“దేవపుత్ర” కాదు మట్టిబిడ్డ!! 

deva

Artwork: Akbar

     *

1990 కి ముందు చదువరులకు ముఖ్య కాలక్షేపం వారపత్రికలే! వాట్లో వచ్చే కథలు, నవలల కోసం వారం పొడుగునా ఎదురు చూసే కాలమది.
 
     అప్పుడు నల్లమాడలో నేను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడ్ని. కథల మీద ఆసక్తి ఉన్న ముగ్గురం మూడు వారపత్రికల్ని  కదిరి నుంచి తెప్పించేవాళ్లం.
 
     1987 డిశెంబరు ఆంధ్రసచిత్ర వారపత్రికలో “ఇరుకు” అనే కథ వచ్చింది. ఆ కథను మేం ముగ్గురమే కాక, సాయంత్రం వాకింగుకు వెళ్లి దూరంగా బండమీద కూర్చొనే మా ఉపాధ్యాయ మిత్రులకంతా చదివి వినిపించాను. వారు దాన్ని మెచ్చుకొని మరికొందరితో చదివించారు. ఆ కథను రాసింది చిలుకూరి దేవపుత్ర!! అప్పట్నుంచీ అతని పేరు నాలో ముద్రించినట్లు స్థిరపడి పోయింది.
 
     అప్పుడతంది ఏవూరో? ఏ ఉద్యోగమో చేస్తున్నాడో కూడా నాకు తెలియదు. అయినా పత్రికల్లో పేరు కనబడితే మొదట అతని కథనే చదివే వాడిని.
 
     మరలా హిందూపురానికి బదిలీపై వచ్చాక, డా.పెద్దిరెడ్డిగారి సాహచర్యంతో 1993  ప్రాంతంలో దేవపుత్రది అనంతపురమే అని, ఇంకా సింగమనేని నారాయణ, శాంతినారాయణ, బండినారాయణ స్వామి వంటి ప్రసిద్ధ రచయితల్ది కూడా అనంతపురమే అని తెలిసి సంతోషించాను.
 
     చిలుకూరి దేవపుత్ర 1951 ఏప్రిల్ 15 నాడు అనంతపురం జిల్లా బెళుగుప్ప దగ్గర కాలువపల్లెలో ఆశీర్వాదం, సరోజమ్మ అనే దంపతులకు జన్మించాడు. దళితుడైన అతని తండ్రి చిన్నపాటి ఉద్యోగి కావడంతో దేవపుత్ర ఇతర దళితుల్లాగా అవమానాలకూ, అంటరాని తనాలకూ గురికాకుండా పెరిగి ఉండవచ్చు!!
 
     అయినా తన వర్గానికి జరిగిన, జరుగుతున్న వెలివేతల్నీ, అంటరానితనాల్నీ, అణగదొక్కడాల్నీ గమనిస్తూ అందరిలాగా చూసీ చూడనట్లు పోలేదు. వారి అసహాయతల్నీ, జీవన శైథిల్యాల్నీ, ఇతర సామాజిక రుగ్మతల్నీ 100 కు పైగా కథల్లోనూ, ఐదు దాకా నవలల్లోనూ సజీవ రూపాలుగా అక్షరబద్దం చేశాడు.
 
     అతడు చదివింది S.S.L.C నే అయినా సమకాలీన సమాజాన్ని, తాను పనిచేసిన రెవెన్యూ శాఖ రుగ్మతల్ని బాగా ఆకళింపు చేసుకొన్నాడు. అతను రాసిన కథల్లో సగందాకా తను పని చేసే శాఖలోని బలహీనతలూ, లంచగొండితనాలూ, దొల్లతనాల్ని గురించి రాసినవే!! అతడంత ధైర్యంగా రాయగలిగాడంటే ఎంతగా వృత్తికి అంకితమై వుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
 
     అతని కథలు “వంకర టింకర ఓ” “ఆరు గ్లాసులు” “ఏకాకి నౌకచప్పుడు” “బందీ” చివరి మనుషులు” అనే సంకలనాలుగా వచ్చాయి.
 
     ఇతను, ప్రసిద్ధ కథకుడు సింగమనేని నారాయణ గారి సాహచర్యం వల్ల వామపక్ష భావాల్ని ఆకళింపు చేసుకొని తన రచనల్ని మెరుగులు దిద్దుకొన్నాడు. ఆ భావజాలంతో 1977 లో మొదట రాసిన “మానవత్వం” అనే కథను రంగనాయకమ్మ గారు మెచ్చుకొని అచ్చువేశారు. అప్పట్నుండీ అదే బాటలో చివరిదాకా నమ్మిన సిద్ధాంతాన్నీ, పట్టిన దారినీ వదలకుండా అద్భుతమైన రచన్లు చేశాడు.
 
     “అద్దంలో చందమామ” నవల- తమ అధికారాల కొమ్ములూడినా రెడ్డీ కరణాల ఆధిపథ్య ధోరణినీ, దళారీతనాల్నీ, దళితులపట్ల వారి కల్ముష వైఖర్లనీ వివరిస్తుంది. “పంచమం” నవల- దళితుల దైన్య జీవితాలను అద్దంపట్టే రచన. “ప్రజల మనిషి” నవల- అవకాశాలు కల్పిస్తే దళితులు కూడా తమ ప్రతిభల్ని చాటుకోగల సమర్థులు అని కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. “కక్షశిల” నవల- పేరులోనే రాయలసీమ కక్షల కాఠిన్యాన్ని ధ్యనిస్తుంది. సీమ ముఠా కక్షల్లో బలి అవుతున్నబలహీన బడుగువర్గాల సజీవ సత్యం. “చీకటి పూల” నవల- తెలియని వయస్సులో నేరాలు చేసి జైళ్లకు వెళ్ళే బాలల హృదయవిదారకమైన దుస్థితిని గుండెల్ని తాకేలా చెప్పింది.
 
     “రచయితలు తమ తరానికి జవాబుదార్లు.
      వారు తమకు తామే జవాబు చెప్పుకోవలసిన వారు” అని, ఆదివాసుల వాస్తవ స్థితిగతుల్ని కళ్లకుకట్టి చూపించిన మహోన్నత రచయిత్రి మహాశ్వేతాదేవి గారన్నట్లు, చిలుకూరి దేవపుత్ర మా అనంతపురం జిల్లాలోని కరువు, దళితసమస్యలు,ఫ్యాక్షనిజం మొదలైన విషయాలను ఇక్కడి సామాన్యప్రజల నిత్య వ్యవహారాల పదజాలంతో, ఎటువంతి కల్పనలకూ, అతిశయోక్తులకూ పోకుండా అక్షరబద్దం చేశాడు.
 
    అతను చాలా యేళ్లు కలెక్తరు కార్యాలంలో పని చేశాడు. నేను ఆకాశవాణికి ధ్వనిముద్రణకు వెళ్లినప్పుడల్లా కలిసేవాణ్ణి. అతను చాలా సార్లు “సడ్లపల్లీ! నువ్వు కథల్లో ఆవేశం, కసి రవ్వంత తగ్గించుకో!! పాత్రల్ని పక్కకు నెట్టి నువ్వెందుకు చొరబడతావు??” అని సూచనలు చేసేవాడు. “వీరమాండలికుడు” అని నాకు చురకలంటించి, సరళ మాండలికం రాయించిన ఘనత దేవపుత్రదే!!
 
     ఎంత భయంకరమైన సామాజిక నగ్నాలు, సంఘర్షణలూ తన రచనలో చెబుతున్నప్పటికీ ఆవేశాన్ని కానీ, అసహనాన్ని కానీ, ధర్మోపదేశాల్ని కానీ చేయడు. పాత్రల పరిధికి మించి ఒక్క మాటకూడా ఎక్కువగా మాట్లాడించడు.
 
     కథను ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఎలా ముగించాలో తెలిసిన బహుకొద్దిమంది  రచయితల్లో దేవపుత్ర ఒకడు.
 
     ఊడలమర్రి, ఇదెక్కడిన్యాయం, ఔషధం, విలోమం, ఆయుధం, సమిధలు, గురుదక్షిణ, నేను పెసిడెంటు సుట్టమురాల్ని మొదలైనవి దళితకథలు. వీటిలో రిజర్వేషన్ల మూలంగా దళితులకు సంక్రమించే పరిపాలనాధికారాలు భూస్వాముల మూలంగా ఎలా అనుభవించలేక పోతున్నరో బలంగా చెప్పిన కథ. గురుదక్షిణ- కథనైతే ప్రముఖ చిత్రకారుడూ, సినీ దర్శకుడూ అయిన బాపు “నాకు నచ్చిన కథ”అని కితాబిస్తూ, తన చేతుల మీదుగా అద్భుతమైన బొమ్మ గీసిన ఆణిముత్యం వంటి కథ.
 
     ఐడెంటిఫికేషన్, మీసాలు, ఆర్డర్లీ, ఆరుగ్లాసులు, విడుదల, దొంగయితే బాగుండు తదితరకథలు వైవిద్య భరితమైన అధికార్ల నిరంకుశత్వాన్ని చెప్పేకథలు.
 
     మట్టికీ దాన్ని నమ్ముకొన్న రైతుకూ వున్న సంబంధాన్ని గొప్పగా చిత్రించిన కథలు మన్నుతిన్న మనిషి,ముంపు. రైతుకూ అతని పెంపుడు నేస్తం పశువుకూ వున్న ఆత్మీయబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపే రచన నెర్లు. మనిషియొక్క శాడిజం మీద రాసింది సిహ్మమ్నవ్వింది అనే కథ.
 
     అతని రచన్లన్నీ మొదట్నుంచీ చివరిదాకా చదివించే, ఆలోచింప చేసేవయినప్పటికీ, నాకు అపరిమితంగా నచ్చిన కథ “రెండు రెండ్ల నాలుగు” అది ఎంత హాస్యంగా మొదలై మనల్ని కడుపుబ్బ నవ్విస్తుందో, ముగింపు గుండెల్ని చెమర్చేలా చేస్తుంది. అలా రాయడం అందరిచేతా అయ్యేపని కాదు!!
 
     “చివరి మనుషులు” కథ నేటి సమాజంలో సంపన్న వర్గాలవారూ, వామపక్ష భావాలవారూ,అధికారులూ,ప్రజల్నేలే నాయకులూ చేసే ప్రసంగాలకూ ఆచరించే దొళ్లతనాలకూ పొంతనలేని భేషజాల్ని ఉతికి ఆరేసిన రచన. ఆ కథలో తమపిల్లల్ని తెలుగుపాఠశాలలో చదివించే ఆంగ్లోపన్యాసకుడు వేరెవరో కాదు! అతడు తెలుగుతల్లి అభిమాన భాషా మానస పుత్రుడైన  చిలుకూరే!!
 
     అతడు తన ఇదరు పిల్లల్నీ ప్రభుత్వ బడుల్లో తెలుగుమాధ్యమంగానే చదివించాడు. కుమార్తె చిలుకూరి దీవెన కవయిత్రి, కథకురాలుకూడా!!
 
     ఇంకొక విషయం ఏమిటంటే అతని భార్య లక్ష్మీదేవిగారిది కర్నాటక. ఆమె అక్కడ చదివింది కేవలం నాలుగో తరగతి దాకానే! ఇతని సాంగత్యంతో తెలుగు చదవడం రాయడం నేర్చి ఓపన్ యూనివర్సిటీలో డిగ్రీకూడా పాసయ్యింది. ఇరవై దాకా కథలుకూడా రాసిన ఏమే దేవపుత్ర కథలకు మొదటిశ్రోత, విమర్శకురాలునూ!!
 
     ఇతడు రాసిన కథలు, నవలలకు ఇరవైకి పైగా అవార్డులూ, సత్కారాలూ అందుకొన్నాడు. చివరగా జాషువాజయంతిని పురష్కరించుకొని సెప్టెంబరు 28 నాడు విజయవాడలో “గుర్రం జాషువా” పురష్కారాన్ని అందుకొన్నాడు. ఇరవైఐదు దాకా విశ్వవిద్యాలయాలు ఇతని రచనలని పాఠ్యాంశాలుగా చేర్చుకొన్నాయి. పది మంది దాకా విద్యార్థులు ఇతని రచన్లపై పరిశోధనలు చేసి డాక్టరేట్లు, యం.ఫిల్ పట్టాలు పొందారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీవారు ఆంగ్లంలో ప్రచురించిన దళితకథా సంకలనంలో ఇతని గురుదక్షిణ తీసుకోవడం మన తెలుగు కథక జాతికే గర్వకారణం.
 
    ఆగష్టు 23 నాడు హిందూపురంలో తపన సాహిత్యవేదిక తరపున తమిళనాడులోని తెలుగు సోదరులు రాసిన “రాగెన్నుల రాజ్యం” మరికొన్ని పుస్తకాల ఆవిష్కరణలతో పాటు, మా అబ్బాయి పెండ్లికి హాజరై, రాత్రి 11 దాకా నాతో ఏకాంతంగా గడిపి కుటుంబ నేపథ్యాన్నతా అదిగి తెలిసుకొని “నువ్వు మనిషివి కావు, రాక్షసుడివి, బ్రహ్మరాక్షసుడివి నీ కథ రాసి తీరుతా” అని కౌగిలించుకొని ముద్దు పెట్తుకొన్నాడు!!
 
    ఇతడు స్నేహశీలి, సౌమ్యుడు, చాలా సున్నితమైన మనస్వి. ఉబికివచ్చే ఆనందాన్ని తన్లో దాచుకోలేని వ్యక్తి. ఒక సారి అనంతపురానికి వచ్చిన గోరటి వెంకన్నతో మేమంతా కలిశాము. “సంత” తో ముడిపడిన జీవితాల్ని అభినయిస్తూ అద్భుత పదచిత్రాల పూలని తనదైన శైలిలో మా హృదయాలమీద చిలకరిస్తున్నాడు. మేము రెప్పవాల్చకుండా గుండెల్ని కూడా శబ్దించకుండా నిశ్శబ్దపరచి ఆస్వాదిస్తున్నాము.
 
     చిలుకూరి ఉన్నఫళంగా లేచి గోరటివెంకన్నను కౌగిలించుకొని తన స్పందనల్ని మాటలుగా మార్చలేక చిన్న పిల్లాడిగా ఏడ్చేశాడు. అదొక్కటి చాలు సమస్యల పట్ల ఎంతగా చలించిపోయే వాడో అని అంచనా వేయడానికి!!
 
    సెప్టెంబరు 27 నాడు పత్రికల్లో వార్తవచ్చింది చిలుకూరికి జాషువా అవార్దు ఇస్తున్నత్లు. ఫోన్ చేసి అభినందనలు చెప్పి, “మా ఊరికి ఎప్పుడొస్తావ్ మా సంస్థతరపున సన్మానం చేయాలనుకొన్నాం” అన్నాను.దానికతడు నవ్వుతూ, “నువ్వు రైతుల కతలు రాయప్పా! అదేనాకు చేసే సన్మానం” అన్నాడు.
 
     అక్తోబరు ఒకటో తేదీ నాడు ఫోన్ చేసి, “సడ్లపల్లీ! వేదగిరి రాంబాబుగారు మన కథల ప్రూఫులు పంపినాడు. ఐ.డి. చెప్పు మెయిల్ చేస్తాను అన్నాడు. “పుత్రా అయితే రేపు అనంతపురానికి నేను రావాల్సిన పని లేదా?” అన్నాను.
 
    “ఔ గదా!! రేపు అభ్యుదయ రచయితల సంఘం తరపున గురజాడ- గుర్రం జాషువాల వ్యక్తిత్వాలపై సమావేశముంది కదా!! పొద్దున్నే ఇంటికొచ్చేయ్” అన్నాడు. అతను జిల్లా రచయితల, అభ్యుదయ రచయితల సంఘాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తి.
 
     మరుసటి దినం తొమ్మిదింటికే మరో కడప మిత్రునితో కలిసి ఇంటికెళ్లాను. అప్పటికే మంచం వెడల్పునా కల్లంలో రైతులు పండిన ధాన్యాన్ని నెరిపినట్లు కూర్చోవడానికే సందు లేకుండా పేపర్లనూ, పుస్తకాల్నీ పరుచుకొని, నేను పెసిడెంటు సుట్టమురాల్ని – కథ ప్రూఫు దిద్దుతున్నాడు.
 
     అతని శ్రీమతి లక్ష్మి దేవిగారు కమ్మని కాఫీ అందించారు. పిచ్చా పాటీ మాటలయ్యక, “టైమయితా వుంది, నేను బిరీన స్నానం చేసొస్తాను. ఈ ప్రూఫ్ అట్ల దిద్దు నువ్వూ మాండలికుడివే కదా” అన్నాడు నవ్వుతూ.
 
     దానికి నేను “మాండలికం అంతే భాష పరిధిని కుదించి చట్రంలో బిగించినట్లుంటుంది. ప్రాంతీయ యాస అంటే బాగుంటుంది కదా” అన్నాను.
 
    “ఎందుకు బాగుండదు! ఇంక మీదట అట్లనే పిలుద్దాంలే” అని స్నానానికి పోయాడు. దిద్దడం అయిపోయాక నా కథను కూడా అతనే తీసుకొని హైదరాబాదుకు పంపిస్తానన్నాడు. మధ్యాన్నానికి సభ ముగిసింది.
 
     అక్టోబరు 15 శుక్రవారము. శాంతినారాయణ, దేవపుత్రా ఫోన్ చేసి” మన జిల్లావే నావుగయిదు కథలున్నాయి. ఆదివారం కథల సంకలనం ఆవిష్కరణ వుంటుందని, వేదగిరి రాంబాబు మైల్ చేశాడుకదా! నువ్వు కూడా వచ్చేయ్ అందరూ కల్సి పోదా” మన్నారు. కొన్ని పునులుండడంవల్ల నేను రానని చెప్పాను.
 
     అక్టోబరు 18, ఉదయం పది గంటల సమయంలో శాంతినారాయణ గారు ఫోన్ చేసి”చిదంబరరెడ్డీ.. ఒక దుర్వార్త…” అని కొంచెం సేపు గుండెను బిగబట్టుకొన్నట్లు ఆగి మన దేవపుత్ర అని చెప్ప బోయాడు. ఏదో ప్రమాదం లాంటిది జరిగి వుండొచ్చనుకొని  ఏం జరిగింది సార్?? అన్నాను. గుండెపోటుతో మనకు దూరమైనాడు” అని ఫోను పెట్టేశాడు.
 
     నాకు కొంతసేపు ఏమి చేయాలో తోచలేదు. వెంటనే ఫేస్ బుక్కులో అతన్ని గురించి నాలుగు మాటలు రాసి, సంతాపం తెలుపుతూ పోస్టు చేసాను.
 
    క్షణాల్లో ప్రపంచంలోని అన్ని దేశాల నుండీ  ఎడతెరిపి లేకుండా సంతాప సందేశాలు పంపిస్తుంటే- అంతమంది అభిమానులు అందునా యువకులు ఉండడం నాకు ఆశ్చర్యానికి గురిచేసింది. మరి కొంత మందయితే అతని కనుమరుగును జీర్ణించుకో లేక నేరుగా నాకు ఫోను చేసిగాని నమ్మలేక పోయారంటే… ఆ సాను భూతిని, అభిమానాన్ని, ప్రేమా వాత్సల్యాల్ని ఎలా వ్యక్తం చేయను?? (ఇప్పుడు 29.10.2016 రాత్రి 10 గంటలప్పుడుకూడా దూరప్రాంతాల్లో వుండి ఆలశ్యంగా తెలుసుకొన్న వారు అతనికి సంతాప స్పందనలు వస్తూనే వున్నాయి)
 
     విషాద వార్త తెలుస్తూనే దేవపుత్ర ఇంటికి వెళ్లిన కథారచయిత బండినారాయణ స్వామి”అతని మరణంలో విషాదంతో పాటు ఒక సంతోషం కూడావుంది. ఉదయం యథాప్రకారం వాకింగు నుండి వచ్చాడు. కాఫీ తాగినాడు. భార్యతో నాలుగు మాటలు మాట్లాడి కుప్పకూలి పొయాడు. ఆమె భయంతో అరిచింది. అతన్ని బతికించుకోవడానికి గుండెపై ఒత్తిడి చేస్తుంటే నిద్రనుంచి లేచినట్లు లేచి “నేను నిద్ర పోతున్నాను. నాకు అందమైన కలలు వసున్నాయి. దయచేసి పాడు చేయవద్దు” అని అతని చివరి మాటలు వివరిస్తూ, “అతడు సమాధుల తోట్లో పూసిన ఒక పూవు. నా నల్లని చందమామ”అన్నాడు.
 
     రెవెన్యూ శాఖలో ఇనస్పెక్టరుగా పని చేస్తున్న వ్యక్తి ఇంతికి కావాల్సిన చక్కెర, కిరోసిన్ వంటివి అందరిలాగే బ్లాకులో కొనడం మీరెక్కడైనా చూశారా??
 
    అదేశాఖలో పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తిని, అదే సంస్థ”మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన పని లేదు. యథాప్రకారం ఆఫీసులోనే వచ్చి కూర్చొండి. చేతనయితే ఏదయినా పని చేయండి. మీరు ఇక్కడికి రావడమే మా కార్యాలయానికి గౌరవ సూచిక. ప్రతి నెలా గౌరవ వేతనం పదివేలిస్తాం.”అని ఎక్కడైనా అన్నట్లు విన్నారా??
 
     అంగ్లేయుల కాలంలో చెప్పలేను కానీ, ఇప్పటి వ్యవస్తలో అంతటి నిజాయితీ, వృత్తికి అంకితమై పోయిన మొదటివాడూ చివరివాడూ బహుశహా చిలుకూరి దేవపుత్ర ఒక్కడేనేమో!!
 
     బయటి ప్రపంచానికి తెలియని దళిత, బడుగు వర్గాల జీవితాల కఠోర సత్యాల్ని ఇంకా చెప్పాల్సిన దేవపుత్ర మరణం అభ్యుదయ సమాజానికీ, అణగారిన ప్రజానీకానికీ తీరని లోటు.
 
    అతడందించిన కథల కేతనాన్ని యువతరం అంది పుచ్చుకొని,విశ్వమానవ సమాజం వైపు నడిపించుకు పోయినప్పుడే  అతనికి నిజమైన నివాళి !!

*

అపుడు కరెంటుండ్లేదు!

అపుడు కరెంటుండ్లేదు. తెల్లారి మూడుగటల్కే లేసి మా నాయినావాళ్లు కపిలిబాన దాని సరంజామా అంతాతీసుకోని,ఎద్దులు తోలుకోని,సేన్లకి నీళ్లు తోలేదానికి పోతావుండ్రి.

దూళి దూళి మబ్బున్నట్లే మాయమ్మ,అన్నయ్య,అక్కయ్యావాళ్లు లేసి ఎనుములు(బర్రెలు)ఇంట్లోనుంచి బయటకట్టేసి,ప్యాడ తిప్పకిమోసి,గంజుతీసి పారబోసి పాలు పిండతావుండ్రి. అయిదుగంటల్కే ఇందూపురమ్నుండి పాలోడొచ్చి సేర్తోకొల్సి సైకిల్లో తీసుకుపోతావుండె.ఏడుగంటల్కి ఇసుకూలుమొదలయ్యి పదిగంటల్కి ముగుస్తావుండె.అపుడు ఇసుకోలు పిళ్లోళ్లంతా ఎనుముగొడ్లు మేపుకోనొచ్చేకి పోతావుంటిమి.

సానామంది రెడ్డ్ల ఇండ్లల్లో పనులుసేసేకి,సేద్యాలు సేసేకి, జీవాలుమేపేకి జీతగాళ్లు(సంబళగాళ్లు)వుంటావుండ్రి(ఎక్కువగా మాదిగలు ఒకసారి పెళ్లికో,జాత్రకో,ఇతరఖర్చులకో కొంత అప్పుచేసి,దానికి హామీగా వారిపిల్లల్ని చాకిరీకి వుంచేవారు దాదాపు 1977(ఎమర్జెన్సీ) వరకూ ఈపద్ధతి వుండేది). మాఇంట్లో అన్నిపన్లూ మేమేసేయల్ల.

వుప్పర నరసిమ్ముడు, పింజిరి పీరూగాడు,బేల్దారి అస్వత్తుడు,మురవోడు,నేను ఎనుముల జతగాళ్లు.వాటిమింద కూకోని గుర్రాలమాదిరీ ఎగిరిస్తావుంటిమి. అపుడు వాన్లు బాగకురుస్తావుండె. పొలాల్లో పంట్లు,కాణాసిల్లోగడ్డి పెరుగుతూనే “కట్” సేసినట్ల తప్పెటకొట్టి సాటింపేస్తావుండ్రి. ఇద్దురు ముగ్గురు కావలిగాల్లు పొలిమేర్లకానా గస్తీతిరుగుతావుండ్రి.పంట్లు కోసేవొర్కూ జీవాలు పోగూడదు,గడ్డికోయగూడ్దు.అట్లసేస్తే జూల్మానా ఏస్తావుండ్రి. బందుల్ దొడ్డికి తోల్తావుండ్రి.

అందుకే మేము బాటపక్కకి తోల్తావుంటిమి. సుక్కురువారుము ఇందూపురంసంత.సుట్టూపక్కల వూర్లజనాలంతా పొద్దుట్నుంచి రాత్రిఒరుకూ ఇసకేస్తే రాల్నట్ల పోతావుండ్రి.ఒగరిద్దరు రెడ్లు,కోమిటి లెచ్చుమయ్య మాత్రమే పావళాఇచ్చి జట్కాలో పోతావుండ్రి.

వుప్పరనరసిమ్ముడు బొలే కిల్లేకిత్తిరిగాడు. బోకుల్ని రెండణాలమాదిరీ(అప్పుడు పగలంతాపనికి రెండణాలకూలి.12పైసలు) తయారుసేసి పాతబట్టల్ని కర్చీపుల్మాదిరీసించి మూటగట్తి దావలో ఏస్తావుండె.శానామంది దుడ్లే అనుకోని అక్కడిక్కడసూసి ఎత్తుకుపోతావుండ్రి.సెట్లమరుగ్లో దీన్నిసూసి కడుపులు పగిలేతట్ల నగుతావుంటిమి.

మావూర్లపక్క యాడసూసినా సెరుకుతోట్లే!! బెల్లాన్ని బండ్లకినింపి మండీలకి తోల్తావుండ్రి.వాళ్లని అడిగితేసాలు తినే అంతబెల్లమిస్తావుండ్రి.ముందుగానే సంటకుపొయ్యి తిరిగొచ్చే వాళ్లనడిగితే బొరొగులూ కారంబూందీలు పెడతావుండ్రి.ఈపన్లు నరసిమ్ముడు,మురవోడు సేస్తావుండ్రి.

ఒంటిగంటకి సైరన్నుకూస్తావుండె.అవుడు ఎనుముల్ని గుంతల్లోకో సెరువులోకో దించి నల్లగా నిగనిగలాడేతట్ల కడిగి ఇంటికి యల్బార్తావుంటిమి.రెండుగంటల్కి పాలోడొచ్చేటయానికి మద్యాన్నంబెల్లుపడతావుండె. గోదుమరవ్వతో వుప్పుమా,పొవుడరుపాలూ ఇస్తావుండ్రి.రవ్వంత సదువవుతూనే ఇసుకూలు తోటకి సెరువునీళ్లు మోస్తావుంటిమి.

ఇంటికిపొయ్యినంక కట్లికి(వంటచెరుక్కు) పోవల్ల. ఆకాలంలో మావూరిదగ్గర తిండికన్నా కట్టెలకరువుశానా. ఈత తట్టెల్తీసుకోని జొన్నకొయ్యలు,కందికొయ్యలు,సన్నబన్న గబ్బుసెట్లు ఏరుకోని తెస్తావుంటిమి. తిరగ ఇంటిముంద్ర,పసువులకిందా కసువు సిమ్మల్ల.ఎద్దులకి సొప్ప,అగిశాకూ తినిపించల్ల. కుడితికి,ఇంటికి కావల్సినన్ని నీళ్లు బాయినుంచి సేదల్ల.(కొన్నిపన్లు నావరకూవచ్చేవికావు.అప్పుడు అందరు దాదాపు చేయాల్సినపనులు చెబుతున్నాను) రాగులు ఇసరల్ల,జొన్నలు వొడ్లుదంచల్ల సన్నపిళ్లోల్లని ఎత్తుకోవల్ల. లాటీన్ల(ల్యాంపుల) చిమిలీలమస్సితుడుసల్ల. సీమనూనె పోయల్ల,తావదీపం పెట్టేకి ప్యాడ తేవల్ల. ఏడుగంటల్కే బువ్వతినల్ల.

కడుపుకు సరయిన కూడులేక మేము సస్తావుంటే వానెమ్మ!!

నల్లుల బాదయాలసెప్పల్ల.ఇంటి నడిమద్య సాపలు,గోనిసంచులు పర్సుకోని అవిరాకుండ సుట్టూర కోటమాదిరీ రాగివుబ్బళ(రాగులమీది పొట్టు),మూటకట్టాకు(వరిమడికోశాక మొలిచే బంకబంక ఆకులుండేకలుపుమొక్క) ఏసుకొంటా వుంటిమి.జనాల రగతం తాగేదానికేమో!! అవి శానాతెలివయిన్వి.పక్క గోడ్లు,తడకలూ ఎక్కి మేలాటం (టాపు)మీద్నుంచి మిందకి దుముకుతావుండె.

నీళ్లు పోసుకోనేది, బట్టలిడిసేది ఒగవారం లేటయితేసాలు బట్టల్నిండా కూరేగంట్లు(చీర పేన్లు) ఇంకాకొంద్రు బీదాబిక్కీ జనాలకి పీడ పేన్లు పడతావుండె.అవి సంకలకింద,తొడలమద్య,కన్రెప్పల్కి అతుక్కోని గోరుల్తో గీకినా కనిపిస్తావుండ్లేదు.ఇట్ల అర్దం రగతం అవేతాగుతావుండె.

పున్నమికోసరం నెలంతా ఎదురుసూస్తావుంటిమి. యాలంటే ఆపొద్దు రాత్రిలో ఎలుగుంటుంది. యంతసేపయినా ఆడుకోవొచ్చు. ఆడపిల్లోల్లు మగపిళ్లోల్లు కల్సి సల్లేమల్లే గుడ్లు( చల్లే మల్లెల కుప్పలు-ఎంత అధ్భుతమైన పేరోకదా!!)పెద్దోళ్లు వుప్పురపెట్టెలు- ఆట్లు ఆడ్తావుంటిమి.

ఏమాట్లాడినా మానాయిన లేకుంటేనే!! ఆయప్ప కతలు ఇంగొగ సారిసెప్పుతాను. మాయన్న ఇంట్లో వుంటే నేను మాయమ్మకి సిక్కల్ల. నీళ్లు పోపిచ్చుకోవల్ల. పేన్లు సూపిచ్చుకోవల్ల. ఈపిలు(పేల గుడ్లు)ఈరబానితో ఈరిపిచ్చుకోవల్ల. గోర్లు కత్తిరిచ్చుకోవల్ల. పండుకొంటే ఇసనగర్రి తోఇసరుకొంటా కూకోవల్ల.

మాఇల్లు యట్లున్నిందో రవ్వంత సెప్పుతాను. అట్లాఇల్ల యాడన్నావుందేమో అని శానాఏండ్లు యెదికినా కనపడ్లేదు. నేను పుట్టేకి ముందే మాయప్పప్పా(చిన్నాయన) మానాయినా యారేపొయ్యిండారు. సుట్టూ ఇటికెలగోడ దానిమింద సెరుకు సోగల కప్పడము మాసిన్నాయనది.దాని పక్కలోనే సుట్టూ టెంకాయ గర్రుల తడకలు.ఆడ వానొస్తే ఈడకారేసోగలకప్పడము మాది.వాకిలికూడా తడకే.కుక్కలు,కోళ్లు,పిల్లులు,మేము యాడ్నుంచీ అయినా దూరి లోపలికిపోవొచ్చు.అందుకే మాయమ్మ శార,సంగటి,మజ్జిగ..అన్నీ వుట్టిమిందే ఎత్తిపెడ్తావుండె.

అది కూటికరువుకాలము. జనాలు పుట్టిండేది తినేదానికే అనిపిస్తావుండె. మేము అయిదారుమంది పిల్లోల్లు. వుండేది ఒగతట్ట. మాయమ్మ సంగటి కెలుకుతూనే తెడ్డు సుట్టూసేర్తావుంటిమి. అందురూ ఒగే తట్ట సుట్టూసేరి-నువ్వుముందో నేనుముందో-అన్నట్ల తింటావుంటిమి. వేరే ఇండ్ల్లో ఆడోల్లు మగోల్లు కూడా ఒగేతట్లో తింటావుండ్రి.

మానాయిన ఇపరీతంగా బీడీలు తాగుతావుండె.(గణేష్ బీడీలు) సాయంట్రమౌతూనే వాళ్లూ వీళ్లూ వొచ్చి మాగుడిసితాకొస్తావుండ్రి. వాల్లకి రాజకీయాలు,బారతంకతలు,దేశాలుతిరిగి సూసిన సంగత్లన్నీ సెప్పుతావుండె.మద్యాలో బీడీ ఆరిపోతే బుడ్డీలోనో,పొయ్యిలోనో అంటిచ్చుకు రమ్మని సెప్పుతావుండె.అది యంతసేపటికీ అంటుకోకుంటే నోట్లో పెట్టుకోని ఒగ పీక పీకుతావుంటి.

ఒగదినము గుంతులో పగసేరి తగ్గొస్తే అది సూసి జుట్టుపట్టుకోని వంగబెట్టి కొట్టింది ఇంకాబాగ గురుతుంది.

అట్ల బీడీలు తాగీ తాగీ నోరు సెడిపోతావున్నేమో. మాయమ్మ యంతబాగ శార సేసినా రుసీ పసీలేదని గలాటకి పెట్టుకొంటావుండె.గిన్నిచ్చి నన్ని ఇండ్లంటీ తరుముతావుండె.ఒగొగుదినము ఒగొగు ఇంటికిపొయ్యి శార పోపిచ్చుకొస్తావుంటి.ఇండ్లతాకిపొయ్యి అడుక్కుతినేవోళ్లమాదిరీ అడిగేకి, నాకి శానాసిగ్గి. పోకుంటే ఏట్లు.మేం పదిమంది సంతానం. మా అక్కయ్య ఇద్దరన్నయ్య గార్లూ శానా పెద్దోల్లు. ఇంకిద్ద రన్నయ్యగార్లూ సచ్చిపొయ్యిండారు.(వాళ్లు యట్ల సచ్చిరో తిరగ సెప్పుతా) ఇంకిద్దరు తమ్ముల్లూ, సెల్లెళ్లూ శానా సన్నపిల్లోళ్లు.అందుకే సన్నాబన్నా పన్లన్నీ నామిందే పడ్తావుండె.

-సడ్లపల్లె చిదంబరరెడ్డి