రావి శాస్త్రి గారి ఆరు సారా కధల్లో ….

 

ravi-sastry

నా మేనమామ ఆకెళ్ళ కృష్ణమూర్తి గారు శాస్త్రి గారి ఆప్తమిత్రుల్లో ఒకరు కాబట్టి, వారు మా మావయ్య తో విశాఖలో ని సింధియా కోలని లో ఉన్న మా ఇంటికి తరచూ  రావడం వల్ల వారితో నా చిన్నప్పటి నుంచి పరిచయం ఉండడం నా అదృష్టం. ఆ పరిచయం నా వ్యక్తిత్వమూ, ఆలోచనలు సరి అయిన దారిలో రూపొందడానికి చాలా సహకరించింది. ఆరు సారా కధలు ఏప్రెల్ 2 1961 నుంచి  లో  విశాలాంధ్ర ఆదివారం సంచికలో 6 వారాలు వచ్చినప్పుడు 16 సంవత్సరాల వయస్సులో నేను అన్ని  కధలు చదివి  చాలా ఇష్టపడి మా ఎకనామిక్స్ డిపార్టుమెంట్ లో ( అప్పుడు నేను ఆంధ్రవిశ్వవిద్యాలయం లో 4 సంవత్సరాల  ఎకనామిక్స్‌ హానర్స్ రెండవ సంవత్సరం విద్యార్ధిని) అందరితోనూ ఆ కధలు చదివించే వాడిని.

ఆ తర్వాత 1983 లో ఢిల్లీలో కల జె,యెన్.యు లో టంకశాల అశోక్ గారి ఆధ్వర్యంలో ఉండే  “ప్రగతి సాహితి” మిత్రులతో కలిసి సారా కధల ఆధారంగా   అత్తిలి కృష్ణరావు గారు రాసిన సారాంశం నాటికను నా దర్శకత్వంలో  ఢిల్లీలో 5 చోట్ల తర్వాత విజయవాడ లో జరిగిన విరసం సభల్లోనూ ప్రదర్శించాం . ఆ రకంగా ఆరు సారా కధలతో 21 ఏళ్ల తర్వాత నా అనుబంధాన్ని గట్టి పరచుకున్నాను.

2014 మార్చ్  లో ఢిల్లీ తెలుగు సాహితీ వేదిక వారు రావిశాస్త్రి గారి కధల మీద ఒక సదస్సు నిర్వహించినప్పుడు, శాస్త్రి గారి ఆరు సారా కధల మీద ఒక ప్రసంగం  చేయాలని ,   ఈ కధలని విపరీతంగా ఇష్టపడే  వాడిని కనుక,    సదస్సు నిర్వాహకుల అంగీకారం తర్వాత ఒక ప్రసంగం  చేశాను. ఇప్పుడు అదే ప్రసంగాన్ని  చాలా మార్పులు చేసిన వ్యాసమిది.  55 సంవత్సరాల తర్వాత నాకెంతో ఇష్టమయిన రావి శాస్త్రి గారి ఆరు సారా కధలను మళ్ళీ తలచు కోవడం  ఎంతో ఆనందం గా ఉంది.

మన రాజ్యాంగానికి స్వాతంత్రం  వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా మన న్యాయ వ్యవస్థ ఇంకా బ్ర్తిటిష్ వాడు తన వలస పాలన సౌలభ్యం కోసం  పెట్టిన   న్యాయ పద్ధతులు, ముఖ్యంగా భారత శిక్షా స్మృతి, ( బ్రిటిషోడు 1860 లో పెట్టినదే  – పాపం కొన్ని మార్పులు తర్వాత చేసినట్టున్నారు), ఇంకా అమల్లో ఉండడం మన దౌర్భాగ్యం. 2015, 2016 ల్లో,    బ్రిటిషోడు ప్రజలు తమకు అణిగి ఉండడం కోసం ఏర్పాటు చేసిన దేశభక్తి న్యాయం (Sedition Law) కూడా ఇంకా అమల్లో ఉండడం రాజ్యం చేస్తున్న దౌర్జన్యం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే దేశద్రోహమనే ఈ చట్టం , 2016 జనవరి – ఫిబ్రవరిలో లో హైదరాబాద్ సెంట్రల్ & జె.ఎన్.యు. విశ్వవిద్యాలయాల విద్యార్ధుల మీద జరిగిన దౌర్జన్యానికి  ప్రస్తుత ప్రభుత్వం వాడింది. . అక్కడే కాదు ఇంకా అనేక చోట్ల ఈ ‘దేశద్రోహ నేరం’ ప్రస్తుత కేంద్ర పాలకులకు తరచుగ  ఉపయోగ పడుతోంది. ఈ మార్పులను దృష్టిలో  పెట్టుకొని, 2 ఏళ్ల తర్వాత ఈ వ్యాసాన్ని తిరిగి రాసాను.

పేదల – బడుగుల సమస్యల్నే కథలుగా మలిచిన రావిశాస్త్రి గారు, ఉత్తరాంధ్ర తెలుగు సాహిత్యానికి ఇచ్చిన   గొప్ప వరం. ఆయన 1960 లో రాసిన ఆరు సారా కధలు తెలుగు సాహిత్యం లో ఒక మరుపు లేని కొత్త మలుపు. రాజ్యము రాజ్యవ్యవస్థగా ఉన్న కోర్టులు, పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలలోని ప్రజా వ్యతిరేకత  చూపించిన ఘనత ఆరు సారా కధలకే దక్కుతుంది

“ఉత్తమ సాహిత్యం సామాజిక శాస్త్రాల కన్నా ప్రతిభావంతంగా సమాజాన్ని  ప్రతి ప్రతిఫలిస్తుంది. అందుకే “సాహిత్య పరిశీలన సామాజిక అధ్యయనానికి సాధనం మాత్రమే  కాదు అవసరం కూడా” అని మిత్రుడు సి.వి.సుబ్బారావు (విరసం రచయిత + పౌరహక్కుల ఉద్యమకారుడు  – సుర/సుబ్బా) తన విభాత సంధ్యలో అన్నారు. ఆ దృష్టి లో చూస్తే ఆరు సారా కధల పరిశీలన చాలా అవసరం  అని  నా ఉద్దేశం.

ఆరు సారా కధల సంపుటి  ముందు మాటలో శ్రీ శ్రీ  గారు అన్నట్టుగా ” అతడు కళా స్రష్ట. అతడు వ్రాసిన ఆరు కథానికలు ఆరు కళా ఖండాలు.  తెలుగులో ఒక్క గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమయిన పాత్ర చిత్రణ ఈ కధల్లో కనపడుతుంది. ఇవి వాస్తవికతకు ఒక నివాళి. వీటిలో  కధనం ఉంది, కావ్యం ఉంది, డ్రామా ఉంది. జీవితాన్ని  నిశితంగా పరిశీలించడం ఉంది. ఆ చూసిన దాని మీద వ్యాఖ్యానించినట్టు గా కనిపించని వ్యాఖ్యానం ఉంది”

రావి శాస్తి గారి ఆరు సారా కధల్లో ప్రత్యేకంగానూ, ఆయన రచనలు అన్నిటిలోనూ ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత-దర్శకుడు బెర్టోల్ట్ బ్రెక్ట్  దూరీకరణ  సూత్రం  (alienation effect) ,  తాదాత్మ్య విచ్ఛిత్తి , కనిపిస్తుంది.  ఇందు లో  నాటకంలో ప్రేక్షకులకు/కధలో పాఠకులకు , తాదాత్మ్యం కలిగించి వాస్తవమని భ్రమ కలిగించాలన్న సూత్రానికి భిన్నం గా ఆ తారతమ్యాన్ని ఛేదించి, నిరంతరం ఇది నాటకం/కధ అని జ్జ్ఞప్తికి తెస్తూ, వాటిల్లో ఇమిడి ఉన్న నైతిక, సామాజిక, రాజకీయ సంఘర్షణల అంతరాయాన్ని ప్రేక్షకుడు/పాఠకుడు గ్రహించే విధంగా  చేయడం ఈ సూత్రం లక్ష్యం.

ఉదాహరణకి ‘మాయ’ కధలో ముత్తేలమ్మ అన్న పాత్ర చేత అప్పుడు దేశం లోని సామాజిక పరిస్థితిని శాస్త్రి గారు చెప్పించిన విధం చూడవచ్చు. ఆమె ఇలా అంటుంది “పీడరు బాబూ సెప్తున్నాను ఇను! నువ్వే కాదు, ఈ బాబే కాదు, ఏ మనిసి మంచోడని ఒవురు సెప్పినా  నాను  నమ్మను.   ఈ నోకంల డబ్బూ యాపారం తప్ప  మరేట్నేదు. పశువులూ-నోర్లేని సొమ్ములు  – ఆటికి నీతుంది కానీ మనకి నేదు. సదువు లేందాన్ని నాకూ నేదు; సదువుకున్నాడివి నీకూ నేదు. డబ్బు కోసం నోకం – నొకమంతా పడుచుకుంటోంది. డబ్బుకు నాను సారా అమ్ముతున్నాను, డబ్బుకి సదువుకున్న సదువంతా నువ్వమ్ముతున్నావు. డబ్బుకి పోలిసోళ్ళు  నాయ్యేన్నమ్ముతున్నారు. మందు కోసం పెద్దాసుపత్రికెల్తే  అక్కడ మందులమ్ముతున్నారు. గుళ్ళోకెళ్లి కొబ్బరికాయ సెక్కా  కాన్డడబ్బూ  ఇస్తే ఆ దేవుడి దయే అమ్ముతున్నారు. వొట్లొస్తే ( ఎన్నికలు) పీడరు బాబూ నువ్వూ. నానూ ,ఈ బాబూ, అందరం అమ్ముడయిపోతున్నాం. అమ్మకం! అమ్మకం! అమ్మకం! అమ్మకం తప్ప మరెట్నేదీలోకంలో.” ఇంతకన్నా సమాజంలో డబ్బు   ఎంత ముఖ్య పాత్ర వహిస్తోందో ఈ మాటల్లో శాస్త్రి గారు   నేరుగా  పాఠకులకు చెప్పారు. అలాగే ఈ కధల్లో  చాలా సార్లు పాత్రలు తిన్నగా పాఠకులతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి .

సామాన్య ప్రజలు తమ రోజు వారీ జీవితం లో ఎదుర్కునే రాజ్యం యొక్క వివిధ రూపాలను /శక్తులను, వాటితో ప్రజల ప్రతి చర్యలను ఉదాహరణగా తీసుకొని మన సమాజంలో రాజ్య స్వభావం  మీద మనకున్న అమాయక మాయను తొలగించడానికి రావి శాస్త్రి గారు ఆరు సారా కధల్లో అపూర్వమయిన ప్రయత్నం చేశారు. ఆయన ఈ రచనలో  పాత్రలు రాజ్యం తాలూకా   రూపాలు లేదా శక్తులు, విభిన్న సందర్భాల్లో  ఎదుర్కుంటాయి.   వాళ్ళ సామాజిక అనుభవాలని విశ్లేషించడం రావి శాస్త్రి గారు సాధించిన విజయం. ఆ పరిశీలనను, పైన చెప్పిన  బెక్ట్ పద్ధతి లో పాఠకులు ఆలోచించే శైలి లో వారు రాశారు.  అయన ఆరు సారా కధల  తరవాత వచ్చిన ఇతరుల కధల మీద, ముఖ్యం గా బీనాదేవి , పతంజలి రచనల మీద, వాటి ప్రభావం చాలా ఉంది.

వివిన మూర్తి, ఏం.వి.రాయుడు గార్ల సంపాదకత్వంలో వచ్చిన “రాచకొండ విశ్వనాధశాస్త్రి  రచనా సాగరంలో” లో వారు చెప్పినట్టు “బాధ్యతగా మాత్రమే రాయాలనుకుంటున్న రచయిత   తన ఆవేశానికి అనుగుణంగా కళాకౌశవాన్ని ఇనుమడింప చేసుకుని ఆరు సారా కధల వంటి కళాఖండాలను  వెలువరించిన దశ ఇది. ఈ కధలు శాస్త్రి గారు తన రాజకీయ దృక్పథాన్ని స్థిరపరచుకున్న దశలో వచ్చిన మొదటిది”.

ఆరు సారా కధల్లో రావి శాస్తి గారు రాజ్యం, ప్రజల, ముఖ్యంగా అణగారిన ప్రజల పైన, తన అధికారం చూపడానికి సులభంగా, అది కూడా వలస వాదులు, ఎదురు తిరిగే ప్రజలను అణచివేయడానికి పనికి వచ్చే శిక్షా స్మృతి , మిగిలిన వలస వాద న్యాయ సూత్రాల సహాయంతో, రాజ్యం కొమ్ము కాచే  రెండు ముఖ్య సంస్థలు పోలీసు , న్యాయ వ్యవస్థ ల గురించి ఒక తిరస్కార   విమర్శ చూపించారు.  అయితే పోలీసుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ బాధను, నిస్సహాయతను సహానుభూతితో చూపుతారు. ఇది మనం మోసం కధలో చూడవచ్చు.  ప్రజల రక్షణ కోసం ఉన్న పోలీసులను తమ స్వంత పనులకోసం  రాజ్యాన్ని నడిపే రాజకీయ నాయకులు, ఆ నాయకులను నిలబెట్టి గెలిపించే అత్యధిక ధనిక వర్గాలు  ఎలా హింస పెడతారో   అద్భుతంగా చెప్పారు శాస్త్రి గారు.

బ్రిటిషోడు తన రాజ్యాధికారం కోసం మరియు  తన వలసను స్థిరపరచుకునేందుకు ఏర్పాటు చేసిన శిక్షాస్మృతిని, న్యాయవ్యవస్థని స్వాతంత్రం వచ్చేకా కూడా మన దేశం లో అమల్లో ఉండటాన్ని “మాయ’ కధలో ఒక సీనియర్ న్యాయవాది ఒక చిన్న న్యాయవాదితో చెప్పిన ఈ కింది సంభాషణ లో కనిపిస్తుంది. అప్పటి వలస చట్టాలను గత రెండు సంవత్సరాలుగా , 2015-2016 ల్లో మన ప్రభుత్వం  దేశ ప్రజలమీద, ముఖ్యంగా విద్యార్ధుల మీద, రాజ్య పద్ధతులను ప్రశ్నిస్తున్న అన్నీ వర్గాల మీద   ప్రభుత్వం   తన సంస్థల  ద్వారా జరిపిస్తున్న దాడుల్లో కూడా ఈ సంగతి ఖచ్చితంగా కనిపిస్తుంది.

జ్ఞానమొచ్చినప్పటినుంచి,  నాకు  ఒక విషయం ఎప్పుడూ అర్ధమయ్యేది కాదు. చట్టాలోకటే అయినప్పుడు ఒక కేసు నిర్ణయం ఒకొక్క కోర్టు లో ఒకొక్క విధంగా యెందుకుంటుందని . ఈ న్యాయ నిర్ణయం లో అంతులేని పేద నిస్సహాయులకు, పలుకుబడీ, అధికారం లో ఉన్న తేడా కూడా మనం చూస్తూనే ఉంటాం. మనది చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశమనీనూ , ఇంత గొప్ప దేశం లో న్యాయం  చాలా నిజంగానూ, స్వచ్ఛంగా తళతళ మెరుస్తుందనీనూ    నమ్మేవారు శాస్త్రి గారు   చెప్పిన ఈ కింది మాటలు (మాయ కధ)  మనస్సులో పెట్టుకోవాలి. ఈ మాటల నిజం  ఈ మధ్య ప్రభుత్వం ఆడిన  డీమోనటైజేషన్ నాటకం లో బాగా కనిపిస్తుంది. దేశం లో ఉన్న నల్ల డబ్బును బయటకు తీయడానికి మొదలు పెట్టిన ఈ ప్రక్రియ లో నల్ల డబ్బున్న కొద్దిమందీ బాగానే ఉన్నారు, ఏమీ లేని జనం మాత్రం  రోజుల తడబడి లైన్లలో నుంచుని , అందులో కనీసం 100 పైగా చనిపోయిన దౌర్భాగ్యం,  ఎలా జరిగుంటుందో  కూడా ఈ మాటల్లో తెలుస్తుంది.

ఇంగ్లీషువాడు మనకి స్థాపించిన న్యాయం అది. ఆకులన్నీ ప్రజలవి. ఆపిల్ పళ్ళన్నీ అధికారులవి. వాళ్ళ దేశంలోనూ అంతే, మన దేశంలోనూ అంతే.      మనకి వాడు చెప్పిన పాఠమే అది. పని కూలివెధవల్ది. లాభం బుగతది     (పెట్టుబడిదారుడిది).   ఏమైనా అంటే , ఎదురు తిరిగితే మన (రాజ్యం)    సాయానికి  (పోలీసులున్నారు) కోర్టులున్నాయి, జెయిళ్ళున్నాయి.  ఇవి లేకపోతే        ఇంగ్లీషువాడి  రాజ్యమే లేదు. ……… ఆఖర్నయినా ఏం          చేశాడు? అక్కడా-అక్కడా  చలాయించినట్టు ఇక్కడ (కూడా) కూలి       వెధవలు   పెత్తనం             చలాయిస్తారేమోనని అనుమానం కలిగింది.  వెంటనే సాటి        షావుకార్లకి   రాజ్యం అప్పచెప్పి చల్లగా తెర వెనక్కి      జారుకున్నాడు.   గొప్ప మాయగాడు. వ్యాపారం, వ్యాపారం లాగే ఉంది.   లాభాలు  లాభాల్లాగే ఉన్నాయి.  ఏదైనా       రొష్తుంటే అదంతా మన      వెధవల్దే  అయింది.

అందుకే ఇప్పటి న్యాయవ్యవస్థలో, అప్పటి వలస రాజ్యం లో లాగా, కోర్టుల్లో అనాధుల ఆక్రందన, పేదల కన్నీటి జాలులే కనిపిస్తాయి. ప్రభుత్వం వారి లెక్కల ప్రకారమే  డిసెంబర్ 31, 2015 కు , దేశంలో నిందమోపబడి, న్యాయ విచారణ కోసం  జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో సగానికి పైగా – 54.9 శాతం , (దళితులు  21.6%. గిరిజనులు  12.4% మరియు ముస్లింలు 20.9%) వీరే కనిపిస్తారు. వీరు కాక మిగతా వెనుకబడిన కులాల (OBC) 31% శాతం కూడా కలిపితే మొత్తం 85.9% ఉన్నారు.

ఇదేమాట శాస్త్రి గారు 50 సంవత్సరాల కిందట  రాసిన వారి నిజం నాటకం ముందు మాటలో   ఇలా చెప్పారు.

ప్రస్తుతం మన దేశంలో ప్రతి రోజూ, ప్రతీ ఛోటా కూడా ఎందరో      కొందరమాయకులు వాళ్ళు చేయని నేరానికి శిక్షలనుభవించడం            జరుగుతోంది. కానీ , ఈమాత్రం డబ్బూ పలుకుబడీ, పదవీ, హోదా        కలవాడెవడూ పడడు, ఇరుక్కోడు, ఒకవేళ పడినా, ఇరుక్కున్నా పైకి    తప్పించుకోగలడు.

ఇలా ఎన్ని రోజులు?. రావి శాస్త్రి గారు సారా కధల్లోని పుణ్యం కధలో మార్పు ఎలాగో సూచించారు. ఈ కధలో  పోలమ్మ అన్న ఆవిడ గురించి కరుణాకరం అనే లాయరు ఇంకో తోటి లాయరుతో మాట్లాడుతూ :

            అది తెలివితక్కువ ముండ, వెర్రి వెంగళ్ళప్పన్నావు . ఇప్పటికీ బాగానే  ఉంది. అలాంటి వాళ్ళు దేశంలో కోటానుకోట్లున్నారు. అందుకే నువ్వూ      నేనూ బతికేస్తున్నాం. కానీ ఎల్లకాలం వాళ్ళు అలా వెంగళప్పల్లా        ఉండిపోరు. ఎప్పుడో అప్పుడు వాళ్ళు గప్పున తెలివి             తెచ్చుకుంటారు. వాళ్ళు తెలివి     తెచ్చుకుంటే నువ్వూ నేనూ,   నీలాంటి వాళ్లూ నాలాంటి వాళ్ళం అంతా కూడా జాగ్రత్తగా      ఉండాలి.            ఏంచేత జాగ్రత్తగా వుండలో తెలుసా?. అప్పుడు    పుణ్యం వర్ధిల్లుతుంది . అప్పుడు మనలాంటి పాపులం బహు జాగ్రత్తగా ఉండాలి.

  ఇప్పుడున్న వ్యవస్థలో, రాజ్యం సామాన్య ప్రజల అణచివేతకు, దోపిడీకి, బ్రిటిష్ వాడు తన వలస పాలన కోసం ఏర్పాటు చేసిన చట్టాలూ, న్యాయ వ్యవస్థలనూ,  స్వాతంత్రం వచ్చాక కూడా ప్రభుత్వం ఎలా వాడుకుంటున్నాయా 1961 లోనే చెప్పారు తన ఆరు సారా కధల్లో.

 చివరగా….

ఆరు సార కధల్లోని మోక్షం కధలో చెప్పినట్టు  –   ఒహ్హో మర్చేపోయాను! గవర్నమెంటుకి పాపం (ఈ డీమోనటైజేషన్ తో) పిచ్చెకింది కదూ? ఎలా ఉందో ఏమిటో చూద్దాం పదండి.

(ఈ వ్యాసం రాయడం లో మిత్రులు మృణాలిని, వేణుగోపాల్, , సాయిపద్మ, విజయభాను కోటె మంచి సలహాలనిచ్చి  సహకరించారు. వారికి నా కృతజ్ఞతలు )

 

*