-మనోజ్ఞ ఆలమూరు
~
మధురాంతకం రాజారాం అబ్బ ఈ పేరు అంటే నాకెంతిష్టమో చెప్పలేను. ఎందుకో తెలియదు మొదటిసారి ఈ పేరు వినగానే అర్రె భలే ఉందే అనుకున్నాను. నేను చదివిన పుస్తకాల తాలూకా రచయితలను వారి వారి రచనలను బట్టి గుర్తుంచుకున్నాను. కానీ ఒక్క మధురాంతకం వారిని మాత్రం పేరు నచ్చి గుర్తు పెట్టుకున్నాను. దాదాపుగా నేను ఎమ్మేలో ఉన్నప్పుడు అనుకుంటాను నాకు ఈయన పేరుతో పరిచయం కలిగింది. అయితే ఆయన కథలు చదవడం మాత్రం ఇప్పటికి కుదిరింది. చదివిన వెంటనే రాయకుండా మాత్రం వుండలేకపోయాను. రాజారాం గూర్చి కొత్తగా చెప్పేదేముంది అని అనిపించవచ్చును. కానీ కొంత మంది పుస్తకాలు చదివినా, వారి గురించి చెప్పకున్నా నిత్య నూతనంగానే అనిపిస్తాయి. పైగా ఈ కథలు నాకు కొత్త అద్భుతమైన అనుభవం, నవ్యనూతనమూనూ… అందుకే చెప్పకుండా ఉంలేకపోతున్నాను.
మధురాంతకం రాజారాం కథలు 3వ సంపుటం అట్టమీద ఒక స్త్రీ కూర్చుని ఏదో వడ్డిస్తున్నట్టు ఉంటుంది. ఎవరు గీసారో కానీ ఆ బోమ్మను ఎంతబాగా గీసారో. పుస్తకంలోని కథలకు ఆ బొమ్మకు ఎంత బాగా జోడీ కుదిరిందో. రాజారాం గారి కథలు సాహిత్యాభిమానులకు అమృతాన్ని పంచుతాయి. దాన్నే సింబాలిక్ గా స్త్రీ రూపంలో సరస్వతీ దేవి అమృతాన్ని పంచినట్టు చిత్రీకరించారేమో అని అనిపిస్తుంది. ఇంక కథల విషయానికి వస్తే రాయలసీమ రచయితల కథలు, రచనలు ఇంతకు ముందు చాలానే చదివినా…రాజారాం కథలు ఒక ప్రత్యేక అనుభవమనే చెప్పాలి. రాయలసీమ యాసలో ఒక వింత అందం ఉంటుంది నాకైతే. నామిని గాని, ఖదీర్ బాబువి కానీ మంచి చిక్కని సీమ యాసలో ఉంటాయి. మిగతావారివి కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. కానీ రాజారాం గారి యాస మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంది. అది పూర్తిగా రాయలసీయ యాస కాదు….కానీ పదాల వారీగా చూసుకుంటే మాత్రం చాలా వరకు సీమ పదాలే. రాజారాం గారి కథల్లో తెలుగు బహుమధురంగా అనిపించింది నాకు. చదవడానికి అత్యంత అందంగా…సరళలంగా ఉండడమే కాక మంచి తియ్యగా కూడా అనిపించింది. అందులోనూ వారు రాసిన విధానం దానికి మరింత అందాన్ని చేకూర్చింది. మధ్యమధ్యలో సామెతలు, జాతీయాలు కలగలిసి రాజారాం గారి కథలకు వింత సొబగును అద్దింది ఆయన భాష. తెలుగు సామెతలను అత్యంత సమర్ధవంతంగా వాడుకున్న వారిలో మధురాంతకం రాజారాం గారు ఒకరు. సందర్భానుసారంగా సామెతలను వాడుతూ తన కథలకు మరింత వన్నెలను అద్దారు రాజారాంగారు. ఒక్కోసారి సామెతలను ముందు చెబుతూ తర్వాత కథలను మొదలుపెట్టడం, సామెతల ద్వారా పాత్రలను పరిచయం చేయడం వంటివి రాజారాం గారి ప్రత్యేక శైలి. అందుకే కీ.శే. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారు రాజారాం కథలు చదివి ఇలా అన్నారుట.” రాజారాం గారి కథల్లో అతి సుందరపదాలను, నుడికారాలను, ఇదివరలో వెలుగు చూడని సామెతలను – పరిశోధకులు ప్రోది చేసి భద్రపరచవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని.”
రాజారాం గారి కథలు చక్కగా కూర్చోబెట్టి, ప్రేమగా పాఠం చెబుతున్నట్టు ఉంటాయి. అన్నట్టు అసలు విషయం మర్చేపోయాను. రాజారాం గారు వృత్తిరిత్యా ఉదాపాధ్యాయులు కదూ. అదీ సంగతి ఆయన ప్రవృత్తిలోకి వృత్తి చొచ్చుకొని వచ్చేసిందన్నమాట. అందుకే ఆయన కథలు పాఠకులకు పాఠం చెబుతున్నట్టు ఉంటాయి. మొదటసారి ఈయన కథలు చదువుతున్నప్పుడు ఒక కొత్తదనం పలుకరించింది. అరే ఇదేమిటీ గమ్మత్తుగా ఉందే అనుకున్నాను. తర్వాత్తర్వాత చదవగా చదవగా ఆ గమ్మత్తు ఆయన కథనరీతి అని అర్ధం అయింది. రాజారాం గారు ఎంచుకునే కథాంశాలు కూడా అలానే ఉంటాయి. ఒక రకమైన స్థిరత్వం కలిగి ఉండి, విశ్వాసం కలిగిస్తున్నట్టు ఉంటాయి. మానవుడిలో ఉన్న అభద్రతాభావాన్ని పక్కకు నెట్టేసి భరోసాను కలిగిస్తాయి. ఉపాద్యావృత్తిలో ఆయన తిరిగిన ప్రదేశాలు, తరచిన అనుభాలూ, కలిసిన మనుషులు, వారి భిన్న మనస్తత్వాలు వారి రచనలకు ఎంతగానో ఉపకరించాయి. ఊహూ…ఉపకరించడం కాదు వాటినే ఆయన తన కథా వస్తువులుగా తీసుకున్నారు అంటే ఇంకా బావుంటుంది.
రాజారాంగారు వృత్తి రిత్యా ఎక్కువగా పల్లెల్లోనే తిరిగారు. అందుకే వారి కథలు 80% పల్లెల చుట్టూరానే తిగుతాయి. గ్రామీణ జీవితంలో మధ్యతరగతి మనుషులు వారి మనో వికారాలు, ప్రవృత్తులు, సమస్యలు ఆయన కథల్లో మనకు దర్శనమిస్తాయి. రాజారాం కథలకు మునిపల్లెరాజుగారు ముందుమాట రాస్తూ…..సామాజికి ఆర్ధ్రత లేని చోట సామాజిక స్పృహ అన్న పదానికి అర్థం ఉండదని ఈయన కథలు చదివిన పాఠకులందరూ గ్రహిస్తారు అని చెబుతారు. ఇది అక్షరసత్యం. రాజారాం గారి కథల్లో ఎక్కడా పలాయనవాదం కనిపించదు. సామాన్య మానవులు వారి చిత్తప్రవృత్తులు, వారి సమస్యలు, వాటి పర్యవసానం అన్నింటినీ కళ్ళకు కట్టినట్టు చెబుతూ వాటికి పరిష్కారాను చూపిస్తూ జీవితం అంటే ఇదే అంటూ భుజం తట్టినుంటాయి వీరి కథలు.వ్యక్తుల్ని,సన్నివేశాల్ని,రాగద్వేషాల్ని,ఈతిబాధల్ని,జీవనదృక్పథాన్ని ఇంత అద్బుతంగా,ఇంత కూలంకషంగా విశదపరిచిన తెలుగు రచయితల్లో రాజారాం గారు ఒకరని ఢంకా బజాయించి మీరీ చెప్పవచ్చును.
పెద్దబాలశిక్ష లా ప్రపంచ జ్ఞానాన్ని బోధిస్తూ,పంచతంత్రం లా చిన్న చిన్న కథలలో జీవితసారాన్ని వడ్డిస్తాయి ఈయన కథలు. ఆ అనుభవాలనే సాకల్యంగా ప్రతి ఒక్క విషయమూ క్షుణ్ణంగా పరిశీలించి, అనేక కోణాలను చక్కగా పరిశీలించి ఆవిష్కరిస్తున్నట్టుంటాయి రాజారాంగారి కథలు. ఆధునికయుగంలో కులాంతర, మతాంతర, విజాతివివాహాలు, కుటుంబనియంత్రణలు అన్నీ ఆయనకి కథావస్తువులే. తమకి ఇబ్బంది కలిగించే అంశాలు –అసభ్యసాహిత్యంవంటివి- తీసుకోక మానరు కానీ అది తమకి అప్రియమని తెలియజేయడానికి వ్యంగంగా వాటిని తన కథల్లో ఉటంకిస్తారు. ఉప కథల్తో పిట్ట కథల్తో, మధ్య మధ్య వర్ణనలతో సావధానంగా కబుర్లు చెబుతున్నట్లుండి, కథల్లో కథ ‘చెప్పే’ పద్ధతిలో ఉంటాయి రాజారాం గారి కథలు.
చాలా కథలలో రచయితే సూత్రధారై కథను నడిపిస్తాడు. ఆగని వేగం అనే కథలో జీవితాంతం నడుస్తూ శ్రమించిన వ్యక్తితో రచయిత చెప్పించే జీవనగీతోపదేశం అద్బఉతంగా ఉంటుంది. ఆ కథ చదువుతుంటే బతుకు మీద విశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. జీవించిన చివరి క్షణం వరకు బతకాలి….బతికుండగానే చనిపోకూడదు అని అనిపిస్తుంది. అలాగే యుగారంభం అనే కథలో పద్యరచన, వచన రచన గురించి చెబుతూ రెండూ కాలగమనంలో నుంచి వచ్చినవే కదా అంటారు. రెండింటినీ స్వీకరించి వాటిని గమనాన్ని బట్టి నడుచుకోవాలని హితబోధ చేస్తారు. అలాగే పంచవర్ష ప్రణాలికలన్నవి కుగ్రామాల నుంచే మొదలు కావాలని, గ్రామాభివృద్ధే అసలైన అభివఋద్ధి అని ధర్మయ్య కల ద్వారా శక్తివంతంగా చెప్పిస్తారు. ఒక సామెతని యదాలాపంగా కథలో చొప్పించడం ఒక ఎత్తు. దాన్ని కథలో ఒక ప్రధానాంశంగా మార్చుకోడం మరొక ఎత్తు.
“ఒక ఆడబిడ్డకు వివాహ సంబంధం కుదర్చాలంటే మునుపు ఏడు జతలజోళ్ళు అరిగిపోయేవిట.” అంటూ అనామకుడు కథలో రచయిత కథను ఎత్తుకుంటారు. అయితే దాన్ని అక్కడతో వదిలేయకుండా ఆ సామెతను కథకి ఆయువు పట్టుగా మలుచుకుంటారు. సామెతకు అనుగుణంగా ఆధునీకరిస్తారు. “కాలేజీలెక్కువై అబ్బాయిలు అమ్మాయిలు పరస్పరం ప్రేమించుకోడమంటూ ఒకటి ప్రారంభమైన తరవాత ఇప్పుడా బెడద చాలావరకు తగ్గిపోయినట్టే ఉంది…” అంటారు. ఇది కథలో ఒక కీలకమయిన అంశమని మనకి చివరికి గానీ స్పష్టం కాదు. మొత్తం కథంతా ఈ అంశంమీద కేంద్రీకృతమై, పాఠకుడిని ఆందోళనకు గురిచేస్తుంది. అంటే రాజారాంగారు ప్రేమకథలకి వ్యతిరేకి అని కాదుకానీ మానవసంబంధాలు ఆధునికయుగంలో ఎలా మార్పులకు లోనయ్యాయో, వాటి ఫలితాలేమిటో చిత్రించి చూపించారు ఈ కథలో. ఇక రుద్రభూమి అన్న కథలో….కథకులకు సున్నితంగా, సూక్ష్మంగా సలహాలిస్తారు.
“మీరెలా రాస్తారండీ” అని అడిగితే, ఆయనజవాబు, “అదెంత పని లేవోయ్ కన్నారావ్! వ్రాయగలిగిన పేనా ఒకటి చేతిలో ఉండాలి. అందులో సిరా ఉండాలి. ఎవరైనా రాసి పారెయ్యొచ్చు.” ఆ తరవాత మాత్రం ఆయనకి చిన్న బెదురు కలుగుతుంది. “ఈ కన్నారావు కరపత్రాలు, ఆకాశరామన్న ఉత్తరాలు మొదలైనవి రాసేవాళ్ళకున్నూ, కథలు, నవలలు మొదలైనవి వ్రాసేవాళ్ళకున్నూ స్వభావంలో తేడా ఏమాత్రముండదన్నట్టు భావిస్తున్నాడు!” అంచేత వెంటనే, “ఏదైనా వ్రాయాలంటే దండిగా చదవాలోయ్, కన్నారావ్.” అని హెచ్చరిస్తారు. ఎంత బాగా చెప్పారో కదా….ఎంత చదివితే అంత బాగా రాయొచ్చు అని అనిపిస్తుంది ఈ వాక్యాలు చదివాక.
ఇక రాజారాం గారి కథల్లో మరో ముఖ్యమైన అంశం స్త్రీ పాత్ర చిత్రణ. రాజారాం కథల్లో కనిపించే ప్రధాన స్త్రీ పాత్రలన్నీ ఏదో స్ఫూర్తి నిచ్చేవిగానే వుంటాయి. కక్షలు, కార్ఫణ్యాలు మానవ జీవితాలకు ఆంటకాలే కానీ….అభివృద్ధి కావంటూ కొండారెడ్డి కూతురు కథలో నాగతులసి, గాలివీడు నుంచి న్యూయార్క్ దాకాలో సీరజ పాత్రల చేత చాలా చ్క్గా చెప్పిస్తారు రాజారాం గారు. మంచి మాటలు, మంచి మనసులతో ఎటువంటి కరడుగట్టిన వారినైనా మార్చవచ్చిన నిరూపిస్తాయి నాగతులసి, నీరజ పాత్రలు. తనను చంపడానికి వచ్చిన ఇద్దరికి బుద్ధి చెప్పి మంచి వారిగా చేసి…వారికో నూతన జీవితాన్నిస్తుంది నాగ తులసి. అలాగే ఒక ఊరిలో ఇద్దరు పెద్ద మనుషుల మధ్య ఉన్న అగాధాలను తన మాటకారితనంతో మూసుకుపోయేలా చేస్తుంది నీరజ.
ఇద్దరు వ్యక్తులు కొట్టకోవడం వల్ల వచ్చిన నష్టం ఏమిటో అతి తెలివిగా, సున్నితంగా చెప్పి…వారు తప్పు తెలుసుకునేలా చేస్తుంది. ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని ఆటుపోటులెదురైనా తను అనుకున్నది సాధించి పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోనే తెలివైన పాత్ర సబల లోని విశాల పాత్ర. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తను కోరుకున్న వాడినే ఏరికోరి పెళ్ళి చేసుకుంటుంది. అలాగే మిస్ ఎమరాల్డా కథలో తల్లిదండ్రుల ప్రేమకు దూరమై, అనాథలా బతికినా….ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా, విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలకునే విదేశీ యువతి ఎమరాల్డా అంతరంగాన్ని చాలా బాగా ఆవిష్కరిస్తారు. ఇంకా ఇలాంటి మంచి పాత్రలు ఎన్నో ఆయన కథల్లో ఉన్నాయి. రాజారాం కథల్లో ఎన్నో స్త్రీ పాత్రలు మనల్ని పలకరించినట్లు వుంటాయి. మనతో కలిసి జీవించినట్లు వుంటాయి. మనల్ని సుతిమెత్తగా మందలించి , ప్రేమానురాగాల్ని పంచిపెట్టి అనుబంధాలతో అల్లుకుపోయినట్లు అనిపిస్తాయి. ఎందుకంటే అవి సమాజంలో నుంచీ తీసుకోబడిన పాత్రలే కాబట్టి. ఒక్క మాటలో చెప్పాలంటే మన చుట్టూ వున్న స్త్రీ రాజారాం కథల్లో విభిన్న రూపాల్లోకి , పేర్లలోకి పరకాయప్రవేశం చేసాయా అనిపిస్తాయి.
మొత్తానికి ప్రతి ఒక్క విషయమూ క్షుణ్ణంగా పరిశీలించి, అనేక కోణాలను చక్కగా పరిశీలించి ఆవిష్కరిస్తున్నట్టుంటాయి రాజారాం గారి కథలు. ఎత్తుగడలో, పాత్రచిత్రణలో, సన్నివేశాలు ఆవిష్కరించడంలో, ముగింపులో – ప్రతి పదంలోనూ ప్రతి అక్షరంలోనూ రాజారాంగారి ముద్ర కనిపిస్తుంది. ఇతరులకు సాధ్యం కానిది, తనకు మాత్రమే సొంతమైన…అద్భుతమైన ముధ్ర అది. ఇతివృత్తాల్లో వైవిధ్యం, పాత్రచిత్రణలో పరిపూర్ణత, కథనరీతిలో అసదృశమైన పోకడలు రాజారాంగారి కథలని తెలుగు కథాసాహిత్యంలో ప్రత్యేకంగా, విడిగా నిలబెడతాయి. ఆధునికతకు పట్టం కడుతూనే… స్నేహ ధర్మాన్నీ , మానవధర్మాన్ని మర్చిపోవద్దు అంటూ తన కథల ద్వారా మధురంగా చాటి చెప్పారు మధురాంతకం రాజారాం గారు.
*
తాజా కామెంట్లు