13 జులై 1931

 

-అవ్వారి  నాగరాజు
~
1
ఎటు వైపునుండయినా దీనిని మొదలు పెట్టవచ్చునని తెలిసాక
అటూ ఇటూ కదలజాలక బంధితమై  ఉన్న చోటునుండీ ఇంటినుండీ కరుడుకట్టిన నిశ్చలప్రవాహాలలాంటి రోడ్లమీదకు ఉరకాలనుకునే నిస్సహాయపు రాత్రి నుండీ
కొంచెం భయంతో మరికొంచెం ఆసక్తితో మరణాన్ని తప్ప మరొకదాన్ని ఆవాహన చేయజాలని
రోజుల గుండెలమీద నెమ్మదిగా కదలాడుతున్న ఒకానొక పురా భారము నుండీ
నుదుటి మీద నీకోసం కేటాయించిన వరుస సంఖ్యను సదా ఊహిస్తూనే ఉంటావు
2
 రోజులు  నీలాగే వొట్టిపోతున్నపుడు లేదా నీవే  రోజులన్నింటిలాగా వొట్టిపోతున్నపుడు
జీవితం అర్ధాంతరమని  గీతగీసి మరీ చెప్పడానికి
 ఇంటిలో నీ తల్లో ఎవరో మరెవరో ఒక ఆడకూతురు నీ ఎదురుగానే తిరగాడుతున్నప్పుడు
 బిడ్డల చావుని తప్ప మరేదీ నమ్మనంత ధ్యానంగా వారు  మృత్యువుని మోసుక తిరుగుతున్నప్పుడు
నువ్వు వాళ్ళని ఊరకే అలా చూస్తూ ఉండలేవు
ముఖాల మీద కదిలీ కదలాడని ఒక పలుచని తెరలాంటి దాన్ని చదవకుండానూ ఉండలేవు
3
ముందుగానే తెలిసిపోయే భవిష్యత్తులాంటి
లేదా ఇంతకు ముందెప్పుడో సరిగ్గా అలాంటిదాన్నే అనుభూతి   చెందిన  పీడకలల ప్రయాణపు దారిలాంటి
చంచలిత దృశ్యాదృశ్యాల కలయికలలో
ఇదేరోజున నిన్ను జీలం నదీ శీతలజలాల చెవియొగ్గిన చప్పుళ్ళలో
ఇంకా రాళ్ళను విసిరేందుకు ఏరుతున్న రహదారులమంటల కశ్మీర్ లోయలలో
దుఃఖించినట్టూ గుండెలవిసేలా బాదుకున్నట్టూ
కాకుండా ఇక ఎలా రాయగలవూ?
*

సూఫీ- సంత్ సంవాద కేళి

 

 

-అవ్వారి నాగరాజు

~

 

సంత్ ఏక్‍నాథ్ ఒక రోజున స్నానమాచరించడానికి గోదావరీ నదీ తీరానికి వెళ్ళాడట. శుచిగా స్నానం చేసి తిరిగి వస్తుండగా దారి పక్కన ఉన్న ఒక ఫకీరు ఆయన మీద ఉమ్మి ఊస్తాడట. శరీరం మైల పడిపోవడంతో  ఆయన తిరిగి మరోసారి స్నానానికి వెళతాడట. తిరిగి వస్తుండగా ఆ ఫకీరు మరో సారి ఆయన మీద ఉమ్మి ఊస్తాడట.  ఏక్‍నాథ్ ఆ ఫకీరుని ఏమీ అనకుండా సహనం వహించి తిరిగి మరో సారి నదికి వెళతాడట.

స్నానం చేసి తిరిగి రావడం, ఫకీరు ఉమ్మడం – ఇలా అనేక సార్లు జరిగిన తర్వాత కూడా తనని ఏమీ పల్లెత్తు మాట కూడా అనని సంత్‍ సహనానికి ఆ ఫకీరు పశ్చాత్తాపం చెంది తనను క్షమించమని అడుగుతాడట. పైథాన్(ప్రతిష్టాన పురం) నివాసి అయిన ఏక్‍నాథుని గొప్పతనం గురించి జనసామాన్యపు నాలుకల మీద ఉన్న ఈ కథనానికి కొనసాగింపు ఉంది.

తనని క్షమించమని అడిగిన ఫకీరుకు, బదులుగా ఏక్‍నాథ్-  మీరు చేసిన ఈ పని వల్లనే పవిత్రమైన ఈ గోదావరీ నదిలో అనేక మార్లు  స్నానం చేసే భాగ్యం నాకు కలిగిందని అంటాడట. సంత్ ఏక్‍నాథునితో ఫకీరు జరిపిన ఈ సంవాదాన్ని సంత్ అనుచరులు ఇద్దరు మహాత్ములు జరిపిన దివ్య కేళీ కలాపంగా వివరిస్తుంటారు.

సంత్ గొప్పదనాన్ని ప్రపంచానికి వెల్లడి చేసేందుకు ఫకీరుగా తన పాత్రని పండించిన వ్యక్తి సిద్ధి ఆలీబాబా. ప్రముఖ సూఫీ గురువు.  ఆయన అప్పుడు- మీ మీద ఇన్ని సార్లు ఉమిసాను కదా, బదులుగా ప్రాయశ్చిత్తం చెప్పమంటాడట. నా పుట్టిన రోజునాడు నా భక్తులు చేసే ఉత్సాహాల సందోహంలో, వారి కాలికింద రేగిన దుమ్ము నీ దర్గాపై పడుతుంది పో. అదే నీకు ప్రాయశ్చిత్తం అని సంత్,  బాబాని  సముదాయిస్తాడట.

సంత్ పుట్టిన రోజు ఉత్సవాలలో పాల్గొనే భక్తులు, దారిలో ఉన్న సిద్ధి ఆలీ బాబా దర్గాను చూసి ఈ కథనాన్ని  తలుచుకోవడం ఇప్పటికీ వాడుకలో ఉంది.

జనం వాడుకలో ఉన్న ఈ కథనాలు భక్తి ఉద్యమాన్ని గురించి మనకు సంకేత ప్రాయంగా రెండు విషయాలని తెలియజేస్తున్నాయి. పదమూడవ శతాబ్ధి చివరి వరకూ తెర వెనుకగా ఉన్న ఇస్లామ్- సూఫీ ప్రభావాలు ఉత్తర భారత దేశంలో పద్నాలుగ శతాబ్ధం నుండీ ప్రత్యక్షంగా అయిపోయాయి. ఈ రెండూ పరస్పరం జరుపుకున్న ఆదానప్రధానాలు పైన చెప్పిన కథనంలో మాదిరిగా ఎదురెదురుగా  నిలుచున్న సూఫీ, సంత్‍లు జరిపిన సంవాదకేళిలాగా మారిపోయాయి.  అలాగే,  పైన చెప్పిన కథనంలో మాదిరిగా సాధికారికమైన మత తాత్వికతకు ప్రత్యామ్నాయమైన  విశ్వాసాలూ, ఆచరణా కలగలిసిన సాంస్కృతిక ఆవరణాన్ని భారత దేశ మధ్యయుగాలకు ఇవి అందివ్వగలిగాయి.

ఇలాంటి సాంస్కృతిక వాతావరణం నుండే ఉత్తర భారతదేశపు భక్తి ఉద్యమం అభివృద్ధి చెందింది.

ఙ్ఞానేశ్వర్, నామదేవ్, కబీర్, రాయ్‍దాస్, నానక్, దన్నా, దాదూ, ఇంకా ఒరిస్సాలోని పంచసఖులు, తుకారాం, చైతన్యుడు, మీరా- ఇలా వీరందరూ ఉత్కృష్టమైన సాంస్కృతిక పర్యావరణానికి ఉదాహరణలు. వీరు ఇస్లాం, సూఫీల ప్రభావానికి ప్రత్యక్షంగా లోను కావడమే కాకుండా, తమ కాలపు మత ఆచరణలలోని చెడులను తీవ్రంగా విమర్శించారు కూడా. నామదేవ్ విగ్రహాలను పూజించడాన్ని అపహాస్యం చేస్తాడు. హిందూ-ముస్లీంల నడుమ సయోధ్యను ఏర్పర్చడానికి కృషి చేస్తాడు. కబీర్ ఇటు బ్రాహ్మనీయ హిందూ మతంలోనూ,ఇస్లాంలోనూ ఉన్న అతిని ఖండిస్తాడు. నానక్ మరో అడుగు ముందుకు వేసి ఒక విశ్వాసానికి ఎదురుగా మరో విశ్వాసం నిలబడి ఉన్నప్పుడు వాటి మధ్య సయోధ్య కుదరదని అంటాడు. ఈ రెండింటినీ విడిచి సిక్కుమతాన్ని స్థాపిస్తాడు. ఆయన మహ్మద్ ప్రవక్త జీవితం నుండీ ప్రేరణ పొందినట్టుగా చెప్పుకున్నాడు. సూఫీలవలే గురు పరంపరను ఏర్పరచి గురుస్థానాన్ని మార్గదర్శకంగా చేస్తాడు. ఒరిస్సాలోని పంచసఖులు భారత, భాగవత, రామాయణాలను ఒడియాలోకి అనువాదం చేసి భక్తి మార్గాన్ని సుస్థిరం చేసారు. చైతన్యుడు సంకీర్తనామార్గాన్ని అవలంభించాడు. మీరా రాబియా వలే భగవంతునిలో సఖుడిని వెతుక్కుంది.

ఒక భక్తి ఉద్యమ కవినీ లేదా సంత్‌నీ అధ్యయనం చేయడానికి వారి స్థానిక సాంస్కృతిక వాతావరణం, వారి వాఙ్మయ సారస్వతం గొప్ప ఆధారాలుగా ఉపయోగపడతాయి. వాటిని ఆధారంగా వారు తమ కాలపు సామాజిక చలనంలో ఎక్కడ నిలబడి ఉన్నారో, వారు తమ కాలానికి చెందిన లక్షణాలను ఎలా ప్రతి ఫలించగలిగారో మనం అధ్యయనం చేయవచ్చు.

మధ్య యుగాల నాటి ఉత్తర భారత దేశంలో ఉన్న సాంస్కృతిక వాతావరణం మునపటికన్నా మరింత కాంతివంతంగా మారడానికి బయటి నుండీ జరిగిన దండయాత్రలూ,ముస్లీంల రాజ్య స్థాపన దోహద పడ్దాయి. సామాజిక స్థితిగతులలో కుదపూ ఏర్పడింది.ఈ కుదుపుకు అనుగుణంగా సమాజంలో సర్దుబాట్లు జరగాల్సిన అవసరం ఏర్పడింది. గుప్తుల కాలం నాటికి బయటి ప్రాంతాల నుండి వచ్చిన శకులు, హుణులు లాంటివారు ఇక్కడి స్థానిక సమాజంలో భాగమయ్యారు. అలాగే స్థానిక ఆదివాసీ తెగలు ప్రధాన స్రవంతిలో భాగమయ్యి రాజపుత్రులుగా, వివిధ కులాలుగా స్థిరపడ్డారు. సరిగ్గా అలాంటి  సామాజిక మార్పులే ముస్లీం రాజ్య స్థాపనల వల్ల మరోసారి ఏర్పడాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఈ రకమైన సామాజిక మార్పులు వ్యక్తమవడానికి ఇస్లాం-సూఫీ తాత్వికతలు ఈ కాలంలో ఎంతగానో దోహద పడ్డాయి.

సాధికార మత తాత్వికతలు, కొత్తగా తమ చారిత్రక పాత్రని నిర్వహించడానికై ఉబికి వస్తున్న ప్రజా సమూహాలకు గొప్ప అడ్డంకులుగా ఉండడం వల్ల వాటిని తోసివేసే మత విశ్వాసాలూ, ఆచరణలే మధ్య యుగపు తాత్విక భూమికలయ్యాయి. ఇవి అటు బ్రాహ్మణీయ హిందూ మతానికీ, ఇమాంలు ప్రవచించే  ఇస్లాంకూ సవాల్‍గా నిలబడ్డాయి. ఈ చారిత్రక ఘట్టం భక్తి ఉద్యమంగా పిలవబడడానికి బహుళత్వానికి పీట వేసే వివిధ సంప్రదాయాలు, సూఫీల కృషీ పునాదులుగా దోహదపడ్దాయి. సూఫీలు తమను తాము ఇస్లాంలో విడదీయరాని భాగంగా చెప్పుకుంటూ ఈ కృషిలో పాలు పంచుకున్నారు.

ఉత్తర భారతంలో భక్తి ఉద్యమ కాలపు సాంస్కృతిక వాతావరణాన్ని మనం తిరిగి సంత్ ఏక్‍నాథ్ నుండే ఉదహరించవచ్చు. ఏక్‍నాథ్ దక్కన్‍లో భాగమైన మహారాష్ట్ర ప్రాంతపు బ్రాహ్మణుడు. ఆయన పదహారవ శతాభ్ది చివరి అర్థభాగానికి చెందిన వాడు. ఆయన పుట్టిన పైథాన్ పట్టణం ప్రతిష్టానపురం పేరుతో చరిత్రలో శాతవాహనుల ఏలుబడిలో ఉండేది. మహారాష్ట్రలో వర్కారీ సంప్రదాయానికీ ఆలంబనగా ఉన్న విఠోబా విగ్రహాన్ని విజయనగరం నుండీ వెనక్కి తీసుకొని వచ్చి పండరీపురంలో పునఃస్థాపించిన భానుదాసు ఈయన పూర్వీకుడు. దేవగిరి దౌలతాబాద్‍గా మారడానికి పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన యాదవులు మరాఠీ భాషాభిమానులు. నిజాంషాహీల పాలన ఇక్కడికి వచ్చే నాటికి పైథాన్ పట్టణం గొప్ప విద్యా, వాణిజ్యకేంద్రం.

ఏక్‍నాథ్ తండ్రి సుల్తాన్ వద్ద వజీరుగా పని చేసే ఒక బ్రాహణుడికి గురువు. ఆ రకంగా వారి కుటుంబానికి ఇటు పైస్థాయి అధికార వర్గంతోనూ, భక్తి సంప్రదాయంతో మమేకమయ్యే సాధారణ ప్రజానీకంతోనూ దగ్గరి తనం ఉండేది. ఏక్‍నాథ్‍ను విద్యనభ్యసించడానికి దౌలతాబాద్‍లో ఉన్న ఒక బ్రాహ్మణుడి వద్దకు ఆయన తండ్రి పంపుతాడు. ఆయన దౌలతాబాద్ కోటలో పని చేసే ఒక అధికారి(ఖిల్లేదార్). దౌలతాబాద్‍కు  జంటనగరంగా ఉన్న ఖుల్దాబాద్ ఏక్‍నాథ్ కాలం నాటికే  ప్రముఖ సూఫీకేంద్రం. ఏక్‍నాథ్‍కు  విద్యను నేర్పే గురువును ఆశీర్వదించడానికి అప్పుడప్పుడూ ఆయన ఇంటికి ఒక సూఫీ ఫకీర్ వస్తూ ఉండేవాడు. అంటే ఏక్‍నాథ్ గురువుకు గురువు ఒక సూఫీ ఫకీర్ అన్నమాట.

ఊహించడానికి కూడా సంభ్రమాన్ని కలిగించే ఇలాంటి చిత్రమైన సామాజిక వాతావరణం ఏక్‍నాథ్‍ను మహారాష్ట్రలో ఏ విధంగా ప్రముఖమైన సంత్‍గా మార్చి వేసిందో దాదాపుగా అలాంటి సామాజిక పర్యావరణమే ఉత్తర భారత దేశంలోని భక్తి ఉద్యమకారులమీదా భక్తి ఉద్యమం మీదా ప్రభావితమై అంతటా తానై అయి నడిపించింది.

ఇలాంటి చిత్రమైన సామాజిక పర్యావణం ఏర్పడడానికీ, వాటిని అందిపుచ్చుకొనే సామాజిక శక్తులు ఏర్పడడానికి  ప్రధాన కారణాన్ని సామాజిక చరిత్రకారులు పైకి ఎదిగి వస్తున్న కులాల అస్తిత్వ చైతన్యం నుండి వివరిస్తున్నారు. ఈ వివరణను దక్షణాదిన భక్తి ఉద్యమం ప్రారంభమయ్యే నాటి కాలానికి కూడా వీరు వర్తింప చేస్తున్నారు. గుప్తుల పతనానంతరం స్థిరమైన, విశాలమైన రాజ్యాలు దక్షణాదినే ఏర్పడడంతో పాటుగా, చాప కింద నీరులాగా ఇస్లాం- సూఫీల ప్రభావం కూడా పని చేయడం వల్ల ఇక్కడ నూతనంగా ఆవిర్భవిస్తున్న సామాజిక శక్తులకు ఒక దారి దొరికినట్లయింది. నయనార్లతో భక్తి ఉద్యమం స్పష్టమైన రూపం తీసుకున్నదని అనుకున్నట్లయితే, సంగం యుగం కాలం నుండీ ఎనిమిదవ శతాబ్ధం వరకూ కొనసాగిన ఈ సంప్రదాయపు సాహిత్యం పదవ శతాబ్ధానికి గానీ క్రోడీకరింపబడలేదు. పదవ శతాబ్ధంలో క్రోడీకరింపబడిన ఈ సాహిత్యపు ఉనికిలోనూ, ప్రత్యేకించి ఎంపిక చేయబడిన అరవైమూడుమంది నయనార్ల పేర్లలోనూ ఈ అస్తిత్వ చైతన్యమే పని చేసిందని వీరు వివరిస్తున్నారు. ఆళ్వార్లుగా ప్రసిద్ధిపొందిన వారికీ ఇది వర్తిస్తుంది.

భక్తి ఉద్యమం- అది కొనసాగిన కాలం దృష్ట్యా, అది వ్యాపించిన భౌగోళిక ప్రాంతం దృష్ట్యా చాలా విస్తృతమైనది.  నూతనంగా ఎదిగి వస్తున్న సామాజిక శక్తులకు ఉనికికి అది ఒక తాత్విక వ్యక్తీకరణగా ఎట్లా ఉపయోగపడిందో, సమాజంలోని ప్రధాన స్రవంతితో, ఆధిపత్య భావజాలంతో సర్దుబాటు చేసుకోవడానికి కూడా అంతగానే ఉపకరించింది. సాధికారికమైన భావజాలాలతో పేచీ పడడానికి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించడానికి అది ఎలా కారణమైందో అలాగే తిరిగి మరో కొత్త సాధికారిక భావజాల కేంద్రాల స్థాపనకు అది దోహదమయింది. ఘర్షణ-ఐక్యతా చరిత్ర చోదక సూత్రాలుగా ఎలా పదేపదే ప్రకటితమవుతూ వచ్చాయో అదే విధంగా సాధారణీకరణ-వైవిధ్యమూ భక్తి ఉద్యమ కాలపు లక్షణాలుగా వ్యక్తమవుతూ వచ్చాయి.

ఇంత సంక్లిష్టత ఈ కాలపు లక్షణంగా ఉన్నందువల్ల భక్తి ఉద్యమం సామాజిక శాస్త్రవేత్తలకు గొప్ప అధ్యయన వనరయింది. సామాజికంగా ఉన్న కుల వివక్షలను స్థూలంగా పక్కకు నెట్టడం, బౌద్ధిక వ్యక్తీకరణలకు కేంద్రంగా ఉన్న సంస్కృత ఆధిపత్యాన్ని తోసివేసి స్థానిక భాషలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం, దైవం గురించి, ఆరాధనా సంబంధమైన కర్మకాండలకు సంబంధించి పై కులాలకు మాత్రమే అర్థమయ్యే విధంగా ఉన్న మత తాత్విక విధానాలను కిందికి దించి జన సామాన్యానికి అర్థమయ్యే ఉద్వేగ సంబంధమైన  ఆచరణలలోనికి తీసుకరావడం, దేవుడిముందు రాజూ-పేదా అందరూ సమానమనే భావనలను తేవడం భక్తి ఉద్యమకాలపు సాధారణ వ్యక్తీకరణలు. భక్తి ఉద్యమ కవులు, యోగులందరిలోనూ ఈ లక్షణాలను మనం చూడవచ్చు.

అయితే సామాజిక శాస్త్రవేత్తలకు ఈ సాధారణించబడిన లక్షణాలకన్నా, భక్తి ఉద్యమంలోని  వైవిధ్యమూ, బహుళత్వమే మరింత ఆసక్తికరమైన అంశాలుగా కనపడుతున్నాయి. సగుణ-నిర్గుణ వంటి విభజనల ఆధారంగా ఉత్తర భారతంలోని భక్తి ఉద్యమం గురించి స్థూలంగా కొన్ని సాధారణీకరణలను చేయడానికి కొందరు చరిత్రకారులు ప్రయత్నించారు. అయితే ఈ విభజనకూడా స్థూలమైనదే కానీ ఏ ఆచరణనూ పూర్తిగా సమగ్రంగా చెప్పడానికి పనికి వచ్చేది కాదు. భక్తి ఉద్యమాన్ని ఇలా సాధారణీకరించడానికి ప్రయత్నించిన ప్రతీ సారీ , దాని లోపలి నుండే పొడ చూపే భిన్నత్వం చరిత్రకారులకు నిరంతర సవాల్‍గా ఉండేది. ఒక ఆచరణ నిర్దిష్టమైమైన స్థల కాలాల పరిమితుల్లో  వివిధ సామాజిక శ్రేణులమధ్య వ్యాప్తిని పొందేటప్పుడు ఆయా ప్రజానీకపు అస్తిత్వ అవసరాలకనుగుణంగా అది నిరంతరంగా మార్పులకు గురికావడమే దీనికి కారణం . ఈ మార్పులు ఎంతగా తీవ్రంగా ఉంటాయంటే,  అవి దాని తొలి రూపానికి ఏమాత్రమూ పొంతనలేని ఒక కొత్త మత ఆచరణలోకి మార్చేసేవి.  బసవుని వీరశైవం నుండీ వివిధ పంథాల వరకూ వీటిని మనం గమనించవచ్చు.

సగుణ భక్తి భగవంతునికొక రూపాన్ని ఇచ్చి స్తుతిస్తుంది. నిర్గుణ భక్తి భగవంతుని నిరాకారునిగా చూస్తుంది. సగుణ భక్తి కన్నా నిర్గుణ భక్తి ప్రగతి శీలమైందనీ, ఇది సాధికారిక మత సంప్రదాయాలను నిర్ద్వంధ్వంగా తోసివేసిందనీ సామాజిక చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా నిర్గుణ భక్తికి కబీర్‍ను, సగుణ భక్తికి తులసీ దాస్‍ని వీరు చెబుతారు.

బసవని తర్వాత కబీర్ అపురూపమైన వ్యక్తిగా మనకు కనపడతాడు. సాధికారికమైన మత ఆచరణలను కబీర్ తన రచనల ద్వారా ఆవలికి నెట్టివేస్తాడు. తన జీవిత కాలమంతటా మగ్గం నేసి జీవిస్తూ, సాధారణ ప్రజానీకానికి సాధ్యంకాని సన్యాసి-ఫకీర్ ఉదాహరణలకు భిన్నమైన పంథాగా ఆయన జనానికి అందుబాటులో ఉంటాడు. ఆయన సారస్వతం పూర్తిగా మౌఖికమైంది. తర్వాత అది గ్రంథస్తమైనా మౌఖిక సంప్రదాయమే ఆయన విధానం. ప్రజలు పాడుకొనే భాషలో, వారికి అర్థవంతంగా ఉండే ఆయన ధోరణి సాధికారికమైన పుస్తక కేంద్రక విధానానికి వ్యతిరేకమైనది. ఆయన చెప్పే రాముడు దశరథకుమారుడూ, సీతాపతీ అయిన రాముడు కాదు. అంతకు మించి దశావతారాలలో ఒకడైన పురాణ పురుషుడూ కాదు. వీటన్నింటికీ విరుద్ధంగా ఆయన నిరాకారి. అనంత ప్రేమా మూర్తి.  రాముడనేది భగవంతుడికి కబీర్ పెట్టిన పేరు మాత్రమే. అందుకే కబీర్ భగవంతుడిని రాముడిగా కీర్తించిన సూఫీగా మనకు కనపడతాడు. దీనివల్లనే కబీర్ శిష్యులలో అసంఖ్యాకంగా కింది కులాలవారూ, ముస్లీంలూ కూడా మనకు కనపడతారు.

సగుణ భక్తుడైన తులసీదాస్ దీనికి భిన్నంగా రాముడిని పురాణ పురుషుడిగా,దశావతారాలలో ఒకనిగా రామచరిత మానస్‍లో రాస్తాడు. గ్రంథానికీ, బ్రాహ్మణాధిక్యతకూ చోటిచ్చి పునరుద్ధరణ వాదానికి దోహదపడతాడు.

ఒక వైపు  మౌఖిక సంప్రదాయంలో భక్తి వ్యాపిస్తూ ఉండగా, ఈ కాలంలోనే  మరొక వైపు సంస్కృత మత గ్రంథాలు, భారత, భాగవత, రామాయణాలు స్థానిక భాషలలోకి అనువాదం అయ్యాయి. ఇవి మూలానికి పూర్తిగా లోబడి ఉండక ఆయా భాషలలో స్వతంత్రమైన వైఖరులను తీసుకున్నాయి.  బ్రాహ్మణీయ విలువలను, ఆధిక్యతనూ స్థాపించడానికే ఇవి ఆయా భాషలలో రాయబడ్డాయని విమర్శకు గురయినా అప్పటి ఆధిపత్య భాష అయిన సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా స్థానిక భాషలను ముందుకు తేవడానికి ఆయా కవులు పెద్ద యుద్ధమే చేసారు.  ఏక్‍నాథ్ మరాఠీలో భాగవతపురాణాన్ని రాయడం కోసం తన కొడుకు నుండే వ్యతిరేకతని ఎదుర్కొన్నాడు. తనకంటే చాలా  ముందుగానే ఙ్ఞానేశ్వర్ మరాఠీలో రాసే సంప్రదాయాన్ని ఆరంభించినప్పటికీ ఆయనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా భక్తి ఉద్యమ కవులు స్థానిక భాషలను ముందుకు తెచ్చి పెద్ద తిరుగుబాటునే చేసారు.

ఒక వైపు తిరుగుబాటూ, మరో వైపు పునరుద్ధరణ పక్కపక్కనే, ఒక దాని వెంట ఒకటిగా కొనసాగడం భక్తి ఉద్యమ కాలానికి సంబంధించిన ప్రధాన లక్షణం. ఈ విచిత్రమైన స్వభావాన్ని సామాజిక చరిత్రకారులు గ్రామ్‍స్కీ ప్రతిపాదించిన “హిస్టారికల్ బ్లాక్” (historical block) భావన ద్వారా వివరిస్తున్నారు.

సమాజంలోని వివిధ శ్రేణులు తమ అవసరాల కోసం, అస్తిత్వం కోసం ఉనికిలో ఉన్న సాధికర భావజాలాలతో, నిర్మాణాలతో తిరుగుబాటును ప్రకటించి పోరాడతాయి. ఈ క్రమంలో అవి తమవయిన తాత్విక సామాజిక భావజాలాలను ప్రత్యామ్నాయంగా ముందుకు తెస్తాయి. అయితే అవి తమ గమనంలో ఒక సంతృప్త స్థితికి చేరుకున్న తర్వాత  ఇదివరకటి తిరుగుబాటును పక్కన పెట్టి  ప్రధాన స్రవంతిలో భాగమవుతాయి. సమాజగమనం గురించిన ఈ సత్యాన్ని గ్రామ్‍స్కీ “హిస్టారికల్ బ్లాక్” భావనలో వివరించాడు.

భక్తి ఉద్యమంలోని తిరుగుబాటు-పునరుద్ధరణ లేదా సర్దుబాటులను మాత్రమే కాకుండా సమకాలీన సమాజంలోని వివిధ ఉద్యమాలు, ధోరణుల  గమనాలను అర్థం చేసుకోవడానికి కూడా ఈ భావన బాగా ఉపయోగపడుతుంది.

 

ఆధారం:

1. Sufism, An introduction-Farida Kahanam

2.Rabia As Mystic, Muslim And Woman- Barbara Lois Helms

3.Influence Of Islam ON Indian Culture- Tarachand

4. Vaishnavism, Saivism And MInar Religious Systems- R.G. Bhadarkar

5.Contextualizing The Past, The Saint And His Environment -Dusan Deak

6. Challenging Gender And Sexuality Norms Through Devotion: Bhakti And Sufi Writings- Srishti Nayak

మానవ హృదయం చేసిన తిరుగుబాట్లు!

-అవ్వారి నాగరాజు
~

చేర రాజు పెరుమాళ్‍కు ఒక చిత్రమైన కల వొచ్చిందట.
ఆ కలలో అర్థచంద్రాకృతిలో ఉన్న  చంద్రుడు రెండుగా చీలిపోయినదట. ఆ కలకు భావమేమిటొ కనుగొనాలని రాజు తన ఆస్థానంలోని పండితులందరినీ అడిగి చూసాడట. కానీ వారు ఇచ్చిన వివరణలేవీ అతనికి సంతృప్తినివ్వలేదట. అంతలో అతని సమాచార బృందం అతనికి, ఒక అరబ్ నావికుల బృందం తమ తీరం మీదుగా ప్రయాణిస్తున్నదనీ, ఆ ఓడలో అనేక మంది వర్తకులతో పాటుగా మత ధార్మికవేత్తలు కూడా ఉన్నారని ఆయనకు సమాచారమిచ్చిందట. రాజుకు అంతకు ముందే ఇస్లాం మత ధార్మిక వేత్తల పాండిత్యం గురించి పరిచయం ఉన్నది కాబట్టి, వారిని కూడా అడిగి చూతామని ఆలోచన కలిగిందట. రాజు తలిచినదే తడవుగా ఆ పండితులను ఆయన ముందర హాజరు పరిచారట.

అపుడు వారు రాజు చెప్పిన కలను సావధానంగా విని అది ఒక మార్మికమైన వృత్తాంత్తంగా, మహ్మద్ ప్రవక్త పిలుపుగా ఆయనకు తెలియ జేసి వెళ్ళిపోయారట. అపుడు రాజు ఏకాంత మందిరంలో తన ఆంతరంగికులతో చింతన చేసి, తన రాజ్యాన్ని కొన్ని  భాగాలుగా చేసి,  అర్హులైన వారి నాయకత్వం కింద అప్పగించి మహ్మద్ ప్రవక్తను కలిసేందుకు మదీనాకు తరలిపోయాడట. మహ్మద్ ప్రవక్త సాంగత్యంలో ఆయన అక్కడే ఇస్లాంను స్వీకరించాడట. అటు తర్వాత అక్కడ కొంత కాలం గడిపి, తిరిగి వస్తూ ఉండగా అనారోగ్యంతో ఒమన్‍లోని సలాలహ్ వద్ద దేహాన్ని విడిచాడట.

భారత దేశ తాత్విక చింతనలో ఇస్లాం ప్రభావాన్ని తెలిపే గాధలలో ఇది ఒకటి. చేరమాన్ రాజు ఉనికి, అతని కాలమూ, అతను కాంచిన అద్భుతమైన కల, అతను చేసిన ప్రయాణము – మొదలైన వాటిపై చరిత్రకారులలో వాదవివాదాలు ఉన్న మాట వాస్తవమే. రాజు మదీన వెళ్లిన మాట నిజమే కానీ ఆ ప్రయాణం పక్కా వ్యాపార లావాదేవీలకు సంబంధించిందిలెమ్మని చెప్పే వాళ్ళూ ఉన్నారు. కానీ అతని రాజధాని కొడంగుళ్ళూరు (కేరళ)లో మాత్రం అతని పేరు మీద ఒక మసీదు వెలసింది. ఇది భారత దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మసీదులలో ఒకటిగా గుర్తింపబడింది. క్రీశ 629నుండీ ఇది ఇక్కడి నేల మీద ఒక చారిత్రక సంగమంగా సమున్నతంగా నిలబడి ఉంది.

ఈ నేలమీదకు ఇస్లాం రాక నిజంగా చారిత్రక సంగమమే. అది మనకు పరిచయంలేని నియో ప్లాటినిజం, యూదు, క్రైస్తవ వంటి అనేక  తాత్విక భావధారలనూ, మత సాంప్రదాయాలనూ, ఆచారాలనూ, ధిక్కారాలనూ తనలో కలగలుపుకొని ఈ నేలమీదకు మోసుకొని వచ్చింది. ఇస్లాం, సూఫీల  రూపంలో ఆయా తాత్విక భావ దారలు ఇక్కడ పాదుకొని, నేల నాలుగు చెరుగులా ప్రవహించి, ఇక్కడి మట్టిలోనికి ఇంకి “సంగమం” అనే మాటకు విన సొంపయిన అర్థాన్ని తెచ్చిపెట్టాయి. సరిగ్గా ఈ అర్థం నుండే, సహజీవన విలువలను ప్రస్తుతిస్తూ  తాత్వికుడూ, కవీ అయిన షాజాహాన్ కుమారుడు దారాషికోహ్ తన సూఫీ తాత్విక గ్రంథానికి “రెండు సముద్రాల సంగమం” అని పేరు పెట్టాడు.

రాబియా గురించి మార్గరేట్ స్మిత్ అనే మతతాత్విక విమర్శకురాలి విమర్శను పూర్వ పక్షం చేస్తూ, లూయిస్ మాసింగ్సన్ “సంగమం” (కాన్ఫ్లుయెన్స్) అనే మాటను ఉపయోగించాడు. ఏదైనా ఒక కొత్త ధోరణి లేదా విశ్వాసం ఉనికిలోకి వచ్చినపుడు దానిని  ఒక మతానికీ మరో మతానికీ అంటుకట్టకుండా(హైబ్రిడైజేషన్), ఆయా మత భావాల పుట్ట్టుక, పరిణామాలతో పాటుగా ఆయా స్థల కాలాల నాటికి  ఉనికిలో ఉన్న ఇతర ప్రాభావికమైన అంశాలను కూడా పరిగణనలో తీసుకోవాలని చెబుతూ, ఈ విషయాలను  సూఫీయిజం పుట్టుకకు అన్వయించి చెబుతాడు. మన దేశంలోని మత సాంప్రదాయాలతో సూఫీ, ఇస్లాంల పారస్పరిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటించాల్సి ఉంటుంది.

భారత దేశంలో ముస్లీం పాలన ఏర్పడక ముందునుండే దేశ దక్షణ కోస్తాకు అరబ్, పర్షియా, ఈజిప్టు, ఇతర మధ్యప్రాచ్య ప్రాంతాలకు చెందిన ముస్లీంలతో సంబంధ బాంధవ్యాలున్నాయి. భారత దేశానికి ఇస్లాంతో ఏర్పడిన సంబంధాలను చరిత్రకారులు మూడు రకాలుగా వివరిస్తున్నారు. దేశ దక్షణ కోస్తా పశ్చిమ ప్రాంతానికి ఇస్లాం ఆవిర్భావానికి ముందు నుండే ఆయా దేశాల వర్తకులు రాకపోకలు సాగించేవారు. ఇస్లాం ఉనికిలోకి వచ్చాక వర్తకులతో పాటుగా మిషనరీలు కూడా ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలతో సంబంధాలను ఏర్పరుచుకున్నారు. స్థానిక ప్రజలలో భాగంగా కలిసిపోయారు. మోపిల్లాలు దీనికి ఉదాహరణ. దీనికి తోడుగా ఉమయ్యాడ్‍ల కాలంలో సింధ్ ప్రాంతంమీదకు చేసిన దాడులు, ఆక్రమణలు స్థానిక ప్రజలకు ఇస్లాంను, సూఫీలను పరిచయం చేసాయి. ఈ రెంటితో పాటుగా క్రమ పద్ధతిలో  పదవ శతాబ్ధం నుండి చేసిన దాడులు, వలసలు, రాజ్యాల స్థాపన, వీటికి తోడుగా పదమూడవ శతాబ్ధంలో మంగోలుల దండయాత్రల వల్ల ముస్లీం ప్రాభల్య ప్రాంతాలు స్థిరత్వాన్ని కోల్పోయి అనేకమంది ఇస్లాం పండితులు, సూఫీలు ఢిల్లీ సుల్తానుల ఆశ్రమాన్ని కోరి ఢిల్లీని చేరడం, ఆక్కడ నుండీ వివిధ ప్రాంతాలలో స్థిర పడడ-. ఈ సంఘటనను చరిత్రకారులు కాన్‍స్టాంట్‍నోపిల్ పతనంతో పోలుస్తున్నారు.

దేశ దక్షణ కోస్తా పశ్చిమ ప్రాంతం మిగిలిన అన్ని ప్రాంతాల కన్నా ముందుగా ఇస్లాం ప్రభావానికి గురి  కావడం వల్ల దాని మతతాత్విక వ్యక్తీకరణలలో అది  గొప్ప కుదుపుకు లోనయ్యింది. ఇది భక్తి ఉద్యమం రూపంలో ఇక్కడ వ్యక్తమయ్యింది. మధ్య యుగాల సామాజికమార్పులకు ఈ ప్రాంతం వేగుచుక్కగా నిలిచింది.
ఈ ప్రాంతంలో ఇస్లాం వచ్చే నాటికి వివిధ తెగల, జాతుల సాంస్కృతిక మతపర సంకేతాలు ఒక దానితో మరొకటి ఘర్షణ, ఐక్యతలను పొంది సరికొత్త దేవుళ్ళూ, మత సంకేతాలూ ఏర్పడ్డాయి. కుల వ్యవస్థ స్థిరపడింది. మతాలు వ్యవస్థీకరణ రూపాన్నిపొంది బ్రాహ్మణీకరింపబడ్డాయి. బౌద్ధ, జైన మతాలు అనేక చీలికలుగా మారి తమ ప్రభావాన్ని చూపెడుతున్నాయి. అయితే ఏకేశ్వరారాధన ఇంకా బలపడలేదు. ఒకే దేవుని కింద మత విశ్వాసాలు బలాన్ని పుంజుకోలేదు. ఒకే దేవుడి గురించిన భావనలు ఉపనిషత్తులలోనూ, వేదానంతర సాహిత్యంలోనూ కనిపించినప్పటికీ అవి తాత్విక పరిభాషలోనూ, తర్కపరమైన చర్చల్లోనూ ఉంటూ,  సమాజంలోని పైస్థాయి పండిత చర్చలుగానే ఉండిపోయాయి. అంతేగానీ సామాన్య ప్రజల వ్యక్తీకరణలుగా అవి పాదుకోనలేదు. ఈ అంతరం సమాజంలోని ప్రజల మధ్య ఉన్న సామాజికార్ధిక విభనను సూచిస్తున్నది. వేదకాలపు కర్మకాండకు వ్యతిరేకంగా వచ్చిన బౌద్ధ, జైన మతాలు నాస్తిక మతాలుగా ప్రజలకు పరిచయమయ్యాయి. బౌద్ధం అటు తర్వాత మహాయాన బౌద్ధంగా మార్పు చెంది, బుద్ధున్ని దేవునిగా మార్చినప్పటికీ అది వేడుకలు, ఉత్సవాలకు ఆలవాలమై కేవలం విగ్రహారాధానను మాత్రమే మిగుల్చుకున్నది. అందువల్ల అప్పటి సామాన్య ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు సరిపోయేదిగా కాలేక పోయింది. ఇస్లాం ఈ లోటును పూరించేందుకు తగిన దన్నును అందించగలిగింది.

ఇస్లాం సాధారణ ప్రజల వ్యక్తీకరణకు ఒక అంతఃస్రవంతిగా ఇక్కడ పని చేయగలగడానికి ఇక్కడి సామాజిక రాజకీయ పరిస్థితులు కూడా దోహదపడ్డాయి. హర్ష సామ్రాజ్య పతనానంతరం దేశ మొత్తం మీద ఇక్కడే సుస్థిరత కలిగిన రాజ్యాలు ఏర్పడ్డాయి. చేతి వృత్తులు, వాణిజ్యం వృద్ధిచెందాయి. వృత్తినిపుణులు, చిన్న చిన్న వర్తకులు సమాజంలో తమ స్థానాలను తాము గుర్తించగలిగే స్థితికి చేరుకున్నారు.  ఈ స్థితిలో వారి వ్యక్తీకరణకు సరిపోయే మతం కావలిసి వచ్చింది. ఇది భక్తి ఉద్యమ రూపంలో ముందుకు వచ్చింది.

భక్తి ఉద్యమం శూద్రుల వ్యక్తీకరణ. అది బ్రాహ్మణియ వ్యక్తీకరణలకు పూర్తిగా భిన్నమైనది. భక్తి అనే భావన భగవద్గీతలోనూ, శ్వేతాశ్వతరోపనిషత్తులోనూ, మహాయాన బౌద్ధంలోనూ అప్పటికే ఉన్నప్పటికీ సారంలో భక్తి ఉద్యమ కాలపు భక్తికీ దీనికీ చాలా అంతరం ఉంది. భక్తి భావన వేదాలలోనూ, ఉపనిషత్తులలోనూ కూడా ఉందని కొందరు అంటుంటారు. కానీ వేదాలలోని భక్తి కర్మకాండనుంచీ వేరు చేయలేనిది. కాగా భక్తిఉద్యమ కాలపు భక్తి ఏకేశ్వరారాధనతో ముడిపడి ఉన్నది. అది కర్మకాండ ప్రధానమైనది కాదు. ఉపనిషత్తులలోనూ, వేదానంతర సాహిత్యంలోనూ ఉన్న భక్తి ఙ్ఞానంతో ముడి పడి ఉంటుంది. అది అవ్యక్తిగతంగానూ, భావోధ్వేగరహితంగానూ, తాత్విక పదబంధాలతోనూ ఉంటుంది.

భక్తి ఉద్యమం ప్రతిపాదించిన భక్తి దేవుని ముందర భక్తులందరినీ సమానం చేసింది. ఇది బౌద్ద్ధ, జైనాలలో కూడా ఉన్నప్పటికీ కుల అసమానతలను తుడిచివేయగలగిన తీవ్రమైన ఆవేశిత మిలిటెంట్ స్వభావం ఇస్లాం ప్రభావం నుండే భక్తి ఉద్యమం పొందింది. ఆరవ శతాబ్ధం నుండీ ఎనిమిదవ శతాబ్ధం వరకూ సమాజాన్ని అమితంగా ప్రభావితం చేసిన నయనార్లలో స్త్రీలు, శూద్రులు, దళితులూ ఉన్నారు. బ్రాహ్మణుడైన సుందరమూర్తి నయనార్ అబ్రాహ్మణ స్త్రీలను వివాహమాడాడు. ఆళ్వార్లు కూడా  కులం పట్ల ఇదే విధానాన్ని అవలంబించారు. రామానుజుడు కులాలకు అతీతంగా వ్యవహరించాడు. మార్గ నిర్ధేశకులుగా, గురువులుగా, దైవానుగ్రహాన్ని పొందిన వారిగా, భగవంతునితో సంధాన కర్తలుగా ఉంటూ కుల, లింగ వివక్షతలు  లేకుండా పాటించి చూపారు. నయనార్లలోకంటే ఆళ్వార్లలో, రామానుజునిలోనూ ఇస్లాం ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రామానుజుడు అనుసరించిన “ప్రపత్తి” ( సెల్ఫ్ సరెండర్) ఇస్లాం నుండి వచ్చినదే. భండార్కర్ ఇది క్రైస్తవ ప్రభావం నుండి వచ్చినదని అభిప్రాయపడ్డాడు. కానీ ఆ కాలంలో దక్షణ భారతదేశంలో   క్రైస్తవ ప్రభావం ఇస్లాంతో పోలిస్తే చాలా తక్కువ.
భక్తి ఉద్యమం ముందుకు తెచ్చిన భగవంతుడు అద్వితీయుడు. అతను తప్ప మరొకరు భగవంతుడు కాలేరు. శైవులకు శివుడు, వైష్ణవులకు విష్ణువు, శాక్తేయులకు శక్తి తప్ప మరొకరెవరూ దైవంగా ఉండజాలరు. అయితే భగవంతుడొక్కరే కానీ ఆయన సూఫీలు అనుభూతి పొందిన మాదిరిగానే,  వైయక్తికంగా ఒక్కొక్కరికీ ఒక స్వరూపంగా గోచరిస్తాడు. ఒకరికి ఆయన గురువు, మరొకరికి స్నేహితుడు, ఇంకొకరికి ప్రియుడు. భగవంతుడు ఇంతలా వివిధ వైయక్తిక భావనలతో అత్యంత సన్నిహితునిగా మారడం మనం భక్తి ఉద్యమంలో మాత్రమే చూడగలం .అందుకే భక్తి ఉద్యమ కాలపు భక్తి సూఫీల వలే అత్యంత వైయక్తికమైనదీ, భావోద్వేగపూరితమైనది.

ఆళ్వార్లు, నయనార్లు, ఆ తర్వాత వచ్చిన భక్తి ఉద్యమ కవులు గురువులూ, మార్గ నిర్దేశకులూ కూడా. భగవంతునితో అనుసంధానం చేసే వాళ్ళు కాబట్టీ వీరు అత్యంత గౌరవనీయులూ, పూజనీయులు. గురువులుగా వీరు పొందిన స్థానం సూఫీ పీర్‍లను  పోలి ఉంటుంది. సూఫీ గురువు భగవంతునిచే ఎంపిక చేయబడ్డవాడు. మార్గ నిర్ధేశకుడు. దివ్యానుగ్రహం పొందిన వాడు. పూజనీయుడు. అతను తనను అనుసరించే వారిని ముక్తి మార్గంలో నడిచేలా చేస్తాడు. బౌద్ధ, జైనాలలో కూడా ఈ రకమైన గురుశిష్య సంబంధం ఉంటుంది. అయితే భక్తి ఉద్యమం దీనిని సూఫీల దారిలో మరింత ముందుకు తీసుకొని పోయింది. సూఫీ ఫీర్‍ల వలెనే భక్తి  ఉద్యమ కాలపు గురువులు దివ్యత్వాన్ని పొందినవారు. ఈ దివ్యత్వం వారిని దేవునితో  సమం చేస్తుంది. నయనార్లు సాక్షాత్ శివ స్వరూపులు.  శంకరాచార్యులు శివుని స్వరూపం. సరిగ్గా ఇలాంటి దివ్యత్వం ఆళ్వార్లలో కూడా ఉంటుంది.  భక్తి ఉద్యమం దీనిని అంతటితో ఆపక సూఫీలలో వలెనే  గురు స్థానాన్ని  దేవుని అధిగమించి ముందుకు తీసుకొని పోతుంది. వీర శైవులలో భగవంతుని కన్నా గురువు స్థానం ముందుంటుంది.

ఏకేశ్వరారాధనతో కూడిన భక్తి,ప్రపత్తులు, గురువుకున్నప్రత్యేక  స్థానంతో పాటుగా భక్తి ఉద్యమం ఆచరించిన మరొక గొప్ప విలువ కుల, లింగ సమానత్వాలను పాటించడం. ఇది బసవని కాలంలో తీవ్రరూపాన్ని తీసుకున్నది.
” బలులను అర్పించవలసిన పని లేదు. ఉపవాసాలు, విందులను పాటించనవసం లేదు. తీర్ధయాత్రలతో పని లేదు. శుద్ధి పొందేందుకు ఏ నదిలోనూ మునగవలసిన పని లేదు. కులం లేదు. కడజాతివారయినా శైవునిగా మారిన తర్వాత అతడు బ్రాహ్మణుని కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు. పుట్టుక, లింగం కారణంగా ఎవరూ ఎవరికీ తక్కువ కాదు,. మనుషులందరూ పరమాత్ముడు నివశించే దేవాలయాలే.”

 

“వివాహం ఐచ్చికం. దానికి వధువు అంగీకారం తప్పనిసరి. బాల్య వివాహాలు చేయరాదు. విధవలు గౌరవనీయులు. వారిని  వివాహం చేసుకొనేందుకు అంగీకరించాలి.  మరణించిన వారికి శ్రాద్ధకర్మలు అవసరంలేదు. పునర్జన్మలనేవి లేవు. లింగాయతులందరూ కలిసి భుజిస్తారు. కలిసి జీవిస్తారు.”

 

ఆరవ శతాబ్ధం నుండి పదమూడవ శతాబ్ధం వరకూ దక్షణ భారత దేశంలో సామాజిక మార్పును సూచించిన భక్తి ఉద్యమం అసమానతలపై సూఫీలు చేసిన తిరుగుబాటు వంటిది. ఈ రెండూ మానవ హృదయం చేసిన తిరుగుబాట్లు. సూఫీలు, భక్తి ఉద్యమ కవులు చేసిన సామాజిక తిరుగుబాట్లను ప్రస్తావించకుండా సూఫీల ప్రేమ తత్వం, భక్తి ఉద్యమ కవుల గొప్పదనం  గురించి మాటాడబోవడం ఒక రకమైన వంచనే అవుతుంది.
ఇస్లాం, సూఫీల ప్రభావం,   భారతీయ తాత్విక చింతనను ఆరవ శతాబ్ధం నుండీ పదిహేడవ శతాబ్ధం వరకూ ఇక్కడి సామాజిక చలనాలకు అనుగుణంగా తమవైన వ్యక్తీకరణలను ఎంచుకునేందుకు అవసరమైన తాత్విక తోడ్పాటునందించి, ఎంతగానో దోహద పడ్డాయి. ఇస్లాం, సూఫీల ప్రభావంలేకుండా వీటిని మనం  ఊహించలేము.

*
.

   సూఫీ నెచ్చెలి రాబియా

 

 

సంభాషణలు

-అవ్వారి నాగరాజు
~
ఎవరమైనా ఎలా చెప్పగలం
తాత్విక ప్రశ్నల సుడుల నడుమ గింగిరాలు కొడుతూ
మూగిన పంథాల చిక్కుముడులలో ఉక్కిరిబిక్కిరిగా
కాలాకాలాల నడుమ గీతలు గీస్తూ చుట్టుకొలతలు తీస్తూ
అప్పుడప్పుడూ ఒక నిట్టూర్పునో మరింకో దాన్నో
జరగండహో జరగండని దారి చేసుకుంటూ
మనమూ ఉన్నామని చెప్పుకోవడానికి ఆదుర్దాపడుతూ
మన పనిలో మనం నిత్యం నిమగ్నమై ఉంటాం కదా
దేహాలని పగల చీల్చుకుంటూ
సందర్భాసందర్భాల నడుమ తమను తాము పేని
ఊపిరి కదలికలకు చలించే వో సంకేతంలాగా  కాకుంటే ఇంకేదో స్ఫురించని సుదూరపు ఊహలాగా
ఏదో వొక క్షణంలో
ఎవరొస్తారో తెలియదు కానీ
ఇదుగో ఇట్టాగే చప్పున చొచ్చుకొని వొచ్చేస్తారు
అలా వొచ్చేదాకా
చావు మన అర చేతుల మీద ఇగరని నెత్తుటిమరకలను అద్ది పోయేదాకా
వొక తెర చాటున నక్కిన మాయోపాయి వేసే
ఆట్టే తెలియని సహస్ర శిరచ్చేధ చింతామణి ప్రశ్నలలాంటివేవో ముఖాల మీద పెఠిల్లున చిట్లేదాకా
ముసిరిన సంభాషణలకు
అటూ ఇటూ తిప్పి చూసుకొనే దిగ్భ్రాంతీ దుఃఖమూ తప్ప
ఇదమిత్తంగా ఇదని చెప్పలేము కదా

గోమూత్రమూ మరియూ దేశభక్త పురాణము

-అవ్వారి నాగరాజు 
~
avvariపొద్దున్నే లేచి పవిత్రముగా శిరముపై ఆవ్వుచ్చ చిలకరించుకొని కూర్చొని ఉంటాను
గోవు మన తల్లి, ఆమె  భరత మాత వంటిది. గోమాతకు హాని తలపెట్టినయేని యది గన్నతల్లికి కీడుసేయ సమమని చదువుకొని, దానిని కన్నులకద్దుకొని, మరియొక పెద్ద లోటాడు నీరు త్రావి  ఇంకొకపరి మల విసర్జనమునకై వేచివేచి నటునిటు కాసేపు తిరుగుతాను
ఈయొక మల బద్దకమ్మునకు మన గోమాతా వైభవములో ఏమైనా యుపాయము రాసియున్నదేమో అడిగి తెలుసుకుందుముగాకా యని యనుకొని, యంతలో కడుపావురించుకొ్నెడి ఒత్తిడితో తొక్కిసపడి తటాలున  మరుగు దొడ్డికి పరుగులెడతాను
అటుపై సకలమునూ మూసుకొని యోగాధ్యానాదుల నొనర్చి,  కన్నులు తెరిచిన వాడనై, సకల విశ్వమునకునూ ఙ్ఞానప్రదాతయైన ఈయమకు తక్క  యన్యులకు ఇసుమంటి విద్యలు తెలియనేరవు కదాయని అరమోడ్పు కన్నుల ఆనందపరవశుడనవుతాను
ఆ తల్లి  ముద్దుబిడ్డడినయినందులకు కించిత్ గర్వపడి, ఆపై యామె ఋణమ్మును యెటుల తీర్చుకొందునాయని యోచించి,  ఆయొక్క గోమాతా వైభవమ్మను పవిత్ర గ్రంథ రాజమ్మును ఇంచుక పేజీలను ద్రిప్పి  సకల దేవతలకునూ  సాక్షాత్నిలయమ్మయిన యా దేహమే ఈ దేశము గదాయని కైతలుప్పొంగగ కరముల మోడ్చి సాగిలపడతాను
నుదుట తిలకమ్ము ధరించుట  హిందూ ధర్మమని  దెలుసుకొని, అటుపై రోజుకొక్క గంటతూరి స్వచ్చ భారతం, వారానికి రెండు సార్లు జెండావందనం,  నెలకొకమారు మన్‍కీ బాత్, రాత్రి పొద్దుపోయిందాకా దేశభక్త పురాణ పఠనం- అయ్యా నేను బాపనోన్ని కాదు-  మరింత హిందువగుటనెట్లో చెప్పండయా
సాధులూసాధ్వులూసన్యాసులూమఠాధిపతులూయోగిమహరాజ్‍‍లూఆవులూబర్రెలూకుక్కలూపందులూశాఖాహారమాంసాహారమత్స్యాహారధ్యానయోగకర్మ- అంతా మీరు చెప్పినట్టే చేస్తున్నానయా- కులం తక్కువ వాడ్ని
పిల్లల గలవాణ్ణి. మరీ ముఖ్యంగా ఆడపిల్లల తండ్రిని. నన్నుకరుణించి మరి కాసింత మంచి హిందువును చేయండయా!
*

 

స్నేహమే ఉద్యమం, ఉద్యమమే ప్రాణం!

 

ఆ ఇంట్లో దెయ్యముంది..

avvariఆ ఇంటి గురించి వాకబు చేసినపుడు అన్నింటి కన్నా ఆమెకు ముందుగా  తెలిసిన విషయం, ఆ ఇంట్లో దెయ్యముందని.
 
ఇదేమిట్రా నాయనా అనుకొని, ఆ పక్కనే ఉంటోన్న తెలిసిన టీచరునొకాయన్ని అడిగితే ఆయన అన్నాడు గదా-” మేడం, నాలుగైదేళ్ళ నించీ ఆ ఇల్లు ఖాళీగా ఉందన్నది మాత్రం వాస్తవం. ఇంతకు ముందు అద్దెకు ఉన్న ఆమె  అక్కడే ఆత్మహత్య చేసుకొని  చచ్చిపోయిందంట. అదికూడా అనుకుంటుంటే విన్నదే గానీ వాస్తవం మాత్రం మనకు తెలియదు. అయినా దెయ్యాల్లాంటివి ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు? ఇల్లు మాత్రం ఏ ఇబ్బందీ లేకుండా అన్ని విధాలుగా మీకు బాగుంటుంది” అన్నాడు.
దెయ్యాలంటే నమ్మకమా అపనమ్మకమా అన్న మీమాంసలో పడేంత సమయం అప్పుడు లేకపోయింది తనకు. వొచ్చి ఇల్లు చూడడం, చేరిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.
అయితే ఆ ఇంట్లో చేరిన నెల రోజుల వరకూ చుట్టు పక్కల వాళ్ళంతా తన గురించే అనుకుంటూ ఉన్నారు.  నాలుగైదు రోజులుండి ఖాళీ చేసి పోతుందిలే అనుకన్నారు. ఈ విషయాలన్నీచాలారోజుల  తర్వాత పక్కింటామె చెప్పింది తనకు.
ఉండగా ఉండగా తనకు తెలిసి వొచ్చిన విషయం ఏమిటంటే నమ్మకమైనా, అపనమ్మకమైనా అవి అనుభవం మీదనే తేలతాయి. ఆ అనుభవం కూడా మనమున్న స్థితిని బట్టే ఉంటుంది. అందునా, ఇప్పుడు అనిపించిన విషయాలు రేపటికి  కూడా ఇట్టానే అనిపించాలని లేదు. ఇలాంటి తెలివిడి తనకు ఆ ఇంటి నుండే వొచ్చింది. ఇప్పటికిప్పుడు ఎవరైనా తనను ఆ ఇంట్లో నిజంగా దెయ్యముందా అనడిగితే ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేదు. ఒకోసారి ఉంటుంది, ఒకోసారి ఉండదు అని మాత్రమే చెప్పగలదు.
చాలా సార్లు ఆ ఇంటి గురించి ఆలోచిస్తుంటే అది ఆ ఇంటి గురించి కాక తన గురించి, తన ఆంతరంగిక విషయాల గురించి తరచి తరచి చూసుకున్నట్టుగా   ఉంటుంది ఆమెకు .
అట్లా తరచి చూసుకోవడం ఒకోసారి తనకు తెలియకుండానే ఇష్టంగా ఉంటుంది. మరోసారి అసలు ఆ ఇంటి నుంచీ, చివరకు తన ఉనికి నుంచే తప్పించుకొని ఎక్కడకయినా పారిపోదామా అన్నంత భయం గొలిపేదిగా కూడా ఉంటుంది.
****                                                                              *****                                                             ****
ఆలోచనలు అనేక విధాలుగా కదులుతూ అదుపు తప్పి పోతున్నాయి. అట్లా కావడం ఎంతమాత్రమూ  మంచిది కాదని డాక్టర్ హెచ్చరించడం తను గుర్తు చేసుకున్నది. అట్లా కాకూడదు, అట్లా కాకూడదు అని తనను తాను సంభాళించుకొనేందుకు ప్రయతించింది. కాసేపు వేరే విషయాల మీదకు దృష్టి మళ్ళించేందుకు చూసింది.
చెట్టు కింద అరుగు మీద కూర్చున్నదే కానీ  ఎండ సెగ తెలుస్తూనే ఉంది. బయటి సెగకు తోడు లోపలి సెగ కూడా జతయి నోరంతా పిడచగట్టుక పోతున్నట్టుగా అనిపిస్తోంది. పెదాలను నాలుకతో తడుపుకొని, బాటిల్‍లోని నీళ్ళను లోపలికి వొంపుకున్నది. దాహమయితే తీరింది కానీ నోరంతా ఏదో చేదుగా అనిపించింది.
కాసేపటికి పి.ఎచ్. సి లోనించి “సరోజక్కా” అని పిలుస్తూ తన దగ్గరికొచ్చింది నీలిమ.
వొచ్చీ రాగానే ,”వొంట్లో వుషారుగా ఉందా, జెరం తగ్గి పోయిందా” అని అడిగింది.  అలా అడుగుతూనే చొరవగా నుదురు మీద చేయి వేసి చూసింది.
బదులుగా- ” నయమే లేవే, మరీ నిన్నటంత లేదు గానీ” అనింది తను.
“ఈ రోజు కూడా సెలవు పెట్టాల్సింది. ఈ ఎండకు పడి తిరిగితే లేని రోగం కూడా వొస్తది” హెచ్చరింపుగా అనింది నీలిమ
“కొద్దిగా బాగానే ఉన్నట్టుగా ఉంటే, చిన్నగ బయల్దేరాను లేవే. మరీ ఇబ్బందిగా ఉంటే ఈ బండ చాకిరీ నేను మాత్ర ఎలా చేయగలను. ఇంతకీ ఇప్పుడు మీటింగు ఉంటదంటనా, లేదంటనా” అడిగింది తను.
“అందరూ అదే అనుకుంటున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకన్నారు కదా. పాపం అందరూ ఈ ఎండన పడి వొస్తానే ఉన్నారు. ఇంకాసేపాగితేగానీ ఏమయ్యేదీ తెలియదు”
వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ  ఉండగానే చాలా మంది ఏఎన్నెంలు వ్యాక్సిన్ బ్యాగ్‍లు లోపల పెట్టేసి ఒక్కొక్కరుగా చెట్ల కిందకి చేరుతున్నారు. డిపార్ట్‍మెంట్‍కు సంబంధించిన కబుర్లు, వాళ్ళు పని చేసే ఏరియాలో ఉండే సమస్యలు – ఇట్లా మాట్లాడేసుకుంటా ఉన్నారు. మరికొంత మంది వాచీలు చూసుకుంటూ మీటింగు ఉంటుందా, ఉండదాని వాకబు చేస్తున్నారు.
టైం రెండు దాటుతున్నది. కాసేపటికి పిఎచ్‍సి స్టాఫొకరు వొచ్చి “డాక్టరు గారికి ఏదో ఫోనొచ్చింది. అర్జెంటుగా వెళ్ళి పోయారు. రేపు మీటింగుంటదని ఇప్పుడే ఫోన్లో చెప్పా”రని అన్నాడు.
“మళ్ళా రేపా “, అన్నారు కొంతమంది. “ఎటూ తప్పేది కాదుగా ఈ రోజుకు బతికాం” అనుకున్నారు చాలా మంది. ఎవరి దారిన వాళ్ళు ఒక్కొక్కరిగా బయలు దేరుతున్నారు. తను, నీలిమా కూడా కాంపౌండ్ దాటి బయటకొచ్చారు.
దారిలో, “ఈ ఎండకు ఏం పోతావుగానీ మా ఇంటి కాడికి పోదాంరాక్కా” అనింది నీలిమ.
“లేదే, మా అన్న కాడికి పోయి రావాలి. పొద్దున్నే మా అమ్మ ఫోన్ చేసింది”.
“సరే, అయితే రాత్రికి వొచ్చి తోడు పడుకునేనా. అసలే వొల్లు బాగాలేదు. ఈ పరిస్థితుల్లో మల్లా ఒక్క దానివే ఉన్నావంటే మీ డార్లింగొచ్చి ఎదురుగా కూర్చుంటదేమో!”
ఆ పిల్ల డార్లింగన్న పదాన్ని వొత్తి పలికిన తీరుకి చిన్నగా నవ్వుతూ – “వొద్దులేవే, బాగానే ఉందిగా. పాపం రోజూ నువ్వు మాత్రం ఎక్కడకని వొస్తావు. అంత ఇబ్బందిగా ఉంటే నేనే ఫోన్ చేస్తాలే” అనింది సరోజ.
****                                                                         *****                                                                               ****
ఎండకు వొళ్ళంతా గుచ్చుక పోతున్నట్టుగా ఉంది ఆమెకు. ఉదయం పని, ఆ తర్వాత ప్రయాణం- వీటితో  వొళ్ళు తూలిపోతున్నట్టుగా నీరసం అయింది. కాసేపు ఎక్కడన్నా నీడలో ఆగుదామానిపించింది. కానీ ఇక్కడెక్కడా తను ఆగడానికి లేదు. ఆగితే షాపుల ముందర ఆగాల్సిందే. ఇదంతా ఎందుకు లెమ్మని ఓపిక తెచ్చుకొని చిన్నగా నడవడానికే ఆమె నిర్ణయించుకున్నది.  ఈ రెండు రోజుల నుంచీ కాసిన జ్వరం తనని బాగా నీరసం చేసేసింది.
ఈ సమయంలో నీలిమ తోడు లేకుంటే ఎలా ఉండేదోననిపించింది తనకు. ఒంట్లో ఏ కాస్త నలత చేసినా, మనసు కాస్త తేడాగా ఉన్నా, తన బలహీనతలోనించీ “ఆమె” తన ముందర ప్రత్యక్షమవుతుందేమోనని  ఒకోసారి భయం వేస్తుంది.
ఆలోచనల్లో ఉండగానే బస్టాప్ దగ్గరకొచ్చేసింది. బస్సు వొస్తే ఎక్కి టిక్కెట్ తీసుకొని ఎందుకైనా మంచిదని కిటికీ దగ్గర కూచ్చుంది. ఆలోచనలు వాటి కొసల నుండీ తిరిగి మళ్ళా మొదలవుతున్నాయి. ఒక ధారలాగా ఎడ తెగకుండా తనను తమ లోపలికి పీల్చుకుంటున్నాయి.
“ఇలా కాకూడదు” అనుకున్నది తను. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే లేని రోగం కూడా వొస్తుందన్న సైకియాట్రిస్ట్ హెచ్చరికను గుర్తుకు చేసుకున్నది. ఊరికే అలా ఆలోచనల్లో పడి లోలకంలా పడి కొట్టుకోకుండా ఏం ఆలోచిస్తున్నావో గమనించు అన్న ఆయన సలహాను తలుచుకున్నది.
నెమ్మదిగా అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కొక్కటిగా పోగు చేసుకునేందుకు  ప్రయత్నం మొదలు పెట్టింది.
అసలిదంతా అమ్మ ఉదయాన్నే ఫోన్ చేయడంతో మొదలయ్యింది. ఫోన్లో ఆమె ఏడుస్తున్న గొంతుతో “అన్నను పోలీసోల్లు పిలచక పోయార” ని అన్నది.
” ఎందుకు” అని అడిగితే “ఎస్సై గారు పిలచక రమ్మన్నారు. మళ్ళీ పంపిస్తాం “, అని అన్నారంట.
“ఊళ్ళొ ఇంకా మరో ఇద్దర్ని కూడా పిలచక పోయార”ని ఆమె అన్నది.
రెండు రోజుల నుండి డ్యూటీకి సెలవు. ఈ రోజేమో వ్యాక్సినేషన్. నిన్న సాయంత్రమే తను హాస్పిటల్‍కు ఫోన్ చేసి రేపు వొస్తానని చెప్పింది కూడాను. ఇప్పుడు తను డ్యూటీకి వెళ్ళక పోతే ఎక్కడిదక్కడ ఆగి పోతుంది. ఏం చేయాలో తోచక “సాయంత్రానికల్లా ఇంటికొస్తాన”ని అమ్మతో పోన్లో చెప్పింది.
ఎలాగైతే అలాగవుతుందని లోపల్లోపల ధైర్యం చెప్పుకుంటుందేగానీ లోపలి గాబరా ఎంతకీ ఆగడం లేదు.
“ఎక్కడా ఏమీ అలికిడి లేదే. మళ్ళీ ఎందుకని ఇలా వెంటబడుతున్నారు?”
“మళ్ళి ఏమన్నా నెత్తి మీదకు తెచ్చుకున్నాడా?”
Sketch18116461చుట్టుపక్కల ఎక్కడా నక్సలైటన్న పేరు వినపడకుండా పోయేదాకా పోలీసులు ఆయనెమ్మటి పడుతూనే ఉన్నారు.
“ఎవరికీ లేని ఖర్మ నీకెందుకురా” అని అమ్మ నెత్తీ నోరూ మొత్తుకుంటే మౌనమే వాడి సమాధానం. ఇంకా గట్టిగా నిలదీస్తే కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాడు.
ఇట్లా మొత్తుకున్న కొన్ని రోజుల దాకా తగ్గినట్టే తగ్గి ఇక ఏమీ లేదులే అని అనుకునేటప్పటికీ మళ్ళీ మనకు తెలియకుండానే పీకల్లోతు కూరుకుని పోయేవాడు.
“మీ వాడి పేరు రికార్డుల్లోకి ఎక్కింది. ఎక్కడ ఏమీ జరిగినా మీ వాడినే ముందు తీసుకొని పోయేది”, అనే వాళ్ళు అందరు.
“అట్లా రికార్డుల్లోకి ఎక్కిందాన్నేనా, చుట్టూ ఏమీ లేక పోయినా మళ్ళీ మళ్ళీ పట్టుకొని పోతా ఉంది?” అనుకున్నది తను.
అట్లా అనుకుంటూనే గబగబా తయారయి వ్యాక్సిన్ బ్యాగ్ పికప్ చేసుకుంది. ఆటో ఎక్కి తను పని చేసే ఊర్లో దిగే సరికే ఎండ దంచేస్తా ఉంది. ఆటోలు ఆగే దగ్గర  ఆశా వర్కర్ రమణమ్మ సిద్ధంగా ఉంది. వ్యాక్సిన్ బ్యాగ్‍ను ఆమె తన చేతుల్లోకి తీసుకున్నది.
గబగబా నడుస్తూ చిన్నబడి దగ్గరికొచ్చేసరికి వాళ్ళకు సుమారు ఒక పది మంది డ్రస్సుల్లో, తుపాకులతో ఎదురయ్యారు. ఊహించని ఈ సన్నివేశానికి తనకు ఒక్కసారిగా ఊపిరాడనంత పనయ్యింది. ఒక్క క్షణం వాళ్ల వైపు చూస్తూ నిలబడింది. వాళ్ళు గబగబా వరుసగా ఒకళ్ళ వెనుక ఒకళ్ళుగా తమను దాటి మెయిన్ రోడ్‍కు  అవతల ఉన్న గుట్టల వైపు పోతున్నారు.
లోపల తను ఆలోచిస్తున్న దానికి, బయట తను చూస్తున్న దానికీ సంబంధం ఏమయినా ఉందేమోనని ఆమె కాసేపు సంకోచపడింది. తను మాట్లాడేది వాళ్ళకు వినపడుతుందేమోనన్న భయంతో , ” రమనమ్మా, ఏందీ వీళ్ళూ?” అని చిన్నగా అడిగింది.
“ఎర్ర సెందనం కోసమంటమ్మా. అడివిలోకి ఎవురూ కూడా పోవడానికి బయపడి సస్తా ఉండారు. మొన్న తిరపతి కాడ కట్టె కొట్టడానికి పోయినోళ్ళను కూడా సంపిండ్రంట గదా. మనకెల్లంతా కూడా అడవడివీ గాలిస్తా ఉండారు”
ఒక్క క్షణం నింపాదిగా గాలి పీల్చుకున్నది తను. అంగన్‍వాడీ  సెంటర్ దగ్గరికొచ్చేసరికి అప్పటికే బాలింతలు చంటిబిడ్డల్ని తీసుకొని తన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళను ఒక్కొక్కళ్ళనూ పలకరిస్తూ పనిలో పడింది తను.
****                                                                        *****                                                                                         ****
తిరిగి వొస్తున్నప్పుడు దారిలో అటో తోలుతున్న చాకలి గురవయ్య అంటున్నాడు. “పెద్ద పెద్ద వాళ్ళను వొదిలేసి సన్నా సపకా వాళ్ళను చంఫుతున్నారు మేడం”.
 
ఆ మాటలు తనకు తగలాలనే, తనను ఉద్దేశించే అంటున్నాడు.
అయినా తనకు తెలియకుండానే, “ఆఁ” అన్నది తను.
తను “ఆఁ” అనడం అతనికి ఎలా తోచిందో గానీ దారి పొడగునా వొదురుతానే ఉన్నాడు.
“ఎప్పటికయినా సన్నా సపకా వాళ్ళకేనంట నెత్తి మీదికొచ్చేది”.
“ఈ చుట్టు పక్కల తలకాయ ముదిరిన ప్రతీ వాడూ ఎర్ర చందనం డబ్బు ఏదో రకంగా తిన్నవాడేనంట”.
“మొన్న ఎలక్షన్లో ఇప్పటి ఎమ్మెల్యేని గెలిపించింది కూడా ఆ డబ్బులేనంట”.
“ఇట్టాంటి డబ్బు తినడానికి ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదంట.”
“కట్టె కొట్టబోయిన తన లాంటి వాళ్ళకు మాత్రం తన్నులూ, కోర్టు కేసులూ, చావులూనంట”.
“అట్టాంటి కేసుల్తోనే సంవత్సరంగా డబ్బులు పోసుకుంటా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడంట”.
చాకలి గురవయ్య మాటల్లో కసంతా తన మీదకే కొడతా ఉంది. అది తనకు తగలాలనీ, తనను బాధ పెట్టాలనీ ఉద్దేశించినట్టుగానే ఉంది.
ఒక్క క్షణం తనకు అతనితో, ’నేనూ నీ లాంటి దాన్నే” అని చెప్పాలనిపించింది. ’నాకూ నీకూ ఎడంలేదు. నీది బయటకు కనపడే బాధ. నాది బయటకు కనపడనిది. నీలా చెప్పుకోలేనిది” అని అనాలనిపించింది. “కానీ అది ఆయనకు అర్థమవుతుందా”?
“అయినా ఇప్పుడు తను ఈ మాటల్నీ,  మాటలతో సలపరించే తన గతాన్నీ తవ్వుకుంటూ కూర్చోలేదు. అది తనని ఇంకా ఇంకా పాతాళానికి తోసేస్తుంది. తను దాన్నించీ తప్పుకోవాలి. బతకాలి”. లోపలికి గట్టిగా గాలిపీలుస్తూ  అనుకుంటూ ఉండిదామె.
****                                                                                      *****                                                                              ****
బస్సు దిగి ఇంటి దగ్గరకొచ్చేసరికి అన్న వొచ్చేసి ఉన్నాడు. తను  ఇంట్లోకడుగు పెట్టేసరికి మొగరానికానుకొని గిట్టకాళ్ళమీద కూర్చొని తనని చూసి పలకరింపుగా నవ్వాడు. అమ్మ పొయికాడ రొట్టెలు చేస్తా ఉంది. అన్న తాగుతున్న బీడీని పక్కన పారేసి గ్లాసు తీసుకొని టీ పోయించుకరాను బయలుదేరాడు.
“ఇప్పుడెందుకులేన్నా”, అంటే , “పోనీలేవే, కాసింత రొట్టె తిన్నాక టీ తాగడం నీకిష్టమేగా” అన్నది అమ్మ.
అన్న బయటికెలితే ఆ సమయంలో ఏదన్నా మాటాడొచ్చని ఆమె ఆలోచన.
అన్న గ్లాసు తీసుకొని బయటకు పోగానే అమ్మ చెప్పడం మొదలు పెట్టింది.
“ఊళ్ళలో ఉండే అన్న లాంటి వాళ్ళందరినీ మళ్ళా పోగేసి మాట్లాడానికి పిలిపిచ్చిండ్రంట. ఆప్పుడప్పుడూ అట్టా పిలిపిచ్చి మాట్టాడితే గానీ బయ్యముండదని ఇదంతా చేస్తా ఉన్నారంట. రేపు మార్కాపురం డీఎస్పీ కాడికి కూడా అందరూ పోయి రావాల్నంట”.
“మళ్ళీ రేపు కూడానా” , అన్నది తను.
“ఏం చేస్తాం. అందరూ బాగానే ఉండారు. మా కర్మే ఇట్టా కాలబన్నది”, పుల్లవిరుపుగా అన్నది వొదిన.
తను వొచ్చిన దగ్గర నుండీ ఆమె ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాటాడలేదు. ఇలాంటి సమయాల్లో ఆమె మూతి ముడుచుకోని ఉంటుందని తనకి తెలుసు. ఆమెలో ఏదో కోపం. ఎవరి మీద చూపాలో తెలియని కోపం.
ఆమె కోపం ఉదయం తను చూసిన చాకలి గురవయ్య లాంటిదేనని అనిపించింది తనకు. కానీ ఆమె కోపము, ఆ పుల్లవిరుపు వైఖరి తనను ఎంతకూ కుదురుగా ఉండనీయడంలేదు.
” ఎవ్వరి బతుకులు మాత్రం బాగున్నాయి. తను కూడా ఆమె లాగా, చాకలి గురవయ్యలాగా ఈసురోమనే కదా బతుకుతున్నది. పైకి మాత్రం ఇదిగో, మంచిగా కనపడే  గుడ్డలు కట్టుకొని, భుజానికి హ్యాండ్ బ్యాగ తగిలించుకొని తెల్లపుల్లగా కనపడుతున్నాను గానీ, నా బతుకు కూడా తగలబడి పోతుందని ఈమెకు తెలియదా? వీళ్ళకన్నా ఏడ్చుకోవడానికి ఉంది. నేను మాత్రం ఈ తెల్లపుల్లని గుడ్డల మాటున శిధిలమైపోతున్నాను” అని గట్టిగా అరవాలనిపించింది.
“కానీ తనకు తెలుసు. మనుషుల మధ్యన ఉండే దూరాలు, ఎత్తు పల్లాలు మనుషులను ఎంతకీ దగ్గర కానీవు.  ఎంత మొత్తుకున్నా ఒకరికొకరు అర్థం కానీయవు. ఒకరికొకరు కాస్త దగ్గరకొచ్చినట్టుగా అనిపించినా అది కాసేపే. తిరిగి మళ్ళీ మనుషుల మధ్య గోడలు పైకి లేస్తాయి. పైకి లేచిన గోడల మధ్యన మనుషులు జంతువుల్లాగా బంధీలై గాలిలోకి కాళ్ళూ చేతులూ విసురుతూ మొత్తుకోవాల్సిందే.”
“లేకుంటే తను ఏమి చేసామని  వొదిన తనతోనూ, అమ్మతోనూ సరిగా మాటాడదు? ఏదన్నా అంటే, ఈ కొంపలో నా కర్మ కొద్దీ వొచ్చి పడ్డానంటుంది. ఆమె ఈ ఇంటికొచ్చిన  దగ్గరనించీ ఇదే తంతు. అంతా అయిపోయీ, అన్న ఇక ఎటూ పోకుండా ఇంటి కాడే ఉండేంత వరకూ ఇట్లాగే కక్షగా ఉండేది ఆమె.”
“తనకూ, మొగునికీ పడక గొడవలై, ఇక కలిసి ఉండలేక వొక్కతిగా  ఉండాల్సొచ్చినపుడు  అన్నా, వొదిన, అమ్మ తన దగ్గరకు వొచ్చి రెండు రోజులున్నారు.  ఆ రెండు రోజులూ మాత్రమే వొదిన మునపటి కన్నా నెమ్మదిగా, మెత్తగా మాటాడింది. ఆ నెమ్మదితనం, మెత్తదనం చూసి తనే ఆమెను దూరం నుంచీ చూసి అర్థం చేసుకున్నానేమో అనుకున్నది. కానీ ఈ రోజు, ఈ సంఘటనతో మళ్ళీ తనకు తెలిసిన వొదిననే చూస్తున్నది తను”.
కళ్ళలో నీళ్ళు మెదలుతున్నాయి తనకు. అన్న వొస్తూ వొస్తూ పిల్లల్ని కూడా పిలుచుకొని వొచ్చాడు. వొస్తూనే వాళ్ళూ “అత్తా” అని మీద పడిపోయారు. హ్యాండ్ బ్యాగ్ లోనుండీ  కొనుక్కోవడానికి వాళ్ళకు డబ్బులు తీసిచ్చింది.
అన్న తెచ్చిన టీ తాగుతూ, “అయితే రేపు కూడా పోవల్నా” అని అడిగింది తను.
“అవును ఉత్త పున్నేనికే తిప్పుతా ఉండారు”, అన్నాడు ఆయన.
ఇంకేం మాటాడడానికి తోచలేదు తనకు.
టీ ఊదుకుంటా తాగుతా ఉంటే అన్న మొకం కెల్లి చూసింది. మొకమంతా డొక్కుపోయినట్టుగా ఉంది. రెక్కల కష్టంతో దేహం ఎండిపోయి కంప మాదిరిగా తయారయ్యింది. ” తనకున్న రెండెకరాల చేను పీల్చి పిప్పి చేస్తున్నది” అనుకున్నది తను.
Sketch18116461
ఈ నిశ్శబ్ధంలో కాసేపు ఆగి అటూ ఇటూ తిరుగుతూ బోకులు సర్దుకుంటున్న వొదిననూ, పిల్లలనూ, అమ్మనూ మార్చి మార్చి చూసింది. వాళ్ళు కూడా అన్న లాగే ఎండిపోయి వొట్టి చేపలల్లే ఉన్నారు. ఒకే ఇంటిలో ఒకే రకమైన కష్టాలతో ఒకరినొకరు ముమ్మూర్తులా పోలి ఉన్నారు.
కానీ వాళ్లందరినీ విడగొడుతున్నదీ, ఒకరంటే ఒకరికి ద్వేషాన్నీ, కోపాన్నీ కలిగించేదీ ఏదో అక్కడే మెసల్లాడుతున్నట్టూగా తోచింది. అది గాలిలాగా అక్కడే తిరుగుతూ ఉన్నది. వొంటికి తాకుతూ ఉంది. అక్కడక్కడే తిరుగుతూ మనుషుల్ని నిస్సహాయుల్ని చేసి దిక్కుకొకరుగా ఈడ్చుక పోతూ ఉంది. అది తనకు తెలుస్తూ ఉంది అనుకున్నది తను.
ఉండి ఉండీ కాసేపటికి, “నిన్న స్టేషను కాడ మీ లాయరు మాట్లాడిండు” అన్నాడు అన్న.
తను ఏమీ మాటాడలేదు.
ఏమయినా మాటాడితే అది ఆ ఇంట్లో మరో విస్పోటనంగా పని చేస్తుందని తనకు తెలుసు. అందుకే తను ఏమీ మాటాడలేదు.
కానీ అమ్మ అందుకోనే అందుకున్నది. అది నెమ్మది నెమ్మదిగా మొదలై తిట్లు, శాపనార్ధాలకు చేరుకుంటున్నది.
****                                                              *****                                                                                                 ****
అందరిలాగే తన బతుకూ ఉంటుదనుకున్నది తను.  పెళ్ళయిన కొన్నేళ్ళ దాకా బాగానే ఉన్నాడు  భర్త వెంకట రమణ. ఉద్యోగస్తుడు కాకపోయినా దగ్గరి సంబంధం బాగుంటుందని చేసారు. కానీ మూడేళ్ళు దాటిన దగ్గర నుంచీ మొదలయ్యిందీ నరకం. పిల్లలు పుట్ట లేదని అత్త, మామా సణుగుడు. దానికి తోడు తను చేసే ఉద్యోగం మీద ఏవేవో సూటిపోటి మాటలు. తన రాకపోకల మీద భరించరాని ఆంక్షలు. కాసింత ముందుగా బయల్దేరినా, కాస్త లేటుగా వొచ్చినా ఎంతదాకా మాటలు పడాల్సొస్తుందోనని గుండెలు బితుకు బితుకు మనేవి.
ఇది చాలదన్నట్టుగా ఎట్టా తగులుకున్నాడోగానీ రాజకీయ నాయకులెమ్మటి తిరగడం, ఎమ్డీవో, ఎమ్మార్వో ఆఫీసులెమ్మటి మరిగి ఊళ్ళో వాళ్లకి పనులు చేపించడం , దానికి గాను ఆఫీసర్లకింత ఇప్పించి తనూ కొంత దండుకోవడం.
“ఎందుకయ్యా ఈ తిరుగుళ్ళు, ఉన్న కాస్త పొలమూ చూసుకోక”, అంటే “తిరుగుతున్నాను కాబట్టే లోకం తెలుస్తుందం”టాడు.
ఇది ఎంత దాకా వొచ్చిందంటే చుట్టూ పక్కల ఏ పనొచ్చినా ఆయన కన్ను దాటి పోని పరిస్థితి.
ఆయన చేసే పనులు వింటుంటే ఒకోసారి తనకే ఆశ్చర్యం వేసేది. హైస్కూలు చదువు దాటని మనిషి ఇన్ని రకాలుగా చేయగలగడం నమ్మశక్యం అయ్యేది కాదు. ఇదంతా తన అన్న నడిచే దిశకు వ్యతిరేకంగా సాగడంగా తనకు అర్థమయ్యేది. ఇది ఇంట్లో ఇంకా ఇంకా హింసకు దారి తీసేది. అన్న జీవితంలో ఎదురయ్యే మలుపులు, ఇబ్బందులు రోజుకొక్క రకంగా తనకు దెబ్బలై తాకడం తనకు తెలుసు.
ఇందులో తన ప్రమేయం ఎక్కడా లేదు. కానీ ఇదీ అని చెప్పలేదు గానీ లోపల మాత్రం తనకు తెలియకుండానే తన మొగ్గు అన్న వైపే ఉన్నట్టుగా కనపడుతుండేది.
మొగుడు మొకాన్నే అనేవాడు, “నీకు ఇదంతా యాడ నచ్చుద్ది లేవే,  గుట్లమ్మటీ, అడువులమ్మటీ తిరుగుతుంటే నచ్చుద్దీ గానీ” అని. అన్న ఇబ్బందులకు గురి కావడం, కేసుల పాలయిన సందర్భాల్లో అయితే ఇక ఆ ఇంట్లో లేకుండా ఉంటే పీడా పోతుందనుకునేది.
ఇదంతా ఏళ్ల పాటు గడిచింది. అన్న జీవిత ఇక ఒక స్తబ్ధ స్థితికి చేరుకుంటున్నదనుకునే సమయానికి తన జీవితం ఇంకో ఇబ్బందిలోకి కూరక పోయింది.
వెంకట రమణ   ఎర్ర్ర చందనం కొట్టించడం మొదలు పెట్టాడు.  మొదట తను ఇది విన్నప్పుడు, ” ఇది, ఇక్కడా” అని ఆశ్చర్య పోయింది. ప్రకాశం, కడప జిల్లాల సరిహద్ధుల్లో ఇది సాధ్యమేనా అనుకున్నది.  కానీ తర్వాత్తర్వాత ఇది నిజమేనని తెలుసుకున్నది. ఫారెస్టోల్లూ, పోలీసుల గొడవ మళ్ళీ తన జీవితంలో మరో విధంగా మొదలయింది. కానీ అవి తన భర్తను బతక నేర్చిన వాడిగా, పలుకుబడి గలిగిన వాడిలాగా నిలబెట్టేందుకే దోహద పడ్డాయి. కేసులూ, రైడింగులూ అన్నీ అయ్యాయి గానీ అవన్నీ ఆయనని మరింత ఎత్తుకు చేర్చేందుకే ఉపయోగ పడ్డాయి.  ఇట్టాంటి డబ్బే కిందటి ఎలక్షన్లల్లో ఏరులై పారిందంట. చివరకు వెంకట రమణ పంచాయితీ సర్పంచ్ కూడా అయ్యాడు.
వీటన్నింటికీ తోడు తను ఇక తట్టుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరైన విషయం వెంకట రమణ  ఒంగోలులో ఎవరితోనో కాపురం పెట్టడం.  ఇది తన సహనానికి ఉన్న ఆఖరి హద్దును కూడా పూర్తిగా చెరిపేసింది.
****                                                            *****                                                                                          ****
బస్సెక్కి తిరిగి ఊరు చేరుకొనేసరికి ఎనిమిది దాటుతుంది. బస్సు దిగగానే పర్సులోనించీ సెల్లు బయటకు తీసి చూసుకుంది. నీలిమ నుంచీ రెండు మిస్‍డు కాల్స్.
తిరిగి ఆ నెంబరుకి కాల్ చేయబోయింది కానీ ఎందుకో ఒక్క క్షణం ఆగి మానేసింది. ఈ క్షణంలో ఆమె ఏది మాట్లాడించబోయినా  తను మాటాడగల స్థితిలో లేదు.
బస్టాప్ నుంచీ ఇంటి దాకా కూడా నడవడానికి ఓపికగా ఉన్నట్టు అనిపించడంలేదు. దగ్గర ఉన్న ఆటో ఒక దాన్ని ఆపి ఇంటి అడ్రస్సు చెప్పి ఎక్కి కూచ్చునింది.
బస్సు ఎక్కినప్పటి నుండే తల ఊరకే కదిలి పోతున్నట్టుగా అనిపిస్తోంది. కడుపులో ఒక పక్కగా మొదలైన మంట రొమ్ము దగ్గరకు పాకుతూ వొస్తుంది. అది ఇప్పుడు మరింత ఎక్కువై నోట్లో నీళ్ళు ఒకటేమైన ఊరుతున్నాయి. ముక్కుతో గాలిని నిండుగా పీల్చుకుంటూ నెమ్మదిగా వొదులుతూ నియంత్రించుకునేందుకు ప్రయత్నించింది. కానీ లోపలి నుంచీ వొస్తున్న హోరును ఆపుకోలేక పోతుంది. ఆటోలో నుండే భళ్ళున వాంతి చేసుకున్నది. నోరు, ముక్కు, కళ్ళ నిండా సుళ్ళు తిరిగుతూ ఒక్క క్షణం ఊపిరి ఆగినట్టుగా అయింది.
ఆటో నడిపే అతను ఆటోను ఒక పక్కన ఆపి, పుక్కిలించుకోవడానికి నీళ్ళు అందిస్తున్నాడు.
****                                                              *****                                                                                   ****
శరీరాన్ని చిన్నగా ఈడ్చుకుంటూ,  మెట్లెక్కి పై దాకా వొచ్చింది కానీ తాళం తీసుకొని ఇంట్లోకి అడుగు పెడదామనుకునేసరికి వొళ్ళంతా భయంతో జలదరించింది. శరీరమంతా చెమటతో తడిచి ముద్దయింది. చేతులూ, కాళ్ళూ వొణుకుతూ ఉన్నాయి.  ఆ క్షణం  అక్కడ నుంచీ దూరంగా ఎక్కడకన్నా పారి పోదామా అనిపించింది. తాళం తీయాలనే ఆలోచన పక్కన పెట్టి మెట్ల మీద అలాగే కూర్చుండి పోయింది.
 
వొళ్ళూ, మనసూ పుండు మాదిరిగా సలుపుతున్న ఈ స్థితిలో ఇంట్లోకి అడుగు పెట్టడమన్న అలోచనే ఆమెకు ఊపిరి ఆడనీయడంలేదు.
తలుపు తీసి లోపలికెళితే ఏమవుతుందో ఆమెకు తెలుసు. అక్కడ “ఆమె” ఉంటుంది. ఇట్టాంటి సందర్బాల్లో ఆమె ఖచ్చితంగా తనకెదురుగా వొచ్చి నిలబడుతుంది.
ఆమె తనను ఏమీ అనదు. ఊరకే అలా చూస్తూ కూర్చుంటుంది. ఎటు కదిలితే అటు తన కళ్లను తిప్పి అదే పనిగా చూస్తుంటుంది. పారదర్శకమైన ఆ దేహాన్ని తను మొదట ఆ ఇంట్లోనే చూసింది. చూడగానే  మ్రాన్పడిపోయింది. తను చూస్తున్నదేమిటో అర్థమవగానే గబగబా అక్కడ నుంచీ పారిపోయింది.
ఇట్టాంటి అనుభవం తన చదువుకూ, తను చేసే పనికీ వ్యతిరేకంగా తోచింది కానీ త్వరలోనే ఆ పారదర్శకమైన దేహం వెనుకా, ఆ చూపుల వెనకా ఆకర్షణీయమైనదేదో ఉన్నట్టుగా తనకి అనిపించింది. అందులో ఏదో మార్మికమైనదేదో ఉన్నట్టుగా తోచేది. అది తనకు మాత్రమే అర్థమవుతున్నట్టుగా అనిపించేది.
“ఎవరు ఆమె?”
“మొగుడు రైల్వేలో ఉద్యోగమంట.”
“కొత్తగా పెళ్ళయిందంట.”
“అయితే ఈమె మాత్రం మంచిది కాదంట.”
“మొగుడు బయటికి పోగానే ఎప్పుడు మిద్దె మీదే అటూ ఇటూ తిరగతా ఉంటదంట.”
“ఏమయిందో ఏమో గానీ చివరకు ఆమె ఫ్యానుకు ఉరేసుకున్నదంట”
“చంపిండ్రో, ఆమే చచ్చి పోయిందో ఎవ్వరికీ తెలియదంట”.
“చివరకి, అద్దెకిచ్చినోళ్ళక్కూడా తెలియకుండా గప్‍చిప్‍గా బాడీని జీపులో వేసుకొని పోయిండ్రంట”.
“అభాగ్యురాలు పాపం. కానీ చావు ఎంత అదృష్టం”
“చావూ, చావూ  ఆడవాళ్ళంటే ఎందుకు నీకంత ప్రత్యేకమైన ఇష్టం?”
పక్కింట్లో నుండి ఏదో దైవ స్తుతి శ్లోకాలుగా వినవొస్తుంది. రాత్రి ఏడు గంటలకల్లా కల్లా తిని ఎనిమిదిన్నరకల్లా ఇట్టాంటి శ్లోకాలు, ప్రార్థనలు వింటూ అటువంటి ప్రశాంతత ఇచ్చే రక్షణలో సుఖంగా నిద్రపోయే ఆన్నీ అమరిన సుభద్రమైన సంసారం.
“అందరికీ హాయినీ, రక్షణనూ ఇచ్చే దేవుడు తన సంసారాన్ని మాత్రం ఎందుకనీ ఇలా చేసాడు?”
“ఈ రకంగా అలమటిస్తుంటే ఒక్క నాడన్నా తనని పట్టించుకోని గుడ్డి నాబట్ట కాదా వాడు.”
****                                                           *****                                                                                                      ****
మెట్ల సందుల్లోనించీ ఆకాశం చంద్రుని లేత వెలుతురులో సన్నగా మెరుస్తా ఉంది. అలసట తీరినట్టుగా అనిపించింది కానీ జంకు వల్ల కలిగిన అలజడి మాత్రం శరీరంలో ఇంకా ఉన్నట్టుగానే అనిపిస్తొంది
  తన కతంతా చెప్పినపుడు సైకియాట్రిస్టు చెప్పిన మాటలను ఆమెకు గుర్తుకొస్తున్నాయి.
“ఆ ఇంట్లో దెయ్యం ఉండడమా, లేకుంటే ఉండకపోవడమా అనేది మీ చుట్టు పక్కల వాళ్ళకు ఒక నమ్మకం కావొచ్చు. కాకుంటే ఒక భ్రాంతీ అయి ఉండవచ్చు. అంతకు మించి వాళ్ళ అనుభవంలోగానీ, అనుభూతుల్లోగానీ మరేమీ లేదు”.
” కానీ మీ అనుభవంలో మాత్రం ఇది  ఒంటరితనానికీ, జీవితంలోని స్తబ్ధతకు బదులుగా చావు పట్ల మీరు పెంచుకున్న ఆకర్షణగా నాకు తోస్తున్నది.”
“దెయ్యం పేరుతో ఉన్న ప్రతీ అనుభవంలోనూ మీరు ఆత్మహత్యతో తలపడుతున్నట్టుగానే నాకు అనిపిస్తోంది. అది కాసేపు మిమ్మల్ని భయ పెడుతోంది. మరి కాసేపు మిమ్మల్ని ఆకర్షిస్తోంది.  ఈ ఘర్షణ ఇట్లాగే సాగడం మీకు మంచిది కాదు. నిజంగా అట్టాంటి సంఘర్షిత క్షణాలే ఎదురైనప్పుడు వాటిలో ఊరకే పడి కొట్టుక పోకుండా  అదేమిటో తేల్చుకోవడమే బాగుంటుంది….”
ఫోన్ మోగుతోంది.
అవతల నీలిమ.
“రాత్రికి తోడుగా వొచ్చి పడుకునేనా”, అని అడుగుతున్నది.
తను ఇక నిశ్చయించుకోవాల్సిన సమయం వచ్చింది.
బదులుగా, ” పర్వాలేదులే” అని నచ్చచెప్పింది తను.
నీరసంగా అనిపించినా, నింపాదిగా తాళం తీసి లోపలికి అడుగు పెట్టింది.
లైట్ వెలిగించి, కిందింటి పిల్లాడ్ని పిలిచి, నాలుగిడ్లి కట్టించుకరమ్మని డబ్బులిచ్చి పంపింది.

కుక్క అంటే ఏమిటి?

1

ఈ నడుమ మా చిన్ని పాప తరుచూ ప్రతీ దానికీ కుక్క అనే పదాన్ని చేరుస్తుంది

 

మూడేళ్ళ పిల్ల, బొత్తిగా భాషాపాటవం తెలియనిది

ఇప్పుడిప్పుడే బడికి పోతూనో (హతవిధీ) పోబోతూనో

పోలేకనో, పోకుండా ఉండలేకనో ( దాని చేతుల్లో ఏముంది ) కింద పడి దొర్లి, కాళ్ళూ చేతులను నునుపాటి గట్టి గ్రానైట్ బండ మీద

ఇష్టారాజ్యంగా తపతపా విదిలించి కొడుతూ ఎక్కడ దెబ్బ తగులుతుందేమోనని గుండెలదరింపజేస్తూ

తన రోజు వారీ మాటల సమయాలలో అంటుంది కదా-

 

ఎక్కడికి పోయినావే కుక్కా, కుక్క నాకొడకా-

 

“ఇంక ఏమి తింటవ్ తల్లీ?”

కుక్క తింట-

 

“ఇట్లయితే ఎట్లనే?”

కుక్కనే-

dog

2

 

ఇంతకూ కుక్కా అనేది ఏ భాషావిశేషం?

 

పదే పదే మాటల తొక్కిసలాటలలో ఇరుక్కపోయిన భాషా క్రీడగానో, క్రీడించే సమయాలోకి సంభాషణగా కరిగే భాషగానో

మాటలుగా, వాక్యాలుగా అర్థాలు చెదిరి, అర్థాలతో పాటుగా సన్నివేశమూ అందలి పాత్రలూ చెదిరి

ఎటూ పొసగనీ లేదా ఇమడని ఉధ్విగ్నతలలోనికి పొగమంచుగా పాకి

విఫల యత్నమై బ్రహ్మ రంద్రాన్నిపగలగొట్టుకొని శూన్యంలోనికి పెగిలే నిట్టూర్పులా ప్రయత్నిస్తున్నపుడు

 

మనుషుల రణగొణ ధ్వనులలో మాటల బండరాళ్ళపై పడి

నాకూ కాళ్ళూ చేతుల్ని టపటపా కొట్టుకోవాలనిపిస్తుంది

 

కుక్క మాటలు

కుక్క సంభాషణలు

కుక్క కవిత్వమూ అని రాయాలనిపిస్తుంది.

avvariఅవ్వారి నాగరాజు

 

రెండు పాదాల కవిత

   

వొచ్చీరానీ అక్షరాలను కూడబలుక్కొని

ఆ రెండు పాదాలూ నువ్వు రాస్తున్నప్పుడు నేను నీ పక్కనే కూర్చొని ఉన్నాను

అప్పుడు చుట్టూ రాబందుల రెక్కల చప్పుడు

 

ఆ రెండు పాదాలే పుంఖానుపుంఖమై రోజుల నిర్దాక్షణ్యతను తొలుచుకుని బారులు సాగుతునప్పుడు-

“కవిత్వమా అది”- అనే కదా నేనడుగుతాను

 

అప్పుడు జల్లెడలా తూట్లు పడి దేహమంతా తడిసి ముద్దయి బహుశా నొప్పితోనే కాబోలు

వణుకుతున్న చేతితో జేబులో నుండి తడిసిన ఆ కాగితాన్ని ఒక చిన్ని మిణుగురులా బయటకు తీసి

ఒక్కసారి చూసుకొని తిరిగి జేబులో దాచుకుంటున్నావు

 

చావును బతుకును కలుపుతూ వంతెనలా నువ్వు

వెలుగుకు చీకటికి నడుమ పలుచని వెలుతురులా నీ జేబులోని వొచ్చీ రానీ ಆకవిత్వమూ

 

ఆ వెలుతురులో ఆ వంతెన మీదుగా అటునుండీ ఇటూ ఇటునుండీ అటూ పిచ్చి పట్టినట్టూ తిరుగుతున్నప్పుడు

చేయి పట్టుక పక్కన కూర్చోబెట్టుకొని అప్పుడు నువ్వే ఇలా అంటున్నావు

 

బహుశా ఒక అమరగీతం రాసే ఉంటావు నువ్వు, తుంటరి దొంగ సుమా వీడు –

దొరికినదంతా దోచుక పోగలడు

తాగి తాగి వొదురుతూ రాసిన మీ అక్షరాల మీద ఒంటేలు పోసి పళ్ళికలించగలడు

 

ఒక మనిషి ఎప్పుడు ఎలా పరిణమించగలడోనని మీరు ఆసక్తిగా చూస్తుంటారు

కానీ అటూ ఇటూ చెదరని నిశ్చితాల మీదనే మీ గురి-

 

కొత్త బట్టలేసుక రోడ్డు మీద తిరుగుతున్నందుకు గుడ్డలిప్పదీయించిన పెద్దమనిషి

తుపాకీ ముందర చేతులుకట్టుకొని “అనా, అనా” అని వొరపోతున్నప్పుడు లోపల ఎట్టా కుతకుతమంటదో మీరూహించగలరు గానీ

 

పక్కన ఎప్పుడూ ఊహించనంత డబ్బు

ఎటు పక్కనించీ ఏ పోలీసొస్తాడోనన్న భయం

భుజాలనొరుసుకుంటూ మావో నిలిపిన ఆదర్శం-

 

రోట్లో వేసి కలిపి దంచినట్టూ మనసు ఎన్ని పరిపరి విధాలుగా పోగలదో మీరూహించలేరు

చోరజాలని ఇరుకిరుకు సందులలో మురికి పెంటల మీదగా జీవితం ప్రవహించడం మీరు చూడలేరు –

 

తలెత్తిన ఆకాశంలో మేఘాల పరిభ్రమణంలా గిర్రున తిరుగుతూ తన లోతులలోనికి చేయి పుచ్చుకొని ఈడ్చుక పోతున్నపుడు

తనను ముట్టుకొని అలా వెళ్ళిన వాడివి మరలా ఎందుకిలా తిరిగి వచ్చావు అని అడగాలనుకున్నాను

 

తిరిగి తను అర్థాంతరంగా వదిలేసిన పాదాలే –

 

ఒకటి మరొక దానిని కలుపుతూ ఒక దృశ్యాన్ని విడదీస్తుంటుంది

మొదటిది రెండవ దాని నుండి విడిపోతూ ఒక భావాన్ని నెలకొలుపుతుంది.

-అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

 

 

 

 

 

 

 

 

 

 

 

విలువల గురించిన సంవాదం – కారా ‘స్నేహం’ కత

karalogo

నిర్వహణ : రమాసుందరి బత్తుల

కారా మాస్టారి ‘స్నేహం’ కత చదవగానే మనుషుల మధ్య ఉండే సంబంధాలు, మ్మకాలు, విశ్వాసాలకు సంబంధించిన ఆలోచనలు నన్ను అలుముకున్నాయి. ఒక
మనిషి తనను నమ్మి సహాయార్ధిగా వచ్చినపుడు ఎవరైనా అతని పట్ల ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తారు?  తమ మధ్య అప్పటికే ఉన్న స్నేహాన్ని ఎలా వ్యాఖ్యానించుకుంటారు? వీటన్నింటి వెనుక ఉన్న విలువల చట్రం మనుషులను ఎలాంటి అనుభూతులకూ, అనుభవాలకూ గురి చేస్తుందీ అన్న ఆలోచనలు నన్ను నిలువనీయలేదు. ఈ ఆలోచనల వలయం నన్ను భావజాలానికి సంబంధించిన విషయాలలోనికి పడదోసింది.

భావజాలం ఎలా ఉనికిలోనికి వస్తుంది? దాని ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది? మానవ సంబంధాలను అది ఎలా ప్రభావితం చేస్తుందీ అన్నవి ఆసక్తికరమైనప్రశ్నలు. పరస్పర వైరధ్యాలు, విభిన్నత కలిగిన సమాజాలలో అనేక భావజాలాలు ఒకే సమయంలో ఉనికిలో ఉండడమే కాకుండా పరస్పరం పోటీ పడడం కూడా మనం చూస్తూ ఉంటాం. భావజాలం ఉనికిలోకి రావడానికీ, అది మిగిలిన వాటి కన్నా  ప్రబలంగా  మారడానికీ మనిషి అవసరాలే ప్రాతిపదిక.  తన అవసరాలకు ఆటంకంగా మారిన పాత    ఆలోచనలను, విధానాలను అడ్డు తొలగించుకోవడానికి మనిషి సంకోచించడు. నిరంతరమూ  మారుతూ ఉండే మనిషి అవసరాల మాదిరిగానే భావజాల ఉనికి, వాటి ప్రభావాలూ  సాపేక్షికాలు. సమాజంలోని వివిధ వర్గాల, అస్తిత్వాల ప్రయోజనాలు పరస్పరం సంఘర్షిస్తూ ఉన్నప్పుడు, వాటి ఘర్షణ భావజాలాల నడుమ ఘర్షణగా వ్యక్తమవుతూ  ఉంటుంది. వీటిని మనం విలువలు, విశ్వాసాలు, సంబంధాలు, విధానాల తాలూకు  ప్రశ్నలుగా, సంవాదాలుగా చూస్తుంటాం. ఇలాంటి ఒక సంవాదమే కారా ‘స్నేహం’.

అరవై తొమ్మిదుల్లో రాసిన ఈ కత, విషయరీత్యా చాలా చిన్నదే అయినప్పటికీ, ఈ  కాలపు తన ఇతర కతల్లాగానే అనేక అంశాలను పాఠకుల ముందుకు తెస్తుంది. ఈ కతను
పై నుంచి చూసినపుడు, నమ్మి వచ్చిన స్నేహితుడిని మోసం చేసిన కతగా  కనపడుతుంది. స్నేహానికి ఉన్న పాత అర్థాన్ని చెరిపేసి, ఒక కొత్త అర్థాన్ని  ప్రతిపాదిస్తున్న కతగా కనిపిస్తుంది. అయితే ఇది వీటికి మాత్రమే పరిమితమైన  కత కాదు. వీటిని కేంద్రంగా చేసుకొని మరింత లోతుల్లోకి తరచి చూసిన కత.

స్నేహానికి విలువనియ్యాలనీ, ఆపన్నుడై వచ్చిన సహాయార్ధికి తప్పనిసరిగా,  శ్రమకోర్చి అయినా సహాయం చేసి పెట్టాలనే విలువకు, జీవితం వైకుంఠపాళీ  కాబట్టీ – తన విలాసాలకు, తన అవసరాలకూ, తను మరింత ‘పైకెగబాకడా’నికీ వచ్చిన  అవకాశాన్ని ఏమాత్రమూ వెనకాడకూడదూ  అనే విలువకూ నడుమ జరిగే ఘర్షణను దాని  రక్త మాంసాలతో సహా అనుభవంలోకి తెచ్చే కత . ఈ ఘర్షణలో మనుషులలో ఏర్పడే  సంవేదనలను సెస్మోగ్రాఫుపై లెక్కించి చూపిన కత. కొత్త విలువలూ, కొత్త  విశ్వాసాలూ- పాత విలువలనీ, పాత విశ్వాసాలనూ ధ్వంసించి, ఆసాంతమూ  ముప్పిరిగొని తమ ఉనికికి మనుషుల చేతననే పతాకగా ఎగరేస్తూ తమను తాము  వ్యక్తం చేసుకొనే కత .

ఈ కతను చదవడం మొదలు పెట్టగానే పాఠకుడికి అర్థం అయ్యే  అంశాలు డాక్టరు  వేణుగోపాలరావు ఆతృత, అవసరం. రాజారావుతో అతనికి గల స్నేహం. వీటికి గల నేపథ్యం, ప్రాతిపదిక అతని చిన్ననాటి  స్నేహితుడు శివయ్య వచ్చాక గానీ  పాఠకుడి అవగాహనలోకి రావు. వేణుగోపాలరావు ఎదిగి వచ్చిన సమాజం ఎలాంటిది?

ఇప్పడు తను ఉన్న పరిస్థితులకూ, గతానికీ ఉన్న తేడా ఏమిటీ? తనను చదివించి, పిల్లనిచ్చిన మామతో, కట్టుకున్న భార్యతో అతని సంబంధాలు ఎలాంటివన్న విషయాలు ఒక్కొక్కటిగా వాళ్ళ సంభాషణలో బయటికి వస్తాయి. శివయ్యకూ, వేణూగోపాలరావుకూ ఉన్న స్నేహం గురించి కూడా అప్పుడే తెలుస్తుంది. అయితే వీటన్నింటికీ రచయిత ఉద్దేశించిన అర్థం, కత చివరలో వేణుగోపాలరావు  స్నేహానికీ, మానవ సంబంధాలకూ ఇచ్చిన వ్యాఖ్యానం ద్వారా గానీ  మన  అనుభవంలోకి రావు. ఆసాంతం చివరకు వచ్చాక రచయిత ఏం చెపుతున్నాడో మన మనసులో ఒక్కొక్కటిగా స్ఫురిస్తున్నపుడు, వాటిని రూఢీ చేసుకునేందుకు తిరిగి మళ్ళీ కథనంలో దొర్లిన అనేక సంగతులలోకీ, వివరాలలోకీ మనం ప్రయాణిస్తాం. ఇలాంటి శిల్పసంవిధానంతో  వేణుగోపాలరావునూ, శివయ్యనూ, రాజారాంనూ  అర్థం  చేసుకుంటాం.

వేణుగోపాలరావును మోసగాడని, స్నేహధర్మం పాటించని వ్యక్తని చెప్పడానికి  నిజానికి కతలో ఇన్ని విషయాలను చొప్పించనవసరం లేదు. అసలు రాజారావు పాత్రే  అవసరం లేదు. మరి రాజారావు పాత్రకున్న ప్రాముఖ్యత ఏమిటి?

వేణుగోపాలరావు గతానికి శివయ్య ఎలానో అతని వర్తమానానికి రాజారావు సంకేతం. మారిన తన అభిరుచులకూ, స్నేహాలకూ, సంబంధాలకూ అతను కొండ గుర్తు. అతను దళారీ
మాత్రమే కాదు. వేణుగోపాలరావులో ఇంకా మిగిలి ఉన్న గతకాలపు వాసనలకూ,  ఎగబాకడమొక్కటే పరమావధిగా ఉన్న వర్తమాన ఆకాంక్షలకూ మధ్య జరిగే  బలహీనమైన
ఊగిసలాటకు అతను వేదిక. శివయ్య తన కొడుకు ఉద్యోగం సిఫారసు కోసం  వేణుగోపాలరావును ప్రాదేయపడినప్పుడు ఒక దశలో డబ్బు ప్రసక్తి లేకుండానే పని  చేయిద్దామా అన్నట్టూ ఊగిసలాడతాడు గానీ,  రాజారావు అతనిని తొందరగానే  వాస్తవంలోకి తేలగొడతాడు. ఇలాంటి ఊగిసలాటను పాఠకుడు సరిగ్గా అంచనా వేసుకోవడానికి రాజారావు సున్నితపు త్రాసులా పనికొస్తాడు. గతానికి   సంబంధించిన పనికి రాని ‘చెత్త’ నుండి బయటపడడానికి ఉత్ప్రేరకంగా కూడా పని  చేస్తాడు. రాజారావు ‘స్నేహం’ లేకుండా వేణుగోపాలరావు, వేణుగోపాలరావు కాడు.  అలాగని  రాజారావుకు పూర్తిగా డబ్బు మీదనే నమ్మకమా? డబ్బు లేకుండా పని  జరగకూడదని అంటాడా?  అంటే అలా  ఎన్నటికీ అతడు అనడు. అప్పుడప్పుడూ కాస్త  నిజం కలిపితే గానీ అబద్దానికి విలువుండదు అన్నట్టుగా, అప్పుడప్పుడూ కాస్త  మెరిట్‍కు కూడా చోటు దొరుకుతే గానీ మిగిలిన వాటికి ఢోకా ఉండదు అని నమ్మే  మనిషి తను. వ్యవస్థ ఆయువుపట్టు తెలిసిన వాడు కనుకనే మెరిట్‌కూ స్థానం  దొరకక పోదని ఆయన మనకు భరోసా ఇస్తాడు.

వేణుగోపాలరావులో కలిగిన  ఊగిసలాట శివయ్యకు అర్థం అవుతుంది కానీ,  దానిలోని ప్రయోజకత్వం పట్ల ఆయనకు నమ్మకం ఏర్పడదు. ఇంకా, డబ్బులు లేకుండా  నడిపే వ్యవహారంలో అసలుకే మోసం వస్తుందేమోననే భయం కూడా కలుగుతుంది. దీనికి  వ్యతిరేక దిశలో రాజారావు పట్ల అతనిలో నమ్మకం స్థిరపడుతుంది. ఇది క్షణ కాలం పాటు మనలో విస్మయం కలిగిస్తుంది. కానీ, కాసులు రాలకుండా ఉద్యోగం  రాదన్న సంగతి సమాజంలో స్థిరపడిపోయిన విశ్వాసంగా మనలో స్ఫురించినపుడు  దీనికున్న ప్రాసంగికత మనకు ఎరుకలోనికి వస్తుంది.

చివరకు, ఈ మొత్తం సంబంధాలనూ మీనాక్షీదేవి సమక్షంలో సైద్ధాంతీకరిస్తూ,  శివయ్య అవసరం కొద్దీ వచ్చిన మనిషనీ, కాబట్టి అతని నుంచీ ఇంకా డబ్బు వసూలు  చేయొచ్చుఅని వేణుగోపాలరావు అన్నప్పుడు వెంటనే  అతనిపై మనకు ధర్మాగ్రహం  కలుగుతుంది. కానీ లోకంలో స్నేహమే లేదంటే విస్మయపడే ఆమె ముందర అతని  ప్రసంగం వొట్టి వాచాలతేననీ మనం త్వరలోనే పసిగడతాం. పదే పదే దేనినైనా  సమర్ధించాల్సి రావడం .. అది బలంగా నాటుకోకపోవడం వల్లనే అన్న అవగాహనతో  వేణుగోపాలరావు ఇంకా రాజారావులా రాటుదేలలేదని రూఢీ చేసుకుంటాం. ఇంకా తరచి  చూసినపుడు వేణుగోపాలరావు ఎంత అసందర్భ ప్రలాపో కూడా మనకు ఇట్టే  బోధపడుతుంది. మీనాక్షీదేవి గారి సమక్షంలో ‘విష్ణుమూర్తిలాగా పవళించి’,  లోకంలో స్నేహమనేదే లేదని ఉవాచించడం, ప్రతీదీ అవసరాల కోసం చేసుకున్న  ఏర్పాటే అనడం వల్ల ఆ మాట మీనాక్షీ దేవికి కూడా తగులుతుందని, అది ఆమెను  నొప్పించి తీరుతుందన్న జ్ఞానం అతనిలో లేకపోయింది. అదే ఉన్నట్లయితే అతను  బహు నమ్మకంగా రాజారావు శివయ్యను లోబరుచుకున్నట్టుగా మాటాడి ఉండేవాడు.
ఇక్కడ కూడా వేణుగోపాలరావు తన అనుభవరాహిత్యాన్నే బయటపెట్టుకున్నాడు.  అయితే ఈ మాటలకు మీనాక్షీదేవిలో కలిగిన ప్రతిస్పందన కతాగమనాన్ని పూర్తిగా  మార్చి, కతను ఇంకొక తలంలోనికి ప్రవేశపెడుతుంది. అప్పటి వరకూ మధ్యతరగతిలో  ఉండే నమ్మకాలూ, విశ్వాసాలూ, పైకెగబాకాలనుకునే వెంపర్లాటలూ, వాళ్ళలోని  ఊగిసలాటలూ చెబుతూవచ్చిన కత, మీనాక్షీదేవి ప్రతిస్పందనతో తిరిగి  విశ్వాసాలకూ, స్నేహాలకూ లోకంలో విలువ ఉండితీరుతుందన్న మరో తలంలోనికి  ప్రవేశిస్తుంది. ఇది ఇప్పటి వరకూ కత నడచిన తలానికి, పూర్తి వ్యతిరేక  దిశలోని మరో తలం. విలువల గురించిన సంవాదంలో మానవీయమయిన ‘థీరీ’.  అందువల్లనే, మూడు రూపాయల కోసం గొంతులు కోయగల వాళ్ళున్న లోకంలో, మూడు వందల  కోసం  డాక్టరుగారు ఇట్టాంటి ‘థీరీ’ లేవదీసుంటారు లెమ్మని ఆమె చప్పున  గ్రహించగలుగుతుంది.

సామాజిక గమనంలో వ్యక్తులు ఒక దశ నుండీ ఇంకో దశకు మారుతున్నప్పుడు, పాత  స్నేహాల స్థానంలో కొత్త స్నేహాలు చోటు చేసుకుంటున్నప్పుడు, పాత సంబంధాలను  వదులుకొని కొత్త సంబంధాలను స్థిరపరుచుకుంటున్నప్పుడు వాటి సవ్యతను  సమర్దించుకోవడానికి, వ్యాఖ్యానిచడానికీ ఒక కొత్త భావజాలం అవసరం. ఇట్టాంటి  అవసరాన్ని సందర్భసహితంగా, మానవ సంవేదనలతో సహా పట్టుకున్న కత ‘స్నేహం’.  ఇది విలువల గురించిన సంవాదాన్ని ముందుకు తెస్తున్నది.

అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

–అవ్వారి నాగరాజు

(ఎ.నాగరాజుగారు ప్రకాశం జిల్లాలో టీచరుగా పనిచేస్తున్నారు. ఈయన రాసిన కవితలు, వ్యాసాలు అరుణతారలోనూ, ఒకటీ అరా ఆంధ్రజ్యోతిలోనూ వచ్చాయి. తొలినాటి రచయితలలో శ్రీపాద అంటే ఇష్టపడతారు. మానవ భావోద్వేగాలను,  అందులోని ఘర్షణను ప్రతిభావంతంగా చిత్రీకరించిన అల్లం రాజయ్య, రఘోత్తం  రచనలు అంటే చాలా ఇష్టమట. దళితవాదంతో సహా, అన్ని అస్తిత్వ వాదాలూ  పరిమితులకు లోనయ్యాయని నాగరాజుగారు అభిప్రాయపడుతున్నారు. స్త్రీవాద  రచనలను చాలా సంవత్సరాలుగా కొనసాగిస్తున్న పి.సత్యవతిగారి కథలను  మెచ్చుకున్నారు. నాగరాజుగారి బ్లాగ్ minnalpoetry.blogspot.com)

 

 

( వచ్చే వారం  ” సంకల్పం” కథ గురించి  పి. సత్యవతి గారు పరిచయం చేస్తారు)

పాలస్తీనా

అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

నిదుర రాని రాత్రి ఒకలాంటి జీరబోయిన గొంతుకతో

వొడుస్తున్న గాయం మాదిరి, పోరాడే  గాయం మాదిరి

నిస్పృహ, చాందసం ఆవల

ఎక్కడో ప్రవాసంలో తన దాయాదులనుద్దేశిస్తూ నిరాఘాటంగా దార్వేష్ పాడుతూ  ఉన్నాడు

అతడి పాట చెవిని తాకి నెమ్మదిగా లోలోనికి  చురకత్తిలా  దిగుతున్నప్పుడు

తనలాంటి, తన కవిత్వంలాంటి ఒక తల్లి

తన తొలిప్రాయపు బిడ్డను కోల్పోయిన దుఃఖంలా

వేలి కొసలకు ఎన్నటికీ చెరగిపోని నెత్తుటి మరక

సమయం ఉపవాస మాసపు తెల్లవారుజాము-

మసీదు గోపురం చివర నుండి సన్నని వొణుకుతో జాగోమని జాగురూకపరిచే సుపరిచిత గొంతుక

ఈ రోజు ఎందుకో నా ముస్లీం మిత్రులను పేరుపేరునా కలవాలనిపిస్తోంది

ఒక వ్యధామయ ప్రయాసను దాటబోతున్న వాళ్ళలా

మృగ సదృశ్య సాయుధ హస్తం ముందర నిలబడి మరేమీ లేక వుత్తిచేతులతో తలపడబోతున్నవాళ్ళలా

ఒక్కొక్కరినీ పొదువుకొని ముఖంలో ముఖం పెట్టి పుణికి పుణికి చూడాలనిపిస్తోంది

ఒకరు పుడుతూనే పరాయితనాన్నిమోస్తున్న వాళ్ళు

వేరొకరు కాలుమోపడానికి కూడా చోటులేని  శాపగ్రస్తులు

నిర్నిద్రితమైన  దేహంతో కనలుతూ  రాకాసిబొగ్గులా  ఎగపోసుకుంటూ తెల్లవారుతున్న ఈ రాత్రి

రెండు సాదృశ్యాల నడుమ రెండు ఉనికిల నడుమ అగ్ని గోళంలా దహించుకపోతున్నప్పుడు

సింగారించిన నాలుగు అక్షరాలను కాగితాలమీద చిలకరించి  కవిత్వం రాయబోను

ఉదయాలు మరణంతో కొయ్యబారి ఆకాశానికి చావు వాసన పులుముకుంటున్నట్టూ

ఒక రోజునుంచీ ఇంకో రోజుకు దాటడానికి ఎన్ని దేహాలు కావాలో లెక్కకట్టి

ఒకానొక దానిని ఇది తొలి వికెట్టని ప్రకటించినట్టూ మాత్రమే  రాస్తాను

సరిగ్గా ఇలాంటి వేకువ జాములలోనే మొస్సాద్-రా మన ఇంటి తలుపు తట్టి

ఉమ్మడి దాడులలో  పెడరెక్కలు విరగదీసి  తలకిందులుగా వేలాడదీస్తారని రాస్తాను

గాజా – కశ్మీర్  తరుచూ పొరపడే పేర్లుగా నమోదు చేస్తాను

నేల మీద యుద్ధం తప్పనిదీ, తప్పించుకోజాలనిదీ అవుతున్న వేళలలో

విరుచుకపడే ధిక్కారాన్నే పుడమికి ప్రాణదీప్తిగా పలవరిస్తాను.

-అవ్వారి నాగరాజు

పక్షి ఎగిరిన చప్పుడు

అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

దారి చెదరిన ఒక ఒంటరి పక్షి తెల్లని తన రెక్కలు చాచి

చుక్కలు కాసిన ఆకాశంలో వెతుకుతుంటుంది

ఒక దిక్కు మరొక దిక్కులోనికి ముడుచుక పడుకొనే జాము

కలయతిరిగి కలయతిరిగి

ఎక్కడ తండ్రీ నీ గూడు

నీలినీలి చీకటిలో ఎక్కడ తండ్రీ నీ తెన్ను

పగటి ఎండలో దూసర వర్ణపు వేడిలో వొదిగి వొదిగి దేహాన్ని ఏ చెట్టుకొమ్మకో వేలాడదీసి

క్రమంగా వివర్ణితమై ఒక కెంజాయ ముఖాన్ని చరుస్తున్నపుడు

నీకు గూడు గురుతుకొస్తుంది

దిగ్మండలం మీద చెదురుతున్న పొడలా దారి గురుతుకొస్తుంది

Murder_by_vhm_alex

ఆకాశపు నీలిమ కింద

చుక్కల లేవెలుతురు క్రీనీడల కింద

నీ పూర్వీకులు తిరిగిన జాడల వాసన గురుతుకొస్తుంది

నీలాగే ఇప్పటి నీలాగే తిరిగి తిరిగి లోకం ముంగిట ఒక్క స్మృతినీ మిగిల్చుకోని కఠినాతి కఠినమైన మొరటు మనుషులు

ఆకాశం నుండి నేల వరకూ అనేకానేక లోకాలను తమ నిట్టూరుపులపై నిలబెట్టిన వాళ్ళు

అలుముకపోయిన చీకటిలో ఎక్కడో వెలుతురు

అలసిన నీ రెప్పల వీవెనల కింద వూటలా చెమరింపుల చల్లని తడి

తిరిగి తిరిగి ఇక అప్పుడు

దేహపు ఆవరణలలో పసికందులా రాత్రి నిదురపోతున్నప్పుడు

రెక్కల మీద చేతులు చాచుక ఆకాశం విస్తరిస్తున్నప్పుడు

కదిలినప్పుడల్లా సలుపుతున్న నొప్పిలా పక్షి ఎగురుతునే ఉంటుంది.

-అవ్వారి నాగరాజు

‘సమైఖ్య’గీతిక అనబడు బిస్కెట్టు కవిత

అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

 

ఈ రోజు  ముఖంలో ముఖం పెట్టి

అంటోంది ప్రేమించవేం ప్రియా ?

“సమైఖ్యం” గా ఉందామని

 

ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్  గోరటోని లాగా

అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక-

 

చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ

ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి

ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి బలవంతప్ప్రేమ లాగా

 

చీచ్చీ ఒళ్ళు తెలియడంలేదు సుమీ

తలుచుకుంటే కొన్ని సార్లు ఒళ్ళు అదుపు తప్పుతుంది సుమీ

ఎండాకాలపు ఒరిపిడిలోనూ ఇగరని జీర పాటల ప్రవాహ సవ్వడి సుమీ తెలంగాణం

 

స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక! స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక!

images1

నిజంగానే ముఖంలో ముఖం పెట్టి మాటాడుదాం

రావేం ప్రియా అని బతిమాలుడుదాం

విడిపోతే ఎలా మనం అని విరహాలు పాటిద్దాం

 

కవి గాయక వైతాళికులను రమ్డోయ్ రారమ్డోయ్ అని నినదిద్దాం

ఒక ప్రణయ గీతికను రాయించి నీ కోసం ప్రత్యేకం అని కన్ను గీటుదాం

చెలియలికట్ట దాటకు చెలీ అని గొంతుక మీద కాలునలాగే కొనసాగిస్తూ మురిపెంగా బుజ్జగిద్దాం

అదీ కాక పోతే చరిత్ర తెలియదా అని శపిద్దాం

పొంగుకొచ్చే బాన కడుపులను

అల్లరిగా కాసేపు దాపెట్టి ఒక్క బిసెట్టు కూడా ముట్టలేదు సుమీ అప్పటి నుండి అని అతిశయంగా గారాలు పోదాం

 

జనం ఎటూ పైకెగయని గొంతుకలు కదా

గాలి పారాడని ఆవరణంలో ముముక్షువులై ముడుచుక పడుకున్న జెండాలు కదా

పొద్దునే లేచి లెక్కలేసుకొని జీవితాన్ని జేబిలో పొందికగా మడచి పెట్టుకో జూసే అకాల స్వప్నాలు కదా

చదువుకొని శిక్షణలు పొంది

కనీస్టూబుల్లలాంటి పంతుల్ల సాంగత్యంలో కారాగారాల్లాంటి కలల్ని కావలించుకొని పడుకొనే అర్భక ప్రాణులు కదా

 

ఇంకా ఇక  ఉద్యోగాలుండవని అరుద్దాం

నీళ్ళుండవ్ నేలుండదు చివరాఖరుకు ముడ్డి  మీద గోసి గుడ్డకూడా అని గావు కేకలు పెడదాం

జనం మీద జనాన్ని బంధిఖానా మీద బంధిఖానాను పోటీగా నిలబెడదాం

జారి పోకుందా ఉండేందుకు

అందరమూ కలిసి

సామూహిక ప్రణయ గీతిక రాద్దామని కాణిపాకం వినాయక సామ్మీద సత్యప్రమాణాలు తీసుకుందాం

 

నిజంగానే ఒక్క ప్రేమలేఖయినా రాద్దాం

కాలపు రేఖలమీద ఐక్యతను విడగొడుతూ ‘సమైఖ్యత’నొక ప్రతీకగా నిలబెడదాం

 

ఈ రోజుటి ముఖమ్మీద

తాగి పడేసిన సీసా గాజుముక్కతో వికృతంగా గజిబిజి ఒక్క ప్రేమ లేఖనయినా-

 

-అవ్వారి నాగరాజు