స్వప్నాన్ని నాలో వొంపండి

jaya1

పూనే, మహారాష్ట్ర లో నివశించే జూయి కులకర్ణి మరాఠీ యువకవయిత్రి. హిందీ లోనూ కవితలల్లే చిత్రకారిణీ. మరాఠీ,హిందీ ఆంగ్ల భాషలతో పాటు పిగ్ లాటిన్ భాషలలో ప్రావీణ్యం సాధించిన బహుముఖ ప్రతిభావంతురాలు.

రాత్రంతా మేల్కొంటున్నావా? రెండు నదీ తీరాలను యేకం చేసే కవిత్వాన్నీ రాస్తున్నావా? అంటూ పలువురి సాహితీవేత్తల ప్రశంసలందుకొంది. శ్వాసల నిర్మాణ కార్యం అనే యీమె కవితా సంపుటి మరాఠీలో ఆసక్తిని రేకెత్తించింది. అతికోమలంగా కనిపించే పదాల వెనుకటి అల్లకల్లోలాలు పాఠకులను కలచివేసే కవితలు. యీమె కవిత్వ అభివ్యక్తి నూతనంగా వుండి ఆలోచింపజేస్తుందిలా-

నేటి నా కన్నీరును యీ పూలసజ్జలో దాస్తున్నాను..కొన్ని రోజుల్లో వో యాత్రికుడి దాహాన్ని తీర్చాక ఆరిపోవచ్చు.యీమె కవిత్వంలోని కల్పనలు,ప్రేరణలు,అర్థవంత నిర్మాణాలకు పునాదిగా నిలిచి మానవ సంబంధాలను నిర్మిస్తాయి. యీ కవితను గీత్ చతుర్వేది మరాఠీ నుంచి హిందీ చేసారు.

jaya

స్వప్నాల దాడి
——————–

యీ రోజుల్లో స్వప్నాలు
గొప్పగా ప్రపంచ వ్యవహారికంగానే వస్తున్నాయి

స్వప్నాలలోనూ
వంట చేయాలనిపిస్తుంది
చాలా సార్లు నన్ను నేను
వంట చేస్తున్నట్టే స్వప్నిస్తాను

చీల్చుతూ, కోస్తూ, మర్థిస్తూ
వుడకబెడుతూ, వేయిస్తూ, వండుతూ
పెరుగుతూనే వుంటాయి
నీ కవితలు, కథలు,వృత్తాంతాలు,నవలలు

స్వప్నాలలోనూ
తెరచిన కిటికీ నుంచి
బల్లులు, కప్పలు వస్తుంటే చూస్తుంటాను
భయపడిపోతుంటాను

స్వప్నాలలోనూ
గడియారపు ముళ్ళపై
నా బరువును తూకం వేసి
ఆకస్మిక భీతిలో నిద్రపోతాను

స్వప్నాలలోనూ
రుచి చెడిన అన్నపు వ్యంగం
గొర్తొస్తుంది

వినండి!
మీరెవరైనా సరే
బలవంతంగానైనా పర్లేదు
కొత్త కొత్తగా గాని
కఠినాతి కఠినమైనవి కాని
చూచేందుకు సరైన
స్వప్నాన్ని నాలో వొంపండి..

*

కాసింత రక్త స్పర్శ!

satya1

Art: Satya Sufi

1977 బొంబాయిలో జన్మించి భోపాల్ లో నివశిస్తున్న గీత్ చతుర్వేది గద్య పద్య రచనలను సమానంగా లిఖిస్తున్న కవి.  పదహారేళ్ళ పాత్రికేయ వృత్తి తరువాత తను అధిక సమయాన్ని రచనా వ్యాసంగానికే వెచ్చిస్తున్నారు. యితనిని యిండియన్ యెక్స్ప్రెస్ లాటి ప్రచురణ సంస్థలు ప్రసిధ్ది చెందిన 50 మంది హిందీ రచయితల్లో వొక్కడిగా పరిగణించాయి. యితని ఖాతాలో ఆరు రచనలు ప్రచురింపబడ్డాయి.

యితని కవితలు 14 దేశ విదేశీయ భాషల్లో అనువదింపబడ్డాయి. అనేక పురస్కారాలు సృజన,అనువాద రచనలకు యితన్ని వరించాయి. గీత్ చతుర్వేది 21వ శతాబ్దపు కవి. 2010లో తన మొదటి కవితా సంకలనం అలాప్ కా గిరహ్ ప్రచురింపబడితే రెండో కవితా సంకలనం న్యూనతం మైఁ ప్రచురణలో వుంది. గీత్ చతుర్వేది హిందీ కవిత్వంలో ప్రపంచ గుర్తింపును సాధిస్తున్న కవి.

వీరి కవితలు మారే కాలంతో పాటు యెదుగుతున్న సముచిత కవితలు. అందుకే వీరి కవిత్వం బరువైన  కవితలుగా మారుతున్నాయి. యితని కవితల్లోని ప్రతిబింబాలు, సంకేతాలు యాంత్రికతలో మనిషి హత్యల చల్లటి నెత్తురు యెగజిమ్ముతుంది.యితని కవితల్లో మనల్ని మనుషులుగా నిలిపి వుంచే మరో విశిష్ట సృజనాత్మక లక్షణం.

chatur

*

ఆనందపు గూఢచారులు
———————————–

వొక పసుపుపచ్చని కిటికి
తెరుచుకొంటోంది
పూరేకులు విప్పారుతున్నట్టుగా

వొక పంజరపు పక్షి
వూచల్ని కొరుకుతుంటుంది
తన పొలంలోని వరికంకుల్ని కొరికినట్టు

నా స్వప్నాలు కొన్ని
పొడిబారి పోయాయి యిప్పుడు
వాటితో నిప్పు గుండాన్ని
మండిస్తున్నాను యిప్పుడు

కొన్ని పచ్చగా వున్న నా కలలను
పోగేసుకొని
వో గొర్రె ఆకలిని నింపుతున్నాను

నా భాషలోని అతివృధ్ధ కవి
లైబ్రరీ నుంచి లావుపాటి పుస్తకాలు తెచ్చాడు
కూడలిలో కూర్చొని
బంగారు నాణేల్లాంటి పదాలను
పంచిపెడుతున్నాడు

నా పొరుగింటి ముసలావిడ
వొక యంత్రాన్ని ఆవిష్కరించింది
అందులో కన్నీటిని కుమ్మరిస్తే
తాగేందుకు నీరు
తినేందుకు వుప్పు వేరౌతాయి

వో అమ్మ తన బిడ్డలను
యెంత ప్రేమగా చూస్తుందో
ఆమె పాలధారతో
అనేక నదులు ప్రవహిస్తుంటాయి

నేల పైన చెల్లాచెదురైన
లోతైన నెత్తుటి యెరుపు రంగు
ప్రేమ యొక్క లేత గులాబి రంగులోకి
మారిపోతుంది….

*

యివే లేకుంటే …

vandana1వందన టేటే రాంచి, ఝార్ఖండ్లో నివసిస్తున్న ఆదివాసీ కవయిత్రి. రాజస్థాన్ విద్యాపీఠ్ లో తన విద్యను పూర్తిచేసి యే.కే.పంకజ్ ను వివాహమాడి ఆధార్ ఆల్టర్నేటివ్ మీడియాను స్థాపించి ఆదివాసీ హక్కుల కోసం నిత్యం పనిచేస్తున్నారు. ఝార్ఖండ్ ఆదివాసీల భాష,సాహిత్యం,సంస్కృతులను ప్రతిబింబించే ‘అఖాడా’ అనే పత్రికకు సంపాదకురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

వందన టేటే వ్యక్తిగా చాలా ప్రశాంతంగా కనిపించినా ఆమె కవితలు మాత్రం చదివేకొద్ది మనలో నిద్రపోతున్న అలజడులను సృష్టించి మేల్కొల్పుతాయి. యిలాటి అనుభవం కోసం యీమె రచించిన స  ‘కోన్జోగా’ అనే కవితా సంకలనం చదివి తీరాల్సిందే. కొండలతో, నదులతో,పాటలతో తయారైన వో ఆదివాసీ స్త్రీ కి అంకితమిచ్చింది యీ కవయిత్రి. స్త్రీ మారిన తన యింటిపేరనే బరువును మొండిగా,నిర్భయంగా మోస్తున్నదని అవేదన చెందుతుంది. తన పూర్వీకుల త్యాగాలను కీర్తిస్తూ,తన వారి అస్తిత్వ సంక్షోభాలను కవిత్వంగా వినిపిస్తూ వారిలో నమ్మకాన్ని, యేకత్వాన్ని సాధించడాన్ని నిరంతరం కృషి చేస్తున్న కవయిత్రి సామాజిక కార్యకర్త కూడాను.

vandana

సీతాకోకచిలుక
——————–

నాకు తెలుసు
సీతాకోకచిలుక రెక్కలు వున్నవి
అందంగా కనిపించేందుకో లేక
యెగిరేందుకో కాదని
రెక్కలు దీని అస్తిత్వంలో భాగం అని
యివే లేకుంటే దానికి వునికే లేదని

నాకు తెలుసు
సీతాకోకచిలుక రెక్కలు
మనసును ఆకర్షించేందుకో లేక
వాటి రంగులను నిర్వచించేందుకో కాదని
రంగులు దాని జీవితపు అంగాలు అని
యివే లేకుంటే దానికి యెలాంటి గుర్తింపూ వుండదని

నాకు తెలుసు
సీతాకోకచిలుక రెక్కలు
ప్రియుణ్ణి వాటికింద పొదివించుకునేందుకు కాదని
కేవలం పిల్లలను పోషించేందుకు కాదని
దీని రెక్కలు ప్రకృతి శ్వాసలని
యివే లేకుంటే
యీ భూమి జీవించడం కష్టం అని…

*

చీకటిని మింగిన వెలుగు తార

hemantహేమంత్ కుక్రేతి హిందీ ఆచార్యులుగా పనిచేస్తూనే తన కవితా సేద్యంలో ఐదు కవితా సంపుటాలు పండించారు. కవిత విమర్శ పై నాలుగు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. హిందీ సాహిత్య వాస్తవ చరిత్ర అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని రచించారు. వీరి కవితలు భారతీయ భాషలతోపాటు విదేశీ భాషల్లోనూ  అనువదింపబడ్డాయి.ఆకాశవాణి,దూరదర్శన్లకు తమ రచనా సేవను అందిస్తున్నారు. సాహిత్య పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యిన్ని రకాలుగా సాహిత్యానికి సేవచేస్తున్న వీరికి పురస్కారాలు వరించవా?! వీరి కవిత్వం మనుషుల్ని నమ్మి వారి చుట్టూ తిరిగే అందాలను వర్ణిస్తుంది, మోసాలను పసికడుతుంది. వీరి కవిత్వం చీకటిని మింగి వెలుగు తారలను కురిపిస్తుంది. జీవితం పట్ల విపరీత ప్రేమ వో వైపూ మరో వైపు నిరశన కూడా లేకపోలేదు. దుఖాలను తుడిచే ప్రయత్నంలో చివరి వరకు పోరాడే కవిత్వం. కవిత్వాన్ని చదవాలని కవిత్వమై బతకాలనే ధృఢమైన సంకల్పం వుంటుంది అతని కవితల్లో. వ్యవస్థల పట్ల విపరీతంగా వ్యంగ్యంగా దుయ్యబట్టిన సంధర్భాలు అనేకం. వర్తమానంలో కవిత్వాన్ని వొక ఆయుధంగా వుపయోగించమనే కవుల్లో అగ్రగణ్యుడు.

మట్టి కవిత
—————-

నీరే మట్టిని రాతిలా మార్చుతుంది
నీటిలో నానితే అది మెత్తబడుతుంది
నిప్పు లోపల నీటిచుక్క వుండునేమో
ఆకాశంలో భూమి జీవితంలా

యెన్నో యుగాల నుంచి సీతాకోక చిలుకలు
తమ శరీరాలపై వొణుకుతున్న రంగుల
మౌనాన్ని మోస్తున్నాయి.
పూలు యెవరి ప్రేమ యాతనలోనో కాలుతుంటాయి
మరెవరిలోనో జ్ఞాపకాలు  మట్టిలా మారిపోతుంటాయి

జీవించడానికి ప్రాణానికి ఆత్మ తోడు కావాలి
శరీరమంతటా అన్నపు వాసనే లేదు
పనికి యే కవచము లేదు
తప్పించుకుని వుండడమంటే గింజలా మారడమూ కాదు
యీ పనికి రాని ప్రపంచంలో వో భారీ లాభం దాగుంది
కొన్ని లాభంలేని వుపాదులు
మిగిలిన వ్యాపారమంతా యిలానే వుంటుంది
తనకు తననే కొనుక్కొని
అమ్ముడుపోవడం నుంచి తప్పించుకోవాలి
దేవుడి గొప్పతనం దైనిక భవిషత్తు
ఫలితం తప్ప మరేం లేదు

ప్రేమించేందుకు అడ్డుపడుతూ కాలయాపన కోసం ప్రేమించలేదు
తన జీవితపు వుప్పును పొందేందుకు
తన మట్టినే పిసికి తన ముఖాన్ని తయారు చేసుకున్నాడు

మబ్బుల్లో  మెరుపులు వుంటాయి
మెరిసే ప్రేమమయ ముఖాలపై యెక్కడో లోతుగా గుచ్చుకున్న
గాయాలు వుంటాయి
వీటిల్లో నుంచి వొకరికొకరం దగ్గరగా సమీపిస్తాం
అంతం మమ్మల్నీ విరిచేసి
నిర్మించుకోమనే సవాలు విసురుతుంది

మట్టికి చావు లేదు
అది కొద్దిగా పెరిగుతుంది

వారి ప్రాణాలు యెవరి వద్ద వుంటాయో

పొదలలో దాక్కొన్న వాడు
ఎలుగుబంటి అయ్యుంటాడు
యెందుకంటే బంగాళాదుంప తినేవాడు
దాని కథతోనే భయపడి పోయాడు
బంగాళాదుంపను పండించేవారే
ఎలుగుబంటిని అదిలించారు

వారు వెచ్చదనం కోసం పాలు తాగేందుకు వెళ్ళారు
పశువులను మేపుకొని తిరిగొచ్చారు
వారి చెమట యెంతలా మండుతూ వుందంటే
బంజరును మండించేసేలా వుంది

నివాసించాలనే సాకుతో పల్లెలను కాల్చేస్తున్నారు
హిమాలయాలను కరిగించేసి సప్తసముద్రాలను దాటించేస్తారు
గంగాతీరంలో మధ్యసీసాల్లో నింపి , అమ్మేస్తారు

యిక కాపాడుకునేందుకు తమ
ప్రాణాలు తప్ప యిక యేమి లేనివారు
యిలాటి వారినే యెందుకు యెంచుకుంటాడో
తాను పండించిన బంగాళాదుంపల ఖరీదుతో భయపడి
అక్కడి పొదల్లో దాక్కొంటాడు

వాడు కథలలో నుంచి బయటకు వచ్చి
వారిని లోపలకు యెందుకు పంపడు

వీరి యిళ్ళను ఆక్రమించుకొన్నాక
పొలాల్లో
అంతరిక్ష నరకాన్ని నిర్మించాలనుకొంటున్నాడు.

*

నానుంచి నీకు విడుదల ఇక!

mastanకృష్ణ మోహన్ ఝా మధేపురా బీహార్ లో జన్మించారు. తన వున్నత విద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి అస్సాం విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. సమయ్ కో చీర్కర్ అనే కవిత సంపుటిని హిందీలోనూ,యెక్టా హెరాయల్ దునియా అనే సంపుటిని మైథిలిలోను ప్రచురించారు. యితని కవితలు మరాఠి,మైథిలి,నేపాలి,ఆంగ్ల భాషల్లో అనువదింపబడ్డాయి.

కృష్ణ మోహన్ ఝా కవితలలో కోమల దేహంపై కాలం చేసిన లోతైన గాయాలు వుంటాయి. గాయాల గురుతులు మన సభ్య నాగరికత చేసిన అనేక అసంగతులను సంకేతిస్తాయి. మనుషులు చేసే హింస హింసను కొట్టే దెబ్బలను భరించే ప్రకృతి దుఖంతో యితని కవిత్వం కంపిస్తుంది.యేడ్చే పిల్లవాడు తన మాటలను లిఖించినట్టు,యేడ్చి యేడ్చి లేచొచ్చిన స్త్రీ లా యితని కవిత్వముంటుంది. కవిత్వ రసస్వాదనలో దాని ఆంతరంగిక లయను ఆత్మగతమై రచిస్తాడు కవి.

నిన్ను విడుదల చేస్తున్నాను
————————————-

నేను వో రాతిని తాకుతాను
వారి కలవరంలో రాళ్ళుగా మారిన
వారి గాయాలు కనిపిస్తాయి

నేను మట్టిని తాకుతాను
భూమి చర్మం చుట్టూ అల్లుకున్న
అదృశ్యపు పువ్వుల సువాసనలు చూస్తాను

నేను చెట్టును తాకుతాను
క్షితిజంలో పరుగెత్తే వ్యాకులత నదులు
పాదగురుతులు వినిపిస్తుంటాయి.

ఆకాశం వైపు చూస్తూనే
నీ వీపులో నుంచి పుట్టిన బాణం
నన్ను చీల్చుకొంటూ వెళ్ళిపోతుంది

నా చుట్టు నిశబ్దాన్ని మోగనివ్వాలి
వెళ్ళిఫో
యీ ప్రపంచంలో నాకు ముక్తి లభిస్తుంది
నీతో యేం చెప్పలేను..చెబితే
దానికి అర్థము వుండదు
నేను నిన్ను నానుంచి విడుదల చేస్తున్నాను
యింత కంటే యింకేమి చెప్పలేను

నా దేహం, కళ్ళ నుంచి
నా శరీరపు పరాగాన్ని వూడ్చుకొని
తీసుకు వెళ్ళు

నాలో యెక్కడైన నా పేరున
వో అలికిడి మిగిలి వుంటే
దోచుకు వెళ్ళు

యుగాలు నేసిన దాహపు దుప్పటిని
నా దేహంపై నుంచి లాక్కెళ్ళు

వొక అర్థవంతమైన జీవితం కోసం
యింత దుఖం తక్కువేం కాదేమో…

*

రంగుల్ని కోల్పోయిన దిగులు!

vazda

వాజ్దా ఖాన్  సిధ్ధార్థ నగర్, వుత్తర్ ప్రదేశ్ లో జన్మించిన యీ ప్రసిధ్ధ చిత్రకారిణీ వో మంచి కవయిత్రి కూడా. బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి చిత్రకళలో యెం.యె.,డి.ఫిల్. పట్టాను పొందారు.యీమె ‘జిస్ తరహ్ ఘుల్తీ హై కాయా’ (దేహం కరుగుతున్నట్టు) అనే కావ్య సంకలనాన్ని భారతీయ జ్ఞానపీఠ్ వారు ప్రచురించారు. హేమంత్ స్మృతి సమ్మాన్ పురస్కారాన్ని పొందారు.  చిత్రకళాకారిణిగా అనేక యేక, సామూహిక చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. యీమె కవితలు భారతీయ భాషల్లో అనువదింపబడ్డాయి.

వాజ్దా ఖాన్ కవితల్లో రంగులను శిల్పించే శిల్పి సంవేదన వుంది.యింకా ప్రపంచపు రాగతత్వంతో పాటు వర్ణహీన జీవితపు స్థితుల్లోని సుఖ దుఖాలను వేరుగా చూడడం కష్టంగానే వుంటుంది. యీమె కవితల్లోని చైతన్యపు కరుణామయ పిలుపు అస్థిత్వపు దార్శినికత వైపు తీసుకెళుతుంది. భాషా శిల్పాల జుగల్బందిలో వాజ్దా ఖాన్ కవితల్లోని అంతరంగిక లయ కారణంగా పాఠకుణ్ణి ప్రత్యేకంగా పలకరిస్తుంటాయి.

మట్టి, గాలి, నేనూ
————————

స్వప్నాలూ
మీకు యేం అవసరం వుందని
శతాబ్దాల తరబడి నా చుట్టే తిరుగున్నారు
నా సారాన్ని రహదారుపై వెతుకుతుంటే
మీరు నన్ను వెంటనే నన్ను కప్పేస్తుంటారు

మీరిలా అంటుండే వారు కదూ –
నాలో  సూక్ష్మ రూపంలో వున్నావని
నా ప్రతి చింతనలో
నా ప్రతి శ్వాసలో
వాటిని దించుకునే దానిని నేను
మనసు రెప్పల పై నుంచి
ఆకాశపు రెప్పలపైకి
నా వుత్తమ విధానాన్ని రచించేందుకు
నీలో వెతుకున్నాను
నా సారం – భూమి, ఆకాశం,సముద్రం
మట్టి,గాలి,నేను
అన్నీ నీలో విలీనం అయ్యాయి
రెప్పల తడి శివమౌతోంది
యీ ఆలోచనను కూడా నీవే నిర్మించావు
సాధనా శివంగా మారే దిశ నిర్మింపబడింది
కల్పన రూపాన్ని గ్రహించడం ఆరంభమైంది
యుగపు శాశ్వత సత్యం నీవు
నీ దేహం నుంచి తన అమూర్తత వరకు…

*

వాన సంవాదం!

tushar

42 యేళ్ళ తుషార్ ధవళ్ సింహ్ డిల్లీ స్కూల్ ఆప్ యెకనామిక్స్ లో పట్టభద్రులై యిండియన్ రెవెన్యూ సర్వీస్ లో కమీషనర్ ఆప్ ఇన్కంటాక్స్ గా పని చేస్తున్నారు. పైంటింగ్,ఫోటోగ్రఫి, నాటకాలు కూడ అంతే యిష్టంగా వేస్తుంటారు.యిప్పటివరకు రెండు కవితా సంకలనాలు ప్రచురించారు.

యితని కవిత్వం యాంత్రిక జటిలతను ప్రశ్నిస్తూ ..వుత్తర పెట్టుబడి వాదంతో భారత దేశ సంస్కరణల వలన యేర్పడ్డ విషమ పరిస్థితులను యితని కవిత్వం గొంతెత్తుతుంది.రంగుల్లేని మధ్యతరగతి జీవనపు దుఖాలను దుఖమై కరుగును.యీ సంవేదనలన్నీ తన కవిత్వంలో తిరిగి మానవత్వాన్ని పొందాలనే ప్రయత్నంలో భాగమే. దృశ్యాత్మక బింబాల్లో యదార్థాలను ప్రకటించడమే తన శిల్పపు ప్రత్యేకత.

యీ యాత్రలో
——————-

చాల దూరం వరకు విస్తరించిన దట్టమైన అడవిలో
నాకు వో నది కనిపిపిస్తుంది
నువ్వు చూడలేక పోవచ్చు

తేమతో వేగంగా వీచే గాలి
వాన సంవాదంతో
వర్షాన్ని తీసుకురాదు
నిగిడిన వో తియ్యదనం వుంటుంది

యింతవరకు నడిచినదంతా
నా లోపలే నడిచిచాను
మైళ్ళ బొబ్బలు నా అరికాళ్లు
నా నాలుక పైనా వున్నాయి

నా గాయాల లెక్కింపు
నీ లెక్కించలేని
జయగాథల్లో జతకావచ్చు
యీ యాత్రలో
నా కోసం
యివి చిత్రాలు

యీ బెరడులపై
అక్కడి నుంచే బయలు దేరుతున్నాను
ఆ గుహల వరకు

నా పరిశోధన గురుతులు వున్నాయి
నీ యాత్రలలో దుమ్ము వుంది
వీటిల్లో సుఖపు రోజుల్లోని
విధ్వంసపు కథలున్నాయి

అన్నీ పడదోసి చేరుకున్నప్పుడు
నాకు నేను తిరిగివచ్చినట్టు
అనుకొంటాను

తిరిగి రావడమంటే
యేదో చెట్టు తన గింజలోకి ప్రవేశించడం
సాధారణ సంఘటన కాదు
యిది వొక అజేయ సాహసం
పతనానికి వ్యతిరేకంగా …

*