13 జులై 1931
సూఫీ- సంత్ సంవాద కేళి
-అవ్వారి నాగరాజు
~
సంత్ ఏక్నాథ్ ఒక రోజున స్నానమాచరించడానికి గోదావరీ నదీ తీరానికి వెళ్ళాడట. శుచిగా స్నానం చేసి తిరిగి వస్తుండగా దారి పక్కన ఉన్న ఒక ఫకీరు ఆయన మీద ఉమ్మి ఊస్తాడట. శరీరం మైల పడిపోవడంతో ఆయన తిరిగి మరోసారి స్నానానికి వెళతాడట. తిరిగి వస్తుండగా ఆ ఫకీరు మరో సారి ఆయన మీద ఉమ్మి ఊస్తాడట. ఏక్నాథ్ ఆ ఫకీరుని ఏమీ అనకుండా సహనం వహించి తిరిగి మరో సారి నదికి వెళతాడట.
స్నానం చేసి తిరిగి రావడం, ఫకీరు ఉమ్మడం – ఇలా అనేక సార్లు జరిగిన తర్వాత కూడా తనని ఏమీ పల్లెత్తు మాట కూడా అనని సంత్ సహనానికి ఆ ఫకీరు పశ్చాత్తాపం చెంది తనను క్షమించమని అడుగుతాడట. పైథాన్(ప్రతిష్టాన పురం) నివాసి అయిన ఏక్నాథుని గొప్పతనం గురించి జనసామాన్యపు నాలుకల మీద ఉన్న ఈ కథనానికి కొనసాగింపు ఉంది.
తనని క్షమించమని అడిగిన ఫకీరుకు, బదులుగా ఏక్నాథ్- మీరు చేసిన ఈ పని వల్లనే పవిత్రమైన ఈ గోదావరీ నదిలో అనేక మార్లు స్నానం చేసే భాగ్యం నాకు కలిగిందని అంటాడట. సంత్ ఏక్నాథునితో ఫకీరు జరిపిన ఈ సంవాదాన్ని సంత్ అనుచరులు ఇద్దరు మహాత్ములు జరిపిన దివ్య కేళీ కలాపంగా వివరిస్తుంటారు.
సంత్ గొప్పదనాన్ని ప్రపంచానికి వెల్లడి చేసేందుకు ఫకీరుగా తన పాత్రని పండించిన వ్యక్తి సిద్ధి ఆలీబాబా. ప్రముఖ సూఫీ గురువు. ఆయన అప్పుడు- మీ మీద ఇన్ని సార్లు ఉమిసాను కదా, బదులుగా ప్రాయశ్చిత్తం చెప్పమంటాడట. నా పుట్టిన రోజునాడు నా భక్తులు చేసే ఉత్సాహాల సందోహంలో, వారి కాలికింద రేగిన దుమ్ము నీ దర్గాపై పడుతుంది పో. అదే నీకు ప్రాయశ్చిత్తం అని సంత్, బాబాని సముదాయిస్తాడట.
సంత్ పుట్టిన రోజు ఉత్సవాలలో పాల్గొనే భక్తులు, దారిలో ఉన్న సిద్ధి ఆలీ బాబా దర్గాను చూసి ఈ కథనాన్ని తలుచుకోవడం ఇప్పటికీ వాడుకలో ఉంది.
జనం వాడుకలో ఉన్న ఈ కథనాలు భక్తి ఉద్యమాన్ని గురించి మనకు సంకేత ప్రాయంగా రెండు విషయాలని తెలియజేస్తున్నాయి. పదమూడవ శతాబ్ధి చివరి వరకూ తెర వెనుకగా ఉన్న ఇస్లామ్- సూఫీ ప్రభావాలు ఉత్తర భారత దేశంలో పద్నాలుగ శతాబ్ధం నుండీ ప్రత్యక్షంగా అయిపోయాయి. ఈ రెండూ పరస్పరం జరుపుకున్న ఆదానప్రధానాలు పైన చెప్పిన కథనంలో మాదిరిగా ఎదురెదురుగా నిలుచున్న సూఫీ, సంత్లు జరిపిన సంవాదకేళిలాగా మారిపోయాయి. అలాగే, పైన చెప్పిన కథనంలో మాదిరిగా సాధికారికమైన మత తాత్వికతకు ప్రత్యామ్నాయమైన విశ్వాసాలూ, ఆచరణా కలగలిసిన సాంస్కృతిక ఆవరణాన్ని భారత దేశ మధ్యయుగాలకు ఇవి అందివ్వగలిగాయి.
ఇలాంటి సాంస్కృతిక వాతావరణం నుండే ఉత్తర భారతదేశపు భక్తి ఉద్యమం అభివృద్ధి చెందింది.
ఙ్ఞానేశ్వర్, నామదేవ్, కబీర్, రాయ్దాస్, నానక్, దన్నా, దాదూ, ఇంకా ఒరిస్సాలోని పంచసఖులు, తుకారాం, చైతన్యుడు, మీరా- ఇలా వీరందరూ ఉత్కృష్టమైన సాంస్కృతిక పర్యావరణానికి ఉదాహరణలు. వీరు ఇస్లాం, సూఫీల ప్రభావానికి ప్రత్యక్షంగా లోను కావడమే కాకుండా, తమ కాలపు మత ఆచరణలలోని చెడులను తీవ్రంగా విమర్శించారు కూడా. నామదేవ్ విగ్రహాలను పూజించడాన్ని అపహాస్యం చేస్తాడు. హిందూ-ముస్లీంల నడుమ సయోధ్యను ఏర్పర్చడానికి కృషి చేస్తాడు. కబీర్ ఇటు బ్రాహ్మనీయ హిందూ మతంలోనూ,ఇస్లాంలోనూ ఉన్న అతిని ఖండిస్తాడు. నానక్ మరో అడుగు ముందుకు వేసి ఒక విశ్వాసానికి ఎదురుగా మరో విశ్వాసం నిలబడి ఉన్నప్పుడు వాటి మధ్య సయోధ్య కుదరదని అంటాడు. ఈ రెండింటినీ విడిచి సిక్కుమతాన్ని స్థాపిస్తాడు. ఆయన మహ్మద్ ప్రవక్త జీవితం నుండీ ప్రేరణ పొందినట్టుగా చెప్పుకున్నాడు. సూఫీలవలే గురు పరంపరను ఏర్పరచి గురుస్థానాన్ని మార్గదర్శకంగా చేస్తాడు. ఒరిస్సాలోని పంచసఖులు భారత, భాగవత, రామాయణాలను ఒడియాలోకి అనువాదం చేసి భక్తి మార్గాన్ని సుస్థిరం చేసారు. చైతన్యుడు సంకీర్తనామార్గాన్ని అవలంభించాడు. మీరా రాబియా వలే భగవంతునిలో సఖుడిని వెతుక్కుంది.
ఒక భక్తి ఉద్యమ కవినీ లేదా సంత్నీ అధ్యయనం చేయడానికి వారి స్థానిక సాంస్కృతిక వాతావరణం, వారి వాఙ్మయ సారస్వతం గొప్ప ఆధారాలుగా ఉపయోగపడతాయి. వాటిని ఆధారంగా వారు తమ కాలపు సామాజిక చలనంలో ఎక్కడ నిలబడి ఉన్నారో, వారు తమ కాలానికి చెందిన లక్షణాలను ఎలా ప్రతి ఫలించగలిగారో మనం అధ్యయనం చేయవచ్చు.
మధ్య యుగాల నాటి ఉత్తర భారత దేశంలో ఉన్న సాంస్కృతిక వాతావరణం మునపటికన్నా మరింత కాంతివంతంగా మారడానికి బయటి నుండీ జరిగిన దండయాత్రలూ,ముస్లీంల రాజ్య స్థాపన దోహద పడ్దాయి. సామాజిక స్థితిగతులలో కుదపూ ఏర్పడింది.ఈ కుదుపుకు అనుగుణంగా సమాజంలో సర్దుబాట్లు జరగాల్సిన అవసరం ఏర్పడింది. గుప్తుల కాలం నాటికి బయటి ప్రాంతాల నుండి వచ్చిన శకులు, హుణులు లాంటివారు ఇక్కడి స్థానిక సమాజంలో భాగమయ్యారు. అలాగే స్థానిక ఆదివాసీ తెగలు ప్రధాన స్రవంతిలో భాగమయ్యి రాజపుత్రులుగా, వివిధ కులాలుగా స్థిరపడ్డారు. సరిగ్గా అలాంటి సామాజిక మార్పులే ముస్లీం రాజ్య స్థాపనల వల్ల మరోసారి ఏర్పడాల్సిన పరిస్థితులు వచ్చాయి.
ఈ రకమైన సామాజిక మార్పులు వ్యక్తమవడానికి ఇస్లాం-సూఫీ తాత్వికతలు ఈ కాలంలో ఎంతగానో దోహద పడ్డాయి.
సాధికార మత తాత్వికతలు, కొత్తగా తమ చారిత్రక పాత్రని నిర్వహించడానికై ఉబికి వస్తున్న ప్రజా సమూహాలకు గొప్ప అడ్డంకులుగా ఉండడం వల్ల వాటిని తోసివేసే మత విశ్వాసాలూ, ఆచరణలే మధ్య యుగపు తాత్విక భూమికలయ్యాయి. ఇవి అటు బ్రాహ్మణీయ హిందూ మతానికీ, ఇమాంలు ప్రవచించే ఇస్లాంకూ సవాల్గా నిలబడ్డాయి. ఈ చారిత్రక ఘట్టం భక్తి ఉద్యమంగా పిలవబడడానికి బహుళత్వానికి పీట వేసే వివిధ సంప్రదాయాలు, సూఫీల కృషీ పునాదులుగా దోహదపడ్దాయి. సూఫీలు తమను తాము ఇస్లాంలో విడదీయరాని భాగంగా చెప్పుకుంటూ ఈ కృషిలో పాలు పంచుకున్నారు.
ఉత్తర భారతంలో భక్తి ఉద్యమ కాలపు సాంస్కృతిక వాతావరణాన్ని మనం తిరిగి సంత్ ఏక్నాథ్ నుండే ఉదహరించవచ్చు. ఏక్నాథ్ దక్కన్లో భాగమైన మహారాష్ట్ర ప్రాంతపు బ్రాహ్మణుడు. ఆయన పదహారవ శతాభ్ది చివరి అర్థభాగానికి చెందిన వాడు. ఆయన పుట్టిన పైథాన్ పట్టణం ప్రతిష్టానపురం పేరుతో చరిత్రలో శాతవాహనుల ఏలుబడిలో ఉండేది. మహారాష్ట్రలో వర్కారీ సంప్రదాయానికీ ఆలంబనగా ఉన్న విఠోబా విగ్రహాన్ని విజయనగరం నుండీ వెనక్కి తీసుకొని వచ్చి పండరీపురంలో పునఃస్థాపించిన భానుదాసు ఈయన పూర్వీకుడు. దేవగిరి దౌలతాబాద్గా మారడానికి పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన యాదవులు మరాఠీ భాషాభిమానులు. నిజాంషాహీల పాలన ఇక్కడికి వచ్చే నాటికి పైథాన్ పట్టణం గొప్ప విద్యా, వాణిజ్యకేంద్రం.
ఏక్నాథ్ తండ్రి సుల్తాన్ వద్ద వజీరుగా పని చేసే ఒక బ్రాహణుడికి గురువు. ఆ రకంగా వారి కుటుంబానికి ఇటు పైస్థాయి అధికార వర్గంతోనూ, భక్తి సంప్రదాయంతో మమేకమయ్యే సాధారణ ప్రజానీకంతోనూ దగ్గరి తనం ఉండేది. ఏక్నాథ్ను విద్యనభ్యసించడానికి దౌలతాబాద్లో ఉన్న ఒక బ్రాహ్మణుడి వద్దకు ఆయన తండ్రి పంపుతాడు. ఆయన దౌలతాబాద్ కోటలో పని చేసే ఒక అధికారి(ఖిల్లేదార్). దౌలతాబాద్కు జంటనగరంగా ఉన్న ఖుల్దాబాద్ ఏక్నాథ్ కాలం నాటికే ప్రముఖ సూఫీకేంద్రం. ఏక్నాథ్కు విద్యను నేర్పే గురువును ఆశీర్వదించడానికి అప్పుడప్పుడూ ఆయన ఇంటికి ఒక సూఫీ ఫకీర్ వస్తూ ఉండేవాడు. అంటే ఏక్నాథ్ గురువుకు గురువు ఒక సూఫీ ఫకీర్ అన్నమాట.
ఊహించడానికి కూడా సంభ్రమాన్ని కలిగించే ఇలాంటి చిత్రమైన సామాజిక వాతావరణం ఏక్నాథ్ను మహారాష్ట్రలో ఏ విధంగా ప్రముఖమైన సంత్గా మార్చి వేసిందో దాదాపుగా అలాంటి సామాజిక పర్యావరణమే ఉత్తర భారత దేశంలోని భక్తి ఉద్యమకారులమీదా భక్తి ఉద్యమం మీదా ప్రభావితమై అంతటా తానై అయి నడిపించింది.
ఇలాంటి చిత్రమైన సామాజిక పర్యావణం ఏర్పడడానికీ, వాటిని అందిపుచ్చుకొనే సామాజిక శక్తులు ఏర్పడడానికి ప్రధాన కారణాన్ని సామాజిక చరిత్రకారులు పైకి ఎదిగి వస్తున్న కులాల అస్తిత్వ చైతన్యం నుండి వివరిస్తున్నారు. ఈ వివరణను దక్షణాదిన భక్తి ఉద్యమం ప్రారంభమయ్యే నాటి కాలానికి కూడా వీరు వర్తింప చేస్తున్నారు. గుప్తుల పతనానంతరం స్థిరమైన, విశాలమైన రాజ్యాలు దక్షణాదినే ఏర్పడడంతో పాటుగా, చాప కింద నీరులాగా ఇస్లాం- సూఫీల ప్రభావం కూడా పని చేయడం వల్ల ఇక్కడ నూతనంగా ఆవిర్భవిస్తున్న సామాజిక శక్తులకు ఒక దారి దొరికినట్లయింది. నయనార్లతో భక్తి ఉద్యమం స్పష్టమైన రూపం తీసుకున్నదని అనుకున్నట్లయితే, సంగం యుగం కాలం నుండీ ఎనిమిదవ శతాబ్ధం వరకూ కొనసాగిన ఈ సంప్రదాయపు సాహిత్యం పదవ శతాబ్ధానికి గానీ క్రోడీకరింపబడలేదు. పదవ శతాబ్ధంలో క్రోడీకరింపబడిన ఈ సాహిత్యపు ఉనికిలోనూ, ప్రత్యేకించి ఎంపిక చేయబడిన అరవైమూడుమంది నయనార్ల పేర్లలోనూ ఈ అస్తిత్వ చైతన్యమే పని చేసిందని వీరు వివరిస్తున్నారు. ఆళ్వార్లుగా ప్రసిద్ధిపొందిన వారికీ ఇది వర్తిస్తుంది.
భక్తి ఉద్యమం- అది కొనసాగిన కాలం దృష్ట్యా, అది వ్యాపించిన భౌగోళిక ప్రాంతం దృష్ట్యా చాలా విస్తృతమైనది. నూతనంగా ఎదిగి వస్తున్న సామాజిక శక్తులకు ఉనికికి అది ఒక తాత్విక వ్యక్తీకరణగా ఎట్లా ఉపయోగపడిందో, సమాజంలోని ప్రధాన స్రవంతితో, ఆధిపత్య భావజాలంతో సర్దుబాటు చేసుకోవడానికి కూడా అంతగానే ఉపకరించింది. సాధికారికమైన భావజాలాలతో పేచీ పడడానికి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించడానికి అది ఎలా కారణమైందో అలాగే తిరిగి మరో కొత్త సాధికారిక భావజాల కేంద్రాల స్థాపనకు అది దోహదమయింది. ఘర్షణ-ఐక్యతా చరిత్ర చోదక సూత్రాలుగా ఎలా పదేపదే ప్రకటితమవుతూ వచ్చాయో అదే విధంగా సాధారణీకరణ-వైవిధ్యమూ భక్తి ఉద్యమ కాలపు లక్షణాలుగా వ్యక్తమవుతూ వచ్చాయి.
ఇంత సంక్లిష్టత ఈ కాలపు లక్షణంగా ఉన్నందువల్ల భక్తి ఉద్యమం సామాజిక శాస్త్రవేత్తలకు గొప్ప అధ్యయన వనరయింది. సామాజికంగా ఉన్న కుల వివక్షలను స్థూలంగా పక్కకు నెట్టడం, బౌద్ధిక వ్యక్తీకరణలకు కేంద్రంగా ఉన్న సంస్కృత ఆధిపత్యాన్ని తోసివేసి స్థానిక భాషలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం, దైవం గురించి, ఆరాధనా సంబంధమైన కర్మకాండలకు సంబంధించి పై కులాలకు మాత్రమే అర్థమయ్యే విధంగా ఉన్న మత తాత్విక విధానాలను కిందికి దించి జన సామాన్యానికి అర్థమయ్యే ఉద్వేగ సంబంధమైన ఆచరణలలోనికి తీసుకరావడం, దేవుడిముందు రాజూ-పేదా అందరూ సమానమనే భావనలను తేవడం భక్తి ఉద్యమకాలపు సాధారణ వ్యక్తీకరణలు. భక్తి ఉద్యమ కవులు, యోగులందరిలోనూ ఈ లక్షణాలను మనం చూడవచ్చు.
అయితే సామాజిక శాస్త్రవేత్తలకు ఈ సాధారణించబడిన లక్షణాలకన్నా, భక్తి ఉద్యమంలోని వైవిధ్యమూ, బహుళత్వమే మరింత ఆసక్తికరమైన అంశాలుగా కనపడుతున్నాయి. సగుణ-నిర్గుణ వంటి విభజనల ఆధారంగా ఉత్తర భారతంలోని భక్తి ఉద్యమం గురించి స్థూలంగా కొన్ని సాధారణీకరణలను చేయడానికి కొందరు చరిత్రకారులు ప్రయత్నించారు. అయితే ఈ విభజనకూడా స్థూలమైనదే కానీ ఏ ఆచరణనూ పూర్తిగా సమగ్రంగా చెప్పడానికి పనికి వచ్చేది కాదు. భక్తి ఉద్యమాన్ని ఇలా సాధారణీకరించడానికి ప్రయత్నించిన ప్రతీ సారీ , దాని లోపలి నుండే పొడ చూపే భిన్నత్వం చరిత్రకారులకు నిరంతర సవాల్గా ఉండేది. ఒక ఆచరణ నిర్దిష్టమైమైన స్థల కాలాల పరిమితుల్లో వివిధ సామాజిక శ్రేణులమధ్య వ్యాప్తిని పొందేటప్పుడు ఆయా ప్రజానీకపు అస్తిత్వ అవసరాలకనుగుణంగా అది నిరంతరంగా మార్పులకు గురికావడమే దీనికి కారణం . ఈ మార్పులు ఎంతగా తీవ్రంగా ఉంటాయంటే, అవి దాని తొలి రూపానికి ఏమాత్రమూ పొంతనలేని ఒక కొత్త మత ఆచరణలోకి మార్చేసేవి. బసవుని వీరశైవం నుండీ వివిధ పంథాల వరకూ వీటిని మనం గమనించవచ్చు.
సగుణ భక్తి భగవంతునికొక రూపాన్ని ఇచ్చి స్తుతిస్తుంది. నిర్గుణ భక్తి భగవంతుని నిరాకారునిగా చూస్తుంది. సగుణ భక్తి కన్నా నిర్గుణ భక్తి ప్రగతి శీలమైందనీ, ఇది సాధికారిక మత సంప్రదాయాలను నిర్ద్వంధ్వంగా తోసివేసిందనీ సామాజిక చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా నిర్గుణ భక్తికి కబీర్ను, సగుణ భక్తికి తులసీ దాస్ని వీరు చెబుతారు.
బసవని తర్వాత కబీర్ అపురూపమైన వ్యక్తిగా మనకు కనపడతాడు. సాధికారికమైన మత ఆచరణలను కబీర్ తన రచనల ద్వారా ఆవలికి నెట్టివేస్తాడు. తన జీవిత కాలమంతటా మగ్గం నేసి జీవిస్తూ, సాధారణ ప్రజానీకానికి సాధ్యంకాని సన్యాసి-ఫకీర్ ఉదాహరణలకు భిన్నమైన పంథాగా ఆయన జనానికి అందుబాటులో ఉంటాడు. ఆయన సారస్వతం పూర్తిగా మౌఖికమైంది. తర్వాత అది గ్రంథస్తమైనా మౌఖిక సంప్రదాయమే ఆయన విధానం. ప్రజలు పాడుకొనే భాషలో, వారికి అర్థవంతంగా ఉండే ఆయన ధోరణి సాధికారికమైన పుస్తక కేంద్రక విధానానికి వ్యతిరేకమైనది. ఆయన చెప్పే రాముడు దశరథకుమారుడూ, సీతాపతీ అయిన రాముడు కాదు. అంతకు మించి దశావతారాలలో ఒకడైన పురాణ పురుషుడూ కాదు. వీటన్నింటికీ విరుద్ధంగా ఆయన నిరాకారి. అనంత ప్రేమా మూర్తి. రాముడనేది భగవంతుడికి కబీర్ పెట్టిన పేరు మాత్రమే. అందుకే కబీర్ భగవంతుడిని రాముడిగా కీర్తించిన సూఫీగా మనకు కనపడతాడు. దీనివల్లనే కబీర్ శిష్యులలో అసంఖ్యాకంగా కింది కులాలవారూ, ముస్లీంలూ కూడా మనకు కనపడతారు.
సగుణ భక్తుడైన తులసీదాస్ దీనికి భిన్నంగా రాముడిని పురాణ పురుషుడిగా,దశావతారాలలో ఒకనిగా రామచరిత మానస్లో రాస్తాడు. గ్రంథానికీ, బ్రాహ్మణాధిక్యతకూ చోటిచ్చి పునరుద్ధరణ వాదానికి దోహదపడతాడు.
ఒక వైపు మౌఖిక సంప్రదాయంలో భక్తి వ్యాపిస్తూ ఉండగా, ఈ కాలంలోనే మరొక వైపు సంస్కృత మత గ్రంథాలు, భారత, భాగవత, రామాయణాలు స్థానిక భాషలలోకి అనువాదం అయ్యాయి. ఇవి మూలానికి పూర్తిగా లోబడి ఉండక ఆయా భాషలలో స్వతంత్రమైన వైఖరులను తీసుకున్నాయి. బ్రాహ్మణీయ విలువలను, ఆధిక్యతనూ స్థాపించడానికే ఇవి ఆయా భాషలలో రాయబడ్డాయని విమర్శకు గురయినా అప్పటి ఆధిపత్య భాష అయిన సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా స్థానిక భాషలను ముందుకు తేవడానికి ఆయా కవులు పెద్ద యుద్ధమే చేసారు. ఏక్నాథ్ మరాఠీలో భాగవతపురాణాన్ని రాయడం కోసం తన కొడుకు నుండే వ్యతిరేకతని ఎదుర్కొన్నాడు. తనకంటే చాలా ముందుగానే ఙ్ఞానేశ్వర్ మరాఠీలో రాసే సంప్రదాయాన్ని ఆరంభించినప్పటికీ ఆయనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా భక్తి ఉద్యమ కవులు స్థానిక భాషలను ముందుకు తెచ్చి పెద్ద తిరుగుబాటునే చేసారు.
ఒక వైపు తిరుగుబాటూ, మరో వైపు పునరుద్ధరణ పక్కపక్కనే, ఒక దాని వెంట ఒకటిగా కొనసాగడం భక్తి ఉద్యమ కాలానికి సంబంధించిన ప్రధాన లక్షణం. ఈ విచిత్రమైన స్వభావాన్ని సామాజిక చరిత్రకారులు గ్రామ్స్కీ ప్రతిపాదించిన “హిస్టారికల్ బ్లాక్” (historical block) భావన ద్వారా వివరిస్తున్నారు.
సమాజంలోని వివిధ శ్రేణులు తమ అవసరాల కోసం, అస్తిత్వం కోసం ఉనికిలో ఉన్న సాధికర భావజాలాలతో, నిర్మాణాలతో తిరుగుబాటును ప్రకటించి పోరాడతాయి. ఈ క్రమంలో అవి తమవయిన తాత్విక సామాజిక భావజాలాలను ప్రత్యామ్నాయంగా ముందుకు తెస్తాయి. అయితే అవి తమ గమనంలో ఒక సంతృప్త స్థితికి చేరుకున్న తర్వాత ఇదివరకటి తిరుగుబాటును పక్కన పెట్టి ప్రధాన స్రవంతిలో భాగమవుతాయి. సమాజగమనం గురించిన ఈ సత్యాన్ని గ్రామ్స్కీ “హిస్టారికల్ బ్లాక్” భావనలో వివరించాడు.
భక్తి ఉద్యమంలోని తిరుగుబాటు-పునరుద్ధరణ లేదా సర్దుబాటులను మాత్రమే కాకుండా సమకాలీన సమాజంలోని వివిధ ఉద్యమాలు, ధోరణుల గమనాలను అర్థం చేసుకోవడానికి కూడా ఈ భావన బాగా ఉపయోగపడుతుంది.
ఆధారం:
1. Sufism, An introduction-Farida Kahanam
2.Rabia As Mystic, Muslim And Woman- Barbara Lois Helms
3.Influence Of Islam ON Indian Culture- Tarachand
4. Vaishnavism, Saivism And MInar Religious Systems- R.G. Bhadarkar
5.Contextualizing The Past, The Saint And His Environment -Dusan Deak
6. Challenging Gender And Sexuality Norms Through Devotion: Bhakti And Sufi Writings- Srishti Nayak
మానవ హృదయం చేసిన తిరుగుబాట్లు!
చేర రాజు పెరుమాళ్కు ఒక చిత్రమైన కల వొచ్చిందట.
ఆ కలలో అర్థచంద్రాకృతిలో ఉన్న చంద్రుడు రెండుగా చీలిపోయినదట. ఆ కలకు భావమేమిటొ కనుగొనాలని రాజు తన ఆస్థానంలోని పండితులందరినీ అడిగి చూసాడట. కానీ వారు ఇచ్చిన వివరణలేవీ అతనికి సంతృప్తినివ్వలేదట. అంతలో అతని సమాచార బృందం అతనికి, ఒక అరబ్ నావికుల బృందం తమ తీరం మీదుగా ప్రయాణిస్తున్నదనీ, ఆ ఓడలో అనేక మంది వర్తకులతో పాటుగా మత ధార్మికవేత్తలు కూడా ఉన్నారని ఆయనకు సమాచారమిచ్చిందట. రాజుకు అంతకు ముందే ఇస్లాం మత ధార్మిక వేత్తల పాండిత్యం గురించి పరిచయం ఉన్నది కాబట్టి, వారిని కూడా అడిగి చూతామని ఆలోచన కలిగిందట. రాజు తలిచినదే తడవుగా ఆ పండితులను ఆయన ముందర హాజరు పరిచారట.
అపుడు వారు రాజు చెప్పిన కలను సావధానంగా విని అది ఒక మార్మికమైన వృత్తాంత్తంగా, మహ్మద్ ప్రవక్త పిలుపుగా ఆయనకు తెలియ జేసి వెళ్ళిపోయారట. అపుడు రాజు ఏకాంత మందిరంలో తన ఆంతరంగికులతో చింతన చేసి, తన రాజ్యాన్ని కొన్ని భాగాలుగా చేసి, అర్హులైన వారి నాయకత్వం కింద అప్పగించి మహ్మద్ ప్రవక్తను కలిసేందుకు మదీనాకు తరలిపోయాడట. మహ్మద్ ప్రవక్త సాంగత్యంలో ఆయన అక్కడే ఇస్లాంను స్వీకరించాడట. అటు తర్వాత అక్కడ కొంత కాలం గడిపి, తిరిగి వస్తూ ఉండగా అనారోగ్యంతో ఒమన్లోని సలాలహ్ వద్ద దేహాన్ని విడిచాడట.
భారత దేశ తాత్విక చింతనలో ఇస్లాం ప్రభావాన్ని తెలిపే గాధలలో ఇది ఒకటి. చేరమాన్ రాజు ఉనికి, అతని కాలమూ, అతను కాంచిన అద్భుతమైన కల, అతను చేసిన ప్రయాణము – మొదలైన వాటిపై చరిత్రకారులలో వాదవివాదాలు ఉన్న మాట వాస్తవమే. రాజు మదీన వెళ్లిన మాట నిజమే కానీ ఆ ప్రయాణం పక్కా వ్యాపార లావాదేవీలకు సంబంధించిందిలెమ్మని చెప్పే వాళ్ళూ ఉన్నారు. కానీ అతని రాజధాని కొడంగుళ్ళూరు (కేరళ)లో మాత్రం అతని పేరు మీద ఒక మసీదు వెలసింది. ఇది భారత దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మసీదులలో ఒకటిగా గుర్తింపబడింది. క్రీశ 629నుండీ ఇది ఇక్కడి నేల మీద ఒక చారిత్రక సంగమంగా సమున్నతంగా నిలబడి ఉంది.
ఈ నేలమీదకు ఇస్లాం రాక నిజంగా చారిత్రక సంగమమే. అది మనకు పరిచయంలేని నియో ప్లాటినిజం, యూదు, క్రైస్తవ వంటి అనేక తాత్విక భావధారలనూ, మత సాంప్రదాయాలనూ, ఆచారాలనూ, ధిక్కారాలనూ తనలో కలగలుపుకొని ఈ నేలమీదకు మోసుకొని వచ్చింది. ఇస్లాం, సూఫీల రూపంలో ఆయా తాత్విక భావ దారలు ఇక్కడ పాదుకొని, నేల నాలుగు చెరుగులా ప్రవహించి, ఇక్కడి మట్టిలోనికి ఇంకి “సంగమం” అనే మాటకు విన సొంపయిన అర్థాన్ని తెచ్చిపెట్టాయి. సరిగ్గా ఈ అర్థం నుండే, సహజీవన విలువలను ప్రస్తుతిస్తూ తాత్వికుడూ, కవీ అయిన షాజాహాన్ కుమారుడు దారాషికోహ్ తన సూఫీ తాత్విక గ్రంథానికి “రెండు సముద్రాల సంగమం” అని పేరు పెట్టాడు.
రాబియా గురించి మార్గరేట్ స్మిత్ అనే మతతాత్విక విమర్శకురాలి విమర్శను పూర్వ పక్షం చేస్తూ, లూయిస్ మాసింగ్సన్ “సంగమం” (కాన్ఫ్లుయెన్స్) అనే మాటను ఉపయోగించాడు. ఏదైనా ఒక కొత్త ధోరణి లేదా విశ్వాసం ఉనికిలోకి వచ్చినపుడు దానిని ఒక మతానికీ మరో మతానికీ అంటుకట్టకుండా(హైబ్రిడైజేషన్), ఆయా మత భావాల పుట్ట్టుక, పరిణామాలతో పాటుగా ఆయా స్థల కాలాల నాటికి ఉనికిలో ఉన్న ఇతర ప్రాభావికమైన అంశాలను కూడా పరిగణనలో తీసుకోవాలని చెబుతూ, ఈ విషయాలను సూఫీయిజం పుట్టుకకు అన్వయించి చెబుతాడు. మన దేశంలోని మత సాంప్రదాయాలతో సూఫీ, ఇస్లాంల పారస్పరిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటించాల్సి ఉంటుంది.
భారత దేశంలో ముస్లీం పాలన ఏర్పడక ముందునుండే దేశ దక్షణ కోస్తాకు అరబ్, పర్షియా, ఈజిప్టు, ఇతర మధ్యప్రాచ్య ప్రాంతాలకు చెందిన ముస్లీంలతో సంబంధ బాంధవ్యాలున్నాయి. భారత దేశానికి ఇస్లాంతో ఏర్పడిన సంబంధాలను చరిత్రకారులు మూడు రకాలుగా వివరిస్తున్నారు. దేశ దక్షణ కోస్తా పశ్చిమ ప్రాంతానికి ఇస్లాం ఆవిర్భావానికి ముందు నుండే ఆయా దేశాల వర్తకులు రాకపోకలు సాగించేవారు. ఇస్లాం ఉనికిలోకి వచ్చాక వర్తకులతో పాటుగా మిషనరీలు కూడా ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలతో సంబంధాలను ఏర్పరుచుకున్నారు. స్థానిక ప్రజలలో భాగంగా కలిసిపోయారు. మోపిల్లాలు దీనికి ఉదాహరణ. దీనికి తోడుగా ఉమయ్యాడ్ల కాలంలో సింధ్ ప్రాంతంమీదకు చేసిన దాడులు, ఆక్రమణలు స్థానిక ప్రజలకు ఇస్లాంను, సూఫీలను పరిచయం చేసాయి. ఈ రెంటితో పాటుగా క్రమ పద్ధతిలో పదవ శతాబ్ధం నుండి చేసిన దాడులు, వలసలు, రాజ్యాల స్థాపన, వీటికి తోడుగా పదమూడవ శతాబ్ధంలో మంగోలుల దండయాత్రల వల్ల ముస్లీం ప్రాభల్య ప్రాంతాలు స్థిరత్వాన్ని కోల్పోయి అనేకమంది ఇస్లాం పండితులు, సూఫీలు ఢిల్లీ సుల్తానుల ఆశ్రమాన్ని కోరి ఢిల్లీని చేరడం, ఆక్కడ నుండీ వివిధ ప్రాంతాలలో స్థిర పడడ-. ఈ సంఘటనను చరిత్రకారులు కాన్స్టాంట్నోపిల్ పతనంతో పోలుస్తున్నారు.
దేశ దక్షణ కోస్తా పశ్చిమ ప్రాంతం మిగిలిన అన్ని ప్రాంతాల కన్నా ముందుగా ఇస్లాం ప్రభావానికి గురి కావడం వల్ల దాని మతతాత్విక వ్యక్తీకరణలలో అది గొప్ప కుదుపుకు లోనయ్యింది. ఇది భక్తి ఉద్యమం రూపంలో ఇక్కడ వ్యక్తమయ్యింది. మధ్య యుగాల సామాజికమార్పులకు ఈ ప్రాంతం వేగుచుక్కగా నిలిచింది.
ఈ ప్రాంతంలో ఇస్లాం వచ్చే నాటికి వివిధ తెగల, జాతుల సాంస్కృతిక మతపర సంకేతాలు ఒక దానితో మరొకటి ఘర్షణ, ఐక్యతలను పొంది సరికొత్త దేవుళ్ళూ, మత సంకేతాలూ ఏర్పడ్డాయి. కుల వ్యవస్థ స్థిరపడింది. మతాలు వ్యవస్థీకరణ రూపాన్నిపొంది బ్రాహ్మణీకరింపబడ్డాయి. బౌద్ధ, జైన మతాలు అనేక చీలికలుగా మారి తమ ప్రభావాన్ని చూపెడుతున్నాయి. అయితే ఏకేశ్వరారాధన ఇంకా బలపడలేదు. ఒకే దేవుని కింద మత విశ్వాసాలు బలాన్ని పుంజుకోలేదు. ఒకే దేవుడి గురించిన భావనలు ఉపనిషత్తులలోనూ, వేదానంతర సాహిత్యంలోనూ కనిపించినప్పటికీ అవి తాత్విక పరిభాషలోనూ, తర్కపరమైన చర్చల్లోనూ ఉంటూ, సమాజంలోని పైస్థాయి పండిత చర్చలుగానే ఉండిపోయాయి. అంతేగానీ సామాన్య ప్రజల వ్యక్తీకరణలుగా అవి పాదుకోనలేదు. ఈ అంతరం సమాజంలోని ప్రజల మధ్య ఉన్న సామాజికార్ధిక విభనను సూచిస్తున్నది. వేదకాలపు కర్మకాండకు వ్యతిరేకంగా వచ్చిన బౌద్ధ, జైన మతాలు నాస్తిక మతాలుగా ప్రజలకు పరిచయమయ్యాయి. బౌద్ధం అటు తర్వాత మహాయాన బౌద్ధంగా మార్పు చెంది, బుద్ధున్ని దేవునిగా మార్చినప్పటికీ అది వేడుకలు, ఉత్సవాలకు ఆలవాలమై కేవలం విగ్రహారాధానను మాత్రమే మిగుల్చుకున్నది. అందువల్ల అప్పటి సామాన్య ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు సరిపోయేదిగా కాలేక పోయింది. ఇస్లాం ఈ లోటును పూరించేందుకు తగిన దన్నును అందించగలిగింది.
ఇస్లాం సాధారణ ప్రజల వ్యక్తీకరణకు ఒక అంతఃస్రవంతిగా ఇక్కడ పని చేయగలగడానికి ఇక్కడి సామాజిక రాజకీయ పరిస్థితులు కూడా దోహదపడ్డాయి. హర్ష సామ్రాజ్య పతనానంతరం దేశ మొత్తం మీద ఇక్కడే సుస్థిరత కలిగిన రాజ్యాలు ఏర్పడ్డాయి. చేతి వృత్తులు, వాణిజ్యం వృద్ధిచెందాయి. వృత్తినిపుణులు, చిన్న చిన్న వర్తకులు సమాజంలో తమ స్థానాలను తాము గుర్తించగలిగే స్థితికి చేరుకున్నారు. ఈ స్థితిలో వారి వ్యక్తీకరణకు సరిపోయే మతం కావలిసి వచ్చింది. ఇది భక్తి ఉద్యమ రూపంలో ముందుకు వచ్చింది.
భక్తి ఉద్యమం శూద్రుల వ్యక్తీకరణ. అది బ్రాహ్మణియ వ్యక్తీకరణలకు పూర్తిగా భిన్నమైనది. భక్తి అనే భావన భగవద్గీతలోనూ, శ్వేతాశ్వతరోపనిషత్తులోనూ, మహాయాన బౌద్ధంలోనూ అప్పటికే ఉన్నప్పటికీ సారంలో భక్తి ఉద్యమ కాలపు భక్తికీ దీనికీ చాలా అంతరం ఉంది. భక్తి భావన వేదాలలోనూ, ఉపనిషత్తులలోనూ కూడా ఉందని కొందరు అంటుంటారు. కానీ వేదాలలోని భక్తి కర్మకాండనుంచీ వేరు చేయలేనిది. కాగా భక్తిఉద్యమ కాలపు భక్తి ఏకేశ్వరారాధనతో ముడిపడి ఉన్నది. అది కర్మకాండ ప్రధానమైనది కాదు. ఉపనిషత్తులలోనూ, వేదానంతర సాహిత్యంలోనూ ఉన్న భక్తి ఙ్ఞానంతో ముడి పడి ఉంటుంది. అది అవ్యక్తిగతంగానూ, భావోధ్వేగరహితంగానూ, తాత్విక పదబంధాలతోనూ ఉంటుంది.
భక్తి ఉద్యమం ప్రతిపాదించిన భక్తి దేవుని ముందర భక్తులందరినీ సమానం చేసింది. ఇది బౌద్ద్ధ, జైనాలలో కూడా ఉన్నప్పటికీ కుల అసమానతలను తుడిచివేయగలగిన తీవ్రమైన ఆవేశిత మిలిటెంట్ స్వభావం ఇస్లాం ప్రభావం నుండే భక్తి ఉద్యమం పొందింది. ఆరవ శతాబ్ధం నుండీ ఎనిమిదవ శతాబ్ధం వరకూ సమాజాన్ని అమితంగా ప్రభావితం చేసిన నయనార్లలో స్త్రీలు, శూద్రులు, దళితులూ ఉన్నారు. బ్రాహ్మణుడైన సుందరమూర్తి నయనార్ అబ్రాహ్మణ స్త్రీలను వివాహమాడాడు. ఆళ్వార్లు కూడా కులం పట్ల ఇదే విధానాన్ని అవలంబించారు. రామానుజుడు కులాలకు అతీతంగా వ్యవహరించాడు. మార్గ నిర్ధేశకులుగా, గురువులుగా, దైవానుగ్రహాన్ని పొందిన వారిగా, భగవంతునితో సంధాన కర్తలుగా ఉంటూ కుల, లింగ వివక్షతలు లేకుండా పాటించి చూపారు. నయనార్లలోకంటే ఆళ్వార్లలో, రామానుజునిలోనూ ఇస్లాం ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రామానుజుడు అనుసరించిన “ప్రపత్తి” ( సెల్ఫ్ సరెండర్) ఇస్లాం నుండి వచ్చినదే. భండార్కర్ ఇది క్రైస్తవ ప్రభావం నుండి వచ్చినదని అభిప్రాయపడ్డాడు. కానీ ఆ కాలంలో దక్షణ భారతదేశంలో క్రైస్తవ ప్రభావం ఇస్లాంతో పోలిస్తే చాలా తక్కువ.
భక్తి ఉద్యమం ముందుకు తెచ్చిన భగవంతుడు అద్వితీయుడు. అతను తప్ప మరొకరు భగవంతుడు కాలేరు. శైవులకు శివుడు, వైష్ణవులకు విష్ణువు, శాక్తేయులకు శక్తి తప్ప మరొకరెవరూ దైవంగా ఉండజాలరు. అయితే భగవంతుడొక్కరే కానీ ఆయన సూఫీలు అనుభూతి పొందిన మాదిరిగానే, వైయక్తికంగా ఒక్కొక్కరికీ ఒక స్వరూపంగా గోచరిస్తాడు. ఒకరికి ఆయన గురువు, మరొకరికి స్నేహితుడు, ఇంకొకరికి ప్రియుడు. భగవంతుడు ఇంతలా వివిధ వైయక్తిక భావనలతో అత్యంత సన్నిహితునిగా మారడం మనం భక్తి ఉద్యమంలో మాత్రమే చూడగలం .అందుకే భక్తి ఉద్యమ కాలపు భక్తి సూఫీల వలే అత్యంత వైయక్తికమైనదీ, భావోద్వేగపూరితమైనది.
ఆళ్వార్లు, నయనార్లు, ఆ తర్వాత వచ్చిన భక్తి ఉద్యమ కవులు గురువులూ, మార్గ నిర్దేశకులూ కూడా. భగవంతునితో అనుసంధానం చేసే వాళ్ళు కాబట్టీ వీరు అత్యంత గౌరవనీయులూ, పూజనీయులు. గురువులుగా వీరు పొందిన స్థానం సూఫీ పీర్లను పోలి ఉంటుంది. సూఫీ గురువు భగవంతునిచే ఎంపిక చేయబడ్డవాడు. మార్గ నిర్ధేశకుడు. దివ్యానుగ్రహం పొందిన వాడు. పూజనీయుడు. అతను తనను అనుసరించే వారిని ముక్తి మార్గంలో నడిచేలా చేస్తాడు. బౌద్ధ, జైనాలలో కూడా ఈ రకమైన గురుశిష్య సంబంధం ఉంటుంది. అయితే భక్తి ఉద్యమం దీనిని సూఫీల దారిలో మరింత ముందుకు తీసుకొని పోయింది. సూఫీ ఫీర్ల వలెనే భక్తి ఉద్యమ కాలపు గురువులు దివ్యత్వాన్ని పొందినవారు. ఈ దివ్యత్వం వారిని దేవునితో సమం చేస్తుంది. నయనార్లు సాక్షాత్ శివ స్వరూపులు. శంకరాచార్యులు శివుని స్వరూపం. సరిగ్గా ఇలాంటి దివ్యత్వం ఆళ్వార్లలో కూడా ఉంటుంది. భక్తి ఉద్యమం దీనిని అంతటితో ఆపక సూఫీలలో వలెనే గురు స్థానాన్ని దేవుని అధిగమించి ముందుకు తీసుకొని పోతుంది. వీర శైవులలో భగవంతుని కన్నా గురువు స్థానం ముందుంటుంది.
ఏకేశ్వరారాధనతో కూడిన భక్తి,ప్రపత్తులు, గురువుకున్నప్రత్యేక స్థానంతో పాటుగా భక్తి ఉద్యమం ఆచరించిన మరొక గొప్ప విలువ కుల, లింగ సమానత్వాలను పాటించడం. ఇది బసవని కాలంలో తీవ్రరూపాన్ని తీసుకున్నది.
” బలులను అర్పించవలసిన పని లేదు. ఉపవాసాలు, విందులను పాటించనవసం లేదు. తీర్ధయాత్రలతో పని లేదు. శుద్ధి పొందేందుకు ఏ నదిలోనూ మునగవలసిన పని లేదు. కులం లేదు. కడజాతివారయినా శైవునిగా మారిన తర్వాత అతడు బ్రాహ్మణుని కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు. పుట్టుక, లింగం కారణంగా ఎవరూ ఎవరికీ తక్కువ కాదు,. మనుషులందరూ పరమాత్ముడు నివశించే దేవాలయాలే.”
“వివాహం ఐచ్చికం. దానికి వధువు అంగీకారం తప్పనిసరి. బాల్య వివాహాలు చేయరాదు. విధవలు గౌరవనీయులు. వారిని వివాహం చేసుకొనేందుకు అంగీకరించాలి. మరణించిన వారికి శ్రాద్ధకర్మలు అవసరంలేదు. పునర్జన్మలనేవి లేవు. లింగాయతులందరూ కలిసి భుజిస్తారు. కలిసి జీవిస్తారు.”
ఆరవ శతాబ్ధం నుండి పదమూడవ శతాబ్ధం వరకూ దక్షణ భారత దేశంలో సామాజిక మార్పును సూచించిన భక్తి ఉద్యమం అసమానతలపై సూఫీలు చేసిన తిరుగుబాటు వంటిది. ఈ రెండూ మానవ హృదయం చేసిన తిరుగుబాట్లు. సూఫీలు, భక్తి ఉద్యమ కవులు చేసిన సామాజిక తిరుగుబాట్లను ప్రస్తావించకుండా సూఫీల ప్రేమ తత్వం, భక్తి ఉద్యమ కవుల గొప్పదనం గురించి మాటాడబోవడం ఒక రకమైన వంచనే అవుతుంది.
ఇస్లాం, సూఫీల ప్రభావం, భారతీయ తాత్విక చింతనను ఆరవ శతాబ్ధం నుండీ పదిహేడవ శతాబ్ధం వరకూ ఇక్కడి సామాజిక చలనాలకు అనుగుణంగా తమవైన వ్యక్తీకరణలను ఎంచుకునేందుకు అవసరమైన తాత్విక తోడ్పాటునందించి, ఎంతగానో దోహద పడ్డాయి. ఇస్లాం, సూఫీల ప్రభావంలేకుండా వీటిని మనం ఊహించలేము.
*
.
సూఫీ నెచ్చెలి రాబియా
“ప్రభూ , నరకమనే భయంతో నిన్ను ఆరాధించినట్లయితే నన్ను ఆ నరకపు జ్వాలలోనే పడవేయి.
స్వర్గపు ఆశతో నిన్ను మ్రొక్కితే , దాని నుండీ నన్ను మినహాయించు
కేవలం నీ కొరకే నిన్ను ఆరాధించినట్లయితే మాత్రం
ఆద్యంత రహితమైన నీ సౌందర్యదీపం నుండీ నన్ను దూరం చేయకు”
ఈ మాటలు మనకు యధాతథంగా రవీంద్రుని గీతాంజలిని గుర్తుకు చేస్తాయి. రాబియా వ్యక్తీకరణ మన అక్కమహాదేవినీ, మీరాని గుర్తుకు తెస్తాయి.
రాబియా ఎనిమిదవ శతాబ్ధపు ఇస్లాం ధార్మిక వేత్త. తొలి తరం సూఫీలలో పేరుపొందిన వ్యక్తి. స్త్రీగానూ, అట్టడుగు జీవితపు ప్రతినిధిగానూ ఆమెది ఆశ్చర్యానికి లోను చేసే వ్యక్తీకరణ.
తన కాలంలో ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నందువల్లనే ఆమె ప్రజల ఙ్ఞాపకాలలో అద్భుతం, వాస్తవం కలగలిసిన వ్యక్తి అయింది. రాబియా అంటే నాలుగవది అని అర్థమట. ఆమె పుట్టినప్పుడు ఆమె తండ్రి, నవజాత శిశూవుకు కల్పించవలిసిన కనీస వసతులు కూడా కల్పించలేక బోరున విలపించాడట. అప్పుడు మహ్మద్ ప్రవక్త ఆయనకు కలలో కనిపించి ఆమె గొప్ప వ్యక్తి ఆవుతుందని, గొప్ప మార్గదర్శిగా ఎదుగుతుందనీ చెబుతాడట. బాల్యంలోనే తల్లితండ్రులను కోల్పోయి తీవ్రమైన కరువులో, ఆమె పుట్టిన ఊరు బస్రా నుండీ మరో ప్రాంతానికి వలస పోతున్నప్పుడు కొందరు దోపిడీ దొంగలు ఆమెను అపహరించి, ఒక సంపన్నునికి బానిసగా అమ్ముతారట. ఒక వైపు యజమాని చెప్పిన పనులను చేస్తూనే, తీరుబాటుగా ఉన్న రాత్రి సమయాలలో ఆమె భగవత్ ధ్యానాన్నీ, ఉపవాసాలనూ, తీవ్రమైన నియమ నిష్టలనూ పాటించేదట. తన బానిస తీరుబాటు సమయాలలో చేసే పనులను చాటుగా గమనించదలుదుకున్న యజమానికి ఆమె ఒకసారి జ్వాజ్వాల్యమైన ముఖవర్చస్సుతో, అద్భుతమైన కాంతివలయాలతో గోచరమైనదట. ఈ సంఘటనతో భయకంపితుడైన యజమాని ఆమెకు తక్షణం స్వేచ్చనిచ్చి అక్కడ నుంచీ పంపి వేస్తాడట.
ఇది ఆమె జీవితానికి సంబంధించిన అద్భుత గాధ. వాస్తవానికీ, కల్పనకూ మధ్య దూరాన్ని చెరిపేసే ఇలాంటి కథనాలతో తన గురువులకు కూడా ఈర్ష్య కలిగించేలా, ఆమె సూఫీలలో అగ్రశ్రేణికెక్కింది.
దేశాన్నీ, జాతినీ, మతాన్నీ, దేవుడినీ మెజారిటి ప్రజానీకానికి వ్యతిరేకంగా నిలబెట్టిన మన వర్తమానం నుంచీ రాబియానీ, ఆమె ఎన్నుకున్న సూఫీ మతాన్నీ చదువుతున్నప్పుడు సాంస్కృతిక బాహుళ్యానికి చోటునిచ్చిన వివిధ ధోరణులనూ, మతవిశ్వాసాలనూ కళ్ళకద్దుకోవాలనిపిస్తుంది.
రాబియా జీవితం, ఆమె ఆచరణ, కవిత్వం- ఇస్లాం తొలినాళ్ళ సమానత్వాన్ని మళ్ళీ ఉనికిలోకి తేవడానికి ప్రయత్నించిన సూఫీయిజంతోనూ, స్త్రీగా తన కాలపు కుటుంబ సంబంధాల అసమానతలతోనూ ముడిపడి ఉంది. ఎనిమిదవ శతాబ్ధి నాటికి ఇస్లాం ప్రాభల్య ప్రాంతాలలోని పాలక వర్గాలలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, భోగలాలసత పెచ్చుపెరిగాయి. ప్రజల మధ్య అసమానతలు పెరిగి ఇస్లాం మూల సూత్రాలకే తావు లేకుండా పోయింది. ఇలాంటి సామాజిక రాజకీయ పరిస్థితులకు మత సాంస్కృతిక రూపంలో ముందుకొచ్చిన ప్రతిస్పందనే సూఫీయిజం. సూఫీ తాత్వికతను, చాలా మంది “హిందూ” ఉపనిషత్, వేదాంతప్రభావాలతో ముడి వేయడానికి ప్రయత్నిస్తారు. ఇది అంత నిజం కాదు. దీనికి తోడుగా సూఫీయిజాన్ని ఇస్లాంకు దూరంగా చూసే ధోరణులు కూడా ఉన్నాయి. సూఫీయిజాన్ని ఇస్లాం, “హిందూ” మత తాత్వికతలకు కట్టిన అంటుగా భావించడం ఆధిపత్య వైఖరే అవుతుంది.
ఇస్లాంలో సూఫీ ధోరణులు ఉనికిలోకి రాక మునుపే మధ్య ఆసియా ప్రాంతం జొరాష్ట్రియన్, క్రైస్తవ, యూదు, ఇస్లామ్, బౌద్ధం, ఉపనిషత్, వేదాంత ధోరణులకు సంగమ స్థలిగా ఉండేది. ఈ భావ సంగమం అటునుండీ ఇటూ, ఇటు నుండీ అటూ అలల మాదిరిగా నిరాఘాటంగా ప్రయాణించేది. ఇలాంటి విభిన్న భావజాల సంగమ నేపథ్యం ఆ కాలపు సామాజిక రాజకియ పరిస్థితులకు తొడై సూఫీ తత్వానికి కారణమయింది. అంతే కాని సూఫీయిజం ఏ ఒక్క మతానికో మరో మతాన్ని అంటుకట్టడం వల్ల ఉనికిలోకి వచ్చింది కాదు. సూఫీయిజంలోని మార్మిక ధోరణులను “హిందూ” తత్వంతో ముడిపెట్టే ధోరణులలాగానే, రాబియా జీవితంపై పుస్తకాన్ని రాసిన మార్గరెట్ స్మిత్ కూడా సూఫీయిజంలోని నిరపేక్షమైన భక్తి భావనని, సమర్పణని క్రైస్తవానికి ముడిపెట్టింది. భావాలు ఉనికిలోకి రావడం వెనుక ఉన్న ఆదానప్రధానాలను, సంఘర్షణలను పరిగణనలోకి తీసుకోని ఇలాంటి అచారిత్రక ధోరణులకు కారణం ఆధిపత్యభావజాలమే.
సూఫీయిజం అనేక సుదూర ప్రాంతాలకు పరివ్యాపితమైనప్పటికీ, భారత దేశంలో కాలక్రమేణా అనేక రకాలపంథాలుగా, ఇస్లాంకు విపరీతమని అనిపించే అనేక రకాల పద్ధతులకు తావిచ్చినప్పటికీ అది తనను తాను ఎప్పుడూ ఇస్లాంకు దూరంగా ప్రకటించుకోలేదు. విమర్శకులు ఎన్ని విధాలుగా దానిని తన తల్లివేరు నుండి విడదీసి చూడదలుచుకున్నప్పటికీ సూఫి తాత్వికులు తమను తాము భగవంతునికి, ఖురాన్కు విధేయులుగానే ప్రకటించుకుంటున్నారు. సూఫీయిజంలోని ప్రతీ పంథా తమ మూలపురుషుల (పీర్లు) మూలాలను ప్రవక్తలోనే చూసుకుంటున్నారు. ఇది సూఫీయిజం ఉనికిలోకి వచ్చినప్పటి నుండీ ఇటీవలి కాలం వరకూ ప్రతీ సూఫీ అన్నింటికన్నా ముందుగా విధిగా నిర్వహిస్తున్న పని. అయితే దీన్ని మత ధార్మికతలోని వివాదాలకు సంబంధించిన చర్చలో భాగంగా కాకుండా, తనలోని మౌలికాంశాలను అట్టే ఉంచుకొని, తను వ్యాపించినంత మేరా స్థలకాలాలకు అనుగుణంగా సూఫీయిజం అవలంభించిన స్థానికానుకూలతగా దీన్ని భావించవలసి ఉంటుంది. ఇటువంటి అనుకూలతను దాని తాత్వికతలో భాగం చేసుకున్నందువల్లనే అది వ్యవస్థీకృత మతాల వలే కాకుండా సామరస్యానికి, ఇచ్చి పుచ్చుకునే ధోరణులతో కూడిన బహుళత్వానికి నిరంతరంగా చోటు ఇవ్వగలిగింది.
అందుకే సూఫీ రాబియా ఇలా అనగలిగింది.
“ఎక్కడ నేను మోకరిల్లుతానో
అక్కడ నా ఆత్మలో
ఓ గుడి, ఒక దర్గా, మసీదు, చర్చి ఉంటాయి.”
సూఫీగానే కాకుండా ఒక స్త్రీగా ఆమె భగవంతుని సంబోధించే విధానం, తనతో ఆమె ఏర్పరుచుకునే సంబంధం సూఫీలలోనే మకుటాయమైన స్థానం ఏర్పరిచింది. సూఫీలు భగవంతునితో సాన్నిహిత్యాన్ని, అవిభాజ్యమైన స్థానాన్నీ కోరుకుంటారు. కానీ ఆమె ఆయనను ప్రియునిగా సంబోధిస్తుంది. భగవంతునితో దివ్యమైన ప్రేమ బంధాన్ని ఏర్పరుచుకుంటుంది.
ఆమె ఇలా అంటుంది.
“నేను నిన్ను రెండు రకాలుగా ప్రేమించాను
ఒకటి స్వార్థంతో
మరొకటి నీకు సరితూగేటంటంతగా
మొదటి దానిననుసరించి
మిగిలిన వారందరినీ తొలగదోసి
నేను నిన్ను ఆక్రమించాను
మరో దానిప్రకారం
నా మేలిముసుగును నీవు పైకెత్తుతుండగా నేను నిన్ను చూసాను
రెంటిలోనూ ఘనత నాదికాదు
ఏ ఒక్క దానికైనా నిజమైన ఘనత నీకే చెందాలి”
******
“ప్రేమలో హృదయాల నడుమ ఇక ఏమీ ఉండదు
కోరికల నుండి మాటలు పుడతాయి
చవి చూసిన వారికి మాత్రమే నిజమైన రుచి తెలుస్తుంది
వివరించే వ్యక్తి అబద్ధాలనే చెప్పగలడు
నీవు ఎవరి ముందర అస్పష్టమవుతుంటావో
ఎవ్వరిలో నీవు ఇంకనూ ఉనికియై ఉంటావో
నీ గమ్యపు గురుతుగా సదా ఎవరు నిలిచి ఉంటారో
అలాంటి నిజమైన వానిని
మరింకే దాని నుండో నీవు ఎలా విడదీసి చెప్పగలవు ?”
****
కన్నులు సోలుతున్నాయి
నక్షత్రాలు మణుగుతున్నాయి
గూళ్ళలోని కువకువలూ , కడలిలోని అతికాయులూ జోగుతున్నారు
మార్పు లేకుండడమన్నది తెలిసిన వాడివి నీవొక్కడివే
అటూ ఇటూ వొంగడమన్నదే ఎరుగని సమతుల్యత
ఇసుమంత దూరమూ జరగని ఆద్యంతరహితమూ నీవే
కావలి వాండ్ల పహరాల వెనుక
కామందుల తలుపులగడియలు బిగించి ఉన్నవి
నిన్ను తలచే వారి కోసం
నీ తలుపులొక్కటే తెరచి ఉన్నాయి
ప్రభూ
ప్రతీ ప్రేమా తన ప్రియునితో ఏకాంతత నొంది యున్నది
నేను మాత్రం నీతో ఏకాంతంగా ఉన్నాను ”
*****
ఇస్లాం విస్తరించినంత మేరా దాని అభివృద్ధిలో పురుషులతో పాటుగా అనేక మంది స్త్రీలు కూడా పాలు పంచుకున్నారు. ఒక్క మధ్య ప్రాచ్యంలోనే వీరి సంఖ్య మత ధార్మిక వేత్తలుగా ఇంకా వివిధ స్థాయిలలో ప్రభావ శీలమైన వ్యక్తులుగా వేలలో ఉండాలని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ వారి సంఖ్య చరిత్ర గ్రంథాలలో నూ , ఎన్సైక్లోపీడియాలలోనూ చాలా తక్కువగా ఉంది. ఈ వివక్ష సూఫీలలో కూడా ఉన్నప్పటికీ వ్యవస్థీకృత ఇస్లాంతో పోల్చితే ఈ సంఖ్య మెరుగుగానే ఉన్నదని చరిత్రకారులు అంటున్నారు. అయితే ఇలాంటి విచక్షణలలోనూ స్మృతీ-విస్మృతుల ప్రభావాలకావల రాబియా వ్యక్తిత్వం సమున్నతంగా నిలబడి ఉంది.
తొలినాళ్ళ సూఫీలు తమకాలపు అసమానతలపై మతతాత్వికతను దన్నుగా చేసుకొని తిరుగుబాటు చేస్తే, స్త్రీ సూఫీగా రాబియా తనకాలపు కుటుంబ వ్యవస్థపై తరుగుబాటు చేసింది. సాధారణ పరిస్థితులలోనే స్త్రీల పరిస్థితి కింది స్థాయిలో ఉంటుంది. సామాజికంగా దిగజారిన సందర్భాలలో స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులనుండే రాబియా తన వ్యక్తీకరణలో సంచలానాత్మకంగా కుటుంబ వ్యవస్థను తృణికరించింది. తన జీవిత కాలమంతటా ఒక్కతిగానే జీవించి, తనకు సరియైన సహచరుడు భగవంతుడు తప్ప మరొకరు కాదని ప్రకటించింది. సరిగ్గా ఇలాంటి ధిక్కారాన్ని మనం ఇక్కడ అక్క మహాదేవీ, మీరా వంటి వారిలో మనం చూస్తాం. ఆ తర్వాత ఇలాంటి ధోరణి మన వద్ద మధురభక్తి పేరుతో లింగ బేధాలను దాటి వ్యాపితమైనా దాని అసలైన వాడిని భక్తి ఉధ్యమ కాలపు స్త్రీల నుండే మనం చవి చూస్తాం. దేవుడొక్కడే అన్న భావనకు , భక్తి ఉద్యమం ప్రతిపాదించిన సమానతలకు ఇస్లాం, సూఫీయిజాలు బలమైన సైద్ధాంతిక ప్రభావాలుగా మన మీద ముద్ర వేసాయి. వీటన్నింటినీ కలగలుపుకొని కుటుంబ వ్యవస్థపై తమ ధిక్కారాన్ని తృణీకారంగా ప్రకటించిన ధోరణులకు మాతృక గా మనకు రాబియా కనిపిస్తుంది.
సంభాషణలు
గోమూత్రమూ మరియూ దేశభక్త పురాణము
స్నేహమే ఉద్యమం, ఉద్యమమే ప్రాణం!
సుదూరాలకు వ్యాపించి ఉంది.దాదాపుగా నిండు జీవితమని పిలుచుకోగలిగినన్నాళ్ళూ జీవించిన తను ఈ రోజు మన మధ్య లేడని , ఇక భౌతికంగా తన పలకరింపు, నింపాదితనంతో కూడిన తన చిరునవ్వు ఇక ఉండబోవని అనుకోవడం తీరని దుఃఖాన్ని కలిగిస్తుంది.బహుశా కొన్ని సార్లు మరణం కూడా ఒక సందర్భంగా మన మధ్య వచ్చి నిలబడుతుంది కాబోలు. పుట్టుక లాగే మరణం కూడా అతి సహజంగా భావించి , దాని గురించి ఏనాడూ ఇసుమంత జంకు కూడా ప్రదర్శించని వ్యక్తి మరణం గురించి ఈనాడు దుఃఖించడం వెనుక ఆయన బతికిన రోజుల నిండుదనమే ఉంది.
వయసు రీత్యా ఆయన విరసంలో ఎంత పెద్దవాడో చురుకుదనంలోనూ, కలగొలుపుదనంలోనూ అంత బాలకుడు. ఉమ్మడి కమ్యునిష్టు ఉద్యమం నుండి నక్సల్బరీ- మావోయిష్టు ఉద్యమాల దాకా ఎంతో విస్తృతమైన ఆచరణ, అనుభవం ఉన్న తనను, అన్ని విధాల అల్పులమైన మేము ఏక వచన ప్రయోగం చేసినా, చిన్నా పెద్దా తేడా లేకుండా సి.పి. అని సంబోధించినా అది ఆయన మా మీద చూపించిన ప్రేమ వల్లే సాధ్యమైంది. కొత్తగా సాహిత్య, సాంస్కృతిక వాతావరణంలోకి వచ్చిన మాబోటి వాళ్ళతో ఆయన భుజాల మీద చేతులు వేసి నడిచేవాడు. బాబూ అని పిలుస్తుండేవాడు.
ఇప్పుడు – చలసాని గురించి తారీకులూ గట్రా వివరాలు లేకుండా, కేవలం చెదురు మదురు ఙ్ఞాపకాల మీద ఆధార పడి ఆయన గురించి తలపోస్తున్నప్పుడు
దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉండే ఆయన రచనా విధానమే గుర్తుకొస్తున్నది. సి.పి ఏది రాసినా దాని పుట్టుపూర్వోత్తరాల ప్రస్తావన లేకుండా ఉండదు. వ్యక్తులను ప్రస్తావించినా, సంఘటనల గురించి రాసినా దేశ కాలాలను తప్పకుండా ప్రస్తావించేవాడు. ఇట్లా సవివరంగా రాసేందుకు ఆయన మేధ సదా సంసిద్ధంగా ఉండేది. ఈ శక్తితోనే ఆయన కృష్ణాబాయిగారితో కలిసి శ్రీశ్రీ , కోకుల సమగ్ర సంపుటాలను పాఠకుల ముందుకు తేగలిగాడు.
అయితే ఆయన చివరి దశకాల్లో వయసు రీత్యా ఈ శక్తి కొద్దికొద్దిగా మందగిస్తూ వచ్చింది. విరసం మహాసభల్లోనూ, సాహిత్య పాఠశాలల్లోనూ విరసం పతాక గీతం
“ఎత్తినాం విరసం జెండా” పాటతో కార్యక్రమాలను ప్రారంభించడం ఆనవాయితీ. ఈ పాటను ఎప్పుడూ చలసానే పాడేవాడు. లయబద్ధంగా ఆయన పాడుతుంటే మిగిలిన వాళ్ళు
ఆయనను అనుసరించేవాళ్ళు. అయితే ఒకసారి విశాఖపట్నంలో జరిగిన సభల్లో అనుకుంటాను. పాటలోని ఒక చరణంలో కొన్ని పాదాల దగ్గర ఆయన తడబడ్డాడు. ఆ
తర్వాత వెంటనే సరి దిద్దుకున్నా, పతాకావిష్కరణ కార్యక్రమం అయిపోగానే ఆయన తన ఙ్ఞాపక శక్తిని పరీక్షించుకోవడం కోసం, సీరియస్గా కలం, కాగితం
తీసుకొని పతాక గీతాన్ని మొదటి పాదం నుండి చివరి దాకా తడబాటూ లేకుండా రాసి చూసుకొని సంతృప్తి పడ్డాడు.
మాటల సందర్భంలో ఏదైనా కవిత్వమో, కతో, నవలో, విమర్శో చర్చకు వచ్చినప్పుడు, వాటికి సంబంధించిన వాచకంలోని పంక్తులూ, విడి భాగాలనూ ఆయన
స్పష్టంగా, ఖచ్చితంగా గుర్తు పట్టేవాడు. అవసరమైతే వాటిని నిర్ధారించుకోవడం కోసం వాటి గురించి తెలిసి ఉంటుందనుకున్న వ్యక్తులతో వెంటనే ఫోన్ ద్వారాగానీ, ఉత్తరం ద్వారా గానీ సంప్రదించి నిర్ధారణ చేసుకొనేవాడు. నికోలాయ్ ఓస్త్రావ్స్కీ- కాకలు తీరిన యోధులు నవలలోని కొన్ని పంక్తులను నిర్ధారించుకోవడం కోసం ఆయన నాకు ఓసారి ఇలాగే ఉత్తరం రాసాడు.
వ్యక్తిగతమైన పనులు, ఇష్టాలు, ఇతరేతరాలూ ఎన్ని ఉన్నా ఉద్యమావసరాలే ఆయనకు ప్రథమ ప్రాధాన్యం. ఒకసారి అరుణతార పనుల మీద నేను రెండు రోజుల పాటు
విజయవాడలో ఉండాల్సొచ్చింది. ఇతర పనుల మీద ఆయన కూడా సరిగ్గా అప్పుడే విజయవాడకు వచ్చాడు. అక్కడ నేనున్నానని తెలుసుకొని, తన పనులు త్వరత్వరగా
ముగించుకొని నాకు తోడుగా ఉండడం కోసం మిగిలిన సమయం అంతా ఆ రెండు రోజుల పాటూ ప్రెస్లోనే గడిపాడు.
తొంభై ఐదు తర్వాత విరసంలో సభ్యులుగా చేరిన మాకు ఒక వైపు విప్లవోద్యమాన్ని సమర్ధిస్తూనే, మరో వైపు వివిధ అస్తిత్వ ధోరణులనూ, సామాజిక మార్పులనూ సమన్వయం చేసుకోవడంలో సందేహాలు కలుగుతుండేవి. ఇట్లాంటి సందర్భాల్లో ఏ రకమైన జంకూగొంకూ లేకుండా మాటాడుకునేందుకు చలసానిని మించిన మనిషి మరొకరు ఉన్నట్టుగా మాకు అనిపించలేదు. చర్చించడానికీ, అభిప్రాయాలను వ్యక్తపరచడానికీ, అవి ఎలాంటి స్వరంతో ఉన్నా చలసాని సదా ఆహ్వానించేవాడు.
వ్యక్తుల అభిప్రాయాలనూ, అనుభవాలనూ, పరిమితులనూ గౌరవిస్తూనే, అవసరమైనప్పుడు వాటిని విబేధించేవాడు. అది కూడా మనుషులు తమ పట్ల ఎలాంటి
సున్నితత్వాన్ని కోరుకుంటారో, అదే సున్నితత్వంతో తన అభిప్రాయలను చెప్పేవాడు. భిన్నాభిప్రాయాలను ప్రకటించినందుకో, తీవ్ర స్వరంతో
విమర్శించినందుకో, వ్యక్తిగతమైన పరిమితులు, బలహీనతల కారణంగా, ఆయన- మనుషులను పక్కన పెట్టినట్టుగా నేనెప్పుడూ వినలేదు.
ఇట్టాంటి జీవితం వల్లనే ఆయన పరిచయాలు, మానవసంబంధాలు కళ్ళూ చెదిరేంత విస్తృతంగా మారి ఉంటాయి. ఉమ్మడి కమ్యునిష్టు ఉద్యమం మొదలుకొని
ఇప్పటిదాకా, వివిధ సామాజిక చలనాలకు గురుతులుగా నిలబడ్డ అసంఖ్యాక వ్యక్తులతో ఆయనకు సంబంధాలు ఏర్పడి ఉంటాయి. ఇట్టాంటి మానవ సంబంధాల వల్లనే
ఆయన విరసానికీ, ప్రగతిశీల, పౌరహక్కుల ఉద్యమాలకూ ఎనలేని సేవలందించగలిగాడు. ఆయా పోరాటాల మీద నిర్భందం విరుచుకపడినప్పుడు తనకున్న వేల చేతులతో పాలక వర్గాల కుట్రలను ప్రజల్లోకి తీసుక పోగలిగాడు.
ఆయన ఇంటి ముఖ ద్వారానికి మార్క్స్, బుద్ధుడు, అంబేద్కర్ చిత్తరువులు తగిలించి ఉండేవి. వీరు ముగ్గురూ భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి
అత్యావశ్యక మార్గదర్శులు అని ఆయన మాతో అన్నాడు. వలసవాదం ఏ రూపంలో ఉన్నా ఆయన తీవ్రంగా అస్యహించుకొనేవాడు. గూగీవాధియాంగో ఒక సారి తన ఇంటికి తన కోసం ఫ్జోన్ చేయడాన్ని అపురూపంగా ఆయన చెప్పడం నేను స్వయానా రెండు మూడు సార్లు విన్నాను. వీరస్టాలినిష్టుగా పిలవబడడాన్ని ఇష్టపడే తను స్టాలిన్
బలహీనతల గురించి ప్రస్తావించినప్పుడు సావధానంగా వినేవాడు.
అన్నింటికీ మించి మనుషుల జీవితాల్లో సంక్షోబాలు ఏర్పడినప్పుడు అందరికి మించిన ఆర్తిని ఆయన ప్రదర్శించేవాడు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా,
ఉద్యోగ సమస్య అయినా , కుటుంబ సమస్యలయినా అనేక మంది ఆయన వైపు చూడడం నాకు తెలుసు. ఆయనవి గరుత్మంతుని రెక్కలు. ఇలాంటి సందర్భాల్లో ఆయన ఇల్లు సొంత ఇంటిని మించి తలుపులు చాచుకొనేది.
ఇంత గొప్ప సామాజిక సంబంధాలు ఉన్నప్పటికీ వాటిని ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, విలాసాల కోసం వాడుకున్న సందర్భం నాకు తెలిసి ఒక్కటి కూడా
లేదు. నిరాడంబరత, కార్యశీలత కలగలిసిన అపురూపమైన మనిషి చలసాని.
ఆ ఇంట్లో దెయ్యముంది..
కుక్క అంటే ఏమిటి?
1
ఈ నడుమ మా చిన్ని పాప తరుచూ ప్రతీ దానికీ కుక్క అనే పదాన్ని చేరుస్తుంది
మూడేళ్ళ పిల్ల, బొత్తిగా భాషాపాటవం తెలియనిది
ఇప్పుడిప్పుడే బడికి పోతూనో (హతవిధీ) పోబోతూనో
పోలేకనో, పోకుండా ఉండలేకనో ( దాని చేతుల్లో ఏముంది ) కింద పడి దొర్లి, కాళ్ళూ చేతులను నునుపాటి గట్టి గ్రానైట్ బండ మీద
ఇష్టారాజ్యంగా తపతపా విదిలించి కొడుతూ ఎక్కడ దెబ్బ తగులుతుందేమోనని గుండెలదరింపజేస్తూ
తన రోజు వారీ మాటల సమయాలలో అంటుంది కదా-
ఎక్కడికి పోయినావే కుక్కా, కుక్క నాకొడకా-
“ఇంక ఏమి తింటవ్ తల్లీ?”
కుక్క తింట-
“ఇట్లయితే ఎట్లనే?”
కుక్కనే-
2
ఇంతకూ కుక్కా అనేది ఏ భాషావిశేషం?
పదే పదే మాటల తొక్కిసలాటలలో ఇరుక్కపోయిన భాషా క్రీడగానో, క్రీడించే సమయాలోకి సంభాషణగా కరిగే భాషగానో
మాటలుగా, వాక్యాలుగా అర్థాలు చెదిరి, అర్థాలతో పాటుగా సన్నివేశమూ అందలి పాత్రలూ చెదిరి
ఎటూ పొసగనీ లేదా ఇమడని ఉధ్విగ్నతలలోనికి పొగమంచుగా పాకి
విఫల యత్నమై బ్రహ్మ రంద్రాన్నిపగలగొట్టుకొని శూన్యంలోనికి పెగిలే నిట్టూర్పులా ప్రయత్నిస్తున్నపుడు
మనుషుల రణగొణ ధ్వనులలో మాటల బండరాళ్ళపై పడి
నాకూ కాళ్ళూ చేతుల్ని టపటపా కొట్టుకోవాలనిపిస్తుంది
కుక్క మాటలు
కుక్క సంభాషణలు
కుక్క కవిత్వమూ అని రాయాలనిపిస్తుంది.
రెండు పాదాల కవిత
వొచ్చీరానీ అక్షరాలను కూడబలుక్కొని
ఆ రెండు పాదాలూ నువ్వు రాస్తున్నప్పుడు నేను నీ పక్కనే కూర్చొని ఉన్నాను
అప్పుడు చుట్టూ రాబందుల రెక్కల చప్పుడు
ఆ రెండు పాదాలే పుంఖానుపుంఖమై రోజుల నిర్దాక్షణ్యతను తొలుచుకుని బారులు సాగుతునప్పుడు-
“కవిత్వమా అది”- అనే కదా నేనడుగుతాను
అప్పుడు జల్లెడలా తూట్లు పడి దేహమంతా తడిసి ముద్దయి బహుశా నొప్పితోనే కాబోలు
వణుకుతున్న చేతితో జేబులో నుండి తడిసిన ఆ కాగితాన్ని ఒక చిన్ని మిణుగురులా బయటకు తీసి
ఒక్కసారి చూసుకొని తిరిగి జేబులో దాచుకుంటున్నావు
చావును బతుకును కలుపుతూ వంతెనలా నువ్వు
వెలుగుకు చీకటికి నడుమ పలుచని వెలుతురులా నీ జేబులోని వొచ్చీ రానీ ಆకవిత్వమూ
ఆ వెలుతురులో ఆ వంతెన మీదుగా అటునుండీ ఇటూ ఇటునుండీ అటూ పిచ్చి పట్టినట్టూ తిరుగుతున్నప్పుడు
చేయి పట్టుక పక్కన కూర్చోబెట్టుకొని అప్పుడు నువ్వే ఇలా అంటున్నావు
బహుశా ఒక అమరగీతం రాసే ఉంటావు నువ్వు, తుంటరి దొంగ సుమా వీడు –
దొరికినదంతా దోచుక పోగలడు
తాగి తాగి వొదురుతూ రాసిన మీ అక్షరాల మీద ఒంటేలు పోసి పళ్ళికలించగలడు
ఒక మనిషి ఎప్పుడు ఎలా పరిణమించగలడోనని మీరు ఆసక్తిగా చూస్తుంటారు
కానీ అటూ ఇటూ చెదరని నిశ్చితాల మీదనే మీ గురి-
కొత్త బట్టలేసుక రోడ్డు మీద తిరుగుతున్నందుకు గుడ్డలిప్పదీయించిన పెద్దమనిషి
తుపాకీ ముందర చేతులుకట్టుకొని “అనా, అనా” అని వొరపోతున్నప్పుడు లోపల ఎట్టా కుతకుతమంటదో మీరూహించగలరు గానీ
పక్కన ఎప్పుడూ ఊహించనంత డబ్బు
ఎటు పక్కనించీ ఏ పోలీసొస్తాడోనన్న భయం
భుజాలనొరుసుకుంటూ మావో నిలిపిన ఆదర్శం-
రోట్లో వేసి కలిపి దంచినట్టూ మనసు ఎన్ని పరిపరి విధాలుగా పోగలదో మీరూహించలేరు
చోరజాలని ఇరుకిరుకు సందులలో మురికి పెంటల మీదగా జీవితం ప్రవహించడం మీరు చూడలేరు –
తలెత్తిన ఆకాశంలో మేఘాల పరిభ్రమణంలా గిర్రున తిరుగుతూ తన లోతులలోనికి చేయి పుచ్చుకొని ఈడ్చుక పోతున్నపుడు
తనను ముట్టుకొని అలా వెళ్ళిన వాడివి మరలా ఎందుకిలా తిరిగి వచ్చావు అని అడగాలనుకున్నాను
తిరిగి తను అర్థాంతరంగా వదిలేసిన పాదాలే –
ఒకటి మరొక దానిని కలుపుతూ ఒక దృశ్యాన్ని విడదీస్తుంటుంది
మొదటిది రెండవ దాని నుండి విడిపోతూ ఒక భావాన్ని నెలకొలుపుతుంది.
-అవ్వారి నాగరాజు
విలువల గురించిన సంవాదం – కారా ‘స్నేహం’ కత
నిర్వహణ : రమాసుందరి బత్తుల
కారా మాస్టారి ‘స్నేహం’ కత చదవగానే మనుషుల మధ్య ఉండే సంబంధాలు, మ్మకాలు, విశ్వాసాలకు సంబంధించిన ఆలోచనలు నన్ను అలుముకున్నాయి. ఒక
మనిషి తనను నమ్మి సహాయార్ధిగా వచ్చినపుడు ఎవరైనా అతని పట్ల ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తారు? తమ మధ్య అప్పటికే ఉన్న స్నేహాన్ని ఎలా వ్యాఖ్యానించుకుంటారు? వీటన్నింటి వెనుక ఉన్న విలువల చట్రం మనుషులను ఎలాంటి అనుభూతులకూ, అనుభవాలకూ గురి చేస్తుందీ అన్న ఆలోచనలు నన్ను నిలువనీయలేదు. ఈ ఆలోచనల వలయం నన్ను భావజాలానికి సంబంధించిన విషయాలలోనికి పడదోసింది.
భావజాలం ఎలా ఉనికిలోనికి వస్తుంది? దాని ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది? మానవ సంబంధాలను అది ఎలా ప్రభావితం చేస్తుందీ అన్నవి ఆసక్తికరమైనప్రశ్నలు. పరస్పర వైరధ్యాలు, విభిన్నత కలిగిన సమాజాలలో అనేక భావజాలాలు ఒకే సమయంలో ఉనికిలో ఉండడమే కాకుండా పరస్పరం పోటీ పడడం కూడా మనం చూస్తూ ఉంటాం. భావజాలం ఉనికిలోకి రావడానికీ, అది మిగిలిన వాటి కన్నా ప్రబలంగా మారడానికీ మనిషి అవసరాలే ప్రాతిపదిక. తన అవసరాలకు ఆటంకంగా మారిన పాత ఆలోచనలను, విధానాలను అడ్డు తొలగించుకోవడానికి మనిషి సంకోచించడు. నిరంతరమూ మారుతూ ఉండే మనిషి అవసరాల మాదిరిగానే భావజాల ఉనికి, వాటి ప్రభావాలూ సాపేక్షికాలు. సమాజంలోని వివిధ వర్గాల, అస్తిత్వాల ప్రయోజనాలు పరస్పరం సంఘర్షిస్తూ ఉన్నప్పుడు, వాటి ఘర్షణ భావజాలాల నడుమ ఘర్షణగా వ్యక్తమవుతూ ఉంటుంది. వీటిని మనం విలువలు, విశ్వాసాలు, సంబంధాలు, విధానాల తాలూకు ప్రశ్నలుగా, సంవాదాలుగా చూస్తుంటాం. ఇలాంటి ఒక సంవాదమే కారా ‘స్నేహం’.
అరవై తొమ్మిదుల్లో రాసిన ఈ కత, విషయరీత్యా చాలా చిన్నదే అయినప్పటికీ, ఈ కాలపు తన ఇతర కతల్లాగానే అనేక అంశాలను పాఠకుల ముందుకు తెస్తుంది. ఈ కతను
పై నుంచి చూసినపుడు, నమ్మి వచ్చిన స్నేహితుడిని మోసం చేసిన కతగా కనపడుతుంది. స్నేహానికి ఉన్న పాత అర్థాన్ని చెరిపేసి, ఒక కొత్త అర్థాన్ని ప్రతిపాదిస్తున్న కతగా కనిపిస్తుంది. అయితే ఇది వీటికి మాత్రమే పరిమితమైన కత కాదు. వీటిని కేంద్రంగా చేసుకొని మరింత లోతుల్లోకి తరచి చూసిన కత.
స్నేహానికి విలువనియ్యాలనీ, ఆపన్నుడై వచ్చిన సహాయార్ధికి తప్పనిసరిగా, శ్రమకోర్చి అయినా సహాయం చేసి పెట్టాలనే విలువకు, జీవితం వైకుంఠపాళీ కాబట్టీ – తన విలాసాలకు, తన అవసరాలకూ, తను మరింత ‘పైకెగబాకడా’నికీ వచ్చిన అవకాశాన్ని ఏమాత్రమూ వెనకాడకూడదూ అనే విలువకూ నడుమ జరిగే ఘర్షణను దాని రక్త మాంసాలతో సహా అనుభవంలోకి తెచ్చే కత . ఈ ఘర్షణలో మనుషులలో ఏర్పడే సంవేదనలను సెస్మోగ్రాఫుపై లెక్కించి చూపిన కత. కొత్త విలువలూ, కొత్త విశ్వాసాలూ- పాత విలువలనీ, పాత విశ్వాసాలనూ ధ్వంసించి, ఆసాంతమూ ముప్పిరిగొని తమ ఉనికికి మనుషుల చేతననే పతాకగా ఎగరేస్తూ తమను తాము వ్యక్తం చేసుకొనే కత .
ఈ కతను చదవడం మొదలు పెట్టగానే పాఠకుడికి అర్థం అయ్యే అంశాలు డాక్టరు వేణుగోపాలరావు ఆతృత, అవసరం. రాజారావుతో అతనికి గల స్నేహం. వీటికి గల నేపథ్యం, ప్రాతిపదిక అతని చిన్ననాటి స్నేహితుడు శివయ్య వచ్చాక గానీ పాఠకుడి అవగాహనలోకి రావు. వేణుగోపాలరావు ఎదిగి వచ్చిన సమాజం ఎలాంటిది?
ఇప్పడు తను ఉన్న పరిస్థితులకూ, గతానికీ ఉన్న తేడా ఏమిటీ? తనను చదివించి, పిల్లనిచ్చిన మామతో, కట్టుకున్న భార్యతో అతని సంబంధాలు ఎలాంటివన్న విషయాలు ఒక్కొక్కటిగా వాళ్ళ సంభాషణలో బయటికి వస్తాయి. శివయ్యకూ, వేణూగోపాలరావుకూ ఉన్న స్నేహం గురించి కూడా అప్పుడే తెలుస్తుంది. అయితే వీటన్నింటికీ రచయిత ఉద్దేశించిన అర్థం, కత చివరలో వేణుగోపాలరావు స్నేహానికీ, మానవ సంబంధాలకూ ఇచ్చిన వ్యాఖ్యానం ద్వారా గానీ మన అనుభవంలోకి రావు. ఆసాంతం చివరకు వచ్చాక రచయిత ఏం చెపుతున్నాడో మన మనసులో ఒక్కొక్కటిగా స్ఫురిస్తున్నపుడు, వాటిని రూఢీ చేసుకునేందుకు తిరిగి మళ్ళీ కథనంలో దొర్లిన అనేక సంగతులలోకీ, వివరాలలోకీ మనం ప్రయాణిస్తాం. ఇలాంటి శిల్పసంవిధానంతో వేణుగోపాలరావునూ, శివయ్యనూ, రాజారాంనూ అర్థం చేసుకుంటాం.
వేణుగోపాలరావును మోసగాడని, స్నేహధర్మం పాటించని వ్యక్తని చెప్పడానికి నిజానికి కతలో ఇన్ని విషయాలను చొప్పించనవసరం లేదు. అసలు రాజారావు పాత్రే అవసరం లేదు. మరి రాజారావు పాత్రకున్న ప్రాముఖ్యత ఏమిటి?
వేణుగోపాలరావు గతానికి శివయ్య ఎలానో అతని వర్తమానానికి రాజారావు సంకేతం. మారిన తన అభిరుచులకూ, స్నేహాలకూ, సంబంధాలకూ అతను కొండ గుర్తు. అతను దళారీ
మాత్రమే కాదు. వేణుగోపాలరావులో ఇంకా మిగిలి ఉన్న గతకాలపు వాసనలకూ, ఎగబాకడమొక్కటే పరమావధిగా ఉన్న వర్తమాన ఆకాంక్షలకూ మధ్య జరిగే బలహీనమైన
ఊగిసలాటకు అతను వేదిక. శివయ్య తన కొడుకు ఉద్యోగం సిఫారసు కోసం వేణుగోపాలరావును ప్రాదేయపడినప్పుడు ఒక దశలో డబ్బు ప్రసక్తి లేకుండానే పని చేయిద్దామా అన్నట్టూ ఊగిసలాడతాడు గానీ, రాజారావు అతనిని తొందరగానే వాస్తవంలోకి తేలగొడతాడు. ఇలాంటి ఊగిసలాటను పాఠకుడు సరిగ్గా అంచనా వేసుకోవడానికి రాజారావు సున్నితపు త్రాసులా పనికొస్తాడు. గతానికి సంబంధించిన పనికి రాని ‘చెత్త’ నుండి బయటపడడానికి ఉత్ప్రేరకంగా కూడా పని చేస్తాడు. రాజారావు ‘స్నేహం’ లేకుండా వేణుగోపాలరావు, వేణుగోపాలరావు కాడు. అలాగని రాజారావుకు పూర్తిగా డబ్బు మీదనే నమ్మకమా? డబ్బు లేకుండా పని జరగకూడదని అంటాడా? అంటే అలా ఎన్నటికీ అతడు అనడు. అప్పుడప్పుడూ కాస్త నిజం కలిపితే గానీ అబద్దానికి విలువుండదు అన్నట్టుగా, అప్పుడప్పుడూ కాస్త మెరిట్కు కూడా చోటు దొరుకుతే గానీ మిగిలిన వాటికి ఢోకా ఉండదు అని నమ్మే మనిషి తను. వ్యవస్థ ఆయువుపట్టు తెలిసిన వాడు కనుకనే మెరిట్కూ స్థానం దొరకక పోదని ఆయన మనకు భరోసా ఇస్తాడు.
వేణుగోపాలరావులో కలిగిన ఊగిసలాట శివయ్యకు అర్థం అవుతుంది కానీ, దానిలోని ప్రయోజకత్వం పట్ల ఆయనకు నమ్మకం ఏర్పడదు. ఇంకా, డబ్బులు లేకుండా నడిపే వ్యవహారంలో అసలుకే మోసం వస్తుందేమోననే భయం కూడా కలుగుతుంది. దీనికి వ్యతిరేక దిశలో రాజారావు పట్ల అతనిలో నమ్మకం స్థిరపడుతుంది. ఇది క్షణ కాలం పాటు మనలో విస్మయం కలిగిస్తుంది. కానీ, కాసులు రాలకుండా ఉద్యోగం రాదన్న సంగతి సమాజంలో స్థిరపడిపోయిన విశ్వాసంగా మనలో స్ఫురించినపుడు దీనికున్న ప్రాసంగికత మనకు ఎరుకలోనికి వస్తుంది.
చివరకు, ఈ మొత్తం సంబంధాలనూ మీనాక్షీదేవి సమక్షంలో సైద్ధాంతీకరిస్తూ, శివయ్య అవసరం కొద్దీ వచ్చిన మనిషనీ, కాబట్టి అతని నుంచీ ఇంకా డబ్బు వసూలు చేయొచ్చుఅని వేణుగోపాలరావు అన్నప్పుడు వెంటనే అతనిపై మనకు ధర్మాగ్రహం కలుగుతుంది. కానీ లోకంలో స్నేహమే లేదంటే విస్మయపడే ఆమె ముందర అతని ప్రసంగం వొట్టి వాచాలతేననీ మనం త్వరలోనే పసిగడతాం. పదే పదే దేనినైనా సమర్ధించాల్సి రావడం .. అది బలంగా నాటుకోకపోవడం వల్లనే అన్న అవగాహనతో వేణుగోపాలరావు ఇంకా రాజారావులా రాటుదేలలేదని రూఢీ చేసుకుంటాం. ఇంకా తరచి చూసినపుడు వేణుగోపాలరావు ఎంత అసందర్భ ప్రలాపో కూడా మనకు ఇట్టే బోధపడుతుంది. మీనాక్షీదేవి గారి సమక్షంలో ‘విష్ణుమూర్తిలాగా పవళించి’, లోకంలో స్నేహమనేదే లేదని ఉవాచించడం, ప్రతీదీ అవసరాల కోసం చేసుకున్న ఏర్పాటే అనడం వల్ల ఆ మాట మీనాక్షీ దేవికి కూడా తగులుతుందని, అది ఆమెను నొప్పించి తీరుతుందన్న జ్ఞానం అతనిలో లేకపోయింది. అదే ఉన్నట్లయితే అతను బహు నమ్మకంగా రాజారావు శివయ్యను లోబరుచుకున్నట్టుగా మాటాడి ఉండేవాడు.
ఇక్కడ కూడా వేణుగోపాలరావు తన అనుభవరాహిత్యాన్నే బయటపెట్టుకున్నాడు. అయితే ఈ మాటలకు మీనాక్షీదేవిలో కలిగిన ప్రతిస్పందన కతాగమనాన్ని పూర్తిగా మార్చి, కతను ఇంకొక తలంలోనికి ప్రవేశపెడుతుంది. అప్పటి వరకూ మధ్యతరగతిలో ఉండే నమ్మకాలూ, విశ్వాసాలూ, పైకెగబాకాలనుకునే వెంపర్లాటలూ, వాళ్ళలోని ఊగిసలాటలూ చెబుతూవచ్చిన కత, మీనాక్షీదేవి ప్రతిస్పందనతో తిరిగి విశ్వాసాలకూ, స్నేహాలకూ లోకంలో విలువ ఉండితీరుతుందన్న మరో తలంలోనికి ప్రవేశిస్తుంది. ఇది ఇప్పటి వరకూ కత నడచిన తలానికి, పూర్తి వ్యతిరేక దిశలోని మరో తలం. విలువల గురించిన సంవాదంలో మానవీయమయిన ‘థీరీ’. అందువల్లనే, మూడు రూపాయల కోసం గొంతులు కోయగల వాళ్ళున్న లోకంలో, మూడు వందల కోసం డాక్టరుగారు ఇట్టాంటి ‘థీరీ’ లేవదీసుంటారు లెమ్మని ఆమె చప్పున గ్రహించగలుగుతుంది.
సామాజిక గమనంలో వ్యక్తులు ఒక దశ నుండీ ఇంకో దశకు మారుతున్నప్పుడు, పాత స్నేహాల స్థానంలో కొత్త స్నేహాలు చోటు చేసుకుంటున్నప్పుడు, పాత సంబంధాలను వదులుకొని కొత్త సంబంధాలను స్థిరపరుచుకుంటున్నప్పుడు వాటి సవ్యతను సమర్దించుకోవడానికి, వ్యాఖ్యానిచడానికీ ఒక కొత్త భావజాలం అవసరం. ఇట్టాంటి అవసరాన్ని సందర్భసహితంగా, మానవ సంవేదనలతో సహా పట్టుకున్న కత ‘స్నేహం’. ఇది విలువల గురించిన సంవాదాన్ని ముందుకు తెస్తున్నది.
–అవ్వారి నాగరాజు
(ఎ.నాగరాజుగారు ప్రకాశం జిల్లాలో టీచరుగా పనిచేస్తున్నారు. ఈయన రాసిన కవితలు, వ్యాసాలు అరుణతారలోనూ, ఒకటీ అరా ఆంధ్రజ్యోతిలోనూ వచ్చాయి. తొలినాటి రచయితలలో శ్రీపాద అంటే ఇష్టపడతారు. మానవ భావోద్వేగాలను, అందులోని ఘర్షణను ప్రతిభావంతంగా చిత్రీకరించిన అల్లం రాజయ్య, రఘోత్తం రచనలు అంటే చాలా ఇష్టమట. దళితవాదంతో సహా, అన్ని అస్తిత్వ వాదాలూ పరిమితులకు లోనయ్యాయని నాగరాజుగారు అభిప్రాయపడుతున్నారు. స్త్రీవాద రచనలను చాలా సంవత్సరాలుగా కొనసాగిస్తున్న పి.సత్యవతిగారి కథలను మెచ్చుకున్నారు. నాగరాజుగారి బ్లాగ్ minnalpoetry.blogspot.com)
( వచ్చే వారం ” సంకల్పం” కథ గురించి పి. సత్యవతి గారు పరిచయం చేస్తారు)
పాలస్తీనా
నిదుర రాని రాత్రి ఒకలాంటి జీరబోయిన గొంతుకతో
వొడుస్తున్న గాయం మాదిరి, పోరాడే గాయం మాదిరి
నిస్పృహ, చాందసం ఆవల
ఎక్కడో ప్రవాసంలో తన దాయాదులనుద్దేశిస్తూ నిరాఘాటంగా దార్వేష్ పాడుతూ ఉన్నాడు
అతడి పాట చెవిని తాకి నెమ్మదిగా లోలోనికి చురకత్తిలా దిగుతున్నప్పుడు
తనలాంటి, తన కవిత్వంలాంటి ఒక తల్లి
తన తొలిప్రాయపు బిడ్డను కోల్పోయిన దుఃఖంలా
వేలి కొసలకు ఎన్నటికీ చెరగిపోని నెత్తుటి మరక
సమయం ఉపవాస మాసపు తెల్లవారుజాము-
మసీదు గోపురం చివర నుండి సన్నని వొణుకుతో జాగోమని జాగురూకపరిచే సుపరిచిత గొంతుక
ఈ రోజు ఎందుకో నా ముస్లీం మిత్రులను పేరుపేరునా కలవాలనిపిస్తోంది
ఒక వ్యధామయ ప్రయాసను దాటబోతున్న వాళ్ళలా
మృగ సదృశ్య సాయుధ హస్తం ముందర నిలబడి మరేమీ లేక వుత్తిచేతులతో తలపడబోతున్నవాళ్ళలా
ఒక్కొక్కరినీ పొదువుకొని ముఖంలో ముఖం పెట్టి పుణికి పుణికి చూడాలనిపిస్తోంది
ఒకరు పుడుతూనే పరాయితనాన్నిమోస్తున్న వాళ్ళు
వేరొకరు కాలుమోపడానికి కూడా చోటులేని శాపగ్రస్తులు
నిర్నిద్రితమైన దేహంతో కనలుతూ రాకాసిబొగ్గులా ఎగపోసుకుంటూ తెల్లవారుతున్న ఈ రాత్రి
రెండు సాదృశ్యాల నడుమ రెండు ఉనికిల నడుమ అగ్ని గోళంలా దహించుకపోతున్నప్పుడు
సింగారించిన నాలుగు అక్షరాలను కాగితాలమీద చిలకరించి కవిత్వం రాయబోను
ఉదయాలు మరణంతో కొయ్యబారి ఆకాశానికి చావు వాసన పులుముకుంటున్నట్టూ
ఒక రోజునుంచీ ఇంకో రోజుకు దాటడానికి ఎన్ని దేహాలు కావాలో లెక్కకట్టి
ఒకానొక దానిని ఇది తొలి వికెట్టని ప్రకటించినట్టూ మాత్రమే రాస్తాను
సరిగ్గా ఇలాంటి వేకువ జాములలోనే మొస్సాద్-రా మన ఇంటి తలుపు తట్టి
ఉమ్మడి దాడులలో పెడరెక్కలు విరగదీసి తలకిందులుగా వేలాడదీస్తారని రాస్తాను
గాజా – కశ్మీర్ తరుచూ పొరపడే పేర్లుగా నమోదు చేస్తాను
నేల మీద యుద్ధం తప్పనిదీ, తప్పించుకోజాలనిదీ అవుతున్న వేళలలో
విరుచుకపడే ధిక్కారాన్నే పుడమికి ప్రాణదీప్తిగా పలవరిస్తాను.
-అవ్వారి నాగరాజు
పక్షి ఎగిరిన చప్పుడు
దారి చెదరిన ఒక ఒంటరి పక్షి తెల్లని తన రెక్కలు చాచి
చుక్కలు కాసిన ఆకాశంలో వెతుకుతుంటుంది
ఒక దిక్కు మరొక దిక్కులోనికి ముడుచుక పడుకొనే జాము
కలయతిరిగి కలయతిరిగి
ఎక్కడ తండ్రీ నీ గూడు
నీలినీలి చీకటిలో ఎక్కడ తండ్రీ నీ తెన్ను
పగటి ఎండలో దూసర వర్ణపు వేడిలో వొదిగి వొదిగి దేహాన్ని ఏ చెట్టుకొమ్మకో వేలాడదీసి
క్రమంగా వివర్ణితమై ఒక కెంజాయ ముఖాన్ని చరుస్తున్నపుడు
నీకు గూడు గురుతుకొస్తుంది
దిగ్మండలం మీద చెదురుతున్న పొడలా దారి గురుతుకొస్తుంది
ఆకాశపు నీలిమ కింద
చుక్కల లేవెలుతురు క్రీనీడల కింద
నీ పూర్వీకులు తిరిగిన జాడల వాసన గురుతుకొస్తుంది
నీలాగే ఇప్పటి నీలాగే తిరిగి తిరిగి లోకం ముంగిట ఒక్క స్మృతినీ మిగిల్చుకోని కఠినాతి కఠినమైన మొరటు మనుషులు
ఆకాశం నుండి నేల వరకూ అనేకానేక లోకాలను తమ నిట్టూరుపులపై నిలబెట్టిన వాళ్ళు
అలుముకపోయిన చీకటిలో ఎక్కడో వెలుతురు
అలసిన నీ రెప్పల వీవెనల కింద వూటలా చెమరింపుల చల్లని తడి
తిరిగి తిరిగి ఇక అప్పుడు
దేహపు ఆవరణలలో పసికందులా రాత్రి నిదురపోతున్నప్పుడు
రెక్కల మీద చేతులు చాచుక ఆకాశం విస్తరిస్తున్నప్పుడు
కదిలినప్పుడల్లా సలుపుతున్న నొప్పిలా పక్షి ఎగురుతునే ఉంటుంది.
-అవ్వారి నాగరాజు
‘సమైఖ్య’గీతిక అనబడు బిస్కెట్టు కవిత
ఈ రోజు ముఖంలో ముఖం పెట్టి
అంటోంది ప్రేమించవేం ప్రియా ?
“సమైఖ్యం” గా ఉందామని
ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్ గోరటోని లాగా
అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక-
చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ
ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి
ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి బలవంతప్ప్రేమ లాగా
చీచ్చీ ఒళ్ళు తెలియడంలేదు సుమీ
తలుచుకుంటే కొన్ని సార్లు ఒళ్ళు అదుపు తప్పుతుంది సుమీ
ఎండాకాలపు ఒరిపిడిలోనూ ఇగరని జీర పాటల ప్రవాహ సవ్వడి సుమీ తెలంగాణం
స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక! స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక!
నిజంగానే ముఖంలో ముఖం పెట్టి మాటాడుదాం
రావేం ప్రియా అని బతిమాలుడుదాం
విడిపోతే ఎలా మనం అని విరహాలు పాటిద్దాం
కవి గాయక వైతాళికులను రమ్డోయ్ రారమ్డోయ్ అని నినదిద్దాం
ఒక ప్రణయ గీతికను రాయించి నీ కోసం ప్రత్యేకం అని కన్ను గీటుదాం
చెలియలికట్ట దాటకు చెలీ అని గొంతుక మీద కాలునలాగే కొనసాగిస్తూ మురిపెంగా బుజ్జగిద్దాం
అదీ కాక పోతే చరిత్ర తెలియదా అని శపిద్దాం
పొంగుకొచ్చే బాన కడుపులను
అల్లరిగా కాసేపు దాపెట్టి ఒక్క బిసెట్టు కూడా ముట్టలేదు సుమీ అప్పటి నుండి అని అతిశయంగా గారాలు పోదాం
జనం ఎటూ పైకెగయని గొంతుకలు కదా
గాలి పారాడని ఆవరణంలో ముముక్షువులై ముడుచుక పడుకున్న జెండాలు కదా
పొద్దునే లేచి లెక్కలేసుకొని జీవితాన్ని జేబిలో పొందికగా మడచి పెట్టుకో జూసే అకాల స్వప్నాలు కదా
చదువుకొని శిక్షణలు పొంది
కనీస్టూబుల్లలాంటి పంతుల్ల సాంగత్యంలో కారాగారాల్లాంటి కలల్ని కావలించుకొని పడుకొనే అర్భక ప్రాణులు కదా
ఇంకా ఇక ఉద్యోగాలుండవని అరుద్దాం
నీళ్ళుండవ్ నేలుండదు చివరాఖరుకు ముడ్డి మీద గోసి గుడ్డకూడా అని గావు కేకలు పెడదాం
జనం మీద జనాన్ని బంధిఖానా మీద బంధిఖానాను పోటీగా నిలబెడదాం
జారి పోకుందా ఉండేందుకు
అందరమూ కలిసి
సామూహిక ప్రణయ గీతిక రాద్దామని కాణిపాకం వినాయక సామ్మీద సత్యప్రమాణాలు తీసుకుందాం
నిజంగానే ఒక్క ప్రేమలేఖయినా రాద్దాం
కాలపు రేఖలమీద ఐక్యతను విడగొడుతూ ‘సమైఖ్యత’నొక ప్రతీకగా నిలబెడదాం
ఈ రోజుటి ముఖమ్మీద
తాగి పడేసిన సీసా గాజుముక్కతో వికృతంగా గజిబిజి ఒక్క ప్రేమ లేఖనయినా-
-అవ్వారి నాగరాజు
తాజా కామెంట్లు