మనిషి సంఘజీవి. మనుష్యుల మధ్యనే జీవిస్తూ మానసికంగా ఏకాంత జీవనసౌందర్యాన్ని అన్వేషించగలిగినవారు, అనుభూతం చేసుకోగలిగిన వారు ఋషి తుల్యులౌతారు.నిరంతర గమనశీలత్వం గలిగిన జీవనంలో గుంపులో కాకుండ, ఒక్క ప్రయాణికుని మాత్రమే తోడుగా ఎంచుకోమని, సరైన తోడు దొరకనపుడు ఖడ్గమృగంలా ఒంటరిగానే గమనం సాగించమని బుద్ధుడుపదేశించాడు. అందుకే, జీవితమంతా ఎంతోమందిని కలుపుకుంటూ విడిపోతూ, సరైన తోడుకోసం అన్వేషిస్తూ జీవనగమనాన్ని సాగించే మనిషి, ఏదో ఒక దశలో ఏకాంత జీవన సౌరభాన్ని ఆఘ్రాణించగలుగుతాడు. తామరాకు మీది నీటి బొట్టులా ప్రాపంచికబంధాలకు అంటీముట్టనట్లుగా ఉంటూనే, జీవితాన్ని ఉత్సవంలా తీర్చిదిద్దుకోగలుగుతాడు.
మానవాంతర్గత చీకటికోణాలను ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా మొదలైన త్రిపుర కథారచన, మనిషి, మనీషిగా ఎదగగలిగిన క్రమాన్ని నిర్దేశిస్తాయి. కథలు ఆటోబైయోగ్రఫికల్ గా ఉండాలనీ, రెండురకాల మనస్తత్వాలు లేకుండా, మనం మనతోనే ఇంటర్ రిలేటడ్ గా ఉండాలని నమ్మిన త్రిపుర, తమ కథలను, ఆటోబయోగ్రఫికల్ గా, కన్ ఫెషనల్ గా, ఇంటర్ రిలేటడ్ గా తీర్చి దిద్దారు. తమకు నచ్చని పనిని చేయలేకపోవడం తమ బలం గా కలిగిన త్రిపుర, ‘మనస్సులో కల్మషం ఉంటే దేహానికి జబ్బు ‘ అన్న ప్రాథమిక ఆరోగ్య సూత్రాన్ని గుర్తించిన అపర ధన్వంతరి త్రిపుర, తమను తాము క్షాళన చేసుకుంటూ ఎదిగిన క్రమాన్ని ఆయన కథలు చెప్తాయి.
* * *
—డా. రాయదుర్గం విజయలక్ష్మి
తాజా కామెంట్లు