బోయి భీమన్న ‘పైరుపాట’లో ప్రణయతత్త్వం

ప్రగతిశీల కవితావికాసయుగంలో చైత్యచోదనకు, సామాజిక న్యాయసాధనకు కృషిచేసిన బోయి భీమన్నగారి ‘పైరు పాట’ నృత్య సంగీత గేయరూపకం రచితమై ఇప్పటికి యాభై సంవత్సరాలు కావస్తున్నది. స్వాతంత్ర్యోద్యమం సఫలమైన దశాబ్దినాటి జాతీయ భావస్పందాన్నీ, ఆనాటి అభ్యుదయ కవిత్వాదర్శాలనూ పరిణామక్రమంలో మారుతూ వచ్చిన నేటి సామాజిక వాస్తవికతా దృగ్విషయంతో సరిపోల్చి, ఆ రచన కాలప్రవాహంలో ఎంతవరకు ఎదురీదినదీ పరిశీలిస్తే – దానికి సాహిత్య చరిత్రలో రాదగినంత గుర్తింపు ఈనాటికీ రాలేదనే అనిపిస్తుంది. కవి జీవితకాలంలో వెలువడిన వివాదాస్పద అనుకూల ప్రతికూల విమర్శలు రెండింటికీ అతీతంగా – కవి జీవితాని కంటె సుదీర్ఘమైన కావ్యజీవితాన్ని సమీక్షించి, గుణావగుణాల నిగ్గు తేల్చవలసిన సమయం ఇది. ఆయన సౌందర్యదర్శనాన్ని అధికరించి, సృజనవిజ్ఞానాన్ని ఉపలక్షించి, ప్రగతిశీల కాల్పనిక నవ్యకవిత్వోద్యమ కవులలో ఆయన స్థానాన్ని నిర్ణయింపవలసిన అవసరం ఉంది.

‘పైరు పాట’ తెలుగులో ప్రణయతత్త్వ ప్రతీకీకరణను అభ్యుదయాదర్శాలతో ప్రవేశపెట్టిన ప్రప్రథమ గేయనాటిక. మొదట ‘స్నేహ’ అన్నపేరుతో ఆకాశవాణిలో ప్రసారితమై, ఆ తర్వాత ‘స్నేహసుందరి’ అన్నపేరిట ఒక వారపత్రికలో ప్రకటితమైంది. ముద్రణ నాటికి ‘పైరు పాట’ అన్న నాట్యరంగప్రదర్శనీయమన్న సాంకేతికతతో వినూత్నాభిధానాన్ని సంతరించుకొన్నది. భీమన్నగారు మానవతావాదానుసారం గాంధీయుగచైతన్యంతో రచనలు చేస్తూనే కాల్పనికచైతన్యాన్ని అభిమానించారు. సంప్రదాయబలాన్ని తమ కవితాప్రక్రియలకూ, సిద్ధాంతాలకూ అండదండలుగా నిలుపుకొన్నారు. కాల్పనిక కవితాచైతన్యంలోనూ, సామ్యవాద వాస్తవికతలోనూ స్వీయానుభవాల నేపథ్యాన్ని గుర్తుపట్టారు. ఆ దర్శనసారాన్ని సొంత గొంతుకతో ఆలపించారు. దేశికవితారీతులను అభ్యసించి, తెలుగుదనానికి వెలుగునిచ్చే ప్రక్రియలను మాత్రమే తమ అభివ్యక్తిదీపికలుగా మలచుకొన్నారు. ఆ సంస్కారమంతా ‘పైరు పాట’లో రూపుదిద్దుకొంది. “ఇది నృత్యగాన సాహితి, బ్రదుకున సుఖమిచ్చు పదసరస్వతి, ప్రేమాస్పద…” అని విశ్వశ్రేయం తమ కవితాలక్ష్యమని, ప్రేమ తమ కవిత్వానికి ప్రాణప్రదమని చాటిచెప్పారు.

999394_382232561881202_503972310_n

‘పైరు పాట’కు రంగస్థలం భీమన్నగారికి బాల్యంనుంచి సుపరిచితాలైన గోదావరీతీరంలోని పైరుపొలాలు. ఈ రూపకంలో కథానాయిక స్నేహ ఒక మాల పిల్ల. పేదరికంలో పెరిగి పెద్దయిన యువతి ఆమె. పైరుచేల గట్లలో పచ్చగడ్డి కోసుకొనేందుకు ప్రతిసాయంత్రమూ పొలాల్లోకి వస్తుంటుంది. ఒక కామందు ఇంట్లో పాలేరుతనానికి కుదురుకొంటుంది. యజమాని ఇంటిపనులు నిర్వర్తించడం, పశువుల మేతకోసం ప్రతిరోజూ పంటపొలాల్లో తిరిగి గడ్డి కోసుకొని ఇంటికి తిరిగివెళ్ళటం, పంటతల్లి అందాలకు ఆనందించటం ఆమె దినచర్య. శీల ఆమె స్నేహితురాలు. ఆమెకూడా ఒక కామందు ఇంట్లో పనికి కుదిరినదే. శ్రీవత్స అనే అగ్రకుల విద్యావంతుడు ఆ పొలాల్లోనే షికారుకు వచ్చి స్నేహను చూసి ఆమెతో స్నేహం చేస్తాడు. ఇద్దరి మనస్సులూ ఆకర్షణకు లోనై, స్నేహం ప్రణయంగా మారటాన్ని భీమన్నగారు చాలా సున్నితంగా చిత్రించారు. శీల తన స్నేహితురాలి చిత్తవిభ్రమాన్ని గుర్తించి ఆమెను హెచ్చరిస్తూ ఉంటుంది. స్నేహ తాను గతి తప్పుతున్నానేమో అని భయపడుతుంది. ఎంత అభ్యుదయవాది అయినా అగ్రకులస్థుడు, గొప్పోళ్ళ బిడ్డ అయిన శ్రీవత్స తనను పెళ్ళి చేసుకుంటాడో లేదో అని కలవరపడుతుంది. అందనిదానికోసం ఎగబడుతున్నానేమో అని వెనకాడుతుంది. తన మనస్సును కట్టడి చేసుకొనే ప్రయత్నంలో అతనికి కనబడటం మానేస్తుంది. శీల అయోమయంలో పడుతుంది. శ్రీవత్సకు ఆందోళన కలుగుతుంది. శీలను అడిగి విషయం తెలుసుకొని ఆమె అనుమానాలను, అభ్యంతరాలను పరాస్తం చేసి స్నేహను పెండ్లిచేసుకొంటాడు.

‘పైరు పాట’ రూపకంలో అంకవిభాగానికి మారుగా భీమన్నగారు రంగవిభాగాన్ని అభిమానించారు. ఆ రంగాలు కాలగమనాన్ని సూచించేందుకు మాత్రమే పరికరించాయి. మొదటి ఆరు రంగాలకూ దృశ్యం ఒక్కటే. పచ్చని పైరుపొలం. చివరి రంగంలో నైపథ్యయవనికపై కల్యాణవేదికగా ఒక కుటీరాన్ని చిత్రించటమొకటే మార్పు. పుష్యమాసపు చల్లనివేళలో అననుభూతరతోత్సవులైన నాయికానాయకులు స్నేహ – శ్రీవత్సల మనస్సులలో ప్రేమభావం మొలకెత్తి, అంతలోనే మొగ్గతొడిగి, పూవై పూచి, నిండుగా పండి, పరిపక్వమవుతుంది. మొదట్లో స్నేహ శ్రీవత్సను విమర్శనాదృష్టితో చూస్తుంది. ఉన్నతవిద్యావంతుడైన అతని ప్రేమనిర్భరమైన వాక్యజాతంలోని గంభీరిమ అర్థం కాకపోయినా, క్రమంగా అదే భాషలో అతనికి జవాబు చెప్పటం నేర్చుకొంటుంది. ఆ అభ్యుదయపరిభాష ఆమెకు అలవడటం రూపకంలోని భావశబలతకు పరాకాష్ఠ.

మొదటి రంగంలో నాయికానాయకులకు పరస్పరాకర్షణ సిద్ధిసాధనను పొందినా శ్రీవత్స యెడ స్నేహ ఆభిముఖ్యం రెండవ రంగం దాకా అభివ్యక్తం కాలేదు. ఎంత ప్రార్థించినా ఆమె అతనికి తన పేరుచెప్పదు. శరణ్యాంతరం తోచక అతను తన స్నిగ్ధభావసూచకంగా ఆమెకు ‘స్నేహ’ అని పేరుపెడతాడు. అది ఆమె వాస్తవనామమై ఉండటం రూపకంలోని చిత్రకల్పనాకృతులలో ఒకటి. కథాసంవిధానంలో ‘పైరు పాట’పై కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం నాటకప్రభావం అడుగడుగున గోచరిస్తుంది. సంవాదశిల్పంలో రాయప్రోలు జాడలున్నాయి.

భీమన్నగారు ప్రతిపాదించిన ‘రసాద్వైత సిద్ధాంతం’ కూడా రాయప్రోలు ‘అమలిన శృంగార’ సిద్ధాంతానికి శాఖాంతరితమే. కాళిదాసు కావ్యకళాకమనీయదృశ్యాలను రమ్యంగా ఆధునీకరించారు. దుష్యంతుడు శకుంతలను చూసినప్పటి పుష్పోపమానమే ఈ కథలోనూ శ్రీవత్సకు స్నేహను చూసినప్పుడు స్ఫురిస్తుంది. “పచ్చపచ్చని పైరుచేలో, విచ్చివిచ్చని వింతపువ్వా!, నీకు నాకూ ఇంత దవ్వా, రేక విప్పగదే!” అన్న చరణంతో వారి ప్రేమకు అంకురార్పణ జరుగుతుంది. కాళిదాస నాయకుని వలెనే శ్రీవత్స స్నేహను గురించి, “ఎవరామె! ఎక్కడ పు, ట్టిందామె? ఏమిటి నే, ర్చిందామె? ఏమిటామె, స్థితిగతులు?” అని శీలను ప్రశ్నిస్తాడు.

శీల పాత్రనిర్మాణం అచ్చంగా శాకుంతలంలోని అనసూయ పాత్రనిర్మితికి తులనీయంగా సాగింది. రూపరూపణలో ప్రకృతికి కూడా మానవీయతాప్రకల్పనం, మనోవస్థానురూపమైన స్పందన, భావశబలత శాకుంతలంలో వలె ఇందులోనూ ప్రాకామ్యస్థితిని పొందాలని కవి ప్రయత్నించారు. నాయికానాయకుల ప్రణయసాఫల్యానికి పచ్చని పంటచేలు పరవశించి శ్యామలించిన సస్యాలతో ప్రాభాతిక మంగళగీతాన్ని వినిపించే సన్నివేశం మూలాన ‘పైరు పాట’ అన్న కావ్యనామం అర్థవంతంగా అమరింది.

Pairu Pata Cover Page

కాళిదాసు ప్రభావానికి ‘పైరు పాట’లో ఇంకా ఉదాహరణలను చూడవచ్చు. “పంపరమ్మ దీవించి, పచ్చని లతకూనలార!, పైరుగాలి సందిట్లో, పవళించిన పైరులారా!” అన్న దళం ‘అనుమతగమనా శకుంతలా, తరుభిరియం వనవాసబంధుభిః” అన్న కణ్వ మహర్షి వచనానికి ప్రతిరూపమే. “క్షితిరుహములార! పుష్పితలతికలార!, అనుమతింతురు గాక కల్యాణయాత్ర” అన్న పినవీరన శాకుంతలానువాదం (4-93) చూడండి. “ఎన్ని రాత్రు లీ యొంటరి, తిన్నెపైని కూర్చుండి, నా మది మడతలను విప్పి, మీ ముందర పరచితినో” అన్నది శాకుంతలంలోని “అమీ వేదిం పరితః లుప్తధిష్ణ్యా” అన్న కణ్వమహర్షి వచనానికే అనురణనం. శాకుంతలంలో వలె ‘పైరు పాట’ లోనూ ఏడే అంకాలున్నాయి. కథానాయిక స్నేహ శీలసౌందర్యాన్ని ఉద్దీపింపజేయటానికి భీమన్నగారు వివిధ రసభావాలను శాకుంతలంలో వలెనే ముగ్ధా శృంగారానికి పరిపోషకంగా ప్రవేశపెట్టారు. జానపదుల పవిత్ర ప్రణయానికి ప్రతీకగా శిల్పీకరించారు.

‘పైరు పాట’ సాహిత్యవిజయాన్ని సాధించిన చాలా సంవత్సరాల తర్వాత భీమన్నగారు “రసభావపుష్కలమైన కవితాసౌందర్యానికిది పరాకాష్ఠ” అని స్వయంగా తానే తన జ్ఞాపకాలను స్వీయచరిత్ర ‘పాలేరు నుంచి పద్మశ్రీ దాకా’లో నిండైన సంతృప్తితో నెమరువేసుకొన్నారు. “చిత్తంలో ప్రతిదెబ్బా, సుత్తి దెబ్బగా మలచిన, మానవతామూర్తిని మించి, మహితశిల్ప మేమున్నది?” అన్న దళాన్ని ‘పైరు పాట’లో ఉదాహరణీయమని శిరోవతంసీకరించారు. ప్రముఖ విమర్శకులు శ్రీవాత్సవ గారు ఆ రోజుల్లో దీనినొక విశిష్ట కావ్యవిశేషంగా, కవితా పూజాకుసుమంగా భావించారు. మానవతలో మహోన్నతిని చూపి, దానిని ప్రకృతిలో ప్రతిబింబింపజేసిన గేయకృతిగా ‘పైరు పాట’ను అభివర్ణించారు.

ప్రణయతత్త్వ ప్రతీకీకరణం

ప్రణయాన్ని ప్రతీకీకరించే లక్ష్యంతో వ్రాసినందువల్ల ‘పైరు పాట’లో సామాజికవైరుధ్యాలు, జీవితంలోని ఉత్థానపతనాలు, నిమ్నోన్నతాల భావసంఘర్షణ చిత్రణకు రాలేదు. ఇతివృత్తం కులాంతరవివాహమే అయినప్పటికీ – కులాల మధ్య ఏర్పడిన అడ్డుగోడలు ఇందులో నిజంగా అవరోధాలు కాలేదు. స్నేహ ఆందోళన, శీల హెచ్చరిక నిజానికి ఏ కులానికి చెందిన యువతికైనా వర్తించేవే. నాయిక ఇందులో శాకుంతలంలో జరిగినట్లు వివాహపూర్వపు వర్తనఫలితంగా మానసికోద్వేగానికి, ఒడిదుడుకులకు గురికాలేదు. సమాజం కాని, సంప్రదాయం కాని వీరి స్వచ్ఛందప్రేమకు అడ్డుపడలేదు. తల్లిదండ్రుల మందలింపులు, కులాల అంతరాలు చర్చకు రాలేదు. ఈ ఎన్నుకొన్న సంవిధానాన్ని బట్టి ఏ సందేశమూ ఇందులో లేదు. ఈ కథలో లాగా మనసారా ప్రేమించుకొన్న యువతీయువకులందరూ ఏ కష్టాలూ, కన్నీళ్ళూ లేకుండా నిజంగా హాయిగా పెళ్ళిచేసుకోగలిగితే ఎంత బాగుంటుంది! జీవితం ఇలాగే ఉంటే ఎంత ఆదర్శవంతంగా ఉంటుంది! అనిపించటమే ‘రొమాంటిక్ టైపిఫికేషన్’ అన్న ఈ ప్రణయతత్త్వ ప్రతీకీకరణ పరమోద్దేశం. స్వచ్ఛమూ, స్వచ్ఛందమూ, విమలమూ, విషాదరహితమూ అయిన ఇటువంటి ఆదర్శ మానవసంబంధాన్ని నెలకొల్పటమే విప్లవోద్యమం పార్యంతికఫలమని 1939లో మాక్సిం గోర్కీ రష్యన్ సాహిత్య చరిత్ర ‘ఇస్తోరియా రూస్కోయ్ లితెరతురీ’లో నిర్దేశించాడు. “వాస్తవికజగత్తులో లేని అపూర్వమైన అనుభవాన్ని ఆదర్శంగా లోకానికి అందివ్వడమే కాల్పనిక సాహిత్యోద్యమ లక్ష్యం” అన్నాడు. దీనినే మరికొంత విపులీకరిస్తూ ఎ.కె. ద్రెమోవ్ తన ‘రొమాంటిక్ టైపిఫికేషన్’ అన్న వ్యాసంలో, “సామాజికపురోగమనానికి దోహదం చేసే నూతనస్వప్నాలను కల్పనాజగత్తులోనికి తీసుకొనిరావటం నవ్యసాహిత్య సంప్రదాయాలలో ఒకటి” అని మరింత స్పష్టం చేశాడు. ప్రణయతత్త్వ ప్రతీకీకరణలోని అభ్యుదయాదర్శం వర్తమానం అనే పునాదిపైని ఒక నవసమాజాన్ని నిర్మించటమే” అని చాటిచెప్పాడు.

“వర్తమానపరిస్థితుల పట్ల అసంతృప్తిని కాల్పనిక రచయిత అభ్యుదయ కళాదర్శంగా పరివర్తించి, వాస్తవజగత్తులో చోటుచేసుకోనున్న అనివార్య పరిణామాలను సాహిత్యంలో ఘటితాంశాలుగా నిరూపించటం జరుగుతుంది. ఆ ఆదర్శానికి స్పష్టమైన రూపం లేనప్పటికీ, అందులో సంభావ్యత లోపించినప్పటికీ ఆగామి యుగంలోని దృగ్విషయాలన్నీ పాఠకులకు దృష్టిగోచరం అవుతాయి. కళాప్రపంచం లోని ఆ రసాత్మకత సమ్మోహకంగా భాసించి, సమాజం దానిని వాస్తవీకరించాలనే ప్రయత్నాన్ని మొదలుపెడుతుంది. సంఘజీవితంలో మార్పులు వస్తాయి. మానవప్రవృత్తి సంకుచిత స్వార్థం నుంచి విడివడి విశ్వశ్రేయోభిముఖంగా ప్రయాణిస్తుంది.”

అని ద్రెమోవ్ పేర్కొన్న సంవిధానమే, యాదృచ్ఛికమే అయినప్పటికీ భీమన్న గారి అసంకీర్ణచిత్రీకరణలో ప్రస్ఫుటిస్తుంది. ఈ అభ్యుదయాదర్శానికి అనుభూతి కవితారూపాన్ని ఇచ్చినందువల్ల ‘పైరు పాట’లో “కష్టానికి ఫలమేమిటి, కన్నీరొక్కటి తప్ప, ఇచ్చేవాడినే దోచి, పుచ్చుకుంటదీ లోకం. / మేడలు మిద్దెలు ఉన్నా, మెత్తని పానుపు లున్నా, హృదయం లేకున్నప్పుడు, వృథయే కద బ్రతుకంతా.” వంటి పంక్తులకు నివేశం ఏర్పడింది. కథాశిల్పం, పాత్ర మనోధర్మవిశదిమ, సంవాదశైలి మొదలైనవన్నీ ఈ మార్గానుసారం ప్రవర్తిల్లాయి.

సంగీత నృత్య నాటికగా ప్రదర్శనీయరూపాన్ని సంతరించుకొన్నందువల్ల ‘పైరు పాట’ భావుక మనోధర్మానుసారం స్వరప్రస్తారానికి, రాగవిస్తారానికి, రంగభూమిపై తాళమాధురికి జీవకళను ప్రసాదించే నృత్యాభినయకల్పనకు అనువైన గతిలో సలక్షణంగా సాగింది. సామాజికవాస్తవికతను అభ్యుదయాదర్శాలకు అనుగుణంగా మలిచి, భావిసమాజం తీరుసౌరులు ఈ విధంగా ఉంటాయన్న కాల్పనికచైతన్యాన్ని తెలుగులో ప్రప్రథమంగా ఆవిష్కరించింది. “కాలంతోపాటు సమాజమూ, సమాజంతోపాటు సాహిత్యరీతి, దానితోపాటు విమర్శనాపద్ధతీ పురోగమించాలి. అందుకు దేశం నోచుకోలేదు” అని భీమన్న గారు బాధపడ్డారు. “మళ్ళీ గుచ్చుకొన్నా తీగ లొత్తిగించి చూడగలవారికి ఆకుల మాటున అరుణకాంతులు వెదజల్లే పుష్పాలు లభింపకపోవు” అని భవభూతి లాగా ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఆ సహృదయధర్మానికి సమానధర్ములకు స్వాగతం!

-ఏల్చూరి మురళీధరరావు

murali

ఏరీ ఆ శబ్దవిధాతలు నేడు !?!

murali

గతితార్కికభౌతికవాదప్రభావఫలితంగా తెలుగులో ప్రగతిశీలకవిత్వం వెలువడసాగిన తొలిరోజులలోనే అభ్యుదయకవులు ప్రచారంలో ఉన్న పెక్కు పదాలకు ప్రవాహవేగంతో ముంచెత్తుతున్న నవీనభావాల అర్థసమర్పకశక్తి లేదని గ్రహించారు. సంప్రదాయధోరణిలో ధారుణిలో బలంగా వేరూని నిలిచిన ప్రతీకలకు కొత్తరంగులద్ది, రాజకీయరూపచిత్రాలుగా పరివర్తించి, వాటికి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ పౌరాణికశైలితో కాలానుగుణమైన నూత్నపరిభాషను కల్పించుకొని అజరామరమైన పదబంధా లెన్నిటికో నవ్యవిధాతలై రాణించారు. “క్రొత్త పాతల మేలి కలయిక”గా గురజాడతో ప్రారంభమైన ఈ మార్గాన్ని సుగమీకరించి భావకవులు “మామిడికొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిల, స్వామికి మ్రొక్కి” అభినవధ్వనిధారణకు ఉద్యమింపగా – అభ్యుదయకవులు “సకలప్రజాసముద్ధర్త, సుప్తోద్ధృతజీవశక్తి”తో ఉత్తుంగ ప్రగతిశిఖరాల నుంచి నవ్యజలపాతాలను ప్రవహింపజేశారు. కావ్యదృష్టి ఒకరికి అనంత రసవృష్టి, మరొకరికి దురంత ఖడ్గసృష్టి. ఈ అద్యతనుల అనర్ఘమైన కృషి ఫలితంగా భావంలోనే కాక భాషలోనూ సరికొత్త మార్పులేర్పడి ఆకర్షణీయమైన పదసంపద చిరస్మరణీయంగా వెలసి విలసిల్లింది. ఆ నవీన గద్గదనదద్గోదావరీవారి తెలుగువారి ఆలోచనాక్షేత్రాలను సస్యశ్యామలం చేసింది. కవుల పేరు వింటే కవితలూ, కావ్యాల నామధేయ రూపధేయాల కంటె ప్రచార భేరీభాంకారాల భాగధేయమే కనుపిస్తున్న కాలంలో ఉన్నాము మనం. కవికీ, కవిత్వానికీ నిలకడ లోపించింది. “నిత్యవేగి నా, చిత్తము; శబ్దమేరుటకు చిన్నము నిల్వదు!” అన్నారు కాని, విశ్వనాథ కావ్యసరణి ఇరవైయవ శతాబ్ది సాహితికి ప్రాణంపోసిన సంధానకరణి. ఆ సంజీవనీశక్తి కుశలకరాంగుళులలో రూపుదిద్దుకొని సాహిత్యసౌహిత్యికుల నాలుకలపై నాట్యం చేస్తున్న శైలీశైలూషి అందచందాలు అన్నీ ఇన్నీ కావు. సంప్రదాయకవిత్వపు గౌరీశంకరశిఖరం మీద నిలిచి విశ్వనాథ “జీవుని వేదన” సృజించి వ్యాపింపజేసిన అనల్ప కల్పనాశిల్ప శాలీనతకు దీటుగా శ్రీశ్రీ నేతృత్వంలోని అభ్యుదయకవిత్వంలో “మరోప్రపంచం” నేలకు దిగివచ్చింది.

జీవితచరమసంధ్యాసమయంలో ఉన్న చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారిని కవిత్వలక్షణం ఏమిటని శ్రీశ్రీ అడిగితే ఆయన అన్నారట: 1) రమ్యాక్షరనిబంధం వల్ల కంఠవశం కాగల రచన 2) జాతీయజీవనస్రవంతిలో నుంచి వేణికలల్లిన సన్నివేశాలతో మననం చేసుకోవటానికి అనువయిన పదసంచయనం 3) ధారావిశుద్ధి మూలాన రసనాగ్రనర్తకిగా ఉండటం.

శాస్త్రిగారు చెప్పిన ఆ మూడు లక్షణాలూ పదపరివృత్తిని బట్టి వస్తుతః సమానార్థబోధకాలే అయినా వాటిలో కొంత ఛాయావిభేదం లేకపోలేదు.

రమ్యాక్షరనిబంధమన్నది కవితాశైలికి సంబంధించిన మసృణత్వం. అది సందర్భవశమే కాని సర్వకాల సర్వావస్థాగతం కాదని పొరబడకూడదు. ‘రమ్యత’ అంటే పాఠకుడు ఒక రచనను చదివిన కొంతకాలం తర్వాత దానిని మళ్ళీ అధ్యయనం చేసినప్పుడు – ప్రతిపాద్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగలగటం వల్ల, జీవితంలో తాను పొందిన సుఖదుఃఖాల అనుభవపరిణామం వల్ల, ఆత్మసంస్కారం వల్ల ఆ రచన మరింత కొత్తగానూ, మరింత దీప్తంగానూ భాసించే స్వభావాన్ని కలిగి ఉండటం అన్నమాట. కవియొక్క ప్రతిభాశక్తి కాలాంతరంలోని పాఠకుల అవగాహన పరిధికంటె ఎన్నోరెట్ల గాంభీర్యౌన్నత్యాలతో విలసిల్లితే గాని ఆ రమ్యాక్షరనిబంధం సాధ్యం కాదు. కవి ఎన్నెన్ని పూర్వజన్మలలో ఆరాధించి ఎంతమంది మహాకవుల నుంచి మూటగట్టి తెచ్చుకొన్న పుణ్యఫలమో అది!

కవిత్వాన్ని జాతీయ జనజీవనస్రవంతిలో నుంచి వేణికలల్లిన సన్నివేశాలతో విశ్వజనీనంగా తీర్చిదిద్దాలన్న ఆదర్శంలో కవి మనీషిత, లోకహితైషిత గోచరిస్తాయి. వేణికలల్లటం కేవలం ఆఖ్యానశిల్పానికి పరిమితమైన ఔపచారిక శబ్దప్రవృత్తి కాదు. కథాగతులైన వ్యక్తుల శీలౌన్నత్యానికి, శీలభ్రష్టతకు కారణాలేమిటో నిరూపించి, లోకానికి ఉపదేశప్రాయమైన రచనను చేయగలగటం అన్నమాట. ఆ రచనకు మూలాన్ని జాతీయ జనజీవితాలలో నుంచి తీసుకోవటం వల్ల పాఠకుడు తన జీవితాన్ని దానితో సరిపోల్చుకొని, తన జీవితానికొక గమ్యాన్ని, ఒక ఆదర్శాన్ని కల్పించుకోగలుగుతాడు. కవిత్వ రచనోద్దేశం ఆ ఆదర్శకల్పనల ఫలమైన సమాజాభ్యుదయమే. ఒక్కొక్క యుగంలో పరిభాష మారుతుందే కాని పార్యంతికఫలశ్రుతి అదే.

ధారాశుద్ధి అంటే వర్షామేఘం నుంచి తెంపు లేకుండా స్రవించే నీటిచాలు లాగా కవిత్వం పరిశుద్ధమైన పదసంపదతో హాయిగా సాగిపోవటం. పద్యమైనా, గేయమైనా పాఠకులకే గాక రచించిన కవికి సైతం గుర్తుండని స్థితి ఏర్పడటానికి కారణం ఈ ధారావిశుద్ధి లోపమే. ఈ ధారావిశుద్ధి స్వస్వరూపంతో చదువరుల గుండెలకు హత్తుకొనిపోవాలనే విశ్వనాథ వారు కావ్యరచనావేళ ఒక పూర్తి సన్నివేశాన్ని పూర్తిగా మనస్సులో కూర్చుకొన్నాక లేఖకునికి చెప్పి వ్రాయించటం జరిగేది. అజంతా గారు ఒక గేయం పూర్తిగా మనస్సులో నిలిచిపోయిన తర్వాత దానిని ఎన్నోమార్లు నెమరువేసుకొని, ధారణను సరిచూసుకొని, నిబ్బరంగా కుదిరిందని అనిపించిన తర్వాతనే ఆ నిరాకార శబ్దస్రవంతిని కాగితం పైకి ప్రవహింపజేసేవారు. చెళ్ళపిళ్ళ వారికీ, శ్రీశ్రీకీ, ఎంతోమంది మహాకవులకూ అభ్యస్తపూర్వమైన కవితా రచనా దృగ్విషయం అది.

viswa

అనువాదాలపై ఆధారపడక స్వతంత్రావిర్భావవికాసాలను కలిగివుండటం కూడా ఉత్తమకవిత్వపు సాముద్రికలక్షణమని వెంకటశాస్త్రి గారు సూచించారట.

రూపానికి ప్రాధాన్యం ఇచ్చి వస్తువు విషయాన్ని ప్రసక్తింపలేదని ప్రథమదృష్టికి భాసింపవచ్చును గాని, ప్రతిపాద్యవస్తువుకు చిరంజీవిత వెంకటశాస్త్రిగారు అనుభవపూర్వకంగా చెప్పిన స్మరణయోగ్యత వల్లనే సిద్ధిస్తుందనేది అందరికీ తెలిసిన సత్యమే.

భావికాలికాకాంక్ష లేని కవిత్వానికి భవిష్యత్తు సంకోచప్రదమని శ్రీశ్రీ తరచు అంటుండేవారు. అపురూపమైన ఆ సగుణశక్తిసాధన తోనే శ్రీశ్రీ తనకాలంనాటి మూడు తరాలకు నాయకత్వం వహింపగలిగారు. అభ్యుదయకవులు ఆయనను శబ్దబ్రహ్మగా ఆరాధించి, అనుకరించి, పదికాలాలపాటు పదిలంగా నిలిచే పదబంధాలెన్నిటినో కవిత్వపరిభాషలో నియతంగా నిలిపారు. ఆయన ప్రకల్పించిన శబ్దపు తంత్రులను మ్రోగించి, నూతనస్వరాలను పలికించి, ఆత్మీయాదర్శాలతో జాతి అంతరంగసంగీతాన్ని వినిపించారు.

అభ్యుదయకవిత్వావిర్భావదశకం

గతితార్కికభౌతికవాదప్రభావఫలితంగా తెలుగులో ప్రగతిశీలకవిత్వం వెలువడసాగిన తొలిరోజులలోనే అభ్యుదయకవులు ప్రచారంలో ఉన్న పెక్కు పదాలకు ప్రవాహవేగంతో ముంచెత్తుతున్న నవీనభావాల అర్థసమర్పకశక్తి లేదని గ్రహించారు. సంప్రదాయధోరణిలో ధారుణిలో బలంగా వేరూని నిలిచిన ప్రతీకలకు కొత్తరంగులద్ది, రాజకీయరూపచిత్రాలుగా పరివర్తించి, వాటికి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ పౌరాణికశైలితో కాలానుగుణమైన నూత్నపరిభాషను కల్పించుకొని అజరామరమైన పదబంధా లెన్నిటికో నవ్యవిధాతలై రాణించారు. “క్రొత్త పాతల మేలి కలయిక”గా గురజాడతో ప్రారంభమైన ఈ మార్గాన్ని సుగమీకరించి భావకవులు “మామిడికొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిల, స్వామికి మ్రొక్కి” అభినవధ్వనిధారణకు ఉద్యమింపగా – అభ్యుదయకవులు “సకలప్రజాసముద్ధర్త, సుప్తోద్ధృతజీవశక్తి”తో ఉత్తుంగ ప్రగతిశిఖరాల నుంచి నవ్యజలపాతాలను ప్రవహింపజేశారు. కావ్యదృష్టి ఒకరికి అనంత రసవృష్టి, మరొకరికి దురంత ఖడ్గసృష్టి. ఈ అద్యతనుల అనర్ఘమైన కృషి ఫలితంగా భావంలోనే కాక భాషలోనూ సరికొత్త మార్పులేర్పడి ఆకర్షణీయమైన పదసంపద చిరస్మరణీయంగా వెలసి విలసిల్లింది. ఆ నవీన గద్గదనదద్గోదావరీవారి తెలుగువారి ఆలోచనాక్షేత్రాలను సస్యశ్యామలం చేసింది.

కవుల పేరు వింటే కవితలూ, కావ్యాల నామధేయ రూపధేయాల కంటె ప్రచార భేరీభాంకారాల భాగధేయమే కనుపిస్తున్న కాలంలో ఉన్నాము మనం. కవికీ, కవిత్వానికీ నిలకడ లోపించింది. “నిత్యవేగి నా, చిత్తము; శబ్దమేరుటకు చిన్నము నిల్వదు!” అన్నారు కాని, విశ్వనాథ కావ్యసరణి ఇరవైయవ శతాబ్ది సాహితికి ప్రాణంపోసిన సంధానకరణి. ఆ సంజీవనీశక్తి కుశలకరాంగుళులలో రూపుదిద్దుకొని సాహిత్యసౌహిత్యికుల నాలుకలపై నాట్యం చేస్తున్న శైలీశైలూషి అందచందాలు అన్నీ ఇన్నీ కావు. సంప్రదాయకవిత్వపు గౌరీశంకరశిఖరం మీద నిలిచి విశ్వనాథ “జీవుని వేదన” సృజించి వ్యాపింపజేసిన అనల్ప కల్పనాశిల్ప శాలీనతకు దీటుగా శ్రీశ్రీ నేతృత్వంలోని అభ్యుదయకవిత్వంలో “మరోప్రపంచం” నేలకు దిగివచ్చింది.

srisri-profile

రాయప్రోలు కాల్పనికజీవనదిలో నుంచి తీసిన భావకవితాకుల్యను మళ్ళీ విశ్వనాథ సంప్రదాయజలధిలో కలిపివేయడంతో భావకవితాయుగంలో ఒక సువర్ణావృత్తి పూర్తయింది.

ఆ ఉరవడికి తట్టుకొని స్వీయవ్యక్తిత్వాన్ని నిలుపుకొన్న సామాజిక శబ్దవిధాతలు అబ్బూరి రామకృష్ణారావు, ఉమ్రాలీషా, కృష్ణశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్య, కుసుమ ధర్మన్న, జాషువా, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి కనుపిస్తారు. ఆ తర్వాత శిష్ట్లా, శ్రీశ్రీ, నారాయణబాబులు సృష్టించిన అభ్యుదయ ప్రవర అనిసెట్టి సుబ్బారావు, ఆరుద్ర, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, రెంటాల గోపాలకృష్ణ, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఆవంత్స సోమసుందర్, దాశరథి, బైరాగి, అజంతా, కవిరాజమూర్తి, దేవరకొండ బాలగంగాధర తిలక్ మొదలుకొని కాళోజీ, డా|| సి. నారాయణరెడ్డిల దాకా నిరంతరాయితంగా కొనసాగింది.

బోయి భీమన్న, గుంటూరు శేషేంద్రశర్మ, కోవెల సుప్రసన్నాచార్య, మాదిరాజు రంగారావు, చెరబండరాజు, జ్వాలాముఖి, సుబ్బారావు పాణిగ్రాహి, కె. సత్యమూర్తి, శివారెడ్డి, వరవరరావు, ఇస్మాయిల్, వేగుంట మోహన్ ప్రసాద్, గద్దర్, వంగపండు ప్రసాదరావు, ఓల్గా, ఘంటసాల నిర్మల, పాటిబండ్ల రజని, ముకుందరామారావు, పెన్నా శివరామకృష్ణ, త్రిపురనేని శ్రీనివాస్, ఎండ్లూరి సుధాకర్, అఫ్సర్, యాకూబ్, శిఖామణి, ఖాదర్ మొహియుద్దీన్, సతీష్ చందర్, జూపాక సుభద్ర, గోగు శ్యామల, చల్లపల్లి స్వరూపరాణి, మానస చామర్తి మొదలైన సమాజ ప్రియంభావుక కవులు తమతమ తీరుల కొత్త దారులను అభిమానించి వర్తమాన శరతల్పం మీదికి ప్రగతిశీల నవ్యోక్తివైఖరుల సంజీవనీ కావ్యజలధారను అమృతాయమానంగా తీసుకొనివచ్చినవారిలో కొందరు. వీరిలో పెక్కుమంది తమ వరివస్యతో అభ్యుయానంతర కవితా క్షితిజరేఖలను దిగంతాలకు విస్తరించే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు.cherabandaraju

అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో అనూహ్యమైన వేగంతో మారుతున్న సమాజంలో ఈనాడు కవులు సామాజిక హృదయస్పందనకు నేతృత్వం వహింపలేకపోవటానికి కారణం ఏమిటి? సాహిత్యప్రక్రియలపై ప్రసారసాధనాలు, ప్రచార రాజకీయాల దాడి ఈ మధ్యకాలంలో పదునెక్కుతున్నది. సారస్వతవ్యాపారసంస్థల పురస్కారసంస్కృతి ఈ పతనావస్థకు ప్రతిఫలనం. అన్యభాషలలో వలె కాక తెలుగువారు కవుల చలనచిత్రరంగప్రవేశాన్ని విస్ఫారితనేత్రాలతో తిలకించటం వల్ల ప్రాంతీయ వాణిజ్యావసరాలు సాహిత్యపరిభాషను శాసించటం మొదలయింది. నిర్ణేతృక సర్వసైన్యాధ్యక్షపదవిని వదులుకొని కవులే బంట్లుగా బానిసతనానికి తలొగ్గుతున్నారు.  విజాతీయధోరణులతో స్వరూపస్థితిని కోల్పోతున్న జాతిని దళితవాదకవయితలు వచ్చి మేల్కొలుపకపోతే నేటి సాహిత్యం పూర్తిగా నిర్నిమిత్తమై, విస్మరణీయావస్థలోకి జారుకొనేదనటంలో అతిశయోక్తి లేదు.

ఓల్గా

ఓల్గా

శ్రీశ్రీ యుగప్రభావం నాటి ప్రతిభావిలసన క్రమంగా పరిమితం కాసాగినందు వల్ల కవులు అల్పప్రాయమైన రూపవాదానికి ప్రాధాన్యమిచ్చి, చిరంతనమైన సమసమాజాదర్శాన్ని గౌణీకరించి, కల్పనాశిల్పాన్ని అనాదరిస్తున్నారు. సాహిత్యికులలో వ్యుత్పత్తిగౌరవం, క్రాంతదర్శిత క్రమంగా సన్నగిల్లుతూ వస్తున్నాయి. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం వైపుకు పరుగులుతీస్తున్నది. అస్తిత్వవాదం నుంచి సంఘటితశక్తిగా ఆవిర్భవించి దళిత బహుజనకవిత్వం సమాజనిష్ఠం అవుతున్న రోజులలో కూడా కవులు వైయక్తికాదర్శాలతో వెలసిన వార్తాపత్రికలే వస్తునిర్దేశికలుగా సరిపెట్టుకొని, జాతిభవితవ్యం పట్ల మౌనం పాటిస్తూ స్వార్థ రాజకీయవిధాతల వేలుపట్టుకొని నడుస్తున్నారు. ప్రజాస్వామిక మానవసంబంధాలకు కట్టుబడిన చైతన్య ధనుష్పాణుల గొంతుక సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకొని ఇంకా బలంగా వినబడుతుందని ప్రజలు బ్రతుకుబాటలో తమకు దారిచూపే శబ్దవిధాతల పాటకోసం వెయ్యికళ్ళతో వేచిచూడక తప్పటం లేదు.

ఏల్చూరి మురళీధరరావు

ఛందోబందోబస్తులన్నీఛట్‌ ఫట్‌ ఫట్‌మని త్రెంచిన…శ్రీశ్రీ !

muraliఛందోవిరహితమైన శబ్దం లేదనీ, శబ్దవర్జితమైన ఛందస్సు ఉండదనీ కవిత్వరచన వ్యవస్థితమైన పూర్వపు రోజులలో “ఛందస్సు లేని కవిత్వ”మన్న ఊహకే ఉపాధి ఉండేది కాదు. గద్యబంధంలో కూడా వృత్తగంధాన్ని సంవీక్షించి గద్యాన్ని ఛందోభేదంగానే పరిగణించిన ఒకనాటి లాక్షణికుల కావ్యశాస్త్రనిర్దేశపు ముత్యాలగొడుగుకింద మన కవులకు ముక్తచ్ఛందమన్న తిరుగుబాటు ఆలోచన రావటానికి అవకాశం లేకపోవటం సహజమే. ఆ అవకాశం మధ్యయుగాలను దాటి ఆధునికయుగంలో ప్రప్రథమంగా పందొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచిభాషలో సంచయించి, గతితార్కికభౌతికవాద ప్రభావం వల్ల సోవియట్ రష్యాలో బోల్షెవిక్కుల విజయానంతరం ప్రపంచకవితారంగంలో చోటుచేసుకొన్న విప్లవాత్మకమైన పరిణామాల కారణంగా వివిధరీతుల విస్తరించింది. ఛందోనియమాలతోపాటు కనీసం గుర్తింపదగిన గతివిధానమైనా లేని కేవల భావలయాత్మకవచనంలో వృత్తరీతి లేని అసమగణాల సంవిధానంతో పదపంక్తులను రూపొందించుకొని కవిత్వరచన చేయవచ్చుననే స్వచ్ఛందధోరణి సరిక్రొత్తగా ప్రచారంలోకి వచ్చి, అచిరకాలంలో ఆ వ్యవస్థ విశ్వమంతటా ప్రాచుర్యాన్ని పొందింది. అందువల్ల వచనానికి చైతన్యస్రవంతి శిల్పం ఎటువంటిదో – పద్యానికి ఛందోముక్త “వెర్స్ లిబర్” అటువంటిదని పాశ్చాత్య లాక్షణికులు భావించారు.

తనకాలం నాటికే ప్రభావశీలమై, భారతీయ కవిత్వంలోకి ప్రవాహవేగంతో చొచ్చుకొనివస్తున్న ఈ ప్రయోగవాదం అవ్యవస్థావాద సిద్ధాంతకర్తల ప్రాయౌగికదృష్టితో ముగ్ధుడై ఉన్న శ్రీశ్రీ దృష్టిని ఆకర్షించటం సహజమే.

 

కమ్యూనిస్టు మేనిఫెస్టో చల్లని గొడుగునీడలో కర్తవ్యస్ఫూర్తిని పొందిన శ్రీశ్రీ ఆ భాషాకవుల మార్గంలో కొత్తదీపాల వెలుగులను చూశారు. దాని ఫలితమే మహాప్రస్థానం కావ్యసృష్టి. ఆ తర్వాతిది ఖడ్గసృష్టి.

 

ఖడ్గసృష్టిలో “ఛందోబందోబస్తు లన్నీ, ఛట్‌! ఫట్‌ ఫట్‌మని త్రెంచి” పారేయాలన్న వచనకవిత్వ మౌలికసూత్రీకరణను శ్రీశ్రీ ‘కొంటెకోణాలు’ గేయంలో అలవోకగా చెయ్యలేదు. శబ్దస్ఫూర్తిని మించిన భావవ్యక్తి అందులో ఉన్నది. శ్రీశ్రీ విశాలమైన వైదుష్యనేపథ్యం ఉన్నది.

 

1928లో శ్రీశ్రీ తొలి పద్యకవితా సంకలనం ‘ప్రభవ’ వెలువడింది. భాషపై ఎంతో ప్రభుత్వాన్ని సంపాదించి, పద్యరచనలో కొంత పరిణతిని సాధించినా – స్వీయవిమర్శ చేసుకోగలిగిన శ్రీశ్రీకి ఆ ప్రస్థానం సంతృప్తి నివ్వలేదు. ఆ సంపుటిలో చేర్చిన

అలఘుధ్వాంతవితానసంభరితరోదోంతర్మహాగహ్వర

స్థలి యంభోనిధి యయ్యె; సంతతజలస్రావాతిరేకంబునన్

విలయాంభోధరఘోషసమ్మిళితగంభీరాట్టహాసధ్వనీ

చలితప్రాకటదిగ్గజుండ వగుచున్ సంప్రీతి నర్తింపుమా శంకరా!

వంటి రచనల కూర్పు వస్తువివేకసాధనకే తప్ప ఆయన అంతరాత్మ అందులో ధ్వనింపలేదు. అందులోని “ధ్వనీచలిత” వంటి వాచకదోషాలను గుర్తింపగల వివేకబోధ ఉన్నవాడు. పౌర్వికుల నీడలో నిలిచి ఉండే నిస్తేజస్వి కూడా కాదు. దానికితోడు తన భావోద్వేజనకు సంప్రదాయకవిత్వంలో ఉన్న పరిమితి కూడా శ్రీశ్రీ గుర్తింపుకు వచ్చింది. ఆ పరిణామవయోవస్థలోని సందిగ్ధావస్థను ఆ తర్వాత ఆయన తన ‘సుప్తాస్థికలు’ కవితలో పరిష్కరించే ప్రయత్నం చేశారు. అప్పుడే మార్క్సిస్టు దర్శన కవితాదర్శనపు మహానిధి ఆయన చేతికి వచ్చింది. సరికొత్త ఛందోవిచితి సాక్షాత్కరించింది. ఆ అభిజ్ఞానం తోనే ఆయన నిగళాలను ఛేదించాలని నిశ్చయించుకొన్నారు.

 srisri

రష్యన్ భాషాచ్ఛందోనైపథ్యం

శ్రీశ్రీకి ఆంగ్లభాషాముఖంగా సోవియట్ సాహిత్యపరిచయం కలిగేనాటికే ఐరోపీయభాషాకుటుంబంలోని రష్యన్ ఛందోరీతులలో సంప్రదాయానువర్తన యుగం ముగిసి ఆధునిక ప్రయోగశకం పరాకాష్ఠకు చేరుకొన్నది. ఫ్రెంచి, జర్మను భాషానువాదాలతోనూ, జానపద సంగీత పరిచయంతోనూ అలెగ్జాందర్ పుష్కిన్ నూతన విద్యాద్వారాలను తెరిచి రష్యన్ ప్రజాజీవితాలలోకి ఆంగ్లేయులకు బైరన్ లాగా ఐరోపీయమారుతపోతాలను ఆహ్వానించాడు.  గెటే కవిత్వంలోని కాలాతీతమైన సౌందర్యదీధితి, షిల్లర్ ఆశావాదంతోడి ఆధ్యాత్మికభావసౌగంధ్యం,  షెల్లీ లలితభావవాదకల్పనాశిల్పంలో భావివిప్లవాల క్రాంతదర్శిత, బైరన్ శృంగారభంగీభణితిలోని అపురూపమైన రాజసం, బ్రౌనింగు ఆత్మాశ్రయధోరణి, హ్యూగో చిత్రణలోని విషాదకిర్మీరాలు, బార్బియర్ కవితలలోని అంతరంగసంగీతం పుష్కిన్ ఆవిష్కరించిన నూత్నచ్ఛందోగతులలోకి అడుగుపెట్టాయి. షేక్స్పియర్ సానెట్టుల విశ్వజనీన కావ్యవిశిష్టపదరచనారీతిని దెల్విగ్, ఓదోవ్‌స్కీ, పోలెజాఫ్‌లు; షెల్లీ కాల్పనికవాద లలితగీత సరణిని లెర్మొంతోవ్ ప్రవేశపెట్టి రష్యన్ ఛందోగతులకు నవీన యుగకర్త లయ్యారు. గొగోల్ నేర్పిన ధ్వన్యాత్మకవిప్లవశీలితను కవిత్వంలో ప్రవేశపెట్టి – పాతబడిన ఛందస్సులలో పరివర్తనను తీసుకొనిరావాలనీ, లేదా వాటిని పూర్తిగా పరిహరించి నవగతినిర్మితిలో స్వేచ్ఛాగానఝరుల సంగీతభంగీతరంగాలను నినదింపజేయాలనీ తుర్గెనీవ్, తొల్‌స్తోయ్ (టాల్‌స్టాయ్)లు ప్రయత్నింపసాగారు. పాశ్చాత్య విద్యాభ్యాసం చేసివచ్చిన నవకవుల ప్రభావంతో చెహొవ్ సమకాలీన జీవితంలోని నైరాశ్యాన్నీ, పాలకుల పతనావస్థనూ, సమాజంలో లోపిస్తున్న ఆదర్శాలనూ గుర్తించి సాహిత్యానికి స్వతంత్ర దిశానిర్దేశం చేయాలని సంకల్పించుకొన్నాడు. అక్షరసంహతిలో ఛందోనియమరహితమైన నవ్యపథాన్ని అభిమానించాడు. ఆ సమయంలో రష్యన్ ఛందోగ్రంథాలలోనూ, ఆంగ్లచ్ఛందస్సులను వివరించే రష్యన్ పాఠ్యపుస్తకాలలోనూ సంప్రదాయచ్ఛందస్సులకు నిరసనగా ప్రొక్రూస్టియన్ బెడ్ అనే కొత్త వైమర్శిక పదబంధం వచ్చి చేరింది.  తనకు మార్గదీపకులైన క్రొపోత్కిన్, బకూనిన్ వంటి అరాచకవాద సామాజిక సిద్ధాంతకర్తల ప్రబోధాల మూలంగా శ్రీశ్రీకి దీని పరిచయం కలిగి ఉంటుంది.

 

ప్రొక్రూస్టియస్ తల్పం

గ్రీకు పౌరాణికగాథల నుంచి సాహిత్యక్రియాకల్పంలోకి ప్రవేశించిన ఆధునిక పదబంధం ఇది. ఏథెన్సు నుంచి ఎల్యూసిస్‌కు వెళ్ళే పవిత్రమార్గంలో ఉన్న కొరిడల్లాస్ పర్వతశ్రేణికి రాజు పొసైడాన్ కొడుకు ప్రొక్రూస్టియస్. వట్టి కుతంత్రపరుడు. అతని వద్ద ఒక మాయాతల్పం ఉండేది. అది ఎటువంటివాళ్ళకైనా సరిగ్గా సరిపోతుందని, దానిమీద పడుకొనేవారికి ఆహ్లాదం కలుగుతుందని అతను ఆ దారిని వచ్చినవాళ్ళను మభ్యపెట్టి దానిపై పడుకోమనేవాడు. ఆ ఆగంతుకులు మంచం కన్నా పొడుగ్గా ఉంటే కట్టుతాళ్ళు బిగించి, వాళ్ళ కాళ్ళుచేతులు అందుకు సరిపడేట్లు నరికి ప్రొక్రూస్టియస్ పైశాచికానందం పొందేవాడు. పొడుగ్గా లేనివాళ్ళ కాళ్ళుచేతులు సాగలాగి తెగనరకటం మాత్రం తప్పేది కాదు. పొట్టివాళ్ళు పడుకొంటే ఆ మంచం మరీ పొట్టిదయ్యేది. కాళ్ళుచేతులు తెగగొయ్యటం తప్పేది కాదు. కాళ్ళుచేతులు నరికినా తప్పులేదు కాని అవి మంచాన్ని మించకూడదని అతని వాదన.

రష్యన్ లాక్షణికులు ఛందస్సును ఈ ప్రొక్రూస్టియన్ మంచం తోనూ, వ్యతిక్రమాన్ని సహింపని ఛందోనియమాలను కట్టుతాళ్ళతోనూ సరిపోల్చటం శ్రీశ్రీ దృష్టిని ఆకర్షించి ఉండాలి. అంతకు మునుపే మయకోవ్‌స్కీ కాల్పనికవాదుల ఆత్మాశ్రయ కృత్రిమాదర్శాలు ఆగామి సామ్యవాద సమాజంలో ప్రొక్రూస్టియన్ శయ్యాగతికి నోచుకోక తప్పదని విమర్శించటం మనకు తెలిసిన సంగతే.

 

గ్రీకువీరుడు థెస్యూస్ వచ్చి ప్రొక్రూస్టియస్‌ను మాటల్లో పెట్టి అదే మంచానికి కట్టి చంపినపుడు – నిజానికి అతని వద్ద రెండు మంచాలున్నాయని, బాధితుల ఒడ్డుపొడుగులను బట్టి వాటిని మారుస్తుండేవాడని రహస్యం బయటపడుతుంది.

 

ఛందోవ్యవస్థలో ఈ రెండే గద్యం, పద్యం అని సంకేతితా లన్నమాట. పద్యానిర్మాణం చేసేవారు పాదాక్షర గణానుసారం సిద్ధిసాధనకు శబ్దంలోని దీర్ఘానికి లేని లఘిమను, లఘువుకు కూడని దీర్ఘిమను కల్పించినా తప్పులేదు కాని, ఛందోభంగాన్ని మాత్రం సహించేందుకు వీలులేదన్న నియమం – “అ‌పి మాషమ్ మషమ్ కుర్యాత్, ఛందోభంగం న కారయేత్” అన్నది ప్రొక్రూస్టియన్ శయ్యాసంస్థితమైన భాష దుఃస్థితికి అద్దం పడుతుంది.

 

లాటిన్ భాషాచ్ఛందోవిధానంలో ఇది మరొక విధంగా ఉన్నది. పాదాంతంలో పదచ్ఛేదం వల్ల సాధించే భావలయకు ప్రొక్రూస్టియన్ లయ అని పేరు. ఇది మన ఛందోనిబంధంలోని అంత్యప్రాస విధివిధానంలో ఉన్నదే. “అందంగా మధురసని / ష్యందంగా …”, “జాతి జాతి నిర్ఘాత పాత సం / ఘాత హేతువై …”, “జగతి మరపు, స్వప్నం, ని / శ్శబ్దం, ఇది …” వంటి పాదాలు ఈ అంత్యప్రాస నియతిలోని వివిధ భావగతులకు ఉదాహరణాలు.

 0148

ఇంగ్లీషులో దీనినే డ్రోలరీ (శబ్దడోలిక = తూగు) అంటున్నాము.  శ్రీశ్రీ ప్రయోగాలలో ఇది విస్తృతంగా కనుపిస్తుంది.

 

శ్రీశ్రీని ప్రభావితం చేసిన మహాకవులలో ఒకరైన ఎడ్గార్ ఆలెన్ పో “ది పర్లాయిన్‌డ్ లెటర్” అన్న కథలో పారిస్ నగర రక్షకభటులు నేరపరిశోధనసమయాలలో సడలింపు లేని చట్టాలకు ఒదిగి, పరిశోధనలో స్వేచ్ఛాసంచారం లేక చేతులు కట్టి పడవేసినట్లు ఉండవలసి రావటాన్ని ప్రొక్రూస్టియన్ తల్పంతో ఉపమించటం కూడా పో అభిమాని అయిన శ్రీశ్రీ దృష్టిపథంలో ఉండే ఉంటుంది.

 

కానీ రష్యన్ లాక్షణికులు పై దృక్కోణాలను అనుసరింపక ప్రొక్రూస్టియన్ తల్పాన్ని కేవలం ఛందోబందోబస్తుల ఏర్పాటుకు పర్యాయపదంగా మాత్రమే పరిగణించారు. ఆ సాహిత్యప్రభావమే శ్రీశ్రీ అమోఘమైన వాక్కులో ఛందోబందోబస్తు లన్నీ, ఛట్‌! ఫట్‌ ఫట్‌మని త్రెంచి  అన్న వచనకవితాగతినిర్దేశక మార్గదీపక పదబంధంగా రూపుదిద్దుకొన్నది.

ఛందస్సుకు అక్షరగతులు, మాత్రానియమాలు కట్టుతాళ్ళన్న ప్రసక్తి లేకపోతే “ఛందో-బందోబస్తు” లన్న రూపణకు పద్యంలో స్థానం లేదు.

 

ఛందోరీతుల కల్పనలో సమకాలీన  తెలుగు కవుల ప్రభావం శ్రీశ్రీపై ఏమీ లేదని ఫలితార్థం. శ్రీశ్రీ సాధించిన ఛందోవిజయవిలాసం వల్ల తెలుగు సాహిత్యం మరింత ప్రజాసన్నిహితమై విశ్వతోముఖంగా వికసించిందనేది చర్వితార్థం.

 

 ఏల్చూరి మురళీధరరావు