నీ పేరు జస్టిన్..

siva “నీ పేరు జస్టిన్”(Your Name is Justine) : ఇది పోలాండ్ చిత్రం. డైరెక్టర్ ఫ్రాంకో .

మారియోలా ఒక అందమైన యువతి. పోలాండ్ లోని లక్సెంబర్గ్ లో అల్లారు ముద్దుగా చూసుకునే తన అమ్మమ్మతో భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటూ హాయిగా జీవించే యువతి. తన అమ్మమ్మలా పాతతరం మనుషుల్లాగా సాదా సీదాగా సాఫీ జీవితం కాకుండా జీవితం ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా, భిన్నంగా, ఉత్తేజకరంగా తీర్చిదిద్దుకోవాలని ఉవ్విళ్ళూరుతూ కోటి కోరికలతో తపన పడుతూ ఉంటుంది. ముగ్గురు స్నేహితురాళ్ళలో ఉద్యోగం సంపాదించుకుని జీవితంలోని ప్రతి అడుగులో విజయం సాధించబోతున్న ప్రత్యేకమైన దానిలా ఉంటుంది .

ఆమెకు “ఆర్ధర్” అనే అందమైన ప్రియుడుంటాడు. ఒక రోజు ఆర్ధర్ మారియోలా దగ్గరి కొస్తాడు. ఒక సెలవు దినాన్ని యూరప్ వెళ్ళి సముద్రతీరంలో సృజనాత్మకంగా, అద్భుతంగా గడుపు దామని ఊరించే కబుర్లతో నచ్చజెప్పి మారియోలాను ఒప్పిస్తాడు. ఆర్థర్ ఆమె మాజీ ప్రియుడు కాబట్టి యూరప్ చుట్టూ విహార యాత్ర అనగానే మురిసి పోతుంది మారియోలా. విడిపోయిన ఆమెను తిరిగి పొందడానికి, ప్రేమగా మాట్లాడుతూ పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చి పెళ్ళికి ముందు అతని తండ్రి మారియోలాను చూడాలను కుంటున్నాడు కాబట్టి జర్మనీకి వెళదా మంటాడు. జర్మనీ లోని కొలోన్ లో ఉన్న ఆర్థర్ వాళ్ళ కుటుంబాన్ని సందర్శించడానికి పోలాండ్ నుండి ప్రయాణం చేయబోతున్నామని చెబుతాడు ఆర్ధర్. ట్రిప్ ప్రారంభానికి ముందు, అతను ఆమె నివసించే ప్రాంతానికి వచ్చి ఆమెను రకరకాల భంగిమల్లో నవ్విస్తూ కొన్ని ఫొటోలు, ఆమె అమ్మమ్మతో సహా కొన్నిఫొటోలు తీస్తాడు. నాన్న తమ పెళ్ళికి తొందర పడుతున్నాడనీ, ఆయనకి మారియోలాను చూపించడానికి జర్మనీకి తీసికెళ్తున్నానని కూడా అమ్మమ్మతో చెబుతాడు. తాను జర్మనీలో కాబోయే మామగారిని చూడ బోతున్నాననుకుని దారిలో చాలా ఉద్విగ్నంగా కొన్ని జర్మన్ పదాలు కూడా నేర్చు కుంటుంది మారియోలా. జర్మనీ దాటగానే బెర్లిన్ లో ఒక అపార్ట్ మెంట్ కి తీసికెళ్తాడు ఆర్ధర్. ఆ ఇంట్లో చంటిపాపతో ఉన్న ఒక మహిళ తనవంక వింతగా చూడడం, ఆ ఇంటి వాతావరణం అసాధారణంగా, తేడాగా ఉండడంతో ఆర్ధర్ తో “వెంటనే ఇక్కణ్ణుంచి వెళ్ళిపోదాం, వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం” అని అంటుంది మారియోలా. “ఒక్క రాత్రికే సర్దుకుందాం” అని అంటాడు ఆర్ధర్.

ఇంతలో ముగ్గురు రాక్షసుల్లాంటి మృగాళ్ళు వస్తారు. అతి కౄరంగా ఉన్న ఒకడు సరాసరి మారియోలా దగ్గరకొచ్చి దౌర్జన్యంగా మీద చెయ్యేస్తాడు. “ఇక నీకు ఎంతమాత్రమూ నీ అసలు పేరు మారియోలా అని ఉండదు. ఈ రోజునుంచి నీ పేరు జస్టిన్“అని అంటాడు. ఒక పక్క నుంచి తీవ్రంగా ప్రతిఘటిస్తూనే,”ఇతను మీదకొస్తున్నాడం”టూ గొప్ప నమ్మకంతో ప్రియుడికి అమాయకంగా ఫిర్యాదు చెయ్యబోతుంది మారియోలా. అందులో ఒకడి దగ్గరనుంచి నోట్ల కట్టలు అందుకుంటూ ప్రేక్షకులకు కనిపిస్తాడు ఆర్ధర్. ”నీ ప్రియుడు ఆర్ధర్ నిన్ను మాకు అమ్మేశాడు” అంటాడు చెర బట్టిన వాడు. ఆమె ప్రియుడు లోపల పైశాచిక ప్రవృత్తి గల అతి కౄరుడు. మారియోలాను పాస్ పోర్ట్ తో సహా ఒక వేశ్యను అమ్మినట్లు అమ్మేసి మరుక్షణంలో మాయమవుతాడు!

లక్సెంబర్గ్ సరిహద్దు దాటి జర్మనీలోకి ప్రవేశించి బెర్లిన్ లోని ఒక ఇంటికి తీసికెళ్ళే వరకూ ఆనందంగా ఉంటుంది మారియోలా. అంతే! ఆమె జీవితంలో సంతోషపు ఘడియ లంతరించిపోతాయి! మరుక్షణంలో జీవితం ఊహించని విధంగా భయానకంగా మారిపోతుంది! ఇక మారియోలా జస్టిన్ గా చెలామణీ అవుతూ ఉంటుంది!

అప్పటినుంచి జస్టిన్ జీవితంలో చూడలేని, భరింపరాని లైంగిక హింస మొదలవుతుంది. చెరబట్టిన ముగ్గురిలో ఇద్దరు జస్టిన్ ని చెప్పనలవి కానన్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఆమె వారించిన కొద్దీ విపరీతంగా కొట్టి కొట్టి రక్తాలు కారేలా చేస్తారు. వారిలో ఇద్దరు ఒకడి తర్వాత ఒకడు పశువులకంటే హీనంగా, నీచాతి నీచంగా ప్రవర్తిస్తారు.  జస్టిన్ కూడా చాలా బలంగా మంచి శరీర దారుఢ్యంతో ఉండి తన కున్న శక్తి నంతా ఉపయోగించి ధీటుగా ఎదిరిస్తూనే ఉంటుంది. ప్రచండంగా, భీకరమైన పోరులో శక్తి కొద్దీ శత్రువుతో పోరాడినట్లు ప్రతిఘటిస్తూనే ఉంటుంది. కానీ ఆమె శక్తి చాలదు. పెనుగులాడీ, పెనుగులాడీ నిర్జీవంగా మిగిలిపోతుంది ప్రతిసారీ. వారి రాక్షసత్వం ముందు ఆమె నిస్త్రాణంగా నిస్తేజంగా మిగిలిపోతూ ఉంటుంది. ఒకసారి కాదు,అనేకసార్లు ఆమె మీద బలప్రయోగం చేస్తారు. రోజుల తరబడి అత్యాచారం కొనసాగిస్తారు. చివరికి ఆమె కొట్టొద్దని దీనంగా వేడుకునే పరిస్థితికి వస్తుంది. వస్తూ,పోతూ తాళాలు వేసి బంధిస్తూ ఉంటారు. ఆ ఇల్లొక భూతాల కొంప లాగా, పాడుపడిన కొంపలాగా పరమ మురిగ్గా ఉంటుంది. ఎవరూ ఉండరు. తాగుదామంటే పంప్ లో నీళ్ళు రావు. ఫ్రిజ్ తెరిస్తే తినడానికేమీ ఉండవు. అమ్మమ్మను తల్చుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆకలితో అలమటించిపోతూ, ధ్వంసమైపోతున్న తన జీవితాన్ని తలచుకుని భయంకరమైన మానసిక సంఘర్షణకు గురౌతుంది. ఇంట్లో దయ్యం పట్టిన దానిలా తిరుగుతూ, తిండికోసం వెతుక్కుంటూ, అందంగా ఉన్న తన జుట్టును ఒక కత్తిని దొరిక బుచ్చుకుని బర బరా కోసేసు కుంటుంది.బట్టలు ఎక్కడివక్కడ చింపేసుకుంటుంది. అపార్ట్ మెంట్ కిటికీ తలుపుల్ని తన బలాన్నంతా ఉపయోగించి ఊడదీసి బయటికొచ్చి రక్షించమంటూ వెర్రి కేకలు పెడుతుంది. ఎవరికీ వినిపించని ఆమె కేకలు అరణ్య రోదనగానే మిగిలిపోతాయి. ఆ రాక్షసులు సుడి గాలిలా వస్తూనే ఉంటారు. భీభత్సం సృష్టిస్తూనే ఉంటారు!

వారిలో మూడోవాడు మాత్రం నేను నిన్నేమీ చేయను, నమ్మమంటాడు.  లైంగికంగా ఏ విధంగానూ వేధించడు. ఆమెను చూసి జాలి పడినట్లే, కనికరించినట్లే చేస్తాడు. ఒకరోజు తినడానికి కాస్త తిండీ, తాగడానికి డ్రింకూ తెచ్చిస్తాడు. అప్పుడప్పుడూ వచ్చి కాస్త తిండి, అవసరమైన చిన్న చిన్న వస్తువులు తెచ్చి పెడుతూ దయగా ఉంటాడు. నేను చెప్పినట్లు వింటే నీకిక్కడనుంచి విముక్తి కలిగిస్తానని నిరంతరంగా సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు. నిస్సహాయస్థితిలో ఉన్న ఆమె వినక చేసేది కూడా ఏమీ లేదు. అతడికి వేరే ప్రణాళిక లుంటాయి!

ఆమెను బయటికి తెచ్చి ఒక హోటెల్ లో కాల్ గర్ల్ గా నియమిస్తాడు. ఆ హోటెల్ రూం రష్ ని కాలింగ్ బెల్ మోగడం – వాడొక పక్కన నిలబడి డబ్బు వసూలు చేసుకోవడం ద్వారా సూచిస్తాడు డైరెక్ట్రర్ ఫ్రాంకో. విటులుగా వచ్చిన ప్రతి ఒక్కరిని “నేను మోసపోయాను.నన్ను మా అమ్మమ్మ దగ్గరికి చేర్చి సహాయం చెయ్యమ”ని వేడుకుంటుంది. ప్రతి అడుగులోనూ పదునైన బాకులు పొంచి చూస్తున్నట్లు, పగబట్టినట్లున్న ఆమె జీవితంలో అంతటి అదృష్టమేది?

ఇంతలో ఒకరోజు ఎక్కడినుంచో ప్రియుడి రూపంలో ఉన్న కిరాతకుడు ఆర్ధర్ ఊడిపడతాడు.”నీకొక చెడు వార్త” అంటూ అమ్మమ్మ మరణం గురించి చెప్తాడు. అప్పటివరకూ అంతటి దుఃఖంలోనూ “అమ్మమ్మా! నీ రాజకుమారి కఠినమైన జైల్లో ఉంది. ఎవరూ చొరబడలేని కోట బురుజులున్న రాజ భవనంలో బంధింపబడి ఉంది. స్వేచ్చగా ఎగిరే పక్షుల్ని చూడాలనుకుంటుంది”అని అనుకుంటూ అమ్మమ్మని తల్చుకుని ఊహల్లోనైనా సేదదీరే జస్టిన్ కి ఆ ఆశ కూడా లేకుండా పోతుంది. పట్టరాని కసితో ఆర్ధర్ ని చంపేస్తుంది! జైలుకి వెళ్తుంది!!

మూడేళ్ళ జైలు శిక్ష ముగిశాక కూడా మన మారియోలా గొప్ప ఆశాజీవిగా కనపడుతుంది.తన జీవితాన్ని మళ్ళీ పునర్నిర్మించు కోవాలనుకుంటుంది. కానీ తన చుట్టూ ఉన్నబయటి ప్రపంచమంతా మారిపోయి ఉంటుంది. తనకి అమ్మమ్మ లేదు! ఊళ్ళో ఎవరూ లేరు! ఉన్న ఇద్దరు దోస్తులు గుర్తొస్తారు గానీ తాను జీవితం నుంచి ఎంత దూరం జరిగిందో తెలుసుకుని నిస్తేజపడుతుంది. అసలు న్యాయం ఎక్కడుంది? ప్రేమకు అర్ధమేమిటి? స్వేచ్చ అందని వస్తువేనా? అనడంతో సినిమా ముగుస్తుంది. ప్రేక్షకుల హృదయాలు భారమవుతాయి.

మహిళలు తరతరాలుగా ఆర్జించి పెట్టి ఈ సమాజానికి అందించిన జ్ఞానం, మాతృస్వామ్య వ్యవస్థనుంచి ఇంటిపెద్దగా వారి పాలనానుభవం, శక్తి సామర్ధ్యాలు, అందం, అధికారం, అనేకరకాల స్వభావాలతో ఈ ప్రపంచాన్ని అర్ధవంతం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని అగ్ర రాజ్యాలతో సహా ఏ దేశంలోనూ మహిళల్ని మానవులుగా సమాజంలో సగ భాగంగా భావించడం లేదు. మనసుని మెలిపెట్టే బాధతో, గుండెలవిసిపోయేలా గింజుకుని, ఊపిరాడక అల్లాడిపోయే ఈ జస్టిన్ పాత్రను ప్రపంచీకరణ నేపధ్యంలో దేశ దేశాల్లోని మహిళలు నిస్సహాయమైన పరిస్థితుల్లో లైంగిక దోపిడీకి బలవుతున్న మహిళలకు ప్రతీకగా చూడాలి.

ఈ సినిమా.కథలు రెండూ “ఒసామా”, “నీ పేరు జస్టిన్” మహిళలపై ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృతమైన అసంబద్ధ క్రూరత్వం గురించి చెప్తాయి. ఒక శతాబ్దం వెనక్కి నెట్టే  ఇటువంటి పాత రాతియుగం ఆలోచనలు నమ్మటం కష్టం. మనం నవ నాగరికుల మని మురిసి పోతున్న ఈ కాలంలోనే ప్రపంచంలోని కొన్ని మూలల్లో జరుగుతున్న అమానుష చర్యలివి!

బూర్జువా ప్రపంచంలో బాల్యాన్ని,యవ్వనాన్ని, జీవితాన్ని పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా ఆ యా దేశాల్లో స్త్రీల పట్ల

జరుగుతున్న వ్యవస్థీకృత హింసలను ఎంతో ఆర్ధ్రంగా అర్థం చేసుకుని నిజాయితీగా ప్రాణాలకు తెగించి గొప్ప స్కోప్ లో బర్మెక్ తెరకెక్కిస్తే, లైంగిక బానిసత్వాన్ని ఇతివృత్తంగా తీసుకుని దిగ్భ్రాంతి కలిగేలా చిత్రాన్ని మలిచారు డైరెక్టర్ ఫ్రాంకో. మన చలం లాగా స్త్రీల స్వేచ్చ కోసం తపించి ఆర్తితో పని చేసిన ఈ ఇద్దరికీ స్త్రీజాతి తరఫున ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది.

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా 1913 లో ప్రపంచ సినిమా విశ్వవేదిక మీద కొచ్చింది. సరిగ్గా శతాబ్ద కాలం గడిచాక కూడా అంటే 2013 లో వచ్చిన ఈ రెండు సినిమాలను పరిశీలిస్తే స్త్రీల జీవితాలు ఏమాత్రం మెరుగుపడలేదనీ,వారు ఆత్మ గౌరవంతో జీవించే పరిస్థితులు అగ్రదేశాలతో సహా ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవనీ రుజువైంది.

ఆశ్చర్యకరంగా వేరు వేరు ప్రాంతాల్లో తీసిన ఈ రెండు సినిమాల్లోనూ దుర్భర పరిస్థితుల్ని అనుభవిస్తున్న కథానాయికలిద్దరూ కూడా అమ్మమ్మ ప్రేమలో స్వాంతన పొందుతారు!

“చీకటి థియేటర్ లో సినిమా చూడడం ఒక ధ్యానం లాంటిది.  నా దృష్టిలో ఇంకే కళారూపం ఇలాంటి అనుభూతిని ఇవ్వ లేదు.  చికాకులు, మానసిక ఒత్తిడితో ఒంటరి దీవులుగా మారిపోయిన నేటి మానవ కుటుంబాన్ని సమైక్య పరచే ఏకైక శక్తి సినిమా-అంటారు ఆదూర్ గోపాలకృష్ణన్. స్త్రీలూ, పిల్లలూ, అట్టడుగు ప్రజలు, బలహీనులు. సమానత్వాన్ని కోరుకుంటారు. కాస్త మెరుగైన పరిస్థితుల్లో ఉన్న మనమందరం ప్రపంచ కుగ్రామం లోని వారి పట్ల సహానుభూతితో ఉందాం. ప్రపంచం సినిమా ద్వారా బాధాసర్పదష్టులకు దగ్గరవుదాం!

ఎక్కడో తాలిబన్ లో కదా “ఒసామా”కథ, పోలాండ్ లో కదా “నీ పేరు జస్టిన్” కథ జరిగింది అని తేలిగ్గా తీసుకోనక్కరలేదు. మన దేశంలో మొన్న మన నిర్భయకీ, నిన్నమన జిషాకీ జరిగిన ఘోరాల సంగతేమిటి? పసిపాపల పట్ల ప్రతిరోజూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు?

నటీ-నటుల గురించి, చిత్ర నిర్మాణం గురించి ఎంతైనా రాయొచ్చు. కానీ కేవలం కథలకే పరిమితమవుతున్నాను. 2013 లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో “Osamaచిత్రాన్ని, 2013 లోనే “celebrating women” పేరిట జరిగిన 18 వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో “Your Name is Justine” (“నీ పేరు జస్టిన్”) చిత్రాన్ని చూశాను.

(సెప్టెంబర్ 10,11 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్వహించిన సదస్సు కోసంనన్ను ప్రభావితం చేసిన సినిమా సాహిత్యం” అనే అంశంపై రాసిన వ్యాసం)

                                                                                                                                    –

 

 

 

 

మనసు గీసిన బొమ్మలు ఈ సినిమాలు!

                     

                               siva1

                               

“ఓ నాటికి ఈ భూమండలం నాగరికతా ముఖ చిత్రాన్ని మార్చివేయగల శక్తివంతమైన నవ కల్పన సినిమా. తుపాకీ తూటా, విద్యుత్ శక్తి, నూతన ఖండాలు కనుగొనటం కన్నా ప్రధానమైన ఆవిష్కరణ సినిమా. ఈ భువిపై మానవాళి ఒకరి నొకరు తెలుసుకోవడానికి, ఒకరి కొకరు చేరువ కావడానికి, ఒకరి నొకరు ప్రేమించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సినిమా. సినిమాకు సముచిత ప్రాధాన్యత నిద్దాం. ప్రేమిద్దాం!గౌరవిద్దాం”-అని అంటారు ముస్తఫా కమాల్ అటాటర్క్.

చలన చిత్రమంటే కదిలే బొమ్మలతో కథ చెప్పేది. తక్కువ మాటలు-ఎక్కువ దృశ్యాలు. కినిమా అంటే పురోగమనమని అర్ధం. దాని సమానార్ధకమే సినిమా! ప్రపంచ సమాజంలో వెల్లి విరిసిన భావ పరంపరల వ్యక్తీకరణ సాహిత్యమైతే దాని విస్తృత దృశ్యీకరణే సినిమా! దృశ్యీకరణ ద్వారా మనిషిని చిరంజీవిని చేసింది సినిమా!

దృశ్యమైతే  జీవితాంతం మనసులో ముద్ర పడి పోతుంది. ఉదాహరణకి కన్యాశుల్కంలో సావిత్రి ఏడు నిమిషాల పాటు న  వ్విన దృశ్యం. ఒకసారి చూసిన వారు ఆ దృశ్యాన్ని మర్చిపోవడం అసంభవం. కొన్ని వందలు, వేలు, లక్షలమంది పుస్తకాలు చదివితే  ఎన్నో కోట్ల మంది  సినిమాలు చూస్తారు.ఏది సాధించాలన్నా ముందుగా ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి.భావవ్యాప్తి లేకుండా ఏదీ సాధ్యం కాదు. మన రాష్ట్రం, మనదేశం అని కాకుండా రచయితలు ప్రపంచానికి చెందినవారనుకుంటే మనం ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ ప్రపంచం వైపుకి దృష్టి సారిస్తే, ప్రతి విషాదాన్నీ మనకంటే ముందు ఎదుర్కొన్నవాళ్ళు ప్రపంచ సినిమాల్లో కనిపిస్తారు.కష్టంలో ఉన్న మనుషులకి గొప్ప దన్నూ, మనం ఒంటరి వాళ్ళం కాదు అనే భరోసా లభిస్తాయి.కనపడని సమాజం, వ్యవస్థలు మనుషుల రూపంలో చేస్తున్న ఆగడాలు తెలిసివస్తాయి.ఎవరు చెప్పినా నమ్మం కనుక మన నరనరాల్లో జీర్ణించుకు పోయిన అమానుషత్వం, అవినీతి, ఉదాసీనత, మూఢవిశ్వాసాలు, అసమర్థత, నిరక్షరాస్యతలను ఎదురుగా పెట్టి కళ్ళకు కట్టినట్లు మన జీవితాలను మనమే చూస్తున్నామా అన్నట్లు చూపిస్తాయి సినిమాలు.

ఏ వ్యక్తైనా అతని జీవితంలో వ్యక్తులనుంచి,వ్యవస్థల నుంచి వచ్చిన ఒత్తిళ్ళను తట్టుకుని నిలబడి,ప్రశ్నించి, ప్రతి ఘటించి, సామాజిక ఎజెండాను ఎదుర్కొని, ప్రజల ఆకాంక్షలను నిలబెట్టే ప్రయత్నంలో ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ  చేసే ఏ పనైనా మానవజాతి పురోగమనానికి దోహదపడుతుంది.  ప్రపంచంలోని ఎందరో ప్రతిభావంతులైన రచయితలు,కళాకారులు సినిమా మాధ్యమం ద్వారా మానవాళికి వినోదాన్నందిస్తూనే చైతన్యవంతం చెయ్యడానికి తమ జీవిత కాలమంతా శ్రమించి,పోరాడి,రహస్యంగా పని చేసి,చివరికి ప్రాణత్యాగాలు కూడా చేసి చిరస్మరణీయమైన కృషి చేశారు.

సినిమా మేధావి చాప్లిన్ తన చిత్రాల్లో పాలక సమాజాన్ని తన వ్యాఖ్యానాలతో విమర్శలతో చీల్చిచెండాడాడు.

రష్యాలో మార్క్స్ గతి తార్కిక భౌతికవాదాన్ని “మాంటేజ్” కి అన్వయించి, అద్భుతమైన చిత్రాలు నిర్మించారు సెర్గాయ్ ఐసెన్ స్టీన్,వుడోవ్ కిన్ మొదలైన ప్రపంచ ప్రసిద్ధ ప్రముఖులు.  ఫుడోవికిన్ గోర్కీ “మదర్”ని చలన చిత్రంగా నిర్మిస్తే, ఐజెన్ స్టీన్   “స్ట్రైక్” లాంటి చిత్రాలను “మాంటేజ్” విధానంలో రూపొందించారు.

లాటిన్ అమెరికా సినిమా రచయితలు. “ప్రతీకారమో, ప్రాణ త్యాగమో” అనే నినాదమిస్తూ జనంలో మమేకమై “విప్లవానికి ప్రేలుడు పదార్ధాల్లా ఉపయోగపడే చిత్రాలు తీస్తున్నాం” అంటూ గెరిల్లా సినిమాకు బాటలు పరిచారు.

జర్మనీ నుంచి పురుషాధిక్య ప్రపంచంలో నిలదొక్కుకుని 56 మంది మహిళల్లో జుట్టా బ్రుకనీర్, మార్గరెట్ వాన్ ట్రోటా, డొరిస్ డెర్రీ, హెల్కే సాండర్స్ వంటివారు ఉత్తమ ప్రపంచ దర్శకులుగా ఘనకీర్తి సాధించారు.

విదేశాల్లో అన్ని రకాల ఇజాల్లో సాహిత్యం వచ్చినట్లే, సినిమాలూ వచ్చాయి.

ఇటలీ నుంచి విట్టోరియా డిసికా తీసిన నియో రియలిస్టు సినిమా బైసికిల్ తీఫ్. సినిమా పూట గడవని మామూలు మనిషిని దోషిగా నిలబెడుతున్న కంటికి కనపడని అసలు దొంగ ఫాసిజం అని తేల్చి చెప్తుంది.1948 లో వచ్చిన సినిమా మన సత్యజిత్ రే కి ప్రేరణ నిచ్చిపథేర్ పాంచాలివాస్తవమైన అద్భుత సృష్టికి  కారణమైంది.

మన దేశం విషయాని కొస్తే సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్, భూపేన్ హజారికా, శాంతారాం, బిమల్ రాయ్, గురుదత్, శ్యాం బెనెగల్, గౌతం ఘోష్ మొదలైన ఎందరో ప్రతిభావంతులు మంచి సినిమాలతో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించారు. ఇక మన తెలుగు విషయాని కొస్తే “జాతీయోద్యమ చైతన్య దీపం చాలా చిన్నది”అని  కె.వి.ఆర్. అన్నట్లు ఆ పరిమితుల్లోనే మన సినిమాలొచ్చాయి. జాతీయోద్యమ, సంస్కరణోద్యమ ప్రభావాలతో కొన్ని విలువల్ని ప్రతిబింబించే చిత్రాలు 50,60 దశకాల్లో వచ్చాయి. “సినిమా అన్నది చాలా శక్తివంతమైన సాంస్కృతిక మాధ్యమం. దాన్ని సరిగా ఉపయోగించుకో దగ్గ ప్రతిభావంతులు ఇంకా రావాల్సి ఉంది” అన్నారు సినిమారంగంలో ఎన్నో దశాబ్దాలు గడిపిన శ్రీశ్రీ. మహాకవి అన్నట్లే ఇప్పుడెదుర్కొంటున్న ప్రపంచీకరణ విపత్కర పరిస్థితులకు ఎదురు నిలిచే, చైతన్యాన్నిచ్చే చిత్రాలు మనకి లేవు.

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా 1913 లో ప్రపంచ సినిమా విశ్వవేదిక మీద కొచ్చింది. వెయ్యేళ్ళు గడిచాక ఇప్పుడొస్తున్న సినిమాలను పరిశీలిస్తే స్త్రీల జీవితాలు ఏమాత్రం మెరుగుపడలేదనీ, వారు ఆత్మ గౌర వంతో జీవించే పరిస్థితులు ఏ దేశంలోనూ లేవనీ రుజువైంది. 1913 తర్వాత సరిగ్గా శతాబ్దం తర్వాత అంటే 2013 లో వచ్చి నన్ను అమితంగా దుఖపెట్టి, కదిలించి,  కలవరపెట్టి, మనసులో తిష్ట వేసిన  రెండు సినిమా కథల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.

మొదటి సినిమా పేరు ఒసామా”(Osama)

ఇది ఆఫ్గనిస్తాన్ చిత్రం. దర్శకుడు బర్మెక్. 1996 నుండి ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం పూర్తిగా చిత్రనిర్మాణాల్ని నిషేధించింది. ఈ సినిమా ఆఫ్గనిస్తాన్,నెదర్లాండ్స్,జపాన్,ఐర్లాండ్,ఇరాన్ కంపెనీల మధ్య ఒక అంతర్జాతీయ సహ-ఉత్పత్తి వల్ల ప్రపంచం ముందుకొచ్చింది.ఈ సినిమా ఒక నిరాశ, భయంకరమైన లేమి, మరణం, ఒక విషాదం, అన్నీ కల గలిపిన ఒక గొప్ప షాక్! బాలికలు,మహిళలకు సంబంధించి ప్రపంచ దుస్థితినీ, వారి పట్ల వ్యవస్థలు అవలంబించే దుర్మార్గమైన పద్ధతులనూ అద్దంలో పెట్టి చూపించే చిత్రం.

siva2

 

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో ఉన్న సమయంలో ప్రజలపై ఎన్నో రకాల ఆంక్షలు, పెత్తనా లుండేవి.ముఖ్యంగా మహిళలపై అణచివేత మరీ దారుణంగా ఉండేది.వారికి సామాజిక జీవితం నిషేధించ బడింది.తాలిబన్లు స్త్రీలను బురఖా ధరించి తీరాలని నిర్భంధిస్తారు.వారిని ఎవరూ చూడ కూడదనుకుంటారు. ఎందుకంటే  మహిళల ముఖం చూడడం వల్ల సమాజం లోని అన్ని రకాల అధోగతులు చుట్టుకుంటాయని, సర్వనాశన మవుతుందని తాలిబన్ల బలమైన విశ్వాసం.పనిహక్కు లేదు. అసలు స్త్రీలు భర్తతో తప్పించి బయట కనపడగూడదు.తప్పనిసరైతే బురఖాలో కాలికున్న చెప్పులు కూడా ఎవరి కళ్ళ బడకుండా ఒబ్బిడిగా వెళ్ళి, ఇంట్లో కొచ్చి పడాలి.యుద్ధాల వల్ల ఆఫ్గనిస్తాన్ లో మహిళలు వారి భర్తలు, తండ్రులు, కొడుకులను భారీ సంఖ్యలో పోగొట్టుకుని,అనాధలవుతారు.

ప్రారంభ సన్నివేశంలో “క్షమించ గలనేమో కానీ మర్చిపోలేను” అనే నెల్సన్  మండేలా సూక్తి తో  సినిమా   మొదలవుతుంది. మొదటి సీన్ లోనే పైనుంచి కిందివరకూ ముఖాలు కూడా కనపడకుండా  నీలి రంగు బుర్ఖాలు  ధరించిన   మహిళలు గుంపులు గుంపులు గా కనిపిస్తారు.

“ఆకలి మా ప్రాణాల్ని తోడేస్తుంది”.

“మేము వితంతువులం”.

“మాకు పని కావాలి”

“మేము రాజకీయం చెయ్యడం లేదు”

అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటారు.

 

చావుకి తెగించి  మనుగడ కోసం పోరాటం చేస్తున్న మహిళల మీద తాలిబాన్ సైనికులు నీటి గొట్టాలను వదలడం, గ్రెనేడ్ లాంచర్లు పేల్చడం లాంటి దృశ్యాలను ఒక పదమూడేళ్ళ బాలిక, మన కథానాయిక తలుపు సందు గుండా చూస్తుంది. ఇది చాలా శక్తివంతమైన  దృశ్యం. తర్వాత  సినిమా మొత్తం దీనీ కొనసాగింపుగా నడుస్తుంది.

ఈ దుర్భర పరిస్థితుల్లో ఒక ఇంట్లో మూడు తరాలకు  ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మహిళలు బాలిక అమ్మమ్మ-అమ్మ-మనవరాలు సాంపాదించే పురుషుడే లేకుండా దిక్కులేని వాళ్ళవుతారు. బాలిక తండ్రి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో మరణిస్తే, బాలిక మేనమామ  రష్యన్ యుద్ధంలో మరణిస్తాడు.ఆ ఇంట్లో పోషించే పురుషుడే ఉండడు. వృద్ధురాలైన తల్లినీ, బిడ్డనూ పోషించడం కోసం బాలిక తల్లి ఒక హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తుంటుంది.అమ్మాయి కూడా తల్లికి తోడుగా అదే హాస్పిటల్ లో చిన్న చిన్న పనులు చేస్తూ  అమ్మకు సహాయంగా ఉంటుంది. ఆ సమయంలో స్త్రీలు బయటి కొచ్చి పని చెయ్యకూడదు అనే ఆంక్ష విధిస్తారు తాలిబన్లు. అంతేకాదు. అకస్మాత్తుగా వీళ్లు పని చేస్తున్న హాస్పిటల్ కి నిధులు ఆపేస్తారు. ఆమెకు మూడు నెలల జీతం కూడా రావలసి ఉంటుంది. ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకునే వారెవరూ ఉండరు. పైగా తల్లీ-బిడ్డా ఎవరో పురుషుణ్ణి కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుకుని అతని భార్యా,బిడ్డలుగా బండి మీద వస్తుంటే ఆమె కాళ్ళు బయటికి కనిపిస్తున్నాయని పోలీసు ఆమె కాళ్ళ మీద లాఠీ తో కొడతాడు. నానా కష్టాలూ పడి ఆ పూటకి ఇల్లు చేరడమే గగనమవుతుంది.

ఆకలితో అలమటించి పోతామని భయపడిన తల్లీ-అమ్మమ్మ రోజులు చాలా గడ్డుగా ఉన్నాయనీ,ఏదో ఒకటి చెయ్యకపోతే ప్రాణాలు నిలుపుకోలేమనీ అనుకుంటారు. ఇంకో దారే లేని పరిస్థితుల్లో మనవరాలికి మారువేషం వేసి,అబ్బాయిగా తయారు చేసి ఏదో ఒక పనికి పంపించాలని భావిస్తారు.బాలిక మాత్రం తాలిబన్లు ఈ సంగతి తెలిస్తే తనని చంపేస్తారని భీతిల్లిపోతుంది.నిస్సహాయంగా భయం భయంగా బేల చూపులు చూస్తూనే గత్యంతరం లేని పరిస్థితిలో అమ్మమ్మ-అమ్మ చెప్పినట్లే చెయ్యడానికి సంసిద్ధమౌతుంది.అమ్మమ్మ అమ్మాయి పొడవైన జుట్టంతా జడలుగా అల్లి కత్తిరిస్తుంది.అమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న బట్టలు తెచ్చి వేస్తుంది.మొత్తానికి అందమైన సుకుమారమైన అమ్మాయి కాస్తా అచ్చం అబ్బాయిలా తయారవుతుంది.తండ్రి స్నేహితుణ్ణి బతి మాలి అబ్బాయికి చిన్న టీదుకాణంలో పనికి కుదుర్చుకుంటారు.అందరూ మారువేషంలో ఉన్న అమ్మాయిని అబ్బాయనే అనుకుంటారు గానీ తల్లితో పాటు హాస్పిటల్ పనికి వెళ్ళొస్తున్నప్పుడు చూసినఎస్పాండీఅనే బాలుడు మాత్రం ఈ రహస్యాన్ని పసిగట్టేస్తాడు. అతనేఒసామా అని పేరు పెడతాడు. ఒసామా బాలుడు కాదు బాలిక అని మిగిలిన పిల్లలకు అనుమానం వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఎస్పాండీ ఆదుకుంటాడు.నాకు తెలుసు.అతను అబ్బాయే, పేరు ఒసామా” అని చెప్పి రక్షించడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించవు.

 siva3

ఇంత దయనీయమైన పరిస్థితుల్లో కనాకష్టంగా బతుకీడుస్తున్న వాళ్ళను విధి ఈ రకంగా కూడా బతక నివ్వ దల్చుకోలేదు. గ్రామంలోని బాలుర నందరినీ తాలిబాన్ శిబిరం నిర్వహించే ఒక మతపరమైన పాఠశాలకు తరలిస్తారు. తప్పనిసరిగా ఒసామా కూడా వెళ్ళవలసి వస్తుంది. ఈ పాఠశాలలో మతగురువులు పోరాడే పద్ధతులతో పాటు, భవిష్యత్తులో వివాహాల తర్వాత వారి వారి భార్యలతో ఎలా ప్రవర్తించాలో, భార్యలను కలిసిన తర్వాత స్నానంతో వారి శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా నేర్పించే సన్నివేశమొకటి జుగుప్సతో, భయంతో వళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. బాలిక తన రహస్యాన్ని తాలిబన్ల నుంచి కాపాడుకోవడానికి అవయవాలను శుభ్రం చేసుకునే సందర్భంలో తప్పించుకోవడానికి విఫలయత్నాలు చేస్తుంది. తాలిబాన్ ఉపాధ్యాయులు పెట్టే నరకయాతనల పరిక్షల సమయంలోనే రజస్వల కూడా అయినందువల్ల  ఆమె కాళ్ళనుంచి రక్తం కారడం వల్ల, ఆమె ఒక బాలిక అని వాళ్ళకు తెలిసిపోతుంది. హాస్పిటల్ లో అరెస్ట్ చేసిన ఒక జర్ణలిస్ట్ నీ, ఒక విదేశీ వనితతో  పాటు ఆమెను జైలుకి పంపిస్తారు. పెద్ద పంచాయితీ చేసి మిగిలిన ఇద్దరికీ  మరణ శిక్ష విధిస్తారు. ఇంతలో ఒక ముసలి ముల్లా వచ్చి తాను బాలికను వివాహ మాడతానంటాడు. న్యాయ నిర్ణేతను “నన్ను ఈ ముసలివానికివ్వొద్దు. నాకు మా అమ్మ కావాలి.నన్ను అమ్మదగ్గరకు పంపించండి”అని దీనంగా,హృదయ విదారకంగా వేడుకుంటుంది బాలిక. జడ్జి మనసు కరగదు. పదమూడేళ్ళ  పసిపిల్ల పండు ముసలివానికి ఆఖరి భార్య కాక తప్పలేదు! అప్పటికే అతనికి ముగ్గురు భార్యలూ బోలెడంతమంది పిల్లలూ ఉంటారు. అది ఒక శిక్షగా ఆమెను అతని కిచ్చేస్తారు. అతని కౄరత్వం గురించి, అతని వల్ల తమ జీవితాలెలా నాశనమయ్యాయో అతని భార్యలే బాలికకు వివరించి చెప్తారు. సహాయ పడాలని ఉన్నా తాము ఏమీ చేయలేని నిస్సహాయులమని చెప్తారు.  ఇంతకు ముందున్న భార్యలతో పాటు బాలికను కూడా బంధించి, ఒక ఇంటిపై భాగంలో పెట్టి పెద్ద తాళం వేస్తాడు. ప్రతిరోజూ ముసలివాడు  పెట్టే హింస  చిన్నారిని  బాధిస్తూనే  ఉంటుందని  చెప్పకనే చెప్తారు.

ఒక వాస్తవిక కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆఫ్ఘానీ మహిళల దుస్థితిని చాలా  ఆర్ధ్ర్తతతో అద్యయనం చేసిన రచయిత  “సిద్దిక్ బర్మెక్. ఆయనే దర్శకులు, ఎడిటర్, స్క్రిప్ట్ కూడా ఆయనే రాశారు.

మహిళలకు “గౌరవం” సంగతి అటుంచి  అమానుష భౌతిక, మానసిక హింసలు  జీవితకాలమంతా  ఆఫ్గనిస్తాన్ లో  అమలవుతున్నవి. ఒక మహిళను గొంతు వరకూ పాతి పెట్టి ఆ పైన రాళ్ళు రువ్వే దృశ్యం కూడా  ఉందీ సినిమాలో! ఆఫ్ఘానీ మహిళల జీవిత సమస్యలను అర్థం చేసుకుని విశ్లేషించడానికి ఎంతో గుండెనిబ్బరం ఉండాలి. అయినా సరే మొట్టమొడటగా ఇంత ధైర్యం చేసిన బర్మెక్.ను ఎంతప్రశంసించినా తక్కువే!

బూర్జువా ప్రపంచంలో బాల్యాన్ని,యవ్వనాన్ని, జీవితాన్ని పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా మొత్తం దేశాన్ని తద్వారా తాలిబన్ ఇనుప పాలనను గొప్ప స్కోప్ లో బర్మెక్ చూపించారు.

రెండో సినిమా గురించి తర్వాత సంచికలో చెప్పుకుందాం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చిగురంత ఆశ ..ఈ చిన్ని సినిమా!

 

siva

 

శివలక్ష్మి 

~

గర్ల్ రైజింగ్ (Girl Rising)  అనే ఈ స్పెషల్ ఇంట్రస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ న్యూయార్క్ లో చిత్రీకరించబడింది.

ఈ చిత్ర దర్శకుడు రిచర్డ్ రాబిన్స్ .

ఈ సినిమా నిడివి గంటా 41 నిమిషాలు.

 

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆడపిల్లలు పుట్టిన దగ్గరనుంచి పెరుగుతున్న క్రమంలో పడుతున్న దారుణ మైన హింసల్ని రికార్డ్ చేసిన చిత్రమిది. బాల్య వివాహాలు,  పిల్లల బానిసత్వం, నిరక్షరాస్యత, పేదరికం, మానవ రవాణా మొదలైన సమస్యల గురించి హృదయ విదారకమైన కథలు చెబుతుంది. 9 దేశాల ప్రతినిధులుగా 9 మంది బాలికలు ఈ అడ్డంకులన్నిటినీ అధిగమిస్తామని గొప్ప ఆశావాదాన్ని వినిపిస్తారు.

కంబోడియా మురికి వాడ నుంచి వచ్చిన అనాధ “సోఖా” చురుకైన విద్యార్ధిగా, ‘నర్తకి’ గా మారిన విధానాన్ని మనసులో నిల్చిపోయేటట్లు చిత్రించారు.

నేపాల్ నుంచి “సుమ బలవంతపు దాస్యం నుంచి తాను తప్పించుకుని మిగిలిన తనలాంటివారిని తన సంగీత విద్య ద్వారా బాధ్యతగా తప్పించే పనిలో నిమగ్న మవడం చూస్తాం.

ఇండియా నుంచి కలకత్తాలో రోడ్డు పక్కన నివసించే ఒక తండ్రి తన చిన్నారి పాప  “రుక్సానా లోని ఆర్టిస్ట్ ని గుర్తించి ఆమె కోసం కుటుంబమంతా తమ  ప్రాధమికావసరాల్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతారు. రోడ్డు మీద నివశించే వారి కుటుంబం ఒకసారి కురిసిన తుఫాన్ లాంటి వర్షంలో అల్లాడిపోతుంది.”వెయ్యి నదులు కక్షతో ప్రవహిస్తున్నట్లు వర్షిస్తుంటే,నిలువ నీడలేని మా అందరితో పాటు నా చిత్రలేఖనాలు కూడా రోదిస్తున్నట్లనిపిస్తుంది. నానిపోయిన నా డ్రాయింగ్స్ ని ఏమూల ఆరబెట్టాలి?” అంటుంది రుక్సానా ఏడుపు గొంతుతో.

అలాగే పెరూ దేశం నుంచి “ సెన్నా” అనే పాప పేరుని క్లాస్ రిజిస్టర్ నుంచి స్కూలు ఫీజ్ కట్టనందు వల్ల    తీసేస్తారు.తల్లిని చదువుకుంటానని అడుగుతుంది. తల్లి “మన దగ్గర డబ్బుల్లేవమ్మా” అని చెప్తుంది. తల్లికి సహాయం చేస్తూనే మళ్ళీ క్లాస్ కెళ్తుంది. బహుశా అది పేద దేశమైనందు వల్లనో ఏమో స్కూలు బిల్డింగ్  లాంటి వేమీ ఉండవు.ఒక ఖాళీ జాగాలో టీచర్ పాఠాలు చెప్తూ ఉంటుంది.నిశ్శబ్దంగా మన పాప వెనక బెంచీలో కూర్చుని పాఠాలు వింటూ ఉంటుంది. టిచర్ చూసి “మీ అమ్మ స్కూలు ఫీజ్ ఇచ్చిందా”? అనడుగుతుంది.పాప ధైర్యంగా “లేదు. మా దగ్గర డబ్బు లేదం”టుంది.ఐతే క్లాస్ నుంచి  వెళ్ళిపొమ్మంటుంది టిచర్. మొదటిసారి నిరాశగా వెళ్ళిపోతుంది సెన్నా. చదువుకోవాలనే కోరిక ఆ పాపని నిలవనీయదు. ఎన్నిసార్లు వెళ్ళమన్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది.ఇక చివరికి టీచర్ కి ఆ పాప పట్ల ఇష్టం పెరిగిపోయి చిరునవ్వుతో చూస్తూ ఉండిపోతుంది.చిత్రం ముగుస్తుంది.

“నేను చదువుతాను. నేను చదువుకుంటాను. నేను నేర్చుకుంటాను. మీరు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తే నేనింకా బలంగా పోరాడతాను” – అని కధకురాలు తన గొంతుతో చెప్తుంది గానీ ఆ పాప తాను చదువుకోవాలనే విపరీతమైన తన కాంక్షను తన నటన ద్వారా అద్భుతంగా వ్యక్తీకరించింది. “ఒకవేళ మీరు గనక నన్ను దూరంగా పంపిస్తే మీరు ఉండమనేవరకూ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను” అని చెప్తూ నటించడం కాకుండా ఆ చిన్ని పాత్రలో జీవించి చూపించింది.కాకరాల గారంటారు “పాత్రలలో చిన్నా, పెద్దా అని తేడాలుండవు. ప్రతిదీ ప్రత్యేకమైనదే”అని.

అమ్మాయిలందరూ ఎవరికి వారే సాటి అని అనిపించినప్ఫటికీ ఈ సెన్నాపాప కథ చాలా ఆశాజనకంగా ఉండి నాకు విపరీతంగా నచ్చేసింది. అసలు సినిమాలో ఈ పాప కథని నడిపించే సంగతేమిటంటే  “వారియర్ ప్రిన్సెస్ సెన్నా”లా పెరగాలని తండ్రి ఆమెకు ఆ పేరు పెడతాడు. అతను సెన్నాకి పాఠశాలకి వెళ్ళి బాగా చదవాలని చెప్తుండేవాడు. తర్వాత తండ్రి ఒక బంగారు గని మైనింగ్ ప్రమాదంలో మరణిస్తాడు. ఆమె తండ్రి ఆదేశం ప్రకారం స్కూలుకి వెళ్ళడానికి తన శక్తికి మించి ప్రయత్నించి తన కోరికే కాక తండ్రి ఆశయాన్ని నెరవేర్చే దిశగా దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తుంది. పౌరహక్కుల సంఘం నాయకుడు పురుషోత్తం గారిని హైదరాబాద్ లోని దిల్ శుక్ నగర్ లో నడిరోడ్డుమీద గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెడితుంటే వాళ్ళ పాప మాత్రం (పదేళ్ళుంటాయేమో) నిబ్బరంగా ఉంది. అస్సలేడవలేదు.”ఏంట్రా, నీకేడుపు రావట్లేదా?” అనడిగితే “బాపు నాకు ఏడవద్దని చెప్ఫాడు” అని చెప్పింది. తండ్రి చెప్పిన మాటను తు.చ. తప్పకుండా పాటించాలనుకునే సెన్నాని చూసినప్పుడు నాకది గుర్తొచ్చింది!

అసలెందుకిలా జరుగుతుంది? ఈ అమ్మాయిలేమీ అసాధ్యమైన, గొంతెమ్మ కోరికలు కోరడం లేదు కదా? ఈ పిల్లలు భావి ప్రపంచపౌరుల కిందికి రారా? వీళ్ళు విద్యావంతులవ నవసరంలేదా? అనే భావాలతో హృదయం తల్లడిల్లిపోయింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి “అమీనా” “నా తండ్రి నాకు పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు నాకు 11 సంవత్సరాలు” అని అంటుంది.

అలాగే తొమ్మిది మంది  బాలికల కథలు తొమ్మిది రకాలైన ప్రత్యేక కథనాలైనప్పటికీ ఇవి ప్రపంచంలోని అన్ని దేశాల్లో సర్వ వ్యాపితమైనవే. ఎక్కడో జరుగుతున్నట్లనిపించవు.మన చుట్టూ మనం చూస్తున్న సంఘటనలే అనిపిస్తాయి!

“ఇంత  అందమైన ప్రపంచంలో అందం,ఆనందాలతో పాటు ఇంత కౄరమైన నీచత్వం ఒకే చోట  ఎలా కలగలిసి ఉంటున్నాయి?” అని అంటుందొక పాప.

“బాలికలు ఎప్పటికీ సమస్య కాదు. వారు అన్నిటికీ పరిష్కారాలు సూచించగలరు. మీరు ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టాలన్నా, ప్రపంచ ఆర్థికపరిస్థితిని మెరుగు పరచాలన్నా అమ్మాయిల్ని చదివించండి” అని అంటుందింకొక అమ్మాయి.

“నేను మా ప్రాంతాల్లో అమ్మాయిల వేలం  పాట విన్నాను.పురుషులను కూడా అలాగే వేలం  వెయ్యండి” – అని ఒక పాప అంటే,

“నావిషయంలో ఏంజరిగిందో ప్రతిదీ నేను మీకు చెప్పలేను. కానీ ఆ హింసను నేను నాజన్మలో మర్చిపోలేను” – అని మరొక అమ్మాయి అంటుంది.

సామాజిక కార్యకర్త మరియాసియర్రా ఒక ఇంట్లో బానిస చాకిరీ చేస్తున్న ఒక అమ్మాయికి స్వేచ్చ నివ్వమని అడుగుతుంది. ఆ యజమాని నిరాకరించినప్పుడు ఆమె వివిధ చట్టాల గురించి వివరించి చెప్పి ఆయన నొప్పించి అమ్మాయికి విముక్తి కలిగిస్తుంది.

“మీరు గనక నన్ను ఆపివేస్తే, నా వెనక లక్షలమంది అమ్మాయిలు ఈ కారణం కోసం పని చేస్తారు”.

“చదువుతో ఏదైనా చేయగలనని భావిస్తున్నాను.ఆడపిల్లల ప్రపంచాన్ని మార్చే శక్తి వస్తుంది”.

“చదువుకుని ఆర్ధికంగా నా కాళ్ళమిద నేను నిలబడగలిగితే నాకు నేనే స్వంత మాస్టర్ నవుతాను”

“నేను మేకల పర్యవేక్షణలో ఉన్నప్పుడు అమ్మాయిల కంటే మేకలే మంచి స్థితిలో ఉన్నట్లనిపించింది”.

ఈ విధంగా అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ కోరికల్ని, అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. తమ వ్యక్తిగత బాధామయ ప్రయాణాలను ప్రపంచంతో పంచుకోవడం ద్వారా ఒక్కొక్కరూ ఒక్కో ఉపాధ్యాయురాలి లాగా మారినట్లు ప్రేక్షకులకు కనిపిస్తారు. సినిమా చూచిన వారందరికీ మెరుపు తీగల్లాంటి తొమ్మిదిమంది అమ్మాయిలు మన మనో ఫలకంపై ముద్ర పడిపోతారు. ఆడపిల్ల  చదువుకుని విద్యావంతురాలైతే ఆమె జీవితం లోనే కాక ప్రపంచాన్నే మార్చగలిగిన శక్తి వస్తుందనే ఆశాభావాన్ని కలిగిస్తారు.

ఈ కథ సాధారణమైనదే! ఇది మొదలూ కాదు, అంతమూ కాదు. కానీ ఈ పిల్లల్లో కనిపించే గొప్ప ఉత్తేజం ఆనందం కలిగిస్తుంది. ఒక్కొక్కరినీ చూస్తుంటే శతాబ్దాలుగా చెత్త పోగులో పడి ఉన్న “ఆమె” ఇప్పుడు కటిక చీకటిలో అందమైన మిణుగురుల పంట పండిస్తుందనిపించింది!

ఇది వినూత్నమైన పద్ధతిలో నిర్మించిన ఒక కథా చిత్రం. ప్రపంచ మంతటా ఎదుర్కొనే ప్రమాదకరమైన అసమానతలను విశ్లేషించారు. తీవ్రంగా కలతపెట్టే సమస్యల చర్చలున్నాయి. ఆడపిల్లల సాధికారత, విద్య, సమానత్వాల గురించి చర్చించినప్పటికీ, ఈ అమ్మాయిలు ఎలా దోపిడీ అణచివేతకు గురౌతున్నారో చిత్రించడానికి భయానక శబ్దచిత్రం గా రూపొందించారు. ఎదుగుతున్న తరం కూడా తమ స్త్రీజాతి ఇక్కట్ల గురించి తెలుసుకోవాలని, అవగాహన కలిగించాలని ఒకవేళ వారి తల్లిదండ్రులు ఎవరైనా అనుకుంటే ఈ సినిమా చూపించడానికి  ప్రయత్నించే వీలే లేదు. తమ టీనేజ్ ఆడపిల్లలతో కూర్చుని ఈ చిత్రాన్ని చూడడం గానీ, వాళ్ళకు ఈ కల్లోల పరిస్థితుల్ని వివరించి చెప్పడం గానీ, ఆలోచనలు పంచుకోవడం గానీ కుదరదు. వారి పెద్దలకు చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంటుంది!

ఒక్కో అమ్మాయి కథను కు చెందిన ఆయా దేశాలకు చెందిన ఒక్కో ప్రఖ్యాత రచయిత రాశారు. సామాజిక కార్యకర్త మరియా-సియర్రా గొంతుతో పాటు, ఆయా దేశాల ప్రముఖ నటీమణుల స్వరాలతో కధనాన్ని హృద్యంగా దృశ్యీకరించారు దర్శకులు రిచర్డ్ రాబిన్స్. ఆయన ఆస్కార్ నామినేటెడ్ డాక్యుమెంటేరియన్.

మొత్తానికి పాఠశాలకు వెళ్ళాలని  కలలు కంటున్న  అద్భుతమైన అమ్మాయిలు వీళ్లంతా! ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి బాలికలు 66 మిలియన్ల మంది ఉన్నారని తెలుస్తుంది. ఒక్కోఅమ్మాయి ధైర్యంగా చదువుకోవాలని ఆరాటపడడం చూస్తే ఎవరికి వారు వారి వారి దేశాల్లో విప్లవాలు చేసేటట్లున్నారు !

ఇంత గొప్ప దర్శకులు రిచర్డ్ రాబిన్స్ పిల్లల్ని విప్లవాలనుంచి తప్పించే ప్రయత్నంలో ఉన్నారా అనే విషయం నిరాశ పరిచింది. నిజంగా స్పష్టమైన మూల కారణాలను అన్వేషించే ప్రయత్నమైతే కనిపించలేదు.  రిచర్డ్ రాబిన్స్ బాలికలకు విద్యా, సమానత్వం కోరుతూ పని చేసే  “10” అనే ఒక సామాజిక సంస్థ డైరెక్టర్. ప్రపంచమంతా దీని శాఖలున్నాయి.

“అదిగో చూడండి,అక్కడ పీడితులున్నారు.బాధితులున్నారు” అని చెప్పడానికి అసలు విషయం చెప్పకుండా నిజమైన స్ట్రగుల్స్ నిర్మించకుండా వారిని దిష్టి బొమ్మలుగా చూపిస్తూ తమ భవిష్యత్తుని దేదీప్యమానంగా వెలిగించుకుంటారు కొందరు ఎన్ జీ వో  సంస్థల నాయకులు. పీడితుల వెతల్ని హృదయ విదారకంగా వర్ణిస్తూ మన రచయితల్లాగే అవార్డులూ, రివార్డులూ ఆస్కార్ నామినేషన్లూ సాధించుకుంటారు. కానీ పీడితుల, బాధితుల పరిస్థితులు ఎప్పటికీ మారవు. ప్రభుత్వాలు కోరుకుంటున్నట్లే వీళ్లకు కూడా  యధా తధ పరిస్థితులు  కొనసాగాలి. చిత్ర నిర్మాణాలకు దర్శకులకు,రాయడానికి రచయితలకు మాత్రం వాళ్ళ బాధలు కావాలి,ఆ తర్వాత బాధితులు ఎలా చస్తే మనకెందుకు మన బహుమతులు మనం గెల్చుకోవాలి అని కోరుకుంటారు!

“పిల్లలు స్త్రీలు బలహీనులు.నిరుపేదలు.సమానత్వాన్ని కోరుకుంటారు.బలవంతులకి ఆ ఆలోచనే ఉండదు”- అని అరిస్టాటిల్ 348 B.C.లోనే చెప్పాడు. అప్పటినుంచి ఇప్పటివరకూ హింసను కొనసాగిస్తున్న ప్రపంచ పాలకుల, వారి మద్దతు దార్ల ఘనతను ఏమని కొనియాడాలి?

మానవత్వం అనేది ఏమిటో మచ్చుకైనా తెలియని పెట్టుబడి చేస్తున్న విధ్వంసమిది!మార్కెట్ కి వినియోగదారులుగా పనికిరాని, కొనుగోలు శక్తి లేని పేద ప్రజలను ఏకంగా  మట్టుబెట్టాలని చూస్తుంది. ఈ సినిమాలో కనిపించే అసలు రహస్యం ఇదే! దీనంతటికీ మూల కారణాలైన కేపిటల్ గురించీ, మార్కెట్ గురించీ చెప్పకుండా చేసిన ఈ దృశ్యీకరణ ఎంత బాగున్నప్పటికీ, పేదలపట్ల జరుగుతున్న ఈ ఘోరకలిని మెచ్చుకోలేం!

“సాధారణ ప్రజలు మనకంటే చాలా తెలివైనవాళ్ళు. ఈ కష్టాల వ్యవస్థలో ఎలా బతకాలో వాళ్ళకి తెలుసు.ఎవరూ ఏమీ చెయ్యకపోయినా ఫరవాలేదు. మీరందరూ హాయిగా బతకండి.  కానీ వారి ఉద్యమాలకు వెనకుండి మద్దతు నివ్వండి” అని అంటారు  మహాశ్వేతా దేవి. మన వంతుగా కనీసం అది చేసినా చాలు!

నేనీ సినిమా గోతెజెంత్రం (జర్మన్ ఫిల్మ్ క్లబ్) లో చూశాను.

 

~

  ప్రపంచ శ్రమజీవుల సినిమా “స్ట్రైక్”

strike

 

-శివలక్ష్మి 

 ~

1925 లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన అత్యద్భుతమైన ఆవిష్కరణస్ట్రైక్. ఈ సినిమా డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చిత్ర నిర్మాత “సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్. ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన  రాజకీయ చిత్రం. దీని నిడివి ఒక గంటా,ఇరవై రెండు నిమిషాలు.

కథలోకి వెళ్ళి క్లుప్తంగా చెప్పుకోవాలంటే – ఒక మెటల్ ఫ్యాక్టరీలో 25 రూబిళ్లు ఖరీదు చేసే ఒక మైక్రోమీటర్  మాయమవుతుంది. ఆ నేరాన్ని యాజమాన్యం యాకోవ్అనే కార్మికుడి మీదకు నెడుతుంది. అవమానభారంతో అతను ఉరి వేసుకుని మరణిస్తాడు. యాకోవ్ ఉరి తీసుకునే ముందు తనకు జరిగిన అన్యాయం గురించి తన సహ కార్మిక సోదరులకు వాస్తవాలను వివరిస్తూ రాసిన ఒక లేఖను వదిలి వెళ్తాడు. ఆ లేఖతో పాటు, యాకోవ్ వేళ్ళాడుతున్న శవాన్ని చూసిన కార్మికులు పట్టరాని ఆగ్రహంతో పని అక్కడికక్కడే ఆపేసి, మిల్లింగ్ గది వదిలేసి మెరుపు సమ్మెకు దిగుతారు. స్ట్రైకర్స్ వదులుగా ఉన్న మెటల్ ని, రాళ్ళని కొలిమి కిటికీల నుంచి విసురుతూ ఫ్యాక్టరీ పనికి ఆటంకం కలిగిస్తారు. అప్పుడు యాజమాన్యం మండిపడుతూ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ గేట్ల లోపల కార్మికులందర్నీ నిర్భందిస్తుంది. కోపించిన శ్రామికులు కార్యాలయాన్ని ఆక్రమించి ఒక అధికారిని బలవంతంగా ఒక బండి చక్రానికి గట్టి కొండ పక్కనున్న వాగు నీటిలో ముంచుతారు. ఆ రోజు నుంచి కార్మికులు పనిని స్తంభింపచేయడం వల్ల ఫ్యాక్టరీ ఖాళీగా ఉండి, కళావిహీనమై పోతుంది. రాబడి ఆగిపోయినందువల్ల యాజమాన్యం ఆగ్రహం రోజు రోజుకీ   పెరిగిపోతూ ఉంటుంది. శ్రామికులు ఐక్యంగా ఉండి, సమిష్టి ఆలోచనలతో తమ డిమాండ్లు రూపొందిస్తారు. అవి

1) కార్మికులందరికీ 8 గంటల పని దినం కావాలి

2) యాజమన్యం శ్రామికులను మర్యాదగా,సాటి మనుషులుగా చూడాలి.

3) 30% వేతనం పెంచాలి.

4) బాల కార్మికులకు 6 గంటలకు మించి పని ఉండరాదు.

ఈ నాలుగు ముఖ్యమైన డిమాండ్లతో తయారైన ఒక రాత ప్రతిని  కార్మికులు యాజమాన్యం ముందుంచుతారు. ఈ దరఖాస్తును యాజమాన్యం – పెట్టుబడి పెట్టిన వాటాదారులు కలిసి కూర్చుని సిగార్ల ధూమపానం పీలుస్తూ, రకరకాల  పానీయాలు సేవిస్తూ మహా విలాసంగా తమ సమావేశంలో చర్చిస్తారు.

ఇంతకీ చర్చల అనంతరం ఏం సెలవిచ్చారనుకున్నారు?

8 గంటల పని దినం చట్ట విరుద్ధమైనదన్నారు!

బాల కార్మికులకు 6 గంటల పని దినం అడగడం అన్యాయమన్నారు!

30% వేతన పెంపకం, తోటి మనిషిని మనిషిగా మర్యాదగా చూడడ మనే మిగిలిన డిమాండ్ కూడా న్యాయ సమ్మతమైనది కాదని నిర్ద్వద్వంగా తిరస్కరిస్తారు!!

ఇదంతా  వాటాదారుల ఆదేశాలతోనే, వాళ్ళ ఆజ్ఞానుసారం ప్రకారమే జరుగుతుంది.

ఆగ్రహించిన కార్మికులు సమ్మెకు దిగుతారు. రోజుల తరబడి సమ్మె కొనసాగుతుంది.రెక్కాడితేగాని డొక్కాడని శ్రామికుల కుటుంబాలు  పసిబిడ్డలతో సహా ఆకలి బాధలకు అల్లాడిపోతుంటారు. యాజమాన్యం కార్మికుల పట్ల ఏమాత్రం సానుభూతి లేకుండా తాను పట్టిన పట్టు వీడదు. శ్రామికుల నిరసన తీవ్రరూపం దాలుస్తుంది. పోలీసులు పురికొల్పడంతో శ్రామిక వర్గంలోనే ఉన్న దుష్ట కార్మికులు పోలీసులతో కుమ్మక్కై సోదర కార్మికులకు అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచే భ్రష్టాత్వనికి పాల్పడతారు. యాజమాన్యపు గూఢచారులు జరుగుతున్న పరిణామాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ అప్రమత్తంగా కాపలా కాస్తుంటారు. వీళ్ళందరూ కలిసి – ఆకలి మంటలను సహిస్తూ ,సర్వ శక్తులూ కేంద్రీకరించి సమ్మె చేస్తున్న కార్మికులపై అగ్నిమాపక విభాగంతో, పోలీసులతో దాడి చేయిస్తారు. ఇంతలో సైనిక సిబ్బంది నలువైపులా చుట్టు ముట్టడంతో కార్మిక శక్తి చెల్లాచెదురవుతుంది.

“మాలో పిరికి వాళ్ళు లేరు. దేశద్రోహులు లేరు. మా చివరి రక్తపు బొట్టు వరకూ మేము మా డిమాండ్లను సాధించు కోవడానికి శాయశక్తులా పాటు పడతాం” – అని నినదించిన శ్రమ జీవులందరూ అమరులవుతారు.  ఆ ఆవరణమంతా శ్రమ జీవుల శవాల గుట్టలతో నిండిపోతుంది. సినిమా ఒక విషాద నెత్తుటి టోన్ లో ముగుస్తుంది.

స్థూలంగా ఇదీ కథ. కానీ ఈ సినిమాని ఐసెన్ స్టీన్ దృశ్యకావ్యంగా మలిచిన విధానం చెప్పాలంటే అదొక గొప్ప వచన కావ్యమవుతుందని సినీ విమర్శకులూ, మేధావులూ అన్నారు.

ప్రస్తుతం నాకర్ధ మైనంత మేరకు మే డే సందర్భానికి వర్తించే విషయాలు ప్రస్తావించుకుందాం!

అప్పటికింకా టాకీలు రాలేదు. అదొక నిశ్శబ్ద యుగం. ఈ ‘స్ట్రైక్’ అనే నిశ్శబ్ద సినిమాకి ప్రధానంగా మూడు గొప్ప  లక్షణాలున్నాయి .

మొదటిది ముందు తరాల విప్లవ చరిత్ర,

రెండోది సమూహాల కథ,

మూడోది మాంటేజ్ తాకిడి అంటే రెండు విరుద్ధ సంఘటనల ఘర్షణ సృష్టించి తాను చెప్పదలచుకున్న కొత్త విషయాన్ని చెప్పడం.

ఐసెన్ స్టీన్ ముందు తరాల కార్మికులు రోజంతా పని, అంతులేని పనిగంటలు, వెట్టి చాకిరీతో విసిగిపోయారు. పని వేళలకోసం, పని స్థలంలో కనీస సౌకర్యాలకోసం, చేసిన చాకిరికి సరైన కూలికోసం, మరీ ముఖ్యంగా 8  గంటల పని దినం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎక్కడివారక్కడ ఆందోళనలు, ఉద్యమాలు,సమ్మెలు చేశారు. ఫలితంగా  చిలికి చిలికి ఉధృతమైన వడగళ్ళవానగా రూపుదిద్దుకుని 1886 మే 3 న చికాగోలో  బద్దలైంది. ఆరోజు 25000 మందితో కార్మికులు గొప్ప ఊరేగింపులో పరిసరాలు హోరెత్తేలా కదం తొక్కారు. తర్వాత రోజు హే మార్కెట్లో జరుగుతున్న కార్మిక సభపై పోలీసులు అతి కౄరమైన వికృత వీరంగం చేశారు. “మతియాస్ డేగన్” అనే ఒక పోలీసు అధికారిని గుర్తు తెలియని వ్యక్తి పేల్చినందుకు, దుర్మార్గంగా అనేకమంది కార్మికుల్ని పోలీసులు కాల్చి చంపారు. అమెరికా ప్రభుత్వం ఒక బూటకపు ఎన్ కౌంటర్ జరిపి ఆనాటి కార్మిక నాయకులు పార్సన్స్, స్పైజ్, ఎంగెల్స్ లను ఉరి తీసింది.దీని ఫలితంగా 1890  లో పారిస్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టుల సమావేశం  మే 1 తేదీనిఅంతర్జాతీయ కార్మిక పోరాటదినంగా పాటించాలని తీర్మానించింది.అప్పటినుంచి ప్రపంచవ్యప్తంగా ఉన్న కార్మికులు చికాగో వీరుల బలిదానాన్ని స్మరించుకుంటూ మేడేని తమ విముక్తి పోరాటాలదినంగా జరుపుకుంటున్నారు.

మహత్తరమైన ఈ మే డే పోరాటాలతో పాటు 1917 లో రష్యన్ కార్మిక వర్గం దేశంలోని జాతులన్నిటినీ ఏకం చేసి జరిపిన అక్టోబర్ విప్లవం అంతర్జాతీయంగా వ్యాపించి ఉన్న కార్మిక ప్రపంచానికి ఒక గొప్ప విస్ఫోటనం లాగా, అద్భుతమైన వర్గపోరాటంగా రూపుదిద్దుకుంది.

తనకు  గొప్ప ప్రేరణ నిచ్చిన  19 వ శతాబ్దంలోని తన ముందు తరాల ఉద్యమాల నన్నిటినీ, విప్లవ పోరాట ప్రభావాలనన్నిటినీ  ఈ సినిమాలో అపురూపంగా ఆవిష్కరించారు ఐసెన్ స్టీన్.

ఇక ఈ సినిమా రెండో లక్షణం-సమూహాల కథ. కార్మిక సమూహాల కథ. ఇది ఏ ఒక్కరి కథా కాదు. ప్రాంతం రష్యా కావచ్చు గానీ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న కోట్లాది శ్రమజీవుల కథ. వస్తువు విశ్వజనీన మైనది. సినిమా ప్రారంభమే వ్లాదిమిర్ లెనిన్  కొటేషన్ – “The strength of the working class is organization. Without organization of the masses, the proletarian is nothing. Organized it is everything. Being organized means unity of action, unity of practical activity” తో మొదలవుతుంది. తర్వాత బాతులు, బాతు పిల్లలు, పిల్లి పిల్లలు, పందిపిల్లలు, మొదలైన జంతువుల యొక్క ఫుటేజ్  కనిపిస్తుంది. యాజమాన్యం-పెట్టుబడి పెట్టిన వాటాదారుల సమావేశంలో ఒక నిమ్మకాయను రసం తీసే మెషీన్ లో పెట్టి పీల్చి పిప్పి చేస్తుంటాడొక వాటాదారుడు.అంటే శ్రమిస్తున్న మనుషులమీద అపరిమితమైన ఒత్తిడి ఉందని, వాళ్ళను సాటి మనుషులుగా కాక జంతువుల కంటే హీనాతిహీనంగా చూస్తున్నారని దీనర్ధం. కార్మికులు ఐక్యంగా ఉండి వళ్ళంతా కళ్ళు చేసుకుని, ఎంతో శ్రద్ధాసక్తులతో తమ డిమాండ్లను ఒక రాతప్రతి లో రూపొందిస్తారు.యాజమాన్యం-వాటాదారులు అసలు వర్కర్స్ ని ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా ఆ దరఖాస్తు ఫారం గురించి అసలు సీరియస్ గా తీసుకోకుండా దానితోనే టేబిల్ మీద చిందిన మత్తుపానీయాలను తుడుస్తారు. కార్మికులు ప్రాణాలుగ్గబట్టి రాసిన దరఖాస్తులోని విషయాలు శ్రమ జీవులకు జీవన్మరణ సమస్యలు. అవే సమస్యలు యాజమాన్యాలకు పనికిమాలినవిగా, అసంబద్ధంగా కనిపిస్తాయి. వేళ్ళతో లెక్కించదగినంత మంది, వేలాది మంది జీవితాలను నిరంకుశంగా శాసిస్తున్న విధానాన్ని (అచ్చం ఇప్పటి కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నట్లే) ప్రేక్షకులకందించి ఆలోచించమంటారు ఐసెన్ స్టీన్. ఉద్రిక్తతలు, కష్టాలు, శ్రామికవర్గ త్యాగం మొదలైన ఉద్విగ్న సందర్భాలను తన కథనం ద్వారా ఏకైక దృశ్య భాష మూకీలో ప్రదర్శించడంలో ఒక అద్భుతమైన అవగాహన, మేధావితనం స్పష్టమవుతుంది. వందల మంది తారాగణంతో సినిమా ఆద్యంతం అద్భుతమైన వివరాలు అందిస్తూ, శ్రామికవర్గ విలువల్ని పటిష్టం చేస్తూ  శ్రామికవర్గ ప్రచారాన్ని  చిత్రీకరించడంలో వల్లమాలిన నేర్పరితనం చూపిస్తారు ఐసెన్ స్టీన్.ఇది చాలా ప్రతిభావంతమైన సమూహాల కథా కథనం.

ఇక మూడోది మాంటేజ్ ఆవిష్కరణ. మాంటేజ్ అంటే ఫ్రెంచ్ లో ఆకర్షణ అని అర్ధం .ప్రతి చిత్రం ఓ పుట్టుక.ఓ కొత్త జన్మ ఎత్తడం అన్న ఐసెన్ స్టీన్ రెండు పరస్పర విరుద్ధ శక్తుల సంఘర్షణలో ఓ నూతన శక్తి ఆవిర్భవిస్తుందనే మార్క్స్ గతి తార్కిక భౌతికవాదాన్ని ఆధారంగా చేసుకుని “మాంటేజ్” కి అన్వయించారు. దీనికి ఆయనే ఆద్యుడు. ఇంతకుముందు మాంటేజ్  దర్శకులు వెర్టోవ్, పుడోవ్ కిన్ లాంటి వారున్నప్పటికీ ఐసెన్ స్టీన్ వాళ్ళకి భిన్నమైనవారు. ఐసెన్ స్టీన్ ఈ సినిమా తీస్తున్న సమయానికి రష్యా ప్రజలు 80% నిరక్షరాస్యులు. రోజు రోజుకీ, క్షణ క్షణానికీ ఉధృతమవుతున్న విప్లవోద్యమంతో ప్రేక్షకుణ్ణి మమేకం చెయ్యడాని కీ, రాజకీయ ఆలోచనలు చెప్పడానికీ  మాంటేజ్ ని ఎన్నుకున్నారు ఐసెన్ స్టీన్. దృశ్య భాష ద్వారా రాజకీయ సందేశాలను తెలియజేసేందుకు మాంటేజ్ లోని విస్తారమైన అవకాశాలను వాడుకుని ప్రజలకు అవగాహన కలిగించి, చైతన్య పరచడానికి ప్రయత్నించారు. విభిన్న భాషల, జాతుల ప్రజలను చైతన్య పరచడానికి సినిమాకు మించిన కళారూపం మరొకటి లేదనిఅన్న లెనిన్ సూత్రీకరణను నూటికి నూరుపాళ్ళూ వాడుకున్నారు.

మాంటేజ్ ని అర్ధం చేసుకోవడానికి ప్రేక్షకుల్ని సంసిద్ధం చేసుకుంటారు ఐసెన్ స్టీన్.ఉదాహరణకి సైన్యం చేతిలో కార్మికులు చనిపోతున్న కౄరదృశ్యాన్ని  పశువుల వధ జరుగుతున్నట్లు  గ్రాఫిక్ చిత్రాలతో చూపించి ప్రేక్షకుల దిమ్మ తిరిగేట్లు చేస్తారు. యాకోవ్ మీద దొంగతనం ఆపాదిస్తున్న సీన్ లో యాకోవ్ క్లోజ్ అప్,మేనేజర్ క్లోజ్ అప్ రెండూ కనిపిస్తాయి.రెండు షాట్స్ ఒకదానితో ఒకటి ఘర్షణ పడతాయి. యాకోవ్ ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు అతని పట్ల సహానుభూతితో ఐడింటిఫై అవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఐసెన్ స్టీన్ . మేనేజర్ క్లోజ్ అప్ షాట్ చూస్తున్నప్పుడు మేనేజర్ నేరుగా తనమీదే దొంగతనం నేరారోపణ చేస్తున్నట్లు ప్రేక్షకుడు ఫీలవుతాడు. ఈ రెండు షాట్లనుంచి ఐసెన్ స్టీన్ సాధించదలచుకున్న మూడో ప్రయోజనం-దొంగైనందుకు మేనేజర్ యాకోవ్ ని తిట్టడమే కాదు,తాను దొంగగా భావిస్తున్న యాకోవ్ పక్షం వహిస్తున్న ప్రేక్షకుణ్ణి కూడా తిడుతున్నట్లు ప్రేక్షకుడు ఫీలయ్యేలా చెయ్యడం. ఇది ఒక అత్యద్భుతమైన ప్రయోగం.తెలుగులో మన మహాకవి శ్రీ శ్రీ కూడా తన రచనల్లోని చరమరాత్రి కథల్లోనూ,”గుమస్తా కల”మొదలైన రేడియో నాటికల్లోనూ మాంటేజ్ ని ప్రయోగాత్మకంగా శక్తివంతంగా వాడి విజయం సాధించారు.

విప్లవ కాలంలో ఇంజనీరింగ్ చదువు మాని రెడ్ ఆర్మిలో పని చేసిన చైతన్యశీలి ఐసెన్ స్టీన్. 27 ఏళ్ల వయసులో (స్ట్రైక్ సినిమాకి ముందు) 1925 లోనే దృశ్యీకరించిన బాటిల్ షిప్ పొటోంకిన్ ఒక సృజనాత్మక విస్ఫోటనం. ప్రపంచ సినిమా ప్రేక్షకుణ్ణి దిగ్భ్రాంతికి గురి చేసింది. సోవియట్ యూనియన్ లో సోషలిస్టు రాజ్య స్థాపన గురించి తీసిన ఈ సినిమా సృష్టించిన విప్లవ ప్రకంపనాలకు కంపించిన బెర్లిన్, బ్రిటన్ దేశాలు చిత్రాన్ని నిషేధించాయి.అమెరికా కూడా భయంతో చిత్రంలోని కొన్ని భాగాలు కత్తిరించింది. స్ట్రైక్ సినిమా తర్వాత వచ్చిన అక్టోబర్ చిత్రంలో కూడా జార్ చక్రవర్తి “వింటర్ ప్యాలెస్” పై విప్లవ వీరుల దాడిని అమోఘంగా దృశ్యీకరించారు. ప్రపంచాన్ని గజ గజలాడించిన పది రోజులు అనే జాన్ రీడ్ రచన ఆధారంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఇదంతా గమనించినప్పుడు ఐసెన్ స్టీన్ వ్యక్తిత్వం లోనే కార్మిక రాజ్యం రావాలనే ఆకాంక్ష ఉందనీ, శ్రమజీవుల పట్ల అపూర్వమైన ప్రేమాభిమానాలున్నాయనీ అర్ధమవుతుంది.తన ముందు తరాల విప్లవ పోరాట ప్రభావాలన్నీ ఈ సినిమాలో అపురూపంగా ఆవిష్కరించారు. ఆయన ఎవరి మెప్పు కోసం ఈ సినిమా తియ్యలేదు.సమాజంలోని అట్టడుగు మనుషులు, జంతువులకంటే హీనంగా చూడబడుతున్న మనుషుల పక్షం వహించి, వారి పట్ల ఆయనకున్న నిజాయితీ, నిబద్ధతలను చాటి చెప్పారు!

చూడగానే మనసు చలించే   గొప్ప దృశ్యాలు చాలా ఉన్నాయీ సినిమాలో!

ఒక నెత్తుటి ముఖం, ఒక మండే ఆయుధం ఉపయోగించి, సాధించదలచుకున్న మూడో ప్రయోజనాన్ని స్ఫురింపజేస్తారు!!

సైన్యం సమ్మెను విధ్వంసకరంగా అణిచివేస్తుంది. అసలు సైన్యం ప్రజలకు సేవ చెయ్యాలి.కానీ ధనస్వామ్యానికీ బూర్జువా, కులీన వర్గాలకు సేవ చేస్తుందని చెప్పకనే చెప్తారు ఐసెన్ స్టీన్.

యాజమాన్యం-వాటాదారుల విలాసవంతమైన జీవితాలనూ వాళ్ళకి కార్మికుల పట్ల ఉన్న ఏహ్య భావాన్నీ తెలిపే దృశ్యాన్ని ప్రతిమనిషీ చూచి తీరాలి! యాజమాన్యం-వాటాదారుల సమావేశంలో ఒక నిమ్మకాయను జూస్ తీసే మెషీన్ లో పెట్టి పీల్చి పిప్పి చేస్తుంటాడొక వాటాదారుడు.అంటే శ్రమిస్తున్న మనుషులమీద అపరిమితమైన ఒత్తిడి ఉందని, వాళ్ళను సాటి మనుషులుగా కాక జంతువుల కంటే హీనాతిహీనంగా చూస్తున్నారని దీనర్ధం.

కార్మికుడు తన కుటుంబ పోషణ కోసం పని చెయ్యాల్సింది 6 గంటలు మాత్రమే నంటారు మార్క్స్. కార్మికునికి చెందవలసిన భోజన విరామ సమయాన్ని, ఇతర విశ్రాంతిని కొద్ది కొద్దిగా తగ్గించి తన లాభాలు పెంచుకుంటూ వచ్చాయి యాజమాన్యాలు. ప్రతిరోజూ భోజన విరామ సమయాన్ని పది నిమిషాలు తగ్గించడం ద్వారా ఏడాదికి వెయ్యి పౌండ్లు లాభం వచ్చిందని ఆనందంగా వికటాట్టహాసం చేశాడట ఒక యజమాని. ఇదే స్త్రీల విషయంలో నైతే ఇంకా శ్రమ దోపిడీ చేస్తారు.నేను పని చేసిన ఫెమినైజ్డ్ టెలిఫోన్ ఏక్చేంజి లలో నైతే గంట ఉండాల్సిన భోజన విరామ సమయాన్ని తగ్గించి 10 నిమిషాలే ఇచ్చేవారు! కలుపుకొచ్చుకున్న బాక్స్ల లోని  అన్నాన్ని చార్లీ చాప్లిన్ “మోడరన్ టైమ్స్ ” సినిమాలో యంత్రం ఒక్కొక్క కార్మికుడి దగ్గరకొచ్చి తినిపించినట్లే మేము గుక్కతిప్పుకోకుండా గుటకలు వేస్తూ తినడం ముగించేవాళ్ళం. అరగంట టీ సమయం తగ్గించి 5 నిమిషాలే ఇచ్చేవారు! మధ్యలో అర్జెంట్ గా బాత్రూం అవసరాలొస్తే “ఒన్ మినిట్ ప్లీజ్” అని అడుక్కుని వెళ్ళేవాళ్ళం1!

“తొమ్మిది, పదేళ్ళ పిల్లల్ని, అర్ధరాత్రి రెండు, మూడు, నాలుగు గంటలకు నిద్ర లేపి తెల్లవారి పది, పదకొండు, పన్నెండు దాకా పని చేయిస్తారు.ఆ పరిస్థితిలో వాళ్లు జీవచ్చవాల కన్నా ఎక్కువేమీ కాదు” అని నాటింగాం లోని లేసు పరిశ్రమ గురించి ఆ రోజుల్లో రిపోర్ట్ చేసింది డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక (మార్క్స్ పెట్టుబడి-రచనా క్రమం,ఫ్రాన్సిస్ వీన్, అనువాదం-ముక్తవరం పార్ధసారధి అరుణ తార,ఏప్రిల్ 2016)

వాస్తవాలిలా ఉంటే పెద్దలకు 8 గంటలు, పసివారికి 6 గంటలు కావాలని డిమాండ్ చెయ్యడం చట్టబద్దం కాదట! సాటి మనిషిని మనిషిగా చూడడమనే విషయం  సమాజ నాగరికతలో భాగమవ్వాలి. కానీ అది కూడా ఒక   డిమాండ్ గా పెట్టవలసి రావడం ఎంత విషాదం! పైగా అది న్యాయసమ్మతం కాదట! ఎన్నెన్ని గడ్డుకాలాల్ని దాటి మనకిప్పుడున్న సౌకర్యాలనందించారు మన పూర్వులు? మన ముందు తరాలవారి ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనిదినం ఇవాళ కార్పొరేట్ శక్తుల చేతుల్లో హరించుకుపోయి మళ్ళీ మన తరాలు, మన భావి తరాలు గంటలతరబడి పని చేసే స్థితిలోకి నెట్టబడ్డారు.ఇంకా విచిత్రమేమిటంటే ఇంటి నుంచి పని చెయ్యడం ఒక సౌకర్యంగా చిత్రిస్తున్నారు.దానివల్ల యాజమాన్యం కార్మికులకు సమకూర్చవలసిన సౌకర్యాల నుంచి, కార్మికులు హక్కులుగా పొందవలసినవాటి నుంచి  యాజమాన్యం ఏ మాత్రం బాద్యత వహించకుండా  హాయిగా తప్పించుకుంటుందని కార్మికులు కూడా గమనించడం లేదు. మార్క్స్ చాలా లోతుగా విశ్లేషించి చెప్పిన శ్రమదోపిడీకి ఇదొక పరాకాష్ట!

పరిశ్రమల యాజమాన్యాలు వారి స్వంత సాయుధ బలగాల నేర్పరచుకొని, గూఢచార వ్యవస్థ ద్వారా చైతన్యవంతులైన కార్మికుల గురించీ, వారి నాయకుల గురించీ రహస్య సమాచార సేకరణ చేసేవారు. అలా కనిపెట్టిన సమాచారాన్ని బట్టి యాజమాన్యాలు వారి స్వంత సాయుధ బలగాల ద్వారా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసేవారు. నాయకులను జైళ్ళ పాలు చేసేవారు.

ఎంతో శ్రమకోర్చి ఎన్నో అద్భుతమైన సీన్లను ఈ చిత్రంలో కార్మికుల పక్షం వహించి ఎంతో హృద్యంగా దృశ్యీకరించారు ఐసెన్ స్టీన్.

కార్మికులందరికీ, శ్రామిక సమూహాలన్నీటికీ, ఆ మాటకొస్తే సామాన్య ప్రజలందరికీ విశ్వ వ్యాప్తంగా వర్తించే సామాజిక ఇతివృత్తంతో, మాంటేజ్ టెక్నిక్ ని సమర్థవంతంగా ఉపయోగించి, ఈనాటికీ వర్తించేలా స్ట్రైక్ సినిమాని రూపొందించి చలన చిత్ర చరిత్రలో  తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఐసెన్ స్టీన్.

ఇప్పటి యూనియన్ నాయకులూ, వారి కపట నాయకత్వాలను తలచుకుంటే  నిరాశా, నిస్పృహలు ముంచుకొస్తున్నాయి. కార్మికుల పక్షం వహించిన ఇంత అద్భుతమైన వ్యక్తి ఈ భూమి మీద ఒకప్పుడు సంచరించారంటేనే మనసు సంతోషంతో నిండిపోతుంది.

ఇంకో వెయ్యి సంవత్సరాలకైనా మనదేశంలో ఇటువంటి సినిమాని ఆశించలేము!ప్రేక్షకుల హృదయాలలో లేని జుగుప్సాకరమైన అభిరుచులను వెలికితీసి రెచ్చగొట్టే మన దర్శక నిర్మాతలు కళ ప్రజలకోసం అని గుర్తించి ఎప్పటికైనా ఇంతటి ఉత్తమ విలువలను పోషించే చిత్ర నిర్మాణం చెయ్యగలరా?

శ్రమజీవుల గురించి తపించే వారందరూ ఈ సినిమాని తప్పనిసరిగా చూడాలి! కూలిపోతున్న జీవితాలను నిలబెట్టడానికే కాదు, మనల్ని మనం నిలబేట్టుకోవడానికి కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి తీరాలి!!

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

   పెట్టుబడి ఊసెత్తని ఉద్యమ సినిమా!

 

 

-శివలక్ష్మి 

~

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  గోతె జెంత్రం (Goethe Zentrum-German film Club) లో నాలుగు సినిమాలు ప్రదర్శించారు. అందులో మార్చ్ 9 న ప్రదర్శించిన రెండు సినిమాలు మాత్రమే నేను చూశాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లోని మహిళల, బాలికల దారుణమైన పరిస్థితుల్ని ఈ రెండు సినిమాలు కళ్ళముందుంచాయి. అందులో మొదటి సినిమా: From Fear to Freedom ending violence against women 35 నిమిషాల నిడివి కల ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. దీనిని ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్ (Women’s Learning Partnership) వారు నిర్మించారు.

 

ప్రపంచవ్యాప్తంగా, ప్రతి ముగ్గురు మహిళల్లో కనీసం ఒకరు అతికౄరమైన హింస బారిన పడుతున్నారు. ప్రతి దేశంలో, ప్రతి సంస్కృతిలో, ప్రతి మతంలో, వర్గాల కతీతంగా ఉన్నత, మధ్య, అట్టడుగు తరగతుల్లోని మహిళలందరూ మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. మహిళలపై జరుగుతున్నఅన్ని రకాల హింసలు అంతం కావాలంటూ, భయాలనుండి స్వేచ్చ కోసం చేసే ప్రయాణమే సినిమా ఇతివృత్తం

 ఐక్య రాజ్య సమితి గణాంకాల ప్రకారం 87% ఆఫ్ఘన్ మహిళలు  గృహ హింస బాధితులు.   కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ లో రోజువారీ 1100 కంటే ఎక్కువమంది  మహిళలు,  బాలికలు అత్యాచారానికి  గురవుతున్నారు. ప్రపంచం లోని 137 దేశాల్లో మానవ రవాణా  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని బారిన పడే 80% మంది స్త్రీలే!

ఈ చిత్రంలో పురుషుల్ని ఒక్కొక్కరినీ “నువ్వెంతమందిని అత్యాచారం చేశావు? అనడగడం కనిపిస్తుంది.ఆ పురుషులు ధీమాగా సిగ్గూ శరం లేకుండా 5, 10, 20 మంది అని చెప్తారు.గ్రామాలు తిరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువమందిని అత్యాచారం చేస్తామని కూడా నిర్భయంగా చెప్తారు. పరువు కోసం చెల్లెల్ని చంపేశానని చెప్తాడొకడు. ప్రతి ఏటా దాదాపు 5000 మందిని పరువు, మర్యాదల పేరిట సొంత కుటుంబ సభ్యులే హత్యలు చేస్తున్నారు.

ఏడేళ్ళ పాపకి పెళ్ళి చేస్తే, ఆమె 15 ఏళ్ళకి ఇద్దరు బిడ్డల తల్లవుతుంది.బాల్య వివాహాలు, గర్భ ధారణలతో చిన్న పిల్లలైన తల్లులు, పసిబిడ్డలు కూడా  ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు దాదాపు చాలా దేశాల్లో చిత్రీకరించడం కనిపిస్తుంది.

“ప్రపంచవ్యాప్తంగా మహిళలు బృందాలుగా ఏర్పడి హింస లేని సమాజం కోసం,స్త్రీల హక్కుల్ని సమర్ధించే మెరుగైన కొత్త చట్టాల కోసం పోరాడుతున్నారు. బలమైన వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే ప్రజాస్వామ్య భావనలు నెలకొల్పడానికీ, హింసా సంస్కృతిని అంతం చేయడానికి కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు”- అని అంటారు యునైటెడ్ నేషన్స్ మాజీ సెక్రటరీ జనరల్ గా పని చేసి ప్రస్తుతం ‘ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్’ బోర్డ్ చైర్మన్ గా ఉన్న తొరయా ఒబైడ్ (Thoraya Obaid)

ఇరాన్, అమెరికాలలో ‘ఉమెన్స్  లెర్నింగ్ పార్ట్నర్ షిప్’ వ్యవస్థాపక సభ్యురాలైన మెహ్ నాజ్ అఫ్ కామీ (Mahnaz Afkhami) “మా సంస్థ లింగ వివక్ష మూల కారణాలను అన్వేషిస్తుంద”ని అంటారు. దేశ దేశాల్లో పని చేసే వీరందరూ ఉమెన్స్  లెర్నింగ్ పార్ట్నర్ షిప్ భాగస్వాములే!

సింధి మేదర్ గౌల్డ్ (Sindi Medar Gould) నాయకత్వంలో నైజీరియాలో పనిచేస్తున్న ఒక సంస్థ మహిళలపై హింసను నమోదు చేస్తుంది.

నైజీరియా నుంచి బాయోబాబ్ అనే సంస్థలో పని చేసే షిబోగూ ఓబెన్వా (Shibogu Obinwa) మహిళలకు జరిగే శరీర హింస నుండి తమను తాము రక్షించుకునే హక్కుల గురించి “నా శరీరం, నా ఇష్టం” అని చెప్పే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తారు.

హఫ్సాత్ ఆబియోలా (Hafsat Abiola) నైజీరియాలో ప్రజాస్వామ్య స్థాపనే తమ ధ్యేయమంటుంది.

టర్కీలో పని చేసే యాకిన్ ఎర్టర్క్ (Yakin Erturk)  మహిళల మీద అమలవుతున్న హింస గురించి ప్రస్తావిస్తారు.

అమెరికా నుంచి ఫ్రాన్సెస్ కిస్లింగ్ (Frances Kisling) మహిళలు లైంగిక పరమైన దుర్గార్గపు ఆలోచనలను ప్రేరేపించేవారుగా, పురుషులు దానికి బలవుతున్న వారుగా సమాజపు నరనరాన ఎందుకు ఇంకిపోయిందో అనేదాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంది.

అమెరికా రట్జర్స్ విశ్వవిద్యాలయం నుంచి కరీమా బెన్నౌన్ (Karima Bennoune) అమెరికాలో చట్టాల అమలు గురించి మాట్లాడతారు.

జాక్వెలిన్ పీటాంగ్వై (Jacqueline Pitanguy ) బ్రెజిల్ నుంచి తమ సంస్థ సమాజంలోని స్త్రీ-పురుష అసమానతల గురించి పనిచేస్తుందని చెప్తారు.

బహ్రెయిన్ నుంచి వాజీహా అల్ బహార్న (Wajihaa Albarna) తమ సంస్థ పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తుందని చెప్తారు.

మలేషియా నుంచి బెట్టీ యో (Betty Yeoh) పని ప్రదేశంలో వేధింపుల మీద తమ సంస్థ గురి పెడుతుందంటారు.శక్తివంతమైన అంతర్జాతీయ చట్టాల నుపయోగించి సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తుందని చెప్తారు.

మలేషియా లోని మ్యూస్ వా నుంచి జైనా అన్వర్ (Zainah Anwar) ముస్లిం పురుషులు స్త్రీలను కొట్టి, రకరకాల హింసలకు గురి చేస్తున్నారనే విషయాన్ని ప్రచారం చేసి ప్రజల మద్దత్తుని కూడగట్టడానికి తమ సంస్థ కృషి చేస్తుందని చెప్తారు.

జోర్డాన్ నుంచి అస్మా ఖాదర్ (Asma Khader) కొత్త సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో స్త్రీల సమస్యల మీద ప్రజల్లో అవగాహన పెంచడానికి తమ సంస్థ కృషి చేస్తుందంటారు. పరువు కోసం తన చెల్లెల్ని హత్య చేసిన కేసులో మహిళల నిరసన ఫలితంగా, ఆమె సోదరుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఇలాంటి ముఖ్యమైన సందేశం ప్రజల్లో మార్పు తెస్తుందంటారు అస్మా.

లెబనాన్ నుంచి పని చేసే లిన హబీబ్ (Lina Habib) తమ సంస్థ పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుందని చెప్తారు.

ఐర్లండ్ నుంచి మేరీ రాబిన్సన్ (MARY ROBINSON) వారి సంస్థ మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అని నినదిస్తూ ప్రజల్లో అవగాహన పెంచడానికి దోహదం చేస్తుందంటారు.

పాకిస్తాన్ నుంచి రబియా హది (Rabia HAdi) స్త్రీల పట్ల హింస అంతం కావాలంటే విద్య ద్వారా సాధికారత సాధించాలంటారు.

1993 డిసెంబర్ 20న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా మహిళలపై హింస నిర్మూలన గురించి ఒక ప్రకటన వెలువడింది. అందులో కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిస్తూ “స్త్రీల సమానత్వం, భద్రత, స్వేచ్ఛ, గౌరవం మొ.న హక్కుల పట్ల హామీ పడుతూ స్త్రీల పట్ల వివక్ష తగదని హెచ్చరించింది. మహిళల హక్కులు కూడా మానవ సార్వత్రిక హక్కులలో భాగమేనని ప్రకటించింది.

ఈ హక్కులు అమలు కావడానికి పితృస్వామ్యం పెద్ద అడ్డంకిగా నిలుస్తుందని చెప్తారు ఈ ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్ నాయకులు.

ఒక సంస్థ నుంచి మిగిలిన అన్ని సంస్థలూ సమాచారాన్ని,కష్ట-నష్టాలను పంచుకోవడం, ఒకరినుండి మరొకరు నేర్చుకోవడం ద్వారా వారి మధ్య కొన్ని భావ సారూప్యతలూ – కొన్ని తేడాలు ఉన్నప్పటికీ వారి వారి లక్ష్యాల దిశగా పని చేస్తూ భవిష్యత్తులో ప్రజాస్వామ్య సమాజాన్ని సాధిస్తామని చెప్పుకొచ్చారు.

అన్ని సంస్కృతుల, అన్ని తరగతుల, అన్ని తరాల లింగ పరిధుల్లో సంభాషణ నడుపుతూ మేము సంఘటితమై మా భాగస్వామ్య సామర్థ్యాన్ని పటిష్టపరచుకుంటూ మరింత విస్తరణకు ప్రయత్నిస్తున్నా మంటారు దీని నాయకులు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చివరికి 1800 సంవత్సరం నుంచి మొదలై 1910 వరకూ కొనసాగి తమ రాజీ లేని పోరాటాలతో, చివరికి 140 మంది చికాగో దుస్తుల తయారీ ఫ్యాక్టరీలోని మహిళా కార్మికుల ప్రాణత్యాగాలతో అంతర్జాతీయ మహిళా ఉద్యమాలు సాధించిన ముఖ్యమైన మైలురాళ్ళ ఫలితంగా “అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం” ఏర్పడింది. ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిని సమీక్షించుకుని,సాధించుకోవలసిన సమస్యల కోసం భావి పోరాటాలకు సిద్ధం కావడం “అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం” లక్ష్యం. పండగల్లాగా పట్టు చీరల బహుమతులతో,ముగ్గుల పోటీలతో జరుపుకుంటారు “ అంతర్జాతీయ మహిళా దినోత్సవం” – ఈ రెండిటికీ స్పష్టమైన తేడా ఉంది. అందరూ ఈ భేదాన్ని తెలుసుకోవాలి!

మహిళల మీద అమలవుతున్న హింసను ఎంతో హృద్యంగా  దృశ్యీకరించిన ఈ నాయకత్వం అసలు దీనికంతకూ మూలకారణమైన పెట్టుబడిని రవ్వంతైనా ఎక్కడైనా చెప్తారేమోనని వళ్ళంతా కళ్ళు చేసుకుని కళ్ళార్పకుండా శ్రద్ధగా సినిమా చూశాను.పొరపాటున కూడా పెట్టుబడి ప్రస్తావన రానివ్వలేదు. అసలు జబ్బేమిటో తెలుసుకోకుండా బస్తాలు బస్తాలు మందులు మింగించినట్లుంది. ప్రభుత్వాలను ప్రశ్నించకుండా సన్నాయి నొక్కుల ఉద్యమాల వల్ల ఉపయోగం ఉండదు.

ఎన్ని చట్టాలు వచ్చినా అవి అమలు కావు.మహిళల మీద హింస ఆగదు.దీనికి కారణం ప్రభుత్వాలను తమ పెట్టుబడితో వెనకుండి నడిపే కార్పొరేట్ శక్తులు.

” పెట్టుబడి అనే బండ రాయి కింద నలిగిపోతున్న చీమలు మన శ్రామికులు. పెట్టుబడి రాక్షసికి ఆహారం జంతువు ల్లాంటి మన శ్రామికులు “అని 16 వ శతాబ్దం లోనే తన “అన్నా కరేనినా నవల్లో నికొలాయ్ అనే పాత్రతో చెప్పిస్తారు టాల్ స్టాయ్. శ్రామికులవే బానిస బతుకులైతే, ఇక బానిసకు బానిసలైన స్త్రీల పరిస్తితి ఎంత హీనంగా ఉంటుందో చెప్పనే అక్కరలేదు !

“బీద వారినే కాదు,ఈ భాగ్యవంతుల్నీ వాళ్ళ గొప్ప తనాల భారాల నించీ, ఊపిరాడని గర్వాల నించీ,మర్యాదల నించీ,ఈర్ష్యల నించీ, చికాకుల నించీ తప్పించి, శాంతినీ, సంతోషాన్నీ, తృప్తినీ ఇచ్చి కాపాడే కమ్యూనిజం రావాల”ని కాంక్షించాడు చలం. అంతో ఇంతో సామాజికంగా,ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉన్న స్త్రీలకైనా స్వేచ్చ రావాలంటే ఈ అణచివేతలకు మూలకారణాలను అన్వేషించాలి!

*

అందమైన కలలాంటి ఆ నేలా..గాలీ!

 

  -శివలక్ష్మి

~       

మా కోడలి  అక్కలిద్దరు సంధ్య,రూపల్ ఇండొనేషియాలో టీచర్స్ గా పని చేస్తున్నారు. పదే పదే రమ్మంటున్న వాళ్ళ  ఆహ్వానం మీద  ఇండొనేషియా వెళ్ళాలని అనుకున్నాం. అది ఒక ద్వీప దేశం. చిన్నప్పుడు రామాయణ పాఠాల్లో చదువుకున్న జావా,సుమత్రా దీవులు ఇండోనేషియా లోనివే కనుక చూస్తే బాగుంటుందనుకున్నాం. ఇటీవల మాకుటుంబం లోని – మేమిద్దరం హైదరాబాద్ నుంచి, హిమాన్షి (కోడలు) , శయన్ (మనవడు) డిల్లీ నుంచి , మా బాబు స్వరూప్  లే(లఢక్) నుంచి, రాజ్(రూపల్ భర్త) గౌహతి నుంచి బయల్దేరి, అందరం హైదరాబాద్ లో కలిసి డిసెంబర్ 23 న ఇండొనేషియా రాజధాని జకర్తా చేరుకున్నాం. అక్కడికెళ్ళాక న్యూజీలాండ్ లో చదివే సంధ్య కొడుకు సహర్ష్ జాయినయ్యాడు.అక్కడే ఉంటున్న సంధ్య,రూపల్ ఆమె  కూతురు రసజ్ఞ -ఇదీ మొత్తం 10మంది మాగ్రూప్.

అప్పటికే జకర్తాకి చేరిన సహర్ష్, రూపల్  తో కలిసి మమ్మల్ని జకర్తా ఎయిర్ పోర్ట్ కొచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఇతర దేశాలనుంచి అక్కడి పని చెయ్యడానికొచ్చే ఉపాధ్యాయులకి ఇండొనేషియా ప్రభుత్వం ఉచితంగా ఇల్లు,అవసరమైన గృహోపకరణాలన్నీ ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకి ప్రభుత్వం సమకూర్చిన ఇళ్ళు కూడా స్కూళ్ళకి నడిచి వెళ్ళేంత దూరంలో, మంచి పరిసరాల్లో, అందమైన ఫర్నిచర్ తో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. ఉపాధ్యాయుల  పిల్లలకి ప్రభుత్వమే ఉచిత విద్య నందిస్తుంది. అలా సంధ్య పిల్లలిద్దరూ జునియాలీ, సహర్ష్ 12th క్లాస్ వరకూ ఉచిత విద్య నభ్యసించి ఇప్పుడు పైచదువుల కెళ్ళారు.ఇప్పుడు రూపల్ కూతురు రసజ్ఞ 12th క్లాస్ ఇండొనేషియాలోనే చదువుతుంది. తన క్లాస్ టీచర్సందరూ భారతీయులేనని చెప్పింది. ఈ టీచర్ల పిల్లలందరూ 12th క్లాస్ వరకూ ఇక్కడ చదివి,తర్వాత వాళ్ళ వాళ్ళ అభిరుచుల కనుగుణంగా పై చదువులకు విదేశాలకెళ్తున్నారు.

జకర్తాలో ఉన్న నాలుగు రోజులూ సంధ్య, రూపల్ అత్యంత ఆత్మీయమైన ఆతిధ్యమిచ్చారు. అలాగని వాళ్ళేమీ పదిమంది మున్నామని  హైరానా పడలేదు. వాళ్ళు వంట చెయ్యనే లేదు. అసలా సమాజంలో వంట చేసుకునే కాన్సెప్టే లేదు. ఈ విషయం నాకు భలే నచ్చింది!అమెరికాలో ఇండియాని నెత్తిన మోసుకెళ్ళి ఇక్కడి వంటలతో ఆడపిల్లలందరూ తెగ యాతన పడుతున్నారు! కానీ “రోమ్ లో రోమన్ లా జీవించు” అన్నట్లు మా సంధ్య,రూపల్ ఎంచక్కా వంటలకు గుడ్ బై కొట్టేశారు!!

bali1

“The first condition of understanding a foreign country is to smell it”- అని Rudyard Kipling  అన్నట్లు Food is the best way to represent a country because of its distinctive aromas and flavours. రోడ్ల మీద ఎంతో రుచికరమైన,అత్యంత శుభ్రమైన ఆహారం దొరుకుతుంది.ఏదో అయిందనిపించే టట్లుండదు.నోరూరించే జిహ్వ రుచులతో, స్పైసీగా తిన్నాం.కొంచెం అన్నం, ఒక కప్పు ఆకు కూరా, చికెన్ మూడూ కలిపిన “పడాంగ్” అనబడే భోజనం వేడి వేడిగా దొరుకుతుంది ఆహా!ఎంతో రుచిగా ఉంది! ఎంతో రుచి, ఎంతో రుచి అని పాడుకున్నాం!ఖచ్చితంగా సగం సగం చేసి ఎనిమిది ముక్కలుగా చేసిన, మషాలా దట్టించిన, అద్భుతంగా ఘుమ ఘుమలు వెదజల్లే   నాలుగు పెద్ద పెద్ద చేపల్ని కొనుక్కుని అన్నంతో తిన్నాం.మా షయన్ కి హిమాన్షికి చేపలంటే చాలా చాలా ఇష్టం.అవి తిన్న తర్వాత తీసిన ఫొటోలో వాళ్ళ మొఖాల్లో ఆనందం చూడండి!!

పిల్లల చదువుల కోసం మా సంధ్య, రూపల్  డెహ్రాడూన్ నుంచి వెళ్ళి కుటుంబాలకు దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. అక్కడ ఈవ్ టీజింగ్లుండవు.అత్యాచారాల చాయలేలేవు.ఆ రకంగా ఇండొనేషియా చాలా సురక్షితమైన దేశమని వాళ్ళిద్దరూ చెప్పారు. అత్యాచారాలతో అట్టుడిగిపోతున్న భారత్ గుర్తొచ్చి వేదన కలిగింది. వాయు కాలుష్యముండదు.పెట్రోల్ చాలా చౌకగా దొరుకుతుంది.అదెలా సాధ్యమని అడిగితే మన దేశంలో సెంట్రల్ ఎక్సైజ్,సర్వీస్ టాక్సులు చాలా ఎక్కువుంటాయని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ లో పనిచేసిన మా ఆయన చెప్పారు. ఇండొనేషియాలో లీటర్ పెట్రోల్ మన 30రూపాయల కంటే తక్కువే.మనకి 70 రూపాయలు.రిఫైనరీ లీటర్ ధర రూ 16.50, టాక్స్ 11.80%, ఎక్సైజ్ డ్యూటీ 9.75%, వ్యాట్ సెస్ 4%, స్టేట్ టాక్స్ 8%-ఈ మొత్తం కలిసి 50.05. కానీ భారత ప్రభుత్వం ఇంకో 20రూ అదనంగా మన చెవులు పిండి వసూలు చేస్తుంద ! 20రూ దేనికోసం వసూలు చేస్తుందో మాత్రం ప్రజలకు చెప్పదు !!

మన లాగే ఇక్కడి వారివి మామూలు మధ్య తరగతి జీవితాలే! సాదా సీదా జీతాలే!! కానీ మన ఉపాధ్యాయులే కాదు,ఉన్నతోధ్యోగుల జీవితాలతో పోల్చి చూసినా ఈ దేశంలో చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నారనిపించింది.ఏ రకమైన ఒత్తిడీలేదు.ఇందు గల డందు లేదన్నట్లు మనకి యెల్లడలా ప్రత్యక్షమై, పీల్చి పిప్పి చేసి, అనారోగ్యాల పాల బడేస్తున్న దుమ్ము  అస్సల్లేదు.అమెరికాలో దుమ్ముండదనుకుంటారు గానీ అక్కడి  మూల మూలల్లో కనిపించే దుమ్ము లాంటిది కూడా యిక్కడ కనిపించదు.ఎటు చూస్తే అటు పచ్చని చెట్లతో పరిశుభ్రంగా ఉంటుంది. బట్టలు మాయవు. అంత పచ్చదనం నేనెక్కడా చూడలేదు.తాజాగా,నేవళంగా,కళ కళ లాడుతూ చెట్లూ,ఆకులూ,పువ్వులూ ఆహ్లాదం కలిగిస్తాయి. జకర్తా నగర శివార్లలోనూ,బాలీ లోనూ తిరుగుతుంటే రోడ్డు కిరువైపులా వరి పంట పొలాలు కనిపిస్తూ కన్నుల పండుగ చేస్తాయి.కొన్నిచోట్ల లోయల్లాగా ఉండి, లోయ నిండా పరుచుకున్న పచ్చదనంతో కళ కళలాడుతుంటాయి. ఆ వరి పంట నీళ్ళ మధ్య మధ్య లో చిన్న చిన్న చేపల్ని వదుల్తారనీ, ఆ చేపలు తిరుగుతూ,పెరుగుతున్న క్రమంలో వాటి మల మూత్రాలతో పంట బాగా పండుతుందని,ఆ ప్రజల ప్రధాన మైన పంట వరేనని తన పాఠాల్లో ఉందని రసజ్ఞ  మాకు చెప్పింది!

వాళ్ళ ప్రధానమైన ఆహారం మనలాగే అన్నం.రోజులో నాలుగైదుసార్లు అన్నం తింటారు.కానీ మనుషులు ముఖ్యంగా స్త్రీలు సన్నగా, నాజూగ్గా, చలాకీగా, బలంగా ఉంటారు. మీరు చెప్తే నమ్ముతారో లేదో గానీ నిజంగా నా సైజ్ ప్యాంట్ అక్కడి షాపుల్లో దొరకలేదు.మనదేశంలో నైతే నేనసలు లావే కాదు. నాక్కోపమొచ్చి ఇక్కడ కూడా అక్కడక్కదా లావాటి వాళ్ళున్నారు కదా వాళ్ళకెలా?అని అడిగాను.వాళ్ళకి బిగ్ సైజ్ షాపులుంటాయని చెప్పారు.సిగ్గేసింది కానీ ఒక విషయం తెలిసొచ్చింది. అదేమిటంటే  వాళ్ళు నాలాగా ఆవకాయ-ముద్దపప్పు లేకపోతే రోటి పచ్చడితో ఒక వాయి,కూరతో ఒక వాయి, సాంబారు,రసాలు వగైరాలతో ఒక వాయి,పెరుగుతో చివరి వాయి లాగించరు.ప్రతి సారీ రెండే రెండు స్పూన్ల (మళ్ళీ స్పూన్ అంటే  మన హస్తం కాదు,నిజంగా టేబిల్ స్పూన్ కన్న కొంచెం పెద్ద స్పూన్) అన్నం తింటారు అని. ఈ రహస్యాన్ని మా సంధ్య,రూపల్ దగ్గర ఉన్న మెయిడ్స్ నుంచి రాబట్టాను. మెయిడ్స్ అంటే గుర్తొచ్చింది (పని మనిషి పదం కంటే మెయిడ్ పదం కొంచెం బాగుంది) సంధ్య ఇంట్లో అమ్మాయి పేరుపార్వతి,రూపల్ ఇంట్లో అమ్మాయి పేరు మీనా.ఇంతకీ వాళ్ళు ముస్లిం స్త్రీలు.అచ్చం మన తెలుగు పేర్లు! వాళ్ళు చాలా హుందాగా,సమర్ధంగా ఉన్నారు. చక్కగా టూ వీలర్ల మీద వస్తారు. ఒకరి మీద ఒకరికి ఎంతో నమ్మకం, గౌరవం. వీళ్ళు తాళాలిచ్చి ఉదయాన్నే స్కూళ్ళకెళ్ళిపోతారు! వాళ్ళు ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతికి మడతలు పెట్టడం మొదలైన పన్లు చక్క బెట్టి వెళతారు!

ముస్లిం అమ్మాయిలకు తెలుగు పేర్లు ఎందుకున్నాయో తెలుసుకోవాలనే  ప్రయత్నంలో   జకార్తా చరిత్ర గురించి చదివితే 14 వ శతాబ్దంలో “జకార్తా” జావా అనే హిందూ రాజ్యంలో ఒక చిన్న నౌకాశ్రయం పట్టణంగా ఉండేది. 1527లో “ఫతాహిల్లా” అనే ముస్లిం మత పాలకుడు స్వాధీనం  చేసుకుని “జయకార్తా” (Victory City) అని పేరు మార్చాడు.1619 లో డచ్ వాళ్ళు స్వాధీనం చేసుకుని, ఒక కొత్తనగరంగా నిర్మించి, ‘బటావియా’ అని పేరు మార్చి, ఆగ్నేయాసియాకి అధికార కేంద్రంగా  చేసి 300 ఏళ్ళు పరిపాలించారు. 1941 లో జపాన్ సామ్రాజ్య వాదులు ముట్టడించి పాత పేరు జయకార్తాని జకార్తాగా మార్చేశారు. డచ్ పాలకులు మళ్ళీ ఇంకోసారి జకార్తాని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఇద్దరి మధ్య పోరాటాలు మొదలయ్యాయి. ఈ లోపల ఇండోనేషియన్ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష ఉధృత మైంది . ప్రజల విముక్తి పోరాటాల ఫలితంగా 1945, ఆగష్టు 17 న ఇండోనేషియన్ నాయకులు జకార్తాలో విదేశీ పాలన నుంచి స్వాతంత్ర్యం ప్రకటించారు.

ఇక్కడ శతాబ్దాలుగా హిందూ,ముస్లిం,యూరోపియన్,డచ్,జపనీస్ ప్రజలు సహజీవనం చెయ్యడం వల్ల అన్ని జాతుల మిశ్రమ సంస్కృతి కలగాపులగమైందని అర్ధమైంది. హిందూ, బౌద్ధం,  కన్ఫ్యూషియనిజం, ఇస్లాం, క్రైస్తవ  మతాల సమూహాలతో కలిసిన ఒక సంక్లిష్టమైన సాంస్కృతిక జీవనం ఆశ్చర్యం కలిగిస్తుంది. మన “భాష” లాగే వాళ్ళు మాట్లాడే భాష పేరు “భాస”. స్త్రీలను వనిత (wanita) లంటారు. సరస్వతి, రాముడు,సీత,శివ-పార్వతులు,అర్జునుడు లాంటి అనేకమైన మన పదాలుండడం వల్ల వాళ్ళ భాష (భాస) కొంచెం అర్ధమవుతుంది.అర్ధం కాకపోయినా సైగలతో,హావభావాలతో వాళ్ళతో చక్కగా మాట్లాడొచ్చు. పోయిన సంవత్సరం హాంకాంగ్, మకావ్ లకు వెళ్ళాం. అక్కడి వాళ్ళకు ఇంగ్లీష్ రాదు. ఏ షాపుకెళ్ళినా,బజార్ల లో ఏమైనా తినాలని అడగబోయినా, సైగలు చేద్దామన్నా మొఖాలు చిట్లించుకుని విదిలించి పారేసేవారు. చాలా ఇబ్బంది పడ్డాం! ఇండోనేషియా మనుషులు ఎక్కడున్నా మనందరం మనుషులమే అన్నట్లు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. ప్రేమాభిమానాలు చూపించారు. ఆ నేలలో మనుషులందర్నీ కలగలిపే గొప్పతనమేదో ఉందనిపించింది!

ఇక కరెన్సీ విషయానికొస్తే మన రూపాయికి 210 ఇండొనేషియన్ రూపయ్యాలు. ఒక డాలర్ కైతే 13,600 రూపయ్యాలు. అందుకే డాలర్లున్న విదేశీయుల ఎద్దడి సర్వకాలాల్లోనూ ఉంటుందట! పది వేల రూపాయిల్ని మార్చుకుంటే నాకు 20 లక్షల రూపయ్యాలొచ్చాయి. ఆర్టిస్ట్ మోహన్ అప్పుడప్పుడూ  ఆయన జేబులో కాసిని డబ్బులుంటే చాలు “I am Stinkingly Rich” అని అంటుంటారు, అలా ఫీలైపోయాను. తీరా ఒక కాఫీ మేకర్ కొనుక్కుంటే 2 లక్షలైపోయాయి. పిల్లలకిష్టమైన  బ్రాండ్స్ అన్నీ చీప్ గా దొరుకుతాయి.కానీ అవి ఇండొనేషియన్ బ్రాండ్స్.ఏమైనా రెండు మూడు వస్తువులు కొందామనుకున్నప్పుడు మిలియన్లలో లెక్క తేలేది.ఇక నా లెక్కలు రాని బుర్రకి తాళం పడిపోయేది.కౌంటర్ లో అమ్మాయి ఎంత చెప్తే అంతా ఇవ్వడం, అదీ రాకపోతే రూపల్ హెల్ప్ చేసేది.

bali2

జాతీయవాదం తీవ్రంగా ప్రబలిన  సుకర్ణో కాలంలో నిర్మించిన స్మారక చిహ్నం “మోనాస్”. ఇది 35 కిలోల బంగారపు పూతతో,137 మీటర్ల పొడవైన పాలరాయి కీర్తి స్తంభం. ఆగ్నేయాసియాలో అతి పెద్దదైన ఈ మసీదుని నిర్మించడానికి 17 సంవత్సరాలు పట్టింది.ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదైన ఒక చారిత్రాత్మక మ్యూజియం.”ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం”,అన్న మాహాకవి మాటలు గుర్తొచ్చాయి. కానీ పరపీడన పరాయణత్వం నుంచి ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులకూ, స్వేచ్ఛకూ, వారి స్వావలంబనకూ ప్రతీకగా నిలుస్తున్న మ్యూజియం గోడలు, గోపురం మసీదు వైభవాన్ని, ఐశ్వర్యాన్నే గాక ప్రజల గొప్పతనాన్నీ,హుందాతనాన్నీ,స్వావలంబననీ చాటి చెప్తున్నాయి. పాలకుల దగ్గర యుద్ధ టాంకులుంటే ప్రజల దగ్గర చిట్టి చిట్టి  ఆయుధాలుంటాయి.  ఒకసారి ప్రజలకు రాజకీయ స్పష్టత వచ్చిందంటే ఎంత కౄరమైన సామ్రాజ్య వాదాలైనా కాగితప్పూలలాగా ఎగిరిపోయి, ప్రజలే అంతిమ విజయం సాధిస్తారని చరిత్రలో రుజువైన సత్యాన్ని ఇండోనేషియన్ ప్రజలు  మరోసారి నిరూపించారు.

భాలికల విద్య,ఆధునికత  విషయంలో ” బి యూ కార్టిని (IBU Kartini)” అనే ఒక పేరు ప్రముఖంగా వినబడింది. కార్టిని పేరుతో ఇండోనేషియాలో చాలా స్కూళ్ళు, స్థలాలు ఉన్నాయి.ఏమిటని సంధ్య నడిగితే ఆడపిల్లల చదువుల కోసం కృషి చేసిన కార్టిని అనే ఒక అద్భుతమైన మహిళ గురించి చెప్పింది. కార్టిని 1789 లో ప్రస్తుత ఇండోనేషియాలో ఒక కులీన జావనీస్ కుటుంబంలో జన్మించింది. 1904 వరకూ జీవించింది. ఆమెకు చదువు పట్ల విపరీతమైన  ఆసక్తి ఉండేది. 12 సం.ల లోపే ఆమె డచ్ భాష నేర్చేసుకుంది. జావనీస్ సమాజంలో అమ్మాయిలను ప్రాధమిక పాఠశాల, అంటే 12 సం.ల వరకే పాఠశాలకు వెళ్ళనిచ్చేవారు. ఆ కాలంలో బహుభార్యాత్వ ముండేది. బాలికల వేషధారణ మీద అనేకరకాలైన కౄరమైన ఆంక్షలుండేవి.ముక్కుపచ్చలారని పసిపిల్లలను గృహనిర్భంధంలో ఉంచి, మొఖం తెలియని ముసలివాళ్లతో రెండో,మూడో పెళ్ళికి సిద్ధం చేసేవారు.ఈ బాలికల దుర్భర పరిస్థితులకు కలత చెందిన కార్టిని వారి ఏకాంత బాధలను అధ్యయనం చేసి “Out of Darkness to Light” అనే పుస్తకం డచ్ భాషలో రాసింది. “Letters of a Javanese Princess” అని ఆమె భావాలను వ్యక్తపరిచే కొన్ని ఉత్తరాలు కూడా డచ్ భాషలోనే  రాసింది. అందులో ఆమె బహు భార్యాత్వాన్ని వ్యతిరేకించింది. ఇండోనేషియా యువత యూరోపియన్ యువతలా ఉండాలనే ఆశాభావం వ్యక్తం చేసింది. స్త్రీల చదువుల కోసం, హక్కుల కోసం ,రకరకాల పీడనలనుండి విముక్తి కోసం న్యాయపోరాటాలను సూచించింది. డచ్, నెదర్లాండ్స్, యూరోపియన్  దేశాల పౌరులను ఆకర్షించి, గొప్ప ఆసక్తిని  రేకిత్తించడం ద్వారా  విదేశీ  ప్రముఖుల  మద్దతును కూడగట్టగలిగింది. విద్యా రంగంలో మార్గదర్శకురాలైంది. ఇండొనేషియా స్వాతంత్ర పోరాటంలో కూడా దేశ నాయకులకు ఆమె ఆలోచనలు   ప్రేరణ నిచ్చాయి. కార్టిని జన్మదినం ఏప్రిల్ 21 ని జాతీయ సెలవు దినంగా, ఆమెను జాతీయ నాయకురాలిగా ప్రకటించింది ప్రభుత్వం. ఇండొనేషియా స్మారక చిహ్నం “మోనాస్”. తో పాటు, కార్టిని విగ్రహాన్ని కూడా చూశాం.

bali5

ఇండోనేషియా ఒక ముస్లిం మతం దేశం అయినప్పటికీ బయట పరిశీలకులు సమాజం లో ముస్లిం మహిళల హోదా, హక్కులు, వారి స్థా నాన్ని చాలా ఉన్నతంగా భావిస్తారు. సమాజంలో మహిళలు పాటిస్తున్న మంచి విలువలే సమాజానికి వెన్నెముకలా పనిచేస్తున్నాయని పరిగణిస్తారు. సుకర్ణో కూతురు మేగావతి అధ్యక్ష అభ్యర్థిగా  నిలబడితే ముస్లిం మత నాయకులు ఒక మహిళ అధ్యక్ష పదవిలో ఉండడమేమిటని వ్యతిరేకించారు. కాని ఆమె 1999 జాతీయ ఎన్నికల్లో అతిపెద్ద మెజారిటీతో గెలుపొంది, ప్రముఖంగా నిలిచింది. అక్కడి ముస్లిం మహిళలు బురఖాలు వదిలేశారు. చిన్న చిన్న అతి సుందరమైన స్కార్ఫ్ లను తల చుట్టూ మాత్రం ధరిస్తున్నారు.అవి కూడా మహిళల అందాన్ని పెంచుతున్నాయి. కొందరు అవి కూడా వదిలేశారు.అమ్మాయిలు రాత్రుళ్ళు స్వేచ్చగా తమ తమ పనుల మీదే కాకుండా రాత్రంతా తెరిచి ఉండే నైట్ మార్కెట్లలో నిర్భయంగా తిరుగుతున్నారు.వారికి సౌకర్యవంతంగా ఉండే అన్ని రకాల ఆధునికమైన దుస్తులను ధరిస్తూ అత్యాధునికంగా కనిపించారు. ఇండియాలో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో మేము “బిలియన్ రైజింగ్” ల పేరుతో ‘పగలే కాదు,రాత్రుళ్ళు కూడా మావి కా వాలనే డిమాండ్ తో ఇంకా ఉద్యమాలు చేసే స్థితిలోనే ఉన్నాం! ఈ ఆధునికత వెనక కార్టినికి స్త్రీజాతి పట్ల ఉన్న ఆర్ధ్రత ఎంతైనా అభినందనీయం!!

ఇండోనేషియా నిత్య జీవితంలో ఆహారంలో, సంస్కృతిలో కూడా  దేశీయ ఆచారాలూ, విదేశీ ప్రభావాల కలయికలూ కనిపిస్తాయి. బాలినీస్ నృత్యాల్లో  పురాతన బౌద్ధ, హిందూ మత రాజ్యాల గురించి కథలున్నాయి. బాలిలో అచ్చు తెలంగాణ బోనాల పండుగలో మహిళలు తీసికెళ్ళే బోనాల్లాంటివే బాలి మహిళలు పెద్ద పెద్ద బుట్టలలో రకరకాల పళ్ళు అందంగా పేర్చుకుని తీసికెళ్ళడం చూశాం.

బాలి లో హోటెల్ Kuta Central Park లో దిగాం .అక్కడినుంచి ఒక టాక్సీ తీసుకుని ఊరంతా తిరిగాం. ఒక టాక్సీ డ్రైవర్ ని నీ పేరేమిటని అడిగితే “ఒయాన్” అని చెప్పాడు.మీరు ముస్లింలా?అనడిగితే “No,I am a real Hindu” అని చెప్పాడు.నిజమైన హిందువంటే ఏమిటంటే రోజుకి ఐదు సార్లు పూజ చేస్తారట!ఆ పూజలు ఇంటి బయటి ప్రవేశ ద్వారం దగ్గరే చేస్తారు. ఇంటి ఆవరణమంతా చాలా శుభ్రంగా ఉంచుకుంటారు.మనవాళ్ళలాగా పక్కింటివాళ్ళ గుమ్మాల్లో చెత్త పారబొయ్యరు! ప్రవేశ ద్వారం దగ్గరే  ఎందుకు పూజలు చేస్తారంటే సకల దేవుళ్ళూ,పంచ భూతాలూ ఇంటికి కాపలా ఉండి ఎటువంటి చెడునీ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డు పడతాయని, తమను కాపాడతాయని వాళ్ళ నమ్మకం! నాకిది కూడా భలే నచ్చింది.పూజల పేరిట ఇక్కడి ఆడవాళ్ళకు ఇరుకు ఇళ్ళలో చచ్చేంత చాకిరీ ఉంటుంది.ప్రతిసారీ దేవుడి విగ్రహాలు తోమి,వాడిపోయిన పువ్వులూ,పాచిపోయిన నైవేద్యాలూ అన్నీ శుభ్రం చెయ్యాలి.బయటంటే స్త్రీలూ-పురుషులూ కలిసి చెయ్యడం చూశాం ! నడి రోడ్ల కూడళ్ళలో పెద్ద పెద్ద కృష్ణార్జునులూ,శివ-పార్వతులూ మొదలైన హిందూ దేవుళ్ళ విగ్రహాలు చూశాం!

ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం  వరకూ రంజాన్ సందర్భంగా నిష్టగా నెలంతా ఉపవాసం చేస్తారు. ప్రతి రాత్రి కుటుంబ సభ్యులంతా ప్రత్యేక వంటకాలతో వేడుకగా భోజనం చేస్తారు. స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, సహచరులకు  ఆహార పదార్థాలను పంచిపెడతారు. వారికి ఆతిథ్య సామర్ధ్యం చాలా ఎక్కువని, రంజాన్ సమయంలో మాకు విందులే విందులని మా సంధ్య,రూపల్ చెప్పారు.

రాజకీయ వ్యవస్థ, శాస్త్ర,సాంకేతిక సమస్యలు, వినోదం, సినిమా, టెలివిజన్ కార్యక్రమాలు మొదలైన విషయాల్లో పాశ్చాత్య సంస్కృతి ఇండోనేషియాను గొప్పగా ప్రభావితం చేసింది. అరబ్, మలయ్, భారత్ ల జానపద సంగీతాల మేళవింపుతో తయారైన సంగీతం ఇండోనేషియాలో బహుళ ప్రజాదరణ పొందింది.

డచ్, చైనా, యూరోపియన్లు ఆధిపత్యం చెలాయించడం వల్ల ఇండోనేషియాలో ఇప్పటికీ “ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ.”  ఉంది. దేశీయ వినియోగం కోసం జనాభాలో 60 శాతం వ్యవసాయం చేసి, వరి పండిస్తారు. మధ్య భూభాగంలో ఉండడం వల్ల ఇండోనేషియా వేడి ప్రదేశమే. వాతావరణ పరిస్థితుల్ని బట్టి జీవనోపాధికి కూరగాయలు, పండ్లు, టీ, కాఫీ, పంచదార,  సుగంధ ద్రవ్యాలు మొదలైన మార్కెట్ ఆధారిత పంటలు పండించే రైతులున్నారు. అందమైన చెక్క బొమ్మలు చేసే కళలో ఇక్కడి ప్రజలు మంచి నైపుణ్యం సంపాదించారు. బంగారం, చమురు, సహజ వాయువు, తగరం, రాగి, అల్యూమినియం, ఆయిల్ పామ్, రబ్బరు, చక్కెర, ఇండోనేషియా ఎగుమతుల్లో ముఖ్యమైనవి. ఇండోనేషియాలో దొరికే కలప నుపయోగించి ప్రాసెస్ చేసిన చెక్క కూడా ఎగుమతుల్లో ప్రధానమైనది.

గ్రామాల్లో వ్యవసాయపు పనుల్లో స్త్రీ-పురుషుల భాగస్వామ్యం ఉంటుంది. సాధారణంగా పురుషులు పొలం దున్నితే, మహిళలు సేద్యం చెయ్యడం, కోతలు కొయ్యడం,పంటల్ని భద్రపరచడం వంటి అనేక పన్లు చేస్తారు. ఆ స్త్రీలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలుగా దర్శనమిస్తారు. విదేశీ సంస్కృతి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ, కొన్ని మారుమూల ఇండోనేషియన్ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రత్యేక మూలవాసీ సంస్కృతి భద్రపరచబడింది. ఆ  మహిళల సాంప్రదాయ దుస్తుల్ని మేము చాలా ఇష్టంగా  కొనుక్కున్నాం !

bali4నిర్ణయాత్మక స్థానాల్లో,అధికారా హోదాల్లో ఎక్కువగా పురుషులే ఉంటారు. మహిళలు పురుషుల కంటే తక్కువ సంఖ్యలో చిన్న చిన్న ఉద్యోగాల్లో దుకాణాలు, పరిశ్రమలు, మార్కెట్లలో  సేల్స్ గళ్స్ గా కనిపిస్తారు. మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, కాలేజ్ లెక్చరర్లుగా,విశ్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా పురుషులే ఉంటారు గానీ మహిళలు మాత్రం ప్రాధమిక స్కూలు ఉపాధ్యాయుల వరకే పరిమితమవుతారని సంధ్య,రూపల్ చెప్పారు.కానీ ప్రాధమిక పాఠశాలల్లో బాల-బాలికల సంఖ్య సమానంగా ఉంటుందని చెప్పారు! రాచరిక పాలనే అయినప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ఒకటి,రెండు దశాబ్దాలకే చదువు మీద అమితాసక్తి కలిగి,ఉచిత విద్యను అమలు చేసింది ఇండోనేషియన్ ప్రభుత్వం. అదీ గాక, ఈ దేశంలో కార్టిని పాఠశాలల ప్రభావం ఎక్కువగానే ఉంది కాబట్టి కొద్ది కాలంలో చదువుల్లో ఉద్యోగాల్లో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఎదుతారని ఆశించవచ్చు!!

bali6

Taman Safari, Kidzania, Kuta Beach, Kuta Square,Tanah lot Temple,Tanjung Benua in Nusa Dua Beach for water sports,Sukhawati Art Market,Drive in Ubud,Ubud Art Market,Ubud Rice Fields, Zimbaran Beach and Sea Food Dinner, Legian Street,Seminyak area,Sanur Beach,Uluwatu Temple మొ.వాటిని జకర్తా,బాలి లలో మేము చూశాం. రెండు దేవాలయాల బయట సముద్ర తీరాలు,తనివి తీరని దృశ్యాల సౌందర్యాన్నే చూడగలిగాం.సాంప్రదాయ దుస్తులు లేనందుకు మమ్మల్ని లోపలికి అనుమతించలేదు.

ఎటు చూస్తే అటు కనుచూపు మేరా కనిపించే ఇండియన్ ఓషన్ పులకింపజేసేది! మన దేశం పేరుతో ఒక మహా సముద్రముండడ మనే భావన మరీ మరీ పరవశింపజేసింది !! దానికి తోడు ఉడుకు రక్తంతో అత్యుత్సాహంగా ఉరకలు వేసే పిల్లలు.ఒకటే కేరింతలు!వాళ్ళ సాంగత్యంతో మాకూ యవ్వనం వచ్చేసింది!

ఆధునిక జీవితం అర్ధం కావాలన్నారు శ్రీ శ్రీ. వేష భాషల్లోనే కాదు,ఆలోచనల్లోనూ శ్రీ శ్రీ చెప్పిన ఆధునికతను వంట బట్టించుకున్న మా అమ్మాయిలు, ఒకరు కాదు,ఇద్దరు కాదు, ముగ్గురు సమర్ధులైన, అతి చలాకైన,ఆధునిక యువతులు నిర్వహించిన ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప సంబరంగా సాగింది!

         *