ఆమె ఒక సైన్యం!

mahasweta

 

(కల్పన రెంటాల  2007 లో మహాశ్వేత దేవిపై ఈటీవీ -2 మార్గదర్శి కార్యక్రమం కోసం రాసి ఇచ్చిన స్క్రిప్ట్ )

ఆదివాసులంటే భయంకరమైన మనుష్యులనీ, వాళ్ళకు సభ్యతా సంస్కృతి లేవన్న అపోహల్ని ఆమె బద్దలు కొట్టింది. కొండ ప్రాంతాలంటే దొంగలు, దోపిడీ ముఠాలు నెలవుండే చోటన్న కట్టుకథల్నీ ఆమె చెదరగొట్టింది. అక్కడి మనుష్యులు రాక్షసులైన అసురతేగలకి చెందిన వాళ్ళన్న ప్రచారాల్నీ ఆమె పట్టించుకోలేదు. ఆత్మ స్థైర్యాన్నే దివ్వెగా వెలిగించుకొని, ఆమె అడవుల్లోకీ వెళ్లింది. నగర జీవితం లో పుట్టి పెరిగిన మహాశ్వేతా దేవి కీకారణ్యాల గుండెల్లో ఏ మారుమూలనో దాక్కుని బతుకుతున్న అడివి బిడ్డల ఆక్రందనల్నీ వింటూ వాళ్ళ గుండెల్లోకి అడుగుపెట్టింది. భయం, ఆకలి, దారిద్ర్యం, అమాయకత్వం ….వీటన్నింటికి పర్యాయ పదాలుగా బతుకుతున్న ఆదివాసులకి కొండంత అండగా నిలబడింది. ఇప్పుడు ఆమె అడివి బిడ్డలకుఅమ్మ. తరతరాల దోసిళ్లకు ఆనవాలుగా మిగిలిన గిరిజనానికి కనుపాప. ఒకవైపు ఆయుధాలతో కొండ బతుకుల్నీ తీర్చిదిద్దే నక్సల్బరీ పోరాటం సాగుతున్న దశ లోనే ఒకే ఒక్క కలం బలంతో తానే ఒక సైన్యం గా పోరాడి గెలిచిన యోధ మహా శ్వేత దేవి.

ఇప్పటికీ ఎనభై ఏండ్ల క్రితం ఢాకా లోని ఒక సాహిత్య సంప్రదాయ కుటుంబం లో పుట్టిన మహా శ్వేతా దేవి చిన్న వయస్సులోనే ‘ గణ నాట్య ‘ అనే ఒక ధియేటర్ బృందం తో కలిసి పని చేసింది. 1930,40 ల్లో ‘ గణ నాట్య ‘ అంటే సామాజిక రాజకీయ విప్లవ సంకేతం. ఆనాడు బెంగాల్ లోని పల్లె సీమల్లో ‘ గణ నాట్య ‘ గజ్జెల మోత వినిపించని ఊరు లేదు. ‘ గణ నాట్య ‘ అడుగు పెట్టిన చోట అజ్నానానికి నిలవ నీడ లేదు. కలకత్తా విశ్వ విద్యాలయం లో ఆంగ్ల సాహిత్యం లో ఎమ్మే చదువుతున్న కాలం లో కూడా మహాశ్వేత ‘ గణ నాట్య ‘ ప్రభావం తో ఎప్పుడూ ఏదో ఒక సామాజిక రంగం లో తలమునకలుగా వుండేది. అతి కొద్ది కాలం లోనే ఆమె అధ్యాపకురాలిగా , పత్రికా రచయితగా ఉద్యోగ జీవితం లోకి అడుగిడింది.

మన దేశాన్ని చేజిక్కించుకొని దుష్ట పాలన సాగిస్తున్న తెల్లవాళ్లని గజ గజ వణికించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయి జీవితాన్ని ఆధారం గా తీసుకొని చేసిన ప్రయోగాత్మక రచన “ ఝాన్సీర్ రాణి ‘ తో ఆమె సాహిత్య జీవితం 1956 లో మొదలైంది.

కేవలం గ్రంధాలయాలు శోధించి, చరిత్ర పుస్తకాల ఆధారాలతోనే ఆమె ఈ జీవిత చరిత్ర రాయలేదు. ఎక్కడైతే ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచితంగా పోరాడి నేలకొరిగిందో, ఆ నేల మీద జీవిస్తున్న సామాన్య జన హృదయాలో ఝాన్సీ లక్ష్మీ బాయి ఎలా శాశ్వతం గా నిలిచి పోయిందో, ఇప్పటికీ ఆ నేల మీద, ఆ ప్రజానీకం లో ఆ వీరనారి జ్నాపకాలు ఏ విధంగా సజీవం గా వున్నాయో రికార్డు చేయడం ఈ రచనలో మహా శ్వేత చేసిన ప్రయోగం. నిరుద్యోగ రక్కసి ఒక వైపు పట్టి పీడిస్తున్నా, కుటుంబం లో భార్య భర్తలిద్దరికీ ఉద్యోగం కూడా లేని దుర్భర స్థితి వున్నప్పటికీ నాలుగు వందల రూపాయలు అప్పు చేసి బుందేల్ ఖాండ్ కి ప్రయాణమైంది మహా శ్వేత. బుందేల్ ఖాండ్ చుట్టూరా ఎన్నో ఉర్లు తిరిగింది. మామూలు జనం తో ముఖ్యం గా స్త్రీలతో కలిసి మాట్లాడింది. తరాలుగా చెప్పుకునే కథల్ని రికార్డ్ చేసింది. ఆ పరిశోధన ఫలితమే ఆమె మొదటి రచన ‘ ఝాన్సీర్ రాణి’.

ఆ తరువాత నాలుగు దశాబ్దాల పైబడిన సాహిత్య జీవితం లో ఆమె ఇరవై సంపుటాల కథలు, వందకి పైగా నవలలు, వందల కొద్దీ వ్యాసాలూ, ఉపన్యాసాలూ ఆమె బహుముఖ ప్రతిభా కి నిలువుటద్దాలు. భారత దేశం లోనే అత్యున్నతమైన, ప్రతిష్టాత్మకమైన జ్నానపీఠ పురస్కారాన్ని ఆమె గెలుచుకుంది. ‘ ఆసియా నోబెల్ గా  పేరు పొందిన రామన్ మెగాసెసే అవార్డ్ ఆమెకు దక్కింది. ఒక తల్లి ఆత్మ ఘోష ని అక్షరబద్ధం చేసిన ‘ హజార్ చౌరాసీ మా ‘నవల ప్రసిద్ధ దర్శకుడు గోవింద్ నిహలానీ దర్శకత్వం లో చిత్రం గా వెలువడి , ఆమె కీర్తి ని అంతర్జాతీయ పటం మీద నిలబెట్టింది.

mohaseta1468494824

1965 లో పలమావు అనే ఒక గిరిజన గూడేన్ని చూసిన తర్వాత మహాశ్వేత లో చాలా మార్పు వచ్చింది. “ ఈ ఊరు గిరిజన భారతానికి అద్దం” అని ఆమె అనుకుంది. ఆ ఊళ్ళోని భూమి లేని నిరుపేద గిరిజనుల దారుణ జీవన స్థితిగతులూ, భూమి వున్న ధన స్వాముల అరాచకాలూ ఆమె ఆలోచనల్ని మేల్కొలిపాయి. నిజమైన భూమి బిడ్డలకీ, భూమి ని బలవంతాన స్వాధీనం చేసుకొని గిరిజనుల నోటి మట్టికొట్టి విలాసం గా బతుకుతున్న భూస్వాములకీ మధ్య జీవితం లో ఇన్ని వ్యత్యాసలున్నాయా అని ఆమె ఆశ్చర్యపోయింది. అప్పు పేరిట గిరిజనుల మీద పెత్తనం సాగిస్తున్న భూస్వాముల దాష్టీకాన్ని ఎండ కట్టాలని ఆనాడే ఆమె ప్రతిజ్న చేసింది. ఇంక కాలినడకన గిరిజన గూడేలన్నీ తిరగడం మొదలుపెట్టింది.

తన జీవితాన్ని అక్షరాలకే పరిమితం చేయలేదు మహా శ్వేత. రచయిత అంటే తన గదిలో తాను భద్రం గా కూర్చుని రాసేవారు మాత్రమే కాదని, తాను ఎవరికోసమైతే రాస్తున్నారో ఆ పీడితుల నిజ జీవితం లో, వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలన్న దృక్పథం మహాశ్వేత దేవిది.

ఒక వైపు దేశం 21 వ శతాబ్దం లోకి ఉరుకులు పరుగులు తీస్తోందని గొప్పలు చెప్పుకుంటున్న దశ లోనే మరో వైపు అభివృద్ధి ఫలాలు ఏవీ దక్కక ఆదివాసులు బాధిత, పీడిత ప్రేక్షక జన సమూహాలుగా మిగిలిపోయే పరిస్థితి పోవాలని, వాళ్ళ అమాయక జీవితాల్లో చైతన్యం నింపాలని కంకణం కట్టుకుంది. అడవి బిడ్డల హక్కుల సాధన కోసం నడుం బిగించింది. వివిధ అవార్డుల నుంచి తనకు అందిన వేల కొద్దీ ధనాన్ని గిరిజనుల కోసమే వెచ్చించింది. ఆమె కేవలం రచయిత్రి గా కాకుండా ఒక క్రియాశీల కార్యకర్త గా భారతీయ గిరిజన జీవిత చరిత్ర పైన చెక్కు చెదరని ముద్ర వేసింది.

గిరిజనల బతుకుల్లో వెలుగులు నింపే దశ లో ఆమె మొదటి మెట్టు: వాళ్ళ ఆర్ధిక స్థాయి ని పెంచడం, జీవన స్థితి ని మెరుగు పరచడం. ఇప్పటికే గిరిజనులకు అందుబాటు లో వున్న వ్యవసాయం, పాడి సంపాదల్ని ఆధారం గా తీసుకొని , వాటిని ఇంకా ఎలా మెరుగుపరచాలో శాస్త్రీయం గా శిక్షణ ఇవ్వడం మహాశ్వేత సాధించిన తొలి విజయం. అదే సమయం లో వాళ్ళను అక్షరాస్యులుగా చేయడం. అందుబాటు లో వున్న వనరులు, అక్షరాస్యత రెండూ గిరిజనుల బతుకుల్ని మార్చాయంటుంది మహా శ్వేత. ఇంతకు ముందు ఒకే ఒక్క పంట వేసి, భూమిని పోడు తో పాడు చేసే స్థితి నుంచి ఇప్పుడు అదే భూమి లో మూడు పంటలు వేసే స్థితి కి గిరిజనులు వెళ్లారు. దాంతో గిరిజనులు ఆర్ధిక స్థితి మారడమే కాదు, జీవన ప్రమాణాలు పెరగడమే కాదు, వాళ్ళలో కొండంత ఆత్మ విశ్వాసం మేల్కోంది. ఇంతకు ముందు పూట కింత సరిపోయేటంత మాత్రమే పండించిన గిరిజనం ఇప్పుడు శక్తి సామర్ధ్యాలున్న రైతులుగా మారి, ధాన్యం తో పాటు బంగాళా దుంపలు, వేరుశనగల్లాంటివి కూడా పండిస్తున్నారు. కాసింత నమ్మకమిస్తే చాలు, కొండల్ని పిండి చేస్తాం అనే గొప్ప జీవన సూత్రం ఇప్పుడు వాళ్ళను ముందుకు నడిపిస్తోంది.

ఇక గిరిజన మహిళల జీవితాల్లో మహాశ్వేత తీసుకు వచ్చిన వెలుగులు లెక్కలేనన్నీ. కుటుంబం, పిల్లల పోషణ, ఆరోగ్య పరిరక్షణ లాంటి విషయాల్లో ఇప్పుడు ఆ గిరిజన మహిళలు సభ్య సమాజానికే పాఠాలు చెప్పగలరు. 500 నుంచి 600 గిరిజన కుటుంబాలు ఇప్పుడు తమ చేతి వృత్తుల్ని, హస్త కళా నైపుణ్యాన్ని వినియోగం లోకి తీసుకువస్తున్నాయి. వాళ్ళ చేతుల్లోంచి తయారైన అద్భుతమైన , కళాత్మకమైన వస్తువులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లోకి వెళ్తున్నాయి. అడవిలో దొరికే చిన్న వస్తువునైనా అద్భుతమైన కళగా మలచగలమన్న లక్ష్యం తో వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు అనేకం. ప్రపంచీకరణ పుణ్యమా అని ఛిన్నాభిన్నామయిపోతున్న స్థానిక కళా రూపాలకు పునర్జన్మనిస్తున్నారు ఈ గిరిజన మహిళలు.

కొన్ని తరాలుగా నేరస్తులుగా ముద్ర వేయబడి, నేరమే జీవితం గా మారిన గిరిజన తెగల మధ్య పనిచేయడం మహా శ్వేత ఇటీవలి గొప్ప విజయం. సమాజం, అధికార వ్యవస్థ చెక్కిన వికృత నేర శిల్పాలుగా మారిన దాదాపు రెండున్నర కోట్ల మందిని నేర కబంధ హస్తాల నుంచి విముక్తం చేయాలన్నది మహా శ్వేత శపథం. విషాదం ఏమిటంటే పురిలియా లోని ఖేరియా శబర అనే తెగకు చెందిన వీళ్లని గిరిజనుల్లోని మిగిలిన తెగలవారు కూడా నేరస్తులు గానే పరిగణించే ఈ తెగను అక్కున చేర్చుకుని, వారి జీవితాల్నీ మార్చడానికి, వాళ్ళ పట్ల సమాజ దృక్పథం లో మార్పు తీసుకురావడానికి మహాశ్వేత పోరాడుతోంది. దారుణం ఏమిటంటే , పోలీసు వ్యవస్థ వీళ్లను ఇంకా నేరస్తులు గానే మారుస్తోంది.
9 ఏళ్ల క్రితం శబర తెగకు చెందిన బుధాన్ అనే ఒక గిరిజనుడ్ని పోలీసులే కొట్టి చంపిన ఉదంతం తో ఈ పోరాటానికి నాంది పలికింది మహా శ్వేత. బుధాన్ ని కొట్టి చంపిన పోలీసుల్ని కలకత్తా హై కోర్ట్ కి ఈడ్చి న్యాయపోరాటం మొదలెట్టింది మహాశ్వేత . ఈ పోరాటం లో శబర తెగ విజయం సాధించింది. ఇన్నేళ్ళ చరిత్ర లో మొట్ట మొదటిసారిగా ఒక శబర గిరిజనుడు కోర్టులో నిలదొక్కుకొని విజయం సాధించాడు.

మహాశ్వేత పోరాటంతో అనేక సంఘాల కళ్ళు తెరుచుకున్నాయి. తరతరాలుగా నేర జీవితం వైపు నెత్తివేయబడిన శబర తెగల హక్కుల పోరాట సంఘం ఏర్పడింది. అప్పటి నుంచీ శబర గిరిజనుల సంక్షేమానికి మహాశ్వేత అంకితమైంది. దేశం నలుమూలలా తిరిగి శబర గిరిజనుల వివరాలు సేకరించింది. వాళ్ళ కష్టాల్ని రికార్డ్ చేసింది. “ డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ కమ్యూనిటీస్ రైట్ యాక్షన్ గ్రూప్ “ అనే ఒక సంస్థ ఆమె ఆలోచనలకు అక్షర రూపం. దేశం లోని రెండు వందలకు పైగా గిరిజన తెగల్ని ఈ సంస్థ పరిధి లోకి తీసుకువచ్చింది.

2006 లో ఫ్రాంక్ఫర్డ్ లో జరిగిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పుస్తక మహోత్సవానికి మహాశ్వేత దేవి విశిష్ట అతిధిగా హాజరైంది. ఇది భారతీయ సాహిత్యానికి, భారత దేశం లో పీడిత ఉద్యమాలకీ గర్వ కారణం. ఆ ఉత్సవంలో మహాశ్వేత కీలకోపన్యాసానికి కరగని గుండే లేదు. ఆమె మాట్లాడుతున్నంత సేపు ఆ ఉత్సవానికి వచ్చిన వందల కొద్దీ రచయితల కళ్ళు చెమరుస్తూనే వున్నాయి. భారతీయ సంస్కృతి అంటే అనేక కులాల మతాల హరివిల్లు అనీ, దురదృష్టవశాత్తూ అది ఇప్పుడు ఒకే ఒక్క నెత్తుటి రంగుని పులుముకుందని ఆమె బాధ పాడింది. దుష్ట శక్తుల పన్నాగం లో భిన్న సంస్కృతుల నాగరికత అణిగిపోయిందనీ ఆవేదన పడింది.

*

“విముక్త” పోరాటం ఎంత వరకు?!

 

(ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా  సాహిత్య అకాడెమి అవార్డు అందుకుంటున్న సందర్భంగా…)

-కల్పనా రెంటాల

~

 

అప్పటికే ప్రాచుర్యంలో వున్న కావ్యాలనూ, అందులో పాత్రలనూ, సన్నివేశాలను తిరగ రాయడం తెలుగు సాహిత్యంలో కొత్త కాకపోవచ్చు. అదే పనిని అనేక మంది రచయితలు వేర్వేరు కోణాల నుంచి చేశారు. మధ్య యుగాల కావ్య సాంప్రదాయంలో అచ్చ తెలుగు కావ్యాలు చాలా వరకు రామాయణ, మహాభారతాల పునర్లేఖనమే! ఆధునిక యుగంలో విశ్వనాథ, త్రిపురనేని రామస్వామి, పఠాభి, చలం, రంగనాయకమ్మ లాంటి రచయితలు వివిధ కోణాల నించి రామాయణాన్ని తిరగ రాశారు. అలా రాసేటప్పుడు ఆయా రచయితలు కేవలం తిరగ రాయడానికే పరిమితం కాలేదని వాటిని చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఆయా కావ్యాలను కొత్త దృష్టితో చదవాల్సి వుంటుందన్న అవసరాన్ని  కూడా ఈ పునర్లిఖిత కావ్య ప్రయోగం నొక్కి చెబుతుంది.

రామాయణాల్ని ప్రశ్నించే అదే ప్రయోగ ధోరణిని ఇంకా ముందుకు తీసుకువెళ్లి, అందులోని పాత్రలను ఈ కాలపు సందర్భంలోకీ సంభాషణలోకీ పునప్రవేశ పెట్టి, ఇంకో ప్రయోగం చేశారు ఓల్గా. “విముక్త” కథలు దీనికి బలమయిన ఉదాహరణ అయితే, ఆ ‘విముక్త” చుట్టూ ఓల్గా నిర్మించిన పురాణ విముక్త భిన్న సందర్భానికి సాధనాలుగా అమరిన కొన్ని విషయాల్ని చర్చించడం ఇవాళ అవసరం. ‘ విముక్త ‘ లో కొత్తగా ఓల్గా చేసిన దేమిటి? ప్రతిపాదించినదేమిటి? పఠాభి, చలం, కొ.కు.లాంటి వారు పురాణ పాత్రలని తిరగ రాసే పని ఎప్పుడో చేశారు. అయితే ఓల్గా వారి కంటే కొత్తగా, భిన్నంగా చేసినదేమిటి? ఎందుకలా చేసింది? అని ఆలోచించినప్పుడు , విముక్త లోని కథలన్నీ ఒకే సారి మళ్ళీ ఒక చోట ఓ సమాహారం గా చదివినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఓల్గా ముందు తరం రచయితల కంటే ఒక స్త్రీ వాద రచయిత్రి గా ఎంత భిన్నమైందో అర్థమవుతుంది.

పాత్రలు కావు, భావనలు!

ఇంతకు ముందు పురాణ పాత్రల మీద వ్యాఖ్యాన రచనల చేసిన వారు ఆ పాత్రలను కేవలం పురాణ పాత్రలుగా నే చూశారు. పాత్రల వరకే పరిమితమై చూశారు . ఓల్గా చేసిన విభిన్నమైన, విశిష్టమైన పని ఏమిటంటే సీతనో, శూర్పణఖ నో, అహల్యానో, ఊర్మిళ నో, రేణుకనో, చివరికి రాముడి ని కూడా కేవలం ఒక పాత్రలు గా కాకుండా కొన్ని భావనలుగా చూసింది. ఒక భావనగా చూపించేటప్పుడు పురాణ పాత్రల మౌలిక స్వభావాలను మార్చటం అనివార్యమవుతుంది. అలా ఆ భావనలను ఎందుకు మార్చటం అంటే కొత్త భావనల రూపకల్పన కోసం అని చెప్పవచ్చు.  రామాయణం లో శూర్పణఖ అసురీ స్వభావం కల వనిత. అయితే సమాగమం లోని శూర్పణఖ అసూయపరురాలు, రాక్షసి కాదు. అంతఃసౌందర్యంతో విలసిల్లే ధీరోధాత్త.

సీత  ఈ కథలన్నింటి లోనూ కనిపించే ఒక ప్రధాన భావన. ఈ మూల భావన తో ఇతర పాత్రలు ఇంకొన్ని భావనలుగా కలుస్తాయి. అలాంటి కొత్త భావనల సమాగమ సమాహారం విముక్త. సమాగమం లోనో, ఇతర కథల్లోనో కేవలం సీత  శూర్పణఖ నో, అహల్య నో కలవటమే కథ కాదు. పాత్రలుగా కలవటం కాదు అది. వాళ్ళను కలుపుతోంది ఒక భావన. ఒక ఐడియా. ఒక కోణం. రచయిత్రీ ఈ పాత్రలను ఏ భావనాలకు సంకేతంగా తీసుకుంది, వాటిని ఏ భావనలతో కలుపుతోంది, వాటి కలయిక ద్వారా రచయిత్రి చెప్తున్న కొత్త భావనలు ఏమిటి? అన్నది చూస్తే ‘ విముక్త’ ఓల్గా ఎందుకు రాసిందో, ఎందుకు రాయవలసి వచ్చిందో అర్థమవుతుంది.

రామాయణం లో సీత ప్రధాన పాత్ర కాకపోయినా రెండో ప్రధాన పాత్ర. కానీ  విముక్త  కథలన్నింటిలో సీత ప్రధాన పాత్ర గా కనిపిస్తుంది కానీ,  పక్క పాత్రలుగా కనిపించే శూర్పణఖ, అహల్య, రేణుకా, ఊర్మిళ ప్రధాన పాత్రలుగా నిలుస్తారు. ఆ రకంగా పక్క పాత్రలను ప్రధాన పాత్రలుగా చూపిస్తూ, వారి నుంచి సత్యాలను, జ్నానాన్ని సీత పొందటం ద్వారా చివరికి సీత, అహల్య, ఊర్మిళ, రేణుకా అందరూ కలిసి ఒకే భావన గా మారిపోతారు. అయిదు కథలు చదవటం పూర్తి అయ్యాక మనకు అన్నీ పాత్రలు కలిసి ఒక సీత గా , ఒకే ఒక్క భావనగా మిగులుతుంది. ఆ సీత లో శూర్పణఖ ఉంది, ఆ సీత లో అహల్య ఉంది. ఆ సీత లో రేణుకా ఉంది. ఆ సీత లో ఊర్మిళా ఉంది.  ఆ సీత లో రాముడు కూడా వున్నాడు. ఈ కథలన్నింటి లో రాముడి కథ మిగతా వాటి కంటే విభిన్నమైనది.    స్త్రీ పాత్రల వైపు నుంచి మిగతా కథలు నడవగా,  ‘బంధితుడు’ కథ ఒక్కటి  రాముడి వైపు నుంచి సాగుతుంది. ఆ కథ ఓల్గా ఎందుకు రాసిందో, ఎందుకు రాయవలసి వచ్చిందో  అర్థమయితే  ఒకింత ఆశ్చర్యం తో పాటు ఆనందం కూడా కలుగుతుంది.

సీత కాలం నాటి సమస్యలే ఆధునిక వేషం ధరించి ఇప్పుడు కూడా వీర విహారం చేస్తున్నాయి. కొత్త సమస్యలను పురాణ పాత్రల ద్వారా కొత్త చూపుతో విశ్లేషిస్తోంది. అందుకు స్త్రీ వాదాన్ని ఒక సాధనంగా వాడుతోంది.  ఓల్గా కేవలం సాహిత్య సృజన మాత్రమే చేయదల్చుకుంటే, స్టీవాదాన్ని కేవలం సాహిత్య పరిధి లో మాత్రమే వుంచి చూడాలనుకుంటే ఒక ” సమాగమం’ కథ సరిపోయేది. మిగతా కథలు రాయాల్సిన పని లేదు. అయితే యాక్టివిస్ట్ గా ఓల్గా ఒక పరిమితి లో , ఒక పరిధి లో ఆగిపోదల్చుకోలేదు.  సాహిత్యపరిధి నుంచి, సృజనాత్మక పరిధి నుంచి స్త్రీవాదాన్ని ముందుకు తీసుకు వెళ్ళే బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఆ  ప్రణాళిక లో భాగంగానే ఇన్ని కథలు రాయటం అవసరమయింది.

పాతివ్రత్యం అనే పురాణ భావన ని  బద్దలు చేసిన కథ “సైకత కుంభం”. ఇందుకు ఓల్గా ఎంచుకున్న పాత్ర రేణుకాదేవి. జమదగ్ని మహర్షి భార్య గా, పరశురాముడి తల్లి గా లోకానికి తెలిసిన రేణుకా దేవి  ఓ అపురూప శిల్పకారిణిగా ,  విశిష్టమైన సైకత కుంభాలను తయారు చేయగలిగే కళాకారిణిగా  ఈ కథ ద్వారా అర్థమవుతుంది.  ఆర్య ధర్మం లో ప్రధానమైన పితృ వాక్య పరిపాలనకు రాముడు ఒక కోణం అయితే, పరశురాముడు రెండో కోణం.   ఈ రెండు కోణాలు ఇద్దరు స్త్రీలకు ఏం మిగిల్చాయో చెప్పే కథ ఇది.

పాత్రివ్రత్యం , మాతృత్వ భావనల  చుట్టూ స్త్రీల జీవితాలను ఓ ఉచ్చులో బిగించిన పురుషస్వామ్య సంస్కృతి లోని కుట్ర ను, డొల్ల తనాన్ని బయటపెడుతుంది రేణుక. భర్త గురించి,కుమారుల గురించి తనకు తెలిసినంత గా మరెవ్వరికీ తెలియదని రేణుక చెప్పినప్పుడు  మీకు అలా జరిగింది కాబట్టి ప్రపంచం లో భర్తలు, కుమారులు అందరూ ఆలాగే వుంటారని అనుకోవడం న్యాయం కాదని అంటుంది సీత. కానీ రేణుక హెచ్చరించిన సందర్భాలు రెండూ సీత జీవితం లో కూడా ఎదురయ్యాయి.

” భర్త తప్ప వేరే ప్రపంచం లేదనుకుంటారు స్త్రీలు. నిజమే. కానీ ఏదో ఒక రోజు భర్త తన ప్రపంచం లో నీకు చోటు లేదంటాడు. అపుడు మనకు ఏ ఆధారం  ఉంది? పుత్రులకు జన్మనివ్వటమే జీవిత గమ్యమనుకుంటాము. ఆ పుత్రులు పురుషుల వంశాకురాలై మనం గ్రహించే లోపే మన చేయి వదిలి తండ్రి ఆధీనం లోకి వెళ్తారు. వారి అజ్నాబద్ధులవుతారు. లేదా వారే మన జీవితాలకు శాసనకర్తలవుతారు. ఎందుకు ఆ పిల్లలను కనటం- ఇది నాకు అనుభవమైనంత కఠోరంగా మరింకెవరికీ అవదు. కఠోర సత్యం తెలిశాక చెప్పటం నా విధి కదా-”

రేణుక చెప్పిన మాటలు సహజంగానే సీత కు రుచించలేదు.  ఎందుకంటే రేణుక చెప్తున్నలాంటి సందర్భాలు అప్పటికి ఇంకా సీత జీవితం లో ఎదురవలేదు. కళ్లెదుట కనిపిస్తున్నా, తన భర్త, రేపెప్పుడో తనకు పుట్టబోయే బిడ్డలు అలాంటి వారు కారనే ప్రతి స్త్రీ నమ్ముతుంది. ఆ నమ్మకం లోనే, ఆ భ్రమ లోనే బతకాలనుకుంటుంది తప్ప వాస్తవాన్ని గుర్తించాలనిపించదు.  జీవితమనే ప్రయాగశాల లో  రేణుక లాంటి కొందరు స్త్రీలు నేర్చుకున్న అనుభవ పాఠాలు ఎవరైనా చెప్పినా మనకు వాటిని స్వీకరించా లనిపించదు.  దాన్ని సత్యం గా అంగీకరించాలనిపించదు. అందుకే సీత కూడా ” మీ మాటలు నా కర్థం కావటం లేదు. అవి స్త్రీలకు హాని చేస్తాయనిపిస్తోంది” అంటుంది.

తాను తెలుసుకున్న సత్యాన్ని  ఇతర స్త్రీలకు చెప్పటం, తన అనుభవాలను వారితో పంచుకోవటం వల్ల స్త్రీలుగా, బాధితులుగా , అవమానితులు గా   తామంతా ఒక్కరమేనని , ఒకే సమూహానికి చెందిన వారమన్న అనుభూతినిస్తుంది.  ఈ స్త్రీవాద భావన లోంచి చూసినప్పుడు ఓల్గా ఈ కథలను ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం రాసినట్టు స్పష్టం గా తెలుస్తుంది.

స్త్రీలకు తమ మనసు ల మీద, తమ శరీరాల మీద కూడా ఎలాంటి హక్కు లేదని చెప్పే ఆర్య సంస్కృతి పై రేణుక ద్వారా  సైకత కుంభాల సాక్షిగా ఓల్గా తన తిరుగుబాటు ను ప్రకటిస్తోంది.  ఆర్య సంస్కృతి పరిరక్షణ లో భాగంగా పితృస్వామ్యం పెంచి పోషించిన పాతివ్రత్యం, మాతృత్వమే స్త్రీల పరమార్థం లాంటి స్థిర భావనలను సమూలంగా ఈ కథల ద్వారా వోల్గా చర్చకు పెట్టి వాటిని కూకటి వ్రేళ్లతో పెకిలించి వేసి కొత్త భావనలను స్తిరపరుస్తోంది.

vimukta

ఓల్గా రాసిన ‘ విముక్త ‘ కథ లో పద్నాలుగేళ్ళు వనవాసం చేసి వచ్చిన సీత ఊర్మిళ ను చూడటానికి వెళ్లినప్పుడు చెప్పిన మాట ఇది. తనను ఒక మనిషి గానైనా గుర్తించకుండా, కనీసం తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అన్నా వదినల వెంట లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు ఊర్మిళ మొదట కోపంతో రగిలిపోయింది.  ఆరని నిప్పుగా మారింది.  తన నిస్సహాయ ఆగ్రహాన్ని ఊర్మిళ సత్యాగ్రహం గా మార్చుకుంది.   నెమ్మదిగా ఆ కోపం తగ్గాక, ఆ ఆవేశం చల్లారాక ఆమె తన దుఃఖానికి, కోపానికి కారణాలు వెతకటం మొదలుపెట్టింది.  తనను నిలువునా దహించి వేస్తున్న ఆ కోపానికి మూల కారణం కనిపెట్టాలని తన అన్వేషణ మొదలుపెట్టింది. కోపం, దుఃఖం, ఆనందం లాంటి ఉద్వేగాలకు , కోపానికి వున్న మూలసంబంధాన్ని విశ్లేషించటం మొదలుపెట్టింది. అందుకు ఆమెకు ఏకాంతం అవసరమయింది. ఊర్మిళ  ఒంటరి తనం లో కూరుకుపోలేదు. ఏకాంతాన్ని కౌగిలించుకొని తన లోపల తాను గా, తనలో తాను గా  ఆ పద్నాలుగేళ్ళు గడిపింది.  తనకు ఇతరులతో వున్న సంబంధాన్ని పొరలు పొరలుగా తీసి లోతుకి వెళ్ళి చూసింది. ఈ అనుబంధాల మూలాలను కనుగోనె క్రమం లో ఊర్మిళ తనతో తాను పెద్ద యుద్ధమే చేసింది. రక్తపాతం, హింస లేని ఆ ఆత్మ యుద్ధం తో ఆమెకు గొప్ప శాంతి, ఆనందం లభించాయి.

స్త్రీ పురుష సంబంధాల్లో ప్రధాన సమస్య అధికారం. ఎవరికి ఎవరి మీద అధికారం ఉంది? ఎంత వరకూ ఉంది? ఎవరి చేయి పైన, ఎవరి చేయి కింద అన్నదే వారి మధ్య అన్నీ పోట్లాటలకు మూల కారణం. ఆ సమస్య ను ఊర్మిళ తన అన్వేషణతో జయించింది.   అధికార చట్రాలలో పడి నలిగిపోతూ విముక్తమయ్యే దారి, తెన్నూ తెలియక అశాంతి తో, ద్వేషంతో రగిలిపోతున్న వాళ్ళకు ఊర్మిళ తన శాంతి రహస్యాన్ని, తన ఏకాంతం లోని గుట్టు ని విప్పి చెప్దామనే అనుకుంది.  ఊర్మిళ జీవన సత్యాన్వేషణ లో తనతో తాను యుద్ధం చేస్తోందని తెలుసుకోలేని వారు ఆమె దీర్ఘ నిద్ర లో మునిగి ఉందని బాధపడ్డారు.

తాను చెప్పినది సీత కు అర్థమయిందని తెలిసాక  ఊర్మిళ మరో ముందస్తు హెచ్చరిక చేసింది.

” నీ జీవితం లో నా కొచ్చినటువంటి పరీక్షా సమయం వస్తే అప్పుడు ఆ పరీక్ష నిన్ను మామూలు తనం లోకి,మురికి లోకి నెట్టకుండా, ద్వేషంతో , ఆగ్రహం తో నిన్ను దహించకుండా, నిన్ను నువ్వు కాపాడుకో. నీ మీధ అధికారాన్ని నువ్వే తీసుకో. ఇతరులపై అధికారాన్ని ఒదులుకో. అప్పుడు నీకు నువ్వు చెందుతావు. నీకు నువ్వు దక్కుతావు.మనకు మనం మిగలటమంటే మాటలు కాదక్కా “.

ఊర్మిళా చెప్పిన ఆ మాటల్లోని అంతరార్థం ఆ తర్వాత ఆమెకు రాముడు అరణ్యాల్లో ఒంటరిగా వదిలి వేయించినప్పుడు గుర్తొచ్చాయి. రాముడి మీద ప్రేమ ను, అనురాగాన్ని వదులుకొని ఎలా విముక్తం కావాలో , అందుకు మార్గమేమిటో ఊర్మిళా చెప్పిన మాటల నుంచి గ్రహించింది.  ఊర్మిళ చేసినట్లే ఇప్పుడు తాను కూడా తనతో తాను యుద్ధం చేసుకొని ఆ అధికారాన్ని వదులుకునే ప్రయత్నం మొదలుపెట్టాలని, అదే తన కర్తవ్యమని బోధపడింది.

రాముడు అశ్వమేధ యాగం చేస్తున్నాడన్న వార్తా సీత కు చేరగానే ఆమె ను కలవటానికి ఊర్మిళ వాల్మీకీ ఆశ్రమానికి వచ్చింది.

సహధర్మచారిణి గా తాను పక్కన లేకుండా రాముడు అశ్వమేధ యాగం ఎలా చేస్తాడని సీత సందేహపడినప్పుడు ” ఈ ప్రశ్న నీకెందుకు రావాలి? వస్తే రామునికి రావాలి? ” అన్నది ఊర్మిళ. ఆ సమస్య సీత ది కాదు, రాముడి ది.  రాముడి సమస్య ను సీత పరిష్కరించలేదు. పరిష్కరించనక్కరలేదు కూడా.

అనవసరమైన ప్రశ్నలతో అశాంతి పడటం అవివేకమని, అలా నిన్ను నువ్వు హింసించుకోవద్దని  సున్నితంగా హెచ్చరించింది. ” నువ్వు రాముడి నుంచి విముక్తం కావాలి” అని ఆమెకు కర్తవ్య బోధ చేసింది ఊర్మిళ.

” ప్రతి పరీక్ష నిన్ను రాముడి నుంచి విముక్తం చెయ్యటానికే. నిన్ను నీకు దక్కించటానికే. యుద్ధం చేయి. తపస్సు చేయి. లోపలికి చూడు. నీవనే యథార్థం కనపడేదాకా చూడు” .

రాముడి నుంచి సీత విముక్తం కావాలంటే ఆ యుద్ధమేదో సీత చేయాలి.ఊర్మిళ యుద్ధం చేయాల్సిన అవసరాన్ని, ఆ మార్గాన్ని మాత్రమే సూచించగలదు. ఊర్మిళ అదే పని చేసింది. ఆ యుద్ధం తో పోలిస్తే అగ్ని పరీక్ష చాలా చిన్నది.  ఆ యుద్ధం చేశాక , తనను తాను రాముడి నుంచి సీత విముక్తం చేసుకున్నాక  మళ్ళీ వెళ్ళి సభలో తన నిర్దోషిత్వమ్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని సీత కు తెలుసు. అందుకే రాముడు పంపిన ఆ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించి తన గమ్యం వైపు కి సాగిపోయింది.

ఊర్మిళా, సీత  తమతో తాము సంఘర్షించుకొని చేసిన యుద్ధం ద్వారా తెలుసుకున్న సత్యం ఒక్కటే. ” అధికారాన్ని పొందాలి. వదులుకోవాలి కూడా”. ఆ సత్యమే వారిని  పితృస్వామ్య సంకెళ్ళ నుండి విముక్తం చేసింది. ఆధునిక స్త్రీ ది కూడా అదే మార్గం.  అధికారం అనేది ఎలా వదులుకోవాలో? ఎందుకు వదులుకోవాలో తెలిస్తేనే స్త్రీలకు విముక్తి లభిస్తుంది. నిజమైన శాంతి, ఆనందం దక్కుతాయి. స్త్రీ జాతి విముక్తి ని మనసారా కాంక్షిస్తూ  అందుకు అవసరమైన సత్యాలను, అవి గ్రహించే మార్గాలను కూడా మనకు ఈ కథల ద్వారా అందించింది. మార్గం తెలిసింది. యుద్ధం ఎందుకు చేయాలో, ఎలా చేయాలో కూడా తెలిసింది. ఇప్పుడు ఆ యుద్ధం చేయాల్సిన బాధ్యత, విముక్తం కావల్సిన అవసరం ఆధునిక స్త్రీ దే.

*

 

ఓల్గా తో సారంగ ముఖాముఖి ఇక్కడ: 

ఆమె ప్రవాస వేదన

 

సాహితి
  

ప్రవాస జీవితంలోని మరో స్త్రీ కోణాన్ని ఆవిష్కరించిన కథ ఇది. కల్పనా రెంటాల నవల “తన్హాయి” చదివినప్పటి నుంచీ ఆమె ప్రతి రచననీ ఆసక్తిగా చదివే చదువరిగా ఈ కథ నాకు భిన్నంగా అనిపించింది. ప్రవాస జీవన దృశ్యాలని కళ్ళ ముందు పెయింటింగ్ మాదిరిగా చూపించే కథలు కల్పన కలం నుంచి ఇంతకుముందే అనేకం వెలువడినా, ఈ కొత్త కథ మనం సాధారణంగా బయటికి చెప్పుకోలేని ఒక వాస్తవాన్ని చిత్రిస్తుంది.

రెండు కారణాల వల్ల ఈ కథ నన్ను ఆకట్టుకుంది: ఒకటి, ఈ కథలో వర్ణించిన లాంటి సంఘటనలు మామూలే అని ఇటీవలి ప్రవాస వార్తలు చదివిన వారెవరికైనా అర్థమవుతుంది, కాని, ఇందులో కథనానికి పనికొచ్చే విషయాన్ని తీసుకోవడం కల్పనకే సాధ్యమైన సాహసం. రెండు, ఇలాంటి విషయాల్ని కథకి ఇతివృత్తంగా తీసుకున్నప్పుడు వాటిలో ఏ విషయాన్ని ఏ దృక్కోణం నుంచి చూడాలీ అన్న సందిగ్ధం సహజం రచయితల్లోనూ. లేదూ, అలాంటివి పరిశీలనకి వచ్చిన మనలోనూ. కల్పన ఈ కథలో ఒక కౌన్సిలర్ గా అదనపు బాధ్యత తీసుకొని ఈ సమస్యని లోతైన దృష్టిలో విశ్లేషించడం నాకు నచ్చింది. 

ఇక కల్పన కథన నైపుణ్యం గురించి తన్హాయి చదువరులకు వేరే చెప్పకర్లేదు కదా! మరీ ఎక్కువగా మీ కథా సమయాన్ని తీసుకోకుండా మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తాను.

**

It’s Not Okay!

 

Kalpana profile2“నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పర్సనల్. బార్న్స్ అండ్ నోబుల్ దగ్గర కలవటం కుదురుతుందా?’ ఆఫీస్ నుంచి బయలుదేరబోతుంటే వైదేహి నుంచి వచ్చిన టెక్స్ట్ మెసేజీ చూసి శృతి ఆగిపోయింది . వైదేహి ని  కలిసి దాదాపు నెల రోజులకు పైగా అయింది. ఈ మధ్య ఫోన్ కాల్స్ కూడా లేవు. అలాంటిది హఠాత్తుగా ఒక  టెక్స్ట్ మెసేజీ,  అది కూడా ముఖ్యమైన విషయం అని వచ్చేసరికి శృతి కి కొంచెం కంగారుగా అనిపించింది.

ఒక్క సారి వాచీ వంక, మొబైల్ వంక చూసింది. ఒకటి కాలం కోసం, రెండోది సెల్ ఫోన్ గుప్పెట్లో వున్న భౌతిక, మానసిక ప్రపంచాల కోసం. ఆ మొబైల్ లోనే ఆమె జీవితం మొత్తం గూడు కట్టుకొనుంది.   చేయాల్సిన పనులు,ఇంటా,  బయటా చేయించాల్సిన పనులు, అపాయింట్మెంట్ లు, రిమైండర్లు,నోట్స్, కట్టాల్సిన బిల్లులు మొత్తం గా ఆమె  జీవితపు bucket list అంతా ఆ మొబైల్ లో నిక్షిప్తమై ఉంది, రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు.

స్మార్ట్ ఫోన్ లో  ఒక్క సారి To Do List చూసింది. ఒక గంటో, ఒక రోజో ఆలస్యమైతే టోర్నాడో లో , వరదలో వచ్చే ప్రమాదమేమీ లేదని అర్థమయ్యాక,  ” see you girl,” అని వైదేహి కి  రిప్లై ఇచ్చింది.

అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం లో డాలస్, హ్యూస్టన్ లతో పోలిస్తే, ఆస్టిన్ కొంచెం చిన్న ఊరు.  ట్రాఫిక్ లేని సమయాల్లో ఊర్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఓ పావుగంట, అరగంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. రీసెర్చ్ బులవార్డ్ రోడ్డు మీద నార్త్ లో శృతి ఆఫీస్ ఉంటే, ఒక యూ టర్న్ తీసుకొని రీసెర్చ్ బులవార్డ్ సౌత్ మీదకొస్తే బార్న్స్ అండ్ నోబుల్ బుక్ స్టోర్
వస్తుంది. హైవే ఎక్కితే పది నిముషాలే కానీ ఆ ఫ్రాంటేజీ రోడ్డు మీద వెళ్లటమే శృతి కి  ఇష్టం.

హైవే ఎక్కితే తొందర తొందరగా గమ్యానికి చేరుకుంటాము. కానీ శృతి కి ఆ పరుగు పరుగు ఇష్టం లేదు. రోజూ ఆఫీస్ కి వచ్చి వెళ్లే చిన్నపాటి  కారు ప్రయాణాన్ని కూడా నెమ్మదిగా ఎలాంటి అనవసర పరుగులు లేకుండా ఇష్టమైన పాటలు వింటూ అనుభూతిస్తూ వెళ్లాలనిపిస్తుంది . వైదేహి చెప్పబోయే అంత ముఖ్యమైన , వ్యక్తిగతమైన విషయం ఏమై ఉంటుందా అని శృతి డ్రైవింగ్ చేస్తూ ఆలోచనలో పడింది .

***

వైదేహి , శృతి ల మధ్య స్నేహం విచిత్రంగా జరిగింది. సామాన్యంగా కొత్తగా ఏ ఇద్దరు తెలుగు వాళ్ళు ఏ షాపింగ్ మాల్ లోనో, గ్రోసరీ స్టోర్ లోనో ఎదురెదురుపడితే చిన్నపాటి చిరునవ్వు నవ్వటానికి కూడా ఇబ్బంది పడుతూ , చూడనట్లు పక్కకు తప్పుకొని వెళ్లిపోతుంటారు. అలాంటిది హఠాత్తుగా గ్రోసరీ షాప్ లో కలిసిన వీళ్ళిద్దరి  స్నేహం ఓ ఏడాది గా  గా   పెరిగి
పెద్దదవుతోంది .

వైదేహి  వాళ్ళు బోస్టన్ నుంచి అప్పుడే  కొత్తగా ఆస్టిన్ కి రీలొకేట్ అయ్యారు. కందిపప్పు, కూరగాయలు కొనటానికి వైదేహి  , ఇండియన్ గ్రోసరీ షాప్ కి వస్తే అక్కడ జామపళ్లు, సీతాఫలం పళ్ళు కనిపించాయి. వాటిని చూడగానే బోలెడు ఉత్సాహ పడిపోయింది. ఆ ఉత్సాహంతోనే అక్కడే నిలబడి అతి జాగ్రత్త గా జామపళ్ళను,సీతాఫలం పళ్లను ఎంపిక చేసుకుంటున్న శృతి తో  మాటలు కలిపింది.
కొత్తగా  వచ్చిన వైదేహి కి  ఊర్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పింది  శృతి. అలా ఇద్దరి మధ్య మొదలైన స్నేహం నెలకొకసారైనా  బయట కలిసి ఓ కప్పు కాఫీ తాగే వరకు వచ్చింది. అయితే ఎప్పుడు కలిసినా  పిల్లల చదువులు,కమ్యూనిటీ గాసిప్ లు,  లోకాభిరామం విషయాలు తప్ప ఎవరి వ్యక్తిగత విషయాలు మరీ లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం రాలేదు.

వైదేహి  ముఖ్యమైన విషయం, వ్యక్తిగతం అనేసరికి విషయం ఏదో పెద్దదని   శృతి
కి అర్థమయింది . శృతి అలా ఆలోచనల్లో ఉండగానే బార్న్స్ అండ్ నోబుల్ వచ్చేసింది. కారు పార్క్ చేసి బుక్ స్టోర్ కి వెనుక వైపు ఉన్న పార్క్ లోకి నడిచింది శృతి.

2.

అది పెద్ద పార్క్ కాదు కానీ ముచ్చటగా ఒక పక్క చిన్న సరస్సు , మరో వైపు పిల్లలు ఆడుకోవటానికి చిన్న చిన్న జారుడు బండలు ఉన్నాయి.ఒక పక్క పిల్లల్ని ఆడించే వాళ్ళు ఆడిస్తున్నారు. మరో పక్క పార్క్ లో సాయంత్రం చల్లటి వేళ ప్రకృతి ని ఆస్వాదిస్తూ నడిచే వాళ్ళు నడుస్తున్నారు. ఇంకో వైపు   సిమెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్ దగ్గర నెమ్మదిగా కాఫీ  సిప్ చేస్తూ ఏదో దీర్ఘాలోచనలో వైదేహి  కూర్చొని ఉంది. వైదేహి ని  పలకరిస్తూ ఏమిటి విషయం అన్నట్లు  చూసింది శృతి . వైదేహి   మొహం విచారంగా లేదు,సంతోషంగా లేదు. ప్రశాంతంగా లేదు, అశాంతిగానూ లేదు. కేవలం గంభీరంగా ఉంది. అలా వైదేహి ని  ఎప్పుడూ చూడకపోవటం తో శృతి కొంచెం ఆశ్చర్య పడింది .

“Is ever thing alright ?” కొంచెం ఆందోళన గా  అడిగింది.

“యెస్…” తల వూపుతూ శృతి కోసం తీసుకున్న కాఫీ కప్పు ను ఆమె చేతికి
అందించింది వైదేహి. గంభీరంగా ఉన్న వైదేహి వంకే చూస్తోంది శృతి,  ఏం మాట్లాడబోతోందా అన్నట్లు.

” డైవోర్స్ కి ఫైల్ చేశాను.” నేరుగా అసలు విషయం లోకి వచ్చేసింది   వైదేహి .

“వ్వాట్? అసలేమైంది?ఒకటే సారి ఈ  డైవోర్స్ నిర్ణయం ఏమిటి?” శృతి మాటల్లో కనిపిస్తున్న ఆందోళన ను చూసి ఇప్పుడంతా  బాగానే ఉంది,నువ్వేం కంగారు పడకు అన్నట్లు ఆమె చేతి మీద చెయ్యి వేసింది వైదేహి .
అప్పుడే తగిలిన పచ్చి గాయం లాగా , ఎప్పటికీ మర్చిపోలేని ఓ పీడ కల గా మళ్ళీ కొత్త గా కళ్ళకు కట్టినట్లు   కనిపిస్తోంది వైదేహి కి.

***

౩. ఒక శుక్రవారం ఉదయం.

ఫోన్ లో పెట్టుకున్న అలారం బీప్ కన్నా చాలా చాలా ముందే మెలకువ వచ్చేసింది వైదేహి కి.  కనురెప్పలు తెరుచుకున్నాయి కానీ ఒంట్లోని నరాల్లో ఏ మాత్రం కదలిక  లేనట్లు,కండరాలన్నీ ఎక్కడికక్కడ మంచు లో కూరుకుపోయినట్లు మొద్దు బారి పోయి ఉన్నాయి. శరీర కణాల్లో ఏ మాత్రం జీవం లేనట్లు నిశ్చింత గా నిద్ర పోతున్నాయి. ఒక్క క్షణం వైదేహి కి  తానూ బతికున్నదో, చనిపోయిందో కూడా అర్థం కాలేదు. దేహం లోంచి విడివడి పోయి తన ఆత్మ ఒక సాక్షీభూతం గా దూరం గా నిలబడి శరీరాన్ని చూస్తున్న ఫీలింగ్ వైదేహి లో. చేతి ని, కాళ్ళను కదపాలని ప్రయత్నించింది. అసలు అవి ఉన్నాయని కూడా తెలియనట్లు అనిపించింది. మానసికంగా , శారీరకంగా విశ్వ ప్రయత్నం చేసాక ఎక్కడో
చిన్నపాటి కదలిక. మెలకువ  వచ్చాక ఓ పావు గంట పట్టింది మంచం మీద నుంచి కాళ్ళు కింద పెట్టడానికి.  అటు పక్కకు తిరిగి పడుకున్న రాఘవ గొంతు లోంచి
వస్తున్న గురక ను బట్టి  అతను గాఢ నిద్ర లో ఉన్నట్లు తెలుసు ఆమె కు. తన శరీరం , తన మనసు ఏం మాట్లాడుతున్నాయో అతన్ని లేపి చెప్పాలని ఉంది. కానీ
దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకాబట్టి ఆ ప్రయత్నం మానుకొని లేచి నెమ్మదిగా వెళ్ళి అక్కడున్న కిచెన్ బార్  స్టూల్ మీద తన శరీరాన్ని కూలదోసింది.

పొద్దుపొద్దుటే ఈ “ ఫైబ్రో  మయాల్జియా “ పెట్టే బాధలు ఇవాళ కొత్త కాదు వైదేహి కి . ఒళ్లంతా కండరాల నొప్పులు. శరీరమంతా ఒక బాధాసప్తసతి లాగా ఉంటుంది.  ఈ రోగానికి ప్రత్యేకంగా ఏం మందులు ఉండవు అంటూనే డాక్టర్లు ఏవో మందులు ఇస్తూ ఉంటారు. పెయిన్ మేనేజ్మెంట్ తప్ప ఇది తగ్గే రోగం కాదు అని ఆమె కు కూడా తెలుసు. కానీ  ఉదయం లేవకుండా, అమూల్య ను స్కూల్ కు పంపకుండా ఉండటం ఎలా సాధ్యం? చాలా ఉద్యోగాలతో పాటు అమెరికా లోని హాయైన జీవితానికి డ్రైవర్ ఉద్యోగం కూడా చేయాలి కదా అనుకొని నిట్టూర్చింది.

వయస్సు ముప్పై లలోనే ఉన్నా  ఉదయం పూట  ఏదో ముసలితనం వచ్చినట్లు ప్రవర్తించే శరీరం వంక చూసుకుంది వైదేహి .  అలాగే లేచి అటూ ఇటూ కండరాల పెను నిద్దర ను వదిలించే ఎక్సర్ సైజులను చేయటం మొదలు పెట్టింది. ఉన్నట్లుండి కలుక్కున ఎక్కడో పట్టేసింది. నడుం పై భాగం ఒక ముక్క గా , కింద భాగం మరో ముక్క గా  దేహం రెండు గా విడిపోయినట్లు విపరీతమైన నొప్పి.
అతి కష్టం మీద  నేల మీద కు ఒరిగి పోయింది. ఆ నొప్పి లోంచి అమ్మా అన్న కేక గట్టిగా బయటకు వచ్చింది.  కానీ అమెరికా లో అమ్మ లకు అమ్మలు ఎవరూ పక్కన ఉండరు కదా. అయిదు నిముషాలు ఆ నొప్పి ని భరించింది. నొప్పి క్షణం క్షణం ఎక్కువవుతోంది ఇక భరించలేక “ రాఘవా,రాఘవా” అంటూ గట్టిగా కేకేసింది .

ఓ పదిసార్లు గట్టిగా అరిచాక కానీ రాఘవ కు మెలకువ  రాలేదు. కళ్ళు నులుముకుంటూ కిచెన్ లోకి వచ్చాడు. నిద్రాభంగం అయిందన్న చికాకు ఆ మోహంలో స్పష్టం గా కనిపిస్తోంది.

“ ఎవరు చచ్చారని అంత కేకలేస్తున్నావు?” అంటూ వైదేహి కోసం  అటూ ఇటూ చూసాడు. నిద్ర మత్తు లోంచి కళ్ళు  ఇంకా బయటకు రానంటున్నాయి కాబోలు అంతా మసక మసక గా కనిపించింది. కళ్ళు విదిల్చుకొని సరిగా చూసాడు . అప్పుడు కనిపించింది నేల మీద ఓ మూట లా రెండు కాళ్ళు వెనక్కు మెలికపడి కూర్చొన్న వైదేహి  .

వైదేహి కి  శరీరం లోని నొప్పి ని దాటి మరింత నొప్పి పెట్టింది రాఘవ అన్న మాటలు .

“ ఏమిటీ ఎక్సర్ సైజు లు చేసావా?  ఫిజియో థెరపీ కి డబ్బులు వదిలించటం తప్ప  అవి నీకు రావు. నువ్వు చేయలేవు. “ విసుక్కుంటూ వైదేహి ని  పైకి లేపాడు.

వైదేహి కి  అక్కడే కూలబడిపోయి పైకి లేవకుండా భీష్ముడి లాగా “ స్వచ్చంద మరణం” పొందాలనిపించింది.

రాళ్ళను గుగ్గిళ్ళు గా మార్చగలిగే పతివ్రతలో కోవ లో లేదు  కాబట్టి వైదేహి చావలేక బతికి పోయింది.

వైదేహి ని  పైకి లేపి , లేచి నిలబడుతుండగానే టక్కున ఆ స్పర్శ ను అర క్షణం కూడా భరించ లేనట్లు వదిలేశాడు రాఘవ. ఆమె కళ్ళల్లోంచి ఓ సన్నటి నీటి పొర, ఎందుకీ జన్మ  అనుకుంటూ.

ఇంకా పూర్తిగా నిలదొక్కుకోకుండానే వదిలేయటం తో కాళ్ళు ఇంకా బాలెన్స్ లోకి రాక కాస్త అటూ ఇటూ ఊగిపోయింది.  గబుక్కున కిచెన్ మధ్య లో ఉన్న బార్ అంచును పట్టుకొని స్టూల్ మీద కూలబడింది.

మనసు లోని నొప్పి ముందు శరీరం లోని నొప్పి చాలా చిన్న గా అనిపించింది. అయినా ఒక్క మాట కూడా బయటకు రానివ్వలేదు  ఆమె .

కిచెన్ బార్ మీద చార్జింగ్ కి పెట్టిన ఫోన్ తీసి మెయిల్స్ చెక్ చేసుకుంటూ “ఫకింగ్ ఇడియట్. దీన్ని కట్టుకున్నాక నిద్ర సుఖంలేదు. “ గొణుక్కున్నాడు రాఘవ. చీమలు కూడా తిరగని నిశ్శబ్దపు ఇంట్లో అతని మాటలు స్పీకర్ పెట్టినట్లు గట్టిగా వినిపించాయి.

అతన్ని నిద్ర లేపిన ఘోరమైన అపరాధం తనదే అన్నట్లు “ నువ్వు రాత్రి లేట్ గా పడుకున్నావని తెలుసు కానీ పైకి లేవకపోతే అమూల్య ను నిద్ర లేపి స్కూల్ కి తయారు చేయలేను కదా అని పిలిచాను.”

వైదేహి  మాటలకు,  చేత్తో ఇక చాల్లే అన్నట్లు చూపిస్తూ “ ఒక్క రోజైనా మొగుడి ని సుఖ పెట్టావా? ఆ సుఖం గురించి కాదు నేను మాట్లాడుతోంది . డబ్బు తెచ్చి నీ ముఖాన పోస్తున్నాను. అమెరికా లో ఇంత పెద్ద ఇల్లుంది. ఉద్యోగం చేయక్కర లేదు. నన్ను నా ఉద్యోగం చేసుకోనిస్తే చాలు. ఉన్న ఒక్క పిల్ల ను స్కూలు కు దించేస్తే రోజంతా ఖాళీ. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి తెచ్చుకోవటం. ఇది పెద్ద పనా? ఇంజనీరింగ్ చేసావు. నీ ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్ వేర్ లో ఉన్నారు. నిన్ను ఆ పని కూడా చేయమనటం లేదే. హాయి గా ఇంటి పట్టున ఉండి వంట చేసుకొని మా ఇద్దరినీ చూసుకోవటానికి ఏం పోయేకాలం?ఎప్పుడూ ఏదో ఒక  రోగం?” గురి తప్పని మాటల బాణాలు విసరటం మొదలుపెట్టాడు  రాఘవుడు.

“ ఉద్యోగం చేయొద్దన్నది నువ్వు. ఈ ఫైబ్రో మయాలజియా ఉన్నా కూడా ,మీ పనులు ఏవీ ఆపటం లేదే. అన్నీ చేస్తూనే ఉన్నాను గా. “ ఎదురు సమాధానం చెప్పింది వైదేహి, భర్త మాటలకు ఎదురాడ కూడదని తెలిసినా కూడా.

“ నీకు చేతకాదని తెలుసు కాబట్టే వద్దన్నానే. ఒక్క పని అయినా పర్ఫెక్ గా చేస్తావా? నేను నెల లో సగం రోజులు ప్రయాణం లోనే ఉంటాను. నువ్వు పిల్లను స్కూల్లో దింపటం, స్విమ్మింగ్ కి, ఆర్ట్ క్లాస్ కి, సంగీతం క్లాస్ కి తీసుకెళ్లటమేగా  చేయాల్సింది.  అసలు ఆడదానికి పిల్లల్ని పెంచటం కన్నా వేరే  ముఖ్యమైన పనులేమున్నాయి. అదికూడా కష్టమేనా?”

“ రోజంతా ఇంటి పనులు,అమూల్య పనులతో సరిపోతూనే ఉంది కదా. మధ్యాహ్నం రెండు మూడు గంటలు  ఖాళీ , అంతే కదా ” చెప్పటం అనవసరం అని తెలిసినా నోరు ఊరుకోక ఉన్న విషయం చెప్పింది.

“ మొగుడు బయట నానా గడ్డీ తిని రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి తెస్తే చీరలు,మేకప్ లు,నగలు అంటూ దాన్ని ఖర్చు పెట్టడమే కదా మీ ఆడవాళ్ళు చేసే పని. అయినా నువ్వసలు ఆడదానివేనా? నువ్వొక   రోగిష్టి మారివి.  ఉన్న ఒక్క పిల్లను సక్రమం గా పెంచటం చేత కాని ఆడదానివి. ఒక్క ఆడ పని అయినా నువ్వు ఇన్నేళ్ళ లో సక్రమం గా చేసావా? ”

ఒక్కో మాటల తూటా నేరుగా వైదేహి మనసు లో దిగబడి పోతోంది. ఎన్ని సార్లు గుచ్చుకున్నాయో ఈ బాణాలు అయినా చెక్కుచెదరని ధీరత్వం తో కాపురం చేస్తూనే
ఉంది వైదేహి.

రాఘవ మాటలకు వైదేహి సమాధానం చెప్పక్కర లేకుండా ఫోన్ గణ గణ మని మోగింది.

రిసీవర్ తీసి కాలర్ ఐడి లో నెంబర్ చూసి  “ఇండియా నుంచి మీ పుట్టింటి వాళ్ళు. వాళ్ళు కాల్ చేసే ఆ వానేజీ ఫోన్ కి కూడా నేనే డబ్బులు కడుతోంది. కూతురు కి పనులు చేయటం కూడా నేర్పించ కుండా నాకు అంటగట్టి వదిలించుకున్నారు”  కార్డ్ లెస్ ఫోన్ ను  కిచెన్ టేబుల్ కు ఆ వైపున ఉన్న వైదేహి వైపు కు బలంగా విసిరేశాడు రాఘవ.

ఫోన్ ఆన్సర్ చేసి విసిరేసాడేమో, రాఘవ మాటలు అవతల వైపు కు వినిపించాయేమో అని సిగ్గుతో చితికిపోతూ ఫోన్  తీసుకుంది.  రాఘవ మాటల మధ్య కాల్ ఆపేయటాన్ని, రింగ్ ఆగిపోవటాన్ని గుర్తించ లేకపోయింది వైదేహి.
“ ఏం ఆడ పనులు చేయటం లేదు నేనీ ఇంట్లో ?  అయినా అసలు నేను ఆడదాన్ని అని నాతొ సంసారం చేయాలని గుర్తుండాల్సింది నీకు , నాకు కాదు. ”  ఆడ దానివి  కాదు అన్న మాటకు ఒళ్ళు తెలియని కోపంతో మాటకు మాట సమాధానం చెప్పింది వైదేహి.

“ ఏమిటే నీతో సంసారం చేసేది? నీకు మదమెక్కువై ఒళ్ళు కొవ్వొక్కి కొట్టుకుంటున్నావు.  సంసారం చేయాల్సింది పిల్లల్ని కనటానికే. అది జరిగాక ఇక సంసారం చేస్తే అది సంసారం కిందకు రాదు. నేను హిందువు ని. తురకోడి లాగా వందమంది పిల్లల్ని కనక్కరలేదు.” సంసారం విషయం ఎత్తేసరికి రాఘవ లో ఎక్కడ లేని కోపం వచ్చింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. మొహమంతా ఎర్రగా మారిపోయింది.

It's Not Okay story 2

“ నీకు చేత కావటం లేదని చెప్పు.  నీ మగతనం పోయిందని చెప్పు. నీకు ఎరెక్షన్ సమస్య అని చెప్పు. అంతే కానీ  హిందూ ధర్మం, పురాణాల గొడవెందుకు?” వైదేహి సూటి గా అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నది ఆ మాట. ఆ చూపు లో,ఆ మాటలో ఒక తెలియని  కచ్చితనం కనిపిస్తోంది. అతని రహస్యాన్ని బట్టబయలు చేయాలన్న కసి కనిపిస్తోంది.

ఆ మాట ను విని తట్టుకోలేకపోయాడు రాఘవ.

“ బజారు ముండ, నీకు సెక్స్ కావాలటే, రా నా మగతనం చూపిస్తాను.అయినా  You know what, you are not worth to f**** “. విసురుగా దగ్గరకొచ్చి జుట్టు పట్టుకొని వైదేహి ని ఒక్క లాగు లాగాడు. అలా విసురు గా లాగటం తో స్టూల్ మీదున్న వైదేహి కిందపడి పోయింది.

కింద పడటం,    చేతిలో ఉన్న కార్డ్ లెస్ ఫోన్ ను  రాఘవ మొహం మీదకు విసిరేయటం రెండూ ఒక దానివెంట ఒకటి  ఒక్క త్రుటి లో జరిగిపోయింది.

ఫోన్  రాఘవ నుదుటిని కొట్టుకుంటూ వెళ్లి పక్కకు పడిపోయింది.

ఇందాక ఒక సారి పడిపోయిన చోటనే మళ్ళీ దెబ్బ తగిలింది. ఈ సారి నొప్పి మరింత తీవ్రంగా అనిపించింది. కానీ రాఘవ అన్న మాటల కంటే ఆ నొప్పి చాలా మాములుగా భరించగలిగేలా అనిపించింది వైదేహి కి.

“ నన్ను కొడతావా? ఏం జాతే నీది? నువ్వొట్టి బజారు ముండ వి. నువ్వు బ్రాహ్మణ పుటక పుట్టావా? ఇదేనా మీ వాళ్ళు నీకు నేర్పించింది? “ మాటలు,బూతులు అన్నీ కలిసిపోయి తిడుతూ ఆ రిసీవర్ ని తీసి మళ్ళీ వైదేహి మొహం మీదకు విసిరేశాడు.

సూటి గా వచ్చి వైదేహి నోటి కి ఫోన్  బలం గా  తగలటం తో పళ్ళు పగిలినట్లు రక్తం జివ్వున బయటకు వచ్చింది.

అప్రయత్నంగానే చెయ్యి పెదాల మీద కు వెళ్ళింది. చేతికి ఎర్రటి రక్తం. పెదాల చివర నుంచి రక్తం కిందకు ధార లా కారుతోంది.

ఎన్ని సార్లో అంతకు ముందు  అతని చేత తన్నులుతిన్నది. అయినా ఆ క్షణం భిన్నమైనది.

చేతికి అందిన రిసీవర్ ని తీసుకొని గబగబా 911 డయల్ చేసింది.  రాఘవ పెడుతున్న  హింస గురించి ఒక ప్రవాహం లా  మాట్లాడేస్తోంది  వైదేహి.

ఒక పక్క ఆవేశం, ఒక పక్క బాధ, తెలుగు, ఇంగ్లీష్ లలో కలగాపులగంగా రోప్పుతూ మాట్లాడుతోంది వైదేహి.

అటు పక్క నుంచి ఆపరేటర్ వైదేహి మాటల్ని ఆపుతూ “ మేమ్ . జస్ట్ టేక్ డీప్ బ్రెత్ . నెమ్మది గా చెప్పండి. మీ ఇంటి అడ్రెస్ ఏమిటి? ఆర్ యు సేఫ్ ? “అడుగుతున్నాడు .

ఒక్క క్షణం వైదేహి ఏం చేస్తోందో, ఎవరితో మాట్లాడుతోందో అర్థం కాలేదు రాఘవ కు.

వైదేహి కాల్ చేసినదెవరికో అర్థం అయ్యాక రాఘవ గగబా వచ్చి వైదేహి చేతిలోని రిసీవర్ ని తీసుకొని కాల్ ని ఆపేసాడు.

“ You bitch. ఇంటి విషయాల్ని బయట పెట్టడానికి సిగ్గు లేదు. నడువు,ఇప్పుడే నా ఇంట్లో నుంచి బయటకు నడు “ అంటూ జుట్టు పట్టుకొని లేపి తలుపు వైపు తోసాడు.

“ ఇది నా ఇల్లు. నేనెందుకు వెళ్ళాలి?” అంటూ ఓ విధమైన పిచ్చి ఆవేశం తో రెండు చేతులతో రాఘవ రొమ్ము మీద పిడి గుద్దులు  గుద్దింది వైదేహి. చేత్తో అతని మొహం మీద రక్కింది. రాఘవ కళ్ళకు రాక్షసి మీద కు వస్తున్నట్లు కనిపించి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేసాడు. కానీ వైదేహి బలం ముందు బలహీనుడై పోయాడు. తప్పించుకునే ప్రయత్నమో, కోపమో కానీ అతను ఆమె ను కొట్టే ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నాడు.

అలా ఇద్దరు ఒకరినొకరు మాటలతో చేతలతో హింసించుకొంటూ ఉండగా బోయ్ బోయ్ మంటూ శబ్దం చేసుకుంటూ కాప్స్ ఇంటి ముందుకు వచ్చేసారు.

“ వాళ్ళను వెళ్ళిపొమ్మని చెప్పు. ఏం జరగలేదని చెప్పి పంపేయి. లేదంటే నిన్ను ఇక్కడే నరికి చంపేస్తాను” తలుపు తీయడానికి వెళ్తున్న వైదేహి ని ఆపెస్తున్నాడు రాఘవ.

అప్పటి వరకు లేని బలం ఎలా వచ్చిందో వైదేహి కి అతన్ని తోసేసి వెళ్లి తలుపుతీసింది.

భద్రమైన వారి ఇంట్లో కి భద్రతనిచ్చే రక్షకభటులు వచ్చారు.

చెదిరిన జుట్టు, పళ్ళ నుంచి రక్తం, మొహమంతా రక్కేసిన గాట్ల తో వైదేహి అపర కాళిక లాగా పోలీసుల ముందు నిలబడింది.

“ ఆర్ యు ఓకే మేమ్ “ అంటూ ఒక పోలీసు అడిగిన ప్రశ్న కు తల ఊపింది ఆమె.

వాళ్ళను చూడగానే ఒక విధమైన ధైర్యం తో పాటు ఒక ఎంబరాస్మెంట్ ఫీలింగ్ కూడా కలిగింది. లోపల దాచిపెట్టుకున్న ఏడుపు ఒక్క సారిగా బయటకు వచ్చింది.

“ ఇట్స్ ఓకే “ అంటూ లేడీ పోలీసు ఒకామె నెమ్మదిగా వైదేహి ని నడిపించుకుంటూ తీసుకొని వెళ్లి సోఫా లో కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతావా? “ అంటే తల ఊపింది.

రాఘవ కు నోటి మాట రాకుండా స్థాణువై నిలబడి ఉన్నాడు. పోలీసుల వంక చూడలేకపోతున్నాడు. అవమానంగా అనిపించింది. పరువు బజారు పాలు చేసింది ఈ
బజారు ముండ అనుకున్నాడు.

“ సర్, ఆర్ యూ ఆల్ రైట్ ? మీకేమైనా దెబ్బలు తగిలాయా?” రాఘవ మొహం వైపు
చూస్తున్నాడు. మొహం మీద గాట్లు, రిసీవర్ మొహానికి తగిలిన దెబ్బ అన్నీ అద్దం లో కనిపించినట్లు స్పష్టం గా కనిపిస్తున్నాయి ఆ పోలీసు కళ్ళకు .

ఇంతలో వారికి ,  దూరం గా ఒక శిలా విగ్రహం లా నిలబడ్డ అమూల్య కనిపించింది. ఎప్పుడు నిద్ర లేచి వచ్చిందో, ఏం చూసిందో తెలియదు , నోట మాట, శరీరం లో కదలిక లేకుండా శిల లా నిల్చున్న  అమూల్య దగ్గరకు లేడీ పోలీసు వెళ్లి “ స్వీటీ,  ఇట్స్ ఓకే. కెన్ వుయ్ గో ఇన్ టు యువర్ రూమ్? “అమూల్య ని  గది లోకి తీసుకెళ్లింది. ఆమె అమూల్య తో మాట్లాడుతోంది.

ఇంకో ఇద్దరు పోలీసులు వైదేహి తోనూ, రాఘవ తోనూ విడివిడి గా మాట్లాడి నోట్స్ తీసుకున్నారు.

ఒక గంటకు పైగా మాట్లాడి రాఘవ మీద ఎమోషనల్ ఎబ్ యూజ్ కింద కేసు పెట్టారు. కౌంటీ రూల్స్ ప్రకారం గృహ హింస కు జీరో టాలరెన్స్ చట్టం ఉంది కాబట్టి , వైదేహి కంప్లైంట్ ఇస్తే రాఘవ మీద కేసు పెడతామని పోలీసులు చెప్పారు కానీ అతన్ని జైలు కు పంపటం ఇష్టం లేక వద్దని చెప్పింది వైదేహి.

“ ఇక్కడ మీరు సేఫ్ గా ఉండగలరా ? లేక వేరే ఎక్కడైనా ప్రొటెక్షన్ హౌస్ కి వెళ్తారా? “ అన్న పోలీసుల ప్రశ్న కు “ ఇక్కడే ఉంటామని, అవసరమైతే మళ్ళీ కాల్ చేస్తామని “ చెప్పింది వైదేహి.

ప్రొటెక్షన్ సెల్  విజిటింగ్ కార్డ్స్, సహేలి కార్డ్స్, కౌంటీ పోలీస్ స్టేషన్ నెంబర్స్ అన్నీ ఫ్రిజ్ మీద మాగ్నెటిక్  కార్డ్ తో అతికించి వెళ్ళారు.

పోలీసులు ఇద్దరికీ మరో సారి అన్నీ రూల్స్ వివరించారు.  ఇద్దరిలో ఎవరికైనా అవతలి వాళ్ళ వల్ల  ప్రాణాపాయం అనిపించినా వెంటనే కాల్ చేయమని చెప్పారు.

పోలీసుల్ని పంపుతూ  తలుపు వేయటానికి  మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళిన వైదేహి కి, సందు లో తమ ఇంటి ముందు నుంచి వెళ్ళే వాళ్ళంతా స్లో డౌన్ చేసి  ఆ ఇంటి ముందు ఆగిన పోలీసు కార్లను చూసుకుంటూ వెళ్తున్న విషయాన్ని గమనించింది.

సిగ్గు, అవమానం, అసహ్యం , బాధ, ఏడుపు అన్నీ కలగలిసి వచ్చాయి. భారంగా అడుగులు పడుతుంటే లేచి అమూల్య గదిలోకి వెళ్ళింది వైదేహి.

***

“   నా 15 ఏళ్ల వైవాహిక జీవితం చివరకు ఇలా ముగిసింది  శృతీ . అమూల్య కోసమో, నా అనారోగ్యం వల్లనో ,  లేక ఈ కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే తాపత్రయం తోనో  ఏదో ఒక కారణంతో   ఇన్నాళ్ళూ  ఓపిక పట్టాను. ఆ 911 సంఘటన జరిగిన రోజు ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు కానీ ఒక్క సారిగా నా భయాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఆ రోజు మమ్మల్ని అమూల్య చూసిన చూపు నేనెప్పటికీ మర్చిపోలేను. నేనున్న స్థితి లోనే రేపు అమూల్య ఉంటే ఏం చేస్తుంది? భర్త చేత తన్నులు తింటూ అయినా సరే ఆ కాపురాన్ని  నిలబెట్టుకోమని ,  ఆత్మ గౌరవం లేకుండా బతకమని చెప్పనా? అదేనా నేను నా కూతురికి నేర్పించాల్సిన జీవితపాఠం? ”
ఆ సాయంత్రపు నీరెండ వెలుగు లో  తనను తాను ప్రశ్నించుకుంటున్న వైదేహి కొత్త గా కనిపించింది శృతి కి. లేచి వెళ్లి వైదేహి ని హగ్ చేసుకుంది .

(నవ్య వీక్లీ లో ( జూలై 1 సంచిక లో) ప్రచురితమైన  కథ)

స్త్రీల సాహిత్యంలో సరికొత్త చైతన్యం ప్ర.ర.వే.

banner31

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక – ప్ర.ర.వే- ఇటీవల ఒక సాహిత్య చైతన్య కెరటం. వెల్లువలా రచయిత్రులని సమీకరించిన మేలుకొలుపు గీతం. ప్రాంతీయ స్థాయిలో మొదలైన ఈ వేదిక ఇప్పుడు జాతీయస్థాయిలో జయకేతనం ఎగరేయబోతోంది. ఈ విజయోత్సవ వేళ వేదిక నేతలతో సారంగ ముఖాముఖి.

1. ప్రప్రరవే మొదలుపెట్టి ఎంత కాలమయింది? ఈ సదస్సు లో ఎంత మంది సభ్యులున్నారు?

unnamedపుట్ల హేమలత :

2008 జనవరి 10,11తేదీల్లో అనకాపల్లి లో జరిగిన చర్చావేదిక ప్రరవే’ ఏర్పాటుకు నాంది పలికింది .
ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి రచయిత్రుల్ని అనకాపల్లి ఆహ్వానించి రెండు రోజులు చర్చలు జరుపుకున్నాం. ఆ సభల్లో స్త్రీవాద ఉద్యమాలు , స్త్రీలకు సంబంధించి అన్ని అస్తిత్వ వాదాలను గుర్తించి కలిసి పని చేయటం, స్త్రీల పై జరుగుతున్న దాడులకి వ్యతిరేక పోరాటాలు చేయటం , రచయిత్రులంతా ఎవరి అస్తిత్వాల్ని,భావజాలాన్ని వాళ్లు కాపాడుకుంటూ ఒకే వేదికపై కలిసి పని చేయటం అనే అంశాలపై సాధ్యా సాధ్యాల గురించి మాట్లాడుకోవటం జరిగింది . అనేక చర్చలు, అభిప్రాయాల అనంతరం దామాషా పద్దతి ప్రకారం అన్ని వర్గాల నుంచి అధ్యక్షులు, కార్య వర్గ సభ్యుల్ని ఎన్నుకోవటం జరిగింది . ఆ తాత్కాలిక కమిటీని ‘ మనలో మనం’ అని పిలుచుకున్నాం . దాన్నే ‘ ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక’గా రూపొందించుకొని ఇప్పటి వరకు విజయ వంతంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం . ఇప్పటికి ఈ వేదికలో వంద మంది వరకూ సభ్యులున్నారు. ఈ జాతీయ సదస్సు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరింతమంది సభ్యులు పెరుగుతారు. దీని ఫలితంగా స్త్రీల సమస్యలపై మంచి అవగాహన , కార్యక్రమాలు , ఆలోచనాత్మకమైన సాహిత్యం వెలువడే అవకాశం వుంది.

 

dscn0414

2. ప్రఇప్పటి వరకూ వేదిక ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించింది ?

DSC04676మల్లీశ్వరి :

2009 జనవరి 10,11 తేదీల్లో అనకాపల్లి లో మొదటిసారిగా ” సవాలక్ష సవాళ్ళ మధ్య భిన్న అస్తిత్వాలు – ఒక ఉమ్మడి ఆకాంక్ష ”, ” గతానుభవాలు ఎలాంటివైనా ఆశ లెపుడూ నిత్య నూతనమే ” అన్న ఆశతో అవగాహనతో ఉత్తరాంధ్ర రచయితలు, బుద్ధిజీవులు మనలో మనం నిర్వహణ కమిటీగా ( కె. ఎన్. మల్లీశ్వరి, కె. అనురాధ, ఇ పి యస్ భాగ్యలక్ష్మి, వర్మ, నారాయణ వేణు ) ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రచయిత్రులతో సంభాషణ చేసారు. అందరి ఆలోచనలూ ఒక్కటి కావడంతో వందమందికి పైగా రచయిత్రుల చర్చల ఆలోచనల అనంతరం మనలో మనం తాత్కాలిక కమిటీ ఏర్పడి కాత్యాయనీ విద్మహే ప్రతిపాదనను అంగీకరించి ఒక సంవత్సరం పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య సదస్సులను నిర్వహించింది.

 

IMG_0109

దళిత , తెలంగాణా స్త్రీల అస్తిత్వ సాహిత్యం పై వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో, ముస్లిం, రాయలసీమ స్త్రీల అస్తిత్వ సాహిత్యం పై కడప యోగి వేమన విశ్వ విద్యాలయంలో, బిసి,క్రైస్తవ మైనార్టీ, కోస్తాంద్ర స్త్రీల సాహిత్యంపై గుంటూర్ నాగార్జున విశ్వవిద్యాలయంలో సదస్సులను జరుపుకుని తిరిగి ఉత్తరాంధ్ర చేరుకొని , గిరిజన , ఉత్తరాంధ్ర స్త్రీల అస్తిత్వ సాహిత్యం పై ఆంధ్ర విశ్వవిద్యాలయం లో సదస్సుని నిర్వహించాము. అదే రోజు 2010 ఫిబ్రవరి 28వ తేదీన మనలో మనం తాత్కాలిక కమిటీ రద్దయ్యి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పడింది. రంగనాయకమ్మ తో చర్చా కార్యక్రమం , అరుంధతీ రాయ్ తో గోష్టి లాంటి వాటితో పాటు నరసాపురం వై ఎన్ కళాశాలలో , రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో, వరంగల్ కాకతీయలో ముమ్మారు, ఒంగోలులో, ఇంకా అనేక చోట్ల స్త్రీల సాహిత్యంపై అనేక రచయిత్రుల సహకారంతో సదస్సులు నిర్వహించుకున్నాము. ఇదంతా ఒకవైపు అకడమిక్ గా జరిగిన కృషి అయితే మరోవైపు దేశ వ్యాప్తంగా జరుగుతున్న అనేక సామాజిక ఉద్యమాలతో స్త్రీల సాహిత్యాన్ని అనుసంధానించాలన్న ఆశయంతో కొంత కృషి చేసాము . ముజఫర్ నగర్ మారణ కాండ, నిర్భయ ఘటన , వాకపల్లి అత్యాచార ఉదంతం, సోంపేట కాల్పుల ఘటన ,లక్షిం పేట దళితులపై దాడి, ఉత్తరాంధ్ర లో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనుల పోరాటాలకు సంఘీభావంగా నిలబడటం, రాష్ట్రవ్యాప్తం గా మైనింగ్ కి వ్యతిరేకంగా పోరాడటం , రాష్ట్ర విభజన సమయంలో ఒక చర్చా కార్యక్రమం ద్వారా రెండు ప్రాంతాల రచయిత్రులూ కలిసి మాట్లాడుకుని చిన్న చిన్న అపోహలను తొలగించుకుని తమ ప్రణాళికలో రాసుకున్నట్లుగానే తెలంగాణా ఏర్పాటును స్వాగతించడం లాంటి కార్యక్రమాలు జరిగాయి. కొత్త తరాన్నిగుర్తించడంలో భాగంగా ఉత్తరాంధ్రలో ఇంపాక్ట్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకి తన పూర్తి సహకారాన్ని అందించింది సాహిత్యం ప్రధాన రంగం కనుక సామాజిక చలనాలను వివిధ ప్రక్రియల ద్వారా అక్షర బద్ధం చేయడం, వీధినాటకాల ద్వారా సామాన్య ప్రజలకు చేరువలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాము. రచనా శిల్పం మీద కొంత చర్చ ,కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో దాని మీద కూడా ధ్యాస పెడతాము.

3. ప్ర ప్రరవే ప్రచురణల వివరాలు చెప్తారా?

DSC04676మల్లీశ్వరి :
ప్రచురణ రంగంలో ప్రరవే అవసరానికి,ఆసక్తికి,బాధ్యతకి తగినంత కృషి చేసిందని చెప్పలేము. కానీ తన ఆర్ధిక శక్తికి మించి ప్రచురణలు చేసింది. వివిధ సెమినార్లు,వివిధ సాహిత్య సామాజిక సందర్భాల్లో ఇంచుమించు 300 వందల వరకూ వ్యాసాలు వెలువడ్డాయి. కథ, కవిత్వం లాంటి సృజనా తక్కువేమీ కాదు.
ఇప్పటి వరకూ 5 పుస్తకాలు ప్రరవే ప్రచురణలుగా వెలువడ్డాయి.

కవిని – పోరాడితేనే రాజ్యం -తెలంగాణా ఉద్యమ గాధలు
మల్లీశ్వరి – మల్లీస్వరం – సాహిత్యవ్యాసాలు , కాలమ్స్
మల్లీశ్వరి – ఓల్గా నవలలు – ప్రభావశీలత – పరిశోధనా గ్రంథం
అనిశెట్టి రజిత, బండారు విజయ – ముజఫర్ నగర్ మారణ కాండ- నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర
అనిశెట్టి రజిత,కొండేపూడి నిర్మల,శివలక్ష్మి, టి.నళిని,కె. సుభాషిణి సంపాదకులుగా – అగ్నిశిఖ – స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి రచయిత్రుల స్పందన –
సంకలనం

4. ప్ర ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి లో ఉన్న ప్రరవే ఇప్పుడు జాతీయ స్థాయి కి ఎదిగిందని ఈ సదస్సు ప్రకటన వివరాలు చూస్తె తెలుస్తోంది . ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ స్థాయి లో సమావేశాలు నిర్వహించటం ఇదే మొదటి సారా?

dscn0573కాత్యాయని విద్మహే :

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ట్ర స్థాయి నిర్మాణం గా ప్రారంభం అయిందే కానీ రాష్ట్రానికి పరిమితం కాదు . ప్రజాస్వామిక చైతన్యంతో తెలుగులో రాస్తున్న స్త్రీలు ప్రపంచం లో ఎక్కడ ఉన్నా దీనిలో సభ్యులు కావచ్చు . వేదిక లక్ష్యాలకు ,విలువలకు అనుగుణం గా తమ తమ ప్రాంతాలలో పని చేయవచ్చు . ఇతర రాష్ట్రాలలోని తెలుగు రచయిత్రులతో పరిచయాలు పెంచు కొనాలని ,అక్కడ వేదిక శాఖలు ఏర్పడేలా చూడాలని ముందు నుండి అనుకుంటున్నదే . అయితే అందుకు సమయం ,సందర్భం తెలంగాణా రాష్ట్రం ఏర్పడటం తో కలిసి వచ్చాయి. 2014ఏప్రిల్ లోఒంగోలు లో జరిగిన రెండవ మహా సభలో రెండు రాష్ట్రాలకు రెండు శాఖలు ఏర్పడటంతో ఇది జాతీయ స్థాయి వేదిక అయింది . ఢిల్లీ సాహితీ మిత్రుల సహకారం తో ఇప్పుడిలా జాతీయ స్థాయిలో మొదటిసారి సమావేశాలు నిర్వహించ గలుగుతున్నాం .

 

1078762_311578862328506_6767211798998622755_o

5. ప్రఈ జాతీయ సదస్సు లో ఓల్గా, మృణాళిని, కుప్పిలి పద్మ, ఎం. విమల లాంటి వారు తప్ప మిగతా వారంతా మీ ప్రరవే సభ్యులే కదా! సాధారణం గా ప్రరవే సభ్యులు కాని రచయితలకు మీ సదస్సు లలో పాల్గొనే అవకాశం ఉంటుందా?

dscn0573కాత్యాయని విద్మహే :

అవును . ప్రరవే సభ్యులే . ఆసక్తి తో, ఉత్సాహంతో, ప్రరవే నిర్మాణం లో భాగమై పనిచేస్తున్న వాళ్ళను స్త్రీల సాహిత్య అధ్యయన విశ్లేషణలో సుశిక్షితులను చేసుకొనటం ,మరీ ముఖ్యంగా ఆదిశలో కొత్త తరాన్ని తయారు చేసుకోనటం అవసరం అని వేదిక భావిస్తుంది . అందుకే ఒక్కొక్క సమావేశం లో కొందరు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తుంది .సాధారణం గాఒక సదస్సు అనుకున్నప్పుడు ఆయా అంశాలలో నిష్ణాతులైన వారిని గుర్తించి ఆహ్వానించటం జరుగుతుంది . వాళ్ళను వినటం ద్వారా ప్రరవే సభ్యుల జ్ఞాన చైతన్యాలు వికసిస్తాయి అని మా నమ్మకం . ప్రరవే సభ్యులు కాని వాళ్ళు ఆ రకం గా మా సదస్సులలో పాల్గొంటుంటారు .

6. ప్రఈ భారతీయ భాషల స్త్రీల సాహిత్యం అనేది విశాలమైన అంశం. దాన్ని ఒక రెండు రోజుల సదస్సు కు కుదించటం కొంత ఇబ్బందికరమైన విషయమే . అయినప్పటికీ ఇందులో తమిళం, కన్నడం , ఒరియా లాంటి ముఖ్యమైన భాషల స్త్రీల సాహిత్య ప్రస్తావన లేకపోవటం ఒక ప్రధాన లోపం గా కనిపిస్తోంది. మీరేమంటారు?

unnamedపుట్ల హేమలత :
ఈ ప్రశ్నకి సమాధానం మీ ప్రశ్న లోనే వుంది కల్పన గారూ! రెండు రోజుల వ్యవధిలో జరుగబోయే అయిదు సమావేశాల్లో బెంగాలీ , హిందీ. మలయాళం, మరాఠీ , తెలుగు భాషల సాహిత్యాన్ని పరిచయం చేస్తున్నాం .ఈ సభల్ని డిల్లీ తెలుగు సంఘం వారు , ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక, కేంద్ర సాహిత్య
అకాడెమీల సంయుక్తం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం .
ఈ సభల ముఖ్యోద్దేశ్యం తెలుగు మహిళల సాహిత్యాన్ని, భావజాలాన్ని,వివిధస్త్రీవాదఉద్యమసాహిత్యాన్ని మన తెలుగు రచయిత్రుల గళం తోనే దేశ రాజధాని వేదిక మీద వినిపించటం . ఆ ప్రాంతానికి తగినట్టుగా మరాఠి , బెంగాలీ , హిందీ భాషా సాహిత్యాల పరిచయంకూడా జరుగుతుంది . దక్షిణాది నుంచి తెలుగు మలయాళం భాషల సాహిత్యం ఎలాగూ ఉంది . భారత దేశంలో అన్ని ముఖ్యమైన భాషలలోను స్త్రీల సాహిత్యం విస్తృతంగా వచ్చింది. ఆ మాటకొస్తే అస్సామి , ఉర్దూ భాషల్లో కూడా బోలెడంత స్త్రీ సాహిత్యం ఉంది .ఏ భాషలో స్త్రీవాద సాహిత్యం వచ్చినా అధ్యయనం చేసి తీరాల్సిన విషయమే.
మీరుచెప్పిన దక్షిణాది భాషల సాహిత్యాన్ని ఈ సదస్సులో ఇప్పటికి పెట్టలేక పోవటం పెద్ద లోటే అనిపించినా కూడా ప్రరవే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అనేకంచేపట్టగలదని భావిస్తున్నాను.అప్పుడు తప్పని సరిగా అన్ని భారతీయ భాషలలో సదస్సులు ఏర్పాటు చేసే ఉద్దేశం వుంది .

7. ప్ర గతం లో స్త్రీవాద ఉద్యమ తోలి దశ లో అన్వేషి, అస్మిత లాంటి సంస్థలు స్త్రీల అస్తిత్వ సాహిత్యం కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించాయి. మంచి పుస్తకాలు ప్రచురించాయి. వాటికి, ప్రరవే కి సిద్దాంత పరంగా కానీ, ఇతరత్రా గానీ ఎలాంటి పోలిక లేదా వైరుధ్యం ఉన్నది?

DSC04676మల్లీశ్వరి :
అన్వేషి అస్మిత లాంటి సంస్థలు ప్రచురించిన పుస్తకాలు స్త్రీవాద సాహిత్యానికి,ఉద్యమానికి చాలా దోహదపడ్డాయి. విస్మృత చరిత్రలను వెలికితీయడంలో కొత్త తోవలను నిర్మించాయి. స్త్రీవాదాన్ని ఒక ప్రాపంచిక దృక్పథంగా తెలుగు సమాజానికి పరిచయం చేసాయి.

మిత్ర సంస్థల మధ్య పోలికలు, వైరుధ్యాలన్న ప్రశ్నే కొంత ఇబ్బందికరం. ప్రరవే నిర్మాణయుతమైన స్వతంత్ర సంస్థ. ఇప్పటి వరకూ రచయిత్రుల సొంత ఖర్చుతో నడుస్తున్నది. సెమినార్ల నిర్వహణకు విశ్వవిద్యాలయాలూ,కొన్ని కళాశాలలు, ప్రభుత్వ సాహిత్య సంస్థలు, ప్రజాసంఘాలు, సాంస్కృతిక సంస్థల సహకారం తీసుకున్నాము. ఇక్కడ రచయిత్రులు తమకీ, తమ సంస్థ అంతర్గత నిర్మాణానికీ సమాజానికీ,తమ రచనకీ మాత్రమే జవాబుదారులు.

అట్లాగే పార్లమెంటరీ రాజకీయ పార్టీల సభ్యులు , స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అయిన రచయిత్రులకి ప్రరవేలో సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంటుందని నాలుగేళ్ళ కిందటి ప్రణాళికలో రాసుకున్నాము. పాటిస్తున్నాము.

ప్రరవే నిర్మాణం విభిన్నమైనది. జండర్ అస్తిత్వం సమాన సూత్రంగా అణచివేతకి గురైన అస్తిత్వాలకు ఉప అస్తిత్వాలకు దామాషా ప్రాతినిధ్యం ఉండటం వల్ల స్త్రీల మధ్య సమానత్వ సాధనకి బీజాలు పడతాయి అన్నది ఒక అవగాహన. స్త్రీవాదం అన్న మాట స్త్రీలందరి సమస్యలనూ రిప్రజెంట్ చేసేలా లేదని, వాడుకలో దాని పరిధి తగ్గిందన్న విమర్శతో దళిత రచయిత్రులు కొంత చర్చ చేస్తున్నారు.

8. ప్ర మరో ముఖ్యమైన ప్రశ్న –మీ సదస్సు టైటిల్ భారతీయ భాషల స్త్రీల సాహిత్యం నిన్న –నేడు – రేపు. కానీ సదస్సు వివరాలు చూసినప్పుడు కేవలం “ నిన్న “ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉంది. సదస్సు లో ఆఖరి సమావేశం మాత్రమే “ వర్తమాన స్త్రీల సాహిత్యం నేడు- రేపు” కు సంబంధించినది. అందులో వక్తల ప్రసంగ అంశాలు చూస్తే ఒక ప్రధాన లోపం స్పష్టం గా కనిపిస్తోంది. స్త్రీల అస్తిత్వ సాహిత్యం అందులోని సాదృశ్య వైరుధ్యాలు , దళిత స్త్రీల సాహిత్యం, మైనార్టీ స్త్రీల సాహిత్యం, రేపటి స్త్రీల సాహిత్యం, కొన్ని ప్రతిపాదనలు. అస్తిత్వ సాహిత్యం అంటే అందులో వర్తమాన స్త్రీల సాహిత్యం లోని అన్నీ ప్రధాన ధోరణులు వస్తాయి. అయినప్పటికీ ప్రత్యేకంగా దళిత, మైనార్టీ స్త్రీల సాహిత్యం ప్రముఖంగా చర్చించటం బావుంది. కానీ వర్తమాన సాహిత్యం లో ప్రక్రియలకు ( అంటే కథ, కవిత్వం, నవల లేదా సాహిత్య విమర్శ) సరైన చోటు కనిపించటం లేదు . అలాగే సాహిత్య విమర్శా అనేది ప్రధాన అంశం. స్త్రీల సాహిత్యం బలాబలాలు సరైన సాహిత్య విమర్శ వల్లనే తెలుస్తుంది. స్త్రీల సాహిత్య విమర్శ కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ఈ సదస్సు లో అసలు స్థానం కల్పిం చకపోవటం గురించి మీరేమంటారు?

 

dscn0573కాత్యాయని విద్మహే :

భారతీయ భాషలలో స్త్రీల సాహిత్యం; నిన్న -నేడు -రేపు అనే శీర్షికతో సదస్సునిర్వహిస్తూ నిన్నకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారేమిటి అన్న్స్ది మీ ప్రశ్నలలో ఒకటి . స్త్రీల సాహిత్య చరిత్ర గతిని నిరూపించటం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. నిన్న అంటే ప్రాచీన యుగమని ,నేడు అంటే ఆధునిక యుగం అని నిర్వచించుకొని ఈ రెండు యుగాలలో వచ్చిన సాహిత్యం ప్రాతిపదికగా రేపటి స్త్రీల సాహిత్య స్వరూప స్వభావాలను సంభావించాలనే తలంపు తో రూపొందించిన సదస్సు ఇది.
ఆధునిక యుగ స్త్రీల సాహిత్యాన్ని విస్తృతి దృష్ట్యా 1857నుండి 2000ల సంవత్సరం వరకు- రెండు సమావేశాలలో చర్చిస్తున్నాం . 2000వరకు సాహిత్యం అంటే అందులో నేటి సాహిత్యం ఉంటుంది కదా! ఇక మిగిలినది 14 సంవత్సరాల కాలం . ఈకాలపు సాహిత్యాన్ని కూడా కవిత్వం ,కధ ,నవల,నాటకం, అని
ప్రక్రియ పరం గా చర్చిస్తే బాగుండేదని మీరు అంటారు . బాగానే ఉండేది కానీ రేపటి సాహిత్యం గురించి ఊహలు ,ప్రతిపాదనలు చేయటానికి అది సరిపోదు . మొత్తంగా స్త్రీల సాహిత్య ధోరణులు ,స్త్రీల సాహిత్యంలో సాధారణంగా ఉండే అంశాలు ,ప్రత్యేకతలు ,దృక్పధాలు ,వాటిల్లోని వైవిధ్యం తెలియటం అవసరం .

గత పది పన్నెండేళ్ళ గా వీటి గురించిన చర్చ సంఘర్షణ ,సంవాదమూ తీవ్రం గ జరుగుతున్నది కనుక ఆ వైవిధ్యం పై దృష్టి పెట్టి ఈ చివరి సమావేశాన్నిఈ విధం గా ఏర్పాటు చేసాం . ఒక సదస్సు కు రూపకల్పన చేసేటప్పుడు వీలయినంతవరకు ఇంతకు ముందు జరిపిన అంశాలు పునరావృత్తం కాకుండా చూసుకుంటాము . 2012 లోప్రరవే మహాసభ సందర్భంగా రెండు దశాబ్దాల (1990-2010) స్త్రీల సాహిత్యం పై- కొందరు రచయిత్రులను ఎంపిక చేసుకొని వారి సాహిత్య విశ్లేషణ లతో – సదస్సునిర్వహించాం . అలాంటి సదస్సులు ఇంకా అనేక మంది రచయిత్రుల రచనలను పరిచయం చేస్తూ జరగాల్సే ఉంది . ప్రస్తుత సదస్సు చట్రంలో అందుకు అవకాశం లేక పోయింది . దళిత బహుజన మైనారిటీ స్త్రీల సాహిత్యం పై పత్రం ఉంది కదా !అందువల్ల లోటు ఉండదనే అనుకుంటాను .

స్త్రీల సాహిత్య విమర్శకు ఈ సదస్సు లో చోటు లేక పోవటం గురించి అడిగారు … స్త్రీల సాహిత్య విమర్శ శ్రద్ధ పెట్టాల్సిన ప్రక్రియ అని మేము కూడా భావిస్తాం .” రెండు దశాబ్దాల స్త్రీల సాహిత్య గమనం గమ్యం అనే సదస్సు (2012)లో స్త్రీల సాహిత్య విమర్శ పై మూడు పత్రాలకు అవకాశం కల్పించాం కూడా . అయితే ఈ సదస్సును సృజన సాహిత్య ప్రక్రియలకే పరిమిత చేసాము . వ్యాసం , విమర్శ ఆలోచనకు సబంధించినవి కనుక వాటిపై ఎప్పుడైనా ప్రత్యేకం గా సదస్సు నిర్వహించాలని అనుకుంటున్నాం .

 

9. ప్ర గత కొద్ది కాలం గా కొందరు రచయిత్రులు స్త్రీ వాద ముద్ర కు దూరం గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అదే తరహాలో రచనలు చేస్తున్నారు కూడా. మరి అలాంటి వారి సాహిత్యానికి మీ సదస్సు లో చోటు ఇచ్చినట్లు నాకు కనిపించలేదు. మీరేమంటారు?

unnamedపుట్లహేమలత :

ప్రరవే సదస్సులో పాల్గొంటున్న రచయిత్రులంతా స్త్రీవాద ముద్ర ఉన్నవారే అని మీరు చెప్పకనే చెప్పారు :) స్త్రీవాద సాహిత్యాన్ని అర్ధం చేసుకోవటంలో సంప్రదాయక పాఠకుల్లోకి ఒక విరుద్ద భావజాలం ప్రవేశించిందేమో అనిపిస్తుంది.శరీర స్పృహ , లైంగిక స్పృహ , స్వతంత్ర భావజాలం వంటి అంశాలు పత్రికల్లో పదే పదే బహిరంగ చర్చకి రావటం ,ఆధునికులు ,అభ్యుదయ వాదులే తీవ్ర విమర్శలు చేయటం వల్ల రచయిత్రులు స్త్రీవాదులమని చెప్పుకోవటానికే భయ పడుతున్నారు . అందువల్లే నేను రచయిత్రిని అని చెప్పుకోవడానికి గర్వ పడేవారు , స్త్రీవాదిని అని చెప్పుకోవటానికి సిగ్గు పడుతున్నారు . తరతరాలుగా స్త్రీల అంగాంగ వర్ణనల్ని,శృంగారాన్ని సాహిత్యం పేరుతో చదువుతున్న సాంప్రదాయ వాదులకి ఈ తరం స్త్రీలు శరీర స్పృహతో తమ మనోద్వేగాలను కవిత్వీకరిస్తే అది వాడ కవిత్వం , నీలి కవిత్వం లా కనిపించింది.మనిషికి శరీరమూ, మనసూ వేర్వేరు కాదు. స్త్రీకి కూడా అంతే. శరీరపు ఉద్వేగాలు, బాధలూ కవిత్వానికి పనికి రావంటే గృహ హింస , ఆసిడ్ దాడులు, చంపి తగలబెట్టటం వంటి చర్యలతో ఎంతో మంది స్త్రీల శరీరాల్ని హింసించినప్పుడల్లా లింగబేధం మరిచి ఎందుకు ఉద్యమాలు చేస్తున్నాం?

దళిత బహుజన , మైనార్టీ స్త్రీల అస్తిత్వ సాహిత్యం రావటం మొదలయ్యాక వారి రచనల్లో కొత్త వస్తువు , ధోరణులు చోటు చేసుకున్నాయి.అట్టడుగు సమాజంలోని స్త్రీల మట్టి బ్రతుకులూ,ఇంటా బయటా అణచివేతలూ ,కాయకష్టం, ఆకలి పోరాటాలూ తమ సొంత గొంతులతో వినిపించారు. ఈ సాహిత్యం చదివి స్త్రీని అర్ధం చేసుకున్న వారు స్త్రీవాదులమని చెప్పుకోవటానికి సిగ్గుపడరు. ఇప్పుడు ప్రరవే తరపున మేము నిర్వహిస్తున్న సదస్సులన్నింటి లో అస్తిత్వ స్త్రీవాదాలు కేంద్రంగా ఎన్నో పత్ర సమర్పణలు జరిగాయి . పత్రాలు సమర్పించిన వారితో పాటు , పాల్గొన్న వారు కూడా స్త్రీ వాదం పై ఒక అవగాహన ఏర్పరుచుకుంటున్నారు . ఆ స్పృహ తో రచనలు చేయటం కూడా జరుగుతూ ఉంది . ప్రతి రచయిత్రీ తన రచనల్లో ఏదో సందర్భంలో తన ఆత్మ గౌరవాన్నీ , హక్కుల్నీ ప్రశ్నించి తీరుతుంది. అందుకని ప్రరవేలో అన్ని వర్గాల రచయిత్రులూ ఉన్నారనే భావిస్తున్నాను.

 

 

Kalpana profile2ఇంటర్వ్యూ : కల్పనారెంటాల

స్త్రీవాద విమర్శలో కాత్యాయని కొత్త దారి!

కాత్యాయని విద్మహే

కాత్యాయని విద్మహే

(కాత్యాయనీ విద్మహే గారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు సందర్భంగా)

తెలుగునాట స్త్రీవాద సాహిత్య విమర్శ అనగానే గుర్తుకు వచ్చే అతి కొద్ది విమర్శకుల్లో కాత్యాయని విద్మహే ఒకరు. స్త్రీవాదమంటే విదేశాలనుండి దిగుమతి చేసుకున్న వాదంగానే ఇంకా అనేకమంది వ్యాఖ్యానిస్తుండగా, స్త్రీల జీవితాల్లోని ఆరాట, పోరాటాల చరిత్ర ఈనాటిది కాదు,సంప్రదాయ సాహిత్య కాలం నాటికే వుందని సహేతుకంగా నిర్ధారించి, సాధికారికంగా చెప్పిన విమర్శకురాలు విద్మహే. ప్రాచీన సాహిత్యం పవిత్రతని నెత్తిన పెట్టుకోడమో, లేదా పరమ ఛాందసమని తీసిపారెయ్యడమో కాకుండా ఒక సమన్వయంతో, సదసద్వివేచనతో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టికోణం నుండి చూడాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా తన విమర్శనా మార్గాన్ని ఎన్నుకున్నారు విద్మహే.ఈవిధంగా చేయడం వల్ల అటు ప్రాచీన సాహిత్యానికి, ఇటు స్త్రీవాద విమర్శకు ఆమె సరైన న్యాయం చేయగలిగారు. కాత్యాయని లాంటి విమర్శకులు చేసిన ఇలాంటి కృషి వల్ల ‘దేశీయ స్త్రీవాదచైతన్యం’ మూలాలు తెలుకునే వీలు కలుగుతోంది. అయితే ఈ దిశగా తరువాత స్త్రీవాద విమర్శకులెవరూ పెద్దగా కృషి చేసినట్టు కనిపించడంలేదు.

రెండు దశాబ్దాల పైబడి తెలుగు సాహిత్య విమర్శలో కాత్యాయని చేస్తున్న కృషి ప్రముఖంగా చెప్పుకోదగ్గది. కేవలం సమీక్షాత్మకంగా కాకుండా,’లోనారసి’ విశ్లేషణ చేయడం ఆమె విమర్శలో ప్రధానమైన లక్షణం. ఈ లక్షణమే ఆమెకు, ఆమె విమర్శకు ఒక విశిష్టత చేకూర్చగలిగింది.

కాత్యాయని సాహిత్య విమర్శ కృషి ని రెండు పాయలుగా విశ్లేషించి చూడటం అవసరం. స్త్రీవాద సాహిత్య విమర్శ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టినా అంతకుందు ఆమె చేసిన కృషి మరింత ముఖ్యమైంది. కవులు, కవిత్వ విమర్శల ఆకర్షణల నుండి తప్పుకొని తథ్భిన్నంగా కవిత్వేతర సాహిత్య ప్రక్రియలైన కధ,నవల మీద దృష్టి నిలిపి ఏకాగ్రతతో కృషి చేసిన, చేస్తున్న విదుషి విద్మహే. 1977లో ఎమ్మే పూర్తి చేసి ఆధునిక సాహిత్యంలో మరీ ముఖ్యంగా నవల,కథానిక ప్రక్రియల మీద అభిరుచితో పరిశోధన ప్రారంభించారు విద్మహే.సాహిత్య చరిత్ర నిర్మాణంలో భాగంగా ఆమె వివిధ వాఙ్మయ జీవిత సూచికలు రూపొందించారు. కొడవటిగంటి కుటుంబరావు వాఙ్మయ జీవిత సూచిక, నవలా రచయతల పరిచయ విమర్శనల సూచిక ఈ కోలోనివే. కాత్యాయని 1986లో రూపొందించిన కొ.కు.వాజ్మయ జీవిత సూచిక విశేష కృషిగా చెప్పుకోవాలి.

1980లో కొ.కు. చనిపోయిన తర్వాత మొదలెట్టి కనీసం ఆరేళ్ల పాటు పరిశోధించి ఆమె ఈ సూచిక తయారుచేశారు. ఈ సూచిక తయారీ అంతా ఒక ఎత్తు, దీని కోసం ఆమె తయారు చేసిన క్షేత్ర పర్యటన మరో ఎత్తు. ముఖ్యంగా ఈ పుస్తకానికి కాత్యాయని రాసిన పీఠిక ప్రముఖంగా పేర్కొనతగినది. ఇలాంటి విస్తృతమైన కృషినే ‘తెలుగు నవలా, కథానికా విమర్శనా పరిణామం’లో కూడా చూడవచ్చు.

1995లో ప్రచురితమైన ఈ పుస్తకం మొదటి అరవై పేజీలు కధ,నవలాసాహిత్య విమర్శనా పరిణామం చెపుతుంది.తెలుగు లో మొదటి నవల ఏది లాంటి చర్చల్ని తిరగతోడకుండా ప్రస్తుత సాహిత్య సందర్భంలో వచన సాహిత్యానికి సంబంధించిన దృక్పథాంశాల్ని ఈ పుస్తకం చర్చల్లోకి తీసుకు వచ్చింది. తెలుగు సాహిత్య ప్రపంచంలో కథ,నవల ప్రక్రియలపై కలిగిన చైతన్యాన్ని చరిత్రాత్మకంగా రికార్డు చేయడం ఈ పుస్తకం సాధించి్న విజయం.

వీటికంటే ముందు 1986లో అనంతపురం లోని ‘కదలిక’ పత్రిక నుంచి పునర్ముద్రించిన ‘తెలంగాణా పోరాట తెలుగు కధ-నవల’ అనె పెద్ద వ్యాసం ప్రస్తుత సాహిత్య సందర్భంలో ప్రత్యేకించి పేర్కొనతగినది.తెలంగాణా పోరాట సందర్భాన్ని కథ, నవల సాహిత్యంలో ఎలా వ్యక్తీకరించాయన్నది ఈ వ్యాసంలో ఆమె చెప్పారు.అప్పటి రైతాంగ పోరాటంతొ, ఇప్పటి జీవన పోరాటాన్ని సరిపోల్చుతూ వచ్చిన కధల్ని కాత్యాయని విశ్లేషించారు. తెలంగాణ వాస్తవికతని, సాహిత్యంలో దాని ప్రతిఫలనాన్ని మన కళ్ళ ముందుంచే ఈ వ్యాసం అప్పటికంటే ఇప్పుడు మరింత ఉపయోగకరమైందని చెప్పవచ్చు.

ఈ పరిశోధనాత్మక రచనలన్నింటిని ఒక్క సారిగా చదవడం మొదలుపెడితే, కాత్యాయని విద్మహే సాహిత్య దృక్పథం ఏమిటో మనకు స్పష్టమవుతుంది.మొదటి నుంచి కూడా చరిత్ర దృష్టి నుంచి సాహిత్యాన్ని విశ్లేషించే విమర్శకురాలిగా ఒక ప్రత్యేక రచనని ఎలా విశ్లేషించవచ్చో చూపించే ప్రయత్నం చేశారు మరో విమర్శ పుస్తకం’చివరకు మిగిలేది:మానసిక జీవన స్రవంతి నవలావిమర్శ’(1987)లో. స్త్రీవాద దృక్పధం నుంచి కాత్యాయని రాసిన మొదటి విమర్శ గ్రంధం బహుశా ఇదే కావచ్చు. ముఖ్యంగా ఒక పురుష పాత్రకు ఫెమినిస్టు దృక్పధాన్ని ఆపాదించి, విశ్లేషించడం ఈ అధ్యయనంలో విశేషంగా చెప్పు కోవాలి.

ఆ తర్వాత నుంచి కాత్యాయని విమర్శ దృక్పధంలో మార్పు వచ్చింది. ఈ మార్పుకు దర్పణం 1998లో వచ్చిన ‘సంప్రదాయ సాహిత్యం-స్త్రీవాద దృక్పధం’.ఆమే స్వయంగా చెప్పుకున్నట్టు ‘సామాజిక,సాంస్కృతిక రంగాల్లో ఉద్యమ స్థాయిలో ప్రచారంలోకి వచ్చిన స్త్రీవాద భావజాలం, యూనివర్శిటి పరిశోధనా రంగంలోకి చొచ్చుకొచ్చిన మహిళా జీవన అధ్యయన విధానం’ రెండూ కాత్యాయని సాహిత్య జీవిత దృక్పధాన్ని ప్రభావితం చేశాయి. ప్రధానంగా ఈ పుస్తక రచన ఆమెలో వచ్చిన గాఢమైన మార్పుని చూపిస్తుంది.

ప్రాచీన సాహిత్యంలో స్త్రీ-పురుష సంబంధాల విశ్లేషణ, వాటిని స్త్రీవాద దృక్పధం వెలుగులో చూడడం ఈ పుస్తకం వుద్దేశ్యం.భారతంలో భార్యాభర్తృ సంబంధాలతో మొదలై, మహిళావాద భూమిక నుంచి కావ్య శాస్త్ర దర్శనం వరకూ ‘మిరుమిట్ట్లు గొలిపే కొత్త ప్రతిపాదనవలతో’ ఈ విశ్లేషణ సాగుతుంది.సాంప్రదాయ సాహిత్యంలో కనిపించే స్త్రీల జీవితానికి వెనుక వుండే కనపడని పితృ స్వామిక హింసా రూపాలను, ఆ సాహిత్యంలోని కధ నిర్మాణాన్ని,మాటలను,సంభాషణలను బట్టి ఎంత సమగ్రంగా తెలుకునే వీలుందో అన్వేషిస్తాయి ఈ వ్యాసాలు. స్త్రీవాద విమర్శ దిశను మార్చిన రచన ఇది. నిజానికి ఈ పుస్తకంలోని ఒకొక్క వాక్యం విస్తృతంగా చర్చించతగినదే. ఈ వ్యాసాల్లోని ఆలోచనలు ప్రసరించే వెలుగులోసంప్రదాయ సాహిత్యం మన ముందు కొత్త అర్థాల్ని స్పురింప చేస్తుంది. బహుశా ఈ విధమైన రచన కాత్యాయని లాంటి కొద్దిమంది మాత్రమే చేయగలరేమో!

(‘ఈమాట’ వెబ్ పత్రిక సౌజన్యంతో)

Kalpana profile2– కల్పనా రెంటాల