడతానన్నాడు. అన్న తమ్ముడికి బొమ్మలు నేర్పాడు.

చిత్రాయణంలో రామలక్ష్మణుల ప్రస్థానం మొదలైంది. రవివర్మ బరోడా రాజు కోసం వేసిన నలదమయంతి, శంతనమత్స్యగంధి, రాధామాధవులు, సుభద్రార్జునులు వంటి పౌరాణిక చిత్రాల రచనలో రాజవర్మ ఓ చెయ్యేశాడు. చెల్లెలు మంగళాబాయి కూడా రంగులు అద్దింది. నైపుణ్యం పెద్దగా అక్కర్లేని బట్టలు, ఆకాశం, నేల, బండలు, ఆకులు, చెట్ల కాండాలు వగైరా వెయ్యడం వాళ్లపని. అన్నకు తీరికలేకుంటే దేవతల ముఖాలపైనా, చేతులపైనా చెయ్యిచేసుకునేవాళ్లు. అన్న వాటిని సరిదిద్దేవాడు. అంతా కుటీరపరిశ్రమ వ్యవహారం.

రాజా వర్మ వేసిన పరవుర్ చెరువు

రాజా వర్మ వేసిన పరవుర్ చెరువు

పచ్చని కేరళ సీమలోకి తొలుచుకొచ్చిన సముద్రపు కాలవల్లో చల్లని వెన్నెల రాత్రి పడవ ప్రయాణాల్లో అన్నదమ్ములు భారత భాగవత రామాయణాలు చెప్పుకున్నారు. ఏ దేవతను ఏ రూపలావణ్యాలతో కేన్వాసుపైకి తీసుకురావాలో ముచ్చటించుకున్నారు. బొమ్మలు వెయ్యడానికి దేశమంతా తిరిగారు. మద్రాస్, మైసూర్, బాంబే, బరోడా, ఉదయ్ పూర్, ఢిల్లీ, లక్నో, కాశీ, ప్రయాగ, కోల్ కతా, కటక్, హైదరాబాద్, విశాఖ, రాజమండ్రి, విజయవాడ.. అన్నదమ్ములు కాలూనని పెద్ద ఊరుకానీ, స్నానమాడని నది కానీ లేకుండా పోయింది. కొన్ని బొమ్మలను కలసి వేసేవాళ్లు. వాటిపై ఇద్దరూ సంతకాలు చేసేవాళ్లు. కలసి నాటకాలకు, గానాబజానాలకు వెళ్లేవాళ్లు. ‘హిందూ’ లాంటి ఆంగ్ల పత్రికల్లో న్యాపతి సుబ్బారావు పంతులు వంటి కాంగ్రెస్ నేతల రాతలు చదువుతూ దేశ స్థితిగతులు చర్చించుకునేవాళ్లు. బాంబే రెండో ఇల్లయింది. దాదాభాయ్ నౌరోజీ, తిలక్, రనడే, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మహామహులతో కలసి తిరిగేవాళ్లు. కోల్ కతా వెళ్లినప్పుడు టాగూర్ల జొరసొంకో భవంతిలో బసచేశారు. అబనీంద్రనాథ్ టాగూరు బొమ్మలు రవికి నచ్చాయి.

అన్నకు పౌరాణిక గాథలపై మక్కువ. తమ్ముడు ప్రకృతి ఆరాధకుడు. దాని పరిష్వంగంలో పులకరింతలు పోయాడు. ప్రకృతి(ల్యాండ్ స్కేప్) చిత్రాలు భారతీయ కళలో అంతర్భాగం. మొగల్, కాంగ్రా, బశోలీ, రాజ్ పుత్ వగైరా కళాసంప్రదాయాలన్నింటా చెట్టుచేమలు నిండుగా ఉంటాయి. రాజవర్మకు అవి నచ్చలేదు. తనపై పాశ్చాత్య కళాప్రభావం ఉంది కనుక తన దేశ ప్రకృతిని పాశ్చాత్య కళాకారుల్లాగే ఆవిష్కరించాడు. ఆంగ్లేయ ప్రకృతి చిత్రకార దిగ్గజాలు టర్నర్, కాన్ స్టేబుల్ లపై వచ్చిన పుస్తకాలను చదివాడు. రాజవర్మ ప్రకృతి ప్రేమ, కవితా హృదయం అతని డైరీల్లోని ప్రకృతి వర్ణనల్లో గోచరిస్తుంది. రవివర్మ రాజమందిరాల్లో రాచగణాన్ని చిత్రించే వేళ తమ్ముడు చెట్టుచేమా, చెరువులూ కాలవలూ పట్టుకుని తిరిగేవాడు.

పల్లెపడుచు

పల్లెపడుచు

స్టూడియోకు తిరిగొచ్చి వాటిని చిత్రికపట్టేవాడు. ఒడ్డున కొబ్బరి చెట్లతో, లోపల గూటిపడవతో, నారింజరంగు నింగి వెలుతురు ప్రతిఫలించే పరవూర్ సరస్సును, ఆకుపచ్చ నీటి కాలవలను, చెరువుగట్లను ఇండియన్ ఇంప్రెషనిస్ట్ మాదిరి పొడగట్టాడు. ఒంటిపై తడిచిన తెల్లచీర తప్పమరేమీ లేని యువతిని తొలిసంజెలో నెత్తిపై నీళ్లబిందెతో ఓ చిత్రంలో చూపాడు. ‘పంటకోతలు’ చిత్రంలో..

పంటకోతలు

పంటకోతలు

గోచితప్ప మరేమీ లేని మలబారు నల్లలేత పరువాన్ని ఆవిష్కరించాడు. పసుపురంగుకు తిరిగిన పొలం, ఆకాశం, బూడిదాకుపచ్చలు కలసిన కొబ్బరి తోటల నేపథ్యంలో ఆమె చేరో చేత్తో గడ్డిమోపులు పట్టుకుంది. ఫ్రెంచి రొమాంటిస్ట్, రియలిస్ట్ చిత్రకారులు మిలే, లెపెజ్, జూల్ బ్రెతా వంటివాళ్లు వేసిన ఆడరైతుల బొమ్మలకు ఏమాత్రం తీసిపోదీ కేరళకుట్టి. ‘నాటుసారా కొట్టు’ లో సారాకుండ, సీసాల మధ్య స్టూలుపై వయ్యారంగా కూర్చుని బేరం కోసం ఎదురుచూస్తున్న మలయాళీ బిగువు మగువను పరిచయం చేశాడు. అన్న వేసిన ‘భీష్మ ప్రతిజ్ఞ’ లోంచి కోడిపుంజును అరువుకు తెచ్చుకుని ఆ కొట్టు ముందుంచాడు.

రవివర్మ, రాజవర్మలు సమకాలీన యూరోపియన్ అకడమిక్ కళను చాలా దూరం నుంచే అయినా జాగ్రత్తగా గమనించేవాళ్లు. ‘ది ఆర్టిస్ట్’ పత్రిక తెప్పించుకుని చదివేవాళ్లు. రవివర్మ మూర్తిని రాజవర్మ, రాజవర్మ మూర్తిని రవివర్మ చిత్రించేవాళ్లు. ఆప్త బంధువును కోల్పోయిన దుఃఖపురోజుల్లో నెరిసిన గడ్డంతో ఉన్న అన్నను తమ్ముడు ఓ చిత్రంలో చూపాడు. తమ్ముడు కళ్లద్దాలు పెట్టుకుని కిరోసిన్ దీపకాంతిలో దీక్షగా చదువుకుంటున్నట్లు వేశాడు అన్న.

సారా కొట్టు

సారా కొట్టు

మనదేశంలో ఆడవాళ్లు మోడళ్లుగా ముందుకు రావడం అప్పుడప్పుడే మొదలవుతున్న రోజులవి. అయితే వాళ్లు బట్టలు విప్పడానికి ససేమిరా అనేవాళ్లు. దీంతో అన్నదమ్ములు బ్రిటన్, జర్మనీల నుంచి నగ్నమహిళల ఫొటోలు తెప్పించుకుని వాటితో కుస్తీపడేవాళ్లు. వాళ్ల దేహాలకు చీరలు, రవికలు తగిలించి భారతీయీకరించేవాళ్లు. అందుకే రవివర్మ అందగత్తెలు యూరప్ ఆడాళ్లకు బొట్టుపెట్టి, చీరలు చుట్టినట్లుంటాయనే విమర్శలు ఉన్నాయి. రాజవర్మ 1895 నుంచి 1904 వరకు రాసుకున్న డైరీల్లో అతని జీవితమే కాకుండా రవివర్మ చివరి పదేళ్ల జీవితమూ బొమ్మకట్టినట్లు కనబడుతుంది. అవి ఒకరకంగా రవివర్మ డైరీలు కూడా. రవివర్మకు అంతటి పేరు ప్రఖ్యాతులు రావడానికి మిరుమిట్లు గొలిపే అతని కళతోపాటు, రాజవర్మ చేసిపెట్టిన ప్రచారం కూడా సాయపడింది. బొమ్మలు అడిగిన వాళ్లకు అన్న బొమ్మలు ఎంత గొప్పగా ఉంటాయో ఉత్తరాలు రాసేవాడు తమ్ముడు. ఏ సైజుకు బొమ్మకు ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పడం, వేసిన వాటిని భద్రంగా పార్సిల్ చేసి పంపడం, వచ్చిన డబ్బును బ్యాంకులో వెయ్యడం, రాని బాకీలను వసూలు చెయ్యడం వరకు అన్ని పనులూ పకడ్బందీగా చక్కబెట్టేవాడు. దేశవిదేశాల్లో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్ల సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుసుకుని అన్నవేసిన చిత్రాలను పంపేవాడు.

రవివర్మ తన పెయింటింగులను ప్రజలకు మరింత చేరువ చెయ్యడానికి తపనపడ్డాడు. తన పేరుతో బాంబేలో మిత్రుల భాగస్వామ్యంతో కలర్ లితోగ్రాఫ్ ప్రెస్సును స్థాపించాడు. లావాదేవీలను తమ్ముడికే అప్పగించాడు. భాగస్వామి మోసగించాడు. అన్నదమ్ములు అప్పులపాలయ్యారు. తీర్చడానికి తంటాలు పడ్డారు.

రవివర్మ, రాజవర్మలకు ఆంధ్రదేశంతో తీపి, చేదు అనుభవాలున్నాయి. ఇద్దరూ హైదరాబాద్, కురుపాం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, విశాఖల్లో బసచేశారు. రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్ రైల్వే స్టేషన్ల గుండానే ముంబైకి వెళ్లేవాళ్లు. తాడిపత్రి, రేణిగుంటల్లో కలరా పరీక్షలు చేయించుకున్నామని రాజవర్మ ఓ చోట రాసుకున్నాడు. కురుపాం రాజా వారి ఇంట్లో వడ్డించిన తెలుగు వంటకాలు తమిళ, మలయాళ వంటలకు భిన్నంగా ఉన్నా రుచిగానే ఉన్నాయని రాసుకున్నాడు.

ప్రెస్సుతో ఆర్థికంగా దెబ్బతిన్న అన్నదమ్ములు 1902 తొలి మాసాల్లో హైదరాబాద్ లో బసచేశారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాజా దీన్ దయాళ్ వంటి మిత్రుల మాటలపై భరోసా పెట్టుకున్నారు. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ తమతో బొమ్మలు వేయించుకుంటాడన్నఆశతో చాన్నాళ్లు పడిగాపులు కాశారు. దేశమంతా గౌరవించిన రవివర్మకు నిజాం మాత్రం ముఖం చాటేశాడు. అధికారులు రేపోమాపో అంటూ తిప్పారు. అన్నదమ్ములు తొలుత సికింద్రాబాద్ లోని దీన్ దయాళ్ ఇంట్లో బసచేశారు. పొరపొచ్చాలు రావడంతో చాదర్ ఘాట్ లో ఇల్లు అద్దెకు తీసుకుని బొమ్మలు మొదలుపెట్టారు. వ్యాహ్యాళికి హుసేన్ సాగర్ తీరానికి వెళ్లేవాళ్లు. చార్మినార్, చౌమొహల్లా, ఫలక్ నుమా ప్యాలెస్ లను, మీరాలం చెరువును చూశారు. ఆడ మోడళ్ల కోసం వాకబు చేశాడు రాజవర్మ. కొంతమంది వేశ్యలు వస్తామన్నారు కానీ మాట తప్పారు. చివరకు ఓ ముస్లిం యువతి ఒప్పుకుందట.

రాజావర్మ చిత్రకల్పనలో హుసేన్ సాగర్

రాజావర్మ చిత్రకల్పనలో హుసేన్ సాగర్

రాజవర్మ హైదరాబాద్ లో ఉన్నప్పుడు హుసేన్ సాగర్ చిత్రాన్నివేశాడు. ఆ చెరువు నీళ్లు వందేళ్ల కిందట ఎంత తేటగా, నీలంగా ఉండేవో ఈ చిత్రం చూపుతుంది. కుడివైపు చెట్ల మధ్య మసీదు గుమ్మటం ఉంది. చెరువు ఒడ్డున గడ్డిలో పశువులు మేస్తున్నాయి. కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు. చెరువులో పడవలున్నాయి. నేటి కళాప్రమాణాలకు ఇది నిలవకపోవచ్చు కానీ 1903లో మద్రాస్ లో జరిగిన పోటీలో దీనికి బంగారు పతకం వచ్చింది.

రాజవర్మపై పరోక్షంగా నాటి జాతి పునరుజ్జీవనోద్యమ ప్రభావం ఉంది. పరాయి పాలనలో రవివర్మ హిందూదేవతల బొమ్మలను చిత్రించడం, వాటి నకళ్లను వేలకొద్దీ అచ్చుగుద్ది జనంలోకి తీసుకెళ్లడం ఆ ఉద్యమం సామాజిక ఉపరితలాంశంపై వేసిన ప్రభావ ఫలితమే. రాజవర్మకు కపటత్వం నచ్చదు. మూఢాచారాలు గిట్టవు. బాంబేలో బహుశా ఏదో లావాదేవీలో మోసపోయిన సందర్భంలో 1901 ఆగస్ట్ 1న డైరీలో ఇలా రాసుకున్నాడు, ‘ the markets are all great liars and try to take advantage of the ignorance of the strangers.’ నిజాం బొమ్మను కొంటానని చెప్పి, ఆ తర్వాత బేరం తగ్గించిన ఓ హైదరాబాదీపై కోపంతో 1902 జూన్ 8న.. ‘the majority of the Hyderabad nobles and officials are notorious for their dishonesty, want of truthfulness and immoral character‘ అని తిడుతూ రాసుకున్నాడు. జోస్యాలపై నమ్మకం లేదంటూ.. ’I have myself no belief in palmistry, fortune telling etc., for it is my firm conviction that God has not given men the power to pierce into the mystics of the dark future, for the consequences of possessing such a power would be disastrous to the continuance of the world’ అని 1903 అక్టోబర్ 14న రాసుకున్నాడు.

రాజావర్మ వేసిన రవివర్మ చిత్రం

రాజావర్మ వేసిన రవివర్మ చిత్రం

రాజవర్మ క్షత్రియ నాయర్ పెళ్లిచేసుకున్నాడు. పేరు జానకి. పిల్లలు కలగలేదు. బొమ్మలెయ్యడానికి దేశాలు పట్టుకుని తిరగడం వల్ల భార్యను సరిగ్గా చూసుకోలేకపోయాడు. రవి కూడా అంతే. మాతృస్వామ్యంలో, అందునా దేశదిమ్మర చిత్రకారులు కావడంతో భార్యలకు చుట్టాల్లా మారిపోయారు. భార్యను సరిగ్గా చూసుకోలేకపోయానని రాజవర్మ అంత్యకాలంలో అన్న కొడుకు రామవర్మతో వాపోయాడట. రాజవర్మ 1904 చివర్లో మైసూర్ రాజు కోసం బొమ్మలేసే పనిలో బెంగళూరులో ఉన్నప్పుడు తీవ్రంగా జబ్బుపడ్డాడు. పరిస్థితి విషమించడంతో మద్రాసుకు తీసుకొచ్చారు. పేగుల్లో అల్సర్. ఆపరేషన్ చేసిన కొన్నరోజులకే 1905 జనవరి 4న 45 ఏళ్ల ప్రాయంతో కన్నుమూశాడు. అప్పడు జానకికి ముప్పైమూడేళ్లు. ఆమె చెల్లెలు భగీరథి ప్రసిద్ధ మలయాళ నవలా రచయిత సీవీ రామన్ పిళ్లై భార్య. భగీరథి అంతకు కొన్నేళ్లముందు ఆరుగురు పిల్లలను అమ్మలేని వాళ్లను చేసి వెళ్లిపోయింది. రామన్ ను పెళ్లాడింది జానకి. అతని నవలలకు ఆమె స్ఫూర్తినిచ్చిందంటారు. ఆమె 1933లో కన్నుమూసింది.

రాజా రాజవర్మ

రాజా రాజవర్మ

గాయకుడికి గాత్రసహకారంలా పాతికేళ్లు తన కుంచెకు వర్ణదోహదం అందించి తన కళ్లముందే సెలవంటూ వెళ్లపోయిన తోడబుట్టినవాడి మరణంతో రవివర్మ కుదేలయ్యాడు. పైగా మధుమేహం, మతిమరపు, ప్రేలాపనలు. అప్పటికే రవి భార్య చనిపోయి చాలా ఏళ్లయింది. పెద్ద కొడుకు కేరళవర్మ దురలవాట్లకు లోనయ్యాడు. రవి 1906 అక్టోబర్ 29న తను పుట్టిన కిలిమనూర్ ప్యాలెస్ లోనే ఆఖరి శ్వాస తీశాడు.

ఆ అన్నదమ్ములను బతికి ఉన్నప్పుడూ, పోయిన తర్వాతా ఎందరో ఆడిపోసుకున్నారు. అయితే వాళ్లిచ్చిపోయిన బొమ్మలను జనం ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. తలనిండ పూదండ దాల్చే రవివర్మ అందగత్తె వలువల మడతల్లోనో, అతని సరస్వతి, సీత, శకుంతల, దమయంతులు కూర్చున్న రమణీయ వనాల్లోనో, ఆ వనాల దాపు కొలనుల్లోనో, కొలనులపైని కాంతిగగనంలోనో రాజవర్మ కుంచెపూతలు సంతకాల్లేకుండా తారసపడుతూ ఉంటాయి. ఆ అన్నచాటు తమ్ముడి ప్రకృతి లాలసను, అతనికి అందిన అందాలను లీలగా గుర్తుచేస్తూ ఉంటాయి.

-పి.మోహన్

P Mohan

విదూషక బలి

 

"నీకు ఉజ్జోగమిస్తాను కానీ, నీ.. నీ.. టై రంగు నాకు నచ్చలేదు’’

“నీకు ఉజ్జోగమిస్తాను కానీ, నీ.. నీ.. టై రంగు నాకు నచ్చలేదు’’

కత్తికంటే కుంచె శక్తిమంతమని మరోసారి తేలింది. ఆ వెర్రిబాగుల కార్టూనిస్టుల కుంచెలను మూయించడానికి నీకు ఏకంగా కలాష్నికోవ్ రైఫిళ్లు, షాట్ గన్లు, రాకెట్ లాంచర్లు కావాల్సి వచ్చింది. విదూషకులు కదా, పాపం తమ వెక్కిరింతలకు ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుందని తెలుసుకోలేకపోయారు !

వాళ్లేం చేశారు? ‘నా మతాన్ని, నా ప్రవక్తను కించపరిచారు’ అంటావు, అంతేకదా. కానీ వాళ్లు నువ్వు నరనరానా ద్వేషించే అమెరికా వాడిని, వాడి యూరప్ తొత్తులనూ పరమ అసహ్యంగా గేలి చేశారు కదా. నీ మతదేశాల్లోనే కాకుండా లోకంలోని కష్టజీవులందరి శ్రమఫలాలను దోచుకుంటున్న కేపిటలిస్టుల ముఖానా కాండ్రించి ఉమ్మేశారు కదా. నువ్వు మండిపడే క్రైస్తవ మతపెద్దల బట్టలనూ విప్పేశారు కదా. ఒక్క క్రైస్తవాన్నేనా.. యూదుమతాన్నీ, జాతిపిచ్చి మతాన్నీ, జనాన్నిఆరళ్లుపెట్టే సామ్రాజ్యవాద మతాన్నీ, అవినీతిరాజకీయ మతాన్నీ, మెట్రోసెక్సుమత్తు మతాన్నీ, బాసిజపు మతాన్నీ, నాటోదాడుల మతాన్నీ వాంతికొచ్చేలానూ ఎండగట్టారు కదా. ఇవన్నీ నీకు తెలియదనుకోను. నిజం చెప్పు, నువ్వు కూడా ఆ విదూషకుల బొమ్మలను నీ తుపాకీ మడమపై ఉంచుకుని చూసే వేళ ముసిముసిగా నవ్వుకోలేదా?

ఫ్రాన్స్ లో నీ మతం వాళ్లపై వేధింపులు పెరుగుతున్న మాట నిజమే. రైట్ వింగూలూ, నయా జాత్యున్మాద నేషనల్ ఫ్రంట్లూ జడలు విప్పుతున్నదీ, నీవాళ్లను గెంటేయాలని, కొత్తవాళ్లను రానివ్వకూడదని వెర్రిగా అరుస్తున్నదీ నిజమే. చమురు కోసం నీ మతదేశాలపై, అక్కడి నీ అమాయక ప్రజలపై ఫ్రాన్స్ సహా చప్పన్నారు పడమటి దేశాలు దాడులు చేస్తున్నదీ నిజమే. నువ్వు చిదిమేసిన ఆ  కార్టూనిస్టులు తెలిసో తెలియకో తమ పిచ్చి బొమ్మలతో  ఆ దేశాలకు వకాల్తా పుచ్చుకున్నట్లు అనిపించిందీ నిజమే…

అందుకు పగతీర్చుకోడానికి ఆ పిచ్చుకలపై తుపాకీ ఎక్కుపెడతావా? పోనీ ఆవేశంలో పొట్టనబెట్టుకున్నావులే అని సరిపెట్టుకుందామనుకున్నాను, కానీ వీలుకాలేదు. మొన్నటికిమొన్న పెషావర్ ఆర్మీ స్కూల్లో నువ్వు ముక్కుపచ్చలారని 130 మంది పిల్లల నెత్తురు కళ్లజూసినప్పుడు నీకు గట్టిగానే చెప్పాను కదా, చెవికెక్కలేదా? ఆ నెత్తురింకా ఆరకముందే మరింత అమాయకపు నెత్తురును ఒలికించేశావు కదయ్యా!

Karnika Kahen

సహనం నశిస్తోంది మిత్రమా. నీది పెడదారి అని గోబెల్స్ లు చేస్తున్న ప్రచారం నిజమేనేమోనని నమ్మాల్సి వస్తుందని భయంగా ఉంది. నీతో కొన్నిపేచీలు ఉన్నా దుర్మార్గపు మహాకాయపు రాక్షస గోలియత్ ను వడిసెలతో ఎదుర్కొంటున్న నీ సాహసాన్ని చూసి ముచ్చటపడ్డాను. నీకు రాళ్లందిస్తూ సాయంగా ఉందామనుకున్నాను. కానీ ఇక సాధ్యం కాదేమో. నీ కసిలో ఉన్మాదం పాళ్లు పెరిగింది. నీ ప్రతిఘటన పక్కదారి పట్టింది. నీ గురి పూర్తిగా తప్పింది.

ఆ నెత్తురొలికిన కుంచెల సాక్షిగా ఓ మాట చెబుతున్నాను, బాగా విను. కళ్లు మరింత బాగా తెరువు. గురి చెదరనీకు. శత్రువెవడో, మిత్రుడెవడో, తటస్థుడెవడో మరింత బాగా తెలుసుకో. ప్రాణాలు కాపాడుకోవడానికే తుపాకీ పట్టినవాడివి కనక ప్రాణం విలువ నీకు బాగా తెలుసు. అందుకే నీది ధర్మాగ్రహమంటున్నాను. వ్యర్థ బలులను అల్లా కూడా ఒప్పుకోడు. విదూషకుల బలులను అసలెంతమాత్రం ఒప్పుకోడు.. ! ! !

(ప్యారిస్ లో ఈ నెల 7న వ్యంగ్యపత్రిక ‘షార్లీ హెబ్దో’ కార్యాలయంపై దాడిలో బలైన ప్రధాన సంపాదకుడు, కార్టూనిస్టు షార్బ్(47), కార్టూనిస్టులు కాబూ(76), హనోర్, వోలిన్ స్కీ(80), కాలమిస్టులు, పత్రికా సిబ్బంది, ఇతరులకు నివాళిగా..)

                                                              –  పి.మోహన్

ఒక పెయింటింగ్ అంటే వెయ్యి పేజీల పుస్తకమే!

Rorich "compassion"

Rorich “compassion”

‘‘ఎప్పుడూ ఆ పాడుబొమ్మలేమిట్రా.. కూటికొస్తాయా, కురాక్కొస్తాయా?’’

నేను చిన్నప్పుడు బొమ్మలేసుకునేప్పుడు ఇంట్లోవాళ్లు చిన్నాపెద్దా తేడా లేకుండా తరచూ ఇచ్చిన ఆశీర్వాదమిది. చిన్నప్పుడే కాదు పెద్దయి, పెళ్లయ్యాక కూడా ఇవే దీవెనలు. కాకపోతే దీవించేవాళ్లే మారారు. నాకు బొమ్మలు వెయ్యడం రాదని నాకే కాకుండా మా వాళ్లందరికీ గట్టి నమ్మకం మరి.

‘‘ఎప్పుడూ ఆ పాడు పుస్తకాలేమిట్రా.. క్లాసు పుస్తకాలు చదువుకో, బాగుపడతావు!’’

చిన్నప్పుడు చందమామ, బాలమిత్రలు, పెద్దయ్యాక స్వాతి, ఆంధ్రభూమి వగైరా పత్రికలు, ఇంకొంచెం పెద్దయ్యాక శ్రీ శ్రీ, ఆరుద్ర, చలం పుస్తకాలు చదువుకునేప్పుడు అందిన మరో ఆశీర్వాదం.

‘‘ఎప్పుడూ ఆ పిచ్చిబొమ్మల పుస్తకాలు చదవకపోతే డీఎస్సో గీయస్సో రాయొచ్చుగా. ఈ పాడు రేత్రి ఉజ్జోగం ఇంకెన్నాళ్లు?’’

బొమ్మలు రావని తెలిసి బొమ్మలేంటో తెలుసుకోవడానికి ఇప్పుడు ఆర్ట్ పుస్తకాలు చదువుతూ ఉంటే ఇల్లాలు చేస్తున్న హితబోధ ఇది. వచ్చే జన్మంటూ ఉంటే జర్నలిస్టును పెళ్లి చేసుకోనని ఆమె మంగమ్మ శపథం పట్టింది.

వాళ్లకు జీవితానుభవం మెండు. రియలిస్టు చిత్రకారుల్లాంటి వాళ్లు. మరి నేను?

నేను భూమ్మీదపడి ముప్పైయారేళ్లు. ఊహ తెలియని రోజులు తప్ప ఊహ తెలిసిన కాలమంతా పుస్తకాలు, బొమ్మలే లోకం. అలాగని నేను పండితుడినీ కాను, కళాకారుడినీ కాను. నిజానికి సృజనలోకంటే ఆస్వాదనలోనే చాలా సుఖముంది. రచయితలూ, కళాకారులు వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు. మనం వాటిని హాయిగా కూచుని, ఎలా పడితే అలా పడుకుని, నుంచుని ఆస్వాదించొచ్చు. తినడం కంటే వండడం కష్టం కదూ, అదీ రుచిగానూ.

ఎందుకో తెలియదు కానీ బొమ్మల్లేని పుస్తకాలు నచ్చవు నాకు. కవితయినా, కథయినా, నవలైనా, వ్యాసమైనా బొమ్మ ఉంటే దాని అందం వేరు. బొమ్మలేని పుస్తకం ఉప్పులేని కూర. అక్షరాలకు బొమ్మ తోడుంటే పఠనం విసుగెత్తించదు. వాక్యాలు ఇబ్బందిపెట్టినప్పుడు బొమ్మ ఊరటనిస్తుంది. పిండారబోసిన వెన్నెల్లో చందమామలాంటిది బొమ్మ. ఉడుకుడుకు రాగిసంకటి ముద్దలో కాసింత నేతిబొట్టు, వెల్లుల్లికారం పూసిన ఎండుచేప లాంటిది బొమ్మ. నీది పిల్లతనం అంటారు మిత్రులు. తెలివిమీరిన పెద్దతనానికంటే అదే మంచిదంటాను నేను. చిన్నప్పుడు కథల కోసం కాకుండా బొమ్మలు చూడ్డానికే చందమామ, బాలమిత్రలు కొనేవాడిని, చిరుతిళ్లు మానుకుని. కథ కోసం కాకుండా బొమ్మల కోసమే సినిమాలకు వెళ్లేవాడిని.

Hokusai boy on the tree

Hokusai boy on the tree

నాకు తెలియకుండానే బొమ్మలకు బానిసనయ్యాను. దేన్ని చూసినా, దేన్ని చదివినా రంగురూపాల తపనే. ఎంత పిచ్చో ఒక ఉదాహరణ చెబుతాను. కాళహస్తీశ్వర మాహత్మ్యంలోని విచిత్ర సరోవర సందర్శనం విభాగంలో ఓ వచనం నాకు అచ్చం ఎంసీ ఈషర్ వేసిన చేపలు పక్షులుగా మారే చిత్రాన్ని గుర్తుకు తెచ్చింది. ఆ వచనం చదవండి..

నత్కీరుడు ఓ మర్రిచెట్టు కిందికెళ్లి..  ‘తదీయ శాఖాశైత్యంబున కత్యంత సంతోషంబునొంది, కూర్చుండి, తద్వటంబుననుండి రాలిన పండుటాకులు బట్టబయటఁ బడినయవి విహంగంబులు, జలంబునం బడినయవి మీనంబులునైపోవ, నందొక్క పలాశంబు జలాశయంబున సగమును, దట ప్రదేశంబున సగమును బడి, మీనపక్షిత్వంబులఁ గైకొని, లోపలికిన్వెలుపలికిం దివియు చమత్కారంబు నత్కీరుండు చూచి, యద్భుతరసపరవశుండై యుండె..’’

ఇప్పుడు ఈ వ్యాసంలోని ఈషర్ బొమ్మను చూడండి. ధూర్జటి వచనంతో పోల్చుకోండి!!

Escher "birds fish"

Escher “birds fish”

మా ఊరు కడప జిల్లా ప్రొద్దుటూరు. ఊరిలో ఓ బక్కపల్చని ముస్లిం(మతంతో గుర్తింపునిచ్చే నా నిమిత్తం లేని నా మెజారిటీతనానికి సిగ్గుపడుతున్నా) తోపుడు బండిలో పాతపుస్తకాలు అమ్మేవాడు. నాకప్పుడు పన్నెండేళ్లనుకుంటా. మూడు రూపాయలిచ్చి రామకృష్ణ పరమహంస జీవితచరిత్ర కొన్నాను. మూడునాలుగు వందల పేజీల పుస్తకం. అందులో చక్కని నలుపుతెలుపు ఫొటోలు.. పరమహంసవి, శారదమాతవి, వివేకానందుడివి చాలా ఉన్నాయి. బొమ్మలున్నాయి కనుకే కొన్నాను. నా జీవితంలో చూసిన అతి పెద్ద తొలి పుస్తకం. ఎంతో గర్వంతో స్కూలుకు తీసుకెళ్లి క్లాసులో అందరికీ చూపించాను. గుర్తులేదు కానీ, వెర్రివాడినన్నట్టే చూసుంటారు. ఆ పుస్తకాన్ని డిగ్రీకి వచ్చేంతవరకు జాగ్రత్తగా దాచుకున్నా, కాలేజీ రోజుల్లో ఆలోచనలు మారి, ఆ పుస్తకంతో ఏకీభావం లేకపోయినా. మాకు సొంతిల్లు లేదు కనుక ఇళ్లు మారడంలో అదెక్కడో పోయింది. లేకపోతే ఇంట్లోవాళ్లు పడేసుంటారు.

విశాలాంధ్ర వాళ్ల వ్యాను మా ఊరికీ వచ్చేది. అదొచ్చిందంటే కాళ్లు నిలిచేవికావు. దాచుకున్న, ఇంట్లో దోచుకున్న డబ్బులు, స్కాలర్ షిప్ డబ్బులు పట్టుకెళ్లి కొనేసేవాడిని. బొమ్మల పుస్తకాలకే ప్రాధాన్యం. తెలుగులో అలాంటివి చాలా తక్కువ కనుక సోవియట్ పుస్తకాలపై పడేవాడిని. దిండులాంటి రష్యన్ కథలూ గాథలూ, ప్రాచీన ప్రపంచ చరిత్ర, కుప్రీన్ రాళ్లవంకీ, నొప్పి డాక్టరు, మొసలి కాజేసిన సూర్యుడు, లెనిన్ జీవిత చరిత్ర.. ఇంకా గుర్తులేని బొమ్మల పుస్తకాలు కొని చాటుమాటుగా ఇంటికి తెచ్చేవాడిని. సంగతి తెలియగానే తిట్లు, శాపనార్థాలూ. తొమ్మిదిలోనో, పదిలోనో ఉండగా, పాతపుస్తకాలాయన వద్ద మార్క్సూ, ఎంగెల్స్ లపై వాళ్ల మిత్రుల స్మృతుల పుస్తకం దిండులాంటిదే ఇంగ్లిష్ ది దొరికింది. అప్పటికి మార్క్స్ ఎవరో,  ఎంగెల్స్ ఎవరో తెలియదు. ఆ పుస్తకంలో చక్కని ఇలస్ట్రేషన్లు, ఫొటోలు ఉన్నాయి కనుక కొన్నాను అంతే.  జీవితపు అసలు రుచి చూపిన ఆ మహానుభావులు తొలిసారి అలా తారసపడ్డారు బొమ్మల పుణ్యమా అని. అయితే ఇలాంటి ‘పిచ్చి’ పుస్తకాలు ఎన్ని చదివినా పరీక్షలకు రెండు మూడు నెలల ముందు మాత్రం క్లాసు పుస్తకాలు దీక్షగా చదువుతూ క్లాసులో ఫస్ట్ వస్తూ ఉండడం, ఏడు, పదిలో స్కూలు ఫస్ట్ రావడం, ఇంటర్, డిగ్రీ, పీజీల్లో ఫస్ట్ క్లాసులో పాసవడంతో ఆ తిట్ల తీవ్రత తగ్గుతూ వచ్చేది.

తర్వాత రాజకీయాలు ముదిరి లెఫ్ట్ ను మించిన లెఫ్ట్ లో ‘పక్కదోవ’ పట్టాక బొమ్మల పిచ్చి మరింత ఎక్కువైంది.  ఎస్వీ యూనివర్సిటీలో కామర్స్ పీజీ చేస్తున్నప్పుడు నా చిత్రలోకం పెద్దదైంది. స్కాలర్ల రిఫరెన్స్ విభాగంలోకి పగలు పీజీ వాళ్లను రానిచ్చేవాళ్లుకారు. అందుకే సాయంత్రం ఆరుకెళ్లి రాత్రి మూసేవరకు ఫైనార్ట్స్ పుస్తకాలతో కుస్తీ పట్టేవాడిని. అప్పటికి అరకొరగా తెలిసిన డావిన్సీ, మైకెలాంజెలో, రాఫేల్, పికాసో, డాలీలు మరింత దగ్గరయ్యారు. కూర్బె, మిలే, డామీ వంటి రియలిస్టులు, మానే, మోనే వంటి ఇంప్రెషనిస్టులు, వాన్గో, గోగా, సెజాన్ వంటి పోస్ట్ ఇంప్రెషనిస్టులు, ఫావిస్టులు, క్యూబిస్టులు, డాడాయిస్టులు, సర్రియలిస్టులు, ఫ్యూచరిస్టులు, సోషల్ రియలిస్టులు.. నానాజాతి కళాకారులు దోస్తులయ్యారు. పనిపైన హైదరాబాద్ కు వచ్చినప్పుడు సండే మార్కెట్లో అందుబాటు ధరకొచ్చిన ఆర్ట్ పుస్తకాన్నల్లా కొనేవాడిని. అనంతపురం ఎస్కే వర్సిటీలో ఉంటున్నప్పుడు స్నేహితులను చూడ్డానికి బెంగళూరుకు వెళ్లేవాడిని. హైదరాబాద్ లో దొరకని పుస్తకాలు కనిపించేవి. సిగ్గు వదిలేసి డబ్బులడుక్కుని కొనేవాడిని.

తెలుగు సాహిత్యం చదువుకుంటూనే, బొమ్మలూ అర్థం చేసుకుంటూ ఉండేవాడిని. అదొక ఒంటరి లోకం. కథలూ కాకరకాయలపై మాట్లాడుకోవడానికి బోలెడంత మంది. కానీ బొమ్మల గురించి మాట్లాడుకోవడానికి ఎవరున్నారు? పుస్తకాల్లో చూసిన ఇంప్రెషనిస్టుల చెట్లను, దృశ్యాలను వర్సిటీ ఆవరణలోని, అడవుల్లోని చెట్లతో, కొండలతో పోల్చుకుని వాటితో ముచ్చటించేవాడిని. చేతకాకున్నా ఉద్యమ పత్రికల కోసం ‘ఎర్ర’ బొమ్మలను వేసేవాడిని. చిత్రంగా అప్పుడు చూసిన చిత్రాలు, చదివిన ఆర్ట్ పుస్తకాలు దాదాపు అన్నీ పాశ్చాత్య కళవే. జపాన్, చైనాలవి ఉన్నా తక్కువే. భారతీయ కళవి అయితే రెండోమూడో. అవి కూడా నేషనల్ బుక్ ట్రస్ట్, లలితకళల అకాడెమీ వాళ్లు వేసినవి. ఎస్కే వర్సిటీలోని తరిమెల నాగిరెడ్డి పుస్తకాల్లో ఆయన సంతకంతో చైనా చిత్రకళపై పుస్తకం కనిపించడం ఒక వింత.

‘పక్కదోవ’లో నడిచే ధైర్యం లేక ‘సరైన దారి’కి మళ్లాకా బొమ్మల పిచ్చి పోలేదు. తిండితిప్పలు మానేసి, వేల రూపాయలు అప్పులు చేసి ఆర్ట్ పుస్తకాలకు తగలేసిన సందర్భాలు అనేకం. ఒకప్పుడు నావద్ద నాలుగైదు వందల తెలుగు సాహిత్య పుస్తకాలు, ఐదో ఆరో ఆర్ట్ పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు ఆ అంకెలు తారుమారయ్యాయి. ఊళ్లు మారడం వల్ల చాలా తెలుగు పుస్తకాలను లైబ్రరీలకు, మిత్రులకు ఇచ్చేశాను. ఇప్పుడు ఆర్ట్ పుస్తకాలు రెండు మూడువందలున్నాయి. వాటి మధ్యన తెలుగు పుస్తకాలు ఐదో పదో బిక్కుబిక్కుమంటున్నాయి.  కళపై, కళాకారులపై నేను రాసిన వ్యాసాలు, సొంతంగా అచ్చేసిన ‘పికాసో’, ‘డావిన్సీ’ పుస్తకాలు నా జ్ఞానానికో, అజ్ఞానానికో ఉదాహరణలు.

ఇప్పుడు.. అంటే సాహిత్యం, బొమ్మలూ పరిచయమై, అనుభవంలోకి వచ్చిన పదిహేనేళ్ల తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… నా సాహిత్య ప్రయాణం, కళాధ్యయనం కలసి సాగినట్టు అనిపిస్తోంది. బొమ్మల జోలికి వెళ్లకపోయుంటే సాహిత్యంలో నాకంటూ ఓ స్థానం దక్కేదేమోననిపిస్తోంది. అయినా చింతలేదు. మహా రచయితల పుస్తకాల్లోని సారాంశాలను మహాచిత్రకారుల బొమ్మల్లో పట్టుకోగల దారి నాకు ఆర్ట్ పుస్తకాలు చూపించాయి. సాహిత్యం చూపలేని నానా దేశాల, నానా జాతుల నిసర్గ సౌందర్యాన్ని అవి నాకు పరిచయం చేశాయి.

బొమ్మ రాతకంటే ముందు పుట్టింది. అది సర్వమానవాళి భాష. వెయ్యిపేజీల పుస్తకం చెప్పలేని భావాన్ని అది చక్కగా చెబుతుంది. ఒకవేళ బొమ్మ చెప్పలేని భావాన్ని చెప్పే పుస్తకం ఉంటేగింటే, దానికి బొమ్మ కూడా జతయితే ఇక అర్థం కానిదేమీ ఉండదు.

నింగికి, నేలకు మధ్య హద్దులు చెరిపేసిన ఫుజీ మంచుకొండ ముందు, వాగుపై వాలిన ఒంటరి చెట్టుపై కూచుని పిల్లనగోవి ఊదుతున్న హొకుసాయ్ జపాన్ కుర్రకుంకనూ, ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన రష్యన్ రాజకీయప్రవాసిని మాటలకందని ఆశ్చర్యానందంతో చూస్తున్న రెపిన్ మనుషులను, రోరిక్ కుంచెలో రంగులద్దుకుని మెరిపోయే హిమాలయాలను, హిమాలయాల పాదపీఠంలో పేదరికంతో మగ్గే, చలితో ముడుచుకుపోయే అమృతా షేర్గిల్ పల్లె పడచులను, కడుపుతీపిని, కడుపుకోతను గుండెలు చెదిరేలా చూపే క్యాథే కోల్విజ్ జర్మన్ తల్లులను, దేవుడంటూ ఒకడుంటే, అతనికంటే అద్భుతమైన కళాసృజన చేసిన ఇటాలియన్ పునరుజ్జీవన చిత్రకారులను, ఆత్మలను ముఖాలపైకి తెచ్చుకుని చీకట్లో కాంతిపుంజాల్లా తొంగిచూసే రెంబ్రాంత్ డచ్చి జనాన్ని,  కళ్లు తిప్పనీయని ప్రాచీన గ్రీకు శిల్పాలు, నమ్మశక్యంకాని ఈజిప్ట్ పిరిమిడ్లు, స్తంభాలు, పురాతన ఉద్వేగాలను అంటిపెట్టుకున్న ప్రీకొలంబియన్ కుండలను… ఇంకా ఎన్నింటినో ఆర్ట్ పుస్తకాలు నాకు పరిచయం చేశాయి. నా చేతులు పట్టుకుని ఆదిమానవులు ఎద్దుల, మేకల బొమ్మలు గీసిన లాక్సా గుహల దగ్గర్నుంచి నవనాగరిక ఇన్స్ స్టలేషన్ కర్రల, కడ్డీల ఆర్ట్ వరకు నడిపిస్తూ ఉన్నాయి.

                                                                                            -పి. మోహన్

P Mohan