ఆఖరి మెట్టుపైనుండి..

 

 

 

                                                         రామా చంద్రమౌళి

 

 

ఇక్కడనుండి చూడు.. ఈ ఆఖరి మెట్టుపైనుండి

ముషాయిరా.. రాత్రిని కాల్చేస్తూ కాల్చేస్తూ

ఎలుగెత్తిన స్వరాలను మోసుకుంటూ గాలిలో .. ఒక దుఃఖజీర

ప్రక్కనే నిరంతరమై ప్రవహిస్తూ.. నది.. నిశ్శబ్దంగా –

ఔనూ.. శరీరంలోని ప్రాణం శబ్దిస్తుందా

పాదాలు ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు

అందుకోవాలని అలలు పడే యాతన.. ఒక వియోగ జీవక్షోభ

గజల్ గాయని  ఒక్కో వాక్యకణికను

యజ్ఞం లోకి సమిధగా అర్పిస్తున్నపుడు

అక్షరాలు.. అగ్నిబిందువులై తేలి వస్తూంటాయి గాలిలో

సముద్ర జలాలపై లార్క్ పక్షుల్లా –

భూమిలో విత్తనమైనా, పిడికిట్లో నిప్పైనా

ఎన్నాళ్ళు దాగుంటుంది

మొలకెత్తడం.. దహించడం అనివార్యం కదా –

 

అర్థరాత్రి  దాటుతూంటుంది.. అంతా మత్తు.. స్వరమధురిమ మైకం

వజ్రాల హారాలేవో తెగిపోతున్నట్టు

దీపజ్వాలలేవో తీయగా కాలుస్తూ నిశ్శేషపరుస్తున్నట్టు

శరీరం ఉంటుంది

కాని ఉన్మత్తచిత్తయైన ఆత్మ ఉండదు

అడవివంటి అంతరంగం నిండా వందలవేల పక్షుల కలకలం

ఒక మనిషి  సున్నా ఔతుండగా..  మరొకరు ఒక ఒకటౌతారు

సున్నా ప్రక్కన ఒకటి.. ఒకటి ప్రక్కన సున్నా

విలువలు విలోమానులోమాలై

వడ్రంగి పిట్టొకటి తాటిచెట్టును ముక్కుతో పొడుస్తున్న చప్పుడు

పెక్ పెక్ పెక్

తొర్ర ఎక్కడేర్పడ్తోందో తెలియదు

 

రాత్రి ముషాయిరాకు వస్తున్నపుడు

సందు మలుపు చీకటి నీడలో

వీధికుక్క అతనిలోని మరకను పసిగట్టి

మొరిగిన చప్పుడు .. ఫడేళ్మని తెగిన ఫిడేల్ తీగ

పశ్చాత్తాపం ఎప్పుడూ భళ్ళున పగిలిన పింగాణీ పాత్రే

ముక్కలెప్పుడూ తిరిగి అతకవు

కరిగించాలి.. అతకనివాటిని కరిగించాలి

విరుగుట.. పగులుట.. అతుకుట

జీవితమంతా ఆత్మరక్షణే-

ఆరిన దీపం చుట్టూ.. రెండు చేతుల దడి

చివరికి ముందర ఒక ఖాళీ పాత్ర

నిండడంకోసం ఎదురుచూపు

మాసిన గోడలపై .. ఉమ్మేసిన పాన్ మరకలు

ఎక్కడిదో గాలిలో తేలివస్తూ

నిన్నటి ముషాయిరాలో పాడిన ఎంగిలిపాట ఖండిత వాక్యం

కానీళ్ళోడ్తూ-

ఇంకా తెల్లవారక ముందే

నది ఒడ్డుపై ఎవరో.. జలహారతిస్తున్నారు

రెండు చేతుల్లో ఇత్తడి పళ్ళెం ధగధగా మెరుస్తూ .. ఎర్రగా మంట

ఆకాశం తగలబడి పోతోంది –

 

*

 

 

 

 

Sent to Sri Afsar SARANGA

Dt: 12-04-2016

 

విజాతి మనుషులు 

 

                                                                                          

                                                                    – రామా చంద్రమౌళి

 

Ramachandramouli“అసలు అందం అంటే ఏమిటి శివరావ్ “.. అంది మనోరమ ఆరోజు రాత్రి..తమ పెళ్ళై అప్పటికి ఒక పదిరోజులైందో లేదో.  అంతే.

కొత్తగా.. హైదరాబాద్లో.. కిరాయి అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టిన తొలి దినాలు. శీతాకాలం రాత్రి.. పదిగంటలు.. డిసెంబర్ నెల.. సన్నగా చలి.. కిటికీలోనుండి చూస్తే.. అప్పుడప్పుడే మంచుదుప్పటి కప్పుకుంటున్న నగరం.. దూరంగా నిప్పుల కణికల్లా కరెంట్ దీపాల కుప్పలు..మిణుకు మిణుకు.

అప్పుడు మనోరమ తను రీసర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న సిసిఎంబి నుండి ఒక గంటక్రితమే వచ్చి..వంట చేసి..ఇద్దరూ తిన్న తర్వాత..యధాలాపంగా పక్కను సర్దుతూ..దుప్పటిని సరిచేస్తూ.,

శివరావు..డాక్టరేట్ పూర్తి చేసి..ఉస్మానియా లో కొత్తగా లెక్చరర్ గా చేరి..ఒక ఏడాది.,

శివరావు..కిటికీలో నుండి బయటికి..వెన్నెలనిండిన నిర్మలాకాశంలోకి చూస్తూన్నాడు.శివరావుకు ప్రతిరోజూ కనీసం ఓ  ఐదారుసార్లన్నా ఊర్కే అలా ఆకాశంలోకి చూడ్డం అలవాటు. అతనికి ఆకాశంలోకి చూస్తున్నప్పుడల్లా సముద్రంలోకి చూస్తున్నట్టో.. తన ఆత్మలోకి తనే తొంగి చూసుకుంటున్నట్టో..మనిషికి యుగయుగాలుగా ఈనాటికీ అర్థంకాని ఏదో ఒక మహా రహస్యాన్ని చిన్నపిల్లాడిలా గమనిస్తున్నట్టో అనిపిస్తుంది.నిజానికి ఆకాశం.. అంతరిక్షం  మనిషి పుట్టిన నాటినుండీ ఇంతవరకూ ఎవరికీ అర్థంకాని ఒక ప్రశ్న.

“నువ్వు చెప్పు” అన్నాడు శివరావు.

“అందమంటే..ఒక విద్యుత్ తీగలో బయటికి కనబడకుండా ప్రవహిస్తూ మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే కరంట్ వంటిది..వెలిగిస్తుంది..కాలుస్తుంది..షాక్ ఇస్తుంది..గిలిగింతలు పెడుతుంది” అంది అలా పక్కపై వాలిపోటూ..శివరావువంక అభావంగానే చూస్తూ.

శివరావు మాట్లాడలేదు.. కొద్దిసేపు మౌనం తర్వాత కిటికీలోనుండి నిద్రకుపక్రమిస్తున్న నగరాన్ని చూస్తూనే.. వెనుకున్న మనోరమ దిక్కు చూడకుండానే అన్నాడు..” మనోరమా..అందమంటే..ఎప్పటికైనా తప్పకుండా నశించిపోయేది అని అర్థం..” అని.

మనోరమ షాక్ ఐంది. ఆమె అతని నుండి అలాంటి సమాధానాన్ని ఊహించలేదు. నిజానికి మనోరమది మగవాణ్ణి పిచ్చివాన్ని చేయగల అత్యంత ఆకర్షణీయమైన శరీర సౌందర్యం. ఆమె వెన్నెల విగ్రహంలా ఉంటుంది. ఆమెకు వీలుచిక్కినప్పుడల్లా తననుతానే అద్దంలో చూసుకుని మురిసిపోవడం అలవాటు. తన అందాన్ని తన ప్రాణకన్నా మిన్నగా.. జాగ్రత్తగా.. పదిలంగా చూచుకోవడం.. అందాన్ని దాచుకోవడం ఇష్టం.

శివరావుకూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా.. గ్రీక్ యోధునిలా ఉంటాడు. ఆరడుగులపైబడ్డ ఎత్తు అతనిది. నిజానికి మనోరమ అతని అందాన్ని చూచే పెళ్ళి చేసుకుంది. అతని అద్భుతమైన మేధా సంపత్తినిగానీ.. మానవీయ పరిమళంతో నిండిన అతని ఆదర్శ భావాలనుగానీ.. సమున్నతమైన అతని వ్యక్తిత్వాన్నిగానీ  ఆమె ఏనాడూ గమనించలేదు.

ఒకే ట్రాక్ పై పయనిస్తున్న రెండు రైళ్ళు ఒక జంక్షన్ నుండి రెండు భిన్న దిశల్లోకి మారుతున్న దృశ్యం ఎందుకో ఆమె కళ్ళలో మెరిసింది చటుక్కున.

ఇద్దరి మధ్యా భిన్నత. ఆలోచనల్లో.. అభిరుచుల్లో.. ఆకాంక్షల్లో.. లక్ష్యాల్లో.. జీవితం గురించిన భావనలో.

ఆమె ఊహించని రీతిలో శివరావన్నాడు.. “మనోరమా.. నువ్వడిగిన భౌతికమైన అందం గురించి చెప్పాను నేను.. ఆ అందం గురించయితే నేను చెప్పిందే పరమ సత్యం. కొద్దిగా వాస్తవిక దృష్టితో చూస్తే నీకే తెలుస్తుందది. ఐతే.. ఎప్పటికీ వాడిపోనిదీ.. శాశ్వతమై నిలిచేదీ.. పైగా రోజురోజుకూ ఇంకా ఇంకా భాసించే అందం ఒకటుంది..” అంటూండగానే,

ఆమె అంది ..” అది హృదయ సౌందర్యం కదా.. అంతా ట్రాష్.. ఒట్టి చెత్త.ఎంజాయ్ ద బ్యూటీ ఫరెవర్.. యవ్వనాన్నీ.. అందాన్నీ.. పరమ సుఖాలనూ అనుభవించలేనివాళ్ళు చెప్పే చెత్త మాటలివన్నీ.. ఐ హేట్ ఆల్ దిస్ నాన్సెన్స్ ” అంది ఉక్రోషంగా. అని మంచంపై అటువేపు తిరిగి పడుకుంది .. మూతి ముడుచుకుని.

“మనుషులకు అందమైన శరీరాలతోపాటు దేవుడు అందమైన మనస్సునూ బుద్దినీ ఇస్తే బాగుండేది.. కాని అలా ఉండదు  సృష్టిలో.. చాలామంది అందమైన మనుషులకు వికారమైన మనస్సుంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.. తెలుసా. మనిషికి ఏదైనా శారీరక జబ్బు చేస్తే సరిచేసుకోడానికి డాక్టర్ల దగ్గరికెళ్ళి చికిత్స చేయించుకుంటాం.ఎందుకంటే ఆ డిజార్డర్ మనకు వెంటనే తెలుస్తుంది కాబట్టి..అసౌకర్యంగా కూడా ఉంటుంది కాబట్టి.కాని మనిషి మనస్సుకు జబ్బు చేస్తే మనకు వెంటనే తెలియదు.దానికి చికిత్స చేయించుకుని మనస్సును ఆరోగ్యవంతం చేసుకోవాలనికూడా మనం అనుకోము. మానవీయ లక్షణాలతో తనను తానూ.. చుట్టూ ఉన్న సమాజ  సంక్షేమాన్నీ.. సాటి మనుషుల పట్ల సహానుభూతినీ.. కొంత త్యాగాన్నీ అలవర్చుకోని మనస్తత్వం రుజగ్రస్తమైనట్టు లెక్క.”

“ఆపండిక లెక్చర్ ఇక..నిద్రస్తోంది నాకు” దుప్పటికప్పుకుంది తలపైదాకా చిటపటలాడ్తూ..గదినిండా మల్లెపూల పరిమళం.

ఆ పరిమళాన్ని ఆస్వాదించే ఆసక్తీ.. యవ్వన జ్వలన.. అన్నీ శివరావుకు ఉన్నాయి.. వెళ్ళి మంచంపై కూర్చుంటూ .,

తర్వాత్తర్వాత.,

ఈ యేడాది కాపురంలో . . అభిరుచుల వైరుధ్యాలతో. . భిన్నతలతో..విభిన్న తత్వాలతో..ఏదో ఎక్కడో.. బీటలు వారుతున్నట్టు ..చీలిక ఏర్పడుతున్నట్టు.. రేఖలు రేఖలుగా విడిపోతున్నట్టు .. తాడుపురులువిప్పుకుపోతున్నట్టు .. తెలుస్తోంది ఇద్దరికీ.,

నిజానికి.. ఈ భిన్నత ప్రతి భార్యాభర్తల విషయంగా.. పెళ్ళైన కొత్తలో ఎవరికి వారికి అనుభవంలోకి వచ్చేదే.

పెళ్ళికి ముందు.. పెళ్ళి చూపుల హాస్యపూరిత తతంగంలో.. మనుషులు చూడగలిగేది ఏమిటి.. ఒట్టి శరీరాల ఆకృతినీ..రంగునూ.. చదువూ.. ఉద్యోగం.. ఆర్థిక నేపథ్యం.. వీటినేగదా. అసలైన మనస్సునూ.. హృదయాన్నీ.. తత్వాన్నీ అంచనా వేసే వీలు ఎక్కడ.? . . తీరా పెళ్ళి జరిగి.. కాపురం మొదలైన తర్వాత..ఆరంభమౌతుంది అసలు విషయం.. ఆమె ఆశించినదానికి భిన్నంగా  వీడు.. తాగుడు.. తిరుగుడు.. లంచాలు తీసుకునుడు.. స్నేహితులతో నానా బీభత్సమైన వ్యవహారాలు.. అవినీతి..అనైతికత..డబ్బుకోసం ఏదైనా చేయగల దుర్మార్గం..ఇవన్నీ,

ఈమె నేపథ్యానికీ..అభిరుచులకూ..ఏవైనా కళాత్మక అభిరుచులుంటే..గానమో..నృత్యమో..రచనో..సామాజిక సేవా గుణమో..ఉంటే..అంతా” నోర్ముయ్” కింద సమాధి.

అంతా రాజీ పడడాలు.. సర్దుకుపోవడాలు..పట్టు చీరలకింద.. కొన్ని నగల భారంకింద.. హూంకరింపులకింద.. అప్పుడప్పుడు.. దేహ హింసకింద.. బెదిరింపులకింద.. సమాధి ఐపోయి.,

‘ నా బతుకింతే. దేవుడు ఇంతే రాసిపెట్టాడు నా ఖర్మ.’  అని ఒక స్వయం ఓదార్పు.ఎవరికి వారూ..అటు భర్తా..ఇటు భార్యా.

ఒక్క కుదుపు కుదిపినట్టనిపించి.ఉలిక్కిపడి..కళ్ళు తెరిచి,

శివరావు ఈ లోకంలోకొచ్చాడు. తను పయనిస్తున్న రైలు ఎందుకో అకస్మాతుగా వేసిన బ్రేక్ తో కీచుమని ఆగినట్టుంది.

ఏదో స్టేషన్ ఔటర్ యార్డ్. కిటికీ ప్రక్కన కూర్చున్నవాడు తొంగి చూస్తే..చిక్కగా చీకటి.సిగ్నల్ క్లియరెన్స్ కోసం నిరీక్షణ.

ఎప్పటి జ్ఞాపకం ఇది..ఎప్పటిదో..ముప్పది ఏళ్ళనాటి ఘటన.

శివరావు మనసులో మనోరమ రూపం, జ్ఞాపకం కదిలి ఎందుకో ఒక వికారమైన అనుభూతి కలిగి.,పెళ్లయి.. రెండేళ్ళు గడిచి..ఒక పాప పుట్టిన తర్వాత..ఆమెకు తను పి హెచ్ డి చేసిన అదే సి సి ఎం బి లోపలే సైంటిస్ట్ ఉద్యోగం వచ్చి స్థిరపడిపోయింది.

ఇటు తను..తన సహజమైన ఆసక్తితో విప్లవ ఉద్యమాలు.. మానవ హక్కుల పోరాటాలు.. మారుమూల గిరిజన హక్కుల పరిరక్షణ కార్యక్రమాలు.. వీటిలో దాదాపు పూర్తి స్థాయిలో మమేకమై.,

తనకు ఉద్యోగం సెకండరీ..ఇప్పుడు ఈ దేశంలోని అనేకమంది దీనజనుల సముద్ధరణకై సకల ఐహిక సుఖాలను త్యాగం చేస్తూ దిక్కు మొక్కు లేని  జనానికి ప్రతిఘటననూ, ప్రశ్నించడాన్ని నేర్పడమే  ప్రైమరీ ఐన దశ..స్పృహ..యూనివర్సిటీకి అవసరాన్ని బట్టి చాలా సెలవులు పెడ్తూ.. జీతం కోతలతో కురుచైపోతూండగా.. దాదాపు తన జీతం ఎనభై వేలైతే ఏ ముప్పై వేలుకూడా చేతికి రాని పరిస్థితి. ఐనా ఏ ఒక్కనాడూ డబ్బు గురించీ , రాబడి గురించీ  ఆలోచించింది లేదు. డబ్బుతో తనకు అంత పెద్దగా అవసరాలూ లేవు. అతి నిరాడంబరమైన జీవితం తనది. అంతా రెండు మూదు అంగీలు..రెండు ప్యాంట్ లు..భుజానికి ఒక బట్ట సంచీ..కాళ్లకు ఒక స్లిప్పర్ల జత.

జీవితమంతా.. గణితం..చిన్నప్పుడు ప్రాథమిక గణితం..తర్వాత ఉన్నత గణితం…కాలేజ్ లో హయ్యర్ ఇంజనీరింగ్ గణితం..అటు తర్వాత అడ్వాన్స డ్  గణితం.. లాప్లాస్ ట్రాన్స్ ఫార్మేషన్స్.. ఫ్యూరియర్ సీరీస్.. టైం థియరీ.. చివరికి ప్యూర్ మాథమేటిక్స్.. శుద్ధ గణితం..విశుద్ధ గణితం..ఒకటి బై సున్నా .. సున్నా బై ఒకటి ల మీమాంస.. అంత అనంతాలగురించిన  చింతన. అనంత ఆకాశాన్నీ.. అనంతానంత అంతరిక్షాన్నీ..దిగంతాల అవతల ఉన్న శూన్యం గురించీ.. ఏమీలేనట్టే అనిపిస్తూ.. అన్నీ ఉన్న అభేద్య రహస్యాన్నీ తెలుసుకుంటూనే.. ఈ మనుషులు ఎందుకిలా జాతులు జాతులుగా.. బీదలు ధనికులుగా.. కులాలు కులాలుగా.. మతాలు మతాలుగా.. విభజింపబడి.. భాగింపబడి.. విచ్ఛిన్నపర్చబడి.,

చివరికి అన్ని గణితాలనూ పరిత్యజిస్తూ.. జీవిత గణితం గురించిన విపులాధ్యయనం.

అడవుల్లోకి పయనం.. అడవుల్లో అన్వేషణ.. అడవుల్లో అల్లాడుతున్న లక్షల మంది నిరక్షరాస్య జన దుఃఖ మూలాలను తెలుసుకునే వెదుకులాట.

గిరిజనులు సుఖంగా లేరు. వాళ్లకు కనీస సౌకర్యాలు లేవు..అని ఈ చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు చెబుతూ.. ఊదరకొడ్తూ..వాళ్ళ  ఉద్ధరణ పేరు మీద గత అనేక దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న ప్రభుత్వ అధికారులు.. రాజకీయ నాయకులు.. మధ్య దళారులు.. ‘ ప్రకృతిలో లీనమై,భాగమై జీవించే మేము సుఖంగానే ఉన్నాము. మమ్మల్ని మా మానాన విడిచి పెట్టండి మహాప్రభో ‘ అని మొత్తుకుంటూంటే వినకుండా వాళ్ల జీవితాల్లోకి దుర్మార్గంగా ప్రవేశిస్తూ.. కాంట్రాక్టర్ లు.. బహుళజాతి కంపనీలూ.. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ధనిక వర్గపు ప్రయోజనాలకోసం విద్యుత్ ప్రాజెక్ట్ లు.. మైనింగ్ తవ్వకాలు.. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా ఖనిజ నిక్షేపాల  తరలింపు.. గ్రానైట్ ఎగుమతుల పేరుతో గుట్టలకు గుట్టల విధ్వంసం.. అంతా బీభత్స భయానకం.

ఇదంతా.. ఈ నగరాల.. ఈ స్మార్ట్ సిటీల  మాయజలతారు మెరుపుల అవతల అడవుల్లో మరో అనాగరిక లోకంగా ఈ దేశంలోనే వర్థిల్లుతున్న  మరో చీకటి ప్రపంచపు ఆర్తనాద ధ్వని.

లోతుగా.. ఇంకా ఇంకా లోతుగా ఈ గుప్త.. అజ్ఞాత విధ్వంసక జీవన బీభత్సాలను అధ్యయనం చేస్తున్నకొద్దీ అన్నీ గాయాలే.. రక్తాలోడే గాయాలు.

అసలు ఈ స్థితికి  నిష్కృతీ .. వీళ్ళుకు చేయూతా.. ఈ సమస్యలకు పరిష్కారం. . ఏమిటి.

చదువు.. జ్ఞానం.. తమను తాము తెలుసుకోగలిగి ఎదుటి మనుషులు చేస్తున్న మోసాలను పసిగట్టగలిగే స్పృహ.. లోకంపోకడగురించిన ఎరుక.. ఇవి వాళ్ళలో పాదుకొల్పాల్సిన బీజాలు.  ఎవరు చేయాలి ఈ పనులు.. నాలాంటి వాళ్లం కాక.

మెల్ల మెల్లగా ‘మానవ చైతన్య వేదిక ‘ తో అనుసంధానమై.. అటువేపు జరుగుతున్నకొద్దీ,

ఒక రోజు.,

అప్పటికే సి సి ఎం బి నుండి ఒక ప్రత్యేకమైన డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద మూడేళ్ళ పోస్ట్ డాక్టోరల్ కోర్స్ ను పూర్తి చేసేందుకు పాప నిర్మల ను తన వెంట తీసుకుని అమెరికా వెళ్ళిన మనోరమ..అకస్మాత్తుగా తను వెళ్ళిన ఓ ఏడాది తర్వాత ఒక ఈ-మెయిల్ పెట్టింది..” శివరావ్..సారీ..ఐ యాం నో మోర్ ఇన్ లవ్ విత్ యు..నేను నీనుండి విడిపోతూ విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. బహుశా నేనిక తిరిగి ఇండియాకు రాక పోవచ్చు. శాశ్వతంగా నేను ఇక్కడే స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. పాపకూడా నాతోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ అంటూంటావు కదా.. మన అభిరుచులూ.. ఆలోచనలూ.. లక్ష్యాలూ.. తత్వాలూ ఒకటికావని. అది నిజమే.. ఎంత చేసినా ఇనుముతో  రాగీ.. ఇత్తడీ అతకవు. రెండు పదార్థాలు సమగ్రంగా కలిసిపోవాలంటే.. హోమోజినిటీ.. ఏక రూపత కావాలి. కాని అవి మన మధ్య లేవు.

నాలాంటి వాళ్లం సామాన్యులం..  అంటే అందరిలా సకల వ్యామోహాలకూ క్షణక్షణం లొంగిపోతూ.. భౌతిక వాంఛలకోసం పరితపిస్తూ.. అంతిమంగా కోటిలో ఒకరమై ఏ ప్రత్యేకతా లేకుండా అనామకంగా చచ్చిపోతాం. నువ్వలాకాదు. నీకు నీ జీవిత లక్ష్యం స్పష్టంగా తెలుసు.. నీ దారి.. గమనం.. గమ్యం.. నడక అన్నీ నువ్వు ఉద్దేశ్యించుకున్నట్టుగానే నీ ముందు పరుచుకుని ఉంటాయి. ఒకరంగా చెప్పాలంటే  నువ్వొక ఋషివి.

నువ్వు సరే అంటే ఇక్కడి ఒక లాయర్ ద్వారా మన విడాకుల పత్రం పంపుతాను కొరియర్ లో. నువ్వు సంతకం చేసి తిరిగి పంపు.

లేకుంటే కోర్ట్ ద్వారా తీసుకుందామన్నా నేను సిద్ధమే.

కాని.. నువ్వు నేను పంపదలుచుకున్న విడాకుల పత్రం పై సంతకం చేసి సహకరిస్తావనే నా అంచనా.. విశ్వాసం.

నీ విడాకుల అంగీకార పత్రం రాగానే ఇక్కడి ఒక అమెరికన్ మల్టీ బిలియనీర్ ను నేను పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను.

మన పాప నిర్మల బాగుంది. అప్పుడప్పుడు నిన్ను చాలా జ్ఞాపకం చేస్తూంటుంది.

 

– మనోరమ

 

ఆ మెయిల్ కు తను వెంటనే జవాబిస్తే.. అదే రోజు రాత్రి మనోరమ  తిరుగు మెయిల్ లో తన అడ్వకేట్ ద్వారా విడాకుల పత్రం పంపింది.. ఒకటి కొరియర్ లో కూడా.

నిట్టూర్చి.. మొత్తం తమ మూడున్నర సంవత్సరాల కాలం కాపురాన్ని ఒక్క క్షణం మననం చేసుకుని  సంతకం చేసి..కాగితాలను కొరియర్ చేసి.. తనను తాను విముక్తం చేసుకున్నాడు.. ఎందుకో ఆ క్షణం పాప నిర్మల జ్ఞాపకమొచ్చి.. ఒక కన్నీటి బొట్టు.

ఇక తను ఒంటరి. స్వేచ్ఛా జీవి. బంధాలన్నీ తెగిపోయాయి.

తర్వాత మిగిలింది .. ఉద్యోగం.. నెలకు లక్షా ఇరవై వేలొచ్చే అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువు.

ఆ డబ్బుతో తనకు అవసరమే లేదు. పైగా తను అనుకున్నట్టు నిరాడంబరంగా జీవించడానికి అదొక ప్రతిబంధకం.

రిజైన్ చేశాడు.

ప్రయాణం మొదలు .. పూర్తికాల ఉద్యమకారుడిక తను. అడవిలోకి ప్రస్థానం .  తపస్సు కాదుగాని.. ఆత్మావలోకనం. ఆత్మాన్వేషణ . . భవిష్యత్ రూపకల్పన.

ఎక్కడ మనుషులు తమ గొంతును వినిపించలేరో.. అక్కడ తను వాళ్ళ గొంతుకావాలి. ఎక్కడ ప్రజలు సంఘటిలుగా లేరో.. అక్కడకు తను చేరి గడ్డిపోచలతో బలమైన తాడును పేనినట్టు సంఘటితం చేయాలి. ఎక్కడ  బలవంతులు బలహీనులను దోపిడీ చేస్తున్నారో.. అక్కడ తను ప్రత్యక్షమై ‘జనానికి ‘ ప్రతిఘటన విద్యను నేర్పాలి.. ఇదీ.

మూడే పనులు..పొద్దంతా ప్రజల్లో ఒకడిగా పర్యటన..ఎవరు ఏమి పెడితే అదే తినుట.రాత్రంతా పుస్తకాలు చదువుట.. అడవిని చిన్న నిప్పురవ్వ పూర్తిగా దహించి నిశ్శేషం చేస్తుందనే సత్యాన్ని తెలియజేసే పుస్తకాలను రాయుట.వాటిని ఆయుధాలుగా దిక్కుమొక్కు లేని జనాల చేతులకు అందించుట.

అదే జరుగుతూ వస్తోంది .. గత ఇరవై ఎనిమిది సంవత్సరాలనుండి.

శివరావు పేరు ఇప్పుడు.. ఉద్యమ మిత్రులందరికీ శివం గా పరిచయం.

శివం అంటే.. మీడియాలో ఒక చైతన్య జ్వాల. ప్రభుత్వాలకూ.. వాళ్ల తాబేదార్లకూ..శివం సింహ స్వప్నం. కలలో మృత్యువు. ప్రజలకు అతను ఋషి.

ఒక రిపోర్ట్ పంపించాడు ప్రపంచ బ్యాంక్ కు.. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఎన్ని లక్షల కోట్ల రూపాయలను ఋణంగా తీసుకుంది.. ఇప్పుడు మళ్ళీ ఎన్ని లక్షల డబ్బును అప్పుగా అడుగుతోంది.. ఈ డబ్బును ఎలా నాయకులూ,ప్రభుత్వ అధికారులూ  పంచుకుని తినబోతున్నారు.. చివరికి ఈ ఋణాన్ని చెల్లించాల్సిన సామాన్య జనం పై  మనిషికి ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలఅప్పు.. ఇలా సాగింది.. మర్నాడు పత్రికల్లో.. ఈ లేఖ విడుదల. పెట్రోల్ బావి అంటుకున్నట్టు ప్రజల ప్రతిఘటన .. ప్రభుత్వ గూడుపుఠానీ బట్ట బయలు.

 

*                                                               *                                                                *

 

ఏడూ నలభై ఐదు.. కాని అప్పటికే.. రైలుఈ మొదటి స్టాప్ లోనే అరగంట లేట్.

ఈ దేశంలో ఎవడికీ  తన వృత్తిపట్ల ధర్మబద్ధమైన నిబద్దత లేదు.. పై వాడంటే భయమూ లేదు.నిర్లక్ష్యమూ.. ఉదాసీనతా.. ఉపేక్షలకు కొదువే లేదు. జనానికిప్పుడు కావాల్సింది క్రమశిక్షణతో కూడిన జవాబుదారీతనంతో నిండిన జీవన సంస్కృతి. కాని దాన్ని నేర్పే ప్రభుత్వాలు ఈ దేశంలో లేనే లేవు.

రైలు..బొంది వాగు.. రైల్వే గేట్.. క్రిష్ణా కాలనీ.. అండర్ బ్రిడ్జ్ .. వరంగల్లుచేరుతూండగా.. సిగ్నల్ లేదు. మళ్ళీ ఆపుడు రైల్ ను ఔటర్ యార్డ్ లో. ఉండీ ఉండీ చటుక్కున  కరంట్ పోయింది.. నగరమంతా చీకటి. మేఘాలు గర్జిస్తూ.. చెప్పా చేయకుండా.. గాలి దుమారం.. పెద్ద పెద్ద చినుకులతో వాన. ఒక్క క్షణంలో.. అంతా వాతావరణం తారుమారు.

పది నిముషాల తర్వాత.. మెల్లగా కొండ చిలువలా కదులుతూ.. పొడుగాటి రైలు.

వరంగల్ స్టేషన్ ప్లాట్ ఫాం  పైకి ప్రవేశిస్తూండగా.. కరెంట్ వచ్చింది భళ్ళున. జనం క్రిక్కిరిసి.. పరుగులు ఉరుకులు. అంతా హడావిడి.

శివరావు దిగాడు.. ఎస్ 10 బోగీ నుండి భుజాన సంచీతో. వరంగల్ లో రైలు నిలిచే సమయం రెండు నిముషాలే.

చూస్తూండగానే.. అనౌన్స్ మెంట్.. వర్షం ఒకవైపు కుండపోతగా.. రైలు కదుల్తోంది.. మెల్లగా,

అప్పుడు చూశాడు శివరావు.. తన ఎదురుగా ఎస్ 8 బోగీ దగ్గరనుండి ఒక చేతిలో సూట్ కేస్ తో.. మరో చేత్తో పట్టుకుని భుజంపై చిన్న పాపతో.. ఒక గర్భిణీ స్త్రీ.. పరుగెత్తుకుంటూ వస్తూండడం.. వర్షంలో.. రైలు వేగాన్ని అందుకుంటోంది.ఆమె వచ్చీ వచ్చీ.. ప్లాట్ ఫాం పై చటుక్కున బోర్లా పడింది దభేలున.. “ఆమ్మా..” అని దద్ధరిల్లేలా అరుస్తూ.ఆమె భుజం పైనున్న రెండేళ్ళ పాప ఎగిరి దూరంగా.. విరుచుకు పడింది.. కెవ్వున ఏడుస్తూ.. బోర్లా తూలిపడ్డ ఆమె తన గర్భంపై పడిపోయి.. క్షణాల్లో అపస్మారక స్థితి లోకి వెళ్తూ..శివరావు  పరుగెత్తాడు.. ఆమె  దగ్గరకు.. ఇంకొందరు సహ ప్రయాణీకులు కూడా.

“అయ్యా..ఈ ముండాకొడుకులు కోచ్ పొజిషన్ బోర్డ్ లు పెట్టరయ్యా.. రెండేండ్లయ్యింది.. ఎన్నిసార్లు చెప్పానో.. నాల్గు బోగీల అవతలినుండి  పరుగెత్తుకొస్తున్నా.. వీళ్ళ బాడ్ కౌ ఉద్యోగాలు పాడుగాను. అయ్యో నా గర్భం.. నా కొడుకు.. నా బిడ్డ”  అరుస్తూనే ఆమె  అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె నొసలు కూడా చిట్లి రక్తం కారుతోంది.

శివరావుకు అంతా అర్థమైంది .వరంగల్లంటే.. హెరిటేజ్ సిటీ.. అమృత్ సిటీ.. స్మార్ట్ సిటీ.. గ్రేటర్ వరంగల్లు హోదా.

రెండేళ్ల క్రితం రాత్రి ఇదే గోదావరిలో.. హైదరాబాద్ వెల్తూ.. తనుకూడా ప్లాట్ ఫాం పై కోచ్ పొజిషన్ డిస్ ప్లే లేక.. స్టేషన్ మాస్టర్ తో చాలా గొడవ పడ్డాడు.. వ్రాత పూర్వక కంప్లెయింట్ కూడా ఇచ్చాడు.. రెండేండ్ల కాలం గడిచినా.. ఇంకా అదే దరిద్రం. మొద్దు నిద్ర. పాలకులదీ.. అధికారులదీ.. ఛీ ఛీ.

పురమాయించి.. తోటి మనుషుల సహాయంతో.. ఆమెను స్టేషన్ మాస్టర్ గది దాకా మోసుకెళ్ళి.. చుట్టూ వందల మంది గుమికూడి.,

స్టేషన్ మాస్టర్ పరుగెత్తుకొచ్చాడు.. తాపీగా.. నత్తలా.

శివరావు.. తన మొబైల్ ఫోన్ తో.. చక చకా మాట్లాడాడు ఇద్దరితో.

” సర్.. రెండేళ్లయింది ఈ మహా నగరంలో.. ప్లాట్ ఫాంలపై.కోచ్ పొసిషన్ దిస్ ప్లే లేక. జనం ఎలా రెందు నిముషాలే ఆగే రైళ్ళ కోచ్ ను ఎలా వెదుక్కోవాలి.. పాపం ఉరికి ఉరికి ఈమె ఏమైందో చూడండి.. గర్భం  చితికి పోయింది.. ఈమె ప్రాణం ప్రమాదంలో ఉండి.. దీనికి మీరే బాధ్యులు.. ఈమే మీ కూతురైతే ఏం చేస్తారు మీరు.. మేమిప్పుదు మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం ..మూడుసార్లు వరంగల్లుకు మీ జి ఎం వచ్చాడు  ఇన్స్ పెక్ షన్ కు.. మీరు ప్రజల సొమ్ము తింటూ.. మా ప్రాణాలనే తీస్తారా.. ” శివరావు గర్జిస్తున్నాడు. ఈ లోగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది.. నలువైపుల నుండి కెమెరాలతో.. చిలికి చిలికి.. ప్లాట్ ఫాంపై.. నాల్గయిదు వందల మంది.. కేకలు.. నినాదాలు.. పడిపోయిన స్త్రీని ఆస్పత్రికి హుటాహుటిన తరలింపు.. ఒక యుద్ధ వాతావరణం.

పది నిముషాల్లోఅన్ని టి వి చానెళ్లలో.. ప్రసారం ..” వరంగల్లు రైల్వే ప్లాట్ ఫాం పై… ”

అందరూ కూర్చున్నారు నేలపై.. బైఠాయింపు.

కదలిక.. అత్యవసర కదలిక.. ఫోన్ల మీద ఫోన్లు.. ప్రజల సమీకరణ.. ప్రజా శక్తి నిర్మాణం.. బిగించిన పిడికిళ్ల నినదింపు.

వర్షం.. వర్షం.,

తెలతెల వారుతూండగా సికింద్రాబాద్ నుండి ఎ జి ఎం.. ఇతర అధికారుల హుటాహుటి ఆగమనం.

” రెండు రోజుల్లో కోచ్ పొజిషన్ డిస్ ప్లే చేయకుంటే.. ” అని లిఖిత పూర్వక హామీ.

సూర్యోదయమౌతూండగా.. స్టేషన్  బయటకు వస్తూ.. శివరావు.. వెంట వందల మంది జనం.

*                                                                        *                                                                    *

ఐదేళ్ల తర్వాత,

శంషాబాద్ ఏర్ పోర్ట్ నుండి రేడియో క్యాబ్ లో బయల్దేరి.. సి సి ఎం బి లో ఒక ముఖ్యమైన సర్టిఫికేట్  ను తీసుకుని పోయేందుకు..వీసా స్టాంపింగ్ కోసం.. రెండు రోజుల సుడిగాలి పర్యటనకు వస్తోంది మనోరమ అమెరికానుండి.

సాయంత్రం నాలుగున్నర .. మేఘాలు ఆకాశం నిండా.. వర్షం ఏ క్షణమైనా మొదలవ్వొచ్చు.

కార్ సిటీలోకి రాగానే ఒకచోట ఆపించుకుని రెండుమూడు తెలుగు పత్రికలు కొంది మనోరమ.. దిన పత్రికలు. వార పత్రికలు కూడా.ఎన్నాళ్ళయిందో తెలుగు పత్రికలను చూచి. ఈనాడు.. అంధ్రజ్యోతి.. నవ్య.,

పత్రికలను తిరగేస్తూండగా.. లోపలి అనుబంధ పేజీల్లో కనిపించింది ఒకచోట.. శివరావు ఫోటో.. ‘ఎడిటర్ తో ముఖాముఖి.’

‘దిక్కు మొక్కు లేని జనం వెంట జీవితాంతం నడుస్తూ.. వాళ్ళకు చిటికెన వ్రేలునిచ్చి నడిపిస్తూ.. బూర్జువాలకూ.. దోపిడీ దార్లకూ గుండెల్లో తుపాకి గుండై.. ఎందరో అసాంఘిక వ్యక్తులతో నిత్యం తలపడ్తూ.. పలువురిపై ప్రభుత్వాలకూ, కోర్టులకూ బహిరంగంగా పిర్యాదుచేసి.. వాళ్ళను జైలుపాలు చేసిన నిజమైన హీరో.. డాక్టర్ మెతుకు శివరావుతో ఈ రోజు ముఖాముఖి. ‘. ఒక పూర్తి పేజి ఇంటర్వ్యూ.

“సర్.. మీరు గణితంలో డాక్టరేట్ చేసి.. అందరిలా హాయిగా ఉద్యోగం చేసుకుంటూ భార్యా పిల్లలతో సుఖంగా గడపక.. ఈ ఉద్యమాలనీ.. ప్రజా చైతన్యమనీ.. ఈ గొడవల్లో..” అని ప్రశ్న.

“మీరన్న సుఖం..నాకు ప్రజలను చైతన్య పర్చడంలోనూ..ఈ సమాజానికి హాని కలిగిస్తున్న ద్రోహులను ఏరివేయడంలోనూ ఉంది. సుఖం అన్న పదానికి ఎవరి నిర్వచనం వాళ్ళది..”

“ఇప్పటికే.. ఐదారు తిమింగలాలను లీగల్ గా తగు ఆధారాలతో జైల్లోకి తరలించారు మీరు.. మరి మీ వ్యక్తిగత భద్రత గురించి మీరు తీసుకునే జాగ్రత్తలేమిటి”

” ప్రజలకోసం పనిచేస్తున్న వ్యక్తులెప్పుడూ ప్రజలయొక్క భౌతిక సంపద. వాళ్ళ సంపదను వాళ్ళే కంటికి రెప్పలా కాపాడుకుంటారు.”

“పేద ప్రజల్లో.. గిరిజన ప్రాంతాల్లో మీకు అసంఖ్యాకమైన అనుచరులూ, అభిమానులూ ఉన్నట్టే మీరు విరోధిస్తున్న సోకాల్డ్ నియో-రిచ్ బూర్జువాలనుండి శత్రువులూ, బెదిరింపుదార్లూ ఉంటారుగదా.. మరి వాళ్లనుండి.. మీకు రక్షణ..”

“జీవితమంటేనే.. ఒక నిరంతర పోరాటం. భయపడేవాడు పోరాటాలు చేయలేడు. నేను భయాన్ని కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడే జయించాను..”

ఇలా సాగుతోంది సంభాషణ.

శివరావు గొంతులో నిఖ్ఖచ్చితనం.. స్పష్టత.. గురితప్పని విశ్వాసం.. కళ్ళనిండా విద్యుత్ బల్బ్ లోనుండి విరజిమ్మే కాంతిలా వెలుగు.

శివరావు కొన్ని దశాబ్దాలక్రితం..తనతో మనిషి అందం గురించిన చెప్పిన ‘ నిజమైన అందం’ ఈ కళ్ళలో కాంతేనేమో.

అప్రయత్నంగానే.. మనోరమ చటుక్కున తన హ్యాండ్ బ్యాగ్ లోనుండి మిర్రర్ ను బయటకు తీసుకుని తన ముఖాన్ని తానే పరిశీలనగా చూచుకుంది. ముఖంలోగానీ.. కళ్ళలోగానీ ఎటువంటి మెరుపూ.. కాంతీ..జీవమూ లేదు. ఒక అందమైన నిర్జీవ..తెల్లగా వెల్లవేసిన శుభ్రమైన గోడలా ఉంది.

ఎ బల్బ్ విత్ కరెంట్..వితౌట్ కరెంట్.

మనోరమ దీర్ఘంగా నిట్టూర్చి..తలెత్తేసరికి.,

సాయంత్రం..ఐదు గంటలు..అమీర్ పేట్ చౌరాస్తా దాటి..నింస్ దగ్గరకు రాగానే.  ‘ తప్’ మని ఏదో గన్ కాల్చిన చప్పుడు.క్షణం లో.. జనం కకావికలై.. పరుగులు రోడ్ పై.. గుంపులు గుంపులుగా.

” ఏమైంది..”

” ఏమైంది “..ప్రశ్నలు.

” ఎవరో..ఒక మనిషిని గన్ తో కాల్చి  పరారయ్యాడిప్పుడే..అంతా రక్తం.. మనిషి అక్కడికక్కడే చనిపోయాడు”

” ఎవరో పాపం”

” తెలియదండీ”

పొలీస్ వ్యాన్ చప్పుడు.. ఈలలు.. హడావిడి.. పరుగులు.. కుక్కలతోపోలీస్లహడావిడి.

మనోరమ క్యాబ్ కు పదడుగుల దూరంలోనే.. అంతా. .రక్తపు మడుగు కనబడ్తూనే ఉంది.

‘ఎవరో చూస్తే బాగుండు ‘ అని..ఉత్సుకత.

ఇంకా జనం ప్రోగౌతూనే ఉన్నారు. “మేడం..ఇటునుండి కార్ ను వెనక్కితిప్పుతాను..” అని డ్రైవర్ ఏదో అంటూనే ఉన్నాడు..మనోరమ కార్ ను దిగి ఆ గుంపులోకి నడిచింది.

దగ్గరగా వెళ్ళి..ఇంకా జనాన్ని తోసుకుంటూ..లోపలికి.,

ఎదురుగా..తడి రక్తపు మడుగులో..శివరావు.

” శివరావు చచ్చిపోయాడు..తన ఎదురుగానే.”

” కాదు..శివరావు..చంపబడ్డాడు”

వేలమంది గుండెల్లో దేవునిలా కొలువై ఉండే శివరావుకు కూడా శత్రువులుంటారా.

ప్రపంచంలో.. తనలాంటి.. అందగత్తెలూ.. బిలియనీర్లూ కోకొల్లలు.. కాని శివరావులాంటి ప్రజోపయోగ లక్ష్యం తోనే జీవించే.. చావును ప్రతినిత్యం ఎదుర్కుంటూ పోరాడే త్యాగమూర్తులు.. ఎందరు.

‘ఎప్పటికైనా తప్పకుండా నశించిపోయేది భౌతికమైన అందం. రోజులూ.. వయసూ గడుస్తున్న కొద్దీ.. ఇంకా ఇంకా సౌందర్యవంతమయ్యే అందం..మనం నిర్మల పర్చుకునే..మన మనసు..హృదయం..ఆత్మ..’

శివరావు.. తమ పెళ్ళైన కొత్తలో అన్న మాటలు జ్ఞాపకాల పొరల్లోనుండి ధ్వనిస్తూ.,

మనోరమ కళ్ళలోనుండి.. వెచ్చని కన్నీళ్ళు.. ధారలు ధారలుగా.,

కన్నీళ్ళకు హృదయముంటుందా.?

*

 

 

 

 

 

 

 

 

దిగడానికి కూడా మెట్లు కావాలి!

 

రామా చంద్రమౌళి

~

Ramachandramouliరాత్రి పదీ నలభై నిముషాలు.

డిల్లీ రైల్వే ప్లాట్ ఫాం నంబర్ పన్నెండు.అటు చివర.ఎప్పటిదో.పాతది.దొడ్డు సిమెంట్ మొగురాలతో.సిమెంట్ పలకతో చేసిన బోర్డ్.పైన పసుపు పచ్చని పెయింట్ మీద నల్లని అక్షరాలు.’నయీ ఢిల్లీ ‘.పైన గుడ్డి వెలుగు.కొంచెం చీకటికూడా.వెలుతురు నీటిజలలా  జారుతుందా. కారుతుందా. చిట్లుతుందా. ప్రవహిస్తుందా. వెలుతురుపై. కురుస్తూ. వెలుతురును కౌగలించుకుంటూ.. సన్నగా.మంచుతెర.పైగా పల్చగా చీకటి పొరొకటి.అంతా స్పష్టాస్పష్టత.కనబడీ కనబడనట్టు.కొంత చీకటి..గుడ్డి గుడ్డిగా.కొంత వెలుతురు మసక మసగ్గా.తన జీవితం వలె.చీకటి ఒక లోయ.వెలుతురు ఒక శిఖరమా.లోయ ప్రక్కనే శిఖరం.చీకటి ప్రక్కనే.తోడుగా చీకటి.జతలు.జతులు.ద్వంద్వాలు.వైవిధ్యాలు.వైరుధ్యాలు.

డిసెంబర్ నెల. ఇరవై ఆరు. చలి. గాఢంగా . . అప్పుడప్పుడు వణికిస్తూ. అప్పుడప్పుడు . మృదువుగా స్పర్శిస్తూ. కప్పుకున్న శాలువాకింద శరీరం .  నులువెచ్చగా . భాషకందని గిలిగింత . కళ్ళుమూసుకుంటే..గుండెల్లో భైరవీ రాగంలో ఏదో.. ప్రళయభీకర గీతం.

మేఘాలు చిట్లిపోతూ . . ఆకాశం  పగిలిపోతూ . . ఇసుక తుఫానులతో ఎడారులు ప్రళయిస్తూ.శబ్దం విస్ఫోటిస్తూ.అంతిమంగా.శబ్దాలూ.రాగాలూ.గీతాలూ.అన్నీ.ఒక అతి నిశ్శబ్ద బిందువులోకి అదృశ్యమైపోతూ.చివరికి. ఒట్టి..శాంత మౌన ఏకాంతం.జీవితం ఇది.అంతా ఉండీ.చివరికి ఏమీ లేని.ఏమీ లేక అంతిమంగా అన్నీ ఉన్నట్టనిపించే ఒక సుదీర్ఘ భ్రాంతిగా మిగిలి.,

“జిన్ హే హం భూల్ నా చాహే..ఓ అక్సర్ యాద్ ఆతీహై “..అతి విషాద స్వరంతో ముఖేష్..దుఃఖం గడ్డకడుతున్నట్టు..యుగయుగాల పరితపన కన్నీరై ప్రవహిస్తున్నట్టు.,

ఉష..నలభై ఆరేళ్ళ ఉష.శరీరాన్ని.దళసరి ఉన్ని శాలువాలో దాచుకుని.అటు చీకట్లోకి చూస్తోంది. నిశ్శబ్దం లోకి  .ఆమెకు బయట అటు దూరంగా వందలమంది ప్రయాణీకులు . గోలగోలగా ఉన్నా లోపల తనొక్కతే . అంతా నిర్వాణ నిశ్శబ్దం.నిర్గమ నిశ్శబ్దం. నిరామయ నిశ్శబ్దం.

ఒక ఎలక్ట్రిక్ లోకో ఇంజన్ ఏదో అతి వికారంగా అరుస్తూ ప్రక్కనున్న ట్రాక్ పైనుండి మెల్లగా కదుల్తూ..అటు దూరంగా నిష్క్రమిస్తూ,వెలుతురులోనుండి చీకట్లోకి.పైన అన్నీ ఎలక్ట్రిక్ కేబుల్స్.చిక్కు చిక్కుగా.,

చిక్కు.చిక్కు పడ్డ దారం ఉండ జీవితం.ముళ్ళుపడి.అల్లుకుపోయి.కొస దొరుకక.వెదుకులాట.కొస కోసం.ఒక దరి కోసం.దారికోసం.వెదుకులాట.చిన్ననాటినుండి.ఈ క్షణందాకా.ఒకటే నిరంతరమైన అనంత అన్వేషణ.,

ఇంతవరకు వేల పాటలు. వందల సభలు.లక్షలమంది శ్రోతలు.కోట్ల చప్పట్లు.పట్టణాలు.నగరాలు.దేశాలు.ఖండ ఖండాంతరాలు.అంతర్జాతీయ వేదికలు.సన్మానాలు.సత్కారాలు.జ్ఞాపికలు.శాలువాలు.పర్స్ లు.పైవ్ స్టార్ హోటళ్ళు.బెంజ్ కార్లలో ప్రయాణాలు.ఆకాశంలో మేఘాలను చీల్చుకుంటూ..విమానాల్లో.మళ్ళీ శూన్యంలోకి..అన్నీ ఉండి..ఏదీలేని..ఒక ఖాళీలోకి.

ఇంటిగ్రేట్ .  జీవితాన్ని సమాకలించుకోవాలి .  లోయర్ లిమిట్ నుండి   అప్పర్ లిమిట్ వరకు. అవధులు..అవధులు.కిందినుండి పైకి.పుట్టుక నుండి మృత్యువుదాకా.మృత్యువునుండి..మళ్ళీ జన్మదాకా.

‘ మేడ  లోన  అల పైడి బొమ్మా

నీడనే చిలకమ్మా

కొండలే రగిలే వడగాలీ

నీ సిగలో పువ్వేలోయ్ ‘

..చందమామ మసకేసిపోతుందా.?

ఉష..మసక లోకి..మసక వెలుతురులోకి.మసక చీకట్లోకి.చూస్తోంది.

 2          

digadaaniki-picture వర్షం కురుస్తూనే ఉంది.రెండు రోజులుగా.ఎడతెరిపిలేకుండా.

విజయవాడ..హోటల్ మనోరమ వెనుక గల్లీ..అంబికా వైన్స్.

రాత్రి తొమ్మిదిన్నర.రజియాబేగం కు చాలా అలసటగా..చాలా చికాగ్గా..చాలా దుఃఖంగా,జీవితంపట్ల చాలా విసుగ్గా,రోతగా కూడా ఉంది.

‘ఈ జీవితాన్ని జీవించి జీవించి అలసిపోయాన్నేను’..అని ఏ ఐదు వందలవసారో అనుకుందామె.అనుకుని చాలా నిస్సహాయంగా ఆ వర్షం కురుస్తున్న రాత్రి తనచుట్టు తానే చూచుకుంది.

అంతా నీటి తేమ వాసన.వెలసిన గోడలతో నిలబడ్డ అంబికా వైన్స్..షాప్ ముందు.తోపుడుబండి.ఒక కొసకు వ్రేలాడ్తూ.పెట్రోమాక్స్ లైట్.మసిపట్టిన గాజు ఎక్క.మసక వెలుతురు.. ‘ సుయ్ ‘..మని వొక వింత చప్పుడు..పెట్రోమాక్స్ దీ..ఆమె ఎదుట మూకుడులో నూనెలో వేగుతున్న చికెన్ కాళ్ళ దీ..లోపల గుండెల్లో బయటికి వినబడని యుగయుగాల దుఃఖానిది.ప్రక్కనే వాననీళ్ళు కారుతున్న చూరుకింద నిలబడి కస్టమర్ల ఎదురు చూపు.ఇద్దరుముగ్గురున్నారు.ఒకడికి చికెన్ కాళ్ళు రెండు.మరొకడికి బాయిల్డ్ ఎగ్స్.ఇంకొకడికి.రెండు బొచ్చె చేప వేపుడు ముక్కలు.

రెండ్రోజులుగా ముసురుగా కురుస్తున్న వర్షానికి..నగరంలోని వ్యాపారాలన్నీ మందగించాయి..కాని ఈ వైన్ షాప్ లు మాత్రం పుంజుకున్నాయి.తాగుబోతులకు వర్షాలు కురిసినా..శీతాకాలం మంచు కమ్ముకున్నా..ఎండాకాలం ధుమధుమలాడ్తూ సెగలు చిమ్మినా తాగుడుదిక్కే మనసు పోతుంది..అప్పుడు బ్రాండీ విస్కీలు..తర్వాత చల్లని బీర్లు.కాబట్టి వైన్ షాప్ లన్నీ..ఋతువుల్తో సంబంధంలేకుండా  సర్వవేళల్లో  కళకళలాడ్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాయి.అందుకే అవి ప్రభుత్వాలనూ..కొందరు బలిసిన మోతుబరులనూ పోషించే కామధేనువులు.అసలు ఈ భూమ్మీద మద్యాన్ని అమ్మేవాల్లదీ..తాగేవాళ్ళదీ ఒక ప్రత్యేక జాతిగా రజియా ఏనాడో గుర్తించింది.ఈ రెండు  జాతుల మనుషులతో  ఆమెకు పది సంవత్సరాల అనుబంధం.ఆ వైన్ షాప్ ముందు తోపుడు బండి మీద ‘ తిండి ‘ని అమ్ముతూ ఆమె అక్కడ ఒక శాశ్వత అడ్డా మనిషిగా మారిపోయింది.ఆ పది పదిహేనేళ్లలో షాప్ ఓనర్స్ మారిపోయారుగాని రజియా మాత్రం పర్మనెంటైపోయింది.రజియా చేతి ఐటంస్ రుచి అలాంటిది.ఒక్కతే బండిని చూచుకుంటుంది.సాయంత్రం ఏడునుండి.ఏ రాత్రి పదకొండుదాకానో.

తోపుడుబండికి.ఒక మూలకున్న గుంజకు ఒక పాత గొడుగును సుతిలి తాళ్లతో గట్టిగా కట్టుకుంది రజియా.పైన చత్రీ అక్కడక్కడ రంధ్రాలుపడి..కొద్దికొద్దిగా నీటి తడి కారుడు.కస్టమర్లు వేచిఉండడంవల్ల వడివడిగా పనికానిస్తూ,ప్రక్కనున్న వెదురు బుట్టలోని నాల్గయిదు చేపముక్కలను బేసిన్ గిన్నెలోని కలిపిన శనగపిండిలో వేసి కలుపుతూ..అనుకుంది..’చికెన్ ముక్కలూ,చేప ముక్కలూ ఐపోవస్తున్నాయి. లక్ష్మణ్. ఇంకా రాలేదు ఇంటినుండి సరుకు  తీసుకుని..ఒకవేళ లక్ష్మణ్ లారీ దిగి ఇంకా డ్యూటీ నుండి రాకుంటే అప్పల్రాజన్నా రావాలిగదా.వాడూ పత్తాలేడు.ఇక్కడ గిరాకేమో మస్తుగా ఉంది..ఇప్పుడెలా ‘..అనుకుంటూనే..చకచకా.. ఉడికిన కోడిగ్రుడ్ల పొట్టుతీస్తోంది.చుట్టూ అంతా మసాలా..కాగిన నూనె  కలెగలిసి..అదోరకమైన ముక్క వాసన.

రజియా మనసులో లక్ష్మణ్ కదిలాడు.

లక్ష్మణ్  చిన్ననాడు తమ ఇంటిప్రక్కనే ఉండే పుష్ప అత్తమ్మ కొడుకు.పుష్ప అత్తకు ఒక చిన్న చాయ్ హోటల్ ఉండె.ఆమె భర్త జట్కా నడిపించేటోడు.పుష్ప అత్తమ్మ చాయ్ అంటే చుట్టుపక్కల చాలా ఫేమస్.రోజుకు కనీసం రెండువందల చాయ్ లమ్మేది.లక్ష్మణ్ కూడా తల్లితో కలిసి గారెలు చేసుడు,సమోసాలు చేసుడు,రోటీ చికెన్,రోటీ కీమా తయారుచేసుడు.చాలా బిజీగా ఉండేటోడు.తర్వాత్త ర్వాత పుష్పత్త భర్త ఒక ప్రైవేట్ ఇసుక లారీకి డ్రైవర్ గా కుదిరి అప్పుడప్పుడు లక్ష్మణ్ ను తన వెంట క్లీనర్ గా తీసుకెళ్ళేవాడు.లక్ష్మణ్ ది చాలా శ్రావ్యమైన గొంతు.తల్లి హోటల్ లో రాత్రింబవళ్ళు మోగే రేడియోలోని పాటలను విని వెంటనే ఏ పాటనైనా రెండు నిముషాల్లో అచ్చం అలాగే మళ్ళీ పాడేవాడు.అందరూ ఆశ్చర్యపోయేవారు లక్ష్మణ్ ప్రతిభను చూచి.ఇంటిపక్క హోటలే కాబట్టి..చిన్నప్పటినుండి లక్ష్మణ్ తో ఉన్న దోస్తీ వల్లా దాదాపు ప్రతిరోజూ ఒక్క గంటన్నా ఆ హోటల్లో గడిపేది తను  . ఒకసారి ఎవరో ఒక పెద్దాయన పుష్పత్త చాయ్ పేరు విని తాగడానికొచ్చి లక్ష్మణ్ పాట విని..మెచ్చుకుంటూ “వీడు ఏకసంతాగ్రాహి”అని చెప్పాడు. అంటే ఏమిటిసార్..అని తాను ఆశ్చర్యంగా అడిగితే..వీనికి దేన్నైనా ఒక్కసారి వింటేనే దాన్ని యథాతథంగా ధారణ చేసుకుని పునరుత్పత్తి చేయగల సామర్థ్యముంది.అది భగవదత్తమైన ఒక వరం.అదే వీడు ఏ గొప్ప ఇంట్లోనో పుడితే కొన్ని కళల్లో శిక్షణ పొంది..గొప్ప కళాకారుడయ్యేవాడు.కాని..అని ఆగిపొయ్యాడు.ఆ క్షణం లక్ష్మణ్ నిస్సహాయంగా ఆ పెద్దాయన  ముఖంలోకి చూచిన చూపు తనకింకా జ్ఞాపకమే.

లక్ష్మణ్ లోని ఆ గొప్పతనం తనను ఆశ్చర్యపరిచింది. ప్రతిరోజూ..వీలు చిక్కినప్పుడల్లా ప్రక్కనే ఉన్న బుగ్గోల్ల తోటలోకి ఇద్దరమూ కాస్సేపు పారిపోయి..పాటలను వినేది.తను..అడిగేది..”గిట్ల ఎట్ల జ్ఞాపకముంటై నీకు” అని.కాని లక్ష్మణ్ నుండి ఏ జవాబూ వచ్చేదికాది..

Kadha-Saranga-2-300x268

ఊర్కే నవ్వేవాడు.నవ్వి “అంతే..దేవుని దయ అంతా..”అనే వాడు.లక్ష్మణ్ ముఖంలో ఏదో ఒక వింతకాంతి కనిపించేది  దీపం వత్తిలో వెలుగులా.తర్వాత్తర్వాత..మెలమెల్లగా లక్ష్మణ్ తన తండ్రి వెంట ఉండి తనూ డ్రైవర్ గా మారి,ఒక పర్ఫెక్ట్ లారీ డ్రైవర్ గా పేరు  తెచ్చుకున్నాడు.ఆ క్రమంలో ఏవేవో ఊళ్ళు తిరుగుతూ..ట్రిప్ ల కని..దూర దూర ప్రాంతాలకు ఎక్కువసార్లు వెళ్తూ..దూరమౌతున్న సందర్భంగా..అర్థమైంది తనకు..లక్ష్మణ్ పట్ల ఆ సహించలేని..భరించలేని ఎడబాటునే ‘ప్రేమ ‘ అంటారని.అప్పుడు తను ఒకరోజు లక్ష్మణ్ తో కలిసి అతని అశోక్ లేల్యాండ్ లారీలో కూడా ఎవరికీ చెప్పకుండా తీరుబడిగా మాట్లాడాలని భీమవరం వెళ్ళింది.ఒకరు హిందూ..ఒకరు ముస్లిం..తమ ముందు నిలబడ్డ బలమైన కలిసి బతకాలనే కాంక్ష.అప్పటికి తను ఎనిమిదవ తరగతి చదివింది.లక్ష్మణ్ ఇంటర్ ఫేల్.యౌవ్వనం..లక్ష్మణ్ స్పష్టంగానే నిర్ణయం తీసుకుని అన్నవరం సత్యనారాయణ సమక్షంలో..పెళ్ళడాడు ధైర్యంగా.అన్నాడు..’ రజియా..రెండు చేతులకు తోడు మరో రెండు చేతుల..కలిసి నడుద్దాం ‘ అని. ఆ రాత్రి ..వెన్నెల్లో ఎన్నో పాటలు పాడి వినిపించాడు.

విజయవాడ రైల్వే పట్టాలప్రక్కనున్న..మార్క్స్ కాలనీలో కాపురం..జీవితమంతా రాత్రింబవళ్ళు రైళ్ళ శబ్దాలతోనే సహవాసం.నిత్య  యుద్ధం.బతుకే ఒక సవాల్.లక్ష్మణ్ లారీ పై డ్యూటీలు..తను రోజువారీ సంపాదనకోసం వెదుకులాట.కూరగాయల బేరం..నాలుగిండ్లలో పాచిపని..చిన్న చిన్న హోటల్లలో వంటపని..లక్ష్మణ్ కు దేవుడిచ్చిన  స్వరంలాగనే తనకు..రుచికరంగా వంటలను చేయగల నైపుణ్యం అబ్బి.చివరికి.. హోటల్ మనోరమ కిచెన్ డ్యూటీనుండి..ఒక హోటల్ బాయ్ సహకారంతో..ఈ వైన్ షాప్ దగ్గర దొరికిన ఈ అడ్డా.

ఈ లోగా ఇద్దరు పిల్లలు..ముందు ఉష..తర్వాత షకీల్.

జీవితమంతా పోరాటమే.కమ్యూనిస్ట్ నాయకుల మధ్య విభేదాలతో తాముంటున్న గుడిసెవాసుల పై పోలీసుల దాడి అప్పుడప్పుడు.ఇళ్ళను కూలగొట్టుట.కాల్చివేయుట.పోలీస్ కేస్ లు.కోర్ట్ లు.నేలపై.బురద కుంటల ప్రక్కన నివాసం..ముక్కులు పగిలిపోయే బకింగ్ హాం కెనాల్  ఒడ్డుపై కొన్నాళ్ళు..’ సందులలో గొందులలో..బురదలలో పందులవలె’..చీకట్లో చీకిపోయిన బతుకు.,

తర్వాత..లక్ష్మణ్ లో ఒక మహమ్మారి అలవాటు ప్రవేశించి.తాగుడు.తాగి లారీ నడుపుడు.భగవంతుడిచ్చిన గొంతు నశించి.. మనిషి ముఖం నిండా ఒట్టి దైన్యం.బేలతనం.జాలి కల్గించే ఒట్టి శూన్యం.ఎక్కడికో వెళ్ళి పుస్తకాలు చదివేవాడు.గంటలకు గంటలు లైబ్రరీలో కూర్చుని..బుక్స్ తెచ్చుకునే వాడు ఇంటికి.చదువుతూ చదువుతూ అలాగే పడుకుని..ఏవేవో తనలో తానే తత్వాలను పాడుకుంటూ..సారాయి తాగుతూ,

ఇటు పిల్లలు పెరిగి పెద్దగౌతూ.,

ఎక్కడో పిడుగుపడ్డట్టు అకస్మాత్తుగా ఓ ఉరుము ఉరిమి..రజియా చేయి కొద్దిగా వణికి..ముందున్న నూనె మూకుడు పైనున్న గరిటె కొద్దిగా జారి.,

రెండుమూడు వేడి నూనె రవ్వలు చిట్లి..ఆమె చేతిపైబడి..ఉలిక్కి పడింది.

“జాగ్రత్తమ్మా..నూనె పైబడ్తుంది..”అన్నాడు ఆ ప్రక్క గోడనానుకుని నిలబడ్డ గిరాకీ.

అప్పటికే..చేపలను వేయించడం..చికెన్ లెగ్స్ ప్యాక్ చేయడం..నాల్గు బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వడం..చేస్తూ,

జ్ఞాపకాలు చటుక్కున తెగిపోయేయి..చూరునీళ్ళ ధారవలె.

షాప్ లోపల ఇంకా ఫుల్ గా జనం.ఒకటే రద్దీ.

తన దగ్గర స్టాక్ ఐపోతోంది..లక్ష్మణ్ రాడు..అప్పల్రావూ రాడు.ఇప్పుడెలా.

రజియాలో ఆందోళన.గిరాకీ ఉన్నప్పుడే నాల్గు రూపాయలు సంపాదించుకోవాలి.ఎలా..ఎలా.

సరిగ్గా అప్పుడు ప్రత్యక్షమైంది ఎదుట ఉష..పూర్తిగా తడిచి..నీళ్ళలో ముంచి తీసిన కోడివలె.తలపైనుంది నీళ్ళు కారుతూ..నెత్తిపై, భుజాలపై.ఏదో ఒక పాలిథిన్ కాగితం చుట్టుకుని.

ఉష అప్పుడు ఎనిమిదవ క్లాస్..పొద్దంతా తన తోపుడు బండికి కావలసిన ఉల్లి గడ్డలు కోసుకోవడం..చికెన్ షాప్ లనుండి రెండవరకం మెటీరియల్ ను తెప్పించుకుని..దాన్ని శనగపిండిలో..కారం..మసాలాలలో కలుపుకుని నాన్చడం..కోడి గుడ్లను ఉడి         కించుకోవడం..ఈ పనిలో సహాయం చేసేది.షకీల్ గాడు ఒట్టి వెధవ.ఎప్పుడూ అక్కలా పనిలో సహాయం చేయడు.మళ్ళీ రైల్వే పట్టాలప్రక్కన మార్క్స్ కాలనీకి దగ్గరలో..బోస్ నగర్ కు మారినప్పటినుండి వాడికి అంతా స్నేహితులే.నిరంతరం పోరగాండ్లతో రైల్ పట్టాలపై ఆటలు..కూలిన గోడల్లో  సిగరెట్లు తాగుడు. తండ్రి వలెనే అప్పుడప్పుడు మందు.

“తల్లిదండ్రుల లక్షణాలు తప్పక పిల్లలకొస్తాయా.”అని తననుతాను ప్రశ్నించుకుంటే..’తప్పకుండా..వస్తాయనే ‘అనిపిస్తుంది తనకు.

లక్ష్మణ్ లో ఉన్న ఆ స్వరం..అమృతమయమైన గొంతు..ఉష పాడితే అద్భుతమైన మాధుర్యం..అవన్నీ వచ్చాయి బిడ్డకు..తండ్రి నుండి.

కాని షకీలే..ఒట్టి అవారా ఔతున్నాడు రోజురోజుకు. బడికి పోడు..చిల్లర దొంగతనాలు..పోలీస్ కేసులు.విడిపించుకు రావడాలు.తాగి ఎక్కడెక్కడో పడిపోవడాలు..ఏవేవో సినిమా హీరోల అభిమాన సంఘాలంటాడు. రాజకీయ నాయకుల కనుసన్నలలో.. ఊరేగింపులు. దౌర్జన్యాల్లో పాలుపంచుకోవడాలు.అన్నీ చిల్లర  అల్లరిమూకల  చేష్టలు.

ఆ రాత్రి..ఉష వర్షంలో పూర్తిగా తడుస్తూ..అమ్మ మీద..అమ్మయొక్క జీవనోపాధి ఐన చిన్న వ్యాపారంపైన గౌరవంతో చేయూతగా రావడం..రజియాకు పట్టరాని ఆనందాన్నిచ్చింది.

” క్యా హువా..లక్ష్మణ్ నహీ హై” అంది అప్రయత్నంగానే.

” రాలేదింకా.. బాగా తాగి..హోష్ లేకుండా ఎక్కడున్నాడో.అప్పల్రాజు కూతురుకు యాక్సిడెంటై దవాఖానకెళ్ళాడు.” అని తన చేతిలోని మెటీరియల్ ను అందించింది తల్లికి.

అప్పటికే కావలసిన  తిండి సరుకు లేదని చిన్నబుచ్చుకున్న వైన్ షాప్ కస్టమర్లు..బిలబిలా బండి దగ్గరికి పరుగెత్తుకొచ్చి..” రెండు చేప..పావుకిలో చికెన్ మంచూరియా..మూడు బాయిల్డ్ ఎగ్స్..” ఆర్డర్స్ కురిపిస్తూ.,

మూకుమ్మడి దాడిలో రజియాకు ఉషతో మాట్లాడే తీరికే లేదు.పనిలో మునిగిపోయింది.కాస్సేపాగి..”మరి నే వెళ్ళొస్తానమ్మా..నువ్వు..”అంది ఉష..వర్షంలో తడుస్తూనే.రజియా..తలెత్తి బిడ్డదిక్కు నిస్సహాయంగా చూచి.,

అనివార్యత..అనివార్యత.

” సరే బిడ్డా..నువ్వెళ్ళు..నేనొస్తా..షాప్ మూసుకుని”

‘ సంపాదన..ఒక తాగుబోతు తండ్రిని పోషిస్తూ..ఒక తిరుగుబోతు కొడుకును సాకుతూ..ఒక ఇంటర్ పాసై..గడప దగ్గర నిలబడ్డ బిడ్డకు దన్నుగా ఉంటూ..ఒక తల్లి..రాత్రి పదకొండు గంటలకు..వర్షంలో..తడుస్తూ..నిజాయితీతో కూడిన సంపాదనలో..ఈ దేశాన్ని అవినీతితో దోచుకుంటున్న అనేకమంది వైట్ కాలర్డ్ దొంగలకన్న నిర్మలంగా..తన తల్లి..తన అమ్మ..తన మా. ‘

ఉష తిరిగొచ్చింది  ఇంటికి.

వచ్చేసరికి..ఇంట్లో ఎవరూ లేరు.లక్ష్మణ్ యధావిధిగానే ఎక్కడో తాగుతూ..తమ్ముడు షకీల్ ఏ ఫ్రెండ్స్ తోనో.,

కాని..తమ ప్రక్కనే ఉన్న రేకుల షెడ్ లో ఉండే శరత్ మాత్రం ఎదురుచూస్తూ ఉన్నాడు ఉషకోసం.దాన్ని ప్రేమ అంటాడు శరత్.అది వట్టి బూటకం అని తెలుసు ఉషకు.

ఈ ఏ పూటకాపూట కుటుంబాల్లో..ఇంటి పరిస్థితులు మనుషులకు తప్పులు చేయడానికి చాలా అవకాశాలను కల్పిస్తాయి..ముఖ్యంగా ఒంటరితనాలను..స్వేచ్ఛను..యూజ్ అండ్ త్రో టైప్ సందర్భాలను..బలహీనతలను ఆసరా చేసుకుని.

శరీరం ఒక అగ్ని బాంఢం..వాంఛ ఒక పెట్రోల్ బావి.అగ్గి తారసపడ్తే భగ్గున మండి భస్మం చేస్తుంది.

ఇదివరకు ఉష ..ఒక ముసురుపట్టిన రాత్రి  ఒంటరిగా శరత్ కు ప్రక్కనే తారసపడ్తే.,

ఒక వెకిలి వవ్వుతో..ఒక చూపుతో గుచ్చి గుచ్చి చంపి..ఒక కవ్వింత..లోపల ఒక తీవ్ర జ్వలన.

‘ ఏదేమైనా తెగించి ఒక్కసారి సెక్స్  కార్యం జరిపితే..తీవ్రమైన కోరిక నెరవేరుతుంది..అగ్ని చల్లారుతుంది..ఒక కొత్త అనుభవం గురించిన రుచి తెలుస్తుంది.’అన్న ఉత్సుకత. తహతహ.

ఉష మౌనాన్ని అంగీకారంగా వ్యక్తపరిస్తే..శరత్ తెలుగు సినిమాల్లో దిక్కుమాలిన హీరోలా రెచ్చిపోయి,

ఆ స్వేచ్ఛాయుతమైన రాత్రి..ఓ నాల్గైదుసార్లు తృప్తి.

ఇది తప్పు ..ఇది శీలం పోవుట..ఎవరో ఎవర్నో లొంగదీసుకొనుట..అంతా ట్రాష్ అనుకుంది ఉష .ఉష కించిత్తుకూడా బాధపడలేదు..తనుకూడా  కావాలనుకుంది..చేసింది.సింపుల్ గా చెప్పాలంటే..’అంతే.’

ఒకసారి జరిగిన క్రియను..తప్పును..మళ్ళీ..మళ్ళీ పదే పదే చేసినా..పెద్ద తేడా పడేదేముండదన్న తెగింపు.

చాలాసార్లే జరిగి.,

అప్పుడు..ఆ రాత్రి..ఆ వెన్నెల రాత్రి అన్నాడు శరత్..”నువ్వు చాలా చాలా బాగా పాడుతావు ఉషా..ఒక్కసారి ఆ పాటను పాడవా ప్లీజ్” అని.

ఉష వెంటనే పాడింది..శరత్ పాడమన్నందుకు కాదు.పదే పదే తను నిజంగానే మంచి సింగర్ నేనా..అని నిర్ధారించుకునేందుకు.

ఆ రాత్రి ఉష..దేవుడు తనకిచ్చిన ఈ “ఏక సంతాగ్రాహి” లక్షణాన్ని ఏ రకంగా జీవితంలో శక్తివంతంగా ఉపయోచుకోవాలా అని మొట్టమొదటిసారిగా..కొత్తగా ఆలోచించింది.

ప్రేమలు.శీలాలు.త్యాగాలు.దేన్నో కోల్పోయినట్టు  రోదించడాలు..అన్నీ మరిచి..ఉష తన  కళ్ళముందున్న తెరలనూ,ముసుగులనూ తొలగించుకుంది తెలతెలవారుతూండగా.శరీరాన్ని ఆయుధంలా ఎక్కుపెట్టి..ఒళ్ళు విరుచుకుని..ఆవులించి..కళ్ళు తెరిచింది ఉద్యుక్త ఔతూ.

3

digadaaniki-picture ఉష జీవితంలోకి అవినాశ్ ప్రవేశం ఒక పెద్ద మలుపు.లైబ్రరీలో పరిచయమై ఒకరోజు ఒక పుస్తకమిచ్చాడు అతడు. అది”మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి”.

ఆ వర్షం కురుస్తున్న రాత్రే ఆ పుస్తకాన్నంతా చదివింది తను.

SWOT . . అనాలిసిస్ . . S . . అంటే స్ట్రెంగ్త్. . నీ బలాలు..W ..అంటే వీక్నెసెస్..బలహీనతలు.. O అంటే..ఆపర్చునిటీస్..అవకాశాలు.. T   అంటే థ్రెట్స్.. అవరోధాలు.

ఎప్పుడైనా  ఒక కాగితం తీసుకుని నీ ఆలోచనలనన్నింటినీ   దానిపై రాయమని చెప్పాడు మేనేజ్ మెంట్ పితామహుడు..ఎఫ్. డబ్ల్యు. టేలర్.

రాసింది తను.మూడు పేజీలు నిండాయి..క్రోడీకరిస్తే.. తన బలం.. ఒక్కటే అని తేలింది.అది .. ఒక్కసారి వింటే చాలు..ఆ ధ్వనిని మళ్ళీ సరిగ్గా అలాగే పునరుత్పత్తి చేయగల తన దైవదత్తమైన సామర్థ్యం . .తన బలహీనత.. తన బీదరికం.

చాలా మంది  తను ఎదగడానికి తమ బీదరికం..తగు స్థాయిలో డబ్బు లేకపోవడమే కారణమని అనుకుంటారు.. కాని అది పూర్తిగా తప్పు అని  సెల్ఫ్ మేనేజ్ మెంట్ సిద్ధాంతకర్త  స్మిత్ ఎప్పుడో చెప్పాడు.దేన్నైనా సాధించడానిక్కావలసింది..స్పష్టమైన లక్ష్యం..దాన్ని చేరి అనుకున్నది సాధించాలన్న సంకల్పం..పట్టుదల..ప్రతిభ.

ఊష అనే తను ఇక..’ తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలి ‘ అని బయలుదేరింది ఒక రోజు..హైదరాబాద్ కు.హైదరాబాదే  తన కార్యరంగమని తెలుసుకుందామె.

తన ఆయుధం పాట.

పాటకు ప్రాచుర్యమివ్వగలిగింది సినిమా ఒక్కటే.

తను ఒక ప్రసిద్ధ గాయని ఐ ఒక వెలుగు వెలిగి పోవాలి..అందుకు కావల్సింది ‘అవకాశం.’

.       ‘ మనిషికి దేనికైనా ఒక అవకాశం రావాలి.వచ్చినప్పుడు తెలివిగా దాన్ని గుర్తించి ఉపయోగించుకోవాలి.అవకాశం రానపుడు ఆ అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి.’

తనకు అవకాశాలు వచ్చే అవకాశం అస్సలే లేదు..కాబట్టి అవకాశాన్ని తనే సృష్టించుకోవాలి.

ఎలా..ఎలా..ఎలా..అన్వేషణ.సరియైన రీతిలో చేయినందించి నడిపించగల వ్యక్తికోసం..సమర్థునికోసం..అన్వేషణ.

మార్కెట్ స్టడీ..ప్రస్తుత మ్యూజిక్ రంగంలో..ఉన్నతుడూ..మార్కెట్ ఉన్నవాడు  ఎవరు..ఎవరు..ఎవరు.?

ఉష అనే తనకు..ఒక నిర్దుష్ట దృష్టితో..శాస్త్రీయంగా..దూసుకుపోతున్నకొద్దీ..మన దగ్గర ప్రతిభ ఉంటే..తనపై తనకు విశ్వాసముంటే..గమ్యాన్ని చేరడం సుళువే అని తొందరగానే అర్థమైంది.వెదికి వెదికి..పట్టుకుంది  ఓ మనిషిని..అతని పేరు..గణేశ్ శాస్త్రి.

గుర్రపు పందెంలో గెలవాలంటే తనకెంత సామర్థ్యమున్నా సరియైన గుర్రాన్ని ఎంచుకోవడం ఒక అత్యంత ప్రధానమైన మెలకువ.ఆ పందెపు గుర్రం ఇప్పుడు గణేష్ శాస్త్రి.

ఒక మనిషికి చేరువై..అతనితో మనం అనుకున్న పనిని సాధించేందుకు ముందు అతని అత్యంత వ్యక్తిగతమైన జీవితాన్ని అధ్యయనం చేయాలి. కొందరికి తిండి బలహీనత. కొందరికి డబ్బు.కొందరికి స్త్రీ.ఇంకొందరికి స్తుతి.కొందరికి కానుకలు.కొందరికి అధికార హోదాలు..ఏదో ఒక మత్తు.వ్యామోహం.ఇవన్నీ బలహీనతలే.యుక్తిపరుడు ఇవన్నీ గ్రహించి..ఒంటరిగానే  కావలసిన వ్యక్తికి చేరువై..కార్యరంగంలోకి దూసుకుపోయి అంతిమంగా  లక్ష్యాన్ని సాధిస్తాడు.

గణేశ్ శాస్త్రి బలహీనతలను పసిగట్టి సరియైన దిశలోనే కలిసింది తను..చాలా మంది పురుషుల్లో ఉన్న బలహీనతే అతనిక్కూడా ఉంది.మందు..మగువ.మందుకు కొదువలేదతనికి.తను తాగగలడు..వేరే వాళ్ళెవరైనా ప్రతిరోజూ అతను తాగగలిగినంత తాగించగలరు.ఐతే తాగుబోతులకు..వేరేవాడెవడైనా తాగిస్తే బాగుండుననే దుగ్ధ ఒకటుంటుంది.అదే ఉంది శాస్త్రిగారిక్కూడా.శాస్త్రి గారికి మ్యూజిక్ చేయవలసిన సినిమాలు కనీసం ఓ పదుంటాయి చేతిలో ఎప్పుడూ..వివిధ భాషల్లో.

ఒక రాత్రి..ఒక సంగీత విభావరి తర్వాత కలిసింది తను ఒక ఫైవ్ స్టార్ హోటెల్లో శాస్త్రిగారిని..కొన్ని సుమబాణాల్లాంటి చూపులనూ..కొన్ని తళుకులీనే శరీర కదలికలనూ ధరించి..తప్పించుకోలేని  మధుర ధరహాస చంద్రికలనూ వలలా వేసింది.

జీవితమంటేనే వ్యాపారమనీ..వ్యాపారమే జీవితమనీ..కదా ఎం బి ఎ లో పాఠం చెప్పేది.

శాస్త్రిగారికీ..తనకూ రోజురోజుకూ దూరం తగ్గుతూ..సాన్నిహిత్యం పెరుగుతూ..పరస్పరం అర్థంకావడం మొదలై.,

కొన్నింటిని అడిగితేగాని ఇవ్వొద్దు..మరి కొన్నింటిని అడుగకముందే ఇచ్చి పిచ్చెక్కించి పరవశింపజేయాలి.ఇంకొన్నింటిని..మరీ మరీ అడిగించుకుని..బ్రతిమాలించుకుని మాత్రమే ఇవ్వాలి.

‘ నేను పాట పాడుతా..నువ్విను ‘ అంటే వినడువాడు.వాడే ‘ ప్లీజ్..ఒక్కసారి ఒక పాటపాడవా.’ అని బతిమిలాడినప్పుడు పాడుతే బహుబాగా వింటాడు..ప్రశంసిస్తాడు.

మంచి మేనేజర్..తననుకున్న జవాబును ఎదుటివాడు వానంతట వాడే చెప్పేట్టు చేసుకుంటాడు.

శాస్త్రిగారు..ప్రక్కమీదున్నపుడు..కొన్నిసార్లు బతిలాడగా బతిలాడగా ఒక పాటను అద్భుతంగా పాడి వినిపించి గిలిగింతలు పెట్టింది తను.ఫ్లాటయ్యాడు ముసలోడు.ముఖ్యంగా ఒక్కసారే విని తను ధారణ చేసి మళ్ళీ వెన్వెంటనే వినిపించే తన ప్రతిభకు షాక్ అయ్యాడు.ఒకానొక తన్మయ స్థితిలో ” ఉషా..రేపే నీ పాట రికార్డింగ్ “అన్నాడు.అని ఆగకుండా..” చూస్తూండు నువ్వు..నిన్ను భారతదేశ అత్యుత్తమ  లేడీ సింగర్ ను చేస్తా రెండేళ్ళలో.నీది ఒక విలక్షణమైన మధుర స్వరం” అన్నాడు. శాస్త్రి గారు తనకు లొంగిన మాట సత్యమే కాని..నిజానికి ఆయన ఒక అత్యున్నత స్థాయి సంగీతకారుడు.

ఒక రోజన్నాడు శాస్త్రిగారు..” నిజానికి కళలన్నీ మనిషికి  దైవదత్తంగా సంక్రమించేవే..కె ఎల్ సైగల్ కు శాస్త్రీయ సంగీతమే రాదు.కాని అద్భుతమైన శాశ్వతమైన జీవవంతమైన గీతాలను అందించాడుగదా.శాస్త్రాలేవైనా మనిషి అనుభవాలనుండీ..అధ్యయనాలనుండే పుట్టాయిగాని..అనుభవాలు శాస్త్రాలనుండి పుట్టలేదు.నువ్వు ఒక సహజ గాయనివి ఉషా” అని.

నిజానికి ఆయన తనను కావాలని పట్టుపట్టి ఒక ప్రపంచస్థాయి గాయకురాలిని చేశాడు.ఈ పన్నెండేళ్లలో  శాస్త్రిగారు పెట్టిన భిక్షే ఈ తన  వైభవ  ప్రాప్తి . ఆయనను వెదికి పట్టుకోవడం తన తెలివి.

ఐతే..గాయనిగా ..ఒక విలక్షణమైన గొంతు ఉన్న దానిగా పొందిన గౌరవాలు,అనేకానేక సత్కారాలు,విజృంభించి అధిరోహించిన అత్యున్నత శిఖరాలు..అన్నీ ఇప్పుడు..ఒక మాయవలె..విడిపోతున్న మంచు తెరలవలె..ఒక దీర్ఘ భ్రాంతివలె,

ప్రశ్నలు..జీవితంలో..ఆ తర్వాత.. అటు  తర్వాత..ఆ ఆ తర్వాత..అని..ప్రశ్నలు.

ప్రశ్నలు..రాలుతున్న ఎండుటాకులవలె..ప్రశ్నలు..కూలిపోతున్న సౌదాలవలె..ప్రశ్నలు చెదిరి విరిగిపోతున్న నీడలవలె.

పెరుగుతున్నకొద్దీ..లోపల విశాలమైపోయిన ఎడారి..ఎక్కడా..సుదూర ప్రాంతమంతా..మనుషుల జాడలే కానరాని ఎడారి. తత్వవేత్తలన్నట్టు..ఎప్పుడైనా మనిషి కొంత పొందుతున్నాడూ..అంటే కొంత కోల్పోతున్నట్టే లెఖ్ఖనా.?

4

 

అమ్మ..రజియా జ్ఞాపకమొచ్చింది ఉషకు. అమ్మ జ్ఞాపకంతోపాటే ఆపుకోలేని దుఃఖం.

తను ఎదుగుతూ..ఇంకా ఇంకా ఎదుగుతూ పైకి వెళ్తున్నకొద్దీ..” అమ్మా..రా నా దగ్గరకు..నాతో..నాతోపాటే ఉండిపోవమ్మా..అమ్మా రజియా..నా దేవత అమ్మా..రా వచ్చి నా తలను నీ ఒడిలోకి తీసుకుని..నన్నొక్కసారి నీ పరిష్వంగంలో..నీ అమృతహస్తాలతో,”

కాని అమ్మ రాలేదు.చనిపోయిన తమ్ముడు షకీల్ జ్ఞాపకాల్లో కనలిపోతూ, చావక ఇంకా మిగిలి ఉన్న నాన్న లక్ష్మణ్  తో ..అదే తోపుడు బండి.అదే జీవితం.అమ్మది.

అసలు జీవితం ఏమిటి.?

బిగ్గరగా రైలు కేక.భయంకరంగా.వికృతంగా.

అసలు తనిక్కడిలా కూర్చున్నట్టు ఎవరికీ తెలియదు.తెలిస్తే.క్షణాల్లో ఇసుకపోస్తే రాలనంతమంది అభిమానులు చొచ్చుకొస్తారు.

ఒక అంతర్జాతీయ స్థాయి గాయనిప్పుడు..ఉష.

కాని..కాని,

లేచి..ఉష శాలువాను శరీరం చుట్టూ  సవరించుకుని,

ఎ-వన్..కంపార్ట్ మెంట్..తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్..లో..ముప్పది రెండో  నంబర్.

కిటికీలోనుండి బయటకు చూస్తూండగానే రైలు మెల్లగా కదుల్తూ..బయటంతా చీకటి.నల్లగా.

కొద్ది నిముషాల్లోనే ఢిల్లీ మహానగరం కనుమరుగౌతూ,

‘ విజయవాడలో దిగగానే..పరుగు పరుగున అమ్మ దగ్గరికి పరుగెత్తి..చుట్టుకుపోయి…అమ్మ..అమ్మ..రజియా..అమ్మ.,’

ఎందుకో చటుక్కున ఉష చేయి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ముఖేశ్ పాటను వింటానికి టచ్ ఫోన్ తెరను తడిమింది.

” జుబాపే దర్ద్ బరీ దాస్ తా  చలీ ఆయీ

బహార్ ఆనేసే పహలే  ఖిజా చలీ ఆయీ..” స్వర ఝరి అది..గాలిలో తేలుతూ.

ఒక మహాద్భుత  విషాద గీతంలో ఎక్కడని వెదుక్కుంటావు..పోగొట్టుకున్న హృదయాన్ని.?

రైలు వేగాన్ని పుంజుకుంటోంది చీకట్లో.                                                                                                             *

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

‘స్టిల్ లైఫ్’ లో ప్రాణం పొదుగుతున్న రమేష్!

 

సామాన్యశాస్త్రం ‘జీవనచ్ఛాయ’

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19 ) సందర్భంగా హైదరాబాద్‌లోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో సామాన్యశాస్త్రం ఏకచిత్ర ప్రదర్శన (సింగిల్ ఎగ్జిబిట్ షో) 18వ తేదీ మంగళవారం సాయంత్రం ఐదున్నరకు ప్రారంభం. ముఖ్య అతిథులు జి.భరత్ భూషణ్, అల్లం నారాయణ, కె.వి.రమణాచారి. candid picture, life photography ప్రాముఖ్యాన్ని తెలిపే ఈ ప్రదర్శన ఆదివారం దాకా ఉంటుంది. అందరికీ ఆహ్వానం.

– కందుకూరి రమేష్ బాబు, 99480 77893

ఈ సందర్భంగా  రామా చంద్రమౌళి ప్రత్యేక రచన 

raamaa chaMdramouliప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని..ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం,బాగ్ లింగంపల్లి,హైదరాబాద్ లో ప్రఖ్యాత ’ లైఫ్ ’ ఛాయాగ్రాహకులు  కందుకూరి రమేష్ బాబు ఒక విలక్షణతతో..అత్యంత సాహసోపేతంగా 19 నుండి 23 ఆగస్ట్ 2015 వరకు ఏర్పాటు చేస్తున్న ‘ ఏక ఛాయాచిత్ర ప్రదర్శన ‘ (single exhibit show) సందర్భంగా..రమేష్ బాబు గురించిన ముచ్చట.

ఈ ప్రదర్శనలో కేవలం 3′ X 5’ సైజ్ గల క్రింద చూపిన ఒకే ఒక్క ఛాయాచిత్రం మాత్రమే ప్రదర్శితమౌతుంది. సాధారణంగా ఆర్ట్ ఎగ్జ్బిషన్ లలో ఒకే లేదా భిన్న కళాకారులకు సంబంధించిన పలు చిత్రాలు ప్రేక్షకుల సందర్శనార్థం ప్రదర్శితమౌతాయి.కాని ఈ విధంగా ఒకే ఒక్క విలక్షణమైన చిత్రాన్ని రసజ్ఞులైన  వీక్షకులకోసం  ఏర్పాటు చేయడం ఒక సాహసోపేతమైన .. కించిత్తు దర్పంతోనూ, ఒక ప్రత్యేక లక్ష్యంతోనూ కూడుకున్న చర్యగా భావించవలసి వస్తోంది.ఒక జీవనచ్ఛాయా చిత్రకారునిగా గాఢ గంభీరతనూ,అర్థాన్నీ,లోతైన జీవన సంక్షోభాన్నీ అత్యంత గరిష్ఠ స్థాయిలో వ్యక్తీకరిస్తున్న ఈ చిత్రం నిజంగానే  ‘ ఒక్కటే అనేక చిత్రాలకు సమానం కదా ‘ అన్న ఒక ప్రశంసాత్మక అబ్బురాన్ని కలిగిస్తున్న విషయంకూడా తప్పక స్ఫురిస్తుంది అందరికీ . ఈ నేపథ్యంలో..

ramesh

పై ఫోటోకూ నాకూ ఒక వ్యక్తిగత సంబంధముంది.’ నమస్తే తెలంగాణ ‘ పత్రిక కొత్తగా పుట్టిన రోజుల్లో ప్రతి ఆదివారం అనుబంధ పుస్తకం ‘బతుకమ్మ ‘ సంచిక చివరి అట్టపై ఒక పూర్తిపేజి ఛాయాచిత్రం ప్రచురించబడి కళాత్మకమైన  ఫోటో ప్రియులను అలరించేది.ఆ విధంగా..ఒకటా రెండా..అనేకం వచ్చాయి.ఆ క్రమంలో నా హృదయాన్ని దోచుకుంటున్న ఈ  కె ఆర్ బి..అన్న ఫోటోగ్రాఫర్ ఎవరబ్బా అని ప్రత్యేకంగా వాకబుచేసి ఒకరోజు ఫోన్ చేసి..తర్వాత్తర్వాత పలుమార్లు కలుసుకుని..స్నేహించి..ఆత్మీయులమై..రమేష్ బాబు ఫోటోలంటే నాకు ఎంత పిచ్చి ఏర్పడిందంటే..2012 లో వెలువడ్డ ( తెలుగులో..ఇంగ్లిష్ లో ప్రసిద్ధ అనువాదకులు ప్రొఫెసర్ కె.పురుషోత్తం చేత తర్జుమా చేయబడిన) నా ఎనిమిదవ కవితా సంపుటి ” అంతర “పుస్తకంలోని  ప్రతి కవితకూ ఒక పూర్తి పేజి ఫోటో చొప్పున  అరవై కవితలకు అరవై ఫోటోలను  ఉపయోగించుకున్నాను.ఆ పుస్తకం అంతర్జాతీయ ప్రమాణాలతో వెలువడి తర్వాత ప్రతిష్టాత్మక ‘ ఫ్రీవర్స్ ఫ్రంట్-2012 ‘,’ సహృదయ-2013′ వంటి ఎన్నో పురస్కారాలను సాధించింది.

ఆ పుస్తకంలో..’ పాదాల కింది నేల ‘ అన్న కవితకు ఈ రోజు రమేష్ బాబు ఎంతో గర్వంగా ‘ ఏక చిత్ర ప్రదర్శన ‘ గా పెడ్తున్న ఈ అద్భుత చిత్రం ఉపయోగించబడింది.ఇదే కవితను నేను 2012 లో ఆగ్రాలో జరిగిన తొమ్మిది దేశాల ‘సార్క్ ‘ సాహిత్య శిఖరాగ్ర సదస్సులో చదివినప్పుడూ, 22 దేశాల ప్రతినిధులు పాల్గొన్న “2013-జైపూర్ అంతర్జాతీయ సూఫీ సదస్సు” లోనూ చదివినప్పుడు ఈ ఫోటో తో సహానా కవిత కూడా  గ్యాలరీలో ప్రదర్శించబడ్డప్పుడు అనేకమంది విదేశీ ప్రముఖుల ప్రశంసలను పొందింది..ఫోటో..కవితకూడా.అప్పుడు అనేక ప్రాచ్య  ప్రతినిధులు ఈ ఫోటోలోని విలక్షణతను నన్నడిగి తెలుసుకోవడం ఒక మధురమైన జ్ఞాపకం.

krb-5

photo: C.M.Praveen Kumar

నాకున్న వ్యక్తిగత అనుబంధంతో రమేష్ ను అడిగానొకసారి..’నీకూ ఇతర ఫొటోగ్రఫర్లకూ తేడా ఏమిటి ‘అని. అతను చెప్పిన జవాబు నన్ను ముగ్దుణ్ణి చేసి నిజమేకదా అని అబ్బురపర్చింది.అది..” అందరూ తమకు నచ్చిన దృశ్యాన్ని capture  చేస్తే..నా ఎదుట తారసపడే సజీవ జీవన చిత్రం మాత్రం అదే నన్ను capture చేస్తుందన్నా..” అన్నాడు.అది అక్షరాలా నిజం.అప్పుడప్పుడు రమేష్ తో కొన్ని రోజులు గడిపిన నేను..ఒక్క నిద్రపోయేటప్పుడు తప్పితే నిరంతరం కెమెరా అతని శరీరంలో ఒక భాగంవలె వెంట ఉండడం గ్రహించాను .ఎందుకలా అంటే..’ ప్రత్యేకంగా వెదుకకుండానే అనుక్షణం మన నిత్య గమనంలో ఎక్కడ ఒక అద్భుతమైన సామాన్య మానవుని సజీవ జీవన పోరాట సౌందర్యం కంటబడ్తుందో చెప్పలేం ..ఆ క్షణమే ఆ అద్భుత దృశ్యాన్ని  ఒడిసిపట్టుకుని..నిక్షిప్తం చేయాలి.. ‘ అని జవాబు.అతని  గాఢాసక్తి అది .శివునికి మూడో కన్నులాగ రమేష్ కు కెమరా ఒక మూడో భుజం.

ప్రదర్శనలో ఉన్న ఈ బొమ్మ గురించి తన స్వంత అన్వయింపు గురించి అడిగినప్పుడు..రమేషన్నాడు…

 ‘ అందులో  ఉన్న ఒక స్త్రీ..ఒక పురుషుడు ఈ మన భారతదేశ వర్తమాన సంక్షుభిత సమాజంలోని అట్టడుగు వర్గ విస్మృత వ్యక్తుల జీవన పొరాటాన్ని ప్రతిబింబిస్తున్న సజీవ చిత్రం.వాళ్ళు గారడీ వాళ్ళు కావచ్చు.సంచారజాతులకు సంబంధించిన గ్రామీణ కళాకారులు కావచ్చు..ద్రిమ్మరులు కావచ్చు.ఎవరైనా ఒక స్థిరత్వమూ..ఒక ప్రత్యేక అస్తిత్వమూ లేక నిత్య జీవిక కోసం..ఆకలి కడుపులతో అలమటిస్తున్నవాళ్ళు.జూబ్లీ హిల్స్ ,హైదరాబాద్ లో నడిరోడ్డు మధ్య ఎవరి పరుగులు వారివిగా పరుగెత్తుతున్న తీరికలేని నగరవాసుల మధ్య ప్రదర్శిస్తున్న జఠిలమైన ఒక ఫీట్ అది.ఎంతో అర్థవంతమైన..మనుషులను లోతుగా ఆలోచింపజేసే ఒక విన్యాసమది.పురుషుని కాళ్ళకింద కనబడని భూమి..పురుషుని తలపై ఒక భూదేవిలా భారాన్నంతా మోపి ప్రతిష్ఠితమైన స్త్రీ పాదాలు. ఒట్టి మట్టి పాదాలు..మాసిన బట్టలతో దీన పేద ప్రజల ప్రతినిధులుగా చూపులనిండా కొట్టొచ్చినట్టు దైన్యం.శూన్యం వాళ్ళ కళ్ళలో . తాత్విక దృష్టితో చూస్తే..ఒకరి భారాన్ని మరొకరు మోస్తూ స్త్రీ పురుష సంయోగ సంగమాల్లో,విలీనతలో ఏకత్వభిన్నతలో అభిన్నమై నిలిచిన బింబం..ప్రతీక అది. నిరాడంబరమైన అతిసహజ  స్త్రీపురుష  సమన్వయ  సహాకారాలతో కొనసాగే శ్రామిక క్రతువు అది. సంయోగ యోగం. ‘ అని. నిజమే కదా.

ఒక కళాకారునిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించి..రీ డిస్కవర్ చేసేందుకు ఎవరో ఒక దార్శనికుడైన మహానుభావుడు అతనికి తారసపడ్డం యాదృచ్ఛికమే ఐనా అది అదృష్టమే. ఒక కమలాహాసన్ ను,ఒక రజనీకాంత్ నూ గుర్తించగలిగిన కె.బాలచందర్..ఒక ఎ.ఆర్.రెహమాన్ ను,ఒక సంతోష్ శివన్ నూ గుర్తించేందుకు ఒక మణిరత్నం..కావాలి.ఐతే మన రమేష్ ను ఎవరూ గుర్తించలేదుగాని..తనే తనలో క్షిప్తమై ఉన్న కళను గుర్తించగలిగిన  వ్యక్తిని వెదుక్కుంటూ వెళ్ళి తన గురువును అన్వేషించుకుని శిష్యరికం చేశాడు ఓ ఏదాదిపాటు దీక్షతో..చేస్తున్న ఉద్యోగాన్నికూడా వదలి.

రమేష్ గురువు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘురాయ్ .ఒక ఏడాదికాలం హైదరాబాద్,తిరుపతి,ఢిల్లీ,కోల్ కటా..ఇలా అనేక ప్రాంతాలను ఒక శిష్యునిగా,సహచరునిగా,విద్యార్థిగా,మిత్రునిగా వెంట తిరిగి  తనలో దాగిఉన్న’ అగ్ని’ ని తాను గుర్తించి కెమెరాను ఒక ఆయుధంగా స్వీకరించినవాడు రమేష్ బాబు.గురువు చెప్పిన  ప్రధాన విద్య..’ నువ్వు అతి సహజంగా ఫోటోను తీసి దాన్ని ప్రజాపరం చేయ్.అదే నీ వస్తువు,నీ శ్రమ,నీ సృజన.నువ్విక నిష్క్రమించు .ఇక నీ కృతే ప్రజలతో సంధానమై నువ్వేమిటో నీకు చెబుతుంది ‘ అని.అందుకే అందరు ఫోటోగ్రాఫర్లు వాడే ‘ఫోటో షాప్ ‘ ను రమేష్ వాడడు.తన కెమెరాలో అతి సహజంగా జన్మించిన చిత్రాన్ని ఉన్నదున్నట్టుగా మనకందిస్తాడు.మెరుగులూ,అలంకారాలూ,మేకప్పులూ ఉండవు.సహజమైన సృష్టి ఎప్పుడూ జీవాన్ని నింపుకుని అందంగానే ఉంటుంది.అందుకే..’ ఫేస్ బుక్’ మిత్రులకు గత కొన్నేళ్ళుగా 2000 కు పైగా అద్బుతమైన ఫోటోలను ‘ మై సిటీ అండ్ మై పీపుల్’ పేర అందిస్తున్నాడు

.’ వన్ ఇండియా.కాం’ దినపత్రికలో..రోజుకొక్కటి చొప్పున ఇప్పటికి కొన్నేళ్ళుగా వేయికి పైగా ఫోటోలను ‘మై సిటీ..మై పీపుల్ ‘ పేర ప్రచురిస్తున్నాడు. బహుళ పాఠకాదరణ గల ప్రసిద్ధ అంతర్జాల వారపత్రిక ” సారంగ” లో గత వంద వారాలనుండి ‘దృశ్యాదృశ్యం’ శీర్షికన ఒక పులకింపజేసే ఫొటోతో పాటు అర్థవంతమైన వ్యాఖ్యనుకూడా జతచేసి అందిస్తున్నాడు.ఈ మూడు నిత్యకృత్యాల్లోనూ వేలాదిమంది వీక్షకులు విభ్రమంతో పెట్టే వారి వారి కామెంట్స్ ను నేనెరుగుదును.నేనుకూడా అనేకసార్లు మైమరచి సూపర్ లేటివ్స్ లో వ్యాఖ్యలను పోస్ట్ చేసిన సందర్భాలు కోకొల్లలు.అందుకే మొన్న నేనన్నా రమేష్ తో..’నీ ఈ ప్రదర్శనలో వాడిన ” A pictureis worth A thousand words  ” అన్న వ్యాఖ్య సరియైంది కాదేమో రమేష్..వేయి పదాలుకాదు..అసలు అనేక సాహిత్య ప్రక్రియలూ,రూపాలూ ఏవీ కూడా వ్యక్తీకరించలేని అత్యంత సంక్లిష్ట  మహానుభూతులను నీ ఒక్క ఫోటో మాత్రమే వ్యక్తీకరించగలదు..వేరే ఏ ఇతర కళారూపాలూ చేయలేవా పనిని’ అని.

కందుకూరు రమేష్ బాబు ఫేస్ బుక్ లో ‘తల్లి కొంగు ‘ శీర్షికన అందించిన అనేక వందల అర్థవంతమైన,ఆర్ద్రమైన ఫోటోలు కూడా ఎందరు ప్రేక్షకుల మన్ననలను పొందాయో చెప్పలేము.అసలు ఇంత సహజమైన నిర్ణయాత్మక క్షణాలను (decisive moments)  ఇతను ఎలా బంధించగలిగాడబ్బా..అని చకితులమైపోతాము.తల్లి కొంగు ఎలా తన బిడ్డకు ఒక రక్షణ కవచమై..పరిష్వంగమై..అక్కున చేర్చుకునే ప్రాణధాతువౌతుందో ప్రతి ఫోటో చెబుతూనే ఉంటుంది.

అసలు నువ్వు నీ ఫోటోలతో..ఇంత బీభత్స  ఆర్ద్ర రస విన్యాసాన్ని ఎందుకోసం చేస్తున్నట్టు రమేష్..అని  నేనడిగినప్పుడు..’ఈ భిన్న అణచివేతల మధ్య నలిగిపోతున్న..నిస్సహాయంగా అణగారిపోతున్న అతి సామాన్య భారత పౌరులనూ, వాళ్ల వెతలనూ చూస్తున్నప్పుడల్లా నేను ఒకసారి ఒక ఏక పాత్రాభినయాన్ని..కొన్నిసార్లు బహు పాత్రాభినయాన్ని..మరికొన్నిసార్లు..జనంలోనుండే అకస్మాత్తుగా ఏ మేకప్పూ లేని పాత్రలతో ఒక వీధి నాటకంగా నన్ను నేను మార్చుకుని మౌన వేదననూ,దుఃఖాన్నీ ప్రకటిస్తూ ప్రదర్శిస్తున్నానన్నా..’ అని వాపోయినప్పుడు..నిజంగానే నేను స్తబ్దుణ్ణైన  సందర్భాలు చాలా ఉన్నాయి.రమేష్ కు తన ఈ ‘ లైఫ్ ఫోటోగ్రఫీ ‘ ఒక ఎమిటివ్ మీడియా(emittive media)..ఒక బలమైన వ్యక్తీకరణ మాధ్యమం. ఒక ప్రత్యేక భాష..ఛాయా చిత్ర  భాష అది.ఉద్వేగపూరితుడైన ఒక కళాకారుడు తన్ను తాను ఖాళీ చేసుకుంటే తప్ప మళ్ళీ తనను తాను తాజా ఆలోచనలతో పునరావేశపర్చుకోలేడు.అదే జరుగుతోంది ఇతని ఈ అనంత ప్రయాణంలో.

ఒక సృజనకారుని ఆలోచనలూ,అన్వయింపులూ నిజగానే చాలా చిత్రంగా ఉంటాయి.ప్రతి భారతీయ స్త్రీకి..ముఖ్యంగా తెలుగు స్త్రీలకు..తన ఇంటి వాకిలే ఒక కాన్వాస్..రంగస్థలం.ప్రతిరోజూ తన నిత్యనూతన సృజనాత్మకతతో తన ఇంటి చారెడు మట్టి వాకిలిని తన ముగ్గులతో (రంగవల్లులతో) శోభింపజేసి  సౌభాగ్య ప్రదాతయైన దేవునికీ,తన ఇంటికి వచ్చే ప్రతి అతిథికీ స్వాగతం పలుకుతుంది స్త్రీ.ప్రతి దినమూ ఒక కొత్త ముగ్గు.కొత్త రూపు.కొత్త అలంకరణ. కొత్త రంగులు.ఇంత ప్రశస్తమైన ‘ముగ్గులను ‘ ఒక అంశంగా తీసుకుని రమేష్ బాబు 5000 చిత్రాలను తీశాడు.అంటాడు..” అన్నా..ఈ ముగ్గుల ఫోటో లైబ్రరీ 2020 తర్వాతి తరంకోసం.ఎందుకంటే..ఇక రాబోయే తరానికి మట్టి వాకిళ్ళుండవు.అన్నీ కాంక్రీట్ జంగళ్ళే.వాళ్ళు ఈ నా ఫోటోలలోనే తమ  గత వైభవాన్ని చూసుకుంటూ మున్ముందు మురిసిపోవాల్సి  ఉంటుంది” అని.నిజమే ఇది.

కెమరా అనే ఆయుధంతో..భిన్న విన్యాసాలను విజయవంతంగా చేస్తున్న రమేష్ బాబు..తన గురువైన రఘురాయ్ జీవిత కథను అత్యంత ప్రేమతో..భక్తితో..’ సత్యం శివం సుందరం’ పేరుతో ఒక బృహత్ గ్రంథాన్ని  వెలువరించాలని 2010 నుండి శ్రమిస్తున్నాడు.బహుశా రఘురాయ్ జన్మదినమైన రాబోయే డిసెంబర్ 18 న ఆవిష్కరిస్తాడేమో.

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించిన తన తండ్రి కె.కిషన్(కె కె)..తమ ఊరు..ఎల్లారెడ్డి పేట లో నడిపిన  జ్యోతి చిత్రాలయ..స్వాతి ఫోటో స్టూడియో..లో ఫోటో కళ ‘అ ఆ’ లను నేర్చుకున్న రమేష్ బాబు..ఇప్పటికి ఆ కళలో పోస్ట్ డాక్టోరల్ డిగ్రీని సాధించాడనే నావంటి ‘ సామాన్యు ‘ లం అనుకుంటున్నాం.ఐనా ఇంకా సాధించవలసింది అనంతమే కదా.

సామాన్యుని గురించే నిరంతరం తపించే రమేష్..తన పాత్రికేయ,ఛాయచిత్ర కృతులన్నింటినీ ‘ సామాన్య శాస్త్రం ‘ పేరనే వెలువరిస్తూ వస్తున్నాడు.తనకు నచ్చిన కొన్ని ఫోటోలతో 2012 లో ‘ జీవనచ్ఛాయ ‘ పేర,2014 లో ‘ చిత్రలిపి..మగువల ముగ్గులు ‘ పేర నిర్వహించిన రెండు ఫోటో ఎగ్జిబిషన్ లలో తనేమిటో ఋజువు చేసుకున్నాడు. ప్రదర్శనశాలల్లో సాధారణంగా ఒక కళాకారుడు తనకు నచ్చిన తన చిత్రాలనే పెడుతాడు.ఆ విధంగా..నేను చూచినంత వరకు రమేష్ బాబు ఫోటోలన్నీ ఎగ్జిబిషన్ లలో ప్రదర్శన కనువైనవే..అర్హమైనవే. వాటినే గనుక  ప్రదర్శిస్తే..ఆ హాల్ కొన్ని కిలోమీటర్ల పొడవు వుండి..ఒక ‘ వరల్డ్ రికార్డ్ ‘ ఎగ్జిబిషన్ ఔతుందేమో.ఐనా కందుకూరు రమేష్ బాబు తప్పకుండా అందరూ గుర్తించవలసిన ” రేపటి  ప్రపంచ స్థాయి  లైఫ్ ఫోటోగ్రాఫ రే ” కదా.

*

 

అరణ్య  రహస్యం

 రామా చంద్రమౌళి

Ramachandramouli

అంతస్సంబంధమేమిటో  తెలియదు  కాని

రాత్రి కురిసిన  ముసురులో  తడుస్తూ  సూర్యుడుదయిస్తూంటాడుగదా

అరణ్యం  నిద్రిస్తున్న  నాలోకి  మెల్లగా  ప్రవేశిస్తూ  ఒక  మెలకువగా  మారుతుంది

పాదాలను  అడవిలోని  దారి  పిలుస్తూంటుంది

ఇటు  లోయ .. అటు  శిఖరం .. ఎవరు  పెట్టారో పేరు .. గార్నెట్ వ్యాలీ

ఇల్లేమో.. వుడ్స్  ఎడ్జ్ .. అడవి  అంచుపై  ఒక  వీధి

మనుషులెవరూ  కనబడరు .. ఎప్పుడో  ఒకరిద్దరు  వృద్ధ  దంపతులు

అమెరికన్స్ .. చేతిలో  కాఫీ  కప్పులు .. మరో  చేతిలో  కుక్క గొలుసు

ముఖంపై  పొంగిపొర్లే  చిరునవ్వు ..’ హై ‘ అని  ఆత్మీయ పలకరింత

ఎవరో  అపరిచితులే .. కాని  మనందరం   ప్రాథమికంగా  మనుషులంకదా  అన్న  ప్రాణస్పర్స

తప్పకుండా  ఎప్పటికైనా  విడిపోవలసిన  మనుషులమైన   మనం

కలుసుకున్న ఈ  మధుర  క్షణాన్ని ‘సెలబ్రేట్ ‘ చేసుకుందాం  అన్నట్టు  నవ్వుమెరుపు

ఎదురుగా యాభై  అడుగుల  ఎత్తుతో  ఆకుపచ్చని  స్వర్గాన్ని  మోస్తూ .. చిక్కగా  చెట్లు

ఒంటరిగా  నడుస్తూంటాను. . వెంట పక్షుల సంగీతాన్నీ .. సెలయేరు  శృతినీ .. ఒక  అభౌతిక  నిశ్శబ్దాన్నీ   వెంటేసుకుని

నా లోపలినుండి.. నాకే  తెలియని  ఎవరో  పురామానవుడు  ఆవులిస్తూ .. మేల్కొంటూ.. పరవశిస్తూ

నేనుకాని  నేను  నడుస్తూ

హద్దులనూ.. ఎల్లలనూ.. చెరిపేస్తూ.. ఒకే  ఆకాశంకింది  జీవసంపదనంతా  ఆలింగనం  చేసుకుంటున్నట్టు

ఒక  నీటిబాతు  ధ్వని .. పిచ్చుక  కిచ కిచ .. పక్షుల  రెక్కల చప్పుడు –

ఎక్కడి  పెన్సెల్వేనియా.. ఎక్కడి  వరంగల్లు .. ఐనా  భూమి  ఒక్కటే కదా  అన్న  ఆదిస్పృహ

మొదటిరోజు.. మెల్లగా  నడుస్తూ  బాటలొకొచ్చి  చిన్ని తాబేలు .. గోధుమరంగు డిప్పతో..తలపైకెత్తి

పలకరిస్తోందా.. అది .. ఏ భాష

అటుప్రక్క  కళ్ళు  మిటకరిస్తూ .. చెవులు  రిక్కించి  జింక .. నిలబడి .. ఆ  చూపులదే భాష

వెళ్ళిపోతూంటాను  వృక్షాలను  దాటుకుంటూ.,

జ్ఞాపకమొస్తూంటుంది .. పెన్సెల్వేనియా.. ద  స్టేట్  ఆఫ్  వాల్లీస్  అండ్  హిల్స్ .. అని

అన్నీ కొండలూ..శిఖరాలే మనిషిలోలా..కనబడనివీ..కనబడేవీ..చూడాలంతే కనబడేదాకా

ఒంటరిగా ఒక కర్ర బెంచీ..సన్నని సెలయేరు ప్రక్కన..ఎవరు పెట్టారో మహాత్ముడు

పిలుస్తోంది..రా కూర్చోమని..అతిథినికదా

చుట్టూ  మనుషులు  ప్రకృతిని  పదిలంగా  సంపదలా  దాచుకున్నట్టు .. పచ్చని  గడ్డితివాచీ

నగ్న పాదాలకు నేలను తాకాలనీ.. గడ్డిని  ముద్దాడాలని  ఎంత  తహతహో

పురా దాహం .. యుగయుగాల  అలసట .. ప్రకృతిలోకి  పునర్విముక్తకాంక్ష

నగ్నంగా  వచ్చినవాడా .. మళ్ళీ  నగ్నమైపోవడమే  అని ..హెచ్చరిక

మధ్య  ఈ  బూట్లొకటి .. అడ్డు ..  తొలగించాలి

కోడిపిల్లకూ.. గాలికీ మధ్య ..పెంకు.. ఛేదనం.. అనివార్యమేకదా

అరగంట .. ముప్పావు .. ఉహూ.. విడిచి వెళ్ళలేను

నెల్సన్  డి  క్లేటన్ స్మారక వనం .. అని బోర్డ్

అక్షరాలను  తడుముతాను  ప్రేమగా.. ఎందుకో  కళ్ళలో  నీళ్ళు  చిప్పిళ్ళుతాయి.

నాకు  తెలియకుండానే  ఆ  అరవై  అడుగుల  మాపెల్  చెట్టు   కాండాన్ని  చేతితో  స్పర్శిస్తాను

ఎవరో  యుగాలుగా  తస్సిస్తున్న  మునిని  తాకినట్టు  విద్యుత్  జలదరింత

2

మర్నాడు  మళ్ళీ వెళ్తాను

ఎప్పుడు  తెల్లవారుతుందా  అని  ఎదురు  చూచీ చూచీ

మంచు కురుస్తున్న  రాత్రంతా  అడవి  పిలుపే

ఆకులు  పిలుస్తాయి .. కొమ్మలు  పిలుస్తాయి . . నేల  పిలుస్తూంటుంది .. ఆకాశం  పిలుస్తూంటుంది

నా  తాబేలు .. నా జింక  .. నా  పిచ్చుక .. నా  నీటిబాతు .. నా కుందేలు

నా సెలయేరు .. నా  నిశ్శబ్ద  సంగీతం .. నా  మాపెల్ చెట్టు

ఒడ్డున  నా   ఖాళీ  కర్ర   బెంచీ

నా  అడుగులకోసం  ఎదురుచూచే  నా  కాలిబాట

నా  లోయ . . నా  శిఖరం..నాలో  నేనే  ప్రతిధ్వనిస్తున్నట్టు  నాతోనే  నేను

పేరుకు  ఉదయపు  నడకే .. మార్నింగ్  వాక్

వ్యసనమైపోతోంది  అడవి .. అల్లుకుపొతోంది  అరణ్యం

మనిషినీ ..  మనసునూ.. హృదయాన్నీ ..  అత్మనూ

ప్రతిరోజూ

పిలిచినట్టే  బాటపైకి  తాబేలు  నడిచొస్తుంది ..  జింక  దిబ్బపై  నిలబడి   పలకరిస్తుంది

గడ్డిపై  అల్లరల్లరి  చేస్తూ  పిచ్చుకలు  కచేరీ  చేస్తాయి

సెలయేరు  వేగాన్ని  పెంచుకుని  ఉరికొస్తుంది  నా  కుర్చీ దగ్గరికి

పైనుండి  అకాశమేమో.. నవ్వుతూంటుంది .. పిచ్చి అడవీ .. పిచ్చి మనిషీ .. అని

ఔను .. జీవితాన్ని  జీవవంతంగా  జీవించడం  ఒక  పిచ్చేగదా

3

వెళ్ళిపోవాలిక

వచ్చినవాడెప్పటికైనా  వెళ్ళిపోవాలికదా

వీడ్కోలు .. నా  స్నేహితుల్లారా.. నా  వృక్షాల్లారా.. నా  నేలా.. నా   పెన్సెల్వేనియా   గాలీ

ఇన్ని  రాత్రులు   నన్ను  అల్లుకుని

ప్రతి  ఉదయం  మేల్కొలిపి  తల్లి  పిలిచినట్టు   నన్ను   స్వాగతించిన   అరణ్యమా  నీకు  వీడ్కోలు

చివరి  రోజు .. చివరి  నడక .. చివరి స్పర్శ

చూపులు  తాబేలును  వెదుకుతాయి . .  జింక  కోసం  తహ తహ

సెలయేటి  పాటేది  .. నీటిబాతు  చప్పుడేది

నన్ను  ఒడిలో  కూర్చోపెట్టుకున్న  నా   ఖాళీ   కర్ర కుర్చీ  ఏది

వెదుకులాట .. తడుములాట .. తండ్లాట

అడవిలోకి  వెళ్ళిన   నాలోకి  అడవే  ప్రవేశించి .. ఆక్రమించిన  తర్వాత

అడవిని  పిడికెడు  గుండెల్లో   ధరించివస్తున్న . . దాచుకుని  వస్తున్న  నాలో

ఎంత  దుఃఖమో.. ఎంత  శూన్యమో.. సముద్రమంత .. ఆకాశమంత –

 

   ( అమెరికా..  పెన్సెల్వేనియాలోని   గార్నెట్ లోయ .. వుడ్స్   ఎడ్జ్ లోని  నా  కూతురు ‘ పవన ‘ ఇంట్లో పదిహేను రోజులుండి .. ప్రక్కనున్న   అడవితో  పెంచుకున్న   అద్భుతానుబంధాన్ని  దుఃఖోద్వేగంతో  స్మరించుకుంటూ )

 

 

 

 

 

 

ఎవరైనా చేసేది వెదకడమే

Ramachandramouli

 

 

 

 

 

రాత్రి
తలుపులపై దబదబ చప్పుడు కొనసాగుతూనే ఉంటుంది
ఎవరు ఎవరిని ఎప్పుడు ఎందుకు పిలుస్తారో తెలియదు
ప్రక్కనే కిటికీ
గాలి ఒక రైలు కేకను ఇనుప చప్పుళ్ళతోపాటు మోసుకొస్తూ
టక టకా పట్టాలపై చక్రాలు పరుగెత్తుతున్న జీవధ్వని
యాత్రించడమొక వ్యసనం
గడపదాటిన ప్రతిసారీ
ఎవరైనా చేసేది వెదకడమే..రోడ్లను..మనుషులను..కాలపు పొరల లోతులను
ఒంటరిగా వెళ్ళడం..సమూహమై తిరిగి తిరిగి
మళ్ళీ ఒంటరిగానే తిరిగి రావడం
కొన్ని కూడికలు..కొన్ని తీసివేతలు..అంతే
ప్రశ్నలేమో పరుగెత్తే అరికాళ్ళకింది గాజుముక్కలు
కారుతున్న రక్తానికి ఉనికుంటుందా..చిరునామా ఉంటుందా
ఉక్కపోస్తూ ఉక్కిరిబిక్కిరౌతున్నపుడు
మార్చురీ గదుల మౌనరోదన..రక్తహీనతతో పాలిపోయిన చంద్రుడు
అర్థరాత్రులు బీట్ కానిస్టేబుల్ కంకకట్టె కణకణ చప్పుడు
అలసి నిద్రపోలేక దుఃఖించే రోడ్లు
ఎక్కడినుండో ఏడుస్తూన్న కుక్క స్పృహ
ఏదో జరుగుతోంది..అని తెలుస్తూనే
ఏదీ జరుగడంలేదన్న అసత్య నిర్ధారణ
శరీరంలోనుండి బయటకు వెళ్ళిపోవడం
ఎప్పుడో మళ్ళీ తిరిగి రావడం..అప్పుడప్పుడు రాకపోవడం
మరణమా అది.?

ఒక ఖాళీ ఊయల ఊగుతూంటుంది దూరంగా..ఒంటరిగా
ఇనుపగొలుసుల చప్పుడు గాలిని చెరుస్తూ
హృదయంనిండా ఒట్టి ఎడారి
ఇసుకతుఫానులో కొట్టుకుపోతూ ఒక నువ్వూ ఒక నేనూ
శేష నిశ్శేషాల స్పృహ
చేయిని విడిచి నువ్వు కోర్ట్ అవరణలోనుండి నడిచివెళ్తున్నప్పటి
నిశ్శబ్ద వియుక్తత
ఏమిటో..అన్నీ లెక్కలు లెక్కలుగా మనుషులు భాగించబడుతున్నపుడు
కన్నీటిని తుడుస్తున్న వ్రేలు విలువెంత..వ్చ్
కనీసం కంటినిండా నిద్రపోవాలన్న కోరికతీరని వ్యాకులతలో
అన్నీ స్వప్న ఖండాలే శకలాలు శకలాలుగా రాలిపడ్తూ
శేషరాత్రంతా వెదుక్కోవడమే ఎవరికివారు
ముసుగులు తొలగిపోతూ,రంగులు వెలిసిపోతూ
లోపలినుండి దహనం మొదలై మంటలు విస్తరిస్తున్నపుడు
కాలిపోయేదేదో..కాల్చబడేదేదో అర్థంకాని నిశ్చేష్ట –

చాలా దూరమే జరిగింది ప్రయాణం
కదలికలన్నీ వ్యూహాలని అవగతమౌతున్నపుడు
నీ నా చలనాలన్నీ
ఒట్టి అనిర్ధారిత సమీకరణాలే
జవాబు రాదు .. నడక ఆగదు
సరియన జవాబు రావాలంటే
సంధించబడ్తున్న ప్రశ్న సరిగా ఉండాలి
అనిర్వచిత గమ్యంవైపు ఎన్నాళ్ళని నడుస్తూనే ఉంటావు
ఆగు..ఆగి చూచుకో లోపలికి…తొంగి తొంగి గమనిస్తున్నపుడు
దిగుడుబావిలోకి వంగి చూస్తున్నట్టు భయమేస్తోందికదా – ఊc.

– రామా చంద్రమౌళి

 

Everyone has to search…eventually!

-Prof. Raamaa Chandra Mouli

 

It’s night

the banging on the doors continues

who knows who would call whom and for what reason !

Wind blowing through the window carried with it

Taktaka… taktakaa

a hooting and the live trundling noise of wheels on the rails

travel, an addiction

after we step out of the threshold, search is unavoidable:

searching for roads

searching for people

searching the layers of life…

alone we go, as a group we roam and roam

and return alone; some additions, some subtractions

that’s all.

All questions reduce themselves to shards

under the running feet…

does the oozing blood have any identity…an address?

When stifled in humid weather, silent tears are shed

within the confines of the mortuary rooms; bloodless, the moon

appeared pale…night is filled with tap…tap noise of the police-batons…

Unable to sleep, the tired roads weep in insomniac sorrow…

Cognizance of a dog’s wail from somewhere; something is happening…

but a false confirmation of nothing occurring…a feeling of

slipping out of the body and slipping back into it at an impromptu moment;

at times not returning to the body too…is that death?

 

A vacant swing keeps swinging afar…alone;

sound from the iron chains suspended to the swing scatter the wind

desert filling the hearts: a you and an I caught in a simoom

Awareness of all that’s left…

Din of forced separation…of your walking away from the court leaving my hand…

Can’t say anything…when people get divided based on estimates

what might be the value of those loving hands that wipe the tears?

Tch…in the agony of unfulfilled wish for a sound sleep everything is

segments of dreams dropping as fossils;  rest of the night is spent

in each searching for one’s self…the masks lift, colours fade while from within

internal combustion begins and spreads as flames, a shock at

the conundrum of what’s burning and what’s being burnt…

 

it’s quite a long journey.

When it’s realized that all movements are strategies

Your and my efforts are mere unproven equations…

There will not be any answers…the walk is never suspended…

Every answer depends upon the manner the question is put.

How long will you go on walking towards an undefined destination?

Stop…! Stop and look within…deep and deeper…

Aren’t you frightened as if you were bending to look into a very deep well?

 

(original evarainaa cheeseedi vedakatamee)

Transl. Prof. Indira Babbellapati

indira

వర్తమాన కథకి ఒక వరం!

         వరలక్ష్మి మంచి  కథకురాలు  ( story writer ) మాత్రమే కాదు.. ఆమె ఉత్తమశ్రేణికి చెందిన కథాకారిణి ( story teller )కూడా. కథను రూపవంతంగా,సౌందర్యవంతంగా ,ఆలోచనాత్మకంగా అందివ్వడమొక్కటే కాకుండా పఠిత హృదయంలోకి పూవులోనికి పరిమళాన్ని ప్రవేశపెట్టినట్టు కథయొక్క ప్రాణప్రదమైన కథనాన్నీ, ఆత్మనూ విభ్రమపూర్వకమైన సంలీనతతో గ్రాహ్యపర్చడం ఒక మంచి కథాకారుడు చేయగల పని. అలా చేయగల్గితే కథ శ్రోత/పాఠకుడి హృదయంలో ఒక ముద్రగా స్థిరపడి, జ్ఞాపకమై శాశ్వతమైపోతుంది చిరకాలం. కథను సరళంగా, ఆసక్తికరంగా చెప్పగల్గడం ఒక గొప్ప కళ. అది కొద్దిమందికిమాత్రమే సాధ్యమయ్యే రసవిద్య. శైలి,శిల్పం,యితరేతరమైన సాంకేతిక రూప విన్యాసాలను అక్షరాలకూ , వాక్యాలకూ, అలంకారాలుగా కూర్చి , ‘కథ ‘ను ఒక భారీ సాహిత్యభూషణంగా అందివ్వడంకూడా ఒకరకమైన విలక్షణతే కావచ్ఛు.

varalaxmi

కాని నిరలంకారమైన వచనం, నడక, ప్రస్తావనలతో,కథాంశంతో ఒట్టి కొబ్బరినీళ్ళ స్వచ్ఛతవలె కథను పఠితకందివ్వడం అంత సులభమైన పనికాదు. కాగా అది కేవలం కొద్దిమంది, కొంతకాలమే.. కొన్ని సందర్భాలలోమాత్రమే చేయగల మార్మిక నైపుణ్యం. ఒక పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఒక సి. రామచంద్రరావ్ (వేలు పిళ్ళై )కొంతకాలం మంచి కథాకారులుగా   పాఠకుల్లో  ‘ ఇంకిపోయే’రీతిలో కొన్నికథలను రాశారు. కాని వాళ్ళే అంత అందంగా,జీవవంతంగా యిప్పుడు  కథలను  చెప్పలేకపోతున్నారు.  కాబట్టి మంచి కథను సరియైన సరళ సౌందర్యంతో,జిగితో, బిగువుతో కొందరు మాత్రమే,కొంతకాలమే నిర్మించి అందిస్తారని భావించవచ్చనిపిస్తోంది. ఐతే  ఉత్తమ కథా నిర్మాతలైన కొందరు సఫల తెలుగు కథకుల రచనలను అనుశీలించినపుడు అత్యధిక పాఠకుల మన్ననలు పొందిన కథలన్నీకూడా సమాజంలోని అధిక సంఖ్యాకులైన పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు,వాళ్ళ నిశ్శబ్ద వేదనలు,పోరాటాలు,నిస్సహాయతలు, అనివార్యతల్లోనుండి మాత్రమే నీటిఊటవలె పుట్టుకొచ్ఛినట్టు  స్పష్టమౌతోంది. ఐతే రచయిత తన టార్గెట్ ( లక్ష్య ) పాత్రల జీవితాల్లోకి అధ్యయనాత్మక దృష్టితో స్వయంగా ప్రవేశించి తరచి తరచి పరిశీలించినపుడు మాత్రమే శరీరంలోకి జీవంవలె.. కథలో ప్రాణం ప్రేరితమౌతుంది.

 

అప్పుడే కథ సార్వత్రికతను పొంది స్ఫోరకమై పాఠకుల హృదయాలను జయించడం మొదలెట్టి శాశ్వతమౌతుంది . ఐతే ,కథయొక్క అతి గోప్యమైన ఈ నిర్మాణ రహస్యం వరలక్ష్మికి బాగా తెలుసు. ఇది ఆమెకు అత్యంత సహజసిద్దంగా సంక్రమించిన విద్య. ఈ విషయం వరలక్ష్మియొక్క ఏ కథను చదివినా ఇట్టే సులభంగా తెలుస్తుంది ఎవరికైనా. ఇంతవరకు కేవలం మూడు కథా సంపుటాలను మాత్రమే వెలువరించి రసజ్ఞులైన కథాప్రియులకందించిన వరలక్ష్మికథలు మంత్రసాని.,ప్రత్యామ్నాయం,చిన్నమామయ్య,బాంధవ్యం,గమనం,ఖాళీ సంచులు,మట్టి-బంగారం,గాజు పళ్ళెం ..ఇలా ఒకటా రెండా..ఎన్నో ఉత్తమ కథల పరంపరం. తొంభైల్లోనుండి .. రెండువేల ఏడువరకు వరలక్ష్మి తెలుగు కథా రంగంలో  ‘ స్టార్ రచయిత్రి’ . క్రికెట్లో సచిన్,కోహ్లీ వలె తెలుగు కథారచనా క్షేత్రంలో..బ్యాట్ పట్టుకుంటే సెంచరీలవలె..ఈమె ఏదైనా కథల పోటీకి కథ రాసిందంటే తప్పనిసరిగా ఏదో ఒక బహుమతే. తన మూడు కథా సంపుటాల్లోని నలభై ఏడు కథల్లో ముప్ఫై రెండు కథలు పోటీల్లో బహుమతులు సాధించినవేనని తెలుసుకుంటే ఆశ్చర్యంతో పాటు విభ్రమం కల్గుతుంది.

ఐతే..  ఈ విద్య వరలక్ష్మికి ఎలా అబ్బింది,ఈ కథా సృష్టి నైపుణ్యం ఎలా ఈమె హస్తగతమైందీ.. అంటే.. ఆమె మాటల్లోనే —

పుట్టినప్పట్నుంచీ ఇప్పటివరకూ కేవలం పల్లెటూరి జీవిత సౌందర్యాన్నిఅనుభవిస్తూ, సాధారణ మనిషియొక్క మూలాల్లోకి తొంగిచూస్తూ..పొలంలో ఉన్న నాన్నకు అన్నం పట్టుకెళ్ళి దారితప్పి గట్లన్నీ తిరిగి తిరిగి ఎక్కెక్కి ఏడ్చి, నాన్న గొంతెత్తి పాడిన పద్యం మార్గం చూపించగా గమ్యాన్ని చేరి నాన్న భుజంమీద వాలిపోయిన ఆనందాలు.. అమ్మ ఎప్పుడూ సన్నని గొంతుతో పాడే ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘పాటలు.. కన్పించిన ప్రతి చెట్టునూ,పుట్టనూ ప్రేమించి పరవశించి రాసుకున్న కవిత్వాలు, ఊరి మార్గాలన్నింటా విరిసి మురిసిన తురాయి చెట్ల ఎర్రని అటవీ సౌందర్యాలు. . అక్కడ్నుండి ఎదుగుతున్నకొద్దీ అవగాహనలోకొచ్చిన , రక్త సంబందీకుల్లోనే కొరవడిన ప్రేమలు,ఆ ప్రేమలకు దూరమై విలపించే స్త్రీలు, విలాపంలోనూ మానవత్వాన్నీ,క్షమనూ వదలలేని స్త్రీల బలహీనతలు..కూడు పెట్టని కులవృత్తులు,సామాన్యుని బతుకుతెరువుని లాక్కుంటున్న ఆర్ధిక విధానాలు,ప్రపంచీకరణ పెనుతుపానులో పల్లెలు నిర్వీర్యమౌతున్న విధ్వంసకర దృశ్యాలు.. హింసతో ప్రజ్వరిల్లుతున్న ప్రపంచ రాజకీయాలు కంటనీరు తెప్పిస్తూండగా … అని రచయిత్రి రాసుకున్న ‘ నా మాట’ లోని..ఈ సందర్భాలన్నీ.. వరలక్ష్మి కథలకు వస్తువులుగా , ప్రాణవాయువులుగా రూపొందాయి. అందుకే ఆమె కథలన్నీ.. దాదాపు విషాద జీవిత శకలాలను విడమర్చి చూపి కంటతడిపెట్టించేవీ,హృదయాన్ని విలవిల్లాడించేవీ.. అంతిమంగా  దుఃఖోద్విగ్న మహా దివ్యానుభూతిని సిద్దింపజేసేవీ.

pho-3

‘ ప్రత్యామ్నాయం’ కథలో కోతినాడించి జీవించే సిద్దప్ప, ఒక అవిటి శిష్యుడు..శవప్రాయపు మనసున్న భార్య ఈరి,అంగవైకల్యంగల రెండు ఫీట్ల ఎత్తున్న అనాకారి కొడుకు..ఒక కోతి..ద్రిమ్మరి జీవితం..ఇదీ నేపథ్యం.

ఈ బడుగుజీవుల జీవవంతమైన పలుకుబడుల భాషను పట్టుకుంది వరలక్ష్మి. ఈ సంభాషణ చూడండి.

‘ థూ నీయమ్మ.. సూసి సూసి కోతి నా కొడుకుని కన్నావుకదే..ఈడికి పదారేళ్ళు ముడ్డికిందికొచ్చాయంటే ఎవడైనా నమ్ముతాడా అసలు.?’ అన్నాడు సిద్దయ్య.

‘ సాల్లే నీ తాగుబోతు మొకానికి ఇంతకన్నా అందమైన కొడుకు పుట్టేత్తాడేటి.? తెల్లారి లేత్తే నీ మొకం,నువ్వాడించే కోతి మొకమేకదా దర్సినాలు..ఇంకేటవుద్దిమరి !’ అని తిప్పికొట్టింది ఈరి.

ఐదు పేజీల ఈ చిన్న కథ ‘ ప్రత్యామ్నాయం’లో తాగుబోతు సిద్ధయ్య అనూహ్యంగా చచ్చిపోయి ,కోతిని ఎవరో దొంగిలించుకుపోతే..బతుకుతెరువు ఎలాగో అని దుఃఖంతో  విలవిల్లాడ్తున్న ఈరి  ముందు అంగవికలుడైన కొడుకు కోతి గొలుసును తన మెడలో ధరించి ఒక కొసను తల్లి చేతికిచ్చి ‘ నన్ను కోతిలా ఆడించి బతుకమ్మా’ అని సంజ్ఞ చేసినపుడు.. ముగింపు పాఠకుని గుండెను పిండేస్తుంది. దుఃఖం సముద్రమై పోటెత్తుతుంది

‘ బాంధవ్యం’ కథలో.. మరణంకు సమీపంలో ఉన్న తండ్రి .. కూతురు శ్యామల.. వృద్ధాప్యం..నిస్సహాయత,అనివార్యత. ..అంతిమంగా  ఒక దీర్ఘనిట్టూర్పును మిగిల్చే ముగింపు.

‘ చిన్న మామయ్య’ కథలో.. చిన్నప్పట్నుండీ తనను ఆడించి, స్నేహించి,తోడుగా పెరిగి.. పెళ్ళి చేసుకోవాలని తలచి గాఢంగా.. అజ్ఞాతంగా ప్రేమించి..బీదరికంవల్ల  పెళ్ళి సాధ్యం కాక..వనజను కోల్పోయిన చిన్నమామయ్య జీవితమంతా పేదరికంలో,దరిద్రంలో,బతుకు పోరాటంలో ఓడి ఓడి..కడకు మురికివాడలోని కాలువప్రక్క దీనాతిదీనంగా చచ్చిపోతే..కేవలం మానవత్వంతో.. ఎక్కడో ఓ  మూల దాగిఉన్న రవ్వంత తడితో శవాన్ని చూడ్డానికి వెళ్ళిన వనజ..దుఃఖంతో  తిరిగొస్తూంటే..ఎవరో బిచ్చగానివంటి పిల్లవాడు ఒకడు పరుగెత్తుకొచ్చి చిన్నమామయ్య బాపతు చిన్న కాంపస్ బాక్స్ అంతటి పాత ప్లాస్టిక్ పెట్టెనందిస్తే.. దాంట్లో..ఎప్పుడో.. ఎవర్నో అడిగి తెచ్చిన డబ్బా కెమెరాతో తీసి..   ఫోటో రాలేదని తనతో చెప్పి.. జీవితాంతం పదిలంగా దాచుకున్న తన పాత    ఫోటో.. అప్పుడప్పుడు తనను కలిసినప్పుడు దారిఖర్చులకని యిచ్చిన చిల్లర డబ్బులు..పాత నోట్లు ..నాణేలు..

ఎందుకో హృదయం కరిగి..  మనసు  పగిలి  దుఃఖంతో నిండిపోతుంది.

‘ ఈ జీవితాలు ఇలా ఎందుకున్నాయి’ అని నిశ్శబ్ద రోదన ఆవహిస్తుంది.

matti bangaaram

అలాగే..’ మల్లెపువ్వు’ కథలో..  మల్లెపువ్వువంటి మణిరత్నం.. విధికృతంగా ప్రాప్తించిన మొగుడు యాకూబ్.. ఇద్దరు పిల్లలు డేవిడ్,రోజీ.. దిక్కుమాలిన మొగుడితో వేగలేక వదిలేసి   నర్స్ గా   ఒంటరి జీవితం.. పిల్లలను పెంచుతూ.. డేవిడ్ ను ఇంజనీర్ , రోజీని డాక్టర్ చేసి.. చివరికి యిద్దరిచేతా ఈసడింపబడి,గాయపడి..  దుఃఖితగా   మిగిలి.. రచయిత్రి మణిరత్నంను.. వాడి నలిగినా మల్లెపువ్వుతో పోల్చి చెబుతూ.. ముగింపు గాఢ దుఖంతో తల్లడిల్లజేస్తుంది.

‘ ఖాళీ సంచులు’ కథలోకూడా అంతే..దుర్గ,తమ్ముడు వెంకటేష్, మరదలు శారద,జీవితంలో కలిసి విడిపోయిన కుప్పుసామి..  అన్నీ మనముందు కదలాడే,మనకు బాగా తెలిసిన మనుషులే పాత్రలై.. చివరికి.. ‘ ఈ జీవితాలు ఇలా కాకుండా.. ఇంకోలా ఉంటే ఎంత బాగుండు..’ అన్న ఏదో ఒక భాషకందని  మౌనక్షోభ.. గాఢ విషాదం.

అలా అని .. వరలక్ష్మి ఏ కథలోనూ పలాయనాన్నీ, ఓటమినీ, నిస్సహాయమైన లొంగుబాటునూ సమర్థించి చెప్పలేదు.  అన్ని కథల్లోనూ ‘ మన జీవితం మన చేతుల్లోనే ఉంది.. సరిగ్గా గుర్తించి నిన్ను నువ్వు పునర్నిర్మించుకో ‘ అనే ఉదాత్తమైన సందేశాన్నే అందించింది బాధ్యతతో. ఈమె కథల్లో చాలావరకు తన ముగింపు తామే వెదుక్కుని గమ్యాన్ని చేరుతాయి పాత్రలు.. ధైర్యంగా,ప్రతిఘటిస్తూ, సచైతన్యంగా.

వరలక్ష్మి కథల్లోని ప్రత్యేకతలను ఉల్లేఖిస్తే.. అవి.,

1. ఉత్తమశ్రేణి కథకు ప్రధాన లక్షణమైన ఉత్కంఠభరిత ఆరంభం.

2.గోదావరి జిల్లాలల్లోని ప్రజల జీవిత విధానం,నుడికారం,ముఖ్యంగా బడుగు వర్గాల్లోని అలవాట్లు ..బతుకు..వీటిపట్ల  సమగ్రమైన అవగాహన.

3.ఒట్టి ఊహ కాకుండా.. వాస్తవ జీవితాల్లోకి రచయిత్రి ప్రవేశించి ,అధ్యయించి చేసిన జీవవంతమైన సృజన.

4.నిపుణుడైన శ్యాం బెనిగల్,గోవింద్ నిహలాని,సంతోష్ శివన్ వంటి చేయి తిరిగిన చిత్ర దర్శకులవలె..కథా సన్నివేశాలను పఠితముందు రూపుకట్టించడంలో అద్భుతమైన ప్రతిభ.

5.కథలకు నిరలంకార రూప సౌందర్యాన్ని కూరుస్తూనే కథలు బహిర్ అంతర్ వర్చస్సుతో వర్ధిల్లేట్లు నిర్మించి పాఠకుడికి వివేచనార్థం కొంత ఖాళీ ( space )ను వదిలి ‘ open ended ‘ గా ముగించి తన కథలకు ‘ఉత్తమ’ స్థాయిని సాధించి పెట్టడం.

.        6. అన్నింటినీ మించి..నిర్మలాకాశం  మహా సౌందర్యవంతమైనట్టు ..నిరాడంబరతతో కథను నడిపించి ..క్లుప్తతతో , సరళతతో ఉన్నతిని చేకూర్చడం.,

ఇవీ వరలక్ష్మి విశిష్టతలు.

అరవై ఎనిమిది కవితలతో 2003 లో వరలక్ష్మిది ఒక కవితా సంపుటి వెలువడింది. అది ‘ ఆమె’.ఇందులోని కవితలన్నీకూడా ఈమెను మంచి భావుకురాలిగా మనకు పరిచయం చేస్తాయి.

‘ కొబ్బరి   చెట్ల ఆకులు / నీడల  కళ్ళతో ఎదురుచూపులు చూస్తూ /చిరుగాలి అలికిడైనా/ఉలికులికిపడ్తున్నాయి. ‘…యిలా ఉంటుంది నడక. ప్రకృతిని  అక్షరాల్లో ప్రతిక్షేపించడం ఇది.

ప్రస్తుతం ‘ విహంగ’ వెబ్ పత్రికలో ‘ జ్ఞాపకాలు’ రాస్తున్న వరలక్ష్మిని చదువుతున్నవారికి భిన్న బాల్య స్మృతుల్లో కరిగిపొతూండడం అనుభవమే.

ఇప్పటికే ‘ చాసో’ పురస్కారం,’ రంగవల్లి’ పురస్కారం,అజో-విభో అవార్డ్, తానా, ఆటా బహుమతులు, తెలుగు విశ్వవిద్యాలయ కథా పురస్కారం వంటి ఎన్నో అవార్డ్ లను పొంది ప్రసిద్దురాలైన కె.వరలక్ష్మికి ఇప్పుడీ ప్రతిష్టాత్మకమైన ‘ సుశీలా నారాయణరెడ్డి సాహితీ ( జీవిత సాఫల్య ) పురస్కారం ‘ విలక్షణమైన కథకురాలికి విశిష్ట  గౌరవమే. అభినందనలు.

కారణాలు తెలియదుగాని.. ఈ మధ్య వరలక్ష్మి కథలు ఎక్కువగా రాస్తున్నట్టు లేదు. మంచి కథకులు రాయకపోవడం కథాప్రియులైన పాఠకులను నిరాశపర్చడమౌతుందేమో . అలసట కల్గినపుడు విరామం కొద్దిగా అవసరమే..  కాని విరమణ తగదు. ఆమె ఆలోచించాలి..     మళ్లీ   మంచి కథలు రావాలి వరలక్ష్మినుండి.

 

( 17 జనవరి,2014 న రవీంద్రభారతి, హైదరాబాద్ లో  ప్రతిష్టాత్మక ‘ సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం ‘ స్వీకరించబోతున్న సందర్భంగా..,)

 

                                                                                                                                                                                         – రామా చంద్రమౌళి

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పద్దెనిమిది గంటలు

417671_580561545289734_1052452842_n

రామాచంద్రమౌళి తొలికథ  ‘సువర్ణశతదళ పుష్ప రహస్యం’ 1964లో చందమామలో ప్రచురితమైంది. ఇప్పటివరకు 250 దాక  కథలు రాశారు. 18 నవలలు, 8 కవితాసంకలనాలు, రెండు విమర్శా పుస్తకాలు వెలువరించారు. అనేక సాహిత్య వ్యాసాలు రాశారు. అవి రెండు సంకలనాలుగా వచ్చాయి. ఇంగ్లీషు, తమిళ్‌, మలయాళీ, కన్నడ, పంజాబీ, బెంగాళీ భాషల్లోకి ఈయన రచనలు అనువాదమయ్యాయి. 2011లో గ్రీస్‌లో జరిగిన ‘22వ వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ పొయెట్స్‌’లో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు.  అలాగే సార్క్‌సాహిత్య సమవేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్లారు. పలు టెలీఫిలిమ్స్‌ రాశారు. ఇప్పటికే అనేక పురస్కారాలు అందుకున్న రామాచంద్రమౌళి ప్రస్తుతం వరంగల్‌లోని గణపతి ఇంజినీరింగ్‌ కాలేజిలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.–వేంపల్లె షరీఫ్

***

 

 

   భారతదేశం.

                చెన్నై ఇంటర్‌నేషనల్‌ ఏర్‌పోర్ట్‌..అటు హార్బర్‌.

                హార్బర్‌నుండి పన్నెండువందల ముప్పయి కిలోమీటర్ల దూరంలో అండమాన్‌ నికోబార్‌ దీవులు.

                అండమాన్‌ రాజధాని పోర్ట్‌ బ్లైయర్‌.

                వీర్‌ సావర్కర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

                పోర్ట్‌ బ్లెయర్‌లో కేంద్రపాలిత ప్రాంత నగరం..సకల పాలనావ్యవస్థ కేంద్రీకృతమై.,

                నగరం నడిబొడ్డున 1896-1906 మధ్య బ్రిటిష్‌వాళ్ళచే నిర్మించబడిన.. భారతదేశ శుద్ధ స్వాతంత్య్ర సమరయోధులను కఠినాతికఠినంగా, రాక్షసంగా, అమానవీయంగా హింసించి వందలమందిని ఉరితీసిన 696 ఒంటరి కారాగార గృహాలు గల ‘సెల్యులర్‌ జైల్‌’

కేవలం పర్యాటక వ్యాపకాన్నే జీవనవనరుగా బ్రతుకులను వెళ్ళదీసే నిజాయితీ, అమాయకత్వం నిండిన జనం..,

పోర్ట్‌బ్లెయర్‌ నుండి..చుట్టూ తన మాతృకౌగిలిలో జోలబుచ్చే బంగాళాఖాత సముద్రంలో.. యాభై కిలోమీటర్ల దూరంలో ప్రశాంతంగా..హావలక్‌ ద్వీపం.

హావలక్‌ ద్వీప..శాంత గంభీర తూర్పు తీరంవెంట..,

యుగయుగాలుగా అమాయకులను కొల్లగొట్టి, ప్రకృతి వనరులను ధ్వంసించి, ఆక్రమించి, అతిక్రమించి, సకల మానవీయ ధర్మాలను ఉల్లంఘించి కొనసాగిస్తూ వస్తున్న దోపిడీ వర్గాల స్థావరాలు.. లగ్జరీ విల్లాలు..వరుసగా..సండేజ్‌ బీచ్‌ రిసార్ట్‌, అంజనా బీచ్‌ రిసార్ట్‌, బే వ్యూ రిసార్ట్‌, స్మైల్‌ గార్డెన్‌ రిసార్ట్‌, హాప్పీ రిసార్ట్‌, సీషెల్స్‌, ఎక్కోవిల్లా, అమెజాన్‌ బీచ్‌ రిసార్ట్‌..ఒక పరంపర.

‘చీమలుపెట్టిన పుట్టలు పాముల..’ ఒక అనుభవసూత్రం.. యుగయుగాలనాటి పాతది.

ఈ దీవులలో ఎక్కడా..స్థానీయ అండమాన్‌ మూలవాసి ఒక్కరుకూడా కనబడని అత్యంత విషాదకర సందర్భంలో.,

జైలుదేశమైన అండమాన్‌కు.. అవసరార్థమై, బానిస పనులకోసం, పొట్టకూటికోసం, దిక్కులేని పరిస్థితుల్లో, మనుషులు వలసలై..వలస పకక్షులై..ఏ చెట్టుపక్షో ఈ కొమ్మపైవాలి..ఏ కొమ్మ పూలో ఈ దండలో ఒదిగి.,

గ్రీన్‌ వ్యాలీ రిసార్ట్‌,

సాయంత్రం నాలుగ్గంటలు.. సూర్యాస్తమయానికింకా రెండున్నరగంటల వ్యవధి.

ఎదుట ప్రశాంతంగా.. నిశ్శబ్దంగా సముద్రం..నీలిరంగు నీరు..నీలిరంగుదే ఆకాశం. అది సిల్వర్‌ సాండ్‌ ప్రాంతం.. యిసుకంతా వెండిరజనువలె..మెత్తగా, సన్నగా, పొడిపొడిగా..మెరుస్తూ.,

అందమైన ఎనిమిది ఏర్‌కండిషన్డ్‌ గదులతో మనుషులు ముట్టుకుంటే మాసిపోయేట్టున్న మెరుగుపెట్టబడ్డ వెండిగోడలతో నిర్మించినట్టున్న నిశ్శబ్ద, సుందర, నిర్మానుష్య, నిసర్గ సౌందర్య భవనపు ముందున్న ‘బే సీ’ షెల్టర్‌ క్రింద..ఆమె..ముప్పది ఎనిమిదేళ్ళ ప్రౌఢ..చురుకైన జింక కళ్ళు, పదునైన పాదరసంవంటి మేధ, బంగారంతో పోతపోసినట్టున్న శరీరం, దేవతలందరూ పోటీపడి శిల్పించి తుదిరూపమిచ్చినట్టున్న కాంతులీనే మేను, లిప్తకాలంలో సూపర్‌ కంప్యూటర్‌ వేగంతో వ్యూహాలను రచించగల హృదయం.. ఆమె..అరుంధతి ఆడెపు. బి.టెక్‌..ఐఐటీ మద్రాస్‌, ఎమ్‌టెక్‌.. ఐఐటి కాన్పూర్‌, ఎమ్‌బిఎ ఐఐమ్‌ అహమ్మదాబాద్‌,

చూస్తోంది అరుంధతి సముద్రంలోకి, ఆకాశంలోకి, శూన్యంలోకి..శూన్యాంతరాల్లో.. మౌనంగా..నిశ్శబ్దంగా.. అభావంగా.

ఎమ్‌బిఎలో టాపర్‌ ఐ స్వర్ణపతకాన్ని సాధించి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఎనిమిది బహుళజాతి కంపెనీల్లో ఏడాదికి అరవై లక్షల జీతంతో అవకాశాలను పొందగలిగిన తను.. ఏ ఒక్క అవకాశాన్నీ అంగీకరించలేదు.

స్వతంత్రత.. స్వతంత్ర జీవితం.. స్వతంత్ర అభివృద్ధి..స్వతంత్ర సంపాదన..స్వతంత్ర అధిపత్యం.

”డెసిషన్‌ మేకింగ్‌” చాప్టర్‌ను చెబుతున్నపుడు ప్రొఫెసర్‌ మౌళి చెప్పిన వాక్యాలు గుర్తుకొచ్చాయి అరుంధతికి చటుక్కున..ఆయనన్నాడు.. ‘జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో ఆ నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపపడవలసిన సందర్భం రావద్దు..’ అని.

చాలా లోతైన, పరమసత్యమైన, గంభీరమైన ప్రవచనమది. ఆ క్షణం చాలా ఆలోచించింది తను.

నిర్ణయం..డెసిషన్‌..దేని గురించైనా కావచ్చు..ఉద్యోగం..ప్రేమ..పెళ్ళి..పిల్లలు..వ్యూహాలు, పథకాలు, ప్రణాళికలు, రాజకీయాలు, క్రీడలు, కుట్రలు, కుతంత్రాలు..త్యాగాలు..చివరికి యుద్ధాలు.,

నిర్ణయమంటే..ఒకానొక ఎత్తుగడ.. ఒక అడుగు.. ఒక కదలిక.. ఒక ఆయుధం.

”ట్రణ్‌ణ్‌ణ్‌ణ్‌..” మొబైల్‌ మ్రోగింది. ఉలిక్కిపడ్డది అరుంధతి.. ఏదో తెగిపడ్డట్టు., ఏదో చిట్లిపోయినట్టు..ఎవరో   బలవంతంగా తట్టినట్టు.,

‘హలో..’ అంది మృదువుగా..తీయగా..గంభీరంగా.

‘మేడం వుయార్‌ రీచింగ్‌.. ఎక్స్‌ అండ్‌ వై’ అంది మృదుల అట్నుండి. మృదుల అరుంధతి పర్సనల్‌ సెక్రటరీ.

‘హౌ’

‘బై ఎ స్పెషల్‌ ఫెర్రీ’

‘వాటెబౌట్‌ ఎ అండ్‌ బి’

‘దె డు కం..బై ఎనదర్‌ వాటర్‌ వెహికిల్‌ సూన్‌.. మోస్లీ విథిన్‌ ట్వంటీమినట్స్‌’

‘మన షెడ్యూల్‌లో డిలే ఏమి లేదుకదా..ప్రాజెక్టు ఫర్‌ ఫోర్టీన్‌ అవర్స్‌’

‘నో డిలే మేడం..’

‘దట్స్‌ గుడ్‌.. డు కం’ – లైన్‌ తెగిపోయింది.

అరుంధతి ఎందుకో లేచి..రెండు నిముషాలు మెత్తని ఇసుకపై నడుస్తూ, అటు పశ్చిమాకాశంవైపు చూసింది. సూర్యుడు అలసి ఎర్రగా..ఎత్తైన కొండల చాటున,

ఉదయం..అస్తమయం..పొంగుట, కృంగుట.. గెలుచుట ఓడిపోవుట..జన్మించుట మరణించుట.. ఈ ద్వంద్వాలన్నీ పరమసత్యాలేననీ తెలిసి మనిసి.. హుఁ.,

నిట్టూర్చింది అరుంధతి చేతులను వెనక్కి ముడుకుని..నడుస్తూ.

చుట్టూ సముద్రపుటలల లయాత్మక ధ్వని..కొబ్బరిచెట్ల కొమ్మల వింతరొద, చెట్ల గుబుళ్ళలోనుండి పకక్షుల గోల.. వీటన్నింటి మధ్యా నిశ్శబ్దమైన గాలి శబ్దం.

కళ్ళుమూసుకుని ఈ పద్నాలుగ్గంటల ప్రణాళిక, రూపకల్పన, మనుషుల అంగీకారత, వాళ్ళ వాళ్ళ వాటాల వితరణ, సకల సుఖవంతమైన సౌకర్యాల ఏర్పాటు.. ఈ అన్ని విధులనూ తన అజ్ఞాత కంపెనీ ‘రైడర్స్‌’ ఉద్యోగులు ఎంతో క్రమశిక్షణతో నిర్వహించుట..,

ఎక్కడా రవ్వంత కూడా సడలని నిష్టాపూరితమైన క్రమశిక్షణ..జాగ్రత్త..సమర్థత కనిపించేది దొంగల్లో, దోపిడీ దారుల్లో, ఆక్రమణదారుల్లోనేకదా. అప్రమత్తత, వ్యూహాత్మకత, దీర్ఘదృష్టితో వీక్షణ.. ఇవన్నీ వ్యాపారాత్మక విజృంభణకు మూలలక్షణాలు.

‘మనిషిలోని బలహీనతలను సంపదగా మార్చుకోవడమే వ్యాపారం’ అనికదా ప్రొఫెసర్‌ మౌళి చెప్పింది.

బలహీనత..సంపద

సంపదే బలహీనత- సంపదకు లొంగనివాడెవరున్నారీ ప్రపంచంలో.. సంపదంటే డబ్బు, బంగారం, భూములు, ఆస్తులు, అందాలు, వయస్సు..దేహం..దేహసౌందర్యం..తెలివి..ప్రతిభ.. ఏదైనా.

కళ్ళు మూసుకుంది అరుంధతి సాలోచనగా.

‘ఆపరేషన్‌ ఫోర్టీన్‌ అవర్స్‌’ ఒకసారి వీడియో ఫిల్మ్‌వలె కదిలింది మదిలో.

‘ఈ ప్రపంచంలో, ఎవరైనా ఏదో ఒకదానికి తప్పనిసరిగా లొంగిపోతారు ‘అన్న సార్వత్రిక సూత్రం తన అజ్ఞాత సంస్థ ‘రైడర్స్‌’ ఆవిర్భవానికి మూలసూత్రం.. సంస్థకు అసలు ఆఫీసే ఉండదు. తనది ఒక ‘వర్చువల్‌ ఆర్గనైజేషన్‌’. ఉద్యోగులందరూ వర్కింగ్‌ ఫ్రం హోమ్‌ ఆర్‌ సెల్‌. అవసరమైతే తప్ప ఎవరికి ఎవరూ కనబడరు. రెండువందల నలభై రెండు మంది ఉద్యోగులని కలిగి, నెలకు పదిహేను కోట్ల జీతాలను బట్వాడా చేస్తూ కనీసం నెలకు పదివేలకోట్ల టర్నోవర్‌తో వందకోట్ల లాభమైనా సంపదించకుండా ఉండలేని తన కంపెనీ వాస్తవంగా ఒక వర్చువల్‌.. అభౌతిక సంస్థ. ఎక్కువమంది అరవైకి పైబడ్డ వయసు కలిగి..ప్రభుత్వ సెక్రటేరియట్లలో పూర్వ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీస్‌, ఇంటలిజెన్స్‌ శాఖలో ఉన్నతోద్యోగులుగా, దేశ ప్రధాన వనరులు, పరిశ్రమలకు సంబంధించిన మాజీ ఎగ్జిక్యూటివ్స్‌, బ్యాంక్‌ల రిటైర్డ్‌ జి ఎమ్‌ స్థాయి ఉద్యోగులు.. ఎవరెవరికి కీలకమైన పదవుల్లో ఎన్నెన్ని ఎక్కువ పరిచయాలున్నాయో అటువంటి వ్యక్తులు.. వాళ్ళతో కూడిన విశాలమైన నెట్‌వర్క్‌ తనది. రిటైర్డ్‌ ఇండస్ట్రీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రామనాథన్‌ పిళ్ళై యిప్పుడీ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. అతనికి బొగ్గు, చమురు, గ్రానైట్‌ నిక్షేపాల నేపథ్యంతో సంబంధమున్న ఉన్నతాధికారుల, సంబంధిత రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు..అందరూ తెలుసు సన్నిహితంగా. అందరితోనూ బేరసారాలు చేయగలడు. రేట్లు ఫిక్స్‌చేసి అన్నిరకాల డీల్స్‌ కుదుర్చగలడు. రామనాథన్‌ పిళ్ళైవంటి రీజనల్‌, నేషనల్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఎందరో తన దగ్గర.. ప్రకాశ్‌ సింగ్‌ ఝా, మధుకర్‌ ముండా, చిత్రా బన్సల్‌, సత్యరంజన్‌ ఘోష్‌, తాతినేని రాంబాబు..ఎందరో..నెలకు ఒక్కొక్కరికి నాల్గునుండి ఏడెనిమిది లక్షలవరకు జీతాలు, సౌకర్యాలు అదనం. అందరిపైనా వాళ్ళకు తెలియకుండా అదృశ్యనిఘా. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎవర్తో మాట్లాడున్నారు..ఎవర్ని కలుస్తున్నారు..అన్నీ మరుక్షణంలో సమాచారమంతా తనముందు ప్రత్యక్షం.

మనిషికి సంపాదించడం మత్తు.. మెట్లెక్కుతూ పోవడం ఒక పిచ్చి.. ఎక్కడం ప్రారంభమైన తర్వాత.. ఎప్పటికైనా క్రిందకు దిగక తప్పదన్న స్పృహే ఉండని ఉన్మాదం. జీవితమంతా పరుగు..పరుగు..పరుగులో ఉన్నప్పుడు పూర్తిగా నశించిపోయే విచక్షణ. కనిపించేది కేవలం టార్గెట్‌..గమ్యం..గమ్యమంటే డబ్బు..సంపద..

ఎంత సంపద.. ఎంత డబ్బు

వ్చ్‌..ఏమో.

 

*                              *                               *                              *

 

 

చాలా రహస్య పర్యటన..కేవలం పదిగంటలే.

కేంద్రమంత్రి రాంకిషోర్‌ సన్యాల్‌.. గనులశాఖ..చదువు పదవ తరగతి ఫెయిల్‌.గనులంటే ఏమిటి..వనరులంటే ఏమిటి..ఏ ఖనిజాన్ని దేనికి ఉపయోగిస్తారు..తను కాగితంపై సంతకం పెడ్తే ఎందుకు కోట్లకు కోట్లు చేతులుమార్తాయో..తెలియదు అతనికి.

క్రింద బ్యూరోక్రాట్స్‌ ఏది చెప్తే అది. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌..అన్నీ సెక్రటరీ రామ్‌సింగ్‌ ముద్గల్‌.. ఏది చెప్తే అది.

జెట్‌ ఏర్‌వేస్‌ విమానం..చెన్నై టు పోర్ట్‌ బ్లెయర్‌..ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌..రెండు గంటలు గాల్లో ఎగిరివచ్చి..వీర్‌ సావర్కర్‌ ఇంటర్నేషనల్‌ ఏర్‌ పోర్ట్‌లో ఆగింది..వెనుక ఎకానమీ క్లాస్‌లో సన్యాల్‌ పర్సనల్‌ సెక్యురిటీ.. ఎస్‌పిజి కమెండో రఘు సర్కార్‌.

సన్యాల్‌ వయసు యాభై ఎనిమిది..శరీరంనిండా రోగాలే అడవిలో చెట్లవలె.

‘ ఈ సెక్యూరిటీగాణ్ణి ఎలా తప్పించాలి’ అని ఆలోచిస్తున్నాడు సన్యాల్‌ అప్పట్నుండి.

ఏర్‌పోర్ట్‌ బయటికి రాగానే ఒక నల్లని ఆడి క్యూఫైవ్‌ కారొచ్చింది మెత్తగా.

అలా వస్తుందని తెలుసు మంత్రి సన్యాల్‌కు కార్లో కేవలం డ్రైవర్‌..నంబర్‌ చూచుకున్నాడు కార్‌ది. ఓకె.

‘రఘూ..తుమ్‌ ఐసా కరో..యహీ సిటిమే రహెజావ్‌.. ఏరాత్‌.. ఫిర్‌ సుబే ఛేబజే యహా ఆనా..యహీ ఏర్‌పోర్ట్‌మే..ఏలో..పాంచ్‌ హజార్‌..’

రఘు మంత్రి ముఖంలోకి చూశాడు. హత్యానంతరం హంతకుని ముఖంవలె ఉంది మంత్రి ముఖం.. అపరాధ భావరతో.

”ఠీక్‌హై..మై యహా సెల్యులర్‌ జైల్‌ దేఖ్‌నే జావూఁగా..కల్‌ ఛేబజే”.. రఘు ఎందుకో అప్రయత్నంగానే తన సఫారీ డ్రెస్‌ ప్యాంట్‌ జేబును తడుముకున్నాడు. లోపల బెరెట్టా 5 ఎంఎం రివాల్వర్‌ భద్రంగా.

తను ఒక పరమ అవినీతిపరుడైన, దేశాన్ని కొల్లగొడ్తూ వనరులను తోడుకుతింటున్న, దేశద్రోహమంత్రికి బాడీగార్డ్‌..రక్షకుడు.. కాపలాదారు.

ఛీ ఛీ…

కొన్నేండ్లుగా గుండెలను తొలిచేస్తున్న కుమ్మరిపురుగులాంటి భావన.. న్యూనత.. సిగ్గు..లోపల ఏదో దహించుకుపోతున్న.. ఏదో ధ్వంసమైపోతున్న ఫీలింగ్‌.

రఘు చూస్తుండగానే..ఆడి కార్‌ రబ్బర్‌ పలకపై గాజుగోళీలా జారిపోయింది మంత్రిని మోసుకుని.

పది నిముషాల తర్వాత..చత్తాం వార్ఫ్‌.. అక్కడ సిద్ధంగా ఉన్న ప్రత్యేక వాటర్‌ వెహికిల్‌.. కార్‌తో సహా నౌకలోకి ఎక్కి.. నౌక కదిలి..

చుట్టూ నీలిరంగు సముద్రం..సాయంసంధ్య..దూరంగా హవ్‌లక్‌ ద్వీపం..వరుసగా రిసార్ట్స్‌..లీలామాత్రంగా…

కుట్రలూ, దోపిడీలు, వ్యూహాలూ, ఆక్రమణలూ..అన్నీ ఎప్పుడూ నిశ్శబ్దంగానే జరుగుతాయి.

కేంద్రమంత్రి రాంకిషోర్‌ సన్యాల్‌ తలలో ఈ డీల్‌ద్వారా తన అకౌంట్‌లో జమచేయబడబోతున్న పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల డబ్బు తాలూకూ స్పృహ తారాజువ్వలా విప్పుకుని వెలుగుతూ గిలిగింతలు పెడ్తోంది.

 

*                         *                               *                                *

 

క్విడ్‌ ప్రో కొ..ఇచ్చి పుచ్చుకునే ఒక పరస్పర ఒప్పందం.

ఏమి యిచ్చి…ఏమి పుచ్చుకుని.,

ఏదైనా.. బొగ్గుయిచ్చి.. డబ్బు పుచ్చుకుని, గ్రానైట్‌ యిచ్చి డబ్బు పుచ్చుకుని..పవర్‌ ప్రాజెక్ట్‌లు యిచ్చి డబ్బు పుచ్చుకుని.. సెజ్‌ల కింద ప్రభుత్వ భూములను చౌకగా యిచ్చి డబ్బు పుచ్చుకుని.,

యివ్వవలసిన వాటిగురించి చూచుకునేందుకు తన ఉద్యోగి పార్థసారధి రామన్‌.. ఐఎఎస్‌, పార్మర్‌ యిండియన్‌ అంబాసిడర్‌ టు సౌతాఫ్రికా, పుచ్చుకోవలసిన డబ్బు..కోట్ల రూపాయల డబ్బు బట్వాడా..వాళ్ల వాళ్ళ అకౌంట్లలోకి భద్రంగా చేర్చే ప్రక్రియను పర్యవేక్షించేందుకు అరవై ఐదేండ్ల చార్టర్డ్‌ అకౌంటెంట్‌ జొన్నవిత్తుల రామారావు..ఫార్మర్‌ ఆడిటర్‌ జనరల్‌.

మనుషుల ప్రతిభా వ్యుత్పత్తులను ‘చెల్లించి వినియోగించుకో’.. పే అండ్‌ యూజ్‌..లేటర్‌ యూజ్‌ అండ్‌ త్రో..సానిటరీ నాప్‌కిన్‌వలె..

ఆ రాత్రి తొమ్మిదిగంటల వేళ.. బంగాళాఖాత సముద్రతీరంపై.. ఆ రిసార్ట్‌ ముంగిట్లో..పరిచిన పిండివెన్నెల్లో..సన్నగా పాలకాంతిని విరజిమ్ముతున్న టేబుల్‌లాంప్‌ ప్రక్కన.. తళతళా మెరిసే గాజుగ్లాస్‌లో..బంగారురంగు ‘మెకల్లన్‌’ విస్కీని సుతారంగా చప్పరించి.. లోపల..దేహాంతర మోహాగ్ని జ్వాలల్లో నిశ్శబ్దంగా దగ్దమౌతూ.. అరుంధతి ఆడెపు.. లోపల..రిసార్ట్‌పై అంతస్తులో యింకో అరగంటలో తనకు స్వర్గ సుఖాన్నందివ్వబోయే తన రహస్య ప్రేమికుడు నాగరాజు గైక్వాడ్‌ను తలుచుకుంటూ.. కనలిపోతూ..అసహనంగా గడియారాన్ని చూచుకుంది.

తొమ్మిదీ యిరవై రెండు.

అరుంధతికి ఏ పనిచేసినా ఎటువంటి సాక్ష్యమూ, ఆనవాలూ లేకుండా..అవశేషాలు మిగలకుండా..నిశ్శబ్దంగా చేసుకుంటూపోవడం అలవాటు.. అనివార్యమైతే తప్ప తను పిక్చర్లోకి ప్రవేశించదు. ఎప్పుడూ కాగల కార్యాలను గంధర్వులతో చేయిస్తుందామె.

”వెధవలు స్వయంగా పనులు చేస్తారు.. మేధావులు తనక్కావలసిన పనులనే ఇతరులతో చేయించుకుంటారు’ అని నేర్చుకుందామె తన ఎంబిఎ హెచ్చార్‌లో.

అలల నిశ్శబ్ద లయను ఛేదిస్తూ మనిషి అలికిడైతే..తలెత్తి.,

ఎదుట మృదుల.. తన ఆలోచనలకు మానవరూపం..స్త్రీ రూపమెత్తిన విద్యుత్‌మెరుపు..నవ్వుతూ..

”చెప్పు మృదులా” అంది మృదువుగా..టేబుల్‌పైనున్న తందూరీ చికెన్‌ ముక్కనొకదాన్ని నోట్లో పెట్టుకుంటూ-

”ఫైనల్‌ రిపోర్ట్‌ మేడం”

”గివ్‌మీ”

”ఈ రోజు..షెడ్యూల్డ్‌ డీల్స్‌ మూడు మేడం.. ఒకటి..జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధాడు బొగ్గుబ్లాక్‌ను, పశ్చిమబెంగాల్‌లోని మధుజోర్‌ బొగ్గు బ్లాక్‌ను, చత్తీస్‌గడ్‌లోని బ్రహ్మపురి బొగ్గు బ్లాక్‌ను..మూడు కలిపి ముప్పయి రెండు వందల మిలియన్‌ టన్నుల బొగ్గును ఐదువందల కిలోమీటర్ల విస్తీర్ణంలో పన్నెండేండ్లు తవ్వుకునేందుకు అనుమతినిస్తూ మంత్రి సంతకం చేసి విడుదల చేస్తున్న జివో. డీల్‌ వర్త్‌ ఆరువేల ఎనిమిదివందల కోట్లు..మంత్రికి..ఇతర ఖర్చులు నూటా ఎనభై కోట్లు. మన నికర కన్సల్‌టెన్సీ ఫీ యిరవై కోట్లు. రెండవది..ఆంధ్రప్రదేశ్‌..కరీంనగర్‌ జిల్లా.. నాల్గువందల ఎనభై రెండు గుట్టల గ్రానైట్‌ డిగ్గింగ్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ లీజ్‌. ఎస్‌ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌..పన్నెండేండ్లు లీజ్‌ టోటల్‌ డీల్‌ ఐదువందల డెబ్బయ్‌ రెండు కోట్లు.లీడింగ్‌ మూడు పొలిటికల్‌ పార్టీల కన్సార్టియంతో ఎటువంటి గొడవాలేకుండా ‘తిను తినిపించు.. ఎంజాయ్‌’ పాలసీ కింద సెటిల్‌మెంట్‌. నాల్గు జివోల జారీ.. మన ఫీ పన్నెండుకోట్లు. మూడవది..ఉత్తరాంచల్‌లో.. వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ది ప్రాజెక్ట్‌ క్రింద ట్యాక్స్‌ హాలిడే పరిధిలో ఫార్మా సెజ్‌.. అరవింద ఫార్మా లిమిటెడ్‌కు ఐదువందల డెబ్బయి ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి అలాట్‌మెంట్‌..ఎట్‌ ది రేటాఫ్‌ థౌజండ్‌ రూపీస్‌ పర్‌ ఏకర్‌ .. నామినల్‌ రోటో..దీంట్లో మన ఫీ..ఎనిమిది కోట్లు. ఎక్స్‌ అండ్‌ వై రెండవ మరియు మూడవ డీల్‌, ఎ అండ్‌ బి కలిసి మొదటి డీల్‌ను కాగితాలపై సంతకాలు చేశారు మేడం. రవీంద్రన్‌ అన్ని పేపర్స్‌ తయారుచేస్తున్నాడు. ఫైనాన్సియల్‌ ట్రాన్సాక్షన్స్‌ అన్నీ ఫినిష్‌.. ఎవ్రిబడీ ఈజ్‌ హాపీ. నౌ వెట్‌ పార్టీ ఫాలోస్‌..ఆర్గురు గెస్ట్‌లకోసం ఎనిమిది మంది నికోబార్‌ నేటివ్‌ యంగ్‌ గర్ల్స్‌ రెడీగా ఉన్నారు. ఒకమంత్రి.. ముగ్గురు ఐఎఎస్‌ ఆఫీసర్స్‌..వన్‌ మీడియేటర్‌. పాల్‌ జాన్సన్‌ మన ఎగ్జిక్యూటివ్‌. అంతా ‘టర్మ్స్‌ యిన్‌ క్యాష్‌.. గెస్ట్స్‌ విల్‌ లివ్‌ బై ఫోర్‌ ఎ.ఎమ్‌. దె రీచ్‌ దైౖర్‌ డిస్టినేషన్స్‌ బై నైనోక్లాక్‌..ఓవర్‌..”

”గుడ్‌ మృదులా..ఫైన్‌..యు డిడేనైస్‌ జాబ్‌”

”థ్యాంక్యూ మేడం”

”యిదుంచుకో”- ఓ ఐదారు వేయి రూపాయల నోట్ల కట్టలనిచ్చింది తన వ్యానిటీ బ్యాగ్‌నుండి బయటికి తీసి.

చిర్నవ్వుతో అందుకుని అంది మృదుల ”మీరొకసారి అందరికీ మీ దర్శనమిచ్చి పార్టీకి అనుమతినిచ్చి.. అలా మీ రూఫ్‌ గార్డెన్‌వెళ్ళండి- అక్కడ అంతా రెడీ.. దేరెండ్స్‌ ది మాటర్‌. అక్కడే మీ నాగరాజున్నాడు ప్రాజెక్ట్‌ గెట్స్‌ కంప్లీటెడ్‌..’ అని

”ష్యూర్‌…” అంది అరుంధతి..అని లేచి మెరుపుతీగలా మృదుల వెంట నడిచి.,

బాంకెట్‌ హాల్‌లో.. తెల్లగా పాలనురుగులా వెలుగు.. నిశ్శబ్దంగా, విన్రమంగా, భయంభయంగా మంత్రీ, ఐ ఎ ఎస్‌లూ.,

ఆమె చిన్నగా నవ్వి..కవ్వింతగా చూచి..ఠీవిగా చేయూపి.,

‘అందని వస్తువెపుడూ అతిమధురం.. కీప్‌ ద థింగ్‌ ఎవే టు టెంప్ట్‌’

అరుంధతి ‘పిచ్చిలోకమిది..’ ఎక్కుతే వంగుతుంది.. వంగుతే ఎక్కుతుంది’ అనుకుంటూండగా.,

వెన్నెల రాత్రి కరిగిపోతూనే ఉంది.

*             *               *            *           *

స్పెషల్‌ పొటెక్షన్‌ గ్రూప్‌ కమెండో రఘు సర్కార్‌ మనసు దుఃఖంతో, వేదనతో, బాధతో కణకణలాడ్తున్న నిప్పులపై  మొక్కజొన్న కంకిలా ఉంది.

ఒక అతిపెద్ద అవినీతిపరుడైన మంత్రికి రక్షకుడు తను..తన కఠోరమైన యుద్ధవిద్యలశిక్షణ, రక్షణ మెళకువల పరిజ్ఞానం, చిన్ననాటినుండీ గుండెలనిండా జీర్ణించుకున్న దేశప్రేమ.. ఈ మట్టి.. ఈ గాలి.. ఈ సమాజం.. ఈ నీరు.,

దడదడలాడ్తున్న గుండెలతో అడుగుపెట్టాడు తను సెల్యులర్‌ జైల్‌లో.. హృదయం భళ్ళున పగిలింది గాజుపలక నేలపై పడ్డట్టు.

కేంద్రంలో నియంత్రణ భవనం కల్గి ఏడు రెక్కలుగా.. ఒక్కో రెక్కలో నాల్గంతస్తుల ఒంటరి జైలుగదులతో 696 సున్నం, యిటుకలతో నిర్మించిన ఇరుకు అరలు. ఒక్కో అరలో ఒక్కో ఖైదీ.. ఎంతకాలం.. జీవితాంతం..ఏమిటి వాళ్లు చేసిన నేరం.. తమ మాతృభూమిని ప్రేమించడం.. ‘వందేమాతరం’ అని ఎలుగెత్తి నినదించడం.. పరాయిపాలకులను ప్రశ్నించడం..

మనిషి ప్రశ్నగా పరిణమించినందుకు ఆజన్మాంత శిక్ష, ఏకాంత కారాగారవాసం.

మెడకు యినుప కడెం..రెండు చేతులకూ కడాలు..కాళ్ళకు యినుప రింగ్‌లు.. ఈ అన్నింటినీ కలుపుతూ యినుప కడ్డీలు.. గోనెసంచులతో కుట్టిన అంగీ, నిక్కరు..గానుగ ఎద్దులకు బదులు ఖైదీలచే నూనెతీత..దాహమైతే ఎవని ఉచ్ఛ వాడు తాగి, ఆకలైతే ఎవని పియ్యి వాడు తిని.,

ఉరిశాలలు..

ఉరికోసం నిరీక్షణశాలలు.

ఆ ఆవరణ.. ఆ జైలు ఊచలు..ఆ ఒంటరి పురాస్మృతులు..గోడలు.,

మనసునిండా కల్లోల బంగాళాఖాత సముద్రఘోష.,

సెంట్రల్‌ ఆఫీస్‌ గోడలమీది పాలరాతి పలకలపై 689 మంది ఖైదీలపేర్లు.. ఎప్పుడు ఖైదీ చేయబడ్డారో ఆ సంవత్సరాల వివరాలు.. ఎక్కువమంది బెంగాలీలు, బిహారీలు, పంజాబీలు.. వందలకు వందలు.,

యిందరు జీవిత ఖైదీల.. ఒకవీర సావర్కార్‌..తిలక్‌.. వంటి ఎందరెందరో త్యాగధనుల జీవితత్యాగ ఫలితంగా సిద్ధించిన స్వాతంత్య్రం.,

ఈ అరవై ఆరేళ్ళ తర్వాత.,

అవినీతిమయమై.. అనైతికతో, అరాచకత్వంతో, లంచగొండితనంతో, దోపిడీలతో, విలువలన్నీ పతనమైన దౌర్భాగ్య సంస్కృతితో.. విచ్చలవిడి రాజకీయాలతో.. చేవ చచ్చిన అర్థనపుంసక యువతరంతో..,

ఏమిటి..ఏమిటిది..?

రాత్రంతా గుండెలనిండా..అంతర్‌జ్వలనం..దహనం..లోపల ఏదో అరణ్యం తగలబడిపోతున్నట్టు క్షోభ…

ఉదయం.. ఐదు గంటలు.,

సెల్యులర్‌ జైలు ముందు..మొక్కుబడిగా పెంచుతున్న పార్క్‌.. ఒక సిమెంట్‌ చప్టాపై కూర్చుని తదేకంగా చూస్తున్నాడు రఘు సర్కార్‌.. ద పర్సనల్‌ సెక్యూరిటీ టు సెంట్రల్‌ మినిస్టర్‌.

ఎదురుగా.. ఎర్రగా..కాంస్య విగ్రహాలు..ఆరు..మెడలలో సంకెళ్ళతో..చేతులకు, కాళ్ళకు యినుప బేడీలతో.,

ఇందుభూషణ్‌ రాయ్‌ బెంగాల్‌, బాబా భాన్‌సింగ్‌ – పంజాబ్‌, పండిట్‌ రాంరఖా బాలి-పంజాబ్‌, మహావీర్‌ సింగ్‌-యు.పి, మోహన్‌ కిషోర్‌ నాందాస్‌, బెంగాల్‌, మోహిత్‌ మొయిత్రా-బెంగాల్‌.,

ఎవరు వీరు.,

దేశంకోసం ప్రాణాలను రాక్షసహింసననుభవిస్తూ పరిత్యజించి..,

యిప్పుడీ దేశం..ఏమౌతోంది.,

తన మంత్రి..బొగ్గు బ్లాక్‌లు.ఎవరికో ధారాదత్తం చేస్తూ..పైరవీలు..లాబీలు..అమ్మకాలు..కోట్లు..లక్షల వేల రూపాయల స్కాంలు…

ఏమిటిది..?

రఘు సర్కార్‌కు ఎందుకో దుఃఖం సముద్రంవలె ముంచుకొచ్చింది. కన్నీళ్ళు కెరటాలై విజృంభిస్తున్నాయి.

ఎందుకో..ఆక్షణం.. అతనిచేయి అనూహ్యంగానే తన కుడి చేయివైపున్న ప్యాంట్‌ జేబులోకి పోయింది.

చేతిలో బెరెట్టా రివాల్వర్‌..ధగధగా..బరువుగా..నిగనిగా.

నీళ్ళునిండిన కళ్ళతో రివాల్వర్‌ వైపు చూస్తున్నాడు..ప్రేమగా-

 

– రామా చంద్రమౌళి